26, మార్చి 2014, బుధవారం

ఆశావాది నీలకంఠాపురం

బలహీనమైన నేతకైనా బలమైన గొంతుండాలి. అప్పుడే రాజకీయాల్లో రాణించగలం. రాజకీయాన్ని నెగ్గుకు రాగలం. చిత్రమేమంటే రఘువీరాకు గొంతే కాదు, ఇంటి పేరూ గంభీరమే. అదే -నీలకంఠాపురం. ఈ పేరు వినగానే ఓ తెలుగు సినిమాలో శక్తివంతమైన పాత్ర ఇంటి పేరు గుర్తుకొచ్చేట్టుగా ఉంది కదూ!
నీలకంఠాపురం రఘువీరారెడ్డి. అనంతపురం జిల్లాలో బలమైన నాయకుడు. వైఎస్సార్‌కు నమ్మిన బంటుగా చివరి వరకూ నిలిచారు. వైఎస్సార్ ప్రతిపక్షంలో ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా కుడి భుజంగా గుర్తింపు పొందిన ఇద్దరు ముగ్గురు నేతల్లో రఘువీరా కూడా ఒకరు. వైఎస్సార్ మరణం తరువాత జగన్ సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నాక తొలుత పార్టీ మారేది ఈయనేనని అంతా అనుకున్నారు. వార్తల్ని ప్రచారంలో పెట్టారు. అయితే, నేను పార్టీ మారితే నన్ను సమాజం నుంచే వెలివేయండి -అని ధైర్యంగా ప్రకటించారు రఘువీరా. 


కాంగ్రెస్‌లో పుట్టాం. కాంగ్రెస్ గాలి పీలుస్తూ పెరిగాం. కాంగ్రెస్ ఉన్నంత వరకూ అక్కడే ఊపిరి తీసుకుంటాం -అంటూ ప్రకటించారు. ఇలా ప్రకటించిన వీర కాంగ్రెస్‌వాదులు చాలామంది -విభజన తరువాత ఒకరి తరువాత ఒకరు పార్టీ గోడ దూకారు. అప్పటి వరకూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు పంచన చేరారు. రాష్ట్భ్రావృద్ధి బాబు వల్లే సాధ్యమంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా టీవీ తెరలపై మొహమెత్తేలా చెప్పుకొస్తున్నారు. కానీ -రఘువీరా మాత్రం అక్కడే ఉన్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసినా, ఎలా ఉన్నా ఫరవాలేదని ధైర్యంగా కాంగ్రెస్ నాయకత్వం చేపట్టారు.
పార్టీ పరిస్థితి బాగున్నప్పుడు సారథ్యం చేపట్టేందుకు ఎవరైనా ముందుకొస్తాడు. ప్రతికూలతను ఎదురొడ్డి నిలిచిన వాడే నాయకుడని నమ్మడమే కాకుండా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో, ఢిల్లీలో ఉన్నవారికి సైతం తెలుసు. అలాంటిది సీమాంధ్రకు నాయకత్వం వహిస్తున్న రఘువీరారెడ్డికి తెలియదని అనుకోలేం. కానీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవిని ఆయన చాలెంజ్‌గా తీసుకున్నారు. అధికారానికి వచ్చేస్తాం అనే ప్రగల్భాలేమీ పలకడం లేదు. పదేళ్లపాటు అధికారం అనుభవించిన వారు పార్టీ సమస్యల్లో ఉన్నప్పుడు అవకాశవాదం ప్రదర్శించారని మాత్రమే జనంలోకి వెళ్లేట్టు చేస్తున్నారు. నాయకత్వం వహించే అవకాశం లభించినప్పుడు ఏటికి ఎదురీదడానికి సిద్ధపడటమే నాయకుని లక్షణం. అలాంటి నాయకత్వ లక్షణాలు తనకు పుష్కలంగా ఉన్నాయని చాటి చెబుతున్నారు రఘువీరా. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌కు కష్టాలే. సీనియర్లు కొత్త పార్టీని చూసుకున్నారు. ఇంకా పోయేదేమీ లేదు కొత్తగా నిర్మించుకొని ముందుకెళ్తామనే సానుకూల దృక్ఫథంతో వెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారపక్షంలో ఉన్నా ప్రత్యర్థులపై గంభీరమైన కంఠంతో విరుచుకుపడే నీలకంఠాపురం ఇప్పుడు పార్టీ వీడి వెళ్లిన సొంత మనుషులపై అవకాశవాదులు అని విరుచుకు పడుతున్నారు.


అనంతపురం జిల్లా మడకశిర, కల్యాణదుర్గం నియోజక వర్గాల నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు రఘువీరా. అదే నియోజక వర్గంలోని నీలకంఠాపురంలో 1957 ఫిబ్రవరి 12న జన్మించారు. రఘువీరారెడ్డి తండ్రి కావేరప్ప ఈ గ్రామానికి 30 ఏళ్లపాటు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. కుమారుడు అమృతవీర్, కుమార్తె అమిత్‌వీర్. భార్య సునీత గృహిణి. 1987లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కాంగ్రెస్‌లో చేపట్టిన తొలి బాధ్యత. 1999, 2004లో మడకశిర నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

2009లో కల్యాణదుర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004 నుంచి మంత్రిగానే ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకునిగా ఉన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. నాయకత్వ లక్షణాలతోపాటు దైవభక్తి ఎక్కువే. నీలకంఠాపురం గ్రూఫ్ ఆఫ్ టెంపుల్స్‌కు చైర్మన్. మార్చి 11 , 2014న ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి చేపట్టారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అయిందని తెలిసినా బస్సు యాత్ర జరుపుతున్నారు. నాయకత్వం వహించేవారు ఆశావాదిగా ఉండాలి. రఘువీరారెడ్డి ఆశావాది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం