2, ఏప్రిల్ 2026, గురువారం
బాబు పదవిని నిలబెట్టిన గ్యాస్ సిలిండర్ కథ
బాబు పదవిని నిలబెట్టిన గ్యాస్ సిలిండర్ కథ
జర్నలిస్ట్ జ్ణాపకాలు -126
^^ గ్యాస్ సిలిండర్ తో వంట చేయవచ్చని చేసింది నేనే ^^ ఈ మాట అన్నది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు .ఆంధ్ర లో జరిగిన ఓ మీటింగ్ లో ఈ మాట చెప్పారు . బాబు ఉద్దేశ పూర్వకంగా చెబుతారో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ చాలా సార్లు ఆయన మాటల్లో కర్త , కర్మ , క్రియ ఉండదు . గ్యాస్ సిలిండర్ తో వంట చేయవచ్చు అని మొదట చెప్పింది నేనే అని చెప్పవచ్చు . లేదా గ్యాస్ సిలిండర్ తో మొదటి సారి వంట చేసింది నేనే అని చెప్పినా వ్యాఖ్యలో సంపూర్ణత ఉండేది . వంటి చేయ వచ్చని చేసింది నేనే అనడంలో వాఖ్య అర్ధవంతంగా లేదు . విషయం ఎలాగూ అర్ధవంతంగా లేదు కనీసం వాఖ్య అయినా అర్ధవంతంగా ఉండాలి కదా ?
వాఖ్య ఎలా ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పదవిని నిలబెట్టింది ఈ గ్యాస్ సిలిండర్ నే . అదో పెద్ద కథ . గ్యాస్ సిలిండర్ అంత పెద్ద కథ .
***
ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించేశారు అనే బలమైన ముద్ర . లక్ష్మీపార్వతి ప్రచారం . దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో సహా ఎన్టీఆర్ కుటుంబం దూరం కావడం , నందమూరి హరికృష్ణ సొంత పార్టీ పెట్టి బాబు వెన్నుపోటు పై జనం లోకి వెళ్లడం వంటి వాటితో చంద్రబాబు బాబు బాగానే ఇబ్బంది పడుతున్నారు . 1999 ఎన్నికల్లో ఓటమి ఖాయం అనిపించింది . న్యూస్ టైం లో పని చేసే జర్నలిస్ట్ మిత్రుడు పవన్ నేనూ కలిసి అలా గ్రామాల్లోకి వెళదాం ఏమనుకుంటున్నారో తెలుస్తుంది అని బయలు దేరాం . నర్సాపూర్ , గజ్వేల్ ప్రాంతాల్లో తిరిగి మాట్లాడుతుంటే రోడ్డు పై బండి మీద మక్కజొన్న కంకులు కాల్చి అమ్ముతున్న అమ్మాయితో కాసేపు మాట్లాడాం . ఆమె చెప్పిన ఒక్క మాటతో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అని అర్థమైంది . ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే ... ?
****
ఇప్పుడంటే గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీ వాళ్ళు బతిమిలాడి మరి ఇస్తారు . ఆర్థిక సంస్కరణలకు ముందు అలా ఉండేది కాదు . పార్లమెంట్ సభ్యులకు కోటా ఉండేది . ఈ కూపన్ లను కూడా కొందరు అమ్ముకొనేవారు . 96 లో హిమాయత్ నగర్ లో టీడీపీ కార్యాలయం ఉన్నపుడు రాజ్యసభ సభ్యలు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూపన్లను రిపోర్టర్ లకు ఇవ్వమని కార్యాలయ కార్యదర్శికిఇచ్చారు . మహా ప్రసాదం అని తీసుకున్నాం . ఆ రోజుల్లో గ్యాస్ కనెక్షన్ కు అంత డిమాండ్ ఉండేది .
99 ఎన్నికలు సమీపిస్తుండడం ఎలాగైనా గెలవాలి అని ప్రయత్నాలు . ఒక్క ఓటుతో వాజపేయి ప్రభుత్వం పడిపోయింది . బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తో విజయావకాశాలు మెరుగుపడ్డట్టు నమ్మకం కలిగింది . అదొక్కటే సరిపోదు ఇంకేం చేద్దాం అని ఆలోచిస్తుంటే అప్పుడు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా రాజ్య సభ సభ్యునిగా ఉన్న లాల్ జాన్ బాషా మదిలో మెదిలిన ఆలోచన గ్యాస్ సిలిండర్ పథకం . అప్పుడు బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ చేరలేదు . స్పీకర్ పదవి మాత్రమే తీసుకోని బయటి నుంచి మద్దతు అని ప్రకటించింది . మహిళకు గ్యాస్ సిలిండర్ పథకం ప్రకటిద్దామని బాషా చెబితే అది ఎలా సాధ్యం . ఎంపీలు కూపన్ ల కోసమే పైరవీలు చేస్తున్నారు . లక్షల మందికి ఎలా సాధ్యం అంటే బాషా సాధ్యమే అని చెప్పారు . మనం మంత్రి పదవులు తీసుకోవడం లేదు . ఢిల్లీలో వ్యవహారాలు నేను దగ్గరి నుంచి చూశాను మీ పలుకుబడి ఉపయోగిస్తే మన రాష్ట్రానికి భారీ కోటా వస్తుంది . వాటిని ప్రతి గ్రామంలో కొందరికి పంపిణీ చేస్తే ఎన్నికల తరువాత అందరికీ వస్తుందనే నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పారు . బాబు రంగంలోకి దిగి విజయం సాధించారు . ఆ రోజుల్లో ఎన్టీఆర్ భవన్ లో ఆ బీట్ రిపోర్టర్ గా బాషా తో గంటల తరబడి ముచ్చట్లు సాగేవి ఈ విషయాలు అన్నీ ఆ రోజే బాషా చెప్పారు .
ఐటీ నేనే అన్నీ నేనే అని బాబు చెప్పుకుంటారు . కుమారుడిని రాజకీయాల్లో నిలబెట్టాలి ఇమేజ్ పెంచాలి అనుకున్నపుడు నగదు బదిలీ పథకం కనిపెట్టింది లోకేష్ అని చెప్పారు . మిగతా అన్నీ తానే అంటారు . సాధారణంగా క్రెడిట్ ఎవ్వరికీ ఇవ్వరు . కానీ లాల్ జాన్ బాషా చనిపోయినపుడు టీడీపీ విడుదల చేసిన సంతాప ప్రకటనలో గ్యాస్ సిలిండర్ పథకం రూపకల్పనలో లాల్ జాన్ బాషా కృషిని ప్రస్తావించారు . బహుశా అప్పుడు బిపి ఆచార్య సమాచార శాఖ కమిషనర్ .. అప్పటికప్పుడు ఫుల్ పేజీ ప్రకటన విడుదల చేస్తూ ఈ పథకానికి దీపం పథకం అని పేరు పెట్టారు . ఇది తాత్కాలికం అని తరువాత పేరు మారుస్తాం అన్నారు కానీ అదే పేరు కొనసాగించారు .
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కు ముందే దీపం పథకం కింద కొందరికి గ్యాస్ సిలిండర్ లు పంపిణీ చేశారు . గ్రామంలో ఒక కుటుంబానికి గ్యాస్ సిలిండర్ వస్తే ఆ వీధిలో పండుగ అన్నట్టు ఉండేది . ఎన్నికల నోటికికేషన్ వచ్చాక దీనిపై వి . హనుమంతరావు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో కమిషన్ నిర్ణయం మేరకు పంపిణీ నిలిపి వేశారు . నిజానికి హనుమంతరావు ఫిర్యాదు టీడీపీ నెత్తిన పాలు పోసినట్టు అయింది . రాష్ట్రంలో అందరికీ ఇచ్చే అన్ని సిలిండర్ లు లేవు . కాంగ్రెస్ ఫిర్యాదు వల్ల ఆపేశాం , ఎన్నికలు కాగానే ఇస్తాం అని బాబు ప్రకటించడం తో అప్పటికే కొందరికి ఇవ్వడం వల్ల జనంలో నమ్మకం ఏర్పడింది . వాజపేయి ఒక్క ఓటు సానుభూతి , దీపం ఈ రెండూ టీడీపీకి కొండంత అండగా నిలిచాయి
****
నర్సాపూర్ , గజ్వేల్ ప్రాంతంలో మిత్రుడితో కలిసినప్పుడు మక్కా జొన్న కంకులు కాల్చి అమ్ముతున్న అమ్మాయి ఇదే మాట చెప్పింది . వాళ్ళ ఊరిలో ఎవరికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారో వారి పేర్లు చెప్పి , ఎన్నికల తరువాత మాక్కూడా వస్తుంది అందుకే ఈ సారి టీడీపీకే ఓటు వేస్తాం అని ఆ అమ్మాయి చెప్పింది . మిత్రుడు పవన్ , నేనూ అప్పుడే అనుకున్నాం దీపం పథకం టీడీపీకి వెలుగు నింపుతుంది అని .
99 ఎన్నికలే బాబు తెలంగాణలో విజయం సాధించిన చివరి ఎన్నికలు . ఆ తరువాత తెలంగాణలో రోజు రోజుకు చిక్కి శల్యం అయ్యారు . రాష్ట్ర విభజన తో పొరుగు రాష్ట్రం పార్టీ అయిపొయింది .
లాల్ జాన్ బాషా మదిలో మెదిలిన ఈ దీపం పథకం పై బాబు ఇప్పుడే కాదు అప్పుడు కూడా బోలెడు కథలు చెప్పారు . చంద్రబాబు తల్లి పేరు అమ్మణ్ణమ్మ . 95 నుంచి రాష్ట్ర విభజన జరిగే వరకు ప్రతి రోజు టీడీపీ బీట్ రిపోర్టర్ లు బాబు ఇంటికి వెళ్లేవారు . ఒక్క రోజు కూడా వారి తల్లి ఇంటికి రాలేదు . సొంత గ్రామం లోనే ఉండేవారు . బాబు ఎన్నికల ప్రచారంలో దీపం పథకం పై బోలెడు ఆశలు పెట్టుకొని సెంటి మెంట్ తో అమ్మ కథ చేర్చారు . మా అమ్మ చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద వంట వండేది . పొగ వల్ల కంటి నుంచి నీళ్లు వచ్చేవి . ఏనాటికైనా మహిళకు ఇలాంటి కష్టాలు లేకుండా గ్యాస్ పథకం తేవాలి అని ఆ రోజే అనుకున్నాను అని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చేవారు . తల్లి కట్టెల పొయ్యితో కష్టపడుతుంటే ఏ పిల్లాడు అయినా సంపాదించి గ్యాస్ పొయ్యి తేవాలి అనుకుంటాడేమో కానీ రాజకీయాల్లోకి వస్తాను , సీఎం అవుతాను , దీపం పథకం తెస్తాను అని ఎవరైనా అనుకుంటారా ?
- బుద్దా మురళి
3, మార్చి 2026, మంగళవారం
బాబు ను భయపెట్టిన ఇజ్రాయిల్: జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 125
ఉమ్మడి రాష్ట్రం లో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం . అయన ఉపన్యాసం రొటీన్ గా సాగుతోంది . ఎన్నోసార్లు చెప్పిన విషయాలే చెబుతుండడం వల్ల పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు . కొత్త విషయాలు లేవు . చంద్రబాబు తన సొంత నియోజక వర్గంలో ఇజ్రాయిల్ టెక్నాలెజీ తో వ్యవసాయం చేయడాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన రోజులు అవి . బాబు రొటీన్ ఉపన్యాసంలో తాను ఇజ్రాయిల్ పర్యటించనున్నట్టు చెప్పారు . అప్పటికే ఇజ్రాయిల్ టెక్నాలెజీ తో వ్యవసాయం సాగుతున్నందును అందరూ మామూలుగానే విన్నారు . అప్పుడు బీబీసీ రేడియోకు ఉర్దూ రిపోర్టర్ గా ఉన్న ఉమర్ ఫరూఖ్ మీరు ఇజ్రాయిల్ ఎలా వెళతారు ? మన దేశం పాలస్తీనా కు అనుకూలంగా ఉంది . ఇజ్రాయిల్ ఎలా వెళతారు అని ప్రశ్నించేసరికి బాబు ఖంగుతిన్నారు . పక్కనున్న అధికారులతో మెల్లగా మాట్లాడారు . వాళ్ళు ఏం చెప్పారో వినబడలేదు కానీ ఇజ్రాయిల్ వెళితే మైనారిటీ ఓటర్లకు దూరం అవుతారు అనే భయం పట్టుకుంది . అధికారులతో కొద్ది సేపు మెల్లగా మాట్లాడిన తరువాత అటూ ఇటూ కాకుండా తన ఇజ్రాయిల్ పర్యటన లేదు అన్నట్టు సూచన ప్రాయంగా చెప్పారు .
****
అంతమంది ఉన్నప్పుడు ఇతరులకు వినపడకుండా బాబు ఎలా మాట్లాడారు అని సందేహం రావచ్చు . 95 ప్రాంతంలో టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా మాణిక్ రెడ్డి ఉండేవారు . మెదక్ జిల్లాకు చెందిన నాయకుడు . జిల్లాలో పరిచయం కావడం వల్ల బాగా పరిచయం . బాబు ముఖ్యమంత్రి అయ్యాక రోజూ బాబు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యేవారు . ఆ సమయంలో బాబుకు ఫోన్ వస్తే మాట్లాడేవారు కానీ ఎదురుగా కూర్చున్న మాకు ఎవరితో మాట్లాడారు , ఏం మాట్లాడారు తెలిసేది కాదు . కావాలి అంటే మీరు ఓసారి గమనించి చూడండి మీరు ఎదురుగా ఉన్నప్పడు ఎవరికైన ఫోన్ వస్తే ఎవరి నుంచి వచ్చింది , విషయం ఏమిటీ అనేది ఎంతో కొంత అర్థం అవుతుంది . కానీ బాబుకు కాల్ వస్తే కొన్ని వందల సార్లు అక్కడే ఉన్నాను ఎవరి నుంచి కాల్ వచ్చిందో , విషయం ఏమిటో అస్సలు అర్థం కాదు అని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు . అనుమానం ఉంటే ఓటుకు నోటు వీడియో చూడండి . కట్టేకొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది . ఎవరితో మాట్లాడాడు , ఏం మాట్లాడాడు అనేది అర్థం కాదు . మైకు ముందు గంటలతరబడి మాట్లాడే బాబు ఫోన్ లో మాత్రం చిక్కడు దొరకడు అన్నట్టు మాట్లాడుతారు . రాజకీయాల్లో ఉన్నప్పుడు అందులోనూ అధికారంలో ఉన్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త అవసరం .. ఈ రోజుల్లో టెక్నాలెజీ మరీ పెరిగిపోయింది . అందరి బండారాలు బయటపెట్టే న్యూస్ ఛానల్స్ ఓనర్ల గూడుపుఠాణి లే బయటపడుతున్న రోజులివి .
***
ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలం లో రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు కానీ పత్రికల్లో ఇందిరాగాంధీ - పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మెన్ యాసర్ అరాఫత్ ఫోటోలు , వారి వార్తలు ప్రముఖంగా వచ్చేవి . అరాఫత్ ఆజానుబావుడు అన్నట్టుగా ఉండేవారు . ప్రత్యేకమైన దుస్తులతో మీడియా ఫోటోలకు ప్రత్యేకంగా ఉండేవారు . ఇజ్రాయిల్ , పాలస్తీనా వివాదం గురించి అప్పుడు తెలియదు కానీ ఇందిరాగాంధీ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేశ మీడియా అరాఫత్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది . బాబు హయాంలో అమెరికా అధ్యక్షుడు వస్తే మీడియాలో ఎంత ప్రాముఖ్యత లభించేదో అరాఫత్ కు అంత ప్రాముఖ్యత లభించేది . 1948లో ఇజ్రాయిల్ స్థాపనకు వ్యతిరేకంగా ఇండియా ఓటు వేసింది . 1992 వరకు ఇజ్రాయిల్ తో మనదేశం కనీసం పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకోలేదు . 92లో పివి నరసింహారావు హయాంలో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది . అప్పటివరకు ఇండియా పాలస్తీనాకు పూర్తి మద్దతుగా నిలిచింది . 1999లో వాజపేయి హయాంలో సమావేశాలు జరిగాయి . నరేంద్ర మోడీ హయాంలో ఇజ్రాయిల్ , ఇండియా మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయి . ఇజ్రాయిల్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ . ఇటీవల ఇజ్రాయిల్ పర్యటించి అక్కడి పార్లమెంట్ లో ప్రసంగించారు . ***ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం గురించి , మైనారిటీ ఓట్లపై పడే ప్రభావం వంటి అంశాలను ఏ మాత్రం తెలియక కేవలం ఆధునిక వ్యవసాయ పద్దతులను తెలుసుకోవడం కోసమే బాబు ఇజ్రాయిల్ వెళ్ళాలి అనుకున్నారు . అదే విషయం మీడియా సమావేశంలో చెప్పగానే ఉర్దూ బిబిసి విలేకరి ప్రశ్నతో ఆమ్మో ఇదేదో మెడకు చుట్టుకునేట్టుగా ఉందని ఇజ్రాయిల్ పర్యటన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు . ఇప్పుడు బాబు ఎన్ డి ఏ కూటమిలో ఉన్నారు . బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు . ఇజ్రాయిల్ వెళ్ళాలి అనే కోరికను మూడు దశాబ్దాల తరువాత తీర్చుకొనే అవకాశం లభించింది . యుద్ధం ముగిసిన తరువాత భారత బృందం ఇజ్రాయిల్ పర్యటించే అవకాశం లేకపోలేదు . ఇండియా - పాక్ ల మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో ఇరాన్ పాక్ కు అండగా నిలించింది . ఇండియా పాలస్తీనాకు అండగా నిలిచినా , ఇజ్రాయిల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా 1948 లో ఇండియా ఓటు వేసినా పాక్ తో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయిల్ ఇండియాకు సహకరించింది . ప్రపంచం లో ఎక్కడా ఆశ్రయం దొరకనప్పుడు శరణార్థులుగా వచ్చిన యూదులకు వందేళ్ల క్రితం ఇండియా ఆశ్రయం ఇవ్వడంతో వాళ్ళు ఇప్పటికీ ఇండియాను అభిమానిస్తారు .కాలం మారింది ఇప్పుడు ఎవరికైనా తమ దేశ ప్రయోజనాలు ముఖ్యం కావాలి .
బుద్దా మురళి
మబ్బులు చూసి కుండలో నీళ్లు పారబోసిన జర్నలిస్ట్ ల కథ
మబ్బులను చూసి కుండలో నీళ్లు పారబోయవద్దు అని మనకో జాతీయం ఉంది . అలా పారబోస్తే ఏమవుతుంది అంటే .. జర్నలిస్ట్ ల్లా అవుతుంది . జాతీయాలు జీవిత పాఠాల ఉంచి పుట్టాయి . మన బాధ భవిష్యత్తు తరానికి ఓ పాఠం కావచ్చు .
***
ఎకరం 50 వేల రూపాయలు..
నువ్వు రెండు లక్షలు చెల్లిస్తే ఇప్పుడే నీకు నాలుగు ఎకరాల భూమి వస్తుంది .
ఇప్పుడు రెండు లక్షలు చెల్లించి 20 ఏళ్ళ తరువాత తీసుకుంటే నీకో 200 గజాల స్థలం ఇస్తాను ..
ఐతే ఇదిగో రెండు లక్షలు ..
20 ఏళ్ళు గడిచాయి . బాబూ ఇబ్బంయూదుల్లో ఉన్నాను .. అప్పు చేసి నీకు రెండు లక్షలు చెల్లించాను . నామీద దయ చూపించి 200 గజాల స్థలం ఇవ్వు ప్లీజ్ ...
***
ఇలాంటి బేరం గురించి ఎప్పుడైనా విన్నారా ? అప్పటికప్పుడు నాలుగు ఎకరాల డబ్బు ఇచ్చి 20 ఏళ్ళ తరువాత 200 గజాల కోసం బతిమిలాడుకోవడం ఇదేం బేరం .. ఇది బేరం కాదు పిచ్చి అనుకుంటున్నారా ?
అత్యంత దురదృష్టకరమైన బ్యాచ్ జర్నలిస్ట్ ల వాస్తవ వ్యధ ఇది .
ఏ ఐ పుణ్యమా అని ఎలాంటి సమాచారం అయినా దొరుకుతుండడంతో ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ అని ప్రభుత్వం చెబుతున్న ప్రాంతాల్లో 2006 లో వ్యవసాయ భూముల ధరలు ఎలా ఉన్నాయి అని గ్రోక్ ను అడిగితే 50 వేలకు ఎకరం నుంచి రెండు లక్షలకు ఎకరంగా ఉండేవని చెప్పింది .
వై ఎస్ ఆర్ హయాంలో జర్నలిస్ట్ ల హౌసింగ్ సొసైటీ ఏర్పడ్డాక ల్యాండ్ కోసం ఒక్కో జర్నలిస్ట్ రెండు లక్షలు చెల్లించారు . వైఎస్ మరణం , రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి లు సీఎంలు అయ్యారు . తెలంగాణ ఏర్పాటు కెసిఆర్ , రేవంత్ రెడ్డిలు సీఎంలు అయ్యారు . అనేక మలుపులు తిరిగి సుప్రీం కోర్ట్ జర్నలిస్ట్ లకు కేటాయించిన స్థలాల జీవోను కొట్టేసి డబ్బు తిరిగి చెల్లించమంది . గోడకు కొట్టిన సున్నం , ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు తిరిగి రావడం అంత ఈజీ కాదు .
ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఉద్యోగులకు వణికి పోతుంది . వారం రోజుల జీతం ఆలస్యానికి ప్రభుత్వం మీద కక్ష కట్టి ఓడించిన చరిత్ర వారిది . అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి రెండేళ్లు అవుతున్నా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేదు . కోర్ట్ కు వెళ్లిన వారికి చెల్లించామని తీర్పులు వచ్చినా అమలు చేసే స్థితి లేదు . అలాంటిది అడిగేవాడు దిక్కులేని జర్నలిస్ట్ ల డబ్బులు తిరిగి రావు .
ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఫ్యూచర్ సిటీలో జర్నలిస్ట్ లకు ల్యాండ్ ఇస్తారు అని ఓ ప్రచారం .
అంటే జర్నలిస్ట్ లు చెల్లించిన డబ్బుకు ఆ రోజుల్లో నాలుగు ఎకరాలు వస్తే , ఇప్పుడు అదే చోట రెండు వందల గజాల కోసం చకోర పక్షిలా ఎదురు చూడాలి .
సుప్రీం తీర్పు తరువాత కూడా కొందరు ఇంకా పాత స్థలాల మీద ఆశ వదులుకోలేక పోతున్నారు . అలా అని వీరిని తప్పు పట్టలేం . అప్పడు తెచ్చి డబ్బు కట్టి 20 ఏళ్లపాటు ఆశగా ఎదురు చూసి రోజూ వాటి గురించే కలలు , కంటూ స్థలం వచ్చాక కట్టే ఇంటిని ముందు కలల్లోనే కట్టుకోవడం వల్ల స్థలాలు రావు అనేదానిని జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు .
రెండు దశాబ్దాల క్రితమే పరిస్థితి ఉహించి ఆంధ్ర మిత్రులు కొందరు తాము కట్టిన రెండు లక్షలు వెనక్కి తీసుకొని ఆంధ్రలో ప్లాట్స్ కొన్నారు .
2006లో భువనగిరి లో రెండు లక్షలకు రెండు ఎకరాలు వచ్చేవి . మిత్రుడు అయోధ్యరెడ్డి అదే సమయంలో తుర్కపల్లిలో జర్నలిస్ట్ మిత్రులకు తుర్కపల్లిలో మెయిన్ రోడ్ లో 80 వేలకు ఎకరం భూములు చూపించాడు . వాటి ధర ఇప్పుడు రెండు కోట్ల వరకు పలుకుతుంది . జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆశల్లో మునిగిపోయి అటు వైపు ఎవరూ ఆసక్తి చూపలేదు .
నాలుగు ఎకరాలు అమ్మి సొసైటీకి రెండు లక్షలు కట్టాను , ఇప్పుడు నేను అమ్మిన భూమి 60 లక్షలకు ఎకరం అయింది . ఊర్లో , అన్నదమ్ముల ముందు నా పరువు పోయింది అని ఓ జర్నలిస్ట్ మంత్రి పొంగులేటి ముందు తన పరిస్థితి చెప్పుకున్నారు . తప్పు మీదంటే మీది అని ఒక్కరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు .
తప్పు పరిస్థితులదే తప్ప వ్యక్తులది కాదు .
జాతిరత్నాలు సినిమాలో సెంట్రల్ జైలులో వెన్నెల కిషోర్ బెస్ట్ బ్యాచ్ అంటే మనదే అని పొంగిపోతాడు . తెలుగునాట జర్నలిజం చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన బ్యాచ్ అంటే ఇదే . 20 ఏళ్ళ క్రితం నాలుగు ఎకరాల విలువైన డబ్బు చెల్లించి 20 ఏళ్ళ తరువాత కూడా 200 గజాల కోసం ఆశగా ఎదురు చూడడానికి మించిన దురదృష్టకరమైన బ్యాచ్ ఉంటుందా ?
మంచి జీతాలు చెల్లించే మీడియా సంస్థల వారి పరిస్థితి వేరు జీతాలు కూడా సరిగా ఇవ్వని సంస్థల జర్నలిస్ట్ లు అప్పు తెచ్చి రోడ్డున పడ్డారు .
- బుద్దా మురళి
22, ఫిబ్రవరి 2026, ఆదివారం
ఖరీదైన గాంధీ విగ్రహాల జ్ఞాపకాలు ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -124
దాదాపు పాతికేళ్ల క్రితం ... అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి .. లాబీ లో కనిపించిన వారందరితో మాట్లాడుతూ ముందుకు వెళుతుంటే గోడ మీద కొత్తగా తగిలించిన మహాత్మ్యా గాంధీ నెహ్రూ ల ఫోటో ఫ్రెమ్ వేలాడుతుండడం కనిపించింది ... అంతకు ముందు లేదు ... కొత్తగా పెట్టారు . అప్పుడు ఏదో ఛానల్ ( జెమినీ లేదా సిటీ కేబుల్ ) రిపోర్టర్ భూమేష్ గాంధీజీ నెహ్రూల ఫోటో ఫ్రెమ్ చూస్తూ బాగుంది కాదన్న .. ఎన్ని వేల బిల్ వేశారో అనగానే నవ్వు ఆగలేదు ... అలాంటి ఫ్రెమ్ సాధారణంగా ఓ రెండు వందలకు అమ్ముతారు ... ప్రభుత్వ వ్యవహారం కాబట్టి ఓ వెయ్యి వరకు పరవాలేదు ... ఎన్ని వేల బిల్ వేశారో అనడానికి వెనుక ఓ విగ్రహ వ్యవహారం ఉంది .
అప్పుడు యనమల రామకృష్ణుడు స్పీకర్ అసెంబ్లీ ఆవరణలో మహాత్మగాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి అని ప్రయత్నం ...
దీనికి 65 లక్షల వ్యయం .
పాతికేళ్ల క్రితం 65 లక్షలు అంటే పెద్ద మొత్తమే . విగ్రహం ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించ లేదు కానీ ఖర్చు విషయం పై విమర్శలు వచ్చాయి . సగం దుస్తులు ధరించిన మహాత్ముని విగ్రహానికే 65 లక్షల ఖర్చు అంటే పూర్తి దుస్తులు ధరించి ఉంటే ఎంత ఖర్చు చేసేవారో అని జోకులు వేసుకోవడం తప్ప ఖర్చుపై నిలదీయలేని పరిస్థితి ...
ప్రతిభా భారతి స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీ లో టెలిఫోన్ వైరింగ్ కాంట్రాక్ట్ పై ఆరోపణలు మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి ... సాధారణంగా అసెంబ్లీ వ్యయం పై ఎవరూ నోరు మెదపరు .... తెలిసినా మౌనంగా ఉండాల్సిందే ...
రామోజీ రావు లాంటి వారు అసెంబ్లీ ని కూడా ఎదిరించి అరెస్ట్ ను తప్పించుకుంటారు కానీ సాధారణ జర్నలిస్ట్ కు సాధ్యం కాదు ... యాజమాన్యాలు సహకరించవు ... రామోజీనే యజమాని కాబట్టి తన అరెస్ట్ కు అసెంబ్లీ ఆదేశించినా అరెస్ట్ కాలేదు ... సాధారణ జర్నలిస్ట్ అయితే ఉద్యోగం ఊడబెరుకుతారు ..
అందుకే అక్కడి వ్యవహారాలు ఆ భవనం లోనే భూస్థాపితం అవుతాయి ...
చివరకు 65 లక్షల వ్యయంతో అసెంబ్లీ ఆవరణలో మహాత్ముని విగ్రహాన్ని ప్రతిష్టించారు .. 65 లక్షల్లో శిల్పికి ఎంత ఇచ్చారో ? శిల్పానికి ఎంతో , ఎవరికి ఎంతో తెలియదు ...
ప్రజాస్వామ్యానికి , స్వేచ్ఛకు ప్రతీక అంటూ ఆవిష్కరించిన మహాత్ముని విగ్రహం వద్దకు వెళ్లకుండా గొలుసులతో బంధించిన రోజులు చాలానే ఉన్నాయి ... టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ , కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వల్ల అసెంబ్లీ ఆవరణ లోని ఈ విగ్రహం వద్ద శాసన సభ్యులు ధర్నాకు కూర్చుంటున్నారని అటు వెళ్లకుండా గొలుసులతో అడ్డుకట్ట వేశారు ...
పాతికేళ్ల తరువాత హైదరాబాద్ లో మరో భారీ గాంధీజీ విగ్రహానికి శ్రీకారం చుట్టారు ... బాపూఘాట్ వద్ద ఐదు వేల కోట్ల ఖర్చుతో గాంధీజీ విగ్రహం నిర్మిస్తారట .. పాతికేళ్ల క్రితం 65 లక్షలు అన్నప్పుడు ఇప్పుడు విగ్రహానికి ఐదు వేల కోట్లు సముచితమే ... తెలంగాణ ఆదాయం పెరిగింది . ధరలూ పెరిగాయి ... మున్సిపల్ వార్డు మెంబర్ కే కోటి రూపాయల ధర పలుకుతున్న రోజులు ఇవి . రాజకీయాలు చాలా ఖరీదైన భారీ పెట్టుబడితో కూడిన వ్యాపారం . ఐదు వేల కోట్ల విగ్రహం సరైన ధరనే ...
పలానా నాయకుడు రాజకీయాల్లో విచ్చల విడిగా ఖర్చు చేశాడు అని మీడియా విమర్శించేది . మా అభిమాన నాయకుడు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికారం లోకి వచ్చాడు ... హై కమాండ్ ఇంచార్జ్ ల పెత్తనం ఏమిటీ ? పూర్తి అధికారం ఇవ్వండి అని నిస్సిగ్గుగా రాస్తున్న దమ్మున్న మీడియా ఉన్న కాలం ఇది . విగ్రహానికి ఐదు వేల కోట్ల ఖర్చు సముచితమే ...
ధర విషయంలో అభ్యన్తరం లేదు కానీ అపార్ట్ మెంట్ లను కూల్చేసి 450 మంది కుటుంబాలను రోడ్డు పాలు చేయడమే నచ్చడం లేదు . వెయ్యి కోట్ల పెట్టుబడి తిరిగి లాభంతో రాబట్టుకోవలసిందే కానీ సామాన్య కుటుంబాలను రోడ్డు పాలు చేయడమే నచ్చలేదు ...
బాపు ఘాట్ ఐదు వేల కోట్ల విగ్రహం తో అసెంబ్లీ విగ్రహం వ్యవహారం గుర్తుకు వచ్చింది ..
ఇదిగో బాధితులు మీ సంగతి మీరు చూసుకోండి ..వెయ్యి కోట్ల పెట్టుబడికి తగిన గిట్టుబాటు రాలేదు అని బాధపడుతున్న మీడియాకు మీ గోడు పట్టదు ...
విగ్రహ నిర్మాణాన్ని ఆపుతారా
ఉద్యమాలకు భయపడే రకం కాదు .. ఎన్టీఆర్ భారీ విగ్రహం పెడతాం ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం అని సవాల్ విసిరారు కూడా ....
గాంధీజీ విగ్రహానికి బలవుతున్న అపార్ట్ మెంట్ లు యేవో తెలిసిందే ... ఎన్టీఆర్ విగ్రహానికి ఏ కాలనీ బలి కానుందో ...
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)