10, జనవరి 2012, మంగళవారం

నేతలతో వేషాలేయిస్తున్న వార్తా చానళ్లు


టీవిలో కనిపించడానికి గాంధీ భవన్‌లో మహిళా కార్యకర్త నృత్యం చేస్తే, టిడిపి కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఒక కార్యకర్త చిత్రవిచిత్ర వేషాలు వేస్తుంటారు. న్యూస్ చానల్స్ పుణ్యమా అని కార్యకర్తలతో మొదలైన ఈ జబ్బు ఇప్పుడు పెద్ద నాయకుల వరకు వెళ్లింది. కార్యకర్త వేషాలేస్తే వారితో పోటీ పడి పెద్ద నాయకుడు డప్పు వాయిస్తున్నాడు, బోనం ఎత్తుకుంటున్నాడు, బతుకమ్మ ఆడుతున్నాడు.
రాజకీయాల పట్ల నీకు ఆసక్తి లేకపోవచ్చు, కానీ రాజకీయాలకు నీ పట్ల ఆసక్తి ఉంటుంది ఇదో రాజనీతిజ్ఞుడు చెప్పిన మాట. నిజమే మనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నా లేకున్నా రాజకీయాలు మన జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. మన జీవితాలను శాసిస్తాయి. మనను అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేవి, మన జీవితాలను సమస్యాత్మకంగా మార్చేవి, సమస్యలను పరిష్కరించేవి అన్నీ రాజకీయాలే. చివరకు అడవుల్లో జీవించే వారిపై సైతం ప్రభుత్వం తన ప్రభావం చూపుతుంది. అలాంటిది మనపై ఇంకెంత ప్రభావం చూపుతుంది. రాజకీయాల్లో ఒకప్పుడు ఆలోచనా పరులు క్రియాశీలక పాత్ర వహించేశారు. రాజకీయాల్లో ఆలోచనలకు ప్రాధాన్యత ఉండేది. కానీ తెలుగునాట తెలుగు చానల్స్ విజృంభణ తరువాత తమాషాలు చేసేవారే రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు.
మీరు వేషాలు వేయగలరా? తమాషాలు చేయగలరా, సిగ్గుపడకుండా గుంపులో డ్యాన్స్ చేయగలరా? ఇంకెందుకాలస్యం రాజకీయాల్లో చేరిపోండి బాగా రాణిస్తారు. నిజానికి ఈ లక్షణాలన్నీ ఉంటే సినిమా వేషాల కోసం ప్రయత్నించాలి, కానీ ఇప్పుడీ లక్షణాలు సినిమాల్లో కన్నా రాజకీయాల్లో రాణించడానికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా గడిచిన సంవత్సరంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశాలతో దాదాపు అన్ని చానల్స్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. అన్ని చానల్స్‌లోనూ ఎక్కువ ప్రాధాన్యత లభించింది మంత్రి శంకర్‌రావుకే. ఒక చానల్ వాళ్లు ఏకంగా ఆయనకు కామెడీ కింగ్ అనే అవార్డు ప్రకటించారు.
ఏడాది కాలంలో ఆయన చేసిన చిత్రవిచిత్రమైన వేషాలను చానల్స్ చూపించాయి. జీ న్యూస్‌లో, సాక్షి చానల్‌లో శంకర్‌రావు ఆటపాటలు, వింత మాటలను ప్రత్యేకంగా చూపించాయి. సాధారణంగా ఒక కార్యక్రమానికి మంత్రిని అతిధిగా పిలిస్తే రిబ్బన్ కట్ చేయడం, ఉపన్యసించడానికే పరిమితం అవుతారు. కానీ రికార్డింగ్ డ్యాన్స్ వాళ్లు శంకర్‌రావును పిలిస్తే ఆయన ఏకంగా అక్కినేని నాగేశ్వరరావు పాట నేను పుట్టాను ఈ లోకం నవ్వింది అంటూ మొత్తం పాటమీద డ్యాన్స్ చేశారు. ఒక మంత్రి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే కచ్చితంగా అది ఏ చానల్‌కైనా పసందైన వార్త అవుతుంది.
చానల్స్‌కు ప్రధానంగా దృశ్య ప్రధానమైన అంశాలు కావాలి. టికెట్ రాలేదా? గాంధీభవన్‌లో కర్టెన్లు తగలబెట్టండి బ్రహ్మాండమైన కవరేజీ వస్తుంది అంటూ సలహాలిచ్చి మరీ ప్రోత్సహించారు. 2004 ప్రాంతంలో చానల్స్ వాళ్లు ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు నాయకులు రాటుదేలి పోయారు. ఈ పోటీలో సీనియర్ నాయకులు వెనకబడి పోతే వేషాలు వేయగలిగిన వారు ముందు వరుసలో ఉంటున్నారు. బంగిఅనంతయ్య అని కర్నూలులో ఉంటారు. పెట్రోల్ ధరలు పెంచినా, దేశంలో ఏం జరిగినా ఆయన టీవిలో కనిపించాల్సిందే. మరి ఆయన అంత గొప్ప నాయకుడేం కాదు. ఆయన్ని టిడిపి నుండి బయటకు పంపించారు. కానీ ఆయన ఒకసారి పాడె కట్టుకుని శవంలా పడుకుంటారు, మరోసారి కొజ్జాలతో కలిసి ఉద్యమిస్తారు, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్‌లా వేషం వేసుకొని నిరసన వ్యక్తం చేస్తారు. దాంతో ఆయన్ని టీవిల వాళ్లు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రముఖంగా చూపించేయక తప్పదు.
ఉత్తరాది వారిలో నృత్యాలు చేసే సంప్రదాయం ఎక్కువగానే ఉంది. దేశంలో ఏ మూల ఎక్కడ కాంగ్రెస్ గెలిచినా గాంధీ భవన్‌లో ఒకావిడ నలుగురితో కలిసి డ్యాన్స్ చేస్తుంది. ఆమె చూడడానికి బాగానే ఉంటుంది, అందరి ముందు డ్యాన్స్ చేస్తుంది. టీవిలకు ఇంత కన్నా ఏం కావాలి. దాంతో ఆమెను టీవిలో చూపించేస్తారు. పార్టీలో కీలక బాధ్యతలు వహించే వారి కన్నా టీవిల్లో వీరి హడావుడే ఎక్కువగా ఉంటుంది.

 టిడిపిలో గౌడ్ అనే ఒక కార్యకర్త ఉన్నారు. రైతు ఉద్యమం జరిగితే అతను రైతు వేషంలో ప్రత్యక్షమవుతారు. అవినీతి, ధరల పెరుగుదల సందర్భం ఏదైనా కావచ్చు వ్యక్తి ఒక్కరే కాని వేషాలు వేరువేరుగా ఉంటాయి. మద్యం ధరలు ఎంఆర్‌పి కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారని టిడిపి అధ్యక్షుడు ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు. తెలుగు తమ్ముళ్లు నిజంగానే మందు కొడుతూ రోడ్డుపై పడిపోతూ టీవిల ముందు జీవించేశారు. ఇదేంటని విమర్శలు వస్తే మేం మా పాత్రలో సహజంగా నటించాం అంతే తప్ప మరో ఉద్దేశం లేదన్నారు. ఆ తరువాత ఏకంగా తెలుగు మహిళలు మందు బాటిల్స్ పట్టుకుని తాగుతున్నట్టు నటిస్తూ ఎక్సైజ్ కమీషనర్ కార్యాలయం ముందు బైఠాయించారు. టీవిలో కనిపించాలంటే ఈ వేషాలు అవసరమా? మద్యంపై ఉద్యమిస్తున్నారా? నలుగురు నవ్వుకునేట్టు నటిస్తున్నారా?
చిన్న నాయకులకే కాదు మన చానల్స్ పుణ్యమా అని ఈ వేషాలు పెద్ద నాయకులకు సైతం తప్పడం లేదు. వెరైటీగా ఉండాలని ఒక సినిమాలో హాస్య నటుడు దీపావళి నాడు రంగులు పూస్తాడు, దసరా రోజు బాణా సంచా కాలుస్తాడు, గొబ్బెమ్మలు సంక్రాంతి నాడే ఎందుకు పెట్టాలి అని వాదిస్తూ హోళీ నాడు పెడతాడు. ఏ పండుగ రోజున ఏం చేయాలో ఒక పద్ధతి ఉంటుంది. చానల్స్‌లో ఎక్కువ సమయం కనిపించాలంటే రాజకీయ నాయకుల కార్యకలాపాలు దృశ్య ప్రధానంగా ఉండి తీరాలి కాబట్టి ఎప్పుడు ఏం చేయాలనేది పట్టించుకోకుండా నాయకులు వేషాలేస్తున్నారు. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగ అనేవి తెలంగాణకు సంబంధించి ప్రత్యేకత గలవి. రైతు పోరుబాట పేరుతో చంద్రబాబు వరంగల్ జిల్లాలో పర్యటించి బోనం ఎత్తుకున్నారు. చానల్స్ వారు కోరినంత సేపు డప్పు వాయించారు. నిజానికి ఆ డప్పు వ్యవహారం ఏమిటో? ఎందుకు వాయిస్తారో ఆయనకు తెలియదు. కానీ చెప్పిందే చెప్పే తన ఉపన్యాసం కన్నా డప్పు వాయించడాన్ని చానల్స్‌లో ఎక్కువ సమయం చూపిస్తారని ఆయనకు తెలుసు. ఆయన ఊహించినట్టే ఉద్రిక్తతలు, గొడవల మధ్య కూడా ఆయన డప్పు వాయిస్తున్న దృశ్యాలకు చానల్స్‌లో ఎక్కువ ప్రాధాన్యత లభించింది. చానల్స్ లేని కాలంలోనే ఎన్టీఆర్ మహానాడులో లొట్టిపిట్టల ఊరేగింపు, ముగ్గుల పోటీ, వంటల పోటీ వంటి చిత్రవిచిత్రమైన వాటిని పరిచయం చేశారు. ఆయన సన్యాసి వేషంలో కొన్నాళ్లు కనిపించారు. ఆయన స్వయంగా నటుడు కాబట్టి ఆయనకివి చెల్లుబాటు అయ్యాయి కానీ ఇప్పుడు కార్యకర్తలు మొదలుకొని, పెద్ద నాయకుల వరకు టీవి వార్తలో సముచితమైన వాటా కోసం వేషాలు వేయక తప్పడం లేదు.
చానల్స్ పుణ్యమా అని దృశ్య ప్రధానమైన రాజకీయాలు పెరిగిపోయాయి. ఒక మంత్రి నేలపై కూర్చోని సమీక్షలు నిర్వహించినా, నాయకులు డప్పు వాయించినా, నృత్యాలు చేయడం అంతా చానల్స్ రాజకీయం పుణ్యమే. రాజకీయాలు సీరియస్ విషయాలు. దాన్ని చివరకు ఇలా తమాషాగా మార్చడం నాయకులకు మంచిది. సమాజానికీ మంచిది కాదు.

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం