8, జూన్ 2012, శుక్రవారం

న్యాయ వ్యవస్థ కు చెదలా ?... మనం మహా నటులం


న్యాయ వ్యవస్థకు అవినీతి కళంకం

గాలి జనార్ధన్ రెడ్డి బెయులు వ్యవహారం లో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయి. దీంతో మహా నటులయినా మన నాయకులు న్యాయ వ్యవస్థకు కూడా చెదలా ? అంతు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు . న్యాయ వ్యవస్థ గురించి అక్కడి స్థితి గతుల గురించి ఈ నటులు చెప్పేది ఎలా ఉన్న న్యాయం కోసం కోర్టుకు వెళ్ళిన వారికీ,  న్యాయ వాదులకు , కోర్టు గుమాస్తాలకు కూడా బాగా తెలుసు .

సమాజంలో అన్ని వ్యవస్థలూ అవినీతిలో కూరుకుపోయినా న్యాయవ్యవస్థకు మాత్రం అవినీతి అంటలేదన్న భావన చాలామందిలో ఉంటుంది. కానీ నిప్పుకు చెదలంటినట్లు న్యాయవ్యవస్థ కూడా అవినీతికి అతీతం కాదన్న విషయం వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇతర వ్యవస్థలపై వచ్చినంతగా అవినీతి ఆరోపణలు న్యాయవ్యవస్థపై రావు. అవినీతి జరగకపోయినా ఇతర వ్యవస్థలపై ఆరోపణలు చేసినంత సులభంగా న్యాయవ్యవస్థలో అవినీతి జరిగినట్లు తెలిసినా ఆరోపణలు చేయడానికి సాహసించక పోవడం వల్లే ఇప్పటికీ న్యాయవ్యవస్థ మీద చాలామందికి నమ్మకం కలుగుతోంది. అక్కడక్కడ పట్ట్భా రామారావు లాంటివారు బయట పడినపుడు మాత్రమే న్యాయవ్యవస్థలో అవినీతి చర్చకు వస్తోంది.

అధికారం చలాయించే అధికార వ్యవస్థ, న్యాయం చెప్పే న్యాయ వ్యవస్థ, తమ ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ఓటరు అందరూ మనుషులే. మనుషుల మంచి కోసం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థల్లో పని చేసేది మనుషులే. మనుషులకు ఉండే సహజ లక్షణాలన్నీ ఏ వ్యవస్థలో పనిచేసే వారికైనా ఉంటాయి. కానీ కొన్ని వ్యవస్థలను పవిత్రంగా చూడడం అలావాటైన మనకు ఇతర వ్యవస్థల మాదిరిగా న్యాయ వ్యవస్థలో సైతం అవినీతి ఉంది అంటే నమ్మబుద్ధి కాదు. అలా నమ్మబుద్ధి కాని వారి కళ్లు తెరిపించారు సిబిఐ కోర్టు న్యాయమూర్తి పట్టాభి రామారావు. మైనింగ్ మాఫియా గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ వ్యవహారంలో పట్ట్భారామారావుకు కోట్లాది రూపాయల ముడుపులు ముట్టాయనేది ఆరోపణ. ఆధారాలు లభించడంతో పట్టాభిరామారావును సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో న్యాయశాఖ మంత్రి ప్రమేయం ఉందనే లీకేజీ వార్తలపై మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రమేయం ఉందని నిరూపిస్తే రాళ్లతో కొట్టి చంపేయమని ఏరాసు చెబుతున్నారు. మరోవైపు పట్ట్భారామారావు సస్పెన్షన్‌కు గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌కు ఎలాంటి సంబంధం లేదని గాలి సోదరుడు ఒక ప్రకటనలో తెలిపారు.

బెయిల్ కోసం మూడు కోట్ల రూపాయలు చెల్లించినట్టు తొలుత వార్తలు వచ్చాయి, తరువాత అది పది కోట్లకు, అంటు నుంచి 15 కోట్లకు, చివరకు కొందరు 60 కోట్లకు చేర్చారు. ఏదో జరిగింది కానీ ఏం జరిగింది, ఎవరి పాత్ర ఏమిటీ? అనేది సిబిఐ చెప్పడం లేదు. ఈ వ్యవహారంలో ఏం జరిగిందో సిబిఐ అధికారికంగా వెల్లడించలేదు. జగన్‌కు బెయిల్ రాకుండా ఆపడానికి ఇదో ఎత్తుగడ అనే వాదన ఒకటుంది. ఏం జరిగిందో, ఎవరు ముట్టచెప్పారో, ఎంత ముట్టచెప్పారో అధికారికంగా వెల్లడించాల్సిన బాధ్యత సిబిఐపై ఉంది. బెయిల్ కోసం ముడుపుల వ్యవహారం బయటపడగానే కొందరు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం ఆశ్చర్యకరమైన వ్యవహారం. అందులోనూ అనుభజ్ఞులే ఎక్కువ దిగ్భ్రాంతి చెందారు. న్యాయవ్యవస్థకు ఒక మంచి ఉద్దేశంతో రక్షణ కవచం ఏర్పాటు చేశారు. మిగిలిన వ్యవస్థలపై ఆరోపణలు చేసినంత సులభంగా న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. ఈ రక్షణ సమాజానికి మంచి చేయడానికి ఉపయోగపడాలి కానీ పట్టాభి రామారావులను రక్షించడానికి ఉపయోగపడితే ఏం ప్రయోజనం. న్యాయస్థానాల్లో ఇలాంటి వ్యవహారాలకు పట్టాభి రామారావు మొదటి వ్యక్తి కాదు చివరి వ్యక్తి కాదు. 1949లోనే జస్టిస్ సిన్హాను పార్లమెంటు అభిశంసించింది. అన్నాహజారే నాయకత్వంలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సమయంలో ఆయన బృందంలోని సభ్యులు, ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ సంచలన ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సగం మంది అవినీతిపరులు. దీన్ని నేను నిరూపిస్తాను. నేనీ మాటలు అన్నందుకు నాపై కేసు పెట్టండి, నా మాటల్లో నిజం ఉందని నిరూపిస్తా అని సవాల్ చేశారు. అవినీతిపరులు అంటూ ఆయన కొందరు న్యాయమూర్తుల పేర్లు కూడా ప్రకటించారు. ప్రతిపక్ష నాయకుడు న్యాయస్థానాలను ప్రభావితం చేస్తున్నారని, తమ కేసును రాష్ట్రం నుంచి బదిలీ చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సతీమణి విజయమ్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘చంద్రబాబు నాట్ బిఫోర్’ వ్యవహారం విమర్శల పాలైంది. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత కేసు కర్నాటకలో విచారణ జరుగుతోంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిపై కేసు ఆ రాష్ట్రంలో కాకుండా మరో రాష్ట్రంలో విచారణ చేపట్టాలనే డిమాండ్ వచ్చింది. ఇక అలహాబాద్ హైకోర్టు అవినీతిమయం అయిందని స్వయంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు చీఫ్‌జస్టిస్‌గా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ బాలకృష్ణపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. బలమైన రక్షణ కవచం ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థపై ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి, అవి ఉట్టి ఆరోపణలు మాత్రమే కాదు, వాస్తవాలు అని విచారణలో తేలింది.

 నిరూపణ అయిన కొన్ని కేసుల్లోనే ఇలా ఉంటే న్యాయవ్యవస్థకు సంబంధించి వాస్తవ పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో? ఏ వ్యవస్థ అవినీతికి దూరంగా లేదు అని పదే పదే నిరూపణ అవుతోంది. నైతికంగా వేగంగా పతనం అవుతున్న సమాజంలో ఏదో ఒక వ్యవస్థ పవిత్రంగా ఉందని, మిగిలిన వ్యవస్థలు చెడిపోయాయని చెప్పడం హిపోక్రసీ అవుతుంది. అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే న్యాయవ్యవస్థకు సైతం సంస్కరణల చికిత్స అవసరం.

11 కామెంట్‌లు:

  1. న్యాయస్తానాల మీద అపోహలు (ఆరోపణలు) మన దేశానికి పరిమితం కాదు. అమెరికాలో రిపబ్లికన్ అభ్యర్తి గెలిస్తే సుప్రీం కోర్టులో కొత్త నియామకాలతో Roe vs. Wade తీర్పు తారు మారు చేస్తారని చాలా మంది స్త్రీవాదులు నమ్ముతున్నారు.

    మన పొరుగు వారు మన కంటే చాలా నయం. అన్ని వ్యవస్తలు బ్రష్టు పట్టినా న్యాయస్తానాలు మాత్రమె సరిగ్గా ఉన్నాయని సగటు పాకిస్తానీ నమ్మకం.

    Son's case: Pak CJ recuses himself (http://www.thehindu.com/news/international/article3501015.ece)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Jai Gottimukkala గారు స్పందించినందుకు ధన్యవాదాలు సుప్రీం కోర్టు న్యాయముర్తులలో సగం మంది పేర్లు చెప్పి వారి అవినీతిని తాను నిరుపిస్తానని లేక పొతే తనపై చర్య తీసుకోవచ్చునని న్యాయశాఖా మాజీ కేంద్రమంత్రి , అన్న హజారే బృందం లోని సభ్యుడు శాంతి భూషణ్ /ప్రశాంతి భూషణ్ సవాల్ చేశారు . మొన్నటి వరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి గా ఉన్న బాలకృష్ణ గారి అక్రమాలపై విచారణ జరుగుతోంది........... అయినా అపోహలు ane anukundamaa

      తొలగించండి
    2. మురళి గారూ, న్యాయమూర్తులు ఎన్నిక కాని (unelected) అధికారులు. పైగా వారి బాధ్యతా చట్టాన్ని (న్యాయాన్ని) కాపాడడం. ఈ కారణాల వల్ల న్యాయవ్యవస్తకు సీజర్ భార్య పద్దతి (Caeser's wife must be above suspicion) సరి పోతుంది.

      తొలగించండి
    3. Sometimes ignorance is bliss. May be Pakistanis are in that situation.

      తొలగించండి
  2. బుద్దా మురళీ గారు,

    ఇంకానా.న్యాయ వ్యవస్థ కుళ్ళి ఎప్పుడో క్రుసించింది. మీకు ఆల్రెడీ తెలుసు మన ఆంధ్ర హజారే చంద్ర బాబు ప్రభా శంకర్ మిశ్ర కి 'జయప్రద' ముగా తీర్పు ఎలా రాబట్టుకున్నాడో. అదే తీర్పు NTR చావుకి కారణం అనికూడా చెప్పుకుంటారు. మీరు ఒక టపా రాయొచ్చు అసలు ఈ విషయం గురించి.
    డబ్బు,కులం,స్త్రీ వ్యసనం అన్ని రకాల చీడ పీడలు ఉన్నాయి న్యాయ వ్యవస్థలో. ఇప్పుడే తెలిసినట్లు ఆశ్చర్య పోవడమే మనము అసలు ఆశ్చర్య పోవలిసింది.

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు , పట్టాభి రామారావు గారి కేసు లో రౌడి షీటర్ యాదగిరి పాత్ర ఏంటి, కేవలం డబ్బు చేర్చడమేనా?

    న్యాయమూర్తులు అంటే పహిల్వాన్స్ కాదు కదా ఎవ్వరినైనా ఎదిరించడానికి!!!! వారికి రక్షణ ఇవ్వాల్సిన వ్యవస్థలు ఏమి చేస్తున్నాయి?

    రిప్లయితొలగించండి
  4. ముడుపులు చెల్లించడం అంటే బ్యాంకులో డబ్బులు డిపాసిట్ చేసినంత ఈజీ కదండీ . అసలు ఆయన డబ్బులు తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవాలి, తీసుకుంటే ఎవరి ద్వారా అనేది తెలుసుకోవాలి . ఆలాంటి పనులకు యాదగిరి లాంటి వాళ్ళు సేవలు అందిస్తారు . భక్తునికి భగవంతునికి మధ్య అంబిక దర్బార్ బట్టి లాంటి వాళ్ళన్నమాట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రౌడి షీటర్ యాదగిరి సేవలు మాటల్లోనే ఉంటాయా , లేక చేతల్లో (బెదిరింపులు) కూడా ఉంటాయా ? రెండవది అయితే న్యాయమూర్తి ఎం చెయ్యాలి ?

      తొలగించండి
  5. మౌలిగారు బెదిరింపులకు ఈ కాలం లో ములన కూర్చున్న ముసలమ్మ కూడా భయపడదు ( మీకు తెలియక కాదు ) ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కొన్ని విషయాలను నేరుగా మాట్లాడరు . దానికోసం ఇలాంటి వారు మధ్య వర్తులుగా ఉంటారు . వారికి, వీరికి మధ్య బాగా మంచి సంబందాలు ఉన్న వారినే ఇలాంటి పనులకు ఎన్నుకుంటారు . ఇలాంటి వాటి గురించి మరింత వివరంగా రాయాలంటే కొద్దిగా ఇబ్బంది

    రిప్లయితొలగించండి
  6. భయపడతామనే నమ్మకం తో కదండీ ఇక్కడ బోల్డు మంది బెదిరిస్తూ ఉంటారు :) నిజంగానే మధ్యవర్తిత్వం తీరు తెలియక అడిగాను.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం