19, సెప్టెంబర్ 2024, గురువారం

ఓ గోల్డ్ మెడలిస్ట్ అనాధ మరణం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -115

ఆమె యూనివర్సిటీ లో గోల్డ్ మెడల్ సాధించారు . ప్రభుత్వాలను శాసించే నంబర్ వన్ సంస్థ లో జీవితాన్ని ప్రారంభించి ..దాదాపు నాలుగు దశాబ్దాలు అదే జీవితం . ఆమెది ఒంటరి జీవితం . హైదరాబాద్ మహానగరం లో ఒంటరిగా గదిలో ప్రాణాలు విడిచింది .తలుపు బద్దలు కొట్టి చూస్తే తప్ప ఆమె మరణం బయటి వారికి తెలియలేదు . అనాధ శవానికి పోలీసులు , మున్సిపాలిటీ అంత్యక్రియలు నిర్వహించారు . .... ఈ వార్త టీవీ వారి దృష్టిలో పడితే పండగే ... మానవత్వం మంటగలిసింది ... ఎక్కడికి వెళుతున్నాం ... మనుషుల మేనా అంటూ వీలైతే సినిమా పాటలతో అద్భుతంగా మానవత్వాన్ని తట్టిలేపే విధంగా చక్కిని స్టోరీ ప్రసారం చేసే వారు . పత్రికల్లో ఐతే చేయి తిరిగిన సబ్ ఎడిటర్ చేతిలో పడితే కన్నీళ్లు పెట్టించే కవిత్వంతో వార్త వెలుగు చూసేది .. మరణం నిజమే ... కానీ టివిలో , కానీ మీడియాలో కానీ హృదయ విదారక కథనాలేమి రాలేదు .. ఎందుకంటే అలా మరణించింది ఓ మహిళా జర్నలిస్ట్ ... ఎవరైనా ఇలా మరణిస్తే జర్నలిస్ట్ లు హృదయ విదారకంగా కథనం రాస్తారు కానీ జర్నలిస్ట్ మరణిస్తే అలా రాయరు. ఎందుకలా అంటే అదంతే ... .... జంధ్యాల భారతి పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం లో జర్నలిజం లో గోల్డ్ మెడల్ సాధించారు ... ఈనాడు లో జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి తరువాత ఫ్రీ లాన్సర్ గా ఉన్నారు .. మిత్రుడు నామాల విశ్వేశ్వర్ రావు ఫోన్ చేసి జంధ్యాల భారతి సంస్మరణ సభ నిర్వహించాలి అని నాకు ఉంది .. ఆమె ఇలాంటివి తనకు నచ్చవు వద్దు అని గతంలో చెప్పారు అని కొందరు అంటున్నారు .. మీ అభిప్రాయం ఏమిటీ అని అడిగారు .. మీరు సంస్మరణ సభ నిర్వహించినా , నిర్వహించక పోయినా పోయిన వారికి తెలియదు .. మనం ఎలా బతుకుతున్నాం అని మనకు మనం చెప్పుకోవడానికి .. మన జీవితాన్ని మనం సమీక్షించుకోవడానికి సభ నిర్వహించాలి అనేది నా అభిప్రాయం అని చెప్పాను ... ఆమె కోసం కాదు మన కోసం అవసరం అని చెప్పాను ... .... నిన్నటి రోజంతా ఈ విషయం మీదే చర్చ ... ఆలోచన ... ఆమెతో పెద్దగా పరిచయం లేదు ..ఆంధ్రభూమిలో ఉండగా చాలా సార్లు చూశాను .. ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా అన్ని పత్రికలకు రాసే వారు ... ముందు ప్రభ తరువాత కరోనా లో భూమి లో పారితోషకం ఇవ్వడం మానేశాక రాయడం మానేశారు .. మిత్రుడు విష్వఈశ్వర రావు చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఈనాడు లోనే జర్నలిజం జీవితాన్ని ప్రారంభించారు .. ఎం వి ఆర్ శాస్త్రి , కె యల్ రెడ్డి వంటి వారితో కలిసి ఈనాడులో పని చేశారు . అక్కడి ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ... అక్కడ ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమి కాదు ... ఐతే ఇద్దరిలో ఒకరు రాజీనామా చేయాలి ఇది నిబంధన .. ఆమె రాజీనామా చేసింది .. కాపురం మూన్నాళ్ళ ముచ్చట కాదు ఒక రోజు ముచ్చట గానే మిగిలి పోయింది ... మళ్ళీ ఒంటరి జీవితమే ... ప్రైవేటు ఉద్యోగం అంటేనే బతుకు భయం భయం ఇక జర్నలిస్ట్ ఉద్యోగం అంటే మరింత భయం ...ఆమె అలానే జీవితమంతా భయం తో కలిసి బతికింది చనిపోయింది ... .... అందరి జీవితాలు ఇలానే ఉంటాయి అని కాదు సినిమా రంగం , జర్నలిజం , రచయిత ఏ రంగం ఐనా కావచ్చు ... ఎవరి బతుక్కు వారే కారణం ... సమాజం , తోటి వారు , యూనియన్ లు అని మాట్లాడితే పలాయన వాదమే అవుతుంది .. జర్నలిజం నుంచి సివిల్స్ కు ఎంపిక అయిన వారు ఉన్నారు ... ముందుకు బానిసలైన వారు ఉన్నారు ... ఆయేషా అని దక్కన్ క్రానికల్ లో క్రైం రిపోర్టర్ ఉండేవారు .. అమ్మాయి అయినా ఎప్పుడూ మార్చురీల చుట్టూ తిరిగేది ... ఇప్పటిలా వాట్స్ ఆప్ జర్నలిజం కాదు కాబట్టి రోజూ మార్చురీకి వెళ్ళేది ... ఐనా ఆఫీస్ లో వేధింపులు ...ఉద్యోగం వదిలేసింది . కొంతకాలం తరువాత ఆమె ఏకంగా జిల్లా కలెక్టర్ అయ్యారు .. చిన్న వయసు వారు కనిపిస్తే బోలెడు ప్రభుత్వ ఉద్యోగాలు , బ్యాంకు రైల్ వే ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తుంటాయి వెళ్లొచ్చు కదా ? అనేవాడిని ... అలా వెళ్లిన ఎంతో మందిని చూశా ... శ్రీ శ్రీ , వేటూరి సుందర రామ మూర్తి వంటి గొప్ప వారు మొదట్లో జర్నలిస్ట్ లే ... ఇవి ఆ రోజులు కాదు .. ఇతర రంగాల్లో రాణించిన వారిని చూశా అనాధల్లా మరణించిన వారిని చూశా ... ... భూమిలో చిక్కడ పల్లి చారీ అని ఒక పార్ట్ టైం విలేఖరి ఉండేవారు ... ఓ రోజు సార్ నేను ఎడిటర్ ఇంటికి వెళ్తా , ఎడిటర్చెప్పిన పని చేస్తా కానీ ఆఫీస్ కు వచ్చాక న్యూస్ ఎడిటర్ , బ్యూరో డెస్క్ అందరి మీద అధికారం చెలాయిస్తా ... నేను ఒక్కరికి తలవంచి అందరినీ భయపెడతా అని చెప్పుకుంటూ పోయా డు .. భ్రమల్లో బతుకుతున్నాడు పాపం అనిపించింది . అతని గురించి కొన్ని రోజుల తరువాత తెలిసింది .. చనిపోయాడు నాలుగు రోజులు మార్చురీలోనే శవం ... ఎవరూ రాలేదు ... ఎన్టీఆర్ ను దించేసి సమయం ... అప్పుడు సెల్ ఫోన్లు లేవు .. సచివాలయం ప్రెస్ రూమ్ లో ల్యాండ్ లైన్ ... ఓ జర్నలిస్ట్ తన వంతు వచ్చే వరకు నిలబడి మెల్లగా ఫోన్ లో సచివాలయంలో బాబు ఛాంబర్ లో ఎంత మంది శాసన సభ్యులు చేరారో రామోజీ రావుకు చెబుతున్నాడు ... ఆ సాయంత్రమే శిబిరం వైస్ రాయ్ కి మారింది .. ప్రభుత్వాన్ని కూల్చడం లో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారు కూడా అంత మెల్లగా తన పని తాను చేసుకు పోతుంటే ... మందు మత్తులో అమెరికా అధ్యక్షున్ని కూడా ప్రెస్ రూమ్ నుంచే మార్చేస్తున్నట్టు మాట్లాడే వారిని కూడా చూశా ... ప్రపంచం లో ప్రతి పరిణామం పై సమీక్షించే మనం మన జీవితాన్ని కూడా సమీక్షించు కోవాలి లేదంటే ? ఆరోగ్యం , మానవ సంబంధాలు , డబ్బు అన్నీ జీవితానికి ముఖ్యమే ... బెంగళూరులో ఓ సీఏ ఆఫీస్ లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్నారట ... అంత్యక్రియలకు ఎవరూ రాలేదట ... వాస్తవం ఇలానే ఉంటుంది ... భ్రమలు వదిలి వాస్తవం లోకి రావాలి ... ఓ వీడియో వింటుంటే నూతన్ ప్రసాద్ గురించి యండమూరి వీరేంద్ర నాథ్ ఓ మాట చెప్పారు ... సినిమా షూటింగ్ ప్రమాదంలో నడుము వరకు చచ్చుపడడం తో నూతన్ ప్రసాద్ వీల్ చైర్ కే పరిమితం అయ్యారు .. జీవితంలో అనుకోకుండా వచ్చే ప్రమాదాలకు ముందే సిద్ధం అయి ఉంటే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది అని చెప్పారట ... ఏ ఉద్యోగంలో ఉన్న వచ్చే ప్రమాదాలను ముందే ఊహించుకుంటే జీవితం అగమ్య గోచరంగా ఉండదు ... సీఎం తెలుసు పీఎం తెలుసు అంటూ భ్రమల్లో బతికితే .... - బుద్ధా మురళి

17, సెప్టెంబర్ 2024, మంగళవారం

ఆ ఇద్దరికి సీఎం పీఠం దక్కింది కానీ ఇంటి స్థలం దక్కలేదు.. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -114

ఆ ఇద్దరికి సీఎం పీఠం దక్కింది కానీ ఇంటి స్థలం దక్కలేదు.. ఇందిరా గాంధీ పేరు వద్దంటే సభ్యత్వం తీసుకోకండి : రేవంత్ బృందంతో వై యస్ జర్నలిస్ట్ జ్ఞాపకాలు -114 రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన శాసన సభ్యుల హౌసింగ్ సొసైటీలో ఇద్దరు సభ్యులకు ముఖ్యమంత్రి పదవి దక్కింది కానీ ఇప్పటి వరకు ఇంటి స్థలం మాత్రం దక్కలేదు . అటు పార్టీ వాళ్ళు ఇటు మారారు . సీఎంలు అయ్యారు , మంత్రులు అయ్యారు కానీ ఓ ఇంటివారు కాలేదు . ఎన్నో రాజకీయ మార్పులు చూసిన శాసన సభ్యుల హౌసింగ్ సొసైటీ కథ ఇది . ***** టీడీపీ శాసన సభ్యుల బృందం అప్పటి ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి వద్దకు వెళ్లి మెల్లగా తమ కోరిక బయటపెట్టారు . ఇందిరాగాంధీ పేరు వద్దు ఇంకేదైనా పేరు పెట్టండి అని కోరారు . వైయస్ నింపాదిగా మీకు ఇందిరాగాంధీ పేరు నచ్చలేదా ? నో ప్రాబ్లమ్ బలవంతం ఏమీ లేదు . మీకు నచ్చక పోతే ఇందిరా గాంధీ పేరుతో ఉన్న ఆ సొసైటీలో చేరకండి అని చెప్పి పంపించేశారు . ఆ రోజు ఇందిరాగాంధీ పేరు మార్చాలి అని వైయస్ ను కలిసిన శాసన సభ్యుల బృందంలో ఇప్పటి ముఖ్యమంత్రి , అప్పటి శాసన మండలి సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు . ఇందిరాగాంధీ కుటుంబం త్యాగాలు , గాంధీ కుటుంబం సేవల గురించి సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆవేశంగా మాట్లాడారు . ఇందిరాగాంధీ పేరుతో సొసైటీ వద్దు పేరు మార్చాలి అని కోరిన రేవంత్ రెడ్డి అంతే ఆవేశంగా గాంధీ కుటుంబ త్యాగాలు గుర్తు చేసినప్పుడు పాత విషయాలు గుర్తుకు వచ్చాయి . శాసన సభ్యులకు , జర్నలిస్ట్ లకు , సివిల్ సర్వీస్ అధికారులు , న్యాయమూర్తులకు నివాస స్థలాలు ఇవ్వడానికి హౌసింగ్ సొసైటీలు ఏర్పాటు చేస్తున్న సమయం అది . ఉమ్మడి రాష్ట్రంలో 2006లో టీడీపీ శాసన సభా పక్షం కార్యాలయంలో టీడీపీ శాసన సభ్యులు , మండలి సభ్యుల సమావేశం . గుర్తున్నంత వరకు అనుముల రేవంత్ రెడ్డి , పయ్యావుల కేశవ్ , దూళిపాళ నరేంద్ర , ఎర్రబెల్లి దయాకర్ రావు మరికొంత మంది టీడీపీ శాసన సభా పక్షం కార్యాలయంలో సమావేశం . బాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ బృందం ఇలానే ఓ సారి సమావేశం అయింది . ఇంటి స్థలాల కోసం అని చెబితే .. శాసన సభ్యులకు ఇంటి స్థలాలు అంటే బాబు ఒప్పుకోరు . బాబు ఒప్పుకునే ఐడియా చెబుతాను అని . ఎమ్మెల్ల్యేల హౌసింగ్ సొసైటీ అని పేరు పెట్టవద్దు .ఎమ్మెల్యేస్ ఇన్ఫో టెక్ సొసైటీ అని పేరు పెట్టుకోండి అని దయాకర్ రావు బృందానికి సలహా ఇచ్చాను .. ఐటీ పేరుంటే కోరినంత భూములు ఇస్తున్న రోజులు అవి . వీరి వినతిని బాబు పట్టించుకోలేదు . పేరులో ఏముంది అంటారు కానీ అంతా పేరులోనే ఉంది . టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైయస్ సీఎం అయ్యారు . హౌసింగ్ సొసైటీలు ప్రభుత్వ అనుసన్నల్లో ఏర్పాటు అయ్యాయి . అన్నింటికీ వై యస్ ఆర్ నే పేరు పెట్టారు . శాసన సభ్యుల సొసైటీకి ఇందిరాగాంధీ పేరు పెట్టడం టీడీపీ సభ్యులకు ఇబ్బంది కరంగా మారింది . పయ్యావుల కేశవ్ ( ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక మంత్రి ) నాయకత్వంలో అనుముల రేవంత్ రెడ్డి , దూళిపాళ నరేంద్ర , దయాకర్ రావు , వేం నరేందర్ రెడ్డి తదితరులు సమావేశం అయి పేరు మార్చాలి అని వైయస్ ఆర్ ను కోరారు . బలవంతం ఏమీ లేదు మీకు పేరు నచ్చక పోతే సొసైటీలో చేరకండి అని వై యస్ సలహా ఇచ్చి పంపించారు . శాసన సభ్యుల సొసైటీ ఇందిరాగాంధీ పేరుతో ఉంటే , జర్నలిస్ట్ లకు సంబంధించిన సొసైటీ కి జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టారు . మాకా ఇబ్బంది లేదు నెహ్రూ జర్నలిస్ట్ కూడా అని అసలే దిగులుగా ఉన్న టీడీపీ శాసన సభ్యులకు చెప్పాను . **** శాసన సభ్యుల సొసైటీకి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహించారు . ఆ తరువాత ఆయన ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ అయ్యారు . ఢిల్లీలో ప్రయత్నాలు ఫలించి రోశయ్యను తప్పించి సీఎం కూడా అయ్యారు . అనుముల రేవంత్ రెడ్డి ప్రయత్నాలు కూడా ఫలించి సీఎం అయ్యారు . వీరిద్దరూ సీఎంలు అయినా హౌసింగ్ సొసైటీలో సొంత ఇంటి కల ఫలించలేదు. శాసన సభ్యుల హౌసింగ్ సొసైటీ ఎన్నో పరిణామాలు చూసింది . తెలంగాణ ఉద్యమ కాలం లో తెరాస శాసన సభా పక్షం నాయకునిగా ఈటెల రాజేందర్ ఉండేవారు . ఒక దశలో తెరాస శాసన సభ్యులను మేం మీకు సొసైటీలో సభ్యత్వం ఇవ్వం అని ఈటెల బృందంపై కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారు . వారు ఆ ఒత్తిడికి తలొగ్గలేదు . అటు శాసన సభ్యులు , ఇటు జర్నలిస్టులు హౌసింగ్ సొసైటీ ద్వారా ఎప్పుడు ఓ ఇంటివారు అవుతారో ఎవరికి తెలియదు . రేవంత్ రెడ్డి ఇంట్లో వాళ్లకు కూడా ఇదే సందేహం వచ్చింది . జర్నలిస్ట్ లకు పట్టాలు ఇచ్చారు . మరి మన కెప్పుడు పట్టా వస్తుంది అని అడిగారట . ఓ సభలో రేవంత్ రెడ్డినే ఈ విషయం చెప్పారు . శాసన సభ్యులు పది లక్షలు కట్టి ఎదురు చూస్తుంటే జర్నలిస్టులు రెండు లక్షలు కట్టి రెండు దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నారు . రెండు లక్షలు కట్టిన సమయంలోనే కొందరు జర్నలిస్టులు మన్నెవారి తుర్కపల్లి అనే గ్రామంలో రోడ్డు పై ఉన్న పొలం ధర అడిగి వచ్చారు . 80 వేలకు ఎకరం ధర , ఇప్పుడు అక్కడ ఎకరం రెండు నుంచి మూడు కోట్ల . సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోని ఉంటే ? ఇటిచ్చిన రెండు లక్షలతో అటు రెండున్నర ఎకరాలు కొని ఉంటే ఇప్పుడు చకోర పక్షిలా ఎదురు చూసే అవసరం ఉండదు . మార్కెట్ రేటుకు కొన్నా, అదేదో డ్వాక్రా సంఘాల సభలా మూడు రంగుల జెండా పట్టి పాటకు నృత్యం చేసి భావోద్వేగాలకు గురైనా , కొనుక్కున్న స్థలం ఎప్పుడు చేతికి వస్తుంది అనే ప్రశ్నకు సగటు జర్నలిస్ట్ వద్ద సమాధానం లేదు . ఈ ప్రశ్న ఇంట్లో వాళ్ళు అడిగితే సీఎం నే చెప్పలేనప్పుడు సగటు జర్నలిస్ట్ ఏం చెప్పగలడు . ఎంత అంతులేని కథ అయినా ప్రతి కథకు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు తప్పదు . - బుద్దా మురళి