24, అక్టోబర్ 2012, బుధవారం

శ్రీశ్రీ.. ... కృష్ణశాస్ర్తీ..నారాశ్రీ

కవిత్వానికి కాలం చెల్లిందని ఎవరన్నారు. వినేందుకు చెవులు, చదివేందుకు కళ్లు ఉంటే కవిత్వానికి కాలం చెల్లిందనే మాట నోటి నుంచి రానే రాదు. ఒక కుర్ర కవి కవిత్వం రాసి పేరున్న రచయితకు చూపిస్తే, ఆయన ఏమీ చెప్పకుండా ఇతనికి కవిత్వం చేసింది అని యువ కవిని అయోమయంలో పడేశాడు. జలుబు చేసింది అన్నంత ఈజీగా ఆయన కవిత్వం చేసింది అని అన్నాడు. మహాప్రస్థానానికి చలం యోగ్యతా పత్రం ఇచ్చినట్టు కవిత్వం చేసిందనే మాట తన కవిత్వానికి యోగ్యతా పత్రమో, వెటకారపు మాటో అర్ధం కాక యువ కవి అయోమయంలో పడిపోయాడు. అమ్మవారు ప్రత్యక్షం కాగానే అప్పటి వరకు నిరక్షరాస్యుడిగా ఉన్న కాళిదాసు అద్భుతమైన కవిత్వం చెప్పేశారు. ఇంత కాలం తరువాత కూడా కాళిదాసును మరిపించే కవి పుట్టిలేదంటారు. అంటే దేవి ప్రత్యక్షం అయితే కవిత్వం చేస్తుందా? చెప్పడం కష్టమే!
***

మరో ప్రపంచం
మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది
పదండి.. ముందుకు..పదండి దూసుకు!
ఇదెవరి కవిత్వం అని కవిని అడిగితే ఎలా ఉంటుంది? అడిగిన వాళ్లను ఎగాదిగా చూస్తారు కదూ? ఔను మరి శ్రీశ్రీ కవిత్వం తెలియంది ఎవరికి?
మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెనె్నల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్లకీ బ్రతుకు పండెనో
ఇదెవరిది చెప్పండి ?
ఇంకెవరిది దేవులపల్లి కృష్ణశాస్ర్తీది


సరే మరి ఇప్పుడు చెప్పండి వేగుచుక్కలా దూసుకొస్తున్న మరో కవి పలుకులు చెబుతాను. అదెవరిదో చెప్పండి.
‘చాంతాడు వేయకుండానే చేతికి తగిలేట్టున్న కన్నీళ్ల చేరువకు అడుగులు వేస్తున్నాను’ వాహ్‌వా అనాలనిపిస్తోంది కదూ? ఒక శ్రీశ్రీ, ఒక దాశరథి, ఒక కృష్ణశాస్ర్తీ, అంతెందుకు తెలుగు కవులంతా కలగలిసిపోయినట్టు అనిపిస్తే, తప్పు లేదు.
మళ్లీ పైకి వెళదాం ఇంతకూ కవిత్వం ఎందుకు చేస్తుంది?
సిద్దార్థుడు ఒక బిక్షకుడ్ని, మరణించిన వ్యక్తి అంతిమ యాత్రను, మొత్తం మీద సమస్యలు, పేదరికాన్ని చూసినప్పుడు కోరికలు లేని సమాజాన్ని సృష్టించాలనే కోరికతో బుద్ధునిగా మారాడు. ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు దేశాన్ని అర్ధం చేసుకోవడానికి మహాత్మాగాంధీ దేశంలో పర్యటించి, చొక్కా తీసేసుకుని సామాన్య జీవితం గడిపారు. దోపిడీ దొంగతనాలు చేసి బతికే వాల్మికి పావురం మరణాన్ని చూసి మహాకవిగా మారాడు కదా? అలానే మన మహాకూటమి నేత నారాశ్రీ (కవి అన్నాక చివర శ్రీ ఉండి తీరాలి) పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి కవిగా మారాడు. మహాకవిగా ఒక్కో అక్షరాన్ని పేర్చుకుంటూ నడుస్తున్నారు. ఆ భావావేశం నుంచి పుట్టిన కవితలోని పంక్తులే ఈ చాంతాడు వేయకుండానే చేతికి తగిలేట్టున్న కన్నీళ్ల చేరువకు అడుగులు వేస్తున్నాను.. అన్న మాట. ఒక్క చిన్న సంఘటనతో రామాయణం రాసే స్థాయికి వాల్మికి చేరినప్పుడు రెండు వందల కిలో మీటర్ల పాదయాత్ర తరువాత తెలుగునేతలో కవిత్వం పొంగి పొర్లుతోందంటే నమ్మకపోవడానికి కారణం అవసరం లేదు.
పూర్వం రాజులు మారువేషాల్లో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి వెళ్లేవారట! వాళ్లు సమస్యలను వెతుక్కోవడానికి మారు వేషాల్లో వెళ్లే వాళ్లు. అయితే ఇప్పుడూ పాలకులు కావాలనుకుంటున్న వాళ్లు మారు వేషంలో ప్రజల్లోకి వెళుతున్నారు. 


మారు వేషం అంటే శ్రీకృష్ణదేవరాయలు, తన మంత్రితో మల్లీశ్వరిలో బాటసారుల్లా భానుమతి, ఎన్టీఆర్‌లను కలిసినట్టు కాదు. ఇక్కడ మారువేషం అంటే లక్ష కోట్లు సంపాదించిన వాళ్లు తమను మించిన అమాయకులు, బాధితులు ప్రపంచంలో లేరని, చేతిలో మత గ్రంధం ఉంటే తప్ప ధైర్యం ఉండదని అమాయకత్వాన్ని నటించే వాళ్లు. వ్యవసాయం అంటేనే చిరాకు పడి ఐటిని ప్రపంచానికి పరిచయం చేసింది తామే అని మనస్ఫూర్తిగా నమ్మి ఇప్పుడు మాత్రం రైతుల ఊపిరే తన ఊపిరి అని రైతు బాంధవ వేషంలో తిరిగే వారన్నమాట! ఏ గ్రామానికి వెళితే ఆ రూపం ధరిస్తూ గ్రామాలు పర్యటిస్తున్న నాయకులకు కవిత్వం పొంగు కొస్తోంది. తెలుగు నేత డైయిలీ సీరియల్‌గా ఆత్మకథ రాస్తున్నారు కాబట్టి ఆయనలోని కవిత్వం మనకు పరిచయం అయింది. చెల్లి మొదలు పెట్టిన యాత్ర అన్న ముగిస్తారో, అమ్మ ముగిస్తుందో చెల్లే ముగించక తప్పదో మనకు తెలియదు కాబట్టి ఆత్మకథ రాయడం లేదు. అలా రాస్తే తెలుగు సాహిత్య జగత్తుకు ఒక గొప్ప మహిళా భావ కవి లభించి ఉండేవారు. యాత్రలు అధికారం కట్టబెడతాయా? లేదా? అనేది మనకు అవసరం లేదుకానీ తెలుగునేతలోని గొప్ప భావకవిని ప్రపంచానికి వెల్లడి చేసింది.

 ఆయన కవిత్వంలో మరో పంక్తి ఆపార్టీ, పార్టీ అంటూ విడగొట్టే రాజకీయాలేంటి? అని ఆయన తన కవిత్వంతో రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నారు. అంటే దీనర్ధం ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు అధికార పక్షం, ప్రతిపక్షం కలిసిపోయాయని ఆయన చెప్పదలుచుకున్నారా?అని వెటకారాలు వద్దు. పార్టీలు వద్దు అంటే అయ్యో ఈసారైనా అధికారంలోకి వస్తారని ఆశలు పెట్టుకుని బోలెడు ఖర్చు చేస్తున్న మా పరిస్థితేం కావాలని తమ్ముళ్లు భయపడతారేమో! రాజకీయాలు, రాజకీయ పార్టీలు వద్దే వద్దు అంటూ ఆయన చెబుతున్న కవిత్వాన్ని ఆస్వాదించండి అంతే తప్ప సొంత నిర్వచనాలు వద్దు. చెల్లి ఆలస్యమెందుకు? నువ్వూ  కవిత్వం రాసి జనం మీదకు వదిలేయ్.

17, అక్టోబర్ 2012, బుధవారం

కాపీ కొడదాం రండి..


ఏరా పరీక్ష ఎలా రాశావు?
బాగానే రాశాను కానీ ... ఏమవుతుందో అని భయంగా ఉందిరా?
బాగా రాశాక భయమెందుకు?
ఔను అస్సలు కాపీ కొట్టకుండా రాశాను. అందుకే భయం. కాపీ కొట్టి ఉంటే మినిమం గ్యారంటీ ఉండేది.

ఆ విద్యార్థి భయంలో అర్ధం ఉందని రెండో విద్యార్థి నిజమే అని తలూపాడు. చిన్న వయసు నుంచే కాపీ అనేది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అసలు కాపీ అనేది లేకపోతే ఈ ప్రపంచం ఎంత స్లోగా సాగేదో కదా? ఆపిల్, సామ్‌సంగ్ కంపెనీల మధ్య కాపీ పోరు వల్ల బోలెడు మేలు జరిగింది కదా?
ఆమె చీర నా చీరకన్నా తెల్లగా ఉందే ఎలాగబ్బా అనే ధోరణి నుంచి కొత్త సృష్టికి లేదా ఉన్నదానికి కాపీ సృష్టి జరుగుతుంది.
పోటీ ఎంత ఎక్కువగా ఉంటే కాపీ అంత వేగంగా విస్తరిస్తుంది. రాజకీయాల్లో ఇప్పుడు పోటీ బాగా పెరిగిపోయింది. అలాంటప్పుడు కాపీ సైతం అంతే స్పీడ్‌గా పెరిగిపోవాల్సిందే!

 ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆసలు ఆలోచన నాదే వైఎస్‌కు నేనే చెప్పాను అని బొత్స చెబితే, ఆ పథకం రూపకల్పన చేసిందే నేనే, వైఎస్‌ఆర్ ఆ పథకాన్ని కాపీ కొట్టి ఎక్కువ ప్రచారం చేసుకుని తనదని చెప్పుకున్నారని బాబు వాపోయారు. 50 మంది విద్యార్థులుండే తరగతి గదిలో ఎవరిది చూసి ఎవరు కాపీ కొట్టారో తేల్చుకోవడం పేపర్లు దిద్దే టీచర్లకు కష్టం కావచ్చు కానీ ప్రజలు మాత్రం ఎ పథకం ఒరిజినల్ ఎవరిదో? ఎవరు కాపీ కొట్టారో బాగానే గ్రహించేస్తున్నారు. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. ఇద్దరు మనుషులు ఒకరినొకరు ఇష్టపడేందుకే వెయ్యి అబద్ధాలు ఆడినా తప్పులేదనే మినహాయింపు ఉన్నప్పుడు కోట్ల మంది ఓటర్ల ఓట్లు కొల్లగొట్టడానికి నాయకులు ఎన్ని కోట్ల అబద్ధాలు చెప్పడానికి మినహాయింపు ఉండాలి. క్యాలుక్యులేటర్‌కు సైతం అందని లెక్క ఇది. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. కక్కురావడం కాదు ముక్కు చీదినా ఈ మధ్య ప్రభుత్వాలు పడిపోయి మధ్యంతర ఎన్నికలొస్తున్నాయి. జయలలిత, మాయావతి, మమత లాంటి వారికి తుమ్ము, దగ్గు రాకుండా చూసుకోవడానికి గతంలో బిజెపి, కాంగ్రెస్ చాలా తంటాలు పడ్డాయి. ఎలర్జీలు ఉన్నవారిని నమ్ముకుంటే నట్టేట మునుగుతామని గ్రహించి ఈ మధ్య వీళ్లతో సంబంధం లేకుండా బతికేసే మాత్రలను యుపిఏ కనిపెట్టేసింది.

 వాహనాలకు స్టెప్నీ ఉన్నట్టు ఈ మధ్య ప్రభుత్వాలు కూడా మద్దతు విషయంలో ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంటే ఔట్ సోర్సింగ్ అన్నమాట! ఉద్యోగులు తోక జాడిస్తే గతంలో మాదిరిగా లాకౌట్ ప్రకటించాల్సిన అవసరం లేదు. ఔట్ సోర్సింగ్ ద్వారా పని కానిచ్చేయవచ్చు. ప్రభుత్వాలు సైతం ఈ ఔట్ సోర్సింగ్‌ను బాగానే నమ్ముకున్నాయి. చిన్నా చితక పార్టీలను, పార్టీల్లో కొందరు సభ్యులను బయటి నుంచి మద్దతు కోసం అట్టిపెట్టుకున్నారు. దేశ రాజకీయాలకు తొలిసారి బయటి నుంచి మద్దతు మార్గాన్ని పరిచయం చేసింది మన మన బాబుగారే...! దీన్ని కాంగ్రెస్ వాళ్లు కాపీ కొట్టి ప్రభుత్వాలను నిలబెట్టుకున్నారు. మధ్యంతర ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని అన్ని పార్టీల వాళ్లు ధీమాగా ఉన్నారంటే బయటి నుంచి మద్దతు సిద్ధాంతాన్ని నమ్ముకునే కదా? దీనికి బాబుపై కృతజ్ఞత చూపాల్సిన కాంగ్రెస్ ఆయనే్న ఎంత మాటంది. బాబు కాపీ రాయుడట! ఈ మాట అనడానికి వారికి మనసెలా ఒప్పింది? కేంద్రంలో తమ ప్రభుత్వం నిలబడింది బాబు కనిపెట్టిన ఫార్ములాతోనే అనేది గుర్తుకు రాలేదా?
ఒకటా రెండా బాబు ఐడియాలు ఎన్నో కాపీ కొట్టేస్తున్నారు. నగదు బదిలీ పథకం మా అబ్బాయిది, ఉచిత విద్యుత్, ఫీజులు, ఆరోగ్యశ్రీ, మైనారిటీ రిజర్వేషన్లు, రెండు రూపాయల బియ్యం పథకాలన్నీ నావే కాపీ కొట్టేశారని వాపోతున్నారు. చివరకు నా పాదయాత్రను సైతం షర్మిల కాపీ కొట్టేశారంటున్నారు. పాదయాత్ర ఐడియా మా నాన్నది అని ఆమె చెబుతుంటే కాపీ రైట్‌కు కాలం చెల్లింది... ఇప్పుడు కొత్తగా పాదయాత్ర రైట్ బాబుగారిదే అని ఆ పార్టీ వాళ్ల వాదన. ఎప్పుడు మొదలు పెట్టామని కాదు విజయవంతంగా కాపీ కొట్టామా? లేదా? అనేది ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్యం.
బజాజ్ స్కూటర్స్ హవా నడిచే కాలంలో స్కూటర్ తయారై ఇంకా మార్కెట్‌లోకి వెళ్లక ముందే పంజాబ్‌లో నకిలీ పార్ట్స్ తయారు అయ్యేవి. వాటిని నిరోధించలేమని గ్రహించాక చివవరకు కంపెనీ వాళ్లే వాళ్లకు రుణాలు ఇచ్చి కాస్త నాణ్యమైన పార్ట్స్‌ను తయారు చేయండి అని వేడుకున్నారు. స్కూటర్లు కాదు అసలు సృష్టి ప్రారంభం అయినప్పుడే కాపీ అనేది మొదలైంది. సృష్టికి ప్రతి సృష్టి చేయాలని విశ్వామిత్రుడు ప్రయత్నించాడు అంటే కాపీ అక్కడి నుంచే పతాక స్థాయికి వెళ్లినట్టు కదా? సరే మార్కెట్ శక్తులు సహకరించక పోవడం వల్ల విశ్వామిత్రుడి ప్రతి సృష్టి అంతగా విజయవంతం కాక త్రిశంకు స్వర్గంగా నిలిచిపోయింది. రాజకీయాల్లో సైతం కాపీ అనేది ప్రతిసారి ఉపయోగపడుతుందనే గ్యారంటీ లేదు. పార్టీ ఏర్పాటు, విధానాలు, పచ్చ రంగు, ప్రత్యేక వేదిక, సబ్సిడీ పథకాలు అన్నీ తమిళనాడు నుంచి కాపీ కొట్టుకొచ్చినా తెలుగునాడు పార్టీ బాగానే సక్సెస్ అయింది.

శ్రీకృష్ణుడి కాలంలోనూ ఈ కాపీ వ్యవహారం సాగింది. పౌండ్రక వాసుదేవుడు అచ్చం శ్రీకృష్ణుడిలా తయారై, వీధుల్లో తిరిగే వారట! ఈ పాత్ర విషయంలోనే ఎన్టీఆర్‌కు, ఎంఎస్‌రెడ్డికి గొడవ జరిగిందంటారు. ప్రచారంలో గోబెల్స్ మన నేతలకు మార్గదర్శకుడు. ఆయన విధానాలు కాపీ కొట్టినా గోబెల్స్ దిగివచ్చి ఈ ప్రచారం చూస్తే ఆయనే విస్తుపోయేంతగా అలా ముందుకు వెళుతున్నారు మన నేతలు.
అన్ని వేదాల్లోనే ఉన్నాయి  వేదాలనుంచే కాపి కొట్టేశారు అని ఆధునిక పరిజ్ఞానం పై కొందరి అభిప్రాయం 

11, అక్టోబర్ 2012, గురువారం

సంపాదన వన్.. టూ.. త్రీ!

‘ఒకరు లేక ఇద్దరు చాలు’ ఈ ప్రకటన చాలామందికి సుపరిచితం. రెండు మూడు దశాబ్దాల క్రితం -పిలకలేసుకున్న పిల్లల బొమ్మలతో వీధి గోడలమీదో, థియేటర్లలో స్లైడ్ షో మాదిరిగానో కనిపించేవి. కుటుంబ నియంత్రణ శాఖ హోరెత్తించే ఈ ప్రకటనలు రేడియో ప్రసారాల్లో, పత్రికా ప్రకటనల్లోనూ కనిపించేవి. ప్రకటనల మహత్యమో, బతుకుదెరువు ప్రాబ్లమో తెలీదు కానీ, ‘ఒంటికాయ సొంఠికొమ్ము’ స్టయిల్‌కు నానో కుటుంబాలు ఎప్పుడో అలవాటుపడ్డాయి. అందుకే -కుటుంబ నియంత్రణ శాఖ ప్రకటనలూ కనిపించకుండా పోయాయి. ‘సంతానం ఒక్కరే అయితే ఫరవాలేదు. సంపాదన మాత్రం రెండు మూడుండాలి’ అంటూ గ్లోబల్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చేస్తున్న సూచనలనే సరికొత్త పాఠంగా ఆచరించాల్సిన పరిస్థితి వచ్చింది. అవును -నిజం. లైఫ్‌లో ఒకింత ఫైనాన్స్ రిలాక్స్ ఉండాలంటే -ఒక సంపాదన సరిపోదు. రెండు సంపాదనలైతే మంచిది. మూడునాలుగైతే మరీ బెటర్. 

-‘మేం చేసేది బల్లకిందా పైనా చేతులు పెట్టి రెండుచేతులా సంపాదించే ఉద్యోగం కాదుగా? బహుళజాతి సంస్థలో ఐటి ఉద్యోగం’ అన్న అనుమానాలు చాలామందికి కలగొచ్చు. అలాంటి డౌట్లు ఎవరికి మందొస్తే, వాళ్లే ముందుగా కొన్ని సూత్రాలు పాటించాలి మరి. లేదంటే.. లైఫంతే! *** మూడు పదుల సీనియారిటీతో రిటైరయ్యే నాన్నకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం కంటే -పాతికేళ్ల వయసున్న కొడుకు మొదటి నెలలో సంపాదిస్తున్న జీతం ఎక్కువగా ఉంటున్న రోజులివి. సంపాదన బాగానే ఉంటుంది. మరి -ఆ సంపాదన ఎప్పుడూ అలాగే ఉండిపోతుందా? అంటే గెడ్డం కింద చేయి, మూతిమీద వేలు వేసుకుని ఆలోచించాల్సిన పరిస్థితి. ఒకవేళ ఆ జీతం తలకిందులైతే అన్న డౌటు మొదలైందనుకోండి, అప్పుడు స్టార్టవుతుంది అసలు టెన్షన్. -రష్యాలో వానపడితే మన కమ్యూనిస్టులకు జలుబు చేస్తుందంటూ గతంలో జోకులు వినిపించేవి. కానీ ఇప్పుడు -ఇరాక్‌పై అమెరికా దాడి చేస్తే దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఆ దెబ్బకు -హైటెక్ సిటీలో పని చేసుకునే అమలాపురం కుర్రాడు కొన్ని ఖర్చులను సర్దుకోవాల్సి వస్తుంది. ఏమంటే -‘కంపెనీ కాస్ట్ కటింగ్’ అంటాడు. తీవ్రత ఎక్కువై ఉద్యోగం ఊడితే -తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్లిపోవాల్సి రావచ్చు. ఈరోజుల్లో -ఈరోజు జీతం ఎంతైనా కావచ్చు. రేపటి జీతం, జీవితం రెండూ మన చేతుల్లో ఉండవు. అందుకే వారన్ బఫెట్ (ఆయనెవరూ అని అడిగితే మాత్రం మీరు చాలా సూత్రాలు చదువుకోవాల్సి ఉంటుంది) చెప్పిన మొదటి సూత్రం -ఒకే ఆదాయంపై ఆధారపడకు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే జీతంనుంచి సాధ్యమైనంత వరకు పొదుపు పెట్టుబడులు పెట్టాలిట. క్రమంగా జీతంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలట. 

నిజమే -ఉద్యోగం చేయడం వేరు. జీతంపై ఆధారపడటం వేరు. అందుకే -‘మన పెట్టుబడులు మన జీతాన్ని మించి ఆదాయాన్ని కల్పించే విధంగా వ్యూహం ఉండాలి’ అంటాడాయన. మనం చేసే పనికి లభించేది -జీతం. పెట్టుబడులపై లభించేది -అదనపు ఆదాయం. అంటే -రెండో సంతానం. ఒకవేళ కొంతకాలానికి ఉద్యోగంలో తేడావచ్చి జీతం తగ్గినా, రాకున్నా -బెదిరిపోవాల్సిన పనిలేకుండా అదనపు ఆదాయం మీద ఆధారపడొచ్చు అంటాడాయన. అచ్చంగా -ఇలాగే ఉండాలని లేదు. ఆయన చెప్పేదేమంటే -‘అవకాశాలను బట్టి ఒకటికిమించి ఆదాయాలను మనమే కల్పించుకోవాలి’ అని. ** ఇక -సంపాదించడమే కాదు, ఖర్చు పెట్టడమూ కళే! ‘అనవసర వస్తువులు కొనడం హాబీ చేసుకుంటే -అవసరమైన వస్తువులు అమ్ముకోవడం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది’ అన్నది బఫెట్ చేసే పెద్ద హెచ్చరిక. మార్కెట్‌లో ఏది కొత్తగా అనిపిస్తే అది కొనడం కొందరికి అలవాటుతో కూడిన హాబీ. ఆరంభంలోనే ఐదంకెల జీతాలు తీసుకుంటున్న కుర్రాకారు చాలామందిలో ఈ వ్యవసం కనిపిస్తోందన్న సర్వేలూ వెలువడుతున్నాయి. వస్తువు తప్పనిసరైతే కొనడంలో అర్థముంది. కానీ వ్యసనంగా కొనడం మొదలెడితే ఆర్థిక క్రమశిక్షణ లేక దెబ్బతింటారు. ఆఫీసులో పక్కవారి వద్ద కొత్త మొబైల్ చూసి, మనం ‘స్మార్ట్’్ఫన్ కొనడానికి పరుగులు తీయడం అవసరమా? ‘స్క్రీన్’ వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న హీరో రజనీకాంత్ వద్ద బేసిక్ మొబైల్ మాత్రమే ఉండటాన్ని ఓ సినీ జర్నలిస్టు గుర్తించాడట. అంతే, ఆశ్చర్యంగా ముఖం పెట్టి ‘అదేంటీ? మీరు ఇలాంటి ఫోన్ వాడుతున్నారు?’ అని ప్రశ్నించాడట. దానికి రజనీ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? -‘నేను మాట్లాడేందుకు, ఎదుటివారు మాట్లాడింది వినడానికి సెల్‌ఫోన్ వాడతాను. ఆ పనులకు ఇది బాగానే పని చేస్తుంది’ అని. గొప్పల కోసం వృధా ఖర్చులు అనవసరం అన్నది -జగమెరగాల్సిన సత్యం. *** పిల్లల చదువు కోసమో, వృద్ధాప్యంలో కష్టనివారణకో ఉద్యోగంలో చేరినప్పటి నుంచే పొదుపు చేయవచ్చు. వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల తరువాత కాలంలో మీరు మోసే భారాన్ని ఇప్పటి నుంచే సులభతరం చేసుకోవచ్చు. 

మీ జీతంలో కనీసం పదిశాతం పొదుపు క్రమానుగతి పెట్టుబడిపై పెట్టండి. కనీసం ఐదేళ్ళు అలా చేయాలి. ఐదేళ్ల కాలంలో మీకొక అవగాహన వస్తుంది. రిటర్స్న్ ఏమేరకు వస్తున్నాయో, రిస్క్ ఎంతవరకు తీసుకోవచ్చో తెలుస్తుంది. పెట్టుబడులు ఎలా ఉండాలి? అనే దానికి వారెన్ బఫెట్ ఓ చక్కని మాట చెప్పారు. పెద్ద పళ్లెంలో మొత్తం అన్నం మాత్రమే ఉంటే ఎలా ఉంటుంది. పళ్లెంలో అన్నీ ఉంటేనే చూడడానికి బాగుంటుంది. తినడానికి అంతకన్నా బాగుంటుంది. అంతే తప్ప ఒక్క అన్నం మాత్రమే ఉంటే ఏం లాభం. అలానే మీ పెట్టుబడుల్లో సైతం అన్ని రుచులు ఉండాలి. స్టాక్స్, బాండ్స్, నేషనల్ సేవింగ్స్ సర్ట్ఫికెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివన్నీ ఉండాలి. చివరగా బఫెట్ చెప్పిన మరో ముఖ్యమైన సూత్రం -ఎవరిపైనా ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దని. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకుంటే మరీమరీ దెబ్బతింటామని. నమ్మకాలు వద్దు, ఎదుటి వ్యక్తులపై అనుమానాలూ వద్దు. డబ్బును డబ్బుగానే చూడాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులూ ఉండవ్. ఇంకెందుకు ఆలస్యం? మరో మూడువారాల్లో ఎలాగూ జీతం అందుకోబోతున్నారు కదా! ముహూర్తాలు చూడకుండా, పొదుపు పెట్టుబడులు ప్రారంభించండి. ఆర్థిక సూత్రాలు విప్పిచెప్పిన బఫెట్ అంతటి వాళ్లం కాకపోయినా, బాగుపడతామని ఆశించడంలో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు.

10, అక్టోబర్ 2012, బుధవారం

అల్లుడు బంధం!

పాపం రాజకీయ నాయకులు. మన కాలికి ముల్లు గుచ్చుకుంటే వాళ్లు కన్నీళ్లు పెడతారు. మన కోసమే మనం ఆలోచించుకోలేని కాలంలో మీ కోసం అంటూ మన కోసం ఆలోచిస్తారు. నా కోసం ఏడవకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ఒక దేవుడంటే ఆ పని కూడా మేమే చేస్తాం, మా కోసం మీ కోసం మేమే ఏడుస్తామంటారు. రోడ్డుమీద హంటర్‌తో తమను తాను శిక్షించుకునే వాడ్ని చూసి జాలిపడి డబ్బులు రాలుస్తాం కానీ మన కోసం తమను తాము శిక్షించుకునే మన నాయకులను మాత్రం నమ్మం. పాపం వారికి ఇదేం శిక్ష? ఎందుకీ వివక్ష?


పండగ రోజు సగటు మధ్యతరగతి సుబ్బారావు ఇంటికి అల్లుడు అమ్మాయి వస్తే ఏం చేస్తారు. నెలఖరైనా అప్పు తెచ్చి మరీ కట్నం చదివించుకుంటారు కదా? అలా చేయపోతే ఏమంటారు. మర్యాద తెలియని వాళ్లు అని చీదరించుకోరూ..! మరి అదే పని మన నాయకులు చేస్తే ఏమంటున్నాం. తప్పు తప్పు అంటూ గగ్గోలు పెడుతున్నాం. ఇది న్యాయమా? ఎంత చెట్టుకు అంత గాలి ఎంత పెద్దింటి అల్లుడికి అంతటి చదివింపులు. గుమస్తా కుటుంబరావు ఆయన అల్లుడికి బల్లకింద చేయి పెట్టి సంపాదించిన వెయ్యి రూపాయలతో బట్టలు పెడితే, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దేశాన్ని వంటి చేత్తో తెర వెనక నుంచి పాలించేస్తున్న అత్తగారి అల్లుడు గారికి ఎలా మర్యాద చేయాలి. మర్యాద చేస్తే మనం ఇంతగా గొడవ చేయాలా? అందుకే రాజకీయ నాయకులను చూస్తే జాలేస్తుంది. కన్నకొడుకు బాగు కోసం ఒకరు, అల్లుడి కోసం మరొకరు, త్యాగాలు చేస్తుంటే మనం ఇంతగా ఆడిపోసుకోవాలా? ఇది న్యాయమా? ఇదేనా కుటుంబ విలువలకు మనం ఇచ్చే ప్రాధాన్యం? 

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అనే పాట వింటే అసలీ పాటే ఓ బూటకంఅనిపిస్తోంది. అనుబంధం అత్మీయత అంతా వాస్తవం అని కళ్ల ముందు కనిపిస్తుంటే బూటకం అని ఎలా పాడగలం? మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయని ఎవరన్నారు? తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోవడం లేదని, అల్లుళ్లకు అత్తవారింట్లో మర్యాద దక్కడం లేదని ఎవరన్నారు? ఓ సినిమాలో మంత్రిగా ఉన్న అత్తగారు అల్లుడికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తానంటుంది. ఆ డైలాగు విన్నప్పుడు అదెలా సాధ్యం అనిపించింది. ఎందుకంటే మంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లాను, సొంత శాఖను అల్లుడికి రాసివ్వడం సాధ్యమే కానీ మొత్తం రాష్ట్రాన్ని రాసివ్వడం ఎలా సాధ్యం. అది ముఖ్యమంత్రికో, ప్రధానమంత్రికో లేదా వీరిద్దరిని నడిపించే వాద్రా అత్తగారికో సాధ్యం అవుతుంది కానీ మంత్రికెలా సాధ్యం. ఏం అల్లుడికి ఆ మాత్రం స్వతంత్రం ఉండదా? అత్తగారింట్లో అల్లుడికి కాకపోతే ఇంకెవరికి స్వతంత్రం ఉంటుంది. సోనియాగాంధీ అల్లుడికి డిఎల్‌ఎఫ్ అనే సంస్థ వడ్డీ లేకుండా కొంచం తక్కువ 65 కోట్ల డబ్బు ఇచ్చింది. ఏం పావలా వడ్డీ, వడ్డీ లేని రుణం అంటూ అధికారంలో ఉన్న వాళ్లు సామాన్యులకు ఇచ్చినప్పుడు సోనియా అల్లుడికి డిఎల్‌ఎఫ్ ఇస్తే మనకేం నష్టం? ఆ రోజులే వేరు ఉమ్మడి కుటుంబాలు, బంధుమిత్రులతో కళకళలాడేవి, ఒకరినొకరు ఆదరించుకునే వారని, ఇప్పుడు కుటుంబం అంటే భార్యాభర్త, వారి సంతానం మాత్రమే అని వాపోతుంటారు. ఎవరైనా బంధువులను ఆదరిస్తే సహించరు. ఇంత పెద్ద దేశం కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అల్లుడికి 65 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తే తప్పా? తెల్లని దుస్తుల్లో రాముడు మంచి బాలుడు అన్నట్టు హుషారుగా కనిపించే వాద్రా వారికి నచ్చి ఉండొచ్చు. 

వాద్రాలో నేటి కాలానికి పనికి వచ్చే ఒక గొప్ప రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. వాద్రాకు డిఎల్‌ఎఫ్ 65 కోట్లు వడ్డీ లేని రుణం ఇచ్చిందని కెజ్రీవాల్ ఆరోపిస్తే, ఆయన చెప్పిన సమాధానం విన్నాక ఆయన రాజకీయాల్లోకి వచ్చి తీరుతాడని అనిపించడం లేదూ! అసలు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చట్టంపై నాకు విశ్వాసం ఉంది, ప్రజలపై నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థను నేను ప్రేమిస్తాను. అంటూ సమాధానం చెప్పాడంటే అతను కచ్చితంగా కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడే అయి ఉంటాడు. ఇంకా రాజకీయ ఆరంగ్రేటం చేయకముందే వాద్రా ఇంత చక్కని రాజకీయ ప్రకటనలు చేస్తున్నారంటే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక ఇంకెంతగా రాణిస్తారో?


వాద్రా ఇంకా అనుమానం వద్దు రాజకీయాల్లోకి దూకేయ్! కెజ్రీవాల్‌కు డిపాజిట్ కూడా రాదు కానీ మీరు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. వాద్రాకే కాదు అసలు అల్లుళ్లకే కాలం అచ్చిరావడం లేదు. మామ గారు ఊరూరు తిరిగి కష్టపడి సంపాదించుకున్న సైకిల్‌ను అల్లుడు ఎత్తు కెళ్లాడు. ఏం అల్లుడికి ఆ మాత్రం స్వతంత్రం లేదా? అంతోటి దానికి వెన్నుపోటు అనే ముద్ర వేసి మానసికంగా హింసించడం న్యాయమా? నందమూరి వంశ సంప్రదాయం ప్రకారం అల్లుడికే అధికారం దక్కాలని అల్లుడిగారి అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ ఆశిస్తుంటే, కాదు మా అల్లుడికే అధికారం అని బాలయ్య చెప్పకనే చెబుతున్నారు. అల్లుడి నుంచి పోటీ రాకముందే రాజశేఖర్‌రెడ్డి శకం ముగిసింది. జైలు నుంచి ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తానని కొడుకు చెబుతుంటే అల్లుడేమో దేశ దేశాలు తిరిగి ప్రజలను దీవించేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల్లోనూ అల్లుళ్లకు అన్యాయం జరుగుతోంది. తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్నాను, కరుణించి మరోసారి అధికారం ఇవ్వండి అంటూ అల్లుడు గారు సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. మామకు వయసు మీద పడింది, ఇంత కాలం కష్టపడి అలిసిపోయారు, ఇక నేను కష్టపడతాను అని కెసిఆర్ అల్లుడు సిద్ధంగా ఉన్నా, కాలం కలిసి రావడం లేదు. అల్లుడికి పోటీగా కొడుకు క్యూలో నిలిచారు. అందరూ ఒక్క అల్లుడితో తంటాలు పడితే ఎన్టీఆర్ రాజకీయ జీవితం మొత్తం ఇద్దరు అల్లుళ్ల మధ్య నలిగిపోయింది. నెహ్రూకు సైతం అల్లుడి దెబ్బ తప్పలేదు. పార్లమెంటులో అల్లుడు నిత్యం నెహ్రూ విధానాలపై నిప్పులు చెరిగే వారట!

3, అక్టోబర్ 2012, బుధవారం

రాజకీయ జీవుల జీవ వైవిధ్యం...కాంగ్రెస్‌ను మించిన జీవ వైవిధ్యం ప్రపంచంలో లేదు .

ఒక చేతితో తమ కన్నబిడ్డలను టెక్నో స్కూల్‌లో చేర్పించడానికి అప్లికేషన్ ఫారంను మరో చేత్తే తమను కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించడానికి దరఖాస్తు తీసుకుని ఇంటికి బయలు దేరిన సగటు మధ్యతరగతి జీవికి జీవితానికి మించిన జీవ వైవిధ్యం ఏముంటుంది. కళ్లు తెరిచి, మనసు పెట్టి చూస్తూ మన జీవితమే పెద్ద జీవ వైవిధ్యం కాదా?
ఐశ్వర్యారాయ్‌ను మోహించి తల్లిదండ్రులు చూపించిన అమ్మాయితో అడ్జస్ట్ అవుతూ నువ్వే నా పాలిట ఐశ్వర్యారాయ్‌వి అని అతను, నువ్వే నా కలల రాకుమారుడు హృతిక్ రోషన్‌వు అని ఆమె ఒకరికొరకు పైకి చెబుతూ, పైన సంతృప్తి, లోన అసంతృప్తితో జీవించడం జీవన వైవిధ్యమే.!
***

మానవ జీవితంలో పిట్టలు, పక్షులు, జంతువులు అన్నింటికి భాగస్వామ్యం ఉండాలని చెప్పడానికి శత్రు దుర్భేద్యమైన కోటలో సదస్సు నిర్వహించారు. రాజధాని నగరంలో జూబ్లీ హీల్స్ దాటిన తరువాత కొంత దూరం వెళ్లాక అనుమతి లేనిదే చీమలు కూడా దూరని ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య జీవ వైవిధ్య సదస్సు నిర్వహించడం మన వ్యవస్థలోని జీవన వైవిధ్యం. చెట్లు కొట్టేసి, పురుగు పుట్రను ఖాళీ చేయించి అద్భుమైన భవనాలు నిర్మించి వందల కోట్లు ఖర్చు చేసి జీవులను రక్షించాలని సదస్సు నిర్వహించడం కూడా జీవన వైవిధ్యమే.
***

ఐదేళ్లకోసారి అధికారంలోని పార్టీని మర్చేయాలని ఐదేళ్లపాటు ఎదురు చూసే మధ్యతరగతి జీవితాన్ని మించిన జీవన వైవిధ్యం ఎక్కడ కనిపిస్తుంది. సినిమా తారల జీవితంలోని వైవిధ్యం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగే రోజుల్లో వాణిశ్రీ తానేమిటో తానే మరిచిపోయానని చెప్పుకున్నారు. పూర్తిగా పాత్రల్లో లీనమై పోతూ తనను తాను మరిచిపోయానన్నారు. శ్రీరాముడు, రిక్షా రాముడు, డ్రైవర్ రాముడు ఒకదానికొకటి సంబంధం లేదు కానీ ఎన్టీఆర్ అన్నింటిలోనూ లీనమైనటించారు. శ్రీరాముడు అంటే ఇలానే ఉండేవారేమో అనుకున్నారు. రిక్షా రామున్ని చూసి రిక్షా తొక్కేవాళ్లంతా ఇలానే ఉంటారనుకున్నారు. రిక్షావాడు మరోలా కనిపిస్తే నమ్మబుద్ధి అయ్యేది కాదు. వీడెవడో దొంగోడేమో రిక్షా వాడు రిక్షారాముడిలో ఎన్టీఆర్‌లా ఉండాలి కదా? అనిపించేది. పాపం ఆయన అన్ని పాత్రల్లో నటించి చివరకు వాస్తవాలను గ్రహించలేక ఎదుటి వారి నటనను గుర్తుపట్టలేక జీవిత చరమాంకంలో ఘోరంగా దెబ్బతిన్నారు. ఎన్టీఆర్ జీవితం నటనలో జీవించే వాళ్లు ఎదుటివారి నటనను గ్రహించలేరు అనే జీవిత పాఠం నేర్పించింది.

 పాత్రవేరు నువ్వు వేరు అని తెలిసేప్పటికీ పుణ్యకాలం తీరిపోతుంది. శ్రీదేవి, జయప్రద, జయసుధ, డ్రీమ్‌గర్ల్ హేమామాలినికి వారి వారి కాలాల్లో కుర్ర కారు ఆ పేర్లు వింటేనే పడి చచ్చేవాళ్లు. వీళ్లను పెళ్లిచేసుకుందామనే ఆశ ఉన్నా అవకాశం లేదని తెలిసి అలాంటి అందగత్తెలనే పెళ్లి చేసుకుంటామని భీష్మించుకునే వాళ్లు. కొన్ని లక్షల మంది కుర్ర కారు హృదయాలను దోచిన ఇంత అంతగత్తెలకు పెళ్లి కోసం పెళ్లికాని యువకులు దొరక్కపోవడం ఆ దేవుడు చూపించిన జీవన వైవిధ్యమేమో! అంత అందగత్తెలైనా వాళ్లంతా అప్పటికే పెళ్లయి పెద్దపెద్ద పిల్లలు ఉన్న మగాళ్లకు రెండో భార్యలుగా ఉండాల్సి వచ్చింది.హేమామాలినికి పెళ్లికాని యువకుడు దొరక్కపోవడం ఏమిటో? శ్రీదేవి వయసు పిల్లలున్న బోనీ కపూర్‌కు శ్రీదేవి భార్య కావడం ఏమిటో?
***

ఏదో నిధులున్నాయని ఇప్పుడు జీవ వైవిధ్యం అంటూ పాశ్చాత్యులు హడావుడి చేస్తున్నారు కానీ మన దేవుళ్లు జీవ వైవిధ్యాన్ని ఎప్పుడో గ్రహించారు. చాలా మంది దేవుళ్లకు పశుపక్షలు వాహనాలుగా ఉండేవి. తొలి పూజలందుకునే గణపతికి ఏకంగా ఏనుగు ముఖం ఉంది కదా? జీవ జాలం తోడుగా ఉండడం కాదు తమలో భాగం అని దేవతలు నిరూపించారు. మారీచుడు బంగారు జింకగా మారినా? రాక్షసులు పక్షులుగా మారినా జీవ వైవిధ్యమే. దేవతల తరువాత జీవ వైవిధ్యం ప్రాధాన్యతను తెలుగునాట సినిమా రంగంలో ఎక్కువగా గుర్తించింది విఠలాచార్య. హీరోలు, హీరోయిన్ల కన్నా ఆయన సినిమాలో పశుపక్షులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. వాటితో విసిగిపోతే ఆయన దెయ్యాలను నమ్ముకున్నారు, కానీ జీవ వైవిధ్యన్ని వదులుకోలేదు.
***

వీరందరి కన్నా జీవ వైవిధ్యన్నా తమ జీవితంలో భాగంగా చేసుకున్నది మాత్రం కచ్చితంగా రాజకీయ నాయకులే. కోట్లు సంపాదించి ఆదాయం పన్ను కట్టమంటే నా దగ్గరేముంది బూడిద అని అంటారో నేత. అప్పుడే వివేకానంద రూపంలో కనిపించి ఆ వెంటనే మినాక్షి శేషాద్రితో శృంగార పాటలు, కాషాయ రూపం పక్కన పారేసి వృద్ధాప్యంలో వివాహం ఇదే కదా! జీవన వైవిధ్యం. తరువాత కాషాయ దస్తులను ఎర్ర రంగులో ముంచడం ఇదే కదా జీవన వైవిధ్యం. ఊసరవెల్లి ప్రమాదంలో పడినప్పుడు మాత్రమే రంగులు మారుస్తుంది కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్లు క్షణ క్షణం జీవన వైవిధ్యం చూపకపోతే ఔట్ డేటెడ్ నాయకులవుతారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం అనాలి, సీట్లు పెరిగే చాన్సుంటే ఆ వెంటనే రాష్ట్ర విభజన కోసం నడుం బిగించాలి.
ప్రపంచ దేశాలు భారత దేశాన్ని జీవ వైవిధ్య రాజధానిగా ప్రకటించేశాయి. ఏ ఉద్దేశంతో చేసినా వారు చాలా సరైన పనే చేశారనిపిస్తోంది. విదేశీ పాలనకు వ్యతిరేకంగా వందల ఏళ్లపాటు పోరాడిన చరిత్ర ఉన్న ఈ దేశీయులు ఇటలీ వనితికు దశాబ్దాల నుంచి పట్టం కట్టడానికి మించిన జీవన వైవిధ్యం ప్రపంచంలో ఇంకెక్కడుంటుంది. ఆమె నోరుమెదపరు. కానీ కనుసన్నల్లోనే దేశాన్ని పాలిస్తున్నారు. కాంగ్రెస్‌ను మించిన జీవ వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. అధికారపక్షం, ప్రతిపక్షం, అభిమాన పక్షం, వెన్నుపోటు పక్షం, గోతులు తీసే పక్షం, నీతులు చెప్పే పక్షం అన్నీ అందులోనే ఉంటాయి.

26, సెప్టెంబర్ 2012, బుధవారం

తెలుగు జాతీయ గీతం... ఓలమ్మీ తిక్కరేగిందా..!

హాలంతా కేరింతలతో, విజిల్స్‌తో ఊగిపోతోంది. వారి ఆనందాన్ని చూసి తెలుగు నాయకుడి కళ్లు చెమ్మగిల్లాయి. వారిలో ఇంతటి ఉత్సాహాన్ని చూడడం అదే మొదటి సారి. ఆనందంతో గొంతు బొంగురు పోయింది. ఈలోపు పాట అయిపోయింది. నాయకులంతా వన్స్‌మోర్ ... వన్స్‌మోర్ అని అరవసాగారు. తెలుగునేత తల ఊపడంతో పాట మళ్లీ వినిపించారు. ఓలమీ తిక్కరేగిందా.... ఒళ్లంతా తిమ్మిరెక్కిందా? మైకులో పాట పెద్దగా వినిపిస్తోంది. పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఒక్క హిట్టు కూడా లేక చతికిలపడిపోవడంతో సినిమా శ్రేయోభిలాషులు కొందరు ఇచ్చిన సలహా మేరకు తెలుగునేత హిట్ చిత్రాల దర్శకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

 ఒక్కో దృశ్యం రక్తి కట్టడానికి ఏంతో కృషి చేసే దర్శకులు పడిపోయిన పార్టీ పైకి లేవాలంటే పవర్ ఫుల్ సీన్స్ ఉండాలని సూచించారు. ఒకదాని తరువాత ఒకటి అమలు చేయాలని నిర్ణయించారు. మొదటగా సమావేశాల ప్రారంభ సూచనగా ఒలమీ తిక్కరేగిందా? ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా? పాటను వినిపించాలని నిర్ణయించారు. ఆ పాటకు నాయకులంతా ఊగిపోతున్నారు. రాష్టమ్రంతా మీలానే చైతన్యంతో రగిలిపోవడానికి మనం అధికారంలోకి రాగానే ఒలమీ తిక్కరేగిందా? పాటను తెలుగు జాతీయ గీతం చేస్తామని ప్రకటిస్తున్నాను అని తెలుగు నేత చెప్పగానే అంతా చప్పట్లతో ఆమోదం తెలిపారు. 

సార్ రగులుతుంది మొగలి పొద పాటను రెండవ తెలుగు జాతీయ గీతంగా ప్రకటించండి.సామాజిక న్యాయాన్ని పాటించినట్టు  అవుతుంది  అని సినిమా రాజ్యం పార్టీలోకి వెళ్లి వెనక్కి వచ్చిన సీనియర్ నాయకుడొకరు సూచించాడు. అతని సలహాను ఎవరూ పట్టించుకోలేదు. పక్కనున్న నేత సానుభూతిగా సినిమా రాజ్యం నేతకు ఇవ్వాల్సిన సలహాలు తెలుగు నేతకు ఇస్తున్నావు.ఇలా చేస్తే  నీకు భవిష్యత్తు ఉండదు అని మెల్లగా చెవిలో చెప్పారు. 

హాలులో  రాజ మౌళి ని చూసి తెలుగు పార్టీ నేత ఒకరు ఈగను హీరోను చేసిన దర్శకుడు మా నేతను హీరో ను చేస్తాడు చేసి తీరుతాడు అని ధీమాగా పక్కనున్న నేతతో చెప్పాడు.
 గడ్డం రాఘవేంద్రరావు వెనక అతని సహాయకులు ఆపిల్ పళ్లు, బత్తాయి పళ్ల బుట్టలు పట్టుకుని కూర్చున్నారు. రాఘవేంద్రరావు ఉత్సాహాన్ని ఆపుకోలేక బత్తాయి పళ్ల బుట్టను తీసుకుని ఆడవారివైపు చూడగానే విషయాన్ని గ్రహించిన పుసపాటి రాజావారు కొంప తీశారండి 

మీ కళా ప్రదర్శన  ఇక్కడొద్దు అని అడ్డుకున్నారు. 


 దర్శకుల వైపు తెలుగునేత కృతజ్ఞతా పూర్వకంగా చూసి సరే ఇక త్వరలో చేపట్టే అధికార ప్రాప్తి పాదయాత్ర గురించి మీ మీ అభిప్రాయాలు చెప్పండి అని అడిగారు. ఒక్కోక్కరు వంద రోజుల సినిమా తీసిన హిట్ దర్శకులు అలాంటిది డజను మంది హిట్ దర్శకులు రాసిచ్చిన సీన్స్‌తో ప్రారంభించే పాదయాత్ర సూపర్ హిట్టయి తీరుతుందని తెలుగునేత గట్టి విశ్వాసంతో ఉన్నాడు. పాదయాత్ర హిట్టు కావాలంటే కామెడీ ట్రాక్ బాగుండాలని శ్రీనువైట్ల మరీ మరీ చెప్పాడు.

****
పాదయాత్ర ప్రారంభమైంది... తెలుగు నేత ఎండకు, చలికి, వర్షానికి, తుఫానుకు భయపడకుండా పాదయాత్ర ప్రారంభించారు అంటూ చానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. 

యాత్ర సాగుతుండగా, వికలాంగుల గుంపు వచ్చింది. అన్నయ్యా మీరు రాజకీయాల్లోకి రావాలి అని ఒక వికలాంగుడు తెలుగు నేత కాళ్లపై పడ్డాడు. అతన్ని పక్కకి తీసుకెళ్లి ఏరా ఠాగూర్ సినిమా డైలాగు ఇంకా మరిచిపోలేదా? రాజకీయాల్లోకి రావడం ఏమిటి? వచ్చి నాలుగు దశాబ్దాలవుతుంది.

భవిష్యత్తు ఏమిటా ? అని దశాబ్ధం నుంచి కలవరపడుతున్నాడు . 

 అని తిట్టారు.

 డైలాగు సరి చేసుకుని ఆ బృందం మళ్లీ వచ్చింది. అన్నయ్యా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేం కాళ్లు లేకున్నా పరిగెత్తే వాళ్లం. ఇప్పుడు ట్రై సైకిల్ ఉన్నా ముందుకెళ్లడం లేదన్నా నువ్వు అధికారంలోకి రావాలి అని ఏడ్చాడు. అన్నయ్య నా భుజంపై చేయి వేయగానే నాకు కళ్లు వచ్చాయి అని మరో వికలాంగుడు సంతోషంగా గెంతులేశాడు.
అన్నయ్యా మేం ఐటి ఉద్యోగులం ... చెయ్యోళ్ల ప్రభుత్వంలో మా నాన్న ఐఎఎస్ 
పాసై  నిరుద్యోగిగా దుర్భరమైన జీవితం గడిపాడు.

 నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నేను మా అమ్మకడుపులో ఉండగానే ఐటి కంపెనీ నుంచి నాకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మా తమ్ముడు ఐఐటి చదివినా పాన్‌షాప్‌లో కూడా ఉద్యోగం దొరకడం లేదు. మళ్లీ నువ్వు రావాలన్నా రావాలి అంటూ కంటనీరు పెట్టుకున్నాడు.

రైతుల బృందం వచ్చి మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి మాకు ఎరువులు, విత్తనాలు, కరెంటు అవసరమే పడలేదు. ఇప్పుడు వాటి కోసం క్యూలో నిల్చుంటే లాఠీచార్జీలు అంటూ భోరుమన్నారు. దృశ్యాలన్నీ తాము అనుకున్నట్టుగానే వస్తుండడంతో దర్శకులు సంతోషించారు. తెలుగునేత మాత్రం మనసులో... లక్ష కోట్లు సంపాదించిన నేత అధికారం నాదే అని ధీమాగా జైలులో విశ్రాంతి తీసుకుంటుంటే, నేనేమో రోడ్డున పడి నడుస్తున్నా గిట్టుబాటు అవుతుందా? అని అనుకున్నారు. దర్శకులు మనసు పెట్టి రాసిన సీన్లు ,జూనియర్ ఆర్టిస్తులంతా తలపండిన వారు కావడం వల్ల సీన్స్ బాగా వచ్చాయని అంతా అనుకున్నారు .
 యాత్రలో అవి బాగా పండి, రజనీకాంత్ సినిమాలను మించిన ప్రచారం జరిగింది. యాత్ర ముగిసింది. ఎన్నికలు వచ్చాయి. జనం తండోప తండాలుగా పోలింగ్ బూత్ లకు  తరలి వచ్చారు .
***
 అర్ధరాత్రి వరకు మీటింగ్‌లంటూ తిరిగి బారెడు పొద్దెక్కినా మంచం మీది నుంచి లేచేది లేదు అంటూ భార్య దుమ్ము దులపడంతో తెలుగు కార్యకర్త ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు. బంగారం లాంటి కల పాడు చేశావు ఇంతకూ కౌంటింగ్‌లో ఏం జరిగిందో అని మదనపడ్డాడు. ఔను కౌంటింగ్‌లో ఏం జరిగింది!తెలియాలంటే 
 2014 వరకు వేచి చూడాల్సిందే కదా!

19, సెప్టెంబర్ 2012, బుధవారం

సరసమైన ధరకు కిడ్నాప్ చేయబడును!

‘‘బాబూ కాస్త ఈ వస్తువులకు మొత్తం ధర ఎంతవుతుందో చెబుతావా?’’ అంటూ గంగాధర్ వినయంగా అడిగాడు. షాపతను లిస్ట్ చూసి జాబితా పైకే చదివాడు. పనె్నండు పెద్దవి పాత ఇనుప డ్రమ్ములు, ఆరు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములు, రెండు ట్రంకు పెట్టెలు, 43 కార్టూన్ డబ్బాలు, 10 మీటర్ల పొడవైన ఆరు ఇనుప గొలుసులు, 20 మీటర్ల ఐదు తాళ్లు, పెద్ద సైజు వీల్ చైరు, రెండు నల్లపిల్లులు, ఒక పులి చర్మం, ఒక జింక తల, అరడజను గబ్బిలాలు, ఐదారు సాలెపురుగులు, ఇంకా.....
షాపతను అంతటితో చదవడం ఆపేసి గంగాధర్‌ను చూసి బాబూ కొత్తలా ఉన్నట్టుంది అని లిస్ట్‌ను గంగాధర్ చేతిలో పెట్టాడు. ఒకపని చేయ్ ఇవన్నీ ఒకే చోట నీకు దొరకాలంటే జుమ్మేరాత్ బజార్ వెళ్లు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వరకు అన్నీ అమ్ముతారక్కడ. ఉస్మానియా ఆస్పత్రి నుంచి అలానే ముందుకెళ్లు. ఆయనెవరో పార్టీ ఉత్సవంలో లొట్టిపిట్టలను కూడా ఉపయోగించాడు వెరైటీగా అలానే జుమ్మేరాత్ బజార్‌లో చిత్రమైన పక్షులు కూడా దొరుకుతాయి వాటిని కూడా కొనుక్కో అని షాపతను సలహా ఇచ్చాడు. మీ సహాయాన్ని ఈ జన్మలో మరిచిపోలేను. నా డెన్‌కు మీ పేరే పెట్టుకుంటాను. మీ పేరేమిటి ? అని అడిగాడు. గుప్తదానాల్లా మనలాంటి వారి సేవ రహస్యంగానే ఉండాలి అన్నాడు.


జుమ్మేరాత్ బజార్‌ను చూడగానే గంగాధర్ కళ్లు తిరిగాయి. రెండు నెలల క్రితం ఎవరో ఎత్తుకెళ్లిన తమ ఇంట్లో పిల్లల సైకిల్ అక్కడ కనిపించగానే ఆశ్చర్యపోయాడు. ఈ సైకిల్ నాది అంటూ దానిపై చేయి వేశాడు. దాన్ని అమ్ముతున్న అతను ఉర్దూలో చాలా సేపు ఏదో చెప్పాడు. జారే... పాగల్... జా అనే ఒక్క మాట కాస్త వినబడింది అంతకు మించి ఏమీ అర్ధం కాలేదు. 

గంగాధర్ ఈ మార్కెట్‌కు కొత్త అని గ్రహించిన సాటి తెలుగు వాడు ఓదారుస్తూ బాబూ నీ పేరేమిటో వాడు నిన్ను తిడుతూ కొన్ని జీవిత సత్యాలను బోధించాడు, వాటిని తెలుగులోకి అనువదిస్తే, నదులన్నీ సముద్రంలోనే కలిసినట్టు ఎవరి వస్తువైన ఇక్కడికే చేరుకుంటుంది. ఏదీ ఎవరికీ చెందదు. ఏదీ శాశ్వతం కాదు ఒకనాడు నీది అనుకున్నది ఈ షాపువాడిదవుతుంది ’’ ఇది జుమ్మేరాత్ బజార్ సారం. అని అర్ధం చెప్పాడా సాటి తెలుగు వ్యక్తి.

 ‘‘పేర్లు మారుతుంటాయి కానీ ఇలాంటి జుమ్మేరాత్ బజార్‌లో అన్ని చోట్లు ఉంటాయి. వీళ్లకు వైద్యశాస్త్రంలో ప్రవేశం లేదు కానీ అందులోనూ వీళ్లు ప్రవేశించి ఉంటే నీ శరీరంలోని అవయవాలను కూడా కొట్టేసి నీకే అమ్మేయగలరు. నీకు కావలసింది కొనుక్కో అంతే కానీ కనిపించిన దానిపై వ్యామోహం పెంచుకోకు అంటూ ఆ తెలుగు వ్యక్తి తనకు కావలసినవి చూసుకోవడంలో పడిపోయాడు. జుమ్మేరాత్ బజార్ మొత్తం తిరిగి తనకు కావలసినవన్నీ కొనుక్కుని లారీలో వేసుకుని గంగాధర్ బయలు దేరాడు.
అచ్చం తెలుగు సినిమాలో మాదిరిగానే డెన్‌ను ముస్తాబు చేశారు. అడ్డా మీదకు వెళ్లి పది మంది కూలీలను పిలుచుకొచ్చాడు. వీల్ చెయిర్‌పై కూర్చున్న గంగాధర్ పిల్లి తలపై నిమురుతున్న చేతులు, వీపువైపు మాత్రమే కనిపిస్తోంది. అయ్యా అంటూ కూలీలు చేతులు కట్టుకున్నారు. ఏదో తేడా ఉందనుకున్న గంగాధర్ ఒక్క క్షణం ఆలోచించి చందన బ్రదర్స్‌కు పరిగెత్తుకెళ్లి... పది రెడీమేడ్ డ్రెస్‌లు కొన్నాడు. అంతే స్పీడ్‌గా తిరిగి వచ్చి, ఇదిగో ఈ డ్రెస్‌లు వేసుకోండి. అయ్యా కాదు బాస్ అని పిలవాలని వారికి డెన్‌కు సంబంధించి స్వల్పకాలిక కోర్సు నిర్వహించాడు. శిక్షణ సంతృప్తికరంగా సాగిందనుకున్న తరువాత ట్రయల్ రన్ చేయాలనుకున్నారు. డెన్ ప్రారంభోత్సవానికి ఐపిఎస్ అధికారి లక్ష్మయ్యను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు.


 పాత డ్రమ్ములను కాలితో దోర్లించి డెన్ ప్రారంభం అయినట్టు లక్ష్మయ్య ప్రకటించారు. ఆ వెంటనే లక్ష్మయ్యను కిడ్నాప్ చేస్తున్నట్టు గంగాధర్ ప్రకటించాడు. తెలుగును అధికార భాషగా అమలు చేయాలి, అసెంబ్లీ సమావేశాలు నెలకు పది రోజుల పాటు నిర్వహించాలి. కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టమైన తెలుగు మాట్లాడాలి. బాబు ఉపన్యాసం గంట కన్నా ఎక్కువ ఉండవద్దు. జగన్ ఓదార్చడం మానుకోవాలి వంటి కొన్ని డిమాండ్లతో ఐపిఎస్ అధికారిని కిడ్నాప్ చేసినట్టు తన ఫోటోతో పాటు గంగాధర్ మీడియాకు లేఖ పంపించాడు. ఇవేం డిమాండ్స్ అని అసిస్టెంట్స్ నవ్వారు. అవి పైకి కనిపించేవి, తెర వెనుక మన డిమాండ్లు వేరుగా ఉంటాయి అవి సంబంధిత వ్యక్తులకు మాత్రమే చెప్పాలి ఇది వృత్తి రహస్యం అని నవ్వాడు. అమెరికా అధ్యక్షుడి దేశ పర్యటన, భారత ప్రధాని విలేఖరుల సమావేశాలను పక్కకు తోసేసి ఆ రోజంతా చానల్స్‌లో గంగాధర్ జీవిత విశేషాలనే వివరించసాగారు. మొత్తం తెలుగు ప్రపంచంలో గంగాధర్ పేరు మారుమ్రోగింది. ఉదయం జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హోంమంత్రి, కిడ్నాపర్ గంగాధర్ మాట్లాడారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని, ఇలా స్పందించే ప్రభుత్వం ఉండడం రాష్ట్రం చేసుకున్న అదృష్టం అని గంగాధర్ చెప్పాడు. గంగాధర్ లాంటి వారు ప్రశంసించే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతుందని హోంమంత్రి సగర్వంగా ప్రకటించారు. గంగాధర్ ఇంటర్వ్యూ కోసం టీవి చానల్స్ వాళ్లు పోటీ పడ్డారు. ఒకరిద్దరు సినిమా నిర్మాతలు ఫోన్ చేస్తే గంగాధర్ సున్నితంగా తిరస్కరించారు.తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో గంగాధర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేశాడు. ఎలాంటి సమస్యకైనా కిడ్నాప్ ద్వారా సరసమైన ధరలకు పరిష్కారం చూపబడును. మీరు చెల్లించే అడ్వాన్స్‌కు బ్యాంకు గ్యారంటీ ఇవ్వబడును. అని గంగాధర్ పత్రికల్లో ప్రకటన ఇచ్చాడు.
ముక్తాయింపు: ఇది వ్యంగ్యం కాదు న్యూస్ అంటారా? సరే మీ ఇష్టం.

12, సెప్టెంబర్ 2012, బుధవారం

నారా లోకేష్ తొలి రాజకీయ ప్రకటన -- అక్షర సత్యం




కాంగ్రెస్స్ ను ఎదుర్కొనే సత్తా  మాకే ఉంది ..చిత్తూరులో నారా లోకేష్ ( చంద్రబాబు కుమారుడు )

- రాజకీయాలకు కొత్త అయినా , ఏ ఉద్దేశం తో చెప్పినా బాగా చెప్పావు లోకేష్ .. తెలంగాణాలో  తెరాస , సీమంద్రలో  జగన్ మొదటి స్థానం లో నిలుస్తారని సర్వేలు చెబుతున్నాయి . రెండవ  స్థానం కోసం  కాంగ్రెస్స్ తో పోటీ పడే  సత్తా మీకే ఉంటుంది .

యువతాతల మేధోమథనం

కార్లు పుట్టిన కొత్తలో ఇండియాకు వచ్చిన కారులా ఉన్న కారు కనిపించగానే అంతా అటువైపు ఆసక్తిగా చూస్తున్నారు.  కారును మించి పాతగా కనిపిస్తున్న ఒక వృద్ధుడు కారులోంచి దిగి. బాబూ ఇక్కడ యూత్ కాంగ్రెస్ మీటింగ్ జరుగుతుందట ఎక్కడా? అని అడిగాడు. అదిగో అక్కడున్న జూబ్లీ హాలులో తాతయ్యా! అని అటువైపు చూపించాడు. అయినా ఈ వయసులో యూత్ కాంగ్రెస్‌తో మీకేం పని తాతయ్యా అంటూ నవ్వాడా? యువకుడు. 

1952లో యూత్ కాంగ్రెస్‌లో ఉన్న యూత్‌ను రాష్ట్ర రాజకీయాలపై మేధోమథనం జరపడానికి హనుమంతరావు అనే యువకుడు పిలిచాడు బాబు అని నెమ్మదిగా చెప్పాడు ఆ వృద్ధుడు. వాడు చీమిడి ముక్కుతో చెడ్డి కూడా సరిగా వేసుకోకుండా స్కూల్ ఎగ్గొట్టి సినిమా హాళ్ల చుట్టూ తిరిగే వాడు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు. కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది. చీమిడి ముక్కు పోరగాడు ఇంత పెద్ద రాష్ట్రానికి అంత పెద్ద పదవి చేపట్టే యువకుడయ్యాడంటే సంతోషమే కదా? బాబు...అనుకుంటూ జూబ్లీ హాల్‌వైపు వెళ్లాడా! వృద్ధుడు.

అప్పటికే అక్కడికి రెండు వందల మంది వరకు వృద్ధులు చేరారు. అతన్ని చూడగానే ఓరి...ఓరి.. వీరిగా నిన్ను చూసి ఎన్నాళయిందా? ఇంత కాలం ఎక్కడున్నావు... పిల్లలేం చేస్తున్నారు? అంటూ మరో వృద్ధుడు ఆప్యాయంగా భుజంపై చేయి వేసి ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎవరూ.. క్షమించాలి బాబు గుర్తు పట్టకలేకపోతున్నాను అని వృద్ధుడు అద్దాలను సరి చేసుకున్నాడు. నేనురా యూత్ కాంగ్రెస్‌లో మనమిద్దరం క్యాంపుల కెళ్లినప్పుడు గోడలు దూకి నానా అల్లరి చేసేవాళ్లం పండరిని అని కొత్త వృద్ధుడు చెప్పాడు. ఓరి పండరిగా నువ్వారా! నువ్వు పోయావన్నారు ? ఇంకా పోలేదా? అని అడిగాడు. రెండు సార్లు గుండెపోటు వచ్చింది పోయింది నేను కాదు మన బ్యాచ్‌లో కర్రిగాడు ఉండేవాడు కదా? వాడు పోయాడు అని చెప్పాడు. మన హనిమిగాడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడట కదా! రమ్మని లేఖ పంపాడు అందరినీ చూసినట్టు ఉంటుంది అని వచ్చాను అని వీరిగాడు అనబడే ఆ వృద్ధ వీరేశం చెప్పుకుపోతున్నాడు.

 హనిమి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాదురా! వాడి మనవడికి కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వయసు దాటి పోయింది. ఐనా అదేం చిత్రమో రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ అంటే ఇప్పటికీ మన హనుమంతే గుర్తుకొస్తాడు అని పండరి గర్వంగా చెప్పుకొచ్చాడు. ఓహో అలాగా! భడవ మంచి పని చేశాడురా! ఖండ ఖండాల్లో ఉన్న మనమంతా కనీసం ఈ విధంగానైనా కలుసుకున్నాం అన్నాడు వీరి.
వీరు మాట్లాడుకుంటుండగానే చిరంజీవి వచ్చాడు. ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు. అక్కడున్న వృద్దుల్లో ఒక్కరికీ చిరంజీవి తెలియదు, చిరంజీవికి ఒక్కరూ తెలియదు. దాంతో ఆయన పెద్దలను గౌరవించుకుంటూ ఒక పక్కకు వెళ్లి కూర్చున్నాడు.
***

వృద్ధులంతా గుంపులు గుంపులుగా చేరి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఆ గ్రూప్ డిస్కషన్ సారాంశం ఇలా ఉంది.
‘‘బైపాస్ సర్జరీ జరిగింది ఇప్పుడు పరవా లేదు.
రోజుకు అరగంట నడువు చాలు నీ రోగాలన్నీ కనిపించకుండా పోతాయి.
కీళ్ల నొప్పులు, కళ్లు సరిగా కనిపించవు, చెవులు వినిపించవు. మతిమరుపు పెరిగింది.
ఈ ముసలోడు ఎప్పుడు పోతాడా! ఇంటిని అమ్మేద్దామా? అని చూస్తున్నారురా!
మధుమేహం, బిపి, ఇంకెంత కాలం బతుకుతావు అని ననే్న నేరుగా అడిగేశారు.
నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు . ఈ వయసులో పార్టీ నాయకుల నంబర్లు కాదురా! డాక్టర్ల ఫోన్ నంబర్లు ముఖ్యం’’
***

హనుమంతరావుకు కోపం వచ్చింది. ఇదిగో 1952 నుంచి కూడా మీలో ఏ మార్పు రాలేదు. అప్పుడు కూడా యూత్ కాంగ్రెస్‌లో గ్రూపులు మేయింటెన్ చేసేవాళ్లు. ఇక్కడికొచ్చినా అదే చేస్తున్నారు. మేధోమథనంలో రాష్ట్ర కాంగ్రెస్‌ను రక్షించడానికి ఏం చేయాలో ఆలోచిద్దామని మీ అందరినీ పిలిస్తే మీరంతా మీ మీ రోగాల గురించి చర్చించుకోవడం ఏమీ బాగా లేదు. ‘‘ఓరి భడవా అక్కడికొచ్చానంటే రెండు ఇచ్చుకుంటాను. ఒక్క రోజైనా క్లాస్‌లో సరిగా పాఠం విన్నావురా! మీ నాన్న మాకు చెప్పుకొని ఏడ్చేవాడు, పిల్లాడు ఏమైపోతాడో అని ఏమీ కాదు యూత్ కాంగ్రెస్‌లో చేర్పించు అని నేను చెబితేనే కదరా! చేర్పించింది ఇప్పుడు మాకే చెబుతున్నావా? ’’అని కోటేశ్వరరావు వణికిపోతూ కడిగి పారేశాడు.


అది కాదు తాత మీరంతా కాంగ్రెస్‌ను బతికించుకోవడానికి మంచి సలహాలు ఇస్తారని అని హనుమంతరావు నసిగాడు.
పిచ్చి కుంక కాంగ్రెస్‌ను ఒకరు బతికించలేరు... చంపేయలేదు.... కాంగ్రెస్ తనంతట తానే బతుకుతుంది.. తనంతట తానే చస్తుంది.... నువ్వు నేను, హై కమాండ్ అంతా నిమిత్తమాత్రులం. భీష్ముడికి తాను కోరుకున్నప్పుడు మరణించే  వరం ఉన్నట్టుగానే .. ఎవరు ప్రయత్నించక పోయినా తనంతట తానే చచ్చే శాపం కాంగ్రెస్స్, తనకు తానే సంపాదించుకుంది .. అని చెప్పాడు కోటి.

***
కొద్దిసేపటి తరువాత వేదిక మీద ఒక మూల నుంచి వా! వా!! అని ఏడుపు వినిపించింది. చిరంజీవి కన్నీళ్లు పెడుతున్నాడు. ఎవరా కుర్రాడు ఎందుకేడుస్తున్నాడు అనే ప్రశ్నలు వినిపించాయి. ‘‘రాజకీయాలపైనే ఆశలు పెట్టుకొని బతుకుతున్నాను. సొంత పార్టీతో వర్కవుట్ కాలేదు. మీ ఉపన్యాసాలు వింటే ఈ పార్టీ కూడా బతికి బట్టకట్టేట్టు కనిపించడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి. పార్టీ రోగాలు మీ రోగాల జాబితా విన్నాక జీవితం మీదనే విరక్తి కలుగుతోంది’’ .. వా! వా! అని మళ్లీ ఏడుపు మొదలు పెట్టాడు చిరంజీవి.
మేధోమథనానికి ముగింపు ఉండదు. అలా సాగుతూనే ఉంటుంది.

5, సెప్టెంబర్ 2012, బుధవారం

మన్మోహన మౌనాయుధం

మౌనాన్ని 
మేరే పాస్ గాడీ హై, బంగ్లా హై అంటూ ఇంకా ఏమేం హైలో అమితాబ్ వరుసగా చెప్పుకుంటూ పోతుంటే శశికపూర్ మెల్లగా మేరే పాస్ మా హై అంటాడు. దివార్‌లో ఈ డైలాగు హిందీ సినిమాలు ఉన్నంత కాలం గుర్తుండిపోతుంది.  ఇలానే పార్లమెంటులో బిజెపి వాళ్లు కాంగ్రెస్ కుంభకోణాల జాబితా చదువుతుంటే, తనతో తాను కూడా మాట్లాడుకోని మన్మోహన్‌సింగ్ ఏదో చెప్పడానికి సన్నద్ధం అవుతున్నారు. స్పీకర్ ఆప్ బైటియే ఆప్ బైటియే అంటూ తాను లేచి ఎంత మొత్తుకున్నా ఒక్కరూ కూర్చోలేదు. కానీ మన్మోహన్ సింగ్ లేవగానే అంతా బిత్తర పోయారు. ఆయుధం చేపట్టను అని మహాభారత యుద్ధం ప్రారంభ సమయంలోనే శ్రీకృష్ణుడు షరతు విధిస్తాడు. అలాంటి శ్రీకృష్ణుడికి సైతం యుద్ధంలో ఒకసారి కోపం వచ్చి తానే స్వయంగా యుద్ధం చేసేందుకు ముందుకు వస్తాడు. ఈ చర్యతో పాండవులు కౌరవులు బెంబేలెత్తిపోతారు . అలానే మన్మోహన్‌గారే స్వయంగా మాట్లాడేందుకు లేవడంతో ఇరుపక్షాలు బిత్తరపోయాయి. 

చాలా రోజుల నుంచి ఉపయోగించకపోవడం వల్ల పని చేస్తుందో లేదో అని మన్మోహన్‌సింగ్ గొంతు సవరించుకున్నారు. నీళ్లు తాగారు. చాలా కాలం ఉపయోగించని వాహనాలకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. అలానే మన్మోహన్‌కు కొద్దిసేపటి తరువాత తన గొంతు తన అదుపులోకి వస్తున్నట్టు అనిపించింది. అటువైపు చూశాడు. సోనియాగాంధీ గుడ్లు ఉరుమి చూస్తున్నట్టు అనిపించిది. తన అనుమతి లేకుండా మన్మోహన్ ఏదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించి, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని సోనియా ముఖ కవళికలతోనే ఆదేశాలను పంపించారు. 

నిశ్శబ్దంలో గట్టిగా మాట్లాడితే మన మాట మనకే ఎంతో మధురంగా వినిపిస్తుంది. ఆ విషయం సుష్మా స్వరాజ్‌కు బాగా తెలుసు ఆమె ఆ చాన్స్ వదలుకోదలుచుకోలేదు. హమారే పాస్ బోఫోర్స్‌కా రికార్డ్స్ హై, 2జికా రిపోర్ట్స్ హై... అబ్ బొగ్గు కుంభకోణంకా కాగ్ రిపోర్ట్ హై ఆప్‌కే పాస్ క్యా హై అంటూ సుష్మా స్వరాజ్ ఆవేశంగా ఫైళ్ల దొంతరను టేబుల్‌పై వేశారు. మన్మోహన్ గొంతు సవరించుకుని మేరే పాస్మౌన్ హై... వెయ్యి ప్రశ్నలకు సరితూగే సమాధానం మౌనమే అని ఆయన పంజాబిలో చదువుకున్న ఉర్దూ కవితను హీందీలో చెప్పి ఇక చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదన్నట్టు కూర్చుండి పోయారు. సోనియా ముఖం సంతోషంతో విప్పారింది.  చదువుకునే పిల్లాడు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు వాళ్లింట్లో అనుమతి లేకుండా ఏ ఆటవస్తువును ముట్టుకోవద్దు, బుద్ధిగా కూర్చోవాలి అని తల్లి చెబితే, ఆ పిల్లాడు ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తే, ఆ తల్లి ఎంతగా సంతోషిస్తుందో సోనియా అంతగా సంతోషించారు. ఇంట్లో కార్టూన్ నెట్ వర్క్ చూస్తున్న కొడుకుతో బాబు నాకిష్టమైన కలవారి కోడలు సీరియస్ రెండువేల ఒకటో ఎపిసోడ్ చూడాలి అనగానే బుడిబుడి అడుగులతో రిమోట్ పట్టుకొచ్చి తల్లి వళ్లో వేస్తే ఆ తల్లి ఎంతగా సంతోషిస్తుందో మన్మోహన్‌ను చూసి సోనియా అంతగా సంతోషించింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తే తల్లిదండ్రులు ఎంతగా సంతోషిస్తారో, కలిసొచ్చే కాలానికి మౌనంగా ఉండే ప్రధాని లభించడం ఏ పార్టీ నాయకురాలికైనా సంతోషకరమే కదా! మీ వెయ్యి ప్రశ్నలకు నా ఒక్క మౌనమే సమాధానం అని ఆయన చెప్పగానే ముందు సోనియా ఆ తరువాత కాంగ్రెస్ సభ్యులు చప్పట్లు కొట్టి అభినందించారు.

బిజెపి సభ్యులు కోయ్‌లా గొటాలా హాయ్.. హాయ్ అని నినాదాలు చేస్తుంటే కాంగ్రెస్ సభ్యులు హమారే పాస్ మౌన్ హై మౌన్ హై అంటూ నినాదాలు చేయసాగారు. దేశం అట్టుడికిపోతుంటే ఈ బిజెపి వాళ్లేంది కోయిల ... కొయిలా అంటారు అని రాయపాటి పక్కనున్న గారపాటిని అడిగారు. వెనక వైపు నుంచి ఈ మాటలు విన్న మరో ఎంపి కోయ్‌లా అంటే కోయిలా కాదు బొగ్గు. వాళ్లు బొగ్గు కుంభకోణం గురించి నినాదాలు చేస్తున్నారు. అని నవ్వాడు. ఇదిగో మనకెందుకు మనమేమన్నా మాట్లాడితే మన కుంభకోణాలు బయటపెడతారు. అసలే అధికారంలో ఎవరున్నారో, ఎవరి కుంభకోణాలు ఎవరు భయటపెడుతున్నారో అర్ధం కాని పరిస్థితి అని తెలుగు ఎంపి ఒకరు చెప్పగానే అంతా మాట్లాడడం మానేశారు.

మొండివాడు రాజుకున్నా బలవంతుడట! మొండివాడి కన్నా మౌనంగా ఉండేవాడు మరింత శక్తివంతుడు. మౌనాన్ని నమ్ముకున్నవాడికి ఎలాంటి సమస్య ఉండదు. మహాభారత యుద్ధంలో ప్రతి వీరుడి వద్ద ఒక శక్తివంతమైన ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధాన్ని ఒకసారి ప్రయోగిస్తే మరోసారి ప్రయోగించడానికి చాన్స్ ఉండదు. కానీ మౌనం మాత్రం ఎన్ని సార్లయినా ప్రయోగించడానికి అవకాశం ఉన్న శక్తివంతమైన ఆయుధం. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతుంటే భీష్ముడు మౌనంగానే ఉన్నాడు కానీ పల్లెత్తు మాట అనలేదు. ధర్మరాజు జూదంలో ముందు తాను ఓడిపోయి తరువాత నన్ను ఓడిపోయాడా? లేక నన్ను ఓడిపోయాక తాను ఓడిపోయాడా? కనీసం ఈ ప్రశ్నకన్నా సమాధానం చెప్పమని ద్రౌపది అడిగితే, భీష్ముడు మౌనంగానే ఉంటాడు. సమాధానం తెలియ కాదు. సమాధానం చెబితే బాస్‌కు కోపం వస్తుంది. ఆవెంటనే ఊస్టింగ్ లెటర్ వస్తుంది. కార్పొరేట్ కంపెనీ అయినా కౌరవ కొలువులోనైనా, రాజకీయ పదవిలోనైనా ఉద్యోగాన్ని నిలుపుకోవడానికి మౌనాన్ని మించిన లౌక్యం లేదు. తన వౌనాయుధంతో మన్మోహన్ ఇటు సొంత పక్షాన్ని సంతృప్తి పరుస్తున్నారు, అటు ప్రతిపక్షానికి చిక్కడం లేదు. మౌనాన్ని మించిన ఆయుధం లేదని నిరూపిస్తున్నారు.