8, జూన్ 2014, ఆదివారం

ధృతరాష్డ్రుడి సెన్సాఫ్ హ్యూమర్.. దుర్యోధనుడి వందో తమ్ముడు!

‘‘ధృతరాష్డ్రుడిది మంచి సెన్సాఫ్ హ్యూమర్’’
‘‘కొంపతీసి మహాభారతంలో సెన్సాఫ్ హ్యూమర్ అనే అంశంపై పిహెచ్‌డి ఏమైనా చేస్తున్నావా? ’’
‘‘రామాయణంలో మహిళలు, భారతంలో పురుషులు, భాగవతంలో ఋషులు అంటూ పరిశోధనలు చేసినప్పుడు సెన్సాఫ్ హ్యూమర్‌పై చేస్తే తప్పేముంది. కానీ నేనేం ఉద్యోగం చేయడం లేదు కదా? ప్రమోషన్ కోసం పిహెచ్‌డి చేయడానికి’’
‘‘్ధృృతరాష్ట్రుడంటే ప్రేమతో కళ్లు మూసుకుపోయిన తండ్రి గుర్తుకు వస్తాడు కానీ నీకేంటి అలా?’’
‘‘కెసిఆర్ అనగానే తెలంగాణ వారికి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఉద్యమ కారుడిగా కనిపిస్తారు. ఇతరులకు వేర్పాటు వాదిగా కనిపిస్తారు. బాబు కొందరికి వెన్నుపోటు దారుడిగా గుర్తుకు వస్తే, కొందరికి జాతి రత్నంగా, యుగపురుషుడిగా కనిపిస్తారు. ఈ ఇద్దరు వారు వారే. కానీ వీరిని చూసేవారు తమ తమ కోణాల్లో చూస్తున్నారు. ధృతరాష్ట్రుడిలో గుడ్డితనం ఒకరికి కనిపిస్తే, సెన్సాఫ్ హ్యూమర్ ఒకరికి కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు ఒక్కడే చూసేవారే వేరువేరు’’
‘‘అంతే నంటావా? ’’


‘‘ సరే ధృతరాష్ట్రుడి వందో కొడుకు పేరు తెలుసా? ’’
‘‘తెలిస్తే మీలో ఎవరో కోటీశ్వరుడికి, నాగార్జున కోటి ఇచ్చినట్టు సమాధానం చెబితే ఏమిస్తావు? ’’
‘‘నీకు తెలియదని నాకు తెలుసులే... ఒక్కరు లేక ఇద్దరు చాలు అని నిర్ణయించుకున్న మన తరానికి పిల్లల పేర్లు పెట్టడడానికి ఎంతో తంటాలు పడాల్సి వస్తోంది. అన్ని భాషల్లో పిల్లల పేర్ల పుస్తకాలు నాలుగైదు కొంటే కానీ ఒక్క పేరు చిక్కడం లేదు. ఆ రోజుల్లో వంద మంది సంతానానికి ధృతరాష్ట్రుడు అన్ని పేర్లు ఎలా పెట్టాడో? ’’
‘‘ముందు అతని సెన్సాఫ్ హ్యూమర్ గురించి చెప్పు’’
‘‘ అక్కడికే వస్తున్నా? ధృతరాష్ట్రుడి వందో కొడుకు, దుర్యోధనుడి చివరి తమ్ముడి పేరు కవి. కౌరవులంటే ఎవరు మహాభారతంలో విలనే్ల కదా? వాళ్ల పేర్లు కూడా అలానే ఉంటాయి ధుర్యోధనుడు, దశ్శాసనుడు అంటూ అలా పేర్లు పెడుతూ పోయాక చివరకు ధృతరాష్ట్రుడు వందో వాడిపేరు కవి అని పెట్టుకున్నాడు.’’


‘‘మహాభారతంలో ప్రధానంగా ధుర్యోధనుడి యుద్ధ కాంక్ష, దుశ్శాసనుడి ద్రౌపది వస్త్రాపరణం గురించే ప్రస్తావన ఉంది కానీ మిగిలిన వారి గురించి ఎక్కువగా కనిపించదు. మొదటి వాడు యుద్ధాలతో హింసిస్తే చివరి వాడు కవిత్వంతో హింసించే వాడేమో? లేక వాడు పెద్దయ్యాక కవి అవుతాడని తండ్రి ముందే ఊహించి ఉంటాడు. పెద్దయ్యాక కవులయిన వారున్నారుక కానీ పుట్టగానే కవి అయిన ఘనత ధృతరాష్ట్రుడి కుమారుడికి మాత్రమే దక్కింది. ఆ పేరుతో ధృతరాష్ట్రుడు కవులపై సెటైర్ వేశాడేమోననిపిస్తోంది. అందుకే ధృతరాష్ట్రుడి సెన్సాఫ్ హ్యూమర్ తెగనచ్చేసింది..’’
‘‘అయినా నేటి కవి వేరు ఆ కవి వేరు’’
‘‘కాలం ఏదైనా కావచ్చు కవి కవే. 144 సెక్షన్ విధించినా జనం చెల్లాచెదురు కాకపోవచ్చు కానీ అక్కడికి నలుగురు కవులను పంపించామంటే ఒక్క పురుగు కంటికి కనిపించడు అదీ కవి శక్తి సామర్ధ్యం ’’
‘‘అది సరే నీకు హఠాత్తుగా వందో సంతానం పేరు ఎందుకు గుర్తుకు వచ్చింది’’


‘‘వంద రోజుల్లో మీరేం చేస్తారో ప్రణాళిక రూపొందించుకోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రులను ఆదేశించారు. కేజ్రీవాలేమో మోదీకి 101 రోజుల గడువు ఇస్తున్నామని ఆ రోజు నుంచి ప్రశ్నించడం మొదలు పెడతానని చెబుతున్నారు. యుపిఏ మొదటి సారి అధికారంలోకి రాగానే వంద రోజుల్లో సాధించే లక్ష్యాలతో ఇలానే ఆర్భాటం చేసింది. ధరలు తగ్గించడం, మహిళా రిజర్వేషన్ల బిల్లు వంటివన్నీ వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. వంద సంఖ్యకు భారతీయుల జీవితంలో విడదీయరాని అనుబంధం ఉందేమోననిపిస్తోంది. శతమానం భవతి అంటూ వందేళ్లు జీవించాలని దీవిస్తారు’’
‘‘దీవించడమే కాదు శిక్షించడంలో సైతం వందకు ప్రాముఖ్యత ఉంది. శిశుపాలుడు 99 తప్పులు చేసేంత వరకు క్షమించిన శ్రీకృష్ణుడు వందో తప్పు తరువాతే కదా? శిక్షించింది.. చంద్రబాబు వంద తప్పులపై బిజెపి కూడా శత్రుపక్షంగా ఉన్నప్పుడు చార్జీషీట్ విడుదల చేసింది’’
‘‘ఔను డెల్‌కార్నిగ్ తాత పుట్టక ముందు వ్యక్తిత్వ వికాసం గురించి మన వాళ్లు చెప్పింది శతకాల ద్వారానే కదా? శతకాల ద్వారా వంద మంచి మాటలు కలకాలం గుర్తుండేట్టు చెప్పారు కదా? సుమతీశతకం, భాస్కర శతకం, వేమన శతకాలను మనసు పెట్టి చదవాలి కానీ అందులో కావలసినంత వ్యక్తిత్వ వికాస సాహిత్యం దొరుకుంది. తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి. పాలకుల మనస్తత్వం ఎలా ఉంటుంది. మానవ జీవితానికి ఉపయోగపడే ప్రతి అంశం ఈ శతకాల్లో కనిపిస్తుంది. శంఖంలో పోస్తే కానీ తీర్థం కానట్టు ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్‌లో చెబితే కానీ మనం విలువ ఇవ్వం. ప్రబంధ నాయికలు కూడా వంద మందే.. శత ప్రబంధ నాయికలు అని ముచ్చటగా పిలుచుకున్నాం. అభిసారిక విరహత్కంఠిత వంటి ఇద్దరు ముగ్గురు ప్రబంధ నాయికల పేర్లే పాపులర్ కానీ కులట కూడా ఈ శత ప్రబంధ నాయికల్లో ఒకరు ’’
‘‘వంద లేనిదే సినిమా చరిత్ర లేదు. ఇప్పుడంటే సినిమా వంద రోజులు నడిస్తే గొప్ప కానీ గతంలో వంద రోజులు నడిస్తేనే సినిమాకు గుర్తింపు. తమ అభిమాన హీరోల సినిమా వంద రోజులు నడిపించేందుకు అభిమానులు తామే టికెట్లు కొనే వారు కూడా. చిరంజీవి 150వ సినిమా హిట్టు కావాలని మంచి కథ కోసం ప్రయత్నిస్తుంటే ఆయన రాజకీయ జీవితం మాత్రం అట్టర్ ఫ్లాపైంది.’’
‘‘అధికారంలో ఉన్న పార్టీ మారుతోంది కానీ ప్రజల జీవితాలు మారడం లేదు’’
‘‘ఐతే’’

బహుశా ప్రజలు తాము కోరుకున్న రీతిలో ప్రజాస్వామ్య ఉండేందుకు వందేళ్ల గడువు అవసరం అనిపిస్తోంది. అంటే మన ప్రజాస్వామ్యం వయసు 67 ఏళ్లు ఇంకా 33 ఏళ్లు అనుభవించాలి. నువ్వు ఎలాగైనా అర్ధం చేసుకో... పాలకులపై ఇప్పట్లో పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని చెప్పడమే నా ఉద్దేశం.’’

3, జూన్ 2014, మంగళవారం

షో’మాస్టర్స్!... కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నారా చంద్రబాబు నాయుడుల రాజకీయ మనస్తత్వం



రాష్ట్రం -రెండు ముక్కలైంది. రెండు రాష్ట్రాలుగా ఊపిరి పోసుకుంది. భారతదేశ పటం మీద ఒకే ప్రాంతీయ భాష తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలుగా రికార్డు మిగుల్చుకుంది. *** ‘విభజన’ ముగిసింది. పట్టింపులు పోయాయి. పంపకాలు పూర్తయ్యాయి. ఎవరి ఉనికి కోసం వారు పరుగు ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో -ఎవరి రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. ఒకే రాజకీయ తాను నుంచి వచ్చిన ఇద్దరూ -ఎవరి షో వారు ప్రారంభించబోతున్నారు. ఇద్దరి రంగూ రుచీ పాలనలో తేడాలున్నా -పొలిటికల్ షోను ఎవరు రక్తికట్టిస్తారన్నది వెండితెరపై వేచి చూడాలి. *** రాజకీయ వ్యూహాల్లో ఇద్దరూ ఆరితేరారు. ఒకరు స్వయంకృషితో సిఎం పీఠాన్ని అందుకుంటే, మరొకరు -వారసత్వంగా తొలిసారి, ప్రత్యర్థులు సైతం అబ్బురపడేట్టు ఈసారి సిఎం కుర్చీని అందుకున్నారు. మొదటిది -కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. రెండో వ్యక్తి -నారా చంద్రబాబు నాయుడు. ఇద్దరూ ఇద్దరే. గండరగండులే. కానీ, ఎవరి స్టైల్ వారిది. రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరిదీ చెరగని ముద్ర. ఇద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీ సభ్యులు. అత్యంత సన్నిహితులు. కానీ ఇద్దరి మమస్తత్వం భిన్న ధృవాలు. వారి రాజకీయ ఎత్తుగడల్లో ఇంతకాలం ఆ తేడా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు పాలనలో సైతం ఎవరి స్టైల్ వారిది. అనుకూల ప్రచారం కోసం మీడియా మేనేజ్‌మెంట్‌పై ఆధారపడేవారు ఒకరైతే, ఏదో ఒక సంచలన ప్రకటనతో వ్యతిరేక మీడియాను సైతం తనవైపు దృష్టి సారించేలా చేయడం ఇంకొకరి స్టయిల్. అంతిమంగా ఇద్దరి వ్యూహాలు ఫలించాయి. ఇద్దరూ సిఎంలయ్యారు. ఇద్దరి పాలన ఎలా ఉండబోతుందనేదే -పెద్ద క్వొశ్చన్ మార్క్. 

కురుసభ.. భీముడిగా ఎన్టీఆర్. దుర్యోధనుడిగా ఎస్వీ రంగారావు. ఎన్టీఆర్ ఎన్నో పద్యాలు పాడి ఎస్వీ రంగారావును భయపెట్టాలని చూస్తాడు. ఎన్టీఆర్ పద్యాలన్నీ చిద్విలాసంతో విన్న ఎస్వీఆర్ ‘హే.. బానిసలకు ఇంతటి అహంభావమా?’ అంటూ ఒక్కముక్కలో తేల్చేస్తాడు. రాజకీయాల్లో కేసీఆర్‌దీ అదే స్టయిల్. ప్రత్యర్థులు ఆయనపై ముప్పేట దాడి జరుపుతుంటే ఆయన మాత్రం ఒక్కముక్కలో ‘సన్నాసులు’ అని తేల్చిపారేస్తారు. 

80వ దశకం తరువాత తెదేపా ఆవిర్భావంతో తెలుగునాట నవశకం రాజకీయం ప్రారంభమైంది. ఎన్టీఆర్ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అనిపించుకున్నది -నలుగురు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. వైఎస్ మరణంతో మిగిలిన ముగ్గురి చుట్టే రాజకీయాలు తిరిగాయి. వీరిలో ఇద్దరు నేతలు రెండు రాష్ట్రాలకూ ముఖ్యమంత్రులయ్యారు. నవశకం రాజకీయ నేతల్లో చంద్రబాబు, చంద్రశేఖర్‌రావు రాష్ట్ర రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసిన వారు. ఉద్యమం ద్వారా కేసీఆర్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజకీయాల్లో తమ ముద్ర చూపించారు. ఇద్దరు నేతలూ యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారే. తెదేపాలో బాబుకన్నా కేసీఆర్ ఏడాది సీనియర్. తెదేపా ఆవిర్భవించిన తరువాత చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చంద్రబాబు ఓడిపోతే, సిద్ధిపేటలో తెదేపా తరఫున పోటీ చేసి కాంగ్రెస్ నేత మదన్‌మోహన్ చేతిలో కేసీఆర్ ఓడిపోయారు. 83నాటి చారిత్రక సభలో ఇద్దరూ సభ్యులు కాదు. ఎన్టీఆర్ పిలుపు మేరకు కేసీఆర్ తెలుగుదేశంలో చేరితే, ఎన్టీఆర్ అల్లుడి హోదాలో చంద్రబాబు తెదేపాకు వచ్చారు. మెదక్ జిల్లాలో కరణం రామచంద్రరావును ఎన్టీఆర్ ప్రోత్సహించడంతో కేసీఆర్ మొదటి నుంచీ చంద్రబాబు వర్గంగా ఉండిపోయారు. ఇద్దరూ రాజకీయంగా ఓనమాలు దిద్దింది యువజన కాంగ్రెస్‌లోనే అయినా అక్కడ ఇద్దరికీ ఎలాంటి పరిచయం లేదు. ఎందుకంటే అప్పుడు ఇద్దరూ నియోజక వర్గస్థాయి నేతలు కూడా కాదు. ఈమధ్య ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు -కేసీఆర్ నా శిష్యుడే అని చెప్పుకొచ్చారు. కానీ తెదేపాలో మొదటి నుంచీ నాయకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంలో కేసీఆర్‌దే కీలక పాత్ర. జన్మభూమి, శ్రమదానం వంటి కార్యక్రమాల రూపకల్పన, పార్టీ శ్రేణులకు శిక్షణ నిర్వహించడంలో కేసీఆర్‌దే ప్రధాన పాత్ర. అయితే తెదేపా నేతలు మాత్రం ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో బాబు ప్రమేయమేమీ లేదు, వ్యూహమంతా కేసీఆర్‌దేనంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అయ్యేదా? పొయ్యేదా? అనుకున్నారు. ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించడమే కాకుండా తెలంగాణను సాధించుకోవడంతో పాటు తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపడుతున్నారు కేసీఆర్. చంద్రబాబు చరిత్ర ముగిసిపోయింది. 1999లోనే అయనకు చివరి విజయం లభించింది. అంటే ఆయనది 20వ శతాబ్ధం విజయం తప్ప 21వ శతాబ్ధంలో విజయమే లేదు. ముగిసిన చరిత్ర అనుకున్నారు. వరుసగా ఉప ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు. అన్ని సర్వేల్లోనూ జగన్‌దే హవా. అయినా మొక్కవోని ధైర్యంతో ఏఒక్క అవకాశాన్ని వదలకుండా విజయం కోసం కృషి చేసి అనుకున్నది సాధించారు చంద్రబాబు. వైకాపా, తెదేపా కూటమి మధ్య ఓట్ల తేడా కేవలం  2 శాతం మాత్రమే. . ఫలితాలు తేలిన తరువాత ఎన్నికల కమిషన్ ప్రకటించిన లెక్కలివి. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన వారిదే విజయం. ఎంత శాతం, ఎన్ని ఓట్లు అనే లెక్కలెలా ఉన్నా ఈ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అనేది మాత్రం వాస్తవం. 

‘బిజెపి వల్లనే ఓడిపోయాం. ఇక జీవితంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు’ ఇది 2004లో చంద్రబాబు చేసిన ప్రకటన. ‘అమాయక మైనారిటీల హత్యకు కారణమైన నరేంద్ర మోదీని హైదరాబాద్‌లో అడుగు పెట్టనిచ్చేది లేదు’ ఇది అధికారంలో ఉన్నప్పుడు బాబు చేసిన ప్రకటన. ‘నరేంద్ర మోదీని వెంటనే అధికారం నుంచి తొలగించాలి’ -మోదీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఎంగా చంద్రబాబు బిజెపికి ఇచ్చిన అల్టిమేటం ఇది. కాలచక్రం గిర్రున తిరిగి పదేళ్లు గడిచిన పోయిన తరువాత అదే నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడానికి బాబు చేయని ప్రయత్నం లేదు. ‘మోదీ, మహాత్మాగాంధీ ఇద్దరూ గుజరాత్‌లోనే జన్మించారు’ పొత్తు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బాబు చెప్పిన మాట ఇది. చంద్రబాబు ప్రయత్నాలు వృధా కాలేదు. పొత్తు కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. అయితే మోదీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తారని ఏ పార్టీ కూడా ఊహించలేదు. రావాలని కోరుకోలేదు. చివరకు బిజెపి సైతం మిషన్ 272కు మాత్రమే పరిమితమైంది. గతంలోలాగే తెదేపా మద్దతుపై ఆధారపడి ఎన్డీయే అధికారంలోకి రావాలని, వస్తుందని బాబు అనుకున్నారు. సొంత బలంతో బిజెపి అధికారంలోకి రావడం బాబును కొంత నిరుత్సాహపర్చిన అంశం. తన మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వమైతే తన ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం చంద్రబాబుకు ఉండేది. కానీ ఇప్పుడా అవకాశం లేదు. మోదీ ప్రసన్నమైతే ఆయన ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటే అన్ని ఇస్తారు. ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. అంతే తప్ప ఆయనపై బాబు ఒత్తిడి పని చేయదు. ఒత్తిడి పెట్టాలని బాబు కలలో కూడా అనుకొనే పరిస్థితి లేదు. ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే వైకాపా ఎంపీలు ఇద్దరు తెదేపా వైపు వెళ్లగాలేనిది, మోదీ ఈలవేస్తే ఏ పార్టీనుంచైనా ఎంపీలు బిజెపివైపు పరుగులు తీయడానికి నిరాకరిస్తారా? 

రైతుల రుణ మాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి వంటి ఆకర్షణీయ పథకాలకు భారీ ఎత్తున నిధులు వ్యయం చేయాలి. అసలే లోటు బడ్జెట్‌తో ప్రారంభమయ్యే రాష్ట్రానికి ఇంత భారీ వ్యయాన్ని భరించే పథకాల అమలు అంత సులభం కాదు. ఈ కోరికలన్నింటినీ కేంద్రం తీరుస్తుందనే ఎన్నికల్లో బాబు ప్రచారం చేశారు. బిజెపికి మెజారిటీ రాకపోతే అదే జరిగేది కూడా. కానీ పరిస్థితి ఇప్పుడలా లేదు. ఇప్పుడు మోదీ నుంచి అనుకున్నంత సాయం ఒక రాష్ట్రానికి అందుతుందని ఆశించలేం. ఒక రాష్ట్రానికి పెద్దపీట వేస్తే మిగిలిన రాష్ట్రాల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పోనీ తన రాజకీయ మనుగడ కోసం విమర్శలనైనా ఎదుర్కోందాం అనుకోవడానికి -మోదీకి అలాంటి అవసరం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పాలన చంద్రబాబుకు అంత సులభమేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు సాగించిన పాలన వేరు. 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో పాలన వేరు. ఇప్పుడు మనం కొత్త చంద్రబాబును చూడబోతున్నాం. అటు కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోవాలి. ఇన్ని సమస్యలున్నా మీడియా అండ చంద్రబాబుకు కొండంత బలం. ఆయన అధికారపక్షంలో ప్రపంచంలోనే మేటి అని ప్రచారం పొందినా, విపక్షంలో ఉన్నప్పుడు డిపాజిట్లు కోల్పోయినా ధైర్యం వీడకుండా ఉండటానికి మీడియా అండ ఎంతో తోడ్పడింది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన విజయానికి అనేక అంశాలు దోహదం చేశాయి. మోదీ వేవ్, పవన్ కల్యాణ్ ప్రచారం వంటి అంశాలతో పాటు మీడియా మద్దతు విజయానికి దోహదం చేసిన జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. నిజాం కాలేజీలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ. తొలిసారిగా రాష్ట్రంలో అక్కడే మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు ఒకే వేదికను పంచుకున్నారు. పక్కపక్కనే ఉన్నా బాబుతో కరచాలనం చేయడానికి కూడా ఇష్టపడలేదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడైనా స్పందించే తీరు వేరుగా ఉంటుంది. కానీ తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, పదేళ్లు విపక్ష నేతగా పని చేసిన అనుభవం, కేంద్రంలో ప్రధానిని, రాష్టప్రతిని నిర్ణయించడంలో కీలక భూమిక పోషించిన అనుభవం ఉన్న చంద్రబాబు స్పందించిన తీరు అనూహ్యం. కరచాలనం చేయడానికే ఇష్టపడని పవన్ ఇంటికి బాబు స్వయంగా వెళ్లి ఆయన మద్దతు కోరిన రాజకీయ చతురుడు చంద్రబాబు. ఈ చర్యకు బాబు అభిమానులు విస్తుపోయారు. పవన్ అభిమానులు, ఓ సామాజిక వర్గం మురిసిపోయింది. ఆ మురిపెం ఓట్ల రూపంలో ప్రభావం చూపినట్టు ఫలితాలే తేల్చి చెప్పాయి. రాజకీయాల్లో విజయం సాధించాలి. దాని కోసం ఏమైనా చేయాలనేదే నేటి రాజకీయం. ఈ రాజకీయాల్లో చంద్రబాబు ఆరితేరారు. లేకపోతే పదేళ్ల నుంచి వరుస పరాజయాలు వెంటాడుతున్నా, డిపాజిట్లు కోల్పోతున్నా ధైర్యంగా నిలబడ్డారు. సర్వశక్తులు ఒడ్డారు.  ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తన కన్నా మోదీ, పవన్‌లపైనే ఎక్కువ ఆధారపడ్డారు. ఒకరకంగా తన ముఖానికి ఆ ఇద్దరి మాస్క్‌లు ధరించి ప్రచారం చేశారు. ప్రచారం ఎవరు చేస్తేనేం విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది చంద్రబాబు. ఎన్నికల్లో విజయానికి తెరవెనుక వ్యూహాల్లో తనకు సాటిలేరని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. 

విపక్ష నేతగా ఉన్నప్పుడే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పాలన సాగించడంలో సైతం ఆయనకు మీడియా మద్దతు కొండంత అండ. రాజకీయాలంటే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే అనుకుంటే చేసేదేం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చడానికి చంద్రబాబు కృషి చేస్తారని, కొత్త రాజకీయాలకు శ్రీకారం చుడతారని ఆశిద్దాం. *** తెలంగాణ కొన్ని కోట్ల మంది కల. తెలంగాణ రావాలని కోట్లమంది కోరుకున్నారు. కానీ రానేరాదని అదే తెలంగాణకు చెందిన కోట్లమంది నమ్మారు. చివరకు కేసీఆర్ చదువుకునే రోజులనాటి మిత్రులు కూడా అట్లెట్లోస్తది తెలంగాణ అనేవారట! కానీ మొదటి రోజు నుంచీ ఒక్క కేసీఆర్ మాత్రమే ‘అట్లెట్లరాదు తెలంగాణ’ అని నిర్ణయించుకున్నారు. ఏ అంశంపైనైనా లోతుగా అధ్యయనం చేయడం ఆయనకు అలవాటు. నిజానికి కేసీఆర్, బాబు మంత్రివర్గంలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఆలోచించలేదు. 

1995 నుంచీ తెలంగాణ ఉద్యమం సాగుతోంది. అయితే అది కొద్దిమంది మేధావులకు మాత్రమే పరిమితమైన ఉద్యమంగా మొక్క తొడగడం మొదలు పెట్టిన రోజులవి. అప్పుడు బాబు మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రి. రెండు మూడేళ్లు గడిచిన తరువాత క్రమంగా తెలంగాణ ఉద్యమం సామాన్యులకు చేరువవుతుండటాన్ని గమనించారు. అదే సమయంలో రాజకీయ మార్పులను నిశితంగా గమనించారు. అందరి సహకారంతో ఎన్టీఆర్‌ను గద్దెదించినా అంతా తానేనని, తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అనుకునే దశకు బాబు చేరుకున్నారు. ఒకవైపు విద్యుత్ ఉద్యమం మొదలైంది. కొంతమంది తెలంగాణ ఉద్యమానికి రాజకీయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే అంశంపై అధ్యయనం మొదలు పెట్టారు. కేసీఆర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అదే సమయంలో అధ్యయనాల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు. ఈ ఆకాంక్ష బలంగా ఉన్నా, దానికి నాయకత్వం వహించే బలమైన నాయకుడు లేడని గ్రహించారు. ఆ పాత్రను తాను పోషించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. విజయవంతంగా ఆ పాత్ర పోషించారు. విజయం సాధించారు. రాజకీయాల్లో కొంతమంది సేఫ్ గేమ్ ఆడతారు. కానీ కేసీఆర్ మాత్రం అనేకసార్లు తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి రిస్క్‌గేమ్ ఆడారు. ఆ గేమ్‌లో ఆయన ప్రతిసారీ విజయం సాధిస్తూనే ఉన్నారు. తనవల్లే కరీంనగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా ఎన్నికయ్యారని వైఎస్సార్ అంటే సరే తేల్చుకుందాం రా అంటూ రాజీనామా చేసి నాలుగింతల మెజారిటీతో విజయం సాధించి చూపించారు. వైఎస్సార్‌కు మద్దతుగా ఎంఐఎం, కుల సంఘాలు, ఎంఆర్‌పిఎస్ అంతా కలిసి ప్రచారం చేసినా కేసీఆర్‌నే విజయం వరించింది. సురక్షితమైన మెదక్ పార్లమెంటు సీటు విజయశాంతికి ఇచ్చి పార్టీ ప్రభావం ఏమాత్రం లేదని చెప్పుకునే పాలమూరుకు తాను వెళ్లారు. సార్ చాలా రిస్క్ తీసుకుంటున్నారు, ఓడిపోతే తెలంగాణ ఉద్యమం ముగిసినట్టేనని ప్రతిసారి పార్టీ శ్రేణులు హెచ్చరించినా రిస్క్‌లోనే మజా ఉందని చూపించారు. తెలంగాణ ప్రజల మనస్థత్వం ఏమిటో నాకు తెలుసు. వారిపై నమ్మకంతోనే రిస్క్ తీసుకుంటున్నాను అని చెప్పేవారు. చంద్రబాబు మీడియాలో అనుకూల ప్రచారం మాత్రమే కోరుకుంటారు. తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తే సహించలేరు. వాస్తవ పరిస్థితి ఎలా ఉన్నా మీడియాలో వార్తలు మాత్రం వ్యతిరేకంగా రావద్దని బాబు కోరకుంటారు. మీరు తప్పు చేశారా? లేదా? అని కాదు, మీడియాల్లో అలా వార్తలు రాకుండా చూసుకోండి అంటూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు పార్టీ నేతలకు చెప్పిన మాట. ఈ విషయంలో కేసీఆర్‌ది పూర్తిగా భిన్నమైన మనస్థత్వం. తనకు వ్యతిరేకంగా వార్త లు వస్తే ఆయన ఎంజాయ్ చేస్తారు. విమర్శలు రావాలని కోరుకుంటారు. ఒక్కమాటతో రాష్ట్రం మొత్తం తనపై ధ్వజమెత్తే విధంగా పవర్‌పుల్ పంచ్ డైలాగులతో ఎదుటివారు గిజగిజలాడేట్టు చేస్తారు. ఏ విషయంపైనైనా లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే దాని గురించి సాధికారికంగా మాట్లాడతారు. 

పుష్కరాలు అనగానే రాష్ట్రంలో ఏ ప్రాంతం వారికైనా గుర్తుకొచ్చేది రాజమండ్రి. ఏ ప్రభుత్వం ఉన్నా పుష్కరాలకు రాజమండ్రికే నిధులు కేటాయించేది. తెలంగాణలో పుష్కరాలకు నిధులు కేటాయించరా? అంటూ కేసీఆర్ ప్రకటన చేయగానే తెలంగాణ సైతం విస్తుపోయింది. ఓసారి మీడియా సమావేశంలో ఓ విలేఖరి పుష్కరాలు అంటే రాజమండ్రినే కదా? అని అనగానే ఆ ప్రశ్న విని ఆయన సంతోషపడిపోయారు. అసలు పుష్కరాలు అంటే ఏమిటీ అని సుదీర్ఘంగా వివరించారు. 12 ఏళ్లకోసారి పుష్కర దేవుళ్లు నదీ ప్రవాహ ప్రాంతంలో పుష్కర స్నానాలు అచరిస్తారు. అప్పటి నుంచి తెలంగాణలో గోదావరి ప్రవహించే ప్రాంతాల్లోనూ పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు మొదలెట్టింది. పుష్కరాల గురించి మాట్లాడాలన్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నా ఏ అంశంపైనా ఆ రంగంలో నిష్ణాతులైన వారితో మంతనాలు జరిపి, తన సందేహాలను తీర్చుకున్న తరువాతనే ఆ అంశం గురించి మాట్లాడడం కేసీఆర్‌కు మొదటి నుంచి అలవాటు. ఒక అంశం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి చిన్న వాడా? పెద్ద వాడా? అనే తేడా ఆయనకు ఉండదు. విషయం తెలిసిన వ్యక్తి అని తెలిస్తే చాలు గౌరవిస్తారు, ఆ అంశం గురించి అభిప్రాయం అడిగి తెలుసుకుంటారు. సామాజిక వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా ఎవరిని ఎవరు తిట్టాలి అనే జాబితాను చంద్రబాబు రూపొందించుకుంటారు. బాబు నేరుగా తిట్టరు, కానీ కులాల వారిగా తిట్టేవారిని ఎంపిక చేసుకుంటారు. ఈ విషయంలో కెసిఆర్ ఎవరిపైనా ఆధారపడరు. ఎదుటి వారు రోజుల తరబడి గంటల తరబడి తిడితే ఒక్కమాటలో సమాధాన తిట్టు ఉంటుంది. ఇక విలేఖరుల సమావేశాల్లో విలేఖరి అడిగిన దానికి బాబు చెప్పిన దానికి సంబంధం ఉండదు. సుదీర్ఘంగా మాట్లాడి విసిగించడం బాబు అలవాటు. కెసిఆర్‌కు విలేఖరులతో ఆడుకోవడం సరదా. ఓసారి ఒక విలేఖరి ఒక ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నకు సమాధానం నీకు కావాలా? మీ యాజమాన్యానికి కావాలా? అంటూ ఎదురు ప్రశ్నించే సరికి నీళ్లు నమలడం ఆ విలేఖరి వంతయింది. నమ్మి అందలమెక్కించిన అనుచురులు తిట్టి బయటకు వెళ్లిపోయినా కేసీఆర్ పెద్దగా పట్టించుకోరు. వారి గురించి విమర్శలు కూడా చేయరు. 

చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే జన్మభూమి, ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాల్లో ప్రారంభంలో మీడియాతో కలిసి భోజనం చేసేవారు. ఇది కూడా మీడియాలో బాగా హైలెట్ అయ్యేది. నిజానికి ఈ వనభోజనం మీడియా ప్రచారం కోసమే తప్ప నిజంగా అది బాబు నైజం కాదు. బాబు వద్ద అన్నీ దాపరికమే. కేసీఆర్ వద్ద ఏదైనా బహిరంగమే. మరే నాయకుడూ ఎదుర్కోలేనన్ని విమర్శలు కేసీఆర్ ఎదుర్కొన్నారు. ఆక్రోశంతో ప్రత్యర్థి తిడుతుంటే, ఆ తిట్లను సైతం ఎంజాయ్ చేశారు కానీ కృంగిపోలేదు. ఇటుక ఇటుక పేర్చి ఉద్యమదుర్గాన్ని నిర్మించారు. దానికి తెరాస అని రాజకీయరూపం కల్పించారు. వ్యూహాత్మకమైన ఎత్తుగడలతో స్వయం కృషితో తెరాసను విజయశిఖరంపై నిలబెట్టారు. కెసిఆర్‌కు ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా వచ్చింది కాదు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల రూపం. కేసీఆర్ చెప్పినట్టు మనమెవ్వరం వెయ్యేళ్లు బతికేందుకు రాలేదు. బతికేది కొద్ది కాలమే. తరతరాలు గుర్తుంచుకునే విధంగా ప్రజలకు మేలు చేయాలి. ప్రచారం కోసం కాకుండా సహజంగా జనంలో కలిసిపోవడం కేసీఆర్ నైజం. కలెక్టర్ అనగానే అర్భాటాలు అవసరమా? ఇంకా బ్రిటీష్ పాలనలోనే ఉన్నట్టు మనకీ ఆర్భాటాలు అవసరం లేదు అని ఇటీవల కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అంటే సామాన్యుడి ప్రభుత్వమని చూపించాలి. 
 గతం లో కాంగ్రెస్ నుంచి తెలంగాణ వారుఆంద్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఇంటి పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా, ఇదీ మా పాలన అని నిరూపించే విధంగా, తెలంగాణ నేతల రాజకీయ శక్తి సామర్థ్యాలను చూపించే విధంగా కేసీఆర్ పాలన ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. వారి ఆశలను కేసీఆర్ నెరవేరుస్తారో లేదో చూడాలి. *

** 
పాలనలోనైనా పార్టీలోనైనా చంద్రబాబుది వన్‌మేన్ షో. కేసీఆర్‌ది వండర్‌మేన్ షో. ఎవరి స్టయిల్ వారికుంది. సో.. ఒక్కటిగా ఉన్న రాష్ట్రం ఎలాగూ రెండైంది. రెండుగా ఉన్న నేతలు మాత్రం -పాలన, అభివృద్ధి విషయంలో ఒక్కటవ్వాలని, ఒకరికి మించి ఒకరవ్వాలని ఆశిద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ప్రజలకు మేలు చేసే విషయంలో ఇద్దరు నేతలూ పోటీ పడాలని కోరుకుందాం. ఆరోగ్యకరమైన పోటీ రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు చేయాలని ఆశిద్దాం. *

1, జూన్ 2014, ఆదివారం

వాళ్లు ఇప్పుడేం చేస్తున్నారు?

సెలబ్రిటీల జీవితం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఒకప్పటి భారతీయ వెండి తెర కలల రాకుమారుడు రాజేష్ ఖన్నా హఠాత్తుగా తెర వెనక్కి వెళ్లారు. వృద్ధాప్యం, అనారోగ్యం పీడిస్తున్న కాలంలో ఆయన ఫోటోను హఠాత్తుగా పత్రికల్లో చూసిన వాళ్లు ఒక్కసారిగా వైరాగ్యంలోకి వెళ్లారు. రాజేశ్ ఖన్నా వెలుగులను చూసిన తరం ఆయన చీకటిని చూసే సరికి తమ జీవితం కూడా అంతే కదా అనే ఆలోచన పడ్డారు. కాంతారావు కత్తి ఝుళిపిస్తూ గుర్రంపై స్వారీ చేస్తూ కృష్ణకుమారి మనసు దోచుకోవడం చూసిన కుర్ర కారు తమ లేవల్‌లో సైతం అదే విధంగా ఎవరో ఒక కుమారి కోసం ప్రయత్నించే వారు. ఆ కాలం గడిచిపోయాక ఒక్కసారిగా కాంతారావు వృద్ధాప్యంలో కనిపిస్తే తామూ వృద్ధులమయ్యామనే విషయం గుర్తుకు వచ్చి ఎంత కాదన్నా మనసు కలవరపడుతుంది. ఆకాశంలో చుక్కలు హఠాత్తుగా మాయమైనట్టు సినిమాల్లో వెలిగిన తారలు హఠాత్తుగా మాయం అవుతుంటారు. ఇలాంటి వారిపై సహజంగా ఉండే ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని వాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ పాత తరం నటీనటుల గురించి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. 

ఎంతో మందికి నిద్ర లేకుండా చేసిన జయమాలిని ఇప్పుడు చెన్నైలో ప్రశాంతంగా విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నారు. జ్యోతిలక్ష్మి కూడా అంతే. మళయాల మహానటులకు ము చ్చెమటలు పోయించిన షకీలా తెర వెనక్కి వెళ్లారు. ఏం చేస్తున్నారు? అంటే అన్ని రకాల అనుభవాలతో ఆత్మకథ రాస్తున్నాను అని ఆమె ప్రకటించగానే చాలా మందికి నిద్ర కరువైందట!
పాండవులు పాండవులు తుమ్మెదా అంటూ అభిమానుల హృదయాల్లో దూసుకెళ్లిన జానకి, ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, కాంతారావులను మురిపించిన అందాల రాణి కృష్ణకుమారి బెంగళూరులోని ఫాం హౌస్‌లో విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నారని, అలనాటి అందాల తార కాంచన ఒక ఆలయంలో సేవ చేస్తూ శేష జీవితం దైవారాధనలో గడుపుతున్నారంటే ఆసక్తిగానే ఉంటుంది. ఏయిర్ హోస్టేస్ నుంచి సినీ తారగా అటు నుంచి ఆలయంలో సేవకురాలిగా అంటే చదివేందుకు మనసు భారంగానే ఉంటుంది. 


సినిమా తారలు అంటే అభిమానుల దృష్టిలో దేవుళ్లే. దేవుళ్లు నిత్య యవ్వనులు. దేవుని అస్థిత్వాన్ని మనిషి గుర్తించినప్పుడు దేవుళ్ల వయసు ఎంతో ఇప్పుడూ అంతే. దేవుళ్లు నిత్యయవ్వనులుగా ఉన్నప్పుడు తాము అభిమానించే తారా దేవుళ్లు కూడా అలానే ఉండాలని అభిమానులు కోరుకోవడం సహజమే. అందుకే రాజేశ్ ఖన్నా ముఖం ముడతలు పడినా, జేమ్స్‌బాండ్ 116 అంటూ విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సూపర్ స్టార్ కృష్ణ వయసు భారంతో కనిపించినా అభిమానులు తట్టుకోలేరు. మిస్సమ్మలో కస్సుబుస్సు మంటూ వయ్యారి నడకతో కనిపించిన అందాల బొమ్మ జమున ఇప్పుడు నడిచేందుకే ఒకరి సహాయం తీసుకోవడం అభిమానులు అస్సలు తట్టుకోలేరు.


వాళ్లిప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అంటూ చాలా మంది తారల గురించి అప్పుడో ఇప్పుడో ఎక్కడో ఒక పత్రికలో కనిపిస్తూనే ఉంటుంది.
తారల కన్నా ఒక్కో సమయంలో ఎక్కువ వెలుగురు విరజిమ్మిన చాలా మంది నాయకులు కనిపించకుండా పోయినప్పుడు పాపం వారేరీ అంటూ ఎవరూ పట్టించుకోరు. అధికారాంతమున చూడాలి అని వూరికే అనలేదు మరి..


రాష్ట్రం ఎంత క్లిష్టపరిస్థితిలో ఉన్నా, ఉన్నతాధికారులు బయట వేచి ఉన్నా తన గదిలో క్రికెట్ క్రీడను వీక్షించే లాస్ట్‌బాల్ హీరో కిరణ్ కుమార్‌రెడ్డి పేరు నిన్నమొన్నటి వరకు మీడియాలో మారు మ్రోగేది. కాంగ్రెస్‌లో ఉంటూ సోనియాగాంధీనే ఎదిరించిన నేతగా, చక్రం అడ్డువేసి విభజనను అడ్డుకునే మహావీరునిగా ఆయన పేరు మారుమ్రోగింది. మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్న ప్రతి తార టిడిపి వైపు చూసినా చలించని హేమ లాంటి నటికూడా కిరణ్ కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్రలో చేరి మండపేట నుంచి పోటీ చేశారు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అనే ఆసక్తి జనంలో ఉండడం సహజమే. ఏం చేస్తున్నారు అంటే క్రికెట్ చూస్తున్నారు అంటూ ఠక్కున చెప్పవచ్చు కానీ క్రికెట్ 24 గంటలు ఉండదు కదా మిగిలిన సమయంలో ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పార్టీ ఏమైంది? సమైక్యాంధ్ర పరిస్థితి ఏమిటి? అన్నీ సందేహాలే. ఇంతకూ జనం సమైక్యాంధ్రను తిరస్కరించారా? కిరణ్ కుమార్‌రెడ్డి నాయకత్వాన్ని తిరస్కరించారా? ఆయన విషయంలో అన్నీ సందేహాలే.


సాధారణంగా ఎన్నికల ఫలితాలు  చాలా మంది నాయకుల విషయంలో ఇప్పుడు వాళ్లేం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉదయించేట్టు  చేస్తాయి . చంద్రబాబు రెండుసార్లు ఓడిపోయినా  మీడియా ప్రచారం పుణ్యమా అ ని ఆయనే సీఎం అనిపించేది. 83లో ఓడిపోగానే టిడిపిలో చేరడం ఆయన తీసుకున్న తెలివైన నిర్ణయం లేకపోతే ఎన్టీఆర్ అల్లుడు ఇప్పుడేం చేస్తున్నాడు? అనే ప్రశ్న  వినిపించేది.
 మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు విషయంలో మాత్రం  ఈ ప్రశ్న వేసుకోవలసిందే. ఆయనిప్పుడు ఏం చేస్తున్నారో? నంబర్ టూ పదవి కోసం బాబుతో పోటీ పడి 95లో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇప్పుడాయన ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించుకునే స్థితికి వచ్చారు. టిడిపిలో ఆయన బాబు కన్నా సీనియర్... బిజెపితో స్నేహం విషయంలో కూడా ఆయన బాబు కన్నా సీనియర్ కానీ ఏం లాభం సరైన సమయంలో తప్పుడు నిర్ణయంతో దెబ్బతిన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పుస్తకాల రచనలో మునిగిపోయారు. బహుశా ఇప్పుడు రచయితగా కొత్త అవతారంలో కనిపించవచ్చు. 

బాబు అధికారంలో ఉన్నప్పుడు వైస్రాయ్ ప్రభాకర్‌రెడ్డి ఆయనకు కుడిభుజంగా కనిపించేవారు. ఆయనిప్పుడు రాజకీయాలకు దూరంగా హోటల్ వ్యాపారం విస్తరణలో బిజీగా ఉన్నారు. ఒక్కటి మాత్రం నిజం. ఏదీ శాశ్వతం కాదు. మాకు ఎదురు లేదు విర్రవీగితే ఇప్పుడేం చేస్తున్నారు? అని గుర్తు పెట్టుకునే వారు కూడా ఉండరు. ఈ సత్యాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

25, మే 2014, ఆదివారం

బ్రహ్మచారుల రాజకీయ అశ్వమేధ యాగం

‘‘ఊహించని విధంగా ఈ ఎన్నికల ఫలితాలు ఇలా ఎందుకు వచ్చాయంటావు?’’
‘‘ఎవరు ఊహించని విధంగా? నువ్వు ఊహించక పోతే ఎవరూ ఊహించనట్టేనా? ’’
‘‘అంటే నువ్వు ముందుగానే ఈ ఫలితాలు ఊహించావా?’’
‘‘ ఆ మాట నేనన్నానా? ..... బాగా ఆలోచిస్తే, ఈ ఫలితాల వెనుక ఒక రహస్యం ఉందనిపిస్తోంది.’’


‘‘ ఏమిటా? రహస్యం’’
‘‘తొందరెందుకు? చెబుతా! దాని కన్నా ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. పెళ్లి చేసుకుని చల్లగ కాపురం ఉండాలని ఒకరు చెబితే, పెళ్లి మానండోయ్ బాబు కళ్లు తెరవండోయ్ అని మరొకరు చెప్పారు. ఎవరి అనుభవం వారిది. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా కాపురం చేయాలని, భావ కవుల వలె ఏవో పాటలు పాడేయమని చెప్పిన గీత కవిని ఏమండీ పెళ్లిలో అంత సుఖముందా? అని ప్రశ్నిస్తే, దర్శకుడు కోరినట్టు పాట రాస్తాను, నిర్మాత ఇచ్చింది తీసుకుంటాను మిగిలిన దానితో నాకేం సంబంధం అంటాడు. పెళ్లి చేసుకోమని చెప్పినట్టే షాదీ మాటే వద్దు గురూ అని రాయమంటే రాస్తాను నాకేం అంటాడు. పెళ్లిలో సుఖం ఉందా? బ్రహ్మచర్యంలో ఆనందం ఉందా? అంటే ఒక్కొక్కరి అనుభవం ఒక్కో లా ఉంటుంది.... పెళ్లి లేకుండా జీవితం సంగతి ఎలా ఉన్నా, రాజకీయాల్లో మాత్రం ఎదురులేదనిపిస్తోంది.’’


‘‘ఎన్నికల ఫలితాల గురించి రహస్యం చెబుతానని చెప్పి, పెళ్లి రాజకీయం అంటూ లింకు లేకుండా మాట్లాడుతున్నావు’’
‘‘మన దేశంలో రాజకీయాలతో లింకు లేని రంగమంటూ ఉందా? కచ్చితంగా ఉంది? పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించింది ఎవరు? అని ప్రశ్నిస్తే, నరేంద్ర మోడీ అంటారు. అదేం చిత్రమో ఆయన తాను బిజెపి కన్నా చాలా చిన్నవాడిని అని చెప్పుకుంటున్నా, అంతా మాత్రం ఆయన్ని బిజెపి కన్నా పెద్దగానే చూస్తున్నారు. గతంలో బిజెపికి వచ్చిన సీట్లు అని చెప్పుకునే వారు ఇప్పుడు మరో ఆలోచన లేకుండా మోడీకి వచ్చిన సీట్లు అని చెప్పుకుంటున్నారు’’
‘‘అది సరే ఫలితాల రహస్యం చెప్పు ముందు’’
‘‘అక్కడికే వస్తున్నాను ఫలితాలు సాధించిన వారంతా బ్రహ్మచారులే.... పెళ్లయిన బ్రహ్మచారులు, పెళ్లి కాని బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు ’’
‘‘అంటే వారికి పెళ్లి కాకపోవడం వల్లనే విజయం సాధించారనే కదా ? నీ ఉద్దేశం’’
‘‘అలా అని నేననలేదు. కానీ ఫలితాలు అలానే వచ్చాయని చెబుతున్నాను. మోడీకి చిన్న వయసులోనే పెళ్లయింది. పెళ్లయిన కొద్ది కాలానికే భార్య నుంచి విడిగా ఉంటున్నారు. అత్యధిక సీట్లు సాధించిన మోడీ పెళ్లయిన బ్రహ్మచారి. ప్రతి పక్ష హోదా ఏ పార్టీకి దక్కలేదు.. నిజమే కానీ మోడీ తరువాత అత్యధిక సీట్లు సాధించింది యువనేత రాహుల్‌గాంధీ. ఆయనకు పెళ్లి వయసు దాటి రెండు దశాబ్దాలు అయిపోయింది. ఆ లెక్కలెలా ఉన్నా ఇప్పటికైతే ఆయన ముదురు బ్రహ్మచారి’’
‘‘అవును నిజమే’’


‘‘ఇక మోడీ గాలిని తట్టుకుని మూడవ స్థానంలో నిలిచిందెవరో తెలుసా? బ్రహ్మచారిణి అవును నిజం. పురుచ్చితలైవి జయలలిత తమిళనాడులో తన భారీ పర్సనాలిటీతో మోడీ గాలిని విజయవంతంగా అడ్డుకున్నారు. మోడీ పర్యటించినా, రజనీకాంత్ మద్దతు ప్రకటించినా ఆమె గాలికి ఎదురు లేకుండా పోయింది. తమిళ అమ్మకు పెళ్లి కాలేదని వేరుగా చెప్పాలా? ఆమె బ్రహ్మచారిణే’’
‘‘ఒకటిరెండు మూడు ఏదో అలా యాధృచ్చికంగా జరిగిపోతే పెళ్లికి రాజకీయాలకు లింకు కలుపుతారా? ’’
‘‘మూడు వరకే కాదు నాలుగవ స్థానం సంగతేమిటి? మూడు దశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటలను బద్ధలు కొట్టి గడ్డిపోచతో విప్లవం సృష్టించి నాలుగవ స్థానంలో నిలిచింది పెళ్లికాని మమతా దీదీనే... ఇప్పుడేమంటావు?’’
‘‘ ఏమో పెళ్లికి రాజకీయాలకు లింకుందని నేననుకోవడం లేదు’’
‘‘సరే మోడీ స్థానంలో గుజరాత్ పీఠాన్ని అధిరోహించిన అనందిబెన్ పటేల్‌కు ఆ అదృష్టం ఎలా పట్టిందో తెలుసా? ’’
‘‘ అది కూడా నువ్వే చెప్పు’’
‘‘ఉపాధ్యాయురాలిగా స్కూల్ పిల్లకాయలకు పాఠాలు చెప్పుకునే ఆమె భర్త నుంచి విడిపోయిన బ్రహ్మచారిణి... లేకపోతే మహా మహా బడా నేతలు ఎందరో ఉండగా, ఆమెకు ముఖ్యమంత్రి పదవి దక్కిందంటే కారణం అదే అని నేనంటాను. కాదంటావా? ’’
‘‘అంకెలు చెప్పి బోల్తా కొట్టించే నాయకుడిలా ఏవేవో ఉదాహరణలు చెబుతున్నావు కానీ నాకైతే నమ్మకం కుదరడం లేదు.... సరే మాట వరుసకు నువ్వు చెప్పిన వన్నీ నిజమే అనుకుందాం. అత్యధిక ఎంపి సీట్లతో ఆరు, ఏడు స్థానాల్లో నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబులు బ్రహ్మచారులు కాదు కదా? మరి వారెలా విజయం సాధించారంటావు... ఈ లెక్కన నీ థియరీ తప్పని తేలిపోయింది కదా?’’


‘‘ఏమీ కాదు 10ఏళ్ల నిరీక్షిణ తరువాత సగం రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారు. అదీ మోడీ గాలి పుణ్యంతోనే. పదమూడేళ్ల ఉద్యమం తరువాత పది జిల్లాల రాష్ట్రానికి కెసిఆర్ ముఖ్యమంత్రి. అదే మోడీ ముఖ్యమంత్రి అయిన తరువాతనే గుజరాత్ అసెంబ్లీలోకి వెళ్లారు. ప్రధానమంత్రి పదవితోనే మోడీ పార్లమెంటులో అడుగు పెట్టారు. అంటే బ్రహ్మచారి కావడం వల్లనే కదా? మోడీని అదృష్టం వెంటాడుతోంది’’
‘‘పూర్వం రాజులు రాజ్యవిస్తరణ కోసం భార్యతో కలిసి యజ్ఞాలు కూడా చేసేవారు... నువ్వేంటి బ్రహ్మచారులకే రాజ్యాం దక్కుతుందని చెబుతున్నావు’’


‘‘నిజమేనోయ్ అది రాజరికం సంగతి, నేను చెప్పేది ప్రజాస్వామ్యం గురించి... పెళ్లికానివారైతే కుటుంబం కూడా లేదు పాపం ఎవరి కోసం దోచుకుంటాడు అనే సానుభూతి ఉంటుంది.. ఇంకో విషయం చెప్పనా? మహాభారతం మొత్తంలో మహాపరాక్రమవంతుడు ఎవరు? అంటే గుర్తుకు వచ్చేది భీష్ముడు. ఆయనా బ్రహ్మచారే... ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోతే వెన్నుపోటు బాధ తప్పేది మోడీ కన్నా రెండు దశాబ్దాల ముందే ప్రధానమంత్రి అయ్యేవారు కాదంటావా? ’’ 


20, మే 2014, మంగళవారం

జలదృశ్యం నుంచి సచివాలయానికి వంద అడుగుల దూరం 13 ఏళ్ళ ప్రయాణం

మోదీ మార్క్ ఎరువుతో దేశమంతటా కమలం పంట పండితే, పొలిమేరలోనే నమో గాలిని అడ్డుకుని తెలంగాణలో గులాబీ పంట పండించడంలో తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు విజయం సాధించారు. జలదృశ్యం నుంచి సచివాలయానికి దాదాపు వంద అడుగుల దూరం. ఆ దూరాన్ని అధిగమించడానికి తెరాసకు సరిగ్గా 13 ఏళ్ల సమయం పట్టింది. జల దృశ్యం తెరాస పుట్టినప్పటి కార్యాలయం. సచివాలయం రాష్ట్ర పాలనకు అధికార కేంద్రం. ఉద్యమ కేంద్రం నుంచి అధికార కేంద్రానికి చేరుకోవడానికి పదమూడేళ్లపాటు అలుపెరగని పోరాటం సాగింది. చివరకు కల సాకారమైంది. అనుకున్న లక్ష్యం నెరవేరింది.


2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో తెరాస ఆవిర్భావ సభ. వచ్చిన వారిలో తెలంగాణ సాకారం కావాలనే ఆశ, వస్తుందో రాదోననే అనుమానం. వాటిని పటాపంచలు చేస్తూ గమ్యాన్ని ముద్దాడే వరకూ ఉద్యమిద్దామంటూ బక్కపల్చని వ్యక్తి తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎన్ని విమర్శలు. ఎన్ని ఆరోపణలు. ఎంత దుష్ప్రచారం... అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ సాధనే అజెండాగా 13 ఏళ్లపాటు ఉద్యమం సాగించారు. జలదృశ్యం నుంచి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రికి రాత్రి తెరాస కార్యాలయాన్ని తొలగించారు. ఇప్పుడు కేసీఆర్ ఏకంగా తెదేపానే తెలంగాణ నుంచి ఖాళీ చేయించారు. ఆంధ్రకు సాగనంపారు. తెరాస ఆవిర్భావ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, కొత్తగా పుట్టిన పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. పైగా సిద్ధిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇకపై నేనే మీ సిద్దిపేట బాధ్యత చూసుకుంటానని బాబు భరోసా ఇచ్చారు. కానీ అదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చంద్రబాబును అధికారానికి దూరం చేసింది. 2001లో తెరాస ఆవిర్భావం నుంచే తెదేపా పతనం ప్రారంభమైంది. పార్టీ ఆవిర్భవించిన వంద రోజులకే జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెరాస రెండు జిల్లా పరిషత్తులే నెగ్గింది. తెరాసకు ఇది చిన్న విజయమే కావొచ్చు. కానీ, తెదేపాకు వరుస పరాజయాలు ప్రారంభమయ్యాయి. 2001 నుంచి పరాజయాలను మూటకట్టుకున్న తెదేపా, 2014 ఎన్నికలు తొలి విజయం. చిత్రంగా ఇటు తెరాస, అటు తెదేపా ఒకేసారి అధికారంలోకి వస్తున్నాయి. 2001 తరువాత తెరాస అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. 2001 తరువాత తెదేపాకు అధికారం దక్కడం ఇదే మొదటిసారి.
కేసీఆర్‌తోనే తెలంగాణ సాకారమవుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. వైఎస్సార్ అకాల మరణం తరువాత మరోసారి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ సాకారమైన తరువాత రాజకీయ ఎత్తుగడల్లో సైతం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అంచనాలే నిజమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది తెరాస. తన నిర్ణయం సరైనదేనని ఫలితాలతో నిరూపించారు కేసీఆర్. తెరాస ఆవిర్భావం తరువాత తొలిసారిగా ఒంటరిగా పోటీ చేసింది. ఒంటరి పోరులో అందరినీ ఎదుర్కొని విజయం సాధించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తెలంగాణలో అధికారం దక్కాలంటే 60 సీట్లలో విజయం సాధించాలి. హంగ్ తప్పదేమోననే ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ స్పష్టమైన ఆధిక్యత సాధించారు. పోలింగ్ ముగిసిన వెంటనే కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలి, మంత్రివర్గం ఎలా ఉండాలి, పాలన ఎలా సాగాలనే అంశంపై ఇటు నేతలతో, అటు అధికారులతో కేసీఆర్ చర్చలు సాగించారంటే విజయంపై ఆయనకు ఎంత నమ్మకమో చెప్పకనే చెబుతోంది.

18, మే 2014, ఆదివారం

అర్థ రాజ్యం - ఇద్దరు చంద్రులు

  మహారాజా రాజ్యం తూర్పు వైపు ఒక భయంకరమైన జంతువు తిరుగుతోంది. బాటసారులను మాయం చేస్తోంది. అటువైపు వెళ్లాలంటేనే ఎవరైనా భయపడుతున్నారు అంటూ గ్రామస్తులు మూకుమ్మడిగా రాజుకు మొరపెట్టుకుంటారు.
ఈరోజుల్లో మండల రెవెన్యూ అధికారిని నేరుగా కలవాలంటేనే కష్టం. ముందున్న అటెండర్, పక్కనున్న క్లర్క్ వెనక ఉన్న సీనియర్ క్లర్క్ మనం చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందాలి. పరవాలేదు అనుకుంటే అప్పుడు ఆయన దర్శనం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టెర్రరిస్టులు తమ టార్గెట్‌ను చేరుకోవడం కన్నా ప్రజలు ప్రభుత్వ అధికారిని కలుసుకోవడం కష్టం. ప్రజల వద్దకు పాలన వచ్చిన తరువాత ఇలాంటి కష్టాలు వచ్చాయి కానీ రాజరికంలో మాత్రం ప్రజలు నేరుగా రాజును కలిసేందుకు అపాయింట్‌మెంట్ అవసరం లేకుండా వెళ్లిపోయేవారని రాజుల కథలు చదివితే తెలుస్తుంది.


మళ్లీ కథలోకి వద్దాం. గ్రామస్తుల హాహాకారాలకు చలించిపోయిన రాజు తూర్పు వైపున ఆ వింత జంతువును సంహరించిన వారికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంతో పాటు అర్ధరాజ్యం బహుమతిగా ఇస్తాను అని ప్రకటిస్తారు. ఈ మాట విని వింత జంతువును సంహరించలేని రాజు దేశానే్నం రక్షిస్తాడు అని శత్రుదేశం వాళ్లు ఎందుకు దండెత్తరో అస్సలు అర్ధం కాదు. ఈ అర్ధరాజ్యం ప్రస్తావన లేని రాజుల కథలు ఎంత వెతికినా కనిపించవు. ఇందులో అనేక అనుమానాలు. పెద్ద పెద్ద బోనులు తయారు చేయించి జంతువులకు కాపాలా పెట్టినా మన నెహ్రూ జంతు ప్రదర్శన శాల నుంచే జంతువులు, వాటి చర్మాలు మాయం అయ్యాయి. పులితో దూరం నుంచి ఫోటో తీసుకో పరవాలేదు కానీ చనువిచ్చింది కదా అని దగ్గరికి వస్తే ఏదో చేస్తుందని సినిమా డైలాగులకు బాగానే ఉంటుంది కానీ ఎవడో దొంగోడు మరీ దగ్గరగా వచ్చి పులి చర్మం ఒలుచుకుపోయినా దిక్కులేదు. ఆ సంగతి వదిలేస్తే ఏదో జంతువు వచ్చి గ్రామంలో ప్రజలకు ఇబ్బంది పెడితే నలుగురు మనుషులను పంపించి దాని సంగతేమిటో చూడాలి కానీ అమ్మాయిని,అర్ధరాజ్యాన్ని ఇస్తానని ప్రకటించడం ఏమిటో ? ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకుంటే ఒక్కరు ఇద్దరు కాదు రాజులంతా ఇంతే ఏ చిన్న సమస్య పరిష్కారానికైనా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంతో పాటు అర్ధరాజ్యం ఇచ్చేస్తామంటారు. ఈ బంపర్ ఆఫర్ సరే. మరి ఆ సమస్యను మగవారే పరిష్కరించాలనేముంది. ఆడవారు పరిష్కరిస్తే, సరే మగవారే పరిష్కరిస్తారనుకుందాం. పెళ్లి కాని యువకుడే ఆ సమస్యను పరిష్కరించాలనేముంది. వయసు మళ్లిన వాడే అప్పటికే పెళ్లయినా వాడో ఆ సమస్య పరిష్కరిస్తే. ఏంటో రాజులకు మాట ఇచ్చే ముందు ఇలాంటి విషయాలు గుర్తుకు రావా?అల్లా టప్పా రాజులు కాదు చివరకు రారాజు దుర్యోధనుడు సైతం ఇలాంటి వే చేసేవాడు. కర్ణుడిపై అభిమానం పుట్టి అతనికి అర్ధరాజ్యం ఇచ్చేసి అంగరాజును చేశాడు. రారాజే అలా అయితే అల్లాటప్పా రాజులది చెప్పేదేముంది.


అర్ధరాజ్యం, రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని ముసలి రాజు ప్రకటించగానే ఐతే ఎన్టీఆర్ లేకుంటే కాంతారావు కత్తిని గాలిలో ఝుళిపిస్తూ గుర్రంపై దారి తెలియకుండా పరిగెత్తిస్తూ ప్రత్యక్షం అవుతారు. రాక్షసి కావచ్చు, వింత జంతువు కావచ్చు సమస్య ఏదైనా పరిష్కరించి అర్ధరాజ్యంతో పాటు హీరోయిన్‌ను సొంతం చేసుకుంటారు. ఈ అర్ధరాజ్యం కథలు మనకే పరిమితమేమో? తెలుగేతర రాజుల కథల్లో ఈ అర్ధరాజ్యం హామీలు అస్సలు కనిపించవు. అలాంటిదేమీ కాదు హిందీ చందమామ కథల్లో అర్ధరాజ్యం కథలు చదివామని చెబుతారేమో! తెలుగు చందమామ కథలనే హిందీలోకి అనువాదం చేసేవాళ్లు కాబట్టి అవన్నీ తెలుగు రాజుల కథలే. పద్యం తెలుగువాడి ప్రత్యేకం అయినట్టు అర్ధరాజ్యం కథలు కూడా తెలుగువాడి ప్రత్యేకత కావచ్చు. 

ఈ అర్ధరాజ్యం కథ తెలుగు వారిని వదిలేట్టుగా లేదు. తెలుగు రాజ్యాన్ని రెండుగా విభజించి ఒక చంద్రునికి సగం, మరో చంద్రానికి సగం పంచి పెట్టారు. సగం రాజ్యం దక్కింది, మా రాజ్యం మేం బాగు చేసుకుంటాము అని తొలిసారిగా పట్ట్భాషేకం చేసుకోబోతున్న తెలంగాణ రాజ్యాధిపతి సంబరపడుతుంటే మొత్తం రాజ్యాన్ని చాలా కాలం ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన నేను ఇప్పుడు రాజధాని లేని సగం రాజ్యాన్ని పాలించాల్సి వస్తోంది అని చంద్రం వాపోతున్నారు.
మంత్రిపదవి దక్కలేదని ఉద్యమం ప్రారంభిస్తే ఏకంగా రాజ్యమే దక్కింది అని కొందరి విమర్శ. నిజానికి చంద్రన్న రాజకీయం పదేళ్లక్రితమే ముగిసిపోయింది. రాజ్య విభజనతో జనం మా భవిష్యత్తు ఏమిటి? అని కలవరపడుతుంటే నాకు పాలించిన అనుభవం ఉంది నన్ను నమ్మండి ఈసారి బాగా పాలిస్తాను అని జనాన్ని నమ్మించడంతో చంద్రన్న సెకండ్ ఇన్నింగ్స్‌కు జనామోదం లభించింది. రాజ్యవిభజన వల్లే రాజ్యాధికారం దక్కింది కాబట్టి దానికి తెలుగు చంద్రన్న విభజనకు కారణం అయిన వారందిరినీ పేరు పేరును తలుచుకోవాలనేది కొందరి వాదన. తెలుగునేత మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు చంద్రన్న ఏకంగా రాజ్యాధినేత అయ్యాడనే మాటలో ఎంత నిజముందో? ఆయన ప్రారంభించిన ఉద్యమం వల్ల రాజ్యవిభజన జరిగి పరిస్థితులు మారి తెలుగు చంద్రన్న రాజ్యధినేతగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారనే మాటలో అంతే నిజముంది. ఈ మాటలో ఎంత అబద్ధం ఉందో, ఆ మాటలో కూడా అంతే అబద్ధం ఉంది.


ఆకాశంలో సగం, అర్ధాంగి, అర్ధనారీశ్వరుడు అబ్బో ఎన్ని అర్ధకు ఎన్ని అర్ధాలో... అంతా బాగానే ఉంది కానీ సగం సగం అన్నప్పుడు రాజ్యాన్ని రెండు సగాలు చేసినప్పుడు ఒక సగం న్యాయంగా ఆడవారికి దక్కాలి కదా? అర్ధరాజ్యానికి ఆడవారు ముఖ్యమంత్రి కావాలనేది నా కల అని యువరాజావారు చెప్పినా జనం మాత్రం ఎందుకో పట్టించుకోలేదు. 

11, మే 2014, ఆదివారం

ఆయనంతే... అదో టైపు!

ఏ మోయ్ కాంతం ఎప్పుడు లేనంత అందంగా కనిపిస్తున్నావు? ఏమిటో విశేషం ’’
ఆ మాటలతో కాంతం ఒక్కసారిగా సిగ్గుతో ముడుచుకుపోయి ‘ముసలోడికి దసరా పండగ అని ఈ వయసులో ఏమిటా? చిలిపి మాటలు’’ అంటూ పైకి కోపం నటిస్తూనే లోలోన మురిసిపోయింది.

‘‘ఉన్నమాట చెబితే కోపమెందుకు? ఆ నల్లంచు తెల్ల చీరలో మెరిసిపోతున్నావోయ్ శే్వతా దేవి ’’ అని కుటుంబరావు అనగానే కాంతం మెలికలు తిరిగిపోతూ, చాల్లేండి ఎవరైనా వింటే నవ్విపోతారు’’ అంది. ఇంతలోనే కాలింగ్ బెల్ మ్రోగడంతో వెళ్లి తలుపు తీసింది. పక్కింటి పచ్చమ్మ ‘‘కాంతం రెడీ అయ్యారా? పంక్షన్‌కు టైం అవుతుంది పదండి’’ అని హడావుడి చేసింది. ‘‘అంతా పంక్షన్‌కు వెళున్నారా? ఈ రోజు పచ్చమ్మ కొత్త పెళ్లి కూతురంత అందంగా ఉంది . చెంపల్లో ఎప్పుడూ లేనంత మెరుపు కనిపిస్తోంది. ఏమిటా? విశేషం అనుకున్నాను’’ అని కుటుంబరావు పచ్చమ్మను పలకరించాడు. ఆ మాటలతో ఒకేసారి కాంతం, పచ్చమ్మ నివ్వెరపోయారు. అసలు ఇంట్లో ఉన్నాడా? లేడా? అన్నట్టు ఉండే కుటుంబ రావు ఒక్కసారి కూడా పలకరించి ఎరుగడు. అలాంటిది ఏకంగా తనను కొత్త పెళ్లి కూతురులా మెరిసిపోతున్నారు అనడం పచ్చమ్మకు నమ్మశక్యం కాకుండా ఉంది. ఈ మాట వినగానే కాంతం నిర్ఘాంత పోయింది. మా ఆయన మంచోడు ఇంటికెవరైనా ఆడవారు వస్తే తలెత్తి కూడా చూడకుండా తన గదిలోకి వెళతాడు అని ఇంత కాలం గొప్పగా అనుకున్నాను... కానీ ఛీ..్ఛఛీ... ఈ వయసులో ఆయనకు ఇదేం పాడు బుద్ధి నా ముందే ఇంటికొచ్చిన ఆడవారి అందాలను పొగుడుతున్నాడు అని కాంతం బాధపడింది. ఆమెకు పచ్చమ్మ ముఖం చూసేందుకు మనసొప్పలేదు. ఏంటీ ఇంకా రెడీ అయ్యారా? లేదా? అంటూ కమలమ్మ తలుపు తోసుకొచ్చి, పచ్చమ్మ భుజంపై చేయి వేసి, తొందరపెట్టింది. ఆమెను చూడగానే కుటుంబరావు చిన్నగా ఈలవేసి ‘‘ ఓహో ముద్దు గుమ్మ కమలమ్మ కూడా వచ్చిందా? శే్వతమ్మ, కమలమ్మ, పచ్చమ్మ ముగ్గురూ అందగత్తెలే ఒకరిని మించిన వారు ఒకరు. పచ్చమ్మకు, కమలమ్మకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది ఇప్పుడేంటి భుజం భుజం కలిపి నడుస్తున్నారు?’’అంటూ కుటుంబరావు అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాలో వారికి అర్ధం కాలేదు. కాంతానికి మాత్రం తలకొట్టేసినట్టు అనిపించింది. ఇంకాస్సేపు ఉంటే ఈ ముసలాయన వాళ్ల అంద చందాల గురించి ఇంకేం మాట్లాడతాడో అనే భయంతో వారిని తీసుకొని బయటకు నడిచింది.

‘‘ఏమీ అనుకోకండి మా ఆయన ఇంతకు ముందెన్నడూ లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు’’ అని క్షమాపణ చెబితే, ‘‘మనలో మనకు క్షమాపణలేందుకు? వయసు మీరిన తరువాత ఎవరి నుంచైనా మన అందం గురించి పొగడ్తలు వింటే ఇంకా వినాలనిపిస్తుంది కానీ కోపం రాదు అని ముద్దుగుమ్మలు నవ్వుతూ కోరస్‌గా చెప్పారు.
***


కుటుంబరావు వ్యవహారం ముదిరిపోవడంతో కాంతమ్మ ‘‘ఏమండీ ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఈలవేస్తూ పని మనిషి అందాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. ఇంత అద్భుతంగా ఈలవేయడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. మీకేమైందండి’’ అని కాంతం కన్నీళ్లు తుడుచుకుంది.


‘‘పిచ్చి కాంతం నేను ఎప్పటిలానే ఉన్నాను. నీకే ఏదో అయింది’’ అంటూ రిమోట్ అందుకుని టీవి ఆన్ చేశాడు. రాష్టమ్రంతటా యువనేత పవనాలే వీస్తున్నాయి అని తన్మయంగా చెబుతోంది ఆ న్యూస్ రీడర్. ఆయన సింహాసనంపై కూర్చున్న తరువాతనే తాను తల్లి కడుపులో నుంచి బయటకు వస్తానని గర్భస్థ శిశువు శపథం చేసినట్టు మా ప్రత్యేక విలేఖరి కథనం. చానల్ మార్చగానే ‘‘వృద్ధ నేత గడ్డానికి ఫిదా అయిపోయిన ప్రజలు. ఆయనే మళ్లీ రావాలని ప్రపంచ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈరోజు నేను అమెరికాను ఇంత సమర్ధవంతంగా పాలిస్తున్నాను అంటే దానికి ఆయన చూపిన మార్గమే కారణం అని ఒబామా తన  సెక్రటరీతో చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన గెలుపు కోసం ప్రపంచ దేశాల పాలకులు దేవుళ్లను మొక్కుతున్నారు’’ అని మరో చానల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో అదరగొడుతోంది.


‘‘చూశావా కాంతం టీవి ఒకటే, రిమోట్ ఒకటే కానీ చానల్‌ను మారిస్తే అదే టీవి తెరపై యువనేత అధికారంలోకి రావడం ఖాయం అంటుందో చానల్, వృద్ధనేత ఆల్‌రెడీ సింహాసనంపై కూర్చున్నారంటోంది మరో చానల్ ... ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అంతా నాటకం. మన టీవి మనకే అబద్ధం చెబుతుందా? అంటే ఏం చెబుతాం, ఈ లోకం అంతే కాంతం ... అంతే...’’ అంటూ కుటుంబరావు ఇంకా ఏదో చెప్పబోతుంటే కాంతానికి కన్నీళ్లు ఆగలేదు. పాత సినిమాలో తాగుబోతు హీరో వద్ద ఉండే రామయ్యా అనే నౌకరు పాత్ర ఇలానే అర్ధం పర్థం లేకుండా నీతులు చెబుతుంది. మా ఆయనకు ఈ మాయదారి రోగం వచ్చిందేమిటి దేవుడా?అని కాంతం కన్నీళ్లు పెట్టుకుని డాక్టర్ వద్దకు పరుగులు తీసింది.
***
హలో కుటుంబరావు గారూ ఏంటీ ఒంట్లో నలతగా ఉందా? మీ ఆవిడ కంగారు పడుతుంటే నేను వచ్చాను అని డాక్టర్ పలకరించారు. కుటుంబరావు టీవిల్లో వార్తల విశే్లషకునిగా వస్తుంటాడు దాంతో చుట్టు పక్కల బాగానే పాపులర్.
‘‘ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయంటారు?’’ అని డాక్టర్ సంభాషణ ప్రారంభించారు.
‘‘ముందు మీరు ఏ పార్టీనో చెప్పండి... చానల్‌ను బట్టి మా విశే్లషణ ఉంటుంది? అలానే మీరే పార్టీనో చెబితే ఫలితాలు ఎలా ఉంటాయో చెబుతాను’’ అని కుటుంబరావు నవ్వాడు.
***
‘‘జలుబుకు చికిత్స జరిపితే వారంలో, జరపకపోతే ఏడు రోజుల్లో తగ్గిపోతుంది. మీ ఆయన క్కూడా అంతే. చికిత్స చేస్తే వారంలో, చేయకపోతే ఈనెల 16న మధ్యాహ్నానికి సాధారణ స్థితికి వస్తారు’’ అని డాక్టర్ భరోసా ఇచ్చారు.
కాంతం అర్ధం కానట్టు అయోమయంగా చూస్తే, ఏమీ లేదమ్మా మీ ఆయన ఎన్నికల ఫలితాలపై ఒక్కో టీవిలో ఒక్కో రకంగా విశే్లషణ చేసి చేసి అలా అయ్యారు. మే 16న ఫలితాలు వచ్చాక ఆయనే మామూలు మనిషి అవుతారు. అప్పటి వరకు ఎవరైనా చేసేదేమీ లేదన్నాడు.

6, మే 2014, మంగళవారం

మిస్టర్ లోకేశం



సూపర్ స్టార్ కృష్ణ కొడుకైనా సత్తాలేకుండా సినిమాల్లోకి వస్తే.. రమేష్ బాబు అవుతాడు? సత్తా చూపితే మహేష్ బాబు అవుతాడు.
***
ఎవరైనా ఊపిరి తీసుకుని బతుకుతారు. ఆయన మాత్రం రాజకీయమే ఊపిరిగా బతుకుతారు. చదువుకునే రోజులనుంచే రాజకీయ ఎత్తుగడలు నేర్చుకున్న చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్. కానీ -ఆయన రాజకీయ రంగ ప్రవేశమే పేలవంగా జరిగింది. తేదీలు ప్రకటించి ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, చిరంజీవి లాంటి వారంతా తాము సినిమా రంగంలో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడే వారసులను తెరపైకి తెచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం వరుసగా రెండుసార్లు ఓడిపోయి సంక్షోభంలో పడిన సమయంలో తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తన పాదయాత్ర ముగింపు సభలో లోకేశ్‌ను ప్రవేశపెట్టాలనే ప్రయత్నం కుటుంబ రాజకీయాలతో ఫలించలేదు. సైకిల్ యాత్ర అంటూ హడావుడి చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక, లోకేశ్‌ను రాజకీయాలకు విడుదల చేశారు.
‘నగదు బదిలీ పథకం సృష్టికర్త’ -అంటూ నారా లోకేశ్ ట్విట్టర్‌లో తన గురించి తాను రాసుకున్నారు. ‘తెరవెనుక పార్టీ ప్రచారానికి వ్యూహ రచన చేసేది మా అబ్బాయే’ -అని బాబు మురిపెంగా చెప్పుకున్నారు. కానీ, జనం మాత్రం లోకేశ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ‘ఏమంటివేమంటివి..’ అంటూ ఎన్టీఆర్‌లా డైలాగులు చెప్పాలని పవన్ ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది. లోకేశ్ ప్రయత్నం కూడా అలానే ఉంది. ఏదో ఆవేశంగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు, సాధ్యం కావడం లేదు. కుల పిచ్చి ఉన్న పార్టీ తెదేపానే.. అని ఒకసారి, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మనకు మనం ఉరివేసుకున్నట్టేనని మరోసారి ఆవేశంగా మాట్లాడడం వెనక ఉన్నవారు జాగ్రత్తలు చెప్పడం ఈ వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు వినోదాన్ని కలిగిస్తున్నాయి.

అనంతపురం జిల్లాలో లోకేశ్ తొలి రాజకీయ సభ. ఆ సభ ఏర్పాటు చేసి లోకేశ్ పక్కనే ఐదారు గంటలపాటు ఓ యువనేత కూర్చోవాల్సి వచ్చింది. నాలుగు రోజుల తరువాత మళ్లీ కలిస్తే -ఎవరు? అని అడిగారట లోకేశ్. తనను తాను మళ్లీ పరిచయం చేసుకున్నాడు యువనేత. రాజకీయాల్లో రాణించాలంటే అస్సలు ఉండకూడని లక్షణమిది. ఒకరకంగా చంద్రబాబు అదృష్టవంతుడు. తన పార్టీలోనే కాదు తన ఇంట్లో సైతం ఆయనకు ఎలాంటి పోటీ లేదు. శరీరం సహకరించినంత వరకు రాజకీయాల్లో కొనసాగే అదృష్టం ఉన్న నాయకుడు చంద్రబాబు.

రాజకీయాల్లోకి రావడం కోసం లోకేశ్ ఒక చానల్‌ను నిర్వహించాలని ప్రయత్నించినా సాధ్యంకాక చేతులెత్తేశారు. తండ్రి నిలబెట్టిన హెరిటేజ్ నిర్వహణలో మాత్రం దూసుకు వెళ్తున్నారు. మాట తీరు, వ్యవహారం, ఏ ఒక్కటీ రాజకీయాల్లో రాణించే లక్షణాలు లోకేశ్‌లో కనిపించడం లేదు. మీడియా అభిమానంతో ఆకాశానికెత్తినా నిలబడలేరు. సూటిగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడం, ప్రజల్లో మమేకం కావడం, అనుచరులకు విశ్వాసం కలిగించడం వంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. 

వైఎస్సార్, చంద్రబాబు ఒకప్పుడు మంచి మిత్రులు.. ఇద్దరూ 78 బ్యాచ్ ఎమ్మెల్యేలే. ఇద్దరి సంతానం రాజకీయాల్లోకి వచ్చింది. కానీ ఇద్దరికీ పోలికే లేదు. బాబును తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం అతనిలోని రాజకీయ నేతను, తెరవెనుక వ్యూహాల్లో ఆయన తెలివిని కాదనలేరు. కానీ లోకేశ్‌లో అవేవీ మచ్చుకైనా కనిపించవు. కానీ -లోకేశ్‌ను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు పిలిచి సీటు ఇచ్చాయని బాబు చెబుతుంటారు. వినేవాళ్లుంటే చంద్రబాబు చాలా చెప్తారంటారు -మీడియా మిత్రులు.

4, మే 2014, ఆదివారం

దారితప్పిన మేధావి

సబ్బం హరి. ఈ పేరు తలుచుకోగానే ఔను ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? గతంలో ప్రతిరోజూ టెలివిజన్ చర్చల్లో కనిపించే వారు కదా! ఇప్పుడు కనిపించడం లేదేమిటి? అనే ప్రశ్నలు ఒకదాని తరువాత ఒకటి తన్నుకొస్తాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా బలమైన వాదన వినిపించేవారు. ఇప్పుడాయన ఏం చేస్తున్నట్టు? -అంటే విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తున్నారు? అదీ -జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి. ఇది నిజ్జంగా నిజం. ఆ పార్టీకి ఆయన ఉపాధ్యక్షుడు కూడా. 

టెలివిజన్ చర్చలు దెబ్బతీసిన నాయకుల్లో సబ్బం హరి ఒకరు. వైఎస్సార్ ఉండగా, ఆయనకు గట్టి మద్దతుదారునిగా నిలిచారు. వైఎస్సార్ మరణం తరువాత అంతకుమించి జగన్‌కు అండగా నిలిచారు.. జగన్ మీద ఈగవాలినా సహించక పోయేవారు. రోజూ టెలివిజన్ చానెళ్లలో కనిపిస్తూ జగన్‌కు అండగా నిలిచారు. అంతా బాగానే ఉంది. కానీ గొప్ప మేధావిని అనే గట్టి నమ్మకం ఆయన్ని రాజకీయాల్లో దెబ్బతీసింది. అసలే మేధావిననే నమ్మకం.. పైగా టీవీ చర్చలు. ఊరికే ఉంటారా? జగన్ యూపీఏకు మద్దతిస్తారంటూ ప్రకటించేశారు. సబ్బం వ్యాఖ్యలను అందిపుచ్చుకున్న తెదేపా -జగన్‌పై దాడి మొదలెట్టింది. దాంతో వైకాపా వాళ్లు మేం ఎవరికి మద్దతిస్తామో చెప్పడానికి సబ్బం హరికి సంబంధమేంటి? ఆయనసలు మా పార్టీనే కాదు, ఆయనకు మా పార్టీ సభ్యత్వం కూడా లేదు -పొమ్మన్నారు.
మేధావి అహం దెబ్బతింది. నేనేమీ వైకాపా సభ్యత్వం కోసం 

దేబిరించలేదు అంటూ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌లో ఉండి జై సమైక్యాంధ్ర అంటున్నందున ఏకంగా జై సమైక్యాంధ్రనే నమ్ముకుంటే పోలే అనుకుని కిరణ్ అధ్యక్షతన ఉన్న జై సమైక్యాంధ్ర పార్టీకి ఉపాధ్యక్షుడయ్యారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో బాగా ఊహించి అధినాయకుడు కిరణ్‌కుమార్‌రెడ్డినే పోటీకి దూరంగా ఉంటున్నందున పోటీలో ఉన్న సబ్బం హరి పరిస్థితి ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలుగుతాడని భావించిన నాయకుడు చివరకు ఇలా అయిపోయారు. జగన్ జైలులో ఉన్నంతకాలం ఆయనకు మద్దతుగా నిలిచారు. తీరా బయటకు వచ్చే సమయానికి పార్టీ వీడి వెళ్లారు. విశాఖ మేయర్‌గా పని చేసిన సబ్బం హరి, 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో కృషి చేశారు. పార్లమెంటులో చివరి వరకూ పోరాడారు. సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టటంతో కాంగ్రెస్‌కు దూరమయ్యారు. టీవీ చర్చలతో జగన్ పార్టీకి దూరమయ్యారు. కిరణ్‌కు చేరువైనా, కిరణ్‌కే రాజకీయ జీవితం లేనప్పుడు ఇక సబ్బానికేముంటుంది? అన్న సంపతీ డైలాగులు ఎదుర్కొంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఐదుశాతం ఓట్లు కూడా రావని లెక్కలు 
చెబుతున్న సబ్బం, తనకు ఎన్ని శాతం ఓట్లు వస్తాయో చెప్పలేకపోతున్నారు. విశాఖ మేయర్‌గా పట్టణంలో మంచి పట్టుసాధించారు. హేమాహేమీలను తట్టుకుని 2009లో పార్లమెంటుకు ఎన్నికైన సబ్బం రాజకీయ జీవితం ఇప్పుడు క్రాస్‌రోడ్‌లో ఉంది.

ముదురు ప్రేమికుల దినోత్సవం

జీవితం నుంచే సినిమాలు పుడతాయి, సినిమాల నుంచి జీవితాలు ప్రభావితం అవుతాయి. ఇప్పుడు సినిమాలేమో కుర్ర హీరోల ప్రేమ కథలతో చెలరేగిపోతున్నాయి. యువత చదువు ఉద్యోగం వేటలో ఎప్పుడూ లేనంత టెన్షన్ అనుభవిస్తుంటే, అచ్చం గతంలో సినిమాల వలెనే సీనియర్ సిటిజన్స్ ప్రేమలో పడిపోతున్నారు. పెళ్లి చేసుకుంటావా? తాతా అంటే నాకెవడిస్తాడు పిల్లను అనేది పాత మాట. ఈ తరం తాతలు ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి అదృష్టవంతులు కొందరేననుకోండి. ఇలాంటి అదృష్టవంతుల ప్రేమ కథలు మాత్రం యాధృచ్చికంగానే బయటపడుతున్నాయి. 

అదేదో సినిమాలో శ్రీలక్ష్మి మూగపాత్రలో నటించింది. ఆమెకు హఠాత్తుగా మాటలొస్తాయి. ఇంకేం అంత కాలం అణిచిపెట్టుకున్న మాటలన్నీ అసందర్భంగా బయటకు తన్నుకొస్తుంటాయి. స్కూల్‌లో చదివేప్పుడు పెన్సిల్ ఎత్తుకెళ్లాడని మొగుడ్ని చితగ్గొడుతుంది చిన్నప్పటి విషయాలు పెద్దయ్యాక తెగ మాట్లాడేస్తుంది.


ఎన్నికల ప్రచారం, కోర్టు తీర్పులు, ప్రత్యర్థులపై నిఘా పుణ్యమా అని ఇప్పుడు అలానే ఎనె్నన్నో రహస్యాలు బయటకు వచ్చేస్తున్నాయి. మా మోదీ దేశం కోసం పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా? అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకునే వారు. దిగ్విజయ్‌సింగ్ మాత్రం అదేం కాదు మోదీకి భార్య ఉన్నారంటూ చెప్పుకొచ్చేవారు. నాయకులపై ఆరోపణలు సహజం కాబట్టి వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు ఏ కాలంను ఖాళీగా వదిలేయడానికి వీలు లేదు అన్నింటిని పూరించాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు పుణ్యమా అని నరేంద్ర మోదీ తన పెళ్లి రహస్యాన్ని బట్టబయలు చేయక తప్పలేదు. ఈ వ్యవహారంలో బిజెపి వాళ్లకు దిగ్విజయ్‌పై కోపం వచ్చిందో లేక తెర వెనుక వ్యవహారం ఏమిటో కానీ దిగ్విజయ్ సింగ్ అమృతారాయ్‌తో ప్రేమాయణం సాగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.  67 ఏళ్ల దిగ్విజయ్‌సింగ్ తనలో  సగం వయస్సున్న అమృతారాయ్‌ ని అర్ధాంగిగా మార్చుకోనున్నారు . విషయం బయటపడిన తరువాత ఆమె  తో నిండా ప్రేమలో మునిగిపోయినట్టు, అమెకు విడాకులు మంజూరైన మరుక్షణమే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు.. ఆమె కూడా కాబోయే భర్తకు తగిన ఇల్లాలులా పరస్పరం విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాం, అవి అందగానే దిగ్విజయ్ నేనూ ఒకటవుతాం అని ప్రకటించింది.

ఈ ముదురు ప్రేమికుల పుణ్యమా అని జాతీయ మీడియా మరోసారి ఎన్టీఆర్‌ను జ్ఞాపకం చేసుకుంది. ఆయన దిగ్విజయ్‌కన్నా పెద్ద వయసులో కనీసం విడాకుల కోసం దరఖాస్తు కూడా చేయకముందే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు.
విడాకులు, మళ్లీ పెళ్లి ఇప్పుడేం కొత్త కాదు.. కానీ కొన్ని ముదురు ప్రేమలే మరీ చోద్యంగా అనిపిస్తున్నాయి. ఎక్కడో అమెరికాలో 60 ఏళ్లాయన పెళ్లి చేసుకున్నాడని, ఎవరో ఎలిజబెత్ టేలర్ డజన్ల కొద్ది పెళ్లిళ్లు చేసుకుంటుందని వింతగా చెప్పుకునే వారు ఇప్పుడు మనకూ ఇవి కామన్‌గా మారిపోయాయి.


ప్రజా జీవితంలో ఉన్నవారి ఇలాంటి ప్రేమలను ప్రజలు సహించరు అని చెప్పడానికి కూడా వీలులేదు. ఎన్టీఆర్ 70ఏళ్ల వయసులో లక్ష్మీపార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అప్పుడు టిడిపి నాయకులు మా రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే అని కుమిలిపోయారు. తీరా చూస్తే ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతుంటే తమ్ముళ్లు ఈలలు,అరుపులతో ఆనందంగా గెంతులేశారు. ఫలితాలు వచ్చాక చూస్తే కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదు. ఈ ప్రజలు దేన్ని ఆమోదిస్తారో, దేన్ని వ్యతిరేకిస్తారో అర్ధం కాదు. అలా అని దిగ్విజయ్‌సింగ్ తన ప్రేమ పురాణాన్ని బహిర్గతం చేశాడని జనం గెలిపిస్తారా? అంటే అంత సీన్ కనిపించడం లేదు. 

బాబులాగానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగ్విజయ్ సంస్కరణ వాదిగా పేరు తెచ్చుకున్నారు. కొంచం ముందు కొంచెం వెనుక అన్నట్టుగా దాదాపు ఒకే కాలంలో ఇద్దరు అధికారం కోల్పోయారు. అధికారం తప్ప మరేదీ బాబుకు జీర్ణం కాదు. ఆయన అధికారాన్ని అంతగా ప్రేమించారు. అవసరం అయితే జిల్లాకు ఇద్దరు ముగ్గురు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలి అంతే .. ప్రేమిస్తే అంతే లైలా ప్రేమ కోసం సామ్రాజ్యాన్ని వదలుకున్నాడు మజ్నూ. ప్రేమ అత్యంత శక్తివంతమైంది. అది అమ్మాయిపై ప్రేమ కావచ్చు, సింహాసనం పై ప్రేమ కావచ్చు. సింహాసనంపై ప్రేమను విజయవంతం చేసుకునే సూచనలు కనుచూపు మేరలో కూడా కనిపించక పోవడంతో దిగ్విజయ్‌సింగ్ అమృతారాయ్ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ప్రేమలో తన్మయంలో మునిగిపోయినప్పుడు ఎవరు ఫోటోలు తీశారో, ఎవరు లీక్ చేశారో ఏమిటో కానీ వ్యవహారం సామాజిక మాధ్యమాలకు ఆ తర్వాత ప్రతికలకెక్కింది. ఇలాంటి వ్యవహారాల్లో దిగ్విజయ్ మొదటి వారు కాదు చివరి వారు కాదు.
ఎన్టీఆర్ ప్రేమ తెలుగుదేశం చరిత్రను మలుపు తిప్పింది. శశిధరూర్ ప్రేమ ఆయన మంత్రిపదవికి ఎసరు పెట్టింది. ముదురు ప్రేమలో తాత లాంటి వారు ఎన్‌డి తివారి. తన ప్రేమ ఈ వయసులో ఆయన్ని ఇరకాటంలో పెట్టింది. ఎన్ని ప్రేమలో ఆయనకు ఎన్నని గుర్తుంటాయి. చివరకు వాళ్ల అబ్బాయి కోర్టుకెక్కి తివారీనే తండ్రి అని కోర్టుతో చెప్పించుకున్నారు. మరోవైపు ఆయన ప్రేమాయణం గవర్నర్ పదవికి ఎసరు తెచ్చింది.


ఆ మధ్య తారా చౌదరి పట్టుబడ్డప్పుడు చాలా మంది తెలుగు ముదురు ప్రేమికుల పేర్లు బయటకు వచ్చాయి. తరువాత ఏం జరిగిందో కానీ ఎవరికి ఏమీ జరగలేదు, ఆమె బయటకు వచ్చారు. ప్రేమిస్తే పోయేదేమీ లేదు, తిరిగి వారు ప్రేమిస్తారు అనే సినిమా డైలాగు బాగానే ఉంది కానీ ముదురు ప్రేమికులు ప్రేమించేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కెమెరాలు ఉన్నాయో? ఎవరు నిఘా పెట్టారో చూసుకోవాలి లేకపోతే లేటు వయసులో పెళ్లికి ఒప్పుకోవలసి వస్తుంది. ప్రేమికుల దినోత్సవం లానే ముదురు ప్రేమిలకూ ఒక దినం ఉండాలి.
సాహసం చేయకురా నాయకా పదవి ఊ డేను 
రాజ నీతి .. రాజకీయ నాయకులు పదవిని ప్రేమించినట్టు ఆడవారిని ప్రేమిస్తే పదవి ఊ డుతుంది