3, మార్చి 2026, మంగళవారం
బాబు ను భయపెట్టిన ఇజ్రాయిల్: జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 125
ఉమ్మడి రాష్ట్రం లో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం . అయన ఉపన్యాసం రొటీన్ గా సాగుతోంది . ఎన్నోసార్లు చెప్పిన విషయాలే చెబుతుండడం వల్ల పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు . కొత్త విషయాలు లేవు . చంద్రబాబు తన సొంత నియోజక వర్గంలో ఇజ్రాయిల్ టెక్నాలెజీ తో వ్యవసాయం చేయడాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన రోజులు అవి . బాబు రొటీన్ ఉపన్యాసంలో తాను ఇజ్రాయిల్ పర్యటించనున్నట్టు చెప్పారు . అప్పటికే ఇజ్రాయిల్ టెక్నాలెజీ తో వ్యవసాయం సాగుతున్నందును అందరూ మామూలుగానే విన్నారు . అప్పుడు బీబీసీ రేడియోకు ఉర్దూ రిపోర్టర్ గా ఉన్న ఉమర్ ఫరూఖ్ మీరు ఇజ్రాయిల్ ఎలా వెళతారు ? మన దేశం పాలస్తీనా కు అనుకూలంగా ఉంది . ఇజ్రాయిల్ ఎలా వెళతారు అని ప్రశ్నించేసరికి బాబు ఖంగుతిన్నారు . పక్కనున్న అధికారులతో మెల్లగా మాట్లాడారు . వాళ్ళు ఏం చెప్పారో వినబడలేదు కానీ ఇజ్రాయిల్ వెళితే మైనారిటీ ఓటర్లకు దూరం అవుతారు అనే భయం పట్టుకుంది . అధికారులతో కొద్ది సేపు మెల్లగా మాట్లాడిన తరువాత అటూ ఇటూ కాకుండా తన ఇజ్రాయిల్ పర్యటన లేదు అన్నట్టు సూచన ప్రాయంగా చెప్పారు .
****
అంతమంది ఉన్నప్పుడు ఇతరులకు వినపడకుండా బాబు ఎలా మాట్లాడారు అని సందేహం రావచ్చు . 95 ప్రాంతంలో టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా మాణిక్ రెడ్డి ఉండేవారు . మెదక్ జిల్లాకు చెందిన నాయకుడు . జిల్లాలో పరిచయం కావడం వల్ల బాగా పరిచయం . బాబు ముఖ్యమంత్రి అయ్యాక రోజూ బాబు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యేవారు . ఆ సమయంలో బాబుకు ఫోన్ వస్తే మాట్లాడేవారు కానీ ఎదురుగా కూర్చున్న మాకు ఎవరితో మాట్లాడారు , ఏం మాట్లాడారు తెలిసేది కాదు . కావాలి అంటే మీరు ఓసారి గమనించి చూడండి మీరు ఎదురుగా ఉన్నప్పడు ఎవరికైన ఫోన్ వస్తే ఎవరి నుంచి వచ్చింది , విషయం ఏమిటీ అనేది ఎంతో కొంత అర్థం అవుతుంది . కానీ బాబుకు కాల్ వస్తే కొన్ని వందల సార్లు అక్కడే ఉన్నాను ఎవరి నుంచి కాల్ వచ్చిందో , విషయం ఏమిటో అస్సలు అర్థం కాదు అని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు . అనుమానం ఉంటే ఓటుకు నోటు వీడియో చూడండి . కట్టేకొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది . ఎవరితో మాట్లాడాడు , ఏం మాట్లాడాడు అనేది అర్థం కాదు . మైకు ముందు గంటలతరబడి మాట్లాడే బాబు ఫోన్ లో మాత్రం చిక్కడు దొరకడు అన్నట్టు మాట్లాడుతారు . రాజకీయాల్లో ఉన్నప్పుడు అందులోనూ అధికారంలో ఉన్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త అవసరం .. ఈ రోజుల్లో టెక్నాలెజీ మరీ పెరిగిపోయింది . అందరి బండారాలు బయటపెట్టే న్యూస్ ఛానల్స్ ఓనర్ల గూడుపుఠాణి లే బయటపడుతున్న రోజులివి .
***
ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలం లో రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు కానీ పత్రికల్లో ఇందిరాగాంధీ - పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మెన్ యాసర్ అరాఫత్ ఫోటోలు , వారి వార్తలు ప్రముఖంగా వచ్చేవి . అరాఫత్ ఆజానుబావుడు అన్నట్టుగా ఉండేవారు . ప్రత్యేకమైన దుస్తులతో మీడియా ఫోటోలకు ప్రత్యేకంగా ఉండేవారు . ఇజ్రాయిల్ , పాలస్తీనా వివాదం గురించి అప్పుడు తెలియదు కానీ ఇందిరాగాంధీ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేశ మీడియా అరాఫత్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది . బాబు హయాంలో అమెరికా అధ్యక్షుడు వస్తే మీడియాలో ఎంత ప్రాముఖ్యత లభించేదో అరాఫత్ కు అంత ప్రాముఖ్యత లభించేది . 1948లో ఇజ్రాయిల్ స్థాపనకు వ్యతిరేకంగా ఇండియా ఓటు వేసింది . 1992 వరకు ఇజ్రాయిల్ తో మనదేశం కనీసం పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకోలేదు . 92లో పివి నరసింహారావు హయాంలో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది . అప్పటివరకు ఇండియా పాలస్తీనాకు పూర్తి మద్దతుగా నిలిచింది . 1999లో వాజపేయి హయాంలో సమావేశాలు జరిగాయి . నరేంద్ర మోడీ హయాంలో ఇజ్రాయిల్ , ఇండియా మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయి . ఇజ్రాయిల్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ . ఇటీవల ఇజ్రాయిల్ పర్యటించి అక్కడి పార్లమెంట్ లో ప్రసంగించారు . ***ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం గురించి , మైనారిటీ ఓట్లపై పడే ప్రభావం వంటి అంశాలను ఏ మాత్రం తెలియక కేవలం ఆధునిక వ్యవసాయ పద్దతులను తెలుసుకోవడం కోసమే బాబు ఇజ్రాయిల్ వెళ్ళాలి అనుకున్నారు . అదే విషయం మీడియా సమావేశంలో చెప్పగానే ఉర్దూ బిబిసి విలేకరి ప్రశ్నతో ఆమ్మో ఇదేదో మెడకు చుట్టుకునేట్టుగా ఉందని ఇజ్రాయిల్ పర్యటన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు . ఇప్పుడు బాబు ఎన్ డి ఏ కూటమిలో ఉన్నారు . బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు . ఇజ్రాయిల్ వెళ్ళాలి అనే కోరికను మూడు దశాబ్దాల తరువాత తీర్చుకొనే అవకాశం లభించింది . యుద్ధం ముగిసిన తరువాత భారత బృందం ఇజ్రాయిల్ పర్యటించే అవకాశం లేకపోలేదు . ఇండియా - పాక్ ల మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో ఇరాన్ పాక్ కు అండగా నిలించింది . ఇండియా పాలస్తీనాకు అండగా నిలిచినా , ఇజ్రాయిల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా 1948 లో ఇండియా ఓటు వేసినా పాక్ తో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయిల్ ఇండియాకు సహకరించింది . ప్రపంచం లో ఎక్కడా ఆశ్రయం దొరకనప్పుడు శరణార్థులుగా వచ్చిన యూదులకు వందేళ్ల క్రితం ఇండియా ఆశ్రయం ఇవ్వడంతో వాళ్ళు ఇప్పటికీ ఇండియాను అభిమానిస్తారు .కాలం మారింది ఇప్పుడు ఎవరికైనా తమ దేశ ప్రయోజనాలు ముఖ్యం కావాలి .
బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం