21, అక్టోబర్ 2016, శుక్రవారం

అతి నీతి పరులు..!

‘‘రోజురోజుకూ అవినీతి పెరిగిపోతోంది’’
‘‘ఏంట్రోయ్.. నువ్వు కూడా విలువల కోసం పరితపిస్తున్నావ్! బాగానే సంపాదించినట్టున్నావ్! మాదకద్రవ్యాల వ్యాపారం ఏమైనా మొదలుపెట్టావా? ’’
‘‘మనకంత అదృష్టమా? పేపర్‌లో అవినీతి కుంభకోణం అని కనిపిస్తే యథాలాపంగా ఏదో మాట్లాడాను. కానీ, మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేంత దమ్ము లేదు. చేసినా మరీ విలువల గురించి మాట్లాడేంత నీచ స్థాయిలో మాత్రం సంపాదించను.. నీమీద ఒట్టు’’
‘‘ఒట్టు ఎందుకులే’’
‘‘నిజంగా దేశంలో అవినీతి అంత ప్రమాదకరమైన స్థాయికి పెరిగిందా?’’
‘‘ఔనురా! అవినీతి బాగా పెరిగిందని ఐదువందలు, వెయ్యి రూపాయల నోటు రద్దు చేయాలని ‘బాబుగారు’ అడిగితే మా ఏరియాలో ఏకంగా ఐదు రూపాయల నోట్లను కూడా రద్దు చేసి పారేశారు.’’
‘‘ ఏహే.. నేను సీరియస్‌గా అడుగుతుంటే నువ్వేంటి జోకులు వేస్తున్నావ్’’
‘‘ ఒరే సన్నాసీ.. నీకో ఏడాది గడువిస్తాను. ఉభయ రాష్ట్రాల్లో కనీసం రెండు కోట్ల ఇళ్లు ఉన్నాయి. కనీసం ఒక్కటంటే ఒక్క ఇల్లయినా ఎవడో ఒకడికి ఎంతో కొంత ముట్టచెప్పకుండా కట్టి ఉంటే నాకు చూపించు’’
‘‘అంత దాకా ఎందుకు? మా ఇంటికి రా చూపిస్తాను. ఎవడికీ ఒక్క పైసా లంచం ఇవ్వకుండా కట్టాను’’


‘‘దీన్నే  అజ్ఞానం అంటారు. ఒకప్పుడు నాకూ ఈ అజ్ఞానం ఉండేది. మా బిల్డర్ నాకు జ్ఞానోదయం ప్రసాదించాడు. పైసా లంచం ఇవ్వకుండా ఇల్లు కట్టాను చూడు- అని బిల్డర్‌కు గొప్పగా చెబితే వాడు నన్ను వెర్రివాడ్ని చూసినట్టు చూసి ఇలాంటి పిచ్చోళ్లు ఉంటారని మాకు ముందే తెలుసు సార్! మీకు రేటు చెప్పేప్పుడే లంచం కలిపే చెబుతాం. ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌస్ ఏదైనా సరే లంచం రేటు కలిపే ఉంటుందని అన్నాడు. లంచం ఇవ్వకుండా మహా అయితే- విశాఖ సముద్రం ఒడ్డున ఇసుకతో బొమ్మరిల్లు కట్టుకోవచ్చు.. ఇల్లు కట్టడం సాధ్యం కాదు.ఈ విశ్వాన్ని నేనే నడిపిస్తున్నాను అని చెప్పుకొన్న శ్రీకృష్ణుణ్ణి కూడా అవినీతి నడిపించింది 
 జయలలిత సత్య భామగా  అలిగి  గృహం లోకి వెళితే ... ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడిగా లోనికి  ప్రయత్నిస్తే చెలికత్తె అడ్డుకొంటుంది .. బంగారు ఉంగరం లంచంగా ఇచ్చి ఎన్టీఆర్ లోనికి వెళతారు . ’’
‘‘నువ్వు చూశావా ?’’
‘‘ఎన్టీఆర్ చూపించారు ..ఓ సినిమా లో నేను చూశాను ... ’’

‘‘నువ్వు అవినీతిని ప్రోత్సహిస్తున్నావా? ’’
‘‘ అబ్బో.. దానికి బోడి ఒకడి ప్రోత్సాహం అవసరం లేదు. అవినీతి స్వయం ప్రకాశం. విశ్వ వ్యాప్తం .. అజరామరణం ...  గాలి పీల్చుకోకుండా బతికానని ఎవడైనా చెబితే నమ్మకు.. అది సాధ్యం కానే కాదు. అవినీతి కూడా అంతే.. వ్యవస్థకు అది ఆక్సిజన్ లాంటిది. రక్తం నుంచి ప్లేట్‌లెట్స్ వేరు చేయవచ్చు కానీ వ్యవస్థ నుంచి అవినీతిని వేరు చేయలేం.’’
‘‘అలా అందరినీ ఒకే గాటన కట్టేయవద్దు. బాలయోగి దశాబ్దాల పాటు ఏమీ తినకుండా బతికారట! తొమ్మిదేళ్లపాటు సిఎంగా పని చేసిన బాబు ఆస్తి మన వీరయ్య గాడి పూరిపాక విలువంత ఉందట! స్వయంగా లోకేశ్ బాబు చెప్పాడు. ఇవన్నీ నిజం కాదంటావా? ’’
‘‘బాలయోగి గురించి నాకు తెలియదు. భక్తుల మనోభావాలు దెబ్బతీయరాదని తెలుసు. ఎవరి నమ్మకాలు వారివి. అలాంటి వారి సంగతి మనకెందుకు? ’’


‘‘డొంకతిరుగుడుగా మాట్లాడకు.. అవినీతిపరులు దేశానికి ప్రమాదమా? కాదా? సూటిగా సమాధానం చెప్పు’’
‘‘అవినీతిపరుల కన్నా అతి నీతిపరులతో ఈ దేశానికి చాలా ప్రమాదం.’’
‘‘???’’
‘‘నీకు అర్థం కావాలంటే చిన్నప్పుడు చదివిన ఓ కథ చెబుతాను. ఓ ఊళ్లో ఓ మోతుబరి చాలా తెలివైన వాడు. ఓ గురువు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ మోతుబరి ఉంటున్న ఊరికి వచ్చి, ఆ ఇంటి ముందే భక్తులకు విలువలతో కూడిన జీవితం దైవానికి మనిషిని దగ్గరకు చేరుస్తుందని అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చాడు. ఇలాంటి వ్యక్తులపై నమ్మకం లేని మోతుబరి అటువైపుకూడా చూడలేదు. ఉపన్యాసాలు ముగించుకుని ఆ గురువు పొరుగూరుకు వెళ్లిపోయారు. మరుసటి రోజు శిష్యుడు మోతుబరి ఇంటికి వచ్చి అయ్యా మీరు క్షమించాలి. మీ ఇంటి ముందు గడ్డిలో కూర్చోని గురువు గారు బోధనలు చేశారు. వెళ్లిపోయేప్పుడు గమనించలేదు. మా గురువు గారి పంచెకు మీ ఇంటి ఆవరణలోని గడ్డిపోచ అంటుకుంది. పరుల సొమ్ము దొంగతనంగా తెచ్చామనే బాధ గురువుగారిని పీడిస్తోంది. మీ గడ్డి పోచను మీరు తీసుకుని క్షమించానని చెప్పేంత వరకు గురువుగారికి ప్రాయశ్చిత్తం లేదని శిష్యుడు వేడుకున్నాడు. ఆ మాటలకు మోతుబరి చలించిపోయాడు. ఇంతటి మహానుభావులు కలికాలంలో ఉండడం, వారు ఇంటి ముందుకు వస్తే అవమానించి పంపానని తనను తాను తిట్టుకుని గురువు కాళ్లమీద పడి తమ ఇంటికి వచ్చి పావనం చేయాల్సిందే.. అని వేడుకున్నాడు. కాదనలేక గురుశిష్యులు ఆ రాత్రి మోతుబరి ఇంట్లో పడుకున్నారు. తెల్లారి లేచి చూసే సరికి గురుశిష్యులు లేరు ఇంట్లో డబ్బు, నగలు లేవు. అతి నీతి పరులైన మహనీయులు ఇలానే ఉంటారు. వారి ఉపన్యాసాలు అచ్చం ఆ గురువుగారిలానే ఉంటాయి. ’’


‘‘నువ్వు సత్యహరిశ్చంద్రుడిని కూడా అనుమానించేట్టుగా ఉన్నావు?’’
‘‘మనం ఈ కాలం సత్యహరిశ్చంద్రుల కాలంలోనే ఉన్నాం. ఆనాటి సత్యహరిశ్చంద్రుడు ప్రాణం పోయినా అబద్ధం చెప్పలేదు, సత్యహరిశ్చంద్రుల లేటెస్ట్ వెర్షన్ ఇప్పుడు ప్రాణం పోయినా నిజం చెప్పరు. ఆస్తుల ప్రకటన కావచ్చు, జీవితం కావచ్చు. ఏదైనా నిజం చెప్పరు.’’
‘‘ఏంటో మీరు అంతా రివర్స్‌లో మాట్లాడుతున్నారు’’
‘‘లోకమే రివర్స్‌గా ఉంది.. నువ్వే దాన్ని సరిగా చూడడం లేదు. నిజం చెప్పవద్దనే శాపం పాలకులకే కాదు.. సామాన్య ఓటర్లకు సైతం ఉంటుంది. పెళ్లికి ముందు నాటి నీ ప్రేమ పురాణం నిజాయితీగా చెబితే మీ ఆవిడ విడాకులిస్తుంది. నాయకులు నిజం చెబితే తల ముక్కలవుతుంది. ఈ ప్రపంచమే అబద్ధల మీద బతుకుతోంది. పర్సంటేజ్‌లో తేడా ఉంటుంది’’
‘‘వీళ్లను గుర్తించే ఉపాయమే లేదా? ’’
‘‘ఎందుకు లేదు? ఎవరైతే నిరంతరం నైతిక విలువల గురించి మాట్లాడతారో? విలువలు పడిపోతున్నాయని ఆవేదన చెందుతారో అలాంటి వారు తడిగుడ్డతో గొంతు కోసే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా మసులుకోవాలి.’’


‘‘మీరు విలువలకు నిలువెత్తు రూపం’’
‘‘ఇదిగో.. ఏదో నెల జీతం మీద బతికే వాడ్ని. నాకేమన్నా కోట్ల రూపాయల ఆస్తులున్నాయనుకుంటున్నావా? విలువల రూపం అంటున్నావ్. ఇంకో సారి అలా తిడితే మర్యాదగా ఉండదు. ’’ *

జనాంతికం - బుద్దా మురళి ( 21. 10. 2016 శుక్రవారం ) 


1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం