12, ఫిబ్రవరి 2018, సోమవారం

శివరాత్రి ఓ మధుర జ్ఞాపకం:ఉదయం బడిపంతులు రాత్రి నర్తన శాల

శివరాత్రి జాగారానికి ఏం ఏర్పాటుచేస్తున్నారు? ఈ రోజుల్లో ఇలాంటి ప్రశ్న వేస్తే అలా అడిగినవారిని చిత్రంగా చూడాల్సి వస్తుంది. మరో లోకం నుంచి వచ్చినట్టు చూసినా ఆశ్చర్యం లేదు. ఈ రోజుల్లో ప్రతిరోజు జాగారమే. ప్రత్యేకంగా జాగారం ఏర్పాట్లు ఎందుకు?

కాలం మారింది ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేదు. రోజంతా నగరం మేల్కొనే ఉం టున్నది. అయితే టీవీ, లేదంటే ఫోన్‌లో కావలసినవి చూస్తూ రాత్రంతా మెలుకువగానే ఉంటున్నారు. రోజూ జాగారం చేసే ఈ కాలంవారికి నాలుగైదు దశాబ్దాల కిందట ఏడాదికి ఒకరోజు జాగారం చేసేందుకు వారంముందు నుంచి ఏర్పాట్లు చేసుకొనేవారు అంటే వింతగా అనిపించవచ్చు.

దశాబ్దాల కిందట హైదరాబాద్ నగరంలో ఇలా ఉండేది కాదు. తెలంగాణలో పండుగలు ఎక్కువగా సామూహికంగా జరుపుకుంటారు. దీనికి హైదరాబాద్ నగరం మినహాయింపు కాదు. నాలుగైదు దశాబ్దాల కిందట కాలనీలు, అపార్ట్‌మెంట్లు హైదరాబాద్ నగరాన్ని కమ్మేయకముందు అచ్చం గ్రామాల మాదిరిగానే నగరంలో సామూహికంగా పండుగలు జరుపుకొనే ఆనవాయితీ ఉండేది. శివరాత్రి వస్తుందంటే చాలు ముందుగానే జాగారానికి ఏర్పాట్లు జరిగేవి. 
ఈ రోజుల్లో వైకుంఠపాళి అంటే తెలుసా అని ఎవరినైనా అడిగితే రాజకీయ విశ్లేషణలో తరచూ కనిపించే పదంగా మాత్రమే తెలిసి ఉండవచ్చు. కానీ అది హైదరాబాద్‌లో ఆ కాలంలో శివరాత్రికి అందరూ ఆడే మెదడుకు పనిచెప్పే ఒక ఆట.

అష్టాచమ్మ, వైకుంఠపాళి, భజనలు, నాటకాలు, పాటలు.. ఇవన్నీ శివరాత్రి రోజున వినిపించే మాటలు, కనిపించే ఆటలు. పెద్దలకు జాగారం ఎలా అనేది ప్రధాన ఆలోచనయితే పిల్లలకు రోజంతా తినకుండా ఉపవాసం ఎలా అనేది అం తకన్నా పెద్ద సమస్య. ఉదయం మార్నింగ్‌షో బడిపంతులు సినిమా చూసి ఆకలి మరిచిపోవడం, అర్ధరాత్రి సుదర్శన్ టాకీస్‌లో నర్తనశాల సినిమా చూడటం బాల్యంలో ఓ మధుర జ్ఞాపకం.


ఆర్టీసీ క్రాస్‌రోడ్ అంటే సినిమా ప్రియులకు స్వర్గధామం. ఇం కా టీవీలు రంగప్రవేశం చేయని ఆ రోజుల్లో వినోదం అంటే సినిమాలే. సినిమాలు చూడాలంటే టాకీసులే శరణ్యం. ఒక్క ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోనే అరడజను సినిమా హాల్స్ ఉండేవి. ఒక సినిమా కాకపోతే ఇంకో సినిమా. ఏదో ఒక సినిమా టికెట్ దొరుకడం గ్యారంటీ అనే బోలెడు నమ్మకంతో చలో ఆర్టీసీ క్రాస్‌రోడ్ అని సినిమా అభిమానులు క్రాస్‌రోడ్ బాట పట్టేవారు.
భోలక్‌పూర్ పెద్ద మసీదు వద్ద ముస్లింల సంఖ్య ఎక్కువ. దగ్గరలో అక్కడక్కడ హిందువులు ఉండేవారు. అపార్ట్‌మెంట్లు లేవు. ఇండిపెండెంట్ ఇళ్లకన్నా దొడ్డి అని ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఖరీదైనవాళ్లు నివసించే వాటిని గేటెడ్ కమ్యూనిటీ అం టున్నారు. అప్పుడు దాదాపు ఒకటి రెండెకరాల్లో దొడ్డి పిలిచే గృహసముదాయాలుండేవి. భోలక్‌పూర్‌లోని పండరయ్య దొడ్డి లో దాదాపు 15 కుటుంబాలు ఉండేవి. దిగువ, మధ్య తరగతి కుటుంబాలు. దగ్గరలో వెంకయ్య గల్లీ. చుట్టుపక్కల హిందువులుండే గల్లీలు. పండుగ వచ్చిందంటే వీరి హడావుడి కనిపించే ది. సికింద్రాబాద్, హైదరాబాద్ మధ్యలో ఉండే నగరంలోని నిజంగా నడిబొడ్డు ప్రాంతం భోలాక్‌పూర్‌లో దాదాపు పదెకరాల స్థలంలో చిన్న శివాలయం. దేవునితోట ఈ రోజుకు కూడా ఆక్రమణలకు గురికాకుండా దాదాపు పదెకరాల స్థలం శివాలయానికి ఉండటం విచిత్రం. రంగారెడ్డి అనే స్థానిక భూస్వామి దశాబ్దాల కిందట అక్కడ వ్యవసాయం చేసే రోజుల్లో ఆలయానికి ఆ భూమి విరాళంగా ఇచ్చారు. దేవాదాయశాఖ స్వాధీనం తర్వాత అధికారిక ఆక్రమణ తప్ప ఇప్పటివరకు నగరం నడిబొడ్డులో అత్యంత ఖరీదైన ఆ భూమి ఆక్రమణలకు గురికాకపోవడం దైవ నిర్ణయమేమో అనుకుంటారు స్థానికులు. దేవుని తోటలోని చిన్న శివాలయంలో శివరాత్రి రోజు పూజ లు, వెంకయ్య గల్లీ వద్ద శివరాత్రి జాగారం కోసం సినిమా ప్రదర్శన, ఆటపాటలు, నాటకాల ప్రదర్శన ప్రతి ఏటా తప్పనిసరిగా కనిపించే దృశ్యాలు. టీవీ వచ్చేంతవరకు హైదరాబాద్‌లోని బస్తీల్లో ఈ దృశ్యాలు సర్వసాధారణం. విశ్వభారతి యువజన సం ఘం, తొలి హైదరాబాద్ మున్సిపల్ స్థానిక కౌన్సిలర్ శంకర్‌రావు వంటివారు ప్రారంభంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట రమేష్ అనే వ్యక్తి నాటకంలో సీత వేషం వేస్తే అతన్ని ఇప్పటికీ సీత అనే పిలుస్తారు. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‌లో ఆ కాలం నాటక సమాజాలు బలంగా ఉన్నా ఎందుకో నాటక సమాజాల చరిత్రలో వీటికి పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇంట్లో వైకుంఠపాళి, అష్టా చెమ్మా ఆడేవారు కొందరు. చాలా ముందుగానే రోడ్డుమీద సినిమా సందర్శనకు స్థలం రిజర్వ్ చేసుకొనేవారు కొందరు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక స్లాబ్ విధానం అమలుచేయడం, అదే సమయంలో టీవీల ప్రవేశం మొదలుకావడంతో క్రమంగా టాకీస్‌లకు గడ్డుకాలం మొదలైంది. అప్పటివరకు ఉద యం ఆటలు తక్కువ రేటుతో పాత సినిమాలు ప్రదర్శించేవారు. మూడు షోలు కొత్త సినిమాలు ప్రదర్శించేవారు. శివరాత్రి రోజు జాగారం ఉండేవారి కోసం అర్ధరాత్రి 12.30కి ఒక షో, 3.30కి ప్రత్యేకంగా రెండు షోలు ప్రదర్శించేవారు. అంటే దాదాపు ఉద యం ఆరుగంటల వరకు సినిమా ప్రదర్శన ఉండేది. ఆ విధంగా సినిమా టాకీసులోనే వేలాదిమంది శివరాత్రి జాగారం పూర్తయ్యేది. 1976లో శివరాత్రి రోజున ఒకేరోజు అర్ధరాత్రి దాటాక 3.30కి దీపక్‌లో, సాగర్, శిష్‌మహల్ హైదరాబాద్‌లో, సికింద్రాబాద్‌లో ప్యారడైజ్‌లో ప్రత్యేకంగా పాండవ వనవాసం ప్రదర్శించారు. ఒక సినిమా విడుదలన పాతికేళ్ల తర్వాత ఒక నగరం లో నాలుగు టాకీసుల్లో ప్రదర్శించడం విశేషం. శివరాత్రి రోజున అర్ధరాత్రి ప్రత్యేకంగా ప్రదర్శించే సినిమాల్లో తప్పనిసరి గా నర్తనశాల, శ్రీ సీతారామ కళ్యాణం (సుదర్శన్ 35 ఎం. ఎం.), పాం డురంగ మహత్యం, దక్షయజ్ఞం (సుదర్శన్ 70 ఎం.ఎం.) మాయాబజార్, ఎన్టీఆర్ శివాజీ గణేశన్ నటించిన కర్ణ, శ్రీ కృష్ణవిజయం, లవకుశ, శ్రీకృష్ణ పాండవీయం, అక్కినే ని, యస్.వరలక్ష్మి నటించిన సతీసావిత్రి, అక్కినేని, జమున నటించిన శ్రీకృష్ణమాయ, చెంచు లక్ష్మీ, శ్రీ సత్యనారాయణ వ్రత మహత్యం వంటి సిని మాలు తప్పనిసరిగాఉండేవి. ఇప్పుడంటే వినాయక మంటపాల్లో కొన్ని ప్రాంతాల్లో రికార్డింగ్ డాన్సులు ప్రదర్శిస్తున్నారుకానీ ఆ రోజుల్లో శివరాత్రి అంటే టాకీసుల్లో ఎక్కువగా పౌరాణిక సినిమాలే ప్రదర్శించేవారు. కొన్ని టాకీసు ల్లో పౌరాణిక సినిమాలు దొరక్కపోతే సాంఘిక సినిమాలు ప్రదర్శించేవా రు . జమ్రుద్ వంటి టాకీసుల్లో శివరాత్రి రాత్రి 12:45 కు బ్రహ్మ విష్ణు మహేష్ వంటి హిందీ పౌరాణిక సినిమాలు ప్రదర్శించేవారు.
వైకుంఠపాళిలో పాము పెద్ద ప్రమాదం. దాన్ని తప్పించుకొం టూ వైకుంఠం వరకు వెళ్ళాలి. వైకుంఠపాళిలో పాము బారిన పడ్డట్టుగానే స్లాబ్ సిస్టం సినిమా హాళ్లను మింగేసింది. నాగరికత హైదరాబాద్ బస్తీల్లోని సామూహిక పండుగల సంస్కృతిని మిం గేసింది. ఇంట్లో అందరూ కలిసి పండుగ జరుపుకొంటే ఈ రోజు ల్లో అదే సామూహికంగా పండుగ జరుపుకోవడం.
బుద్దా మురళి (జ్ఞాపకాలు 11-1-2018)
టాకీస్ 8 


9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

మీ రోగమే మా భాగ్యం!

‘‘ఏరా..! అలా మెలికెలు తిరిగిపోతున్నావ్? ఏదో చెప్పాలనుకుంటున్నావ్?’’
‘‘ఆఫీసులో సుజాత అదోలా చూసింది..’’
‘‘చూడదా? కలిసి పనిచేస్తున్న వారికి ఆ మాత్రం అనిపించకుండా ఉంటుందా? కాటికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని ఎదురు చూస్తున్న వాడిలా కనిపిస్తున్నావ్.. నీకు అసలేమైంది?’’
‘‘వెటకారం చాలులే, నాకేమీ కాలేదు. నా కొత్త లుక్‌ను చూసి, జెలసీతో ఏదో మాట్లాడుతున్నావ్! హీరోలా ఉన్నాను నాకేంటి? ’’
‘‘నేనూ అదే అంటున్నాను. 45ఏళ్ల వయసు కూడా లేదు అప్పుడే తెలుగు సినిమా హీరోలా అరవై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నావు. బహుశా షుగర్ కావచ్చు.. టెస్ట్ చేయించుకున్నావా? ’’
‘‘షుగర్, బీపీ, థైరాయిడ్, న్యుమోనియా, ఓల్డ్ మోనియా అన్ని టెస్ట్‌లు చేయించుకున్నా.. నాకేమీ కాలేదు’’
‘‘పోనీ.. ఆ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉన్న యంత్రాలన్నీంటికీ పని కల్పిస్తూ అన్ని టెస్ట్‌లు చేయమనాల్సింది. ఏదో ఒక రోగం కచ్చితంగా బయటపడేది. ’’
‘‘రోజురోజుకూ నేను స్లిమ్‌గా తయారవుతున్నానని నీకు కుళ్లు..’’
‘‘ఏదో అంతుచిక్కని జబ్బుతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావ్ .. కొంపదీసి ..’’
‘‘్ఛ..్ఛ.. జీవితంలో సుఖమే లేదు ఇక సుఖరోగమా?’’
‘‘మరేంటిరా.. అలా అయిపోతున్నావ్... సడన్‌గా చూస్తే నేను కూడా నిన్ను అస్సలు గుర్తు పట్టలేదు. ’’
‘‘నువ్వేంటి.. వారం రోజుల పాటు పుట్టింటికి వెళ్లి వచ్చిన మా ఆవిడే చూడగానే నన్ను గుర్తు పట్టలేదు. ’’
‘‘నువ్వు ఏదో దాస్తున్నావు.. మహా నాయకులు, దేశాధినేతలు అనారోగ్యంతో ఉంటే వెంటనే ప్రకటించరు. రాజ్యం అల్లకల్లోలం అవుతుందని, పెద్ద పెద్ద కంపెనీల పాలకులూ అంతే. నువ్వో సాధారణ ఉద్యోగివి, వీలునామా రాసేంత ఆస్తి కూడా లేదు’’
‘‘అనారోగ్యం అని ఎందుకు అనుకుంటావ్? ఆరోగ్యం, కొత్త శక్తి వల్ల ఇలా అయ్యాననే ఆలోచన నీకు ఎందుకు రావడం లేదు’’
‘‘ఏదో దాస్తున్నావనేది మాత్రం నిజం’’
‘‘ టుమ్రీరావు ఆరోగ్య ఫార్ములాను అనుసరిస్తున్నా. దాని ఫలితమే ఇది. ’’
‘‘ఏంటో ఆ ఫార్ములా?’’
‘‘గురుముఖంగా నేర్చుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ట్రేడ్ సీక్రెట్ ఎవరికీ చెప్పవద్దన్నారు. ఐనా మిత్రుడివి కాబట్టి చెబుతున్నాను. నువ్వు ఉదయం ఏం చేస్తావ్?’’
‘‘ఏం చేస్తాం.. మా ఆవిడ లేస్తే టిఫిన్ చేస్తుంది.. నేనూ తింటాను. ముందు నేనే లేస్తే టిఫిన్ చేస్తాను.. ఇద్దరం తింటాం’’


‘‘మరదే.. అల్పమానవులు మీరంతా ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. రాత్రి నిద్ర పోతారు. కానీ మేమలా కాదు. టుమ్రీరావు ఫార్ములా దీనికి భిన్నమైంది. మేం ఉదయం భోజనం చేస్తాం. మధ్యాహ్నం టిఫిన్ చేస్తాం. పగలు పడుకుంటాం, రాత్రి మేల్కొంటాం. ఆఫీసు పని ఇంట్లో చేస్తాం. ఇంట్లో పని ఆఫీసులో చేస్తాం. భార్యను పలకరించం, పక్కింటావిడ చెప్పిన పని చేస్తాం . దీని వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో నూటపాతిక సంవత్సరాలు బతుకుతాం.. నూటపాతికకు ఐదో పదో ఎక్కువే తప్ప తగ్గే ప్రసక్తే లేదని టుమ్రీ రావు గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పాడు.’’
‘‘నిజమా?’’
‘‘ఇలాంటి అపనమ్మకులతో ఈ ఫార్ములా గురించి మాట్లాడవద్దని, విశ్వాసుల వద్దనే మాట్లాడాలని టుమ్రీరావు అందుకే చెప్పారు’’
‘‘సరే.. నూటపాతిక సంవత్సరాలు బతుకతావనే అనుకుందాం. అంత కాలం బతికి ఏం చేస్తావురా? ఒంటరిగా బోరుకొట్టి పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకుంటావు. దాని కన్నా సకాలంలో మరణం మంచిది కదా?’’
‘‘నా మనోభావాలను అవమానిస్తున్నావ్..’’


‘‘టుమ్రీరావు ఈ ఫార్ములా రహస్యం నీకు చెప్పి ఎంత తీసుకున్నాడు’’
‘‘ఏడాదికి ఇంత అని నూటపాతిక సంవత్సరాల మొత్తం నాలుగు ఇన్‌స్టాల్ మెంట్లలో తీసుకున్నాడు.’’
‘‘అంత గ్యారంటీ ఇచ్చినప్పుడు ఫీజేదో నీకు నూటపాతిక సంవత్సరాలు వచ్చిన తరువాత తీసుకుంటే బాగుండేది కదా?’’
‘‘్ఫర్ములాపై నాకు నమ్మకం లేకపోతే కదా?’’
‘‘దీనే్న మార్కెట్ మాయాజాలం అంటారురా అప్పిగా .. రాందేవ్ బాబా  పతంజలి బ్రాండ్ పుణ్యమాని ఆయుర్వేదానికి, ఆరోగ్య రహస్యాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. టుమ్రీరావు కన్నా ముందు ఇంకో రావు ఇలానే బాగుపడ్డాడు..ఆకులు అలములు తిని శాశ్వతంగా బతకొచ్చు అని పాపం బాగానే చెప్పారు . చెప్పడం వరకు పరవాలేదు ఆచరించాడు కూడా . ఆకులూ అలములు తిన్న అయన ఆరోగ్యం , అయన మాట విన్న వారి ఆరోగ్యం ప్రమాదం లో పడిపోయింది . వాళ్ళు వీళ్లూ చెబితే నమ్మలేదు కానీ చివరకు అయన పరిస్థితే ప్రమాదం లో పడ్డాక కనిపించకుండా పోయారు .   టుమ్రీరావుల ప్రకృతి ఆహారానికి మంచి
 మార్కెట్ ఏర్పడింది. మహా మహా కోల్గెట్ కంపెనీ వాడే పతంజలి దెబ్బకు వేదాంత కోల్గెట్ అంటూ పురాణాలను నమ్ముకున్నాడు. నీకో రహసహ్యం చెప్పనా? ఈ మార్కెట్ టెక్నిక్ మీ టుమ్రీ రావు కొత్తగా కనిపెట్టిందేమీ కాదు. కోల్గెట్ వంటి బహుళజాతి కంపెనీ పతంజలి కన్నా ముందే ఈ టెక్నిక్‌ను ఇండియాలో అమలు చేసింది. ఉదయం లేవగానే మనం టీ తాగుతాం కదా? దీనిపై నీ అభిప్రాయం?’’
‘‘ఎక్కువగా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.. టుమ్రీ రావులే కాదు నువ్వు ఏ డాక్టర్‌ను అడిగినా చెబుతారు.’’


‘‘నిజమే కదా? కానీ మొదట మన దేశంలో టీ అలవాటు చేసేందుకు ఏం చెప్పారో తెలుసా? దీర్ఘాయుష్షు కోసం టీ తాగమని ప్రకటనలు ఇచ్చారు. సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం ‘ఇండియా టీ వల్ల దీర్ఘాయుష్షు కలుగుతుంది’ అని 4.1.1937 నాటి గోల్కొండ పత్రికలో పూర్తి పేజీ ప్రకటన ఇచ్చారు. ఆయుష్షు పెరగడానికి టీ తాగమని ఆనాడే విస్తృత ప్రచారం చేశారు. కావాలంటే నెట్‌లో దొరుకుతుంది చూడు. ఏదో సమాచారం కోసం ఇంటర్నెట్‌లో అనే్వషిస్తుంటే ఆ ప్రకటన కనిపించింది. టీ ఎలా తయారుచేయాలో కూడా ఆ ప్రకటనలో నేర్పించారు. ఒకసారి మనకు అలావాటు అయ్యాక టీ లేనిదే బతక లేని స్థితికి చేరుకున్నాం. బ్రిటీష్ వాడు దేశం వదిలి వెళ్లినా ఆ కాలంలో వాడు అలవాటు చేసిన టీ మనల్ని ఇంకా వదలలేదు.’’
‘‘అంటే.. నిజం కాదా? ’’
‘‘అదేదో కంపెనీ అండర్‌వేర్ ధరిస్తే అందమైన అమ్మాయిలు మన వెంట పడతారనే ప్రకటనలు నమ్మడం లేదా? అలానే దీర్ఘాయుష్షు కోసం ఫలానా హోటల్‌లో తినండి, ఫలానా హీరో సినిమాలే చూడండి అని చెప్పినా మనం నమ్మేస్తాం. మన నమ్మకమే వారి వ్యాపారం. ఆరోగ్యం పేరుతో మనకు ఏదైనా అమ్మవచ్చునని 80 ఏళ్ల క్రితమే బ్రిటీష్ కంపెనీలు కనిపెట్టాయి.’’

బుద్దా మురళి (జనాంతికం 9-2-2018)

5, ఫిబ్రవరి 2018, సోమవారం

లవకుశులు తప్ప ఏదీ లేదు .. నటరాజ్‌లో లవకుశ




తెలుగు సినిమాల్లో అజరామరంగా నిలిచిపోయే సినిమాల పేర్లు కొన్ని చెప్పమంటే అందులో లవకుశ ఉండితీరుతుంది . 1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఆ కాలంలో ఒక సంచలనం. చుట్టుపక్కల గ్రామాల నుం చి ఎడ్లబండ్లను కట్టుకొని ఈ సినిమాను చూసేందుకు వచ్చేవారు.సికింద్రాబాద్‌లోని నటరాజ్‌లో ఈ సిని మా విడుదలైంది. నటరాజ్‌కు దగ్గరలో ఉన్న క్లాక్‌టవర్ పార్క్ వద్ద ఆ రోజుల్లో జాతరలా ఉండేది. టికెట్ దొరక్కపోతే అక్కడే వండుకొని తిని తర్వాత షో చూసి వెళ్లేవారు. ఆ టాకీసు చరిత్రలోనే ఇదో సంచలనం. సికింద్రాబాద్‌లోని వీధులన్నీ ఇరుకిరుకుగా ఉంటాయి. నిజాంకాలంలో సికింద్రాబాద్ ప్రాంతం బ్రిటిష్ వారి పాలనలో ఉండేది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వేరుగా ఉండేది. ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర చరిత్రలో సికింద్రాబాద్‌ను పెద్ద బస్తీ అని పేర్కొన్నారు.

నాటి బ్రిటిష్ పాలకులు 1930 ప్రాంతంలో రోడ్ వెడల్పు చేద్దామని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం నుంచి పుట్టిందే విశాలమైన కింగ్స్ వే.. దీనికి కూడా అనేక మలుపులున్నాయి. ఆ కాలంలోనే కొందరు బ్రిటిష్ అధికారులకు 15 వేల లంచం ఇచ్చి తమ దుకాణాలుపోకుండా ప్రయత్నించారు. 1930 ప్రాం తం నాటి ఈ వ్యవహారాన్ని ఆ కాలం వాళ్లు చెబుతుంటారు.

కింగ్స్ వే నుంచి నేరుగా వెళ్తే.. వందేండ్ల కిందట స్వామి వివేకానందుడు ప్రసంగించిన మహబూబ్ కాలేజీ హైస్కూల్ కనిపిస్తుంది. విశాలమైన ఆ స్కూల్ ఆవరణలో ఒకవైపు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ.. ఆ కాలేజీ ఎదురుగానే నటరాజ్ టాకీస్. ఆ కాలేజీ విద్యార్థిగా రోజూ నటరాజ్‌ను దర్శనం చేసుకున్న జ్ఞాపకాలు. నటరాజ్ టాకీస్‌కు బయటినుంచి దారి ఉండేవిధంగా ఇరానీ హోటల్. జేబులో డబ్బులుంటే అక్కడ టీ తాగుతూ సిని మా పోస్టర్ చూస్తూ చర్చలు. ఆమ్మో మీరు టీ తాగేందుకు హోటల్‌కు వెళ్తారా? మా ఇంట్లో వాళ్లు చూస్తే ఇంకేమన్నా ఉందా? అని ఆశ్చర్యపోయిన మిత్రుడు చదువు ముగిశాక సకల కళా వల్లభుడు అయ్యాడని తెలిసి ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అని పాడుకోవడం తప్ప ఏం చేయగలం. మహబూ బ్ కాలేజీ అంత కాకపోయినా విశాలంగా ఉండే ఆ జూనియర్ కాలేజీ ఇప్పుడు బక్కచిక్కిపోయి ఓ మూలకు పరిమితమైంది. చైతన్య నారాయణల వ్యాధిన పడి అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల వలె సికింద్రాబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కూడా చిక్కి శల్యమైంది. అప్పటి కాలేజీలో ఇప్పుడు ఇంజినీరిం గ్ కాలేజీ పుట్టింది. సికింద్రాబాద్ పోస్టాఫీస్‌కు దగ్గరలో ఉం టుంది నటరాజ్ టాకీస్.

ఔను ఇప్పుడు అక్కడ టాకీస్ మాత్రమే ఉంటుంది. సినిమా ల ప్రదర్శన మాత్రం జరుగదు. ఇప్పుడు అక్కడో ఫర్నీచర్ షాప్. సినిమా టాకీస్‌ను యథాతధంగా అలానే ఉంచారు. నటరాజ్ అనే టాకీస్ పేరు కూడా అలానే ఉంది. టాకీస్ లోపల ఉన్న ఫర్నీచర్, కుర్చీలో అన్నీ తొలిగించి నటరాజ్‌లో ఫర్నీచర్ షాప్ ఏర్పాటుచేశారు.

80 ప్రాంతం నుంచి నటరాజ్‌లో అన్నీ హిందీ సినిమాలే ప్రదర్శించేవారు. కానీ అంతకుముందు అద్భుతమైన తెలుగు సినిమాలెన్నో ఇందులో విడుదలయ్యాయి. దాదాపు ఐదేండ్ల కిం దట నటరాజ్ సినిమా హాల్‌గా మూతపడి ఫర్నీచర్ షాప్‌గా కొత్తరూపు సంతరించుకున్నది. తెలంగాణ, ఆంధ్ర, పట్టణాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ అనే తేడా లేకుండా లవకుశ సినిమా విడుదలైన ప్రతిచోట సంచలనమే.

సికింద్రాబాద్ నాలా బజార్ గవర్నమెంట్ స్కూల్‌లో ఏడవ తరగతి చదివేరోజుల్లో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలగిరికి వెళ్ళాలంటే రెండు బస్సులు మారాలి. అలా తిరుమలగి రి వెళ్లి ఇంతదూరం నుంచి సికింద్రాబాద్‌కు రోజూ ఎలా వస్తాడో అని మిత్రుడిపై బోలెడు జాలిచూపాను. ఇప్పుడు తిరుమలగిరి దాటి 4 కిలోమీటర్లు వెళ్తే మా ఇల్లు. తిరుమలగిరి, అల్వాల్, సైనిక్‌పురి, మల్కాజ్‌గిరి, కాప్రా, నెరేడ్‌మెట్ ప్రాంతాలన్నీ ఆ రోజుల్లో గ్రామాలే, అమీర్‌పేట కూడా ఆ రోజుల్లో ఓ పల్లె, ఇటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆ రోజుల్లో గ్రామాలే. కొన్ని ప్రాంతాలు తొలుత గ్రామ పంచాయితీలు, తర్వాత మున్సిపాలిటీలు. 11 శివారు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేశారు. అంతకుముందు అవన్నీ గ్రామాలు. 

ఇలాంటి గ్రామాలనుంచి ఎడ్లబండ్లపై లవకుశ సినిమా చూసేందుకు నటరాజ్‌కు వచ్చేవారు. ఈ రోజుల్లో మాదిరిగా అప్పుడు ఒకే సినిమాను వందల టాకీసుల్లో విడుదల చేసేవారు కాదు. ఇంత పెద్ద మహానగరంలో లవకుశ విడుదలైంది నటరా జ్, బసంత్ రెండు టాకీసుల్లో మాత్రమే. కొన్నిరోజుల తర్వాత సినిమా మరో టాకీస్‌లోకి మారేది. లవకుశ మాత్రం ఎన్నిరోజు లు అయినా నటరాజ్ దాటకపోవడంతో ఇతర ప్రాంతాలవారు బండ్లు కట్టుకొని నటరాజ్‌కు వచ్చేవారు. ఇప్పటి క్లాక్‌టవర్ పార్క్ లో ఎడ్లబండ్లను నిలిపి అక్కడే వంటలు వండుకొని సినిమా చూసి వెళ్లారని ఆ కాలంవారు చెబుతుంటా రు. ప్రధానమైన టాకీసుల్లో సినిమా ఓ వారం నడిచాక ఖైరతాబాద్‌లోని రీగల్ టాకీస్, అమీర్‌పేటలోని విజయలక్ష్మి టాకీస్‌కు ఆ సినిమాలు వచ్చేవి. ఆ రోజు ల్లో బేగంపేట రైల్వే స్టేషన్ ప్రశాంతంగా, ఎంత అందంగా ఉందో ముని ఆశ్రమంలా ఎంత ప్రశాంతంగా ఉందో చూడాలంటే పూల రంగడు సినిమా చూడొచ్చు. అందులో జమున కూరగాయలు అమ్ముకొంటున్నట్టు చిత్రీకరించింది అక్కడే. నాగేశ్వర్‌రావు గుర్రపు బండితో నిలుచునేది అక్కడే.

లవకుశ సినిమా విడుదలైన అన్ని టాకీసుల్లోనూ సంచలన మే. బసంత్, నటరాజ్, ఖమ్మంలో సుందర్, వరంగల్‌లో రాజేశ్వర్, నిజామాబాద్‌లో మోహన్ టాకీస్‌లలో ఈ సినిమా విడుదలైంది. లవకుశలో ప్రధాన పాత్రల్లో ఎన్టీఆర్, అం జలి, నాగ య్య, కాంతారావు, శోభన్‌బాబు, రేలంగి, రమణారెడ్డి, కన్నాం బ, గిరిజ, సూర్యకాంతం, యస్.వరలక్ష్మి ఇప్పుడు వీళ్ళెవరూ లేరు. దర్శకులు సి.పుల్లయ్య, సి.యస్.రావు, నిర్మాత శంకర్‌రెడ్డి, సంగీతం అందించిన ఘంటసాల వీరెవరూ ఇప్పుడు లేరు. ఆ సినిమా ప్రదర్శించిన టాకీసులు లేవు. లవకుశ సినిమా ప్రకటన నాటి ప్రముఖ పత్రికలు గోల్కొండ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జనతాలో ప్రధానంగా ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు ఆ పత్రికలూ లేవు. లవకుశులుగా నటించిన మాస్టర్ సుబ్రహ్మణ్యం, నాగరాజులు అప్పుడప్పుడు టీవీ ఇంటర్వ్యూల్లో కనిపించేవారు.

భారత చలనచిత్ర చరిత్రలో సంచలనం సృష్టించిన ఎన్నో సినిమాలను నటరాజ్‌లో ప్రదర్శించారు. షోలే సినిమా చాలారోజులు నడిచింది. అమర్ అక్బర్ అంథోని, ఖూన్ పసీనా, కభీ కభీ, మిస్టర్ నట్వర్ లాల్ సినిమాలు ప్రదర్శించారు. నిన్నేపెళ్లాడతా నటరాజ్‌లో చెప్పుకోదగిన చివరి సినిమా వందరోజుల ప్రదర్శన. ఫిరోజ్‌ఖాన్ నటించిన చార్ ధర్ వేశ్, దేవానంద్, మధుబాల నటించిన షరాబీ, అశోక్ కుమార్ నటించిన విక్టోరియా నెంబర్ 203, దాదిమా, యా దొంకి బారా త్ వంటి సూపర్‌హిట్ సినిమాలు ప్రదర్శించారు.

అక్కడివారిని పలుకరిస్తే ఇక్కడ టాకీసు ఉండగా మేం చూడలేదన్నారు. ఇప్పుడు అక్కడ పేరు నటరాజ్ అని ఉంది. కానీ అక్కడ సినిమా జ్ఞాపకాలేమి లేవు. పలుకరిస్తే నటరాజ్‌లో అమ్ముతున్న ఫర్నీచర్ గురించి చెప్పేవారే కానీ, నటరాజ్ లో ప్రదర్శించిన సినిమాలు, టాకీసు జ్ఞాపకాలను చెప్పేవారు అక్కడ కనిపించలేదు

బుద్ధా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 4. 2. 2018) 
టాకీస్ 7 

2, ఫిబ్రవరి 2018, శుక్రవారం

సూర్యుడి కిడ్నాప్!

‘‘శేఖర్.. అర్జంట్‌గా నువ్వు మా ఇంటికి రావాలి. ఆయన మాట అదోలా ఉంది. మీ ఇద్దరూ కూర్చున్నప్పుడు, కవితా పఠనంలో ఇలాంటి మాటలు చాలా సార్లు విన్నాను, కానీ పట్టించుకోలేదు.. నాతో కూడా అలానే ఏవేవో మాట్లాడుతున్నారు. ’’
‘‘ఏరా! నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను. నువ్వే ఉల్కలా ఊడిపడ్డావ్.. మా ఆవిడ కంగారుపడి కాల్ చేసింది కదూ! నా మదిలో ఓ అద్భుతమైన ప్లాన్ మెదిలింది. సక్సెస్ అయితే ప్రపంచం మనకు దాసోహం అంటుంది.’’
‘‘అంత గొప్ప ప్లాన్ ఏంటో చెప్పు’’
‘‘మనం భూకంపం సృష్టించబోతున్నాం. ప్రపంచ దేశాలను మన మార్గం పట్టించబోతున్నాం.’’
‘‘దావోస్‌ను మా ఊరికి  లాక్కోస్తానంటూ ఆయనెవరో గత రెండేళ్ల నుంచి చెబుతున్నట్టు నువ్వు ప్రపంచ దేశాలను మీ అపార్ట్ మెంట్ కు లాక్కురావాలనుకుంటున్నావా?’’
‘భూకంపం సృష్టిస్తా .. భూ మార్గం పట్టిస్తా- అని మహాకవి శ్రీశ్రీ అప్పట్లో అంటే అంతా ‘ఆహా.. ఓహో..’ అన్నారు. నేను నిజంగానే భూ కంపం సృష్టించే ఐడియా చెబుతానంటే ‘హీ..హీ’ అని నవ్వుతున్నావా? ’’
‘‘కవిత్వంతో ఆలోచనల భూకంపం వేరు, నువ్వు చెబుతున్న భూకంపం వేరు. ’’
‘‘తాన్‌సేన్ రాగాలతో వర్షాన్ని కురిపించినప్పుడు, మంటలు సృష్టించినపుడు నిజమని నమ్మినప్పుడు నా మాటలెందుకు నమ్మవు.’’
‘‘ఇంతకూ ప్రపంచాన్ని కుదిపేసే ఆ విషయం ఏంటో చెప్పు ’’
‘‘సూర్యుడ్ని కిడ్నాప్ చేద్దాం..’’
‘‘వాడెవడు? మీ ఆఫీసులో క్లర్కా? నగరమనంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆఫీసులో ఏవైనా గొడవలు ఉంటే, మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఇలా కిడ్నాప్ చేస్తామనడం మంచిది కాదు’’
‘‘ నేను సూర్యుడి కిడ్నాప్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆఫీసులో బోడి సూర్యారావు గురించి చెబుతున్నావ్..’’
‘‘సూర్యుడేమన్నా మనిషా గొంగడి కప్పి కారులో కిడ్నాప్ చేసేందుకు.?. ’’
‘‘ఆయనెవరో రుషికి కోపం వచ్చి సముద్రాన్ని కమండలంలో బంధించ లేదా? మూడు లోకాలపై మూడు కాళ్లు పెట్టిన దేవుడి అవతారం గురించి తెలియదా? వీరహనుమాన్ బాల్యంలోనే సూర్యుడిని మింగేందుకు వెళితేనే కదా మూతి ఎర్రగా కాలింది.వాళ్లకు సాధ్యం అయింది మనకు కదా మనిషిని తక్కువగా అంచనా వేయు కు మానవుడే మహనీయుడు అని ఘంటసాల ఎప్పుడో అన్నారు ’’
‘‘అవన్నీ పురాణాలు ’’
‘‘ఒక నాటి చరిత్రే తరువాత  పురాణాలు. చంద్రగ్రహం, సూర్యగ్రహం వంటివి నమ్ముతావు కదా? రాహుకేతువులు తెలుసు కదా? రాహుకేతువులు సూర్యచంద్రులను మింగడం సాధ్యం అయినప్పుడు కిడ్నాప్ చే యడం ఎందుకు సాధ్యం కాదు?’’
‘‘సరే.. నిజమే అనుకుందాం కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెడతావు? మీ డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో దాచిపెడతావా? ’’
‘‘ఎక్కడ దాచిపెడదామనేది తరువాత. ఈ కిడ్నాప్‌లో నువ్వు నాకు సహకరించాలి’’
‘‘అన్నప్రాసన నాడే ఆవకాయ అన్నట్టు మొదటి కిడ్నాప్ సూర్యుడితోనే ఎందుకు? పోనీ చంద్రుడ్ని కిడ్నాప్ చేస్తే కొంచెం సేఫ్ కదా!’’
‘‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే  కొట్టాలి. కిడ్నాప్ చేస్తే సూర్యుడ్నే చేయాలి, బ్రాండ్ అంబాసిడర్ హక్కులుమనమే  సాధించాలి. ’’
‘‘కిడ్నాప్ చేసి ఏం చేద్దామని నీ ఆలోచన?’’
‘‘చార్మినార్ వద్ద మదీనా హోటల్ గురించి తెలుసా? ’’
‘‘మదీనా లో సూర్యుడ్ని దాచి పెడతావా? అందులో టీ చాలా బాగుంటుంది. సూర్యుడ్ని అందులో దాచడం సాధ్యం కాదు. ’’
‘‘పూర్తిగా విను.. ఇప్పుడు పెట్రోల్ డబ్బులతో సంపన్న దేశాలుగా వెలిగిపోతున్న ఎన్నో గల్ఫ్ దేశాల కన్నా మన దేశం సంపన్నంగా ఉండేది. మక్కా యాత్రీకులకు సహాయం చేసేందుకు ఆ కాలంలో మదీనా హోటల్ కట్టారు. పెట్రోల్ వల్ల గల్ఫ్ దేశాలు, సాంకేతిక విప్లవం వల్ల యూరప్ దేశాలు, సహజ వనరులతో మరెన్నో దేశాలు సంపన్న దేశాలుగా మారాయి. సూర్యుడ్ని కి డ్నాప్ చేస్తే అమెరికా, దావోస్, గల్ఫ్.. వాళ్ల అబ్బలాంటి దేశాలు కూడా జీ హుజూర్ అంటూ మనలను వేడుకోవలసిందే. వాళ్లు పెట్రోల్ అమ్ముకొని బలిసినట్టు, మనం సూర్యుడి వేడిని అమ్ముకుని సంపన్నుల మవుదాం. ’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘సూర్యుడు లేకపోతే జీవరాశి బతుకుతుందా? ’’
‘‘ఒక్క క్షణం కూడా బతకలేదు. చెట్టు, చేమ, పుట్ట, సమస్త జీవకోటి సూర్యుడి వల్లనే బతుకుతుంది. సూర్యుడు లేకపోతే ప్రాణకోటి లేదు, ప్రకృతి లేదు. ’’
‘‘కదా..! అందుకే అలాంటి సూర్యుడినే కిడ్నాప్ చేసేద్దాం. గల్ఫ్ దేశాలు ప్రపంచానికి గ్యాలన్లలా పెట్రోల్ అమ్మి బతికినట్టు, మనకు డబ్బులు చెల్లించిన వారికే సూర్యుడి వేడి అందేట్టు చేద్దాం.’’
‘‘ఈ పనేదో అర్జంట్‌గా చేసేయాలి. ఆలస్యం అయితే సూర్యుడే ఉండడు. సూర్యుడు వృద్ధుడవుతున్నాడని ఓ వెబ్‌సైట్‌లో బ్రేకింగ్ న్యూస్ చూశాను. పది మిలియన్ సంవత్సరాలకు సూర్యుడు వృద్ధుడై అంతరించి పోతాడట! ఇప్పటికే రెండు మిలియన్ సంవత్సరాల కాలం గడిచిపోయిందట.. వెబ్‌సైట్ తమ్ముడు సూర్యుడితో మాట్లాడివచ్చినట్టుగా చక్కని వార్త ప్రసారం చేశాడు.’’
‘‘ప్లాన్ మొత్తం రెడీ అయింది ’’
‘‘ఓ నేత సూర్యుడు మా బ్రాండ్ అంబాసిడర్, సూర్యుడు మొదట ఉదయించేది మా ఊరిలోనే అని చెప్పారు కదా? సూర్యుడ్ని నువ్వెట్లా సొంతం చేసుకోగలుగుతావ్? ’’
‘‘ చెప్పాడు కానీ సూర్యుడి పై అయన ఇంకా కాఫీ రైట్ హక్కులు సాధించలేదు . ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంటూ విస్తృత ప్రచారం ప్రారంభించక ముందే సూర్యుడిని కిడ్నాప్ చేసేస్తాం.. ఎవరికీ తెలియని రహస్యం చెబుతున్నాను- సూర్యుడు మొట్టమొదట ఉదయించేది గోల్కొండ చౌరస్తా నుంచి ముందుకు వెళితే వచ్చే గాంధీనగర్ రెండవ వీధి బంగ్లాపైన . మొన్న పార్టీ ఆలస్యం కావడంతో రాత్రంతా ఆక్కడే ఉండిపోవలసి వచ్చింది. తెల్లారి లేచాక సూర్యుడు మొదట అక్కడే ఉదయించడం కళ్లారా చూసాను.  అది మా ఫ్రెండ్ ఇళ్ళే . రాత్రికి అక్కడ మాటు వేసి సూర్యోదయం కాగానే కిడ్నాప్ చేద్దాం. సూర్యుడ్ని కిడ్నాప్ చేశాక కాపీరైట్ హక్కులన్నీ మనకే ఉంటాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు వాడుకున్నా కప్పం కట్టాల్సిందే’’
‘‘సూర్యుడి కిడ్నాప్ ఆపరేషన్ అమలుకు మెరికల్లాంటి వారు కావాలి. సూర్యుడిని కిడ్నాప్ చేసేందుకు నాతో కలిసి రావాలి  అని జాతి జనులకు పిలుపు ఇస్తున్నాను  ’’
***
‘‘అమ్మాయ్.. మీ ఆయనకు ముందు మజ్జిగ ఇవ్వు. టీవీలో ‘సూర్యుడు మావాడే’ అంటూ సాగుతున్న ఉపన్యాసాలను అదే పనిగా విని, నిద్రపోయి లేచాడు. ఆ ప్రభావం ఇంకా ఉండడంతో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవి మామూలు కలవరింతలే.. కంగారు పడాల్సిన అవసరం లేదు. సాధ్యం అయినంత వరకు టివిలో ఉపన్యాసాలు , వార్తలను సీరియస్ గా తీసుకోకుండా చూడండి  ’’
*
-బుద్దా మురళి (జనాంతికం 2-2-2018)

29, జనవరి 2018, సోమవారం

బసంత్‌లో రాజకీయ చిత్రాలు




తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగించేందుకు బసంత్ టాకీస్‌లోనే పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నో సెంటిమెంట్ సినిమాలు తెరపై ప్రదర్శించిన చోటే సజీవ సెంటిమెంట్ సినిమా ప్రదర్శించారు. ఎన్టీఆర్‌ను దించే ఎపిసోడ్‌లో వైస్రాయ్ హోటల్‌కు లభించినంత గుర్తింపు కీలక పరిణామాలకు వేదికైనా ఇతర ప్రాంతాలకు లభించలేదు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగిస్తూ ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ బసంత్ టాకీస్‌లో జరిగిన సమావేశంలోనే తీర్మానం ప్రవేశపెట్టారు. 

మానవ సంబంధాలు, కుటుంబసభ్యుల మధ్య అనురాగా లు, రాగద్వేషాలు, వెన్నుపో ట్లు, అధికారం, డబ్బు కోసం అయినవారిపై నే కుట్రలు.. కష్టాలు, కన్నీళ్ల సెంటిమెంట్లు ఇవన్నీ సినిమాలో చూస్తూ.. అది తెర అని, మనం చూసేది సినిమా అని తెలిసినా.. ఆ నాటకీయతలో లీనమై ప్రేక్షకులుగా మనం కూడా భావోద్వేగాలకు గురవుతుంటాం. సినిమాలు ప్రదర్శించే టాకీసులో అలాంటి అరుదైన దృశ్యాలు కళ్ళముందు నిజంగానే జరుగుతుంటే.. ప్రేక్షకులుగా సినిమా చూసి న కుర్చీలోనే నిజమైన ఆ సంఘటనలు చూసే అరుదైన అవకాశం కాచిగూడలోని బసంత్ టాకీస్‌లో లభించింది.

కాచిగూడ మెయిన్‌రోడ్‌కు సంబంధం లేకుండా గల్లీలో ఉండే ఈ టాకీసు అప్పట్లో ఇళ్ల మధ్య ఉండేది. ఇప్పుడు ఏకంగా అపార్ట్‌మెంట్‌గా మారిపోయింది. మూగ మనసులు, జీవనతరంగా లు, జీవనజ్యోతి, బలిపీఠం, ఆలుమగలు వంటి సెంటిమెంట్ కథాబలం ఉన్న సినిమాలు ప్రదర్శించిన బసంత్‌లో అంతకన్నా బలమైన సెంటిమెంట్ దృశ్యాలు చోటుచేసుకున్నాయి.
ఆ దుష్టున్ని బంధించండి అని జానపద సినిమాల్లో వృద్ధరా జు ఆదేశించగానే సైనికులు ఆ రాజునే బంధిస్తారు. తన వెనుక జరిగిన కుట్రలను ఆ రాజు అప్పటివరకు గుర్తించడు. గుర్తించినా ఏమీ చేయలేని దశలో గుర్తిస్తాడు. సైన్యాధ్యక్షుని కుట్రలను ఛేదిం చి తల్లిదండ్రులను విడిపించిన యువరాజుల కథలు.జానపద సినిమాల్లో సైన్యాధ్యక్షుల కుట్రలను ఛేదించిన యువరాజుల సినిమాలను మార్నింగ్ షోలుగా, విలన్లను మట్టికురిపించిన హీరోల సినిమాలు రెగ్యులర్ షోలుగా ఎన్నో ప్రదర్శించిన ఈ టాకీసులో అలాంటి సంఘటనలు నిజంగానే జరుగడం విశేషం.

బసంత్ టాకీస్ ఇక నడిచే అవకాశం లేదని గ్రహించాక తెర ను శాశ్వతంగా దించేసి ఫంక్షన్‌హాలుగా మార్చారు. అంతకన్నా లాభసాటి ఆలోచన రాగానే దానిని అపార్ట్‌మెంట్‌గా మార్చారు. బసంత్ టాకీస్ అపార్ట్‌మెంట్‌గా అవతారమెత్తక ముందు కీలకమైన రాజకీయ పరిణామాలు అక్కడ చోటుచేసుకున్నాయి. ఎన్టీ రామారావును అధికారం నుంచి దించేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సంఘటన అనగానే అందరికీ వైస్రాయ్ హోటల్ గుర్తుకు వస్తుంది. అంతకన్నా కీలక పరిణామం బసంత్ టాకీస్‌లో చోటుచేసుకున్నది.ఒక కుమారుడు తన తండ్రిని ఒక పదవి నుంచి తొలిగించి బోరున ఏడ్చింది ఇక్కడే. ఒక అల్లుడు మామ పదవిని కైవసం చేసుకొని బావమరిదిని ఓదార్చింది ఇక్కడే.

తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగించేందుకు బసంత్ టాకీస్‌లోనే పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నో సెంటిమెంట్ సినిమాలు తెరపై ప్రదర్శించిన చోటే సజీవ సెంటిమెంట్ సినిమా ప్రదర్శించారు. ఎన్టీఆర్‌ను దించే ఎపిసోడ్‌లో వైస్రాయ్ హోటల్‌కు లభించినంత గుర్తింపు కీలక పరిణామాలకు వేదికైనా ఇతర ప్రాంతాలకు లభించలేదు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగిస్తూ ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ బసంత్ టాకీస్‌లో జరిగిన సమావేశంలోనే తీర్మానం ప్రవేశపెట్టారు. అక్కడివరకు ఉత్సాహంగా వచ్చిన హరికృష్ణ తన తండ్రిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలిగిస్తూ తీర్మానం చదివి దుఃఖం ఆపుకోలేకపోయారు. సినిమాలు ప్రదర్శించే వేదికపైనే ఏడ్చేశారు. సినీ ప్రేక్షకులు సీట్లపైన మీడియా, పార్టీ నాయకులు ఇప్పుడు ఏమవుతుంది? హరికృష్ణ దుఃఖం వ ల్ల ఎన్టీఆర్‌ను దించేయాలనే నిర్ణయం మార్చుకుంటారా? ఏం చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా చంద్రబాబు హరికృష్ణ భుజంపై చేయివేసి అనునయించారు. బాబు సకాలంలో స్పందించి హరికృష్ణ కన్నీటిని నిలిపివేయించారు. ఆ తర్వాత అశోక గజపతిరాజు, ఇతర నాయకులు అనునయించారు. తం డ్రిని కుమారుడు గద్దెదించినట్టు చరిత్ర పుస్తకాల్లో, సినిమాల్లో కనిపించే దృశ్యం బసంత్‌లో కనిపించింది.

తక్కువ బడ్జెట్‌తో అద్భుత కథాబలంతో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తూర్పుపడమర, నీడ వంటి సినిమాలు బసంత్‌లో విజయవంతంగా ప్రదర్శించారు.ఇక్కడి నుంచే దాసరి నారాయణరావు రాజకీయ పార్టీ ఏర్పాటుచేయాలనీ ప్రయత్నించారు. అది విడుదలకు నోచుకోని సినిమాగానే మిగిలిపోయింది. చిరంజీవి కన్నా ఓ దశాబ్దకాలం ముందే దాసరి రాజకీయపార్టీ ఏర్పాటుకోసం ప్రయత్నించారు. బసంత్ టాకీస్‌లో దాసరి అభిమాన సంఘాల రాష్ట్ర సమావేశం జరిగింది. అందరి అభిప్రాయాలూ తీసుకొని అక్కడే దాసరి పార్టీ ప్రకటిస్తారని తొలుత సమాచారం ఇచ్చారు. అభిమానులు పార్టీ పెట్టాల్సిందేనని సూచించారు. మాజీ ఎమ్మె ల్యే గోనె ప్రకాశరావు అప్పటికప్పుడు ఏ సామాజికవర్గం ఓట్లు ఎక్కడ ఎన్ని ఉన్నాయి. దాసరి పార్టీ పెడితే ఎన్ని సీట్లు వస్తాయో ఆ టాకీసులోనే మీడియాకు లెక్కలు చెప్పారు. దాసరి అభిమానులకు నివేదిక ఇచ్చారు. పార్టీ ఏర్పాటు చేయలేదు. కానీ అక్కడ మాత్రం ఉత్సాహపూరిత వాతావరణం కనిపించింది. పురజనుల కోరికపై దాసరి పార్టీ ఏర్పాటును కొద్దిరోజులు వాయి దా వేస్తున్నారని దాసరి తరపున గోనె మీడియాకు లీకేజీ ఇచ్చా రు. కానీ మీడియా మాత్రం దాసరి పార్టీ విడుదల కావడం లేద ని రాశాయి. దాసరి రాజకీయ సినిమా విడుదల కాకుండానే దాసరి జీవితం ముగిసింది. బసంత్ టాకీస్ కనుమరుగైంది. అప్పుడప్పుడు హిందీ సినిమాలు ప్రదర్శించినా బసంత్‌లో ఎక్కువగా తెలుగు సినిమాలు ప్రదర్శించేవారు.
 
సినిమా టాకీస్‌లో జనం అంతంత మాత్రమే కాగా సైకిల్‌స్టాండ్‌లో సైకిళ్ల సంఖ్య ఇంకా తక్కువగా ఉండేది. టాకీసుకు పక్కనే వెదురుబొంగులు అమ్మేవారు, అనధికారికంగా సైకిల్‌స్టాండ్ నిర్వహించేవారు. టాకీసులోని సైకిల్ స్టాండ్‌కన్నా తక్కువధర, టికెట్ దొరక్కపోతే రిటన్ తీసుకువెళ్ళవచ్చుననే సౌకర్యం కల్పించడంతో ఎక్కువమంది అనధికార స్టాండ్‌లోనే సైకిల్ పార్క్ చేసేవారు. ఇప్పుడంటే ఓ కుటుంబం సినిమాకు వెళ్లాలంటే ఓ వెయ్యి రూపాయలు కావాలి. ఆ రోజుల్లో ఓ ఐదు రూపాయలుంటే చాలు సైకిల్ స్టాండ్, ఇంటర్‌వెల్ ఖర్చుతో సహా. శోభన్‌బాబుకు సోగ్గాడు అనేది మరో పేరుగా మారిపోయిం ది. ఆ సినిమా విడుదల సందర్భంగా శోభన్‌బాబు తన సన్నిహితులతో ఈ సినిమా తర్వాత ఈ సినిమా పేరే తనపేరుగా మారిపోతుందని చెప్పారట. దానికి తగ్గట్టుగానే శోభన్‌బాబును అప్పటి నుంచి సోగ్గాడు శోభన్‌బాబు అని పిలిచారు. సోగ్గాడు సినిమా బసంత్‌లో 1975లో 110 రోజులు ఆడింది.శోభన్‌బాబు విజయవంతమైన ఎన్నో సినిమాలు ఇందులో ప్రదర్శించారు. ఇద్దరు అమ్మాయిలు, కన్నవారి కలలు, చక్రవా కం, రాధాకృష్ణ, దీపారాధన, ప్రతీకారం వంటి సినిమాలు బసంత్‌లో విజయవంతంగా ప్రదర్శించారు.

బసంత్ టాకీస్ కు భారీ కటౌట్ లు ఏర్పాటు చేసే వారు . వై యం సీఏ నుంచి కాచిగూడ కు వెళ్లే వారికి ఆ కటౌట్ లు కనువిందు చేసేవి . ఆ ప్రాంతం లో కన్నడ వారు ఎక్కువగా ఉండడం తో అప్పుడప్పుడు ఉదయం పూట కన్నడ సినిమా ప్రదర్శించే వారు .  లవకుశ ,బసంత్ లో ఏడాది పాటు నడిచింది . దేవుడు చేసిన మనుషులు కూడా ఏడాది ప్రదర్శించారు . 
సినిమా చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనూ బసంత్‌కు స్థానం ఉంది. ఎన్నో విజయవంతమైన సినిమాలు ప్రదర్శించిన బసంత్ మారిన పరిస్థితులను తట్టుకోలేక మూతపడి, బసంత్ అపార్ట్‌మెంట్‌గా కొత్తరూపు సంతరించుకున్నది.
-బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 29-1-2018)

26, జనవరి 2018, శుక్రవారం

ఏం కోరుకుంటే అదే...



‘‘నా పూర్తి పేరు చెబితే మీరు షాక్ అవుతారు? తాటికొండ పాపారావు నా పూర్తి పేరు’’
‘‘తాటికొండ పాపారావు అని తెలుగు టీచర్ అటెండెన్స్ పిలిస్తే, ఎస్ సార్ అంటూ కర్ణ కఠోరంగా నువ్వు బదులివ్వడం ఇప్పటికీ చెవుల్లో గింగురు మంటూనే ఉంది దీంట్లో షాక్ ఏముంది?’’
‘‘మా కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో మా పిల్లలను చూస్తే మీరు షాకవుతారు.’’
‘‘ఒరేయ్ షాకు నువ్వు తెలుగు వెబ్‌సైట్‌లో పని చేస్తున్నావు కదూ? నిజంగా ఇది మాకు షాకేరా? చదువుకునే రోజుల్లో ఏ కొత్త సినిమా విడుదలైనా నీ హడావుడే కనిపించేది. టాకీసులను కడిగి, అలంకరించే వాడివి. నువ్వు ఏనాటికైనా సినిమా హీరోవు అవుతావని అంతా కలలు కన్నాం. నువ్వేంటిరా అ దిక్కుమాలిన షాకింగ్‌ల వెబ్‌సైట్‌లో చేరి విద్యుత్ శాఖలో పనిచేసే లైన్ మెన్‌లా షాకులిస్తూ బతుకుతున్నావ్’’
‘‘కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. మొన్న రాత్రి పడుకునేప్పుడు మా ఆవిడకు గుడ్‌నైట్ చెప్పడానికి బదులు నీకో షాకింగ్ న్యూస్ నీతోపాటు పడుకుంటున్నది నేనే అని చెప్పాను. మా ఆవిడ తలమీద టపాటపా కొట్టింది. మాటలకు కర్త, కర్మ, క్రియ తప్పనిసరి అన్నట్టు షాకింగ్ వెబ్‌సైట్‌లో పనిచేయడం మొదలు పెట్టాక ప్రతి మాటకు ముందోసారి, వెనకోసారి షాకింగ్ న్యూస్ అనాల్సి వస్తోంది. నా జీవితం షాకింగ్‌లలో కరిగిపోయింది. ’’
‘‘నీ జీవితం నీకే షాకింగ్‌రా’’
‘‘ దశాబ్దాల క్రితం అంతా కలిసి చదువుకున్న మనం ఈరోజు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందిరా? మనలో అటెండర్ మొదలుకొని, ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వరకు ఉన్నాం. చదివింది ఒకే స్కూల్, ఒకే స్థాయిలో జీవితాన్ని ప్రారంభించిన వాళ్లం అయినా మన స్థితిలో ఎంత తేడాలున్నాయిరా? అచ్చం మినీ ఇండియాలా ఉన్నాం మనం. ఇలా ఎందుకు జరుగుతుందంటావ్’’
‘‘అమెరికా నయా సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారి విధానం, మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థ, విప్లవం.’’
‘‘ఒరేయ్ భాస్కర్ పరీక్షల్లో నువ్వు రాసిన సమాధానాలు చూసి నువ్వు ఏదో రాశావు. దానికి మార్కులు వేయాలో వద్దో తేల్చుకోలేక పంతులు జుట్టు పీక్కునే వాడు. ఎదుటివారిని గందరగోళంలో పడేసి ఏదో చెప్పాడు, కానీ ఏంటో అర్థం కావడం లేదు అనుకునేట్టు చేయడంలో నీ స్టైల్ చిన్నప్పటి నుంచి అలానే ఉంది. మారలేదు. కాస్త అర్థం అయ్యేట్టు చెప్పు’’
‘‘చిన్ననాటి మిత్రులు కాబట్టి మీ దగ్గర మనసు విప్పి మాట్లాడుతున్నాను. చదువు ముగియక ముందే అడవి బాట పట్టాను. ఏం సాధించానో తెలియదు. నావే అర్థం కాని మాటలంటే, నా కన్నా అర్థం కాకుండా మాట్లాడే వాళ్లు చాలామంది అడవుల్లో ఉండేవాళ్లు. అడవుల్లో మేం విప్లవాన్ని వండుకుని, విప్లవానే్న తినేవాళ్లం. 30 ఏళ్ల తరువాత ఏం సాధించామని ఆలోచిస్తే కన్నీళ్లు ఆగలేదు. బోరున ఏడ్చి ప్రశాంతంగా ఆలోచించి, జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నాం. మీరంతా గొప్పగా మీరు సంపాదించిన డిగ్రీలు, కట్టుకున్న ఇళ్లు, కొనుక్కున్న ప్లాట్ల గురించి, బ్యాంకు బ్యాలెన్స్‌ల గురించి, అమెరికాలో ఉన్న పిల్లల గురించి చెబుతుంటే, నేనేమో నామీద ఉన్న కేసుల సంఖ్య, కాల్చిన బస్సుల గురించి, చేసిన హత్యల గురించి చెప్పుకోవలసి వచ్చింది.’’
‘‘ఈ దేశం ఎవరికోసం కొందరు గుడిసెల్లో బతుకుతుంటే అంబానీలు 80 అంతస్థుల భవనాల్లో ఉంటారా? ఎవడబ్బ సొత్తు, విప్లవం వర్థిల్లాలి. నా దేశాన్ని నిర్బంధం నుంచి విముక్తి చేస్తాను. మనిషి పుట్టుకతో స్వేచ్ఛా జీవి, ఈ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు’’
‘‘ఎవర్రా ఆ బుడ్డోడు మన పెద్ద వాళ్ల మీటింగ్‌కు వచ్చి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. ’’
‘‘మా అబ్బాయే కాస్త మార్పు ఉంటుందని నేనే తీసుకొచ్చాను. వాడు కడుపులో ఉండగానే మా ఆవిడ నేను జాయింట్‌గా ఐఐటి కలలు కన్నాం . నర్సరీ కన్నా ముందు ప్రెగ్నెన్సీ కోర్సు మొదలు పెడితే అప్పటి నుంచి ఎంసెట్ వరకు చై.నా విద్యాసంస్థల్లోనే చేర్పించాం. పుట్టక ముందు నుంచే వాడి స్వేచ్ఛను హరించామని వాడికి కోపం. ఎంసెట్ తరువాత ఒక్కసారి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెట్టడంతో, కొత్త వాతావరణానికి అలవాటు పడక పిచ్చిపిచ్చిగా విప్లవం అంటాడు. అంబానీ అంటాడు. ప్రపంచాన్ని మార్చేస్తానంటాడు. డాక్టర్లను కలిస్తే ఈ వయసులో, ఈ కాలంలో ఇది కామన్. దీన్ని చై.నా ఎఫెక్ట్ అంటారు. దీనికి చికిత్స లేదు. ఏదో ఒక రోజు హఠాత్తుగా మామూలు మనిషి అవుతాడని డాక్టర్లు చెప్పారు.’’
‘‘అంతరిక్ష యాత్రీకులు భూమిపై దిగాక ఒకేసారి భూమి వాతావరణంలో బతకలేరు. క్రమంగా అలవాటు చేస్తారు. అలానే కార్పొరేట్ విద్యా సంస్థల్లో పుట్టి పెరిగిన వారిని ఎంసెట్ తరువాత స్వేచ్ఛా జీవితం క్రమంగా అలవాటు చేయాలి.’’
‘‘ఈ దేశంలో 75శాతం సంపద ఒక శాతం మంది సంపన్నుల చేతిలోనే ఉందట! ఇది అన్యాయం కదూ? అందుకే విప్లవం వస్తుందని, రావాలని నేనూ కోరుకుంటున్నాను’’
‘‘ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చుంటేనో, అడవి బాటపట్టి బస్సులు తగలబెడితేనో, బోనస్ డబ్బులతో కవితా సంకలనాలు ప్రచురించి మిత్రులకు ఉచితంగా పంచి పెడితేనో, అభిమాన హీరో సినిమా విడుదల రోజున టాకీసులను కడిగి శుభ్రం చేస్తేనే సంపద వాళ్ల చేతిలో వచ్చి పడిపోవడం లేదు. చట్టబద్ధంగా సంపాదిస్తే తప్పేంటి?’’
‘‘ఏరోయ్ సంపన్నులను సమర్ధిస్తున్నావంటే నువ్వు కూడా కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టున్నావ్’’
‘‘కుక్కను కొట్టినా డబ్బులు రాలుతాయి అంటారు. కొట్టిచూడు కరిస్తే రాబిస్ వ్యాధి వస్తుందేమో కానీ డబ్బులు రాలవు.’’
‘‘ఇంతకూ నువ్వేమంటావు’’
‘‘సంపన్నుడివి కావాలనుకుంటే నీ ఆలోచనలు ఆ దిశగా సాగాలి. డబ్బుతో పని లేదు. ఆబిడ్స్‌లో ఆదివారం రోజు దొరికే పాత పుస్తకాలే నాకు పెన్నిధి అనుకుంటే తప్పు లేదు. సాహిత్య వ్యవసాయం చేస్తూ సంపద పంట పండడం లేదేమిటని దిగులు పడకు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు నీకేం కావాలో ప్రశాంతంగా ఆలోచించుకుని ఆ మార్గంలో వెళ్లమంటాను. చట్టబద్ధమైనది ఏదీ తప్పు కాదు.’’
-బుద్దా మురళి (జనాంతికం 26-1-2018)

22, జనవరి 2018, సోమవారం

మూగ బోయిన మూకీల కాలం నాటి రాజేశ్వర్ టాకీస్


సినిమా పుట్టక ముందు పుట్టిన టాకీసు అది ...టాకీసు అంటేనే సినిమాలు ప్రదర్శించేది . మరి  సినిమా పుట్టక ముందు టాకీసు ఎలా పుడుతుంది ? పుట్టి ఏం చేస్తుంది ?
నిజమే ఇప్పటి సినిమాలు పుట్టక ముందు మూకీ సినిమాలు ఉండేవి .. మూకీ సినిమాలు ప్రదర్శించే కాలం లోనే రాజేశ్వర్ టాకీస్ పుట్టింది .. మరో తొమ్మిదేళ్ల పాటు ఎలాగోలా నడిస్తే వందేళ్లు పూర్తి చేసుకునేది .  ఓ తరం వారికి జ్ఞాపకాలను మిగిల్చి రాజేశ్వర్ టాకీసు తలుపులు ముసుకు పోయాయి ..

తెలుగు సినిమా వయ సు 87 ఏండ్లు అయి తే అంతకన్నా ఐదేండ్ల పెద్ద వయసులో రాజేశ్వర్ టాకీ సు నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోయింది. 1931లో తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద వస్తే, సికింద్రాబాద్‌లో రాజేశ్వర్ టాకీసు 1926లో ప్రారంభమైం ది. రాజేశ్వర్ టాకీసు ప్రారంభమైన ఆరేండ్ల తర్వాత తొలి తెలు గు సినిమా వచ్చింది.ఢిల్లీలో 86 ఏండ్ల రీగల్ టాకీ సు మూతపడితే జాతీయ పత్రికల్లో ప్రత్యేక వార్తా కథనాలు వచ్చాయి. అంతకన్నా పాత టాకీసు రాజేశ్వర్ పత్రికల్లో సింగిల్ కాలం వార్తగా కూడా కనిపించకుండా చరిత్రలో కలిసిపోయింది.
1957లో వచ్చిన సువర్ణ సుందరి సినిమా ఈ టాకీసులో బ్రహ్మాండంగా నడిచిందని అక్కడ పనిచేసిన సిబ్బంది ఇప్పటికీ గర్వంగా చెప్పకుంటారు. అక్కినేని సువర్ణ సుందరి, ఎన్టీఆర్ గులేభకావళి కథ, శోభన్‌బాబు మనుషులు మారాలి, చలం నటించిన సంబరాల రాంబాబు వంటి సినిమాలను సగర్వంగా ప్రదర్శించిన ఈ టాకీసు చివరిదశలో బతుకు పోరాటంలో థర్డ్ గ్రేడ్ చిత్రాలను సైతం ప్రదర్శించింది. మోండా మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని ఆనంద్‌భవన్‌లో టిఫిన్ చేసి, రాజేశ్వర్ టాకీసులో సినిమా చూడటం ఒక తరానికి ఓ అలవాటు.
***
ఎన్టీఆర్ రావణుడిగా నటించిన భూకైలాస్ 1958లో మొదటి సారి విడుదల కాగా కొంత కాలం తరువాత రాజేశ్వర్ టాకీసు లో రెండవ సారి విడుదల అయినా జనం కిక్కిరిసి పోయారు . టికెట్ లు అయిపోతే  అలానే క్యూలో కూర్చుంటే డైలాగులు అన్నీ వినిపించేవి . తరువాత షో కు సినిమా చూడడం ఇలాంటి అనుభవాలు అయిదు దశాబ్దాల క్రితం చాలా మందికి నేటికీ తాజాగా ఉన్నాయి ఆ టాకీసు జ్ఞాపకాల్లో
***

మూకీల కాలంలో ప్రారంభమైన రాజేశ్వర్ టాకీస్ మారిన పరిస్థితులను తట్టుకొని నిలబడేందుకు ప్రయత్నించింది. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామని పోస్టర్లతో వెలిగిపోయిన ఆ టాకీసును చూసిన కళ్లతోనే అవేవో రాత్రులు అంటూ బూతు పోస్టర్లను బాధగా చూడాల్సి వచ్చింది ఆ ప్రాంతవాసులు. చివరికి ఆ బూతు సినిమాలు కూడా రాజేశ్వర్ టాకీసును బతికించలేకపోయాయి.
తెలుగు సినిమా చరిత్ర కన్నాముందు చరిత్ర రాజేశ్వర్ టాకీసుది. 1926లో ప్రారంభమైన రాజేశ్వర్ టాకీసులో మూకీ సినిమాలు కూడా ప్రదర్శించారు.

ఒకప్పడు అందమైన బట్టలకు ఖజానా శ్రీ ఆనంద్ క్లాత్ స్టోర్ తంధానా అనే ప్రచార పాట రేడియోలో తెగ వినిపించేది. చందన, బొమ్మన కాలం కన్నాముందు బట్టల వ్యాపారానికి సికింద్రాబాద్ పేరుగాంచిన ప్రాంతం. జెక్సానీ రామ చంద్రయ్య బట్టల దు కాణం, ఆనంద్ క్లాత్‌స్టోర్‌ను దాటుకొని ముందుకువెళ్లాక శ్రీరామ బుక్‌డిపో తర్వాత దర్శనమిస్తుంది రాజేశ్వర్ టాకీస్.
నిలబడి టిఫిన్ తినడం అలవాటయ్యాక కూర్చొని తినే ఆనంద్ భవన్‌ను చిన్నచూపు చూశారు. ఇప్పడు ఆనంద్ భవన్ మూతపడింది. రామచంద్రయ్య బట్ట లు దుఖాణం లేదు. ఆనంద్ క్లాత్ స్టోర్ మూసేశారు . మోండా మార్కెట్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరపడింది. రాజేశ్వర్ టాకీస్ కాలగర్భంలో కలిసిపోయింది. మార్కెట్ ప్రాం తంలో ఇవి ల్యాండ్ మార్కులు.

1930-40 నాటి హైదరాబాద్ రాష్ట్ర జీవితాన్ని వివరిస్తూ రాసిన నవలలో తమిళ రచయిత అశోక మిత్రన్ సికింద్రాబాద్ గురించి వివరిస్తూ మొహంజొదారో నాగరికతను అక్కడి తవ్వకాల్లో బయటపడిన నీటిపారుదల కాలువలు చిత్రించినట్టుగా సికింద్రాబాద్ నాగరికత అంతా గల్లీలనబడే సందుగొందు ల్లో నిక్షిప్తమై ఉంది అంటారు. నిజం గా అలాంటి ఒక సం దులోనే రాజేశ్వర్ టాకీసు ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి కూడా ఈ టాకీసుకు వచ్చి సినిమాలు చూసేవారు. ఆ కాలంలో పెద్దగా టాకీసులుండేవి కావు.
 
ఘనా ఘన సుందరా కరుణా రస మందిరా
అది పిలుపో మేలు కొలుపో
అది మధుర మధురమ ఓంకారమో
ఈ పాట ఒకప్పడు తెలుగునాట భక్తి ఉద్యమంలా వినిపించింది. 1973లో వచ్చిన భక్తతుకారాం సిని మా తెలుగు నాట సంచలనం. రాజేశ్వర్‌లో ఈ సిని మా ప్రదర్శించిన సమయంలో సినిమా హాలులా కాకుండా అదో దేవాలయంలా కనిపించేది. సినిమా హాలు ఆవరణలోనే విఠలేశ్వరుని ప్రతిమను ఏర్పాటుచేశారు. ఆ సినిమా నడిచినన్ని రోజులు టాకీసును దేవాలయంగా చూశారు. రాజన్నగౌడ్ రాజేశ్వర్ టాకీసును 1926లో ఏర్పాటుచేస్తే అక్కడ పనిచేసిన సిబ్బంది ఇప్పటికీ ఆయన పేరు వినగానే దేవుడు సార్ చాలా మంచివారు. టికెట్ దొరక్క చిన్న కుర్రా ళ్లు ఏడిస్తే వెళ్లి కూర్చోరా అని పంపేవారు అని టాకీసులో 36 ఏండ్లు పనిచేసిన విజయ్‌కుమార్ అనే ఉద్యోగి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజ న్న గౌడ్ తర్వాత ఆయన కుమారుడు టాకీసును నడిపారు. తర్వాత యాజమాన్యం చేతులు మారింది. మూతపడింది. తొలుత ముందువరుసలో బెంచీలుండేవి. టికెట్ ధర కూడా మోండాలో కూరగాయ ల్లా చాలా తక్కువ ఉండేది. ఇక సింగిల్ తెర టాకీసు లు కావు, మల్టీప్లెక్స్‌లు కూడా నడవవు అని ఏమీ చదువుకోని విజయకుమార్ సినిమా టాకీసుల జోస్యం చెప్పారు.
***
^^ మా అక్క పేరు సీత .. మా అమ్మను డెలివరీ కోసం గాంధీ ఆస్పత్రి లో చేర్పించారు . రాజేశ్వర్ లో సీతా రామ కళ్యాణం సినిమా ఆడుతోంది . నాన్నకు బోర్ కొట్టి అమ్మను తీసుకోని రాజేశ్వర్ కు తీసుకు వెళ్లారు . సెకండ్ షో ఛుఇసి వచ్చిన కొద్దీ సేపటికి మా అక్కయ్య పుట్టింది . అందుకే సీత అని పేరు పెట్టారు .  సీత పేరు వద్దు కష్టాలు పడుతుంది అని ఎంత మంది వారించినా నాన్న వినలేదు . మా అక్క ప్రస్తుతం అమెరికా లో ఉంటుంది ^^ అని రాజేశ్వర్ తో తన అనుబంధాన్ని ఓ జర్నలిస్ట్ మిత్రుడు పంచు కొన్నారు ... 
***
1958లో రాజేశ్వర్ ఎన్టీఆర్ జి వరలక్ష్మి , కృష్ణకుమారి , రేలంగి నటించిన రాజనందిని ప్రదర్శించారు . అక్కినేని నటించిన చక్రధారి సినిమా బాగా నడిచింది . 1966లో బాలయ్య , రాజశ్రీ , రేలంగి నటించిన విజయ శంఖం ప్రదర్శించారు . పద్మనాభం నటించి నిర్మించిన పొట్టి ప్లీడర్ బాగా నడిచింది . 77లో భక్త ప్రహ్లద రెండవ సారి విడుదల అయినప్పుడు కూడా అదే క్రేజీ . 76లో సూపర్ స్టార్ కృష్ణ పాడిపంటలు సినిమా ఈ టాకీస్ లో దుమ్ము దులిపింది . 
**

సికింద్రాబాద్ సందుల్లో నుంచినడవడమే కష్టం  ఇక పార్కింగ్? ఇప్పుడు రాజేశ్వర్ టాకీసు కార్ల పార్కింగ్ ప్లేస్ గా మారింది . తిరిగి టాకీసు తెరువకపోతారా? అని స్థానికులు ఆశగా ఎదురుచూస్తుంటే మా బకాయిలు ఏనాటికైనా చెల్లించకపోతారా? అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అక్కడ పనిచేసిన వారితో మాట్లాడుతుంటే ఓ మధ్య వయసు మహిళ టాకీసు మొత్తం కలియ తిరగసాగింది. ఏమీలేదు అంటూతనకు తానె భారంగా చెప్పుకొంటూ  ఏమీ మాట్లాడకుండారాజేశ్వర్ టాకీస్ జ్ఞాపకాలతో  భారంగా వెళ్లిపోయింది ... 
- బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 21-1-2018) 
టాకీస్ 5 

19, జనవరి 2018, శుక్రవారం

ప్రపంచానికి నా పిలుపు

‘‘ఏరా చేతిలో పెన్ను పట్టుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు ఫోజు ప్రాక్టీస్ చేస్తున్నావంటే కొత్త కవితా సంకలనం కోసం సిద్ధమవుతున్నట్టున్నావ్?’’
‘‘రావోయ్ రా! అలాంటిదేమీ లేదు. ఐనా ఆ ఫోటో ట్రెండ్ మారి చాలా కాలమైంది. కవితా సంకలనాలకు చివరి పేజీ ఫోటో అంటే, ఇప్పుడు కావలసింది చేతిలో పెన్ను కాదు, నెరిసిన గడ్డం మాసిన ముఖం... ఏమోయ్! అరగంట క్రితం టీ తెమ్మని చెప్పాను కదా? ఒకటి కాదు రెండు టీలు తీసుకురా!’’
‘‘ఇంతకూ దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావో చెప్పనే లేదు. ’’
‘‘ప్రాణమిత్రుడివి నీ దగ్గర దాపరికమెందుకు? ప్రజలకు ఏదో ఒక పిలుపు ఇవ్వాలనిపిస్తోంది. ఏదో ఒక పిలుపు ఇవ్వందే సుఖంగా నిద్ర కూడా పట్టేట్టు లేదు. అవే ఆలోచనలు వెంటాడుతున్నాయి.’’

‘‘క్షయ గురించి అమితాబ్ ప్రకటనలు చూస్తున్నావు కదా? ఎడతెరిపి లేకుండా అలా దగ్గు రావడం క్షయ లక్షణం. వరుసగా తుమ్ములు వస్తుంటే జలుబు లక్షణం ఎలానో సమాజానికి ఏదో పిలుపు ఇవ్వాలనే ఆలోచన వెంటాడడం మేధావి లక్షణం. నీలోని మేధావి ముదిరిపోతున్నాడు అనేందుకు ఇదే తార్కాణం. కక్కొచ్చినా, కల్యాణం వచ్చినా ఆగనట్టే సమాజానికి పిలుపు ఇవ్వాలనే ఆలోచన వచ్చినా ఆగదు. ఎయిడ్స్‌కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గం అన్నట్టు పిలుపు ఇవ్వడం ఒక్కటే ఈ ఆలోచనలకు మందు’’
‘‘నా ఆలోచనలను పొగుడుతున్నావో? వెటకారం చేస్తున్నావో అర్థం కావడం లేదు’’
‘‘మేధావులను అందరూ తొలుత పిచ్చివాళ్లుగానే పరిగణించారు. విజయం సాధించేంతవరకు అంతా ఇలా చిన్నచూపు చూస్తారు. కార్య సాధకుడు ఇలాంటి వాటికి భయపడడు. వచ్చావా ఉగాది మళ్లీ వచ్చావా అంటూ మొదటి సారి నువ్వు కవిత రాసినప్పుడు ఎవరేమన్నారో గుర్తుందా? వాటిని పట్టించుకుంటే ఈ రోజుకు పనె్నండు కవితా సంకలనాలు వెలువరించే స్థాయికి వచ్చేవాడివా? పట్టించుకోవద్దు. ప్రొసీడ్’’
‘‘అంతే అంటావా?.. కానీ నేనిచ్చే పిలుపు ప్రత్యేకంగా ఉండాలి. అందరూ పాటించి తీరాలి అనేది నా కోరిక ’’
‘‘పూర్వం ఒక రాజు గారు ప్రజలంతా ఉదయం పడుకుని, రాత్రి పూట మేల్కొనాలని ప్రజలకు పిలుపు ఇచ్చాడని చిన్నప్పుడు కథ చదివాం గుర్తందా? ఆ పిలుపు ఇప్పుడు నువ్వు ఇవ్వు’’
‘‘రాజరికంలో రాజుగారు ఇలాంటి పిలుపు ఇచ్చినా పట్టించుకున్నారు కానీ ఇప్పుడు వర్కవుట్ కాదేమో! ఐనా జనం ఎక్కడ పడుకుంటున్నారు 24 గంటలు మెలకువగానే ఉంటున్నారు. నగరాలు అసలు నిద్రపోవడం లేదు. ఇంకేదన్నా వెరైటీ పిలుపు ఉంటే చెప్పు’’
‘‘నేను రావడానికి అరగంట ముందు టీ తెమ్మని మీ ఆవిడకు పిలుపు ఇచ్చావు. నేను వచ్చాక రెండు టీలు అని పిలుపు ఇచ్చావు. అరగంట గడిచినా మీ ఆవిడ నీ టీ పిలుపును ఖాతరు చేసినట్టు కనిపించడం లేదు. ఇంట్లో శ్రీమతినే నీ పిలుపు పట్టించుకోనప్పుడు ప్రపంచం నీ పిలుపునకు ఎలా స్పందిస్తుందా?అనే చిన్న అనుమానం’’
‘‘పిచ్చోడా! ఇదసలు సమస్యనే కాదు. ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలు, మేధావులకు ఇది కామన్ సమస్య. ఇంట్లో భార్య ఖాతరు చేయకపోవడం, భార్య రాచి రంపాన పెట్టడం వల్లనే ఎంతోమంది తత్వవేత్తలు, మేధావులు ఈ ప్రపంచానికి ఎంతో ఇచ్చారు. అలా కాకపోతే - ‘స్వానుభవమున చాటు సందేశమిదే పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాపురముండాలోయ్ ఎల్లర సుఖము చూడాలోయ్’ అంటూ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్లు. ఎంత గొప్ప మేధావి పిలుపునకైనా ప్రపంచం స్పందిస్తుంది కానీ ఇంట్లో భార్యలు స్పందించరు. ఇదసలు సమస్య కానే కాదు.’’
‘‘సమస్య కానప్పుడు పిలుపు ఇవ్వడం గురించి ఇంకా దీర్ఘాలోచనలు దేనికి?’’
‘‘పిలుపు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాను కానీ ఎవరికి పిలుపు ఇవ్వాలి? ఏమని పిలుపు ఇవ్వాలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. ’’
‘‘అప్పుడెప్పుడో లాల్‌బహదూర్ శాస్ర్తీ దేశంలో పేదరిక నిర్మూలన కోసం వారంలో ఒక రోజు తినవద్దని పిలుపు ఇచ్చారని చరిత్ర పుస్తకాల్లో చదివాను.’’
‘‘నాకూ తెలుసు కానీ ఈ పిలుపునకు పెద్దగా స్పందన రాలేదు. అలా కాదు అందరూ తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిన విధంగా పిలుపు ఇవ్వాలని నా ఆలోచన’’
‘‘దసరా పండగ జరుపుకోవాలని, ఆ రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లాలని, రావణ దహనం చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చేయ్. తెలంగాణలో ప్రజలు దసరా రోజున నీ పిలుపుమేరకే ఇలా చేశారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకెందు కాలస్యం’’
‘‘సంక్రాంతికి సొంతింటికి వెళ్లాలని ఆంధ్ర లో  పిలుపు ఇస్తే చక్కగా పాటించారట ’’
‘‘ఇంకా ఏదైనా వెరైటీ పిలుపు ఇవ్వడం ద్వారా చరిత్రలో నిలిచిపోదామని!’’
‘‘హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు, హైదరాబాద్‌లో ఉన్న వాళ్లు తప్పని సరిగా ఇరానీ చాయ్ తాగాలని పిలుపు ఇవ్వు. నీకో విషయం తెలుసా? కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి ఇరానీ చాయ్ తాగేందుకే హైదరాబాద్ వస్తారు. ఎవరు టీ తాగినా నీ పిలుపు మేరకు టీ తాగినట్టు ఉంటుంది. పిలుపు ఇవ్వాలనే నీ కోరికా తీరుతుంది.’’
‘‘ఐడియా బాగానే ఉంది కానీ మరీ ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ఇంకాస్త విస్తృతంగా ఉంటే బాగుంటుంది’’
‘‘పోనీ హిందువులు ఆలయాలకు వెళ్లాలని, క్రైస్తవులు చర్చిలకు వెళ్లాలని, ముస్లింలు మసీదులకు, సిక్కులు గురుద్వారాలకు వెళ్లాలని పిలుపు ఇవ్వు. ప్రపంచమంతా నీ పిలుపునకు స్పందించినట్టుగా ఉంటుంది.’’
‘‘ఇదేదో ఐడియా బాగుంది. మీమీ మతాచారాల ప్రకారం ప్రార్థనాలయాలకు వెళ్లమని ప్రపంచ ప్రజలకు పిలుపు ఇస్తాను. నీతో చర్చంచిన తరువాత కొత్తకొత్త పిలుపుల కోసం కొత్త ఆలోచనలు వచ్చాయి. జనవరి ఒకటిన న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలని, ఆదివారం సెలవు దినంగా పాటించాలని ప్రపంచానికి పిలుపు ఇవ్వాలనుకుంటున్నాను’’
‘‘నీ పిలుపుల రోగం గురించి  విన్నాక ప్రపంచానికి నేను కూడా ఏదో ఒక పిలుపు ఇవ్వాలనుకుంటున్నాను.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ప్రపంచానికి ఏదో ఒక పిలుపు ఇవ్వాలనేది ప్రపంచ ప్రజలకు నా పిలుపు’’
‘‘ అంతా చదివారు కదా? ప్రపంచానికి మీరూ ఏదో ఒక పిలుపు ఇవ్వండి. ఇప్పటికే ఆలస్యం అయింది . మీ పిలుపు ఏమిటో చెప్పండి ’’

-బుద్దా మురళి (19. 1. 2018 జనాంతికం ) 

16, జనవరి 2018, మంగళవారం

రాహత్ మహల్ కోరా కాగజ్




అత్యద్భుత చిత్రము యొక్క అద్భుత విజయం పక్షి రాజావారి బీదల పాట్లు తారలు నాగయ్య -లలిత- పద్మ 
రాహత్ మహల్ లో సమయము , ఆటలు యధా ప్రకారం - జనవరి 16-1951లో అంటే 67 ఏళ్ళ క్రితం గోలకొండ పత్రికలో సినిమా ప్రకటన . 
 మహల్ అదెక్కడా? అనే ప్రశ్న ఈ తరం వారికిఉదయించవచ్చు . 
ఆ సినిమా టాకీసు పేరు అర్థం ఆ రోజుల్లో తెలియలేదు. కానీ ఆ పేరులోనే ఆహ్లాదం ఉన్నది. ముషీరాబాద్‌లోని ఈ సినిమా హాలును ఇప్పటికీ అక్కడివారు రాత్ మహల్ అనే పిలుస్తారు. రాత్ మహల్ అంటే రాత్రి ప్యాలెస్ అని అర్థం. కానీ దాని అసలు పేరు రాహత్‌మహల్. రాహత్ అని రహత్అని కొన్ని ప్రకటనల్లో ఉంది. రాహత్   అంటే అరబ్బీ భాషలో విశ్రాంతి, రిలీఫ్ అని అర్థం. మహల్ అంటే ప్యాలెస్. ఎన్నో సమస్యలతో సతమతమయ్యే సగ టు జీవి కాసేపు సేదతీరేది సినిమాహాలులోనే. దానికి తగ్గట్టుగానే కళాత్మకహృద యంతో ఈ సినిమా హాలుకు రహత్ మహల్ అని పేరు పెట్టారు.
రాహత్ని ాఅని అరబ్బీ పేరు పెట్టినా ప్రారంభం లో ఎక్కువగా తెలుగు సినిమాలే ప్రదర్శించే వారు .కాంతారావు , కృష్ణ కుమారి , రాజనాల నటించిన కనకదుర్గ పూజా మహిమ ఇందులో ప్రదర్శించారు  గుండమ్మ కథ వంటి సినిమాలు ప్రదర్శించారు. 
  యజమాని ఎవరు? హాలులో ఎవరి వాటా ఎంత? ఆదాయం వస్తుందా? లేదా? అనే ఆలోచన లు అప్పుడు అస్సలు లేవు. కానీ సినిమాహాలు రూపం మారిన తర్వాత ఇది వనపర్తి రాజాలదని తెలిసింది.ఇప్పుడు రహత్ మహల్ లేదు. కానీ రాజా పేరుతో అదే చోట మూడు టాకీసులు నిర్మించారు. పేరుకు తగ్గట్టు విశా లమైన స్థలంలో ఈ టాకీసు ఉండేది. చుట్టుపక్కల ఎక్కువ గా ముస్లింలు నివసించే ప్రాంతం కావడంతో ఎక్కువగా హిందీ సినిమాలే విడుదలయ్యేవి.
టాకీసు ఉన్నది ముషీరాబాద్‌లో అయినా ముషీరాబాద్, బోలక్‌పూర్, బాకారం, జమీస్తాన్‌పూర్, రాంనగర్ వారికి అందుబాటులో ఉండేది. ఈ ప్రాంతాల హిందీ సినిమా ప్రేమికులకు రహత్ మహల్ ఒక మధుర జ్ఞాపకం. తొలిసా రి సినిమా షూటింగ్ చూసింది కోరా కాగజ్ హిందీలో బాగా హిట్టయిన ఈ సినిమా రహత్ మహల్లోనే చూశాను. జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో ఒకసారి తెలుగు సినిమాను ప్రదర్శించేవారు.ఈ రోజుల్లో సినిమాహాలు బుకింగ్ వద్ద మొదటి తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి అని ఎక్కడైనా కనిపిం చిందా? కావాలంటే నగరంలోని అన్ని టాకీసులు తిరిగి చూడండి ఒక్కచోట కూడా కనిపించదు. కానీ ఆ రోజుల్లో రహత్ మహల్లో ఆడేవి హిందీ సినిమాలే అయినా బుకింగ్ దగ్గర మాత్రం తెలుగులోనే మొదటి తరగతి, రెండవ తరగ తి, మూడవ తరగతి అని రాసి ఉండేది. మూడవ తరగతి చదువుకుంటున్నవారికే టికెట్లు ఇస్తారేమో అని అనుకొని ఐదవ తరగతి చదువుతున్నా టికెట్లు ఇచ్చేవాడికి మూడవ తరగతి అని అబద్ధం చెప్పాలని నిర్ణయించుకుని క్యూలో నిలబడిన సందర్భాలు చాలామందికి ఉన్నాయి.
కోరా కాగజ్ సినిమాలోని ఒక సీనును ట్యాంక్‌బండ్‌పై చిత్రీకరించారు. నటుల పేర్లు తెలియదు. కానీ ట్యాంక్‌బండ్ పై స్త్రీ పాత్రధారి వెళ్తుంటుంది. కారుపై వెళుతూ హీరో ఆమె కు కారు తగిలిస్తాడు. ఈ చిన్న సీనును తీసేందుకు కొన్ని గం టలపాటు షూటింగ్ జరిగింది. సినిమా షూటింగ్ అంటే ఇం త కష్టమా? అనిపించింది మొదటిసారి.రహత్‌మహల్లో లెక్కలేనన్ని హిందీ సినిమాలు చూసినా కోరా కాగజ్ సినిమా అనుభవం ప్రత్యేకం. అప్పటివరకు హిందీ సినిమాలు అంటే డిష్యూం డిష్యూం ఫైట్స్‌కు పెట్టింది పేరు. డిష్యూం మాట దేవుడెరుగు ఈ సినిమాలో కనీసం ఒక చెంపదెబ్బ సీన్ కూడా లేకపోవడంతో ఇదేం సినిమా అనిపించింది 1974లో. ఆ ఏడాది హిందీలో పాపులర్ సినిమాగా కోరా కాగజ్‌కు అవా ర్డు దక్కింది.అమర్ అక్బర్ ఆంథోని. ఆ కాలం లో ఒక ఊపు ఊపిన హిందీ సినిమా. ఆ సినిమాను చూసింది రహత్ మహ ల్‌లోనే ఉదయం పూట పాత తెలుగు సినిమాలు ప్రదర్శించేవారు. మూడు ఆటలు ఎక్కువగా హిందీ సినిమాలే ప్రదర్శించేవారు. దగ్గరలోనే ముషీరాబాద్ హైస్కూల్ కావడంతో ఇంటర్వె ల్‌లో టాకీసుకు వచ్చి హాజరు వేయిం చుకొని వెళ్లడం అక్కడి విద్యార్థులకు అలవాటు.ఇక్కడ చూసిన సినిమాల కన్నా విన్న సినిమాలు ఎక్కువ. బయటకు సినిమా మొత్తం వినిపించేది. కాసేపు అక్కడ గడిపి వెళ్లడం ఓ వ్యాపకం.

విశాలమైన ఆవరణ చివరలో సినిమా హాలు. ఎంట్రెన్స్ లోనే క్యాంటిన్, క్యాంటిన్ ముందు విశాలమైన ఖాళీ స్థలం. అప్పటి కార్మిక నాయకుడు, ఇప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుల్లెట్ మీద టంచనుగా రహత్ మహల్‌కు రోజూ వచ్చేవారు. సినిమా చూసేందుకు కాదు. క్యాంటిన్ ఎదురుగా ఖాళీ స్థలంలో తనకోసం వేచి ఉన్న వారి సమస్యలను పరిష్కరించి వెళ్లేవారు.ఈ ప్రాంతం చుట్టుపక్కల ఎక్కువగా శ్రమజీవులే. దినమంతా పనిచేసేవారే. మిగిలిన ఆటలకన్నా సెకండ్ షోలోనే ఎక్కువమంది కనిపించేవారు. కొంతకాలానికి సినిమా హాలును మూసేశారు. రహత్ మహల్‌ను మూసినచోట ఇప్పడు రాజా పేరుతో మూడు సినిమా హాళ్లను నిర్మించారు. ముందు షాపింగ్ కాంప్లెక్స్, లెక్కలేనన్ని షాపులు. వెనుక మూడు సినిమా హాళ్లు. సూక్ష్మంలో మోక్షం సాధించాలి అని ఆధ్యాత్మికవేత్తలు భావించినట్టుగానే తక్కువ స్థలంలో ఎక్కు వ వ్యాపారం సాగించాలనేది నేటి మాట. అందుకే విశాలం గా ఉన్నరహత్ మహల్ అంతరించి ఇరుకుగా మూడు టాకీసులు, డజన్లకొద్దీ షాపులు వెలిశాయి. పాతతరం వారికి రహత్ మహల్ జ్ఞాపకాలు ముఖ్యం. కొత్తతరం యజమానులుకు లాభం ముఖ్యం.ఎప్పటిలానే ఈ టాకీసుల్లో హిందీ సినిమాలనే విడుదల చేస్తున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా క్యాంటిన్ లో కొంతభాగం అలానే ఉంది.

ముగ్గురు అన్నదమ్ములు విలన్ కారణంగా విడిపోతారు. అమర్ అక్బర్ ఆంథోనీగా మూడు మతాలకు చెందిన వారి గా పెరిగి పెద్దవుతారు. ముగ్గురు తాము అన్నాదమ్ములమని, విలన్ కారణంగా తమ కుటుంబం విడిపోయిందని గ్రహిం చి ప్రతీకారం తీర్చుకుంటారు. ఈ కథతో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. కానీ అమర్ అక్బర్ ఆంథోనీ సూపర్‌హి ట్ అయింది. రహత్ మహల్‌లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.విడిపోయిన ముగ్గురు అన్నదమ్ములు చివరకు ఒకటవుతారు. రహత్ మహల్ మాత్రం ఒకటి నుంచి మూడయింది. కానీ ఆ కళ మాత్రం కనిపించడం లేదు. ఆ తరం వారికి రహత్ మహల్ ఒక జ్ఞాపకం మాత్రమే. ఇప్పుడు బయటినుంచి చూస్తే ముందుగా కనిపించేవి షాపులు. వాటివెనుక సినిమా టాకీసులు.
బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 14-1-2018)
టాకీస్ 4 

12, జనవరి 2018, శుక్రవారం

మన కాలం దేవుళ్ళు

‘ఈ కాలంలో ఉన్న మనం అదృష్టవంతులం’’
‘‘మనలా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న తరం మరేదీ లేదు. చిన్నప్పుడు ట్రంక్ కాల్ చేయాలంటే ప్యాట్నీలో ఉన్న టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌కు వెళ్లి టోకన్ తీసుకుని గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు అమెరికాలో ఉన్న కూతురు హైదరాబాద్‌లో ఉన్న తల్లితో ట్యాబ్‌లో వంకాయ కూర గురించి, సాంబారులో ఉప్పు గురించి లైవ్‌లో మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఇల్లూ 24 ఇంటూ 7 లైవ్ వంటల చానల్‌గా మారిపోయింది అంటే టెక్నాలజీ పుణ్యమే కదా? ’’
‘‘ముప్పయి ఏళ్ల క్రితం మనమీ టెక్నాలజీని ఊహించలేదు. అలానే వచ్చే ఇరవై ఏళ్లలో టెక్నాలజీ ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో మనం ఊహించలేం. స్మార్ట్ ఫోన్ లేనిదే జీవించలేని స్థితికి చేరుకున్న మనం సెల్‌ఫోన్ లేకుండా చిన్నప్పుడు ఎలా బతికామని ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అలానే మరో రెండు మూడు దశాబ్దాల తరువాత టెక్నాలజీలో బతికే వాళ్లు ఇప్పటి మన జీవితం గురించి తెలుసుకొని ఓ మైగాడ్ స్మార్ట్ఫోన్ అనే పాత టెక్నాలజీతో పాపం ఎలా బతికారో అని మనమీద సానుభూతి చూపొచ్చు. మనం అదృష్టవంతులం అని నేను చెప్పింది టెక్నాలజీ గురించి కాదు. ’’
‘‘మరింక దేని గురించి?’’
‘‘ఉన్నావా? అసలున్నావా? అంటూ అనుమానం వ్యక్తం చేసిన మహామహా భక్తులు కూడా ఒక్కోసారి నిజంగా దేవుడు ఉన్నాడో లేడో నిర్థారించుకోలేక సతమతమయ్యారు. అలాంటిది మనం ఏకంగా దేవుళ్లు ఉన్న కాలంలో బతకడం అదృష్టవంతులమే కదా? ’’
‘‘ఈ కాలంలో దేవుళ్లను సినిమాల్లో చూసే అదృష్టం కూడా లేదు అలాంటిది నువ్వు దేవుళ్లను చూశావా? మొన్ననే కనిమొళి 2జి స్కామ్ నుంచి విజయవంతంగా బయటపడినందుకు తిరుపతి వెళ్లి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుని తిరుపతిలో అసలు దేవుడే లేడని ప్రకటించింది. అలాంటిది నువ్వు దేవుళ్లను చూశావా? ’’
‘‘కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి, బయటపడ్డాక ఆమెకు దేవుడు లేడనే అనుమానం వచ్చి ఉంటుంది. సహజమే కదా? ఆమెకే కాదు ఒక్కోసారి నాక్కూడా- నిజంగా దేవుడుంటే కుంభకోణాలు చేసిన వారు ఎలా బయటపడతారు అనిపిస్తుంది. కనిమొళిని చూసి విజయ్ మాల్యా అనవసరంగా దేశం విడిచి వచ్చానని సిగ్గుపడుతున్నాడేమో!’’
‘‘కేసు నుంచి బయటపడిన వారు దేవుడున్నాడనడం మామూలే, కానీ ఈమె కాస్త వెరైటీగా కేసు నుంచి బయటపడగానే దేవుడు లేడు అంటోంది. రుజువేంటి అని ఎవరైనా అడిగారో లేదో అడిగితే కేసు నుంచి నేను బయటపడడమే దేవుడు లేడు అనేందుకు రుజువు అంటుందేమో?. చర్చ పక్కదారి పట్టినట్టుంది. దేవుళ్లను చూశానన్నావు ఏంటాకథ’’
‘‘మొన్న బ్లాక్ బస్టర్ సినిమా అట్టర్ ప్లాప్ అయింది కదా?’’
‘‘నువ్వు మరీ ఇంత దుర్మార్గుడివి అనుకోలేదు. ఒక సినిమా అట్టర్ ఫ్ల్లాప్ అయితే దేవుడున్నాడని అంటావా? అంటే ఆ సినిమా అట్టర్ ఫ్ల్లాప్ కావాలని దేవుళ్లను మొక్కుకున్నావన్న మాట! ఫ్ల్లాప్ వెనుక అదేదో పార్టీ యువ నేత ఉన్నాడంటారనుకున్నారు చాలా మంది. కానీ దేవుడున్నాడన్న మాట’’
‘‘దేవుళ్లు ఉన్నారు. మొదట్లో మన సినిమాలన్నీ పౌరాణికమే. మనకు దేవుళ్లు పరిచయం అయింది ఈ సినిమాల ద్వారానే. 1936లో వచ్చిన తొలి తెలుగు సినిమా ‘్భక్తప్రహ్లాద’ పౌరాణికమే. దాదాపు 70వ దశకం వరకు దేవుళ్లను మనం సినిమాల్లోనే చూశాం.’’
‘‘ఔను నిజం ముఖ్యంగా 60వ దశకంలో వచ్చిన దేవుళ్ల సినిమాలను ఇప్పటికీ మైమరిచి చూస్తాం. ఆ తరువాత దేవుళ్ల సినిమాలు ఎందుకు రాలేదంటావు?’’
‘‘దేవుళ్లే కళ్లెదుట కనిపిస్తుంటే ఇక దేవుళ్ల సినిమాలు ఎవరు చూస్తారని అనుకున్నారేమో, దేవుళ్ల సినిమాలు తగ్గిపోయాయి.?’’
‘‘అన్నీ చెబుతున్నావుకానీ దేవుళ్లను ఎక్కడ చూశావు? ఎప్పుడు చూశావు ఆ సంగతి మాత్రం చెప్పడం లేదు.’’
‘‘ఇరాక్‌పై అమెరికా దాడి, ట్విన్ టవర్స్‌ను విమానంతో పేల్చడం, మన పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడిపై టీవిలో ఉద్వేగ పూరితంగా చర్చలు జరిపినట్టుగా, అంతకన్నా కొంచెం ఎక్కువగా ఓ తెలుగు సినిమా విడుదలపై ప్రజలేమనుకుంటున్నారు అని తెలుగు చానల్స్ అన్నీ కట్టకట్టుకుని చర్చించాయి. ఆ చర్చలప్పుడు నాకు దేవుళ్లు ఉన్నారని జ్ఞానోదయం అయింది.’’
‘‘అదే ఎలా అని ?’’
‘‘బ్లాక్‌బస్టర్ అని ప్రచారం జరిగి అట్టర్ ఫ్ల్లాప్ అయిన సినిమాను చూసి బయటకు వస్తున్న ప్రేక్షకుడు నాకీ జ్ఞానోదయం కలిగించాడు. ఆ ప్రేక్షకుడి తల్లి ఏరా బిడ్డా దెబ్బలు తగిలించుకున్నావు అని అడిగితే.. అమ్మా ఓసారి నీకు దెబ్బలు ఎలా తగిలాయి అని నిన్ను అడిగితే దైవ దర్శనం కోసం వెళితే తొక్కిసలాటలో దెబ్బలు తగిలాయి అని చెప్పావు. నేను నా అభిమాన హీరో సినిమాకు వెళితే నాకీ దెబ్బలు తగిలాయి. హీరోనే నాకు దైవం అని గర్వంగా చెప్పాడట! తన్మయంతో అతను చెప్పడం, టీవి చర్చల్లో ఉన్న ఓ అమ్మ మనసు ఉప్పొంగిపోవడం చూశాక కలికాలం దేవుళ్లు మన హీరోలే అనిపించింది. అప్పుడెప్పుడో భారతదేశ జనాభా 10- 20 కోట్లు ఉన్నప్పుడు ముక్కోటి దేవతలు అన్నారు. ఇప్పుడు వంద కోట్లు దాటినప్పుడు అదే దామాషా ప్రకారం దేవుళ్ల సంఖ్య కూడా పెరగాలా? వద్దా? రాష్ట్రాల సంఖ్య, నియోజక వర్గాల సంఖ్య పెరుగుతున్నప్పుడు దేవుళ్ల సంఖ్య ఎందుకు పెరగొద్దు’’
‘‘అవును నిజమే రజనీకాంత్ తమిళదేవుడు అయినట్టుగానే చాలా రాష్ట్రాల్లో చాలా మంది నట దేవుళ్లు జీవిస్తున్న కాలంలో మనం ఉండడం మన అదృష్టమే. ఈ విషయంలో ఉత్తరాది వారి కన్నా దక్షిణాది వాళ్లం అదృష్టవంతులం.’’
‘అభిమానులకు దేవుళ్లు కనిపిస్తారో లేదో కానీ. లింగ, కబాలీ, కాటమరాయుడు, వంటిసినిమాల నిర్మాతలు , బయ్యర్లకు  ఆ సినిమాల విడుదల తరువాత నిజంగానే దేవుడు కనిపించి ఉంటాడు. తమ్ముడి తాజా సినిమా  ను కొన్న వాళ్లకు దేవుడు కనిపించే ఉంటాడు 
... బిచ్చగాడు డబ్బింగ్  సినిమా నిర్మాతను కోటీశ్వరుణ్ణి చేస్తే, కాపీ కథల కలియుగ దేవుళ్ల సినిమా కోటీశ్వరులను బిచ్చగాళ్లను చేస్తోంది. ఇదంతా దేవుళ్ల మహిమ.’’
బుద్దా మురళి (జనాంతికం 12-1-2018)