22, మే 2012, మంగళవారం

రాష్ట్రం లో కార్పోరేట్ స్కూల్స్ వ్యాపారం ఎక్కువనా ? కార్పోరేట్ కాలేజీల వ్యాపారం ఎక్కువా ?


హవ్వ..మార్కులు ఇవ్వలేరా?


 ప్రభుత్వం ఉంటే పరీక్షలపై దృష్టి పెట్టేది. అసలు ప్రభుత్వమే లేదనుకునే పరిస్థితి ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉంటే వారికేం? పదవ తరగతి విద్యార్థులకు మార్కులకు బదులు గ్రేడింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కారణం ఏమిటా? అంటే కార్పొరేట్ కాలేజీల పోటీని నివారించేందుకట! దొంగతనాలను నివారించలేని రాజుగారు దొంగలకే ఆ బాధ్యత అప్పగించారట వెనకటికి. కనీసం ఆ రాజు నిర్ణయమైనా కొంత మెరుగ్గానే పని చేసింది. వీళ్లది మరీ అధ్వాన్నం. కార్పొరేట్ స్కూల్స్ మధ్య పోటీని నివారించేందుకా? లేక కార్పొరేట్ కాలేజీలకు మేలు చేసేందుకా? ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు విద్యార్థులు పోటీ పడి చదువుతున్నారు. ఒక్కో మార్కు కోసం పోటీపడతారు. దేశ వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ఒకే విధానంతో నిర్వహించాలనే ఉద్దేశంతో మార్కులకు బదులు గ్రేడింగ్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటే చేయగలిగింది ఏమీ లేదు.. ఆ నిర్ణయానికి స్వాగతం పలకడం మినహా. కానీ ఇక్కడ మాత్రం కార్పొరేట్ స్కూల్స్ మధ్య పోటీ పెరిగిందట. దాన్ని నివారించేందుకు గ్రేడింగ్‌లు ఇస్తారట! ప్రభుత్వానికి, విద్యాశాఖ పెద్దలకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉందా? రాష్ట్రంలో ఇప్పుడు అత్యంత లాభసాటి వ్యాపారం విద్యా వ్యాపారం. కనీసం రాజకీయ వ్యాపారానికైనా కేసుల వేధింపుల వంటి కొన్ని అడ్డంకులున్నాయి. ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. కానీ విద్యా వ్యాపారంలో మాత్రం ఆ సమస్య కూడా లేకుండా బంగారు బాతుగుడ్డుగా మారింది. రెండు కార్పొరేట్ కాలేజీలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను శాసిస్తున్నాయి. కోట్ల రూపాయలు ప్రకటనలకు వెచ్చిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటనలు నిలిపివేసి మీడియాను తమ అదుపులోకి తీసుకోవడంలో కొంత కష్టం ఉంది.. కానీ ప్రకటనలతో దాన్ని చాలా సులభంగా ఇది సాధించవచ్చు. సెలవుల్లో కాలేజీలను నిర్వహించవద్దనే ప్రభుత్వ ఆదేశాలు వీరికి పట్టవు, పదవ తరగతి ఫలితాలు వచ్చేంత వరకు ఇంటర్‌లో చేర్చుకోవద్దనే ఆదేశాలను పూచిక పుల్లను తీసిపారేసినట్టు పారేసి విద్యార్థులను చేర్చుకుంటారు. అసెంబ్లీ శాసన సభాకమిటీ దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో పర్యటించి అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలను, కార్పొరేట్ కాలేజీలను పరిశీలించింది. కార్పొరేట్ కాలేజీల్లో అసలు లేబొరేటరీలు లేవని, ప్రభుత్వ కాలేజీలే ఈ విషయంలో నయమని నివేదిక ఇచ్చాయి. పదవ తరగతిలో ఐదువందలకు పైగా మార్కులు వచ్చిన బడుగుల పిల్లలకు మంచి విద్య అందించేందుకు ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ కాలేజీల్లో చేర్పిస్తే, మంచి విద్య మాట అటుంచి పదవ తరగతిలో 500 మార్కులు దాటగా, ఇంటర్‌లో వీరిలో 25నుంచి 30 శాతం మంది ఫైయిల్ అయ్యారు. ర్యాంకులపై తప్పుడు ప్రకటనలు, ర్యాంకుల కొనుగోళ్ల వంటి వ్యాపారంపై ప్రభుత్వం నోరుమెదపదు. లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులను రెండు కార్పొరేట్ కాలేజీలు పంచుకుంటున్నాయి. వందల కోట్ల రూపాయల ప్రకటనలతో అందరి నోళ్లు మూయిస్తున్నారు. వీటి ప్రచార తాకిడికి స్థానిక కాలేజీలు మూత పడుతున్నాయి. మధ్య తరగతి వారు ఆప్పు చేసైనా కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించక తప్పని పరిస్థితి. వాస్తవానికి పదవ తరగతిలో కార్పొరేట్ స్కూల్స్ మధ్య పోటీ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా కార్పొరేట్ జూనియర్ కాలేజీల మధ్య పోరు సాగుతోంది. ఈ కార్పొరేట్ కాలేజీలు స్కూల్ విద్యా వ్యాపారంలోకి ప్రవేశించినా అంతగా రాణించడం లేదు. మహామహులైన కార్పొరేట్ కాలేజీల వారి కన్నా సాధారణ ప్రైవేటు హై స్కూల్స్ వారికే పదవ తరగతిలో ఎక్కువ మార్కులు రావడం వీరు జీర్ణం చేసుకోలేకపోతున్నట్టుగా ఉంది. నిజంగా విద్యా వాప్యారాన్ని, ప్రచారాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం అనుకుంటే కార్పొరేట్ కాలేజీలపై దృష్టి సారించాలి. నిబంధనలకు వ్యతిరేకంగా వారు వ్యవహరించడాన్ని అడ్డుకోవాలి. అంతే తప్ప పదవ తరగతి విద్యార్థులకు మార్కులకు బదులు గ్రేడింగ్‌లు ఇవ్వడం ద్వారా పోటీని నివారించాలనుకోవడం తగదు. కార్పొరేట్ కాలేజీల ఆగడాలను అడ్డుకట్టవేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వం, పదవ తరగతి విద్యార్థులకు గ్రేడింగ్‌ల పేరుతో మార్కులు చూసుకోకుండా చేయడం తగదు.

రాష్ట్రం లో ఇంటర్ విద్యనూ రెండు కార్పోరేట్ కాలేజిలు పంచుకున్నాయి . అయినా రాజధాని నగరానికి సుదూరంగా శ్రీకాకుళం లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజి విద్యార్థి ఇంటర్ లో ఈ సారి స్టేట్ టాపర్ గా నిలిచారు. అక్కడ సగానికి ఎక్కువ మంది లెక్చరర్ లో కాంట్రాక్ట్  లెక్చరర్ లే .  ఈ కాలేజి పై విద్యా శాక పెద్దలు ఏమయినా చర్య  తీసు కుంటారేమో చూడాలి
 

11 కామెంట్‌లు:

  1. చాలా మార్పులు జరుగుతున్నట్టు ఉన్నాయి విద్యావిధానంలో.
    EAMCET తీసేస్తున్నారంట కదండి?

    రిప్లయితొలగించండి
  2. దేశ వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ఒకే విధానంతో నిర్వహించాలనే ఉద్దేశంతో మార్కులకు బదులు గ్రేడింగ్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటే చేయగలిగింది ఏమీ లేదు.. ఆ నిర్ణయానికి స్వాగతం పలకడం మినహా Nice View, & Good Analysis

    thanks
    ?!

    రిప్లయితొలగించండి
  3. మురళీ గారు.. మీరు అడిగిన రెండు ప్రశ్నలు కి సమాధానం రెండు సమానమే! ఐ సీట్ అనేది అమలు పరచితే.. (నాకు అనుమానం అమలు పరచడంలో చాలా జాప్యం జరగవచ్చు) కార్పోరేట్ కాలేజీల హవా కొంత తగ్గు ముఖం పట్టి..స్కూల్ స్థాయి నుండే కార్పోరేట్ విద్య చిన్న చిన్న పట్టణాల లోకి జోరబడుతుంది.కొన్ని సంస్థలు తెలివిగా ఇప్పటికే కార్పోరేట్ స్కూల్ స్థాయిలో బలంగానే వేల్లూనుకున్నాయి.
    నేను గమనించిన విషయం ఒకటి చెపుతున్నాను.
    విజయవాడలో ఒక ఐ ఐ టి కాన్సెప్ట్ స్కూల్ లో చదివి ..అదే స్కూల్ ఇంటర్ మీడియట్ లో మరో కార్పోరేట్ కాలేజ్ తో టై అప్ అయి.. రిజల్ట్స్ వచ్చాక ఆ ఐ ఐ టి కాన్సెప్ట్ స్కూల్ వాళ్ళు, ఇంకో కార్పోరేట్ కాలేజ్ వాళ్ళు అవే రాంక్ లని ఇద్దరు ఎనౌన్స్ చేసుకుంటారు. ఆ కాంపస్ స్త్రెంగ్ట్ 1000 మంది కానీ పిల్లల తల్లిదండ్రులు పిచ్చి పట్టినట్లు ఆ కార్పోరేట్ కేంపస్ లో పిల్లలని జేర్పించి నరకం అంటే ఏమిటో.. చూపిస్తున్నారు.
    ఈ రాష్ట్రం లో విద్యా వ్యవస్థ ఉన్నంత దారుణంగా ఇంకా ఎక్కడ ఉండదు.
    ఈ కార్పోరేట్ కాలేజ్ లలో రాంక్ లు సాదించి ఐ ఐ టి లకి వెళ్లిన వారి నాలెడ్జ్ లెవల్స్ ..నోట్స్ అడిగే తీరులో ఉన్నాయన్నది చదివేతే ఆశ్చర్య పోతాం .
    ఒక విధంగా గ్రేడింగ్ విధానం మంచిదేమో అనిపిస్తుందండీ.
    అలాగే ప్రభుత్వ paaThashala ల పై దృష్టి సారించి నియమ నిబంధాలని కఠినం గా అమలుపరచాలి. అని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి వనజవనమాలి గారు మొదట ఆ వార్తా నేను చూడలేదు కానీ మిత్రుడు మన వాళ్ల గొప్పతనం గురించి వచ్చింది చూడ మంటే చూశాను . అయినా నమ్మకం కలగక ఇంజనీరింగ్ చదివే వారిని అడిగితే . రెండు కార్పోరేట్ కాలేజిలు నోట్స్ ఇస్తూ ఇలా తయారు చేశారని , పరిస్థితి అలానే ఉంది నిజమే అని చెప్పారు . నిజమోకాదో తెలియదు కానీ ఓ మిత్రుడు చెప్పాడు మన రాష్ట్రానికి చెందిన ఐ టి కంపనీలు కొన్ని దిల్హి వెళ్లి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నారట

      తొలగించండి
  4. జలతారువెన్నెల,ఎందుకో ఏమో , రాజ్ కుమార్ , వనజవనమాలి గారు ధన్యవాదాలు
    వీలుంటే నిన్నటి ౨౧.౫.2012 ఈనాడు రెండో పేజీలు వచ్చిన వార్తా చూడగలరు . మన రాష్ట్రానికి చెందిన iit టాప్ ర్యాంకర్ ముంబై iit లో చేరారు. అక్కడి లెక్చరర్ ను నోట్స్ ఇస్తారా ? అని ప్రశ్నించగానే ఆతను వెంటనే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చావా ? అని అడిగారట

    రిప్లయితొలగించండి
  5. రాజధాని నగరానికి సుదూరంగా శ్రీకాకుళం లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజి విద్యార్థి ఇంటర్ లో ఈ సారి స్టేట్ టాపర్ గా నిలిచారు. అక్కడ సగానికి ఎక్కువ మంది లెక్చరర్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ లే . ఈ కాలేజి పై విద్యా శాక పెద్దలు ఏమయినా చర్య తీసు కుంటారేమో చూడాలి-----:)

    రిప్లయితొలగించండి
  6. బట్టీ ఫాక్టరీలు స్కూలు అయినా కాలేజి అయిన దొందూ దొందే. వీరికి కార్పరేటు అనే ముక్క అతికించి కార్పరేటు రంగాన్ని అవమానం పరచడం నాకు ఇష్టం లేదు.

    రిప్లయితొలగించండి
  7. మురళి గారు,
    ఒకప్పుడు (అంటే ఈ కార్పోరేటు కల్చరు విద్యా విధానం లోకి అప్పుడప్పుడే జొరబడుతున్న రోజుల్లో) నేను ఇలాంటి ఒక స్కూల్లో చదివాను. తర్వాత గవర్నమెంటు పాలిటెక్నిక్ లో చేరిన తర్వాత కాని అర్ధం కాలేదు నేను ఎంత నష్టపోయానో. సహజం గా నేర్చుకునే లక్షణం పోయి, స్పూను ఫీడింగు కి అలవాటు చేస్తున్నారు. మార్కులకోసం పిల్లల సహజ మేధస్సును బలహీనం చేస్తున్నారు అనిపిస్తోంది..మంచి టాపిక్ రాసారు.

    రిప్లయితొలగించండి
  8. ఒక్కొక్క మార్కు కోసం అనవసరంగా పోటీ పడడం కంటే గ్రేడింగు పధ్ధతే మంచిదేమో?

    రిప్లయితొలగించండి
  9. అదృష్టవంతుడిని. నా చదువు 45 ఏళ్ల క్రితమే అయిపొయింది.......... దహా.
    అసలు విద్యావిధానం అంటూ ఏమైనా ఉందా ? అమలు పరిచే యంత్రాంగం సరిగ్గా ఉందా ?
    మీరు కరెక్టు గానే చెప్పారు. ఆ శ్రీకాకుళం కాలేజి పై ఏదైనా ఏక్షన్ తీసుకున్నా ఆశ్చర్యపడనవసరం లేదు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం