15, మార్చి 2015, ఆదివారం

రాజరికం కమ్ కంపెనీ పాలన!

‘‘రాజువయ్యా మహరాజు వయ్యా’’
‘‘ మా వైఎస్‌ఆర్ పై ప్రేమ పుట్టుకొచ్చిందేమిటి?’’
‘‘నేను పాడే పాటకు నీ మాటకు సంబంధం ఏమిటో నాకర్ధం కావడం లేదు’’
‘‘అబ్బో నటించకు.. టీవి ఆన్ చేయగానే వైఎస్‌ఆర్ బొమ్మ చూపిస్తూ రాజువయ్యా మహరాజువయ్యా అని పాటివినిస్తుంది. తెలియదా? ’’
‘‘నీ ఉద్దేశం ప్రకారం ఇది మీ పార్టీ జాతీయ గీతం అన్నమాట! నీకు తెలుసో లేదు కానీ మీ పార్టీ పుట్టక ముందే ఈ పాట పుట్టింది.’’
‘‘మా తెలుగు తల్లికి పాట ఎన్టీఆర్‌కు రాజకీయాల్లోకి కాదు కదా కనీసం సినిమాల్లో అవకాశాలు కూడా రాని రోజుల్లో పుట్టింది. కానీ చివరకది తెలుగుదేశం పార్టీ జాతీయ గీతం అయింది. పాట ఎలా పుట్టిందని కాదు.. ఆ పాటను ఎవరెలా ఉపయోగించుకున్నారన్నది ముఖ్యం. అలానే రాజువయ్యా మహరాజువయ్యా అనగానే వైఎస్‌ఆరే గుర్తుకొస్తారు. వైఎస్‌ఆర్ గుర్తుకొచ్చి కాకుంటే మరెందుకు పాడావాపాట? ’’


‘‘కెసిఆర్ కోసం పాడాను. కెసిఆర్ తనను తాను తెలంగాణకు రాజును అనుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులంటే అవును మా కెసిఆర్ మహారాజు మనసున్న మహారాజు ప్రజలెన్నుకున్న మహారాజు అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కీర్తిస్తుంటే పాట గుర్తుకొచ్చింది. ’’
‘‘నిజమే కెసిఆర్ ఏమైనా రాజుననుకుంటున్నాడా? రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు వందల కోట్లను ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నాడేమిటి? బాబుగారు తన తొలి పాలనా కాలంలో బిల్‌గేట్స్, బిల్ క్లింట్లన్ , ఉల్ఫెన్‌సన్ అంటూ నోరు తిరగని కొత్త కొత్త పేర్లు స్మరిస్తూ అలా ముందుకెళ్లేవారు. కెసిఆర్ కాకతీయలు, రెడ్డిరాజులు, బహుమనీ సుల్తాన్‌లు, అసఫ్‌జాహీలు అంటూ అలా వెనక్కి వెళుతున్నారేంటి? ’’
‘‘ప్రజలను పట్టించుకోకుండా ఉల్ఫెన్‌సన్ అంటూ అలా ముందుకు వెళ్లడం వల్లనే కదా జనం పదేళ్లపాటు ఆయన్ని వెనక పడేశారు. ముందుకు వెళ్లడం వల్ల వెనకబడిపోతామని కెసిఆర్ ముందు జాగ్రత్తగా అలా రాజులను గుర్తు చేస్తూ మహారాజులా నిలిచిపోవాలనుకుంటున్నారేమో.. కుంభకోణాలతో ప్రజల సొమ్ము స్వాహా చేస్తే తప్పు, అవినీతిపై విచారణకు స్టే పొంది రాజకీయం చేస్తే తప్పు కానీ ఆలయాలను అభివృద్ధి చేస్తే తప్పేంటి? ’’
‘‘తప్పని కాదు రాచరికంలో కూడా ఇలానే ఆలయాలను నిర్మించే వారు. బహుశా కెసిఆర్ కూడా అలా రాజరికంలో బతికేస్తున్నాడేమో అని ’’
‘‘మనది సెక్యులర్ దేశం సరే కానీ సెక్యులరిజం అంటే ఆలయాలను పట్టించుకోవద్దు అని ఎక్కడా లేదు కదా? ప్రజాస్వామ్యం అంటేనే మెజారిటీ ప్రజల అభీష్టం కదా? మెజారిటీ ప్రజల ఆలయాలను అభివృద్ధి చేస్తే తప్పేముంది. ’’


‘‘ఆలయాలనే కాదు ప్రజలను కూడా పట్టించుకోవాలి కదా? విమర్శించే వాళ్ల ఉద్దేశం అదే కావచ్చు. లేకపోతే కుల భవనాలు, మతాలయాలు ఇలా ఉదారంగా కట్టేస్తుంటే మా పరిస్థితి ఏంటనే భయం కావచ్చు. నువ్వెన్నయినా చెప్పు మన వాళ్లకు రాజులపై ఇప్పటికీ బోలెడు ప్రేమ. విజయనగరం నుంచి గెలిచే అశోకగజపతిరాజు ఏమీ చేయకపోయినా రాజులపై ఉండే అభిమానంతో గెలిపిస్తాడంటారు. మనకు తెలియని రాజుల పాలన అద్భుతంగా ఉండేది అని కొందరి గట్టి నమ్మకం.’’
‘‘మరి రాజుల పాలన నిజంగా అంత అద్భుతంగా ఉండేదా? ఇప్పుడు రాజులు ముస్లిం దేశాల్లో మాత్రమే ఉన్నారు. మొన్నో రాజు తన పుట్టిన రోజున దేశంలో అందరికీ కానుకల వర్షం కురిపించారట! రాజుల గురించి ఇలాంటి కథలు వింటుంటే రాజరికం నిజంగానే బాగుండేదేమో అనిపిస్తోంది ’’
‘‘రాజుల పాలన చూసిందెవరు? ఇప్పుడు ముఖ్యమంత్రులు తమ పాలన అద్భుతం అంటూ మీడియాలో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవిల్లో అదర గొట్టే యాడ్స్ ఇచ్చుకున్నట్టుగా రాజుల కాలంలో ఇలాంటి సౌకర్యం లేదు కాబట్టి నా పాలన పరమాద్భుతం అంటూ శాసనాలు రాయించుకునేవారు. అవి తప్ప మరో ఆధారం ఏముంది. పత్రికల్లో వచ్చే సమాచార శాఖ వారి ప్రకటనల ఆధారంగా ప్రభుత్వ పనితీరు ఊహించుకుంటే ఎలా ఉంటుందో, శాసనాలను బట్టి ఆ రాజు పాలనను అంచనా వేయడం కూడా అలాంటిదే ’’
‘‘అంటే దేన్నీ నమ్మవద్దంటావా? ’’


‘అలా నేనెందుకంటాను? అలా అని పూర్తిగా నమ్మవద్దు అనేది నా ఉద్దేశం. ఆ రాజు ప్రజలను తన కన్నబిడ్డల్లా చూసుకునే వారు అని ముగుస్తాయి అనగనగా ఒక రాజు కథలన్నీ... కథల వరకు ఓకే కానీ నిజంగా రాజు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటారా? అన్నదమ్ములే రాజ్యం కోసం చంపుకున్న మహాభారతాన్ని చదివిన తరువాత కూడా రాజులు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవారంటే ఎలా నమ్ముతాం. మహాభారతంపై నమ్మకం లేకపోయినా రాజ్యం కోసం తండ్రిని చంపిన కొడుకులు, కొడుకులను చంపిన తండ్రి, అన్నను చంపిన తమ్ముళ్ల కథలు చరిత్రలో ఎన్ని లేవు. ఐనా దీని కోసం చరిత్ర దాకా ఎందుకు మన కళ్లముందే జరిగింది కదా? ఏం జరిగిందో గుర్తు చేసుకో నేను చెప్పడం ఎందుకు? ’’
‘‘ఇంతకూ తెలుగు పాలకుల పాలన రాజుల పాలన గుర్తుకు తెస్తుందా? లేదా? ’’


‘‘ తెలుగు పాలకులే కాదు తమిళ పాలకులైనా? బెంగాలీ మమతక్క పాలనైనా ప్రాంతీయ పార్టీల పాలన ఎక్కడ సాగినా అది కంపెనీ పాలన అవుతుంది కానీ రాజరికం కాదు. రాజరికం కన్నా ఇది కొంచం బెటర్. మొగలాయిల పాలన తరువాత దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది. కంపెనీ పాలన అని ముద్దుగా పిలుచుకునే వాళ్లు. 1857 సైనిక తిరుగుబాటు తరువాత కంపెనీ నుంచి నేరుగా బ్రిటీష్ రాణి పాలన ప్రారంభం అయింది. 90 ఏళ్ల పాటు బ్రిటీష్ రాణి నేరుగా పాలించారు. ఇంత కాలానికి మళ్లీ దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ కంపెనీల పాలన సాగుతోంది. సైనిక తిరుగుబాటు వచ్చే అవకాశాలు లేనే లేవు. ఎందుకంటే ఇది రాజరికం కమ్ కంపెనీ పాలన విధానాన్ని మిక్స్ చేస్తే వచ్చిన ప్రాంతీయ పార్టీల పాలనా కాలం.         - బుద్దా మురళి 

1 కామెంట్‌:

  1. పేరుకి ప్రజాస్వామ్యం అయినా, ఇప్పుడు జరుగుతున్నది అయిదేళ్ళ రాజరికమే.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం