20, డిసెంబర్ 2011, మంగళవారం

బుల్లితెరపై భక్తి ఉద్యమం



మతం మనుషులకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అంటే రెండు వైపులా బలంగా వాదించవచ్చు. ఈ వాదన కొత్తేమీ కాదు. తరతరాల నుండి ఉన్నదే. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన తరువాత, కంప్యూటర్ యుగంలో ఇంకా ఈ నమ్మకాలేమిటి? అనే వాదన కంప్యూటర్‌లు మన దేశంలోకి వచ్చిన కొత్తలో బాగా వినిపించేది.
 ఇప్పుడు ఇంటింటికి కంప్యూటర్ , ప్రతి చేతిలో సెల్‌ఫోన్ అన్నంతగా పరిజ్ఞానం పెరిగింది. అయితే మేధావులు ఊహించినట్టుగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత భక్తి భావం తగ్గలేదు. మరింతగా పెరిగింది. ఇప్పుడు అమెరికాలో ఉన్నా, గల్ఫ్ దేశంలో ఉన్నా ఇంట్లో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజలను తిలకించవచ్చు, పులకించి పోవచ్చు. ఉదయం లేవగానే తిరుమలలో వినిపించే సుప్రభాతాన్ని ఇంట్లో నుండి వినవచ్చు. మనిషి జీవితం సంక్లిష్టంగా మారినా కొద్ది దైవంపై భక్తి మరింతగా పెరుగుతుంది. ఆధునిక జీవితంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఒక్క మానసిక ప్రశాంతత తప్ప. ఇలాంటి పరిస్థితిలో తనకు తెలియని ఏదో ఒక శక్తి ఉందని మనిషి నమ్ముతాడు. ఈ నమ్మకం అతనికి కొంత మానసిక ప్రశాంతతను ఇస్తుంది అంతే తప్ప సమాజానికి నష్టమేమీ లేదు.

 మానసిక ప్రశాంతత కోరుకునే వారు దైవాన్ని నమ్ముతున్నారు. దైవ దర్శనం అంటే వయసు మీరిన వారికి సంబంధించిన విషయమేమీ కాదు ఇప్పుడు. సంపద ఎక్కువ ఉన్న చోట భక్తి సైతం ఇప్పుడు ఎక్కువగానే కనిపిస్తోంది. ఆలయాలను సందర్శిస్తే పెద్దవారి కన్నా యువత ఎక్కువ కనిపిస్తున్నారు. మనం సాంకేతికంగా ఎంతో ముందడుగు వేసినా నైతిక విలువల విషయంలో మన పరిస్థితి ప్రశ్నార్ధకంగానే ఉంది. భక్తి భావం మనిషిలో విలువలను పెంచుతుంది. ఏ మతమైనా కావచ్చు దైవాన్ని విశ్వసించే వాడి మొత్తం సమాజం మంచిని కోరుతారు. మీడియాలో సైతం భక్తి అంశాలకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. దాదాపు తెలుగు పత్రికలన్నీ ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రత్యేకంగా పేజీలు కేటాయిస్తున్నాయి. ఇప్పుడు బుల్లితెరపై సైతం భక్తి ఉద్యమం సాగుతోంది.
వారానికోసారి దూరదర్శన్ సప్తగిరిలో ధర్మసందేహాలు వినేవారి సంఖ్య తక్కువేమీ కాదు. తండ్రికి తద్దినం చిన్నకొడుకు పెట్టాలా? పెద్ద కొడుకు పెట్టాలా? అనే సందేహం మొదలుకుని మహాభారత, రామాయణాల వరకు ధర్మ సందేహాల్లో ఏ అంశం గురించి ప్రశ్నించినా పండితులు చక్కని సమాధానాలు ఇస్తున్నారు. ఒక విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితోనైనా వినవచ్చు.
2007లో భక్తి పేరుతో పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఎన్‌టీవి ఒక చానల్‌లు ప్రారంభించింది. 24 గంటల పాటు చూపడానికి భక్తి కార్యక్రమాలు ఏముంటాయని అప్పుడు అనిపించి ఉండవచ్చు. కానీ నాలుగున్నర ఏళ్లపాటు భక్తి టీవి ఆధ్యాత్మిక ప్రసారాల ద్వారా భక్తులను బాగానే ఆకట్టుకుంది. దూరదర్శన్ ధర్మ సందేహాల తరహా కార్యక్రమాలు చానల్స్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఉంటోంది. ఈ తరహా కార్యక్రమానికి సప్తగిరి మార్గదర్శిగా నిలిచింది.
ఎన్‌టీవి వారి భక్తి చానల్‌తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ హిందూ మతానికి సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసే రెండు చానల్స్. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ టిటిడి వారిది కాబట్టి ఆ చానల్ కార్యక్రమాలను ప్రసారం చేయడాని కన్నా ముందు ఆ చానల్ గురించి, నిధుల దుర్వినియోగం అంటూ దాదాపు అన్ని న్యూస్ చానల్స్ హడావుడి చేశాయి.

 హిందూ ఆలయాల గురించైనా, హిందూ మతానికి సంబంధించిన విషయాలపైనైనా దాడికి మీడియా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే హిందువులు కాబట్టి. ఈ మధ్య చిన జీయర్ స్వామి తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలని క్లబ్‌కు వెళ్లి వచ్చిన భావన కలగరాదని అంటే తిరుమలలో మద్యం, వ్యభిచారం, మాంసం విచ్చలవిడిగా అంటూ జీ న్యూస్ చానల్ మసాలా దట్టించి ప్రసారం చేసింది. భక్తి చానల్ దక్షిణ భారత దేశంలోనే తొలి ఆధ్యాత్మిక చానల్. కాగా భక్తి చానల్ వస్తోందని తెలిసి టీవి9 వాళ్లు హడావుడిగా ప్రపంచంలోనే తొలి సర్వమత చానల్ అంటూ సంస్కృతిని తీసుకు వచ్చారు. ఎంత హడావుడిగా ఆ చానల్‌ను ప్రారంభించారో అంతే హడావుడిగా దాని చరిత్ర ముగిసిపోయింది. టీవి 1 అంటూ ఆ చానల్ ప్రసారాలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక చానల్‌ను ప్రారంభించబోయి తమ వల్ల కాదని చేతులు ఎత్తేసిన వారు అదే చానల్‌లో హిందువుల మనోభావాలను అగౌరవపరిచే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. సప్తగిరిలో వచ్చే ధర్మసందేహాలను పేరడీ చేస్తూ ఇడియట్ సందేహాలు అంటూ వెకిలి అంశాలతో వ్యంగ్యం అంటూ చూపుతున్నారు.
శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌లో తిరుమలలోని భక్తి కార్యక్రమాలకు పరిమితం కాగా, భక్తి టీవి మాత్రం ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో పాటు ఆలయాల గురించి, ధర్మ సందేహాల గురించి వివరిస్తోంది. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉన్నవారిని బాగా ఆకట్టుకుంటోంది. పండుగల సందర్భంగా ఆయా పండగల గురించి తెలియని విషయాలు చెబుతున్నారు. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక అంశాల కోసం మరో చానల్ ప్రారంభించనున్నారు. కొన్ని మతాలకు సంబంధించిన ప్రచారానికి విదేశాల నుండి నిధులు రావడం గురించి అందరికీ తెలిసిందే. హిందువులకు అలాంటి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లోనూ భక్తి చానల్ వంటివి విజయవంతంగా నాలుగున్నర ఏళ్ల నుండి ప్రసారాలు కొనసాగించడం అభినందనీయం.

1 కామెంట్‌:

  1. Tv9 లో అయితే తిరుమల టాపిక్ పై వారంలో తప్పనిసరిగా ఒక న్యూస్ ఐటెమ్ ఉంటుంది. ఈ వార్త ద్వారా వాళ్ళు చెప్పే అసలు విషయం కంటే బురదజల్లుడే ఎక్కువగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం