పుస్తక సమీక్ష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుస్తక సమీక్ష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, మార్చి 2012, ఆదివారం

మీడియా తప్పు చేస్తే...



రాజు తప్పు చేయడు అంటారు. అంటే రాజు ఏం చేసినా అది తప్పు కాదన్నమాట. మన మీడియా సైతం అలానే అనుకుంటోంది. మీడియా తప్పు చేయదు అని మరి అలా తప్పు చేస్తే విమర్శించాల్సిన అవసరం ఉందా? లేదా? ప్రజాస్వామ్య దేశంలో ప్రధానమంత్రి తప్పు చేసినా బోనులో నిలబడుతున్నారు. మీడియాలో ఉండేది కూడా మనుషులు మనుషులన్నాక తప్పులు ఎందుకు జరగవు. కొన్ని ఉద్దేశ పూర్వకంగా జరుగుతాయి. కొన్ని తెలియక జరుగుతాయి. మేం ఏది చేసినా సరైనదే అనుకోవడం కన్నా తప్పును ఒకరు ఎత్తి చూపినప్పుడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మీడియా తప్పులను ఎత్తి చూపుతూ మీడియా స్కాన్ పేరుతో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఒక పుస్తకాన్ని వెలువరించారు. ప్రతి వారం మీడియా పోకడలను ప్రస్తావిస్తూ ఈ వారంలో రాసిన వ్యాసాలతో మీడియా స్కాన్ పేరుతో పుస్తకంగా విడుదల చేశారు. ఒక దశాబ్దం క్రితం ఒక మీడియా మాటే వేదంగా చెలామణి అయింది. వాళ్లు వెన్నుపోటు అంటే అది వెన్నుపోటు, కాదు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ప్రజా స్వామ్య పరిరక్షణగా చెలామణి అయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పార్టీకో పత్రిక, ప్రాంతానికో పత్రిక, కులానికో పత్రిక కనిపిస్తోంది. మారిన ఈ పోకడ ఒక విధంగా ఆవేదన కలిగిస్తే, మరో విధంగా అభినందనీయం. ప్రజలను నమ్ముకోవడం కన్నా ఒకటి రెండుపత్రికలను నమ్ముకుని రాజకీయం చేద్దామనుకునేవారికి ఆటలు ఇక సాగవు అని చెప్పే విధంగా మీడియాలో పోటీ ఏర్పడడడం ప్రజాస్వామ్యానికి మంచిదే. తెలుగుమీడియాపై వచ్చిన ఎపి మీడియా బ్లాగ్ స్పాట్ డాట్‌కాం బ్లాగు గురించి మొదలు పెట్టి ఈనాడు , సాక్షి వివాదాల వరకు రచయిత మీడియాలోని అన్ని అంశాలను తన వ్యాసాల్లో ప్రస్తావించారు. ఒక పార్టీపై అభిమానమో, ఒక పత్రికపై ప్రేమ, మరో పత్రికపై వ్యతిరేకత అని కాకుండా నిష్పక్షపాతంగా పత్రికల ధోరణుల గురించి రాశారు. ఒక అంశంలో ఒక పత్రికను విమర్శించిన రచయిత మరో అంశంలో ఆ పత్రిక వైఖరిని మెచ్చుకోవడం ద్వారా తన నిష్పక్షపాత వైఖరిని చెప్పకనే చెప్పారు. రామోజీరావుతో వివాదం తరువాత ఆయన కుమారుడు సుమన్ సాక్షికి తన ఇంటర్వ్యూ ఇవ్వడం, ఆ అంశంపై చానల్స్‌లో జరిగిన చర్చను ప్రస్తావించారు. తెలుగు మీడియా ధోరణులు, రాజకీయ పక్షాలకు మద్దతుగా, వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారికి మంచి సమాచారం అందించారు రచయిత. తప్పు ఎత్తి చూపిన వారిని శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు. తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి.
ఇంగ్లీష్, తెలుగు దినపత్రికలతో పాటు చానల్స్‌లోని వార్తలను, వాటి ధోరణులను సమీక్షించారు. అదే విధంగా నవ్య వారపత్రిక ప్రత్యేక సాహిత్య సంచికపై వ్యాసం ఆకట్టుకునే విధంగా ఉంది. నవ్య వారపత్రిక శ్రీశ్రీపై ప్రత్యేక సంచిక వేసింది. సాధారణంగా సినిమా తారల ముఖ చిత్రంతో వార పత్రిక వెలువడినప్పుడు అమ్మే కాపీల కన్నా సాహిత్య సంచికగా వెలువడినప్పుడు తక్కువ కాపీలు అమ్ముడవుతాయి. కానీ ఇలాంటి ప్రత్యేక సంచికల ద్వారా ఆ పత్రికకు సాహిత్య విలువ ఏర్పడుతుందనే మంచి విషయం చెప్పారు.
- మురళి
మీడియా స్కాన్
( పత్రికలపై పరిశీలనా నేత్రం)
రచయిత: డాక్టర్ నాగసూరి
వేణుగోపాల్
వెల:150 రూపాయలు
పేజీలు 240
ప్రతులకు : ఎన్‌కె పబ్లికేషన్స్
24-8-1,సమీర రెసిడెన్సీ,
విజయనగరం 535002
ఫోన్ 094403 43479

26, ఫిబ్రవరి 2012, ఆదివారం

స్ఫూర్తి ప్రదాతలు.. విజేతల జీవన రేఖలు



జీవితంలో అన్నింటా ఓడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని ఓ బహుళ అంతస్తుల భవనం ఎక్కాడు. దూకడానికి సిద్ధమైన అతనికి ఎదురుగా మరో భవనంపై వేలాడుతూ ఓ వ్యక్తి భవనానికి రంగులు వేయడం కనిపించింది. అతనికి జీవితం ప్రతి రోజు రిస్కే. రిస్కునే జీవితంగా గడుపుతున్నప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం పిరికితనమే, జీవితం జీవించడానికే అని గ్రహించి, తన ఎదుగుదలకు కృషి చేశాడు. స్టార్ హోటల్స్ నిర్మించాడు. అంతర్జాతీయ అవార్డులు సాధించాడు. సినిమా కథ చెబుతున్నాననుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి జీవిత కథను ప్రస్తావిస్తున్నాను. నిజమే తెలుసుకునే ఓపిక ఉండాలి కానీ సినిమా కథలను మించిన మలుపులుంటాయి వ్యక్తుల జీవితాల్లో. అవి స్ఫూర్తినిస్తాయి. అలాంటి 51 మంది స్ఫూర్తి ప్రదాతల సంక్షిప్త జీవిత చరిత్రల రూపమే స్ఫూర్తి ప్రదాతలు. ఇవి సినిమా కథలు కాదు విజయం సాధించిన వారి జీవితాలు. కామత్ హోటల్ పేరు విన్నదే కదా? ఆ హోటల్‌లో పదార్థాలు నాలుకపై కలిగించే ప్రభావం కన్నా ఆ హోటల్ యజమాని జీవిత కథ మనసుపై చూపించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకుందామనుకున్న స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి హోటల్ నిర్మించే స్థాయికి ఎదిగిన వ్యక్తి విఠల్ వెంకటేష్ కామత్.
ఆయన ఆత్మకథను యండమూరి వీరేంద్రనాథ్  తెలుగులో అనువదించారు. కర్నాటకలో పలు యూనివర్సిటీల్లో ఆయన అత్మకథను నాన్‌డిటేల్డ్‌గా పెట్టారు. కచ్చితంగా ఇలాంటి వారి ఆత్మకథలు యువతకు ప్రేరణ కలిగిస్తాయి. స్ఫూర్తి ప్రదాతలు అంటే.. అందరూ చిల్లిగవ్వలేకుండా జీవితాన్ని మొదలు పెట్టి కోట్లు గడించిన వారేనా? ఈ మధ్య వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎక్కువగా ఇలాంటి వారి జీవితాలనే ఉదహరిస్తున్నాయి. అయితే, ఈ పుస్తకంలో రామా చంద్రవౌళి కేవలం అలాంటి విజేతలను మాత్రమే ఎంపిక చేసుకోలేదు. బాలచందర్, ఇళయరాజా మొదలుకుని తమ ఆలోచనల ద్వారా సమాజంలో చైతన్యానికి పూనుకున్న మహాశే్వతాదేవి, మేథాపాట్కర్ , అన్నా హజారే, బెన్‌కింగ్‌స్లే , బాలగోపాల్ వరకు వివిధ రంగాల్లోని విజేతలను పరిచయం చేశారు. బూట్ల పాలిష్ షాపులో పని చేసే వ్యక్తి స్థాయి నుండి అత్యున్నతమైన జ్ఞానపీఠం అవార్డు స్థాయి వరకు ఎదిగిన జయకాంతన్ వరకు 53 మంది విశిష్ట వ్యక్తుల సంక్షిప్త జీవిత చరిత్రల కూర్పు స్ఫూర్తి ప్రదాతలు.
ముంబైలో, హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన గ్రంథి మల్లిఖార్జున రావు గురించి రాస్తూ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మద్యపాన నిషేధ ప్రతిపాదనలు ప్రకటించగానే ఆయన తన బ్రూవరీలను యుబికి అమ్మేశాడని రాశారు. రాష్ట్రంలో చంద్రబాబు ఎప్పుడూ మద్యపాన నిషేధం విధించలేదు. పైగా నిషేధాన్ని ఎత్తేశారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సారాపై నిషేధం విధిస్తే, 1994లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. ఆ తరువాత వచ్చిన బాబు నిషేధాన్ని సడలించారు. రచయిత అనేక చోట్ల ఒక రంగాన్ని నమ్ముకుని అదే రంగంలో ఉన్నవారు అత్యున్నత స్థాయికి వెళ్లారని పేర్కొంటారు. అంటే అదే రంగంలో ఉండాలనే ఉద్దేశంతో. విజయానికి ఇవీ సూత్రాలు అని ఏమీ ఉండదు. మరి ఇదే పుస్తకంలో గ్రంధి మల్లిఖార్జున రావు సంప్రదాయంగా తాము చేస్తున్న వ్యాపారాలను వదిలి ఇతర రంగాలకు వెళ్లి విజయం సాధించారు కదా? జూట్‌నుంచి జెట్ వరకు ఎదిగిన సాహసిగా మిత్రులు ఆయనను అభివర్ణిస్తారని రచయితే రాశారు. పౌరహక్కుల నేత కె.బాలగోపాల్ గురించి రాసిన దానిలో ఎస్‌ఆర్ శంకరన్, కెజి కన్నాభిరాన్, ఆర్‌ఎస్ రావులను ప్రస్తావించారు. ఐఎఎస్ అధికారుల్లో స్ఫూర్తి దాయకమైన ఎస్‌ఆర్ శంకరన్ లాంటి వారు లేకపోవడం దురదృష్టకరమనే మాట ఇటీవల తరుచుగా వినిపిస్తోంది. వారి గురించి కూడా రాస్తే బాగుండేది. ఈ పుస్తకంలో దాదాపుగా స్ఫూర్తి ప్రదాతల ఆత్మకథలో, జీవిత చరిత్రలో వెలుగు చూశాయి. సంక్షిప్త జీవిత కథ చదివిన తరువాత ఆసక్తి గల వారు వారి ఆత్మకథలు చదివేందుకు ప్రయత్నించవచ్చు.

    స్ఫూర్తి ప్రదాతలు
( విజేతల జీవన రేఖలు)
రచయిత :
రామాచంద్రవౌళి
వెల : వంద రూపాయలు
పేజీలు 196
ప్రాప్తిస్థానం: అన్ని ప్రధాన పుస్తక షాపుల్లో