నేతాశ్రీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నేతాశ్రీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, మే 2014, మంగళవారం

మిస్టర్ లోకేశం



సూపర్ స్టార్ కృష్ణ కొడుకైనా సత్తాలేకుండా సినిమాల్లోకి వస్తే.. రమేష్ బాబు అవుతాడు? సత్తా చూపితే మహేష్ బాబు అవుతాడు.
***
ఎవరైనా ఊపిరి తీసుకుని బతుకుతారు. ఆయన మాత్రం రాజకీయమే ఊపిరిగా బతుకుతారు. చదువుకునే రోజులనుంచే రాజకీయ ఎత్తుగడలు నేర్చుకున్న చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్. కానీ -ఆయన రాజకీయ రంగ ప్రవేశమే పేలవంగా జరిగింది. తేదీలు ప్రకటించి ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, చిరంజీవి లాంటి వారంతా తాము సినిమా రంగంలో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడే వారసులను తెరపైకి తెచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం వరుసగా రెండుసార్లు ఓడిపోయి సంక్షోభంలో పడిన సమయంలో తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తన పాదయాత్ర ముగింపు సభలో లోకేశ్‌ను ప్రవేశపెట్టాలనే ప్రయత్నం కుటుంబ రాజకీయాలతో ఫలించలేదు. సైకిల్ యాత్ర అంటూ హడావుడి చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక, లోకేశ్‌ను రాజకీయాలకు విడుదల చేశారు.
‘నగదు బదిలీ పథకం సృష్టికర్త’ -అంటూ నారా లోకేశ్ ట్విట్టర్‌లో తన గురించి తాను రాసుకున్నారు. ‘తెరవెనుక పార్టీ ప్రచారానికి వ్యూహ రచన చేసేది మా అబ్బాయే’ -అని బాబు మురిపెంగా చెప్పుకున్నారు. కానీ, జనం మాత్రం లోకేశ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ‘ఏమంటివేమంటివి..’ అంటూ ఎన్టీఆర్‌లా డైలాగులు చెప్పాలని పవన్ ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది. లోకేశ్ ప్రయత్నం కూడా అలానే ఉంది. ఏదో ఆవేశంగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు, సాధ్యం కావడం లేదు. కుల పిచ్చి ఉన్న పార్టీ తెదేపానే.. అని ఒకసారి, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మనకు మనం ఉరివేసుకున్నట్టేనని మరోసారి ఆవేశంగా మాట్లాడడం వెనక ఉన్నవారు జాగ్రత్తలు చెప్పడం ఈ వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు వినోదాన్ని కలిగిస్తున్నాయి.

అనంతపురం జిల్లాలో లోకేశ్ తొలి రాజకీయ సభ. ఆ సభ ఏర్పాటు చేసి లోకేశ్ పక్కనే ఐదారు గంటలపాటు ఓ యువనేత కూర్చోవాల్సి వచ్చింది. నాలుగు రోజుల తరువాత మళ్లీ కలిస్తే -ఎవరు? అని అడిగారట లోకేశ్. తనను తాను మళ్లీ పరిచయం చేసుకున్నాడు యువనేత. రాజకీయాల్లో రాణించాలంటే అస్సలు ఉండకూడని లక్షణమిది. ఒకరకంగా చంద్రబాబు అదృష్టవంతుడు. తన పార్టీలోనే కాదు తన ఇంట్లో సైతం ఆయనకు ఎలాంటి పోటీ లేదు. శరీరం సహకరించినంత వరకు రాజకీయాల్లో కొనసాగే అదృష్టం ఉన్న నాయకుడు చంద్రబాబు.

రాజకీయాల్లోకి రావడం కోసం లోకేశ్ ఒక చానల్‌ను నిర్వహించాలని ప్రయత్నించినా సాధ్యంకాక చేతులెత్తేశారు. తండ్రి నిలబెట్టిన హెరిటేజ్ నిర్వహణలో మాత్రం దూసుకు వెళ్తున్నారు. మాట తీరు, వ్యవహారం, ఏ ఒక్కటీ రాజకీయాల్లో రాణించే లక్షణాలు లోకేశ్‌లో కనిపించడం లేదు. మీడియా అభిమానంతో ఆకాశానికెత్తినా నిలబడలేరు. సూటిగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడం, ప్రజల్లో మమేకం కావడం, అనుచరులకు విశ్వాసం కలిగించడం వంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. 

వైఎస్సార్, చంద్రబాబు ఒకప్పుడు మంచి మిత్రులు.. ఇద్దరూ 78 బ్యాచ్ ఎమ్మెల్యేలే. ఇద్దరి సంతానం రాజకీయాల్లోకి వచ్చింది. కానీ ఇద్దరికీ పోలికే లేదు. బాబును తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం అతనిలోని రాజకీయ నేతను, తెరవెనుక వ్యూహాల్లో ఆయన తెలివిని కాదనలేరు. కానీ లోకేశ్‌లో అవేవీ మచ్చుకైనా కనిపించవు. కానీ -లోకేశ్‌ను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు పిలిచి సీటు ఇచ్చాయని బాబు చెబుతుంటారు. వినేవాళ్లుంటే చంద్రబాబు చాలా చెప్తారంటారు -మీడియా మిత్రులు.

4, మే 2014, ఆదివారం

దారితప్పిన మేధావి

సబ్బం హరి. ఈ పేరు తలుచుకోగానే ఔను ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? గతంలో ప్రతిరోజూ టెలివిజన్ చర్చల్లో కనిపించే వారు కదా! ఇప్పుడు కనిపించడం లేదేమిటి? అనే ప్రశ్నలు ఒకదాని తరువాత ఒకటి తన్నుకొస్తాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా బలమైన వాదన వినిపించేవారు. ఇప్పుడాయన ఏం చేస్తున్నట్టు? -అంటే విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తున్నారు? అదీ -జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి. ఇది నిజ్జంగా నిజం. ఆ పార్టీకి ఆయన ఉపాధ్యక్షుడు కూడా. 

టెలివిజన్ చర్చలు దెబ్బతీసిన నాయకుల్లో సబ్బం హరి ఒకరు. వైఎస్సార్ ఉండగా, ఆయనకు గట్టి మద్దతుదారునిగా నిలిచారు. వైఎస్సార్ మరణం తరువాత అంతకుమించి జగన్‌కు అండగా నిలిచారు.. జగన్ మీద ఈగవాలినా సహించక పోయేవారు. రోజూ టెలివిజన్ చానెళ్లలో కనిపిస్తూ జగన్‌కు అండగా నిలిచారు. అంతా బాగానే ఉంది. కానీ గొప్ప మేధావిని అనే గట్టి నమ్మకం ఆయన్ని రాజకీయాల్లో దెబ్బతీసింది. అసలే మేధావిననే నమ్మకం.. పైగా టీవీ చర్చలు. ఊరికే ఉంటారా? జగన్ యూపీఏకు మద్దతిస్తారంటూ ప్రకటించేశారు. సబ్బం వ్యాఖ్యలను అందిపుచ్చుకున్న తెదేపా -జగన్‌పై దాడి మొదలెట్టింది. దాంతో వైకాపా వాళ్లు మేం ఎవరికి మద్దతిస్తామో చెప్పడానికి సబ్బం హరికి సంబంధమేంటి? ఆయనసలు మా పార్టీనే కాదు, ఆయనకు మా పార్టీ సభ్యత్వం కూడా లేదు -పొమ్మన్నారు.
మేధావి అహం దెబ్బతింది. నేనేమీ వైకాపా సభ్యత్వం కోసం 

దేబిరించలేదు అంటూ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌లో ఉండి జై సమైక్యాంధ్ర అంటున్నందున ఏకంగా జై సమైక్యాంధ్రనే నమ్ముకుంటే పోలే అనుకుని కిరణ్ అధ్యక్షతన ఉన్న జై సమైక్యాంధ్ర పార్టీకి ఉపాధ్యక్షుడయ్యారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో బాగా ఊహించి అధినాయకుడు కిరణ్‌కుమార్‌రెడ్డినే పోటీకి దూరంగా ఉంటున్నందున పోటీలో ఉన్న సబ్బం హరి పరిస్థితి ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలుగుతాడని భావించిన నాయకుడు చివరకు ఇలా అయిపోయారు. జగన్ జైలులో ఉన్నంతకాలం ఆయనకు మద్దతుగా నిలిచారు. తీరా బయటకు వచ్చే సమయానికి పార్టీ వీడి వెళ్లారు. విశాఖ మేయర్‌గా పని చేసిన సబ్బం హరి, 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో కృషి చేశారు. పార్లమెంటులో చివరి వరకూ పోరాడారు. సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టటంతో కాంగ్రెస్‌కు దూరమయ్యారు. టీవీ చర్చలతో జగన్ పార్టీకి దూరమయ్యారు. కిరణ్‌కు చేరువైనా, కిరణ్‌కే రాజకీయ జీవితం లేనప్పుడు ఇక సబ్బానికేముంటుంది? అన్న సంపతీ డైలాగులు ఎదుర్కొంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఐదుశాతం ఓట్లు కూడా రావని లెక్కలు 
చెబుతున్న సబ్బం, తనకు ఎన్ని శాతం ఓట్లు వస్తాయో చెప్పలేకపోతున్నారు. విశాఖ మేయర్‌గా పట్టణంలో మంచి పట్టుసాధించారు. హేమాహేమీలను తట్టుకుని 2009లో పార్లమెంటుకు ఎన్నికైన సబ్బం రాజకీయ జీవితం ఇప్పుడు క్రాస్‌రోడ్‌లో ఉంది.

29, ఏప్రిల్ 2014, మంగళవారం

తెలంగాణ జెండా

కె సిఆర్ -ఈ మూడక్షరాలు తెలంగాణ జెండా.. తెలంగాణ ఆస్తిత్వం... తెలంగాణ ఉద్యమం.. 2001 స్థానిక సంస్థల ఎన్నికలు. నర్సాపూర్ ప్రాంతంలో కేసీఆర్ హెలికాఫ్టర్‌లో వచ్చి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించి వెళ్తుంటే -ఒక పోలీసు అధికారి ముఖంలో ఆనందం వెళ్లివిరిసింది. కేసీఆర్‌తో కరచాలనం చేసి తన ఆనందాన్ని పంచుకోకుండా ఉండలేకపోయాడు. అతనిలోని అంతటి ఆనందానికి కారణం -తన ఉపన్యాసంలో కెసిఆర్ ఉపయోగించిన పదాలు. సిరా ఆరకముందే పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారని కెసిఆర్ చేసిన ఉపన్యాసాన్ని ప్రస్తావిస్తూ ‘సిరా’ ఈ మాట వినగానే నా బాల్యంలోకి వెళ్లిపోయాను. ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాట అంటూ ఆ అధికారి తనకన్నా చిన్న వయసు వ్యక్తితో ఆనందాన్ని పంచుకున్నాడు.

తెరాస ఆవిర్భావం తరువాత తెదేపా పతనం మొదలైందా? తెదేపా పతనం నుంచి తెరాస ఆవిర్భవించిందా? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావచ్చు. కానీ తెరాస ఆవిర్భావం మాత్రం తెదేపాను చావు దెబ్బతీసింది. 2001 ఏప్రిల్ 27న తెరాస ఆవిర్భవించిన తరువాత వందరోజులకే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తెదేపా పరాజయం ప్రారంభమైంది. 2004 సాధారణ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. 2009లో తిరిగి అదే తెరాసతో జతకట్టినా తెదేపాకు అధికారం దక్కలేదు.


విద్యుత్ ఉద్యమం, చంద్రబాబుపై భ్రమలు తొలిగిపోతున్న కాలం అది. తెలంగాణ పార్టీ ఏర్పాటుకు అదే సరైన సమయం అని కెసిఆర్ నిర్ణయానికి వచ్చారు. కెసిఆర్‌తోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని చాలామంది భావిస్తారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 95నుంచే కొన్ని ఉద్యమ సంస్థలు తెలంగాణ కోసం సభలు, సదస్సులు, మేధోపరమైన చర్చలు సాగించాయి. వరంగల్‌లో భారీ బహిరంగ సభ సైతం నిర్వహించారు. అయితే కెసిఆర్ రంగ ప్రవేశం చేశాక తెలంగాణ ఉద్యమం రాజకీయ రూపం సంతరించకుంది.
తెలంగాణలో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో దేశాన్ని ఊపేస్తున్న బిజెపి నేత నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మన్మోహన్‌సింగ్ వంటి హేమాహేమీలు తెలంగాణలో ప్రచారం చేశారు. వీరందరి లక్ష్యం, గురి -కెసిఆర్‌పైనే. అందరి లక్ష్యం ఒక్కరే అయినప్పుడు తెలంగాణలో అతని బలమెంతో తెలుస్తోంది.
మీడియా, అంగబలం, ఆర్థికబలం, కులబలం ఇవన్నీ ఒకవైపు, కెసిఆర్ నాయకత్వం ఒకవైపు.

తెలంగాణ ఇచ్చింది మేమే అని కాంగ్రెస్ చెబితే, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన స్వాతంత్య్ర సమరయోధులకు క్రెడిట్ ఇస్తామా? స్వాతంత్య్రం ఇచ్చిన బ్రిటీష్‌వాడికి క్రెడిట్ ఇస్తామా? అని కెసిఆర్ ప్రశ్నిస్తారు. ఎవరికి నచ్చినా నచ్చక పోయినా 2001 నుంచి పదమూడేళ్లపాటు రాష్ట్ర రాజకీయాలను తెలంగాణ చుట్టూ తిప్పిన ఘనత కేసీఆర్‌దే.
డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు కేసీఆర్ తెరాస పార్టీని ఏర్పాటు చేశాడు. అప్పటివరకు తెదేపా వారి అంచనా భద్రత కోసం ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిలో కొనసాగుతాడని, దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. పార్టీ ఆవిర్భావ సభలో నాటకీయంగా కేసీఆర్ నవ్వు ఒక్క రాజీనామా చేయమంటే నేను మూడింటికి చేస్తున్నాను. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి -ఇదిగో రాజీనామా అంటూ వేదికపైనుంచే రాజీనామా లేఖలు అందించడం రాజకీయంగా తెలంగాణ వారిలో కేసీఆర్‌పై విశ్వసనీయత కలిగించింది. నాయకులు, మీడియా, ప్రత్యర్థులు ఎవరైనా కావచ్చు కేసీఆర్ విశ్వసనీతను దెబ్బతీయడానికి చేసిన తీవ్ర ప్రయత్నాలు తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ విశ్వసనీయతను పెంచాయి. 

1954లో జన్మించిన కెసిఆర్ 83లో తొలిసారిగా సిద్దిపేట నుంచి పోటీ చేసి మదన్‌మోహన్ చేతిలో ఓడిపోయారు. 85లో గెలిచారు. తరువాత ఓటమి ఎరుగలేదు. 90వ దశకంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో కరువు మంత్రిగా చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా పని చేశారు. కారు గుర్తుతో సైకిల్‌ను ముప్పు తిప్పలు పెడుతున్నారు.

26, ఏప్రిల్ 2014, శనివారం

శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిన సామెత.. ప్రత్యామ్నయ -జెపి


అంద రికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట! ఈ సామెతలానే ఉంటుంది -లోక్‌సత్తా జాతీయాధ్యక్షుడు నాగబైరవ జయప్రకాశ్ నారాయణ రాజకీయ వ్యవహారం. సాంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా లోక్‌సత్తా పుట్టిందని చెప్పే జెపి -తాను పోటీ చేసే నియోజక వర్గం ఎంపికలో మొదటినుంచీ సాంప్రదాయ రాజకీయాలనే ఆశ్రయించారు.

1994 మేలో ఎన్టీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయనను దించేసే వ్యూహ రచన సాగింది. ఆగస్టు గండం ఈసారి ఎన్టీఆర్‌ను రక్షించలేకపోయింది. చిన్నల్లుడు, పెద్దల్లుడు ఒక్కటయ్యారు. అయినా అప్పటికీ వారి వద్ద మెజారిటీ ఎమ్మెల్యేలు కూడలేదు.


-‘అసెంబ్లీ రద్దు చేస్తానని ప్రకటించండి. జారిపోయిన ఎమ్మెల్యేలు భయపడి వెనక్కి వస్తారు’ అంటూ ఓ ఆసామీ ఎన్టీఆర్‌కు సలహా ఇచ్చాడు. సలహా నచ్చడంతో -ఎన్టీఆర్ ప్రకటించేశారు. అంతే -సీన్ రివర్సయ్యింది. ఎన్టీఆర్ దెబ్బకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు వెనక్కి రాలేదు. వెనక్కి వెళ్దామా అన్న ఆలోచనల్ని కూడా బుర్రల్లోంచి తుడిచేశారు. సరికదా -ఎన్టీఆర్‌తో ఉన్నవాళ్లూ అల్లుళ్ల వద్దకు పారిపోయారు. ఎన్టీఆర్‌కు ఈ సలహా ఇచ్చింది -ఆయన వద్ద ఐఏఎస్ అధికారిగా కీలకస్థానంలో ఉన్న జయప్రకాశ్ నారాయణ అని అప్పట్లో వినిపించిన మాట.
తరువాత జెపి ఎక్కువ రోజులు పదవిలో ఉండలేదు. లోక్‌సత్తా పేరిట సంస్థ స్థాపించారు. స్థానిక సంస్థలకు అధికారాలు, గ్రామ స్వరాజ్యం కోసం సంస్థ తరుఫున పలు సదస్సులు నిర్వహించారు. లోక్‌సత్తాను 2006లో రాజకీయ పార్టీగా మార్చారు.

సాంప్రదాయ రాజకీయాలకు భిన్నం -ప్రత్యామ్నాయ రాజకీయం. అదేంటో చూపిస్తామంటూ జెపి అట్టహాసంగా ప్రకటనలు గుప్పించారు. ప్రారంభంలో లోక్‌సత్తా పట్ల యువత బాగానే ఆకర్షణకు గురైంది. ‘కులం, మతం, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేయడం సాంప్రదాయ పార్టీల నైజం. లోక్‌సత్తా దీనికి భిన్నం’ అని జెపి ప్రకటించారు. అయితే -పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే లోక్‌సత్తా సాంప్రదాయ రాజకీయానే్న అనుసరించింది. తమ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లిని జెపి పోటీకి సురక్షిత స్థానంగా ఎంపిక చేసుకోవడం సాంప్రదాయ రాజకీయమే. ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చు. కానీ సాంప్రదాయ పార్టీలు గెలుపు గుర్రాలంతా దీన్ని ముద్దుగా పిలుచుకుంటాయి. అంటే ఆ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఎవరైతే గెలుస్తారు? అనే లెక్కలన్నమాట. చివరకు ఇప్పుడు జెపి అదే లాజిక్కుతో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు.

లోక్‌సత్తాకు 2009 ఎన్నికల్లో రెండు శాతం వరకు ఓట్లు రావడంతో కాంగ్రెస్ కుట్రలో భాగంగానే లోక్‌సత్తా పుట్టిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ బృందం తీవ్రంగా విమర్శలు చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ మనిషి కనుకే జెపికి నామినేటెడ్ పదవిని సోనియా గాంధీ కట్టబెట్టిందనేది తెదేపా ఆరోపణలకు ఆధారం. 2009 ఎన్నికల వరకూ తెదేపా, లోక్‌సత్తా తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నాయి. చివరకు ఏం జరిగిందో తెలీదుకానీ, ఇప్పుడు -దేశానికి మోడీ, రాష్ట్రానికి బాబు, హైదరాబాద్‌కు జెపి కావాలని జెపి నినాదం ఇస్తున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ ప్రచారం చేసిన జెపికి మోడీలో కనిపించిన ప్రత్యామ్నాయ రాజకీయం ఏమిటి? అనే విమర్శ వినిపిస్తోంది. 1980 ఐఏఎస్ అయిన జెపి అధికారిగా ఉన్నప్పుడు, లోక్‌సత్తా సంస్థను నిర్వహించినప్పుడు మంచి పేరే సంపాదించారు. జెపికి నామినేషన్ వేసేందుకు రాజమౌ ళి కావాలి, ప్రచారానికి పవన్ కల్యాణ్, గెలవడానికి మోడీ కావాలి. ఇవి అవకాశవాద రాజకీయాలుకావా? అన్నది మల్కాజిగిరిలో జెపితో పోటీ పడుతున్న స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్న. దీనికి సమాధానం చెప్పేదెవరు?

5, ఏప్రిల్ 2014, శనివారం

పెను’గాలి! ఆ రోజు స్పీకర్ పదవి తీసుకోని ఉంటే 95వెన్నుపోటు కథ ఏమయ్యేదో ?

          

  పేరులో ఏముందిలే అంటారు -పెద్దలు. పేరులోనే కాదు ఇంటి పేరులోనూ ఏదో ఉండే ఉంటుంది -అనిపిస్తుంది ముద్దుకృష్ణమ నాయుడు గాలిని చూస్తే. ఆయన తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఆయనవి -గాలి మాటలు అనేవాళ్లు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తెదేపా వాళ్లు -గాలి మాటలు పట్టించుకోం అనేవారు. పురాణమైనా రోజూ వింటే బోరు కొడుతుంది. అలాగే -గంటకోసారైనా అవినీతిపై తీవ్రారోపణలు చేయడంతో -గాలి ఆరోపణలకు ఆరోప్రాణం లేకుండా పోయింది. మంత్రిగా ఉన్నపుడు -ప్రచారంలో కొత్తపుంతలు తొక్కారు. 

’94 ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లోనే తేలిపోయింది. విజయం ఖాయం అని తేలాక మంత్రి పదవులకు ఎంపికలు కూడా లోపాయకారిగా జరిగిపోతున్నాయి. ఆ సమయంలోనే అల్లుడి కదలికలపై మామకు అనుమానమొచ్చింది. ఏదైనా జరగొచ్చనుకున్నారు. ఫలితాలు వచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత స్థాయిలో కాంగ్రెస్ ఓడిపోయింది. స్పీకర్ పదవి తీసుకోండి అని ఎన్టీ రామారావు, లక్ష్మీపార్వతి దంపతులు గాలి ముద్దు కృష్ణమనాయుడిని కోరారు. ముద్దుకృష్ణమ నాయుడు ఎన్టీఆర్‌కు వీరభక్త హనుమాన్ అన్నట్టుగా ఉండేవారు. దానికితోడు జిల్లాలో అల్లుడికి గాలికి పడటం లేదు. జరగరానిది ఏమైనా జరిగితే స్పీకర్ మనవాడు కావడం మంచిదనుకున్నారు. కానీ మంత్రి పదవిలో చురుగ్గా ఉండే ముద్దు తనకు స్పీకర్ పదవి ఇష్టం లేదన్నారు. ఒకవేళ ఆ రోజు గాలి ముద్దు కృష్ణమనాయుడు స్పీకర్ పదవి తీసుకోవడానికి అంగీకరించి ఉంటే -1995 వెన్నుపోటు కథ ఎలాంటి మలుపులు తిరిగి ఉండేదో? ఎన్టీఆర్‌కు సన్నిహితంగా మెదిలిన 12మంది మంత్రులను అప్పుడు డర్టీ డజన్ అంటూ బాబు వర్గం -మీడియాలో బాగా ప్రచారం చేసింది. ఆ పనె్నండు మందిలో ముద్దుకృష్ణమనాయుడు మొదటి వారు.
గాలి ముద్దు కృష్ణమనాయుడికి -చంద్రబాబుతో ప్రారంభంలో మంచి స్నేహం ఉండేది. పేకాట ఆడే ప్రాణమిత్రులు ఎంతగా కలిసి పోతారో అలా ఉండేవారు. క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. 95లో ఎన్టీఆర్‌ను దించేసిన తరువాత ఒకరి తరువాత ఒకరు తిరిగి చంద్రబాబు నాయకత్వంలో పని చేసేందుకు పార్టీలో చేరినా ముద్దుకృష్ణమ మాత్రం మనసు చంపుకోవడానికి  ఇష్టపడలేదు. కాంగ్రెస్‌లో చేరారు. సిఎల్పీ కార్యాలయంలో ప్రతి రోజు చంద్రబాబుపై ధ్వజమెత్తేవారు. వీర కాంగ్రెస్ వాదులను మించి విమర్శలు చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా సాకారం కాలేదు. 2009లో తెదేపా అధికారంలోకి వస్తుందనే అంచనాకు వచ్చారు. ఆయన గెలిచారు. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. మళ్లీ ప్రతిపక్షమే. అయితే తాను తిట్టాల్సిన నాయకుడి పేరు మారింది అంతే. ముద్దు కృష్ణమనాయుడు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తెదేపాను, తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను తిట్టడంలో తనకుతానే సాటి అని నిరూపించుకున్నారు. వెయ్యి కోట్ల పనుల్లో పదివేల కోట్ల కుంభకోణం అంటూ ధైర్యంగా విమర్శలు చేయడంలో గాలికి గాలే సాటి.
ఇలా ఇష్టం వచ్చినట్టు విమర్శించడం వీళ్లకు సరదా అని మీరనుకుంటారేమో -కానే కాదు. నేనో మాట అంటే ప్రత్యర్థి పార్టీ వాళ్లు అనకుండా ఉంటారా? పడాలి తప్పదు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకుడు చెప్పినట్టు తిట్టక తప్పదని ఓ సందర్భంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. 95లో ఎన్టీఆర్ హయాంలో పోయిన మంత్రి పదవి ఇప్పటికీ ఆయనకు దక్కినట్టే దక్కి దూరమవుతోంది. చిత్తూరు జిల్లా వెంకటాపురం గ్రామంలో 1947 జూన్‌లో జన్మించిన గాలి -ఎన్టీఆర్ తెదేపాను ఏర్పాటు చేసినప్పుడు లెక్చరర్‌గా పని చేసేవారు. ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. శాసన సభకు ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఏ పార్టీలో ఉన్నా ఎక్కువగా విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడేది ఆయనే. ఏం మాట్లాడినా గాలి మాటలు అనే విమర్శ మాత్రం ఇప్పటికీ -వినిపిస్తూనే ఉంది. 

3, ఏప్రిల్ 2014, గురువారం

లెక్కల్ల్లో జగన్

  

ఎ క్కడ రాణించాలన్నా -ముందు ఓ లెక్కుండాలి. అంటే -లెక్కల్లో పట్టుండాలి. అది వ్యాపారం కావొచ్చు. జీవితమో.. రాజకీయమో కావొచ్చు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వయసు లెక్కకు -చిన్నది. రాజకీయ వయసు -అంతకన్నా చిన్నది. పొలిటికల్ అకౌంటెన్సీలో మాత్రం -ఆయనది వయసుకు మించిన పరిణతి. ఆ ఆసక్తితోనే బికాం చదివారు. తరువాత ఎంబిఏ కోసం విదేశాలకి వెళ్లారు. పొరుగు దేశంలో ఎంబీయే చేయడంకంటే సొంతూళ్లో వ్యాపారం లాభసాటి అని లెక్కలేసుకున్నారు. అందుకే విదేశాల నంచి -మధ్యలోనే తిరిగొచ్చేశారు. జగన్ తండ్రి -వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 60ఏళ్ల వయసులో రాజకీయాల నుంచి రిటైర్‌కావాలంటూ పదే పదే చెప్పేవారు. (ఆయనదో లెక్క).

బాబాయ్‌తో రాజీనామా చేయించి కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. కానీ -సోనియా నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. 2009 పార్లమెంటు ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసి వైఎస్సార్‌కు వారసునిగా సన్నద్ధమవుతున్న సమయంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించడంతో జగన్ రాజకీయ జీవితం ప్రశ్నార్ధకమైంది. అధికార పక్షం మంత్రులు, ఎమ్మెల్యేలంతా జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని సంతకాలు చేశారు. ఎవరు చేశారో.. ఇంకెవరు చేయించారోనన్న విషయం పక్కనపెడితే -మొత్తంమీద మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసేశారు. జగన్ స్పీడ్‌కు హైకమాండ్ మాత్రం బ్రేకేసేసింది.

స్క్రీన్ మీదకు -రోశయ్యను ముఖ్యమంత్రిగా తెచ్చింది. రోశయ్య కాలం దీర్ఘంగా నడిచిపోతుంటే -కుర్రాడు జగన్ వౌనంగా ఉండలేక పోయాడు. పీఠం దక్కని తనని -సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేలే ఓదార్చకపోడంతో తానే జనాన్ని ఓదార్చేందుకు బయలుదేరారు. అక్కడే -్భవిష్యత్ ప్రణాళికకు బ్లూప్రింట్ తయారు చేసుకున్నారు.

ముసుగులో గుద్దులాటకు ఫుల్‌స్టాప్ పెట్టారు. హైకమాండ్‌ను కలిసి లెక్కలు తేల్చుకుందామన్న నిర్ణయానికి వచ్చారు. లాభసాటి అయితే కొనసాగటం. లేదంటే -కొత్త దారి చూసుకోవటం. ఇదీ అప్పటి ఆయన నిర్ణయం.
కుటుంబ సమేతంగా -పార్టీ చీఫ్ సోనియాను కలిశారు. ‘నీ భవిష్యత్ నాకొదిలెయ్’ అన్న ఒక్క మాటొస్తే చాలనుకున్నారు. కనీసం కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ -్ఢల్లీలో ఉన్నది హై’కమాండ్. తీపి కబుర్లు వినడమే తప్ప, వినిపించాలని అనుకోదు. అదే జరిగింది. జగన్ లెక్క కరెక్టయ్యింది. ఒక్కసారి మాజీ సిఎంల సంతానాన్ని మనసులోనే పరీక్షించారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి.. ఇలా ఎందరో మాజీ సిఎంల సంతానం భవిష్యత్ పార్టీలో ఎలా ఉందో లెక్కలేశారు. లేట్ చేస్తే లెక్క తప్పే ప్రమాదం ఉందని, చాలామందిలాగే తానూ ప్రవాహంలో పుడకలా మిగిలిపోతానని అంచనా వేసుకున్నారు.
భవిష్యత్ అయోమయమైన పార్టీలో ఉండేకంటే -పార్టీ పెట్టి భవిష్యత్ చూసుకోవడం బెటరనుకున్నారు. అంతే -కాంగ్రెస్ నుంచి జగన్ వేరుపడ్డారు. అప్పటికి రాష్ట్రంలో వైఎస్సార్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వైఎస్సార్ కనుక -వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీకి పురుడు పోశారు. కొత్త పార్టీని భుజనేసుకుని -జనంలోకి వెళ్లారు. వైఎస్సార్ సంక్షేమ పథకాల ప్రభావం ప్రజల్లో ఎంతబలంగా ఉందో ఓదార్పులో తిరుగుతూ ఒడుపుగా పసిగట్టారు.
వైఎస్సార్ అధికారాన్ని పుత్రుడు దుర్వినియోగపర్చి కోట్లు స్వాహా చేశారని కేసులు పుట్టుకొచ్చాయి. జగన్ సహా మంత్రులు, ఐఏఎస్ అధికారులు జైలుపాలయ్యారు. అయితే ఇదంతా ఒక కుటుంబంపై అందరూ కలిసి సాధిస్తున్న కక్షగానే సామాన్యులు భావించి, ఉప ఎన్నికల్లో ఘన విజయం చేకూర్చి పెట్టారు.

కెరీర్ విషయంలో జగన్ -లెక్క తప్పలేదు. అందుకే కాంగ్రెస్‌ను వదిలేశారు. కొత్త పార్టీ పెట్టారు. లెక్కను సరిగ్గా నిర్దేశించుకోలేక మరో మార్గంలో వెళ్లివుంటే ఇప్పటికి -జగన్ చాలామంది మాజీ సిఎంల పుత్రరత్నంలాగే ఉండి ఉండేవాడు.
ఎంతోమంది హేమాహేమీలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మనసు చంపుకుని అప్పటి వరకు తిట్టిన బాబును ఆకాశానికెత్తుతున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమనే డైలాగును అరగదీస్తున్నారు. లెక్కల్లో విఫలమైవుంటే -అలాంటివాళ్ల జాబితాలో జగన్ కూడా ఉండిఉండేవాడే. లెక్క తప్పలేదు కనుకే -క్యూలో ఉండాల్సిన జగన్ ముందు ఇప్పుడు క్యూ ఉంటోంది. 16 నెలలు జైలులోవున్నా పార్టీని ఉప ఎన్నికల్లో పరిగెత్తించారు. సార్వత్రిక ఎన్నికల్లో సర్వేలన్నీ -ఆంధ్రలో అధికారం జగన్ పార్టీకేనని చెప్పే స్థితికి తెచ్చారు. ఇంతా చేస్తే జగన్ వయసు -42 ఏళ్లు. రాజకీయం వయసు ఐదేళ్లు. అందులో 16 నెలల కాలం జైలు జీవితం. కానీ  
ర్టీ ఇయర్స్ పాలి’ట్రిక్స్‌లో ఉన్నవాళ్లకు చమటలు పట్టిస్తున్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే సొంత మీడియా ఎంతో అవసరమని చిన్నతనంలోనే గ్రహించిన నేత. 

తెలంగాణ, సమన్యాయం, సమైక్యం అంటూ ఎప్పటికప్పుడు మాట మార్చినా అన్నీంటిలో -ఆయనకు ఉండే లెక్కలు ఆయనకున్నాయి. అవే -జగన్‌ను కాపాడుతున్నాయి.

27, మార్చి 2014, గురువారం

దేశంలో -తొలి మహిళా హోంమంత్రి

ఒక్క నిర్ణయం -జీవితానే్న మార్చేస్తుంది.
సంక్షోభం సమయంలో సమయస్ఫూర్తిగా తీసుకున్న చిన్న నిర్ణయం -ఆమె రాజకీయ జీవితాన్ని వెయ్యిమైళ్లు ముందుకు తీసుకుపోయింది. దేశంలోనే -తొలి మహిళా హోంమంత్రిని చేసింది.
చంద్రబాబు సీఎం పీఠంపై ఉన్నపుడు -పార్టీ ఎమ్మెల్యే ఎవరు మరణించినా భార్యకు టికెట్ ఇచ్చే సంస్కృతి తెచ్చారు. దాని ప్రకారం -ఒక దశలో 12 మంది వితంతువులు సభలోకి ప్రవేశించారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంద్రారెడ్డి మరణించారు. సొంత పార్టీ వారేకాకుండా ఇతర పార్టీ ఎమ్మెల్యే మరణించినా టికెట్ తమ పార్టీ నుంచే ఇస్తాననే ప్రతిపాదనతో బాబు ముందుకొచ్చారు. 


జిల్లాలో చక్రం తిప్పుతున్న దేవేందర్‌గౌడ్, మేనల్లుడు మహేందర్‌రెడ్డి, బంధువులంతా తెదేపా టికెట్ తీసేసుకో.. 2020 వరకూ ఆ పార్టీకి ఢోకాలేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వైఎస్సార్ -నా మాట నమ్మండి. తెదేపా పనైపోయింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. బాగా ఆలోచించండి! -అని ఇచ్చిన సలహా ఆమె రాజకీయ జీవితానికి సోపానంగా మారింది. సంక్లిష్ట పరిస్థితిలో సమయస్ఫూర్తి నిర్ణయం తీసుకున్న ఆమె -సబితా ఇంద్రారెడ్డి. కాళ్లదగ్గరకు వచ్చిన చాన్స్ వదులుకున్నారని అంతా జాలి చూపినా -ఆమె ధైర్యం వీడలేదు. కాంగ్రెస్ తరఫునే పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. పోటీ చేశారు, విజయం సాధించారు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పదేళ్లపాటు మంత్రిగా ఉన్నారు.


దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా వైఎస్సార్ ప్రభుత్వంలో పని చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా భర్త రాజకీయాల్లో కీలక స్థానంలో ఉన్నందున రాజకీయాల్లో ఆమె ఎలాంటి ఇబ్బందీ పడలేదు. ఇంద్రారెడ్డి భార్యగా రాజకీయాల్లో ప్రవేశించి -సొంత వ్యక్తిత్వంతో ధృడంగా, స్వతంత్రంగానే వ్యవహరించారు.
వైఎస్సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్సార్‌ను ముఖ్యమంత్రిని చేసిన పాదయాత్రకు తొలి అడుగు పడింది చేవెళ్ల నుంచే. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొత్త పథకమైనా చేవెళ్ల నుంచే ప్రారంభించేవారు. వైఎస్సార్ రెండోసారి విజయం సాధించాక రచ్చబండను తిరుపతి నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ -ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
చేవెళ్ల నుంచి రెండుసార్లు, మహేశ్వరం నుంచి ఒకసారి విజయం సాధించారు సబిత. వైఎస్ ప్రభుత్వంలో గనుల మంత్రిగా పని చేశారు. ఆకాలంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై సిబిఐ కేసు ఎదుర్కొంటున్నారు. బిఎస్సీ చదివిన సబితా ఇంద్రారెడ్డి ఉన్నంత వరకు గృహిణిగానే ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇంద్రారెడ్డి మరణించిన తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇంద్రారెడ్డి ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్‌ను దించేసే సమయానికి ఆయన హోంమంత్రి. భార్యాభర్తలు ఇద్దరూ రెండు వేర్వేరు పార్టీల ప్రభుత్వాల్లో హోంమంత్రులుగా పని చేసిన రికార్డు ఉంది. 


సబితకు ముగ్గురు పిల్లలు. కుమారుడు రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హోంమంత్రిగా ఉన్న ఆమె ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆదేశాలను పట్టించుకోని పోలీసులు, ముఖ్యమంత్రి ఒత్తిడి, తెలంగాణవాదుల విమర్శలు వీటి మధ్య ఆమె ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. గనుల కేటాయింపుపై సిబిఐ కేసు వల్ల సబిత 2013లో మంత్రి పదవికి రాజీనామా లేఖ ఇచ్చారు.

26, మార్చి 2014, బుధవారం

ఆశావాది నీలకంఠాపురం

బలహీనమైన నేతకైనా బలమైన గొంతుండాలి. అప్పుడే రాజకీయాల్లో రాణించగలం. రాజకీయాన్ని నెగ్గుకు రాగలం. చిత్రమేమంటే రఘువీరాకు గొంతే కాదు, ఇంటి పేరూ గంభీరమే. అదే -నీలకంఠాపురం. ఈ పేరు వినగానే ఓ తెలుగు సినిమాలో శక్తివంతమైన పాత్ర ఇంటి పేరు గుర్తుకొచ్చేట్టుగా ఉంది కదూ!
నీలకంఠాపురం రఘువీరారెడ్డి. అనంతపురం జిల్లాలో బలమైన నాయకుడు. వైఎస్సార్‌కు నమ్మిన బంటుగా చివరి వరకూ నిలిచారు. వైఎస్సార్ ప్రతిపక్షంలో ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా కుడి భుజంగా గుర్తింపు పొందిన ఇద్దరు ముగ్గురు నేతల్లో రఘువీరా కూడా ఒకరు. వైఎస్సార్ మరణం తరువాత జగన్ సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నాక తొలుత పార్టీ మారేది ఈయనేనని అంతా అనుకున్నారు. వార్తల్ని ప్రచారంలో పెట్టారు. అయితే, నేను పార్టీ మారితే నన్ను సమాజం నుంచే వెలివేయండి -అని ధైర్యంగా ప్రకటించారు రఘువీరా. 


కాంగ్రెస్‌లో పుట్టాం. కాంగ్రెస్ గాలి పీలుస్తూ పెరిగాం. కాంగ్రెస్ ఉన్నంత వరకూ అక్కడే ఊపిరి తీసుకుంటాం -అంటూ ప్రకటించారు. ఇలా ప్రకటించిన వీర కాంగ్రెస్‌వాదులు చాలామంది -విభజన తరువాత ఒకరి తరువాత ఒకరు పార్టీ గోడ దూకారు. అప్పటి వరకూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు పంచన చేరారు. రాష్ట్భ్రావృద్ధి బాబు వల్లే సాధ్యమంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా టీవీ తెరలపై మొహమెత్తేలా చెప్పుకొస్తున్నారు. కానీ -రఘువీరా మాత్రం అక్కడే ఉన్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసినా, ఎలా ఉన్నా ఫరవాలేదని ధైర్యంగా కాంగ్రెస్ నాయకత్వం చేపట్టారు.
పార్టీ పరిస్థితి బాగున్నప్పుడు సారథ్యం చేపట్టేందుకు ఎవరైనా ముందుకొస్తాడు. ప్రతికూలతను ఎదురొడ్డి నిలిచిన వాడే నాయకుడని నమ్మడమే కాకుండా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో, ఢిల్లీలో ఉన్నవారికి సైతం తెలుసు. అలాంటిది సీమాంధ్రకు నాయకత్వం వహిస్తున్న రఘువీరారెడ్డికి తెలియదని అనుకోలేం. కానీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవిని ఆయన చాలెంజ్‌గా తీసుకున్నారు. అధికారానికి వచ్చేస్తాం అనే ప్రగల్భాలేమీ పలకడం లేదు. పదేళ్లపాటు అధికారం అనుభవించిన వారు పార్టీ సమస్యల్లో ఉన్నప్పుడు అవకాశవాదం ప్రదర్శించారని మాత్రమే జనంలోకి వెళ్లేట్టు చేస్తున్నారు. నాయకత్వం వహించే అవకాశం లభించినప్పుడు ఏటికి ఎదురీదడానికి సిద్ధపడటమే నాయకుని లక్షణం. అలాంటి నాయకత్వ లక్షణాలు తనకు పుష్కలంగా ఉన్నాయని చాటి చెబుతున్నారు రఘువీరా. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌కు కష్టాలే. సీనియర్లు కొత్త పార్టీని చూసుకున్నారు. ఇంకా పోయేదేమీ లేదు కొత్తగా నిర్మించుకొని ముందుకెళ్తామనే సానుకూల దృక్ఫథంతో వెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారపక్షంలో ఉన్నా ప్రత్యర్థులపై గంభీరమైన కంఠంతో విరుచుకుపడే నీలకంఠాపురం ఇప్పుడు పార్టీ వీడి వెళ్లిన సొంత మనుషులపై అవకాశవాదులు అని విరుచుకు పడుతున్నారు.


అనంతపురం జిల్లా మడకశిర, కల్యాణదుర్గం నియోజక వర్గాల నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు రఘువీరా. అదే నియోజక వర్గంలోని నీలకంఠాపురంలో 1957 ఫిబ్రవరి 12న జన్మించారు. రఘువీరారెడ్డి తండ్రి కావేరప్ప ఈ గ్రామానికి 30 ఏళ్లపాటు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. కుమారుడు అమృతవీర్, కుమార్తె అమిత్‌వీర్. భార్య సునీత గృహిణి. 1987లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కాంగ్రెస్‌లో చేపట్టిన తొలి బాధ్యత. 1999, 2004లో మడకశిర నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

2009లో కల్యాణదుర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004 నుంచి మంత్రిగానే ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకునిగా ఉన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. నాయకత్వ లక్షణాలతోపాటు దైవభక్తి ఎక్కువే. నీలకంఠాపురం గ్రూఫ్ ఆఫ్ టెంపుల్స్‌కు చైర్మన్. మార్చి 11 , 2014న ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి చేపట్టారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అయిందని తెలిసినా బస్సు యాత్ర జరుపుతున్నారు. నాయకత్వం వహించేవారు ఆశావాదిగా ఉండాలి. రఘువీరారెడ్డి ఆశావాది.

25, మార్చి 2014, మంగళవారం

వై యస్ ఆర్ అలా దెబ్బ తీశాడు చిరంజీవిని .. కొందరి వాడు

నర్సాపూర్ దగ్గర గ్రామం -మొగల్తూరు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినూరు. సొంతిల్లూ ఇక్కడే ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన తరువాత.. -ఎన్నికల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అక్కడికెళ్లారు. సొంతూళ్లో.. సొంతింటిని గ్రంథాలయం ఏర్పాటుకు ఇవ్వని ఈయన రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేస్తాడంటే నమ్ముతున్నారా? -అంటూ సెటైర్ వేశారు. అది చిరంజీవి గుండెల్లో గునపంలా గుచ్చుకుంది. ‘హమ్మో రాజకీయాలు’ అనుకున్నాడు. రాజకీయ ఆట అంటే ఏమిటో ఆ దెబ్బతో మెగాస్టార్‌కు తెలిసొచ్చింది. చిరంజీవి ఇంటిని గ్రంధాలయంగా మార్చాలని  చాలా కాలం క్రితం  గ్రామస్తులు అడిగితే , చిరంజీవి ఒప్పుకోలేదు .. ఇంటిని అమ్మేశారు 


చిరంజీవి ‘అందరివాడు’ -హీరో. మేమూ అలాగే అనుకుంటే -ఆంధ్రావాడని నిరూపించాడని తెలంగాణ వాళ్లు తెగుడుతారు. మావాడూ కాదు -మంత్రి పదవి కోసం సీమాంధ్రను దగా చేసిన మోసగాడంటూ సీమాంధ్రులూ తిడతారు.


ఇదీ రాష్ట్రంలోని -రెండు ప్రాంతాల్లో చిరంజీవి పరిస్థితి. సినిమాల్లో మామాలు స్థాయిలో అడుగుపెట్టి మెగాస్థాయికి చేరుకున్న చిరంజీవి -రాజకీయాల్లో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మిగిలిపోయారు. అన్నా నువ్వు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలి. నా మరణమైనా నీలో కదలిక తీసుకురావాలి -అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడో అభిమాని ఖమ్మంలో. బహుశా.. భారతదేశంలో ఎక్కడా -పొలిటికల్ పార్టీ పెట్టమని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాగడా పెట్టి వెతికినా కనిపించదు. ఎన్టీఆర్ తనంతట తానే పార్టీ పెట్టాడు. కానీ చిరంజీవిని మాత్రం ఎంతోమంది అభిమానులు కోరితేనే పార్టీ పెట్టారని చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అల్లు బావ అరవింద్ చెప్పుకొచ్చారు. నిజమే కానీ -పార్టీ పెట్టాక అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఖమ్మంలో ఒక్క సీటు కూడా రాలేదు. ఇదీ, ఇదే నిజం.
53 ఏళ్ల వయసు అంటే ఒక ఉద్యోగి తన బాధ్యతలు పూర్తి చేసుకోవాలి. రిటైర్‌మెంట్ వయసు దగ్గరపడుతోంది అని కంగారుపడుతుండాలి. కానీ -రాజకీయ నేతకు అది నవ యవ్వనం. మరి సినిమా హీరోకు ఆ వయసు సంధియుగం. చరిష్మా కుంగి.. హీరోగా అవకాశాలు తగ్గి.. ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన తరుణం. ఎన్టీఆర్ హయాంలో హీరోల రిటైర్‌మెంట్ వయసు 60ఏళ్లు. చిరంజీవి కాలానికి అది 53ఏళ్లకు దిగింది. తనకున్న అపారమైన ఇమేజ్ ఒకవైపు, హీరోగా అవకాశాలు తగ్గిపోతున్న పరిస్థితి మరోవైపు.. రెంటినీ బేరీజు వేసుకుని ఇదే సరైన సమయమనుకుని చిరంజీవి 2008లో ప్రజారాజ్యం జెండా ఎగరేశారు. హీరో దారి మళ్లడానికి అది సరైన వయసు కావచ్చు, కానీ రాజకీయ రంగంలో అది సరైన సమయం కాదని ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. ఒకవైపు తన పథకాలతో జనంలో వైఎస్సార్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. బలమైన ప్రతిపక్షంగా తెదేపా తన స్థానాన్ని పదిలపర్చుకుంది. ఈ రెండు పక్షాలకు బలమైన మీడియా మద్దతూ ఉంది. ఇలాంటి అననుకూల పరిస్థితిలో రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి -తన లక్ష్యాన్ని చేరుకోలేక పోయారు.


అంతా రెడీ అయ్యాక షాట్‌కు పిలిస్తే చెప్పినట్టు చేసి మెప్పించటం -నటన. అన్నిటికీ బాధ్యత వహించి అందరినీ మెప్పించటం -రాజకీయం. ఈ రెంటికీ తేడా తెలిసి సారాన్ని గ్రహించే సరికి జెండా పీకేయాల్సిన సమయం ఆసన్నమైంది. తెల్ల ఏనుగులాంటి ప్రజారాజ్యాన్ని నడపడం వల్లకాదని గ్రహించిన తరువాత కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం పొంది కేంద్ర మంత్రి అయ్యారు. చిరంజీవి ఉదంతం సినిమా వాళ్లకు జ్ఞానోదయం కలిగించే చక్కని అంశం. తెరమీద గ్లామర్ సీన్లు చూసి చప్పట్లు కొట్టే అభిమాన జనమంతా పోలింగ్ బూత్‌కు పరిగెత్తుకొచ్చి ఒటువేసే జనం కాదని సినిమా వాళ్లందరికీ తెలిసి వచ్చేట్టు చేశారు చిరంజీవి. రీల్ హీరోలు.. రియల్ హీరోల మధ్య వ్యత్యాసం ‘చిరు’-సన్నివేశంతో సినిమా వాళ్లకు అర్థమైనట్టే.
ముక్తాయింపు: అందరివాడు కాదు మోసగాడంటూ -విభజన తరువాత తిట్టిపోస్తున్న సీమాంధ్రలోనే కాంగ్రెస్‌ను గెలిపించే ప్రచార బాధ్యతలు చిరంజీవి మోయాల్సి రావడం.  

24, మార్చి 2014, సోమవారం

ప్రజలకు అందుబాటులో ఉండడమే ఆయన తప్పు .... అలాయ్ బలాయ్ దత్తన్న

2004 ఎన్నికల సమయం. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ పైన కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ. ఎవరూ ముందుకు రావడం లేదు. నగరంలో ప్రముఖ నాయకుడని దానం నాగేందర్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తే.. ‘నన్ను బలిపశువు చేయాలని చూస్తున్నారా? మీ ఆటలు సాగవు’ అని విమర్శించి పార్టీ మారి తెదేపాలో చేరారు. -‘అదేంటి దత్తన్న మీద పోటీ చేయడానికి కాంగ్రెస్‌లో ఎవరూ లేరా? ప్రజాస్వామ్యం అన్నాక ఎవరో ఒకరు పోటీ చేయాలి’ అని కమలం పెద్దన్న వెంకయ్యనాయుడే ఆశ్చర్యపోయారు. చివరకు అంజన్‌కుమార్ యాదవ్‌ను వెతికి పట్టుకొచ్చి మరీ పోటీ చేయించారు. అయితే ఏమైంది? అసలు పోటీనే లేదనుకున్న దత్తాత్రేయ ఓడిపోయారు. పెద్దగా పరిచయం లేని అంజన్‌కుమార్ యాదవ్ అనూహ్యంగా గెలిచారు.
ఎందుకలా జరిగింది! దత్తాత్రేయ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లా? -అంటే కాదు. అనుకున్న దానికంటే -ఎక్కువ అందుబాటులో ఉండటమే దత్తన్నకు అసలు సమస్య.


నమ్మి ఓటేస్తే.. గెలిచాక ఐదేళ్ల వరకూ కనిపించ లేదు. ఇదీ -దేశంలో ఏమూలకు వెళ్లినా రాజకీయ నేతల గురించి వినిపించే కామన్ ఫిర్యాదు. కానీ దత్తన్న విషయంలో మాత్రం సరిగ్గా దీనికి రివర్స్. ఎప్పుడూ నియోజక వర్గంలోనే ఉంటారు. ఇలాగైతే కష్టం.. ఇదీ ఆయనపై వినిపించే విమర్శ. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇలాంటి ఫిర్యాదులను బహిరంగంగానే ఎదుర్కొన్నారు. దత్తన్న -కేంద్ర రైల్వే మంత్రి కాదు.. సికింద్రాబాద్ మంత్రి. ఎప్పుడూ సికింద్రాబాద్‌లోనే ఉంటారన్న విమర్శలు తప్పలేదు. బిజెపిని ఇతర పార్టీలు అంటరాని పార్టీగా చూస్తారు. కానీ దత్తాత్రేయ ఏటా నిర్వహించే ‘అలాయ్ బలాయ్’లో మాత్రం అన్ని పార్టీల నేతలూ కనిపిస్తారు. ఆయన నిర్వహించే అలాయ్ బలాయ్‌లోనే కాదు.. తన వ్యక్తిత్వం ద్వారా అందరి అభిమానం సంపాదించుకున్న నాయకుడు -దత్తన్న.


2004లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత సచివాలయంలో ముఖ్యమంత్రి పేషీ వద్ద కనిపించిన ఓ సన్నివేశమిది. కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావు తొలిసారి ఎన్నికైన ఎంపీ అంజన్‌కుమార్‌ను అధికారులకు పరిచయం చేస్తూ -బండారు దత్తాత్రేయ మంచి నాయకుడు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయనపై గెలిచిన ఎంపీ అంజన్‌కుమార్ -అని పరిచయం చేశారు. పార్టీలకు అతీతంగా అంతా దత్తన్నను అభిమానిస్తారు.
బండారు అంజయ్య, ఈశ్వరమ్మ దంపతులకు 1946 జూన్ 12న హైదరాబాద్‌లో దత్తాత్రేయ జన్మించారు. 1980 నుంచి బిజెపిలో ఏదోక పదవిలో ఉంటూనే ఉన్నారు. బ్రహ్మాచారిగానే గడపాలనుకున్నారు. 43 ఏళ్ల వరకూ అలాగే గడిపారు. -‘పెళ్లంటూ చేసుకుంటే దత్తాత్రేయ బావనే చేసుకుంటా’నని మరదలు వసంత ఎదురు చూడటంతో.. 43 ఏళ్ల లేటు వయసులో 1989లో పెళ్లికి తలూపారు దత్తన్న. అయితే పెళ్లి తరువాత దత్తాత్రేయకు రాజకీయాల్లో కాలం కలిసొచ్చింది. అంతకుముందు అనేకసార్లు పోటీ చేసినా విజయం దక్కలేదు. పెళ్లి తరువాత ’91 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలుపొందారు. 96,98లో  గెలిచాక కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి పదవి చేపట్టారు. తరువాత రైల్వే శాఖకు మారారు. ’96లో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖలు రాయడం మొదలు పెట్టారు. ఒకదశలో లేఖోద్యమమే నడిపారు. బాబు, వైఎస్సార్‌ల హయాంలో రాసిన వందలాది లేఖలను పుస్తకంగానూ ప్రచురించారు. ఉస్మానియా వర్సిటీలో బిఎస్సీ చదివిన దత్తన్నకు రాజకీయంగా ఎంతటి పాపులార్టీ ఉందంటే.. ఒకదశలో సికింద్రాబాద్ బరిలో ఆయనకు ఎదరు నిలిచేందుకు సాహసించిన నేత లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి దత్తన్నకు -ఇప్పుడు సికింద్రాబాద్ సీటుకే చెక్ పెట్టే ప్రయత్నాలు బిజెపిలో సాగుతున్నాయి. దటీస్.. దత్తన్న!

23, మార్చి 2014, ఆదివారం

అతని జీవితం సినిమా కథ ... దొర గడీని కొన్న డాలర్ లక్ష్మయ్య


నేతా శ్రీ 6
అది ఖిలాషాపురం గ్రామం. మొత్తం ఊరిని శాసిస్తున్నట్టుగా సగర్వంగా తలెత్తుకుని నిలిచినట్టున్న ఊరి దొరగారి గడీ (పెద్ద భవనం). భవనం నుంచి రేడియోలో చక్కని పాటలు వినిపించేవి. ఓ కుర్రాడు రేడియో పాటలు వినడానికి తెల్లారకముందే భవనం గోడకు చెవి ఆనించేవాడు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని, అలా ఎదిగి ఆ భవనాన్ని, అందులోని రేడియోను కొని కాలుమీద కాలేసుకుని పాటలు వినాలని కలలుగన్నాడు. ఆ తరువాత కలలకే పరిమితం కాలేదు.వాటిని సాకారం చేసుకోవాలని కంకణం కట్టాడు. యువకుడిగా తన చదువు అతన్ని సంపన్నుడిని చేసింది. విదేశాలకు వెళ్లాడు, డాలర్లు సంపాదించాడు.. సొంతూరికి వచ్చాడు. వచ్చీ రాగానే భవనం గురించి వాకబు చేశాడు. అమ్మకానికి ఉందని తెలియగానే కొనడానికి ముందుకొచ్చాడు. అప్పటి వరకు రెడ్డిగారిదైన భవనం అప్పటి నుంచి ఆ యువకుడిది అయింది. భవనం అమ్మాక నాకు ఆ రేడియో కూడా కావాలని, ఎంతకైనా సరే కొంటానని ముచ్చట పడి రేడియోనూ కొన్నాడు. ఇదేదో సినిమా కథ అనిపిస్తుంది కదూ! అలా అనిపించొచ్చుగానీ, ఇది సినిమా కాదు. పొన్నాల లక్ష్మయ్య సొంత కథ. స్వయంకృషితో చదువును నమ్ముకుని ఉన్నతస్థాయికి ఎదిగిన ఒక గ్రామీణుడి కథ. ఆ ఇంటిని ఏనాటికైనా కొనాలనే తన లక్ష్యమే తనకు చదువుపై ఆసక్తి పెంచిందని, అమెరికాకు వెళ్లేలా చేసిందని చెప్పుకుంటారు ఆయన. ఏదైనా అనుకుంటే సాధించేంత వరకూ వదిలిపెట్టను అంటారాయన! ఆయన జీవితం లో మొదటి సగం సినిమా హీరో జీవితాన్ని తలపింప జేసే విధంగా ఉన్నా , ఇంటర్వెల్ తరువాత రాజకీయ జీవితం లో మాత్రం  ఆయన మరీ ఫన్నిగా వ్యవహరించారు .. తెలంగాణా  కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత సీరియస్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు . 

చిన్ననాటి లక్ష్యం వేరు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం ఉన్నా, అది అంత సులభం కాదు.


ఇంటి పేరు పొన్నాల. ఆయన పేరు లక్ష్మయ్య. జనగామలో ఆయన గురించి తెలిసినవారు మాత్రం డాలర్ లక్ష్మయ్య అంటారు. ఒకప్పుడు రూపాయి కోసం ఆశగా ఎదురు చూసిన ఆయన తరువాత డాలర్ లక్ష్మయ్యగా మారారు. బాల్యంలో పేదరికాన్ని అనుభవించిన లక్ష్మయ్య కసితో చదివి ఇంజనీరింగ్ డిగ్రీతో అమెరికా వెళ్లి మాస్టర్ డిగ్రీతోపాటు డాలర్లతో తిరిగొచ్చాడు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితం, మూడుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం, నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నిక. అయినా ఆయన చర్యలు మాత్రం సీరియస్ పాలిటిక్స్ నడుపుతున్నట్టుగా ఉండవు. మంత్రిగా ఉంటూ స్విమ్మింగ్ చేస్తూ కెమెరాలకు ఫోజులిస్తాడు. కెమెరాల కోసం ఆయన చేయని చిలిపి పని లేదు.
వరంగల్‌లో 94 సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు సాగుతున్న కొంతసేపటికి పొన్నాల లక్ష్మయ్య లేచి విలేఖరులకు నమాస్కారం చేసి వెళ్లిపోసాగారు. అదేంటి ఇంకా సగం కూడా ఓట్ల లెక్కింపు జరగలేదు, అప్పుడే వెళ్లిపోతున్నారేంటని అడిగితే -‘చివరి వరకు ఉండటం వృధా. ఫలితం తేలిపోయింది. ప్రజల తీర్పు అలా ఉంది.. ఆమోదించాల్సిందే’ అంటూ వెళ్లిపోయారు. సాధారణంగా నాయకులకు చివరి ఓటు వరకూ గెలుపుపై ఆశ చావదు. కానీ ఎప్పుడూ బోళాగా నవ్వుతూ ఉండే పొన్నాల అంత హుందాగా ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే ఓటమి అంగీకరించడం ప్రత్యేకంగా నిలిచింది.


కాంగ్రెస్‌లో ఎవరికి వారే హీరోలు. ఎవరూ ఎవరి మాటా వినరు. అలాంటిది కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఈ పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్‌కు పొన్నాల లక్ష్మయ్య సారథి. అంటే -తెప్పతో నడి సంద్రంలో సాహసాలు చేయడం లాంటిదే. అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేని పార్టీలు సైతం ‘పవర్లోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి’ అంటూ ప్రచారం చేసుకుంటున్న తరుణంలో.. ‘మా పార్టీ అధ్యక్షుడే బీసీ’ అని చెప్పుకునే స్థితిలో కాంగ్రెస్ లేదు. 1945 ఫిబ్రవరి 1న వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో జన్మించిన పొన్నాలకు ఇద్దరు కుమారులు.

20, మార్చి 2014, గురువారం

కుండబద్ధలు కొట్టే సిల్లీ నేత టిజి వెంకటేష్

నేతా  శ్రీ 5 

కర్నూలులో రాయలసీమ హక్కుల ఐక్యవేదిక తొలి బహిరంగ సభ. జనం పెద్ద సంఖ్యలోనే వచ్చారు. వేదిక ఎందుకు ఏర్పాటు చేశారో? వెంకటేశ్ ఏం చెబుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెంకటేశ్ ఒక కుండను తీసుకొచ్చి వేదిక ముందు పెట్టాడు. జనంలో మరింత ఆసక్తి పెరిగింది. కొద్దిసేపటి తరువాత వెంకటేశ్ పెద్ద కర్రను పట్టుకుని ముందుకొచ్చాడు. ఆయన ముఖాన్ని చూసిన వారు ఎవరిపైనో దాడికి వచ్చాడనుకున్నారు. కర్రను పైకి లేపి బలంగా కుండపై కొట్టాడు. అది బద్దలైంది. ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్ధం కాలేదు. అప్పుడు మైకు వద్దకొచ్చిన టీజీ వెంకటేశ్ -నేను ఏంచెప్పినా కుండబద్దలు కొట్టి చెబుతాను -అంటూ ఉపన్యాసం ప్రారంభించారు. రాజకీయాల్లో ఆయన సిల్లీ పనులకు ఇదో ఉదాహరణ. ఆయన సీరియస్‌గా చెప్పాలనుకున్నారో, మీడియా దృష్టిని ఆకట్టుకోవాలని ప్రయత్నించారో కానీ జనం అంతా ఆయన చర్యను సిల్లీగానే తీసుకున్నారు.


రాముడు- భీముడు సినిమాలో రాముడు అమాయకంగా కనిపిస్తే, భీముడు అందరినీ చితగ్గొడుతుంటారు. రెండు పాత్రల్లోనూ ఎన్టీఆర్ ఇమిడిపోయారు.
సరిగ్గా టీజీ వెంకటేశ్ కూడా అంతే. వ్యాపారాల్లో అయన ఎంత సీరియస్‌గా ఉంటారో, రాజకీయాల్లో అంత సిల్లీగా ఉంటారు. ఆ వెంకటేశ్ ఈ వెంకటేశ్ ఒకరేనా? అని చూసిన వారు ఆశ్చర్యపోవాలి.
ఆదోనికి చెందిన టీజీ వెంకటేశ్ రాయలసీమకు చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబం. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడుల్లో పలు వ్యాపారాలు ఉన్నాయి. విజయవంతమైన వాణిజ్య వేత్తకు ఏ సమయంలో ఏం చేయాలో బాగా తెలుసు. రాజకీయాల్లో సైతం టీజీ వెంకటేశ్ ఈ సూత్రాన్ని చక్కగా పాటిస్తున్నారు.


టి డిపి ఎమ్మెల్యేగా ఉంటూనే బిజెపికి చేరువయ్యారు. కర్నూలులో టిడిపి ఎమ్మెల్యేగా బిజెపి సమావేశాలకు హాజరయ్యారు. 2004లో ఓడిపోగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై రోశయ్య మంత్రివర్గంలో మంత్రి అయ్యారు, కిరణ్ మంత్రివర్గంలోనూ స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పని ఖాళీ అయిందని భావించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వ్యాపారవేత్తగా ఇప్పుడు మళ్లీ టిడిపిలో చేరారు. సీమాంధ్రను అభివృద్ధి చేయగల సామర్థ్యం బాబుకే ఉందని చెబుతున్నారు. బాబును వీడివెళ్లిన పదేళ్ల తరువాత ఆయన బాబు సామర్థ్యాన్ని గుర్తించారు.


తన పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగుల్లో మద్యం, సిగరేట్ తాగే అలవాటు లేనివారికి ప్రత్యేక ప్రోత్సహాకాలు ఇచ్చారు.
కర్నూలులో కెఇ కృష్ణమూర్తి వర్గంతో రాజకీయ వైరం. చివరకు కేబుల్ టీవీలకు సైతం ఈ వైరం ప్రాకింది. సై అంటే సై అంటూ నెలకు ఐదు రూపాయలకే కెబుల్ టీవీ కనెక్షన్ ఇచ్చి ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీ గూటిలో ఉన్నారు. పవర్ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహిస్తున్న టీజీ వెంకటేశ్ పవర్ పాలిటిక్స్‌ను బాగానే వంటబట్టించుకున్నారు.

19, మార్చి 2014, బుధవారం

భక్త హనుమాన్!

నేతా శ్రీ 4
విహెచ్.. వి హనుమంతరావు అనగానే గుర్తుకొచ్చేది యువజన కాంగ్రెస్. సరిగ్గా 42ఏళ్ల క్రితం ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1972 బ్యాచ్ యూత్ కాంగ్రెస్ లీడర్లతో సమావేశం నిర్వహించాలనీ ప్రయత్నించారు. యువజన కాంగ్రెస్‌కు అది స్వర్ణయుగం అంటారు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు తాలుకా స్థాయిలో యువజన కాంగ్రెస్ నాయకుడు. హనుమంతరావు సార్థక నామధేయుడు. 1992నుంచి ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యులుగానే ఉన్నారు. ఇందిరమ్మ కుటుంబం పట్ల వీరవిధేయతే ఆయన రాజకీయ జీవితానికి పునాది... శాసన మండలి సభ్యునిగా, మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.
రాజీవ్ గాంధీ హత్య జరిగి ఉండకపోతే ముఖ్యమంత్రి పదవిలో ఆయన్ని తెలుగు లాలూప్రసాద్ యాదవ్‌గా చూసి ఉండేవాళ్లం. 


2004లో టిడిపిని ఓడించి వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో వైఎస్‌ గాలి చండ ప్రచండంగా వీస్తోంది. మధ్యాహ్నా సూర్యుడిగా వెలిగిపోతున్నాడు. అలాంటి సమయంలో సైతం వి హనుమంతరావుకు రాజ్యసభ సభ్యత్వం లభించింది. వైఎస్ కూటమికి ఇది ఏమాత్రం మింగుడుపడని విషయం. హైకమాండ్ వద్ద హనుమంతరావుకు ఉన్న పలుకుబడికి నిదర్శనం ఇది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉన్నా, అద్భుతంగా ఉన్నా ఎలా ఉన్నా ఆయన మాత్రం కాంగ్రెస్ నాయకత్వానికి వీర విధేయుడిగానే ఉన్నారు. హనుమంత్ జీ అంటూ రాజీవ్‌గాంధీ ఆయన్ని ముద్దుగా పిలిచే వారు. ముఖ్యమంత్రిగా నేదురుమల్లిని మార్చాల్సి వచ్చినప్పుడు రాజీవ్‌గాంధీ ఓటు హనుమంతుకే. అయినా ఎక్కువమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో ముఖ్యమంత్రి పదవి తృటిలో తప్పిపోయింది. ఆయన మాటలకు మేకప్ ఉండదు, చేతలకు పాలిష్ ఉండదు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఈనాటి రాజకీయాలకు ఇది ఏమాత్రం సరిపోని తత్వం.

ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పనుల కోసం వచ్చిన వారితో ఆయన కార్యాలయం కిక్కిరిసిపోయి ఉంది. ఎక్సైజ్ అధికారి ఒకరు తానెంత మంచి వాడో, తనలాంటి వారి వల్ల రాష్ట్రానికి ఎంత ప్రయోజనమో చాలాసేపు చెప్పుకొచ్చారు. తనను కోరుకున్న జిల్లాకు బదిలీ చేయడం వల్ల జిల్లాకు ఎంతో ప్రయోజనం అంటూ చెప్పుకొచ్చాడు. అంతా విన్న హనుమంతరావు ఫోన్ తీసుకుని వారి ఉన్నతాధికారికి ఫోన్ కలపమని చెప్పి ఇదిగో వీడికి మీరు బదిలీ చేసిన జిల్లాలో పెద్దగా గిట్టుబాటు కాదట! ఇంకో జిల్లాకు బదిలీ చేయండి అంటూ ఒక్క నిమిషంలో ముగించారు. ఆ మాటలతో ఆ అధికారితోపాటు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. 

ఓసారి పాలమూరు జిల్లాలో కారులో అనుచరుడితో కలిసి వెళుతున్నారు. తాము వెళ్లాల్సిన ప్రాంతం సమీపిస్తుండగానే ఏరా ఇక కారు అద్దాలు తీయమంటావా? పిసిసి అధ్యక్షుని పక్కన కూర్చొని వస్తున్నానని అందరికీ తెలవాలి కదరా! అంటూ తానే కారు అద్దాలు పైకి తీశాడు. ఆ అధికారి మనసులోని మాట, ఈ కార్యకర్త మనసులోని మాట అదే -కానీ పైకి చెప్పలేరు. హనుమంతరావు నిర్మోహమాటంగా చెప్పుతారు. అదే రాజకీయాల్లో ఆయన స్టయిల్. కోట్లు సంపాదించి సమాజం ఎక్కడికెళుతుంది అనే డైలాగులు చెప్పేరకం కాదు... ఆయన మాటల్లో, చేతల్లో ఏమాత్రం నటన కనిపించదు. కానీ ఆయన మాట్లాడినప్పుడు నటులను మించిన కామిడీ పండుతుంది. 

హైకమాండ్ అడ్రస్ 10 జనపథ్ అయితే వీరభక్త హనుమాన్‌ది 11 జనపథ్. 1948లో అంబర్‌పేటలో జన్మించిన హనుమంతరావు ఆర్థికంగా జూబ్లీహిల్స్ స్థాయికి చేరుకున్నా అంబర్‌పేటను వదలలేదు 65 ఏళ్ల హనుమంతరావు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌ఆర్, జగన్, కిరణ్ ఎవరినైనా సరే నిర్మోహమాటంగా తిట్టిన చరిత్ర ఆయనకు సొంతం.

18, మార్చి 2014, మంగళవారం

మీడియా డార్లింగ్... నారా బాబు

నేతా శ్రీ 3 .....                     మీడియా డార్లింగ్ ... అది బాబుకు ఇంగ్లీష్ మీడియా పెట్టుకున్న ముద్దు పేరు  . ’95లో ఆయన అధికారాన్ని లాక్కున్న తరువాత ప్రధానంగా మీడియా ప్రచారంపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఒకవైపు కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలి. మరోవైపు ప్రజల్లో విశేషమైన గ్లామర్ ఉన్న ఎన్టీఆర్‌ను మరిపించాలి. -అంటే మీడియానే శరణ్యం అని భావించారు. మీడియా రంజక పాలన సాగించారు. ఆ కాలంలో బాబుకు వచ్చిన ముద్దు పేరు -మీడియా డార్లింగ్. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నారు. అధికారం కోల్పోయి పదేళ్లు. అయినా ఇప్పటికీ ముద్దుపేరును ఆయన నిలబెట్టుకుంటున్నారు. 

2004లో ఘోరమైన ఓటమి. 2009లో మహా కూటమితో మహా పరాజయం. అయినా మీడియా ప్రచారంలో మాత్రం ఎప్పుడూ ఆయనదే పైచేయి. ఈ క్షణంలో కూడా ఏదోక చానల్‌లో ఆయన దర్శనమిస్తారు.
మీడియాకు సామాజిక బాధ్యత ఉండాలంటారు బాబు. రాష్ట్రంలో మీడియా మాత్రం పార్టీల వారీగా సామాజిక బాధ్యత నిర్వర్తిస్తోంది. నిజానికి బాబు ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నంత దుర్మార్గుడు కాదు. మీడియా చెబుతున్నంత మంచివాడూ కాదు. ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు. ఎన్టీఆర్‌కు జనాకర్షణ మాత్రమే తెలిసుండవచ్చు. కానీ చంద్రబాబుకు రాజకీయాలు తెలుసు. తెలుసు కాబట్టే జనాకర్షణ లేకపోయినా ఆకట్టుకునే విధంగా మాట్లాడలేకపోయినా, అధికారం దూరమై పదేళ్లవుతున్నా -ఇంకా వార్తల్లో నేతగానే నిలిచారంటే ఆయనలోని రాజకీయ చతురతే కారణం.


రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం. ఈ విషయంలో మాత్రం బాబు గ్రాఫ్ చాలా వీక్. అందుకే ఆయన ప్రత్యర్థులు దీనిపైనే గురి చూసి కొడుతుంటారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారనే మాట, విశ్వసనీయత లేదనే విమర్శలను ఆయన జీవిత కాలమంతా ఎదుర్కోక తప్పదు. ప్రచారం ద్వారా ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చునని, ఎలాంటి మాయనైనా చేయవచ్చునని నిరూపించారు బాబు. మంచి జరిగితే అది తనవల్లేనని, చెడు జరిగితే ఇతరుల వల్ల అని బ్రహ్మాండమైన ప్రచారం చేయగలరు. నిజానికి ఆయన ఒక రాజకీయ యంత్రం . వ్యక్తిగా ఎవరిపైన ప్రేమ ఉండదు. ద్వేషం ఉండదు. రాగద్వేషాలకు అతీతుడు. తన రాజకీయ జీవితానికి ఉపయోగరం అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు. పనికిరాడు అనుకుంటే ప్రచారంతో పాతాళానికి తొక్కగలరు. మసీదులు కూల్చే పార్టీ అని బిజెపిపై 96లో నిప్పులు చెరిగి మజ్లిస్ నాయకులను మించి విమర్శలు చేసిన బాబు, 98 ఫలితాలను చూసి బిజెపితో అంతే ఉత్సాహంగా చేతులు కలిపారు.
2004లో ఓడిపోగానే మీవల్లే ఓడిపోయానంటూ నెపం బిజెపిపైకి నెట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీపై నిప్పులు చెరిగి, హైదరాబాద్‌లో అడుగు పెట్టనిచ్చేది లేదని హూంకరించిన బాబు, ఇప్పుడు మోడీని మహాత్మాగాంధీతో పోల్చేందుకు ఏమాత్రం మోహమాట పడటంలేదు. మోడీ, గాంధీ ఇద్దరూ గుజరాత్‌లోనే పుట్టారని మోడీని ఆయన సమక్షంలోనే ఆకాశానికెత్తారు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని డిమాండ్ చేసిన నాయకులు అలా గాంధీతో పోల్చడం మోడీకి ఇబ్బంది కలిగించవచ్చు. కానీ బాబు మాత్రం వీటన్నిటికి అతీతుడు.... నిజానికి ఆయనకు మోడీపై ఒకప్పుడు ద్వేషం లేదు. ఇప్పుడు ప్రేమ లేదు. ఆయన మాటలన్నీ రాజకీయ లెక్కల్లో భాగంగానే ఉంటాయి. 


మేధావులను నడిచే గ్రంథాలయం అంటారు. బాబును నడిచే రాజకీయం అనొచ్చు. ముఖ్యమంత్రి పదవి కోసం బాబు ఎంతో తపిస్తున్నారో, అది అంత దూరంగా జరుగుతోంది. ఆ తపనే లేకపోతే ఆయన రాజకీయాల్లో ఉండలేరు. ఆ తపన కనిపిస్తే జనం ఆదరించడం కష్టం. బాబు ప్రస్తావన లేని రాష్ట్ర రాజకీయ చరిత్ర అసంపూర్ణం.

17, మార్చి 2014, సోమవారం

జనసేనాని

నేతాశ్రీ 2

24 రంగాలు కలిస్తే సినిమా! మరి ఎన్ని రంగాలు కలిస్తే రాజకీయం ? మహా మహానటులనే బోల్తా కొట్టిస్తుంది రాజకీయం. రాజకీయం కళా? కలనా?అంటే ఎవరికి తోచిన అర్ధం వాళ్లు చెప్పుకోవచ్చు కానీ అన్నీ కలిస్తేనే రాజకీయం. తలపండిన వారిని సైతం పిచ్చివాళ్లను చేసి ఆడించే రాజకీయ రంగంలో బుడ్డొడు ఏం చేస్తాడు.


చె గువేరా సినీనటుడు పవన్ కల్యాణ్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు. పవన్ చెగువేరాను నరనరాన జీర్ణం చేసుకున్నాడు. చెగువేరాకు బాగా నచ్చిన నవల డాన్ క్విక్సోట్. ఈ నవలలో హీరో క్విక్సోట్ రోసి నంటి అనే బక్కచిక్కిన గుర్రం ఎక్కి స్పెయిన్ దేశమంతా తిరిగి అన్యాయాన్ని ఎదిరిస్తూ, అనాధలను ఆదుకుంటూ ప్రజలను రక్షిస్తుంటాడు.
సరిగ్గా ఇలానే తెలుగు ప్రజలను రక్షించాలని పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ ఏర్పాటు  చేశారు . జనసేన పేరుతో రాజకీయ పార్టీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జనసేనాధిపతిగా ఆయన నిలవాలనుకుంటున్నారు. నవల కాబట్టి రచయిత ఇష్టం వచ్చినట్టుగా హీరో వీరోచిత కార్యాలు చేస్తారు. రాజకీయాల్లో అది సాధ్యమా? మహామహా మెగాస్టార్లనే బోర్లాపడేసిన రంగమిది. 

మనం బుడ్డొడు అని ముద్దుగా పిలుచుకున్నట్టు అర్జెంటినాలో చె అని పిలుచుకుంటారు.  చె  అంటే బుడ్డోడు అని. చెగువేరా పేరు అలా ఏర్పడిందే. చెగువేరాను ఇష్టపడే ఈ బొడ్డుడు రాజకీయాల్లో ఏం చేస్తాడు.
ఆవేశం ఒక్కటే రాజకీయాల్లో రాణించడానికి సరిపోతుంది అనుకుంటే అది పవన్‌కు బోలెడుంది. నాలుగు పదుల వయస్సున్న పవన్ కల్యాణ్ అన్న చాటు తమ్మునిగా సినిమాల్లోకి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. మిగిలిన హీరోల్లా కాకుండా సమాజం గురించి ఆలోచించడం, బాగా చదవడం, ఏదో చేయాలనే తపన సినిమా రంగంలో పవన్‌ను ప్రత్యేకంగా నిలిపింది. ఎంతో మందిని ఆదుకునే మంచి మనసున్న నటుడు అంటారు తెలిసిన వారు.


కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి కామన్ మ్యాన్ ప్రోటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినా, ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టి కాంగ్రెస్ నాయకుల పంచెలు ఊడదీసి కొడదామని తిట్టినా అది ఆవేశం నుంచి వచ్చిన చర్యలే.
రాజకీయాల్లో రాణించాలంటే సర్వకళల్లో ఆరితేరి ఉండాలి. కెమెరా స్టార్ట్ యాక్షన్ అనే మాటలు వినగానే నటిస్తే నటులకు సరిపోతుంది కానీ రాజకీయాల్లో అలా కాదు. నిశ్శబ్దంలోనూ, చిమ్మ చీకటిలో, నిద్రలోనూ, మెలుకువగా ఉన్నప్పుడు నిత్యం ప్రతి క్షణం నటిస్తూనే ఉండాలి. అది నటన అని ఏ మాత్రం తెలియకుండా నటించేంత సామర్ధ్యం ఉండాలి. అలా ఉన్నవాళ్లే రాజకీయ నాటక రంగంలో రాణిస్తారు. ప్రజారాజ్యంను చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత పవన్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సొంత బృందంతో రాజకీయాల్లోకి వస్తున్నారు.   ప్రశ్నించడం కోసం జనసేన పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట! పవన్‌ను అభిమానించే వారు, వ్యతిరేకించే వారు అంతా అనుకునే మాట పవన్ రాజకీయాల్లో ఇమడలేడు అని ఈ సంగతి కాలమే తేల్చాలి.

13, మార్చి 2014, గురువారం

దివాకర్ ట్రావెల్స్ .. గాంధీ భవన్ టూ ఎన్టీఆర్ భవన్


కుటుంబం దెబ్బతిన్నప్పుడు గుర్తుకు వచ్చేది మేనమామ. మేనమామ అంటే తల్లి తరువాత తల్లిలా ఆదరిస్తాడు, తండ్రిలా భరోసా ఇస్తాడు. మాటల్లోనే కాదు చేతల్లోనూ దీన్ని రుజువు చేశారు అనంతపురం సీనియర్ నాయకుడు జెసి దివాకర్‌రెడ్డి. కరవు జిల్లా అనంతపురంలో అపరకుబేరుడు. తన కింద పని చేసే సాధారణ ఉద్యోగితో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టించిన మహనీయుడు. మైన్స్, ట్రాన్స్‌పోర్ట్, రాజకీయం వంటి అనేక వ్యాపారాల్లో ఆరితేరిన వారు. రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు వోల్వా బస్సును బహుమతిగా ఇస్తానని బహిరంగంగా ఆఫర్ చేసిన మహాదాత. ఆయన చితికి పోవడం ఏమిటని? సందేహం రావడం సహజమే. చితికి పోయింది ఆయన కాదు. ఆయన వోల్వా బస్సు తగలబడి అర్ధశతకం మంది అసువులు బాసినా ఆయన బస్సులు గంట కూడా నిలువలేదు. వ్యాపారం ఆగలేదు. 

చితికిపోయింది ఇంత కాలం ఆయన్ని ఆదరించి పెద్దవాన్నిచేసిన పార్టీ. కుటుంబం చితికి పోతే మేనమామను ఆశ్రయిస్తారు. అలానే రాజకీయ పార్టీ చితికిపోతే మేనమామ పార్టీనే కదా ఆశ్రయించాల్సింది. జెసి ఆదే చేశారు. సొంతంటిలో కన్నా అమ్మ పుట్టిల్లు అయిన మేనమామ ఇంటిలో మరింత స్వేచ్ఛ ఉంటుంది. అనంతపురంలో కాంగ్రెస్, టిడిపి నాయకులు కత్తులు దూసుకున్నా, పీకలు తెగ్గోసుకున్నా జెసి మాత్రం తాను కాంగ్రెస్‌లో ఉన్నా టిడిపితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలే నెరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడ్డా కింద పడకుండా ఉండడం వెనుక మ్యాజిక్ ఏమిటో జెసినే చెప్పారు. బాబు కాంగ్రెస్‌కు మేనమామ లాంటివారు, అండగా నిలవడం మేనమామ బాధ్యత అందుకే మా బాబు మేనమామలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నాడని చెప్పుకొచ్చారు. విభజనతో కాంగ్రెస్ పరిస్థితి అడవి గాచిన వెనె్నలగా మారిపోవడంతో మేనల్లుడు జెసి మేనమామను నమ్ముకుని టిడిపికి దూకేశారు. పరిటాల రవి హత్య సమయంలో జెసి పాత్ర ఉందని బాబు గగ్గొలు పెట్టాడు కదా? కార్యకర్తలను చంపించాడన్నారుకదా మరి ఎలా చేర్చుకుంటున్నారు అనే ప్రశ్నలు వంద వచ్చాయి. 

అన్నాదమ్ములే కోపం వచ్చినప్పుడు ఎన్నో తిట్టుకుంటారు. పార్టీలు అన్నాక అలాంటివి సాధారణం. మేనల్లుడు కష్టాల్లో ఉన్నప్పుడు మేనమామ పిలిచి ఆదరించడంలో విశాల హృదయాన్ని చూడాలి కానీ పాత కక్షలనుకాదు. ఒకే వేదికపై పరిటాల భార్య సునీత, జెసి దివాకర్‌రెడ్డి కూర్చోని రాష్ట్ర సంక్షేమం కోసం పాటు పడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు. ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎమ్మెల్యేలుగానే కాదు మంత్రులుగానే వారిద్దరు ఒకే వేదికపై కూర్చుంటారు. ఆరుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జెసి దివాకర్‌రెడ్డి 69 ఏళ్ల వయసులో పసుపు కండువాతో కొత్త పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నారు