27, ఏప్రిల్ 2016, బుధవారం

ప్రభుత్వం పనితీరే తెరాసకు ఊపిరి

జల దృశ్యంలో ఒక మొక్కగా ఊపిరి పోసుకున్న టిఆర్‌ఎస్ 16 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో 29వ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ దృష్టిని ఆకట్టుకునే మహా వృక్షంగా ఎదిగింది. ఉద్యమ కాలంలో జై తెలంగాణ నినాదమే టిఆర్‌ఎస్‌కు ఊపిరిగా నిలిచి, టిఆర్‌ఎస్‌ను ఒక రాజకీయ పార్టీగా నిలబెట్టింది. ఇప్పుడు టిఆర్‌ఎస్‌కు ప్రభుత్వ పని తీరే అసలైన బలం. బుధవారం ఖమ్మంలో టిఆర్‌ఎస్ ప్లీనరీ జరుగుతోంది. ప్రభుత్వ పథకాలు ఎంత బాగా అమలు చేస్తే పార్టీ అంతగా పటిష్టపడుతుంది అని గ్రహిస్తే పార్టీకీ , తెలంగాణకు ప్రయోజనం. తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ ప్రజల సమస్యలను తెలంగాణ కోణంలో ఆలోచించి పరిష్కార మార్గాలు చూపే దిశగా పాలన సాగిస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో తిరుగులేని శక్తిగా నిలుస్తుంది. తప్పటడుగులు వేస్తే పార్టీ నష్టపోవడమే కాదు, తెలంగాణ సుడిగుండంలో చిక్కుకుంటుంది.


దాదాపు రెండేళ్ల పాలన చూసినా, ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసినా ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోందని స్పష్టమవుతోంది. వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆకస్మిక తనిఖీలు, ముఖ్యమంత్రి ఆగ్రహాలు వ్యక్తం చేయడం వంటి చిలిపి పనులతో నిరంతరం మీడియాలో ఉంటూ పని మంతునిగా బోలెడు ప్రచారం తెచ్చుకోవచ్చు. ప్రభుత్వానికి దీనికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణకు ఇది అవసరం లేదు. తెలంగాణ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే నిర్ణయాలు కావాలి. ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోందని ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తెలంగాణ ప్ర భుత్వం ఏదో చేసేసింది అని కాదు, చెప్పింది చేస్తుంది అనే నమ్మకంతోనే ప్రతి ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్ సైతం ఊహించని స్థాయిలో విజయం చేకూర్చి పెట్టారు. 

కొన్ని దశాబ్దాల పాటు పాలకులు 18 గంటలు కష్టపడ్డామని, ఎన్నో మీటింగులు పెట్టామని చెప్పినా తెలంగాణ కరవు సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణను ఇంత కాలం అంటిపెట్టుకుని ఉన్న శతకోటి దరిద్రాలకు కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే సరైన పరిష్కారం.
దర్భతో గోవును హతమార్చిన వశిష్టుడు గోహత్యా పాతకం పోయేందుకు తపస్సు చేసి గోదావరిని ఆ ప్రాంతం గుండా ప్రవహింప చేశాడని గోదావరి గురించి పురాణ కథ. కథలో నిజానిజాలు ఎలా ఉన్నా కోటి ఎకరాలకు సాగునీరు లభిస్తే, తెలంగాణకు గత నాయకత్వం తెలిసో తెలియకో చేసిన పాపాలను ప్రక్షాళన చేసి, సస్యశ్యామల తెలంగాణను అందిస్తే పాలకులకు అంతకు మించి పుణ్య కార్యం ఉండదు. ఈ దిశగా ప్రభుత్వం సరైన అడుగులే వేస్తోంది. మేం వెళ్లిపోతే హైదరాబాద్ తలక్రిందులు అయిపోతుందని, చీకట్లో బతుకుతారు అని బెదిరించిన వారు కుళ్లుకునే స్థాయిలో నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రియల్ ఎస్టేట్ పాతాళంలోకి ఏమీ వెళ్లలేదు. మరింతగా పెరిగింది. గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరం విద్యుత్ కోతలు లేని వేసవిని చూస్తోంది. ఇవన్నీ తాత్కాలిక విజయాలు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడం శాశ్వత విజయం. తాత్కాలిక విజయాలను సొంతం చేసుకుంటే ప్రభుత్వం బలంగా ఉండేట్టు చూసుకుంటే ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోంది అనే అభిప్రాయం ప్రజలకు కలిగించడంలో విజయం సాధించారు.


ఆసరా, డబుల్ బెడ్‌రూమ్, కోటి ఎకరాలకు సాగునీరు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తే, టిఆర్‌ఎస్ ఒక మహావృక్షంగా నిలుస్తుంది. పథకాల అమలులో మాట తప్పినా, వెనకడుగు వేసినా, లక్ష్యాన్ని చేరుకోకపోయినా టిఆర్‌ఎస్‌కు అదే పెద్ద ప్రమాదం. హామీల అమలులో విఫలమైతే మరుగుజ్జు నేతలే టిఆర్‌ఎస్‌ను బలంగా ఢీకోనే శక్తివంతులుగా అవతరిస్తారు. తన బలం మొత్తం ప్రకటించిన పథకాలను అమలు చేసి చూపడమే అని టిఆర్‌ఎస్ నాయకత్వం సదా గుర్తుంచుకోవలసిన అంశం.
తెలంగాణలో పెద్దగా ప్రతిపక్షం అంటూ లేదు. ప్రభుత్వం, పార్టీ దేనికైనా భయపడడం అంటే తామిచ్చిన హామీలను తాము విజయవంతంగా అమలు చేసే అంశంపైన ప్రజలకే భయపడాలి. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ రెండు కోవల్లోకి వస్తాయి. ఒకటి సినిమా నటులు తమ గ్లామర్‌ను పెట్టుబడిగా పెట్టి ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీలు. లేదా ఒక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీలు. ఆవిర్భావ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సినీ గ్లామర్ లేదు. వారసత్వ నాయకత్వం లేదు. తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకత్వం లేదు. నాయకత్వం ఒక జిల్లాకు ఒక నియోజక వర్గానికే పరిమితం అయి ఉండవచ్చు. కానీ ప్రజల ఆకాంక్ష మాత్రం తెలంగాణ వ్యాప్తం. తెలంగాణ ప్రజలు తమ చిరకాల స్వప్నాన్ని నిజం చేసే సత్తా ఉన్న పార్టీగా టిఆర్‌ఎస్‌ను గుర్తించారు.
తెలంగాణ వాదులే కాదు తెలంగాణ వ్యతిరేకులు సైతం కొద్ది కాలంలోనే ఈ విషయం గ్రహించారు. అందుకే తెలంగాణను కోరుకునే వారికి కెసిఆర్ కేంద్ర బిందువుగా మారితే, తెలంగాణ వ్యతిరేకులకు సైతం ఆయనే కేంద్ర బిందువుగా మారారు. 


చంద్రబాబు వైఎస్‌ఆర్, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి నాయకులు, ఆంధ్ర నాయకత్వం, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వర్గాలన్నీ కెసిఆర్‌నే కేంద్ర బిందువుగా చేసుకుని విమర్శలకు దిగాయి. అదే ఆయనకు వరంగా మారింది.
తెలంగాణకు సంబంధించి అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఆయననే  నాయకునిగా గుర్తించడం తెలంగాణకు బలమైన నాయకత్వం లభించేట్టు చేసింది. తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగింది, తెలంగాణ సాకారం అయితే ఎలా అభివృద్ధి చెందుతామో చెబుతూ కెసిఆర్ తెలంగాణ వారికి దగ్గరవుతుంటే, తెలంగాణ వ్యతిరేకులు ఆయన్ని వ్యతిరేకిస్తూ పాపులర్ నాయకునిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో కెసిఆర్‌ను నిలిపేందుకు తమకు తెలియకుండానే తమ వంతు సహకారం అందించారు. దీని వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ కాలంలోనే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా అభివృద్ధి చెందాల్సి ఉండే. కానీ అలా జరగలేదు.


 2014 ఎన్నికలకు ముందు వరకు 47 స్థానాల్లో పోటీ చేయడమే టిఆర్‌ఎస్ రికార్డు. 2004లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తే 27 స్థానాలు వచ్చాయి, 2009లో టిడిపితో కలిసి పోటీ చేస్తే 10 స్థానాల్లో గెలిచింది. తెలంగాణ ఉద్యమానికి టిఆర్‌ఎస్ కెరాఫ్ అడ్రస్ అని అన్ని పార్టీలు ఒప్పుకోక తప్పని పరిస్థితి. అయితే ఎన్నికల్లో సీట్ల సంఖ్య తక్కువ కావడం అసలు రాజకీయం. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో, జై తెలంగాణ నినాదాలు ఇవ్వడంలో, తీర్మానాలు చేయడంలో అన్ని పార్టీలు పోటీ పడ్డాయి. అదే సమయంలో పార్టీ అగ్రనాయకత్వాలు తెలంగాణను అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాయి.టిఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమం చేస్తే మేం మౌ నంగా ఉంటే మా నియోజక వర్గంలో కొత్త నాయకత్వం పుడుతుంది, అలా కాకుండా ఉండాలంటే మేం టిఆర్‌ఎస్ కన్నా గట్టిగా జై తెలంగాణ నినాదం వినిపించాలి అదే చేస్తున్నాం అంటూ ఉద్యమ కాలంలో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు చెప్పిన మాట. అన్ని పార్టీలు, అన్ని నియోజక వర్గాల్లో ఇదే విధంగా తెలంగాణ కోసం ఉద్యమాలు చేశాయి. సమయం వచ్చినప్పుడు పార్టీ నాయకత్వాలు తెలంగాణను అడ్డుకున్నాయి. దీంతో ఉద్యమ కాలంలో ఉద్యమ స్థాయిలో నియోజక వర్గాల్లో టిఆర్‌ఎస్ చొచ్చుకు వెళ్లలేకపోయింది. అలా కాకుండా ఉంటే ప్రతి నియోజక వర్గంలోనూ తెలంగాణకను కోరుకున్న యువనాయకత్వం గ్రామ స్థాయి నుంచి నియోజక వర్గం స్థాయి వరకు బలంగా ఉండేది. అలా జరగకుండా దాదాపు సగానికి పైగా నియోజక వర్గాల్లో పార్టీ ఏదైనా పాత కాపులే తమ తెలివి తేటలతో నియోజక వర్గంలో నాయకత్వం తమ చేయి దాటి పోకుండా చూసుకున్నారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. తెలంగాణ సాధించిన టిఆర్‌ఎస్‌కే పాలించే బాధ్యతను ప్రజలు అప్పగించాఠు. ఉద్యమ కాలంలో రాజకీయ భవిష్యత్తు కోసం అధిష్టానం కోరిక మేరకు నడుచుకున్న నాయకులు, ఎన్నికల తరువాత మళ్లీ తమ రాజకీయ భవిష్యత్తు కోసమే టిఆర్‌ఎస్‌ను ఆశ్రయించాయి. రెండు కుటుంబాలు, ఇద్దరు వ్యక్తులు, రెండు కులాల మధ్యనే పోరు అన్నట్టుగా తెలుగునాట గత మూడు దశాబ్దాల రాజకీయం సాగింది. అవశేష ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పటికీ అదే రాజకీయం కనిపిస్తుంటే తెలంగాణలో మాత్రం దీనికి భిన్నవైఖరి కనిపిస్తోంది. ప్రభుత్వ పాలన తెలంగాణ కోణంలో తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ సాగుతోంది. అందుకే మిషన్ కాకతీయ, భగీరథ వంటి పథకాలపై ప్రధానమంత్రితో పాటు నీతి ఆయోగ్ ప్రత్యేకంగా దృష్టిసారించింది.


ఇక రాజకీయాల అంశానికి వస్తే గతానికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదు. ఉద్యమ కాలంలో ఇష్టం లేకపోయినా జై తెలంగాణ అని నినదించిన నాయకులు నియోజక వర్గంలో పట్టు కోల్పోకుండా ఉండడమే కాకుండా తరువాత మంత్రివర్గంలో సైతం స్థానం సంపాదించారు. వారు అలా అని ఉండకపోతే బలమైన కొత్త నాయకత్వం పుట్టుకు వచ్చేది. తెలంగాణ ఈ అవకాశాన్ని కోల్పోయింది. అధికార పక్షం ఎమ్మెల్యేలనే కొనుక్కొని ప్రభుత్వానే్న పడగొట్టే మహా నీతిమంతుల ఎత్తుగడలను తిప్పి కొట్టి టిటిడిపినే టిఆర్‌ఎస్‌లో విలీనం అయ్యేట్టు చేశారు. అధికారం కన్నా సిద్ధాంతాలే ముఖ్యం అని మడికట్టుకుని కూర్చోని ఉంటే టిఆర్‌ఎస్ కూడా సిపిఐ, సిపిఎం తరహాలో మిగిలిపోతే, ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే కాంగ్రెస్, టిడిపిల మధ్య అధికార మార్పిడి జరిగేది. గొంగట్లో తింటూ వెంట్రుకలను ఏరినట్టు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత కన్నా గొప్ప విలువలతో కూడిన రాజకీయాలను ఆశించడం అత్యాశే. ఎందుకు చేర్చుకుంటున్నారు? ఎందుకు చేరారు అనే వాటి జోలికి ప్రజలు వెళ్లడం లేదు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసే స్వాప్నికునిగా కెసిఆర్‌ను ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు తొలుత కెసిఆర్ ఒక్కరికే తెలంగాణ సాధ్యం అనే గట్టి నమ్మకం ఉండేది. అందరికీ అపనమ్మకమే. ఇప్పుడు బంగారు తెలంగాణ సాకారం అవుతుందనే నమ్మకం తెలంగాణ మేలును కోరుకునే వారందరికీ ఉంది. ఆ నమ్మకం ప్రతి ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తోంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. 

ప్రజల్లో కెసిఆర్ పట్ల అంత బలమైన నమ్మకం ఉంది కాబట్టే విపక్షాలు డీలా పడడమే కాదు. సొంత పార్టీలోని నేతలు సైతం మౌ నంగా ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వం పట్ల ప్రజల్లో ఇంతటి విశ్వాసం లేకుంటే సొంత పార్టీ వారే విశ్వరూపం చూపించేవారు. ఈ నమ్మకాన్ని కలకాలం నిలబెట్టుకోవలసిన బాధ్యత కెసిఆర్‌పైనే ఉంది. అదే తెలంగాణకు మేలు.- బుద్దా మురళి (ఎడిట్ పేజి 27. 4. 2016)

1 కామెంట్‌:

  1. మురళి గారూ, తెలంగాణా వచ్చీరాగానే పెట్టిబడులు & ఉపాధి అవకాశాలు అన్నీ వెళ్లిపోతాయని, హైదరాబాదు రోడ్లు బోసి పోతాయని, ఖాళీ అయిన కూడళ్ళలో ప్రభాకర్ మందార, మీరు, నేను ఇతర తెలంగాణావాది బ్లాగర్లు క్రికెట్ ఆడుకోవాల్సి వస్తుందని ఎందరో "మిత్రులు" జోస్యం చెప్పిన మాట మీదు విదితమే.

    ఎక్కడ మాచ్ ఆడుదామండీ?

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం