28, మార్చి 2012, బుధవారం

హిట్లర్, గాంధీ, నెహ్రూల తప్పులు...కర్ణుడికి జరిగిన అన్యాయం... కనిపెట్టిన మన సుబ్బారావులు

రండి రండి సెలవు రోజు కదా ! హాయిగా మాట్లాడుకోవచ్చు’’ సుబ్బారావు మిత్రులను చూసి డోర్ తెరిచాడు. బిబిసి చూస్తూ ‘‘ఎంతైనా బ్రిటిష్ వాడి తెలివే తెలివి. మన నాయకులూ ఉన్నారు ఎందుకు . నాయకుడు అన్నవాడిలో దూకుడు ఉండాలి . క్రైసెస్ మేనేజ్‌మెంట్ తెలిసుండాలి’’ అన్నాడు. సుబ్బారావు కాఫీకి ఆర్డర్ వేయగానే మిత్రులిద్దరూ ఔనవును అన్నారు. ‘‘ ఆ మధ్య మహేష్‌బాబు సినిమాకు మా బాస్ కూతురు ఎలాగైనా మొదటి రోజు సినిమా చూసి తీరాల్సిందే అని బాస్‌కు వార్నింగ్ ఇచ్చిందట! ఆయన ఎంత ప్రయత్నించినా టికెట్ దొరకలేదు. ఇంకేముంది... చేతులు కాళ్లు ఆడడం లే. నువ్వే కాపాడాలోయ్ సుబ్బారావు అని నా చేతులు పట్టుకున్నాడు. మా మేనమామ చిన్నల్లుడు పోలీస్ కానిస్టేబుల్ వాడి నంబర్ పట్టుకున్నా, వాడు ఆ థియేటర్‌లో డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్‌ను పట్టుకుని, మూడు టికెట్లు సంపాదించాడు. అవి బాస్ చేతిలో పెడితే...నన్ను ప్రమాదం నుంచి బయటపడేశావు సుబ్బారావు నీ మేలు మరిచిపోను అన్నాడు. ఆ రోజు మా బాస్‌లానే నేను బెంబేలెత్తిపోతే సమస్య పరిష్కారం అయ్యేదా? . నాయకత్వం వహించే వాడికి దూకుడు ముఖ్యం. ఇది మన నాయకుల్లో ఏడిస్తే దేశం ఇలా ఎందుకుండేది. పాకిస్తాన్ మీద మనమో రెండు బాంబులు విసిరేస్తే వాడు నోరుమూసుకుని ఉండే వాడు. ఆ ధైర్యం మన వాళ్లకు ఎక్కడిది’’ అని సుబ్బారావు నిట్టూర్చాడు.


 ‘‘ఐనా వీళ్లనని ఏం లాభం సుబ్బు’’ అని విశ్వనాథం అందుకున్నాడు. ‘‘ ఇందిరాగాంధీని అనాలి. మన సైనికులు పాక్‌పై దాడి చేసినప్పుడు కరాచీ, లాహోర్‌లను స్వాధీనం చేసుకొని ఉంటే పరిస్థితే వేరుగా ఉండేది. దాన్ని నాలుగు ముక్కలు చేసి రెండు మనం తీసుకుని ఒక ముక్కలో బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి మరో ముక్కను పాక్‌గా ప్రకటించి ఉంటే కాశ్మీర్ సమస్యే ఉండేది కాదు కదా?’’ అని విశ్వనాథం చెప్పాడు. ‘‘ నేను చెబితే నమ్మరు . ఇందిరాగాంధీ రహస్యంగా పాకిస్తాన్‌తో కుమ్మక్కు అయ్యిందని నేను కచ్చితంగా చెప్పగలను’’ అన్నాడు. ‘‘ ఇందిరాగాంధీ కన్నా ముందు నెహ్రూ ఏమన్నా తక్కువ తిన్నారా? శాంతి అంటూ ప్రపంచాన్ని జయించే చాన్స్‌ను మిస్ చేసింది నెహ్రూనే కదా? మహాభారతంలో స్పష్టంగా ఉంది. మనది సువిశాల దేశం అని ఆఫ్ఘానిస్తాన్ లాంటి దేశాలు కూడా ఒకప్పుడు మన దేశంలో భాగమే కదా? మనం సహనం చూపించి ఉంటే ఆ దేశాలన్నీ మనకు వచ్చేసేవే, పాకిస్తాన్‌ను విభజించాల్సిన అవసరమే ఉండేది కాదు, కానీ నెహ్రూ ఎప్పుడు ప్రధాని పీఠం మీద కూర్చుందాం? అని తొందరపడి దేశ విభజనకు ఒప్పుకున్నాడు’’ అని రామనాథం తాను విన్న విషయం చెప్పాడు. 


అసలు భీష్ముడు మహాభారత యుద్ధంలో ముందు కర్ణున్ని పంపి ఉంటే యుద్ధ్ఫలితం వేరుగా ఉండేది.
ప్రతిభను నొక్కిపెట్టడం అంతటా ఉన్నదే కదా! మొన్న కంపెనీ తరఫున విదేశాలకు వెళ్లే చాన్స్ వస్తే నన్ను పంపడానికి బదులు మా బాస్ వాళ్ల కులపోన్ని పంపుకున్నాడు. ఆ రోజు కర్ణుడికి జరిగింది. ఇప్పడు నాకు జరిగింది ’’ అని విశ్వనాథం ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ఇద్దరు మహాభారతాన్ని పొడిగించ వద్దని మనసులోనే అనుకున్నారు.


‘‘చంద్రబోస్ నాయకత్వంలో స్వాతంత్య్రం సిద్ధిస్తే తనకు క్రెడిట్ దక్కకుండా పోతుందనే స్వార్ధంతోనే కదా మహాత్మాగాంధీ బోస్ మాట వినలేదు. జపాన్ సహాయంతో అమెరికాపై దాడి చేసి జర్మనీని ఓడించి రష్యాతో కలిసి చైనా సంగతి తేల్చి, టిబెట్ సమస్య పరిష్కరించి, శ్రీలంకను మచ్చిక చేసుకుని నేపాల్ రాజుతో స్నేహం కలుపుకొని , కాంబోడియా వాణిజ్య సంబంధాలు, ఫ్రాన్స్‌తో దౌత్య సంబంధాలు పెట్టుకొని ఉంటే ప్రపంచం మనకు పాదాక్రాంతం అయి ఉండేది కదా? దమ్ముంటే ఎవరైనా దీన్ని కాదనమనండి చూద్దాం’’అని విశ్వనాథం బలంగా బల్ల గుద్ది చెప్పాడు. ‘‘అమెరికా వాడు జపాన్‌పై అణుబాంబు వేయక ముందే హిట్లర్ రష్యా, అమెరికాలపైన బాంబులు వేసి ఉంటే ఇప్పుడు ప్రపంచం మరోలా ఉండేది’’అని సుబ్బారావు అన్నాడు. మన నాయకుల తప్పులన్నింటినీ క్షమించేద్దాం. కానీ వయోజన ఓటింగ్ తప్పు క్షమించరాని నేరం. దీంతో ప్రతి వాడు మాట్లాడే వాడే? మనమేమో బిజీగా ఉండి ఓటింగ్‌కు దూరంగా ఉంటాం . మన లాంటి వారి పిల్లలకు అందరితో పాటు క్యూలో నిల్చోని ఓటు వేసే ఖర్మ పట్టలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని మమూలు జనం ఓట్లు వేస్తున్నారు. పనికి రాని నాయకులను ఎన్నుకుంటున్నారు. ఈ దేశాన్ని ఎవ్వడూ బాగు చేయలేడు సుబ్బారావు నిట్టూర్చాడు.
ఏమండీ ఒక్కసారి లోపలికి వస్తారా? సుబ్బారావు భార్య పిలుపుతో లోనికి వెళ్లాడు.


***
స్టౌవ్‌మీద పాలు పెట్టాను చూడండని చిలక్కి చెప్పినట్టు చెప్పా... పాలు పొంగాయి, గినె్న మాడిపోయింది. ఇంకొద్ది సేపు ఉంటే గ్యాస్ సిలండర్ పేలిపోయేది. షాపుకెళ్లి సరుకులు తేవడం చాతకాదు... ఒక్క పని సరిగా చేయరు. ఐదు నిమిషాల్లో ఒక్కరు కనిపించినా ఊరుకునేది లేదు.. వార్నింగ్ ఇచ్చింది భార్యామణి. 144 సెక్షన్ విధించి లాఠీచార్జ్ చేసినట్టే ... సుబ్బారావు బయటకు పరిగెత్తుకొచ్చాడు. కొడుకు స్కూల్ బ్యాగ్ మీద పడేసి , నువ్వు చేసిన హోంవర్క్‌లో అన్నీ తప్పులే, నీ వల్ల దెబ్బలు తిన్నాను అని ఏడ్చాడు. అంతర్జాతీయ సమస్యలు పరిష్కరిస్తా...లెక్కలు తొక్కలు అంటూ చిన్న చిన్న సమస్యలపై దృష్టి పెట్టాలంటే నా లాంటి వారికి కష్టమే అర్థం చేసుకోరు  అని నిట్టూర్చాడు 
  సుబ్బారావు...

8 కామెంట్‌లు:

  1. చివరికి మన దేశం సుబ్బారావు ల పాలయింది కదా........ దహా.

    రిప్లయితొలగించండి
  2. నిజంలాటి నిజాలు నిజంగా చెప్పేరు

    రిప్లయితొలగించండి
  3. బులుసు సుభ్రమణ్యం గారు,kastephale గారు, జలతారు గారు ధన్యవాదాలు .. అంతా నిజమే చెబుతాను అబద్దం చెప్పను అని మన నాయకుల మీద ప్రమాణం చేశాను .

    రిప్లయితొలగించండి
  4. ఇల్లు చక్కదిద్దుకోలేనోళ్ళు, దేశాన్ని ఉద్ధరిస్తారా?

    రిప్లయితొలగించండి
  5. మురళి గారు,
    మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే నిజమని పించినా. ఆధునిక కాలంలో సమాజం గురించి కొంత అవగాహన అనేది ఉండాలి. ఆ అవగాహన ఇతరులను తక్కువ చేసి చూపటానికి ఉపయోగించకుడదు. నీకే కాదు నాకు తెలుసు అని చెప్పటానికి, నీకన్న నేను గొప్ప అని నిరుపించుకోవటానికి ఉపయోగించకుడదు. విచక్షణ ఉండాలు. మా ఊర్లో ఉండే వ్యాపారులు పొద్దున నుండి రాత్రి వరకు ఎంతో శ్రద్దతో పని చేసినా, డబ్బులు సంపాదించినా వారి జీవితాలు బావిలో కప్పల ఉంటాయి. ఎప్పుడు లాభం, నష్ట్టాల లెక్కలు. ఎదైనా కొత్త సలహా ఇస్తే అది మంచి లాభలు తెచ్చేదిగా ఉండాలి. లేకపోతే వేటకారంగా నవ్వుతారు.
    బతికినన్ని రోజులు తనకున్న చిన్నపరిధిలో శ్రద్దగా పనిచేసిన వారికి పెద్ద ఊహలు/కలలు కనటం తెలియదు.
    సుబ్బారావు లాంటి వారి సంఖ్య ఎక్కువైతే కనీసం ఒకరిద్దరు అన్నా దేశభక్తి కలిగిన వారసులు దేశానికి దొరుకుతారు.

    రిప్లయితొలగించండి
  6. @*పూర్వ ఫల్గుణి@*bonagiri@శ్రీనివాస్ గారు ధన్యవాదాలు
    ఈ మధ్య ఏదో సందర్భం లో రాంగోపాల్ వర్మ ఒక మాట చెప్పారు . ఆ మాట అతనికి గవాస్కర్ చెప్పారట గవాస్కర్ ఔట్ అయి వచ్చాక ప్యాడ్ బాయ్ గవాస్కర్ ప్యాడ్ విప్పుతూ మీరు ఆ బాల్ అలా కొట్టాల్సింది కాదు అని సలహా ఇచ్చాడట . మనిషి అన్న వారు దేశం కోసం ఆలోచించాల్సిందే కానీ ఆ రోజుల్లో మన స్వతంత్ర సమర యోధులు ఆ సమయానికి తగిన నిర్ణయాలు తీసుకున్నారు . ఈ రోజూ మనం ప్రశాంతంగా కూర్చొని ఆ నాటి నిర్ణయాలను తప్పు పడుతూ ఉపన్యాసాలు ఇచ్చే వారిని చూస్తే నాకు మాత్రం ఎందుకో ........... అంతే

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం