29, నవంబర్ 2023, బుధవారం

తిక్కవరపు ఇంటికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి .. టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం . జర్నలిస్ట్ జ్ఞాపకాలు -106

తిక్కవరపు ఇంటికి భోజనానికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -106 ---------------------- 1993-94 ప్రాంతం . ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకున్న కొత్తలో . అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కొత్తగా వివాహం చేసుకున్న ఎన్టీఆర్ దంపతులను తన ఇంటికి భోజనానికి పిలిచారు . ఇప్పుడైతే ఐతే ఏంది ? అనిపిస్తుంది . ఆ రోజులు అలా కాదు . ఎన్టీఆర్ ను గద్దె దించడానికి పార్టీలో పుట్టిన ముసలంలో ఈ భోజనం ఎపిసోడ్ కూడా ఒక ప్రధాన పాత్ర వహించింది . ఎన్టీఆర్ దంపతులు సుబ్బిరామిరెడ్డి ఇంటికి వెళ్ళగానే బాబు వర్గం రంగంలోకి దిగింది . లక్ష్మీ పార్వతి పార్టీని అపవిత్రం చేస్తోంది అనేది ఆ వర్గం ప్రచార సారాంశం . భోజనానికి వెళితే అపవిత్రమా ? అంటే వారి దృష్టిలో అంతే .. వారు అలా భావించడానికి ఓ కారణం ఉంది . హిమాయత్ నగర్ లో పార్టీ కార్యాలయం ఉన్నప్పుడు , తరువాత భవన్ లో టీడీపీ నాయకులతో సరదా సంభాషణల్లో మీ పార్టీ సిద్ధాంతం ఏమిటీ అంటే పలువురు రెండు రూపాయలకు కిలో బియ్యం అని గర్వం గా చెప్పేవారు . రెండు రూపాయలకు కిలో బియ్యం సిద్ధాంతం కాదు ఆదో స్కీమ్ అని గుర్తు చేస్తే ... చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దాదాపు అందరు నాయకులు కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అనే వారు . ఒక పార్టీని వ్యతిరేకించడం మరో పార్టీ సిద్ధాంతం ఏమిటో ? ఒక వేళ కాంగ్రెస్ రంగంలో లేకుండా పోతుంది అనుకోండి అప్పుడు మీ పార్టీకి సిద్ధాంతం లేకుండా పోతుంది కదా ? అని చమత్కరించేవాడిని . నిజానికి ఆ కాలం లో కాంగ్రెస్ రంగంలో లేకుండా పోతుంది అనే మాట ఊహకు అందనిది . ఈ మూడు దశాబ్దాల కాలం లో ఆంధ్ర లో కాంగ్రెస్ లేకుండా పోతే , తెలంగాణలో టీడీపీ లేకుండా పోయింది . ***** తిక్కవరపు ఇంటికి ఎన్టీఆర్ దంపతులు భోజనానికి వెళ్ళాక పార్టీలో బాబు వర్గం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ కు దగ్గర చేస్తోంది అనే గుస గుస ప్రచారం మొదలు పెట్టారు .తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ నాయకుడు , రాజ్యసభ సభ్యులు , కేంద్ర మంత్రి అయినా ఆయన పలుకుబడి కాంగ్రెస్ కె పరిమితం కాలేదు . ఉమ్మడి రాష్ట్రంలో ఆ కాలంలో కూడా ఆయన్ని ప్రచార పిచ్చి ఉన్న నాయకుడు అనే చూశారు కానీ ఢిల్లీలో అయన పలుకుబడి ఎలాంటిదో టీడీపీ రాజ్య సభ సభ్యులుగా ఉన్నప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఓ సారి చెప్పారు . ఆయన ఢిల్లీలో పార్టీ ఇస్తే కేంద్రమంత్రులు ,ఆ న్నీ పార్టీల నాయకులు .... బడా బడా అధికారులు , సినిమా హీరోలు, హీరోయిన్ లు వచ్చేవారట . కనులతోనే ఎవరి అవసరం ఏమిటో గ్రహించేసే వారట .. అక్కడి పెద్దలు .. అంతటి సుబ్బిరామిరెడ్డి కంస్ట్రక్షన్ సంస్థ వేల కోట్ల అప్పులతో చేతులు ఎత్తేసింది . దివాళా ప్రక్రియ సాగుతోంది . లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ కు చేరువ చేస్తోంది అని ప్రచారం ప్రారంభించిన బాబు వర్గం బాస్ బాబే స్వయంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు . ఆ తరువాత లక్ష్మి పార్వతిపై టీడీపీ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం . ఎన్నికలు వచ్చాయి . కాంగ్రెస్కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోగా ఎన్టీఆర్ సీఎం అయ్యారు . 95 వెన్నుపోటులో ఎన్టీఆర్ ను దించేసిన తరువాత ఎన్టీఆర్ కాంగ్రెస్ మద్దతు కోసం ప్రయతినించారు అని మళ్ళీ వార్తలు . అప్పుడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు జోక్యం చేసుకోక పోవడం ద్వారా పరోక్షంగా బాబుకు సహకరించారు . ఎన్టీఆర్ ను దించేసిన కొద్ది రోజులకే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి . లోక్ సభ సీట్లు మీకు , అసెంబ్లీ మాకు .. బాబును దించేయాలి అని ఎన్టీఆర్ కాంగ్రెస్ తో మంతనాలు సాగిస్తున్నారని బాబు మీడియాలో ప్రచారం . బాబు సీఎంగా కుదురుకోవడంతో ఎన్టీఆర్ తెలుగుదేశం అని కొత్త పార్టీ ఏర్పాటు చేసి పోటీకి సిద్ధమయ్యారు కానీ ఎన్నికలు రాకముందే మరణించారు . ఎన్టీఆర్ నిజంగా కాంగ్రెస్ తో చేతులు కలిపారా ? బేరం కోసం ప్రయత్నించారా ? అంటే ఆ మాట చెప్పల్సింది ఎన్టీఆర్ , వార్తలు రాయించిన బాబు ... చెప్పడానికి ఎన్టీఆర్ లేరు . బాబు చెప్పరు . **** సుబ్బిరామిరెడ్డి ఇంటికి ఎన్టీఆర్ దంపతులు భోజనానికి వెళ్లడం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే ? ఖమ్మంలో కాంగ్రెస్ నేత ప్రియాంక సభ లో టీడీపీ జెండాలు రెపరెపలడాయి . కాంగ్రెస్ సభల్లో టీడీపీ జెండాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి . ఇదేం కొత్తకాదు 2018 లోనే చెట్టాపట్టాలేసుకొని పోటీ చేశారు కదా ? అంటే నిజమే 2018 లో కాంగ్రెస్ , టీడీపీ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంది . ఈ సారి పొత్తుకాదు ఒక్క సీటు కూడా ఇవ్వకపోయినా కాంగ్రెస్ విజయానికి టీడీపీ పని చేస్తోంది . కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అని సగర్వంగా ప్రకటించుకున్న పార్టీ కాంగ్రెస్ కోసం తమ పార్టీని మూసేసుకుంది . ఒక్క సీటు కూడా లేకుండా షర్మిల పార్టీ కాంగ్రెస్ తో జత కట్టింది . ఒక్క సీటు లేకుండా కోదండరాం పార్టీ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది . ఆ రెండు పార్టీల దారిలోనే టీడీపీ సైతం కాంగ్రెస్ కోసం పని చేస్తోంది . 2014 కాలం లో బాబు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ ఖాళీ చేయడానికి టీడీపీ బీరు సీసా కాదు అన్నారు . ఖాళీ బీరు సీసాకు కూడా కొంత విలువ ఉంటుంది . కానీ బాబు మాత్రం ఉచితంగానే తెలంగాణలో కాంగ్రెస్ కోసం టీడీపీని ఇచ్చేశారు . బాబు గ్రేట్ ---------- సుబ్బిరామిరెడ్డి ఇంటికి భోజనానికి వెళితే పార్టీని అపవిత్రం చేస్తున్నారని ప్రచారం చేసి దాన్ని నమ్మించిన బాబు ఏకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా , ఉచితంగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నా టీడీపీ శ్రేణులు , నేతలు ఏమంటున్నారు ? అంటే ? ఏమీ అన్నారు బాబు ఏం చేసినా అదే కరెక్ట్ అనుకునేట్టు ట్యూన్ చేయడంలో బాబు విజయం సాధించారు . ప్రజలను ట్యూన్ చేయడంలో బాబు విఫలం అయి ఉండవచ్చు కానీ పార్టీని ట్యూన్ చేయడంలో ఘన విజయం సాధించారు . - బుద్దా మురళి

5, నవంబర్ 2023, ఆదివారం

వార్తల సైజులు పార్టీల గెలుపును నిర్ణయించలేవు ... . మీడియాలో mim , షర్మిల పార్టీ వార్తలు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 105

వార్తల సైజులు పార్టీల గెలుపును నిర్ణయించలేవు ... . మీడియాలో mim , షర్మిల పార్టీ వార్తలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 105 ......... ....... సాధారణంగా ప్రధాన మీడియాలో ఒక్కో పార్టీ గురించి ఎం సైజులో వార్తలు వస్తే జనంలో ఆ పార్టీకి ఆ సైజుకు తగ్గ ఆదరణ ఉంది అనిపిస్తుంది . వార్తల సైజులను బట్టి ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఎన్ని సీట్లు రావచ్చు అనే అంచనాకు వస్తారు . పాఠకులే కాదు.. రాజకీయ నాయకులు చివరకు జర్నలిస్ట్ లు కూడా ఇదే అంచనాతో ఉంటారు . ఓ ఏడాది క్రితం మీడియా బిజెపికి హైప్ ఇచ్చింది . తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని సూచించే స్థాయిలో ఆ వార్తలు ఉండేవి . మీడియా + రాజకీయ నాయకులు ఐన వి 6 వివేక్ వెంకటస్వామి లాంటి వారు బిజెపిలోకి , బిజెపి నుంచి కాంగ్రెస్ కు ఇలా అనేక పార్టీలు మారింది ఇలాంటి వార్తలు హైప్ వల్లనే . మీడియా కలిగించే ఈ హైప్ లో చివరకు మీడియా కూడా పడిపోతుంది . చిత్రంగా మేధావులపై ఈ హై ప్ ప్రభావం తీవ్రంగా పడి తమ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారు . కానీ ఓటర్లపై ఈ హైప్ ప్రభావం తక్కువే అనేక సందర్భాల్లో తేలింది . తాము సృష్టించిన వార్తలను నమ్మి మీడియా తామే బోల్తా పడుతోంది కానీ జనం పెద్దగా లెక్కేలోకి తీసుకోవడం లేదు . మద్య నిషేధ ఉద్యమ సమయంలో స్పోర్ట్ పేజీ మినహా ఈనాడు మొత్తం మద్య నిషేధ వార్తలతో నిండి పోయేది . ఉమ్మడి రాష్ట్ర జనాభాను మించి రాష్ట్ర జనాభా మద్య నిషేధ ఉద్యమం లో ఉన్నారు అనిపించేది . జోనల్ పేజీ , జిల్లా పేజీ , మెయిన్ పేజీ ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా మద్య నిషేధ ఉద్యమం లో పాల్గొన్నారు అనిపించేది ఈనాడు చదివితే .. అది మీడియా సృష్టించే మాయాజాలం . మద్యానికి వ్యతిరేక ప్రచారం , మద్యం తాగడం వల్ల ఆరోగ్యం ఎలా పాడవుతుందో మీడియా ప్రచారం చేయాలి . దాని వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది . కానీ అక్కడ ఆ ప్రచార ఉద్దేశం ఒక పార్టీని ఓడించి ఒక పార్టీని గెలిపించడం ... నిజానికి నిషేధ సమయంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి మందు తాగడానికి ఉద్యమ స్థాయిలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు . సరిహద్దుల్లో మద్యం షాప్స్ వెలిశాయి , ఎందరినో సంపన్నులను చేశాయి . ******* ప్రధాన మైన టివి మీడియా , ప్రింట్ మీడియా లో ఎం . ఐ . ఎం పార్టీ వార్తలు అస్సలు కనిపించవు. గత రెండేళ్ల నుంచి షర్మిల పార్టీ వార్తలు కొన్ని మీడియాల్లో ఆమెనే సీఎం అన్నట్టుగా ప్రచారం చేశారు . జగన్ ను వ్యతిరేకిస్తూ , బాబును అభిమానించే మీడియా జగన్ సోదరి పార్టీని ఆకాశానికి ఎత్తారు . చివరకు పోటీ చేస్తే డిపాజిట్ ఎక్కడా రాదు అని తెలిసి ఆమె పోటీ చేయడం లేదు , ఆమె పార్టీ పోటీ చేయడం లేదు . షర్మిల పార్టీకి ఇచ్చిన ప్రచారంలో ఏడు సీట్లు గెలిచే mim కి ఒక్క శాతం ప్రచారం కూడా ఇవ్వలేదు . ఇక్కడ ఉద్దేశం ప్రచారం ఇవ్వళ్ళూ అని కాదు . మీడియాలో లభించే ప్రచార సైజు చూసి పార్టీలను అంచనా వేయవద్దు అని చెప్పడమే . అదే బీజేపీ వార్తలు చూస్తే ఏడాది క్రితం వరకు వాళ్లే అధికారంలోకి వస్తారేమో అన్నంతగా మీడియాలో ప్రాధాన్యత లభించింది . గత ఎన్నికల్లో mim కు ఏడు సీట్లు వస్తే బీజేపీకి వచ్చింది ఒకే ఒక సీటు . కానీ మీడియాలో ఈ రెండు పార్టీలకు వచ్చిన వార్తలను పోలిస్తే అసలు సంబంధమే ఉండదు . ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే ఏడు స్థానాలు mim కు వదిలేసి మిగిలిన సీట్ల గురించే ఏ పార్టీ ఐనా ఆలోచించాలి . పోలింగ్ కు ముందే ఫలితాలు తేలిపోయే నియోజక వర్గాలు ఇవే . గత ఎన్నికల్లో తెలంగాణ లో మీడియా వార్తల ప్రకారం చూస్తే మహాకూటమి గెలుస్తుంది అని , ఆంధ్ర లో టీడీపీ అని మెజారిటీ మీడియా వార్తలతో హోరెత్తిందించి . తాము గెలవాలి అని కోరుకున్న పార్టీ గెలుస్తుంది అని మీడియా చెబుతోంది కానీ ఎవరు గెలుస్తారో చెప్పడం లేదు . **** 2012-13 సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా లాబీ లో చర్చ . అప్పుడు హైదరాబాద్ లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పని చేసే జర్నలిస్ట్ మిత్రుడు శాస్త్రి ఇక తెలంగాణ ఉద్యమం ముగిసిపోయినట్టే కదా ? అని కవ్విస్తున్నట్టు అడిగాడు . ఉద్యమం ఒక సారి ఉదృతంగా సాగుతుంది .పత్రికల నిండా ఏవ్ వార్తలు ఆ ఉదృతి చూసి వారం లో తెలంగాణ ఇచ్చేస్తారు అనిపిస్తుంది . కొంత కాలం స్థబ్దతగా ఉండేది ఆ సమయంలో మీడియాలో సైతం వార్తలు కనిపించవు . దాంతో తెలంగాణ ఉద్యమం అయిపొయింది అనుకునేవారు . మీడియాలో వచ్చే వార్తల సైజును బట్టి తెలంగాణ పై నువ్వు అంచనాకు వస్తున్నావు . మీడియా లో వార్తల సైజుతో సంబంధం లేదు . తెలంగాణ ఏర్పడేంత వరకు తెలంగాణ అంశం ఉంటుంది అని వార్తల సైజుకు నిర్ణయాలకు సంబంధం ఉండదు అని అని చెప్పాను . సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో మీడియా మొత్తం అవే వార్తలు . ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి ఆ ఉద్యమ వార్తలు చూపుతూ ఇప్పటికీ తెలంగాణ వస్తుందా ? అని అడిగితే .. ఆ వార్తల సైజులు మీడియా ఓనర్లను సంతృప్తి పరుస్తాయి నిర్ణయంలో ఎలాంటి ప్రభావం చూపవు వస్తుంది అని చెప్పాను .. ***** 1978 లో విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా గోడల మీద జనతా పార్టీ గుర్తు నాగాలిపట్టిన రైతు బొమ్మ ఉండేది . జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తుంది అనుకున్నాను . దేశమంతా వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ లో జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు . ఆ తరువాత చదువు పూర్తయి జర్నలిజంలోకి వచ్చాక మీడియాలో వచ్చే వార్తల సైజుకు జనంలో పార్టీకి వచ్చే ఓట్లకు సంబంధం లేదు అని అర్థమయింది . ఇప్పుడు అన్ని పార్టీలకు మీడియా ఉంది . పక్ష పాతం అనే మాటకు తావు లేకుండా ఏ పార్టీ మీడియా ఆ పార్టీని ఆకాశానికి ఎత్తుతోంది . ఒక పార్టీ మీడియాకే పరిమితం కాకండి అన్ని పార్టీల మీడియా ను చదవండి , చూడండి .. అలానే సొంత కులం వారితోనే కాకుండా అందరితో మాట్లాడండి ఓ నిర్ణయానికి రండి . ఏదో ఒక పార్టీ మీడియా ను ఫాలో అయి ఎన్నికల ఫలితాలపై పందెం వేస్తే దెబ్బ తింటారు . డబ్బులు ఊరికే రావు . - బుద్దా మురళి

3, నవంబర్ 2023, శుక్రవారం

అభ్యర్థుల పేర్లు - పూర్వ విద్యార్థుల సమావేశం నాయకుల జోనల్ పేజీల జీవితాలు.... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 104

అభ్యర్థుల పేర్లు - పూర్వ విద్యార్థుల సమావేశం నాయకుల జోనల్ పేజీల జీవితాలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 104 --------------------------------------- రాజకీయ పార్టీ ప్రకటించిన మూడవ జాబితా అని కనిపించగానే యధాలాపంగా చదువుతూ పోతుంటే కొన్ని పేర్లు కనిపించగానే ముఖం సంతోషంగా వికసించింది . హైదరాబాద్ లో మాములు ప్రభుత్వ పాఠశాలల్లో చదువు . పూర్వ విద్యార్థుల సమావేశాలు జరుపుకొంటారు అని తెలియని కాలం లో చదువు . పత్రికల్లో పూర్వ విద్యార్థుల సమావేశాల గురించి చూసినప్పుడు మనకు అలాంటి అవకాశం లేదే అని కొంత నిరాశ . కానీ పార్టీ అభ్యర్థుల మూడవ జాబితా లోని కొన్ని పేర్లు చూడగానే పూర్వ విద్యార్థుల సమావేశం అంత ముచ్చటేసింది . డిగ్రీ చదువుకొనే రోజుల నుంచే జర్నలిజం నుంచి సహవాసం కావడం వల్ల అప్పుడు విన్న , పరిచయం ఉన్న ఆ పేర్లు కొన్ని పాత జ్ఞాపకాలు తట్టి లేపాయి . పూర్వ విద్యార్థులు సమ్మేళనం లో చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చినట్టు పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి . కరోనా తరువాత ఎవరు ఉన్నారో , ఎవరు ఏమయ్యారో తెలియదు .. అలాంటప్పుడు మనం మరిచి పోయిన కొందరు ఉన్నారు అని తెలియడమే కాకుండా , వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంటే ముచ్చటేయడం సహజమే కదా ? సాధారణ నాయకులే కాదు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకులు సైతం ఇంటికే పరిమితం అయిన తరువాత వారిని ప్రజలు మరిచిపోతారు . ఓడినా గెలిచినా నాయకులు జనాల్లో ఉంటేనే రాజకీయంగా సజీవంగా ఉన్నట్టు . జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా , కేంద్రమంత్రిగా ఓ వెలుగు వెలిగారు . ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఇంటికే పరిమితం అయ్యారు . అయన మరణించినప్పుడు రిపోర్టర్ గా సమాచారం కోసం ఇంటికి వెళ్ళాను . చడీ చప్పుడు లేదు . అయన గురించి అడిగితే చెప్పేవారు దొరక లేదు . ఇంట్లో జలగం ఆత్మకథ గ్రంధం ఉంది . తీసుకువెళ్ళండి అని ఒకరు సలహా ఇస్తే ... వార్త సాయిబాబా అప్పటికే బుక్ వెతుకుతుంటే నేనూ ఒకటి తీసుకున్నా .. అయన పోయారు అనే వార్త విని ఆయన ఉన్నారా ? ఎక్కడా వార్తల్లో కనిపించలేదేమబ్బా అనిపించింది . ***** జర్నలిస్ట్ గ్రూప్ లో బిజెపి మూడవ జాబితా కనిపించగానే చదువుతుంటే కొన్ని పేర్లు చూసి మొదట అనుమానం వచ్చింది . తరువాత బిజెపి జాబితానే అని నిర్ధారణ చేసుకొని పేర్లు చదివి సంతోషించాను . చేవెళ్ల నుంచి రత్నం , అంబర్ పేట కృష్ణ యాదవ్ , జూబ్లీ హిల్స్ లంకల దీపక్ రెడ్డి , సికిందరాబాద్ మేకల సారంగపాణి ఇలా ఇంకా చాలా మంది పేర్లు ఉన్నా టీడీపీ కార్యకలాపాల్లో నగరంలో వీరి హడావుడి చాలా ఉండేది . దాదాపు రెండు దశాబ్దాల క్రితం వీరి హడావుడి కనిపించేది .తరువాత వీరు ఏమయ్యారో తెలియదు . హఠాత్తుగా వీరి పేర్లు చూసే సరికి ఎన్నికల్లో జయాపజయాలు ఎలా ఉన్నా .. ఉన్నారు అని సంతోషం . మేకల సారంగపాణి ఒకప్పుడు టీడీపీ నగరనాయకుల్లో ఒకరు . కార్పొరేటర్ స్థాయికి పరిమితం కాకూడదు శాసన సభ్యున్ని కావాలి అని ఆశ ప్రజారాజ్యం పెట్టగానే పోటీ చేసి ఓడిపోయారు . తరువాత ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో బీజేపీ లో ఎప్పుడు చేరారో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు బీజేపీ సికిందరాబాద్ అభ్యర్థి అయ్యారు . చేవెళ్ల రత్నం ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో జిల్లా పరిషత్ చైర్ మెన్ గా చివరి వరకు ఎన్టీఆర్ వర్గంలో ఉన్నారు . తరువాత కనిపించలేదు . లంకల దీపక్ రెడ్డి చివరి దశలో చేరినా హడావుడి ఎక్కువగానే ఉండేది . తెలుగుదేశంలో కృష్ణ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు . హఠాత్తుగా మంత్రి వర్గం నుంచి బాబు తొలగించారు . ఎందుకో ఏ మీడియా రాయలేదు . ఎవరికీ తెలియదు . కొన్ని రోజుల తరువాత వేల కోట్ల రూపాయల తెల్గీ స్టాంప్ కుంభకోణంలో కృష్ణ యాదవ్ పాత్ర ఉందని అరెస్ట్ చేశారు . ఓహో బాబుగారు మంత్రివర్గం నుంచి తొలగించింది ఇందుకా అని అప్పుడు తెలిసింది . జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి టీడీపీ కోసం కృష్ణ యాదవ్ బాగా ప్రయత్నించారు . చేరలేదు . తెలంగాణ ఏర్పడింది . టీడీపీ తన ప్రాభవాన్ని కోల్పోయింది . తరువాత తెరాస లో చేరారు . తెరాస లో ఉన్నారో లేరో అన్నట్టు ఉండేది . బీజేపీ మూడవ జాబితా తో మళ్ళీ తెరపైకి వచ్చారు . మాంసం తిన్నామని ఎముకలు మేడలో వేసుకొని తిరిగినట్టు అనే సామెతలా .. తెల్గీ నుంచి కృష్ణ యాదవ్ తిన్నది కొద్దిగానే ఐనా శిక్ష చాలా ఎక్కువగా అనుభవించారు అని ప్రచారం . తెల్గీ కుంభకోణం బయటపడి , కృష్ణ యాదవ్ అరెస్ట్ అయ్యాక అయన వార్తలు పత్రికల్లో చందమామ కథల్లా కనిపించేవి . కృష్ణ యాదవ్ అంతకు ముందు ఏ జిల్లాలో తిరిగాడో ఆ జిల్లా నుంచి కథలు వచ్చేవి ఆ జిల్లాలో ఎవరెవరిని కలిశాడు , ఏం జరిగింది అని వార్తలు వచ్చేవి . తెల్గీ కన్నా ఎక్కువ శిక్ష పడింది యాదవ్ కె మంత్రి పదవి పోయింది , జైలు జీవితం తప్పలేదు . రాజకీయ జీవితం ముగిసింది . ******* మీడియాలో జోనల్ పేజీలు వచ్చాక ఏ జోనల్ నాయకులు ఆ జోనల్ పేజీలోనే కనిపిస్తున్నారు . ఇతర జోన్ లలో ఉండే పాఠకులకు వీరు ఉన్నారని తెలియదు . ఏ పార్టీలో ఎప్పుడు చేరారో తెలియదు . జోనల్ జీవితం వల్ల ఒక జోనల్ నాయకుల రాజకీయం ఇంకో జోన్ వారికి తెలియకుండా పోయింది . కనీసం ఎన్నికల వల్ల నైనా వారు ఉన్నారు అని తెలుస్తోంది . ఎన్నికల జాతర వచ్చినప్పుడు టికెట్ కోసం ప్రయత్నించేవారు పేర్లు పత్రికల్లో చదువుతుంటే వీళ్ళు ఇంకా ఉన్నారా ? మరిచే పోయాం అనిపిస్తుంది . నాయకుల గురించి మీడియా ఇలా అనుకుంటే మీడియా వాళ్ళ గురించి నాయకులు కూడా ఇంకా ఉన్నారా ? అనే అనుకుంటారు . రాస్తూంటేనే జర్నలిస్ట్ జీవించి ఉన్నట్టు .. పోటీ చే స్తుంటే, .. రాజకీయాలు చే స్తుంటేనే రాజకీయ నాయకులు రాజకీయంగా జీవించి ఉన్నట్టు .. రచయితలు , సినిమా నటులు సైతం అంతే కలం వదిలేసి, నటన మానేసి అస్త్ర సన్యాసం చేస్తే అంతే ... - బుద్దా మురళి

30, అక్టోబర్ 2023, సోమవారం

తెలంగాణ లో టీడీపీ చరిత్ర అలా మొదలై ఇలా ముగిసింది ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -103

తెలంగాణ లో టీడీపీ చరిత్ర అలా మొదలై ఇలా ముగిసింది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -103 --------------------------------------- తెలంగాణ లో జరిగే 2023 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు . రాజమండ్రి జైలులో ఉన్న బాబు ములాఖత్ లో తెలంగాణ టీడీపీ నాయకులకు ఈ విషయం చెప్పారు . ఆ పార్టీ ఉనికి తెలంగాణలో అంతంగా మాత్రమే . పోటీ చేసినా చేయక పోయినా పెద్దగా ప్రభావం ఉండదు . ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రభావం ఎంతో టీడీపీ ప్రభావం అంతే ఉటుంది . ఐతే నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఈసారి పోటీ చేయడం లేదు అంటే . తెలంగాణలో ఆ పార్టీ చరిత్ర ముగిసినట్టు . తెలంగాణలో 1999 ఎన్నికలే టీడీపీ గెలిచిన చివరి ఎన్నికలు . 24 ఏళ్ళ నుంచి తెలంగాణ లో పెద్దగా ప్రభావం లేదు . ఐతే ఈ సారి పోటీ చేయడం లేదు అంటే తెలంగాణలో టీడీపీ చరిత్ర అధికారికంగానే ముగిసినట్టు . వారం క్రితం తెలంగాణ టీడీపీ అధ్యక్షడు తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని ప్రకటించారు . ఆరు నెలల క్రితం ఖమ్మంలో టీడీపీ బహిరంగ సభ జరిగింది . పాత టీడీపీ వారంతా టీడీపీలోకి వచ్చేయండి అని బాబు పిలుపు ఇచ్చారు . ఈ పిలుపును అందుకొని ఎవరెవరు రాబోతున్నారో తెలుగు ఛానల్స్ వారం రోజుల పాటు చర్చలతో ఉదరగోట్టాయి . ఒక్కరూ రాలేదు . పైగా బాబైనా పార్టీ మారుతాడేమో కానీ ఈయన మారడు అని పేరున్న రావుల చంద్ర శేఖర్ రెడ్డి కూడా టీడీపీని వీడి వెళ్లారు . తెలంగాణ జనంలో టీడీపీకి లేకపోవచ్చు కానీ మీడియా గుండెల్లో బాబు గూడు కట్టుకొని ఉన్నారు . ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం అని ప్రచారం చేసే దమ్మున్న మీడియా టీడీపీకి ఉంది . ఎన్నికల్లో పోటీ చేస్తేనే రాజకీయ పార్టీకి ఉనికి . పోటీకి దూరం కావడంతో అధికారికంగా తెలంగాణలో టీడీపీ శకం ముగిసినట్టే . పార్టీ పుట్టుక నుంచి ముగింపు వరకు పలు కీలక సంఘటనల్లో ప్రత్యక్ష సాక్షిని .. ***** క్లిక్ మని ఫ్లాష్ వెలగగానే ఎన్టీఆర్ ఒక్కసారిగా ఆ ఫోటో గ్రాఫర్ వైపు కోపంగా చూశారు . మార్వాడి షాప్ లో కనిపించే పరుపు గద్దె మీద ఎన్టీఆర్ కూర్చొని ఉన్నారు . పక్కన నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నారు . ఫోటో గురించి నాదెండ్ల ఏదో చెప్పే సరికి ఎన్టీఆర్ మాములు అయ్యారు . ఇది 1982లో రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ ను టీడీపీ నాయకుడి పాత్రలో తొలిసారి చూసిన సందర్భం . అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను . పదవ తరగతి పరీక్షలు రాస్తున్న కరీం నగర్ జిల్లాకు చెందిన మిత్రుడు భూపాల్ తీసుకువెళితే రామకృష్ణ స్టూడియోకు వెళ్ళాను . కొత్తగా పెట్టిన టీడీపీలో జిల్లాల వారిగా నాయకులతో ఎన్టీఆర్ సమావేశం . ఆ రోజు కరీం నగర్ సమావేశం కావడంతో తనకు తెలిసిన వారు టీడీపీలో చేరుతున్నారని , వారితో ఎన్టీఆర్ సమావేశం ఉంది వెళదాం అంటే స్టూడియోలోకి వెళ్ళాను . దాదాపు ఓ వందమంది ఉండవచ్చు . అంతకు ముందు దివిసీమ తుఫాన్ బాధితుల కోసం ఎన్టీఆర్ అక్కినేని బృందం విరాళాలు సేకరిస్తుంటే సికింద్రాబాద్ దర్గా వద్ద రేఖా ఎంపోరియం లోకి వెళ్లి విరాళాలు తీసుకుంటుంటే చూశాను . కానీ టీడీపీ ఏర్పడ్డాక ఎన్టీఆర్ ను 82లో రామకృష్ణ స్టూడియోలో చూశాను . 84లో లో ఎన్టీఆర్ కు నాదెండ్ల వెన్నుపోటు తరువాత రామకృష్ణ స్టూడియో వద్ద పిట్టగోడ ఎక్కి వెంకయ్య నాయుడు బీజేపీ కార్యకర్తలు చేసిన ఉపన్యాసం , ఉద్యమం చూశాను . ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలో టీడీపీ కన్నా బీజేపీ హడావుడి ఎక్కువ ఉండేది . ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం లో స్టూడియో వద్ద బీజేపీ నాయకులదే ఎక్కువ హడావుడి . ఆ సమయంలో నేను అక్కడ ఎందుకు ఉన్నానో గుర్తు లేదు కానీ.. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అప్పుడు ఆ స్టూడియో వద్దనే ఉన్నాను . చాలా మంది రోడ్డు మీద నిలబడి చూశారు . ఆ మరుసటి సంవత్సరం ఒక వైపు కాలేజీకి వెళుతూనే 1985 నుంచి ఉదయం స్థానిక విలేకరిగా టీడీపీని దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది . విద్యార్థిగా , జర్నలిస్ట్ గా టీడీపీ పుట్టుక నుంచి మహోజ్వలంగా వెలిగిపోవడం , ఆరిపోవడం వరకు అన్ని కీలక పరిణామాలను దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది . ఎన్టీఆర్ ను దించేసిం వైస్ రాయ్ ఎపిసోడ్ నుంచి తెలంగాణ ఏర్పాటుతో టీడీపీ నిర్వీర్యం కావడం వరకు ఆంధ్రభూమి నుంచి టీడీపీ రిపోర్టర్ గా అన్ని పరిణామాలను చూశాను . *** ఎం ఎల్ ఏ క్వార్టర్ లో టీడీపీ పుట్టిన సందర్భంలో అక్కడ లేను కానీ అటు నుంచి రామకృష్ణ స్టూడియోలో సమావేశాలు ప్రారంభం నుంచి .. తెలంగాణ లో పార్టీ శకం ముగియడం వరకు అన్నీ చూశాను . తెలంగాణ ఏర్పడినా 2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి ఎన్నికలు జరిగాయి . ఒక ప్రాంతీయ పార్టీ ఒకే రాష్ట్రంలో ఉంటుంది . రెండు రాష్ట్రాల్లో ఉండదు . ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల విభజనను అంత త్వరగా జీర్ణం చేసుకోరు . ఆ ఎన్నికల్లో టీడీపీ పది స్థానాల్లో గెలిచింది . ఓటుకు నోటు తెరాస కు వరంలా మారింది . 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ , టీడీపీ మహాకూటమి మీడియాతో కలిసి అధికారంలోకి వచ్చేస్తున్నారు అనే భావన కలిగించడంలో విజయం సాధించారు . మంత్రివర్గాలను కూడా ఏర్పాటు చేసేసుకున్నారు . ఫలితాల్లో బోల్తా కొట్టారు . ప్రచారంలో బాబు సింహా భాగం ఆక్రమించారు . తీరా రెండు సీట్లకు పరిమితం అయ్యారు . 150 డివిజన్ లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీకి ఒక్క టంటే ఒక్క కార్పొరేటరే గెలిచారు . ఓటుకు నోటు కేసులు , పరాజయాలతో తెలంగాణ టీడీపీ నాయకులు తెరాస , కాంగ్రెస్ , బీజేపీ ఏదో ఒక పార్టీలో సర్దుకున్నారు . రిటైర్డ్ అయిన వారి కాలక్షేపం క్లబ్ తరహాలో ఎన్టీఆర్ భవన్ కొద్ది మందికి పరిమితం అయిపొయింది . ***** ఎందుకు పోటీ చేయడం లేదు .. రాజకీయ పక్షాలు నిజం చెప్పవు .. వారు చెప్పెది నిజం కాదు . ఐతే ఎందుకు పోటీ చేయడం లేదు అనే దానిపై నిజం చెప్పడం లేదు .. అబద్దం చెప్పడం లేదు . మరో ఆరు నెలల్లో ఆంధ్రాలో ఎన్నికలు . టీడీపీకి అవి చావుబతుకుల పోరాటం . తెలంగాణ లో అన్ని చోట్ల డిపాజిట్లు పోవడం ఖాయం .. డిపాజిట్లు పోతే ఆంధ్ర లో ఆ ప్రభావం పడుతుంది . బాబు జైలుకు వెళ్లిన తరువాత ఆంధ్ర కన్నా తెలంగాణలోనే నిరసన కార్యక్రమాలు ఎక్కువగా జరిగాయి . ఒక సామాజిక వర్గం వారాంతపు ఆట విడుపులా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మీడియా మాత్రం జనప్రవాహం అని చెబుతోంది . డిపాజిట్లు పోతే ఓస్ సానుభూతి ఇంతేనా ? అని ఆంధ్ర లో గాలి పోతుంది . మరో వైపు ఈ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లించాలి అని టీడీపీ అనుబంధ మీడియా ప్రయత్నాలు . టీడీపీ పోటీలో ఉంటే ఆ వర్గం అటు ఓటు వేయాలో ఇటు వేయాలో గందరగోళం . బి ఆర్ యస్ కన్నా రేవంత్ రెడ్డి అధికారం లో ఉంటే తానే అధికారంలో ఉన్నట్టు బాబు భావించడానికి అవకాశం ఉంటుంది . ఎలాగూ గెలిచే అవకాశం లేని ఒకటి రెండు శాతం ఓట్లతో పోటీ చేయడం కన్నా పోటీకి దూరంగా ఉండడం ప్రయోజనం అని టీడీపీ తెలంగాణలో తమ పార్టీకి మంగళం పాడింది . నిజానికి తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడో మంగళం పాడారు . ఇప్పుడు టీడీపీ కూడా మంగళం పాడింది . *** ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన గండిపేట కుటీరం , హిమాయత్ నగర్ లోని టీడీపీ కార్యాలయం ( ఎన్టీఆర్ ది , బాబుది తొలి పార్టీ కార్యాలయాలు హిమాయత్ నగర్ లో దగ్గర దగ్గరే ఉన్నాయి ) ఎన్టీఆర్ భవన్ ఇవన్నీ ఒకప్పటి జ్ఞాపకాలు . విశాలమైన , అత్యంత ఖరీదైన ఎన్టీఆర్ భవన్ అక్కడే ఉంటుంది కానీ తెలంగాణలో టీడీపీ రాజకీయాలు ఉండవు . తెలంగాణ ఉద్యమ కాలం లో టీడీపీ తెలంగాణ గడ్డ మీద పుట్టింది .. ఇక్కడే ఉంటుంది అని బాబు చెప్పేవారు . ఇక్కడ పుట్టినా ఇప్పుడు ఆంధ్ర కే పరిమితం . హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఎదురుగా విశాలమైన స్థలం కేటాయిస్తే .. బాబు దానిని ఎన్టీఆర్ భవన్ పేరుతో టీడీపీకి కేటాయించుకున్నారు . పేరుకు ఎన్టీఆర్ విధానాల పై అధ్యయనం , ప్రచారం కోసం ఈ భవన్ అని చెప్పినా పూర్తిగా టీడీపీ కోసం భవన్ ఉండేది . తెలంగాణలో ఇప్పుడు పార్టీ లేదు . విశాలమైన ఎన్టీఆర్ భవన్ మాత్రమే మిగిలింది . - బుద్దా మురళి

19, అక్టోబర్ 2023, గురువారం

కంట్రీ క్లబ్ లో బతుకమ్మ .. నుంచి  బాబు కోసం  -బతుకమ్మ పూజ వరకు జర్నలిస్ట్  జ్ఞాపకాలు-  102-------------

కంట్రీ క్లబ్ లో బతుకమ్మ .. నుంచి  బాబు కోసం  -బతుకమ్మ పూజ వరకు జర్నలిస్ట్  జ్ఞాపకాలు-  102----------------------------- ఏమన్నా విశేషాలు ఉన్నాయా ? అని కాల్ చేస్తే మా పిల్లలు బతుకమ్మ ఆట  చూద్దాం అంటే కంట్రీ క్లబ్ కు  తీసుకువచ్చాను అని అటు నుంచి సమాధానం వచ్చింది . ఇప్పుడు కాదుదాదాపు రెండు దశాబ్దాల క్రితం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు .. చిత్తూరు జిల్లా నగిరికి చెందిన ఏఎం రాధాకృష్ణ ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా ఉండేవారు .  ఇంటికి వెళ్లేప్పుడు  టీడీపీకి సంబంధించి ఏమన్నా వార్తలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం అలవాటు .   1987లో రిపోర్టర్ గా ఉద్యోగంలో చేరాక పండుగలు , పబ్బాలు అంటూ ఏమీ లేవు . అన్ని రోజులు దాదాపు ఒకేలా గడిచిపోయేవి . 95లో హైదరాబాద్ వచ్చాక వారాంతపు సెలవు తప్ప ఏదీ గుర్తుండదు . తెలంగాణ ఉద్యమం దాదాపు అప్పుడే ప్రారంభం అయింది .  బతుకమ్మ పండుగా ఎలా ఉంటుందో చూపడానికి కంట్రీ క్లబ్ తమ క్లబ్ లో బతుకమ్మ ఆడించింది . ప్రాంతం ఏదైనా కావచ్చు , పండుగలు , ఆటలు అంటే పిల్లలకు ఇష్టం. బతుకమ్మ ఆట చూపడానికి కంట్రీ క్లబ్ కు  వచ్చాము అని రాధాకృష్ణ చెప్పిన తరువాత ఆలోచనలో పడిపోయాను .  బాల్యం అంతా కవాడిగూడ ,  బోలాక్ పూర్ , పద్మశాలి కాలనీ ల మధ్య గడిచిపోయింది . ఈ ప్రాంతాలు హుసేన్ సాగర్ కు రెండు కిలో మీటర్ల పరిధిలోనే ఉంటాయి . ఈ ప్రాంతాల్లో బాల్యంలో బతుకమ్మ  సందడిగా ఆడేవారు .  ఆ రోజుల్లో హుసేన్ సాగర్ ఇప్పటిలా ఉండేది కాదు . ఒకప్పుడు తాగునీటికి ఉపయోగించిన చెరువు .  బట్టలు  ఉతుక్కునే వారు , స్నానాలు చేయడం చూశాను . బతుకమ్మ పండుగ రోజుల్లో హుసేన్ సాగర్ కళకళ లాడేది . కవాడి గూడా , బోలాక్ పూర్ వంటి ప్రాంతలు దగ్గరే కాబట్టి బతుకమ్మ ఆడి హుసేన్ సాగర్ లో బతుకమ్మ విడిచేవారు . అక్క చెల్లెళ్ళతో చాలా సార్లు అలా వెళ్ళాను . ఏదో మంత్రం వేసి  మాయం చేసినట్టు  నగరంలో బతుకమ్మ మాయమైంది .గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ మొదటి నుంచి అలానే ఉన్నా నగరంలో మాయమైంది   అలాంటి బతుకమ్మ ను చూడాలి అంటే చివరకు కంట్రీ క్లబ్ కు వెళ్లాలా ? అనిపించింది ... స్వతంత్ర పోరాట కాలం లో తిలక్ గణపతి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించి   స్వతంత్ర పోరాటం జరిపారు . తెలంగాణ ఉద్యమానికి దీనిని స్ఫూర్తిగా తీసుకున్నారు . *****  కవిత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలకు  తిరిగి పూర్వ వైభవం లభించింది . బడుగుల బతుకమ్మ అంటూ వామపక్ష బావాలు గలవారు పోటీగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు . పేరు ఏదైతేనేం బతుకమ్మ అంతటా మళ్ళీ కనిపించింది . గతంలో హైదరాబాద్ కాలనీల్లో బతుకమ్మ అంటే తెలియదు అన్నట్టు ఉండేవారు . తెలంగాణ ఏర్పడిన  తరువాత ఇప్పుడు కాలనీల్లో కూడా బతుకమ్మ కనిపిస్తోంది . బతుకమ్మ చూడాలి అంటే హనుమకొండ లోనే చూడాలి అనేవారు . ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పుడు నగరంలోనూ బతుకమ్మ కనిపిస్తోంది . ఉద్యమానికి బతుకమ్మ ను ఉపయోగించుకున్నప్పుడు ప్రత్యర్థుల రాజకీయం సహజమే . బతుకమ్మ తెలంగాణ కు మాత్రమే చెందిన వేడుక కాదు విజయవాడలో కూడా ఆడుతారు అంటూ కొందరి వాదన . ఇదిగో ఆధారాలు అని కొందరు వ్యాసాలు రాస్తే ,  లగడ పాటి రాజ్ గోపాల్ విజయవాడలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు . అప్పుడు టీడీపీలో నర్రా విజయలక్ష్మి అనే మహిళా నాయకురాలు ఉండేవారు . లగడపాటి రాజ్ గోపాల్ అన్న బతుకమ్మ వేడుకలకు విజయవాడ పిలిచారు వెళుతున్నాను అంటూ మీడియా ముందు హడావుడి చేసి విజయవాడ వెళ్లారు . తెలంగాణ ఏర్పడిన తరువాత లగడపాటి అన్నగారు విజయలక్ష్మి చెల్లిని బతుకమ్మ వేడుకలకు విజయవాడ పిలిచారో లేదో , చెల్లి వెళ్లారో లేదో తెలియదు . తెలంగాణ వచ్చాక  విజయవాడలో లగడపాటి  బతుకమ్మ వేడుకలు జరిపినట్టు వార్తలు అయితే రాలేదు .  ****  తెలంగాణ ఉద్యమం ఉదృతం అయ్యాక చంద్రబాబు , బాలకృష్ణ లు కూడా బతుకమ్మ పూజ చేశారు . బోనం ఎత్తారు . ఐనా తెలంగాణ వచ్చింది . ఉద్యమ కాలం లో ట్యాంక్ బండ్ పై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడాలని ఏర్పాట్లు చేస్తే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆడేందుకు వీలు లేదు అని ఆంక్షలు విధించింది . జాగృతి కోర్ట్ కు వెళ్లి అనుమతి  తెచ్చింది . తెలంగాణ ఏర్పడిన తరువాత అదే ట్యాంక్ బండ్ పై అధికారికంగా ప్రభుత్వమే పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరిపింది . సీఎం తో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు ఆ వేడుకల్లో పాల్గొన్నారు . ***స్కిల్  స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు . బాబు విడుదలను కోరుతూ ట్యాంక్ బండ్ పై ఈ రోజు టీడీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ  ఆడుతున్నారు . కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు . తిరుపతి వెంకన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల దేవుడే కాదు . ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ మొక్కుతారు . బతుకమ్మ అందరి పండుగ అనుకుంటే సంతోషమే .. అది గుజరాతీ పండుగా నా ? ఇది బిహారీ పండుగ , తెలంగాణ , ఆంధ్ర పండుగ అని కాదు ఎన్ని పండుగలు చేసుకునే వీలుంటే అన్ని చేసుకోవచ్చు జీవితం పండుగ మాయం అవుతుంది .  - బుద్దా మురళి 

15, అక్టోబర్ 2023, ఆదివారం

కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది . జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 101

కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది . జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 101 చదువుకొనే రోజుల్లో ఒక పాట బాగా పాపులర్ . శోభన్ బాబు కారులో వెళుతుంటే వాణిశ్రీ పడుతుంది. కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ. మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. ఇదీ పాట . ఇదేమీ ప్రేమికులు పాడుకున్న డ్యూయెట్ కాదు . అక్షర సత్యం .. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు . ఇప్పుడెందుకు ఈ పాట అంటే . 2013 సాధారణ ఎన్నికలకు ఈ ఉదయం 55 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే తొలుత నాగర్ కర్నూల్ నియోజక వర్గం పేరు ఆసక్తిగా చూశాను . నాగం జనార్దన్ రెడ్డి పేరుకు బదులు రాజేష్ రెడ్డి అనే పేరు కనిపించగానే .. నాగంతో రెండు దశాబ్దాల సంఘటనలు గుర్తుకు వచ్చాయి . ఆ రోజుల్లో బాబు నంబర్ వన్ ఐతే దేవేందర్ గౌడ్ , నాగం జనార్దన్ రెడ్డి నంబర్ టూ అన్నట్టుగా ఓ వెలుగు వెలిగారు . ఇద్దరి రాజకీయ జీవితం ఒకేలా ముగింపు నాకు వచ్చింది . తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా ఉంది నాగం పరిస్థితి అని గతంలో ఓ సారి రాశాను . రాజకీయా నాయకులు , అధికారులు , ఉద్యోగులు , వారూ వీరు అని కాదు కాలం మారుతుంది అనే విషయం , మారింది అనే విషయం అందరూ గుర్తించాలి .. లేక పోతే మరీనా పరిస్థితులను తట్టుకోలేక మానసిక ఆందోళన పాలవుతాం . అందుకే ఆ పాట గుర్తుకు వచ్చింది . ఆ పాట ఓ జర్నలిస్ట్ గా నాకూ వర్తిస్తుంది . మీకూ వర్తిస్తుంది . ************* 2004 ఎన్నికలకు ముందు మంత్రి వర్గ సమావేశం . ఆ రోజుల్లో మంత్రి వర్గ సమావేశం అంటే ఇన్ సైడ్ సమాచారం కోసం కనీసం పది మంది మంత్రులనైనా కలవాల్సి వచ్చేది . మంత్రివర్గ సమావేశం ముగిసింది అని తెలియగానే సచివాలయం లోకి వస్తూ తొలుత నాగం జనార్దన్ రెడ్డి ఛాంబర్ లోకి ఇద్దరు ముగ్గురం జర్నలిస్ట్ లం వెళ్ళాం . లోపలి వెళుతూ నాగం కనిపించగానే ఏంటీ ఈ రోజు కేబినెట్ లో ఊపేశారట ! అని పలకరిస్తే ఆయన మురిసిపోయారు . మేము వెళ్లే సరికి ఛాంబర్లో వాళ్ళ నియోజక వర్గంలోని గ్రామం వాళ్ళు ఏదో పని కోసం వచ్చి ఉన్నారు . 2004 ఫలితాలు ఎలా ఉంటాయి అని నాగం అడిగితే , ఎలాంటి అనుమానం వద్దు మీ పార్టీ ఓటమి ఖాయం అని లెక్కలు చెప్పాను .. నువ్వు ఇలా చెబుతున్నావు కానీ , ఊరినుంచి వచ్చారు వీళ్ళతో ఇప్పుడే మాట్లాడాను గెలుస్తాం బాగుంది అంటున్నారు అని నాగం చెప్పారు . నేను లోపలి వస్తూనే ఏమన్నాను , క్యాబినెట్ లో ఊపేశారట కదా ? అన్నాను . నిజానికి ఈ రోజు క్యాబినెట్ జరిగింది అన్న విషయం తప్ప ఎవరు వచ్చారు , ఏం మాట్లాడారు నాకేం తెలియదు . నేరుగా మీ వద్దకే వచ్చాను . కేవలం ఇన్ సైడ్ సమాచారం కోసం మీ వద్దకు వచ్చి ఊపేశారట అని పొగిడాను . ఇదేమి పైరవీ కాదు , మీరు చెప్పక పోతే ఇంకో 30 మంది మంత్రులు ఉన్నారు . ఐనా మిమ్ములను పొగిడాను . సమాచారం కోసమే నేను మిమ్ములను పొగిడినప్పుడు , మీతో పని కోసం మీ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు గెలుస్తామని చెప్పక పోతే ఓడిపోతాం అంటారా ? అని చెబితే పక పక నవ్వారు . ******** బాబు హయాంలో నంబర్ 2 గా నాగం ఓ వెలుగు వెలిగిపోతున్న కాలం లో రేవంత్ రెడ్డి తెరాస లో సాధారణ కార్యకర్త . అటు నుంచి రేవంత్ టీడీపీలోకి వచ్చారు . అప్పుడూ నాగం నంబర్ 2 నే .. తెలంగాణ ఉద్యమం ఉదృతం అవుతుండడంతో నాగం కు ఎటూ పాలుపోలేదు . తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ , రెడ్డిగా వై యస్ ఆర్ రాజశేఖర్ రెడ్డిపై ధ్వజ మెత్తుతూ టీడీపీ లో తన స్థానం సుస్థిరం అనుకున్నారు . కోదండరాం రెడ్డి నాయకత్వంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయ్యాక ఓ రోజు నాగం తెలంగాణ రెడ్డి నాయకునిగా కోదండరాం ఎమర్జ్ అవుతున్నారు అని కంగారు పడ్డారు . తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో సభలో బాబును వ్యతిరేకించినట్టు మాట్లాడి , సంచలనం రేకెత్తించి , కొద్ది సేపు సభలో విడిగా కూర్చొని తరువాత వెళ్లి బాబు పక్కన కూర్చోగానే అదే జిల్లాకు చెందిన మరో నేత ..తిరుగుబాటు చేసిన వారు అలానే ఉండాల్సింది బాబు పక్కన కూర్చోగానే నాగం ది అయిపొయింది ఆయనకు అర్థం కావడం లేదు అన్నారు . టీడీపీలో తాము వెలిగిపోతున్నప్పుడు కెసిఆర్ ఎక్కడో ఉన్నారు , ఆయన నాయకత్వంలో ఎలా పని చేయాలి అని అటు వెళ్ళలేదు . ఇటు కోదండరాం నాయకునిగా వెలుగులోకి వస్తున్నాడు అని తెలంగాణ పేరుతో ఉద్యమ సంస్థ ఏర్పాటు చేశారు . అటు నుంచి బిజెపి , బీజేపీలో అసంతృప్తి అటు నుంచి కాంగ్రెస్ . టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారు . ఐనా టికెట్ పై ఆశలు పెట్టుకొని అలానే ఉన్నారు . నా లాంటి నాయకుడు కెసిఆర్ నాయకత్వంలో పని చేయడం ఏమిటీ అనుకున్న నాగం చివరకు తెరాస లో చోటా నాయకుడిగా పని చేసిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక . రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ లో పని చేశారు . రేవంత్ రెడ్డి టికెట్ఐ లు ఇచ్చే స్థానంలో ఉండగా .. నాగం టికెట్ అడిగే స్థానం లో ఉన్నారు . ఐనా టికెట్ దక్కలేదు . *********** ఉద్యమ కాలం లో చాలా మంది నాయకులకు చర్చల్లో ఓ మాట చెప్పేవాడిని . ఆంధ్రభూమిలో వెజ్ బోర్డు సిఫారసులు అమలు చేస్తారు . మంచి జీతాలు ఉంటాయి . నాకు భూమిలో దాదాపు ఏడు వేల రూపాయల జీతం వచ్చే రోజుల్లో ఏబీకే ప్రసాద్ సంపాదకునిగా సుప్రభాతం అని పక్ష పత్రిక వచ్చేది . రవిప్రకాష్ అందులో దాదాపు మూడు వేల రూపాయలకు రూపాయలకు ఉద్యోగం చేసేవారు . టివి 9 తో రవిప్రకాష్ ఎక్కడికో వెళ్లిపోయారు . భూమిలో ఏదన్నా తేడా వస్తే , ఎక్కడ ఉద్యోగం వచ్చినా చేస్తా కానీ అప్పుడు నాకు ఏడు , నీకు మూడు వేలే జీతం అంటే ఇంట్లో కూర్చోవలసి వస్తుంది అనే వాడిని . .. కాలం కారుతుంది . అలా మారుతుంది అని గ్రహించాలి , స్వీకరించాలి లేకపోతే తిరునాళ్లలో తప్పిపోయినట్టు అవుతుంది . - బుద్దా మురళి

13, అక్టోబర్ 2023, శుక్రవారం

జర్నలిస్ట్ లారా మీరెటువైపు ? జర్నలిస్ట్ జ్ఞాపకాలు -100

జర్నలిస్ట్ లారా మీరెటువైపు ? జర్నలిస్ట్ జ్ఞాపకాలు -100 -------------------------------------- రచయిత లారా మీరెటు వైపు అంటూ 1970 లో వినిపించిన ప్రశ్న 53 ఏళ్ళ క్రితం సాహిత్యంలో ఓ సంచలనం . అప్పుడు నేను ఇంకా స్కూల్ లో కూడా లేను కానీ ఆ ప్రశ్న గురించి ఆ తరువాత కూడా చాలా సార్లు చదివాను . అప్పటి వివాదం , అప్పటి చర్చ లోతుల్లోకి వెళ్ళలేను కానీ .. ఈ మధ్య వచ్చిన సినిమా పాట ఆ వైపు నుంటావా ? ఈ వైపు నుంటావా అని రంగస్థలంలో రాం చరణ్ ప్రశ్నకు మూలం ఈ ప్రశ్న నే కావచ్చు . పైకి ప్రశ్న లానే ఉన్నా అందులో ఒక రకమైన బెదిరింపు కూడా ఉంది అనిపిస్తోంది . విప్లవ రచయితల సంఘం రచయిత లారా మీరెటువైపు అని అడిగిన ప్రశ్నలో మా వైపున ఉంటే ఒకే లేకుంటే అంతే అన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణ చదువు చదివిన నాలాంటి వ్యక్తికి అనిపిస్తోంది . రచయితలు అంటే కొందరు అటు కొందరు ఇటూ అన్నట్టు , మరి కొందరు ఎటో తెలియనట్టు ఉండడం వల్ల అదో సంచలనం , సమాధానం కావలసిన ప్రశ్న . మరి జర్నలిస్ట్ లారా మీరెటు అంటే ? ******************** జర్నలిస్ట్ లారా మీరెటువైపు అని ప్రశ్నిస్తే జర్నలిస్ట్ లే కాదు , పత్రికలు చదివే పాఠకులు , ఛానల్స్ చూసే ప్రేక్షకులు కూడా క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తారు . కొందరు మేం తటస్థులం అని నటిస్తుంటారు . ఓ నిమిషం మాట్లాడితే ఏ పార్టీ తటస్తులో తేలిపోతుంది . తెలంగాణకు చెందిన ఓ ఛానల్ ఓనర్ తెరాస , కాంగ్రెస్ బీజేపీల మధ్య పొద్దు తిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు . ఆ ఛానల్ ఓనర్ ఎటు మారితే ఛానల్ అటు మారుతుంది . జర్నలిస్ట్ తనకు ఇష్టం వచ్చినట్టు రాస్తారు అనుకుంటాను కానీ యజమాని ఇష్టం వచ్చినట్టు రాయాలి , రాస్తారు . కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి , జీతాలు ఇచ్చి మీడియా సంస్థలను నడిపేది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకో , ప్రజల స్వేచ్ఛ కోసమో కాదు . డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ 1950 ప్రాంతంలోనే సబ్బుల వ్యాపారం ఎలానో మీడియా వ్యాపారం కూడా అంతే , దీనికి పెద్దగా విలువలు అంట గట్టకండి అన్నారు . మీడియాది వ్యాపారం అని జర్నలిస్టులకు , యజమానులకు , సంపాదకులకు , యూనియన్ నాయకులకు తెలియదా ? అంటే పాఠకులకే తెలిసినప్పుడు వారికి తెలియకుండా ఎందుకు ఉంటుంది . దేవతా వస్త్రాల కథలా అందరూ నటించేస్తుంటారు . గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు మీడియా మొత్తం వివిధ పార్టీలకు అనుబంధంగా పని చేస్తోంది . యజమాని ఏ పార్టీకి అనుబంధంగా పని చేస్తే ఆ మీడియా జర్నలిస్ట్ తనకు నచ్చినా నచ్చక పోయినా ఆ పార్టీకి ప్రయోజనం కలిగించే కోణం లోనే పని చేయాలి . ******* 95లో ఎన్టీఆర్ ను దించినప్పుడు అనేక వార్తల్లో , వ్యాసాల్లో నేను ఆంధ్రభూమిలో వెన్నుపోటు అని రాశాను . ఆ వెన్నుపోటులో మీడియా పాత్ర కూడా ఉంది . వారి పత్రిక తరపునే కాకుండా చిత్తశుద్ధితో వెన్నుపోటు కు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు ఈ మధ్య ఒక వ్యాసంలో 95 సంఘటన ప్రస్తావిస్తూ వెన్నుపోటు అని రాశారు . అది వెన్నుపోటు అని గ్రహించడానికి ఆ జర్నలిస్ట్ కు పాతికేళ్ళు పట్టిందా ? అంటే కాదు 95లో వెన్నుపోటుకు సహకరించిన మీడియాలో ఉన్నారు . పాతికేళ్ల తరువాత వెన్నుపోటు అని రాసినప్పుడు జగన్ మీడియాలో ఉన్నారు . నేను వెన్నుపోటు అని రాశాను అని స్వతంత్రంగా రాశాను అని కాలరెగిరిస్తే ఓ జర్నలిస్ట్ మిత్రుడు అది మీ పత్రిక పాలసీ కాబట్టి అలా రాయగలిగావు అంతే తప్ప అది మీ మీడియా ఇచ్చిన స్వేచ్ఛ కాదు అంటే ఆలోచిస్తే అతని వాదనలో కూడా నిజం ఉంది అనిపించింది . ఒక్కో సారి యజమాని జర్నలిస్ట్ ఒకే కోణం లో ఉంటే అదృష్టమే . బాబు వెన్నుపోటు సమయంలో మేనేజ్ మెంట్ , ఎడిటర్ , నేనూ వెన్నుపోటు అనే భావించడం వల్ల రాతలకు ఇబ్బంది కలుగలేదు . 2001 తెలంగాణ ఉద్యమం వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది . నేనేమో తెలంగాణ కోరుకున్న వాడిని , యాజమాన్యం కొన్ని కారణాల వల్ల మనం సమైక్యాంధ్ర అంది . ఎడిటర్ తెలంగాణ అనే మాట వినడానికే ఇష్టపడని వారు . ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎడిట్ పేజీలో వారం వారం రాసే పొలిటికల్ కాలం లో ధైర్యం చేసి తెలంగాణ ఎందుకు అవసరమో రాశాను . అది పబ్లిష్ అయ్యాక ఆఫీస్ లో తెలంగాణ మిత్రులు మెల్లగా ఏంటీ మన పత్రికలో తెలంగాణ గురించి అని మెల్లగా అభినందించి వెళ్లేవారు ... ముందుగా ఊహించినట్టుగానే ఎడిటర్ నుంచి ఫోన్ .. అక్షింతలు .. ఇంకోసారి నాకు చూపకుండా పంపవద్దు అని వార్నింగ్ .. నిజానికి నేను అంతకన్నా ఎక్కువ నష్టానికి మానసికంగా సిద్దమై ఉన్నాను . ఉద్యమం ఉదృతం అయ్యాక తెలంగాణ గురించి రాసుకొనే అవకాశం లభించింది . ఎడిటర్ సమైక్యాంధ్ర కోసం రాస్తే నేను తెలంగాణ కోసం రాశాను . పత్రికల్లో కొంత మేరకు యాజమాన్యం స్వేచ్ఛ ప్రసాదించినా , మాకు వద్దంటే వద్దు అని ఎడిటర్ , యజమాని ఏం కోరుకుంటే అదే రాద్దాం అనుకునేవాళ్లనూ చూశాను . 95లో వెన్నుపోటు గురించి రాసే అవకాశం భూమిలో ఉన్నా చాలా మంది ఉపయోగించుకోలేదు . అలానే తెలంగాణ ఉద్యమం ఉదృతం అయ్యాక రాసే అవకాశం ఉన్నా స్వేచ్ఛను ఉపయోగించుకొని వారు ఉన్నారు . ఎడిటర్ పేపర్ కు తానే ఓనర్ అన్నట్టు వ్యవహరించేవారు .. ఆంధ్రభూమి యాజమాన్యం పెద్దగా జోక్యం చేసుకునేది కాదు . దీనివల్ల కొంత వరకు రాయాలన్నది రాసే అవకాశం లభించింది ... ***************** రాష్ట్ర విభజన తరువాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊహించని విధంగా మీడియా రాజకీయ పార్టీలను మించి రాజకీయ అభిమానం చూపుతోంది . బాబు అరెస్ట్ తరువాత ఛానల్స్ లో కొందరు యాంకర్లు మాట్లాడుతున్న మాటలు పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడలేరు . పార్టీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు సైతం యాంకర్ల పార్టీ భక్తి చూసి ఈర్ష పడేట్టుగా ఉంది . రెండు రాష్ట్రాల్లో కూడా మొత్తం మీడియా రాజకీయ పార్టీలకు అనుబంధంగానే ఉంది . కొన్ని మీడియాలను ఏకంగా పార్టీలే నడుపుతుంటే , కూని మీడియాలేమో పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి . సొంతంగా పార్టీలు నడిపే మీడియా పార్టీకి శాశ్వతంగా కట్టుబడి ఉంటుంది . పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా పార్టీ మారదనే నమ్మకం లేదు . మారుతూ ఉంటుంది . రాజకీయ పార్టీల్లో , మావోయిస్టుల్లో కోవర్ట్ లు ఉన్నట్టే మీడియాలో కూడా కోవర్ట్ లు ఉంటారు . ఒక పార్టీ మీడియాలో ఉంటూ ప్రత్యర్థి పార్టీ కి సమాచారం చేరవేస్తారు . ఆ మధ్య ప్రభూత్వ ఉద్యోగులను ఓ మీడియా యజమాని బాబు ముందే తిడుతుంటే రికార్డ్ అయి బయటకు వచ్చింది ఇలానే . ఆ వీడియో టీడీపీకి కలిగించింది . *********** జాతీయ స్థాయిలో కొన్ని మీడియాలను బీజేపీ మరి కొన్నింటిని కాంగ్రెస్ బహిష్కరించింది . దానితో కాంగ్రెస్ సానుభూతి పరులు అంటూ ఎవరో ఒకరిని డిబేట్ లో కూర్చోబెట్టి చర్చ రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు . రాహుల్ గాంధీ అదానీ పై ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే , దానిని ప్రశ్నలతో రసాభాస చేయమని ndtv ఒక జర్నలిస్ట్ ను పంపితే , అతను నా వల్ల కాదు అని రాజీనామా చేశారు . మేనేజ్ మెంట్ చెప్పినట్టు చేస్తేనే ఉద్యోగం లేదంటే బయటకు వెళ్ళాలి . సామాజిక మాధ్యమాల పుణ్యమా ? అని మీడియా లోని వ్యవహారాలు బయటకులు వస్తున్నాయి . ప్రతి మీడియాకు రాజకీయ అనుబంధం ఉంది .. కొందరు అనుబంధం కోసం పార్టీలకు దరఖాస్తు చేసుకున్నా వీరికి అంత సీన్ లేదు అని పార్టీలు పట్టించుకోవడం లేదు . గతం లో ఓ కొత్త మీడియా వస్తుందే అంటే ఎడిటర్ ఎవరు ? అనే ప్రశ్న వినిపించేది .. ఇప్పుడు ఓనర్ ఏ పార్టీ అనే ప్రశ్న వినిపిస్తుంది . - బుద్దా మురళి

11, అక్టోబర్ 2023, బుధవారం

ఎన్నికల ఖర్చు మాయాజాలం ఒక్కరూ పాటించరు .. ఒక్కరిదీ రుజువు కాదు..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -99

ఎన్నికల ఖర్చు మాయాజాలం ఒక్కరూ పాటించరు .. ఒక్కరిదీ రుజువు కాదు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -99 ------------------------------ 2009 - 10 కాలం లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి . తెలుగుదేశం శాసన సభా పక్షం కార్యాలయం వద్ద నిలబడి కడప జిల్లాకు చెందిన శాసన సభ్యులు లింగారెడ్డి నేనూ ఏదో మాట్లాడుకుంటుంటే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ శాసన సభ్యులు రాజు అని గుర్తు ఆవేశంగా సభ నుంచి వస్తూ ఇలాంటి వారున్న సభలో నేను శాసన సభ్యునిగా ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను అని ఆవేశంగా ప్రకటించారు . ఏ మైంది అని పలకరిస్తే జగన్ వేల కోట్ల అవినీతి , అలాంటి అవినీతి పరుని గురించి సభలో చర్చ - విలువలు ఎక్కడికి పోతున్నాయి .. ఇలాంటి వారున్న సభలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను - సంక్షిప్తంగా ఇదీ అతని ఆవేదన . అతనికి నన్ను నేను పరిచయం చేసుకొని , మీ జేబులో ఉన్న ఒక్క రూపాయి గురించి కూడా అడిగే అధికారం నాకు లేదు . కానీ మనం విలువల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాను . మీకు ఇష్టం అయితే చెప్పండి ఎన్నికల్లో మీరు ఎంత ఖర్చు చేశారు అని అడిగాను . అతను కాసేపు అలానే ఉండి పోయి , ఐతే అవినీతి గురించి ప్రశ్నించే హక్కు నాకు లేదా అని అడిగారు . అది కాదు ఎన్నికల్లో నిబంధనల మేరకే ఖర్చు చేసిన వారు ఎవరైనా ఉన్నారా ? అని నాకు పరిచయం అయిన అందరినీ అడుగుతున్నాను , తెలుసుకోవాలి అని ఆసక్తి అంతే అన్నాను . చెప్పు పరవాలేదు , మురళి మన ఫ్రెండే అని లింగా రెడ్డి తాను ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో చెప్పారు . ఎక్కువ ఖర్చు చేస్తే అవినీతిని ప్రశ్నించే హక్కు లేదా అని ఆ రాజుగారు మళ్ళీ అడిగారు . ఇలాంటి సభలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను అన్నారు కదా ? నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఖర్చు చేసిన మీకు నైతికంగా అసలు సభలోకి వెళ్లే హక్కే లేదు . డబ్భు లేని వ్యక్తి సభ లోకి వెళ్లలేక పోయారు , డబ్బు ఎక్కువ ఖర్చు చేసి మీరు వెళ్లారు . మీ సభా ప్రవేశమే అనైతికం .. మీరే ఏ ఒక్కరు కూడా నిబంధనల మేరకు ఖర్చు చేయరు అని చెప్పాను . విచిత్రం యేమిటంటే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నిబంధనల మేరకు ఖర్చు చేయరు . ఇలా ఎక్కువ ఖర్చు చేశారు అని ఒక్కరంటే ఒక్కరి విషయంలోనూ రుజువుకాలేదు , రుజువు చేయలేరు . ఉమ్మడి రాష్ట్రంలో ఆసక్తితో దాదాపు 50-60 మందిని ఖర్చు గురించి అడిగి నిర్ధారించుకున్నాను . వార్త రాయడం కోసం కాదు ఆసక్తి కొద్ది తెలుసు కోవాలి అని అడుగుతున్నాను అంటే చాలా మంది చెప్పారు . తరువాత తెలంగాణ ఉద్యమం , అంతటా ఉద్రిక్త వాతావరణం వల్ల ఎన్నికల ఖర్చు గురించి మనసు విప్పి మేట్లడుకోలేదు . 294 మందిని ఖర్చు గురించి అడగలిగాని ఉండేది . 50-60 మందితోనే ఆగిపోయాను . ********* రెండు రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల వార్త టివి లో చూస్తుంటే ... ఆ వెంటనే మరో ఆసక్తికరమైన వార్త .. ఖమ్మం జిల్లాలో లో ఓ వ్యక్తి డబ్బు తీసుకోని వెళుతుంటే తనిఖీ చేస్తున్న పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు . ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చినందున ప్రజాస్వామ్యాన్ని ధన స్వామ్యం నుంచి కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారన్నమాట . ఎన్నికల కమిషన్ చాలా సేపు మీడియాతో మాట్లాడింది . అది పూర్తి కాక ముందే టివి ముందు నుంచి రంగంలోకి దిగిన పోలీసుల ఉత్సాహాన్ని చూశాక మన ప్రజాస్వామ్యం పోలీసుల వల్ల భద్రంగా ఉంది అనిపించింది . ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంత ఖర్చు చేయవచ్చునో తెలుసా ? 2014 వరకు అయితే 28 లక్షలు , 2022 లో పెంచిన దాని ప్రకారం ఇప్పుడు 40 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు . జోక్ కాదు నిజం అందరూ ఇంతే ఖర్చు చేస్తారు , చేయాలి . ఇంతకన్నా ఎక్కువ ఖర్చు చేసినట్టు తేలితే శాసన సభ్యత్వం రద్దు అవుతుంది . దేశంలో ఏ ఒక్కరు కూడా ఈ పరిధికి లోబడే ఖర్చు చేయడం సాధ్యం కాదు . అలా అని పరిధికి మించి ఖర్చు చేశారు అని ఒక్కరి విషయంలోనూ రుజువు చేయడం సాధ్యం కాదు . ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థి కూడా పరిమితిని మించి ఖర్చు చేశాడు అని రుజువు కాలేదు . .ఆ మధ్య యనమల రామకృష్ణులు ఓ టివి ఇంటర్వ్యూలో ఎన్నికల్లో తాను చేసిన భారీ ఖర్చు గురించి చెప్పారు . అది విని వైయస్ ఆర్ కాంగ్రెస్ వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో తెగ హడావుడి చేశారు . యనమల పని అయిపోయినట్టే ఇదిగో ఆధారం అని .. తరువాత ఏమైందో ఎవరూ పట్టించుకోలేదు . నామినేషన్ దాఖలు చేసే ఒక్క రోజే ఇంతకు మూడింతలు ఖర్చు అవుతుంది . ****** ఢిల్లీలో ఎన్నికల కమిషన్ మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు రంగంలోకి దిగి దారులను దిగ్భందం చేసి వెతికితే నోట్ల కట్టలు దొరుకుతాయి . మీడియాలో బోలెడు ప్రచారం . బేగం బజార్ లో నిలబడి వాహనాలు వెతికితే రోజుకు కొన్ని కోట్లు దొరుకుతాయి . అలా డబ్బులు తీసుకువెళ్లే వారు ఎన్నికల్లో పంచడానికి కాదు . వారికి కనీసం ఎన్నికల షెడ్యూల్ వచ్చింది అని కూడా తెలియదు . బేగం బజార్ లో రోజూ నగదు రూపంలోనే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది . ఒక్క బేగం బజార్ అనే కాదు ఇలా తనిఖీల్లో దొరికే డబ్బు కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి సంబంధం ఉండదు . వ్యాపారాలు , వ్యక్తిగత అవసరాల కోసం అలా డబ్బు తీసుకువెళుతున్న వారే వారంతా .. ఇంకా వివిధ పార్టీల అభ్యర్థులే తేలనప్పుడు ఎవరు ఎవరికి పంచుతారు డబ్బులు . 2004 , 2009 ఎన్నికల్లో కొందరు ఏకంగా రెడీ మెడ్ సిమెంట్ మిక్సర్ భారీ వాహనాల్లో కూడా డబ్బు పంపినట్టు ఎన్నికలల్లో చురుగ్గా పాల్గొన్న వారు ఎన్నికలు అయ్యాక చెప్పిన మాట . ఎన్నికల సంస్కరణలు అంటే చాలా మంది శేషన్ పేరు గుర్తు చేసుకుంటారు . ఒకరు మరో కోణంలో చూశారు . శేషన్ కన్నా ముందు గోడల మీద రాతలతో తక్కువ ఖర్చుతో ప్రచారం జరిగేది . శేషన్ పుణ్యమా అని గోడమీద రాతలు మాయం ఆయాయ్యి కానీ ఖర్చు భారీగా పెరిగింది . ఎన్నికల ఖర్చు రాసి , ఆడిట్ చేసి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలి . ఎన్నికల ఖర్చు పరిమితిలో సగం ఈ ఆడిటర్ పీజుకే కేసరిపోతుందేమో .. - బుద్దా మురళి

5, అక్టోబర్ 2023, గురువారం

ఆ నేత మరణం తీరని లోటు ... జర్నలిస్ట్ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది .. ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 98

ఆ నేత మరణం తీరని లోటు ... జర్నలిస్ట్ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 98 ---------------------------------------- ఎవరైనా రాజకీయ నాయకుడు మరణిస్తే .. ఆ వార్తలు చదివితే పత్రిక ఏదైనా కావచ్చు , నాయకుడు ఎవరైనా కావచ్చు , ప్రకటన ఇచ్చింది ఎవరైనా కావచ్చు ఒక వాఖ్యం అన్నింటిలో కామన్ గా కనిపిస్తుంది . ఆ నాయకుడి మరణం తీరని లోటు అనే మాట లేకుండా వార్త ఉండదు . అలానే జర్నలిస్ట్ మరణిస్తే సిటీ పేజీలో , జిల్లాల్లో ఐతే జిల్లా పేజీలో తప్పని సరిగా కనిపించే మాట . మరణించిన కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది . ఆ మాట చదవగానే వైరాగ్యంతో కూడిన నవ్వు వస్తుంది . ******** 1993 నాటి మాట .. 30 ఏళ్ళ క్రితం నల్లగొండ జిల్లా లో ఆంధ్రభూమి రిపోర్టర్ గా చేస్తున్నప్పుడు మిర్యాలగూడలో యూనియన్ సమావేశం . హైదరాబాద్ నుంచి యూనియన్ రాష్ట్ర నాయకులు రావాలి . ఆలస్యం అవుతోంది . వారు వచ్చే వరకు మౌనంగా ఉండలేరు కదా ? అప్పటి వరకు జిల్లా స్టాప్ రిపోర్టర్ లు మాట్లాడితే బాగుంటుంది అని సలహా ఒకరి తరువాత ఒకరు మాట్లాడుతున్నారు . నన్నూ మాట్లాడమన్నారు. అప్పటివరకు మాట్లాడిన అనుభవం లేదు . నాలుగు మంచి మాటలు చెప్పేందుకు ఇబ్బంది ఏముంది అని మైకు తీసుకోని .... మీరు ఫుల్ టైం పని చేయాల్సిన స్టాఫ్ రిపోర్టర్ లు కాదు , పార్ట్ టైం పని చేయాల్సిన లోకల్ విలేకరులు . మా ఏరియానే ప్రపంచం , ప్రపంచాన్ని మేమే శాసిస్తున్నాం అనే భావన వద్దు . మేనేజ్ మెంట్ కు కోపం వచ్చినా , ఎవరికి కోపం వచ్చినా మీ పార్ట్ టైం ఉద్యోగానికి భరోసా ఉండదు . పైగా మీకు వచ్చే డబ్బు అంతంత మాత్రమే . ఇది పార్ట్ టైం అని గుర్తుంచుకొని , ఏదైనా ఉపాధి మార్గం చూసుకోవాలి . ఒకరికి చేయి చాపే స్థితిలో ఉండకూడదు . ఆ నాయకుడు తెలుసు , ఈ నాయకుడు తెలుసు అని చెప్పుకోవడానికి బాగుంటుంది , అవేవి జీవితానికి ఉపయోగపడవు . నీ జీవితం నీకు ముఖ్యం . అందరూ నమస్తే అన్నా అంటున్నారని మురిసిపోవడం కాదు . జీవితానికి ఉపయోగపడే ఉపాధి చూసుకొని , పార్ట్ టైం విలేఖరులుగా ఏదో ఆసక్తి ఉంటే పని చేయండి. చాలా మంది మరణిస్తే అంత్యక్రియలకు చందాలు వసూలు చేయడం చూశాను . ఉపాధి చూసుకోవడం , ఉపాధి పొందే నైపుణ్యం పెంచుకోవడం ముఖ్యం అంటూ ఉపన్యాసం ఇస్తున్నాను ... నేను అలా మాట్లాడుతుండగానే రాష్ట్ర నాయకులు వచ్చారు . నా ఉపన్యాసంలో కొంత విన్నారు . ఎంత విన్నా ఏదో ఒక ఉపాధి చూసుకోండి అనే మాటనే తిప్పి తిప్పి చెప్పాను .. రాష్ట్ర నాయకులు వస్తూనే ఇది జర్నలిస్ట్ ల యూనియన్ మీటింగ్ హక్కుల కోసం పోరాటాల గురించి ఉపన్యాసాలు ఉండాలి , ఉపాధి గురించి కాదు అని నాకు ఓ చురక అంటించారు.. ఆ తరువాత జర్నలిస్ట్ అంటే ఏమిటీ ? యూనియన్ ఏమిటీ ? ఉద్యమాలు , త్యాగాలు అంటూ యూనియన్ నాయకులు బాగా మాట్లాడారు . నాకూ నిజమే అనిపించింది . ఆ సమావేశం చివరలో విరాళాలు వసూలు చేశారు . స్థానికంగా ఉన్న జర్నలిస్ట్ ఒకరు మరణించారు . అంత్యక్రియలు , తక్షణం కుటుంబం గడవడానికి ఏమీ లేదు . దానితో విరాళాలు వసూలు చేశారు .అప్పుడు యూనియన్ నాయకుడి ఉపన్యాసం నాకూ బాగానే నచ్చింది కానీ .. జర్నలిజం అంటే , యూనియన్ అంటే ఏమిటో అద్భుతంగా మాట్లాడిన ఆ యూనియన్ నాయకుడికి చాలానే సైడ్ బిజినెస్ లు ఉన్నాయని ఒకటి రెండు దశాబ్దాల తరువాత కానీ నాకు తెలియలేదు . ************** మూడు దశాబ్దాల క్రితం నాటితో పోలిస్తే ఇప్పుడు అంత అమాయకులేం లేరు . చాలా మంది స్థానిక విలేకరులు కూడా ముదిరిపోయారు . అలానే చాలా మంది ఊబిలో చిక్కుకు పోయినట్టు అక్కడే ఉండిపోతున్నారు . అక్కడ ఉండలేరు , బయటకు రాలేరు . ఒక్క సారి ఆ గౌరవానికి , నాయకుల నుంచి అన్నా అనే పిలుపునకు అలవాటు పడి అక్కడే కొట్టుమిట్టాడే వారు ఉన్నారు . ఒక ఉద్యోగం లా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తున్న వారూ ఉంటే ఉండొచ్చు ... ************** ********* 1995-96 లో ఓ రోజు సచివాలయం నుంచి ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్ వస్తూ ట్యాంక్ బండ్ పై కాసేపు ఆగాను . బైక్ మీద ప్రెస్ అని చూసి ఓ పెద్దాయన వచ్చి ఏ పేపర్ అని అడిగారు . ఆంధ్రభూమి అని చెబితే సీరియస్ గా మీ జర్నలిస్ట్ లను అస్సలు నమ్మొద్దు అని ఏదో గొణిగాడు . ఏమైంది అంటే ఆంధ్రభూమిలో బాబురావు అని జర్నలిస్ట్ ఉండేవారు . అయన మరణించినప్పుడు ఆంధ్రభూమి జర్నలిస్ట్ లు చాలా మంది ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారట ... తరువాత ఎవరూ పట్టించుకోలేదు . ఇదీ ఆయన కోపానికి కారణం .. ఎవడి బతుకు వాడికే కష్టం .. ఇంకా ఇతరుల కుటుంబాలను పట్టించుకునేంత , అండగా ఉండే అంత ఉంటుందా ? ఏదో మాట వరుసకు అలా అంటారు . ****************** నగరంలో లోకల్ విలేకరి ఒకరు మరణించిన వార్తలో .. ఆ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది అనే వార్త చదివాక మిర్యాలగూడ మీటింగ్ , ట్యాంక్ బండ్ సంఘటన గుర్తుకు వచ్చింది. ఎప్పటిలానే మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది అని ప్రకటించారు . ఎవరికి ఎవరు అండగా ఉండలేరు . ఎవరి బతుకు వారికే సమస్య కనీసం ఇప్పుడు మీడియా అకాడెమీ ఆర్ధిక సహాయం చేస్తోంది . గతంలో అదికూడా లేదు . ***** నాయకుడు మరణించినా , సినిమా వాళ్ళు మరణించినా వారి మరణం తీరని లోటు అనేది కామన్ డైలాగు . ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మాజీ సీఎం ఒకరు మరణిస్తే ఆఫీస్ లో ఉండగా ఫోన్ రింగ్ అయింది . వి . హనుమంతరావు ఫోన్ చేసి కాంగ్రెస్ రిపోర్టర్ గురించి అడిగితే ఇంకా రాలేదు అని చెబితే సంతాపంలో నాదీ రాసేసుకో .. తెలుసు కదా తీరని లోటు అని రాయి అని ఒక్క ముక్కలో ముగించేశారు . ************** ఒక వ్యక్తి మరణం ఆ కుటుంబానికే తీరని లోటు .. ఆ సంగతి జర్నలిస్ట్ మిత్రులు బతికి ఉండగా గ్రహించాలి అని ఆశ ... - బుద్దా మురళి

29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

నూలు పోగు కూడా అడ్డం లేకుండా నగ్న నృత్యం చేస్తున్న మీడియా ... ఆ రోజుల్లో మీడియా అంతా కలిసి నాయకులను బహిష్కరించేవారు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 97

నూలు పోగు కూడా అడ్డం లేకుండా నగ్న నృత్యం చేస్తున్న మీడియా ... ఆ రోజుల్లో మీడియా అంతా కలిసి నాయకులను బహిష్కరించేవారు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 97 ------------------------- రాష్ట్రాల్లో , జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా ఒక పార్టీ మీడియాను, మరో పార్టీ బహిష్కరించడం ఇప్పుడు సర్వసాధారణం . ఆ రోజుల్లో కూడా బహిష్కరణ ఉండేది కానీ ఇప్పటిలా కాదు . జర్నలిస్ట్ లంతా కలిసి తప్పు చేసిన నాయకుడిని బహిష్కరించేవారు . అన్ని పార్టీల మీడియా ఏకాభిప్రాయానికి రావడం ఎలా సాధ్యం అని ఇప్పటి వారికీ అనిపించవచ్చు . కానీ అప్పటి పరిస్థితి వేరు . 1987లో తొలిసారిగా మెదక్ జిల్లాలో జర్నలిస్ట్ గా ఉద్యోగం . అప్పుడు జిల్లాకు చెందిన బాగారెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం నాయకుడు జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు ఒకరు బీర్ తాగిస్తే ఏమైనా రాస్తారు అంటూ జర్నలిస్ట్ ను ఏదో తిట్టాడు . జిల్లా జర్నలిస్ట్ లకు చెప్పడంతో అంతా సమావేశం అయి ఆ నాయకుడిని మీడియాలో బహిష్కరించాలి అని నిర్ణయించారు . అటు నుంచి హైదరాబాద్ వచ్చి బాగారెడ్డిని కలిసి కాంగ్రెస్ నాయకుడిపై ఫిర్యాదు . అప్పుడు నాయకులు ఏ మీడియా వారిని తిట్టినా అందరూ కలిసి బహిష్కరించేవాళ్ళు . బహిష్కరణ అంటే ఏ మీడియా కూడా ఆ నేత పేరు, అతని ప్రకటనలు ఉండవు . .93లో నల్లగొండలో పని చేసేప్పుడు నరసింహారావు అని జిల్లా కలెక్టర్ ఉండేవారు . ఈనాడు రిపోర్టర్ తో ఏదో వివాదం. అతని వార్తలు బహిష్కరించాలి అంటే ఎలా ? జిల్లాలో ప్రధాన వార్తలు కలెక్టర్ వే ఉంటాయి . కలెక్టెర్ వార్తలు రాయాలి కానీ , కలెక్టర్ పేరు రాయకూడదు అని నిర్ణయం . దాదాపు ఐదు ప్రధాన పత్రికల రిపోర్టర్ లు ముగ్గురు నలుగురు లోకల్ రిపోర్టర్ లు కాబట్టి నిర్ణయం అమలు ఈజీ . సాధారణంగా ఈనాడు రిపోర్టర్ లు యాజమాన్య నిర్ణయం మేరకు యూనియన్ కార్యకలాపాలకు దూరం , ఐతే ఇలాంటి దాడుల విషయంలో కలిసి వచ్చేవారు . ఓ వారం పాటు పట్టించుకోని కలెక్టర్ కు తరువాత తన పేరు లేకుండా తన వార్తలు రావడం చిరాకు వేసి అందరినీ పిలిచి ఏదో రాజీ పడ్డారు . డివిజన్ స్థాయి మొదలు కొని జిల్లా స్థాయి వరకు ఇలా బహిష్కరణలు ఆ రోజుల్లో కామన్ . ఓ సారి సదాశివపేట విలేకరులకు పొలిసు వారితో ఏదో వివాదం క్రైం వార్తలు బహిష్కరించాలి అని నిర్ణయం . సిఐ అత్యాచారం చేశాడు అనుకో ఆ వార్త రాయరా ? అని లోకల్ విలేకరులను అడిగితే ఏమీ చెప్పలేదు . ***** ఇప్పుడు బహిష్కరణలు మరింత ఉదృతంగా సాగుతున్నాయి . ఐతే జర్నలిస్ట్ లు అందరూ కలిసి నాయకుడిని బహిష్కరించడం కాదు . ఒక పార్టీ మీడియా మరో పార్టీ మీడియాను బహిష్కరిస్తోంది . ఆంధ్ర లో టీడీపీ వై యస్ ఆర్ పార్టీ మీడియాను బహిష్కరిస్తే , వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మీడియాను బహిష్కరించింది . మా మీటింగ్ కు మీరు రావద్దు అని చెప్పాము ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు . తెలంగాణ లో సైతం బి ఆర్ ఎస్ , బీజేపీ మీడియాలు పరస్పరం బహిష్కరించుకున్నాయి . మొదలుకొని దేశం వరకు ఇదే తీరు . తమిళనాడులో పార్టీ గుర్తు , ఆ పార్టీకి చెందిన ఛానల్ గుర్తు ఒకటే ఉంటుంది . మన రాష్ట్రం లో కొంత ముసుగు ఉండేది . పార్టీల ఆధ్వర్యంలో నడిచే మీడియా , పార్టీలకు మద్దతు ఇచ్చే మీడియాగా ఇప్పుడు రెండు మీడియాలు ఉన్నాయి . రెండు రాష్ట్రాల్లో చిన్న పార్టీ , పెద్ద పార్టీ అని కాదు అన్ని పార్టీలకు మీడియా ఉంది . శాసన సభలో ప్రాతినిధ్యం లేనికదా ? ఎందుకు వచ్చారు అని బహిరంగంగానే అడుగుతున్నారు . గతంలో ఆ రెండు పత్రికలు టీడీపీకి అనుకూలం , మాకు వ్యతిరేకం అంటూ వై యస్ ఆర్ బహిరంగంగానే అనేవారు కానీ బహిష్కరిద్దాం అంటే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక , అప్పటికి సొంత పత్రిక సాక్షి లేదు .. ఇప్పుడు ఏ పార్టీ పత్రిక ఆ పార్టీకి ఉండడం తో ఈజీ అయింది . . మీడియా రాజకీయ అనుబంధాలు కొత్తేమి కాదు కానీ ఇప్పుడు చిన్న నూలుపోగు కూడా అడ్డం లేకుండా మీడియా ఇప్పుడు నగ్న నృత్యం చేస్తోంది . 82లో టీడీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ప్రచారం వరకు బాధ్యతను ఈనాడు తన భుజాలపై వేసుకోంది . 82 నాటి టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో ఎం వి మైసూరారెడ్డి ఇంట్లో ఓ సారి చూశాను . ఈనాడు కార్యాలయంలో ముద్రించినట్టు మ్యానిఫెస్టో లోనే ఉంటుంది . టీడీపీ అనుకూల వార్తలు రాయడమే కాదు పెద్ద పెద్ద శీర్షికలతో ఈనాడులో టీడీపీకి ఓటు వేయండి , కాంగ్రెస్ ను ఓడించండి అని నినాదాలు ముద్రించేవారు . ఈ రోజులలో పార్టీ పత్రికలు కూడా అలా నినాదాలు ముద్రించవు .. ఐతే ఆ రోజుల్లో ఉన్న రాజకీయ వాతావరణంలో అది తప్పు అనిపించలేదు . ఈ తరం వారికి నమ్మశక్యం కాకపోవచ్చు ఇప్పుడు టీడీపీ కోసం ప్రాణాలు ఇచ్చే జ్యోతి ఆ రోజుల్లో కాంగ్రెస్ వైపు ఉండేది . ఆ పత్రిక యజమాని కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులు . క్రమంగా మెజారిటీ మీడియా టీడీపీకి మద్దతుగా నిలవడం తమ సామాజిక బాధ్యతగా భావించింది . 95 లో ఎన్టీఆర్ ను దించే నాటికి అంతంత మాత్రంగానే సర్క్యులేషన్ ఉన్న ఆంధ్రభూమి మినహా మెజారిటీ మీడియా బాబు కోసం , బాబు టీడీపీ కోసం అలుపెరుగని శ్రమ దానం చేసింది . ఎన్టీఆర్ లాంటి జనాకర్షణ గల నాయకుడు సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు . మీడియా తనను కుట్రతో దించేసింది అని .. ఈనాడు సంగతి తెలుస్తాను అని శ్రీశైలం లో మీడియాతో చెప్పిన వార్త ఈనాడులో చిన్నగా వచ్చింది . ఆలా చెప్పిన వారానికి ఎన్టీఆర్ మరణించారు . మీడియా మొత్తం టీడీపీ వైపు నిలవడం 95 నాటికి పీక్ స్టేజికి వెళితే .. ఆ తరువాత క్రమంగా రోజులు మారాయి .******** అన్ని పార్టీలకు సొంత మీడియా ఉంది . పార్టీలకే కాదు వ్యక్తులకూ ఉంది . ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు ఈనాడులో కనిపించవద్దు అని పేపర్ బాస్ హుకుం జారీ చేస్తే ఎంపీ యున్న ఎన్నికల్లో పోటీ చేసేవారి గురించి రాసేప్పుడు ఉండవల్లిని మినహాయించారు . యూ ట్యూబ్ ఛానల్స్ వచ్చాక ఉండవల్లి సెలబ్రిటీ అయిపోయారు . ఈనాడులో పేరు కనిపించడం లేదు అని ఒకనాడు తపించిన ఆయన మాట్లాడితే యూ ట్యూబ్ లో లక్షల్లో చూస్తారు . ***** చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ తరువాత తెలుగు మీడియా కనీసం నూలుపోగు కూడా అడ్డం లేకుండా నగ్న నృత్యం చేస్తోంది . కొన్ని ఛానల్స్ , పత్రిక లు మొత్తం బట్టలు విప్పుకోలేదు కానీ .. కొన్ని ఛానల్స్ పత్రికలు జనం నవ్వుకుంటారు అని కూడా ఆలోచించకుండా నగ్న నృత్యాలు చేస్తున్నాయి . రాజమండ్రి జైలులో బాబుపై దోమలతో బయో వెపన్ ఉపయోగిస్తున్నారు , దోమలతో కుట్టించి చంపాలని చూస్తున్నారు అని మహా టివి చివరకు సీరియస్ వ్యవహారాన్ని నవ్వులాటగా మార్చేట్టు ఉన్నాయి . టివి 5 ఆవేశంతో పోతారేమో అన్నట్టుగా ఊగిపోతోంది . మేడం భువనేశ్వరీ నడుం బిగించండి అని అని టివి 5 పిలుపు ఇచ్చింది . మహా టివి , టివి 5, abn బాధ వర్ణనాతీతం . వీరికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఆంధ్ర లో రాష్ట్రపతి పాలన పెడుతున్నారు , అమిత్ షా తో అధికారుల తాట తీయిస్తున్నారు . సందట్లో సడేమియా అని మహా టివి ఏకంగా బాబుకు మద్దతుగా వంద దేశాల్లో ఉద్యమాలు చేయిస్తోంది . మా బాబు బంగారం అని టీడీపీ మీడియా 24 గంటలు కోడై కుస్తుంటే , బాబు దుర్మార్గుడు అని సాక్షి తీర్పులు ఇస్తోంది . శుక్రవారం ఆంధ్ర లో జరిగిన మీటింగ్ లో టీడీపీ పత్రికల పై జగన్ వ్యంగ్యోక్తులు విసిరారు . నిజానికి బాబు అరెస్ట్ ఎపిసోడ్ లో అన్ని ఛానల్స్ కన్నా మహా టివి ఎక్కువ వినోదాన్ని పంచుతోంది .ఐతే అన్ని ఛానల్స్ ను ప్రత్యేకంగా ప్రస్తావించిన జగన్ మహాటీవీ పేరు ఎత్తలేదు . పార్టీలు ఒకరినొకరు పొడుచుకొంటారేమో అనిపించేట్టుగా ఉంది . ప్రత్యర్థి పార్టీల మీడియాను పరస్పరం బహిష్కరించుకుంటున్నా .. తిట్టుకుంటున్నా .. క్షేత్ర స్థాయిలో పని చేసే జర్నలిస్ట్ ల మధ్య అంత కక్షలు , పగలు ఏమీ లేవు . హాయిగా పని చేసుకుంటున్నారు . ఎందుకంటే యాజమాన్యాలు , యాజమాన్యాల పార్టీల రాజకీయాలు వారికి బాగా తెలుసు .. - బుద్దా మురళి

26, సెప్టెంబర్ 2023, మంగళవారం

శవం మీద టీడీపీ జెండా కప్పమని ప్రజారాజ్యం లోకి జంప్ .... మన్మోహన్ ను గెలిపించిన ...నేతల మాటల మర్మం చెప్పిన ఓషో జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 96

శవం మీద టీడీపీ జెండా కప్పమని ప్రజారాజ్యం లోకి జంప్ .... మన్మోహన్ ను గెలిపించిన ...నేతల మాటల మర్మం చెప్పిన ఓషో జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 96 --------------------------------------------- జర్నలిస్ట్ లు అవకాశం ఉన్నంత వరకు చదవాలి . 87 నుంచి 94 వరకు జిల్లాల్లో పని చేసేప్పుడు చాలా మంది జర్నలిస్ట్ లు జిల్లా పేజీలు మాత్రమే చదివే వారు . ఆ తరువాత మనం రాసిన వార్త మనం చదివితే పేపర్ చదివినట్టే అనే దశకు చేరుకున్నాం . ఇప్పుడు ఆ దశ కూడా దాటి పోయి టివిలో న్యూస్ చూడడమే తప్ప చదవడం అనే అలవాటు తగ్గిపోయింది . నాయకుల మాటల్లో మర్మం అర్థం చేసుకోవడానికి ఓషో రచనలు నాకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి . మాట్లాడే మాటల అర్థాలు వేరు కావచ్చు , కానీ వాటి వెనుక మతలబు వేరుగా ఉంటుంది .. ఆ మతలబును అర్థం చేసుకోవడంలో ఓషో రచనలు ఉపయోగపడ్డాయి . ******** చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన కొత్తలో ఎన్టీఆర్ భవన్ లో అప్పటి టీడీపీ నాయకుడు తమ్మినేని సీతారాం విలేకరుల సమావేశం . సమావేశానికి ముందు , సమావేశం తరువాత నాయకులు మీడియాతో ఇష్టాగోష్టిగా మనసులో మాట మాట్లాడుతుంటారు . విలేకరుల సమావేశాల్లో పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినా అసలు విషయాలు ఇష్టాగోష్ఠిలోనే పంచుకుంటారు . చిరంజీవి పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది ? అని సీతారాం విలేకరుల అభిప్రాయం అడిగారు . ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు . అంతంత మాత్రమే ప్రభావం ఉంటుంది .. నమ మాత్రంగానే సీట్లు గెలుస్తారు అని విలేఖరులు తమ అభిప్రాయం చెప్పారు . లేదు మీరు చూస్తూ ఉండండి ప్రజారాజ్యం ప్రభావం చాలా ఉంటుంది . బాగానే గెలుస్తారు అని తమ్మినేని చెప్పుకొచ్చారు . విలేకరుల సమావేశం టైం కాగానే అదే తమ్మినేని స్టేజి మీదకు వెళ్లి వీరావేశంతో ప్రజారాజ్యంను , చిరంజీవిని తీవ్రంగా విమర్శించారు . తమ్మినేని మాట తీరు ఏకపాత్రాభినయం లా గంభీరంగా ఉంటుంది . ఆవేశం తెచ్చిపెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించి .. అకారణంగా అంత ఆవేశంగా ప్రజారాజ్యంను తిడుతున్నారు అంటే చూస్తుంటే మీరు కూడా ప్రజారాజ్యం లోకి వెళుతున్నట్టు ఉంది అన్నాను . తమ్మినేని అంతే ఆవేశంగా ఏంటీ నేనా ? ప్రజారాజ్యం లోకి వెళ్లడమా ? చివరి వరకు టీడీపీలోనే ఉంటాను , నా శవం మీద టీడీపీ జెండా కప్పాలి అంటూ ఆవేశంగా చెప్పారు . విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన్ని మళ్ళీ పార్టీలో చూడలేదు . ఎందుకంటే అటుబుక్నుం లో చి ఆటే వెళ్లి ప్రజారాజ్యం లో చేరారు . తమ్మినేని అంత ఆవేశంగా ప్రజారాజ్యంను విమర్శిస్తుంటే .. మీరు ప్రజారాజ్యంలోకి వెళ్లేట్టు ఉన్నారు అని ప్రశ్నించడం ఒక రకంగా చూస్తే అర్థం లేని ప్రశ్న అవుతుంది . కానీ ఓషో పుణ్యమా అని అలా ప్రశ్నించాను . నువ్వు ఏదైతే కాదో అది అని చెప్పడానికి ప్రయత్నిస్తావు అని ఓషో అంటాడు . మనసులో ఉన్నది ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది అంటాడు ... నాయకుడైన , మాములు వారైనా విలువల గురించి ఎక్కువగా మాట్లాడితే ఓషో చెప్పిన మాట ప్రకారం అతన్ని ఎక్కువగా అనుమానించడం నాకు అలవాటు . కొల్లి ఇంటిపేరుతో ఓ జర్నలిస్ట్ మిత్రుడు ఉండేవాడు . తెలంగాణ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ , అంతే ఘాడంగా టీడీపీని అభిమానించేవాడు . రాజకీయ పక్షాల్లో విలువలు ముఖ్యం అంటూ ఫేస్ బుక్ లో తెగరాసేవాడు . ఇప్పుడు ఎక్కడ ఉన్నడో తెలియదు కానీ .... తెలంగాణ ప్రభుత్వం గొర్రెలు , బర్రెలు ఇప్పించే పథకం లో కొంతమంది తో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడితే అరెస్ట్ చేశారు . తరువాత ఏమైందో తెలియదు . ************* మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అణుఒప్పందం పై వామపక్షాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాయి . ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెట్టారు . కోట్ల రూపాయలు ఇచ్చి టీడీపీ ఎంపిలను కొనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మీడియాలో వార్తలు . ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో ఓ ఎంపీని పలకరిస్తే కోట్ల రూపాయలు ఆఫర్ ఇస్తున్నారని మీరు వార్తలు రాయడమే కానీ ఒక్కరు కూడా సంప్రదించలేదు అని నవ్వుతూ అనాన్రు . టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ , టీడీపీ శాసన సభా పక్షం కార్యాలయం ఇంటి వ్యవహారం లా ఉండేది . వాళ్ళు వాళ్ళే కుటుంబ సభ్యుల్లా మాట్లాడుకుంటారు . అదే కాంగ్రెస్ శాసన సభా పక్షం కార్యాలయం నానా జాతి సమితిలా ఉంటుంది . అన్ని పార్టీల నాయకులు , రిపోర్టర్ లు అక్కడికి చేరుకునే వారు . అన్ని పార్టీల వ్యవహారాలు అక్కడ చర్చకు వచ్చేవి . పెళ్లి చేయుకుంటావా ? తాతా అంటే ఈ వయసులో పిల్లను ఎవడిస్తాడు అంటదు తాత . అంటే ఇస్తే చేసుకోవడానికి రెడీ అన్నమాట . మనసులో ఉన్నది ఇలా ఎలానో బయటకు వస్తుంది . ఓషో చెప్పిన దాని ప్రకారం .. ఇప్పటి వరకు ఒక్కరూ డబ్బులు ఇస్తామని ఆఫర్ చేయలేదు అంటే ఆ ఎంపీ డబ్బులకు సిద్ధం అన్నమాట అని నా అభిప్రాయం నేను చెప్పాను .. తరువాత ఏం జరిగిందో , ఎవరు ఏం చేశారో , ఎంత ఇచ్చారో తెలియదు కానీ . టీడీపీ ఓట్లు రెండు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా పడ్డాయి . ప్రభుత్వం నిలబడింది . ఎంపిలను కొనడం అనైతికం కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ దేశానికి చేసిన మేలు అంతా ఇంతా కాదు .ఆ ను ఒప్పందం వల్ల దేశం ఈ రోజు శక్తి వంతంగా తయారు అయింది .. ధైర్యంగా నిలబడింది... - బుద్దా మురళి

25, సెప్టెంబర్ 2023, సోమవారం

ప్రతి ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది ... లక్ష కోట్లు .. ఐటీని కనిపెట్టడం .. మడమ తిప్పక పోవడం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -95

ప్రతి ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది ... లక్ష కోట్లు .. ఐటీని కనిపెట్టడం .. మడమ తిప్పక పోవడం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -95 ------------------------------------- 2004 లో టీడీపీ ఓడిపోయి వైయస్ ఆర్ ముఖ్యమంత్రి అయిన మూడు నాలుగు నెలలకే వేలకోట్ల అవినీతి అంటూ టీడీపీ ప్రచారం చేసేది . వారి ప్రచారాన్ని ముందు వారు నమ్మి ఇతరులను నమ్మిస్తారు . ఈ విధానం టీడీపీలో చాలా బాగుంటుంది . ఓ రోజు తెలుగుదేశం శాసన సభా పక్షం కార్యాలయంలో ఉన్నప్పుడు టీడీపీ శాసన సభ్యులు దేవినేని ఉమ హరిశ్చంద్రుడు అబద్దం చెప్పడు అనే ముఖకవళికలతో బోలెడు బాధపడుతూ .. విచ్చల విడిగా సంపాదిస్తున్నారు , ఇంత డబ్బు ఏం చేసుకుంటారో అని అమాయకత్వం కనిపించేలా ప్రశ్నించారు . నేనూ అంతే సీరియస్ గా విన్నట్టు ముఖం పెట్టి .. వాళ్ళు అధికారం లోకి వచ్చి ఏడాది కావస్తుంది కదా ? ఈ ఏడాదిలో వాళ్ళు ఎంత సంపాదించారో ఈజీగా లెక్క కట్టవచ్చు అన్నాను . ఎంత సంపాదించారు ? ఎలా చెప్పవచ్చు అని ఆసక్తిగా అడిగారు . మూడో తరగతి వాడు కూడా చెబుతాడు ఇదో పెద్ద లెక్క నా ? అని మీ పార్టీ తొమ్మిదేళ్లు అధికారంలో ఉంది కదా ? తొమ్మిదేళ్లలో ఎంత సంపాదించారో దాన్ని తొమ్మిది తో భాగించండి .. ఒక్క సంవత్సరంలో ఎంతో వస్తుంది .. ఒక్క సంవత్సరంలో మీరు సంపాదించింది ఎంత మొత్తమో , ఈ ఏడాది లో కాంగ్రెస్ సంపాదించింది అంతే .. ఈజీ అన్నాను . ముఖం చూస్తే అమాయకంగానే ఉంది . లెక్క తప్పేమీ కాదు . ఏమీ బదులివ్వకుండా అలానే ఉండి పోయారు దేవినేని ... **** వేల కోట్ల నుంచి ఈ అంకె క్రమంగా లక్ష కోట్లకు చేరింది . రాజకీయాల్లో అవినీతి ఉండదు అంటే ఎవరూ నమ్మరు . పాత సినిమాల్లో హీరో పగటి పూట చిన్న ఉద్యోగం , మూటలు మోస్తూ , రిక్షా తొక్కుతూ , రాత్రి టాక్సీ నడుపుతూ , చివరకు సైకిల్ తొక్కే పోటీలో పాల్గొని ఇంటికి డబ్బు తీసుకొచ్చినట్టు నాయకులు కాయా కష్టం చేసి , ముఖానికి మాస్క్ ధరించి రిక్షా తొక్కినా డబ్బుతో పార్టీలు నడపరు , రాజకీయ పార్టీ అన్నాక వ్యవహారాలు ఉంటాయి . ఐతే కొందరు తాము శ్రీ రామ చంద్రునికి లేటెస్ట్ వెర్షన్ కానీ, మా ప్రత్యర్ధులు మాత్రం మనుషులను తినే రాబందులు అన్నట్టు ప్రచారం చేస్తుంటారు . రౌండ్ ఫిగర్ అని మొదటి పది వేల కోట్లు , తరువాత 40 వేల కోట్లకు పెంచి చివరకు అంకె ఆకర్షణీయంగా ఉంటుంది అని లక్ష కోట్లకు చేర్చినట్టు ఎం వి మైసూరారెడ్డి ఓ సారి బహిరంగంగానే ప్రకటించారు . కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేర్చుకొని వారికి రాజ్యసభ సభ్యత్వం కల్పించారు . చివరకు టీడీపీ మీడియా సూపర్ మాన్ గా క్రియేట్ చేసిన జెడి లక్ష్మీనారాయణ ఆ లక్ష కోట్ల అంకె ఎలా వచ్చిందో తెలియదు అని, చార్జిషీట్ లో సుమారు 15వందల కోట్ల వరకు అవినీతి వివరాలు ఉన్నాయని స ఓ ఇంటర్వ్యూలో చెప్పారు . లక్ష కోట్లు అంటే ఎన్ని లారీల్లో డబ్బు తీసుకువెళ్ళవచ్చో లోకేష్ చెప్పారని చంద్రబాబు మురిసిపోయారు . ఇలా వినూత్నంగా చెప్పాలి అని పార్టీ నాయకులకు సూచించారు . ఐనా లక్ష కోట్ల ప్రచారం ఆశించిన స్థాయిలో పని చేయలేదు . చివరకు లక్ష కోట్లు అనేది ఒక జోక్ గా మారిపోయింది . దీనిని ప్రజలు ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావడం లేదు అని ఈ మధ్య బాబు కూడా మీడియా ముందు బాధపడ్డారు . ***** లక్ష కోట్లు ఇడుపుల పాయలో నేలమాళిగల్లో దాచిపెట్టారు అని ఉమ్మడి రాష్ట్రంలో దేవినేని పదే పదే ఆరోపించేవారు . ఉమ్మడి రాష్ట్రంలో 2009 ప్రాంతంలో అసెంబ్లీ లాబీ లో లక్షకోట్లపై చర్చ జరుగుతుంటే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి ఆసక్తికరమైన విషయం చెప్పారు . అప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు . లక్ష కోట్ల అవినీతి నిజం కాదు కానీ టీడీపీ ప్రచారం చేయడం తెలివైన నిర్ణయం అన్నారు . లక్ష కోట్లు అంటే మీరూ నేనూ నమ్మక పోవచ్చు . మన నమ్మకాలు టీడీపీకి అనవసరం . టీడీపీ ప్రచారం చేసేది జగన్ వర్గం నమ్మాలి అని కాదు .. టీడీపీ వర్గం నమ్మాలి అని . వాళ్ళు నమ్ముతారు టీడీపీ కి అది చాలు . తండ్రి పేరు చెప్పుకొని జగన్ వెళుతుంటే టీడీపీ ఏం చేయాలి మౌనంగా ఉండాలా ? తమ వర్గం కోసం అయినా లక్ష కోట్లు అని ప్రచారం చేయాల్సిందే అంటూ ప్రచారంలో మర్మాన్ని వివరించారు . . ఏ విషయం అయినా కావచ్చు నమ్మని వారు ఉంటారు , అదే విధంగా నమ్మేవారు ఉంటారు . ప్రచారం చేసేది నమ్మేవారి కోసమే కానీ నమ్మనివారి కోసం కాదు. టీడీపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని టీడీపీ వర్గం అయితే నమ్ముతూయింది కదా అది చాలు అని ఆనం వివేకానందరెడ్డి కళ్ళు తెరిపించారు . ఒక్క టీడీపీ అని కాదు అన్ని పార్టీల ప్రచారానికి ఇది వర్తిస్తుంది . ఐటీ ని బాబే కనిపెట్టారు , సెల్ ఫోన్ బాబే తెచ్చారు అనే ప్రచారంలో మర్మం ఇదే తమ వర్గం నమ్మితే చాలు . మడమ తిప్పడు మాట తప్పఁడు అని చెప్పినా , రాజన్న రాజ్యం అని ప్రచారం చేసినా ప్రజలంతా నమ్ముతారని కాదు . అది నమ్మే వర్గం కొంత ఉంటుంది అది చాలు ... రాజకీయాల్లో పని చేసేది ఈ నమ్మకాలే ..... - బుద్దా మురళి

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

ఎడిటర్ తో ఒక రోజు .... బీడీ కట్ట కోసం ఇతరులపై ఆధారపడే వాళ్ళు కూడా కెసిఆర్ ను తామే నడిపించామంటారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -94

ఎడిటర్ తో ఒక రోజు .... బీడీ కట్ట కోసం ఇతరులపై ఆధారపడే వాళ్ళు కూడా కెసిఆర్ ను తామే నడిపించామంటారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -94 ---------------------------------- ఈ మధ్య యూ ట్యూబ్ లో కొన్ని వీడియోలు చూస్తుంటే బీడీ కట్ట కోసం , ప్లేట్ ఇడ్లీ కోసం ఎవరో ఒక్కరిపై ఆధారపడే వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కెసిఆర్ కాదు మేమే ... మేం లేక పోతే కెసిఆర్ ఎక్కడ అంటూ బోలెడు మాట్లాడుతున్నారు . ఆ వీడియోలు చూస్తుంటే అలాంటి దృశ్యాన్ని మరికొందరు జర్నలిస్ట్ మిత్రులతో కలిసి నేరుగా చూసిన సంఘటన గుర్తుకు వచ్చింది . ************* 2014 లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాత సచివాలయానికి రోజూ వచ్చే వారు . భూమి ఎడిటర్ శాస్త్రి ఇంట్లో పెళ్లి కి పిలవడానికి ఎడిటర్ , జర్నలిస్ట్ మిత్రుడు వెల్జాల చంద్రశేఖర్ , మరో ఇద్దరితో కలిసి వెళ్లాం . దాదాపు మూడు గంటలు వేచి చూసినా పిలుపు రాలేదు . గతంలో ఛానల్స్ నాయకుడితో ఒక రోజు , నటులతో ఒక రోజు అని ఎన్నికల సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు చూపే వారు . యూ ట్యూబ్ ఛానల్స్ పెరిగాక వీధి రౌడీతో ఒక రోజు అని డబ్బులిస్తే చేసే కార్యక్రమాలు కూడా వస్తున్నాయి అవి వేరు . ఓనర్ తో , ఎడిటర్ తో ఒక రోజు అనే కార్యక్రమం రిపోర్టర్ లకు అగ్ని పరీక్ష లాంటిదే . తేడా వస్తే ఉద్యోగాలకే ప్రమాదం . టంకశాల అశోక్ ఎడిటర్ గా జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రధాన అంశాలు , వేటిపైన వార్తలు రాయవచ్చునో రిపోర్టర్ లతో మాట్లాడేవారు . అలానే ఆంధ్రప్రభలో గతంలో ఓ ఎడిటర్ ఆంధ్ర ప్రాంతంలో పర్యటించి రిపోర్టర్ ని ఓ గుడి పూజారి పేరు అడిగితే చెప్పలేదు , ఎడిటర్ గుడికి వెళితే పూర్ణ కుంభ స్వాగతం పలక క పోవడం తో నువ్వేం రిపోర్టరువు అని చెడామడా తిట్టాడు . ఆ మీడియా ఈ మీడియా అని కాదు అన్ని చోట్ల బాస్ తో ఒక రోజు అంటే అది గండమే . ఎడిటర్ ఇంట్లో పెళ్లి , తెలంగాణ సీఎం ను పిలవడానికి కాబట్టి ఎడిటర్ తొలిసారిగా నన్ను వెంట తీసుకువెళ్లాడు . మూడు గంటలైనా లోనికి పిలుపు లేక పోవడంతో ఒక వైపు నేనూ , జర్నలిస్ట్ మిత్రుడు వెల్జాల చంద్రశేఖర్ బాధపడుతున్నట్టు నటిస్తూ , మరో వైపు సంతోష పడుతున్నాం . సంతోషానికి కారణం మా ఇద్దరికే తెలుసు . అక్కడి సిబ్బంది పరిచయం ఉండడం వల్ల కలిస్తే ప్రపంచ బ్యాంకు అధికారులు బయటకు రాగానే మీరు లోనికి దూసుకు వెళ్ళండి అని సలహా . అ లానే చేశాం . సీఎం కార్డు తీసుకోని నాకేమీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా మాములుగా అందరితో మాట్లాడి పంపించారు . ఎడిటర్ సమైక్య రాతలు, తెలంగాణ వ్యతిరేక రాతలు , తెలబాన్లు అని రాసిన చిల్లర మాటలు అన్నీ కెసిఆర్ చదివారు , గుర్తుంది . ఎడిటర్ మాత్రం అవి గుర్తు లేవేమో అనుకున్నారు . ********** హమ్మయ్య గండం గడిచింది . ఎడిటర్ తో ఒక రోజు ఎలాంటి ప్రమాదం లేకుండా గడిచింది అని బయటకు వచ్చాక ... రమణా చారి ఇక్కడే ఉన్నారుకదా ఫోన్ చెయ్ వెళదాం అని ఎడిటర్ అనగానే ఫోన్ చేసి బుద్దా మురళి అని చెప్పగానే అప్పుడు ఆంధ్రభూమి ఆదివారం లో వారం వారం రాస్తున్న ధనం - మూలం లో ఎక్కెడెక్కడి వారి గురించి భలే రాస్తున్నావు అని మాట్లాడుతుంటే .. నా పని ఐపోయింది అనుకున్నాను . ఎడిటర్ తో పాటు వెళ్లి రమణా చారి ఛాంబర్ లో కూర్చున్నాక ధనం - మూలం కాలం గురించే అలానే మాట్లాడారు . ప్రమాదం తప్పదు అని నిర్ణయించుకున్నాను . ******** ఉదయం నుంచి సాయంత్రం వరకు తినక పోవడం ఒకటి . సంతోషాన్ని పంచుకోవడం ఒకటి దారిలో సికింద్రాబద్ తాజ్ మహల్ హోటల్ లో తిన్నాం . సంతోషానికి కారణం ఏమంటే ఎడిటర్ తో సీఎంను కలిసినప్పుడు నాకూ , మిత్రుడు చంద్రశేఖర్ కు ఎక్కువ గౌరవం ఇచ్చి ఉంటే తెల్లారి నుంచి ఎడిటర్ పైరవీ పనులు , అయన రాసిన పుస్తకాలు అమ్మించే పనులు అప్పగిస్తారని భయపడ్డాం .. సీఎం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వక పోవడం , మూడు గంటలు వేచి ఉండాల్సి రావడం తో ఎడిటర్ మా పై ఆశలు వదులుకొని ఆంధ్ర పై దృష్టి సారించాడు . **** సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్ కు మరో ఇద్దరు జర్నలిస్టులతో కలిసి వచ్చే సరికి హోటల్ కౌంటర్ దగ్గర ఓ వ్యక్తి హోటల్ యజమానితో కెసిఆర్ ను నడిపించేది నేను , ఇప్పుడు ఇక్కడికి పిలిపించ మంటావా ?అని ఏదో మాట్లాడుతున్నాడు . ఇప్పుడు రెన్నొవేషన్ చేశారు . అంతకు ముందు సికింద్రాబాద్ పాత తరానికి చెందిన వారు అక్కడ కబుర్లు చెప్పుకొంటూ ఉండేవారు . బీడీ కట్టలకు కూడా ఇతరులపై ఆధారపడే వ్యక్తిలా ఉన్నాడు . మహా ఐతే హోటల్ యజమాని అతనికి ఓ ప్లేట్ ఇడ్లీ ఉచితంగా ఇస్తాడేమో , తెలంగాణ ఉద్యమాన్ని తానే నడిపినట్టు , కెసిఆర్ ను తానే నడుపుతున్నట్టు తెగ కబుర్లు చెబుతున్నాడు . ఎడిటర్ తో కలిసి వెళ్లి మూడు గంటలు నిలబడి కష్టంగా కలిసిన మేం ఆ మాటలు వింటూ నవ్వుకున్నాం . అప్పుడు ఎవరైనా యూ ట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటే అతన్ని ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు . ఇప్పుడు ఇలాంటి వారి ఇంటర్వ్యూలు యూ ట్యూబ్ లో చాలా కనిపిస్తున్నాయి . ***** ఆ రోజు ప్రమాదం ఏమీ ముంచుకురాలేదు . మూడు నాలుగు రోజులు గడిచిన తరువాత ఎడిటర్ పిలిచి ధనం - మూలం కాలం చాలా రోజుల నుంచి రాస్తున్నావు కదా ? ఇక చాలు ఆపేయ్ అన్నారు . ఈ సంగతి నేను ఆ రోజే అనుకున్నాను అని మనసులోనే చెప్పుకున్నాను . అబ్దుల్ అని సినిమా రిపోర్టర్ సినిమా సమీక్షకు నంది అవార్డు వచ్చింది . జాగ్రత్త అని ముందే చెప్పాను . ఉత్సాహంగా ఎడిటర్ కు యెగిరి గంతేసి చెప్పాడు . ఆ మరుసటి రోజు నుంచి సినిమా రిపోర్టింగ్ నుంచి తొలగించి ఆదిలాబాద్ మఫిసిల్ డెస్క్ లో చేయమని చెప్పారు అట్లుంటుంది ఎడిటర్స్ తో ... - బుద్దామురళి .

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

ఆ... రాజకీయం అంతు చిక్కని అద్భుతం ... ఎన్టీఆర్ ను లక్ష్మీ పార్వతిని ఒక్క మాట అనలేదు . అంతా మనోగతమే .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 93

ఆ... రాజకీయం అంతు చిక్కని అద్భుతం ... ఎన్టీఆర్ ను లక్ష్మీ పార్వతిని ఒక్క మాట అనలేదు . అంతా మనోగతమే జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 93 --------------------------------------- సార్ ఇప్పుడు అంతా అయిపొయింది కదా ? కనీసం ఇప్పుడన్నా చెప్పండి ఎన్టీఆర్ ను అధికారం నుంచి ఎందుకు దించేశారు చెప్పండి అని మీడియా సమావేశంలో బాబును అడిగితే , నన్ను ప్రశ్నార్ధకంగా చూసి మీ అందరికీ తెలుసు కదా ? అని సమాధానం చెప్పారు .ఇది 95 సెప్టెంబర్ లో జరిగింది . ఎన్టీఆర్ ను ఎందుకు దించేశారో బాబు చెబితే వినాలి అని ఉన్న నా కోరిక తీరలేదు . ఆ మధ్య ఆహా ఛానల్ లో బాలకృష్ణ ప్రోగ్రాం లో ఎన్టీఆర్ దించే అంశం లో ఆ రోజు మనం చేసింది కరక్టే కదా ? అని బాలకృష్ణతో ఒప్పించారు కానీ ఎన్టీఆర్ ను దించి 28 సంవత్సరాలు గడిచిపోయినా ఈ రోజుకు కూడా ఎన్టీఆర్ ఏం తప్పు చేశారు , ఎందుకు దించారు అనేది బాబు నేరుగా చెప్పలేదు . ఇక లక్ష్మీ పార్వతి ఎర్ర బస్సు ఎక్కి పోవలసిందే అని దగ్గుబాటి వెంకటేశ్వర రావు మీడియా ముందు విమర్శించారు కానీ .. బాబు కాదు . లక్ష్మి పార్వతికి దుష్ట శక్తి అని హరికృష్ణ పేరు పెడితే, సినిమా నటుడు రజనీకాంత్ పాపులర్ చేశారు . దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి అని ఈనాడులో బ్యానర్ వార్త వచ్చింది కానీ . చంద్రబాబు మీడియాలో ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు . లక్ష్మీ పార్వతి భుజం మీద తుపాకి పెట్టి ఎన్టీఆర్ ను పేల్చేసిన వ్యూహం బాబుది కానీ.. ఆ దంపతులను బాబు ఒక్క మాట అనలేదు . జామాతా దశమ గ్రహం అంటూ ఎన్టీఆర్ అల్లుడిని అనరాని మాటలు అంటూ క్యాసెట్ లు తయారు చేసి జనం మీదకు వదిలారు కానీ బాబు ఎన్టీఆర్ ను ఒక్క మాట అనలేదు . ******* చంద్రబాబు రాజకీయం అంటే అది ....ఎన్టీఆర్ ను దించేసి మూడు దశాబ్దాలు అవుతున్నా ఒక్క మాట అనకుండా దించేయడం ఎలా సాధ్యం అని ఆశ్చర్యం కలుగుతుంది . కానీ ఇది నిజం .. నమ్మకం లేకుంటే పాత పత్రికలు వెతికి చూడండి . జర్నలిస్ట్ లు కావచ్చు , జర్నలిజం విద్యార్థులు కావచ్చు , పరిశోధకులు కావచ్చు ఎన్టీఆర్ ను ఎందుకు దించేస్తున్నామని చంద్రబాబు ఎక్కడైనా చెప్పారా ? గ్రంథాలయాల్లో కాస్త శ్రమిస్తే పాత పత్రికలు దొరుకుతాయి . 95 నాటి పత్రికలు పరిశోధించండి చాలా మటుకు ప్రభుత్వ గ్రంధాలయంలో 95 నాటి పత్రికలను 95-96 లోనే మాయం చేశారు . వేట పాలెం లాంటి గ్రంధాలయంలో ఉన్నాయి . ***** ఆగస్టు సంక్షోభం అంటూ పుంఖాను పుంఖాలుగా వార్తలు కనిపిస్తాయి . ఎన్టీఆర్ ను ఎందుకు అధికారం నుంచి దించేస్తున్నారు , ఎందుకు దించేయాలి , దించేయడం వల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది అని బోలెడు వార్తలు , వ్యాసాలు , వ్యాఖ్యానాలు , సంపాదకీయాలు కనిపిస్తాయి కానీ ఒక్క చోట కూడా నేరుగా చంద్రబాబు చెప్పినట్టు వార్త ఉండదు . చంద్రబాబు మనోగతం , చంద్రబాబు భావిస్తున్నారు అనే వార్తలు కనిపిస్తాయి కానీ ఒక్క చోట కూడా నేరుగా బాబు మాట్లాడినట్టు ఉండదు . ఎన్టీఆర్ సామాన్య నాయకుడు కాదు , వెన్నుపోటుకు గురికాక పోతే దేవే గౌడ స్థానంలో ప్రధాన మంత్రి స్థానంలో ఉండే అవకాశం ఉన్న వారు . కాంగ్రెస్ కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా పార్టీని గెలిపించిన నాయకుడు . అలాంటి నాయకుడిని గద్దె దించినప్పుడు , అలా దించడానికి నాయకత్వం వహించిన వారు ఎందుకు దించుతున్నామో చెప్పినట్టు మీడియాలో లేదు అంటే ఆశ్చర్యమే . బాబు మనోగతం తప్ప నేరుగా బాబు దించేయడానికి కారణం ఏమిటో ఆ రోజు చెప్పలేదు . ఈ రోజుకు చెప్పలేదు . భారత రాజకీయాల్లో , మీడియా చరిత్రలో ఇదో అద్భుతం . అద్భుతాలు జరగడానికి కాలం అనేది కీలక పాత్ర వహిస్తుంది . ఆనాటి మీడియా దాదాపు 90 శాతానికి పైగా ఈ కుట్రలో భాగస్వామ్యం . మీడియా మొత్తం అటు ఉన్నప్పుడు ఇది సాధ్యం అయింది . ఆ తరువాత ఎలక్ట్రానిక్ మీడియా రావడం , పత్రికల సంఖ్య పెరగడం , అన్ని పార్టీలకు మీడియా రావడం , తరువాత సామాజిక మాధ్యమాలు వచ్చి ప్రతి మనిషి ఒక మీడియా కావడం వల్ల పరిస్థితులు మారాయి . 90 శాతం మీడియా చెప్పు చేతుల్లో ఉండడం వల్ల ఒక్క మాటకూడా ఓపెన్ గా మాట్లాడకుండా ఎన్టీఆర్ నుం దించడం వంటి కార్యం సాధించగలిగారు . ***** బాబు జైలుకు వెళ్లడం తో పవన్ దూసుకెళ్తున్నారు అని కొందరు .. ఇది పవన్ కు లాభమా ? బాబుకా ? అని లెక్కలు వేస్తున్నారు . అలా లెక్కలు వేస్తున్నారు అంటే చంద్రబాబు రాజకీయం పై అవగాహన లేనట్టే ... విశ్వ విఖ్యాత నటసార్వ భౌమను దించేసిన వారికి పవన్ ఓ లెక్కనా ? బిర్యానీ ఆరగించుకున్న వారికి బఠాణీ నమిలినంత ఈజీ . కూటమి అధికారం లోకి వస్తే చేరి రెండున్నరేళ్లు సీఎం అని , ముందు బాబు అని కాదు పవన్ అని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు తప్ప బాబు ఓపెన్ గా నోరు విప్పలేదు ... అచ్చం దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి వార్తలనే ఇదీనూ ... పవన్ కళ్యాణ్ పాత వీడియో ఒకటి - మీరు వెన్నుపోటు పొడిస్తే పొడిపించుకోవడానికి సిద్ధంగా లేము అని పవన్ వార్నింగ్ ఇస్తున్నారు . పవన్ కు తెలియంది .. పవన్ సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు . అసలు తెలియకుండా పోటు పొడిచేంత రాజకీయ సామర్ధ్యం బాబుకు ఉంది . - బుద్దా మురళి

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

మాక్ అసెంబ్లీలోనూ మనచేతిలోనే అధికారం ... బాబుకు బాబే ప్రత్యామ్నాయం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -92

మాక్ అసెంబ్లీలోనూ మనచేతిలోనే అధికారం బాబుకు బాబే ప్రత్యామ్నాయం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -92 ------------------------------ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి . సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు అని టీడీపీ శాసన సభ్యులు తెలుగుదేశం శాసన సభా పక్షం కార్యాలయం మెట్ల వద్ద మాక్ అసెంబ్లీ నిర్వహించారు . కాంగ్రెస్ ,టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఇలా మాక్ అసెంబ్లీ నిర్వహించడం మాములే . సీఎం , ప్రతిపక్ష నాయకుడు , స్పీకర్ గా తమలో తామే కొందరిని నిర్ణయించి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు . ఒక రకంగా ఇది రాజకీయ వీధి నాటకం . ఆరు బయటే సాగుతుంది కాబట్టి ఇతర పార్టీల వాళ్ళు , అన్ని పార్టీల మీడియా అక్కడే ఉంటుంది . ప్రచారం , ప్రత్యర్థి మీద వ్యతిరేకత వ్యక్తం చేయడం , కాసింత సరదా ఈ రాజకీయ నాటకాల్లో ఉంటుంది . దూళిపాళ నరేంద్ర ముఖ్యమంత్రిగా , మోత్కుపల్లి నర్సింహులు ప్రతిపక్ష నాయకుడు , ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్ , ఇతర శాసన సభ్యులకు పాత్రలు ఇచ్చారు . టీడీపీ శాసన సభ్యులు విలేకరుల సమావేశాల్లో ఏం విమర్శలు చేశారో అవే విమర్శలు మాక్ అసెంబ్లీలో , పైగా అధికార పక్షం ( అప్పుడు కాంగ్రెస్ ) మేము తప్పు చేశాం అన్నట్టు మాట్లాడడం .. అధికార పక్షం , విపక్షం రెండూ ఆయనుంటే బాగుండు అన్నట్టుగా మాక్ అసెంబ్లీ సాగుతోంది . మాక్ అసెంబ్లీ అంటే చూసేవారికి ఉషారు కలిగేట్టుగా సరదాగా ఉండాలి . కానీ అక్కడ కూడా విలేకరుల సమావేశంలానే సాగుతుండడం తో .. నేను సరదాగా మన మైండ్ లో కొన్ని నిర్ణయాలు చాలా బలంగా ఉండి పోతాయి . వీళ్ళు ముఖ్యమంత్రి పదవిని కనీసం మాక్ అసెంబ్లీ లో కూడా ఇతరులకు ఇవ్వరు . దూళిపాళ్ల నరేంద్రను సీఎం చేశారు కానీ , మరో వర్గం వారిని , తెలంగాణ వారిని మాక్ అసెంబ్లీలోనే కాదు కలలో కూడా సీఎంగా ఒప్పుకోరు అని జోక్ చేశాను . ఎన్టీఆర్ కు మొదటి సారి పోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు , రాజ్యాంగేతర శక్తి అని మీడియా ప్రచారం చేసిన లక్ష్మీ పార్వతి , విజయవంతంగా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన బాబు అంతా ఒకే వర్గం . *********** మాక్ అసెంబ్లీని కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ లతో పాటు కాంగ్రెస్ కు చెందిన రవిచంద్ కూడా వింటున్నాడు . ఏదో సరదాగా జోక్ చేసి న మానాన నేను వెళ్లి పోయాను . వార్తలు రాసేందుకు సాయంత్రం ఆఫీస్ కు వెళ్లే సరికి మాక్ అసెంబ్లీ వార్తతో పోటీ పడే విధంగా ... చివరకు మాక్ అసెంబ్లీ లో సైతం అదే వర్గం వారికి సీఎం పాత్ర . కనీసం మాక్ అసెంబ్లీలోనూ వేరేవారికి ఇవ్వరా ? అని కాంగ్రెస్ శాసన సభ్యులు నిలదీసిన వార్త కనిపించింది ***** స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు రాజమండ్రి జైలులో ఉండడంతో ఇక బాలకృష్ణ రంగప్రవేశం చేస్తారని టీవీల్లో వార్తలు . ప్రపంచ పటంలో ఆంధ్ర లేదు అంటూ ఆయనేదో ఆవేశంగా మీడియాతో మాట్లాడారు . ఉమ్మడి రాష్ట్రంలో బాబు తొలిసారిగా దశల వారీగా పాదయాత్ర కు శ్రీ కారం చుట్టినప్పుడు ఎన్టీఆర్ భవన్ కు నందమూరి హరికృష్ణ ఇలానే వచ్చి ఈ రోజు నుంచి పార్టీని నేను చూసుకుంటా అని ఆఫీస్ లో కూర్చున్నారు . నాలుగైదు రోజులు వచ్చారు . తరువాత కనిపించలేదు ఏమైంది అని తెలుసు కుంటే .... జిల్లాల నుంచి ఎవరో ఒకరు వచ్చి బస్సుకు డబ్బులు లేవని అడగడం , సహాయం చేయమని అడగడం చేసేవారు . నాలుగు రోజులు డబ్బులు ఇచ్చి .. చిరాకేసి రావడం మానేశాడు అని తెలిసింది . నాలుగు రోజులు కుదురుగా పార్టీ కార్యాలయంలో కూర్చోలేరు వీళ్ళ వల్ల ఏమవుతుంది అనిపించింది . ఆ నాలుగు రోజులు హరికృష్ణ మీడియాతో ఇష్టాగోష్టిగా తెగ మాట్లాడారు . రాజకీయం అంటే ఏమిటీ అంటూ .... తెలంగాణ ఉద్యమ చివరి దశలో టీడీపీ తెలంగాణ నేతలు తెలంగాణ ఫోరమ్ అని పెడితే , దూళిపాళ్ల తొలుత నాయకత్వం లో ఆంధ్ర ఫోరమ్ పెట్టారు . మాక్ అసెంబ్లీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కాలువ శ్రీనివాస్ను ఆంద్ర ఫోరమ్ఎనాయకున్ని చేశారు . మా నాన్న లా నేను మంచి వాడిని కాదు అని లోకేష్ సినిమా డైలాగులు చెప్పినా , జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని సభల్లో కొందరు బ్యానర్లు చూపినా బాబు రాజకీయం ముందు నిలవలేరు .. ఎన్టీఆర్ కు చంద్రబాబు ఉన్నట్టు , చంద్రబాబుకు మరో చంద్రబాబు లేకపోవడమే బాబుకు పెద్ద లోటు అని ఎన్టీఆర్ ను దించేసిన కాలం లో అన్నారు . చంద్రబాబుకు చంద్రబాబే ప్రత్యామ్నాయం , పార్టీని నిలబెట్టినా, ముంచినా కర్త , కర్మ , క్రియ అన్నీ బాబే ... - బుద్దా మురళి

11, సెప్టెంబర్ 2023, సోమవారం

అలిపిరి పై సానుభూతి ఆశిస్తే ఏం జరిగింది .. తెలుగునాట సానుభూతి రాజకీయలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 91

అలిపిరి పై సానుభూతి ఆశిస్తే ఏం జరిగింది .. తెలుగునాట సానుభూతి రాజకీయలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 91 ------------------------------------- నవంబర్ 14, 2003 సచివాలయం విలేకరులతో కిక్కిరిసిపోయాయి ఉంది . అంతకు ముందే మంత్రివర్గ సమావేశం జరిగింది . అసెంబ్లీని రద్దు చేస్తూ సమావేశంలో తీర్మానం చేశారు . అప్పటికప్పుడు గవర్నర్ కు తీర్మాన ప్రతిని అందజేశారు . రాజ్ భవన్ నుంచి మంత్రివర్గ తీర్మానం మేరకు అసెంబ్లీ రద్దు నిర్ణయం వెలువడింది . అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరిస్తున్నారు . వెంటనే ఎన్నికలు జరగాలి అని కోరుకున్నారు . అసెంబ్లీ రద్దు గురించి బాబు చెబుతుండగానే ఇంగ్లీష్ ఛానల్ మహిళా రిపోర్టర్ ఒకరు మధ్యలో లేచి ఢిల్లీ నుంచి ఇప్పుడే సమాచారం వచ్చింది . ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించలేం , సమయం పడుతుంది అని కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ప్రకటించింది అని చెప్పగానే బాబు కంగారు పడ్డారు . ముఖకవళికలు మారిపోయాయి . పరిస్థితులు చేయి దాటి పోక ముందే ఎన్నికలు జరగాలి అని ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేశారు . రద్దు ప్రకటన చదువుతుండగానే పిడుగులాంటి వార్త వినడంతో బాబు కంగారు పడ్డారు . 99 లో స్వల్ప తేడాతో గెలవడం , 2001లో తెలంగాణ ఉద్యమం , వరుసగా మూడు నాలుగేళ్ల నుంచి కరువు వంటి పరిస్థితుల్లో పూర్తిగా పరిస్థితి చేయి దాటి పోక ముందే ఎన్నికలకు వెళ్లాలని బాబు అనుకున్నారు . 2003 అలిపిరిలో నక్సల్స్ తన వాహనం పై బాంబు దాడి చేశారు . ఈ దాడి నుంచి బయటపడ్డ బాబు దానిని అనుకూలంగా మార్చుకొని సానుభూతి పవనాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు . వారం రోజుల చికిత్స తరువాత జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో బాబు మీడియాతో మాట్లాడుతారు అని సమాచారం . అప్పుడు సీఎం ముఖ్య పౌర సంబంధాల అధికారిగా ఉన్న విజయ కుమార్ మీడియా ఏమీ ప్రశ్నించవద్దు , బాబు చెప్పింది విని వెళ్ళాలి అంతే అనే షరతు తో లోనికి అనుమతి ఇచ్చారు . ఏమీ అడగవద్దు అని విజయ్ కుమార్ నాకు మరోసారి షరతు గుర్తు చేశారు . అంతకు ముందు రోజే జ్యోతిలో కొమ్మినేని బాబు ముందస్తు ఎన్నికలకు వెళతారు అని రాశారు/ రాయించారు . బాబు అరగంటకు పైగా మాట్లాడారు . ఆయన మాటల సారాంశం నామీద దాడి జరిగింది , ముందస్తు ఎన్నికలకు వెళతాను , నాకు ఓటు వేయండి అని అడుగుతున్నట్టుగా ఉంది అని జర్నలిస్ట్ మిత్రులతో నా అభిప్రాయం చెప్పాను . , సానుభూతి కోసం మంచి ప్రయత్నాలు చేశారు . ఇప్పుడు వై యస్ ఆర్ కాంగ్రెస్ లో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అప్పుడు టీడీపీలో కీలక నాయకులు వారికీ చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి పెద్ద సంఖ్యలో పిల్లలను తీసుకువచ్చి బాబుకు పిల్లలతో పూలు ఇప్పించారు . డక్కన్ క్రానికల్ లో సైతం స్కూల్ అమ్మాయి గులాబీ పూవు బాబుకు ఇస్తున్న ఫోటో మొదటి పేజీలో అద్భుతంగ వచ్చింది . ఆ తరువాత నియోజక వర్గాల వారీగా పార్టీ వారికీ టార్గెట్ విధించి ప్రతి రోజు బాబు ఇంటికి వచ్చేట్టు చేశారు . అంతరం పార్టీ విస్తృత సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అని నిర్ణయాలు . రాష్ట్రంలో నక్సలైట్లు విజృంభిస్తున్నారు , అసెంబ్లీ రద్దు చేస్తాం . మమ్ములను తిరిగి గెలిపించండి ఇదీ తీర్మానం . అధికారంలో ఉన్నది టీడీపీ , నక్సల్స్ విజృంభిస్తే కట్టడి చేయాల్సింది ప్రభుత్వం , ప్రభుత్వంలో ఉండి అసెంబ్లీ రద్దు చేయడం ఏమిటో , తిరిగి అధికారం ఇవ్వమని కోరడం ఏమిటో ప్రజలకు అర్థం కాలేదు . ****** స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపడంపై ఆంధ్ర లో భిన్న వాదనలు గతమ్లో జగన్ ను అరెస్ట్ చేస్తే జగన్ సీఎం అయ్యారు , ఇప్పుడు బాబును అరెస్ట్ చేయడం వల్ల బాబు సీఎం అవుతారు అనేది తెలుగుదేశం వాదన . సానుభూతి వల్లనే జగన్ సీఎం అయ్యారు అని వాదించినా , సానుభూతి వల్ల బాబు సీఎం అవుతారు అని వాదించినా కోట్లాది మంది ఓటర్ల అభిప్రాయాలను చిన్న చూపు చూసినట్టే . ఒక పార్టీ నచ్చ డానికి , నచ్చక పోవడానికి ఓటర్లకు అనేక కారణాలు ఉంటాయి అంతే తప్ప నాయకుడికి జ్వరం వచ్చింది అనో జలుబు చేసింది అనో సానుభూతితో ఓడించరు , గెలిపించరు . పాదయాత్ర చేయగానే సీఎం అని , అరెస్ట్ చేయగానే సీఎం అని చిత్రమైన విశ్లేషణలు చేస్తుంటారు . షర్మిల పాదయాత్రతో తెలంగాణ కాబోయే సీఎం అని రాసిన మీడియా మేధావులు కూడా ఉన్నారు . చివరకు ఆమె కనీసం ఒక్క స్థానంలో కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు . పాదయాత్ర తోనే అధికారం వస్తే సిపిఎం తమ్మినేని వీరభద్రం ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రం సీఎం అయిపోవాలి . పాపం ఆ పార్టీకి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రతినిధ్యమే లేదు . అనేక అంశాలు ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి . *****\ తెలుగు నాట సానుభూతి రాజకీయాలు కొత్తేమి కాదు. సానుభూతి ఎన్నికల్లో పని చేస్తుందా ? చేయదా ? అంటే ? పని చేసిన సందర్భాలు ఉన్నాయి , పని చేయని సందర్భాలు ఉన్నాయి . 84లో ఇందిరాగాంధీ హత్య తరువాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 404 పార్లమెంట్ సీట్లను గెలుచుకోండి . స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కు అన్ని సీట్లు ఎప్పుడూ రాలేదు . అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి సానుభూతి పవనాలు పని చేయలేదు . టీడీపీకి 30 సీట్లు వచ్చాయి . తొలిసారిగా పార్లమెంట్ లో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది . అరెస్ట్ చేయగానే సీఎం అని కొందరు జోష్యం చెబుతున్నారు . వై యస్ జగన్మోహన్ రెడ్డిని 2012 మేలో అరెస్ట్ చేశారు . ఆ తరువాత 2014 లో ఎన్నికలు జరిగితే జగన్ సీఎం కాలేదు . బాబు ఐదేళ్ల పాలనా ప్రభావం వల్లనే జగన్ 2019 లో సీఎం అయ్యారు కానీ . 2012లో అరెస్ట్ అయ్యారనే సానుభూతితో కాదు . కాంగ్రెస్ కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా ఎన్టీఆర్ 94లో కాంగ్రెస్ ను ఓడించారు . 95లో ఎన్టీఆర్ ను బాబు గద్దె దించితే ఎన్టీఆర్ నల్ల దుస్తులు వేసుకొని సానుభూతి యాత్ర చేసినా పెద్దగా స్పందన లేదు . ఆంధ్రభూమి మినహా మీడియా పట్టించుకోలేదు . 94లో ఘనవిజయం చేకూర్చిన ప్రజలే 95లో పట్టించుకోలేదు . ఆయా సమయంలో పరిస్థితులే కీలక పాత్ర వహిస్తాయి కానీ , సానుభూతి , అరెస్ట్ లు , పాదయాత్రలు కాదు . ******* ముందస్తు ఎన్నికల ఆశపై ఎన్నికల కమిషన్ నీళ్లు పోసింది . ఐతే సానుభూతి పవనాలు విచడం లేదు అనే విషయం దాదాపు అందరికీ అర్థమైంది . అలిపిరి బాంబు దాడి తరువాత తిరుపతికి చెందిన టీడీపీ లీడర్ , బాబు మిత్రుడు , మున్సిపల్ ఛైర్మెన్ శంకర్ రెడ్డిని పిలిచి .... బాబు షర్ట్ రక్తంతో తడిసిపోయింది , నువ్వు లోకల్ కాబట్టి షాప్స్ షట్టర్ ఎత్తి ఐనా కొత్త షర్టు తీసుకురా అని పంపించారు . బాంబు దాడి వల్ల సానుభూతిగా తిరుపతిలో షాప్స్ అన్నీ మూసేస్తారు అని శంకర్ రెడ్డి అనుకున్నాడు . వెళ్లి చూసే సరికి అన్ని షాప్స్ లో బిజినెస్ యధావిధిగా జరుగుతోంది . ఈ విషయం శంకర్ రెడ్డినే ఎన్టీఆర్ భవన్ లో ఇష్టాగోష్టిలో చెప్పుకొచ్చారు . ******* రాయలసీమకు చెందిన ఓ లీడర్ మంచి మిత్రులు ఓ రోజు ఫోన్ చేసి ఈ సారి మేం గెలవడం కష్టమే అని చెప్పుకొచ్చారు . అలిపిరి దాడి జరిగినప్పుడు షేరింగ్ ఆటోలో కొందరి ముచ్చట ఒకరు దాడి గురించి చెబితే మరొకరు అన్న మాట కార్యకర్త విని ... జనాల్లో ఇంత వ్యతిరేకత ఉంది . బాంబు దాడి జరిగినా కనీస సానుభూతి చూపడం లేదు అని ఆ సంఘటన గురించి చెప్పుకొచ్చారు . ******** ఆరు నెలల ముందు అసెంబ్లీ రద్దు చేసినా ఎన్నికలు సకాలం లోనే జరిగాయి . ఏప్రిల్ 20న పోలింగ్ జరిగింది . బాబు జన్మదినం రోజున పోలింగ్ జరిగింది . ప్రజలు పుట్టిన రోజు కానుక ఇస్తారు చూడు అంటూ అప్పుడు ఎన్టీఆర్ భవన్ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణ గట్టిగా వాదించారు . ఏ సానుభూతి పవనాలు పని చేయలేదు . అప్పటి వరకు టీడీపీ చరిత్రలోనే తక్కువ సీట్లు వచ్చాయి . టీడీపీకి 47 స్థానాలు మాత్రమే వచ్చాయి . ప్రజలు తప్పు చేశారు అంటూ టీడీపీ మీడియా రాస్తూ పోయింది ఎప్పటి మాదిరిగానే . అలిపిరి సానుభూతి కథ అలా ముగిసింది ... అదే సమయంలో  బాబు పోతూ పోతూ వాజపేయి ప్రభుత్వాన్ని కూడా ముందస్తుకు తీసుకు వెళ్లారు . ఇండియా షైనింగ్ నినాదం తో ముందస్తుకు వెళ్లి బీజేపీ బోర్లాపడింది . ఏ కారణమో తెలియదు కానీ అదే సమయంలో బంగ్లా దేశ్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది . బాబు ముందస్తు తో బంగ్లా దేశ్ కూడా ముందస్తుకు అని తెలుగు మీడియా చాలా ముచ్చట పడి రాసింది .  - బుద్దా మురళి

9, సెప్టెంబర్ 2023, శనివారం

జైలులో ఇనుప చువ్వల వెనుక బాబు పోస్టర్ లతోహైదరాబాద్ ను నింపేశారు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 90

జైలులో ఇనుప చువ్వల వెనుక బాబు పోస్టర్ లతోహైదరాబాద్ ను నింపేశారు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 90 -------------------------------------- అర్ధరాత్రి ఇంటికి చేరుకొని ఎప్పటిలానే ఉదయం ప్రధాన రహదారి పైకి వెళ్లి చూస్తే ఇనుప చువ్వల వెనుక జైలులో బాబు ఉన్న పోస్టర్ లు , బేగంపేట వంటి ప్రధాన రహదారిలో భారీ హోర్డింగ్లను చూసి ఆశ్చర్యం వేసింది . వారి సామర్ధ్యం గురించి తెలియంది కాదు . అప్పటికే వారిని దగ్గర నుంచి ఒకటిన్నర దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాను . అయినప్పటికీ ఆ హోర్డింగ్ లు , పోస్టర్ లు చూసి వాళ్ళు మామూలోళ్లు కాదు అనుకున్నాను . రాత్రి మహారాష్ట్ర శివారులో అరెస్ట్ అయితే , తెల్లవారే సరికి హైదరాబాద్ లో ఇనుప చువ్వలు , జైలు లో బాబు బొమ్మలతో అంత భారీ హోర్డింగ్ లు ఎలా సాధ్యం అయ్యాయి అనుకున్నాను . బహుశా పోస్టర్ లు , హోర్డింగ్లకు ముందే ఏర్పాట్లు చేసుకొని ఉండవచ్చు . స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు అరెస్ట్ అయితే ఇదే మొదటి సారి అని అనుకొంటున్నారు , 2010 లోనే భారీ అరెస్ట్ గుర్తుకు వచ్చి ... **** సరిగ్గా 13 సంవత్సరాల క్రితం . తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజులు . తెలంగాణ కోసం తెరాస శాసన సభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల ప్రచారం , తెలంగాణ ఉద్యమం కలిసి ఉదృతంగా సాగుతున్న రోజులు . ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ లో నినాదం లేదు . మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా తెలంగాణ ను ఎడారిగా మారుస్తున్నారు అనే నినాదం తో టీడీపీ విస్తృతంగా ప్రచారం . శత్రు దేశం పైకి దండెత్తిన తీరులో ప్రజాప్రతినిధులు , పార్టీ నాయకులు మీడియా తో కలిసి చంద్రబాబు బాబ్లీ కి పయనం . ఇదేమి రాజరికం కాదు కొద్ధి మంది సైన్యం తో శత్రు రాష్ట్రం పై గెరిల్లా దాడి చేసి ఆ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోలేరు . ఏం చేస్తారో అంతా రహస్యం . మంత్ర సాని తనానికి ఒప్పుకున్నప్పుడు ఏమొచ్చినా పట్టుకోవాలి అనే సామెత చెప్పినట్టు టీడీపీ బీట్ రిపోర్టర్ అన్నప్పుడు వారు ఎటు వెళితే అటు వెళ్ళాలి . జూలై 16న 2010 న మీడియాతో కూడిన సర్వ సైన్త్యం తో చంద్రబాబు బృందం ప్రత్యేక బస్సుల్లో బయలు దేరింది . అచ్చం దండయాత్రకు వెళుతున్నట్టుగానే ఉంది . బాబు తరువాత తెలంగాణ నాయకుల్లో ఎర్ర బెల్లి దయాకర్ రావు , ఆంధ్ర నాయకుల్లో పయ్యావుల కేశవ్ లు బాబ్రీ ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణ ఎడారిగా ఎలా మారుతుందో కళ్ళకు కట్టినట్టు వివరించారు . చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ సినిమాల్లో , గూఢచారి సినిమాల్లో ఎడారిని చూసి ఉండడం వల్ల తెలంగాణ ఎడారి అవుతుంది అని టీడీపీ నాయకులు చెప్పింది ఈజీగానే అర్థం అయింది . ******* బాసర లో భోజనానికి ఆగారు . నాకెంతో ఇష్టమైన సర్వ పిండి హోటల్స్ లో అమ్మడం బాసరలోనే తొలిసారి చూశాను . ఇప్పుడు స్వగృహ ఫుడ్స్ అమ్మే చాలా వాటిలో సర్వ పిండి అమ్ముతున్నారు కానీ అప్పుడలా కాదు . నిజాం కాలేజీ గ్రౌండ్ లో తెలంగాణ సంబురాలు నిర్వహించి తెలంగాణ వంటకాలు అమ్మితే మొత్తం సర్వ పిండి అరగంటలో కనిపించకుండా పోయింది . అప్పుడు సర్వ పిండి తినాలి అంటే ఇంట్లోనే .. అందులోనూ అమ్మచేసిన సర్వపిండి రుచి చూశాక ...... అలాంటి పరిస్థితిలో బాసరలో సర్వపిండి అలా గుర్తుండి పోయింది . .. భోజనాలు అయ్యాక శత్రు సైన్యానికే కాదు సొంత సైన్యానికి కూడా చివరి నిమిషం వరకు దాడి తెలియకుండా ఉండడం యుద్ధ నీతి .. అటు నుంచి వాహనాలను ఎటు తీసుకువెళ్తారో , ఏం చేస్తారో తెలియదు . అప్పటి ఆంధ్ర , మహారాష్ట్ర సరిహద్దుల్లో ధన్ బాద్ సమీపం లో పెద్ద సంఖ్య లో పోలీసులు మోహరించారు . ఆంధ్ర నుంచి వచ్చిన బాబూ సైన్యాన్ని అక్కడే ఆపేశారు . అక్కడే ఉపన్యాసాలు .. చుశారా ? మీరేమో తెలంగాణ రాష్ట్రం కావాలి అని డిమాండ్ చేస్తుంటే మేం తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాం , అరెస్టులకు సిద్ధం అయ్యాం , ఇక నైనా మారండి అన్నట్టుగా పయ్యావ్యుల కేశవ్ తెలంగాణ కోరుకునే నాలాంటి వారికీ హితబోధ చేశారు . ఇదేమన్నా ఒక రాజ్యం ఇంకో రాజ్యం పై దాడి చేయడమా ? ఇలా చేస్తే తెలంగాణకు ఏం లాభం అంటే .. అరెస్టులకు సిద్దమైన ఆంధ్ర నాయకుల త్యాగాలు నీకు అర్థం కావు అని విమర్శ .. సరిహద్దుల్లో కొంత సమయం రాజకీయ ఉపన్యాసాలు , చప్పగా ఉన్నట్టు అనిపించింది . లాటీ చార్జీలు , తోపులాట అయితే తప్ప సరైన కవరేజ్ దక్కదు . మహారాష్ట్ర పోలీసులేమో మీ భూ భాగం లో మీరు ఏమైనా చేసుకోండి అని నిమ్మకు నీరెత్తినట్టు ఉండి పోయారు . దాంతో బాబూ బృందానికి సహనం నశించి సరిహద్దు దాటి మహారాష్ట్రలో అడుగుపెట్టి బాబ్లీ వెళ్లాలని ప్రయత్నిస్తే సాయంత్రం తరువాత ఈ బృందాన్ని అరెస్ట్ చేసినట్టు చూపించి ధన్ బాద్ లోని ఒక విద్యా సంస్థలో ఉంచారు . ఉప ఎన్నికల్లో ఎక్కడ గెలవరు , గెలుపు మాట దేవుడెరుగు డిపాజిట్ కూడా దక్కదు . ఉప ఎన్నికలు వెనకల్కి వెళ్లి తమ బాబ్లీ ఉద్యమం ముందుకు రావాలి అనే రాజకీయం అని తెలుస్తూనే ఉంది . అక్కడినుండి చేసేదేమి లేదని ఆఫీస్ కు ఫోన్ చేసి అనుమతి తీసుకోని హైదరాబాద్ వచ్చేశాను . ********** ఉదయం రోడ్డు మీద చూడగానే జైలు గోడల మధ ఇనుప చువ్వల వెనుక బాబు ఉన్నట్టు భారీ పోస్టర్ లతో నగరాన్ని నింపేశారు . ధన్ బాద్ లోని ఐ టి ఐ లో అందరినీ ఒకే చోట ఫ్రీ గానే వదిలేశారు . ఈ జైలు గోడలు , ఇనుప చువ్వల వెనుక బాబు ఎలా వచ్చారో అర్థం కాలేదు . అది సరే అరెస్ట్ తో అప్పుడు సానుభూతి వచ్చిందా ? అంటే ఉప ఎన్నికలను మరిచిపోయేట్టుగా మీడియా బాబు బాబ్లీ ఉద్యమానికే ప్రాధాన్యత ఇచ్చి కవరేజ్ తో అదరగొట్టినా .. ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ కే ప్రాధాన్యత ఇచ్చారు విజయం చేకూర్చారు . బాబు బాబ్లీ నాటకం మీడియా ప్రచారానికే పరిమితం అయింది . డిపాజిట్ లు కూడా దక్కలేదు . - బుద్దా మురళి

8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

బస్సు డిపోలో బాక్స్ లు , బేరింగ్ కార్డు నుంచి వాట్స్ ఆప్ లో న్యూస్ వరకు ... జర్నలిజం పరిణామ క్రమం ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -89

బస్సు డిపోలో బాక్స్ లు , బేరింగ్ కార్డు నుంచి వాట్స్ ఆప్ లో న్యూస్ వరకు ... జర్నలిజం పరిణామ క్రమం ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -89 ----------------------- ----------------------- ఇమ్లీ బన్ బస్సు డిపో , జూబ్లీ బస్సు డిపో , విజయవాడ , విశాఖ బస్సు డిపోల్లో ఏదో ఓ మూలకు కొన్ని బాక్స్ లు మీరు చూసే ఉంటారు. అన్ని దిన పత్రికలు తమ తమ పత్రికల పేర్లు రాసి అక్కడ బాక్స్ లు వేలాడ దీశారు . ఇప్పుడు వాటి ఉపయోగం లేకున్నా కొన్ని బస్సు డిపోల్లో ఆ బాక్స్ లు దుమ్ముకొట్టుకుపోయి ఇంకా అలానే ఉన్నాయి . వాటికో చరిత్ర ఉంది . మహా సామ్రాజ్యం కూలిపోయిన తరువాత శిధిలాలు కనిపించినట్టు ఒకనాటి మహా వైభవాన్ని ప్రదర్శించే విధంగా దుమ్ము పట్టిన ఆ బాక్స్ లు ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి . ఒకనాడు ఆ బాక్స్ లు సమాచార విప్లవానికి దోహదం చేశాయి . పత్రికల ప్రచురణ కేంద్రాల్లో రిపోర్టర్ లు ఆఫీస్ కే వచ్చి వార్తలు రాస్తారు . మరి జిల్లాల నుంచి వార్తలు ఎలా ? ముఖ్యమైన వార్తలు ఐతే ఫోన్ లో మిగిలినవి రాసి పంపాలి . రాసిన వార్తలను మండలాలు , జిల్లాల నుంచి స్థానిక జర్నలిస్ట్ లు బస్ స్టాండ్ కు వెళ్లి హైదరాబాద్ కు వెళ్లే బస్సు డ్రైవర్ ను పట్టుకొని అతనికో రెండు రూపాయలు , వార్తలు రాసిన కవర్ ఇస్తే , వాటిని హైదరాబాద్ డిపో లో ఉండే ఆయా పత్రికల బాక్స్ లలో వేసేవారు . ఒక్కో డ్రైవర్ వద్ద హైదరాబాద్ వెళ్లే సరికి ఒక్కో సారి 20-30 కవర్లు కూడా ఉండేవి . కవరు మీద ఆ పత్రిక లోగో అతికిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఏ పత్రిక కవరును ఆ పత్రిక బాక్స్ లో వేస్తే , పత్రిక కార్యాలయం నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆ కవర్లను రోజుకు రెండు సార్లు తీసుకువెళ్ళేవాడు . ఆ కాలం లో కొన్ని పత్రికలు తమ రిపోర్టర్ లకు బేరింగ్ కార్డు లు ఇచ్చేవారు . అంటే పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి వార్తలను టెలిగ్రామ్ గా పంపడం . డబ్బులు చెల్లించనవసరం లేదు . బేరింగ్ కార్డు చూపితే సబ్సిడీ తో తక్కువ ఖర్చుతోనే పంపేవారు . లెక్క చూపించి పత్రిక ప్రధాన కేంద్రం నుంచి డబ్బు తీసుకొనేవారు . ఇంగ్లీష్ లిపిలో తెలుగు రాసి టెలిగ్రామ్ పంపాలి . అది రాసే వారికి , టెలిగ్రామ్ పంపే ఉద్యోగి ఇద్దరికీ చాలా కష్టమైన పని .. వివాహ శుభాకాంక్షలు , పలానా వారు పోయారు వంటి రెండు మూడు సందేశాలకే టెలిగ్రామ్ పంపేవారు , అలాంటిది పేజీలకు పేజీలు ఇంగ్లీష్ లిపిలో తెలుగు వార్తలు పంపాలి అంటే ఇబ్బంది పడేవారు . 87లో నేను సంగారెడ్డిలో ఆంధ్రభూమిలో తొలి ఉద్యోగం . బేరింగ్ కార్డు ఇచ్చి పంపారు . టెలిగ్రామ్ కన్నా ఆర్ టీసీ డిపోలో బాక్స్ బెటర్ అనిపించింది . ****** 1986-87 లో ఆంధ్రభూమి లో అప్పటి న్యూస్ ఎడిటర్ జొన్నలగడ్డ రాధాకృష్ణచొరవ తీసుకోని డిపోలో ఈ బాక్స్ ఏర్పాటు చేశారు . అంతకు ముందు ఆంధ్రపత్రిక కాలం లో ఆయా ప్రాంతాల్లోని పత్రిక ఏజెంట్ లే పోస్ట్ లో వార్తలు పంపేవారు . తరువాత జిల్లా కేంద్రాల్లో టెలిప్రింటర్ ల శకం మొదలైంది . సంగారెడ్డి లో నండూరి సాంబశివరావు ఈ టెలీ ప్రింటర్ గురించి తెలుసుకొని మా కన్నా మీరే నయం , మాక్కూడా అలాంటి సౌకర్యం లేదు అన్నారు . అప్పుడు అలా ఉండేది టెలిప్రింటర్ ఏర్పాటు చేస్తే టీపీ సెంటర్ ప్రారంభోత్సవం అంటూ కొన్ని పత్రికలు ప్రత్యేక సంచికలు వేసి ప్రకటనలు వసూలు చేసేవారు . పత్రిక వా.ళ్ళు టి పి సెంటర్ పెట్టుకొంటే రాజకీయ నాయకులు ప్రకటనలు ఎందుకు ఇవ్వాలో ? ... బస్సు డిపోలో బాక్స్ ల ద్వారా వార్తలు పంపే స్థాయి నుంచి సామాన్యుడు తన ఆత్మహత్యను ఫేస్ బుక్ లో ప్రపంచానికి లైవ్ గా చూపిస్తున్న కాలానికి వచ్చాము . 90 కి ముందు పత్రికా కార్యాలయానికి వార్తలు పంపాలి అంటే అదో యజ్ఞం లా ఉండేది . కానీ వార్తల సేకరణ జర్నలిస్ట్ కు పరీక్ష పెట్టే విధంగా , ఆసక్తి కలిగించే విధంగా ఉండేది . ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ ఉంటే క్షణం లో ఫోటో లు పంపవచ్చు , సెల్ ఫోన్ లోనే వార్తను టైపు చేసి పంపవచ్చు . కానీ పెరిగిన ఈ సాంకేతిక విప్లవం జర్నలిజాన్ని మెల్లగా చంపేస్తోంది . ******************* ఇప్పుడు కాలం మారింది . రిపోర్టర్ , సబ్ ఎడిటర్ ఇద్దరూ తిరుగుదామన్నా అవకాశం లేకుండా పోయింది . టెక్నాలెజీ పెరగడం , సామాజిక మాధ్యమాలు , వాట్స్ ఆప్ , కరోనా , రాష్ట్ర విభజన , మారిన పరిస్థితులు జర్నలిజాన్ని పూర్తిగా మార్చేసింది . ఒక్కో మీడియా ఒక్కో రాజకీయ పక్షానికి అనుబంధంగా మారిపోయింది . ఒక పార్టీ నాయకుడు విమర్శితే , మరో పార్టీ నాయకుడు ఎదురు దాడి , ప్రతి విమర్శ చేస్తాడు . కానీ చిత్రంగా వై యస్ ఆర్ కాంగ్రెస్ పలానా నాయకుడికి గట్టి కౌంటర్ ఇచ్చిన పలానా నంబర్ టివి రిపోర్టర్ అనే శీర్షికతో ఛానల్స్ వార్తలు కనిపిస్తున్నాయి . ఒక వైపే కాదు అన్ని పార్టీల ఛానల్స్ లో ఇదే తీరు . రాజకీయ పక్షాల మధ్యనే కాదు ఛానల్స్ మధ్య కూడా రాజకీయ పోరు సాగుతోంది . ఒక పార్టీ ఛానల్ ను మీడియాను , మరో పార్టీ బహిష్కరిస్తోంది . ***** రిపోర్టర్ అనే వాడు తిరగక చెడితే , సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోతాడు అనేది మీడియా రంగంలో గతంలో వినిపించిన ఓ హితోక్తి . రిపోర్టర్ ఎంత ఎక్కువ తిరిగితే అంత ఎక్కువగా రాణిస్తాడు . అధికారులు నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి . జర్నలిజంలో పరిచయాలు అంటే సోర్స్ . ఎంత ఎక్కువ పరిచయాలు ఉంటే అంత బాగా వార్తలు రాయవచ్చు . నాలుగు దశాబ్దాల జర్నలిజంలో నేను చూసిన వారిలో అత్యధికంగా పరిచయాలు ఉన్న జర్నలిస్ట్ ఈ మధ్య మరణించిన సి హెచ్ వి ఎం కృష్ణారావు . రిపోర్టర్ తిరగాల్సిందే , తిరగకుండా ఆఫీస్ లో కూర్చోని ఎవరో ఒకరి మీద ఆధారపడి వార్తలు రాస్తే ఆ వార్తల్లో జీవం ఉండదు . అందుకే రిపోర్టర్ తిరగక చెడిపోతాడు అంటాడు . మరి తిరిగి సబ్ ఎడిటర్ చెడిపోవడం ఏమిటీ ? అంటే వీరి సంఖ్య చాలా చాలా స్వల్పంగానే ఉండొచ్చు కానీ కొంతమంది సబ్ ఎడిటర్స్ , ఇంచార్జ్ లు నాయకుల వద్దకు తిరిగేవారు . పి . అశోక గజపతి రాజు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికీ ఎలాంటి పని చేయరు అని జర్నలిస్ట్ ల సర్కిల్స్ లో పేరు . అలాంటి అశోక గజపతి రాజు సైతం తమ ప్రాంతానికి చెందిన , హైదరాబాద్ లో పని చేసిన సబ్ ఎడిటర్ కు బాగానే పని చేసి పెట్టాడు అని చెప్పుకొనేవారు . ఎన్టీఆర్ మరణించిన కొత్తలో లక్ష్మీ పార్వతి , ఇంద్రా రెడ్డి ఓ సారి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతుంటే ఒకరు కంగారుగా ఫోన్ చేసి పూర్వ జన్మ బంధం అన్నట్టుగా ఏదో చెబుతుంటే ఇంద్రారెడ్డి ల్యాండ్ లైన్ రిసీవర్ మీద చేయి పెట్టి ఫోన్ చేసిన జర్నలిస్ట్ పేరు చెప్పి ఎవరితను అని అక్కడున్న వారిని అడిగితే , ఓ పత్రికలో సబ్ ఎడిటర్ అని తెలిసింది . ఇంద్రారెడ్డి మనది జన్మ జన్మల బంధం అన్నట్టుగా తిరిగి అంతే ఆప్యాయంగా అతన్ని పేరు పెట్టి పలకరించి మాట్లాడితే ఆమ్మో ఇంద్రారెడ్డి అనిపించింది . ఈ సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోయాడు అనడానికి సజీవ ఉదాహరణగా నిలిచాడు . ******** ఇప్పుడు సబ్ ఎడిటర్ కాదు రిపోర్టర్ కూడా తిరిగే అవకాశాలు లేకుండా పోయాయి . సమాచారం క్షణాల్లో వాట్స్ ఆప్ లో పంపడమే . విలేకరుల సమావేశం అంటే కేవలం నాయకులు , అధికారులు చెప్పిన విషయం వినడానికి కాదు .. నిజానికి విలేకరుల సమావేశం తరువాత పిచ్చాపాటి మాట్లాడితే అనేక విషయాలు తెలిసేవి . రాజకీయ పరిణామాలు , పార్టీల్లో ఏం జరుగుతుందో పిచ్చాపాటి కబుర్లలోనే తెలిసేది . ఇప్పుడు అలాంటి అవకాశం పూర్తిగా తగ్గిపోయింది . ఒక వైపు సామాజిక మాధ్యమాల విస్తృతి , మరోవైపు రాజకీయ పక్షాలు , మీడియా అనుబంధం వల్ల మీడియా రూపురేఖలు మారిపోయాయి . కెమెరాలు , ఫోటోలకు ఉపయోగించే పేపర్ అమ్మకాల్లో కోడాక్ ప్రపంచంలో నంబర్ వన్ గా ఉండేది . ఇప్పుడు ప్రపంచంలో వందల కోట్లమంది రోజూ వందల కోట్ల ఫోటోలు తీస్తున్నారు . ఫోటోలు తీసేవారి సంఖ్య పెరిగింది కాబట్టి కొడాక్ వ్యాపారం పెరగాలి కానీ అలా జరగలేదు . మూత పడింది . కెమెరాలు , పేపర్ లు అవసరం లేకుండా సెల్ ఫోన్ లోనే ఫోటోలు తీసే రోజులు వచ్చాయి కాబట్టి కొడాక్ మూతపడింది . సాంకేతిక విప్లవం కూడా జర్నలిజం కు కొడాక్ లా కోలుకోలేని దెబ్బ తీసింది . జర్నలిజం ఉంటుంది . మీడియా ఉంటుంది కానీ అందులో గతంలోలా జీవం ఉందా ? అంటే ఏమో ..... ఎవరికి నచ్చినా , నచ్చక పోయినా మార్పు ఆగదు .. - బుద్దా మురళి

6, సెప్టెంబర్ 2023, బుధవారం

చదువురాని ఓ జర్నలిస్ట్ కథ... మారుతున్న మీడియాకు ప్రతిరూపం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -88

చదువురాని ఓ జర్నలిస్ట్ కథ మారుతున్న మీడియాకు ప్రతిరూపం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -88 ------------------------------------------- దాదాపు రెండేళ్ల క్రితం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సరికి నా కోసం ఒకరు గేటు వద్దనే ఎదురు చూస్తున్నారు . నేను వచ్చాక ఏదో మాట్లాడి స్టైల్ గా చేతికి ఐడెంటీ కార్డు ఇచ్చాడు . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా గలవారికి కూడా అంత నాణ్యమైన కార్డు ఉండదు . కార్డు నాణ్యత తో చాలా బాగుంది . అలా చూస్తూ ఉండి పోయాను . నేను కూడా రిపోర్టర్ ను ఐ పోయాను అన్నాడు . టివి 9 సక్సెస్ అయ్యాక , 9 కి ముందో వెనుకనే కొన్ని అక్షరాలు , లేదా మరి కొన్ని తొమ్ముదులు చేర్చి చాలా నే ఛానల్స్ వచ్చాయి . అనంతరం ఈ తొమ్మిదులను చేర్చుకుంటూ పోతూ యూ ట్యూబ్ ఛానల్స్ వచ్చాయి . అందులో ఒక అనేక తొమ్ముదుల యూ ట్యూబ్ ఛానల్ లో తనను రిపోర్టర్ గా నియమించినట్టు ఐడెంటీ కార్డు చూపించాడు . ఎనీ బడి కెన్ డాన్స్ ( ఏబీసీ ) అని డాన్సర్ నటుడొకరు సినిమా తీసి జనం మీద వదిలినట్టు యూ ట్యూబ్ వాళ్ళు ఎవరైనా జర్నలిస్ట్ కావచ్చు అని మొత్తం జర్నలిజం మీదనే కక్ష తీర్చుకుంటున్నట్టు అనిపించింది . చక్కని ఐడెంటీ కార్డు తో నా ముందు నిలబడ్డ అతను మా మాజీ పని మనిషి భర్త .. నువ్వేమన్నా రాజకుటుంబం నుంచి జర్నలిజం లోకి వచ్చావా ? పని మనిషి భర్త జర్నలిస్ట్ కాకూడదా ? ఎంత అహంకారం అని తొందరపడి తిట్టకండి . మా రోజుల్లో నైనా , ఈ రోజుల్లో ఐనా ఎక్కువగా పేదవారు , దిగువ మధ్యతరగతి వారే జర్నలిజంలోకి వస్తున్నారు . మధ్యతరగతి ఐతే ఇంజనీరింగ్ చేసి అమెరికా కో, కెనడాకో , ఇంకో దేశానికో వెళ్లి పోతారు . ఆ విషయం నాకు తెలుసు . నా సందేహం అది కాదు . అతనికి చదువు రాదు , పని గండం . శివశంకరి అనే పాటతో బాలకృష్ణ గాయకుడు అయినట్టు , వినేవాళ్ళు , చూసే వాళ్ళు ఉంటే ఎవరు ఏమైనా కావచ్చు అభ్యన్తరం చెప్పఁడానికి నేనెవరిని . కానీ చదువు రానివారు జర్నలిస్ట్ ఎలా అవుతారు అనేదే నా అనుమానం . తరువాత ఆ అనుమానం తీరిపోయింది . అక్షరం ముక్క రావలసిన అవసరం , రాయాల్సిన అవసరం లేకుండా యూ ట్యూబ్ జర్నలిస్ట్ లను చేసేస్తుందని తెలిసింది . ***** అతనితో మాట్లాడుతూనే యూ ట్యూబ్ లో రెండుకన్నా ఎక్కువ తొమ్ముదులు టైప్ చేసి చూశాను . ఓ ఛానల్ కనిపించింది . ఏడాది కాలం లో దాదాపు నాలుగు వందల మంది ఆ ఛానల్ చూశారు . ఇసుక మాఫియా అంటూ ఏదో స్టోరీ . విషయం అర్థమైంది . అది సరే చదువుకోక పోయినా జర్నలిజం లోకి రావచ్చు అనే ఆలోచన నీకు ఎలా వచ్చింది అని ఆసక్తిగా అడిగాను . అప్పుడప్పుడు అతను టెంపో నడుపుతాడు . టెంపోను ఓ యూ ట్యూబ్ ఛానల్ అతను అద్దెకు తీసుకోని నువ్వూ జర్నలిస్ట్ కావచ్చు అని ఐడెంటీ కార్డు అంటగట్టాడు . ( టెంపోకు అద్దె ఇచ్చాడో ఐడెంటీ కార్డు తోనే సరిపెట్టాడో నేను అడగలేదు అతను చెప్పలేదు ) అతన్ని అడిగిన మొదటి ప్రశ్న నెలకు ఎంత ఇమ్మన్నాడు అని ... భలే అడిగాను అని మనసులోనే నన్ను నేను అనుకున్నాను . ఎవరైనా ఉద్యోగం వచ్చింది అంటే , వెంటనే జీతం ఎంత అని అడుగుతారు . కానీ నేను ఎంత ఇమ్మన్నారు అని అడిగాను . నా ప్రశ్న కు అతనేమీ ఆశ్చర్య పోకుండా , ఇది కామన్ అన్నట్టు ఎంతో అనుభవజ్ఞుడిలా 25 వేలు ఇమ్మన్నాడు అని బదులిచ్చాడు . అతనికి 25 వేలు ఇవ్వాలి , నీకు ఎంతో కొంత కావాలి ఇదంతా ఎలా వస్తుంది అని అడిగాను . అతను రాదా ? అని లీడర్లు ఇస్తారు కదా ? అని బదులిచ్చాడు . నీకు స్మార్ట్ ఫోన్ ఉంటే రెండు వందలు ఖర్చు పెడితే జియో సిమ్ తో నువ్వే ఓ యూ ట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయవచ్చు ఇప్పుడున్న తొమ్ముదులకు మరో తొమ్మిది కలిపితే పేరు కోసం కూడా వెతకాల్సిన అవసరం లేదు అన్నాను . నాయకుల వద్ద బోలెడు వసూలు చేయవచ్చు అని ఉత్సాహంగా ఉన్న అతనికి అనుభవం ఐతే కానీ తత్త్వం బోధపడదు అని .. మన లోకల్ శాసన సభ్యులు మైనంపల్లి హనుమంతరావు అతన్ని కలిసి నీ అనుభవం చెప్పు అని పంపించేశాను . అతను హనుమంతరావును.. కలిశారో లేదో తెలియదు మళ్ళీ నన్ను ఎప్పుడూ కలువ లేదు . గర్భస్థ శిశువు లా ఇంకా పురుడు పోసుకొని జర్నలిస్ట్ ను చంపేశానో లేదో తెలియదు . ****95లో ఎన్టీఆర్ ను దించినప్పుడు అప్పుడుడప్పుడే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది . బాబు శిబిరం , ఎన్టీఆర్ శిబిరాలుగా టీడీపీ విడిపోయింది . ఈ రోజు వార్తలను మరుసటి రోజు రోజుకు గంట ప్రసారం చేసే రోజులు అవి .. కమ్యూనిస్ట్ పార్టీ శాసన సభ్యులు నర్రా రాఘవరెడ్డిని ఛానల్ మహిళా రిపోర్టర్ మీరు బాబు గ్రూప్ నా ? ఎన్టీఆర్ గ్రూప్ నా ? అని అడిగింది . రాఘవరెడ్డి కూడా టీడీపీ శాసన సభ్యలు అని ఆ అమ్మాయి అనుకుంది . అది విన్న తలపండిన జర్నలిస్టులు చాలా మంది ఆ ప్రశ్నను ఘోరమైన తప్పుగా చూశారు . దాన్నే తప్పు కుంటే ఈనాటి యూ ట్యూబ్ ఛానల్స్ జర్నలిజం ను ఏమనాలో .. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ నగరం లోనే జీవితం . చిన్నప్పుడు పలువురు పేరు మోసిన రౌడీలా పేర్లు వినిపించేవి . పేర్లు వినే వణికి పోయే వాళ్ళం ... ఆ పేర్లలో ఇప్పటికీ బతికి ఉన్న కొందరి దివ్య మంగళ రూపాన్ని యూ ట్యూబ్ ఛానల్స్ వల్ల చూసే భాగ్యం లభించింది . ఆ పుణ్య దంపతుల ఇంటర్వ్యలు , వారి నిజ గృహంబులను చక్కగా చూపిస్తున్నారు . నా బాల్యంలో పేరు మోసిన రౌడీలు ఇప్పుడు యూ ట్యూబ్ ఛానల్స్ లో జాతిని ఉద్దేశించి చక్కని సందేశాలు కూడా ఇస్తున్నారు . యూ ట్యూబ్ ఛానల్స్ తరుపున ఇంటర్ వ్యూ చేసేవారు సైతం వయసుకు మించిన నటనా కౌశల్యం ప్రదర్శిస్తూ వారు చెప్పే మాటలు వింటూ చక్కగా ఆశ్చర్యాన్ని నటిస్తున్నారు . ***** యూ ట్యూబ్ ఛానల్స్ యేనా ? మిగిలిన మీడియా పవిత్రమైనదా ? అనే ప్రశ్న రావచ్చు . పార్టీలకు అనుబంధం లేకుండా ఏ మీడియా లేదు . ఈ దేశంలో మీడియా పుట్టిందే పార్టీలకు అనుబంధంగా . బ్రిటిష్ పాలనా కాలం లో కాంగ్రెస్ పార్టీ , మీడియా , స్వతంత్ర సమర యోధులు ఒకే లక్ష్యం తో పని చేశారు . దేశానికి స్వతంత్రం తేవాలి అనే లక్ష్యం తో కాంగ్రెస్ నాయకులే పత్రికలను ప్రారంభించారు . ఆ రోజులు , ఆనాటి మీడియా లక్ష్యాలు వేరు , ఇప్పుడు వేరు ... ఇప్పుడు శాసన సభ్యులే కాదు టికెట్ ఆశిస్తున్న వాళ్ళు , లోకల్ లీడర్లు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నారు . మా పార్టీ వాళ్లే యూ ట్యూబ్ ఛానల్స్ పెట్టి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల మీద ఫిర్యాదు చేశారు . డజన్ల కొద్ది యూ ట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న నాయకులు ఉన్నారు . ఓ ఇంటర్స వ్యూ లో రాంగోపాల్ వర్మ వెల్లువెత్తిన యూ ట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడుతూ వీటిని ఎవరూ ఆపలేరు . కాలం గడిచిన తరువాత అబద్దాల ఛానల్స్ పోతాయి , నాణ్యత ఉన్నవి మిగులుతాయి అన్నారు . రోగాన్ని దాచిపెట్టుకుంటే ఆరోగ్యాంగా ఉన్నట్టు కాదు . రోగం ఉందని గుర్తిస్తే చికిత్స లభిస్తుందేమో . రాం గోపాల్ వర్మ జోస్యం నిజం కావాలి అని ఆశించడం తప్ప , ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేదు . BUDDHA MURALI

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

సగటు జర్నలిస్ట్ జీవితంలో రోజూ బ్రహ్మానందమే .... ఎడిటర్ ల వేధింపులు ఎలా ఉంటాయంటే ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 87

సగటు జర్నలిస్ట్ జీవితంలో రోజూ బ్రహ్మానందమే .... ఎడిటర్ ల వేధింపులు ఎలా ఉంటాయంటే ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 87 -------------------------------------- "మీకేంటి రెండు చేతులా సంపాదిస్తారు .. జీతానికి జీతం పై ఆదాయానికి పై ఆదాయం " ఈ మాట ప్రతి జర్నలిస్ట్ తన వృత్తి జీవితంలో అనేక సార్లు విని ఉంటారు . జర్నలిస్ట్ జ్ఞాపకాలు రాస్తుంటే కూడా కొందరు తెలిసిన వారు జర్నలిస్టులకు రెండు చేతులా ఆదాయం ఉంటుంది మీ రెమో దిన దిన గండం అని రాస్తున్నారు అని అడిగారు . వారి సందేహాలు నిజమే , జర్నలిస్టుల జీవితాలు దిన దిన గండం నిజమే . ఓ సినిమాలో బ్రహ్మానందం ఒక వైపు బాధపడుతున్నట్టు నటిస్తూ మరు క్షణమే ఇంకో వైపు సంతోష పడుతున్నట్టు అద్భుతంగా నటన పండించాడు . చాలా మంది జర్నలిస్ట్ లు ఇలాంటి నటనను దాదాపు రోజూ తన వృత్తి జీవితంలో ప్రదర్శించాల్సి ఉంటుంది . బయటి వారే కాదు రిపోర్టర్ లను చూసి సబ్ ఎడిటర్ లు , సబ్ ఎడిటర్ లను చూసి రిపోర్టర్ లు మా కంటే వీరి జీవితమే బెటర్ అని ఈర్ష పడుతుంటారు . నెల నెల జీతం ఇచ్చే పత్రికల్లో జర్నలిస్ట్ లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని , అప్రమత్తంగా పని చేయాల్సి ఉంటుంది . జీతం ఇవ్వడం మాట దేవుడెరుగు ఉల్టా జర్నలిస్ట్ ల వద్దనే డబ్బులు తీసుకోనే మీడియాలో వారు ఆడింది ఆటగా ఉంటుంది . తిను తినిపించు అనే నినాదం ను వీరు నమ్ముతుంటారు . అప్పుడుడప్పుడు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న జర్నలిస్ట్ ల అరెస్ట్ అంటూ వచ్చే వార్తలు ఇలాంటి వారి గురించే . నెల నెల జీతం ఇచ్చే సంస్థల్లో జర్నలిస్ట్ ల జీవితాలు మాత్రం దిన దిన గండం లాంటిదే . ఉద్యోగం నిలుపుకోవడానికి బ్రహ్మానందం ను మించి నటించాల్సి ఉంటుంది . సంస్థ లో ఒక్కరు కాదు బోలెడు మంది బాస్ లు ఉంటారు . కొన్ని సంస్థల్లో బాస్ ల సొంత పనులు చేయకపోయినా ఇబ్బందే .. ఇదే సమయంలో ఇలాంటి పైరవీలు ఎంజాయ్ చేస్తూ ఎదిగే వారు కూడా ఉంటారు . మీరు ఎన్నయినా చెప్పండి .. నిజాయితీ గా మన పని మనం చేస్తే బాస్ కే కాదు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని సినిమా డైలాగు చెప్పవచ్చు కానీ వాస్తవ పరిస్థితి అలా ఉండదు . **** ఒకరోజు ఆఫీస్ కు వెళ్ళగానే వాతావరణం వేడిగా ఉంది . చీఫ్ రిపోర్టర్ యస్ ఎన్ సి ఎన్ ఆచారిని పిలిచి ఎడిటర్ శాస్త్రి చెడా మడా తిట్టి పంపించారు . సాధారణంగా ఏదైనా ముఖ్యమైన వార్త మిస్ అయితే అలా తిడతారు . దానితో రిపోర్టర్ లు అందరూ అప్రమత్తమైన తమ బీట్ కు సంబంధించిన వార్త ఏమైనా మిస్ అయిందా అని అన్ని పత్రికలు చూశారు . ఏమీ మిస్ కాలేదు . మరి దేనికోసం ఆ తిట్లు అని విచారిస్తే ... ఆస్ట్రేలియాలో భారీ భూకంపమో ఏదో ప్రకృతి వైపరీత్యం .. ఆ వార్త భూమిలో మిస్ అయ్యారు . విషయం తెలిసి ఆఫీస్ లో మౌనంగానే ఉండి .. నవ్వు ఆపుకోలేక మిత్రులం టీ డబ్బా వద్దకు వెళ్లి పగలబడి నవ్వుకున్నాం . ఆస్ట్రేలియాలో ఏదో జరిగితే హైదరాబాద్ లో ఉన్న రిపోర్టర్ కు ఏం బాధ్యత అది డెస్క్ వాళ్ళ పని ... ఐతే ప్రతి తిట్టుకు తెరవెనుక ఓ కథ ఉంటుంది . ఎడిటర్ ఎక్కువ సమయాన్ని పుస్తకాలు రాయడానికి ఉపయోగిస్తారు . యజమాని దృతరాష్ట్రుడు అయినప్పుడు దుర్యోధనుడు పూనడం సహజం . ఈ పుస్తకాలను అమ్మడం జర్నలిస్టుల ప్రధాన విధిగా మారిపోతుంది . ప్రభుత్వ సంస్థలకు పెద్ద మొత్తంలో పుస్తకాలు అంటగట్టారు . బిల్లులు మాత్రం రావడం లేదు . ముఖ్యమంత్రి స్థాయిలో చెబితే తప్ప పని కాదు . అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి . కిరణ్ కుమార్ రెడ్డి ఆచారికి సన్నిహితుడు .. ఎంత స్నేహం అంటే ఓ సారి చారికి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే చారి బాబాయ్ నేను పనిలో ఉన్నాను , తరువాత నేనే కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేయడం నా ముందే జరిగింది . అంత సన్నిహితంగా ఉండేవారు పని చెబితే చేయడం లేదు అంటే ఎవరూ నమ్మరు . పుస్తకాల బిల్లుల కోసం ఎడిటర్ చారి మీద ఒత్తిడి , చారి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డిని బతిమిలాడడం అసంకల్పిత ప్రతీకార చర్య సూత్రం లా వరుసగా జరుగుతున్నా బిల్లు మాత్రం మంజూరు కాలేదు . బిల్లు కోసం చారి చిత్త శుద్దితో ప్రయత్నం చేయడం లేదు అని ఎడిటర్ నమ్మకం . చారి ఎంత ప్రయత్నించినా కిరణ్ కుమార్ రెడ్డి వినలేదు . దాంతో అమెరికాలో తుఫాన్ఏం వచ్చినా , , ఆస్ట్రేలియాలో భూకంపం వచ్చినా చారి వణికిపోయే పోయే పరిస్థితి . పుస్తకాల డబ్బుల కోసం ఎడిటర్ కక్ష కట్టాడు అని అర్థమైన చారి ఇక ఉండలేను అని గ్రహించి భూమిని వదిలేసి డక్కన్ క్రానికల్ లో చేరిపోయారు . మనం నిజాయితీ గా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు అనే డైలాగు ఇతర ఉద్యోగాలకు పని చేస్తుందేమో కానీ జర్నలిస్ట్ లకు పని చేయదు . ఎడిటర్ పని కాక పోయినా , ఓనర్ కు కోపం వచ్చినా వణికిపోవలసిందే . ఇదే సమయంలో ఓనర్ పనులు, ఎడిటర్ పనులు చేస్తూ సొంత పనులు చక్కపెట్టుకుని ఎంతో ఎత్తుకు ఎదిగి ఓనర్లు గా మారి సమాజానికి నైతిక విలువలు బోధిస్తున్నవారు కూడా ఉన్నారు . . అదేదో సినిమాలో పాము కాటుకు మంత్రం వేసే వాడు పాము కాటుకే పోయాడు అని శ్రీ హరి చెప్పిన డైలాగులా , పుస్తకాల అమ్మకాల కోసం ఎందరినో బ లి చేసిన ఎడిటర్ ఉద్యోగం చివరకు ఆ పుస్తకాల కాటుతో ఊడింది . ఆ కథ మరోసారి .. - బుద్దా మురళి

27, ఆగస్టు 2023, ఆదివారం

మజ్జిగ ప్యాకెట్ .. నీళ్ల బాటిల్ లోనూ రాజకీయం ఉంటుంది ....జర్నలిస్ట్ జ్ఞాపకాలు -86

డాక్టర్స్ హెల్త్ క్యాంపు అంటే .. ఏ నియోజకవర్గం అనడిగాను ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -86 వీళ్ళిద్దరూ డాక్టర్స్ పార్టీ శిక్షణా శిబిరాల్లో హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు అని పరిచయం చేయగానే , ఒక్క క్షణం కూడా ఆగకుండా .. ఏ నియోజక వర్గం టికెట్ ఆశిస్తున్నారు అని ప్రశ్నించగానే ఆ డాక్టర్ జంట బిత్తర పోయింది . చూసే కనులు , ఆలోచించే మెదడు ఉండాలి కానీ రాజకీయాల్లో సినిమాలను మించిన నాటకాలు కనిపిస్తాయి . ఇక్కడ రిహార్సల్స్ ఉండవు , కట్ చెప్పే డైరెక్టర్ ఉండరు , మేకప్ వేసేవారు ఉండరు , డైలాగులు రాసే రైటర్ ఉండరు . అంతా తామే సిద్ధం చేసుకొని తామే నటించాలి . అది నటన కాదు సహజం అనిపించేలా నటనలో జీవించాలి . అలా జీవించారు కాబట్టే విశ్వ విఖ్యాత నట సార్వభౌముడే కాకుండా స్వయంగా దర్శకుడు కూడా అయిన ఎన్టీఆర్ బాబు నటనలో జీవిస్తే గ్రహించలేక పోయాను అన్నారు . . తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ పేర్లు ఉంటే , తమిళ డబ్బింగ్ తెలుగు సినిమాలకు చక్కని తెలుగు పేర్లు ఉన్నట్టు ... కొందరి నటన పేలవంగా ఉంటుంది. షర్మిల మాట్లాడితే తెలంగాణ అంటే అచ్చం డబ్బింగ్ సినిమాకు అమలాపురం బుల్లోడు , సీమ వీరుడు అని టైటిల్ లా ఉంటుంది . సీమ మీద ప్రేమతో ఆ సినిమా చూస్తే తమిళ గ్రామాలు , తమిళ బోర్డు లు ఉంటాయి . తమిళ పత్రికలను తెలుగులో చదువుతుంటారు . రాజకీయాల్లో డబ్బింగ్ సినిమాలు నడిచినట్టు చరిత్ర లేదు . ***** కరోనా సమయంలో మా అబ్బాయి మెదక్ జిల్లాలో సేవా కార్యక్రమాలు చేశారు టికెట్ ఇవ్వరా ? అని మైనం పల్లి హనుమంతరావు గట్టిగా ప్రశ్నిస్తున్నారు . నాకు టికెట్ ఇచ్చారు సరే మా అబ్బాయికి ఇవ్వాలి అనేది అయన డిమాండ్ . కరోనాలో తన కుమారుడి సేవ గురించి ప్రస్తావించి టికెట్ డిమాండ్ చేయడం తో రాజకీయాలలో ఈ నిస్వార్ధ సేవా కార్యక్రమాలుగుర్తుకు వచ్చాయి . ఎన్టీఆర్ నుంచి బాబు పార్టీ లాక్కున్న తరువాత చంపా పేట లో టీడీపీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు . 97-98 లో ఓ రోజు ఈ శిక్షణా కార్యక్రమాల్లో రాజకీయాల్లో నైతిక విలువలు , క్రమశిక్షణ గురించి బాబు ఉపన్యాసం ముగిశాక మీడియా తిరిగి వెళ్లి పోవడానికి వస్తుంటే పార్టీలో ముఖ్యనాయకుడు పి . ఎన్ వి . ప్రసాద్ మీడియా వద్దకు పరిగెత్తుకు వచ్చి ఒక డాక్టర్ జంటను పరిచయం చేశారు . పార్టీ శిక్షణా కార్యక్రమం లో వీళ్ళు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు సేవా భావం తో అని పరిచయం చేశారు . నవ్వుతూ ఏ నోయోజక వర్గం టికెట్ ఆశిస్తున్నారు అని అడిగాను . వాళ్ళు అప్పుడు చెప్పలేదు కానీ కానీ 1998 లో99లో ఆ డాక్టర్ సుగుణకుమారికి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కింది . ఆమె గెలిచింది కూడా ., 98లో గెలిచాక కానీ 2004 లో ఓడిపోయాక కానీ మళ్ళీ ఎప్పుడూ ఆమె హెల్త్ క్యాంపు లు నిర్వహించినట్టు కనిపించలేదు . టికెట్ కోసం సేవా కార్యక్రమాలు కానీ టికెట్ వచ్చి గెలిచాక సేవా కార్యక్రమాలు ఏమిటీ మన పిచ్చికానీ .. ********** పి ఎన్ వి ప్రసాద్ కూడా పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు . ఎన్టీఆర్ కుటుంబ యల్ ఐ సి ఏజెంట్ గా జీవితాన్ని ప్రారంభించి బాబు హయం లో పార్టీలో కీలక నేతగా మారారు . హెలికాఫ్టర్ లో జగన్ ఇడుపుల పాయ ఎస్టేట్ ను రహస్యంగా చిత్రించింది ఈయనే . పార్టీకి సంబంధించి కీలక వ్యవహారాలు తెలిసిన నేత . నియోజక వర్గం టికెట్ ఆశించలేదు కానీ రాజ్య సభ సభ్యత్వం ఆశించారు . దక్కక పోవడం తో కొన్ని రోజులు రాజ్యాధికార వేదిక లో పని చేశారు . తరువాత వై యస్ ఆర్ కాంగ్రెస్ లో తేలారు . జగన్ లక్ష కోట్లు సంపాదించారు అని ఆరోపించి , సాహసోపేతంగా హెలికాఫ్టర్ లో జగన్ సామ్రాజ్యాన్ని చిత్రీకరించి సంచలనం సృష్టించిన వారు అదే జగన్ పార్టీలో చేరడం అంటే రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు ఉంటాయి అంటే నమ్మకుండా ఉంటారా ? ****** మహానాడు వంటి పెద్ద మీటింగ్ లు కావచ్చు ఎన్నికల ముందు జరిగే మీటింగ్ లు కావచ్చు కొందరు మంచి నీళ్ల బాటిల్స్ , మజ్జిగ ప్యాకెట్స్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు . మజ్జిగ చిక్కదనాన్ని ఆస్వాదించడం తో పాటు ఆ మజ్జిగ ప్యాకెట్ మీద ఉన్న సందేశాన్ని చదివితే వాటిని పంచిన నాయకుడు టికెట్ ఆశిస్తున్నా నియోజక వర్గం గురించి స్పష్టం గా ఉంటుంది . తెలంగాణ , ఆంధ్ర , రాయలసీమ అనే తేడా లేదు . సికింద్రాబాద్ మహంకాళి జాతర మొదలుకొని కోటప్ప కొండ , నెల్లూరు రొట్టెల జాతర వరకు నాయకుల హోర్డింగ్ లతో పాటు వారు టికెట్ ఆశిస్తున్న నియోజక వర్గం పేరు స్పష్టంగా కనిపిస్తుంది . నాయకుల పుట్టిన రోజు కావచ్చు శ్రావణ శుక్రవారం కావచ్చు పత్రికల్లో పెద్ద ప్రకటనలు , అమ్మవారి జాతర ల వద్ద పెద్ద పెద్ద హోర్డింగ్ లు కనిపిస్తాయి . వాటిలో నాయకుల బొమ్మలు , వారు టికెట్ ఆశిస్తున్నా నియోజక వర్గం ఉంటుంది . ప్రతి సేవ వెనుక ఒక నియోజక వర్గం టికెట్ లక్ష్యం ఉంటుంది . సేవా కార్యక్రమాలు చూసి మానవతావాది లో మానవత్వం పొంగిపొర్లుతోంది అని తొందరపడి ఓ నిర్ణయానికి రావద్దు . చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రాజకీయ ప్రవేశం చేసినప్పుడు చెప్పనే చెప్పారు సేవే మార్గం అని . బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయండి తరువాత రాజకీయ ప్రవేశానికి ఉపయోగపడుతుంది అని చిరంజీవికి యండమూరి వీరేంద్ర నాథ్ సలహా ఇచ్చినట్టు ఎక్కడో చదివాను . దివిసీమ తుఫాను సమయంలో ఎన్టీఆర్ , అక్కినేని జోలె పట్టి విరాళాలు వసూలు చేశారు . ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంలో చెప్పుకోవడానికి ఈ సేవ ఎంతో ఉపయోగపడింది . సేవలందు రాజకీయ సేవలు వేరు . బుద్దా మురళి .