21, ఏప్రిల్ 2017, శుక్రవారం

సవాళ్లకు ఎదురీది.. సత్తా చాటిన తెలంగాణ

‘ఎలా బతుకుతుందో..?’ అనే సందేహాల నుంచి తన ప్ర స్థానం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం గత మూడేళ్లలో అనేక అంశాల్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా నిలిచి ప్రగతి పథంలో పరుగులిడుతోంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు బారిన పడిన జపాన్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుందా? ఆని ప్రపంచం ఎదురు చూసింది. ప్రపంచం ఊహించని విధంగా జపాన్ ప్రతీకారం తీర్చుకుంది. అమెరికాపై బాంబులు వేసి విజయం సాధించలేదు. అమెరికా ఏయే రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తుందో ఆ రంగాలన్నింటిలో తాను మొదటి స్థానంలో నిలవాలని కంకణం కట్టుకుని జపాన్ అద్భుతాలను సాధించింది. తెలంగాణ సైతం అదే బాట పట్టింది. ‘మీకు తినడం నేర్పించాం. మేం లేకపోతే మీకు తిండి గింజలు కూడా దొరకవు, పాతిక లక్షల గొట్టపుబావులకు మా వల్లే విద్యుత్ అందుతోంది. రాష్ట్రం విడిపోతే మీ గతి ఏమవుతుంది?’- అనే మాటలకు మూడేళ్లలో తెలంగాణ దీటైన సమాధానం చెప్పింది.
దక్షిణాది మొత్తంలో యాసంగిలో తెలంగాణలోనే అత్యధిక వరి పంట పండింది. దశాబ్దాల పీడన నుంచి బయటపడిందనే సానుభూతి కావచ్చు, ఐదువందల సంవత్సరాల విదేశీ పాలన, ఆరు దశాబ్దాల సమైక్య పాలన తరువాత తనను తాను పాలించుకుంటున్న తెలంగాణపై ప్రకృతి కూడా కరుణ చూపించింది. పాలన ఎంత అద్భుతంగా సాగినా ప్రకృతి కరణించక పోతే ఏ పాలకుడైనా చేసేదేమీ ఉండదు. ‘తెలంగాణ రైతులు అదృష్టవంతులని ఆంధ్ర ప్రాంతానికి చెందిన సాధారణ రైతు చెప్పడం, మీ ప్రాంత నాయకుల వలే పోరాడితే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని ఒక సామాన్యుడు చెప్పడం, మీకు పాలన చేత కాదు అని ఈసడించిన నేతల రాష్ట్రానికి చెందిన ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు తెలంగాణలో ఎన్నికల హామీలు అన్నీ నెరవేర్చారని అభినందనలు అని చెప్పడం అమెరికా అధ్యక్షుడి మెచ్చుకోలు కన్నా ఎక్కువ. ప్రొటోకాల్ మెచ్చుకోలు వేరు, సామాన్యుడి మెచ్చుకోలు వేరు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం నడిచిన ప్రాంతంలోనూ కెసిఆర్‌కు క్రేజ్ ఏర్పడింది. ఇది పాలన వల్ల సాధ్యమైందే కానీ, సినిమా గ్లామర్ వల్ల కాదు.
తెలంగాణ ఆవిర్భావం సమయంలో తలెత్తిన విధంగానే టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావంలోనూ అనేక సందేహాలు.. ఆ పార్టీ ఎంత కాలం నిలుస్తుంది? కెసిఆర్ పార్టీని నడపగలరా? అనే మాటలు వినిపించాయి. అంతకు ముందు తెలంగాణ కోసం పుట్టిన కొన్ని పార్టీలు ఆరంభశూరత్వానికే పరిమితం అయ్యాయి. అనుమానాలను పటాపంచలు చేస్తూ టిఆర్‌ఎస్ ఎత్తిన జెండా దించకుండా తుది వరకు పోరాడింది. టిఆర్‌ఎస్ నాయకత్వంలో మలిదశ ఉద్యమం ప్రారంభం అయిన తరువాత ఎంతోమంది నేతలు తెలంగాణ సాధన కెసిఆర్ వల్ల కాదు మేమే సాధిస్తామని పార్టీలు పెట్టి మధ్యలోనే కనిపించకుండా పోయారు. టిఆర్‌ఎస్ కూడా ఎన్నో తిరుగుబాట్లను తట్టుకుని నిలిచింది. టిఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన నాయకులు చాలా మంది పార్టీలు పెట్టి ఒకటి రెండు సమావేశాల కన్నా ఎక్కువ నిర్వహించలేకపోయారు. అలాంటిది ఒకటిన్నర దశాబ్దాలు, కొన్ని వందల సమావేశాలు, డజన్ల కొద్దీ ఎన్నికలను తట్టుకుని నిలిచింది టిఆర్‌ఎస్. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కన్నా తెచ్చిన టిఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారు.
17 ఏళ్ల క్రితం 2001లో సచివాలయం ఎదురుగా ఉన్న ‘జలదృశ్యం’లో టిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ. జనం వెయ్యి మందే కావచ్చు కానీ కోటి ఆశలతో ఉద్వేగపూరిత మైన వాతావరణం. తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆకాంక్ష బలంగా ఉన్నా... సాధ్యం అనే నమ్మకం చాలా కొద్ది మందిలోనే . అసాధ్యం అనుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కన్నా సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకుని నిలిచేట్టు చేయడం ద్వారా సమర్ధ పాలకుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయం సాధించారు.
ఉద్యమకాలంలో టిఆర్‌ఎస్‌కు చాలా సార్లు ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. 2009లో మహాకూటమితో కలిసి పోటీ చేసినా కేవలం పది స్థానాల్లో విజయం సాధించడం టిఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ. వైఎస్‌ఆర్ హయాంలో పది మంది ఎమ్మెల్యేలను లాక్కున్నా టిఆర్‌ఎస్ చలించలేదు. 2009 ఎన్నికల ఫలితాలు మాత్రం టిఆర్‌ఎస్‌కు గట్టిదెబ్బ. ఓడినా, గెలిచినా, పార్టీలో తిరుగుబాట్లు వచ్చినా, ఢిల్లీ పెద్దలు అవకాశాలు కల్పించినా, ఎలాంటి పరిణామాల్లోనైనా తెలంగాణ ప్రజలనే టిఆర్‌ఎస్ నమ్ముకొంది. ఆ నమ్మకమే టిఆర్‌ఎస్‌ను విజయతీరాలకు నడిపించింది.
తెలంగాణ సాధించేంత వరకు ఒకటే నినాదం. లెఫ్ట్, రైట్ అనే సిద్ధాంతాల తేడా లేదు.. తెలంగాణ సాధించడం ఒక్కటే లక్ష్యం ఆ ప్రాంతంలో కనిపించింది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అయిన తరువాత ఎక్కడో చిన్న అనుమానం... ఉద్యమించిన వారిలోనూ, ఎక్కడో తెలియని గుబులు, సందేహం... ఏం జరుగుతుంది? తెలంగాణ ఏర్పడితే చీకటి మయం అంటూ అప్పటి వరకు అధికారంలో ఉన్న వాళ్లు చేసిన ప్రచారం ఎంతో కొంత ప్రభావం చూపించి అనేక అనుమానాలు రేకెత్తించింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ అనుకున్న విధంగా లేకపోతే నవ్వుల పాలవుతామనే భయం. 60ఏళ్ల కల సాకారం కావడం నమ్మలేని నిజం.. భవిష్యత్ ఎలా ఉంటుంది? ఈ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచుకునే విధంగా తన ప్రస్థానం సాగించింది. ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నెరవేర్చింది. టిఆర్‌ఎస్ 17 ఏళ్ల ప్రస్థానంలో ఇప్పుడు మరింత బలపడింది. ‘మాకు ఉద్యమ రాజకీయాలు తెలుసు, అధికార రాజకీయ లౌక్యం తెలుసు..’ అని టిఆర్‌ఎస్ అధినేత నిరూపించారు. 63 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేయాలనుకున్న పార్టీ టిఆర్‌ఎస్‌లో విలీనం అయ్యేట్టు చేశారు. ‘ఇదేమీ మఠం కాదు, టిఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీనే’ అని స్వయంగా కెసిఆరే ప్రకటించారు.
టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, టిడిపి తదితర పార్టీల అంతిమ లక్ష్యం అధికారమే. కానీ టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి తనను తాను తెలంగాణలో కలిపేసుకుంది. తెలంగాణను, తనను విడదీయలేని విధంగా తన ఆలోచనను మార్చుకుంది. ఇక్కడే అధికార పక్షం విజయానికి, ఇతర పార్టీల పరాజయానికి కారణాలు కనిపిస్తాయి. అన్ని పార్టీల లక్ష్యం అధికారమే అయినా తెలంగాణ కోణంలో అధికారం కోసం ఆలోచించడం, పార్టీ కోణంలో అధికారం కోసం ఆలోచించడంలో తేడా ఉంటుందని పార్టీలు నిరూపిస్తున్నాయి. సగం తెలంగాణను సస్య శ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పొరుగు రాష్ట్రం వ్యతిరేకించినా మాట్లాడలేని రాజకీయ పార్టీ నాయకులు తెలంగాణకు నాయకత్వం వహిస్తారా? తెలంగాణ ప్రజలు వారిని నమ్ముతారా? ఇక్కడే తెలంగాణతో టిఆర్‌ఎస్ విడదీయరాని అనుబంధం ఏర్పడగా- ఇతర పార్టీలు దూరమవుతున్నాయి. ఒక రాజకీయ పార్టీ ఏం చేసినా మరో రాజకీయ పార్టీ వ్యతిరేకించడమే రాజకీయం. టిఆర్‌ఎస్ సహా దేశ రాజకీయాల్లో అన్ని పార్టీలూ అనుసరించే సూత్రం ఇదే. తెలంగాణ కొత్త రాష్ట్రం, ఓటు వేసి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం వేరు. ఉద్యమించి కొత్త రాష్ట్రం తెచ్చుకోవడం వేరు. ప్రజలు ఉద్యమించి తెలంగాణ తెచ్చుకున్నారు. ఒక పార్టీ చేసే పనిని మరో పార్టీ వ్యతిరేకించాలనే సాధారణ రాజకీయ సూత్రం ఇప్పుడు పని చేయదు. అందుకే రాష్ట్రంలో విపక్షాలకు ‘స్కోప్’ కనిపించడం లేదు.
హైదరాబాద్ ఇమేజ్ పడిపోతుంది. పరిశ్రమలు తరలిపోతాయి. విద్యుత్ సంక్షోభం తలెత్తి చీకటి మయం అవుతుంది. వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వలేరు’.. ఉద్యమకాలంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారి మాటలు ఇవి. రాష్ట్ర విభజన తర్వాత ఇలా జరిగితే బాగుండునని కోరుకున్నారు. కానీ చిత్రంగా ఈ అంశాలన్నింటిలో పూర్తిగా దీనికి భిన్నంగా జరిగింది. శాపాలనే తెలంగాణ సోపానాలుగా మార్చుకుంది. గూగుల్ వంటి ప్రఖ్యాత కంపెనీ హైదరాబాద్‌కు వచ్చింది. ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రం వీడి వెళ్లలేదు. ప్రత్యర్థులు సైతం ఊహించని విధంగా విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడడమే కాదు. మిగులు విద్యుత్ స్థాయికి చేరుకుంది. తిరిగి విజయం సాధించాలంటే ఆసరా పథకం ఒక్కటి చాలు, డబుల్ బెడ్‌రూమ్ దానికి తోడుగా ఉంటుంది.
రాబోయే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే లక్ష్యం కారాదు. తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే గ్రామాలు పచ్చగా ఉండాలి. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి పథకాలతోనే అది సాధ్యం. హరిత తెలంగాణతోనే ‘బంగారు తెలంగాణ’ సాకారం అవుతుంది. అయిదేళ్ల పాలనలో సగం కాలం ముగిసింది. మిగిలిన ఈ సగం కాలంలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యాన్ని చేరుకుంటే తెలంగాణ కలలు సాకారం అవుతాయి. టిఆర్‌ఎస్ పాలన ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. జరుగుతున్న అభివృద్ధిని చూస్తే, కెసిఆర్ నాయకత్వంలో కోటి ఎకరాలకు సాగునీటి కల సాకారం అవుతుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదనే భయం ఉంది. ప్రజల నమ్మకాన్ని కెసిఆర్ నిలబెట్టుకోవాలి. ఈనమ్మకాన్ని నిలబెట్టే విధంగా తెరాస ప్లీనరీలో చర్చలు ఉంటాయని ఆశించవచ్చు. మణిపూర్ అంటేనే ఇరోం షర్మిల అన్నంతగా జాతీయ మీడియా ప్రచారం చేసింది. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెకు కేవలం 90 ఓట్లు వచ్చాయి. వరంగల్‌లో 300 ప్రజాసంఘాలు, 12 వామపక్ష పార్టీలు ఒక అభ్యర్థిని నిలబెడితే డిపాజిట్ రాలేదు. ఇలాంటి పోరాట యోధులు, వారి ప్రకటనలకు తెలంగాణలో కొదవ లేదు. వీరిని పట్టించుకోవలసిన అవసరం లేదు వీరి సంగతి పక్కన పెట్టి, తెలంగాణ ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికే టిఆర్‌ఎస్ ప్రాధాన్యత ఇవ్వాలి. ‘తెలంగాణ ప్రజలే టిఆర్‌ఎస్‌కు బాస్‌లు’ అనే మాటను ఆచరణలో చూపించాలి.
-బుద్దా మురళి(21-4-2017)

1 కామెంట్‌:

  1. తెలంగాణా అనేది ఒక ప్రయాణం తప్ప గమ్యము కాదు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం అన్నది ఈ పయనంలో ఎంతో ముఖ్యము అయినప్పటికీ అదీ ఒక మైలురాయి మాత్రమే.

    ఇంకోరకంగా చెప్పాలంటే తెలంగాణా ఏర్పాటు ప్రజాభివృద్ధికి అవసరమే కానీ తనంతట తానే సరిపోని విషయం (necessary but not sufficient condition).

    తెలంగాణా సమస్యలకు పరిష్కారాలు తెలంగాణా అస్తిత్వ మూలాల నుండే రావాలి. This identity is not just a tool of recognition but also an platform for achievement.

    ఈ వాస్తవాలను గుర్తించి & మనసా వాచా కర్మణా అమలు చేసే వారికే రాజకీయ మనుగడ ఉంటుంది తత్తిమ్మా వారు ఎంత ఘనులయినా ఈ గడ్డపై ఎక్కువ కాలం మనలేరు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం