26, జులై 2012, గురువారం

మన్మోహన్ కన్నా రాహుల్ సమర్దుడా ?



 వేదాల్లో ఉంది అంటే గతం లో మనకు అది తిరుగు లేనిది అని చెప్పినట్టు .. ఇప్పుడు ఆమెరికా మాటనే మనకు వేద వాక్కు .. టైం  పత్రిక ఇటివల మన్మోహన్  సింగ్ వైపల్యాల నాయకుడిగా కవర్ పేజి స్టొరీ ప్రచురించింది .. పేరుకు ఆయన ప్రధాన మంత్రే అయినా పెత్తనం అంతా సోనియా గాంధీ దే .. క్రమంగా మన్మోహన్ ప్రతిష్ట మసక బారేట్టు చేశారు  . అదే సమయం లో రాహుల్ గాంధీ వెలుగులోకి వస్తున్నారు .. టైం లో  మన్మోహన్ సింగ్ వైపల్యం గురించి కవర్ స్టొరీ రావడం , అదే సమయం లో అమ్మి చెబితే కీలక బాద్యతలు స్వికరించడానికి రాహుల్  సిద్ధం అనే  ప్రకటన ఒకే సారి రావడం యాదృచ్చికమేనా ? మన్మోహన్ సింగ్ విఫలం చెందారు అనుకుంటే .. రాహుల్ గాంధీ ఆయన కన్నా సమర్దుడా? 



 సోనియా గాంధీ తనయుడు, కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. రాహుల్ పగ్గాలు చేపట్టేందుకు రాజకీయంగా ఇదే సరైన తరుణం అని కాంగ్రెస్ అధినాయకత్వం కూడా గుర్తించింది.
42 ఏళ్ల బ్రహ్మచారి అయన రాహుల్ - నెహ్రూ కుటుంబం నాలుగవ తరం నాయకునిగా కాంగ్రెస్ పగ్గాలు తద్వారా ఈ దేశ పాలనా పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌గాంధీ సిద్ధమవుతున్నారనేది స్పష్టం. ఇక తేలాల్సింది ముహూర్తం మాత్రమే. దీని కోసం రాహుల్‌గాంధీ ఎనిమిదేళ్ల లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యునిగా వారసత్వ హక్కు అతనికి దానంతట అదే వస్తుంది, కానీ మారిన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎనిమిదేళ్ల రాజకీయ శిక్షణ తీసుకున్నారు. 42 ఏళ్ల వయసు దాటినా ఆయన తన పెళ్లికి తొందరపడడం లేదు కానీ ఆయన పట్ట్భాషేకానికి కాంగ్రెస్ నాయకులు తొందర పడిపోతున్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్ని ప్లాప్‌షోలు ప్రదర్శించినా ఆయన పట్ట్భాషేకాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను రాహుల్ తన భుజస్కందాలపై వేసుకున్నా పెద్దగా ఫలితం చూపలేకపోయారు.



 బీహార్‌లో అరవీర భయంకరంగా యుద్ధం సాగించి గతంలో కన్నా తక్కువ సీట్లు గెలిపించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమేధీ పార్లమెంటు నియోజక వర్గంలోని ఎమ్మెల్యే సీట్లను సైతం గెలిపించలేకపోయారు. అయినా రాహుల్‌కు ఎదురు లేదు.
సోనియా గాంధీ ఆరోగ్యానికి సంబంధించి పలు వార్తలు వస్తున్నాయి. కుమారుడికి తొందరగా పట్ట్భాషేకం చేసి బాధ్యతలు అప్పగించడానికి ఆమె ఆసక్తి చూపుతున్నారు. యుద్ధ రంగంలో విజయం సాధించాలంటే తన శక్తి సామర్ధ్యాల కన్నా ప్రత్యర్థి బలహీనతలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మన దేశంలోని రాజకీయ రంగంలో జరుగుతున్నది అదే. యుపిఏ ఎన్ని కుంభకోణాల్లో కూరుకుపోతున్నా యుపిఏను ఢీకొనే స్థాయిలో బిజెపి కానీ మరో కూటమి కానీ లేదు. ప్రత్యర్థుల ఈ బలహీనతే కాంగ్రెస్‌కు కలిసొస్తోంది. రాహుల్‌కు ప్రభుత్వంలో, పార్టీలో కీలక బాధ్యతలు లభించడం ద్వారా ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పలేం కానీ కచ్చితంగా దేశ రాజకీయాల్లో యువశకం మొదలవుతుందని చెప్పవచ్చు. అనివార్యంగా అన్ని రాజకీయ పార్టీలు యువశక్తిని బయటకు తీయక తప్పదు. 



ప్రధానమంత్రిగా ఉన్నపుడు బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టిన చంద్రశేఖర్ కాలంలో అధికారంలోకి వచ్చి పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించింది మన్మోహన్‌సింగ్. అలాంటి మన్మోహన్ సింగ్ యుపిఏ వన్‌లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సంస్కరణవాదులు మరింతగా సంతోషించారు. ఇప్పటివరకు సంస్కరణలు సూచించిన నాయకుడే స్వయంగా వాటిని అమలు చేసే స్థానంలో నిలవడం వారికి సంతోష కలిగించింది. యుపిఏ వన్ మొత్తం అంతా బాగుంది అనే పాజిటివ్ వేవ్‌లోనే సాగింది. అదే మన్మోహన్‌సింగ్, ఆయన్ని తెరవెనుక నుంచి నడిపించింది అదే సోనియాగాంధీ. గతంలో ఎప్పుడూ లేనన్ని కుంభకోణాలు బయటపడ్డాయి. మన్మోహన్‌సింగ్ ప్రతిష్ట, అంతకన్నా వేగంగా కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారుతున్న సమయంలో రాహుల్‌గాంధీ కీలక బాధ్యతలు చేపట్టడానికి సన్నద్ధం అవుతారనే వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. అమ్మ చెబితే సరే అంటూ అబ్బాయి కూడా సానుకూల సంకేతాలు ఇస్తున్నారు. నేనొక్కడినే ఇంతభారం మోయలేను, మంత్రివర్గంలో చేరి కొంత భారం పంచుకో అని మన్మోహన్‌సింగ్ ఎప్పుడో రాహుల్‌గాంధీకి ఆఫర్ ఇచ్చారు. మన్మోహన్‌సింగ్ తిరుగుబాటు చేసే నాయకుడు కాదు, తిరుగుబాటు చేయడానికి పెద్దగా ప్రజాభిమానం లేదు. ఆ విషయం ఆయనకూ తెలుసు. తన పక్కన చోటు కాదు ఏ రోజు కావాలంటే ఆ రోజు తన కూర్చున్న సీటే యువరాజు కోసం త్యాగం చేయడానికి సదా సిద్ధంగా ఉన్న రాజభక్తుడతను. రాహుల్‌గాంధీ కోసం మన్మోహన్ సింగ్ సదా సిద్ధంగా ఉంటారు.


రాహుల్ కన్నా ముందు రాజకీయాల్లో ప్రియాంక గాంధీ వారసురాలిగా వస్తారని విస్తృతంగా ప్రచారం సాగింది. ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయంటూ బాగానే ప్రచారం సాగింది. వాస్తవానికి రాహుల్‌తో పోలిస్తే ప్రియాంకలో ప్రజలు ఆకట్టుకునే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ కుటుంబ రాజకీయంలో ఏం జరిగిందో కానీ హఠాత్తుగా ప్రియాంక తెరమరుగయ్యారు. రాహుల్ తెరపైకి వచ్చారు. ఇప్పుడు రాహుల్ కోసం క్రమంగా మన్మోహన్‌సింగ్ తెరమరుగు అయ్యే రోజులు సమీపించాయా ?

4 కామెంట్‌లు:

  1. బానిస వ్యవస్థ పోనంత కాలం వీళ్ళు నిలబడుతూనే ఉంటారు.
    అయినా రాహుల్ ఇప్పుడు రావడానికి కారణం
    ౧. ౪౨ ఏళ్లు వచ్చినా పెళ్ళాంతో గడపలేక పోతున్నాడు(అదే veronica) ఇక దేశ ప్రధాని అయితే ఇప్పటి వరకు చెప్పిన అబద్ధం నుంచీ బయట పడవచ్చు.
    ౨. మొన్న నల్ల ధనం మీద యుద్ధం జరుగుతున్నప్పుడు Swiss bank నుంచీ నగదు London banks కు బదిలీ చెయ్యవలసి వచ్చింది, అదే ప్రధాని అయితే Swiss bank తో Pranabh చేసిన ఒప్పందం బలపరచ వచ్చు(అదేనండి - Swiss bank will not reveal money in the bank from Indian culprits even case is proven in Supreme court of India). మన్మోహన్ గారు దీనికి వ్యతిరేకం కాబట్టి ఆయనను తప్పించడానికి ఒక ప్రయత్నం.
    ౩. మాట్లాడితే BJP ఒక మతతత్వ సంస్థ అంటారు కానీ మతతత్వం కాకపొతే హిందువులు భారతదేశం నుంచీ వలసి పోవాల్సి వచ్చేది.

    రిప్లయితొలగించండి
  2. ఏమండీ! తగలబడిపోవడం ఎలాగూతప్పదు, మనం కాదనుకున్నా ఆగదు, భజనపరుల చేతిలో అధికారాలున్నంత కాలం ఇదింతే. జరిగేదేదో తొందరగా జరిగిపోతే....

    రిప్లయితొలగించండి
  3. రాహుల్ తప్పకుండా రావలసినదే.

    ఇంకా ఆయన దేశేధ్ధరణ కోసం వివాహం చేసుకొని భావి యువరాజుకు తండ్రి కావలసినదే.
    ఆయన తరువాత దేశాని కెవరు దిక్కు మరి!

    రాహుల్ పైన వ్యతిరేకత యెందుకు. ప్రస్తుతం ఆయన యువరాజే కదా. రాజు అయితే తప్పేమిటి?

    రాజు గురించి, రాజకుటుంబం గురించీ మాట్లాడుతూ అనుభవాలు, అర్హతలూ అంటూ అసంబధ్దంగా మాత్లాడితే యెలా?

    రిప్లయితొలగించండి
  4. రాహుల్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న అన్ని రాష్ట్రాల్లోనూ దాని అడ్రస్ గల్లంతైంది!! కాంగ్రెస్ మార్కు లూటీ పాలన అంతం అవ్వాలని కోరుకునేవాళ్లందరూ రాహుల్ కి జైకొట్టండి!! రాహుల్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే దాని పని అయిపోతుంది, నూటముప్పయ్యేళ్ళ కాంగ్రెస్ రాచరిక పాలన అంతం అయ్యి ప్రజాస్వామ్యం వస్తుంది!!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం