1, డిసెంబర్ 2017, శుక్రవారం

మాయా ఇవాంక

‘‘దిగులుగా కనిపిస్తున్నావు.. ఇవాంకా వెళ్లి పోయిందనా ? ఆమె  నీ మనసు మీద తీవ్రమైన ప్రభావం చూపినట్టు వుంది?’’
‘‘నీలా నేను బానిసను కాదు స్వతంత్ర భారతదేశంలో పుట్టిన స్వతంత్ర పౌరుడిని..శ్వేత జాతి ఇవాంకా అంటే బానిసలా తోక ఊపుతా అనుకున్నావా?’’
‘‘బానిస అనగానే గుర్తుకు వచ్చింది. నీ దగ్గరకు వస్తున్నాను అని చెబితే మీ బాస్ వాళ్ల ఆవిడ నిన్ను కూరగాయలు తెమ్మని సంచి ఇచ్చింది... పోయినవారం ముదురు వంకాయలు తెచ్చావట ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకొని కూరగాయలు తెమ్మంది.’’
‘‘మా బాస్ వాళ్లావిడకు నా ప్రతిభపై చాలా నమ్మకం.. నాలుగుచోట్ల తిరిగి తక్కువ ధరకు కూరగాయలు తెస్తాను అని నాకు పని చెబుతుంది. అంతే తప్ప నామీద పెత్తనం చెలాయించాలని కాదు... డబ్బులూరికే రావు కష్ట పడితేనే వస్తాయి . నాలుగుచోట్ల తిరిగి ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడే కొనాలి అనేదాన్ని నేను మొదటి నుంచి నమ్ముతాను లలితా బంగారం షాపు అతను నన్ను చూసే  ప్రకటన చేసాడు... మన ఇంట్లోకి కూరగాయలు కొనేప్పుడు కొసరి కొసరి కొన్నట్టుగానే బాస్ ఇంటికి కూడా కొంటాను. అందుకే నాపై అంత నమ్మకం’’.
‘‘తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం చేసేటప్పుడు నువ్వయినా నేనయినా కూరగాయలు తెమ్మన్నా తేవాలి, బాస్ మనవడికి డైపర్ మార్చమన్నా మార్చాలి. తప్పుతుందా? ఏదో బానిసత్వం స్వేచ్ఛా భారతం గురించి మాట్లాడుకుంటూ దారి తప్పినట్టున్నాం..మీ వాడిని అమెరికా పంపే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి ? ఇంతకూ దిగులుకు కారణం చెప్పలేదు .  ?’’
‘‘ఇంత కాలమైనా ప్రపంచం ఇంతగా మారిపోయినా ఇంకా పురుషాధిక్యత కొనసాగడంపై దిగులు పడుతున్నా, బాధపడుతున్నా?’’
‘‘మొన్న మీ ఆవిడను కొట్టినందుకు ఇంకా దిగులు పడుతున్నావా? ఏదో తాగిన మైకంలో అలా కొట్టావు.. మీ ఆవిడేం తక్కువ తిందా? నువ్వు తాగిందంతా కక్కేంతవరకు నిన్ను చితక్కొట్టింది కదా ఇంకా బాధపడడం బాగా లేదోయ్... జరిగిందేదో జరిగిపోయింది మీ ఆవిడ కూడా మరిచిపోయింది వదిలేయ్.’’
‘‘అబ్బా! మా ఆవిడ నన్ను చితగ్గొట్టిన విషయం నువ్వు పదేపదే గుర్తు చేయడం ఏమాత్రం బాగాలేదు. నేను అమెరికా గురించి మాట్లాడుతుంటే నువ్వు పుచ్చు వంకాయలు, మా ఆవిడ తన్నిన విషయాలు, మనం తాగి పడిపోయిన సంగతి మాట్లాడుతున్నావు. కాస్త ఎదుగు.’’
‘‘అవును మరిచేపోయాను. నువ్వు కలిసినప్పుడు అమెరికా విషయాలే చర్చించాలని మొదట అనుకున్నాను. అట్లకాడతో మీ ఆవిడ నీ ముఖం మీద కొట్టిన దెబ్బ మచ్చ చూడగానే విషయం మరంచిపోయాను.
ఇవాంకా ఇక్కడి గాలి పీల్చడానికి ఇష్టపడడంలేదు. పీల్చేందుకు అమెరికా నుంచి గాలి తెచ్చుకుంది. ఇక్కడి వంటలు తినకుండా వండేందుకు అమెరికా నుంచి వంటవాళ్లను తెచ్చుకొంది. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు కోట్లాది రూపాయల వజ్రాల హారం ఇవ్వనుంది అని ఏమేమో వార్తలు వచ్చాయికదా? మరేంటి ఆమె అప్పారావు, సుబ్బారావు, నువ్వు, నేను పీల్చిన గాలినే హాయిగా పీలుస్తూ ఎంత చక్కగా మాట్లాడింది. మన హోటల్ తిండే తిన్నది. ఎందుకిలా జరిగింది. తండ్రిలానే ఆమెకూ మీడియా అంటే అస్సలు పడదేమో! ఒకరకంగా ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే. విమానంలో వచ్చేప్పుడు కొన్ని గాలి సిలెండర్లు పట్టుకొచ్చుకుంటే ఏమవుతుండె. మీడియా గౌరవాన్ని నిలబెట్టిన గుర్తింపు దక్కేది. అసలెందుకిలా జరిగిందంటావ్? పోలీసులు ఖాకీ డ్రెస్ ధరించవద్దు అని హుకుం జారీ చేసారు అన్నావు. ఖాకీ దుస్తుల్లో పోలీసులు ఆమెతో ఫొటోలు దిగారు.’’
‘‘కవి హృదయం అర్థం కాలేదు అనుకోకు. మనవన్నీ గాలి వార్తలని చెప్పాలనుకుంటున్నావేమో! అసలేం జరిగిందో నీకు తెలుసా? కనీసం ఊహించగలవా?’’
‘‘ఊహించలేను  కాబట్టే నిన్ను అడిగాను. ఏం జరిగిందని’’
‘‘అసలు ఇవాంక హైదరాబాద్‌కు రానే రాలేదు. ఇక్కడకు వచ్చింది మాయా ఇవాంక. సొంతగాలి, సొంత తిండి, సొంత పోలీసులు, వాహనాలు ఎన్నున్నా భద్రత లేదనే విషయం తెలిసి చివరి నిమిషంలో అసలు ఇవాంకను వైట్‌హౌస్‌లో దాచిపెట్టి మాయా ఇవాంకను హైదరాబాద్ పంపించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టి ఆమెను అమరావతికి ఆహ్వానించేందుకు వాళ్లు ఆసక్తి చూపలేదు.
ఏంటి ముఖం అలా పెట్టావ్! నేను చెప్పినదానిపై నమ్మకంలేదా? రామాయణం చదివావా?
‘‘ఏంటీ ఇవాంక గురించి రామాయణంలో కూడా ఉందా?’’
‘‘అతిగా ఆశ్చర్యపడకు. మాయా సీత కథ తెలుసుకదా? శ్రీరాముడితోపాటు అడవులకు వెళ్లింది, రావణుడు కిడ్నాప్ చేసింది మాయా సీతనే, అగ్నిప్రవేశం చేసింది అసలైన సీత. త్రేతాయుగంలోనే ఈ టెక్నాలజీ వున్నప్పుడు సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికాకు ఈ టెక్నాలజీ ఉండడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది.’’
‘‘నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది. సరే ఈ సంగతి వదిలేద్దాం. ఇంతకూ నీ దిగులుకు కారణం చెప్పలేదు.
పు రుషాహంకారం వల్ల దిగులుగా వున్నానన్నావు. అదేంటోయ్ అర్థం కాలేదు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు 150 దేశాల ప్రతినిధులు వస్తే వారిలో ఎక్కువమంది మహిళలే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు, ఆయన కుమార్తె ఇవాంకనే ప్రధాన ఆకర్షణ. మహిళా పారిశ్రామికవేత్తలే ప్రధాన అంశంగా సదస్సు నిర్వహించారు. నువ్వేమో పురుషాధిక్యత అంటావు.’’
‘‘అన్నీ బాగానే గుర్తు చేస్తున్నావు. మరి మధ్యలో మెట్రో రైలు గురించి మాట్లాడవేం?’’
‘‘మెట్రో రైలు స్ర్తిలింగం కాదు పురుషలింగం కాదు. అందులో పురుషాధిక్యత ఏముంది.? సీటు వుంటే కూర్చోవాలి. లేకపోతే స్ర్తి అయినా, పురుషులైనా నిలుచోవలసిందే.’’
‘‘చర్చ పక్కదారి పట్టించాలని ప్రయత్నించకు.  మెట్రో ప్రారంభంలో నీకు పురుషాధిక్యత ఏమీ కనిపించలేదా?’’
‘‘కనిపించలేదు పైగా మహిళా సాధికారత కనిపించింది. మెట్రో నడిపింది నలుగురు అమ్మాయిలేనట! వారి ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి.’’
‘‘విషయం తెలిసి కూడా పక్కదారి పట్టించాలని చూస్తున్నావు. ప్రధానమంత్రి మెట్రోను ఎక్కడి నుంచి ప్రారంభించారు?’’
‘‘మియాపూర్ నుంచి’’.
‘‘ఇంతకుమించిన పురుషాధిక్యత ఏముంటుంది? మరే స్టేషన్ దొరకనట్టు మియాపూర్‌నే ఎంపిక చేసుకున్నారంటే పురుషాధిక్యత కాకుండా మరేంటి? 30 కి.మీ రూట్‌లో 30 స్టేషన్లు వున్నాయి. వాటన్నిటినీ వదిలి మగవారి పెత్తనం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా మోదీ మియా మియాపూర్ నుంచే మెట్రోను ప్రారంభించారు. బేగంపేట నుంచి ప్రారంభిస్తే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్టవుతుందని మియాపూర్ ఎంపిక చేసారు. మియాపూర్ అంటే శ్రీవారి పురం, బేగంపేట అంటే శ్రీమతి పేట అనే విషయం ఉత్తరాది మోదీకి తెలియదంటే నమ్మేంత అమాయకుడ్ని కాదు. ఇంకెన్నాళ్లు ఈ పురుషాధిక్యత?’’
‘‘మియాపూర్‌ను ఎంపిక చేసుకోవడంలో మతలబు ఉందో లేదో తెలియదుకానీ దేన్నయినా వ్యతిరేకించే నీ ఆలోచనపై నాకు పూర్తి విశ్వాసం వుంది. తలుచుకుంటే సాధించలేనిది లేదన్నట్టు నువ్వు తలుచుకుంటే దేన్నుంచయినా, ఏదైనా సాధించగలవు. సరే ఇంతకూ మెట్రో ఎక్కుతున్నావా లేదా?’’
‘‘ముందే చెప్పాను. నేను సర్వ స్వతంత్రుణ్ణి. బానిసత్వం అస్సలు పడదు. బంగారు పంజరం కన్నా చెట్టు కొమ్మమీదే పక్షికి స్వేచ్ఛ ఎక్కువ. మెట్రో ఏసి జైలు లాంటిది. స్వేచ్ఛకోసం ఎంతకైనా సాహసించే నేను మెట్రో ఎక్కనుకాక ఎక్కను.’’
‘‘స్వేచ్ఛకు- మెట్రోకు సంబంధం ఏంటోయ్’’
‘‘దేశంలో ఏ రైలయినా ఎక్కిచూడు బీడీలు తాగుతూ, గుట్కా నములుతూ ప్రజలు ఎంత స్వేచ్ఛగా ప్రయాణిస్తారు. మెట్రోలో అలాంటి సౌకర్యం వుండదట! లాలూప్రసాద్‌తోపాటు ఎంతోమంది గొప్పగొప్ప నాయకులు చిన్నప్పుడు టికెట్ లేకుండానే రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించి అంత గొప్ప నాయకులు అయ్యారు. టికెట్ తీసుకుంటేనే రైలు తలుపులు తెరుచుకుంటాయట! ప్రజలపై అంత నమ్మకం లేకపోతే మెట్రోను నేనెందుకు నమ్మాలి. అందుకే మెట్రో వైపే చూడను.’’
* * *
‘‘ఏరోయ్ మెట్రో వైపే చూడను అన్నావు. మొత్తం ఫ్యామిలీ మెట్రో ఎక్కినట్టున్నారు. ఉదయం ఆరు గంటలకే మీ ఫ్యామిలీ ఫొటో మెట్రో సెల్ఫీ ఫేస్‌బుక్‌లో కనిపించింది. ఇంతకూ నువ్వు నువ్వేనా? లేక మాయా నువ్వు కాదుకదా?’’
‘‘పిల్లలు పోరుపెడితే కాదనలేక అర్థరాత్రి వెళ్లి స్టేషన్‌లోనే నిలబడ్డాం. మా ఫ్యామిలీ మొత్తం టీవీలో కనిపించింది.’’
‘‘సెల్ఫీ కోసం వెళ్లావుకానీ మెట్రో ఎక్కవన్నమాట’’
‘‘అదేంకాదు. పిల్లలు ఇంట్లో అందరికోసం స్మార్ట్‌కార్డ్ తీసుకున్నారు. మెట్రో ఎక్కడం ఇష్టం లేదుకానీ స్మార్ట్ కార్డు తీసుకున్నాక తప్పుతుందా?’’
‘‘పిచ్చోడా! నువ్వొక్కడివే కాదు. నేనూ అంతే నువ్వు అర్థరాత్రి నుంచి మియాపూర్ స్టేషన్‌లో వున్నావు. నేను బేగంపేట స్టేషన్‌లో క్యూలో వున్నాను.
క్షమించాలి నేను కాదు. మాయా నేను. మాయా సీత వున్నప్పుడు మాయా ఇవాంక, మాయా నువ్వు ,మాయా నేను ఎందుకు ఉండరు.అంతా మాయ ’’
బుద్దా మురళి (జనాంతికం 1-12-2017)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం