21, జులై 2026, మంగళవారం

యూజ్లెస్ ఫెలో.....జర్నలిస్ట్ కథలు

యూజ్లెస్ ఫెలో -----/ -- 'యూజ్లెస్ ఫెలో ' మెల్లగా అన్నప్పటికీ తన కుమారుడి నోటి నుంచి వచ్చిన ఆమాట కిరణ్ కుమార్ కు వినిపించింది . 'ఏమన్నావు ?'అని అడిగితే ," ఏమీ లేదు . నువ్వు నా చదువు కోసం చేసిన అప్పును వడ్డీ తో సహా ఇచ్చేశాను . మరోసారి నా చదువు కోసం అప్పు చేశాను అనే మాట వినిపించ కూడదు . నీ చదువు కోసం ఎంత కష్టపడ్డాం అంటూ డ్రామా డైలాగులు వినిపిస్తే నాకు చిరాకు వేస్తుంది . అమెరికా వెళ్లేందుకు చేసిన అప్పు ను వడ్డీ తో సహా ఇచ్చేశాను . చిన్నప్పటి నుంచి నా మీద ఎంత ఇన్వెస్ట్ చేశావో చెప్పు . వడ్డీ తో సహా ఇచ్చేస్తాను . ఇంకోసారి సెంటిమెంట్ డైలాగులు వినిపిస్తే మర్యాదగా ఉండదు . నీ డబ్బు నీకు ఇచ్చేశాను . ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ ను ఎవరికి రుణపడి ఉండడం నాకు ఇష్టం ఉండదు . ఇంటికి వచ్చిన వాళ్లందరికీ నన్ను చదివించేందుకు ఎంత కష్టపడింది కథలు కథలుగా చెప్పి సానుభూతి పొందాలి అనే డ్రామాలు ఇక ఆపేయండి . అప్పు తీర్చేశాను . ఇక నా బతుకు నాది మీ బతుకు మీది . " కొడుకు ప్రవీణ్ చెబుతున్న మాటలు విని కిరణ్ కు గుండె పగిలినట్టు అయింది . తన జీవితం మొత్తం ఇద్దరు పిల్లలను ప్రయోజకులను చేయాలి అనే ఏకైక లక్ష్యంగానే సాగింది . అమ్మాయి పెళ్లి . రిటైర్ అయిన జీవితం . ఇక్కడి వరకు లాక్కురావడమే ఎలా సాధ్యం అయింది అన్నట్టుగా సాగింది . తన సంపాదన కుటుంబ సంపాదన అనుకున్నట్టుగానే ,తన కుమారుడి సంపాదన కూడా కుటుంబ సంపాదనే అనుకున్నాడు . నానా తంటాలు పడి కుమారుడిని అమెరికా పంపాడు . చదువు ముగిసింది . ఉద్యోగంలో చేరాడు . చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం . కుదిరితే డబ్బు సర్దాల్సి ఉంటుంది అని కిరణ్ తన కుమారుడికి ఫోన్ లో చెప్పినప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి . ఎప్పుడో ఓ సారి తాను అప్పు చేసి మరీ నిన్ను అమెరికా పంపించాను . అప్పు తీర్చడానికి నేనెంత కష్టపడుతున్నానో తెలుసా ? అని ఏదో కోపం వచ్చినప్పుడు అన్న మాట ప్రవీణ్ కు కోపం తెప్పించింది . పెళ్లి కోసం ఇంటికి రాగానే వడ్డీ తో సహా లెక్క కట్టి డబ్బులు , వడ్డీ అసలు లెక్క రాసిన కాగితం విసురుగా తండ్రికి అందించాడు . ఆ లెక్కలు , వాడి మాటలు విన్నాక తల్లి తండ్రులకు పిల్లలకు మద్య ఉండేది లెక్కలకు చిక్కే బంధమా అని మనసులోనే కుమిలి పోయాడు . తండ్రి కొడుకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ భార్యకు తెలియదు . నేను లోకాన్ని చూశాను . దేన్నయినా తట్టుకోగలను . కానీ భార్య తట్టుకోలేదు . అందుకే తనలోని ఘర్షణను తనకే పరిమితం చేసుకున్నాడు . ఇప్పుడు కొడుకు అమెరికాలో డాలర్ల లో సంపాదిస్తున్నాడు . ఇంకా నయం నవమాసాలు మోసి కన్నందుకు తల్లికి తొమ్మిది నెలల గర్భం అద్దె , తాగిన పాలకు లెక్కగట్టి ఇస్తే ఆ పిచ్చి తల్లి తట్టుకోలేక గుండె పగిలి పోయేది అనుకున్నాడు . చెప్పుకోవడానికి కిరణ్ కుమార్ పేరు మోసిన జర్నలిస్ట్ . పరిచయాలకు కొదవేమి లేదు కానీ ప్రైవేటు ఉద్యోగాలు . ప్రతి రోజూ భయమే . రిటైర్ అయ్యాక మూడు వేల రూపాయల ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ తప్ప ఆస్తులు లేవు . ఉద్యోగంలో ఉన్నప్పుడు చేయి చాచి ఉంటే ఇప్పుడు దర్జాగా బతికే అవకాశం ఉండేది . కానీ ఒకరి వద్ద చేయి చాచేందుకు మనసు అంగీకరించలేదు . ఆత్మగౌరవం తో బతికాడు . ఎంతటి ప్రముఖుడైనా సమాన స్థాయి వ్యక్తి అనే మాట్లాడే వాడు . నీ నుంచి నేను ఏదైనా ప్రయోజనం ఆశిస్తే నీ హోదా గుర్తుకు వస్తుంది . ఏ ప్రయోజనం ఆశించనప్పుడు నువ్వూ మనిషివే , నేనూ మనిషినే ఒక మనిషి మరో మనిషితో ఎలా మాట్లాడుతాడో అలానే మాట్లాడుతాను అనేవాడు . ఎదుటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినా , మంత్రి అయినా మాటతీరు అంతే ...ఇంత కాలం తలెత్తుకొని బతికాడు . రిటైర్ అయి ఆరు నెలలు అవుతోంది . రిటైర్ అయ్యాక పనికి వస్తాడు అనుకుంటే తక్కువ జీతం తో మళ్ళీ కొంత కాలం పని చేసే అవకాశం ఇస్తారు . కిరణ్ కుమార్ కు మేనేజ్ మెంట్ అలాంటి అవకాశం ఇచ్చినా పిల్లలు ప్రయోజకులు అయ్యారు . ఇంకా పని చేసే ఓపిక లేదు చాలు అని తిరస్కరించాడు . యూజ్లెస్ ఫెలో అంటూ తన కుమారుడి నోటి నుంచి వచ్చిన ఆ మాట , అతని ప్రవర్తన కిరణ్ ను కుదురుగా ఉండనివ్వడం లేదు . పదే పదే అదే మాటను గుర్తు చేసుకుంటున్నాడు . మనిషి అవసరం ఉన్నంత వరకే ఆ బంధాలు అందంగా ఉంటాయి . నచ్చని పని చేసినా , ఇష్టం లేని పని చేసినా , కష్టం అనిపించిన పని చేసినా బంధాలు పేక మేడల్లా కూలిపోతాయి అనుకున్నాడు . తల్లి తండ్రులు , భార్యా పిల్లలు ఈ బంధాలు మాత్రమే కల్తీ లేనివి , మిగిలిన బంధాలు అన్నీ పరస్పర అవసరాలతో ఏర్పడే బంధాలే అనుకున్నాడు ఇంత కాలం . తానే ఆలోచనల్లో వెనుకబడి ఉన్నానని , తప్పెవరిదీ కాదు కాలం మారింది . ఇప్పుడు ఎవరి జీవితం వారికి ముఖ్యం . అనేది తానే గ్రహించలేక పోయాను అనుకున్నాడు . ఆలోచనల్లో మునిగిపోయిన కిరణ్ కు తన జీవితం మొత్తం తన కళ్ళ ముందు కనిపించింది . బాగా బతికిన తండ్రి అందరినీ నమ్మి ఉన్నదంతా పోగొట్టుకొని గంపెడు మంది పిల్లల్లతో బతకడానికి హైదరాబాద్ లో అడుగు పెట్టాడు . ఎలాగైనా బతికేస్తాం అనే నమ్మకం తప్ప ఏ భరోసా లేదు . ఐ ఫోన్ కొనిపించలేదు అని ఆత్మహత్యలు చేసుకునే ఈ రోజుల్లో ఏమీ లేకుండా తన తండ్రి గంపెడు సంతానంతో హైదరాబాద్ లో అడుగు పెట్టడం ఇప్పటికీ ఆశ్చర్యమే . తన తండ్రికి కుటుంబం అంతా హుసేన్ సాగర్ లో దూకి చనిపోదాం అనే ఆలోచన వచ్చి ఉంటే ? తలుచుకుంటే కిరణ్ కు ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది . ******** 'యూజ్లెస్ ఫెలో' తొలిసారి తనను ఇలా తిట్టిన మాట గుర్తుకు వచ్చి పెదవులపై చిరునవ్వు మెరిసింది . స్కూల్ లో చదివేప్పుడు హెడ్ మాస్టర్ కు తానంటే ఎందుకో చాలా ప్రేమ ఉండేది . క్లాస్ కు రాగానే పాఠం తననే చదువు మనేవారు . స్పష్టంగా చదువుతానని ఇష్టపడేవారు . చదివాక 'యూజ్లెస్ ఫెలో అని ముద్దుగా అనేవారు . ఆదాయన ఊతపదం . హెడ్ మాస్టర్ అలా తనను అంటే ఎంత ముచ్చటేసేదో . ఆ మాట ఇంకా చెవుల్లో గింగురు మంటూనే ఉంటుంది . బాధ్యతలు లేని వయసు , సమస్యలు లేని జీవితం , పేదరికం అంటే తెలియని పేదరికం చిన్న చిన్న వాటికే సంతోష పడే జీవితం అది . చదువు పూర్తయి జర్నలిస్ట్ గా ఉద్యోగం . ఏదో సాధించాలి అనే తపన , సమాజం పై ప్రభావం చూపించాలి అనే కోరికతో జర్నలిజం లోకి అడుగు పెట్టిన కిరణ్ కుమార్ కు కొద్ది రోజులకే కళ్ళు తెరుచుకున్నాయి . ఇక్కడ పత్రికా స్వేచ్ఛ అంటే యజమానులకు తప్ప జర్నలిస్ట్ లకు కాదు అని తెలిసి వచ్చింది . అప్పటికే సంసారంలో , ఉద్యోగంలో నిండా కూరుకుపోయాడు . కొత్త ఎడిటర్ వచ్చాడు . ప్రపంచంలో తనకు తప్ప ఎవరికీ తెలివి లేదు అనుకునే మూర్ఖుడు అతని తెలివి తేటలన్నీ మేనేజ్ మెంట్ ను బుట్టలో వేయడానికి మాత్రమే పనికి వచ్చాయి . ఎడిటర్ గొంగళి పురుగు లాంటోడు కానీ సీతాకోక చిలుకను అనుకుంటాడు . మంచి జీతం , మంచి సంస్థ ..తెలియని దేవుడికన్నా తెలిసిన దయ్యం బెటర్ అనుకోని కిరణ్ కుమార్ అక్కడే ఉండిపోయాడు . ప్రతి ఒక్కరిని యూజ్లెస్ ఫెలో' అనడం ఎడిటర్ కు అలవాటు . నిజానికి సంస్థలో అల్లుడిలా అనుభవిస్తున్న ఎడిటర్ నే యూజ్లెస్ ఫెలో' కానీ ఆ మాట అతనే అందరినీ అంటుంటాడు . ఓ రోజు ఎడిటర్ కిరణ్ ను ఇలానే ఏదో విషయంలో యూజ్లెస్ ఫెలో అని తిడితే కొలీగ్ ఏరా ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి , బాగా రాస్తావు . నువ్వు సరే అంటే ఇంతకన్నా రెట్టింపు జీతం ఇచ్చేవాళ్ళు ఉన్నారు . వెళ్లిపోకుండా మాటలు పడుతూ వీడి వద్దనే పడి ఉండడం అవసరమా ? అని అడిగితే , నేను వీడి వద్ద పని చేయడం లేదు , వాడు , నేను , నువ్వు ఈ సంస్థలో పని చేస్తున్నాం అంటూ సమర్ధించుకున్నాడు . "మొదటి సారి బాధ పడ్డాను . తరువాత ఆలోచించాను . మంచి సంస్థ , మంచి జీతం . బయటకు వెళితే అక్కడే సమస్యలో ఎవరికి తెలుసు . నేను ఒక్కడిని తిట్లు తింటూ బాధ పడ్డా, కుటుంబం బాగుంటుంది , కుటుంబానికి ఓ భద్రత ఉంటుంది . కుటుంబం కోసం ఆ మాత్రం భరించలేనా ? "అని తేలిగ్గా తీసుకున్నాడు . "చనువుకునే రోజుల్లో ఎంత అగ్రెసివ్ గా ఉండేవాడు . కుటుంబం ఎలా మార్చేసింది" అని కొలీగ్ నవ్వుకుని భుజం తట్టి తన పనిలో తాను మునిగిపోయాడు . నిజానికి ఆ ఎడిటర్ నే పనికిరాని వాడు అని మేనేజ్ మెంట్ గేటు బయటి నుంచి అటు నుంచి ఆటే ఇంటికి పంపించారు . కానీ అప్పటికే ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నాడు . *** ***** **** అమ్మాయి పెళ్లి కావడంతో కిరణ్ ఊపిరి పీల్చుకున్నాడు . పెళ్లి కాగానే అబ్బాయి ప్రవీణ్ అమెరికాకు పయనమయ్యాడు ." మళ్ళీ ఎప్పుడు వస్తావు ?" అని తల్లి ప్రశ్నిస్తే ప్రవీణ్ నుంచి సమాధానం లేదు . తమను వదిలి వెళుతున్నందుకు బాధతో మాటలు రావడం లేదు అని తల్లి అమాయకంగా అనుకుంది . లెక్కలన్నీ పూర్తి అయ్యాయి కాబట్టి తన కొడుకు ఇక ఎప్పటికీ రాడు అని కిరణ్ కు మాత్రమే తెలుసు . తల్లితండ్రులు చనిపోయినా విదేశాల నుంచి రాని పిల్లల గురించి చదివినప్పుడు అలాంటి వారు కూడా ఉంటారా ? అని ఆశ్చర్య పోయిన కిరణ్ కు ఇప్పుడు ఏది ఆశ్చర్యం అనిపించడం లేదు . ఉద్యోగంలో చేరిన కొత్తలో ఓ ప్రమాదంలో 30 మంది చనిపోతే వార్త కవరేజ్ కు వెళ్లి తన పని తాను చేసుకుంటూ పోయాడు కానీ ఆ 30మంది కుటుంబ సభ్యుల ఆవేదన , బాధ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచన రాలేదు . ఆ సంఘటనను ఒక వార్తగా మాత్రమే చూశాడు . మనిషిగా స్పందించలేదు . ఇప్పుడూ అంతే జరుగుతున్నా దానిని సాక్షిగా చూడడం అలవాటు చేసుకున్నాడు . ఎంత వయసు వచ్చినా , ఎంత అనుభవం ఉన్నా , ఎంత జ్ఞానం ఉన్నా కొన్ని సంఘటనలు జీవితంలో ఎదురయ్యేంత వరకు అర్థం కావు . *** *** **** " ఏమోయ్ మళ్ళీ ఉద్యోగానికి వెళుతున్నాను ." అని కిరణ్ చెప్పగానే భార్య ఆశ్చర్య పోయి " అదేంటి ఉద్యోగం చేయాల్సిన ఖర్మ నాకేంటి పిల్లలు చేతికి అంది వచ్చారు . ఎక్కడికీ వెళ్ళను ట్లోనే విశ్రాంతి తీసుకుంటాను అన్నారు . మూడు నెలలలకే బోర్ కొట్టిందా ? మరి మేం జీవిత కాలం అంతా ఇంట్లోనే ఎలా ఉంటామో అర్థం అయిందా " అని భార్య ఎత్తిపొడిచింది . " నీటి నుంచి బయటపడ్డ చేప లా గడిచిపోయింది నా పరిస్థితి . నీటిలో ఉంటేనే చేప బతుకుతుంది . జర్నలిస్ట్ గా రాస్తూ ఉంటేనే నాకు బతికినట్టు ఉంటుంది .పని లేక పోతే మగవాడు శవం తప్ సమానం . అందుకే రెండు రోజుల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నించా , పాత మేనేజ్ మెంట్ మళ్ళీ రమ్మంది వెళుతున్నా" అని కిరణ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు . ఏ సంతానం మీద ఆశలు పెట్టుకొని విశ్రాంతి జీవితం గడుపుదామని కలలు కన్నాడో , వాళ్ళు ఇక ఇంటికి తిరిగి రారు , ఇంటి భారం తనదే అందుకే మళ్ళీ ఉద్యోగానికి వెళుతున్నానని తనకు తప్ప ఇంకెవరికీ తెలియదు . బుద్దా మురళి

29, జూన్ 2026, సోమవారం

జర్నలిస్ట్ కథలు 1.... ఖాళీ కుర్చీ

జర్నలిస్ట్ కథలు 1 ఖాళీ కుర్చీ " చేతకాని వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు . ఒక పండుగ లేదు , పబ్బం లేదు . ఓ శుభ కార్యం లేదు . చివరకు మీకు జ్వరం వచ్చి ఒళ్ళు కాలుతున్న ఆఫీస్ కు వెళ్లక తప్పడం లేదంటున్నారు . ఇలాంటి వాళ్ళు పెళ్లి , పిల్లలు , కుటుంబం అని లేకుండా ఒంటరి బతుకు బతకాలి . నాలుగు రేమో మీకేంటి మీ అయన జర్నలిస్ట్ రెండు చేతులా సంపాదన అంటూ ఎత్తి పొడుస్తుంటారు . మీ కొచ్చే జీతం గొర్రె తోక బెత్తెడు అన్నట్టు అటు బతికేందుకు సరిపోదు , ఇటు చావనివ్వదు" పార్వతి ఆవేశంతో కాదు నిస్సహాయతతో భర్తను ఉదయం నుంచి అలా తిడుతూనే ఉంది . ఆ తిట్లు వినడం గిరిధర్ కు అలవాటే . తనను కాదు అన్నట్టు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు . ఆఫీస్ కు టైం అవుతోంది . బస్సులో వెళ్ళాలి . పేరుకు జర్నలిస్ట్ జీతం అంతంత మాత్రమే . పెద్ద సంస్థనే అకక్డ ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్నంత భరోసా . అంతే స్థాయి జీతం ఉంటుంది అని మిగిలిన మీడియాలో జర్నలిస్ట్ లు కుళ్ళు కుంటారు కానీ అది అర్ధ సత్యం మాత్రమే . పర్మనెంట్ ఉద్యోగికి జీతం బాగానే ఉంటుంది కానీ తాను అక్కడ 15 ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగి . సమానపనికి సమాన జీతం ఉండాలి అని సుప్రీం కోర్ట్ తీర్పు ఉన్నా అది మీడియాలో పని చేయదు . చేసేది ఒకే పని కానీ పర్మనెంట్ ఉద్యోగికి ఇచ్చే జీతంలో కాంట్రాక్ట్ ఉద్యోగికి 20 శాతం ఇస్తారు . అన్యాయమే అయినా మిగిలిన చోట ఈ మాత్రం కూడా ఉండదు కాబట్టి తప్పదు . జ్వరం అని వారం రోజుల నుంచి సెలవుల్లోనే ఉన్నాడు . అయినా జ్వరం తగ్గలేదు . దానితో ఎడిటర్ కు ఫోన్ చేసి "బాగా జ్వరంగా ఉంది . ఇంకో రెండు రోజులు సెలవు కావాలి " అని వణుకుతున్న గొంతుతో గిరిధర్ అడిగితే , ఎడిటర్ " ఐతే ఒక పని చెయ్ . శాశ్వతంగా ఇంట్లోనే ఉండు . ఉద్యోగం కావాలి అని చాలా మంది వచ్చి పోతున్నారు . ఇంకొకరిని చూసుకుంటాలే " అని ఎడిటర్ ఫోన్ కట్ చేశాడు . సెలవు అడిగిన వారితో ఇంట్లోనే ఉండు అనడం ఎడిటర్ కు ఊత పదం కానీ గిరిధర్ లాంటి బడుగు జీవికిఆ ఊత పదం వింటే పై ప్రాణాలు పైనే పోతాయి . ఇవన్నీ భార్యకు చెప్పలేడు . అందుకే ఆమె తిట్లను పట్టించుకోకుండా జ్వరం తో అలానే ఆఫీసుకు బయలు దేరాడు . ఎర్రటి ఎండలో బస్సు కోసం ఎదురు చూస్తూ బస్సు రాగానే ఆఫీస్ కు బయలు దేరాడు . *** **** సిటీ డెస్క్ లో కూర్చున్న గిరిధర్ ను చూసి కొలీగ్ ఇంకా జ్వరం తగ్గినట్టుగా ఉంది . సెలవు తీసుకోవలసింది అని చెబితే , కుదరదు వచ్చేయాలి అని ఎడిటర్ ఆదేశం అని గిరిధర్ పని చేయడానికి ప్రయత్నిస్తే , చేతులు వణుకుతున్నాయి . పనికి శరీరం సహకరించడం లేదు , కానీ ఉద్యోగ భయం మాత్రం పని చేయాల్సిందే అని ఒత్తిడి చేస్తోంది . భయమే విజయం సాధించింది . ఎండలో వచ్చిన గిరిధర్ సాయంత్రం వరకు అలానే పని చేశాడు . హఠాత్తుగా తూలి కుర్చీ నుంచి పడిపోయాడు . స్పృహ తప్పుతుండడం తెలుస్తోంది . ఆఫీస్ లో ఉన్నవాళ్లు ప్రమాదాన్ని గ్రహించి ఆస్పత్రికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు . ఆఫీస్ పక్కనే ఆస్పత్రి ఉండడంతో వీల్ చైర్ తీసుకువచ్చి గిరిధర్ ను కూర్చోబెట్టి లిఫ్ట్ లో తీసుకువెళుతున్నారు . ఇదంతా చూసిన న్యూస్ ఎడిటర్ సుందర్ ఎడిటర్ ఛాంబర్ లోకి వెళ్ళాడు . సుందర్ ను చూడగానే ఎడిటర్ " రావయ్యా ! రా ! నేనే పిలుద్దామనుకుంటున్నా . యూనివర్సిటీలో జర్నలిజం లో నైతిక విలువలు అంశంపై నాదే కీలక ఉపన్యాసం . చదువుతా ఎలా ఉందో చెప్పు . సృష్టిలో అత్యున్నత జీవి మానవుడు . మనిషిగా పుట్టడం పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం . మానవ జీవితమే అద్భుతం అనుకుంటే . జర్నలిస్ట్ జీవితం పరమాద్భుతం . పాలకులకు , ప్రజలకు మధ్య వారధిగా ఉండేది జర్నలిస్ట్ . గొంతు లేనివారికి జర్నలిస్ట్ గొంతు అవుతాడు . పాలకుల చెవులు మూసుకుపోతే జర్నలిస్ట్ శంఖం పూరిస్తాడు . బాధితులు ఎక్కడున్నా మీకు నేనున్నాను అని భరోసా ఇచ్చే గొప్ప మానవతా వాది జర్నలిస్ట్ - ఇలా మొదలు పెడుతున్నాను ఎలా ఉంది? " అని ఎడిటర్ అడిగితే " అద్భుతం " అని సుందరం ఎప్పటిలానే చెప్పాడు . గిరిధర్ స్పృహ తప్పి పడిపోయిన విషయం చెబుతుండగానే సబ్ ఎడిటర్ పండరి వచ్చి " లిఫ్ట్ లో ఆస్పత్రికి వెళుతుండగానే గిరిధర్ చనిపోయాడు" అని చెప్పాడు . ఏం సమస్యలో తెలియదు కానీ ఎడిటర్ ముఖం ఎప్పుడూ చిరాగ్గానే ఉంటుంది . గిరిధర్ ఆఫీస్ లోనే ప్రాణాలు వదిలాడు అని వినగానే మరింత చిరాగ్గా ముఖం పెట్టి తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చాడు . భూకంపం వచ్చినా , తోటివారు ప్రాణాలు వదిలినా ఆఫీస్ లో ఎవరి కుర్చీలో వాళ్ళు కూర్చొని పని చేసుకోవడం బయటి వారికి అమానవీయం అనిపించవచ్చు కానీ ఎడిటర్ కు మాత్రం అదృశ్యం చూడగానే తన ఇగో చల్లారింది . సిటీ డెస్క్ లో ఒక్క కుర్చీ ఖాళీగా ఉంది . అది గిరిధర్ కూర్చునే చోటు . ఎడిటర్ అన్ని డెస్క్ ల వైపు చూసి గ్రామీణ వార్తల డెస్క్ లో తలవంచుకొని భయం భయంగా పని చేసుకుంటున్న వరప్రసాద్ వైపు చూసి" ఏయ్ నిన్నే ఇటు రా ! వెళ్లి సిటీ డెస్క్ లో పని చెయ్ అని ఆదేశించాడు . కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఎడిటర్ మాట తీరు అలానే ఉంటుంది . మారు మాట్లాడకుండా వరప్రసాద్ వెళ్లి ఖాళీగా ఉన్న గిరిధర్ కుర్చీలో కూర్చున్నాడు . పర్సనల్ కంప్యూటర్ మీద వార్తలు కంపోజ్ చేస్తున్నాడు కానీ వరప్రసాద్ కు మనసు మనసులో లేదు . పది నిమిషాల క్రితం ఈ కుర్చీలో గిరిధర్ అందరిలానే పని చేశాడు . సజీవంగా ఉన్నాడు . కేవలం పది నిమిషాల్లో గిరిధర్ మృత జీవి . ఆఫీస్ లో అతని కుర్చీ పది నిముషాలు కూడా ఖాళీగా లేదు . ఇంకో పది నిముషాలు అయితే ఎవరి పనిలో వాళ్ళు లీనం అవుతారు . మనిషి ప్రాణానికి ఉన్న విలువ ఇంతేనా అనిపించింది . మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి . చేతి వేళ్ళు వార్తలను కంపోజ్ చేస్తున్నాయి . ఎడిటర్ తన ఛాంబర్ నుంచి మనుషులను మాత్రమే చూడగలడు కాబట్టి బతికి పోయాం . వాడు మన ఆలోచనలను కూడా నియంత్రిస్తే వరప్రసాద్ మనసులో ఆలోచన రాగానే ఉలిక్కి పడ్డాడు . ఆఫీస్ లో నిశ్శబ్దంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు . జర్నలిస్ట్ లలో నైతిక విలువల ఉపన్యాసం పూర్తి చేయడానికి ఎడిటర్ తన ఛాంబర్ లోకి వెళ్లి పోగానే , ఛాంబర్ ముందు ఎర్ర లైట్ వెలుగుతోంది . సినిమాల్లో ఆస్పత్రిలో ఆపరేషన్ సమయంలో బయట ఎర్ర లైట్ వెలిగినట్టు ఎడిటర్ ఛాంబర్ ముందు ఎర్ర లైట్ వెలుగుతుంటే ఎడిటర్ సీరియస్ గా ఏదో రాసుకుంటున్నారు . ఎవరూ రావద్దు అని అర్థం . సబ్ ఎడిటర్ లు , రిపోర్టర్ లు రెడ్ లైట్ ఏరియా అని తమలో తాము జోకులు వేసుకుంటారు . అరగంట తరువాత ఆఫీస్ మొత్తం గిరిధర్ మరణాన్ని మరిచిపోయారు . ఆ రోజు ముఖ్యమైన వార్త లేమిటో చర్చించుకుంటున్నారు . ఏం వార్తలు ఇస్తున్నారని న్యూస్ ఎడిటర్ బ్యూరో చీఫ్ ను అడిగితే , బ్యూరో చీఫ్ రిపోర్టర్లను అడిగాడు . ఎవడి జీవితం వాడికి ముఖ్యం ఎవరి పనిలో వాళ్ళు బిజీ **** విషయం తెలిసి గిరిధర్ భార్య గుండెలు బాదుకుంటూ ఆస్పత్రికి వచ్చి గుండెలు పగిలేలా ఏడుస్తోంది . పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని ఉదయం అన్ని తిట్లు తిట్టిన భార్య తలబాదుకొని ఏడుస్తోంది . అదే సమయంలో ఎడిటర్ తన ఛాంబర్ లో మసాలా దోశ తింటూ ఫోన్లో గట్టిగా నవ్వుతూతన మిత్రుడైన ఇంటెలిజెన్స్ అధికారికి ఏదో సమాచారం ఇస్తున్నాడు . రిపోర్టర్ లు ఇచ్చే సమాచారం ఇంటెలిజెన్స్ వారికి చేరవేయడం ఎడిటర్ పాటించే నైతిక విలువల్లో భాగం . **** ఆఫీస్ లో గిరిధర్ కుర్చీ ఖాళీ అయిన పది నిమిషాల్లో మరొకరితో భర్తీ చేశారు . గిరిధర్ ఇంట్లో ఖాళీ అయిన కుర్చీ ఖాళీగానే ఉంది . గిరిధర్ భార్య , చదువుకుంటున్న పిల్లల భవిష్యత్తు ఏమిటీ ? అనే ప్రశ్నకు సమాధానం లేదు . వారం తరువాత గిరిధర్ కుమారుడు ఆఫీస్ కు వచ్చి " మా నాన్న ఎలా చనిపోయాడు అని అందరినీ అడిగాడు . ఎవరూ సమాధానం చెప్పలేదు . ఇంట్లో ఖాళీ కుర్చీ ఎలాగూ సమాధానం చెప్పలేదు . ఆఫీస్ లో పది నిమిషాల్లో భర్తీ అయినట్టు ఇంట్లో ఖాళీ కుర్చీ ఎప్పటికీ భర్తీ కాదు . - బుద్దా మురళి

2, ఏప్రిల్ 2026, గురువారం

బాబు పదవిని నిలబెట్టిన గ్యాస్ సిలిండర్ కథ

బాబు పదవిని నిలబెట్టిన గ్యాస్ సిలిండర్ కథ జర్నలిస్ట్ జ్ణాపకాలు -126 ^^ గ్యాస్ సిలిండర్ తో వంట చేయవచ్చని చేసింది నేనే ^^ ఈ మాట అన్నది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు .ఆంధ్ర లో జరిగిన ఓ మీటింగ్ లో ఈ మాట చెప్పారు . బాబు ఉద్దేశ పూర్వకంగా చెబుతారో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ చాలా సార్లు ఆయన మాటల్లో కర్త , కర్మ , క్రియ ఉండదు . గ్యాస్ సిలిండర్ తో వంట చేయవచ్చు అని మొదట చెప్పింది నేనే అని చెప్పవచ్చు . లేదా గ్యాస్ సిలిండర్ తో మొదటి సారి వంట చేసింది నేనే అని చెప్పినా వ్యాఖ్యలో సంపూర్ణత ఉండేది . వంటి చేయ వచ్చని చేసింది నేనే అనడంలో వాఖ్య అర్ధవంతంగా లేదు . విషయం ఎలాగూ అర్ధవంతంగా లేదు కనీసం వాఖ్య అయినా అర్ధవంతంగా ఉండాలి కదా ? వాఖ్య ఎలా ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పదవిని నిలబెట్టింది ఈ గ్యాస్ సిలిండర్ నే . అదో పెద్ద కథ . గ్యాస్ సిలిండర్ అంత పెద్ద కథ . *** ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించేశారు అనే బలమైన ముద్ర . లక్ష్మీపార్వతి ప్రచారం . దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో సహా ఎన్టీఆర్ కుటుంబం దూరం కావడం , నందమూరి హరికృష్ణ సొంత పార్టీ పెట్టి బాబు వెన్నుపోటు పై జనం లోకి వెళ్లడం వంటి వాటితో చంద్రబాబు బాబు బాగానే ఇబ్బంది పడుతున్నారు . 1999 ఎన్నికల్లో ఓటమి ఖాయం అనిపించింది . న్యూస్ టైం లో పని చేసే జర్నలిస్ట్ మిత్రుడు పవన్ నేనూ కలిసి అలా గ్రామాల్లోకి వెళదాం ఏమనుకుంటున్నారో తెలుస్తుంది అని బయలు దేరాం . నర్సాపూర్ , గజ్వేల్ ప్రాంతాల్లో తిరిగి మాట్లాడుతుంటే రోడ్డు పై బండి మీద మక్కజొన్న కంకులు కాల్చి అమ్ముతున్న అమ్మాయితో కాసేపు మాట్లాడాం . ఆమె చెప్పిన ఒక్క మాటతో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అని అర్థమైంది . ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే ... ? **** ఇప్పుడంటే గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీ వాళ్ళు బతిమిలాడి మరి ఇస్తారు . ఆర్థిక సంస్కరణలకు ముందు అలా ఉండేది కాదు . పార్లమెంట్ సభ్యులకు కోటా ఉండేది . ఈ కూపన్ లను కూడా కొందరు అమ్ముకొనేవారు . 96 లో హిమాయత్ నగర్ లో టీడీపీ కార్యాలయం ఉన్నపుడు రాజ్యసభ సభ్యలు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూపన్లను రిపోర్టర్ లకు ఇవ్వమని కార్యాలయ కార్యదర్శికిఇచ్చారు . మహా ప్రసాదం అని తీసుకున్నాం . ఆ రోజుల్లో గ్యాస్ కనెక్షన్ కు అంత డిమాండ్ ఉండేది . 99 ఎన్నికలు సమీపిస్తుండడం ఎలాగైనా గెలవాలి అని ప్రయత్నాలు . ఒక్క ఓటుతో వాజపేయి ప్రభుత్వం పడిపోయింది . బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తో విజయావకాశాలు మెరుగుపడ్డట్టు నమ్మకం కలిగింది . అదొక్కటే సరిపోదు ఇంకేం చేద్దాం అని ఆలోచిస్తుంటే అప్పుడు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా రాజ్య సభ సభ్యునిగా ఉన్న లాల్ జాన్ బాషా మదిలో మెదిలిన ఆలోచన గ్యాస్ సిలిండర్ పథకం . అప్పుడు బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ చేరలేదు . స్పీకర్ పదవి మాత్రమే తీసుకోని బయటి నుంచి మద్దతు అని ప్రకటించింది . మహిళకు గ్యాస్ సిలిండర్ పథకం ప్రకటిద్దామని బాషా చెబితే అది ఎలా సాధ్యం . ఎంపీలు కూపన్ ల కోసమే పైరవీలు చేస్తున్నారు . లక్షల మందికి ఎలా సాధ్యం అంటే బాషా సాధ్యమే అని చెప్పారు . మనం మంత్రి పదవులు తీసుకోవడం లేదు . ఢిల్లీలో వ్యవహారాలు నేను దగ్గరి నుంచి చూశాను మీ పలుకుబడి ఉపయోగిస్తే మన రాష్ట్రానికి భారీ కోటా వస్తుంది . వాటిని ప్రతి గ్రామంలో కొందరికి పంపిణీ చేస్తే ఎన్నికల తరువాత అందరికీ వస్తుందనే నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పారు . బాబు రంగంలోకి దిగి విజయం సాధించారు . ఆ రోజుల్లో ఎన్టీఆర్ భవన్ లో ఆ బీట్ రిపోర్టర్ గా బాషా తో గంటల తరబడి ముచ్చట్లు సాగేవి ఈ విషయాలు అన్నీ ఆ రోజే బాషా చెప్పారు . ఐటీ నేనే అన్నీ నేనే అని బాబు చెప్పుకుంటారు . కుమారుడిని రాజకీయాల్లో నిలబెట్టాలి ఇమేజ్ పెంచాలి అనుకున్నపుడు నగదు బదిలీ పథకం కనిపెట్టింది లోకేష్ అని చెప్పారు . మిగతా అన్నీ తానే అంటారు . సాధారణంగా క్రెడిట్ ఎవ్వరికీ ఇవ్వరు . కానీ లాల్ జాన్ బాషా చనిపోయినపుడు టీడీపీ విడుదల చేసిన సంతాప ప్రకటనలో గ్యాస్ సిలిండర్ పథకం రూపకల్పనలో లాల్ జాన్ బాషా కృషిని ప్రస్తావించారు . బహుశా అప్పుడు బిపి ఆచార్య సమాచార శాఖ కమిషనర్ .. అప్పటికప్పుడు ఫుల్ పేజీ ప్రకటన విడుదల చేస్తూ ఈ పథకానికి దీపం పథకం అని పేరు పెట్టారు . ఇది తాత్కాలికం అని తరువాత పేరు మారుస్తాం అన్నారు కానీ అదే పేరు కొనసాగించారు . ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కు ముందే దీపం పథకం కింద కొందరికి గ్యాస్ సిలిండర్ లు పంపిణీ చేశారు . గ్రామంలో ఒక కుటుంబానికి గ్యాస్ సిలిండర్ వస్తే ఆ వీధిలో పండుగ అన్నట్టు ఉండేది . ఎన్నికల నోటికికేషన్ వచ్చాక దీనిపై వి . హనుమంతరావు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో కమిషన్ నిర్ణయం మేరకు పంపిణీ నిలిపి వేశారు . నిజానికి హనుమంతరావు ఫిర్యాదు టీడీపీ నెత్తిన పాలు పోసినట్టు అయింది . రాష్ట్రంలో అందరికీ ఇచ్చే అన్ని సిలిండర్ లు లేవు . కాంగ్రెస్ ఫిర్యాదు వల్ల ఆపేశాం , ఎన్నికలు కాగానే ఇస్తాం అని బాబు ప్రకటించడం తో అప్పటికే కొందరికి ఇవ్వడం వల్ల జనంలో నమ్మకం ఏర్పడింది . వాజపేయి ఒక్క ఓటు సానుభూతి , దీపం ఈ రెండూ టీడీపీకి కొండంత అండగా నిలిచాయి **** నర్సాపూర్ , గజ్వేల్ ప్రాంతంలో మిత్రుడితో కలిసినప్పుడు మక్కా జొన్న కంకులు కాల్చి అమ్ముతున్న అమ్మాయి ఇదే మాట చెప్పింది . వాళ్ళ ఊరిలో ఎవరికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారో వారి పేర్లు చెప్పి , ఎన్నికల తరువాత మాక్కూడా వస్తుంది అందుకే ఈ సారి టీడీపీకే ఓటు వేస్తాం అని ఆ అమ్మాయి చెప్పింది . మిత్రుడు పవన్ , నేనూ అప్పుడే అనుకున్నాం దీపం పథకం టీడీపీకి వెలుగు నింపుతుంది అని . 99 ఎన్నికలే బాబు తెలంగాణలో విజయం సాధించిన చివరి ఎన్నికలు . ఆ తరువాత తెలంగాణలో రోజు రోజుకు చిక్కి శల్యం అయ్యారు . రాష్ట్ర విభజన తో పొరుగు రాష్ట్రం పార్టీ అయిపొయింది . లాల్ జాన్ బాషా మదిలో మెదిలిన ఈ దీపం పథకం పై బాబు ఇప్పుడే కాదు అప్పుడు కూడా బోలెడు కథలు చెప్పారు . చంద్రబాబు తల్లి పేరు అమ్మణ్ణమ్మ . 95 నుంచి రాష్ట్ర విభజన జరిగే వరకు ప్రతి రోజు టీడీపీ బీట్ రిపోర్టర్ లు బాబు ఇంటికి వెళ్లేవారు . ఒక్క రోజు కూడా వారి తల్లి ఇంటికి రాలేదు . సొంత గ్రామం లోనే ఉండేవారు . బాబు ఎన్నికల ప్రచారంలో దీపం పథకం పై బోలెడు ఆశలు పెట్టుకొని సెంటి మెంట్ తో అమ్మ కథ చేర్చారు . మా అమ్మ చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద వంట వండేది . పొగ వల్ల కంటి నుంచి నీళ్లు వచ్చేవి . ఏనాటికైనా మహిళకు ఇలాంటి కష్టాలు లేకుండా గ్యాస్ పథకం తేవాలి అని ఆ రోజే అనుకున్నాను అని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చేవారు . తల్లి కట్టెల పొయ్యితో కష్టపడుతుంటే ఏ పిల్లాడు అయినా సంపాదించి గ్యాస్ పొయ్యి తేవాలి అనుకుంటాడేమో కానీ రాజకీయాల్లోకి వస్తాను , సీఎం అవుతాను , దీపం పథకం తెస్తాను అని ఎవరైనా అనుకుంటారా ? - బుద్దా మురళి

3, మార్చి 2026, మంగళవారం

బాబు ను  భయపెట్టిన  ఇజ్రాయిల్: జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 125

 ఉమ్మడి రాష్ట్రం లో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం . అయన ఉపన్యాసం రొటీన్ గా సాగుతోంది . ఎన్నోసార్లు చెప్పిన విషయాలే చెబుతుండడం వల్ల పెద్దగా ఆసక్తి  కనిపించడం లేదు . కొత్త  విషయాలు లేవు .   చంద్రబాబు తన సొంత నియోజక వర్గంలో ఇజ్రాయిల్ టెక్నాలెజీ తో  వ్యవసాయం చేయడాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన రోజులు అవి . బాబు రొటీన్ ఉపన్యాసంలో తాను ఇజ్రాయిల్ పర్యటించనున్నట్టు చెప్పారు . అప్పటికే ఇజ్రాయిల్ టెక్నాలెజీ తో వ్యవసాయం సాగుతున్నందును అందరూ మామూలుగానే విన్నారు . అప్పుడు బీబీసీ  రేడియోకు ఉర్దూ రిపోర్టర్ గా ఉన్న ఉమర్ ఫరూఖ్ మీరు ఇజ్రాయిల్ ఎలా వెళతారు ? మన దేశం పాలస్తీనా కు అనుకూలంగా ఉంది . ఇజ్రాయిల్ ఎలా వెళతారు అని  ప్రశ్నించేసరికి బాబు ఖంగుతిన్నారు . పక్కనున్న అధికారులతో మెల్లగా మాట్లాడారు . వాళ్ళు ఏం చెప్పారో వినబడలేదు కానీ ఇజ్రాయిల్ వెళితే మైనారిటీ  ఓటర్లకు దూరం అవుతారు అనే భయం పట్టుకుంది . అధికారులతో కొద్ది సేపు మెల్లగా మాట్లాడిన తరువాత అటూ ఇటూ కాకుండా తన ఇజ్రాయిల్ పర్యటన లేదు అన్నట్టు సూచన ప్రాయంగా చెప్పారు .  **** అంతమంది ఉన్నప్పుడు ఇతరులకు వినపడకుండా బాబు ఎలా మాట్లాడారు అని సందేహం రావచ్చు . 95 ప్రాంతంలో టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా మాణిక్ రెడ్డి ఉండేవారు . మెదక్ జిల్లాకు చెందిన నాయకుడు .  జిల్లాలో పరిచయం కావడం వల్ల బాగా పరిచయం . బాబు ముఖ్యమంత్రి అయ్యాక రోజూ బాబు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యేవారు . ఆ సమయంలో బాబుకు ఫోన్ వస్తే మాట్లాడేవారు కానీ ఎదురుగా కూర్చున్న మాకు ఎవరితో మాట్లాడారు , ఏం మాట్లాడారు తెలిసేది కాదు .  కావాలి అంటే మీరు ఓసారి గమనించి చూడండి మీరు ఎదురుగా ఉన్నప్పడు ఎవరికైన ఫోన్ వస్తే ఎవరి నుంచి వచ్చింది , విషయం ఏమిటీ అనేది ఎంతో కొంత అర్థం అవుతుంది . కానీ బాబుకు కాల్ వస్తే కొన్ని వందల సార్లు అక్కడే ఉన్నాను ఎవరి నుంచి కాల్ వచ్చిందో , విషయం ఏమిటో అస్సలు అర్థం కాదు అని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు . అనుమానం ఉంటే ఓటుకు నోటు వీడియో చూడండి . కట్టేకొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది . ఎవరితో మాట్లాడాడు , ఏం మాట్లాడాడు అనేది అర్థం కాదు . మైకు ముందు గంటలతరబడి మాట్లాడే బాబు ఫోన్ లో మాత్రం చిక్కడు దొరకడు అన్నట్టు మాట్లాడుతారు . రాజకీయాల్లో ఉన్నప్పుడు అందులోనూ అధికారంలో ఉన్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త అవసరం .. ఈ రోజుల్లో   టెక్నాలెజీ మరీ పెరిగిపోయింది . అందరి బండారాలు బయటపెట్టే న్యూస్ ఛానల్స్ ఓనర్ల  గూడుపుఠాణి లే బయటపడుతున్న రోజులివి .  *** ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలం లో రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు కానీ పత్రికల్లో ఇందిరాగాంధీ - పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మెన్   యాసర్ అరాఫత్ ఫోటోలు , వారి వార్తలు ప్రముఖంగా వచ్చేవి . అరాఫత్  ఆజానుబావుడు అన్నట్టుగా ఉండేవారు . ప్రత్యేకమైన దుస్తులతో మీడియా ఫోటోలకు ప్రత్యేకంగా ఉండేవారు .  ఇజ్రాయిల్ , పాలస్తీనా వివాదం గురించి అప్పుడు తెలియదు కానీ ఇందిరాగాంధీ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేశ మీడియా అరాఫత్ కు ఎక్కువ  ప్రాధాన్యత ఇచ్చేది .   బాబు  హయాంలో అమెరికా అధ్యక్షుడు వస్తే మీడియాలో ఎంత ప్రాముఖ్యత లభించేదో అరాఫత్ కు అంత ప్రాముఖ్యత లభించేది . 1948లో ఇజ్రాయిల్ స్థాపనకు వ్యతిరేకంగా ఇండియా ఓటు వేసింది . 1992 వరకు ఇజ్రాయిల్ తో మనదేశం కనీసం పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకోలేదు . 92లో పివి నరసింహారావు హయాంలో  సంబంధాలు ఏర్పాటు చేసుకుంది . అప్పటివరకు ఇండియా పాలస్తీనాకు పూర్తి మద్దతుగా నిలిచింది . 1999లో  వాజపేయి హయాంలో సమావేశాలు జరిగాయి . నరేంద్ర మోడీ హయాంలో  ఇజ్రాయిల్ , ఇండియా మధ్య సంబంధాలు బాగా  బలపడ్డాయి . ఇజ్రాయిల్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ . ఇటీవల ఇజ్రాయిల్ పర్యటించి అక్కడి పార్లమెంట్ లో ప్రసంగించారు . ***ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం గురించి , మైనారిటీ ఓట్లపై పడే ప్రభావం వంటి అంశాలను ఏ మాత్రం తెలియక కేవలం ఆధునిక వ్యవసాయ పద్దతులను తెలుసుకోవడం కోసమే బాబు ఇజ్రాయిల్ వెళ్ళాలి అనుకున్నారు . అదే విషయం మీడియా సమావేశంలో చెప్పగానే ఉర్దూ బిబిసి విలేకరి ప్రశ్నతో ఆమ్మో ఇదేదో మెడకు చుట్టుకునేట్టుగా ఉందని ఇజ్రాయిల్ పర్యటన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు . ఇప్పుడు బాబు ఎన్ డి ఏ కూటమిలో ఉన్నారు . బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు . ఇజ్రాయిల్ వెళ్ళాలి అనే కోరికను మూడు దశాబ్దాల తరువాత తీర్చుకొనే అవకాశం లభించింది . యుద్ధం ముగిసిన  తరువాత భారత బృందం  ఇజ్రాయిల్ పర్యటించే అవకాశం లేకపోలేదు .  ఇండియా -  పాక్ ల మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో ఇరాన్ పాక్ కు అండగా నిలించింది .  ఇండియా పాలస్తీనాకు అండగా నిలిచినా , ఇజ్రాయిల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా 1948 లో ఇండియా ఓటు వేసినా పాక్ తో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయిల్ ఇండియాకు సహకరించింది .   ప్రపంచం లో ఎక్కడా ఆశ్రయం దొరకనప్పుడు శరణార్థులుగా వచ్చిన యూదులకు వందేళ్ల క్రితం ఇండియా ఆశ్రయం ఇవ్వడంతో వాళ్ళు ఇప్పటికీ ఇండియాను అభిమానిస్తారు .కాలం మారింది ఇప్పుడు ఎవరికైనా తమ దేశ ప్రయోజనాలు ముఖ్యం కావాలి . బుద్దా మురళి  

మబ్బులు చూసి కుండలో నీళ్లు పారబోసిన జర్నలిస్ట్ ల కథ

మబ్బులను చూసి కుండలో నీళ్లు పారబోయవద్దు అని మనకో జాతీయం ఉంది . అలా పారబోస్తే ఏమవుతుంది అంటే .. జర్నలిస్ట్ ల్లా అవుతుంది . జాతీయాలు జీవిత పాఠాల ఉంచి పుట్టాయి . మన బాధ భవిష్యత్తు తరానికి ఓ పాఠం కావచ్చు . *** ఎకరం 50 వేల రూపాయలు.. నువ్వు రెండు లక్షలు చెల్లిస్తే ఇప్పుడే నీకు నాలుగు ఎకరాల భూమి వస్తుంది . ఇప్పుడు రెండు లక్షలు చెల్లించి 20 ఏళ్ళ తరువాత తీసుకుంటే నీకో 200 గజాల స్థలం ఇస్తాను .. ఐతే ఇదిగో రెండు లక్షలు .. 20 ఏళ్ళు గడిచాయి . బాబూ ఇబ్బంయూదుల్లో ఉన్నాను .. అప్పు చేసి నీకు రెండు లక్షలు చెల్లించాను . నామీద దయ చూపించి 200 గజాల స్థలం ఇవ్వు ప్లీజ్ ... *** ఇలాంటి బేరం గురించి ఎప్పుడైనా విన్నారా ? అప్పటికప్పుడు నాలుగు ఎకరాల డబ్బు ఇచ్చి 20 ఏళ్ళ తరువాత 200 గజాల కోసం బతిమిలాడుకోవడం ఇదేం బేరం .. ఇది బేరం కాదు పిచ్చి అనుకుంటున్నారా ? అత్యంత దురదృష్టకరమైన బ్యాచ్ జర్నలిస్ట్ ల వాస్తవ వ్యధ ఇది . ఏ ఐ పుణ్యమా అని ఎలాంటి సమాచారం అయినా దొరుకుతుండడంతో ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ అని ప్రభుత్వం చెబుతున్న ప్రాంతాల్లో 2006 లో వ్యవసాయ భూముల ధరలు ఎలా ఉన్నాయి అని గ్రోక్ ను అడిగితే 50 వేలకు ఎకరం నుంచి రెండు లక్షలకు ఎకరంగా ఉండేవని చెప్పింది . వై ఎస్ ఆర్ హయాంలో జర్నలిస్ట్ ల హౌసింగ్ సొసైటీ ఏర్పడ్డాక ల్యాండ్ కోసం ఒక్కో జర్నలిస్ట్ రెండు లక్షలు చెల్లించారు . వైఎస్ మరణం , రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి లు సీఎంలు అయ్యారు . తెలంగాణ ఏర్పాటు కెసిఆర్ , రేవంత్ రెడ్డిలు సీఎంలు అయ్యారు . అనేక మలుపులు తిరిగి సుప్రీం కోర్ట్ జర్నలిస్ట్ లకు కేటాయించిన స్థలాల జీవోను కొట్టేసి డబ్బు తిరిగి చెల్లించమంది . గోడకు కొట్టిన సున్నం , ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు తిరిగి రావడం అంత ఈజీ కాదు . ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఉద్యోగులకు వణికి పోతుంది . వారం రోజుల జీతం ఆలస్యానికి ప్రభుత్వం మీద కక్ష కట్టి ఓడించిన చరిత్ర వారిది . అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి రెండేళ్లు అవుతున్నా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేదు . కోర్ట్ కు వెళ్లిన వారికి చెల్లించామని తీర్పులు వచ్చినా అమలు చేసే స్థితి లేదు . అలాంటిది అడిగేవాడు దిక్కులేని జర్నలిస్ట్ ల డబ్బులు తిరిగి రావు . ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఫ్యూచర్ సిటీలో జర్నలిస్ట్ లకు ల్యాండ్ ఇస్తారు అని ఓ ప్రచారం . అంటే జర్నలిస్ట్ లు చెల్లించిన డబ్బుకు ఆ రోజుల్లో నాలుగు ఎకరాలు వస్తే , ఇప్పుడు అదే చోట రెండు వందల గజాల కోసం చకోర పక్షిలా ఎదురు చూడాలి . సుప్రీం తీర్పు తరువాత కూడా కొందరు ఇంకా పాత స్థలాల మీద ఆశ వదులుకోలేక పోతున్నారు . అలా అని వీరిని తప్పు పట్టలేం . అప్పడు తెచ్చి డబ్బు కట్టి 20 ఏళ్లపాటు ఆశగా ఎదురు చూసి రోజూ వాటి గురించే కలలు , కంటూ స్థలం వచ్చాక కట్టే ఇంటిని ముందు కలల్లోనే కట్టుకోవడం వల్ల స్థలాలు రావు అనేదానిని జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు . రెండు దశాబ్దాల క్రితమే పరిస్థితి ఉహించి ఆంధ్ర మిత్రులు కొందరు తాము కట్టిన రెండు లక్షలు వెనక్కి తీసుకొని ఆంధ్రలో ప్లాట్స్ కొన్నారు . 2006లో భువనగిరి లో రెండు లక్షలకు రెండు ఎకరాలు వచ్చేవి . మిత్రుడు అయోధ్యరెడ్డి అదే సమయంలో తుర్కపల్లిలో జర్నలిస్ట్ మిత్రులకు తుర్కపల్లిలో మెయిన్ రోడ్ లో 80 వేలకు ఎకరం భూములు చూపించాడు . వాటి ధర ఇప్పుడు రెండు కోట్ల వరకు పలుకుతుంది . జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆశల్లో మునిగిపోయి అటు వైపు ఎవరూ ఆసక్తి చూపలేదు . నాలుగు ఎకరాలు అమ్మి సొసైటీకి రెండు లక్షలు కట్టాను , ఇప్పుడు నేను అమ్మిన భూమి 60 లక్షలకు ఎకరం అయింది . ఊర్లో , అన్నదమ్ముల ముందు నా పరువు పోయింది అని ఓ జర్నలిస్ట్ మంత్రి పొంగులేటి ముందు తన పరిస్థితి చెప్పుకున్నారు . తప్పు మీదంటే మీది అని ఒక్కరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు . తప్పు పరిస్థితులదే తప్ప వ్యక్తులది కాదు . జాతిరత్నాలు సినిమాలో సెంట్రల్ జైలులో వెన్నెల కిషోర్ బెస్ట్ బ్యాచ్ అంటే మనదే అని పొంగిపోతాడు . తెలుగునాట జర్నలిజం చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన బ్యాచ్ అంటే ఇదే . 20 ఏళ్ళ క్రితం నాలుగు ఎకరాల విలువైన డబ్బు చెల్లించి 20 ఏళ్ళ తరువాత కూడా 200 గజాల కోసం ఆశగా ఎదురు చూడడానికి మించిన దురదృష్టకరమైన బ్యాచ్ ఉంటుందా ? మంచి జీతాలు చెల్లించే మీడియా సంస్థల వారి పరిస్థితి వేరు జీతాలు కూడా సరిగా ఇవ్వని సంస్థల జర్నలిస్ట్ లు అప్పు తెచ్చి రోడ్డున పడ్డారు . - బుద్దా మురళి

22, ఫిబ్రవరి 2026, ఆదివారం

ఖరీదైన గాంధీ విగ్రహాల జ్ఞాపకాలు ...

జర్నలిస్ట్ జ్ఞాపకాలు -124 దాదాపు పాతికేళ్ల క్రితం ... అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి .. లాబీ లో కనిపించిన వారందరితో మాట్లాడుతూ ముందుకు వెళుతుంటే గోడ మీద కొత్తగా తగిలించిన మహాత్మ్యా గాంధీ నెహ్రూ ల ఫోటో ఫ్రెమ్ వేలాడుతుండడం కనిపించింది ... అంతకు ముందు లేదు ... కొత్తగా పెట్టారు . అప్పుడు ఏదో ఛానల్ ( జెమినీ లేదా సిటీ కేబుల్ ) రిపోర్టర్ భూమేష్ గాంధీజీ నెహ్రూల ఫోటో ఫ్రెమ్ చూస్తూ బాగుంది కాదన్న .. ఎన్ని వేల బిల్ వేశారో అనగానే నవ్వు ఆగలేదు ... అలాంటి ఫ్రెమ్ సాధారణంగా ఓ రెండు వందలకు అమ్ముతారు ... ప్రభుత్వ వ్యవహారం కాబట్టి ఓ వెయ్యి వరకు పరవాలేదు ... ఎన్ని వేల బిల్ వేశారో అనడానికి వెనుక ఓ విగ్రహ వ్యవహారం ఉంది . అప్పుడు యనమల రామకృష్ణుడు స్పీకర్ అసెంబ్లీ ఆవరణలో మహాత్మగాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి అని ప్రయత్నం ... దీనికి 65 లక్షల వ్యయం . పాతికేళ్ల క్రితం 65 లక్షలు అంటే పెద్ద మొత్తమే . విగ్రహం ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించ లేదు కానీ ఖర్చు విషయం పై విమర్శలు వచ్చాయి . సగం దుస్తులు ధరించిన మహాత్ముని విగ్రహానికే 65 లక్షల ఖర్చు అంటే పూర్తి దుస్తులు ధరించి ఉంటే ఎంత ఖర్చు చేసేవారో అని జోకులు వేసుకోవడం తప్ప ఖర్చుపై నిలదీయలేని పరిస్థితి ... ప్రతిభా భారతి స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీ లో టెలిఫోన్ వైరింగ్ కాంట్రాక్ట్ పై ఆరోపణలు మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి ... సాధారణంగా అసెంబ్లీ వ్యయం పై ఎవరూ నోరు మెదపరు .... తెలిసినా మౌనంగా ఉండాల్సిందే ... రామోజీ రావు లాంటి వారు అసెంబ్లీ ని కూడా ఎదిరించి అరెస్ట్ ను తప్పించుకుంటారు కానీ సాధారణ జర్నలిస్ట్ కు సాధ్యం కాదు ... యాజమాన్యాలు సహకరించవు ... రామోజీనే యజమాని కాబట్టి తన అరెస్ట్ కు అసెంబ్లీ ఆదేశించినా అరెస్ట్ కాలేదు ... సాధారణ జర్నలిస్ట్ అయితే ఉద్యోగం ఊడబెరుకుతారు .. అందుకే అక్కడి వ్యవహారాలు ఆ భవనం లోనే భూస్థాపితం అవుతాయి ... చివరకు 65 లక్షల వ్యయంతో అసెంబ్లీ ఆవరణలో మహాత్ముని విగ్రహాన్ని ప్రతిష్టించారు .. 65 లక్షల్లో శిల్పికి ఎంత ఇచ్చారో ? శిల్పానికి ఎంతో , ఎవరికి ఎంతో తెలియదు ... ప్రజాస్వామ్యానికి , స్వేచ్ఛకు ప్రతీక అంటూ ఆవిష్కరించిన మహాత్ముని విగ్రహం వద్దకు వెళ్లకుండా గొలుసులతో బంధించిన రోజులు చాలానే ఉన్నాయి ... టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ , కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వల్ల అసెంబ్లీ ఆవరణ లోని ఈ విగ్రహం వద్ద శాసన సభ్యులు ధర్నాకు కూర్చుంటున్నారని అటు వెళ్లకుండా గొలుసులతో అడ్డుకట్ట వేశారు ... పాతికేళ్ల తరువాత హైదరాబాద్ లో మరో భారీ గాంధీజీ విగ్రహానికి శ్రీకారం చుట్టారు ... బాపూఘాట్ వద్ద ఐదు వేల కోట్ల ఖర్చుతో గాంధీజీ విగ్రహం నిర్మిస్తారట .. పాతికేళ్ల క్రితం 65 లక్షలు అన్నప్పుడు ఇప్పుడు విగ్రహానికి ఐదు వేల కోట్లు సముచితమే ... తెలంగాణ ఆదాయం పెరిగింది . ధరలూ పెరిగాయి ... మున్సిపల్ వార్డు మెంబర్ కే కోటి రూపాయల ధర పలుకుతున్న రోజులు ఇవి . రాజకీయాలు చాలా ఖరీదైన భారీ పెట్టుబడితో కూడిన వ్యాపారం . ఐదు వేల కోట్ల విగ్రహం సరైన ధరనే ... పలానా నాయకుడు రాజకీయాల్లో విచ్చల విడిగా ఖర్చు చేశాడు అని మీడియా విమర్శించేది . మా అభిమాన నాయకుడు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికారం లోకి వచ్చాడు ... హై కమాండ్ ఇంచార్జ్ ల పెత్తనం ఏమిటీ ? పూర్తి అధికారం ఇవ్వండి అని నిస్సిగ్గుగా రాస్తున్న దమ్మున్న మీడియా ఉన్న కాలం ఇది . విగ్రహానికి ఐదు వేల కోట్ల ఖర్చు సముచితమే ... ధర విషయంలో అభ్యన్తరం లేదు కానీ అపార్ట్ మెంట్ లను కూల్చేసి 450 మంది కుటుంబాలను రోడ్డు పాలు చేయడమే నచ్చడం లేదు . వెయ్యి కోట్ల పెట్టుబడి తిరిగి లాభంతో రాబట్టుకోవలసిందే కానీ సామాన్య కుటుంబాలను రోడ్డు పాలు చేయడమే నచ్చలేదు ... బాపు ఘాట్ ఐదు వేల కోట్ల విగ్రహం తో అసెంబ్లీ విగ్రహం వ్యవహారం గుర్తుకు వచ్చింది .. ఇదిగో బాధితులు మీ సంగతి మీరు చూసుకోండి ..వెయ్యి కోట్ల పెట్టుబడికి తగిన గిట్టుబాటు రాలేదు అని బాధపడుతున్న మీడియాకు మీ గోడు పట్టదు ... విగ్రహ నిర్మాణాన్ని ఆపుతారా ఉద్యమాలకు భయపడే రకం కాదు .. ఎన్టీఆర్ భారీ విగ్రహం పెడతాం ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం అని సవాల్ విసిరారు కూడా .... గాంధీజీ విగ్రహానికి బలవుతున్న అపార్ట్ మెంట్ లు యేవో తెలిసిందే ... ఎన్టీఆర్ విగ్రహానికి ఏ కాలనీ బలి కానుందో ... - బుద్దా మురళి

28, మే 2025, బుధవారం

చిన్నప్పటి జ్ఞాపకం హైదరాబాద్ లో భారత్ -పాక్ యుద్ధ జ్ఞాపకం

ఇటీవల భారత్ - పాక్ యుద్ధ సమయంలో ట్యాంక్ బండ్ ను ఏ మీడియా అయినా గుర్తు చేస్తుందేమో అని చూశా . 1971లో జరిగిన ఇండియా పాక్ వార్ లో పాకిస్థాన్ ను జయించి మన సైన్యం స్వాధీనం చేసుకున్న యుద్ధ ట్యాంక్ ఒకటి హుసేన్ సాగర్ కట్ట మీద పాక్ మీద మన సైన్యం సాధించిన విజయానికి చిహ్నం గా నిలిచి ఉంది . ట్యాంక్ బండ్ , వినాయక్ సాగర్ , హుసేన్ సాగర్ పేర్లు ఎన్నయినా అదో అద్భుత మైన ప్రాంతం . వందల ఏళ్ళు అయినా చెక్కుచెదరని నిర్మాణం అని కాదు . ట్యాంక్ బండ్ ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తుంది . అద్భుతం అనిపిస్తుంది . దాదాపు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు చాలా మంది హుసేన్ సాగర్ కట్ట మీదికి వెళుతుంటే నేనూ వెళ్ళాను . హుసేన్ సాగర్ కట్ట మీద ట్యాంక్ ఏర్పాటు చేశారు ,. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని ట్యాంక్ బండ్ గా పాపులర్ అయింది . ట్యాంక్ అంటే యుద్ధ రంగంలో ఉపయోగించే వాహనం . ఇక్కడ నిజంగానే యుద్ధంలో ఉపయోగించే ట్యాంక్ ను ఏర్పాటు చేశారు . దాని పేరు మీదనే ట్యాంక్ బండ్ గా
పాపులర్ . 1971లో ఇండియా పాకిస్థాన్ ల మధ్య జరిగిన యుద్ధంలో ఇండియా పాక్ ను చిత్తుగా ఓడించి బంగ్లా దేశ్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయగలిగింది . ఆ యుద్ధంలో భారత సైన్యం పాకిస్థాన్ లోకి చొచ్చుకు వెళ్లి 66 యుద్ధ ట్యాంక్ లను స్వాధీనం చేసుకుంది . అందులో ఒక ట్యాంక్ ను హుసేన్ సాగర్ కట్ట మీద 1973లో ఏర్పాటు చేశారు . సికింద్రాబాద్ వైపు నుంచి హుసేన్ సాగర్ కు వస్తుంటే కట్ట మొదట్లోనే కుడి వైపు ఈ యుద్ధ ట్యాంక్ ఉంటుంది . ఆ ట్యాంక్ ఏర్పాటు సమయం లో అక్కడికి సమీపంలోనే ఉన్న కవాడిగూడలో ఉండేవాళ్ళం . ట్యాంక్ ఎదురుగా వైస్ రాయ్ హోటల్ . దానికి వెనుక వైపు చిన్న దారి గుండా వెళితే కవాడిగూడ . మహా అయితే వెయ్యి అడుగుల దూరం కావడం వల్ల ఆ ట్యాంక్ ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి చూశాను . చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చి ట్యాంక్ ను చూసేవాళ్ళు . పిల్లలకు అదో జాతరలా ఉండేది . ఇప్పటిలా సెల్ ఫోన్ కెమెరాలు లేవు కానీ కొద్ది మంది ట్యాంక్ లోపల కూర్చొని కెమెరాలతో ఫోటోలు దిగేవారు . హుసేన్ సాగర్ పై మొత్తం సందడి ఇక్కడే ఉండేది . కొద్ది కాలం తరువాత రోటరీ క్లబ్ వాళ్ళు అక్కడ ఒక పార్క్ నిర్మించారు . ఆ పార్క్ లో ఒక పెద్ద అక్వేరియం భవనం కూడా నిర్మించారు . కాలం గడిచిన టి అంజయ్య బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ చేపట్టారు . ముందు నెక్లెస్ రోడ్ , ఎన్టీఆర్ మరణం తరువాత ఎన్టీఆర్ ఘాట్ నిర్మాణంతో ట్యాంక్ ఉన్న ఇటు వైపు ఎవరూ పట్టించుకోలేదు . పార్క్ పాడుపడింది . చెబితే తప్ప ఇది అక్వేరియం అంటే నమ్మని విధంగా మారింది . 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత మరోసారి పార్క్ కళకళ లాడింది . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ట్యాంక్ బండ్ పై ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు . ఆ సందర్భంలో ఈ పార్క్ ను కూడా పట్టించుకున్నారు . వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారని బీజేపీ అనుకూల వర్గాలు హుసేన్ సాగర్ పేరును వినాయక సాగర్ అని పెట్టినా జనం లో మాత్రం ట్యాంక్ బండ్ అనే పాపులర్ . దాదాపు 1980 వరకు కూడా హుసేన్ సాగర్ నీళ్లు ఇప్పటి అంత ప్రమాదకరమైనవి , విషపూరితమైనవి కావు . స్థానికులు ఈత కొట్టేవాళ్ళు . నాకు ఈత రాదు కానీ బాల్యంలో పెద్ద వాళ్ళతో కలిసి వెళ్లిన జ్ఞాపకాలు ఉన్నాయి . హోలీ రోజు రంగుల్లో మునిగిన వారు ఇక్కడ స్నానం చేసేవారు . బతుకమ్మ పండుగకు చుట్టుపక్కల ప్రాంతాల వారు బతుకమ్మ ఆడి ఇక్కడే బతుకమ్మ ను నీళ్లలో వదిలి ప్రసాదం పంచేవాళ్ళు . దాదాపు 1980 తరువాత పరిస్థితి తెలియకుండానే మారిపోయింది . బతుకమ్మ పండుగ కనిపించకుండా పోయింది . తరువాత క్రమంగా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కలిసి పోయి హుసేన్ సాగర్ నీళ్లు విషపూరితంగా మారాయి . ఆ తరువాత ఇక్కడ వినాయక నిమజ్జనం హడావుడి తప్ప యుద్ధ ట్యాంక్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో సందడి లేకుండా పోయింది . తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్ నగరంలో మళ్ళీ బతుకమ్మ పండుగ కళ కనిపించింది . సంస్కృతి , పండుగలు అనేవి ఒక తరం నుంచి మరో తరానికి అలవాటు అవుతుంది . మధ్యలో ఒక తరం తప్పుకుంటే ఇక అంతే . బతుకమ్మ పండుగ ఒకటి కాదు రెండు మూడు తారలు తప్పుకున్నాయి . తెలంగాణ ఉద్యమం వల్ల హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై మళ్ళీ కనిపించింది . చిన్నప్పుడు మొదటి సారి సినిమా షూటింగ్ చూసింది ట్యాంక్ బండ్ పైనే హిందీ సినిమా బహుశా కోరా కాగజ్ కావచ్చు . హీరో పెద్ద కారులో వెళుతుంటాడు . హీరోయిన్ ఆకు కూరలు తీసుకోని వెళుతుంటుంది . కారు తాకి కూరగాయల సంచి పడిపోతుంది . చిన్న సీన్ కు అంత సమయమా అనిపించింది . ఎన్టీఆర్ హయాంలో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేశారు . కెసిఆర్ హయాంలో భారీ అంబెడ్కర్ విగ్రహం , అంతా వీరుల స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు . 1971లో ఇండియా పాకిస్థాన్ పై విజయం సాధించిన దానికి గుర్తుగా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుతారు . కనీసం ఆ రోజైనా ఈ యుద్ధ ట్యాంక్ వద్ద విజయ్ దివస్ నిర్వహించరు . బుద్దా మురళి

14, మార్చి 2025, శుక్రవారం

జిందగీమే కుచ్ భీ హోసక్తా ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -118

జిందగీమే కుచ్ భీ హోసక్తా ... . జర్నలిస్ట్ జ్ఞాపకాలు -118 హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ప్రోగ్రాం ఒకటి జిందగీమే కుచ్ బీ హో సక్తా .. మంచి ఆసక్తికరమైన ప్రోగ్రాం . ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి సినిమా రంగంలో ఎదిగిన వారి జీవిత విశేషాలను పరిచయం చేసే కార్యక్రమం . జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు . జీవితంలో ఏదైనా జరగవచ్చు . ఆశను వదులుకోకుండా ప్రయత్నిస్తే ఏదైనా జరగవచ్చు అని చెప్పే ప్రోగ్రాం . *** *** ***** 2017 లో ఆర్ టీ ఐ కార్యాలయం.. మధ్యాన్న సమయం ఏదో పనిలో ఉండగా ఆఫీస్ బాయ్ వచ్చి ఒక విజిటింగ్ కార్డు అందించాడు . ఇద్దరు రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారులు . షఫీ కుజ్జ మా తో పాటు మరో అధికారి . ఐఏఎస్ గా రిటైర్ అయ్యాక న్యాయవాదులుగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు . ఆర్ టి ఐ కేసు విషయంలో ఆర్ టి ఐ కమిషనర్ గా నన్ను కలవడానికి వచ్చారు . తెలంగాణ యూనివర్సిటీ లో తమ క్లయింట్ కేసు ఉందని , కేసు త్వరగా వస్తే న్యాయం జరుగుతుంది అని చెబుతుంటే .. వాళ్ళిచ్చిన విజిటింగ్ కార్డు ను అలా చూస్తూ ఆలోచనల్లో పడిపోయి .. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను . **** ***** డిగ్రీ పూర్తి కాగానే 1987 సెప్టెంబర్ లో మెదక్ జిల్లా ఆంధ్రభూమి రిపోర్టర్ గా సంగారెడ్డికి వెళ్ళాను . ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన లెటర్ తీసుకోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాను . అప్పుడు కలెక్టర్ షఫీ కుజ్జ మా... ఆంధ్రభూమికి కొత్తగా వచ్చాను అని లెటర్ ఇచ్చి పరిచయం చేసుకున్నాను . అంతకు ముందు జిల్లా మంత్రి కరణం రామచంద్ర రావు కు డిపి ఆర్ ఓ భూమికి కొత్త అని పరిచయం చేస్తే ఆయన ఏ మూడ్ లో ఉన్నారో భూమికి కొత్తా ? భూమికే కొత్తనా ? అని జోక్ వేశారు . 87 నుంచి బాబు సీఎం అయ్యాక అసెంబ్లీలో నే కరణం మాట్లాడుతూ మాట్లాడుతూనే అస్వస్థతకు గురై మరణించేవరకు అనేక సార్లు కరణం ఉపన్యాసాలు విన్నాను ఒక్క సారి కూడా జోక్ వేయగా వినలేదు . కలెక్టర్ మాత్రం ఎలాంటి జోక్ వేయకుండా కాసేపు మాట్లాడి పంపించేశారు . **** ***** తరువాత హైదరాబాద్ వచ్చాక ఓ రోజు అనుకోకుండా 1996 ప్రాంతంలో షఫీ కుజ్జ మా డ్రామా న్యూస్ కవర్ చేయాల్సి వచ్చింది . జూబ్లీ హల్ లో సీఎం చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మీడియా మొత్తం వచ్చింది . మద్యనిషేధాన్ని ఎత్తి వేయడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయం అది . ఇంకా మీటింగ్ పూర్తి కానందు వల్ల బాబు కోసం మీడియా ఎదురు చూస్తుంటే అంత పెద్ద సంఖ్యలో ఉన్న మీడియా వద్దకు షఫీ కుజ్జ మా కొన్ని కాగితాలు చదువుతూ రాష్ట్రంలో మద్యనిషేధం ఎంత ఘోరంగా విఫలం అయిందో చెబుతున్నారు . కల్తీ మద్యం తో ఎంత మంది మరణించారు . ఎన్ని అక్రమ మద్యం కేసులు , మద్యనిషేధం ఎత్తివేయక పోతే ఎంత ప్రమాదకరమో వివరించే విధంగా ఆ గణాంకాలు ఉన్నాయి . చెప్పాల్సింది అంతా ఆయన చెప్పి వెళ్లి పోయాక . కొద్ది సేపటికి సీఎం చంద్రబాబు వచ్చారు . హష్మీ అని ఉర్దూ రిపోర్టర్ బాబు రాగానే మద్యనిషేధం ఘోరంగా విఫలమైంది ? అంటూ ఆ అధికారి చెప్పిన అంకెలు చెప్పుకొచ్చాడు . నిజామా ? అని చంద్రబాబు బోలెడు ఆశ్చర్య పోయాడు. . మా అల్లుడు నా కన్నా గొప్ప నటుడు అని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ఉరికే అనలేదు . **** కేసు త్వరగా వస్తే మా క్లయింట్ విద్యా సంవత్సరం కాపాడినవారు అవుతారు . కమిషన్ నుంచి నోటిస్ వస్తే చాలు పని అయిపోతుంది అని షఫీ కుజ్జ మా అడగగానే ప్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చి పీఎస్ ను పిలిచి వీరి కేసు వెంటనే రావాలి అని చెప్పాను . షఫీ కుజ్జ మా ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోతుంటే 1987 నాటి నా పరిచయం గుర్తు చేసి .. 96లో మద్యనిషేధం విఫలం అంటూ మీరు చదివి వినిపించిన ఆ అంకెలు అన్నీ బాబు ఆదేశంతోనే కదా ? అని అడగాలి అని నోటి వరకు వచ్చినా అడగకుండా ఉండిపోయాను . ఏ పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్రకే పరిమితం కావడమే మంచి సంప్రదాయం అనిపించి మౌనంగానే ఉండి పోయాను . ఐఏఎస్ అధికారులు ఎంత పరిచయం ఉన్నా కొన్ని విషయాలు ముఖాముఖిలో కూడా పంచుకోరు . అలాంటిది బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ అని మీడియా వస్తే బాబుకు సంబంధం లేకుండా ఎక్సయిజ్ కమిషనర్ వచ్చి మద్యనిషేధం ఎలా విఫలం అయిందో చెబుతారా ? తెలిసిన విషయం అడగడం ఎందుకు అని అడగలేదు సాంప్రదాయ ముస్లిం జీవనం గడిపే అతనికి ఎక్సయిజ్ శాఖ అస్సలు ఇష్టం లేదు అని విన్నాను . 1987 లో రిపోర్టర్ గా అతనికి నన్ను నేను పరిచయం చేసుకుంటే ... సరిగ్గా మూడు దశాబ్దాలు గడిచిన తరువాత ఆర్ టీ ఐ కమిషనర్ గా ఉన్న నన్ను న్యాయవాదిగా అతను పరిచయం చేసుకోవడం ఏదో సినిమా కథలా అనిపించింది ... **** హిందూ చీఫ్ రిపోర్టర్ వర్లు ఒక సారి సి సి ఎల్ఏ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లారు . కమిషనర్ కార్యాలయంలోకి వెళ్ళగానే కమిషనర్ వర్లు ను చూసి సార్ మీరు వచ్చారా ? అని లేచి నిలబడి స్వాగతం పలికారు .. ఆ రోజుల్లో మీడియాకు ఇంత గౌరవం ఉండేది అని ముందుగానే నిరయానికి వచ్చేయకండి . కమిషనర్ లేచి నిలబడి స్వాగతమ్ పలికింది నిజమే . కానీ కారణం వేరు . హిందూ లో వర్లు చీఫ్ రిపోర్టర్ గా ఉన్నప్పుడు అతని బ్యూరోలో ఒక రిపోర్టర్ గా సి సి ఎల్ ఏ కమిషనర్ ఉన్నారు . ఎప్పుడు ఉద్యోగం వదిలి , ఎప్పుడు సివిల్స్ కు ఎంపిక అయ్యారో పెద్దగా దృష్టి పెట్టలేదు . తన బ్యూరోలో రిపోర్టర్ వద్దకు తానే ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లడం ఒక అరుదైన అనుభవం . డక్కన్ క్రానికల్ లో అయేషా అని అమ్మాయి క్రైం రిపోర్టర్ . క్రైం రిపోర్టర్ లు ఎక్కువగా పోలీసులు ఇచ్చిన సమాచారం పై ఆధారపడాలి . ఈ అమ్మాయి మాత్రం రోజూ మార్చురీకి వెళ్లి సమాచారం సేకరించేది . అయినా ఎడిటర్ జయంతి వేధిస్తోంది అని బాధపడేది . ఆ వేధింపులు తట్టుకోలేక డక్కన్ క్రానికల్ కు రాజీనామా చేసి ఉర్దూ పేపర్ లో చేరింది . ఆర్ టీ ఐ కమిషనర్ గా ఓ రోజు కేసులు చూస్తుంటే ఓ అధికారి మా కలెక్టర్ స్ట్రిక్ట్ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం అని కలెక్టర్ పేరు చెప్పగానే సంతోషం వేసింది . ఆయెషా గ్రూప్ వన్ కు సెలక్ట్ అయింది అని తెలుసు చిన్న జిల్లాలు ఏర్పాటు చేసిన సమయంలో ఆయెషా ను జిల్లా కలెక్టర్ గా నియమించారు . ఓపిక తో ఉండి తమ నైపుణ్యాలు పెంచుకుంటూ పోతే అవకాశాలు అవే వస్తాయి అని చాలా మంది నిరూపించారు . **** ఐతే జర్నలిజం లోకి రమ్మంటావా ? అని ప్రశ్నిస్తే వద్దే వద్దు అంటాను . ఆర్థిక సంస్కరణల తరువాత అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి . అదే సమయంలో అంతే స్పీడ్ గా మీడియా రంగంలో అవకాశాలు తగ్గిపోయాయి . తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో అవకాశాలు చాలా వేగంగా పడిపోయాయి . పైగా ఇప్పుడు అంతా రాజకీయ పార్టీల మీడియానే . స్వతంత్ర మీడియా అని చెప్పుకొనేది కూడా అటు రైట్ వైపో ఇటు లెఫ్ట్ వైపో స్వతంత్రంగా పని చేస్తున్నావే . 99 లో టీడీపీ స్వతంత్రులకు టికెట్లు , మంత్రి వర్గంలో స్థానం కల్పించింది . ఒక పార్టీ తరపున పోటీ చేశాక తటస్తులు ఏమిటో ? ఇప్పుడు మీడియా కూడా అలాంటి తటస్తమే . ఎడిటర్ లను , పత్రికలో వార్తలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది . లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మొదలుకొని , వెయ్యి లోపు సబ్ స్కైబర్స్ ఉన్న యూ ట్యూబ్ వరకు ఏదో ఒక పార్టీ కోసం పని చేస్తోంది . పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి మధ్యలో మీడియాలోకి వస్తే వేరు కానీ దీనిని ఉపాధిగా భావించి వస్తే దిన దిన గండం ఆరు నెలల ఆయుష్యు అన్నట్టు ఉంటుంది . వెజ్ బోర్డు సిఫారసులు ఉంటాయి .అమలు చేస్తే దాదాపుగా గ్రూప్ వన్ అధికారులకు లభించే స్థాయిలో వేతనాలు ఉంటాయి . ఒక్క ఆంధ్రభూమి తప్ప మరే మీడియా సంస్థ వీటిని అమలు చేయలేదు . - బుద్దా మురళి (జర్నలిస్ట్ జ్ఞాపకాలు 118 )

21, డిసెంబర్ 2024, శనివారం

ఎడిటర్ కు నిజం చెబితే ఉద్యోగం ఊడుతుంది .. ఒక్క రోజు అందరూ నిజమే చెబితే ప్రపంచం తలక్రిందులు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -117

ఎడిటర్ కు నిజం చెబితే ఉద్యోగం ఊడుతుంది .. ఒక్క రోజు అందరూ నిజమే చెబితే ప్రపంచం తలక్రిందులు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -117 ఒక్క రోజు మనుషులు అందరూ నిజం మాత్రమే మాట్లాడితే.. మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాస్క్ లేకుండా , కల్తీ లేకుండా మాట్లాడితే ప్రపంచం తలక్రిందులు అవుతుంది . ఒక్కరికి ఒక్క మిత్రుడు మిగలడు . భార్యా భర్తలు విడిపోతారు . కుటుంబ బంధం నిలవదు ఓషో ఉపన్యాసం లో ఈ మాట విన్నప్పుడు ఒప్పుకోవడానికి మనసు అంగీకరించలేదు కానీ అక్షర సత్యం అనిపించింది . లోకం అబద్దం మీదనే బతుకుతుంది దాన్ని అలానే బతకనివ్వు నిజం చెప్పకు అని నిషే చెప్పింది నిజం . ఆంధ్ర భూమిలో పని చేస్తుండగా అప్పటికి ఓషో చెప్పిన ఈ మాట గురించి తెలియక పోయినా నాయకుల గురించి , మనుషుల గురించి , బాస్ ల గురించి అవగాహన ఉండడం వల్ల నిజం చెప్పాలి అనే జబ్బు బారిన పడకుండా ఉద్యోగం కాపాడుకున్నాను . ఈ మధ్య ఒక ఆసక్తి కరమైన వార్త చూశా ఇంటింటికి తిరిగి క్షవరం చేసే ఎస్ మేడం అనే కార్పొరేట్ కంపెనీ తమ ఉద్యోగుల పని తీరుపై ఒక సర్వే జరిపింది . మీరు ఒత్తిడికి గురవుతున్నారా ? అనేది ఆ సర్వేలో ఓ ప్రశ్న . చాలా మంది ఉద్యోగులకు జీవితానుభవం లేక ఔను మేం విధి నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాం అని రాశారు . అది చదివిన యాజమాన్యం నిజాయితీగా మీ అభిప్రాయం చెప్పినందుకు అభినందనలు . మీ అభిప్రాయాన్ని మేం పరిశీలిస్తున్నాం అని చెబుతూనే ఒత్తిడికి గురి అవుతున్నాం అని సర్వేలో రాసిన దాదాపు వందమంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తీసేశారు . నిజం చెబితే బహుమతి లభించడానికి అదేమీ ప్రాథమిక పాఠశాల కాదు , వాళ్ళేమీ స్టూడెంట్స్ కాదు . అడిగింది టీచర్ కాదు . నెల నెల జీతం ఇచ్చే కార్పొరేట్ కంపెనీ . అడిగిన విషయం పై అభిప్రాయం చెప్పేప్పుడు అడిగింది ఎవరు ? ఏ ఉద్దేశం తో అడుగుతున్నారు ? నిజం చెబితే ఏమవుతుంది అని గ్రహించాలి . అలా గ్రహించకుండా నిజాలు చెబితే సత్యహరిచంద్రునిలా చరిత్రలో నిలిచి పోతామని కలలు కనొద్దు . నిజం చెబితే రోడ్డున పడే ప్రమాదం ఉందని గ్రహించాలి . *** ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు అసెంబ్లీ బిల్డింగ్ ఆవరణలో పిచ్చాపాటి మాట్లాడుతూ ఓషో చెప్పిన ఈ మాట ప్రస్తావించి మనం సరదాగా ఓ గంట పూర్తిగా నిజాలే మాట్లాడుకుందాం అని ప్రతిపాదించా . మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి అనుకోని మాటలు మొదలు పెట్టి మూడు నాలుగు నిమిషాలకు మించి మాట్లాడలేక పోయాం . .. .. ****** ఓ రోజు ఆంధ్రభూమిలో ఎడిటర్ రిపోర్టర్ లను అందరినీ పిలిచి ఆఫీస్ గురించి , పని తీరు మీ తోటి వాళ్ళు అందరి పని తీరుపై బాగా ఆలోచించి నిజాయితీగా రాసి కవర్ లో పెట్టి ఇవ్వండి . ఒకరు రాసింది ఒకరు చదవరు కాబట్టి మనసులో ఉన్నది ఉన్నట్టు రాయండి . రెండు రోజుల్లో రాసి కవర్ లో పెట్టి ఇవ్వండి అని పరీక్ష పెట్టాడు . అప్పుడు మనసులో ఏమనుకున్నానో రాయడం బాగోదు కానీ నవ్వుకున్నాను . మీటింగ్ కాగానే బృందాలుగా హోటల్ కు వెళ్ళాం . మనసులో ఉన్నది ఉన్నట్టు ఎడిటర్ రాయమన్నారు కదా అని రాస్తే ఉద్యోగాలు ఉడుతాయి . జాగ్రత్త . ఇక్కడ ఉన్న లోపాలు అందరికీ తెలిసినవే అందరూ నటిస్తున్నారు . యాజమాన్యం కే లేని దురద మనకెందుకు ? మనం సేఫ్ గేమ్ ఆడుదాం అని అందరికన్నా ముందు నేనే ఒక బృందానికి ఉచిత సలహా ఇచ్చాను . **** ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటిలా వాట్స్ ఆప్ జర్నలిజం కాదు మంత్రి వర్గ సమావేశం జరిగితే లోపల ఏం చర్చ జరిగిందో తెలుసుకోవడానికి కనీసం పది మంది మంత్రులను విడివిడిగా కలవాల్సి వచ్చేది . అలా కలుస్తూ అప్పుడు మంత్రిగా ఉన్న నిమ్మల కిష్టప్ప వద్దకు నేనూ మరో జర్నలిస్ట్ వెళ్ళాం . మంత్రి వర్గ సమావేశంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు చెప్పిన విషయాలు కిష్టప్ప చెబుతూ - ఎన్నికలు సమీపిస్తున్నాయి మనం నిజాయితిగా మాట్లాడుకుందాం .. . మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం . నేనూ చెబుతాను , మీరూ చెప్పండి .. మీరు మొదలు పెట్టండి అని మంత్రులకు బాబు చెప్పారు అని నిమ్మల కిష్టప్ప చెబుతుండగానే నేను మధ్యలో జోక్యం చేసుకొని .. ఆయన మనసులో ఉన్నది చెప్పడు .. మీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఇలా చెబుతాడు జాగ్రత్త . మనసులో ఉన్నది చెబితే ప్రమాదం అని కిష్టప్పకు చెప్పాను . అయన నవ్వుతూ అదే జరిగింది . అనంత పురం జిల్లాలో కుల రాజకీయాలు మరీ ఎక్కువ సర్పంచ్ స్థాయిలో ఉన్న కుల రాజకీయాల గురించి కులాల పేర్లు ప్రస్తావించి చెబితే అంతా విని ఏం మాట్లాడుతున్నారు ? ఈ రోజుల్లో కూడా ఇంకా కులాలా ? అని బాబు చిరాకు పడ్డారని చెప్పుకొచ్చాడు . నిజాలు మాట్లాడుకుందాం , ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం అని ఎవరు అన్నా మీ మనసులో ఉన్నది తెలుసుకోవడానికి తప్ప అది వారి మనసులో ఉన్నది చెప్పడానికి కాదు . రాజకీయాల్లో అనే కాదు ఏ కంపెనీ లోనైనా , ఏ మీడియాలో నైనా , ఏ సంస్థ లో నైనా , ఏ బాస్ అయినా ఇంతే . **** ఆంధ్రభూమిలో ఎడిటర్ కోరిక మేరకు ఎవరికి వారు విడివిడిగా మనసులో ఉన్నది రాసి కవర్ లో పెట్టి ఎడిటర్ కు ఇచ్చాము . ఓ రోజు ఎడిటర్ అందరినీ పిలిచి కవర్లు ముందు వేసి . తొలుత సంస్థ గురించి , రిపోర్టర్ లు , ఇతరుల గురించి మనసులో ఉన్నది చెప్పి . మేం మనసులో మాట రాసిన కవర్లు విప్పి ఎవరిది వాళ్ళు అందరూ వినేట్టు చదవమన్నారు . అందరి మనసులో ఉన్నది ఒక్కటే ఎడిటర్ అద్భుతం , స్టాఫ్ అద్భుతం , యాజమాన్యం అద్భుతం , ధర్మం నాలుగు కాళ్ళ మీద తాండవిస్తోంది ఇదీ సంక్షిప్తంగా ఆ కవర్ లో అందరూ విడివిడిగా రాసిన ఏకాభిప్రాయం . యాజమాన్యం చేస్తున్న తప్పులు , ఎడిటర్ తప్పుల గురించి అందరం రోజూ గంటల తరబడి మాట్లాడుకున్నా ఒక్క వాఖ్య కూడా ఒక్కరూ రాయలేదు ఆ తంతు ముగియగానే మళ్ళీ బృందాలుగా హోటల్ కు వెళ్ళాం . **** మనం నలుగురం ఇలా రాయాలి అనుకున్నాం కాబట్టి ఒకే రకంగా రాశాం . వేరే రెండు బృందాలు కూడా అచ్చం ఇలానే ఎలా రాశాయి . మనసులో ఉన్నది ఒక విషయం కూడా బయట పెట్టకుండా మనసులో మాట భలే రాశాం అందరం అని మమ్ములను మేం మెచ్చుకున్నాం . పాపం ఇంత జీవితానుభవం లేదు కాబట్టి ఎస్ మేడం కంపెనీ ఉద్యోగులు నిజం రాసి రోడ్డున పడ్డారు . రాజాలియాలు , మీడియా , కార్పొరేట్ కంపెనీ అని కాదు . మనుషులు అంతా ఇంతే ఓషో అన్నట్టు ఒక్క 24 గంటలు నిజాలే మాట్లాడితే ఏ బంధం నిలవదు . ఏ ఉద్యోగం ఉండదు . ఈ లోకం అబద్దాల మీదనే బతుకుతోంది దానిని అలానే బతకనిద్దాం అని నిషే చెప్పిన సత్యాన్ని కూడా ఓషో తన ఉపన్యాసంలో ప్రస్తావించారు . అబద్దాన్ని మీరు రక్షిస్తే అబద్దం మిమ్ములను రక్షిస్తుంది . ఇదే లోక రీతి . - బుద్దా మురళి ( జర్నలిస్ట్ జ్ఞాపకాలు 117 )

25, అక్టోబర్ 2024, శుక్రవారం

వంద రూపాయలు సంపాదించండి చూద్దాం ...

మీ అందరికీ ఓ సరదా సవాల్ ఓ వంద రూపాయలు సంపాదించండి చూద్దాం ... ఇదేం సవాల్ నెలకు లక్షల్లో సంపాదించే వారు ఉన్నారు . స్టాక్స్ లో ఒకే రోజుల్లో స్టాక్స్ లో లక్షలు వస్తాయి , పోతాయి . వంద ఓ లెక్కనా ? అంటే .. ఔను లెక్కనే ...ఈ వంద రూపాయల ఛాలెంజ్ ను విజయ వంతంగా పూర్తి చేయడానికి నాకు దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది .. మీరూ ప్రయత్నించి చూడండి ... ఈ సవాల్ ఐడియా నాది కాదు .. యండమూరి వీరేంద్ర నాథ్ గారిది ... ఈ సవాల్ గురించి మొదటి సారి విన్న తరువాత దాదాపు రెండు దశాబ్దాల తరువాత సక్సెస్ అయ్యాను ... నిజానికి ఈ సవాల్ గురించి తెలియని రోజుల్లో చదువుకొనేప్పుడే సక్సెస్ అయ్యాను . కానీ ఉద్యోగంలో చేరాక వంద రూపాయల ఛాలెంజ్ లో విజయం సాధించడం కష్టం అయింది . ఉద్యోగం , వృత్తి , వ్యాపారం లో లక్షలు సంపాదిస్తూ ఉండ వచ్చు .. మనం చేసే ఉద్యోగం వృత్తి నుంచి కాకుండా ఇంకో పని నుంచి కనీసం వంద రూపాయలు సంపాదిస్తే డబ్బు విలువ తెలుస్తుంది అని యండమూరి వీరేంద్రనాథ్ ఓ చోట రాశారు . అది చదివినప్పటి నుంచి ప్రయత్నించాను .. జర్నలిస్ట్ గా ఆంధ్రభూమిలో జీతం తో పాటు వ్యాసాలు రాసినందుకు పారితోషకం ఇచ్చే వారు . అది అదనపు సంపాదనే అయినా రాయడం అనే వృత్తిలో ఉన్నాను . అదే పని చేస్తున్నప్పుడు వేరే పని ద్వారా సంపాదన కాదు ... మన వల్ల కాదు అని వదిలేశా ... ఉద్యోగం తరువాత స్టాక్ మార్కెట్ ... ఇది కూడా వృత్తే ... ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఆదాయం రావచ్చు .. ఇది వేరే వృత్తి ద్వారా సంపాదించాలి అనే ఛాలెంజ్ కు సరిపోదు అనుకున్నాను ... ఆంధ్రభూమిలో పని చేస్తూ వ్యాసాలు రాయడం వృత్తిలో భాగం కానీ పుస్తకం ప్రచురించడం , అమ్మడం వృత్తి కాదు ... ఓ నెల క్రితం పోస్ట్ ఆఫీస్ లో లక్ష్మీ కటాక్షం బుక్ ను పోస్ట్ చేస్తున్నాను ... సెల్ ఫోన్ లో ఆ రోజు స్టాక్ మార్కెట్ చూస్తే నా ఇన్వెస్ట్ మెంట్ దూసుకెళుతుంది ... అది మాములే కానీ ఒక్క సారిగా సంతోషం వేసింది ... నేను రాసిన లక్ష్మీ కటాక్షం బుక్ అమ్ముడు పోతుంది . డబ్బులు వచ్చాయి అంటే మరో వృత్తి ద్వారా వంద రూపాయ లైనా సంపాదించాలి అనే టార్గెట్ పూర్తి అయినట్టే కదా ? అని సంతోషం వేసింది .. యండమూరి రాసిన ఛాలెంజ్ సినిమాలో హీరో చిరంజీవి 50 లక్షలు సంపాదిస్తా అని రావుగోపాల రావు తో ఛాలెంజ్ చేసి ... స్కూటర్ డిపాజిట్లు 50 లక్షలు వసూలు చేసి విజయం సాధిస్తాడు .. ఆ 50 లక్షలు డిపాజిట్లు అవుతాయి కానీ చిరంజీవి సంపాదించినట్టు కాదు కదా ? ఆ 50 లక్షలతో స్కూటర్ లు తయారు చేసి అమ్మితే ఖర్చులు పోగా మిగిలింది ఆదాయం అవుతుంది తప్ప 50 లక్షలు ఆదాయం కావు అని నా అభిప్రాయం ... మీ అభిప్రాయం ఇది . హీరో చిరంజీవి అభిప్రాయం అది అని యండమూరి సమాధానం ... ఆ సమాధానానికి అప్పుడు సంతృప్తి చెందలేదు కానీ ఇప్పుడు నేనూ అదే దారిలో .. పుస్తకం వ్యయం తీసేసిన తరువాత మిగిలేది లాభం అవుతుంది .. అప్పుడే వేరే వృత్తి నుంచి వంద రూపాయలు అయినా సంపాదించాలి అనే ఛాలెంజ్ లో సక్సెస్ అయినట్టు అవుతుంది కానీ బుక్ అమ్మగానే సక్సెస్ అయినట్టు కాదు అనేది ప్రాక్టికల్ వాదన ... ఐతే ఈ వాదనతో సంతోషం ఉండదు . అందుకే ఛాలెంజ్ హీరో వాదనకే ఓటు ... సంతోషం ముఖ్యం కానీ ప్రాక్టికల్ వదనాదేముంది .... ఇదీ విషయం లక్ష్మీ కటాక్షం పుస్తకానికి ఊహించని స్పందన వస్తోంది . సరదాగా మీరూ ప్రయత్నించి చూడండి ... మీ వృత్తి ఉద్యోగం నుంచి కాకుండా మరో పని ద్వారా వంద రూపాయలు సంపాదించండి .. అలా సంపాదిస్తే డబ్బు విలువ తెలుస్తుంది .. అప్పుడప్పుడు ఓలా బైక్ వాళ్ళతో మాట్లాడుతా ... వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం , చదువులో ఉంటూ పార్ట్ టైం సంపాదన కోసం ఓలా ... వీరికి డబ్బు విలువ తెలుసు ... కచ్చితంగా జీవితంలో ఎదుగుతారు అనిపిస్తుంది . అక్కినేని నాగేశ్వర రావు మీద phd చేస్తూ జర్నలిస్ట్ మిత్రుడు నామాల విశ్వేశ్వర రావు అక్కినేనిని తరుచుగా కలిసే వారు . తోటి నటులు కొందరు పేదరికంలో ఉండడాన్ని ప్రస్తావిస్తే .... కీలు గుర్రం సినిమా లో నటించినందుకు నెలకు ఐదు వందలు ఇచ్చారు .. చెక్క గుర్రం మీద రోజంతా కూర్చోవాలి .. మరో వైపు భారీ ఖాయం హీరోయిన్ ... చెక్క గుర్రం ఒరుసుకు పోయేది ... ఐదు వందల రూపాయలకు అంత కష్టపడాల్సి వచ్చేది ... కడుపు కట్టుకొని కూడబెట్టుకున్నాను ... ఐదు వందలు వృధా ఖర్చు చేయాలి అన్నా కీలు గుర్రంలో నెలంతా కష్టపడితే వచ్చిన జీతం అని మనసు అంగీకరించేది కాదు అని అక్కినేని చెప్పుకొచ్చారట ... మనం చెసే పని కాకుండా మరో పనితో వంద సంపాదించినా డబ్బు విలువ తెలుస్తుంది ... వృధా ఖర్చు తగ్గుతుంది .ట్రై చేసి చూడండి . - బుద్దా మురళి