6, నవంబర్ 2013, బుధవారం

విక్రమార్కుడితో బేతాళుడి కుమ్మక్కు

విక్రమార్కుడు బేతాళుడిని భుజాన మోస్తూ వెళుతున్నాడు. ‘‘రాజా! నీకు ఇప్పటి వరకు ఎన్నో కథలు చెప్పాను. ఇప్పుడు తెలుగురాజకీయ కథ చెబుతాను’’ అని భేతాళుడు అనగానే విక్రమార్కుడు వణికిపోయాడు. పొరపాటున ఉదయం టీవిలో తెలుగురాజకీయాల చర్చను చూస్తేనే జీవితంపై విరక్తి కలుగుతోంది. పాపం తెలుగు ప్రజలు దాన్ని ఎలా భరిస్తున్నారురా భగవంతుడా! అనుకుంటున్నాను. ఇక నువ్వు రాజకీయ కథ చెబుతాను అంటే విని బతికి ఉంటా నా? ఇక నీకు సమాధానం చెప్పడానికి’’ అని విక్రమార్కుడు బేరుమన్నాడు!

 ఎన్నో కథలు విని సంక్లిష్టమైన ప్రశ్నలకు ఈజీగా సమాధానం చెప్పిన మీరే ఇలా బెంబేలెత్తిపోతే ఎలా రాజా! ముందు కథ వినండి .. నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతే నిజాయితీగా ఒప్పుకోండి అని బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు.
***
బ్లాక్‌మెయిల్ చేశాడనే ఫిర్యాదు వస్తే తీసేసిన స్ట్రింగర్ కోపంతో పత్రిక పెట్టుకుని ఏకంగా ఎడిటర్ అయినట్టు...తెలుగునాట ఏ నేతకు ఎవరి మీద కోపం వచ్చినా కొత్త పార్టీ పెట్టుకుంటారు. అలానే యువనేత కొత్త పార్టీ పెట్టుకుని విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. 16 నెలల పాటు జైలులో ఉన్న యువనేత ఎన్నికల సమయంలో బెయిల్‌పై బయటకు వచ్చాడు. లక్ష కోట్లు సంపాదించాడని విపక్ష పార్టీ ఆయనపై ఆరోపణలు చేస్తే సిబిఐ మాత్రం అంత కాదు కానీ ఎంతో కొంత సంపాదించాడని చెబుతున్నది. యువనేత సోనియాగాంధీతో కుమ్మక్క య్యారని అందుకే బెయిల్ లభించింది అనేది విపక్ష నేత ఆరోపణ. యువనేత పార్టీ, రాజమాత పార్టీలోవిలీనం అవుతుందని ఆ షరతుతోనే బెయిల్ లభించిందని, యువనేత రాజమాత దత్తపుత్రుడని విపక్ష బాబు ఆరోపణ. నిజమేమిటో కానీ ఈ ప్రచారం మాత్రం బలంగా సాగుతోంది. నిజమే అని నమ్ముదామంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి.


రాజమాత పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడానికి విపక్ష బాబు మద్దతే కారణం అనేది అంత కన్నా బలంగా సాగుతున్న ప్రచారం. రాజమాత పార్టీ నాయకుడు కిరణుడికి సొంత జిల్లాలోనూ ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేదు. కొన్ని పార్టీలు అవిశ్వాసం పెడితే ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేందుకు వీలులేదని అప్పటి వరకు హుంకరించిన విపక్ష బాబు అవిశ్వాసమప్పుడు ఓటింగ్‌కు దూరంగా ఉండి ప్రభుత్వాన్ని కాపాడారు. రాష్ట్ర ప్రభుత్వానే్న కాకుండా ఎఫ్‌డిఐల అంశంలో రాజ్యసభలో కేంద్రంలో అధికార పక్షాన్ని సైతం కాపాడారు. ఆపద తలెత్తిన ఓటింగ్ సమయంలో విపక్ష బాబు పార్టీ ఎంపిలే తలనొప్పితో ఒకరు, దాహం వేయడం వల్ల మరొకరు బయటకు వెళ్లి అధికాపక్షాన్ని కాపాడారు. కేసులకు భయపడి విపక్ష బాబు అధికారపక్షానికి అండగా నిలిచారని ఆయనే రాజమాత పెంపుడు కొడుకుగా మారాడనేది యువనేత పార్టీ ఆరోపణ.


ఇక గులాబీ పార్టీ వారు అటు జగన్‌తో ఇటు కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారనేది అదే విపక్ష బాబు ఆరోపణ. తల్లిపుట్టింటి గురించి మేనమామకు తెలియందేముంటుంది. బాబుకు కాంగ్రెస్ పుట్టి ల్లు. మూడు దశాబ్దాల నుంచి ఆయన మెట్టినింట ఉన్నా పుట్టింటి గురించి ఆయన తెలియని విషయం ఉంటుందా? బాబు మా పార్టీ మేనమామే అని అధికారపక్షం మాజీ మంత్రి కూడా స్వయంగా చెప్పారాయె! 

సందట్లో సడేమియా అన్నట్టు యువనేతతో మా రాజమాత కుమ్మక్కు నిజమే అని అధికార పక్షం నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెస్‌తో టిడిపి కుమ్మక్కు అయిందా? వైకాపాతో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందా? టిఆర్‌ఎస్‌తో వైకాపా కుమ్మక్కా? కాంగ్రెస్ కుమ్మక్కా? లేక వీరంతా కుమ్మక్కు అయి ప్రజలను ఆయోమయంలో పడేస్తున్నారా? ప్రతి కుమ్మక్కు ఆరోపణ నిజమే అనిపిస్తోంది. ఇందులో అసలు నిజం ఏది రాజా!


అప్పుడెప్పుడో తూర్పు పడమర అని ఒక సినిమా వచ్చింది. అందులో తూర్పు పడమర ఎదురెదురూ నింగినేల ఎదురెదురు కలియని దిక్కులు కలవవని తెలిసీ ఆరాటం దేని కని అంటూ ఓ పాట ఉంది. ఈ సినిమాలో ఎవరికెవరు ఏమవుతారో కథ రాసిన రచయిత, దర్శకుడు సైతం తేల్చలేకపోయాడు. తెలుగు రాజకీయం కథ కూడా తూర్పు పడమర కథలానే ఉంది. ఇప్పుడు చెప్పు రాజా! ఎవరికెవరు దత్తపుత్రుడు, ఎవరికెవరు పెంపుడు కొడుకు? ఎవరితో ఎవరు కుమ్మక్కు అయ్యారు? అని బేతాళుడు ప్రశ్నించాడు.


విక్రమార్కుడు చిరునవ్వు నవ్వి ఇందులో తల బద్ధలు కొట్టుకోవలసింది ఏమీ లేదు. ఎవరితో ఎవరూ కుమ్మక్కు కాలేదు అన్నాడు.
ఈ సమాధానంతో బేతాళుడు సంతృప్తి చెందలేదు. అదేంటి రాజా! ఆధారాలు అంత స్పష్టంగా కనిపిస్తుంటే కుమ్మక్కు కాలేదంటావు. కాస్త వివరంగా చెప్పు అని బేతాళుడు అడిగాడు.


యాచకో యాచక శత్రుః అన్నారు. యాచకునికి యాచకుడు ఎలా శుత్రువో రాజకీయ పార్టీలకూ, వాటి నేతలకూ అంతే.
ఎవరు ఎవరితోనూ కుమ్మక్కు కాలేదు. ఎవరితో ఎవరైనా కుమ్మక్కు అవుతారు. కట్టుకున్న పార్టీకే కట్టుబడి ఉండని వారు తెర వెనుక ఒప్పందాలకు కట్టుబడి ఉంటారని అనుకోవడం నీ అమాయకత్వం బేతాళా! స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టేన్సీ అన్నట్టు ఎవరి బతుకు తెరువు కోసం వారు తంటాలు పడతారు. తన కాళ్లు నరికేసుకుని తన ప్రత్యర్థి పార్టీని బతికించాలని ఏ నాయకుడికీ ఉండదు. అలాంటి త్యాగశీలి ఏ పార్టీలోనూ ఉండడు. ఎవరి అవసరం వారిది. ఒకరికి బెయిల్ కావాలి, మరొకరికి ప్రభుత్వం పడిపోతే తక్షణం ఎన్నికలను ఎదుర్కోనే సత్తాలేక కాస్త గడువు కావాలి. అంతే ...


ఎన్నికల ముందు ఎవరితోనూ ఎవరూ కుమ్మక్కు కారు. వరద తగ్గాక నగ్నంగా ఉన్నదెవరో బయటపడుతుందని ఒక నానుడి. ఎన్నికల తరువాత ఎవరి అవసరం మేరకు వారు జతకడతారు’’ అని విక్రమార్కుడు చెప్పాడు.
‘‘రాజా! నా అనుమానం మనకు తెలియకుండానే మన మిద్దరం కుమ్మక్కు అయ్యామనిపిస్తోంది’’అని బేతాళుడు అనుమానం వ్యక్తం చేశాడు.

5 కామెంట్‌లు:

  1. >>ఒకరికి బెయిల్ కావాలి, మరొకరికి ప్రభుత్వం పడిపోతే తక్షణం ఎన్నికలను ఎదుర్కోనే సత్తాలేక కాస్త గడువు కావాలి. అంతే ...

    అంతే ...

    ఇది జనాలకు అర్థం అయ్యే వరకే వీరి నాటకాలు. బాగా చెప్పారు మురళి గారు.

    రిప్లయితొలగించండి
  2. Murli gaaru...chaalaa baagaa cheppaaru...hhha..hhaa..manchi message tho paatu baagaa,navvinchaaru:-):-)

    రిప్లయితొలగించండి
  3. adhe bail kosam ayithe... 16 nelalu jaillo vunnaka kummakku avuthara..... lekunte asalu casele lekunda chandra babu laga kummakku avuthara.... meere cheppandi murali garu...?

    రిప్లయితొలగించండి
  4. Bailkosame ayithe 16 nelalu jaillo vunnaka kummakku avuthara... leka asalu caselu lekunda chendrababu laga cheekatlo kummakku avuthara....? meere cheppandi murali garu..... anni thelisinavaru kadha...

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం