13, జులై 2014, ఆదివారం

పాతాళభైరవి: సినిమాలో రాజకుమారి .. జీవితం లో పేద కుమారి


ఓ పేద యువకుడు చాలెంజ్ చేసి సంపన్నుడు అవుతాడు. కూడు, గుడ్డ లేనివాడు చాలెంజ్ చేసి కోట్లు గడిస్తాడు. ఇది సినిమా కథ. సామాన్యులను రెండున్నర గంటల పాటు ఊహాప్రపంచంలోకి తీసుకు వెళ్లి నిద్ర పుచ్చే సినిమా కథ. ఇలాంటి కథ చూసేందుకైనా, చదివేందుకైనా బాగుంటుంది. కానీ జీవితం సినిమాలా ఉండదు.
అంత కన్నా ఎక్కువ మలుపులు ఉంటాయి. అన్ని మలుపులు మనకు నచ్చాలని లేదు. సినిమా కథ మలుపుల్లో సామాన్యుడు సంపన్నుడైతే, నిజ జీవిత కథలో రాజకుమారి పేద కుమారిగా మారిపోవచ్చు.
***
పాతాళభైరవి సినిమా గుర్తుందా?
‘‘సినిమానే కాదు డైలాగులు కూడా గుర్తున్నాయి. సాహసం సేయరా డింభకా రాజకుమారి లభించునురా! కథ చెప్పమంటావా? డైలాగులు విసరమంటావా? ఎన్టీఆర్ నటన గురించి చెప్పాలా? ఎస్వీఆర్ డైలాగుల గురించి చెప్పనా? అనే సమాధానం వినిపిస్తుంది తెలుగు సినిమా ప్రేమికున్ని ఎవరిని ప్రశ్నించినా..’’ తెలుగులో ఆద్భుతమైన ఐదు సినిమాల పేర్లు చెప్పమని మరో ఐదు దశాబ్దాల తరువాత అడిగినా ఆరు దశాబ్దాల క్రితం వచ్చిన పాతాళభైరవి పేరు అందులో కచ్చితంగా ఉండి తీరుతుంది. ఆ సినిమాల్లో నటించిన హేమాహేమీల్లో ఇప్పుడు ఒక్కరు కూడా సజీవంగా లేరు. కానీ వారంతా చెరగని ముద్ర వేసి వెళ్లారు.
రాజుగారి తోటలో పని చేసే ముసలమ్మ కుమారుడు తోటరాముడు. అప్పుడప్పుడు తోటలోకి వచ్చే రాజకుమారిపై తోటరాముడు మనసు పడ్డాడు. తోటలో పని చేసే తోటరాముడేమిటి? రాజకుమారిపై మనసు పడడం ఏమిటి గమ్మత్తుగా ఉంది కదూ! అది సినిమా సినిమాలో ఏమైనా జరుగుతుంది. ఆ సినిమాలో తోట రాముడుగా నటించిన ఎన్టీఆర్, నేపాళ మాంత్రికుడిగా నటించిన ఎస్వీ రంగారావు, రేలంగి, పద్మనాభం లాంటి వారందరూ మనకు గుర్తున్నారు. రాజకుమారి గుర్తుందా?
రాజకుమారిగానే గుర్తుకొస్తుందేమో కానీ ఆమె గురించి అంతగా తెలియదు.
రాజకుమారి ఎంత అందంగా ఉంటే తోటరాముడు తన ప్రాణాలకు తెగించి మాంత్రికున్ని సైతం సంహరించాలని బయలు దేరుతాడు. వెంట్రుకతో కొండను లాగాలనే ప్రయత్నమే కదా? ఏకంగా నేపాళ మాంత్రికుడి గుహలోకే వెళ్లి తెలివి, సాహసాలను కలగలిపి మాంత్రికునే్న సంహరించి పాతాళభైరవి అనుగ్రహం పొంది రాజకుమారిని పెళ్లి చేసుకుంటాడు. తోటరాముడిలో ఇంతటి సాహసాన్ని ప్రేరేపించిన ఆ రాజకుమారి ఎంత అందగత్తె అయి ఉండాలి. పాతాళభైరవిలో రాజకుమారిగా నటించిన కె మాలతి నిజంగానే మంచి అందగత్తె.
కానీ చాలా మంది పాత తరం నటుల వలెనే దురదృష్టవంతురాలైన అందగత్తె. ఆమె దాదాపు 20 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. దాదాపు అన్నీ హిట్టయిన సినిమాలే.. 1940లో వచ్చిన సుమంగళి ఆమె మొదటి చిత్రం కాగా, 1979లో వచ్చిన శ్రీతిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చివరి చిత్రం. తొలి తరం అందమైన హీరోయిన్ అయిన కె మాలతిని చాలా మందిలానే దురదృష్టం వెంటాడింది.
***
ఒక ఇంటర్వ్యూలో హిందీ నటి రేఖ తన జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపిన ఒక సంఘటన గురించి వివరించింది. నటి రేఖ తల్లి పుష్పవళ్లి పాత తరం తెలుగు, తమిళ నటి. జెమినీగణేషన్, పుష్పవళ్లి కుమార్తెనే రేఖ.
ఒకసారి పుష్పవళ్లి ఇంటికి ఆమె స్నేహితురాలు వచ్చి చాలా సేపు మాట్లాడి వెళ్లింది. ఆమె తిరిగి వెళ్లేప్పుడు పుష్పవళ్లి కొన్ని దుస్తులు కూడా ఇచ్చింది. ఆమె వెళ్లిపోయిన తరువాత తల్లిని రేఖ అడిగింది. ఎవరామె అని
పుష్పవళ్లికి ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.... తన సహ నటి అంటూ... వివరంగా చెప్పుకొచ్చింది. మాలతి.. పాతాళభైరవిలో రాజకుమారిగా నటించిన మాలతి అంటూ చెప్పింది.
***
ఏం జరిగిందో మాలతి పరిస్థితి ఇలా ఎందుకైందో తెలియదు కానీ సినిమాల్లో ఆమెను చూసిన ప్రేక్షకులు మైమరిచిపోతే తెర వెనుక అంతిమ దశలో ఆమె జీవితాన్ని చూసిన వారు చలించి పోయారు. ఆప్రమత్తంగా లేకపోతే రేపు మన జీవితం కూడా అంతేనా? అని వణికిపోయారు.
ఒక్క మాలతి అనే కాదు తొలి తరం నటీనటుల్లో చాలా మంది పరిస్థితి ఇంతే. నటనలో లీనమైపోయిన చాలా మంది వ్యక్తిగత జీవితాన్ని మరిచిపోయారు. కళల ప్రపంచంలో మునిగిపోయి వాస్తవిక ప్రపంచాన్ని మరిచిపోయారు. ఒక లోకం నుంచి మనిషి మరో లోకంలో అడుగు పెడితే ఎలాంటి అయోమయంలో పడిపోతాడో? ఎంత భయపడతాడో చాలా సినిమాల్లో సినిమా వాళ్లు చాలా చక్కగా చూపించారు.
ఒకప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన వారు అవకాశాలు తగ్గినప్పుడు కళల ప్రపంచం నుంచి వాస్తవిక ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు సరిగ్గా ఇలాంటి ఆయోమయంలోనే పడిపోతారు. సినిమాల్లోనే కాదు ఏ వృత్తిలో ఉన్నా వృత్తి వేరు జీవితం వేరు అని గుర్తుంచుకోవాలి. ఉద్యోగికి 58 రిటైర్‌మెంట్ వయసు . 

నటీనటులకు అవకాశాలు ఎప్పుడు తగ్గితే అప్పుడే రిటైర్‌మెంట్. స్టూడియో నుంచి బయటకు వెళ్లిన తరువాత మరో జీవితం ఉంటుందని, సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత సొంత జీవితం ఉంటుందని ఒక వెలుగు వెలుగుతున్న కాలంలోనే గుర్తుంచుకుంటే భవిష్యత్తు జీవితానికి ఢోకా ఉండదు. చివరకు చీమ కూడా ఆహారం దొరికిన కాలంలోనే భవిష్యత్తు కాలంపై దృష్టిపెడుతుంది. అవకాశాలు దక్కిన కాలంలోనే, సంపాదిస్తున్న కాలంలోనే భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఏదీ శాశ్వతం కాదు. కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా ఎప్పుడూ ఇలానే ఉండం కాలం మారుతుందనే విషయం గ్రహించాలి. మారే కాలానికి మంచి కాలంలోనే పునాదులు వేసుకోవాలి. రాజకుమారిగా మహోజ్వలమైన జీవితాన్ని గడిపిన చోటే అవకాశాలు దక్కని కాలంలో భారంగా బతికిన వారి జీవితాలు ఇతరులకు ఆర్థిక వ్యూహంలో జాగ్రత్తలు చెబుతాయి.

2 కామెంట్‌లు:

  1. ఎన్టీయార్ ముఖ్యమంత్రయిన సంవత్సరమేననుకుంటా (1983) - మాలతిగారు మద్రాసులో చనిపొయారు. ఆవిడ ఒక సినిమా థియేటర్ ప్రహరీగోడకి ఆనుకుని వేసుకున్న గుడిసె మీద భవన శిథిలాలు విరిగిపడడంతో వాటికింద నలిగి చనిపోయారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా ఎరుక మేరకు 1979 or 1980 హైదరాబాద్ కాచిగూడ పేవ్మెంట్ పై నివసించే ఈమె సినిమా హాలు ప్రహారి కూలి మరణించారు.

      తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం