13, నవంబర్ 2013, బుధవారం

ఆ ఒక్కటీ అడక్కు...!

‘‘రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నట్టుగా అనిపించడం లేదూ’’!
‘‘దేశంలోని సమస్యలకు పరిష్కారం రాష్ట్ర విభజనే అంటూ జూలైలో ప్రకటించినా, ఇప్పటి వరకు విభజన జరగలేదు రోజులు భారంగానే గడుస్తున్నట్టు అనిపిస్తున్నాయి.’’
‘‘అబ్బా నీకు లోక జ్ఞానం అస్సలే లేదురా! రాష్ట్ర విభజన వద్దంటూ కెసిఆర్ ఆమర దీక్షకు కూర్చున్నా విభజన ఆగదు. ఆ సంగతి వదిలేయ్ ..’’
‘‘మరి నీ బాధ దేని గురించి ?’’
‘‘నిన్న మొన్ననే అన్నగారు సినిమా రంగాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. అలాంటిది అల్లుడు గారు అధికారం చేపట్టడం చివరకు ఆయన కూడా తన కుమారుడిని ప్రజలకు త్యాగం చేయడానికి సిద్ధం చేయడం చూస్తుంటే రోజులు చాలా వేగంగా గడుస్తున్నట్టు అనిపిస్తున్నాయి కదూ!’’
‘‘ఎదుటి వాళ్లతో త్యాగాలు చేయిస్తారు కానీ బాబు త్యాగం చేయడం ఏమిటి?’’
‘‘ఆయనే కాదు ఈ నేలపై పుట్టిన ప్రతి నేత ఏదో ఒక రోజు ఇలా త్యాగం చేయాల్సిందే!’’
‘‘ఏమా త్యాగం ఏమా కథ!’’
‘‘త్యాగాల నేలపై నిలబడి నేతల త్యాగం గురించి తెలియకపోవడం నిజంగా బాధాకరమే. అయితే నీకు మొదటి నుంచి చెప్పాలి. ః’’


***
వెనకటికో ధర్మాత్ముడి వద్దకు కొందరు సంఘ సేవకులు వచ్చి వృద్ధాశ్రమం నిర్మిస్తున్నాం మీ వంతు సహాయం అని కోరితే మీ ఆలోచన అభినందనీయం నా వంతుగా వృద్ధులైన మా అత్తా మామలను మీ వృద్ధాశ్రమానికి విరాళంగా ఇస్తానని ఎంతో దయార్ధ్ర హృదయంతో ప్రకటించాడు. ఆయన మాటలు విన్న శ్రీమతి మా ఆయన అంత ఉదారత్వం చూపిస్తే నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ మా అత్తా మామలను కూడా మీ వృద్ధాశ్రమానికి విరాళంగా ఇస్తానని భార్యా భర్తలు తమ అత్తా మామలను త్యాగం చేసేందుకు పోటీలు పడ్డారు.


త్యాగం ఈనేల సహజ లక్షణం. ఎరువులు వేయకున్నా, వర్షాలు లేకున్నా త్యాగాల పంట దేశంలో రోజు రోజుకూ విరగ పండుతోంది!
వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం చందాలు ఇవ్వండి అని భాగ్యనగరంలో అడిగినట్టు, యజ్ఞం చేస్తున్నాం విరాళం ఇవ్వండి అని భక్తులను అడిగినంత ఈజీగా విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తూ రాక్షసుల నుంచి రక్షణ కోసం దశరథుడిని అడిగితే మీలాంటి వారు అంత దూరం నుంచి వచ్చి అడగాలా! కాకితో కబురంపితే నేనే మా వాళ్లను పంపేవాడిని కదా అన్నట్టుగా చూసి తన కుమారులు రామలక్షణులను పంపించేశాడు. ఇది త్యాగం కాకపోతే మరేమిటి? విశ్వామిత్రుడు ముక్కుపచ్చలారని రామలక్ష్మణులను తీసుకెళ్లింది వన విహారానికి కాదు... రాక్షసులను సంహరించేందుకు! ఏదైనా తేడా వస్తే అంతే కథ. సింహాసనం అధిష్టించాల్సిన వారిని ఇలా త్యాగం చేసే ఆచారం కొత్తదేమీ కాదు. త్రేతాయుగం నుంచి కూడా కొనసాగుతున్నదే. అలానే రాహుల్‌గాంధీని దేశానికి త్యాగం చేయాల్సి రాగానే సోనియాగాంధీ తల్లడిల్లారట! ఇటలీ అయినా ఇండియన్ అయినా తల్లి తల్లే కదా! ముళ్లకిరీటం ధరించేందుకు కొడుకును త్యాగం చేసేందుకు ఏ తల్లయినా తల్లడిల్లిపోతుంది. సింహాసనం అనేది ముళ్లకిరీటం బాబూ! అయినా దేశం కోసం ఈ త్యాగానికి సై అనక తప్పడం లేదని బాధపడ్డారట!


ఈ త్యాగాల చరిత్రలో తెలుగునేత బాబుది విలక్షణ శైలి. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. అన్నగారు. 72 ఏళ్ల వయసులోనూ ప్రేమించి మళ్లీ పెళ్లి చేసుకుని సింహాసనాన్ని వారసునికి త్యాగం చేసే సూచనలు ఏమీ కనిపించక పోవడంతో అల్లుడు గారే మామను త్యాగం చేసి ముళ్లకిరీటం లాంటి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. సహజంగా వారసుడిని ప్రకటించి దేశ ప్రజల కోసం వారసుడిని త్యాగం చేయడం సంప్రదాయం. వారంతట వారే త్యాగానికి సిద్ధం కాకపోతే ఇలా చేయడం ఇక్కడ ఆనవాయితే. వైఎస్‌ఆర్ కూడా బతికి ఉంటే ఇప్పటికే తన కుమారుడిని రాష్ట్రానికి త్యాగం చేసి ఉండేవారు. దాని కోసమే ఎంపిగా ఉన్న తమ్ముడితో సీటు త్యాగం చేయించి అబ్బాయిని పోటీ చేయించారు.


రెండు సార్లు విజయవంతంగా ఓడిపోయాక బాబుగారు కూడా తప్పని సరి పరిస్థితిలో త్యాగాల బాట పట్టారు. అబ్బాయి లోకేశ్ తెలుగు ప్రజలకు త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. పూవు పుట్టగానే పరమళిస్తోంది, అచట పుట్టిన చివరి కొమ్మయినా చేవ అనే మాటలన్నీ ఆ చినబాబు కోసమే పుట్టాయేమో అనిపిస్తోంది. అన్నప్రాసన నాడే ఆవకాయ తింటేనే గొప్ప అనుకుంటున్నాం మనం. అలాంటిది చినబాబు పార్టీలోకి వచ్చిన మొదటి రోజే తెల్ల జుట్టుతో నేడో రేపో అన్నట్టుగా ఉన్న హేమా హేమీలకు ఎన్నికల్లో విజయం సాధించడం ఎలా? విజయానికి ఏడు మెట్లు అంటూ రాజకీయాలను బోధిస్తున్నారు. రాహుల్‌లా చినబాబు తన త్యాగాన్ని చెప్పుకోవడం లేదు. చినబాబు అద్భుతంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తుంటే లైవ్‌లో చూసిన పెద బాబు హృదయం ఆనందంతో పొంగిపోయిందట! పెదబాబు ఇలా పవర్ పాయింట్ ప్రజంటేషన్స్ చేసీ చేసి పార్టీని పదేళ్ల నుంచి అధికారానికి దూరంగా కుటుంబానికి దగ్గరగా తీసుకు వచ్చారు. ఇప్పుడు చినబాబు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తున్నాడంటే మేం ఇక అధికారానికి వచ్చినట్టే అని రెండు సార్లు విజయవంతంగా ఓడిపోయిన నిత్య అసంతృప్తి నేత వాపోయారట!


నాయకులు తమ కుమారులను ప్రజల కోసం త్యాగం చేస్తుంటే ఓటర్లుగా మనం మనశ్శాంతిని కూడా నేతలకు త్యాగం చేయాలి తప్పదు.

 నేతలు తమ వారసులను కాకుండా తాము సంపాదించింది సొమ్మును ప్రజలకు త్యాగం చేస్తే ?
ఆ ఒక్కటీ అడక్కు.

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం