3, మార్చి 2026, మంగళవారం

బాబు ను  భయపెట్టిన  ఇజ్రాయిల్: జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 125

 ఉమ్మడి రాష్ట్రం లో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం . అయన ఉపన్యాసం రొటీన్ గా సాగుతోంది . ఎన్నోసార్లు చెప్పిన విషయాలే చెబుతుండడం వల్ల పెద్దగా ఆసక్తి  కనిపించడం లేదు . కొత్త  విషయాలు లేవు .   చంద్రబాబు తన సొంత నియోజక వర్గంలో ఇజ్రాయిల్ టెక్నాలెజీ తో  వ్యవసాయం చేయడాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన రోజులు అవి . బాబు రొటీన్ ఉపన్యాసంలో తాను ఇజ్రాయిల్ పర్యటించనున్నట్టు చెప్పారు . అప్పటికే ఇజ్రాయిల్ టెక్నాలెజీ తో వ్యవసాయం సాగుతున్నందును అందరూ మామూలుగానే విన్నారు . అప్పుడు బీబీసీ  రేడియోకు ఉర్దూ రిపోర్టర్ గా ఉన్న ఉమర్ ఫరూఖ్ మీరు ఇజ్రాయిల్ ఎలా వెళతారు ? మన దేశం పాలస్తీనా కు అనుకూలంగా ఉంది . ఇజ్రాయిల్ ఎలా వెళతారు అని  ప్రశ్నించేసరికి బాబు ఖంగుతిన్నారు . పక్కనున్న అధికారులతో మెల్లగా మాట్లాడారు . వాళ్ళు ఏం చెప్పారో వినబడలేదు కానీ ఇజ్రాయిల్ వెళితే మైనారిటీ  ఓటర్లకు దూరం అవుతారు అనే భయం పట్టుకుంది . అధికారులతో కొద్ది సేపు మెల్లగా మాట్లాడిన తరువాత అటూ ఇటూ కాకుండా తన ఇజ్రాయిల్ పర్యటన లేదు అన్నట్టు సూచన ప్రాయంగా చెప్పారు .  **** అంతమంది ఉన్నప్పుడు ఇతరులకు వినపడకుండా బాబు ఎలా మాట్లాడారు అని సందేహం రావచ్చు . 95 ప్రాంతంలో టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా మాణిక్ రెడ్డి ఉండేవారు . మెదక్ జిల్లాకు చెందిన నాయకుడు .  జిల్లాలో పరిచయం కావడం వల్ల బాగా పరిచయం . బాబు ముఖ్యమంత్రి అయ్యాక రోజూ బాబు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యేవారు . ఆ సమయంలో బాబుకు ఫోన్ వస్తే మాట్లాడేవారు కానీ ఎదురుగా కూర్చున్న మాకు ఎవరితో మాట్లాడారు , ఏం మాట్లాడారు తెలిసేది కాదు .  కావాలి అంటే మీరు ఓసారి గమనించి చూడండి మీరు ఎదురుగా ఉన్నప్పడు ఎవరికైన ఫోన్ వస్తే ఎవరి నుంచి వచ్చింది , విషయం ఏమిటీ అనేది ఎంతో కొంత అర్థం అవుతుంది . కానీ బాబుకు కాల్ వస్తే కొన్ని వందల సార్లు అక్కడే ఉన్నాను ఎవరి నుంచి కాల్ వచ్చిందో , విషయం ఏమిటో అస్సలు అర్థం కాదు అని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు . అనుమానం ఉంటే ఓటుకు నోటు వీడియో చూడండి . కట్టేకొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది . ఎవరితో మాట్లాడాడు , ఏం మాట్లాడాడు అనేది అర్థం కాదు . మైకు ముందు గంటలతరబడి మాట్లాడే బాబు ఫోన్ లో మాత్రం చిక్కడు దొరకడు అన్నట్టు మాట్లాడుతారు . రాజకీయాల్లో ఉన్నప్పుడు అందులోనూ అధికారంలో ఉన్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త అవసరం .. ఈ రోజుల్లో   టెక్నాలెజీ మరీ పెరిగిపోయింది . అందరి బండారాలు బయటపెట్టే న్యూస్ ఛానల్స్ ఓనర్ల  గూడుపుఠాణి లే బయటపడుతున్న రోజులివి .  *** ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలం లో రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు కానీ పత్రికల్లో ఇందిరాగాంధీ - పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మెన్   యాసర్ అరాఫత్ ఫోటోలు , వారి వార్తలు ప్రముఖంగా వచ్చేవి . అరాఫత్  ఆజానుబావుడు అన్నట్టుగా ఉండేవారు . ప్రత్యేకమైన దుస్తులతో మీడియా ఫోటోలకు ప్రత్యేకంగా ఉండేవారు .  ఇజ్రాయిల్ , పాలస్తీనా వివాదం గురించి అప్పుడు తెలియదు కానీ ఇందిరాగాంధీ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేశ మీడియా అరాఫత్ కు ఎక్కువ  ప్రాధాన్యత ఇచ్చేది .   బాబు  హయాంలో అమెరికా అధ్యక్షుడు వస్తే మీడియాలో ఎంత ప్రాముఖ్యత లభించేదో అరాఫత్ కు అంత ప్రాముఖ్యత లభించేది . 1948లో ఇజ్రాయిల్ స్థాపనకు వ్యతిరేకంగా ఇండియా ఓటు వేసింది . 1992 వరకు ఇజ్రాయిల్ తో మనదేశం కనీసం పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకోలేదు . 92లో పివి నరసింహారావు హయాంలో  సంబంధాలు ఏర్పాటు చేసుకుంది . అప్పటివరకు ఇండియా పాలస్తీనాకు పూర్తి మద్దతుగా నిలిచింది . 1999లో  వాజపేయి హయాంలో సమావేశాలు జరిగాయి . నరేంద్ర మోడీ హయాంలో  ఇజ్రాయిల్ , ఇండియా మధ్య సంబంధాలు బాగా  బలపడ్డాయి . ఇజ్రాయిల్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ . ఇటీవల ఇజ్రాయిల్ పర్యటించి అక్కడి పార్లమెంట్ లో ప్రసంగించారు . ***ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం గురించి , మైనారిటీ ఓట్లపై పడే ప్రభావం వంటి అంశాలను ఏ మాత్రం తెలియక కేవలం ఆధునిక వ్యవసాయ పద్దతులను తెలుసుకోవడం కోసమే బాబు ఇజ్రాయిల్ వెళ్ళాలి అనుకున్నారు . అదే విషయం మీడియా సమావేశంలో చెప్పగానే ఉర్దూ బిబిసి విలేకరి ప్రశ్నతో ఆమ్మో ఇదేదో మెడకు చుట్టుకునేట్టుగా ఉందని ఇజ్రాయిల్ పర్యటన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు . ఇప్పుడు బాబు ఎన్ డి ఏ కూటమిలో ఉన్నారు . బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు . ఇజ్రాయిల్ వెళ్ళాలి అనే కోరికను మూడు దశాబ్దాల తరువాత తీర్చుకొనే అవకాశం లభించింది . యుద్ధం ముగిసిన  తరువాత భారత బృందం  ఇజ్రాయిల్ పర్యటించే అవకాశం లేకపోలేదు .  ఇండియా -  పాక్ ల మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో ఇరాన్ పాక్ కు అండగా నిలించింది .  ఇండియా పాలస్తీనాకు అండగా నిలిచినా , ఇజ్రాయిల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా 1948 లో ఇండియా ఓటు వేసినా పాక్ తో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయిల్ ఇండియాకు సహకరించింది .   ప్రపంచం లో ఎక్కడా ఆశ్రయం దొరకనప్పుడు శరణార్థులుగా వచ్చిన యూదులకు వందేళ్ల క్రితం ఇండియా ఆశ్రయం ఇవ్వడంతో వాళ్ళు ఇప్పటికీ ఇండియాను అభిమానిస్తారు .కాలం మారింది ఇప్పుడు ఎవరికైనా తమ దేశ ప్రయోజనాలు ముఖ్యం కావాలి . బుద్దా మురళి  

మబ్బులు చూసి కుండలో నీళ్లు పారబోసిన జర్నలిస్ట్ ల కథ

మబ్బులను చూసి కుండలో నీళ్లు పారబోయవద్దు అని మనకో జాతీయం ఉంది . అలా పారబోస్తే ఏమవుతుంది అంటే .. జర్నలిస్ట్ ల్లా అవుతుంది . జాతీయాలు జీవిత పాఠాల ఉంచి పుట్టాయి . మన బాధ భవిష్యత్తు తరానికి ఓ పాఠం కావచ్చు . *** ఎకరం 50 వేల రూపాయలు.. నువ్వు రెండు లక్షలు చెల్లిస్తే ఇప్పుడే నీకు నాలుగు ఎకరాల భూమి వస్తుంది . ఇప్పుడు రెండు లక్షలు చెల్లించి 20 ఏళ్ళ తరువాత తీసుకుంటే నీకో 200 గజాల స్థలం ఇస్తాను .. ఐతే ఇదిగో రెండు లక్షలు .. 20 ఏళ్ళు గడిచాయి . బాబూ ఇబ్బంయూదుల్లో ఉన్నాను .. అప్పు చేసి నీకు రెండు లక్షలు చెల్లించాను . నామీద దయ చూపించి 200 గజాల స్థలం ఇవ్వు ప్లీజ్ ... *** ఇలాంటి బేరం గురించి ఎప్పుడైనా విన్నారా ? అప్పటికప్పుడు నాలుగు ఎకరాల డబ్బు ఇచ్చి 20 ఏళ్ళ తరువాత 200 గజాల కోసం బతిమిలాడుకోవడం ఇదేం బేరం .. ఇది బేరం కాదు పిచ్చి అనుకుంటున్నారా ? అత్యంత దురదృష్టకరమైన బ్యాచ్ జర్నలిస్ట్ ల వాస్తవ వ్యధ ఇది . ఏ ఐ పుణ్యమా అని ఎలాంటి సమాచారం అయినా దొరుకుతుండడంతో ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ అని ప్రభుత్వం చెబుతున్న ప్రాంతాల్లో 2006 లో వ్యవసాయ భూముల ధరలు ఎలా ఉన్నాయి అని గ్రోక్ ను అడిగితే 50 వేలకు ఎకరం నుంచి రెండు లక్షలకు ఎకరంగా ఉండేవని చెప్పింది . వై ఎస్ ఆర్ హయాంలో జర్నలిస్ట్ ల హౌసింగ్ సొసైటీ ఏర్పడ్డాక ల్యాండ్ కోసం ఒక్కో జర్నలిస్ట్ రెండు లక్షలు చెల్లించారు . వైఎస్ మరణం , రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి లు సీఎంలు అయ్యారు . తెలంగాణ ఏర్పాటు కెసిఆర్ , రేవంత్ రెడ్డిలు సీఎంలు అయ్యారు . అనేక మలుపులు తిరిగి సుప్రీం కోర్ట్ జర్నలిస్ట్ లకు కేటాయించిన స్థలాల జీవోను కొట్టేసి డబ్బు తిరిగి చెల్లించమంది . గోడకు కొట్టిన సున్నం , ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు తిరిగి రావడం అంత ఈజీ కాదు . ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఉద్యోగులకు వణికి పోతుంది . వారం రోజుల జీతం ఆలస్యానికి ప్రభుత్వం మీద కక్ష కట్టి ఓడించిన చరిత్ర వారిది . అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి రెండేళ్లు అవుతున్నా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేదు . కోర్ట్ కు వెళ్లిన వారికి చెల్లించామని తీర్పులు వచ్చినా అమలు చేసే స్థితి లేదు . అలాంటిది అడిగేవాడు దిక్కులేని జర్నలిస్ట్ ల డబ్బులు తిరిగి రావు . ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఫ్యూచర్ సిటీలో జర్నలిస్ట్ లకు ల్యాండ్ ఇస్తారు అని ఓ ప్రచారం . అంటే జర్నలిస్ట్ లు చెల్లించిన డబ్బుకు ఆ రోజుల్లో నాలుగు ఎకరాలు వస్తే , ఇప్పుడు అదే చోట రెండు వందల గజాల కోసం చకోర పక్షిలా ఎదురు చూడాలి . సుప్రీం తీర్పు తరువాత కూడా కొందరు ఇంకా పాత స్థలాల మీద ఆశ వదులుకోలేక పోతున్నారు . అలా అని వీరిని తప్పు పట్టలేం . అప్పడు తెచ్చి డబ్బు కట్టి 20 ఏళ్లపాటు ఆశగా ఎదురు చూసి రోజూ వాటి గురించే కలలు , కంటూ స్థలం వచ్చాక కట్టే ఇంటిని ముందు కలల్లోనే కట్టుకోవడం వల్ల స్థలాలు రావు అనేదానిని జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు . రెండు దశాబ్దాల క్రితమే పరిస్థితి ఉహించి ఆంధ్ర మిత్రులు కొందరు తాము కట్టిన రెండు లక్షలు వెనక్కి తీసుకొని ఆంధ్రలో ప్లాట్స్ కొన్నారు . 2006లో భువనగిరి లో రెండు లక్షలకు రెండు ఎకరాలు వచ్చేవి . మిత్రుడు అయోధ్యరెడ్డి అదే సమయంలో తుర్కపల్లిలో జర్నలిస్ట్ మిత్రులకు తుర్కపల్లిలో మెయిన్ రోడ్ లో 80 వేలకు ఎకరం భూములు చూపించాడు . వాటి ధర ఇప్పుడు రెండు కోట్ల వరకు పలుకుతుంది . జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆశల్లో మునిగిపోయి అటు వైపు ఎవరూ ఆసక్తి చూపలేదు . నాలుగు ఎకరాలు అమ్మి సొసైటీకి రెండు లక్షలు కట్టాను , ఇప్పుడు నేను అమ్మిన భూమి 60 లక్షలకు ఎకరం అయింది . ఊర్లో , అన్నదమ్ముల ముందు నా పరువు పోయింది అని ఓ జర్నలిస్ట్ మంత్రి పొంగులేటి ముందు తన పరిస్థితి చెప్పుకున్నారు . తప్పు మీదంటే మీది అని ఒక్కరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు . తప్పు పరిస్థితులదే తప్ప వ్యక్తులది కాదు . జాతిరత్నాలు సినిమాలో సెంట్రల్ జైలులో వెన్నెల కిషోర్ బెస్ట్ బ్యాచ్ అంటే మనదే అని పొంగిపోతాడు . తెలుగునాట జర్నలిజం చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన బ్యాచ్ అంటే ఇదే . 20 ఏళ్ళ క్రితం నాలుగు ఎకరాల విలువైన డబ్బు చెల్లించి 20 ఏళ్ళ తరువాత కూడా 200 గజాల కోసం ఆశగా ఎదురు చూడడానికి మించిన దురదృష్టకరమైన బ్యాచ్ ఉంటుందా ? మంచి జీతాలు చెల్లించే మీడియా సంస్థల వారి పరిస్థితి వేరు జీతాలు కూడా సరిగా ఇవ్వని సంస్థల జర్నలిస్ట్ లు అప్పు తెచ్చి రోడ్డున పడ్డారు . - బుద్దా మురళి

22, ఫిబ్రవరి 2026, ఆదివారం

ఖరీదైన గాంధీ విగ్రహాల జ్ఞాపకాలు ...

జర్నలిస్ట్ జ్ఞాపకాలు -124 దాదాపు పాతికేళ్ల క్రితం ... అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి .. లాబీ లో కనిపించిన వారందరితో మాట్లాడుతూ ముందుకు వెళుతుంటే గోడ మీద కొత్తగా తగిలించిన మహాత్మ్యా గాంధీ నెహ్రూ ల ఫోటో ఫ్రెమ్ వేలాడుతుండడం కనిపించింది ... అంతకు ముందు లేదు ... కొత్తగా పెట్టారు . అప్పుడు ఏదో ఛానల్ ( జెమినీ లేదా సిటీ కేబుల్ ) రిపోర్టర్ భూమేష్ గాంధీజీ నెహ్రూల ఫోటో ఫ్రెమ్ చూస్తూ బాగుంది కాదన్న .. ఎన్ని వేల బిల్ వేశారో అనగానే నవ్వు ఆగలేదు ... అలాంటి ఫ్రెమ్ సాధారణంగా ఓ రెండు వందలకు అమ్ముతారు ... ప్రభుత్వ వ్యవహారం కాబట్టి ఓ వెయ్యి వరకు పరవాలేదు ... ఎన్ని వేల బిల్ వేశారో అనడానికి వెనుక ఓ విగ్రహ వ్యవహారం ఉంది . అప్పుడు యనమల రామకృష్ణుడు స్పీకర్ అసెంబ్లీ ఆవరణలో మహాత్మగాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి అని ప్రయత్నం ... దీనికి 65 లక్షల వ్యయం . పాతికేళ్ల క్రితం 65 లక్షలు అంటే పెద్ద మొత్తమే . విగ్రహం ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించ లేదు కానీ ఖర్చు విషయం పై విమర్శలు వచ్చాయి . సగం దుస్తులు ధరించిన మహాత్ముని విగ్రహానికే 65 లక్షల ఖర్చు అంటే పూర్తి దుస్తులు ధరించి ఉంటే ఎంత ఖర్చు చేసేవారో అని జోకులు వేసుకోవడం తప్ప ఖర్చుపై నిలదీయలేని పరిస్థితి ... ప్రతిభా భారతి స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీ లో టెలిఫోన్ వైరింగ్ కాంట్రాక్ట్ పై ఆరోపణలు మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి ... సాధారణంగా అసెంబ్లీ వ్యయం పై ఎవరూ నోరు మెదపరు .... తెలిసినా మౌనంగా ఉండాల్సిందే ... రామోజీ రావు లాంటి వారు అసెంబ్లీ ని కూడా ఎదిరించి అరెస్ట్ ను తప్పించుకుంటారు కానీ సాధారణ జర్నలిస్ట్ కు సాధ్యం కాదు ... యాజమాన్యాలు సహకరించవు ... రామోజీనే యజమాని కాబట్టి తన అరెస్ట్ కు అసెంబ్లీ ఆదేశించినా అరెస్ట్ కాలేదు ... సాధారణ జర్నలిస్ట్ అయితే ఉద్యోగం ఊడబెరుకుతారు .. అందుకే అక్కడి వ్యవహారాలు ఆ భవనం లోనే భూస్థాపితం అవుతాయి ... చివరకు 65 లక్షల వ్యయంతో అసెంబ్లీ ఆవరణలో మహాత్ముని విగ్రహాన్ని ప్రతిష్టించారు .. 65 లక్షల్లో శిల్పికి ఎంత ఇచ్చారో ? శిల్పానికి ఎంతో , ఎవరికి ఎంతో తెలియదు ... ప్రజాస్వామ్యానికి , స్వేచ్ఛకు ప్రతీక అంటూ ఆవిష్కరించిన మహాత్ముని విగ్రహం వద్దకు వెళ్లకుండా గొలుసులతో బంధించిన రోజులు చాలానే ఉన్నాయి ... టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ , కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వల్ల అసెంబ్లీ ఆవరణ లోని ఈ విగ్రహం వద్ద శాసన సభ్యులు ధర్నాకు కూర్చుంటున్నారని అటు వెళ్లకుండా గొలుసులతో అడ్డుకట్ట వేశారు ... పాతికేళ్ల తరువాత హైదరాబాద్ లో మరో భారీ గాంధీజీ విగ్రహానికి శ్రీకారం చుట్టారు ... బాపూఘాట్ వద్ద ఐదు వేల కోట్ల ఖర్చుతో గాంధీజీ విగ్రహం నిర్మిస్తారట .. పాతికేళ్ల క్రితం 65 లక్షలు అన్నప్పుడు ఇప్పుడు విగ్రహానికి ఐదు వేల కోట్లు సముచితమే ... తెలంగాణ ఆదాయం పెరిగింది . ధరలూ పెరిగాయి ... మున్సిపల్ వార్డు మెంబర్ కే కోటి రూపాయల ధర పలుకుతున్న రోజులు ఇవి . రాజకీయాలు చాలా ఖరీదైన భారీ పెట్టుబడితో కూడిన వ్యాపారం . ఐదు వేల కోట్ల విగ్రహం సరైన ధరనే ... పలానా నాయకుడు రాజకీయాల్లో విచ్చల విడిగా ఖర్చు చేశాడు అని మీడియా విమర్శించేది . మా అభిమాన నాయకుడు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికారం లోకి వచ్చాడు ... హై కమాండ్ ఇంచార్జ్ ల పెత్తనం ఏమిటీ ? పూర్తి అధికారం ఇవ్వండి అని నిస్సిగ్గుగా రాస్తున్న దమ్మున్న మీడియా ఉన్న కాలం ఇది . విగ్రహానికి ఐదు వేల కోట్ల ఖర్చు సముచితమే ... ధర విషయంలో అభ్యన్తరం లేదు కానీ అపార్ట్ మెంట్ లను కూల్చేసి 450 మంది కుటుంబాలను రోడ్డు పాలు చేయడమే నచ్చడం లేదు . వెయ్యి కోట్ల పెట్టుబడి తిరిగి లాభంతో రాబట్టుకోవలసిందే కానీ సామాన్య కుటుంబాలను రోడ్డు పాలు చేయడమే నచ్చలేదు ... బాపు ఘాట్ ఐదు వేల కోట్ల విగ్రహం తో అసెంబ్లీ విగ్రహం వ్యవహారం గుర్తుకు వచ్చింది .. ఇదిగో బాధితులు మీ సంగతి మీరు చూసుకోండి ..వెయ్యి కోట్ల పెట్టుబడికి తగిన గిట్టుబాటు రాలేదు అని బాధపడుతున్న మీడియాకు మీ గోడు పట్టదు ... విగ్రహ నిర్మాణాన్ని ఆపుతారా ఉద్యమాలకు భయపడే రకం కాదు .. ఎన్టీఆర్ భారీ విగ్రహం పెడతాం ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం అని సవాల్ విసిరారు కూడా .... గాంధీజీ విగ్రహానికి బలవుతున్న అపార్ట్ మెంట్ లు యేవో తెలిసిందే ... ఎన్టీఆర్ విగ్రహానికి ఏ కాలనీ బలి కానుందో ... - బుద్దా మురళి

28, మే 2025, బుధవారం

చిన్నప్పటి జ్ఞాపకం హైదరాబాద్ లో భారత్ -పాక్ యుద్ధ జ్ఞాపకం

ఇటీవల భారత్ - పాక్ యుద్ధ సమయంలో ట్యాంక్ బండ్ ను ఏ మీడియా అయినా గుర్తు చేస్తుందేమో అని చూశా . 1971లో జరిగిన ఇండియా పాక్ వార్ లో పాకిస్థాన్ ను జయించి మన సైన్యం స్వాధీనం చేసుకున్న యుద్ధ ట్యాంక్ ఒకటి హుసేన్ సాగర్ కట్ట మీద పాక్ మీద మన సైన్యం సాధించిన విజయానికి చిహ్నం గా నిలిచి ఉంది . ట్యాంక్ బండ్ , వినాయక్ సాగర్ , హుసేన్ సాగర్ పేర్లు ఎన్నయినా అదో అద్భుత మైన ప్రాంతం . వందల ఏళ్ళు అయినా చెక్కుచెదరని నిర్మాణం అని కాదు . ట్యాంక్ బండ్ ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తుంది . అద్భుతం అనిపిస్తుంది . దాదాపు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు చాలా మంది హుసేన్ సాగర్ కట్ట మీదికి వెళుతుంటే నేనూ వెళ్ళాను . హుసేన్ సాగర్ కట్ట మీద ట్యాంక్ ఏర్పాటు చేశారు ,. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని ట్యాంక్ బండ్ గా పాపులర్ అయింది . ట్యాంక్ అంటే యుద్ధ రంగంలో ఉపయోగించే వాహనం . ఇక్కడ నిజంగానే యుద్ధంలో ఉపయోగించే ట్యాంక్ ను ఏర్పాటు చేశారు . దాని పేరు మీదనే ట్యాంక్ బండ్ గా
పాపులర్ . 1971లో ఇండియా పాకిస్థాన్ ల మధ్య జరిగిన యుద్ధంలో ఇండియా పాక్ ను చిత్తుగా ఓడించి బంగ్లా దేశ్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయగలిగింది . ఆ యుద్ధంలో భారత సైన్యం పాకిస్థాన్ లోకి చొచ్చుకు వెళ్లి 66 యుద్ధ ట్యాంక్ లను స్వాధీనం చేసుకుంది . అందులో ఒక ట్యాంక్ ను హుసేన్ సాగర్ కట్ట మీద 1973లో ఏర్పాటు చేశారు . సికింద్రాబాద్ వైపు నుంచి హుసేన్ సాగర్ కు వస్తుంటే కట్ట మొదట్లోనే కుడి వైపు ఈ యుద్ధ ట్యాంక్ ఉంటుంది . ఆ ట్యాంక్ ఏర్పాటు సమయం లో అక్కడికి సమీపంలోనే ఉన్న కవాడిగూడలో ఉండేవాళ్ళం . ట్యాంక్ ఎదురుగా వైస్ రాయ్ హోటల్ . దానికి వెనుక వైపు చిన్న దారి గుండా వెళితే కవాడిగూడ . మహా అయితే వెయ్యి అడుగుల దూరం కావడం వల్ల ఆ ట్యాంక్ ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి చూశాను . చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చి ట్యాంక్ ను చూసేవాళ్ళు . పిల్లలకు అదో జాతరలా ఉండేది . ఇప్పటిలా సెల్ ఫోన్ కెమెరాలు లేవు కానీ కొద్ది మంది ట్యాంక్ లోపల కూర్చొని కెమెరాలతో ఫోటోలు దిగేవారు . హుసేన్ సాగర్ పై మొత్తం సందడి ఇక్కడే ఉండేది . కొద్ది కాలం తరువాత రోటరీ క్లబ్ వాళ్ళు అక్కడ ఒక పార్క్ నిర్మించారు . ఆ పార్క్ లో ఒక పెద్ద అక్వేరియం భవనం కూడా నిర్మించారు . కాలం గడిచిన టి అంజయ్య బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ చేపట్టారు . ముందు నెక్లెస్ రోడ్ , ఎన్టీఆర్ మరణం తరువాత ఎన్టీఆర్ ఘాట్ నిర్మాణంతో ట్యాంక్ ఉన్న ఇటు వైపు ఎవరూ పట్టించుకోలేదు . పార్క్ పాడుపడింది . చెబితే తప్ప ఇది అక్వేరియం అంటే నమ్మని విధంగా మారింది . 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత మరోసారి పార్క్ కళకళ లాడింది . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ట్యాంక్ బండ్ పై ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు . ఆ సందర్భంలో ఈ పార్క్ ను కూడా పట్టించుకున్నారు . వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారని బీజేపీ అనుకూల వర్గాలు హుసేన్ సాగర్ పేరును వినాయక సాగర్ అని పెట్టినా జనం లో మాత్రం ట్యాంక్ బండ్ అనే పాపులర్ . దాదాపు 1980 వరకు కూడా హుసేన్ సాగర్ నీళ్లు ఇప్పటి అంత ప్రమాదకరమైనవి , విషపూరితమైనవి కావు . స్థానికులు ఈత కొట్టేవాళ్ళు . నాకు ఈత రాదు కానీ బాల్యంలో పెద్ద వాళ్ళతో కలిసి వెళ్లిన జ్ఞాపకాలు ఉన్నాయి . హోలీ రోజు రంగుల్లో మునిగిన వారు ఇక్కడ స్నానం చేసేవారు . బతుకమ్మ పండుగకు చుట్టుపక్కల ప్రాంతాల వారు బతుకమ్మ ఆడి ఇక్కడే బతుకమ్మ ను నీళ్లలో వదిలి ప్రసాదం పంచేవాళ్ళు . దాదాపు 1980 తరువాత పరిస్థితి తెలియకుండానే మారిపోయింది . బతుకమ్మ పండుగ కనిపించకుండా పోయింది . తరువాత క్రమంగా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కలిసి పోయి హుసేన్ సాగర్ నీళ్లు విషపూరితంగా మారాయి . ఆ తరువాత ఇక్కడ వినాయక నిమజ్జనం హడావుడి తప్ప యుద్ధ ట్యాంక్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో సందడి లేకుండా పోయింది . తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్ నగరంలో మళ్ళీ బతుకమ్మ పండుగ కళ కనిపించింది . సంస్కృతి , పండుగలు అనేవి ఒక తరం నుంచి మరో తరానికి అలవాటు అవుతుంది . మధ్యలో ఒక తరం తప్పుకుంటే ఇక అంతే . బతుకమ్మ పండుగ ఒకటి కాదు రెండు మూడు తారలు తప్పుకున్నాయి . తెలంగాణ ఉద్యమం వల్ల హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై మళ్ళీ కనిపించింది . చిన్నప్పుడు మొదటి సారి సినిమా షూటింగ్ చూసింది ట్యాంక్ బండ్ పైనే హిందీ సినిమా బహుశా కోరా కాగజ్ కావచ్చు . హీరో పెద్ద కారులో వెళుతుంటాడు . హీరోయిన్ ఆకు కూరలు తీసుకోని వెళుతుంటుంది . కారు తాకి కూరగాయల సంచి పడిపోతుంది . చిన్న సీన్ కు అంత సమయమా అనిపించింది . ఎన్టీఆర్ హయాంలో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేశారు . కెసిఆర్ హయాంలో భారీ అంబెడ్కర్ విగ్రహం , అంతా వీరుల స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు . 1971లో ఇండియా పాకిస్థాన్ పై విజయం సాధించిన దానికి గుర్తుగా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుతారు . కనీసం ఆ రోజైనా ఈ యుద్ధ ట్యాంక్ వద్ద విజయ్ దివస్ నిర్వహించరు . బుద్దా మురళి

14, మార్చి 2025, శుక్రవారం

జిందగీమే కుచ్ భీ హోసక్తా ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -118

జిందగీమే కుచ్ భీ హోసక్తా ... . జర్నలిస్ట్ జ్ఞాపకాలు -118 హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ప్రోగ్రాం ఒకటి జిందగీమే కుచ్ బీ హో సక్తా .. మంచి ఆసక్తికరమైన ప్రోగ్రాం . ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి సినిమా రంగంలో ఎదిగిన వారి జీవిత విశేషాలను పరిచయం చేసే కార్యక్రమం . జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు . జీవితంలో ఏదైనా జరగవచ్చు . ఆశను వదులుకోకుండా ప్రయత్నిస్తే ఏదైనా జరగవచ్చు అని చెప్పే ప్రోగ్రాం . *** *** ***** 2017 లో ఆర్ టీ ఐ కార్యాలయం.. మధ్యాన్న సమయం ఏదో పనిలో ఉండగా ఆఫీస్ బాయ్ వచ్చి ఒక విజిటింగ్ కార్డు అందించాడు . ఇద్దరు రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారులు . షఫీ కుజ్జ మా తో పాటు మరో అధికారి . ఐఏఎస్ గా రిటైర్ అయ్యాక న్యాయవాదులుగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు . ఆర్ టి ఐ కేసు విషయంలో ఆర్ టి ఐ కమిషనర్ గా నన్ను కలవడానికి వచ్చారు . తెలంగాణ యూనివర్సిటీ లో తమ క్లయింట్ కేసు ఉందని , కేసు త్వరగా వస్తే న్యాయం జరుగుతుంది అని చెబుతుంటే .. వాళ్ళిచ్చిన విజిటింగ్ కార్డు ను అలా చూస్తూ ఆలోచనల్లో పడిపోయి .. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను . **** ***** డిగ్రీ పూర్తి కాగానే 1987 సెప్టెంబర్ లో మెదక్ జిల్లా ఆంధ్రభూమి రిపోర్టర్ గా సంగారెడ్డికి వెళ్ళాను . ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన లెటర్ తీసుకోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాను . అప్పుడు కలెక్టర్ షఫీ కుజ్జ మా... ఆంధ్రభూమికి కొత్తగా వచ్చాను అని లెటర్ ఇచ్చి పరిచయం చేసుకున్నాను . అంతకు ముందు జిల్లా మంత్రి కరణం రామచంద్ర రావు కు డిపి ఆర్ ఓ భూమికి కొత్త అని పరిచయం చేస్తే ఆయన ఏ మూడ్ లో ఉన్నారో భూమికి కొత్తా ? భూమికే కొత్తనా ? అని జోక్ వేశారు . 87 నుంచి బాబు సీఎం అయ్యాక అసెంబ్లీలో నే కరణం మాట్లాడుతూ మాట్లాడుతూనే అస్వస్థతకు గురై మరణించేవరకు అనేక సార్లు కరణం ఉపన్యాసాలు విన్నాను ఒక్క సారి కూడా జోక్ వేయగా వినలేదు . కలెక్టర్ మాత్రం ఎలాంటి జోక్ వేయకుండా కాసేపు మాట్లాడి పంపించేశారు . **** ***** తరువాత హైదరాబాద్ వచ్చాక ఓ రోజు అనుకోకుండా 1996 ప్రాంతంలో షఫీ కుజ్జ మా డ్రామా న్యూస్ కవర్ చేయాల్సి వచ్చింది . జూబ్లీ హల్ లో సీఎం చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మీడియా మొత్తం వచ్చింది . మద్యనిషేధాన్ని ఎత్తి వేయడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయం అది . ఇంకా మీటింగ్ పూర్తి కానందు వల్ల బాబు కోసం మీడియా ఎదురు చూస్తుంటే అంత పెద్ద సంఖ్యలో ఉన్న మీడియా వద్దకు షఫీ కుజ్జ మా కొన్ని కాగితాలు చదువుతూ రాష్ట్రంలో మద్యనిషేధం ఎంత ఘోరంగా విఫలం అయిందో చెబుతున్నారు . కల్తీ మద్యం తో ఎంత మంది మరణించారు . ఎన్ని అక్రమ మద్యం కేసులు , మద్యనిషేధం ఎత్తివేయక పోతే ఎంత ప్రమాదకరమో వివరించే విధంగా ఆ గణాంకాలు ఉన్నాయి . చెప్పాల్సింది అంతా ఆయన చెప్పి వెళ్లి పోయాక . కొద్ది సేపటికి సీఎం చంద్రబాబు వచ్చారు . హష్మీ అని ఉర్దూ రిపోర్టర్ బాబు రాగానే మద్యనిషేధం ఘోరంగా విఫలమైంది ? అంటూ ఆ అధికారి చెప్పిన అంకెలు చెప్పుకొచ్చాడు . నిజామా ? అని చంద్రబాబు బోలెడు ఆశ్చర్య పోయాడు. . మా అల్లుడు నా కన్నా గొప్ప నటుడు అని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ఉరికే అనలేదు . **** కేసు త్వరగా వస్తే మా క్లయింట్ విద్యా సంవత్సరం కాపాడినవారు అవుతారు . కమిషన్ నుంచి నోటిస్ వస్తే చాలు పని అయిపోతుంది అని షఫీ కుజ్జ మా అడగగానే ప్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చి పీఎస్ ను పిలిచి వీరి కేసు వెంటనే రావాలి అని చెప్పాను . షఫీ కుజ్జ మా ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోతుంటే 1987 నాటి నా పరిచయం గుర్తు చేసి .. 96లో మద్యనిషేధం విఫలం అంటూ మీరు చదివి వినిపించిన ఆ అంకెలు అన్నీ బాబు ఆదేశంతోనే కదా ? అని అడగాలి అని నోటి వరకు వచ్చినా అడగకుండా ఉండిపోయాను . ఏ పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్రకే పరిమితం కావడమే మంచి సంప్రదాయం అనిపించి మౌనంగానే ఉండి పోయాను . ఐఏఎస్ అధికారులు ఎంత పరిచయం ఉన్నా కొన్ని విషయాలు ముఖాముఖిలో కూడా పంచుకోరు . అలాంటిది బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ అని మీడియా వస్తే బాబుకు సంబంధం లేకుండా ఎక్సయిజ్ కమిషనర్ వచ్చి మద్యనిషేధం ఎలా విఫలం అయిందో చెబుతారా ? తెలిసిన విషయం అడగడం ఎందుకు అని అడగలేదు సాంప్రదాయ ముస్లిం జీవనం గడిపే అతనికి ఎక్సయిజ్ శాఖ అస్సలు ఇష్టం లేదు అని విన్నాను . 1987 లో రిపోర్టర్ గా అతనికి నన్ను నేను పరిచయం చేసుకుంటే ... సరిగ్గా మూడు దశాబ్దాలు గడిచిన తరువాత ఆర్ టీ ఐ కమిషనర్ గా ఉన్న నన్ను న్యాయవాదిగా అతను పరిచయం చేసుకోవడం ఏదో సినిమా కథలా అనిపించింది ... **** హిందూ చీఫ్ రిపోర్టర్ వర్లు ఒక సారి సి సి ఎల్ఏ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లారు . కమిషనర్ కార్యాలయంలోకి వెళ్ళగానే కమిషనర్ వర్లు ను చూసి సార్ మీరు వచ్చారా ? అని లేచి నిలబడి స్వాగతం పలికారు .. ఆ రోజుల్లో మీడియాకు ఇంత గౌరవం ఉండేది అని ముందుగానే నిరయానికి వచ్చేయకండి . కమిషనర్ లేచి నిలబడి స్వాగతమ్ పలికింది నిజమే . కానీ కారణం వేరు . హిందూ లో వర్లు చీఫ్ రిపోర్టర్ గా ఉన్నప్పుడు అతని బ్యూరోలో ఒక రిపోర్టర్ గా సి సి ఎల్ ఏ కమిషనర్ ఉన్నారు . ఎప్పుడు ఉద్యోగం వదిలి , ఎప్పుడు సివిల్స్ కు ఎంపిక అయ్యారో పెద్దగా దృష్టి పెట్టలేదు . తన బ్యూరోలో రిపోర్టర్ వద్దకు తానే ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లడం ఒక అరుదైన అనుభవం . డక్కన్ క్రానికల్ లో అయేషా అని అమ్మాయి క్రైం రిపోర్టర్ . క్రైం రిపోర్టర్ లు ఎక్కువగా పోలీసులు ఇచ్చిన సమాచారం పై ఆధారపడాలి . ఈ అమ్మాయి మాత్రం రోజూ మార్చురీకి వెళ్లి సమాచారం సేకరించేది . అయినా ఎడిటర్ జయంతి వేధిస్తోంది అని బాధపడేది . ఆ వేధింపులు తట్టుకోలేక డక్కన్ క్రానికల్ కు రాజీనామా చేసి ఉర్దూ పేపర్ లో చేరింది . ఆర్ టీ ఐ కమిషనర్ గా ఓ రోజు కేసులు చూస్తుంటే ఓ అధికారి మా కలెక్టర్ స్ట్రిక్ట్ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం అని కలెక్టర్ పేరు చెప్పగానే సంతోషం వేసింది . ఆయెషా గ్రూప్ వన్ కు సెలక్ట్ అయింది అని తెలుసు చిన్న జిల్లాలు ఏర్పాటు చేసిన సమయంలో ఆయెషా ను జిల్లా కలెక్టర్ గా నియమించారు . ఓపిక తో ఉండి తమ నైపుణ్యాలు పెంచుకుంటూ పోతే అవకాశాలు అవే వస్తాయి అని చాలా మంది నిరూపించారు . **** ఐతే జర్నలిజం లోకి రమ్మంటావా ? అని ప్రశ్నిస్తే వద్దే వద్దు అంటాను . ఆర్థిక సంస్కరణల తరువాత అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి . అదే సమయంలో అంతే స్పీడ్ గా మీడియా రంగంలో అవకాశాలు తగ్గిపోయాయి . తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో అవకాశాలు చాలా వేగంగా పడిపోయాయి . పైగా ఇప్పుడు అంతా రాజకీయ పార్టీల మీడియానే . స్వతంత్ర మీడియా అని చెప్పుకొనేది కూడా అటు రైట్ వైపో ఇటు లెఫ్ట్ వైపో స్వతంత్రంగా పని చేస్తున్నావే . 99 లో టీడీపీ స్వతంత్రులకు టికెట్లు , మంత్రి వర్గంలో స్థానం కల్పించింది . ఒక పార్టీ తరపున పోటీ చేశాక తటస్తులు ఏమిటో ? ఇప్పుడు మీడియా కూడా అలాంటి తటస్తమే . ఎడిటర్ లను , పత్రికలో వార్తలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది . లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మొదలుకొని , వెయ్యి లోపు సబ్ స్కైబర్స్ ఉన్న యూ ట్యూబ్ వరకు ఏదో ఒక పార్టీ కోసం పని చేస్తోంది . పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి మధ్యలో మీడియాలోకి వస్తే వేరు కానీ దీనిని ఉపాధిగా భావించి వస్తే దిన దిన గండం ఆరు నెలల ఆయుష్యు అన్నట్టు ఉంటుంది . వెజ్ బోర్డు సిఫారసులు ఉంటాయి .అమలు చేస్తే దాదాపుగా గ్రూప్ వన్ అధికారులకు లభించే స్థాయిలో వేతనాలు ఉంటాయి . ఒక్క ఆంధ్రభూమి తప్ప మరే మీడియా సంస్థ వీటిని అమలు చేయలేదు . - బుద్దా మురళి (జర్నలిస్ట్ జ్ఞాపకాలు 118 )

21, డిసెంబర్ 2024, శనివారం

ఎడిటర్ కు నిజం చెబితే ఉద్యోగం ఊడుతుంది .. ఒక్క రోజు అందరూ నిజమే చెబితే ప్రపంచం తలక్రిందులు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -117

ఎడిటర్ కు నిజం చెబితే ఉద్యోగం ఊడుతుంది .. ఒక్క రోజు అందరూ నిజమే చెబితే ప్రపంచం తలక్రిందులు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -117 ఒక్క రోజు మనుషులు అందరూ నిజం మాత్రమే మాట్లాడితే.. మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాస్క్ లేకుండా , కల్తీ లేకుండా మాట్లాడితే ప్రపంచం తలక్రిందులు అవుతుంది . ఒక్కరికి ఒక్క మిత్రుడు మిగలడు . భార్యా భర్తలు విడిపోతారు . కుటుంబ బంధం నిలవదు ఓషో ఉపన్యాసం లో ఈ మాట విన్నప్పుడు ఒప్పుకోవడానికి మనసు అంగీకరించలేదు కానీ అక్షర సత్యం అనిపించింది . లోకం అబద్దం మీదనే బతుకుతుంది దాన్ని అలానే బతకనివ్వు నిజం చెప్పకు అని నిషే చెప్పింది నిజం . ఆంధ్ర భూమిలో పని చేస్తుండగా అప్పటికి ఓషో చెప్పిన ఈ మాట గురించి తెలియక పోయినా నాయకుల గురించి , మనుషుల గురించి , బాస్ ల గురించి అవగాహన ఉండడం వల్ల నిజం చెప్పాలి అనే జబ్బు బారిన పడకుండా ఉద్యోగం కాపాడుకున్నాను . ఈ మధ్య ఒక ఆసక్తి కరమైన వార్త చూశా ఇంటింటికి తిరిగి క్షవరం చేసే ఎస్ మేడం అనే కార్పొరేట్ కంపెనీ తమ ఉద్యోగుల పని తీరుపై ఒక సర్వే జరిపింది . మీరు ఒత్తిడికి గురవుతున్నారా ? అనేది ఆ సర్వేలో ఓ ప్రశ్న . చాలా మంది ఉద్యోగులకు జీవితానుభవం లేక ఔను మేం విధి నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాం అని రాశారు . అది చదివిన యాజమాన్యం నిజాయితీగా మీ అభిప్రాయం చెప్పినందుకు అభినందనలు . మీ అభిప్రాయాన్ని మేం పరిశీలిస్తున్నాం అని చెబుతూనే ఒత్తిడికి గురి అవుతున్నాం అని సర్వేలో రాసిన దాదాపు వందమంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తీసేశారు . నిజం చెబితే బహుమతి లభించడానికి అదేమీ ప్రాథమిక పాఠశాల కాదు , వాళ్ళేమీ స్టూడెంట్స్ కాదు . అడిగింది టీచర్ కాదు . నెల నెల జీతం ఇచ్చే కార్పొరేట్ కంపెనీ . అడిగిన విషయం పై అభిప్రాయం చెప్పేప్పుడు అడిగింది ఎవరు ? ఏ ఉద్దేశం తో అడుగుతున్నారు ? నిజం చెబితే ఏమవుతుంది అని గ్రహించాలి . అలా గ్రహించకుండా నిజాలు చెబితే సత్యహరిచంద్రునిలా చరిత్రలో నిలిచి పోతామని కలలు కనొద్దు . నిజం చెబితే రోడ్డున పడే ప్రమాదం ఉందని గ్రహించాలి . *** ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు అసెంబ్లీ బిల్డింగ్ ఆవరణలో పిచ్చాపాటి మాట్లాడుతూ ఓషో చెప్పిన ఈ మాట ప్రస్తావించి మనం సరదాగా ఓ గంట పూర్తిగా నిజాలే మాట్లాడుకుందాం అని ప్రతిపాదించా . మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి అనుకోని మాటలు మొదలు పెట్టి మూడు నాలుగు నిమిషాలకు మించి మాట్లాడలేక పోయాం . .. .. ****** ఓ రోజు ఆంధ్రభూమిలో ఎడిటర్ రిపోర్టర్ లను అందరినీ పిలిచి ఆఫీస్ గురించి , పని తీరు మీ తోటి వాళ్ళు అందరి పని తీరుపై బాగా ఆలోచించి నిజాయితీగా రాసి కవర్ లో పెట్టి ఇవ్వండి . ఒకరు రాసింది ఒకరు చదవరు కాబట్టి మనసులో ఉన్నది ఉన్నట్టు రాయండి . రెండు రోజుల్లో రాసి కవర్ లో పెట్టి ఇవ్వండి అని పరీక్ష పెట్టాడు . అప్పుడు మనసులో ఏమనుకున్నానో రాయడం బాగోదు కానీ నవ్వుకున్నాను . మీటింగ్ కాగానే బృందాలుగా హోటల్ కు వెళ్ళాం . మనసులో ఉన్నది ఉన్నట్టు ఎడిటర్ రాయమన్నారు కదా అని రాస్తే ఉద్యోగాలు ఉడుతాయి . జాగ్రత్త . ఇక్కడ ఉన్న లోపాలు అందరికీ తెలిసినవే అందరూ నటిస్తున్నారు . యాజమాన్యం కే లేని దురద మనకెందుకు ? మనం సేఫ్ గేమ్ ఆడుదాం అని అందరికన్నా ముందు నేనే ఒక బృందానికి ఉచిత సలహా ఇచ్చాను . **** ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటిలా వాట్స్ ఆప్ జర్నలిజం కాదు మంత్రి వర్గ సమావేశం జరిగితే లోపల ఏం చర్చ జరిగిందో తెలుసుకోవడానికి కనీసం పది మంది మంత్రులను విడివిడిగా కలవాల్సి వచ్చేది . అలా కలుస్తూ అప్పుడు మంత్రిగా ఉన్న నిమ్మల కిష్టప్ప వద్దకు నేనూ మరో జర్నలిస్ట్ వెళ్ళాం . మంత్రి వర్గ సమావేశంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు చెప్పిన విషయాలు కిష్టప్ప చెబుతూ - ఎన్నికలు సమీపిస్తున్నాయి మనం నిజాయితిగా మాట్లాడుకుందాం .. . మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం . నేనూ చెబుతాను , మీరూ చెప్పండి .. మీరు మొదలు పెట్టండి అని మంత్రులకు బాబు చెప్పారు అని నిమ్మల కిష్టప్ప చెబుతుండగానే నేను మధ్యలో జోక్యం చేసుకొని .. ఆయన మనసులో ఉన్నది చెప్పడు .. మీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఇలా చెబుతాడు జాగ్రత్త . మనసులో ఉన్నది చెబితే ప్రమాదం అని కిష్టప్పకు చెప్పాను . అయన నవ్వుతూ అదే జరిగింది . అనంత పురం జిల్లాలో కుల రాజకీయాలు మరీ ఎక్కువ సర్పంచ్ స్థాయిలో ఉన్న కుల రాజకీయాల గురించి కులాల పేర్లు ప్రస్తావించి చెబితే అంతా విని ఏం మాట్లాడుతున్నారు ? ఈ రోజుల్లో కూడా ఇంకా కులాలా ? అని బాబు చిరాకు పడ్డారని చెప్పుకొచ్చాడు . నిజాలు మాట్లాడుకుందాం , ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం అని ఎవరు అన్నా మీ మనసులో ఉన్నది తెలుసుకోవడానికి తప్ప అది వారి మనసులో ఉన్నది చెప్పడానికి కాదు . రాజకీయాల్లో అనే కాదు ఏ కంపెనీ లోనైనా , ఏ మీడియాలో నైనా , ఏ సంస్థ లో నైనా , ఏ బాస్ అయినా ఇంతే . **** ఆంధ్రభూమిలో ఎడిటర్ కోరిక మేరకు ఎవరికి వారు విడివిడిగా మనసులో ఉన్నది రాసి కవర్ లో పెట్టి ఎడిటర్ కు ఇచ్చాము . ఓ రోజు ఎడిటర్ అందరినీ పిలిచి కవర్లు ముందు వేసి . తొలుత సంస్థ గురించి , రిపోర్టర్ లు , ఇతరుల గురించి మనసులో ఉన్నది చెప్పి . మేం మనసులో మాట రాసిన కవర్లు విప్పి ఎవరిది వాళ్ళు అందరూ వినేట్టు చదవమన్నారు . అందరి మనసులో ఉన్నది ఒక్కటే ఎడిటర్ అద్భుతం , స్టాఫ్ అద్భుతం , యాజమాన్యం అద్భుతం , ధర్మం నాలుగు కాళ్ళ మీద తాండవిస్తోంది ఇదీ సంక్షిప్తంగా ఆ కవర్ లో అందరూ విడివిడిగా రాసిన ఏకాభిప్రాయం . యాజమాన్యం చేస్తున్న తప్పులు , ఎడిటర్ తప్పుల గురించి అందరం రోజూ గంటల తరబడి మాట్లాడుకున్నా ఒక్క వాఖ్య కూడా ఒక్కరూ రాయలేదు ఆ తంతు ముగియగానే మళ్ళీ బృందాలుగా హోటల్ కు వెళ్ళాం . **** మనం నలుగురం ఇలా రాయాలి అనుకున్నాం కాబట్టి ఒకే రకంగా రాశాం . వేరే రెండు బృందాలు కూడా అచ్చం ఇలానే ఎలా రాశాయి . మనసులో ఉన్నది ఒక విషయం కూడా బయట పెట్టకుండా మనసులో మాట భలే రాశాం అందరం అని మమ్ములను మేం మెచ్చుకున్నాం . పాపం ఇంత జీవితానుభవం లేదు కాబట్టి ఎస్ మేడం కంపెనీ ఉద్యోగులు నిజం రాసి రోడ్డున పడ్డారు . రాజాలియాలు , మీడియా , కార్పొరేట్ కంపెనీ అని కాదు . మనుషులు అంతా ఇంతే ఓషో అన్నట్టు ఒక్క 24 గంటలు నిజాలే మాట్లాడితే ఏ బంధం నిలవదు . ఏ ఉద్యోగం ఉండదు . ఈ లోకం అబద్దాల మీదనే బతుకుతోంది దానిని అలానే బతకనిద్దాం అని నిషే చెప్పిన సత్యాన్ని కూడా ఓషో తన ఉపన్యాసంలో ప్రస్తావించారు . అబద్దాన్ని మీరు రక్షిస్తే అబద్దం మిమ్ములను రక్షిస్తుంది . ఇదే లోక రీతి . - బుద్దా మురళి ( జర్నలిస్ట్ జ్ఞాపకాలు 117 )

25, అక్టోబర్ 2024, శుక్రవారం

వంద రూపాయలు సంపాదించండి చూద్దాం ...

మీ అందరికీ ఓ సరదా సవాల్ ఓ వంద రూపాయలు సంపాదించండి చూద్దాం ... ఇదేం సవాల్ నెలకు లక్షల్లో సంపాదించే వారు ఉన్నారు . స్టాక్స్ లో ఒకే రోజుల్లో స్టాక్స్ లో లక్షలు వస్తాయి , పోతాయి . వంద ఓ లెక్కనా ? అంటే .. ఔను లెక్కనే ...ఈ వంద రూపాయల ఛాలెంజ్ ను విజయ వంతంగా పూర్తి చేయడానికి నాకు దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది .. మీరూ ప్రయత్నించి చూడండి ... ఈ సవాల్ ఐడియా నాది కాదు .. యండమూరి వీరేంద్ర నాథ్ గారిది ... ఈ సవాల్ గురించి మొదటి సారి విన్న తరువాత దాదాపు రెండు దశాబ్దాల తరువాత సక్సెస్ అయ్యాను ... నిజానికి ఈ సవాల్ గురించి తెలియని రోజుల్లో చదువుకొనేప్పుడే సక్సెస్ అయ్యాను . కానీ ఉద్యోగంలో చేరాక వంద రూపాయల ఛాలెంజ్ లో విజయం సాధించడం కష్టం అయింది . ఉద్యోగం , వృత్తి , వ్యాపారం లో లక్షలు సంపాదిస్తూ ఉండ వచ్చు .. మనం చేసే ఉద్యోగం వృత్తి నుంచి కాకుండా ఇంకో పని నుంచి కనీసం వంద రూపాయలు సంపాదిస్తే డబ్బు విలువ తెలుస్తుంది అని యండమూరి వీరేంద్రనాథ్ ఓ చోట రాశారు . అది చదివినప్పటి నుంచి ప్రయత్నించాను .. జర్నలిస్ట్ గా ఆంధ్రభూమిలో జీతం తో పాటు వ్యాసాలు రాసినందుకు పారితోషకం ఇచ్చే వారు . అది అదనపు సంపాదనే అయినా రాయడం అనే వృత్తిలో ఉన్నాను . అదే పని చేస్తున్నప్పుడు వేరే పని ద్వారా సంపాదన కాదు ... మన వల్ల కాదు అని వదిలేశా ... ఉద్యోగం తరువాత స్టాక్ మార్కెట్ ... ఇది కూడా వృత్తే ... ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఆదాయం రావచ్చు .. ఇది వేరే వృత్తి ద్వారా సంపాదించాలి అనే ఛాలెంజ్ కు సరిపోదు అనుకున్నాను ... ఆంధ్రభూమిలో పని చేస్తూ వ్యాసాలు రాయడం వృత్తిలో భాగం కానీ పుస్తకం ప్రచురించడం , అమ్మడం వృత్తి కాదు ... ఓ నెల క్రితం పోస్ట్ ఆఫీస్ లో లక్ష్మీ కటాక్షం బుక్ ను పోస్ట్ చేస్తున్నాను ... సెల్ ఫోన్ లో ఆ రోజు స్టాక్ మార్కెట్ చూస్తే నా ఇన్వెస్ట్ మెంట్ దూసుకెళుతుంది ... అది మాములే కానీ ఒక్క సారిగా సంతోషం వేసింది ... నేను రాసిన లక్ష్మీ కటాక్షం బుక్ అమ్ముడు పోతుంది . డబ్బులు వచ్చాయి అంటే మరో వృత్తి ద్వారా వంద రూపాయ లైనా సంపాదించాలి అనే టార్గెట్ పూర్తి అయినట్టే కదా ? అని సంతోషం వేసింది .. యండమూరి రాసిన ఛాలెంజ్ సినిమాలో హీరో చిరంజీవి 50 లక్షలు సంపాదిస్తా అని రావుగోపాల రావు తో ఛాలెంజ్ చేసి ... స్కూటర్ డిపాజిట్లు 50 లక్షలు వసూలు చేసి విజయం సాధిస్తాడు .. ఆ 50 లక్షలు డిపాజిట్లు అవుతాయి కానీ చిరంజీవి సంపాదించినట్టు కాదు కదా ? ఆ 50 లక్షలతో స్కూటర్ లు తయారు చేసి అమ్మితే ఖర్చులు పోగా మిగిలింది ఆదాయం అవుతుంది తప్ప 50 లక్షలు ఆదాయం కావు అని నా అభిప్రాయం ... మీ అభిప్రాయం ఇది . హీరో చిరంజీవి అభిప్రాయం అది అని యండమూరి సమాధానం ... ఆ సమాధానానికి అప్పుడు సంతృప్తి చెందలేదు కానీ ఇప్పుడు నేనూ అదే దారిలో .. పుస్తకం వ్యయం తీసేసిన తరువాత మిగిలేది లాభం అవుతుంది .. అప్పుడే వేరే వృత్తి నుంచి వంద రూపాయలు అయినా సంపాదించాలి అనే ఛాలెంజ్ లో సక్సెస్ అయినట్టు అవుతుంది కానీ బుక్ అమ్మగానే సక్సెస్ అయినట్టు కాదు అనేది ప్రాక్టికల్ వాదన ... ఐతే ఈ వాదనతో సంతోషం ఉండదు . అందుకే ఛాలెంజ్ హీరో వాదనకే ఓటు ... సంతోషం ముఖ్యం కానీ ప్రాక్టికల్ వదనాదేముంది .... ఇదీ విషయం లక్ష్మీ కటాక్షం పుస్తకానికి ఊహించని స్పందన వస్తోంది . సరదాగా మీరూ ప్రయత్నించి చూడండి ... మీ వృత్తి ఉద్యోగం నుంచి కాకుండా మరో పని ద్వారా వంద రూపాయలు సంపాదించండి .. అలా సంపాదిస్తే డబ్బు విలువ తెలుస్తుంది .. అప్పుడప్పుడు ఓలా బైక్ వాళ్ళతో మాట్లాడుతా ... వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం , చదువులో ఉంటూ పార్ట్ టైం సంపాదన కోసం ఓలా ... వీరికి డబ్బు విలువ తెలుసు ... కచ్చితంగా జీవితంలో ఎదుగుతారు అనిపిస్తుంది . అక్కినేని నాగేశ్వర రావు మీద phd చేస్తూ జర్నలిస్ట్ మిత్రుడు నామాల విశ్వేశ్వర రావు అక్కినేనిని తరుచుగా కలిసే వారు . తోటి నటులు కొందరు పేదరికంలో ఉండడాన్ని ప్రస్తావిస్తే .... కీలు గుర్రం సినిమా లో నటించినందుకు నెలకు ఐదు వందలు ఇచ్చారు .. చెక్క గుర్రం మీద రోజంతా కూర్చోవాలి .. మరో వైపు భారీ ఖాయం హీరోయిన్ ... చెక్క గుర్రం ఒరుసుకు పోయేది ... ఐదు వందల రూపాయలకు అంత కష్టపడాల్సి వచ్చేది ... కడుపు కట్టుకొని కూడబెట్టుకున్నాను ... ఐదు వందలు వృధా ఖర్చు చేయాలి అన్నా కీలు గుర్రంలో నెలంతా కష్టపడితే వచ్చిన జీతం అని మనసు అంగీకరించేది కాదు అని అక్కినేని చెప్పుకొచ్చారట ... మనం చెసే పని కాకుండా మరో పనితో వంద సంపాదించినా డబ్బు విలువ తెలుస్తుంది ... వృధా ఖర్చు తగ్గుతుంది .ట్రై చేసి చూడండి . - బుద్దా మురళి

22, అక్టోబర్ 2024, మంగళవారం

మా ఇంటి కథ :మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైనది జర్నలిస్ట్ జ్ఞాపకాలు 116^

మా ఇంటి కథ :మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైనది జర్నలిస్ట్ జ్ఞాపకాలు 116^ మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైంది ..  బాగుంటుంది . ^  సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం మామిత్రుడికి సీరియస్ గా చెప్పిన మాట . బహుశా  ఆరవ  తరగతి చదువుతున్నప్పుడు సికింద్రాబాద్ శివాజీ నగర్ లో చాలా కొద్ది నెలలు  అద్దెకు ఉండాల్సి వచ్చింది . రాత్రి తొమ్మిది అయితే చాలు లైట్ బంద్ చేసేవారు . ఓ రోజు తింటుండగా లైట్ బంద్ చేయగానే ఒక్కడినే ఉన్నాను .  దుఃఖం వచ్చినట్టు అయింది . ఏదో ఒక రోజు సొంత ఇల్లు ఉండాలి అని అప్పుడు అనుకున్నంత బలంగా ఎప్పుడూ అనుకోలేదు . ఆ తరువాత అంతకు ముందు అనేక చోట్ల ఉన్నా ఎప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురు కాలేదు . మూసీ పేరుతో హైడ్రా నిర్ధాక్షిణ్యంగా ఇల్లు కూల్చివేస్తోంది . ఒక మధ్యతరగతి నడివయస్కుడు గృహ ప్రవేశం చేసిన ఆరు రోజులకే హైడ్రా ఇంటిని కూల్చేసింది . అన్ని అనుమతి పత్రాలను మీడియాకు చూపిస్తూ అనుమతులు ఉన్నాయి , బ్యాంకు లోన్ ఇచ్చింది ఇంకేం చూస్తాం అంటూ అతను ఏడవ లేక కుమిలిపోతున్నారు . ఇల్లు కూల్చినా రోజూ కూలిన ఇంటి వద్దకు వెళ్లి దీనంగా చూస్తున్నాడు . అతను ఏడిచే వీడియో చూశాక బాగా ఇబ్బంది అనిపించింది . నాకే అలా అయినట్టు అనిపించింది . అతను ఎవరో నాకు తెలియదు కానీ ఒక మధ్యతరగతి తండ్రి సొంత ఇంటి ద్వారా తన కుటుంబానికి భరోసా ఇవ్వాలి అని ఎలా కలలు కంటాడో నాకు తెలుసు . అన్ని కోరికలు చంపుకొని పిల్లలకు ఇంటి ద్వారా భరోసా ఇవ్వాలి అనుకుంటాడు . కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి , రాజకీయ వ్యాపారం చేసేవారికి ఇల్లు అంటే పెద్దగా సెంటి మెంట్ ఉండక పోవచ్చు . ఉండాలని లేదు . కానీ సామాన్యులకు , కుటుంబమే ప్రపంచంగా బతికేవారికి ఇల్లు కూలిస్తే తమ ప్రపంచం కూలి పోయినట్టు , తమను ముక్కలు చేసినట్టు, బతికి ఉండగానే సమాధి చేసినట్టు అనిపిస్తుంది . అతని గురించి పదే పదే ఆలోచిస్తుండడంతో  జర్నలిస్ట్ గా నా  ఇంటి కథ గుర్తుకు వచ్చింది . **** 2004-5 ప్రాంతంలో భూదేవి నగర్ లో ప్లాట్ కొన్నాను . దాదాపు అదే సమయంలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ముఖ్యమంత్రిగా వై యస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు . ఒక వైపు ప్రభుత్వం ల్యాండ్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటే మీరు ఇదే సమయంలో అంత ఇబ్బంది పడి ప్లాట్ కొనడం ఎందుకు అని తోటి జర్నలిస్ట్ విజయప్రసాద్ లాంటి మిత్రులు చెప్పేవారు . మన చేతులో ఉన్న అంశం పై మనం నిర్ణయం వెంటనే తీసుకోగలం , ప్రభుత్వం , వందల మంది జర్నలిస్ట్ లు , వ్యవస్థలు ఎన్నో ఉంటాయి .  ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అసలే మేధావులతో వ్యవహారం .  వచ్చేది వస్తుంది నేను కొనేది కొంటాను అని చెప్పాను . కొన్నాను అప్పుడు ఊరవతల దిగువ మధ్య తరగతి నివసించే ప్రాంతం . రోజూ వార్తల కోసం తిరిగేది బంజారాహిల్స్ లో అయినా దానికి అన్ని కోణాల్లో భిన్న మార్గంలో ఉన్న భూదేవి నగర్ ను ఎంపిక చేసుకున్నాను . చదువుకునే రోజుల్లో క్లాస్ మెట్ తిరుమలగిరిలో ఉండేవాడు . సికింద్రాబాద్ నుంచి తిరుమల గిరి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం . వాళ్ళ ఇంటికి వచ్చాక , ఇంత దూరం నుంచి వస్తావా అని అతని మీద జాలి చూపించాను . తిరుమల గిరి నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న భూదేవి నగర్ లో ప్లాట్ కొని  క్లాస్ మెట్ పై జాలి చూపిన సంఘటన గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను . ***ఇంటి నిర్మాణం పనులు జరుగుతుంటే వెళుతుంటే ఒకప్పటి నక్సలైట్ , తరువాత జర్నలిస్ట్ కవి అయిన మిత్రుడు చారి ఫోన్ చేసి వచ్చేయ్ అన్నాడు . ఇంటి పని చూసేందుకు వెళుతున్నాను రాలేను అంటే . దారిలోనే కదా ? అదేమన్నా తాజ్ మహల్ నా ? రోజంతా చూసేందుకు చూసి వచ్చేయ్ జూబ్లీ బస్సు డిపో దగ్గరే ఇల్లు వచ్చేయ్ ఎదురు చూస్తుంటా  అంటే నేను సీరియస్ గా మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందంగా ఉంటుంది . వందో 50 రూపాయలో ఇస్తే తాజ్ మహల్ ను ఇలా చూసి అలా వచ్చేయ వచ్చు . మా ఇంటిని అలా చూసి రాలేను చాలా అందమైనది . వంద , 50 రూపాయలది  కాదు అంటూ సీరియస్ గా సమాధానం చెప్పాను . ***సరే మీ ఇంటిని తాజ్ మహల్ తో పోల్చడం అతి కదా ? అది సరే ఇల్లు ఎలా ఉంటుంది ? అంటారా ? వంశీ సినిమాలో కనిపించే  సెట్టింగ్ లా ఉంటుంది . పై నుంచి చూస్తే రైలు పట్టాలు , పచ్చని చెట్లు , రైల్ వే స్టేషన్ వంశీ చూస్తే ..... ఇది పై నుంచి చూస్తే కనిపించే దృశ్యం . కింద నుంచి చూస్తే మృణాల్ సేన్ సినిమాలో పేదల ఇండ్ల సెట్టింగ్ కు జీవం పోస్తే ఎలా ఉంటుందో  అచ్చం అలానే ఉంటుంది . ఇంటి నిర్మాణ పనులు చేసే కూలీలు రైల్ వే గోడను ఆనుకొని  బొమ్మరిల్లు లాంటి ఇండ్లను నిర్మించుకొని ఉన్నారు . వారికి హైడ్రా భయం లేదు . అదేమీ చెరువు కాదు రోడ్డు కాబట్టి భయం లేదు . నా ఒక్కనికే కాదు మధ్యతరగతి వారికే కాదు సంపన్నులకు ... ప్రతి మనిషికి తమ ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైనది , గొప్పది . తాజ్ మహల్ మరణించిన ప్రేమకు చిహ్నం . ఇల్లు  తమ కుటుంబానికి రక్షణ . ఇల్లు ఇచ్చే భరోసాతోనే మధ్యతరగతి కుటుంబ రావు పిల్లలకు విదేశాల్లో ఖరీదైన చదువు చెప్పిస్తాడు .  రైటర్ మెంట్ జీవితానికి ఇల్లు భరోసా ఇస్తుంది . ****ఆంధ్రభూమిలో పని చేసేప్పుడు రాంలాల్ అని సీనియర్ ఉండేవారు . ఓ రోజు క్యాంటిన్ లో చర్చ . జూబ్లీ హిల్స్ హోసింగ్ సొసైటీలోని ప్లాట్ అమ్మి నేరేడు మెట్ లో ఇల్లు , ప్లాట్ కొన్నాడు . అప్పుడు జూబ్లీ హిల్స్ లో లక్ష రూపాయలకు గజం .  అమ్మిన ప్లాట్   విలువ మూడు కోట్లు , ఇప్పటి మీ ఆస్తి లెక్క పెడితే 2. 4 కోట్లే అవుతుంది . అంటే మీ నిర్ణయం 60 లక్షల నష్టం అంటే అతను ఇచ్చిన సమాధానం . మురళి నేను జీవిత కాలం అంతా అద్దె ఇంట్లో ఉన్నాను . అద్దె ఇల్లు , ఆంధ్రభూమిలో ఉద్యోగం ఏమవుతుందో అనే భయం తోనే జీవితం గడిచిపోయింది . మా పిల్లలు చిన్నప్పటి నుంచి సొంత ఇంటిలో పెరిగారు . వారిలో బోలెడు ఆత్మ విశ్వాసం కనిపిస్తుంది . మంచి చదువులు , డిఫెన్స్ లో మంచి స్థాయిలో ఉన్నారు . దీనికి ఎంత లెక్క కడతావు అని బదులిచ్చాడు . సొంత ఇల్లు ఇచ్చే భరోసాకు  కరెన్సీ లో లెక్కలు ఉండవు . ముఖేష్ అంబానీ తన భార్యకు కోట్ల రూపాయల విలువ చేసే  భవనాన్ని  పుట్టిన రోజు బహుమతి ఇచ్చాడు . స్టాక్ మార్కెట్ అమితాబ్ రాకేష్ జున్ జున్ వాలా మార్కెట్ లో తాను ఎన్నివేల కోట్లు సంపాదించాడో చెబుతుంటే వాళ్ళ అమ్మ అవేవీ పట్టించుకోకుండా ఇల్లు కొంటావా ? లేదా అని పోరు పెట్టింది . క్రిసిల్ రేటింట్ స్టాక్ అమ్మి ఇల్లు కొన్నాడు . ఇప్పడు ఇంటి విలువ 200 కోట్లు అయితే  ఆ స్టాక్స్ అమ్మకుండా అలానే పెట్టుకొంటే వాటి విలువ ఇప్పుడు రెండు వేల కోట్లు అయి ఉండేదని చెప్పుకొచ్చాడు . ఓ ఇంటర్వ్యూ చూస్తే ఒకతను నెలకు మూడు లక్షల అద్దె చెల్లిస్తున్నాడు . నా పెట్టుబడి కి మార్కెట్ 18 శాతం ఆదాయం ఇస్తుంటే నేను ఇంటి విలువకు నాలుగు శాతం వడ్డీ మాత్రమే అద్దెగా చెల్లిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు అంకెల  పరంగా అద్దె ఇల్లు లాభసాటి కానీ .. సొంత ఇల్లు ఇచ్చే భరోసా , సంతోషం , ఆనందాన్ని లెక్కించే అంకెలు లేవు . నేను ప్లాట్ కొన్న సమయంలోనే కొందరు జర్నలిస్ట్ మిత్రులు మన్నెవారి తుర్కపల్లి గ్రామంలో పొలం చూద్దామని వెళ్లారు .వారికి అప్పుడు చెప్పలేదు కానీ అది మా సొంతూరు . పుట్టగానే హైదరాబాద్ రావడం వల్ల హైదరాబాద్ నే సొంతూరు . తుర్కపల్లి  మెయిన్ రోడ్ లో అప్పుడు 80 వేలకు ఎకరం . నేను ఇల్లు కట్టకుండా పొలం కొంటే కనీసం 10 ఎకరాలు వచ్చేది . ఆ పొలం దాదాపు రెండు కోట్ల వరకు పెరిగింది . కానీ నా నిర్ణయం తప్పుఅని ఎప్పుడూ అనిపించలేదు . జీవితం అంటే కేవలం అంకెలే కాదు అంతకు మించి... .  ...  ఇంటికన్నా మించిన ఆదాయం ఇచ్చే ఇన్వెస్ట్ మెంట్ గురించి నాకు బాగా తెలుసు . అయితే ఇల్లు , ఇన్వెస్ట్ మెంట్ రెండింటిలో ఒకటి అంటే నా ఓటు ఇంటికే .. ***ప్లాట్ కొన్నాక లంచం కోసం బిల్డర్ ను వేధిస్తూ మున్సిపల్  కమిషనర్ వేధించాడు . మధ్యలో నేను ఇరికి పోయాను , ఉన్న డబ్బు అంతా ఇన్వెస్ట్ చేసి అని నా ఆందోళన . దిగులుగా ఆలోచనలో పడిపోయినప్పుడు ఎడిటర్ పిలిచి ఆంధ్రప్రభకు వెళ్లి రమ్మని  సొంత పని చెప్పాడు . దిగులుతో అది మరిచిపోయా .. కోపం వచ్చి  పొలిటికల్ రిపోర్టింగ్ నుంచి ఎడ్యుకేషన్ రిపోర్టింగ్ కు మార్పు . ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ రిపోర్టింగ్ అంటే తినే సమయం , అర్ధరాత్రి తప్ప అంతా బిజీ . హమ్మయ్య అని ఇంటి నిర్మాణం మీద ఎక్కువ సమయం కేటాయించా . ఓ రోజు ఎడిటర్ పిలిచి మాట్లాడితే టీడీపీ రిపోర్టింగ్ అయితే అస్సలు సమయం దొరికేది కాదు ఎడ్యుకేషన్ బీట్ వల్ల హాయిగా దగ్గరుండి ఇంటి నిర్మాణం చూసుకున్నాను అని బదులిచ్చాను . అలా చెబితే ఏమవుతుందో నాకు తెలుసు . మరుసటి రోజు ఎడిటర్ పిలిచి రేపటి  నుంచి పొలిటికల్ బీట్ చూడు అంటూ ఆదేశం . ****ఔను మీరు ప్లాట్ కొనే సమయంలోనే వై యస్ రాజశేఖర్ రెడ్డి జర్నలిస్ట్ లకు ల్యాండ్ కేటాయించారు అన్నారు ఏమైంది ? అంటే ఒక కోర్ట్ నుంచి ఇంకో కోర్ట్ కు కేసు మారుతూ ఉంది . అసలే మేధావుల సమస్య అంత త్వరగా తేలదు . 2005 నుంచి. ఇప్పటి వరకు నాది ఒకటే మాట ఏదో ఒక రోజు తేలుతుంది . ఎప్పుడూ అనేది తెలియదు . తొలుత కోర్ట్ గడప తొక్కింది సభ్యత్వం రాని జర్నలిస్ట్ లు . ఒక్క సారి వ్యవహారం మన చేయి నుంచి పోయి కోర్ట్ బోనులో పడ్డాక ఎప్పుడు ముగింపు నో ఎవరికీ తెలియదు . - బుద్దా మురళి 

3, అక్టోబర్ 2024, గురువారం

మహనీయుల జీవితాలను దుర్భరంగా మార్చిన నిర్లక్ష్యం : మనకు జీవిత పాఠాలు 

లక్ష్మీ కటాక్షం జీవితంలో డబ్బుకు ప్రాముఖ్యత ఉంది అని మీరు భావిస్తే చదవాల్సిన పుస్తకం . తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పటి నుంచి భూగర్భంలో శాశ్వత నిద్రలోకి జారుకునేంత వరకు మనిషి జీవితంలో ప్రతి దశలో డబ్బుకు ప్రాముఖ్యత ఉంటుంది .. అది గ్రహించక పోతే మహా మహుల జీవితాలు కూడా అంతిమ దశలో దయనీయంగా గడిచాయి . సువిశాల భారత దేశాన్ని పాలించిన మొఘల్ వంశీయులు కలకత్తాలో చిన్న టీ కొట్టు పెట్టుకొని బతుకు తున్నారు . ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ లు నెల జీతంతో నటించిన రోజుల్లో సినిమాకు లక్ష రూపాయల పారితోషకం తీసుకున్న తొలి సూపర్ స్టార్ చిత్తూరు నాగయ్య చివరి దశలో కడుపు నింపుకోవడానికి చిన్న చిన్న పాత్రలు వేశారు ... హీరోలను మించి సంపాదించిన రాజనాల చివరి దశలో తిండికే ఇబ్బంది పడ్డారు . రజనీ కాంత్ ను సూపర్ స్టార్ ను చేసిన నిర్మాత వృద్ధాప్యంలో తనకో ఇల్లు దానం చేయండి అని వేడుకున్నాడు .. ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో జీవితం శాశ్వతంగా అలానే ఉంటుంది అని భావించి చివరి దశలో దుర్భర జీవితం గడిపిన ఎందరో మహానుభావుల జీవితాలను కళ్లముందుంచిన లక్ష్మీ కటాక్షం - డబ్బుకు విలువ ఇస్తేనే నిలుస్తుంది -పుస్తకం జీవితం మారకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెబుతుంది . మన భవిష్యత్తు , పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే డబ్బును ఎలా గౌరవించాలో చెబుతుంది . తొలి తరం సినిమా నటుల దుర్భర జీవితం ఆ తరువాత తరం వారికి డబ్బు గురించి ఎన్నో పాఠాలు నేర్పింది .. ఆ పాఠాలు మనమూ నేర్చుకోవడానికి లక్ష్మీ కటాక్షం మానసికంగా మనల్ని సిద్ధం చేస్తుంది . నవోదయ , న్యూ విశాలాంధ్ర , అమెజాన్ లలో పుస్తకాలు లభ్యం . 168 పేజీలు .. ధర 200 వివరాలకు వాట్సాప్ నంబర్  9849998087  - బుద్దా మురళి

19, సెప్టెంబర్ 2024, గురువారం

ఓ గోల్డ్ మెడలిస్ట్ అనాధ మరణం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -115

ఆమె యూనివర్సిటీ లో గోల్డ్ మెడల్ సాధించారు . ప్రభుత్వాలను శాసించే నంబర్ వన్ సంస్థ లో జీవితాన్ని ప్రారంభించి ..దాదాపు నాలుగు దశాబ్దాలు అదే జీవితం . ఆమెది ఒంటరి జీవితం . హైదరాబాద్ మహానగరం లో ఒంటరిగా గదిలో ప్రాణాలు విడిచింది .తలుపు బద్దలు కొట్టి చూస్తే తప్ప ఆమె మరణం బయటి వారికి తెలియలేదు . అనాధ శవానికి పోలీసులు , మున్సిపాలిటీ అంత్యక్రియలు నిర్వహించారు . .... ఈ వార్త టీవీ వారి దృష్టిలో పడితే పండగే ... మానవత్వం మంటగలిసింది ... ఎక్కడికి వెళుతున్నాం ... మనుషుల మేనా అంటూ వీలైతే సినిమా పాటలతో అద్భుతంగా మానవత్వాన్ని తట్టిలేపే విధంగా చక్కిని స్టోరీ ప్రసారం చేసే వారు . పత్రికల్లో ఐతే చేయి తిరిగిన సబ్ ఎడిటర్ చేతిలో పడితే కన్నీళ్లు పెట్టించే కవిత్వంతో వార్త వెలుగు చూసేది .. మరణం నిజమే ... కానీ టివిలో , కానీ మీడియాలో కానీ హృదయ విదారక కథనాలేమి రాలేదు .. ఎందుకంటే అలా మరణించింది ఓ మహిళా జర్నలిస్ట్ ... ఎవరైనా ఇలా మరణిస్తే జర్నలిస్ట్ లు హృదయ విదారకంగా కథనం రాస్తారు కానీ జర్నలిస్ట్ మరణిస్తే అలా రాయరు. ఎందుకలా అంటే అదంతే ... .... జంధ్యాల భారతి పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం లో జర్నలిజం లో గోల్డ్ మెడల్ సాధించారు ... ఈనాడు లో జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి తరువాత ఫ్రీ లాన్సర్ గా ఉన్నారు .. మిత్రుడు నామాల విశ్వేశ్వర్ రావు ఫోన్ చేసి జంధ్యాల భారతి సంస్మరణ సభ నిర్వహించాలి అని నాకు ఉంది .. ఆమె ఇలాంటివి తనకు నచ్చవు వద్దు అని గతంలో చెప్పారు అని కొందరు అంటున్నారు .. మీ అభిప్రాయం ఏమిటీ అని అడిగారు .. మీరు సంస్మరణ సభ నిర్వహించినా , నిర్వహించక పోయినా పోయిన వారికి తెలియదు .. మనం ఎలా బతుకుతున్నాం అని మనకు మనం చెప్పుకోవడానికి .. మన జీవితాన్ని మనం సమీక్షించుకోవడానికి సభ నిర్వహించాలి అనేది నా అభిప్రాయం అని చెప్పాను ... ఆమె కోసం కాదు మన కోసం అవసరం అని చెప్పాను ... .... నిన్నటి రోజంతా ఈ విషయం మీదే చర్చ ... ఆలోచన ... ఆమెతో పెద్దగా పరిచయం లేదు ..ఆంధ్రభూమిలో ఉండగా చాలా సార్లు చూశాను .. ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా అన్ని పత్రికలకు రాసే వారు ... ముందు ప్రభ తరువాత కరోనా లో భూమి లో పారితోషకం ఇవ్వడం మానేశాక రాయడం మానేశారు .. మిత్రుడు విష్వఈశ్వర రావు చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఈనాడు లోనే జర్నలిజం జీవితాన్ని ప్రారంభించారు .. ఎం వి ఆర్ శాస్త్రి , కె యల్ రెడ్డి వంటి వారితో కలిసి ఈనాడులో పని చేశారు . అక్కడి ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ... అక్కడ ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమి కాదు ... ఐతే ఇద్దరిలో ఒకరు రాజీనామా చేయాలి ఇది నిబంధన .. ఆమె రాజీనామా చేసింది .. కాపురం మూన్నాళ్ళ ముచ్చట కాదు ఒక రోజు ముచ్చట గానే మిగిలి పోయింది ... మళ్ళీ ఒంటరి జీవితమే ... ప్రైవేటు ఉద్యోగం అంటేనే బతుకు భయం భయం ఇక జర్నలిస్ట్ ఉద్యోగం అంటే మరింత భయం ...ఆమె అలానే జీవితమంతా భయం తో కలిసి బతికింది చనిపోయింది ... .... అందరి జీవితాలు ఇలానే ఉంటాయి అని కాదు సినిమా రంగం , జర్నలిజం , రచయిత ఏ రంగం ఐనా కావచ్చు ... ఎవరి బతుక్కు వారే కారణం ... సమాజం , తోటి వారు , యూనియన్ లు అని మాట్లాడితే పలాయన వాదమే అవుతుంది .. జర్నలిజం నుంచి సివిల్స్ కు ఎంపిక అయిన వారు ఉన్నారు ... ముందుకు బానిసలైన వారు ఉన్నారు ... ఆయేషా అని దక్కన్ క్రానికల్ లో క్రైం రిపోర్టర్ ఉండేవారు .. అమ్మాయి అయినా ఎప్పుడూ మార్చురీల చుట్టూ తిరిగేది ... ఇప్పటిలా వాట్స్ ఆప్ జర్నలిజం కాదు కాబట్టి రోజూ మార్చురీకి వెళ్ళేది ... ఐనా ఆఫీస్ లో వేధింపులు ...ఉద్యోగం వదిలేసింది . కొంతకాలం తరువాత ఆమె ఏకంగా జిల్లా కలెక్టర్ అయ్యారు .. చిన్న వయసు వారు కనిపిస్తే బోలెడు ప్రభుత్వ ఉద్యోగాలు , బ్యాంకు రైల్ వే ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తుంటాయి వెళ్లొచ్చు కదా ? అనేవాడిని ... అలా వెళ్లిన ఎంతో మందిని చూశా ... శ్రీ శ్రీ , వేటూరి సుందర రామ మూర్తి వంటి గొప్ప వారు మొదట్లో జర్నలిస్ట్ లే ... ఇవి ఆ రోజులు కాదు .. ఇతర రంగాల్లో రాణించిన వారిని చూశా అనాధల్లా మరణించిన వారిని చూశా ... ... భూమిలో చిక్కడ పల్లి చారీ అని ఒక పార్ట్ టైం విలేఖరి ఉండేవారు ... ఓ రోజు సార్ నేను ఎడిటర్ ఇంటికి వెళ్తా , ఎడిటర్చెప్పిన పని చేస్తా కానీ ఆఫీస్ కు వచ్చాక న్యూస్ ఎడిటర్ , బ్యూరో డెస్క్ అందరి మీద అధికారం చెలాయిస్తా ... నేను ఒక్కరికి తలవంచి అందరినీ భయపెడతా అని చెప్పుకుంటూ పోయా డు .. భ్రమల్లో బతుకుతున్నాడు పాపం అనిపించింది . అతని గురించి కొన్ని రోజుల తరువాత తెలిసింది .. చనిపోయాడు నాలుగు రోజులు మార్చురీలోనే శవం ... ఎవరూ రాలేదు ... ఎన్టీఆర్ ను దించేసి సమయం ... అప్పుడు సెల్ ఫోన్లు లేవు .. సచివాలయం ప్రెస్ రూమ్ లో ల్యాండ్ లైన్ ... ఓ జర్నలిస్ట్ తన వంతు వచ్చే వరకు నిలబడి మెల్లగా ఫోన్ లో సచివాలయంలో బాబు ఛాంబర్ లో ఎంత మంది శాసన సభ్యులు చేరారో రామోజీ రావుకు చెబుతున్నాడు ... ఆ సాయంత్రమే శిబిరం వైస్ రాయ్ కి మారింది .. ప్రభుత్వాన్ని కూల్చడం లో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారు కూడా అంత మెల్లగా తన పని తాను చేసుకు పోతుంటే ... మందు మత్తులో అమెరికా అధ్యక్షున్ని కూడా ప్రెస్ రూమ్ నుంచే మార్చేస్తున్నట్టు మాట్లాడే వారిని కూడా చూశా ... ప్రపంచం లో ప్రతి పరిణామం పై సమీక్షించే మనం మన జీవితాన్ని కూడా సమీక్షించు కోవాలి లేదంటే ? ఆరోగ్యం , మానవ సంబంధాలు , డబ్బు అన్నీ జీవితానికి ముఖ్యమే ... బెంగళూరులో ఓ సీఏ ఆఫీస్ లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్నారట ... అంత్యక్రియలకు ఎవరూ రాలేదట ... వాస్తవం ఇలానే ఉంటుంది ... భ్రమలు వదిలి వాస్తవం లోకి రావాలి ... ఓ వీడియో వింటుంటే నూతన్ ప్రసాద్ గురించి యండమూరి వీరేంద్ర నాథ్ ఓ మాట చెప్పారు ... సినిమా షూటింగ్ ప్రమాదంలో నడుము వరకు చచ్చుపడడం తో నూతన్ ప్రసాద్ వీల్ చైర్ కే పరిమితం అయ్యారు .. జీవితంలో అనుకోకుండా వచ్చే ప్రమాదాలకు ముందే సిద్ధం అయి ఉంటే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది అని చెప్పారట ... ఏ ఉద్యోగంలో ఉన్న వచ్చే ప్రమాదాలను ముందే ఊహించుకుంటే జీవితం అగమ్య గోచరంగా ఉండదు ... సీఎం తెలుసు పీఎం తెలుసు అంటూ భ్రమల్లో బతికితే .... - బుద్ధా మురళి