27, మార్చి 2013, బుధవారం

వర్మ షోలే రీమేక్ ఆగ్ .. చిరంజీవి టిడిపి రీమేక్ ప్రజారాజ్యం.. వై యస్ ఆర్ పాదయాత్ర రీమేక్ చేస్తే ?


చరిత్ర పునరావృతం అవుతుందని చెబుతుంటారు కానీ ఇది అక్షర అబద్ధం. అదెప్పుడూ పునరావృతం కాదు. రీమేక్‌లతో చరిత్రను పునరావృతం చేయాలనే ప్రయత్నం ఇటీవల రాజకీయాల్లో , సినిమాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. షోలే సినిమా మళ్లీ తీసి చరిత్ర సృష్టించాలనుకుంటే ఏమవుతుంది. శివ సినిమాతో కొత్త చరిత్ర సృష్టించిన వర్మ కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, తీస్తే షోలే అబ్బ లాంటి సినిమా తీయాలనుకుని, షోలేను రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు. అమితాబ్‌ను బబ్బర్‌సింగ్‌గా మార్చి ఆగ్ తీశాడు. ఇంత చెత్త సినిమాలో నటించేందుకు నేనెలా ఒప్పుకున్నానో నాకే అర్ధం కావడం లేదని అమితాబ్ అంటే ... మీ సంగతి సరే ఆ సినిమా నేనెలా తీశానో నాకే అర్ధం కావడం లేదని వర్మ బుర్ర గోక్కున్నారు.

 హిట్టయిన షోలే వర్మ రీమేక్‌తో ఆగ్ అయినట్టు, టిడిపిని చిరంజీవి రీమేక్ చేయాలనుకుంటే అది ప్రజారాజ్యం అయింది. ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వస్తే, చిరంజీవి ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాలనుకున్నారు. ప్లాప్ లో చరిత్రను సృష్టించారు. ఎన్టీఆర్ 180కి పైగా సీట్లు గెలిస్తే, చిరంజీవి మొదటి రెండు అంకెలు 18 సీట్లకు పరిమితం అయ్యారు. టిడిపిని రీమేక్ చేయడం ఎన్టీఆర్ వల్లనే సాధ్యం కాలేదు, ఇక చిరంజీవి వల్ల ఏమవుతుంది. 95లో అల్లుడు మామను ఇంటికి పంపించాక, నేను బెబ్బులి పులిని ఓటమిని అంగీకరించను అంటూ హూంకరించి ఎన్టీఆర్ టిడిపి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి చరిత్రను పునరావృతం చేస్తానని ప్రకటించి కొన్ని జిల్లాల్లో పర్యటించారు కూడా బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దిగులుతో మంచం పట్టి బక్కెట్టు తన్నేశారు  . ఎన్టీఆరే టిడిపిని రీమేక్ చేయలేనప్పుడు నేనెలా చేస్తాను అనే ఆలోచన చిరంజీవికి వచ్చి ఉంటే రాజకీయాల్లో ఆయన మెగా ఫ్లాప్‌గా నిలిచే వారు కాదు. మరో రెండు మూడు దశాబ్దాల దాకా ప్రజా రాజ్యంను రీమేక్ చేసేంత సాసహం ఏ నటుడూ చేసే సూచనలు కనిపించడం లేదు. అయినా ఇప్పుడు నెలకో హీరోయిన్ ఏడాదిగో హీరో మారిపోతున్నాడు, రాజకీయం చేసేంత సీన్ ఇప్పటి నటులకు ఉంటుందా? రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది ఒక చరిత్ర. అది ఎప్పటికీ పునరావృతం కాదు.  దాన్నెవరూ రీమేక్ చేయలేరు.


రీమేక్ ఆలోచనలు సినిమాలను కనిపెట్టని కాలం నుంచీ ఉన్నాయి. తాను మాటిచ్చిన త్రిశంకు కోసం విశ్వామిత్రుడు స్వర్గాన్ని రీమేక్ చేయాలనుకుంటాడు. విశ్వామిత్రుడు ఎంత శక్తిసంపన్నుడైనా కావచ్చు. రాజులనందరినీ హతమార్చి ఉండొచ్చు. కానీ ఒరిజినల్ ఒరిజినలే రీమేక్ రీ మేకే.. ఇంద్రుడు పాలిస్తున్న స్వర్గానికి విశ్వామిత్రుడు రీమేక్ చేయాలనుకుంటే అది కాస్తా త్రిశంకు స్వర్గం అయిపోయింది. త్రిశంకు అటు భూమికి ఇటు స్వర్గానికి కాకుండా రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బహుశా ఇదే తొలి రీమేక్ ప్రయత్నం అయి ఉంటుంది.

 నాయకులు మాత్రం గజనీ మహమ్మద్ రికార్డును బద్దలు కొట్టాలని చూస్తూ, రీమేక్‌పై అభిమానం మాత్రం చంపుకోవడం లేదు. రీమేక్‌ల ప్లాప్ రికార్డు సాహిత్యంలో సైతం ఉంది. మొక్కపాటి నరసింహశాస్ర్తీ వారి బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప హాస్య నవలగా మిగిలిపోయింది. మొక్కపాటి నరసింహశాస్ర్తీ అని పరిచయం చేస్తే ఐతే ఏంటీ అని పట్టించుకోని వాళ్లు కూడా బారిష్టర్ పార్వతీశం పాత్రను సృష్టించినాయన అనగానే లేచి నిలబడి గౌరవించే వారట! మొక్కపాటి నరసింహ శాస్ర్తీ కూడా బారిష్టర్ పార్వతీశంను రీమేక్ చేశారు, కానీ అది జనానికి పెద్దగా పట్టలేదు.


అప్పుడెప్పు డో  ఎండా కాలంలో చాలా దూరం నడిచి వైఎస్‌ఆర్ అధికారం హస్తగతం చేసుకుంటే దీన్ని రీమేక్ చేయాలని ఆయన మాజీ మిత్రుడు తెలుగు బాబు, కుమార్తె షర్మిల పరుగు పందెంలో పాల్గొన్నట్టు పోటాపోటీగా నడుస్తున్నారు. అసెంబ్లీలో వైఎస్‌ఆర్ కోసం ఒకవైపుకాంగ్రెస్ వాళ్లు, మరోవైపు వైఎస్‌ఆర్ కాం గ్రెస్ వాళ్లు మాటలతో యుద్ధం చేసుకుంటున్నా రు. ఇది సరిపోదన్నట్టు ఆయన నడకను రీమేక్ చేసి అధికారంలోకి వచ్చేయాలని బాబు తంటా లు పడుతున్నాడు. ముందు విద్యుత్ ఉద్యమం, తరువాత పాదయాత్ర వల్ల వైఎస్‌ఆర్ అధికారంలోకి వస్తే, అవే సీన్లను రీమేక్ చేస్తున్నారు.  చివరకు అసెంబ్లీ నుంచి అప్పుడు వై యస్ ఆర్ ఓల్డ్ యమ యల్ ఏ క్వార్టర్ కు వెళ్లి ఎక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేశారో ఇప్పుడు టిడిపి ఎమ్మేల్లెలు అక్కడే  దీక్ష మొదలు పెట్టారు . అడవిరాముడు  షూటింగ్ ఎక్కడ జరిగిందో అక్కడే అదే సినిమాను  జూనియర్  ఎన్ టి ఆర్ తో రీమేక్ చేస్తే  హిత్తవుతుందా ? రీమేక్ మీద మీకు అసక్తి ఉండొచ్చు కానీ ఓటర్లకు ఉండాలి కదా! వారి అభిరుచులు మారాయి.


దేవదాసు అనగానే అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు వస్తారు. అక్కినేని, సావిత్రి ఆ సినిమాల్లో నటించలేదు. జీవించేశారు. ఆ ఒక్కసినిమా చాలు వారెంత గొప్ప నటులో చెప్పడానికి.
దేవదాసును రీమేక్ చేయాలనుకున్న అక్కినేని.. మరణించిన దేవదాసును మళ్లీ పుట్టించి దేవదాసు మళ్లీ పుట్టాడు అని అక్కినేనితోనే సినిమా తీశారు. ఆ సినిమా వచ్చిన సంగతే చాలా మందికి తెలియదంటే రీమేక్ ఎంత అద్భుతంగా వర్కవుట్ అయిందో అర్ధమయ్యే ఉంటుంది. రీమేక్‌లపై అభిమానం చంపుకోలేక కొంత కాలం తరువాత దాసరి మాయాబజార్‌కు రీమేక్‌ను జనం ముందుకు తీసుకు వచ్చారు. మరో మాయాబజార్ అంటూ, ఇదేమైందంటారా? ఏమో తెలియదు కానీ, తాతామనవడు సినిమా వచ్చి 40 ఏళ్లయిన సందర్భంగా ఆ సినిమాను రీమేక్ చేస్తారా? అని దాసరిని ప్రశ్నించారు. రీమేక్ చేయాలనుకోవడం బావ దారిద్య్రం అని ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఈ మాటల వెనుక ఆయన తీసిన రెండు రీమేక్ సినిమాల ప్రభావం ఉండొచ్చు. లేదా జంజీర్ రీమేక్‌పై కామెంట్ కావచ్చు.


ఎన్టీఆర్, మహేష్‌బాబులు ఒప్పుకుంటే గుండమ్మకథ మళ్లీ తీసేందుకు రామానాయుడు ముందుకొచ్చినట్టు వార్తలొచ్చాయి. అయినా ఈరోజుల్లో గుండమ్మ దొరుకుతుందా? ఎంతైనా ఒరిజినల్ ఒరిజినలే జెరాక్స్ కాపీ జెరాక్స్ కాపీనే. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా...

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం