22, మే 2013, బుధవారం

మన ప్రజాస్వామ్యాం గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ షో.. గుండమ్మ కథ

కొన్ని సినిమాలు ఎందుకు హిట్టవుతాయో, కొన్ని పార్టీలు ఎందుకు విజయవంతంగా నడుస్తాయో చెప్పలేం. విజయా వారి గుండమ్మ కథ సినిమాను చూసి కెవి రెడ్డి లాంటి సినిమా పండితుడు సైతం పెదవి విరిచి ఈ సినిమా అస్సలు నడవదు అన్నారట! దాంతో విజయా వారు సినిమా విడుదలను ఆ లస్యం చేస్తూ వచ్చారు. చివరకు ధైర్యం చేసి విడుదల చేస్తే ఘన విజయం సాధించింది. ఆ తరువాత కూడా కెవిరెడ్డి..ఈ సినిమాలో ఏముందని ఇంతగా నడుస్తోంది అని అన్నారట!

 వందేళ్ల భారతీయ సినిమాల్లో పది తెలుగు సినిమాల పేర్లు చెప్పమంటే గుండమ్మ కథ ఉండి తీరుతుంది. సినిమా వచ్చి 50 ఏళ్లయినా మరిచిపోవడం లేదు. మరో 50 ఏళ్ల తరువాత కూడా మనం గుర్తుంచుకుంటాం. బహుశా వినోదం వల్లనే ఆ సినిమా ఇప్పటికీ నిలిచిపోయిందేమో! నాయకుల సామర్ధ్యం తెలిశాక ప్రజలు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో సైతం ఈ కాలంలో వినోదానే్న కోరుకుంటున్నారేమో. గుండమ్మ కథ విజయరహస్యం, కాంగ్రెస్ విజయరహస్యం వినోదమే. లేకపోతే నిండా కుంభకోణాల్లో మునిగిన కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది. 

గుండమ్మ కథ మాతృక కన్నడ సినిమా. ఆ సినిమాలో గుండమ్మకు భర్త ఉంటాడు. అస్సలు మాట్లాడడు. మాట్లాడని భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని తెలుగులో గుండమ్మను వితంతువుగా మార్చేశారు. దేశ రాజకీయ గుండమ్మ కథలో సైతం అంతే ఆయన అస్సలు మాట్లాడడు. అదే ఆయన ప్రధాన అర్హత! అందుకే రెండవ సారి కూడా పదవి వరించింది. మాట్లాడని మంచి ప్రధాని ఓ రాజకీయ వినో దం. మన ప్రజాస్వామ్యాన్ని గ్రేట్ ఇండియన్ లాఫర్ షో అనుకోవచ్చు.


వేలకోట్ల విలువైన బొగ్గు కుంభకోణంపై సిబిఐ డైరెక్టర్ విచారించి నివేదిను తీసుకెళ్లి నిందితులందరికీ ఇంటింటికి వెళ్లి చూపించి ఏమైనా మార్పులు చేర్పులు అవసరమా? అని అడిగితే తలా ఓ మార్పు చేశారు. వర్మ అప్పల్రాజు సినిమాలో డైరెక్టర్‌ను పక్కన పడేసి ఎవరిష్టం వచ్చిన మార్పులు వాళ్లు చేసినట్టు, సిబిఐ డైరెక్టర్‌ను పక్కన పడేసి ఎవరి మార్పులు వాళ్లు చేసుకున్నారు. ఇదే పెద్ద జోకు అనుకుంటే బొగ్గు కుంభకోణం విచారణ జరుపుతున్న సిబిఐ అధికారి సింగ్ ఓ కేసులో 15లక్షల ముడుపులు తీసుకుంటూ పట్టుపడడం మరో వింత. ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో యుపిఏ అంత వినోదాత్మక ప్రభుత్వం మరోటి లేదు.
పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడుల్లో అవినీతి ప్రభుత్వాలను ప్రజలు కూల్చేశారు, కాబట్టి ఇక అధికారంలోకి వచ్చేది నేనే అని ఒకాయన తెలుగు జోకు చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అవినీతి వ్యవహారాల్లో కర్నాటక కోర్టుల్లో విచారణకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఇక కన్నడ మంత్రివర్గంలో మైనింగ్ మాఫియాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారని విమర్శలు. కేంద్రంలో రోజుకో కుంభకోణం బయటపడుతుంటే కాంగ్రెస్‌ది నీతివంతమైన పాలన అని విపక్ష నేతే పరోక్షంగా చెప్పడాన్ని మించిన వినోదాత్మక ప్రకటన ఇంకేముంటుంది. అవినీతి మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తారు, మంత్రులను ఒక్కొక్కరిని కాదు మొత్తం ప్రభుత్వానే్న పడగొడదాం రా బాబూ అంటే అలా ఎలా పడగొడతారు, మేం అండగా నిలుస్తాం అంటారు. ఇలాంటివన్నీ చూశాక మన ప్రజాస్వామ్యాం గ్రేట్ ఇండియన్  లాఫ్టర్ 
షో
 కాదనగలమా ? 

పాలకులు ఏమీ చేయడం లేదని విమర్శించడం కన్నా పాలన ద్వారా చక్కని వినోదాన్ని అందిస్తున్నందుకు అభినందించాలి. పాపం బాబుగారు చక్కని వినోదాన్ని అందిస్తారు, కానీ ఆ విషయాన్ని ఆయనే ఒప్పుకోరు. తాను సీరియస్‌గా చెబుతున్నాను అంటారు. ఆయన అభిమానులు సైతం దాన్ని వినోదం అంటే ఒప్పుకోరు. దాంతో దెబ్బతింటున్నారు. కానీ వినోదాన్ని వినోదంగానే అందిస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఆయనే నంబర్‌వన్!
తెలుగు అమలు తనతోనే ప్రారంభం అవుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నాలు నవ్వు లు పూయిస్తున్నాయి, నేడో రేపో దిగిపోతాడని ఆయన వచ్చినప్పటి నుంచి చెబుతున్నారు. కానీ ఈ వినోదమే ఆయనకు శ్రీరామ రక్షగా నిలిచింది. ఆయన తరువాత జానారెడ్డి తన తెలుగు ద్వారా అంతటి వినోదాన్ని అందించగలరని కొందరి నమ్మకం.


వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీకి మూడవ తరం వారసుడు అన్నకుటుంబం నుంచి రావాలా? అల్లుడి కుటుంబం నుంచా? అని రెండు కుటుంబాల మధ్య రాజకీయం సాగుతోంది. ఇది స్థానిక రాజకీయ వినోదం.


మల్కాజిగిరి ఎమ్మెల్యే ఇటీవల ఒక సమావేశంలో నైతిక విలువల గురించి చక్కని ఉపన్యాసం ఇచ్చారు. ఆ తరువాత మచ్చేంద్ర అని మాజీ ఎమ్మెల్యే మాట్లాడలేక బోరున ఏడ్చేశారు. ఏమైందయ్యా అంటే అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు విలువల గురించి మాట్లాడుతుంటే ఇక నేనేం మాట్లాడాలి అంటూ మళ్లీ భోరున ఏడ్చారు. నాయకుల ఉపన్యాసాలను ఏదో సరదాగా వినాలి కానీ ఒక్కసారికే ఇలా ఏడ్చేస్తే ఎలా మచ్చేంద్ర అని అంతా ఓదార్చారు. ఇలా అయితే మహానాయకుల ఉపన్యాసాలను రోజూ ప్రత్యక్షంగా వినే వాళ్లు ఇక జీవితమంతా ఏడుస్తూనే ఉండాలి.


కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ యుపిఏ అజెండాలో తెలంగాణ లేదు పొమ్మన్నాడు. మరుసటి రోజు నేనలా అనలేదు అని లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చాడు.
ముక్తాయింపు: ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు బ్రీతింగ్ పరీక్షలు జరుపుతున్నారు. మీడియా ముందుకు వచ్చేప్పుడు నాయకులకు ఇలాంటి పరీక్షలేవో నిర్వహిస్తే బాగుంటుందని గుంపులో గోవిందయ్య వ్యాఖ్య.

4 కామెంట్‌లు:

  1. ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు బ్రీతింగ్ పరీక్షలు జరుపుతున్నారు. మీడియా ముందుకు వచ్చేప్పుడు నాయకులకు ఇలాంటి పరీక్షలేవో నిర్వహిస్తే బాగుంటుందని :-)

    రిప్లయితొలగించండి
  2. "దేశ రాజకీయ గుండమ్మ కథలో సైతం అంతే ఆయన అస్సలు మాట్లాడడు. అదే ఆయన ప్రధాన అర్హత!"

    ఇందాక ఫేస్‌బుక్‌లో ఒక కామెంట్ చదివాను.
    మన దేశానికి ప్రధానమంత్రి పదవి అవసరమే లేదని ఆయన నిరూపించాడట.

    రిప్లయితొలగించండి
  3. "గుండమ్మ కధ"మూల కధను ను తయారు చేసింది విటాలా చార్య అని ఎక్కడో చదివాను .

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం