28, జూన్ 2015, ఆదివారం

లాంగ్ లివ్ ఎమర్జెన్సీ....ఈ కాలం నేతల నుంచి ఇందిరా గాంధీ తెలుసుకోవలసిన ఓ సంగతి

‘‘అద్వానీ  అలా ఎందుకు మాట్లాడారో?’’
‘‘ఏం మాట్లాడారు. రెండు సీట్లున్న బిజెపిని రథయాత్రలతో అధికార పీఠం వరకు తీసుకు వెళ్లారు. వాజ్‌పాయి తరువాత ప్రధానమంత్రి కావలసిన వారు.’’
‘‘మళ్లీ ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందని అలా అనవచ్చా?’’
‘‘ప్రస్తుత పరిస్థితి బట్టి ఎమర్జెన్సీ రావచ్చు అని ఆయన అభిప్రాయం. మోదీ పాలన వల్ల రామరాజ్యం వచ్చింది, స్వర్ణయుగం కళ్ల చూడవచ్చు అని ప్రధానమంత్రి అభిమానులు చెప్పుకోవచ్చు. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు?’’
‘‘సూర్యోదయాన్ని చూస్తూ మళ్లీ సూర్యోదయం కావచ్చు అంటే చిత్రంగా అనిపిస్తుంది కదా?’’
‘‘ అంటే’’


‘‘ నిజంగా అర్ధం కాలేదా? అర్ధం కానట్టు నటిస్తున్నావా? దశాబ్దాల నుంచి ఎమర్జెన్సీలోనే జీవిస్తున్న దేశ ప్రజలు దానికి అలవాటు పడిపోతే, మళ్లీ ఎమర్జెన్సీ రావచ్చు అని అంత పెద్దాయన అంటే విడ్డూరంగా అనిపించింది.’’
‘‘ఎమర్జెన్సీ మహాఘోరాలు తెలిస్తే నువ్విట్లా మాట్లాడవు. ఎమర్జెన్సీ విధించి 40 ఏళ్లవుతున్న సందర్భంగా తెలుగు చానల్స్‌లో ఎమర్జెన్సీ ఆకృత్యాలపై  పాతికేళ్ళు నిండని ఆ పసి కూనలు టీవి మైకులు పట్టుకుని ఆనాటి కరాళ నృత్యాల గురించి  కళ్ళకు కట్టినట్టు ప్రత్యక్ష సాక్షుల్లా  చక్కగా వర్ణిస్తుంటే వయసు మీరిన నువ్విలా మాట్లాడతావేమ్?.. ఆ నల్ల చొక్కా టీవి కుర్రాడిని చూడు వానికి మూడు నెలల్ల నుంచి జీతాలు ఇవ్వలేదు .. గట్టిగా అడిగితే ఉద్యోగం నుంచి పీకె స్తామని వార్నింగ్ ఇచ్చారు .. కానీ 
ఎమర్జెన్సీచీకటి రోజుల ఘోరాల గురించి ఎంత బాగా చెబుతున్నాడో  చూడు ’’

‘‘ ఏంటో ఆ ఘోరాలు చెబితే తెలుసుకుంటాం’’
‘‘ ఎమర్జెన్సీలో పౌరుల హక్కులను కాలరాచారు’’


‘‘అబ్బొ గొప్పపాయింట్ చెప్పావు. ఇప్పుడు పౌరులు తమకు హక్కులు ఉంటాయనే విషయమే మరిచిపోయారు. మీకున్న హక్కులు ఇవి అని పౌరహక్కుల ఉద్యమ కారులెవరైనా చెబితే వాళ్లను మాయం చేస్తున్నారు’’
‘‘బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించేవారు. పెళ్లికాని వారికి కూడా ఆపరేషన్లు చేశారు. ’’
‘‘ఎంసెట్ కోచింగ్ సెంటర్లు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. మంచి ర్యాంకుతో కార్పొరేట్ కాలేజీ హాస్టల్ నుంచి బయటకు వస్తారనుకుంటే శవమై బయటకు వస్తున్నవారు లెక్కలేనంత మంది ఉన్నారు. వారి సంఖ్యతో పోలిస్తే, ఎక్కడో పొరపాటున పెళ్లికాని వారికి జరిగిన ఆపరేషన్లు ఎన్నుంటాయి’’


‘‘మీడియాకు సెన్సార్ విధించారు. పౌరులకు తెలుసుకునే హ క్కు లేదా? ఇంత కన్నా ఘోరం ఇంకేముంటుంది? ’’
‘‘ఆవేశం ఎందుకోయ్.. ఎమర్జెన్సీలో మీడియా స్వేచ్ఛను లాగేసుకున్నారు అంటే అంతకు ముందు స్వేచ్ఛ ఉన్నట్టే కదా? అది కొంత నయం. ఇప్పుడు సామాజిక వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా మీడియాపై సెన్సార్‌షిప్ విధిస్తున్నారు. తమకు నచ్చని చానల్ తమ ప్రాంతంలో ప్రసారం కాకుండా నిషేధం విధిస్తున్నారు. మేనేజ్ చేయడం లేదా నిషేధం ..  స్వయంగా ముఖ్యమంత్రి లాంటి వారు అధికారిక విలేఖరుల సమావేశంలో పలానా పలానా మీడియా మా వర్గం కాదు కాబట్టి మా సమావేశాలకు హాజరు కావద్దు అని హుకూం జారీ చేశారు. ఎమర్జెన్సీలో మొత్తం మీడియాపై సెన్సార్‌షిప్ ఉండేది కానీ ప్రాంతాలు, సామాజిక వర్గాల వారిగా సెన్సార్ షిప్ ఉండేది కాదు కదా?’’


‘‘ ఉద్యమ కారులను రాత్రికి రాత్రి మాయం చేసి హత్య చేసిన సంఘటనలు కేరళలో జరిగాయి. ’’
‘‘ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ప్రతి ఊళ్లో జరుగుతున్నాయి. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించే వారిని పట్టపగలే మాయం చేస్తున్నారు. దీనికి ఎన్‌కౌంటర్ అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు.
‘‘అప్పుడు రాజ్యహింస జరిగింది. రాజ్యమే రౌడీలా మారి చట్టాన్ని చేతిలోకి తీసుకుంది’’


‘‘ఏంటో అలాంటి పెద్ద పెద్ద పదాలకు నాకు అర్ధం తెలియదు కానీ నీ అభిప్రాయం ప్రకారం. కోర్టులు, చట్టాలు విచారణ అలాంటివేమీ లేకుండా లేపేశారంటావా? ’’
‘‘ అవును’’
‘‘ మరిప్పుడు జరుగుతున్నదేమిటి? ఒకే రోజు పోటాపోటీగా ఎర్రచందనం కూలీలు, ఐఎస్‌ఐ తీవ్రవాదులను లేపేయడం మొన్ననే  జరిగింది కదా?  హత్యలు రాజ్యం రాజ్యం ప్రధాన బాధ్యతగా మారింది  ఇలాంటివి దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి .. ’’
‘‘ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అధికారంలో ఉన్నవారి కోసం పని చేశారు’’
‘‘మరీ సిల్లీగా మాట్లాడకు ఒక్క ఎమర్జెన్సీలోనే నా ? అధికారులెప్పుడూ అంతే కదా? అధికారంలో ఉన్న నాయకులు ఎలా చెబితే అలానే కదా నడుచుకునేది’’
‘‘అంటే ఎమర్జెన్సీని సమర్ధిస్తున్నావా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావా? ’’


‘‘ ఎమర్జెన్సీని నేనెక్కడ సమర్ధించాను. ఎమర్జెన్సీలో జరిగాయని చెబుతున్న ఆకృత్యాలు ఎప్పుడూ జరుగుతున్నవేనని చెబుతున్నాను. ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయని చెబుతున్నాను.   1975, జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు మాత్రమే ఎమర్జెన్సీ అని నువ్వంటున్నావు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించక ముందు, ఎమర్జెన్సీని ఎత్తివేసిన తరువాత, ఇప్పుడూ అది కొనసాగుతూనే ఉందని, ఎమర్జెన్సీ నిరంతర ఉంది అని నేనంటున్నాను’’


‘‘ ఇందిరాగాంధీ తప్పు చేయలేదని చెప్పదలుచుకున్నావా? ’’
‘‘లేదు... లేదు.. తప్పు వల్లనే నాలుగు దశాబ్దాల తరువాత కూడా ఎమర్జెన్సీ ఆకృత్యాలు అని ప్రచారం చేయగలుగుతున్నాం. ’’
‘‘ ఎమర్జెన్సీ చర్యలన్నీ ఒప్పే అన్నట్టు మాట్లాడి, మళ్లీ ఇందిరాగాంధీ ఘోరమైన తప్పు చేసిందంటావు. ఏమిటా తప్పు ?
‘‘మీడియా మేనేజ్‌మెంట్ చేసుకున్నాక ఎమర్జెన్సీ విధించి ఉంటే ఎమర్జెన్సీ విధించినందుకు ఆమెకు జనం నీరాజం పట్టేట్టు మీడియా చూసుకునేది. సెన్సార్‌షిప్ కన్నా మీడియాకు సెజ్‌లు బహూకరిస్తే ఇది సాధ్యం అయ్యేది. మీడియా మేనేజ్‌మెంట్‌లో నాలెడ్జ్ ఉంటే జనాకర్షణ నేత ఎన్టీఆర్‌ను సైతం అనామకుడిగా మార్చేయవచ్చు, అనామకుడిని మహనీయునిగా చిత్రీకరించ్చు. ఓటునోటులో పట్టుపడిన వాని కన్నా పట్టుకున్న వాడిదే నేరం అని సమర్ధవంతంగా వాదించగలగడం అంటే  మీడియా మేనేజ్‌మెంట్ తెలివితేటలు ఉంటేనే కదా? 

ఎమర్జెన్సీ విధించడానికి ముందు మీడియా మేనేజ్‌మెంట్ చేయకపోవడమే ఆ కాలంలో ఇందిరాగాంధీ చేసిన ఘోరమైన తప్పు .. ఇప్పుడు  ఇందిరాగాంధీ ఉండి  ఉంటే ఇప్పటి రాజకీయాలు చూసి ఈ విషయం ఆమె కూడా ఒప్పుకొని తీరుతారు . 
 ఎమర్జెన్సీ అంటే అదేదో మూడు రంగుల పార్టీ కె సొంతం అనుకుంటారు .. కానీ ఎమర్జెన్సీకి వర్ణ బేధాలు ఉండవు . తెలుపు , ఎరుపు , కాషాయ  అనే తేడా ఉండదు.  పచ్చ, గులాబీ , నీలి రంగు అన్నీ ఒకటే సప్తవర్ణాల కలయికే తెలుపు. ఎమర్జెన్సీ, అధికారం రెండూ కవలలు. అధికారం , ఎమర్జెన్సీ కంబైండ్ ప్యాకేజి విడివిడిగా దొరకవు .. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం