27, డిసెంబర్ 2011, మంగళవారం

మన చానల్స్‌కు చట్టాలు వర్తించవా? టైమ్స్ నౌ పై కేసు పెట్టినట్టు తెలుగు చానల్స్ పై కేసులు పెట్టరేమిటి ?


కొన్ని దేశాల్లో చట్టాలు అక్రమాలకు అనువుగా ఉంటాయి. అలాంటి దేశాల నుండే మన దేశానికి నిధులు వస్తుంటాయి. ఇక్కడ సంపాదించిన సొమ్ము ఆ దేశాల ద్వారా అక్రమంగా మళ్లీ ఇక్కడికే వస్తుంటుంది. అక్రమ సంపాదన పరులకు ఈ దేశాలు కొంగు బంగారం వంటివి. అలానే తెలుగు నాట చానల్స్‌కు చట్టాలు వర్తించవా? అనే అనుమానం కలుగుతోంది. ప్రముఖ సినిమా హీరో అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ మద్యం సేవించి కారు నడిపారని, ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారని ఈ నెల 20న తెలుగు చానల్స్ ఒకరిని చూసి ఒకరు హడావుడి చేశాయ. నాగార్జున తండ్రి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారే, మహానటుడు, నాగార్జున నటుడు, ఇక అఖిల్‌ను నేడో రేపో హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారు. ఇంకేం చానల్స్‌లో ఈ వార్త హడావుడి చేయడం సహజమే. అంతా బాగానే ఉంది కానీ చివరకు తేలింది ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న అఖిల్ నాగార్జున కుమారుడు అఖిల్ కాదు. ఫార్ములా వన్ డ్రైవర్ అఖిల్ కుష్‌లానీ.

 మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్న అతన్ని ట్రాఫిక్ పోలీసులు తిరుమలగిరిలో పట్టుకున్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ అఖిల అనగానే టీవిల్లో నాగార్జున కుమారుడని ప్రకటించి హడావుడి చేశారు. తరువాత కనీసం పొరపాటు జరిగింది ఫార్ములా వన్ డ్రైవర్ అఖిల్‌ను నాగార్జున కుమారుడు అఖిల్ అనుకున్నాం అనే సవరణ అయినా స్క్రోలింగ్‌లో చూపాల్సిన కనీస బాధ్యత లేదా?
ఇలాంటివి చూసిన తరువాతనే చట్టాలు మన తెలుగు చానల్స్‌కు పని చేయవేమో అనిపిస్తుంది. ఎందుకంటే గజియాబాద్ ఫ్రావిడెంట్ ఫండ్‌లో భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణానికి బాధ్యులు సావంత్ కాగా టైమ్స్ నౌ చానల్ పొరపాటున సావంత్ ఫోటోకు బదులు జస్టీస్ సామంత ఫోటో చూపించారు. పొరపాటు జరిగిందని, ఒకరి ఫోటోకు బదులు మరొకరి ఫోటో టీవిలో చూపించామని టైమ్స్ నౌ స్క్రోలింగ్‌లో పదే పదే చూపించింది. అయితే సామంత్ టైమ్స్ నౌ పై పరువు నష్టం దావా వేశారు. కోర్టుకు వెళ్లడంతో వంద కోట్ల రూపాయల జరిమానా విధించారు. టైమ్స్ నౌ సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ వ్యవహారంలో సుప్రీం సైతం జోక్యం చేసుకోలేమంది. ముందు 20 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమంటే చేశారు. ఇది జాతీయ స్థాయిలో మీడియాలో సంచలనాత్మకంగా మారింది. రెండు పేర్ల మధ్య పోలికలు ఉన్నాయి. ఉద్దేశ పూర్వకంగా చేసిన తప్పు కాదు. పైగా పొరపాటు జరిగిందని ప్రకటించారు. అయినప్పటికీ జరిమానా తప్పలేదు.
పొరపాటు జరిగిన దానికే ఇంత తీవ్రంగా స్పందిస్తుంటే ఉద్దేశ పూర్వకంగానే తెలుగునాట చానల్స్ నిబంధనలు తుంగలో తొక్కినా ఎలాంటి చర్యలేదు. నాగార్జున లాంటి వారు ఇలాంటివి పట్టించుకోకపోతే ఫరవాలేదు కానీ కోర్టుకు వెళితే?
వ్యభిచారం కేసులో పట్టుపడినా? నృత్యాలు చేస్తున్న వారిని అరెస్టు చేసినా వారి ముఖాలను టీవిల్లో చూపించవద్దు. దీనికి సంబంధించి స్పష్టమైన నియమ నిబంధనలు, కోర్టు తీర్పులు ఉన్నాయి. అయితే వీటిని ఏ చానల్ పాటించదు. పైగా అలాంటి నిబంధనలు ఉన్నాయనే విషయం కూడా వారికి గుర్తుండదు. నగర శివార్లలో అమ్మాయిల అర్ధనగ్న దృశ్యాలు అంటూ పోలీస్ స్టేషన్‌లో అమ్మాయిల ముఖాలను చూపుతుంటారు. అక్కడి పోలీసులకు తెలియకుండానే నగర శివార్లలో ఫాం హౌస్‌లో నృత్యాలు జరుగుతాయని అనుకోలేం. ఏదో తేడాలు వచ్చినప్పుడు దాడులు జరుగుతుంటాయి, మీడియాను పిలిచి హడావుడి చేస్తారు. వారు అర్ధనగ్నంగా నృత్యాలు చేశారో, మిత్రులతో కలిసి వచ్చారో, ఏం జరిగిందో తెలియదు కానీ చానల్స్‌లో మాత్రం ఆ అమ్మాయిలు ముఖాలను పదే పదే చూపుతూ బోలెడు కవిత్వాన్ని ఒలకబోస్తుంటారు. వాళ్ల ముఖాలు టీవిలో కనిపిస్తే ఆ కుటుంబం ఏం కావాలి. వ్యభిచారం చేసినా ముఖం చూపించవద్దు అనే చట్టం చెబుతుంటే నృత్యాలు చేశారు అంటూ ముఖాలు నేరుగా చూపించడం చట్ట వ్యతిరేకం కాదా? నిబంధనలకు విరుద్ధంగా నృత్యాలు చేస్తున్నారంటూ నిబంధనలకు విరుద్ధంగా టీవిల్లో ఎలా చూపిస్తారు. రెండూ చట్ట వ్యతిరేకమే కదా?
చానల్స్ పోటీతో కొందరి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఆ మధ్య ఒక అమ్మాయిని ప్రేమించానంటూ ఉన్మాది ఆ అమ్మాయి తల్లిదండ్రులను చంపేశాడు. ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ఆ వార్తలను పదే పదే చూపుతుంటే టీవిల ముందే పెద్ద అమ్మాయి ఏడ్చింది అలా చూపించకండి అంటూ. కొన్నాళ్ల తరువాత కేసు విచారణ జరిగి దోషికి శిక్ష పడింది. అప్పుడు మళ్లీ టీవిల వాళ్ల ఆ అక్కా చెల్లెళ్లను మళ్లీ టీవిల్లో పదే పదే చూపించారు. దాంతో చెల్లెలు, దీన్ని తట్టుకోలేక పోతున్నానని, బతికున్నంత వరకు ఇలానే చూపిస్తారని ఆవేదన చెంది పాఠశాలలోనే భవనం పై నుండి పడి ఆత్మహత్య చేసుకుంది. అయినా మన చానల్స్ గుండె కరగలేదు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చూపుతూనే ఉన్నారు. నేరం చేసిన మహిళ అయినా సరే ముఖాన్ని టీవిలో చూపించ వద్దనే నిబంధన ఉల్లంఘించినందుకు చాలా రోజుల క్రితం ఒక సామాజిక ఉద్యమ కారిణి కోర్టుకు వెళితే, ప్రముఖ చానల్‌కు జరిమానా విధించారు. భార్యా భర్తల గొడవ, అక్రమ సంబంధాలు, అనుమానాల వ్యవహారాల్లో సైతం కెమెరాలు పట్టుకుని చానల్స్ దూరిపోతున్నాయి. ఒకావిడ తన భర్త ఎవరితోనో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని చానల్స్ వారిని, జనాన్ని వెంటబెట్టుకుని సాక్షాలతో చూపించి, ఆమెను చితగ్గొట్టింది. భార్యా భర్త, ఆవిడ ముగ్గురు, బంధు జనం రోడ్డున పడ్డారు. కొట్టుకున్నారు. టీవి చానల్స్‌కు పసందైన దృశ్యాలు లభించాయి. ప్రసారం చేశారు. దీని తరువాత ఆ భర్త బుద్ధిగా కాపురం చేసుకున్నాడా? ఆ విషయం చానల్‌కు ఎందుకు అప్పటికప్పుడు న్యూ సెన్స్ జరిగి మంచి దృశ్యాలు దొరికితే చాలు, ఆ అవమానాన్ని భరించ లేక ఆమె ఆత్మహత్య చేసుకుంటే వారికేంటి?
పోటీ వల్ల ఎవరికి వారు తాము వెనకబడతామేమోనని నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇలాంటి తప్పులను క్షేత్ర స్థాయిలో ఉండే రిపోర్టర్లు ఆపలేరు. నిబంధనలు ఉల్లంఘించిన సంఘటనల్లో సామాజిక ఉద్యమ కారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటే చానల్స్‌లో మార్పు రావచ్చు. టైమ్స్ నౌ సంఘటనలో మానవ తప్పిదానికి పెద్ద శిక్ష వేశారు, కానీ ఇక్కడ ఉద్దేశ పూర్వకంగా జరుపుతున్న తప్పులను నివారించడానికి తీవ్రమైన చర్యలు అవసరం.

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం