7, మే 2013, మంగళవారం

కుంభకోణాలను జాతీయం చేయాలి..

‘‘ఈ పుస్తకాలే నా జీవితాన్ని సర్వనాశనం చేశాయి’’ అంటూ రమేష్ పుస్తకాల షెల్ఫ్ వైపు కోపంగా చూశాడు. ‘‘వీడిని నాశనం చేసింది ఈ ఎర్రరంగు పుస్తకాలా? పచ్చరంగు పుస్తకాలా ! మార్స్స్ కాపిటల్ మొదలుకొని సుమతీశతకం వరకు అక్కడ అన్ని పుస్తకాలున్నాయి. ‘‘మనమంతా రాంనగర్‌లో ఉండేప్పుడు అందరి పరిస్థితి ఒకటే కదా! చాలీ చాలని జీతాలతో నానా తంటాలు పడేవాళ్లం. మన పరిస్థితి అలానే ఉంది. ఆ నల్లశీను సొంత టీవిలో దేశంలో పడిపోతున్న నైతిక విలువల గురించి గంటల తరబడి ఉపన్యసిస్తున్నాడు. వందల కోట్లు సంపాదించాడు. మనం విలువలు పాటించి ఇలా అయ్యాం వాడు కోట్లు సంపాదిస్తూ విలువలు బోధిస్తున్నాడు. ఈ పుస్తకాలే కదా మన జీవితాలను ఇలా చేశాయి అని రమేష్ చెప్పాడు.

 ఓ అదా నీ బాధ అని సురేష్ అనునయిస్తూ, ‘‘చాలా మంది దైవభక్తులు కూడా ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్లు మూసుకున్నావా? అని దేవున్ని నిలదీశారు. ఎవడబ్బా సొమ్మని తిట్టిపోశారు. కానీ మన నాస్తిక దేవుడు మార్క్స్‌ను తిట్టడం పాపం రా! అంటూ ప్రపంచ వ్యాప్తంగా విప్లవాలు ఎలా వచ్చాయి, వర్గపోరాటం ఎప్పుడు వస్తుందో చెబుతా ఉండూ అంటూ ఇదిగో మా ఇద్దరికీ రెండు కప్పుల టీ పెడతావా? అని సురేష్ భార్యను కేకేశాడు.‘‘ టీ పొడి అయిపోయిందని చెప్పి రెండు రోజులు అవుతుంది, చక్కెర ఉదయమే అయిపోయింది, పాత బకాయి తీర్చేంత వరకు పాలు పోసేది లేదని పాలవాడు మీకే వార్నింగ్ ఇచ్చాడు, వంటింటి నుంచే భార్య జీవిత చరిత్ర మొత్తం వినిపించింది. ఇంటి చుట్టూ అప్పుల వాళ్లు, ఈయనేమో ప్రపంచ పరిణామాలను వివరిస్తారు అని ఇద్దరికీ వినిపించేట్టుగానే ఆమె గొణిగింది.


పోనీ మజ్జిగ ఉంది ఇమ్మంటారా? అని వ్యంగ్యంగా అడిగింది. షుగర్ వ్యాధి గ్రస్తులను గులాబ్‌జామ్‌ను, శాఖాహారులకు హైదరాబాద్ మటన్ బిర్యానీ ఆఫర్ చేయడం ఎంత పాప మో! మద్యం ప్రియులకు మజ్జిగ ఆఫర్ చేయ డం అంత నేరం ! అని ఆమె ఆఫర్‌ను తిరస్కరించారు. ‘‘ ఇవన్నీ చూశాక నాకో కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలని అనిపిస్తోందిరా’’ అని సురేష్ కళ్లు మూసుకుని శూన్యంలోకి చూస్తూ మాట్లాడసాగాడు. మనం చెప్పేది చాలా గొప్ప విషయం అని ఎదుటి వారు అనుకోవాలంటే అలా కళ్లు మూసుకుని శూన్యంలోకి చూస్తూ చెప్పాలని గట్టి నమ్మకం. 

రాజ్యాంగమే అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది కదా! కులం, ప్రాంతం, మతం పేరుతో ఎవరూ అన్యాయానికి గురికావద్దని మన రాజ్యాంగం చెబుతోంది కానీ కుంభకోణాలన్నీ రెండు మూడు వర్గాలకే పరిమితం కావడం అన్యాయం కదూ! అని సురేష్ ఆవేదనగా పలికాడు.
దేశం మొత్తంలో కుంభకోణాలను జాతీయం చేయాలి అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. కొద్దిమంది మాత్రమే వేల కోట్లకుంభకోణాలు చేస్తున్నారు, మిగిలిన వాళ్లు ఎలా చేయాలో తెలుసుకునే సరికే పుణ్య కాలం గడిచిపోతోంది అని సురేష్ పలికాడు.


 నీలాంటి ఆవేదనే చాలా మందిలో కనిపిస్తుందిరా !అని రమేష్ తల ఊపాడు. హోటల్‌లో ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చిన వాడు పక్కోడు దోశకు ఆర్డర్ ఇచ్చాక అరే తప్పు చేశాను నేను కూడా దోశనే తెప్పించుకోవాల్సింది అని దిగులు పడతాడట! హోటల్‌లో వాళ్లే ఇలా బాధపడితే హోటల్‌లోకి అడుగుపెట్టడానికి డబ్బు లేని వాడి బాధ ఎంతుండాలి అని రమేష్ అడిగాడు. ఈ వ్యవహారానికి హోటల్‌కు సంబంధం ఏమిటి అని సురేష్ అడిగాడు. అక్కడికే వస్తున్నాను యువనేత లక్షల కోట్లు సంపాదించాడు అని ప్రచారం చేసే వాళ్ల మనసులోని భావాన్ని ఒకసారి చదివేందుకు ప్రయత్నించు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇంతగా అవకాశం ఉందని మా వర్గానికి అప్పుడు అంతగా తెలియక పోవడం వల్ల కొద్దికొద్దిగా మాత్రమే దోచుకున్నాం, ఇప్పుడు మరో చాన్స్ ఇవ్వండి మా తఢాఖా చూపిస్తాం అన్నట్టుగా ఉంది వాళ్ల కసి. వంతుల వారిగా వాళ్లూ వీళ్లూ దోచుకుంటుంటే మన లాంటి వాళ్ల పరిస్థితి ఏమిటా? అనేదే నా ఆవేదన అందుకే కుంభకోణాలను జాతీయం చేయడమొక్కటే దీనికి మార్గం అనిపిస్తోంది. అలా చేస్తే అన్యాయంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుంది. 

ఆ మధ్య ఒక జాతీయ పత్రికలో హైదరాబాద్ కుంభకోణాల రాజధానిగా మారుతుందని కొందరు బడా నేతల ఫోటోలు ప్రచురించారు. అది చూసి కెసిఆర్ వాళ్లంతా సీమాంధ్ర నాయకులే అంటూ మండిపడ్డారు. గోదావరి, కృష్ణా జలాల్లో మా వాటా ఎంత అని బహిరంగంగా అడుగుతున్నారు కానీ కుంభకోణాల్లో మా వాటా అస్సలే లేదనే ఆవేదన తెలంగాణా వాదుల్లో బలంగానే ఉన్నట్టు ఆయన మాటలను బట్టి అర్ధం కావడం లేదు. అధికారంలో ఉన్నవారికి కుంభకోణాల్లో సింహభాగం ఉన్నా, దామాషా ప్రకారం ఆయా పార్టీలకు కుంభకోణాల అవకాశం కల్పించాలి. చట్టాలను కూడా మార్చేయాలి. అవినీతి చట్ట వ్యతిరేకం అని చెప్పడం ద్వారా అవకాశం ఉన్న ప్రతి ఒక్కడు అవినీతికి పాల్పడుతున్నాడు. ఈ చట్టాన్ని రద్దు చేసి బాధ్యతాయుతమైన ప్రతి పౌరుడు అవినీతికి పాల్పడాలి అనే చట్టం చేయాలి. చట్టాన్ని ఉల్లంఘించడం మన అలవాటు కాబట్టి అప్పుడు అవినీతికి అస్కారం ఉండదు. దీనిలో క్రీమిలేయర్ విధానం కూడా ఉండాలి. ఒక కుటుంబం ఒకే కుంభకోణానికి పరిమితం కావాలి. భారీ కుంభకోణానికి పాల్పడిన వారికి పదేళ్ల వరకు మళ్లీ అవకాశం ఇవ్వవద్దు.

 ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అవినీతిని, కుంభకోణాలను నివారించలేరు, కానీ వాటిని జాతీయం చేస్తామని ప్రకటిస్తే, దాని వల్ల ప్రజలందరికీ లాభం కాబట్టి ప్రజలు కూడా ఆమోదిస్తారు అని మిత్రులు తమ ఆలోచనలు పంచుకున్నారు.
ప్రజలు ఆకర్షితులయ్యే విధానాలు ఏవైనా ప్రకటించడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే చెబితే పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చేస్తాయి. ఎన్నికల తరువాత చెబుదాం అనుకున్నారు.

7 కామెంట్‌లు:

  1. "యువనేత లక్షల కోట్లు సంపాదించాడు అని ప్రచారం చేసే వాళ్ల మనసులోని భావాన్ని ఒకసారి చదివేందుకు ప్రయత్నించు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇంతగా అవకాశం ఉందని మా వర్గానికి అప్పుడు అంతగా తెలియక పోవడం వల్ల కొద్దికొద్దిగా మాత్రమే దోచుకున్నాం, ఇప్పుడు మరో చాన్స్ ఇవ్వండి మా తఢాఖా చూపిస్తాం అన్నట్టుగా ఉంది వాళ్ల కసి. "

    ఇది నిజమంటారా మురళి గారు?
    అలా అందరు యువనేతని విమర్శించడం నచ్చకపోవడం వలన...ఇలా రాసారా?
    లేక కేవలం అందరు దోచుకునే వారే కనక ఇలా ఒక యువనేతని విమర్శించే హక్కు లేదు అని అర్ధం వచ్చేలా రాసారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జలతారు వెన్నెల గారు ధన్యవాదాలు
      నాయకులు , పార్టీలు , ఎన్నికలను కొంత దగ్గరి నుంచి చూడడం వల్ల నాకు వారి గురించి కొంత అవగాహన ఉంది .. నేను గ్రహించిన దాని ప్రకారం ఏ పార్టీ అవినీతికి దూరంగా లేదు .. రాష్ట్రం లో కాంగ్రెస్ , టిడిపిలు ప్రధాన పార్టీలు అనుకుంటే ఆ పార్టీ ల నాయకులూ చాలా మందికి రెండు పార్టీ లలో పని చేసిన అనుభవం ఉంది .... ఎవరు ఏ పార్టీ విడి ఏ పార్టీ లోకి వెళ్ళినా పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది అంటాడు .. బిజెపి , వామపక్షాలను పార్టీల వాళ్ళు మినహా మిగిలిన అన్ని పార్టీ ల వాళ్ళు ఇతర పార్టీల్లో ఎంత బాగా కలిసి పోతున్నారో చుడండి .... ఏ పార్టీ అయినా చట్టాన్ని ఉల్లంగించి సగటున పది కోట్లు ఖర్చు చేస్తే కాని గెలవరు .... చందన బ్రదర్స్ గొప్పదా? బొమ్మనా బ్రదర్సా ? అంటే నేను మాత్రం ఇద్దరు చేసేది బట్టల వ్యాపారమే అంటాను . కొన్ని విషయాలు నేరుగా చెప్పడానికి కొంత ఇబ్బంది .

      తొలగించండి
    2. మురళిగారు,
      బాగా చెప్పారు . ప్రజలలో కూడా పార్టిల పైన అంచనాలు పెరిగి పోయాయి. అధికారంలోకి వచ్చామా, బాగా పరిపాలించామా, యడ్యురప్పలాగా అంతో ఇంతో సంపాదించుకొని పదవి విరమణ చేశామా అంటే వాళ్లు క్షమించరు. ఈ రోజు కర్ణాటక ఎన్నికల ఫలితాలే దానికి సాక్ష్యం, కన్నడ ప్రజలు "దొంగలను ఘోరం గా ఓడించారు. బందిపోట్లకు అద్భుత విజయాన్ని అందించారు". ప్రజల జీత్వభత్యాలు,జీవన ప్రమాణాలు ఎలాగున్నా వారు మాత్రం రాజకీయ నాయకులు, లక్ష్యల కోట్లలో సంపాదించకపోతే క్షమించరు అని ఈ ఎన్నిక ద్వారా ఒక సందేశం పంపారు.

      తొలగించండి
    3. కన్నడ ప్రజలు "దొంగలను ఘోరం గా ఓడించారు. బందిపోట్లకు అద్భుత విజయాన్ని అందించారు".

      శ్రీ రామ్ గారు ఈ వాఖ్య నాకు బాగా నచ్చింది . మిత్రులతో మాట్లాడినప్పుడు అందరిని విమర్శిస్తే మరి ఎవరు గెలవాలి అని అడిగారు .. సరదాగా మాట్లాడుతూ నా ఉద్దేశం ఒకాడే చాలా కాలం దోచుకోవడం నాకు నచ్చదు దోచుకునే చాన్స్ కొత్త వారికి రావాలి అని చెప్పాను .. పాలనా పార్టీ , పాలనా నాయకుడు అవినీతికి దూరం అని చెప్పే అదృష్టం నాకు మాత్రం ఇప్పటి వరకు రాలేదు

      తొలగించండి
  2. CBI, ED, ACB లాంటి వ్యవస్థలని ఎత్తేస్తే చాలు.
    ఎవడి కెపాసిటీకి తగ్గట్టు వాడు కుంభకోణాలు చేసుకుంటారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. bonagiri gaaru ఆ వ్యవస్థలు ఉన్నా దోచుకునే వాడు దోచుకుంటునే ఉన్నాడు అవి ఉన్నా , లేకున్నా వాడికి బాధలేదు . బాధంత ప్రతిభ లేని వారికే

      తొలగించండి
  3. అవినీతిని విశ్వవిపనీకరణలో భాగంగా ౧౯౯౧ లో ఎంచక్కా అనాయాసంగా అవలీలగా జాతీయం చేసి పారేశాం!ఎవ్వరూ వద్దనలేదు నోరు మెదపలేదు!నిరంతర జాగారూకతే ప్రజాస్వామ్యానికి చెల్లించే మూల్యం అనే మాట మరిచాం!అందుకే కుంభ కోనాలను జాతీయం చేస్తే మాత్రం ఎవ్వరోద్దంటారు..... ఒక్కసారి ఎవడికోఒకడికి ఓటు గుద్దిపారేసాక మళ్ళీ అయిదేండ్లదాకా ఓటర్లు పట్టించుకోరు కదా !అన్నీ అవినీతి పార్టీలే అయినా ఎవడికో ఒకడికి ఓటు వేసి చావాలికదా!నెహ్రూ అన్నట్లు అవినీతిపరులను సమీపంలోని కరెంటు స్తంభానికి వేలాదదీస్తే ఏ పార్టీ లోనూ ఒక్కడూ మిగలని పరిస్థితి!కనుక కుంభ కోణాలను కూడా జాతీయం చేసినట్లుగానే ఉంది!మీడియా ఇంత బలంగా ఉన్నా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు రాజకీయ నాయకులు దులపరించుకుపోతున్నారు!మురలిగారి బాధ ప్రపంచం బాధ!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం