31, అక్టోబర్ 2015, శనివారం

ఎన్టీఆర్ .. బాబు.. వైయస్ ఆర్ .. కెసిఆర్ జమానా- మీడియా .....జనం ఆమోదమే పాలనకు కొలమానం

ఒక పాలకుడి సామర్ధ్యానికి పనితీరుకు కొలమానం ఏమిటి? ప్రజాస్వామ్యంలో కచ్చితంగా జనం ఆమోదమే ఒక నాయకుడి పనితీరుకు కొలమానం. అంతే తప్ప మీడియాతో ఆ నాయకుడు ఎలా వ్యవహరించాడు, మీడియా అతన్ని ఎలా ఆకాశానికి ఎత్తింది? ఎంతగా వ్యతిరేకించింది అనేది పాలకుడి పనితీరుకు కొలమానం కానే కాదు. 2004 గుజరాత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మీడియా నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించింది. అదే సమయంలో చంద్రబాబు పాలనను తెలుగు మీడియా ఆకాశానికెత్తింది. ప్రపంచ మీడియా సైతం ఆకాశానికెత్తినట్టు తెలుగు మీడియా తెలుగు పాఠకులకు చెప్పుకొచ్చింది. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే మీడియా వ్యతిరేకించిన నరేంద్ర మోదీ ఘన విజయం సాధించారు. మీ డియా ఆకాశానికెత్తిన చంద్రబాబు టిడిపి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేవలం 47 స్థానాలకు పరిమితం అయ్యారు. అది మీడియా రంజక పాలనే తప్ప జనరంజక పాలన కాదని జనం తేల్చారు . 

 నాయకుడి పనితీరుపై మీడియా అంచనా, ప్రజల అంచనాలకు అస్సలు సంబంధం లేకపోవడం వల్ల వచ్చిన ఫలితాలివి. టిడిపి ఆవిర్భావానికి ముందు తెలుగునాట రాజకీయాలు ఒక రకంగా ఉంటే ఆ తరువాత రాజకీయాల్లో పూర్తిగా మార్పు కనిపించింది. మీడియా రాజకీయాల్లో భాగంగా మారిపోయింది. ఇప్పుడు పాలకులు- మీడియా సంబంధాలపై చర్చ సాగుతోంది. చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ ముగ్గురి మీడియా అనుబంధం ఒకరితో ఒకరికి ఏ మాత్రం సంబంధం లేనిది. టి అంజ య్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయం మెట్లమీద ఒక జర్నలిస్టు అంజయ్య భుజంపై చేయి వేసి మాట్లాడిన సందర్భాలు సైతం ఉన్నాయి. చివరకు సెక్యూరిటీ వాళ్లు బతిమిలాడడం వల్ల ఆ విధానానికి స్వస్తి పలికారు.
ఎన్టీరామారావు కొన్ని దశాబ్దాల పాటు నటుడిగా సంపాదించుకున్న ఇమేజ్ వల్ల అభిమానులు ఆయన్ని దేవుడిగా చూసేవారు. తిరుపతి వెళ్లి అటు నుంచి మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్‌ను చూసే భక్తులు ఉండేవాళ్లు. అలాంటి ఇమేజ్‌తో రాజకీయ పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌కు మీడియా అండగా నిలిచింది. ఎన్నికల ప్రణాళిక రూపొందించడం మొదలు, అభ్యర్థుల ఎంపిక వరకు మీడియానే చేసింది. అయితే ఆ కాలంలో కాం గ్రెస్‌పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల మీడియా పాత్రపై పెద్దగా విమర్శలు రాలేదు. 


ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత కొద్దిమంది మీడియా వారిని మాత్రమే గుర్తించే వారు. ఆయనకు పత్రికలు చదివే అలవాటు కూడా తక్కువ. మనం వార్తలు సృష్టించాలి కానీ మనం చదవడం ఏమిటి అనేవారట! ఎన్టీఆర్‌ను మినహాయిస్తే ఆ తరువాత ముఖ్యమంత్రులకు మీడియాతో విడదీయరాని బంధం ఏర్పడింది. నువ్వు మరోసారి నా ఇంటికి రా వద్దు, నీ ముఖం నాకు చూపించవద్దు అని విలేఖరుల సమావేశంలోనే ఎన్టీఆర్ ఒక జర్నలిస్టును మందలించారంటే ఆయన్ని దించే కుట్రలో మీడియా పాత్ర ఎంతో తెలుస్తోంది. ఆ తరువాత ఎన్టీఆర్ వద్దకు ఆ జర్నలిస్టు వెళ్లాల్సిన అవసరం ఏర్పడలేదు. ఎన్టీఆర్‌నే వ్యూహాత్మకంగా మీడియా, బాబు కలిసి దించేశారు.
తాను అధికారం చేపట్టడం వెనుక మీడియా పాత్ర ఉండడం వల్ల చంద్రబాబు ముఖ్యమంత్రి మీడియాకు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. బదిలీల కోసం, పోస్టింగుల కోసం ముఖ్యమంత్రిగా బాబు ఇంటి వద్దే కాకుండా ఒక జర్నలిస్టు ఇంటి వద్ద సైతం అధికారులు పడిగాపులు కాసిన రోజులు ఉన్నాయి. బాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే అప్పటి వరకు మంత్రిగా ఉపయోగించిన చాంబర్ వద్దే విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతుంటే ఆజాద్ చిస్తీ అనే ఒక జర్నలిస్టు బాబు చెవిలో ఏదో చెప్పడానికి ప్రయత్నించగా, మీరేదైనా చెప్పదలుచుకుంటే బహిరంగంగానే చెప్పండి అంటూ బాబు నిర్మొహమాటంగా చెప్పారు.


 నిజానికి బాబుకు చెవి కొరుకుడు బృందం వేరుగా ఉండేది. ఇతను ఆ బృంద సభ్యుడు కాదు. ముఖ్యమంత్రి చెవి కొరకడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. చెవి కొరుకుడు చూసిన ఉన్నతాధికారులు ఏదేదో ఊహించుకుని చెవి కొరికిన జర్నలిస్టు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితునిగా భావించి వాళ్లు చెప్పినవి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ కిటుకు ఆ జర్నలిస్టుకు తెలుసు, బాబుకూ బాగా తెలుసు. 

ఏవరో జర్నలిస్టు చెప్పినట్టు నేను నడుచుకుంటాను అని మీరు అనుకుంటున్నారు కదా అని బాబు చాలా సార్లు మీడియా ముందే అడిగే వారు. ఆయన అలా అడగడం వెనుక ఉద్దేశం తనను ఎవరూ నడిపించ డం లేదని చెప్పడం. అయితే ప్రారంభంలో మాత్రం ముఖ్యమంత్రిగా తాను స్థిరపడాలి అనే ఉద్దేశంతో చెప్పినవి చేశారు. చంద్రబాబు మొత్తం జర్నలిస్టుల సంక్షేమం కోసం పెద్దగా పట్టించుకోలేదు కానీ తనను నమ్మిన కొద్ది మందిని ఎక్కడికో తీసుకు వెళ్లారు. జీతాలు కూడా సరిగా చెల్లించలేని సంస్థల్లో పని చేసిన వారిని బంజారాహిల్స్ భవంతుల స్థాయికి తీసుకు వెళ్లారు. రిలయన్స్ లాంటి కంపెనీలో ఉన్నత స్థాయి కల్పించారు. మేనేజ్‌మెంట్ కోటాలో తన వాటా కింద ఒకరిద్దరి పిల్లలకు మెడికల్ సీటు కూడా ఇప్పించారు. మహా అయితే ఓ డజను మంది జర్నలిస్టుల మంచి చెడులు ఆయన చూసుకున్నారేమో కానీ వేలాది మంది సామాన్య జర్నలిస్టులకు ఆయన పాలనలో ఒరిగింది ఏమీ లేదు.


ఇక వైఎస్‌ఆర్‌ది బాబు కన్నా పూర్తి భిన్నమైన శైలి. సచివాలయానికి వచ్చినప్పుడు, పోయేప్పుడు మీడియాతో మాట్లాడే విధానం బాబు హయాంలో ఉంటే దానికి స్వస్తిపలికి అవసరం ఉంటే తానే పిలిచి మాట్లాడతానని అన్నారు. ఆ రెండు పత్రికలు అంటూ మీడియా తీరును బహిరంగంగానే విమర్శించే వారు. ప్రజలను ఒప్పించి అధికారంలోకి వచ్చినా మీడియాను ఒప్పించలేమని, మీడియా మదిలో టిడిపినే ఉంటుందనే భావనతో సొంతంగా మీడియా ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ జరిగేప్పుడు లాబీల్లో కనిపించే జర్నలిస్టులను పేరు తెలియకపోయినా ఏం సార్ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లే వారు. ఒకరిద్దరు జర్నలిస్టులకు సొంత వ్యవహారాలు చక్కబెట్టినా మొత్తం జర్నలిస్టుల సంక్షేమం కోసం కొంత వరకు ప్రయత్నించారు. హెల్త్ కార్డుల వల్ల ఎంతో మంది జర్నలిస్టులకు మేలు జరిగింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సొంత ఇంటి కలను నిజం చేయాలనుకుని భూమి కేటాయించారు. అనేక కేసులు పడ్డాయి సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో ఇప్పటి వరకు వివాదం పరిష్కారం కాలేదు. వైఎస్‌ఆర్ తరువాత వచ్చిన రోశయ్య ఉన్నది కొద్ది రోజులే కాబట్టి చెప్పు కొదగిన పరిణామాలేమీ జరగలేదు. జర్నలిస్టుల వద్ద ఆరోగ్య బీమా కోసం డబ్బులు వసూలు చేసి కార్డులు ఇవ్వని ఘనత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానిది. బహుశా ఈదీ అమీన్‌లాంటి పాలకులు సైతం బీమా సొమ్ము తీసుకుని హెల్త్‌కార్డులు ఇవ్వకుండా అనారోగ్యంతో కొందరు జర్నలిస్టులు మరణించేట్టు చేసి ఉండరు.


చెన్నారెడ్డి కాలం నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి కాలం వరకు కాంగ్రెస్, టిడిపిలు, ము ఖ్యమంత్రులు ఎందరు మారుతున్నా జర్నలిస్టు నాయకులుగా అధికార గణం వద్ద అధికారం చెలాయించేది మాత్రం వాళ్లే. ఎవరు మారినా మీరు మాత్రం కొనసాగుతున్నారని ఒకసారి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారి ముందు ఆశ్చర్యపోయారు. పార్టీలు మారినా వీరి ప్రాభవం తగ్గలేదు. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడడంతో పరిస్థితి పూర్తుగా మారిపోయింది.


బాబు వైఎస్‌ఆర్‌ల కన్నా కెసిఆర్‌ది భిన్నవైఖరి. కొమ్ములు తిరిగాయని భావించే జర్నలిస్టులను సైతం పట్టించుకోరు. అదే సమయంలో ఏదో మారుమూల గ్రామానికి చెందిన గ్రామీణ విలేఖరితో సైతం ఆప్యాయంగా కబుర్లు చెబుతారు. బాబు హయాంలో సచివాలయంలో, అసెంబ్లీలోకి ఆయన వచ్చేప్పుడు పోయేప్పుడు మీడియానే స్వాగతం పలికి, మీడియానే వీడ్కోలు పలికేది. వైఎస్‌ఆర్ దీన్ని కొంత తగ్గిస్తే, కెసిఆర్ కనీసం అటువైపుకూడా మీడియా రాకుండా చేశారు. దీన్ని కొమ్ములు తిరిగిన వాళ్లు, ముఖ్యమంత్రితో ఆప్యాయ సంబంధాల వల్ల వ్యవహారాలు నడిపిన వారు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. 

పాలన ఎలా ఉందో, ప్రజల కష్టనష్టాలు గురించి మీడియాలో రాయడం జర్నలిస్టు బాధ్యత అంతే కానీ ఆ సంగతులు ముఖ్యమంత్రి చెవిలో చెప్పడం డ్యూటీ కాదు కదా? చెవి కొరకనివ్వక పోతే నియంతృత్వం, అహంకారం అంటూ ఆ గగ్గోలు ఎందుకు? ఎప్పుడంటే అప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఇస్తే అది అద్భుతమైన పాలనా? పాలనను ప్రజల కోణంలో చూడాలి, తప్ప జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఎంత వరకు దగ్గరగా ఉన్నారనే దాన్ని బట్టి కాదు. మీడియా వల్ల అధికారంలోకి వచ్చిన నాయకుడిలోనే క్రమం గా మార్పు వచ్చింది. 

అలాంటిది 14 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన నేత మీడియా సహాయంతో అధికారంలోకి వచ్చిన నేతలా ఉండాలని ఎలా కోరుకుంటారు? జర్నలిస్టు పెద్దన్నలుగా అధికారం చెలాయించిన వారికి ఇది కష్టకాలమే అయితే కావచ్చు. కానీ దానితో ప్రజలకు సంబంధం లేదు. గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకునే చర్యలపై టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. హామీలు అమలు చేస్తారా? లేదా ? అనేది కాలం చెబుతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో జర్నలిస్టులు చెప్పాలి కానీ జర్నలిస్టు పెద్దలే ప్రపంచం అని తాము బాగుంటే ప్రపంచం బాగున్నట్టు , తమను పట్టించుకోక పోతే నియంతృత్వం, అహంకారం అనుకోవడమే అసలైన అహంకారం.


  • - బుద్దా మురళి 
  • 31/10/2015

25, అక్టోబర్ 2015, ఆదివారం

బాబు+ తిరుపతి ప్రసాదం =మోదీ + యమునా తీర్థం

‘‘సినిమా కళనా వ్యాపారమా? కళాత్మక వ్యాపారమా? ’’
‘‘ నీ ప్రశ్నలో సమాధానం ఉందని నీ భ్రమ ’’
‘‘ అంటే సినిమా కళాత్మక వ్యాపారం కాదా? మరేంటి? ’’
‘‘రాజకీయం అంటే కళనా? సైన్సా? నువ్వేమనుకుంటున్నావో ముందు చెప్పు’’


‘‘రాజకీయం అంటే రాజకీయమే.. అందులో కళ, సైన్స్ ఏముంది? ’’
‘‘సినిమా అంటే సినిమానే అందులో కళేముంది, కళాత్మక వ్యాపారం ఏముంది అని నేను సమాధానం చెబితే సరిపోతుందా? ’’
‘‘సినిమా వేరు, రాజకీయం వేరు. ఇంతకూ నువ్వేమనుకుంటున్నావో చెప్పు’’
‘‘ సినిమా, రాజకీయం, మతం, అన్నీ లెక్కలే... ప్రతి దానిలో లెక్కలుంటాయి. అలా అని వెంకట్రామా అండ్ కో ఎక్కాల పుస్తకం చూస్తే ఈ లెక్కలు కనిపించవు. కానీ ప్రతి దానిలో కనిపించని లెక్కలుంటాయి.’’
‘‘నేను నమ్మను. నాకు రాజకీయాలన్నా చిరాకే లెక్కలన్నీ చిరాకే నీ సమాధానం నాకు అస్సలు నచ్చలేదు. ’’


‘‘నువ్వీ  మాట అనడం వెనక కూడా ఒక లెక్కంది. నాకు ఐటి నాలెడ్జ్ లేదనుకో ఐటి అంటే పరమ బోర్ నాకు చిరాకు అంటాను. నాలెడ్జ్ లేదు అని చెప్పడానికి అహం అడ్డొచ్చి చిరాకు అంటాం. అలానే రాజకీయాలపై అవగాహన లేక రాజకీయాలంటే చిరాకు అంటాం ఇదో లెక్క. ’’
‘‘నువ్వు నన్ను కన్‌ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తున్నావు. రాజకీయం లెక్కలు ఎలా అవుతుంది. ’’
‘‘బాబు గారు ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పారు. మోదీ మా రాష్ట్రానికి వస్తే అరెస్టు చేయిస్తాను అన్నారు. ఆదే మోదీతో ఇప్పుడు బాబుగారు చేతు లు జోడించి అడుగుతున్నాను అని మాట్లాడుతున్నారు. దీనే్నమంటావు’’
‘‘లెక్కలకు దీనికి సంబంధం ఏముంది? ’’


‘‘అక్కడికే వస్తున్నాను. కేంద్రంలో ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరం అయినన్ని సీట్లు రానప్పుడు కలగూర గంపలా ఎన్‌డిఏ, యుపిఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పుడు బాబుగారికి వచ్చిన సీట్లు కీలకమయ్యాయి. దాంతో కేంద్రంలో చక్రం తిప్పారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి సొంతంగానే సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. లెక్కల్లో వచ్చిన తేడా వల్ల పరిస్థితులు మారిపోయాయి. రాజకీయాలంటే లెక్కలు కాకుంటే ఇంకేంటి? ఇంకో ఉదాహరణ చెప్పాలా? నాదెండ్ల ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేస్తే వెన్నుపోటు అన్నారు, అదే బాబు చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నారు తేడా ఏంటో తెలుసా? లెక్కలే. నాదెండ్లకు ఎమ్మెల్యేల లెక్క సరిపోలేదు. బాబు హయాంలో లెక్క సరిపోయింది. లెక్కల్లో వచ్చిన తేడాతో ఒక సంఘటనకు రెండు వేరు వేరు పేర్లు . రాజకీయాలంటే లెక్కలే’’
‘‘మరి తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ కదా? తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్‌ను ఆంధ్రలో ఓడించారు. తెలంగాణలో గెలిపించలేదు.. ఇక్కడ ఏ లెక్కలు పని చేశాయి’’
‘‘ఇక్కడా లెక్కలే పని చేశాయి... తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే అని ఉద్యమ నాయకుడు కెసిఆరే చెప్పారు. అందుకే కదా ఇంటిల్లిపాది వెళ్లి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. మేం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని బిజెపి చెప్పింది. ప్రధానమంత్రిగా మోదీ స్పీడ్ చూస్తుంటే వంద రోజులు కాదు కదా వందేళ్లయినా వాళ్లు తెలంగాణ ఇవ్వకపోయే వారు. ఏడాదిన్నరలో ఉద్యోగులనే కేటాయించని వాళ్లు వంద రోజుల్లో తెలంగాణ ఇచ్చే వాళ్లా? పార్టీల లెక్కలు పార్టీల కుంటాయి. ప్రజల లెక్కలు ప్రజల కుంటాయి. తెలంగాణ ఇచ్చింది సోనియానే అని కెసిఆర్ చెప్పినా జనం తమ లెక్కలు తాము వేసుకుని టిఆర్‌ఎస్‌కే అధికారం అప్పగించారు. పెళ్లికి వెళ్లినా, అయ్యప్ప దీక్షలోనైనా, చివరకు గాంధీ భవన్‌లో గాంధీ జయంతిలోనూ కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడకుండా ఉండలేరు. వారి చేతిలో అప్పుడే పుట్టిన పసికందు తెలంగాణను పెడితే ఏమవుతుందో జనం బాగానే లెక్కలు వేసుకుని టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. కాంగ్రెస్ లెక్క తప్పింది కానీ జనం లెక్క తప్పలేదు. ప్రజాస్వామ్యం అంటే జనం లెక్కలే కదా? ’’


‘‘మరి తెలంగాణ ఉద్యమ కారుడిగా కెసిఆర్ తెలంగాణలో గెలిచినప్పుడు విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేసిన జగన్ పార్టీ ఆంధ్రలో గెలవాలి కానీ, విభజకు ఆమోదం తెలుపుతూ రెండుసార్లు లేఖలు ఇచ్చిన బాబు పార్టీ గెలవడం ఇదేం లెక్క’’
‘‘ఇదీ కూడా లెక్క ప్రకారమే జరిగింది. పార్టీల లెక్కలు వేరు, జనం లెక్కలు వేరని ముందే చెప్పాను కదా? ఆంధ్రలో మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రాజీనామాతో మెజారిటీ మనకే అని జగన్ లెక్కలేసుకున్నారు. విభజనతో సమైక్యాంధ్ర ఘట్టం ముగిసిపోయింది. పాలన అనుభవం ఎవరికి ఉంది? అని జనం లెక్కలేసుకున్నారు. అందుకే కిరణ్ కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర పార్టీకి పార్టీ గుర్తు చెప్పులే మిగిలాయి’’
‘‘సరే ఇప్పుడు అమరావతి శంకుస్థాపనలోనూ లెక్కలే ఉన్నాయంటావా? ’’
‘‘లెక్కలంటే రాజధాని కోసం సేకరించిన 33వేల ఎకరాల భూమి మాత్రమే కాదు. అన్ని వేల ఎకరాల సేకరణ వెనుక ఎవరి లెక్కలు వారికుంటాయి అది వేరు. అక్కడున్నవి అన్నీ లెక్కలే. అక్కడ రాజధానిని నిర్ణయించడం వెనుక లెక్కలుంటాయి. కెసిఆర్ ఇంటికి వెళ్లి బాబు పిలవడం, కెసిఆర్ వెళ్లి ప్రపంచంలోనే గొప్ప రాజధాని నిర్మాణంలో మా వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చి రావడం వెనుక ఎవరి లెక్కలు వారి కుంటాయి. పిలిచినాయన లెక్కలు పిలిచినాయనకు ఉంటాయి. వెళ్లినాయన లెక్కలు వెళ్లినాయనకుంటాయి. మోదీ లెక్కలు మోదీకుంటాయి. పవిత్రమైన తిరుపతి ప్రసాదం ఇచ్చి మోదీని బాబు ప్రసన్నం చేసుకుందామని లెక్కలేసుకుంటే యమునా నది తీర్థం ఇచ్చి మోదీ లెక్క సరి చేసుకున్నారు. ’’


‘‘వ్యాపారంలో ఏటేటా బ్యాలెన్స్ షీట్ చూసుకుంటారు. ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ప్రజలు రాజకీయ నాయకులు బ్యాలెన్స్ షీట్ చూసి లెక్కలు వేయడమే నన్న మాట. కులాలు, మతాలు, ఓట్లు లెక్కలే ప్రజాస్వామ్యం అని తెలిసొచ్చింది. ’’
‘‘ప్రజలకూ వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి ’’  

 - బుద్దా మురళి (జనాంతికం 24.10. 2015)

19, అక్టోబర్ 2015, సోమవారం

మేలుకో మేధావి మేలుకో

‘‘రండన్నయ్య గారూ రండి. ఆయన లోపల సీరియస్‌గా రాసుకుంటున్నారు. ’’
‘‘ ఏరా అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్ . పాకిస్తాన్ ఏమైనా యుద్ధానికి సిద్ధమైందా? ఏంటి? ’’
‘‘ అంత కన్నా ప్రమాదకరమైన విషయం. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు.. ఎవడి వల్లా కాదు..’’
‘‘ విషయం చెప్పకుండా అచ్చం అలా టీవిలో మాట్లాడినట్టు మాట్లాడితే నాకేం అర్ధమవుతుంది? చిన్ననాటి మిత్రున్ని కలుద్దామని వస్తే నువ్వు అంత సీరియస్‌గా ఉండి, నన్ను అయోమయంలో పడేస్తే ఎలా? ’’
‘‘ ఈ దేశాన్ని పాలించే వాళ్లు ఏం చేస్తున్నట్టు నిద్ర పోతున్నారా? మిలట్రీ ఏం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. మోదీ ఏం చేస్తున్నాడు పారిక్ ఎక్కడున్నాడు. సుష్మ నుంచి ఎంతో ఆశించాం. ఇలా చేస్తుందని అనుకోలేదు. ?’’
‘‘ వావ్ మన క్లాస్‌మెట్ సుష్మ నీకు టచ్‌లోనే ఉందా? కాలేజీ బ్యూటీ చదువుకునేప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడాలంటేనే భయం. సుష్మతో పాటు అన్నపూర్ణ, శోభ ఇంకా లత ఉండేవాళ్లు కదా? అబ్బ ఎంత చలాకీగా ఉండేవాళ్లో. అప్పుడేమో మాట్లాడేందుకు ధైర్యం ఉండేది కాదు. ఇప్పుడేమో మాట్లాడదామంటే వాళ్ల ఫోన్ నంబర్ తెలియదు. జీవితం ఇంతేరా? కనీసం ఆ సుష్మ ఫోన్ నంబర్ ఉన్నా ఇవ్వరా? మాట్లాడతా? ’’
‘‘అందుకే చెప్పాను ఈ దేశాన్ని బాగు చేయడం ఎవడి వల్లా కాదని. నేను చెబుతున్నది దేశం గురించి. సుష్మ అంటే మన క్లాస్ మెట్ కాదు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గురించి. అయినా 50 ఏళ్ల వయసొచ్చినా ఇంకా నీకు అనాటి అమ్మాయిలతో మాట్లాడాలని ఉంది కానీ ఈ దేశానికి వస్తున్న ప్రమాదం గురించి కొంచం కూడా బాధలేదా? ’’
‘‘ సుష్మ అని అంత చనువుగా అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అని ఎలా అనుకుంటానురా! క్లాస్‌మెట్ సుష్మను గుర్తు చేసుకున్నావేమో అనుకున్నా. ఎంతైనా నువ్వు చాలా గ్రేట్‌రా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను చిన్నప్పటి ప్రెండ్స్ కన్నా ఎక్కువ క్లోజ్‌గా పిలుస్తావంటే నీ అదృష్టం చూస్తే కన్ను కుడుతోందిరా! ’’
‘‘ ఇదిగోండి అన్నగారు టీ తీసుకోండి. ఉదయం పాలవాడు వచ్చినప్పుడు చూడాల్సిం ది. మీ ప్రెండ్ అధికార దర్పం, సమాజంలో పలుకుబడి’’
‘‘ప్రెండ్స్ ఏదో దేశం గురించి మాట్లాడుకుంటున్నాం. మధ్య నీ ఉపన్యాసం అవసరమా? వెళ్లు’’


‘‘ నువ్వు సీరియస్‌గా ఆలోచిస్తున్నా విషయం ఏంటో చెప్పనే లేదు? ’’
‘‘ అదేరా! అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలో చైనా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. మన పాలకులు ఏం చేస్తున్నారు? ఒకవైళ చైనా ప్రాజెక్టు నుంచి నీటిని ఒకేసారి విడిచిపెడితే అరుణాచల్ ప్రదేశ్ ఏం కావాలి. దీనిపై మొన్న మా చానల్‌లో ఒక అద్భుతమైన స్టోరీ చేశాను చూడలేదా? ’’
‘‘స్టోరీ అంటే కథ కదరా? వీక్లీల్లో వేసేవారు. ఇప్పుడు 24 గంటల న్యూస్ చానల్స్‌లో కూడా కథలు వేస్తున్నారా? ’’
‘‘అబ్బా నీకన్నీ విడమర్చి చెప్పాలి. ఇక్కడ స్టోరీ అంటే నువ్వనుకునే చందమామ కథ, వీక్లీ కథ కాదు. అంటే నేను సొంతంగా తయారు చేసిన ప్రత్యేక కథనం. ’’
‘‘చైనా వెళ్లి వచ్చావా? ’’
‘‘అంత అదృష్టమా? ఇక్కడి నుంచి పక్క రాష్ట్రం కూడాపోలేదు’’
‘‘మరి చైనా హఠాత్తుగా ప్రాజెక్టు కడుతోందని నీకెలా తెలిసింది? అంటే సైన్యమో ఎవరో ఒకరు బయటపెడితేనే నీకీ విషయం తెలిసింది కానీ నువ్వు చైనా వెళ్లి పరిశోధించి తెలుసుకున్నదేమీ కాదు కదా? ’’
‘‘నిజమే ననుకో కానీ మొద్ద నిద్ర పోతున్న ప్రభుత్వాలను నా స్టోరీస్‌తో నిద్ర లేపుతాను. ముందే మేల్కొని పాకిస్తాన్‌ను అదిలించి, చైనాను బెదిరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అమెరికాతో వ్యూహాత్మకంగా స్నేహం చేసి, రష్యాను దూరం పెట్టి ఉంటే వేరుగా ఉండేది. దేశాన్ని ఇంత కాలం పాలించిన వారికి ఈ వ్యూహం లేకపోవడం వల్లే సమస్య వచ్చిపడింది. దేశాన్ని పాలించే వాళ్లు ఈ సమస్యలను ఊహించడంలో విఫలమయ్యారు. అందుకే చెబుతున్నాను ఈ దేశాన్ని ఎవడూ బాగు చేయలేడు.’’
‘‘నువ్విలా మేధావివి అవుతావని చదువుకునే రోజుల్లోనే అనుకున్నాం. మేమంతా టెక్ట్స్ బుక్స్ చదువుతూ కెరీర్ గురించి మాట్లాడుకుంటుంటే నువ్వు గ్లోబ్‌లో కూడా సరిగా కనిపించని ఏవేవో దేశాల్లో జరిగే ఉద్యమాల గురించి, నాయకుల జీవితాల గురించి మాట్లాడేటోడివి. ’’
‘‘అదిగో అలాంటి మాటలకు పడిపోయే అన్నగారు బంగారం లాంటి సంబంధాలను వదులుకుని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను. ఈయన గారు కాలేజీల్లో ఉపన్యాసాలల్లో ఏవేవో దేశాల పేర్లు అక్కడి విప్లవ వీరుల పేర్లు చెబుతుంటే పడిపోయాను. ఇగో ఇన్నాళ్ల కాపురం తరువాత ఈయనకు ఆ పేర్లు తప్ప జీవితానికి ఉపయోగపడేది ఏమీ తెలియదు అని నాకు తెలిసొచ్చింది. ఇప్పుడనుకొని ఏం లాభం ? పాల వాడు పొద్దునే్న వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. కిరణాషాపుకు వెళ్లాలంటే సిగ్గుగా ఉంది. మూడు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదా మమ్ముల నెందుకు ఇబ్బంది పెడతారని నానా మాటలు అనిపోయాడు. ’’
‘‘ ఏంట్రానిజమా? ఎప్పుటి నుంచి ఇలా? ఎందుకిలా? ’’
‘‘ఉన్నంతలో బాగానే జీతాలు ఇచ్చే సంస్థలోనే ఉద్యోగం చేశాడు. అదేదో మాయదారి చానల్ నువ్వు కోరుకున్న డిజిగ్నేషన్ ఇస్తాను అనగానే ఎగిరి వాలిపోయాడు’’


‘‘ఇచ్చాడా? ’’
‘‘కావలసిన డిజిగ్నేషన్ ఇచ్చాడు కానీ జీతాలే ఇవ్వడం లేదు. చైనాను ఇండియా సరిగా అంచనా వేయలేదని, పాకిస్తాన్ పరిణామాలు గమనించలేదని కథనాలు బాగానే చెబుతాడు. ఉద్యోగానికి వెళుతున్న సంస్థ జీతాలు ఇచ్చేదా? ఇవ్వనిదా? అనే అంచనా మాత్రం వేయలేదు ’’
‘‘ చాల్లే నేను ప్రపంచ గుట్టు విప్పుతుంటే నువ్వు ఫ్రెండ్ ముందు ఇంటి గుట్టు విప్పుతున్నావా? అసలు ఉక్రేనియాలో ఉగ్రవాదు.....’’


‘‘ ఇక చాల్లేరా! నా కళ్లు తెరిపించావు.. వస్తాను... పోతూ.. పోతూ నీకో మాట చెప్పాలనుంది రా ... అందరినీ మేలుకోలపాలని నిరంతరం ఆలోచిస్తున్న నువ్వే ముందు  మేలు మేలుకోవలసిన అవసరం ఉంది .. ముందా విషయం గుర్తించు   ’’
-  బుద్దా మురళి (జనాంతికం .. 18. 10.201 5)

11, అక్టోబర్ 2015, ఆదివారం

కొత్త దేవుళ్లు!

‘‘నరేంద్ర మోదీకి నారా బాబుకు ఒక విషయంలో చక్కని పోలికుంది’’
‘‘ కార్పొరేట్ కంపెనీలపై ప్రేమనా?’’
‘‘ఈ కాలంలో పాలకులెవరైనా కార్పొరేట్‌పై ప్రేమ చూపించాల్సిందే. ఏ రాష్ట్రంలోనైనా కామనే నేను చెబుతున్నది అది కాదు’’
‘‘ఎన్నికల పొత్తు కుదరక ముందు బాబే ఈ విషయం చెప్పారు. మోదీ నన్ను చూసి అభివృద్ధి నేర్చుకున్నారు అని. అభివృద్ధి విషయంలోనే కదా ఇద్దరి మధ్య పోలిక. ’’


‘‘ తింగరి పల్లి సర్పంచ్ కూడా ఇదే మాట అన్నాడులే, నన్ను చూసే ఒబామా అమెరికాను అభివృద్ధి చేస్తున్నాడని, ఆ మాట విని వార్డ్ మెంబర్ కంకికొడవలి కంకన్న చైనా అభివృద్ధికి మా వార్డే స్ఫూరి అని బదులిచ్చాడు.. వార్డు మెంబరైనా ఓడిపోయిన ముఖ్యమంత్రి అయినా తన గురించి తాను ఇలా చెప్పుకోవడం కామన్’’
‘‘ఏం చెప్పినా అది కాదంటున్నావు మోదీ, బాబుల్లో కామన్ ఏంటో నువ్వే చెప్పు ఇద్దరూ
 విదేశాల్లో తెగ తిరిగేస్తున్నారు .. నువ్వన్నది దాని గురించే కదా ?’’
‘‘అధికారం లో ఉన్నప్పుడు కాక పోతే రాజకీయాల నుంచి తప్పుకున్నాక విదేశాల్లో తిరుగుతారా ? అది కాదు 

‘‘మరింకేమిటి ? ’’
‘‘ మోదీ బాబు ఇద్దరూ దేవుళ్లే ’’
‘‘ఎలా? ’’


‘‘ ఇద్దరికీ అభిమానులు గుడి కట్టారు. గుడి మాన్యాలను స్వాహా చేసిన వాళ్లు వేల మంది కనిపిస్తారు ఈ దేశంలో గుడి ఉన్నది ఇద్దరు పాలకులకే. ’’
‘‘ మోదీకి ఎప్పుడో గుడి కట్టారు. కానీ కొత్త రాజధాని అమరావతిలో బాబుకు గుడికడుతున్నారు. రాజధాని ప్రారంభోత్సవానికి వస్తున్న మోదీ పనిలో పనిగా గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారేమో చూడాలి’’
‘‘ దేవుడే తన పక్కన ఉంటే దైవదర్శనానికి గుడికెందుకు వెళ్లడం’’
‘‘ ఇంతకూ దేవుడు ఎలా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావ్?’’
‘‘ ఇదేం ప్రశ్న. బాబు గుడిలో దేవుడు బాబులానే ఉంటాడు. ఆ దేవుడికి గడ్డం కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడికి మీసాలు ఉండేవా ? అని గతంలో టీవిలు, ఇంటర్‌నెట్ లేని రోజుల్లో పెద్ద చర్చ జరిగింది. గడ్డం విషయంలో అలాంటి సందేహాలేమీ ఉండవు ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా? ’’


‘‘ దేవున్ని ఏ రూపంలో ప్రతిష్టిస్తున్నారో? ’’
‘‘ ఇంకా అక్కడి వరకు ఆలోచన రానట్టుంది. నన్నడిగితే మాత్రం శ్రీకృష్ణుడి రూపంలో బాబు విగ్రహాన్ని ప్రతిష్టిస్తే బాగుంటుంది. శ్రీకృష్ణుడు దుష్టపాలకుడైన మేనమామ కంసున్ని సంహరిస్తే, బాబు ఎన్టీఆర్‌ను దుష్టపాలకుడు అని చెప్పి అధికారం నుంచి దించి మానసికంగా కృంగీదీసి పైకి పోయేట్టు చేశారుకదా? శ్రీకృష్ణుడి రూపం కరెక్ట్’’
అలా అంటే శ్రీరాముని రూపం కూడా సరిపోతుంది. శ్రీరాముడు చెట్టు చాటు నుంచి వాలిని సంహరించాడు కదా? నేరుగా ఎదుర్కోలేక. బాబు కూడా అంతే ఎన్టీఆర్‌ను నేరుగా ఎదుర్కోలేదు కదా? ’’
‘‘ నువ్వు చెప్పింది నిజమే కానీ ఆల్ రెడీ రాజమండ్రిలో గోదావరి నదిలో ఎన్టీఆర్ రూపంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఒకే రూపంలో మామా అల్లుళ్ల దేవుడి విగ్రహాలు బాగోవు’’
‘‘ అసలుదేవుడి రూపం ఎలా ఉండేదో? ’’
‘‘ చాలా మంది దేవుడు అచ్చం ఎన్టీఆర్‌లా ఉంటారని చెప్పగా విన్నాను, రాయగా చదివాను’’
‘‘ చెప్పిన వాళ్లు, రాసిన వాళ్లు నిజంగా దేవున్ని చూశారా? ’’
‘‘ లేదు..’’
‘‘ మరి ఏదో అచ్చం మా పెద్దమ్మ కొడుకులానే ఉన్నాడు అన్నంత ఈజీగా అచ్చం శ్రీరామునిలానే ఉన్నాడని ఎలా చెబుతారు’’
‘‘ ఒకరు ఇద్దరు కాదు చాలా మంది చెప్పారు కాబట్టి మనం నమ్మాలి అంతే ఎదురు ప్రశ్నించవద్దు’’


‘‘ నిజం ఒక్కరు చెప్పినా అబద్ధం కోటి మంది చెప్పినా సత్యం సత్యమే అవుతుంది కానీ సంఖ్యతో దానికి సంబంధం లేదు. సత్యం వేరు ప్రజాస్వామ్యం వేరు. ప్రజాస్వామ్యానికి అంకె ముఖ్యం, సత్యానికి కాదు. ’’
‘‘ తెలుగు సినిమా అభిమానులేమో ఎన్టీఆర్ అచ్చం శ్రీకృష్ణుడిలా, శ్రీరాముడిలా ఉన్నావంటారు. రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు కూడా అచ్చం ఎన్టీఆర్‌లానే ఉండేవారంటారు. కర్నాటక వాళ్లేమో హిందూ దేవుళ్లందరూ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌లా ఉండేవాళ్లంటారు. టీవిలో హిందీ సీరియల్ రామాయణం, మహాభారత్ చూశాక ఉత్తరాది వాళ్లేమో రామానంద్‌సాగర్ రామాయణం అచ్చం అరుణ్‌గోయల్ లానే శ్రీరాముడు ఉండేవారని నమ్మేశారు. మహాభారత్ చూశాక శ్రీకృష్ణుడంటే నితీశ్ భరద్వాజ్ అని ఢంకా బజాయించి చెప్పేశారు. మనకు వారి భాష తెలియకపోవచ్చు, వారి సినిమాలు చూసి ఉండక పోవచ్చు కానీ దేశంలో ఎన్ని భాషల్లో సినిమాలు తీస్తారో అన్ని భాషలకు అచ్చం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలానే ఉంటారు అనిపించే నటులున్నారు.’’
‘‘ మరి నువ్వు చెప్పు దేవుడు ఎలా ఉంటారో? ’’
‘‘ ఎవరు చూసి వచ్చారని, రవివర్మ దేవుళ్ల బొమ్మలు చూసి దేవుడు ఇలానే ఉంటాడని సినిమాల వాళ్లు నిర్ణయించేశారు కానీ ఎవరైనా చూసొచ్చారా? ’’
‘‘ దేవుడు నిర్వికారుడు అంటారు కదా? ’’


‘‘ రూపం సంగతి ఎలా ఉన్నా దేవుడికి రంగు పట్టింపు ఉందనిపిస్తోంది’’
‘‘ ఎందుకలా?’’
‘‘ మొన్న తిరుమలలో ఒక హోటల్‌కు గులాబీ రంగు వేయిస్తే గగ్గోలు పెట్టారు.. తెల్లారే సరికి రంగు మార్చారు.’’
‘‘ అమరావతిలో గుడిని పచ్చరంగుతో నింపేస్తారేమో?’’
‘‘ తెలంగాణ ఇచ్చినందుకు ఆ మధ్య శంకర్‌రావు సోనియాగాంధీకి గుడి కడతానన్నారు. ఏమైందో? ’’
‘‘ విగ్రహం కూడా తయారు చేయించారు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి . తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం రాలేదు. ఆంధ్రలో అడ్రస్ లేకుండా పోయింది. కేంద్రంలో ప్రతిపక్ష హోదా దక్కలేదు. దాంతో విగ్రహం అటకెక్కింది. శంకర్‌రావు మాజీ అయ్యారు. ’’
‘‘ ప్రజాస్వామ్యంలో నాయకులను దేవుళ్లను చేస్తూ, గుళ్లు కట్టడం ఏమిటి? ’’
‘‘ మనిషి భయం నుంచి బయట పడేందుకు దేవున్ని సృష్టించాడు అంటారు హేతువాదులు. మన నుంచి భయాన్ని పారద్రోలేందుకు దేవుడి సృష్టి జరిగితే మంచిదే కానీ తమ పాలనతో ప్రజలను భయపెట్టే పాలకులను దేవుళ్లను చేసి గుడి కట్టడమే రాజకీయం. ’’
‘‘ ఇప్పటికే మనకు మూడు కోట్ల దేవుళ్లు ఉన్నారు. ఈ కొత్త దేవుళ్లు అవసరమా? ’’
‘‘ దేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఎంతో కాలం తపస్సు చేసేవాళ్లు. ఇప్పుడు పాలక దేవుళ్లను ప్రసన్నం చేసుకోవాలంటే కొత్త కొత్త టెక్నిక్‌లు అవసరం. గుడి కట్టడం అందులో ఒకటి. లేకపోతే అమరావతికి టిడిపి నేత గురించి ఇంతగా ప్రచారం జరుగుతుంది అంటే గుడి కట్టడం వల్లనే కదా. భక్తుడి తపస్సు ఫలించినట్టే కదా? శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. బతుక నేర్చిన ఉపాయాల్లో పాలకులకు గుళ్లు కట్టడం ఒకటి.’’


‘‘ దేవుడు ప్రసన్నం అయ్యాక గుడి ఉంటే ఎంత లేకుంటే ఎంత? రష్యాలో కమ్యూనిస్టు దేవుడు స్టాలిన్ విగ్రహాలనే కూల్చేశారు.’’
**

-బుద్దా మురళి (జనాంతికం 11. 10.2015 )

4, అక్టోబర్ 2015, ఆదివారం

ఔను! వాళ్లు మేధావులు!!

‘‘నాచేతిలో గన్ ఉంటే ఇలాంటి వాళ్లను వరుసబెట్టి కాల్చి పారేసేవాడ్ని.. వీళ్లను ... ’’


‘‘అంత ఆవేశపడుతున్నావ్ అంటే . మన దేశంలోకి ఉగ్రవాదాన్ని దిగుమతి చేస్తున్న పొరుగు దేశం మీదనే కదా  ఆ కోపం ?’’
‘‘మా ఇంటి పొరుగు వారిని ప్రేమించాలనే బలమైన కోరిక ఉన్నా వాళ్లా యన కండలు చూసి భయంతో ఊరుకున్నాను. లేకపోతే ఎప్పుడో పొరుగు వారిని ప్రేమించే వాడ్ని. అలాంటిది నేను పొరుగు దేశాన్ని వ్యతిరేకిస్తానా? ’’
‘‘అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నర రూపరాక్షసులు ఉగ్రవాదుల మీద కోపం సహజమే. మన పార్లమెంటు మీద దాడి చేశారు. తాజ్ హోటల్‌పైన, ముంబాయి, ఢిల్లీ ఎక్కడ పడితే అక్కడ ముష్కరులు దాడి చేసి ప్రాణాలు తీస్తుంటే కోపం రాదా? ఏం పాపం చేశారని గోకుల్ ఛాట్‌లో పిల్లా పాపలతో సంతోషంగా ఛాట్ తినడమే వారు చేసిన పాపమా? బాంబులు పెట్టి ప్రాణాలు తీస్తారా? అలాంటి వారిని వరుసగా నిలబెట్టి చంపినా తప్పు లేదు. నాకు అర్థమయింది నీ కోపం వారి పైనే  ’’


‘‘మీరు అపార్ధం చేసుకుంటున్నారు. నాకు వాళ్లమీద ఎలాంటి కోపం లేదు. మనకు అన్నీ నెగిటివ్‌గా ఆలోచించడం అలవాటైంది. వాళ్ల సాహసాలను ఒకసారి పాజిటివ్ కోణంలో ఆలోచించి చూడండి. ఒక్కసారి కూకట్‌పల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు ప్రయాణించి చూడు తాతలు గుర్తుకొస్తారు.అలాంటిది దేశం కాని దేశం నుంచి అర్ధరాత్రి నాటు పడవలో కసబ్ అనే ఆ కుర్రాడు రావడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో? తలుచుకుంటేనే జాలేస్తోంది. సరైన తిండి కూడా లేకుండా రోజుల తరబడి సముద్రంలో ప్రయాణించి ఇండియాలో అడుగు పెట్టిన అతని సాహసానికి నేను అబ్బురపడతాను. కానీ కాల్చివేయాలని ఎందుకనుకుంటాను. మీరు గమనించలేదేమో ఇలాంటి వారిని ఉరి తీయడాన్ని తప్పు పడుతూ సంతకం చేసిన మేధావుల్లో నా పేరు కూడా ఉంది. ’’


‘‘ మీరెప్పుడయ్యారు మేధావులు? ఆ వార్త ఎప్పుడొచ్చింది? ’’
‘‘ చేతిలో ఇంగ్లీష్ బుక్, భుజానికి బట్ట సంచి. సంచిలో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నెరిసిన గడ్డం. ఇవన్నీ చూసిన తరువాత కూడా నేను మేధావిని అయ్యాను అనే నమ్మకం నీకు కలగ లేదంటే నీ దురదృష్టానికి నేనేం చేయలేను. నేను మేధావిననే విష యం అందరికీ తెలియడానికి ఎంతో కష్టపడి అందరి సంతకాల మధ్యలో నా సంతకాన్ని జొప్పించాను.. ’’
‘‘ఇంతకూ ఎవరిని కాల్చేయాలనుకున్నావో ఆ ఒక్కటీ చెప్పలేదు.. జీహాదీ పేరుతో అమాయకులను చంపే వారిపైనా? పార్లమెంటుపై దాడి చేసిన వారినా? ’’
‘‘పార్లమెంటులోకి వెళ్లడానికి ఎంపిలే అష్టకష్టాలు పడతారు. అక్కడ సెక్యూరిటీ అంత ఇబ్బంది కరంగా ఉంటుంది. అలాంటి ప్రాంతానికి తీవ్రవాదులు వెళ్లినందుకు వాళ్ల సాహసాన్ని మెచ్చుకోవాలి కానీ తప్పు పట్టడం ఎందుకు? జీహాద్ వారి మనోభావం. ఎవరి మనోభావలను నొప్పించే అధికారం మనకు లేదు. ’’


‘‘మరింకెవరిపై నీ కోపం. అడవుల్లో ఆయుధాలు పట్టుకుని ఆటో డ్రైవర్లను, కూలీలను కిడ్నాప్ చేయడం, ఇన్ఫార్మర్లుఅని కాల్చి చంపడం, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే తీవ్రవాదులపైనా నీ కోపం’’
‘‘ఎంత మాటన్నావు... చిక్కడపల్లి నుంచి మల్కాజిగిరి వరకు, ఎల్‌బి నగర్ నుంచి ఉప్పల్ వరకు అక్కడ ఇక్కడ అని కాదు. ఎక్కడైనా దోమ కాటును తప్పించుకొని దమ్ముంటే సుఖంగా నిద్ర పోయామని ఒక్కరిని చెప్పమను చూస్తాను. మహానగరంలోనే మనం దోమల దాడిని తట్టుకోలేక అల్లాడి పోతుంటే పాపం ఆ అడవి బిడ్డలు దోమలు, పురుగులు, పాములను తప్పించుకుంటూ ఎండకు ఎండి, వానకు తడుస్తూ ఒక చేతితో ఆయుధాలు, మరో చేతితో ఇన్ఫార్మర్ల తలలు పట్టుకుని భారంగా నడవడమే జీవితంగా గడిపే అడవి బిడ్డలను గుండెలకు హత్తుకుంటాను కానీ వాళ్లనెందుకంటాను. పిల్లలు తుపాకీతో ఆడుకుంటే ముచ్చటపడతాం కానీ తప్పు పడతామా? చిన్నప్పుడు బొమ్మ తుపాకీ పెద్దయ్యాక నిజమైన తుపాకీ తేడా అంతే ... ’’
‘‘మరింకెవరిని వరుసగా కాల్చాలనుకుంటున్నావ్’’


‘‘ఎందరో మహానుభావులు దేశం కోసం సర్వస్వం అర్పించి స్వాతంత్య్రం సాధించింది ఇందుకోసమేనా? పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇందుకోసమేనా? ఆరవై ఏళ్ల కొట్లాటతో తెలంగాణ సాధించుకున్నది ఇందుకోసమేనా? ’’
‘‘నీ ఆవేశం, ఆవేదన నా కర్ధమైంది. కానీ ఎందుకోసమో ? ఎవరిపై కోపమో తెలియడం లేదు’’
‘‘ఈ దేశానికో సంప్రదాయం, సంస్కృతి ఉంది? ఎంతో మంది ఎన్నో సార్లు ఈ దేశంపై దాడులు చేశారు. ప్రపంచ పటంలో బూతద్దం పెట్టుకుని చూస్తే కానీ కనిపించని బుడ్డ బుడ్డ దేశాల వాళ్లు కూడా దాడి చేశారు. ఆలయాలపై దాడులు చేశారు. సంపద దోచుకున్నారు. మత మార్పిడులు చేశారు’’
‘‘ఔను నిజమే చేశారు. కానీ వాళ్లను ఇప్పుడు కాల్చాలంటే కుదరదు, ఆ పనులు చేసిన వంశాలన్నీ గతించి కాలగర్భంలో కలిసిపోయాయి. ’’
‘‘నా కోపం వాళ్ల మీద కాదు. అన్ని సార్లు దాడులు చేసినా, సంపద దోచుకెళ్లినా మనం పల్లెత్తు మాట అనలేదు. అతిథిని గౌరవించడం మన ధర్మం... అతిథి దేవోభవ అని నిరూపించుకున్న వాళ్లం మనం. వాళ్లమీద నాకెందుకు కోపం కానీ’’
మరి ఇంకెవరి పై ఆ ధర్మాగ్రహం ’’

 ‘‘ఉదయమే ధర్మ సందేహాలు అంటూ టీవిల్లో మాట్లాడుతున్నారు. మనిషి జీవితానికి విలువలు ముఖ్యం అంటున్నారు. పతనం అయితే సమాజం ప్రమాదంలో పడుతుందని ధర్మోపన్యాసాలు చేస్తున్నారు. గణపతి విగ్రహాల ఏర్పాటు వల్ల 22వేల కోట్ల 575 రూపాయల 45 పైసల ప్రజా సంపద వృధాఅవుతుంది తెలుసా? బతుకమ్మ, అట్లతద్ది వల్ల ఈ ప్రపంచానికి  ఎంత నష్టమో తెలుసా?  ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి బాధ పడుతున్నారు కానీ బతుకమ్మ పండుగ ,రక రకాల  పూజల పేరుతో పూలను హత్య చేయడం గురించి మాట్లాడరేం ..  ఇలాంటివి ప్రోత్సహించే వాళ్లను వరుసబెట్టి కాల్చేయాలనిపిస్తోంది. ’’
‘‘నా అనుమానాలు తీరిపోయాయి. ఇప్పుడొప్పుకుంటున్నాను. నువ్వు కొత్తగా మేధావి మతం పుచ్చుకున్నవాడివి, ట్రైనింగ్ పిరియడ్ ముగిసిపోయిన కరుడు కట్టిన సెక్యూలరిస్టువి ’’ 
- బుద్దా మురళి (జనాంతికం 4.1 0.201 5)

27, సెప్టెంబర్ 2015, ఆదివారం

సినిమా చూపిస్త భామా!

‘‘రోజుకు ఇరవై గంటలు కష్టపడుతూ ఊపిరి తీసుకునేంత సమయం కూడా లేని నాయకులే ఉత్సాహంగా కనిపిస్తుంటే నువ్వేంట్రా అంత దిగులుగా ఉన్నావ్’’


‘‘నేత కష్టాలు నేతవి, పీత కష్టాలు పీతవి’’
‘‘ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగివి. ఊళ్లో పొలం, నగరంలో ఫ్లాట్లు అద్దెలు. వర్షాలొస్తే వర్షాల అలవెన్స్ కరువోస్తే కరవు భత్యం నీకేంటి కష్టాలు’’
‘‘అమ్మాయి పెళ్లిడుకొచ్చింది ’’
‘‘ఐటి కంపెనీలో మంచి ఉద్యోగం, హీరోయిన్ అంత అందంగా ఉంటుంది. మీ అమ్మాయికేంటిరా కళ్లకద్దుకొని పెళ్లి చేసుకుంటారు’’
‘‘ కళ్లకద్దుకొని పెళ్లి చేసుకుంటామని చాలా మందే వస్తున్నారు కానీ వాళ్లె వరూ మా అమ్మాయికి నచ్చడం లేదు. పోలీస్ కానిస్టేబుల్‌నే చేసుకుంటాను అని మొండిపట్టు పట్టింది. ’’
‘‘ ఇదేం కోరికరా నువ్వు చెప్పినా నేను నమ్మలేక పోతున్నాను ’’
‘‘ అదేరా నా దిగులు. ఒక్క సినిమాల విషయం తప్ప అన్నింటిలో ఫర్‌ఫెక్ట్. ఐఐటిలో సీటు కోసం మూడో తరగతిలోనే తెల్లవారు జామున మూడు గంటలకే కోచింగ్ సెంటర్‌లో దించితే మళ్లీ రాత్రి పదకొండు గంటలకు అన్ని ఇన్‌స్టిట్యూట్‌ల కోచింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేది. దాంతో పగలు, రాత్రి ఎలా ఉంటుందో? ప్రపంచం ఎలా ఉంటుందో ఆ పిచ్చి తల్లికి అస్సలే తెలియకుండా పోయింది. ఉద్యోగంలో చేరిన తరువాత ఒక్కసారిగా సినిమా పిచ్చి పట్టుకుంది. తాను చిన్నప్పటి నుంచి చూడాలనుకున్న సినిమాలన్నీ వరుస పెట్టి చూసేస్తున్నది. చూసి వదిలేస్తే బాగుండు ఆ సినిమా కథల ప్రభావం అమ్మాయి మీద తీవ్రంగా ఉందిరా! అంతులేని కథ చూసి అసలు పెళ్లి చేసుకోను కుటుం బం కోసం త్యాగం చేస్తాను అంది ఆ అవసరం లేదు తల్లి అని ఒప్పించడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. అదేదో సినిమాలో కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అంటూ ఆ హీరో చెప్పిన డైలాగుతో పెళ్లంటూ చేసుకుంటే కానిస్టేబుల్‌నే చేసుకుంటాను అంటోంది. చివరకు ఒక పోలీసు సంబంధం తీసుకు వచ్చాను. మూడు సింహాలే కనిపిస్తున్నాయి. కనిపించని ఆ నాలుగో సింహం కావాలంటోంది. ’’
‘‘దురదృష్టంలోనూ నువ్వు అదృష్టవంతుడివిరా ఇంకా నయం దొంగ రాము డు, రిక్షా రాముడు, డ్రైవర్ రాముడు సినిమాలు చూసి ఉంటే దొంగ కోసమో, రిక్షా వాడి కోసమో తిరగాల్సి వచ్చేది.’’
‘‘ఏదైనా సలహా చెబుతావేమో అని వస్తే నన్నింకా భయపెడతావా? ’’


‘‘ సినిమాలో హీరో రిక్షా తొక్కితే ప్రపంచంలో అతి ముఖ్యమైన వృత్తి రిక్షా తొక్కడమే, రిక్షా తొక్కే వాడిలో నిజాయితీ ఉంటుంది అని చూపిస్తారు. హీరో దొంగ అనుకో బలమైన కారణం వల్ల హీరో దొంగతనాలు చేస్తాడు. కానీ దొంగ చాలా మంచోడు. దొంగతనం పవిత్రమైన వృత్తి అని చూపిస్తారు. అలానే విలన్ స్మగ్లర్ అయితే అది దేశ ద్రోహం, అదే హీరో స్మగ్లర్ అయితే ఎంతో తెలివిగా అందరి కళ్లు కప్పి స్మగ్లింగ్ చేస్తాడు. ఇందులో ఆ పాత్ర వృత్తి గొప్పతనం కాదు. హీరో ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్ర గొప్పతనం. ఈ మాత్రం తెలియకుండా మీ అమ్మాయి మరీ ఇంత పిచ్చిగా సినిమాలో లీనం అయితే ఎలా? ’’
‘‘మా అమ్మాయి ఒక్కదాని ఆలోచనలోనే ఏదో తప్పున్నట్టు మాట్లాడతావు. కోట్లాది మంది సామాన్యులు, మేధావుల్లో కూడా ఈ ప్రభావం ఉంటుంది’’
‘‘ నేను నమ్మను’’


‘‘అమెరికాలో ఐటి ఉద్యోగం చేసొచ్చిన కెటిఆర్ శ్రీమతుండు సినిమా చూసి ఎంతగా స్పందించారు. ట్విట్టర్‌లో మహేశ్‌బాబును ఆకాశానికెత్తేయలేదా! అలానే మహేశ్‌బాబు స్పందించి ఏకంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోలేదా? ’’
‘‘ఆ ఇద్దరు ఒకరినొకరు పొగుడు కోవడానికి ఎవరి లెక్కలు వాళ్లకుంటా యి..’’
‘‘ తెలుగు వారికో రాష్ట్రం ఉన్నా, మద్రాస్‌లోనే జీవిత కాలమంతాగడిపిన ఎన్టీఆర్ సినిమా ఎండింగ్‌లో రాజకీయ పార్టీని స్థాపిస్తే ఎన్నో సినిమాల్లో ఆయన పేదలను ఆదుకున్న దాన్ని చూసే కదా తెలుగు ఓటర్లు ఆయనకు పట్టం కట్టింది. మా అమ్మాయిని తప్పు పడుతున్నావు మరి దీనే్నమంటావు. ’’
‘‘ఎన్టీఆర్ సినిమాల్లో విలన్లను మట్టికరిపించినా జీవితంలో మాత్రం తానే విలన్ల చేతిలో ఘోరంగా దెబ్బతిని మానసిక క్షోభతో పైకి పోయారు. అప్పటి పరిస్థితుల వల్ల ఎన్టీఆర్‌ను జనం గెలిపించారు. అదే జనం చిరంజీవి వస్తే గెలిపించలేదు కదా?’’
‘‘మా అమ్మాయికి ఆ దేవుడే ఓ దారి చూపించాలి.’’
‘‘ మీ అమ్మాయికి మంచి సంబంధం కుదిర్చే బాధ్యత నాది ఆ సంగతి నాకు వదిలేయ్’’
****
‘‘నాన్నా నేను ప్రవీణ్‌ను చేసుకుంటాను’’
‘‘సంతోషం ’’
****
‘ థాంక్స్ రా .. అసాధ్యుడివి .. ఏం మంత్రం వేశావు ’’
‘‘  సినిమా పోస్టర్లకు క్షీరాభిషేకాలు చేసేది, హీరో కోసం తలలు పగుల గొట్టుకునేది పెళ్లి కాని, బాధ్యతలు లేని వాళ్లే.’’ఇంకా  నయం మీ అమ్మాయి సినిమాలో హీరో వృత్తినే ప్రేమించింది . ఒక్కోసారి రోగానికి రోగమే చికిత్సలా పని చేస్తుంది. అదేదో కొత్త సినిమా అందులో హీరో హార్డ్‌వేర్... ప్రపంచమంతా ఆ హీరో వృత్తిపైనే ఆధారపడి ఉందని ఆ సినిమాలో చూపించారు. ప్రపంచాన్ని నాశనం చేయాలన్నా, కాపాడాలన్నా ఆ హీరో వల్లే సాధ్యం అనేది కథ. ప్రవీణ్ మా బంధువుల అబ్బాయే హార్డ్‌వేర్. మీ సాఫ్ట్‌వేర్ అమ్మాయికి సరైన సంబంధం అనిపించింది. ఇద్దరికీ నేనే పరిచయం చేశాను. ఇద్దరూ కలిసి సినిమాకెళ్లారు. హార్డ్‌వేర్ అబ్బాయి, సాఫ్ట్‌వేర్ అమ్మాయి ఒకటయ్యారు. ’’
‘‘ నీ సహాయం జీవితంలో మరువలేను’’
‘‘  పెళ్లితో సినిమాకు శుభం కార్డు పడుతుంది.జీవితంలో కాదు. జీవితం వేరు, సినిమా వేరు. జీవితంలో పెళ్లితోనే అసలు కథ మొదలవుతుంది. మహామహా ఎన్టీఆరే నిజ జీవితంలో విలన్‌లను ఎదుర్కోలేక బొక్క బోర్లా పడ్డారు. ఈ హార్డ్‌వేర్ కుర్రాడెంత. పెళ్లయింది కదా మెల్లగా మీ అమ్మాయికే జీవితం వేరు, సినిమా వేరని అర్ధమవుతుంది లే! 

26, సెప్టెంబర్ 2015, శనివారం

కాంగ్రెస్ టిడిపి లను ఏకం చేస్తున్న తెలంగాణా


ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్య మం లెఫ్ట్ రైట్ అనే తేడా లేకుండా తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసింది. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమం అన్ని పార్టీల నాయకులను ఏకం చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్, టిడిపిలను తెలంగాణ ఏకం చేస్తోంది. బలమైన శత్రువును ఎదుర్కోవాలంటే ఏదో ఒక రూపంలో కలిసి అడుగులు వేయక తప్పదని కాంగ్రెస్, టిడిపిలు భావిస్తున్నాయి.

 ప్రస్తుతానికి టిడిపి ముందడుగు వేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ అక్కడక్కడ కలిసి పని చేస్తున్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం టిడిపి సాగించిన పాదయాత్రలో కాంగ్రెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొ ని ఒకే స్వరం వినిపించారు. వైఎస్‌ఆర్ ము ఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేవెళ్ల చెల్లెమ్మ అంటూ ఏ కార్యక్రమమైనా సబితా ఇంద్రారెడ్డి అప్పుడు ప్రాతినిధ్యం వహించిన చేవెళ్ల నుంచి ప్రారంభించేవారు. తెలంగాణలో కాంగ్రెస్,టిడిపిల మధ్య స్నేహం చేవెళ్ల చెల్లెమ్మ సమక్షంలో మొగ్గ తొడిగింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ స్నేహం ఎంత వరకు వెళుతుంది అనేది వేచి చూడాలి.
రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. విచిత్రం కాదు... ఏదైనా సాధ్యమే. సినిమా లే తప్ప రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి చూపని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ముఖ్యమంత్రి కావడం ఒక వింత. తన జీవితంలో ఎక్కువ భాగం మద్రాస్‌లోనే గడిపిన ఆయన పార్టీని స్థాపించాకే తెలుగు నాడుకు వచ్చి తెలుగు వారి ఆత్మగౌరవం అని ఇచ్చిన నినాదానికి జనం నీరాజనం పలికారు. అలాంటి పార్టీని చివరకు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన అల్లుడు ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడే ఆ పార్టీకి నాయకత్వం వహించడం విశేషం. మన దేశంలో రాజకీయ పార్టీలకు సిద్ధాంతం అంటే ప్రధానంగా ఆర్థిక విధానాలు, లౌకిక వాదమా? మతాభిమానమా? అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. కానీ ఒక రాజకీయ పార్టీని వ్యతిరేకించడమే ప్రధాన సిద్ధాంతగా ఆవిర్భవించిన పార్టీ టిడిపి. కాంగ్రెస్ వ్యతిరేకతే మా విధానం అని ఎన్టీఆర్ మొదలుకొని బాబు వరకు టిడిపి నాయకులంతా సగర్వంగా ప్రకటించే వారు. కానీ ఇప్పుడు చిత్రంగా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, టిడిపి కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ ఒకవైపు కాంగ్రెస్‌తో పోరాడుతూనే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తోంది.
94లో కాంగ్రెస్‌కు కనీసం ప్రతి పక్ష హోదా కూడా దక్కలేదు. ఘన విజయం సాధించిన ఎన్టీఆర్ ఇంటికి లక్ష్మీపార్వతి ఒకసారి కాంగ్రెస్‌కు చెందిన టి సుబ్బిరామిరెడ్డిని భోజనానికి ఆహ్వానించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ నేత ఇంటికి కాంగ్రెస్ నాయకుడు భోజనానికి రావడమా? అని చంద్రబాబు వర్గం ఊగిపోయింది. ఎన్టీఆర్‌ను దించేసే రాజకీయ క్రీడలో మొదటి ఎత్తు ఆ భోజనంతోనే మొదలైంది. సుబ్బిరామిరెడ్డిని ఇంటికి భోజనానికి పిలవడం అంటే ఒక దేవుడిగా పూజలందుకుంటున్న నాయకుడిని సైతం అధికారం నుంచి దించేయాల్సినంత ఘోరమైన తప్పిదంగా భావించారు. సుబ్బిరామిరెడ్డిని భోజనానికి పిలవడంతో టిడిపి అపవిత్రం అయినట్టుగా భావించారు. అంత గొప్ప నిష్టగల టిడిపి తెలంగాణలో ఇప్పు డు ఏకంగా కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకుని నడుస్తునడుస్తున్నది.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్, టిడిపిలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు టిడిపి సభలో గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చారు. వైఎస్‌ఆర్ ఎంతో అభిమానంతో భారీ నిధులు కేటాయించి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని టిడిపి, కాంగ్రెస్ రెండు పార్టీల నాయకులు ఒకే స్వరం వినిపించారు. జలయజ్ఞం కాదు ధన యజ్ఞం అంటూ తొమ్మిదేళ్లపాటు వైఎస్‌ఆర్‌పై తీవ్రంగా విమర్శలు సాగించిన టిడిపి నాయకులే ఆ సభలో ప్రాణహిత చేవెళ్లప్రాజెక్టుకు వైఎస్‌ఆర్ కృషిని పొగిడారు.
అంతకు ముందు మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్తు సమావేశంలో కాంగ్రెస్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పక్షం దాడిపై గన్‌పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేస్తే టిడిపి సభ్యులు అక్కడికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. కెసిఆర్ విధానాల వల్లనే కాంగ్రెస్, టిడిపి కలిసి పోరాడాల్సి వస్తోందని టిడిపి నాయకులు చెబుతున్నారు. సభ భయటే రెండు పార్టీలు వివిధ అంశాలపై క్రమంగా దగ్గరవుతున్నాయి. ఇక సభలో విపక్షాల మధ్య ఐక్యత అనేది సహజం. దేశంలో బిజెపికి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. ఆంధ్రలో టిడిపి, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం. కేంద్రంలో ఎన్‌డిఏలో టిడిపి మంత్రులు ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్, టిడిపి ఆందోళనల కోసం అయి నా వేదికను పంచుకోవడం రాజకీయాల్లో విడ్డూరంగానే ఉంటుంది.
నిజానికి రాష్ట్రంలో విపక్షాలను ఏకత్రాటిపైకి తీసుకు వచ్చి టిఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థిశక్తిని నిలపాలని వామపక్షాలు ప్ర యత్నిస్తున్నాయి. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో గద్దర్‌ను ఉమ్మడి అభ్యర్థిగా నిలపడం ద్వారా విపక్షాల మధ్య ఐక్యత కోసం వామపక్షాలు ప్రయత్నించాయి. టిడిపి, కాంగ్రెస్ పార్టీలు సైతం మద్దతు ఇస్తే గద్దర్ పోటీ చేసేందుకు కొంత వరకు అవకాశం ఉండేది. కానీ ప్రధాన పార్టీల మద్ద తు లేకుండా వామపక్షాల అభ్యర్థిగా పోటీకి గద్దర్ ఇష్టపడలేదు. ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్‌ను నిలిపేందుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, టిడిపిలను వామపక్షాలు కోరా యి. అయితే ఆ పార్టీలు అంగీకరించలేదు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల్లో టిఆర్‌ఎస్ బలమైన శక్తి. టిడిపి, కాంగ్రెస్‌లు విడివిడిగా ఆ పార్టీని ఎదుర్కోలేని పరిస్థితి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం అంత సులభం కాదు. ఉద్యమాల కోసం ఏకం కావచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోపాయికారిగా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కానీ సాధారణ ఎన్నికల్లో బహిరంగంగా పొత్తు పెట్టుకోవడం అంత సులభం కాదు.
టిడిపితో పొత్తు తెలంగాణ బిజెపి నాయకులకు మొదటి నుంచి ఇష్టం లేదు. పొత్తు సమయంలో బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అలిగివెళ్లిపోతే పది జిల్లాల అధ్యక్షులు ఏకంగా రాజీనామా చేశారు. మిత్రపక్షంగా బిజెపి టిడిపిలు కలిసి ఉద్యమించాలి కానీ అలా కనిపించడం లేదు. బిజెపి సొంతంగానే కార్యక్రమాలు చేస్తుంటే టిడిపి మాత్రం క్రమంగా కాంగ్రెస్‌తో కలిసి కార్యక్రమాలు చేస్తోంది. ప్రాణహిత చేవెళ్ల కోసం టిడిపి ఉద్యమిస్తే బిజెపి నాయకులను పిలవలేదు, వాళ్లు రాలేదు. కానీ కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి పెద్ద పీట వేశారు. ఈ పరిణామాలపై బిజెపి నాయకులు పైకేమీ చెప్పక పోయినా వారికిది సంతోషకరమైన విషయమే. తెలంగాణలో టిడిపితో తెగతెంపులు చేసుకోవడమే వారికి కావలసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు కొంత బలం తక్కువైతే బయటి నుంచి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, టిడిపిల మధ్య ఒప్పందం కుదిరిందన్న రహస్యాన్ని టిడిపి వర్గీయులే బయటపెట్టారు.

 గతంలో కేంద్రంలో బయటి నుంచి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అనుభవం టిడిపికి ఉంది. అదే విధంగా అవసరం అయితే తెలంగాణలో బయటి నుంచి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ఉండేది. అప్పటికప్పుడు దానికో సిద్ధాంతాన్ని చెప్పడం టిడిపికి పెద్ద కష్టమేమీ కాదు. దుష్ట కాంగ్రెస్‌ను అధికారానికి దూరంగా పెట్టేందుకు బిజెపికి మద్దతు ఇచ్చానని, మతతత్వ బిజెపిని అధికారానికి దూరంగా ఉంచేందుకు కేంద్రంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇచ్చానని గతంలో సమర్ధించుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉంది. అదే తరహాలో దుష్ట టిఆర్‌ఎస్‌ను అధికారానికి దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చానని చెప్పుకునే వారు. అయితే ఆంధ్రలో బిజెపితో, తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తుండడమే విచిత్రం. ఉభయ రాష్ట్రాల్లో మరే పార్టీకి లేని ప్రచార శక్తి టిడిపికి ఉంది. చంద్రబాబు ఒకే రోజు తెలంగాణలో తన లేఖ వల్లనే తెలంగాణ ఏర్పడిందని చెబుతూ, అదే రోజు ఆంధ్రలో మాత్రం ఏకపక్షంగా అడ్డగోలుగా విభజించారని ప్రకటించారు.
వామపక్షాలను పక్కన పెట్టి బిజెపితో కలిసిన సమయంలో తిరిగి బిజెపిని వదిలి వామపక్షాలతో చేతులు కలిపిన సమయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా బలమైన వాదన వినిపించారు. ఆ తరువాత వామపక్షాలను పక్క న పెట్టి 2014లో బిజెపితో చేతులు కలిపినప్పుడు తిరిగి అంతే బలంగా తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ బలమైన వాద న వినిపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని సైతం అంతే బలంగా సమర్ధించుకునేంత యంత్రాంగం టిడిపికి ఉంది.
రెండు పార్టీల మధ్య అనుబంధం కాంగ్రెస్ కన్నా టిడిపికే ఎక్కువ అవసరం. ఆంధ్ర, తెలంగాణల్లో రెండు పార్టీల వ్యవస్థనే ఉంటుంది. ఆంధ్రలో టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌ల మధ్యనే పోటీ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎప్పుడూ రెండు పార్టీల మధ్యనే బలమైన పోటీ సాగింది. ఎంఐఎం పార్టీ పాతనగరానికి పరిమితం అయినట్టు విభజన తరువాత టిడిపి కొత్త నగరంలో కొన్ని నియోజక వర్గాలకు మాత్రమే పరిమితం అవుతుంది. వివిధ అంశాల్లో ఆంధ్ర తెలంగాణలో మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉం టాయి. ఆ వివాదాల్లో టిడిపి ఒకవైపు తమ పార్టీ నేత చంద్రబాబు నిర్ణయాలను సమర్ధిస్తూ మరోవైపు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడాలి. 

ఈ డబుల్ రోల్‌లో కొత్త నగరంలో టిడిపి అభిమానులున్న నియోజక వర్గాలకే పరిమితం కావలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్, టిడిపి చెట్టాపట్టాలేసుకుని ఉద్యమాల్లో పాల్గొంటే కాంగ్రెస్ కన్నా టిడిపికే ఎక్కువ ప్రయోజనం. తెలంగాణ టిడిపి నాయకులు విజయవాడ వెళ్లి చంద్రబాబుతో భేటీ అయిన తరువాతనే టిడిపి ఎమ్మెల్యే పాదయాత్ర, కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి టిడిపి సభలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి పోరాటాల్లో టిడిపితో కాంగ్రెస్ నేతలు కనిపిస్తున్నా, రెండు పార్టీల అనుబంధంపై కాంగ్రెస్ పార్టీ పరంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో టిడిపి సభలో మీరెందుకు పాల్గొన్నారని కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ నాయకత్వం ప్రశ్నించలేదు. ఈ రెండు పార్టీల అనుబంధం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. శాసన సభ సమావేశాల్లో ఈ బంధం మరిం త గట్టిపడే అవకాశం ఉంది.
  • -బుద్దా మురళి

  • 26/09/201
    5
  • 20, సెప్టెంబర్ 2015, ఆదివారం

    ఆత్మ చరిత్ర!

    ‘‘చూస్తుండు బాబాయ్ చరిత్ర సృష్టిస్తాను’’
    ‘‘ ఏరా వాడెవడో గడ్డంతో లారీ లాగి చరిత్ర సృష్టించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించాడట! వాడికి పోటీగా ముక్కులోని వెంట్రుకలతో లారీ లాగి కొత్త చరిత్ర సృష్టిసావా? ఏంటి? ’’
    ‘‘అది కాదు ’’
    ‘‘మరింకేం చేస్తావు. కాళ్లకు అడ్డం తగలలేనంతగా గోళ్లు పెంచడం, రోడ్లను ఊడ్చేంతగా జుట్టు పెంచడం, తల క్రిందులుగా నడవడం’’
    ‘‘అది కాదు బాబాయ్ చరిత్ర సృష్టించినా, తిరగ రాసినా మా వంశం వల్లే అవుతుంది’’


    ‘‘ఆ తెలిసిందిలే ఆ హీరో ఎవరో ఇలాంటి డైలాగులు చెప్పి సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే పోస్టర్లకు పాలాభిషేకాలు చేయడం, హీరో నడిచిన రోడ్డును శుభ్రం చేయడం ఇవే కదా మీ రికార్డులు. మహా అయితే ఆ సినిమాను అందరి కన్నా ఎక్కువ సార్లు చూసి రికార్డు సృష్టిస్తావేమో ? ’’
    ‘‘నేనే పరీక్ష రాసినా ఎందుకు ఫేయిల్ అవుతానో, ఏ ఉద్యోగానికి ఎం దుకు ఎంపిక కావడం లేదో తెలుసా బాబాయ్’’
    ‘‘నీ బుర్రలో మట్టితో పాటు ఇంకేమన్నా ఉంటే పాసయ్యేవాడివి ఇందులో తెలియందేముందిరా అబ్బాయ్’’


    ‘‘జోకులు తరువాత బాబాయ్ నేను సీరియస్‌గా చరిత్ర గురించి చారిత్రాత్మక విషయాలు చెబుతున్నాను. మధ్యలో జోకులొద్దు. యదార్థవాది లోక విరోధి అంటారు. నేను అన్నీ నిజాలే రాస్తున్నాను... చెబుతున్నాను కాబట్టే ఏ ఉద్యోగానికి ఎంపిక చేయడం లేదు. ఏ పరీక్ష పాసవడం లేదు’’
    ‘‘నిజమా? ఏంటో ఆ చారిత్రక సత్యాలు’’
    ‘‘అసలు స్వాతంత్య్ర పోరాటానికి మూలం మా తాత. నిరాయుధీకరణను ఆయుధంగా చేసుకుని మహాత్ముడు జరిపిన స్వాతంత్య్ర పోరాటం వల్ల ఈ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని చరిత్రను తప్పుదోవ పట్టించారు. కానే కాదు.. అసలు చరిత్ర వేరుగా ఉంది. నేనది రాసినందుకే నన్ను పాస్ చేయడం లేదు’’


    ‘‘ ఏంటో ఆ చరిత్ర ’’
    ‘‘తింగరి బుచ్చయ్య అని మా తాత స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి ఆయనే. ఓ రోజు ఆయన తాగి ఇంటికి వస్తే మా అవ్వ తిండి పెట్టలేదు. ఇంట్లోకి రానివ్వలేదు. రెండు రోజుల పాటు తిండి తిప్పలు లేక ఇంటి బయ ట అలానే పడి ఉన్నాడు. ఏ పనీ చేయలేదు. ఎవరింటికి వెళ్లలేదు. మందు తాగలేదు. మాట్లాడలేదు. దాంతో మా ఆవ్వ దెబ్బకు దిగి వచ్చింది. సహాయ నిరాకరణ ఉద్యమానికి, సత్యాగ్రహ ఉద్యమానికి ఇదే స్ఫూర్తి.. కానీ చరిత్రలో మా తింగరి బుచ్చయ్య తాతకు స్థానం కల్పించకుండా కాంగ్రెస్ కుట్ర పన్నింది. ’’
    ‘‘దీంతో కాంగ్రెస్ కేం సంబంధంరా అబ్బాయ్ ’’
    ‘‘అక్కడే ఉంది సమస్య అంతా. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అని విన్నా వా? ’’
    ‘‘ఏదో చరిత్ర రచయితల సంఘం అని చదివినట్టు గుర్తు. ’’
    ‘‘ఇక్కడే అసలు మతలబు ఉంది. చరిత్ర రాసుకునే వాళ్లు కూడా కాంగ్రెస్ అని ఒక పార్టీ పేరుతో సంస్థ పెట్టుకున్నారంటే చూడు బాబాయ్ వీళ్లు ఎంతకు తెగించారో. మా తింగరి బుచ్చయ్య తాత ఇండిపెండెంట్. ఏ పార్టీకి చెందని వాడు. ఇండిపెండెంట్‌గానే దేశానికి ఇండిపెండెన్స్ సాధించాలని ఉద్యమించాడు. మా తాత కాంగ్రెస్ సభ్యుడు కాదు కాబట్టి కాంగ్రెస్ చరిత్ర కారులు మా తాతను చిన్నచూపు చూశారు. ’’


    ‘‘చరిత్ర రచయితల సంఘానికి కాంగ్రెస్‌కు సంబంధం లేదనుకుంటారా? అది ఎప్పుడో 1935లో ఏర్పాటు చేశారురా అబ్బాయ్’’
    ‘‘బాబాయ్ కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయకు. చివరకు వాళ్లు అమెరికా పార్లమెంటుకు కూడా కాంగ్రెస్ అని తమ పార్టీ పేరే పెట్టించుకున్నారు. అమెరికాలోనే పలుకుబడి చూపించినోళ్లు మన దేశ చరిత్రను రాసుకోవడంలో ప్రభావం చూపించలేదంటావా? ’’
    ‘‘ఏమోరా నాకు అయోమయంగా ఉంది.. ఇంతకూ ఇప్పుడు నువ్వేమంటావు’’
    ‘‘అక్కడికే వస్తున్నా... ఫేస్‌బుక్ గురించి విన్నావు కదా! సరికొత్త చరిత్ర సృష్టిస్తాను’’


    ‘‘అవును విన్నాను. కాలేజీకెళ్లే ముగ్గురు కుర్రాళ్లు కారు షెడ్డూలోనే ఫేస్‌బుక్‌ను స్థాపించి ప్రపంచంలోనే సంచలనం సృష్టించారు. 125 కోట్ల మంది ఫేస్‌బుక్ చూస్తారట నిజంగానే ఇది చరిత్ర రా అబ్బాయి’’
    ‘‘అది కాదు నేను చెప్పేది విను. వాడి సంస్థను వాడు కారు షెడ్డులో ప్రారంభిస్తే నాకేం ఇరానీ హోటల్‌లో ప్రారంభిస్తే నాకేం కానీ నేను చెప్పేది ఫేస్‌బుక్ ఓనర్ గురించి కాదు. ఫేస్‌బుక్‌ను ఉపయోగించి కొత్త చరిత్రను సృష్టిస్తాను దాని గురించి చెబుతున్నాను. ’’
    ‘‘కాస్త వివరంగా చెప్పు’’
    ‘‘నీకీ రహస్యం తెలుసా? నెహ్రూ, జిన్నా, ఫరూఖ్ అబ్దుల్లా ముగ్గురు దగ్గరి బంధువులు. వేలువిడిచిన మేనమాట, పినతల్లి చిన్నత్త కొడుక్కు తాత అవుతాడన్నమాట ’’


    ‘‘నిజమా? నెహ్రూ హిందువు, జిన్నా, అబ్దుల్లా ముస్లింలు బంధువులు ఎలా అవుతారు. అయినా ఇలాంటి తిక్క విషయాలు నీకెవడు చెప్పాడురా?’’
    ‘‘ఫేస్‌బుక్, వాట్సప్‌లలో ఇలాంటి అద్భుతమైన చరిత్రను ఇంకా ఎంతో చదవ వచ్చు బాబాయ్. అందుకే నాకీ చరిత్రపై నమ్మకం లేదు. సామాజిక మాధ్యమాల్లో నేను సరికొత్త చరిత్ర రాస్తాను. తింగరి బుచ్చయ్య తాతకు నివాళిగా చరిత్ర పాఠాలు రాస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడతాను, ఫేస్‌బుక్‌లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తా ’’
    ‘‘ బాగా ఎదిగిపోయావురా అబ్బాయ్... ఆయనెవరో నదులను నేనే అనుసంధానం చేశాను, ఇక సముద్రాలను అనుసంధానం చేయడమే తరువాయి అని చెబుతుంటే... నువ్వేమో ఏకంగా చరిత్రనే హైజాక్ చేసేస్తున్నావు’’
    ‘‘ ఆధారాలు చూపిస్తే, మేం పట్టించుకోం. మేం రాసే చరిత్రను అంగీకరించేవారే మా చరిత్ర గ్రూపులో ఉండాలి. ’’


    ‘‘ విజయం సాధించిన వాడు చెప్పిందే చరిత్ర అని నిన్నటి మాట. సామాజిక మాధ్యమాలు చూశాక ఎవడి చరిత్ర వాడిదే అనిపిస్తోంది. ఎవరి ఆత్మకథ వాళ్లు రాసుకున్నప్పుడు ఎవరికి తోచిన చరిత్ర వాళ్లు రాసుకుంటే వద్దనెదేముంది. వీటికి ఆత్మ చరిత్ర అని పేరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది!

    13, సెప్టెంబర్ 2015, ఆదివారం

    కుక్క కరిచింది!

    బ్రేకింగ్ న్యూస్
    ‘‘రాణీ... కుక్క ఒకేసారి ఏకంగా ఏడుగురిని కరిచింది’’
    ‘‘థ్యంక్స్ రఘు ఈరోజు పెద్దవార్తలేమీ లేవు. తొందరగా లైవ్‌లోకి వచ్చేయ్’’
    ‘‘బ్రేకింగ్ న్యూస్...కెసిఆర్ ఇంటికి 28 కిలో మీటర్లు, హైటెక్ సిటీకి 31 కిలో మీటర్లు, అమరావతికి నాలుగు వందల కిలో మీటర్ల దూరంలోని కుషాయిగూడలో పిచ్చి కుక్క విచక్షణా రహితంగా 18 మందిని కరిచింది. పూర్తి వివరాలు మా రిపోర్టర్ రఘును అడిగి తెలుసుకుందాం’’
    ‘‘ రఘూ... కుక్క కరవడంపై ఏమంటున్నారు’’
    ‘‘ఒకేసారి 18 మందిని పట్టపగలు అందరూ చూస్తుండగా కరవడం వెనుక అంతు చిక్కని కుట్ర ఏదో ఉందనే అనుమానం రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు రాణి’’


    ‘‘ రఘూ...రాజకీయ నాయకులు ఎవరైనా స్పందించారా?’’
    ‘‘విప్లవ ప్రతిఘాతక శక్తులు బరితెగించారు అనడానికి కుక్క కరవడమే సాక్ష్యం. ఆరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని కుక్క కాట్లతో విప్లవాన్ని ఆపలేరు.’’ అని విప్లవ్‌కుమార్ ఆవేశంగా ప్రకటించాడు రాణీ. స్థానిక ప్రముఖ నాయకుడు గన్నయ్య మాట్లాడుతూ దామాషా ప్రకాఠం కరవాలి కానీ మా సామాజిక వర్గం వాళ్లను ఎక్కువ మందిని కరిచింది. ఇందులో కుట్ర దాగుంది. సాక్షాలను తారు మారు చేసే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేసి సిబిఐ విచారణకు ఆదేశించాలి.’’
    ‘‘రఘూ... రాష్ట్రాలను కుదిపేసిన ఈ సంఘటనపై మన స్టూడియోలో ఉన్న విశే్లషకుల అభిప్రాయాలు తెలుసుకుందాం. ముందుగా ప్రముఖ రిటైర్డ్ మేధావి మేదయ్య అభిప్రాయం’’


    ‘‘అరవడం మనిషి లక్షణం, కరవడం కుక్క లక్షణం. ప్రత్యేక పరిస్థితుల్లో మనుషులు కరుస్తారు, కుక్కలు అరుస్తాయి. మానవ నాగరికత అభివృద్ధి చెందుతున్న దశలో కక్కలు, మనుషులు కలిసే అరిచేవారు, కరిచే కరిచేవారు. మనిషి ఆహారాన్ని వేటాడే దశలో అతనికి కుక్కలు తోడుగా ఉండేవి. నాగరికత అభివృద్ధి చెందిన తరువాత సామాజిక వర్గాలు, మతం ఏర్పడిన తరువాత కుక్కల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి తమ జాతిపై మనుషులు సాగిస్తున్న అమానుషత్వానికి ప్రతీకారంగానే ఆ కుక్క మనుషులపై దాడి చేసి కరిచింది. ఆ కుక్క నా దృష్టిలో విప్లవ వీరుడు. ఏ జాతిలోనైనా ముందు ఒకే ధిక్కార స్వరం వినిపిస్తుంది. ఆ తరువాత ఆ స్వరాన్ని ఇతర స్వరాలు అనుసరిస్తాయి. మనం అన్ని కోణాల్లో ఈ అంశాన్ని పరిశీలించాలి. ఒక వేళ ఆ కుక్క అసంకల్పితంగా తిరుగుబాటు జరిపితే దానిలో హిందుత్వ వాదుల కుట్ర లేకపోలేదు. హిందూ శక్తులు ఆ కుక్కను ఉసిగొల్పి కరిపిస్తున్నాయేమో అనే కోణంలో పరిశోధన సాగించాల్సిన అవసరం ఉంది. నేనీ మాటను ఆషామాషిగా చెప్పడం లేదు. ఆ కుక్క నలుపు రంగులో ఉంది. అక్కడక్కడ తెలుపు మచ్చలు కనిపిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ కుక్క మీసాల్లో కాషాయ రంగులో ఉన్న వెంట్రుక ఒకటి కనిపిస్తుంది. కుక్క మూతితోనే కరుస్తుంది. అంటే కాషాయ రంగు వెంట్రుక ప్రభావం ఆ కుక్క చర్యలో ఉందని చెప్పడంలో నాకు సందేహం లేదు. ’’


    ‘‘రాజకీయ జీవి గారు ఈ సంఘటనను మీరెలా చూస్తున్నారు.’’
    ‘‘మీరో కీలకమైన విషయాన్ని మరిచిపోతున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనప్పుడే ఈ సంఘటన జరిగిందంటే యాదృచ్చికం అని భావించలేం. బలమైన సాక్ష్యాన్ని సిద్ధం చేసుకొని రాజకీయ కుట్రలో భాగంగానే ఇది జరిగి ఉంటుంది. స్టూడియోలో చర్చకు రాక ముందే కూషాయ గూడాలో కుక్క కాటుబారిన పడ్డవారి వివరాలు సేకరించాను. సామాజిక వర్గాల వారిగా బాధితుల సంఖ్యను చూస్తే రాజకీయ కారణం అనిపిస్తోంది. మా పార్టీకి అండగా నిలిచే సామాజిక వర్గం వారినే ఎక్కువ మందిని కరిచింది. మమ్ములను కరిచే కుక్కలను మేం తిరిగి కరుస్తాం. కరవడం అంటూ మొదలు పెడితే కుక్కలు మిగలవని గ్రహించాలి. పులితో ఫోటో దిగాలనుకో పరవా లేదు కానీ చనువిచ్చింది కదా అని పులిని కరవాలనుకుంటే కుక్క అనే కనికరం కూడా లేకుండా తిరిగి కరిచేస్తాం.’’
    ‘‘తటస్థులు గారు అందరి అభిప్రాయాలు విన్నారు కాదా దీనిపై మీరేమంటారు’’


    ‘‘ ఈ దేశంలో దురదృష్టకరమేమంటే అంతా తమ తమ పార్టీల కోణంలోనే సమస్యను చూస్తున్నారు. సమస్యను సమస్యగా చూడడం లేదు. ఇప్పుడున్న పార్టీలన్నీ కుక్కలను రెచ్చగొట్టి మనుషులను కరిపిస్తున్నాయి. కొత్త పార్టీ రావలసిన అవసరం ఉంది అని మొన్నటి వరకు నేను పని చేసిన పార్టీ నన్ను బయటకు పంపిన తరువాత నేను గ్రహించిన విష యం’’
    ‘‘రఘూ... విన్నావు కదా! ఇంతకూ విచక్షణా రహితంగా మనుషులను అలా ఎందుకు కరవాల్సి వచ్చిందో ఆ కుక్కతో మాట్లాడించు’’
    ‘‘ రాణీ... కుక్క కరవడంపై మనం ప్రసారం చేసిన వార్త దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ప్రధాన మంత్రి కార్యాలయం దీనిపై వివరాలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కుక్కలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ రాష్ట్రప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వివిధ పార్టీల ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసింది. రాష్టప్రతిని, అమెరికా అధ్యక్షుడిని కలిసేందుకు వేరువేరు బృందాలు బయలు దేరి వెళ్లాయి రాణీ. అసలెందుకు కరిచిందో మనం కుక్కను అడిగిత తెలుసుకుందాం.


     కుక్కగారూ మీరెందుకు..... ’’
    కెవ్వు కేక
    ‘‘రఘూ... ఏమైంది .. రఘూ...మాట్లాడండి’’


    ‘‘హాలో నేను దారిన పోయే దానయ్యనండి. మీ రిపోర్టర్‌ను కుక్క కరిచింది. కెవ్వుమని అరిచి పడిపోయాడండి. మాట్లాడలేడు. మీ రిపోర్టర్ నాకు బాగా తెలుసండి. ఆ కుక్క వాడి పెంపుడు కుక్కే. ఈ రోజు వార్తలేమీ లేక తన పెంపుడు కుక్క కరవడంపైనే స్టోరీ చేశాడు. తనను అడ్డం పెట్టుకుని ఇంత రాజకీయం చేయడం చూశాక ఆ కుక్కకు పిచ్చెక్కి మీ రిపోర్టర్‌ను కరిచేసింది. ఇప్పుడు, మీ స్టూడియో వైపేపరిగెత్తుకు  వస్తోంది జాగ్రత్తండి ’’