26, మార్చి 2014, బుధవారం

మారువేషాల్లో మారీచులు!

కల్తీ జీవితంలో భాగంగా మారినప్పుడు అసలునే అనుమానంగా చూడాల్సి వస్తుంది అది లోక సహజం. అసలూ నకిలీ కవలపిల్లల్లా కలిసిపోయాయి. మీరు చూస్తున్నది అసలైన బిజెపి కాదు నకిలీలు ఆక్రమించుకున్న బిజెపిని అని ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులు జస్వంత్ సింగ్ కంటతడిపెట్టి మరీ చెబుతున్నారు. ఇదే మాట మరో రకంగా అద్వానీ చెబితేనే దిక్కులేదు, జస్వంత్ చెబితే పట్టించుకునేదెవరు? అసలు, నకిలీలను గుర్తిం చే బాధ్యత వాజ్‌పాయికి అప్పగించవచ్చు కదా? అంటే ఆయన అసలునే గుర్తించే స్థితిలో లేరు ఇక నకిలీనేం పట్టుకుంటురనే సమాధానం వస్తోంది. 

శ్రీరాముడ్ని నమ్ముకుని ఒక దశలో కమలం పువ్వును వెనక్కి పంపి శ్రీరాముడినే పార్టీ గుర్తుగా మార్చుకుంది బిజెపి . అచ్చం శ్రీరాముడికి వచ్చిన సమస్యనే ఇప్పుడు బిజెపికి వచ్చిపడింది. అప్పుడు శ్రీరాముడు నకిలీని గుర్తించలేక మాయలోపడిపోతే ఇప్పుడు శ్రీరాముని భక్తులు నకిలీని గుర్తించి కూడా మాయలో పడ్డారనేది బాధితుల ఆవేదన.
ఒక ప్రక్షిప్త కథలో మారీచునితో రావణుని సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది. రావణుడు మారీచుడ్ని పిలిచి ఓరే అబ్బాయ్ నేను సీతను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను. శ్రీరాముడి ఉండగా అది సాధ్యం కాదు.... నీవు బంగారు లేడిగా మారి సీతకు కనబడు. ఆమె నిన్ను పట్టుకు రమ్మని శ్రీరామున్ని పంపుతుంది తరువాత కథ నేను చూసుకుంటాను. అయితే శ్రీరాముడు చాలా తెలివైన వాడు సుమా జాగ్రత్త అని చెబుతాడు. రావణుడు చెప్పినట్టే పని ముగించుకుని వచ్చిన మారీచుడు. బాస్ మీరూ శ్రీరాముడి గురించి మరీ ఎక్కువగా చెప్పారు. బంగారు లేడి ఉంటుందని నమ్మిన శ్రీరాముడు తెలివైన వాడంటారేంటి అని అడుగుతాడు.
ప్రొఫెసర్ జ్ఞానాన్ని మరో ప్రొఫెసరే అంచనా వేయాలి కానీ ఏడో తరగతి కుర్రాడికి ఆ పని చేబితే ఏంటో పిచ్చి ప్రొఫెసర్ అనుకుంటాడు నువ్వు అలానే అనుకుంటున్నావని చెప్పి మారీచుడ్ని పంపించేస్తాడు రావణుడు. 


అది సరే మరి శ్రీరాముడు బంగారు లేడిని ఎందుకు నమ్మాడు అంటే అలా నమ్మితేనే కదా? సీతాపహరణ జరుగుతుంది, రావణ సంహారం జరగాలంటే అలా నమ్మి తీరాలి. మారీచుడు బంగారు లేడి వేషంలో వస్తే లోక కల్యాణం కోసమే సీతారాములు నమ్మారు.


దశాబ్దకాలం పాటు బిజెపి వాళ్లు జై శ్రీరాం అని నినాదం ఇచ్చారు. ఆ నినాదంతోనే అధికారం అనుభవించారు. జై శ్రీరాం నినాదం ఒకప్పుడు దేశ మంతా మారుమ్రోగింది. ఇప్పుడా శ్రీరాముడ్ని ఎక్కడో బంధించేసినట్టున్నారు. జై శ్రీరామ్ నినాదాలకు బదులు ఇప్పుడు హర హర నమో అనే నినాదాలు వినిపిస్తున్నాయి. నమో నమో అని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తే మంచిదే కదా? అని పెద్దలకు అనుమానం రావచ్చు, కానీ పిలుస్తున్నది కనిపించని దేవున్ని కాదు, వాళ్ల దృష్టిలో ఇప్పుడు మోడీనే కనిపించే దేవుడు అందుకే ఆయన్ని హర హర నమో అని పిలుస్తున్నారు. శ్రీరాముని జన్మభూమి అయోధ్య కన్నా పరమ శివుడు కొలువైన వారణాసి అందరి నోళ్లలో నానుతోంది.


శ్రీరాముడ్ని మించి నమో భక్తి చూపడం దేశానికి మంచిది కాదని హర హర నమో అన డం తగదనేది సాధువులు సన్యాసులు చెబుతున్నారు. శ్రీరాముడ్నే పక్కన పెట్టిన వారికి సాధుసంతులను పక్కన పెట్టడం ఓ లెక్కా! ఈ పూనకం చూస్తుంటే నమోనే అసలైన దేవుడు అని వాదించేట్టుగా ఉన్నారు.
అడుగడుగునా మారువేషాల్లో వస్తున్న వారిని జనం నమ్ముతున్నారంటే గత్యంతరం లేక మాత్రమే కానీ లోక కల్యాణం కోసం కాదు. వర్షాకాలంలో అంటు రోగాలు పిలవకపోయినా వచ్చినట్టు ఎన్నికల కాలంలో మారువేషాల్లో మారీచులు అడుగడుగునా కనిపిస్తారు. నా గుండెను చీల్చి చూడండి సోనియాగాంధీ కనిపిస్తుంది. నా గుండెను పిండి చూడండి చేతి గుర్తులు కనిపిస్తాయి అని వీర గీతాలు ఆలపించిన నాయకులు హఠాత్తుగా తెలుగు భవన్‌లో ప్రత్యక్షం అవుతున్నారు. అదేంటయ్యా అంటే ఇదే అసలైన కాంగ్రెస్ భవన్ అంటున్నారు. విన్నవాడికి బుర్ర తిరిగిపోతోంది. ఏది అసలైన టిడిపినో, ఏది అసలైన కాంగ్రెసో, ఏది నకిలీదో అర్ధం కాని పరిస్థితి. ఇప్పుడున్నది నిజమైన కాంగ్రెస్ కాదు అందుకే నేను పార్టీ మారుతున్నాను అంటూ గల్లా అరుణ టిడిపిలో చేరిపోయారు. ఆమె మాట్లాడిందాని ప్రకారం ఇప్పుడున్న టిడిపినే నిజమైన కాంగ్రెస్ అన్నమాట! టిడిపిలో కాంగ్రెస్ విభాగం ఏర్పాటు చేయవచ్చు కదా? అని ఒకరు ప్రశ్నిస్తే మా అధ్యక్షుడితో సహా మెజారిటీ కాంగ్రెస్ వాళ్లే ప్రత్యేక విభాగం ఎందుకు అని సమాధానం చెబుతున్నారు.


మిత్రుడి కోసం దుర్యోధనుడు అర్ధరాజ్యం ఇచ్చేస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం జగన్ కోసం కొండా సురేఖ ప్రజాస్వామ్యంలో రాజ్యం లాంటి పూర్తి మంత్రిపదవినే త్యాగం చేశారు. తెలంగాణ వాదులపై వీరోచిత పోరాటం చేశారు. ఆమెను మించిన పోరాట యోధురాలు మరొకరు లేరని టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు..... టికెట్ రాక బయటకు పోయే వాళ్లు ఇది నకిలీ టిఆర్‌ఎస్ అంటున్నారు. టిఆర్‌ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ నకిలీ తెలంగాణ పార్టీలని టిఆర్‌ఎస్ తేల్చేసింది.
ఏకపక్షంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించింది కదా ! రండి ఎన్నికల్లో మీ సంగతి చూపిస్తామని సీమాంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. పాత సినిమాల్లో ముఖంపై నల్లని పులిపిరి పెట్టుకుని ఇదే మారువేషం అనేవారు. ఇప్పుడు అలానే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పులిపిరిలానే తెల్ల దుస్తుల స్థానంలో పచ్చ దుస్తులు వేసుకోని మారువేషాల్లో వస్తున్నారు. పాపం ఓటర్లు ఇంకేం శిక్షిస్తారు.


మారువేషాన్ని గుర్తించినా ప్రేక్షకుడు వౌనంగా సినిమా చూసినట్టు మారువేషాల్లో వచ్చిన నేతలను జనం భరించాల్సిందే! ఇది నకిలీ వేషగాళ్ల కాలం. ఓటుకు దూరంగా ఉంటే నకిలీ నాయకులు నకిలీ ఓట్లు వేసుకుని గెలిచేయగలరు. అందుకే మనది నకిలీ ప్రజాస్వామ్యం అని ఎన్నికలను బహిష్కరించాలనే వారి వాదన.

5 కామెంట్‌లు:

  1. konda surekha nu TRS lo cherinchukovadam thappe kani .... parakala upa ennikala gurunchi mee comment enti

    రిప్లయితొలగించండి
  2. మీకు రాజకీయుల మీద ఇంతలావు ద్వేషం ఉందనుకోలేదు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అర్థం చేసుకుంటే ఆసక్తి .. అర్థం చేసుకోకపోతే ద్వేషం అనిపిస్తుంది

      తొలగించండి
  3. chandu garu ee roju kaadu kaani 18 na face book lo ilaa rashanu ......

    Murali Buddha
    18 మార్చి near Hyderabad
    కొండా దంపతులను చేర్చుకోవడం నైతికంగా తప్పు
    రాజకీయంగా సరైన నిర్ణయం
    (ఆ దంపతులు కాంగ్రెస్ , టిడిపి తరపున గెలవడం కన్నా తెరాస తరపున గెలవడం ఆ పార్టీ కి మేలు కదా )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గతంలో జరిగిన ఉప ఎన్నికలలో కొండా సురేఖ కొద్దిపాటి తేడాతో ఓడిపోయింది. ఎంతో అంగధనబలం & వైఎస్ఆర్ పేరు వాడుకున్నా ఆమె గెలవలేదు. ఈసారి ఆ రెండూ లేవు.

      అంచేత ఇది రాజకీయంగా కూడా తప్పుడు నిర్ణయం.

      తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం