3, ఏప్రిల్ 2013, బుధవారం

చీకటి శాశ్వతం.. వెలుగు భ్రమ!

విద్యుత్ కోత పుణ్యమా అని జనానికి జీవిత సత్యం బోధపడింది. చీకటి శాశ్వతం, వెలుగు భ్రమ అనే నగ్న సత్యం తెలిసొచ్చింది. మబ్బులు అడ్డం వచ్చినప్పుడు సూర్యుడు కొద్ది సేపు కనిపించకుండా పోతాడు. మబ్బులు తొలగిపోగానే మళ్లీ ప్రత్యక్షం అవుతాడు. చీకటి కూడా అంతే లైటు కొద్దిసేపు వెలిగినప్పుడు హుందా గా కొద్దిసేపు చీకటి తప్పుకుంటుంది. శిశువు తల్లిగర్భంలోని అనంతమైన చీకటితోనవమాసాలు సహజీవనం చేస్తాడు. జీవిత నాటక రంగంలో తన పాత్ర ముగియగానే మళ్లీ అనంత చీకటిలో శాశ్వతంగా కలిసిపోతాడు. ముందు చీకటి తరువాత చీకటి మధ్యలో వెలుగు మూడునాళ్ల ముచ్చటే. ఈ మూడునాళ్ల ముచ్చట కోసం నాయకులు పోటీపడి నాలుగేసి రోజుల దీక్షలు సాగిస్తున్నారు.

 ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటి వాయ నం అంటూ ఆడవాళ్లు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నట్టుగా, ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్‌లో నాలుగేసి రోజుల దీక్ష వాయినాలు సాగుతున్నాయి. పేరంటానికి అమ్మలక్కలంతా వచ్చినట్టు వామపక్షాల నాలుగు రోజుల దీక్షకు టిడిపి, టిఆర్‌ఎస్, బిజెపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు. ఆ తరువాత టిడిపి పేరంటానికి మిగిలిన వాళ్లు వచ్చారు. మీది ఉమ్మడి కుటుంబం అయితే మాది ఇద్దరు లేక ముగ్గురు చాలు అనుకునే చింతలు లేని చిన్నకుటుంబం అంటూ బిజెపి వాళ్లు దీక్ష మొదలుపెట్టారు. ఎంత శత్రువైనా పేరంటానికి పిలిచినప్పుడు వెళ్లడం ధర్మం. అందుకే లెఫ్ట్ రైట్ అనే తేడా లేకుండా దశాబ్దాల శత్రుత్వాన్ని సైతం పక్కన పెట్టి లెఫ్ట్ పేరంటానికి బిజెపి వెళ్లింది, బిజెపి పేరంటానికి లెఫ్ట్ నేతలు వెళ్లారు. ముఖ్యమంత్రి మాత్రం చిన్నపార్టీ పెద్ద పార్టీ అనే తేడాలేకుండా అందరికీ నాలుగేసి రోజుల పాటు దీక్షకు అవకాశం ఇచ్చారు. పనిలో పనిగా కాంగ్రెస్ వాళ్లు కూడా దీక్ష చేస్తే భలేగా ఉండేది. కాంగ్రెస్ నాయకులు ఒకే చోట నాలుగు రోజులు కుదురుగా కూర్చోలేరు. కానీ మాటల్లో మాత్రం విపక్షాలను మించి మాట్లాడారు.


వెలుగుల కోసం నాయకులు చేసే ఉద్యమాలు పెళ్లి సందడిని గుర్తుకు తెస్తున్నాయి. నాయకులు జనం వెలుగు కోసం దీక్షలు చేస్తున్నారని ఎవరైనా అనుకుంటే రాజకీయంగా వాళ్లు ఇంకా చిమ్మచీకటిలో ఉన్నట్టే లెక్క. అధికారం లేక చీకటిలో ఉన్న తమకు మళ్లీ వెలుగు రోజులు వస్తాయన్న ఆశతోనే దీక్ష చేస్తారు. చీకటిలోనే నాయకుల వెలుగులు దాగుంటాయి. వారు కోరుకునేది చీకటినే. తమ ప్రత్యర్థి పాలన చీకటిమయం కావాలని, తమ ప్రత్యర్థి పాలించే కాలంలో ప్రజల జీవితాలు చీకటి మయం కావాలని అధికారంలోకి రావాలనుకునే ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. ఎందుకంటే వారికి అధికారం లభించేది చీకటి నుంచే.
రాజకీయాలకు చీకటికి అవినాభావ సం బంధం ఉంది. మీ పాలన చీకటి రోజులను గుర్తుకు తెస్తుంది అంటాడు ప్రతిపక్షం ఆయన అధికార పక్షం వాళ్లను. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు ఈ డైలాగులను ఉపయోగించే అధికారంలోకి వచ్చి ఉంటారు.


 అందుకే నేమో ఈ మాటలు విని దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్యకు దేవుడు గుర్తుకొచ్చాడు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఉద్యమం ఇలానే ఉండేది. ఈ ఉద్యమం పుణ్యమా అని టిడిపి పాలన చీకటిలో కలిసిపోయింది, చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన సైతం అలానే చీకటిలో కలిసిపోయేట్టుగా అనిపిస్తోంది అని ఆయన కెమెరాల వెలుగులోనే మనసులోని మాట చెప్పుకొచ్చారు. ఆయనకు టిడిపి అనుభవం ఉంది, కాంగ్రెస్ అనుభవం ఉంది, మధ్యలో ప్రజారాజ్యం అనుభవం అదనం కాబ ట్టి ఆయన మాటలను తేలిగ్గా తీసిపారేయలేం అంటున్నారు కాంగ్రెస్ అసమ్మతి వాదులు .

 టిడిపి చీకటిపాలనపై ఉద్యమించి ఇప్పుడు చీకటి పాలనకు ప్రాతినిధ్యం అందిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అప్పుడెప్పుడో ఉల్లిగడ్డలు కూడా ఢిల్లీలో ఒక ప్రభుత్వాన్ని దించాయి, మరో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు వచ్చాయి. కాబట్టి రాజకీయాల్లో దేన్నీ తేలిగ్గా తీసుకోలేం. నాయకులు చీకటిని ప్రేమిస్తారు, కానీ వారి జీవితం మాత్రం వెలుగుల మయం, ప్రజలు వెలుగును కోరుకుంటారు కానీ వారి జీవితం మాత్రం చీకటిమ యం.
ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందే అర్ధరాత్రి చిమ్మచీకటిలో... చచ్చి సాధించడం అంటే ఇదేనేమో తమ చీకటి పాలనను ముగించి తెల్లోడు వెళుతూ వెళుతూ చీకట్లోనే స్వాతం త్య్రం ప్రకటించడం ద్వారా మనకు చీకటి పాలన శాశ్వతం చేసేశాడేమో!


బ్రిటీష్‌వాడు చీకట్లో ఇచ్చిన స్వాతంత్య్రాన్ని గౌరవిస్తూ మన నాయకులు చీకటి పాలననే అందిస్తున్నారు. అన్నీ చీకటి ఒప్పందాలే.... చీక టి పనులే... చివరకు విద్యుత్ కోతలతో జనం తప్పనిసరిగా చీకటిని ప్రేమించేట్టు చేస్తున్నారు.


ఎప్పుడో ఒకసారి తళుక్కున మెరుపులా మెరిసిపోయే కరెంట్ వెలుగు  కన్నా రోజూ వెన్నంటి ఉండే చీకటిపైన వద్దన్నా ప్రేమ పుట్టకుండా ఉంటుందా? పాండవులు స్వర్గానికి వెళ్లేప్పుడు ఒకరి తరువాత ఒకరు పడిపోగా, చివరి వరకు ధర్మరాజును ఒక కుక్క వెన్నంటి నిలిచింది. కుక్క విశ్వాసానికి చలించిపోయిన ధర్మరాజు తనతో పాటు ఆ కుక్కకు కూడా స్వర్గానికి అనుమతించాలని కోరాడట! కొన్ని గంటల పాటు తనతో నడిచిన కుక్కకే స్వర్గప్రాప్తి కలిగించాలని ధర్మరాజు అనుకున్నప్పుడు రోజుల తరబడి మనతో ఉండే చీకటిపై మనకు ఆ మాత్రం ప్రేమ పుట్టకుండా ఉంటుందా?


సమస్యలన్నీ వెలుగులోనే ఉన్నాయనిపిస్తోంది. విద్యుత్ కనుగొనడానికి ముందు మనుషుల జీవితాలు కొండల్లో , అడవుల్లో, గుట్టల్లో ప్రకృతిలో ఎంత హాయిగా ఉండేది. విద్యుత్తే లేనప్పుడు ఇక బిల్లులెక్కడివి, కోతలెక్కడివి. మళ్లీ అలాంటి అపురూపమైన కాలంలోకి తీసుకు వెళుతున్న పాలకులకు మనం సదా రుణపడి ఉండాలి.

4 కామెంట్‌లు:

  1. టపా చీకట్లో వ్రాసారా? వెలుగులో వ్రాసారా?

    ఏంలేదు జిగేల్ జిగేల్ మంటుంటే :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెలుగులో చీకటి గురించి ఆలోచించి రాశానండి మౌళి గారు

      తొలగించండి
  2. కొన్ని మానేద్దాం మనం
    ౧. Blogging
    ౨. Blogging
    చీకటి దానంతట అదే పారిపోతుంది.

    రిప్లయితొలగించండి
  3. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు బ్లాగులు పుట్టక ముందు నుంచి ఉన్న చీకటి Bloggingతో పోతుందా ?

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం