7, జూన్ 2013, శుక్రవారం

సమాచార చట్టం తో రాజకీయ వ్యాపారం బట్ట బయలు

ఇప్పుడు దేశంలో రాజకీయం అనేది ఫక్తు వ్యాపారం. ఒక వ్యాపార సంస్థ తన వ్యాపార రహస్యాన్ని బయట పెట్టడం వ్యాపార ధర్మం కాదు, అలా బయట పెట్టాలని కోరడం కూడా అన్యాయమే. అందుకే నేమో సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకు వస్తూ కేంద్ర సమాచార కమిషన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ పక్షాలకు మింగుడు పడడం లేదు. కొన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తే, మరి కొన్ని పార్టీలు ఇదెక్కడి తలనొప్పి అనుకుంటున్నాయి.


దేశంలో రాజకీయం ఎంత వ్యాపారంగా మారినా, ప్రజాస్వామ్యం మనుగడ రాజకీయ పక్షాలపైనే ఆధారపడి ఉంది. రాజకీయ పక్షాలను ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా, ప్రజాస్వామ్యానికి ఇవి తప్ప ప్రత్యామ్నాయం లేదు. లోపాలను సరిదిద్దుకుంటూ ఈ వ్యవస్థలు మనుగడ సాగించాలని కోరుకోవాలి. ఈ వ్యవస్థల్లోని లోపాలను ప్రశ్నించినంత మాత్రాన వీటిని వ్యతిరేకిస్తున్నట్టు కాదు. అన్నా హాజారే అవినీతికి వ్యతిరేకంగా పౌర సమాజం పేరుతో ఉద్యమిస్తున్నప్పుడు పార్లమెంటు కన్నా పౌర సమాజమే ఉన్నతమైంది అన్నట్టుగా వ్యవహరించడాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు. పార్లమెంటులో నేర చరిత్రులకు కొదవ లేదు , తప్పు చేసిన వారి సంఖ్య తక్కువేమీ కాదు . పార్లమెంటు వ్యవస్థలో లోపాలు ఉండవచ్చు. కానీ ఎవరో ఐదారుగురు ఒక బృందంగా ఏర్పడి మీడియా ప్రచారంతో పార్లమెంటు కన్నా తామే ఉన్నతులమన్నట్టుగా మాట్లాడితే ప్రజలు అంగీకరించలేదు. చివరకు అన్నా హాజరే సైతం తామేమీ పార్లమెంటును కించ పరచడం లేదని దిగి వచ్చారు. 

అలానే ఇప్పుడు సమాచార హక్కు కమిషనర్లు రాజకీయ పార్టీల కన్నా, ప్రజాస్వామ్యం కన్నా ఉన్నతులని ఎవరూ భావించడం లేదు. రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో పారదర్శకత కోసమే సమాచార కమిషన్ రాజకీయ పక్షాలను సమాచార హక్కు చట్టం పరిధిలో ఉండాలని కోరుకుంటోంది కానీ వారిపై పెత్తనం చలాయించడానికి కాదు. కమిషన్‌కు రాజకీయ పక్షాలపై పెత్తనం చెలాయించే అధికారం ఉండవద్దు కూడా. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు, రాజకీయ పార్టీల కీలకమైనవి. వాటి ప్రాధాన్యతను తగ్గించలేరు. కానీ రాజకీయ పార్టీల్లో పారదర్శకత కోరుకుంటే తప్పేముంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకిస్తుండడం వల్ల ఈ నిర్ణయం అమలులోకి రావడం సందేహమే.


రాజకీయ పార్టీలను కుటుంబ ఆస్తులుగా మార్చేశారు. కుటుంబ ఆస్తి పాస్తుల వివరాలు కోరితే ఆ సంగతి మీకెందుకు అని యజమానికి కోపం వస్తుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు సైతం అదే విధంగా కోపం వస్తోంది. రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైన భూమిని రాజకీయ పక్షాల కార్యాలయానికి కట్టబెట్టారు. ప్రజల సొమ్మును పార్టీల కార్యాలయాలకు కట్టబెట్టినప్పుడు వాటి వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండాల్సిందే. కాంగ్రెస్, టిడిపి, బిజెపి,టిఆర్‌ఎస్ పార్టీలకు పార్టీ కార్యాలయాలుగా అత్యంత విలువైన భూమి కట్టబెట్టారు. బ్రహ్మానందరెడ్డి పార్క్ ఎదురుగా ఉన్న విలువైన స్థలంలో హుడా ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించగా, దానిని రద్దు చేసి టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ భవన్‌కు కేటాయించి, అక్కడ టిడిపి కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టిడిపి, బిజెపిల మధ్య చెలిమి ఉండేది. అదే సమయంలో నాంపల్లిలో బిజెపి కార్యాలయానికి విలువైన స్థలం కేటాయించారు. ఆ తరువాత వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత బంజారాహిల్స్‌లో టిఆర్‌ఎస్‌కు స్థలం కేటాయించారు. బీంరావ్‌బాడాలోని గుడిసెవాసులను బలవంతంతగా అక్కడి నుంచి తరలించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికి విలువైన స్థలాల్లో కార్యాలయాలు ఉన్నాయి. రాజకీయ పక్షాలపై సమాచార కమిషన్ అధికారం చలాయించే ధోరణితో కాకుండా ,   రాజకీయ పార్టీల  కార్యకలాపాలను ప్రజలకు తెలుసుకునే విధంగా సమాచార హక్కు చట్టం పరిధిలో రాజకీయ పార్టీలను చేర్చడం ఆహ్వానించదగిన పరిణామమే.
రాజకీయ పార్టీలకు అందే విరాళాలు అంత రహస్యమే .. రాజకీయ పార్టీలే మీ 
ధార్మిక సంస్థలు కావు ... విరాళాలు ఇచ్చే వారు పరలోకం లో సుఖం కోసం కాదు పార్టీల అధికారాన్ని ఉపయోగించుకొని ఆర్ధిక ప్రయోజనం పొందాలనే విరాళాలు ఇస్తారు . వీటి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటె తప్పా ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం