10, మే 2012, గురువారం

మీడియాపై నియంత్రణ అవసరమా?



వందలాది వార్తా చానళ్లు, లెక్కలేనన్ని పత్రికలు. క్షణాల్లో ప్రపంచాన్ని కళ్లముందుంచుతున్నాయి. పాకిస్తాన్ ముష్కరులు మన పార్లమెంటుపై దాడి చేసినా, ముంబయలో తాజ్‌మహల్ హోటల్‌పై దాడి చేసినా ఎలక్ట్రానిక్ మీడియా లైవ్‌గా చూపిస్తోంది. క్రికెట్‌కు లైవ్ చెప్పినంత ఉత్సాహంగా పాకిస్తాన్ తీవ్రవాదులు తాజ్‌మహల్ హోటల్‌పై జరిపిన దాడిని చూపించారు. అయితే మితిమీరిన అత్యుత్సాహం విమర్శలకు దారితీస్తోంది. మీడియాకు స్వీయ నియంత్రణ అవసరం అనే డిమాండ్ బలంగా వినిపించింది. అదే సమయంలో మీడియాపై నియంత్రణ విధించడం అంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అనే వాదనా వినిపించింది. ఈ నేపధ్యంలో కోర్టు వ్యవహారాలను మీడియా కవర్ చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 

వ్యవహారం చివరకు సుప్రీంకోర్టు ముంగిటకు వెళ్లింది. కోర్టుల్లో కేసు విచారణ సాగుతుండగా, దానిపై మీడియా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తూ కేసును ప్రభావితం చేస్తున్నాయని, కోర్టులకు సంబంధించిన వార్తల విషయంలో మీడియాపై నియంత్రణ ఉండాలని కోరుకునే వారు చేస్తున్న ఆరోపణ. ఈ అంశంపై సుప్రీంకోర్టు న్యాయనిపుణుల వాదనలు వింది. సుప్రీంకోర్టు ఈ అంశంలో వెలువరించే తీర్పు మీడియాపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా నేతృత్వంలోని బెంచ్ ఇరు వర్గాల వాదనలు వింది. తీర్పును రిజర్వులో పెట్టారు. నారీమన్ లాంటి న్యాయనిపుణలు వార్తల కవరేజిలో నియంత్రణ విధించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని వాదిస్తున్నారు. మీడియా వ్యవహరించే విధానాన్ని నిర్ణయిస్తూ విధివిధానాలు రూపొందించే అధికారం చట్టసభలకు ఉంటుంది. సుప్రీంకోర్టు విధి విధానాలు రూపొందించడం అంటే చట్టసభల అధికారాల్లో జోక్యం చేసుకోవడమే అనేది ఆయన వాదన. మీడియాకు వార్తల కవరేజ్‌లో నియంత్రణ విధించడం మంచిది కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో నియంత్రణ అవసరం అనే వాదన సైతం అంతే బలంగా ఉంది. మీడియాకు నియంత్రణ విధించడం కొత్తేమీ కాదని, న్యాయవార్తల ప్రచురణలో నియంత్రణలను విధిస్తూ గతంలోనే కొన్ని తీర్పులు వెలువడ్డాయని, నియంత్రణ అవసరం అని వాదించే వారు చెబుతున్నారు. మీడియాకు స్వీయ నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయి. సంచలనాత్మకం, పోటీతత్వంతో చివరకు తమ గొంతు తామే కోసుకునే స్థాయికి మీడియా పోటీ పెరిగిందన్న విమర్శలూ వస్తున్నాయి. వివిధ కేసులు కోర్టుల్లో విచారణ జరుగుతుండగానే మీడియా వాటిపై తీర్పులు ఇచ్చేస్తోంది. సంచలనాత్మక కేసుల్లో ప్రజలుకుండే ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కోర్టు విచారణను ప్రభావితం చేసే విధంగా కథనాలు రాస్తున్నాయి.

 కేసు విచారణకు దోహదం చేసే విధంగా ఆధారాలతో వార్తలు రాయడం వేరు- కానీ తీర్పును ప్రభావితం చేసే విధంగా ప్రజలపై ప్రభావం పడే విధంగా సొంత ప్రయోజనాల కోసం రాయడం వేరు. సత్యం కంప్యూటర్స్ కేసులో రాష్ట్రంలోని మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. రామలింగరాజు తాను చేసిన నేరం ఏమిటో ఆయనే స్వయంగా వెల్లడించారు. అప్పటివరకు అతను తప్పు చేసిన విషయం ఎవరికీ తెలియదు. చేసిన తప్పేమిటి? ఏ పరిస్థితుల్లో తప్పు చేశాడో, ఎలా చేశాడో లిఖిత పూర్వకంగా ప్రకటన చేశాడు. ఆ తరువాత కేసు కోర్టుకు వెళ్లింది. ఈలోపు రాష్ట్రంలోని మీడియా సొంతంగా మసాలా వార్తలు వండి వడ్డించారు. ఒక రాజకీయ నాయకుడి ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని రాశారు. తీరా మూడు నాలుగు నెలల తరువాత చార్జిషీట్ దాఖలు చేసిన సమయంలో తాను ఏం తప్పు చేశానని రామలింగరాజు ప్రకటనలో పేర్కొన్నారో, చార్జీషీట్‌లో సైతం అంతే ఉంది. చేసింది తప్పయినా ఏం తప్పు చేశాడో అదే చెప్పాడని నాలుగు నెలల తరువాత అదే మీడియా రాసింది. మరి ఆ మూడు నాలుగు నెలల పాటు వండిన మసాలా కథల మాటేమిటి? ఇలాంటి సంఘటనలు అనేక రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇటువంటి ఉదంతాలు చూపించి మీడియాకు నియంత్రణ అవసరం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో నియంత్రణ అంటూ మొదలైతే అది అన్ని స్థాయిల్లోనూ ఉంటుంది. చివరకు ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని కొందరి వాదన. మారుతున్న కాలంలో మీడియాలో సామాజిక బాధ్యత కన్నా ఇతరత్రా ప్రయోజనాలు ఆశిస్తున్నందు వల్లే మీడియాకు నియంత్రణ అవసరం అనే వాదన వినిపిస్తుండగా దానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి మద్దతు లభించడం లేదు

6 కామెంట్‌లు:

  1. ఈ రోజు నాకు Times now లో వచ్చిన వార్త వెగటు పుట్టుంచింది
    ౧౪ సంవత్సరాలు ఉన్న బాలిక లె.....కి సిద్ధమైతే ఆమె తండ్రి ఠాణా కి వచ్చి తన పుత్రికను అదుపులోకి తీసుకోండి అంటే ఆ తిక్క రక్షక భటుడు రాక్షస హాసం చేసాడు.

    దాన్ని పదే పదే చూపించే ఈ Times now మొన్న అత్యున్నత న్యాయస్థానం విధించిన సంయోగ చట్టం(అదే ౧౮ సంవత్సరాలు నిండితే గానీ ఏ విధమైన సంయోగ చర్యకు పాల్పడ కూడదు) దృష్టిలో ఎందుకు పెట్టుకోవట్లేదు?

    అసలు ఈ times now ప్రజల కోసం పనిచేస్తుందా లేక పొతే విదేశీ అనాగరీక తత్వాన్ని మనం అవలంబిచేలా చెయ్యడానికి పుట్టిందా అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. ‘యిడిచేసింది ఈదికి పెద్ద ’ అని మా వూళ్ళో ఒక సామెతుంది.
    మీడియా/ప్రెస్ ఎంత నీచ్ కుత్తే కమీనే,అవకతవక,దరిద్రగొట్టు,దిక్కుమాలిన,ఎదవ్వేషాలు వేసినా వాటిమీద నియంత్రణ అనేది సరియైన యోచన కాదనేది నా నిశ్చితాభిప్రాయం.
    యాజమాన్యాల కక్కుర్తికీ,లాలూచీలకీ బలయ్యేది,(అడపాదడపా లబ్దిపొందేది) జర్నలిస్టులే,కానీ నియంత్రణ అంటూ ఒకటొస్తే నిర్ద్వందంగా బలయ్యేది మాత్రం జర్నలిస్టులే.
    ఇప్పటికే లెక్కలేనన్ని ప్రవర్తనానియమావళులు ఉన్నాయి,అదీకాక పెద్దలు చూపించిన సత్సంప్రదాయాలూ,న్యాయస్థానాలిచ్చిన తీర్పులు,ఆదేశాలూ ఉన్నాయి.ఇవేవి సాధించలేనివి మరొక నియంత్రణామండలో,మరొకటో ఉధ్దరిస్తాయని ఎందుకు ఊహాగానాలు?
    Who guards the guards?
    Who judge the judges?
    అన్నట్టు ఎవరికెవరు పూచీ?
    అన్నాహజారే గారి జన లోక్ పాల్ బిల్లు మీద మొదట్లో ఉన్న హైపు తర్వాత తగ్గటానికి ఈ ప్రశ్నలూ ఒక కారణం.

    రిప్లయితొలగించండి
  3. భలే చెప్పారు Sir ,
    మీకొక వింత సంగతి చెప్పనా?
    ఆ మధ్య వారున సందేశ్ అనే కథానాయకుడిపై
    అబ్బబ్బ ! ప్రపంచం లో ఇంతకంటే మహాదారునం ఎప్పుడు జరగలేదు
    ఇదే 1st time ఇంకేముంది ప్రళయం వచ్చేస్తుంది
    అన్న తరహాలో ఒక రాత్రంతా వార్త కథనాలు (ఊహా కథనాలు) ప్రసారం చేసారు.
    అతను jail లో ఉన్నాడని ఒక channel చెప్తే మరో channel లో నేమో లేదు ఇప్పటిదాకా పోలీసు అధికారులతో మాట్లాడి వెళ్ళిపోయాడు అని చెప్తుంటే,
    ఇంకో channel లోనేమో అబ్బ వరుణ్ సందేశ్ ఎక్కడ ఉన్నదో అంతు పట్టటం లేదు అని ఇలా పరస్పర విరుద్ధం గా వార్తలు ఏక కాలం లో just channel numbers దూరం లో వచ్చాయి.
    ఈలోపు మన hero గారు popular news channel లో interview ఇస్తూ నేను ఇక్కడ channel లో ఉన్నాను,
    నా అభిమానులు భయపడవద్దు అని భరోసా ఇస్తున్నాడు,
    చూస్తున్న వాళ్లకు మతిపోతుంది, మరికొంతమంది హాస్యాస్పదం అనిపించింది సదరు ఘటన.

    ఇంకో news చెప్పనా?
    ఒక channel వారు ఒక MP ఒక వ్యక్తిపై court లో case నమోదు చేసాడని,
    అతని case ఆధారంగానే case cbi దాక వెళ్లిందని ఒక చర్చా వేదికను live show ను ఏర్పాటు చేస్తే,
    సదరు అర్జీ దారుడే ఆ కార్యక్రమానికి phone చేసి నేనేమి ఎలాంటి case పెట్టలేదని యావత్ రాష్ట్రం చూస్తుంటే చెప్పాడు,
    ఒక ప్రక్కన news చదువరి,,, అతను పెట్టిన అర్జీని live లో అందరికీ చూపించాడు
    ఏది నిజమో తెలియని పరిస్థితిలో ప్రేక్షకుడు...
    అప్పట్లో ఇలాంటి కథనాలను నా blog లో video తో సహా post చేసాను
    ఇప్పుడు తీసేసాను లెండి విసుగొచ్చి...

    స్వయం నియంత్రణ అన్నది కచ్చితం గా అవసరమే,
    ఎంచేత అంటే అస్సలు ఎమాత్రపు ratings రాకో ఏమో కాని,
    మనవాళ్ళు చేయని పని లేదనుకోండి,
    commercialism కనిపిస్తుంది తప్ప అన్యం కాదు.
    ఇలాంటివి ఎన్నీన్నో జరిగాయి జరుగుతున్నాయి కూడా!
    రాయటానికి ఓపిక తీరిక కావాలి

    ?!

    రిప్లయితొలగించండి
  4. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీడియా ఒక వ్యాపారమైపోయింది.
    జుర్నలిస్ట్స్ విలువలని TRP sensation కొరకు తాకట్టు పెడుతున్నారు.
    మీడియా నియంత్రణ అవసరమే నా అభిప్రాయంలో

    రిప్లయితొలగించండి
  5. "సంచలనాత్మకం, పోటీతత్వంతో చివరకు తమ గొంతు తామే కోసుకునే స్థాయికి మీడియా పోటీ పెరిగిందన్న విమర్శలూ వస్తున్నాయి."

    ఇది కరక్టు.

    పదే పదే అబద్ధాలు చెప్పే మీడియాని ప్రజలు విశ్వసించకపోవడమే కాదు, పట్టించుకోరు కూడా.

    రిప్లయితొలగించండి
  6. పదుగురాడు మాట పాడియై ధర చెల్లు అనేది పాత నీతి. పదిమార్లు చెప్పు మాట పాడియై ధర చెల్లు అనేది నేటి మీడియా నీతి.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం