24, ఏప్రిల్ 2013, బుధవారం

ఫేస్‌బుక్ నమో...నమో...!

‘‘ఏమ్మా వాడు లేడా? అని మిత్రులు అడిగితే, తన గదిలో కంప్యూటర్ ముందు కూర్చున్నారు. ఆయన ఎక్కువగా బయటకు రారు అని సురేష్ భార్య చెప్పింది.

 ‘‘అస్సలు క్లాస్‌లో కూర్చునే వాడు కాదూ. అల్లరి చిల్లరగా తిరిగే వాడు. మహానగరంలో కుదురుగా ఉన్నాడంటే చాలా సంతోషంగా ఉంద మ్మా!’’ అంటూ మిత్రులు లోనికి అడుగుపెట్టారు. 

పెద్దింటి కోడలు సీరియల్‌లో పూర్తిగా లీనమై పోయిన ఆమెకు వీరి రాక ఏ మాత్రం సంతోషం కలిగించలేదు. హీరోను చెంప దెబ్బ కొట్టడానికి హీరోయిన్ చెయ్యి పైకి లేపింది. రెండు వారాలైనా ఆ చేయ్యి హీరో చెంపపై పడుతుందా? లేదా? అనేది తేలలేదు. సస్పెన్స్‌కు ఈరోజు తెర పడుతుందని ఆమెకు విశ్వసనీయ వర్గాల నుంచి బోగట్టా అందింది. ఆమె కంగారుగా టీవి ముందుకు పరిగెత్తింది. అపురూపమైన ఆ దృశ్యాన్ని చూసేందుకు.


‘‘ఏరా ఫ్రెండ్స్ అంత దూరం నుంచి ఎండలో పడొస్తే, ఆ కంప్యూటర్‌కు అతుక్కుపోయావేంటి?’’ అని వినయ్ విసుక్కున్నాడు.
‘‘ఒక్క నిమిషం ఆగండిరా! ఫేస్‌బుక్ చూస్తున్నాను’’ అంటూ సురేష్ కొద్ది సేపటి తరువాత ముఖం ఇటు తిప్పి, ఎలా ఉన్నారని అడిగాడు.
వాళ్లు సొంత గ్రామంలో ప్రభుత్వ టీచర్లుగా ఉన్నారు.‘‘గ్రామంలో టీచర్ ఉద్యోగం, వ్యవసాయం అంటే బావిలో కప్ప లాంటి జీవితం. గ్రామాన్ని వదలండిరా! చైతన్యం కండి’’ అని సురేష్ హితబోధ మొదలు పెట్టాడు.
మన దగ్గర కాపీ కొట్టి బొటాబొటి మార్కులతో టెన్త్ పాసైన సురేష్ గాడేనా ఇలా మాట్లాడేది.. బాగా ఎదిగిపోయావురా! అని మిత్రులు అభినందించారు. అది సరే ఇంతకూ మహానగరంలో ఏం చేస్తున్నావురా! అని మిత్రులు అడిగారు.


ప్రజలను చైతన్య పరచే పనిలో బిజీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఫేస్ బుక్ వ్రతం చేస్తున్నాను . అత్యదిక సందేశాలు పోస్ట్ చేసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టిస్తా  అని సురేష్ సీరియస్‌గా చెప్పాడు. అర్ధం కాలేదు అన్నట్టుగా మిత్రులు ఆయోమయంగా ముఖం పెట్టారు. ఢిల్లీలో అత్యాచారం జరిగిన సంగతి తెలుసు కదా? అని అడిగాడు.


తెలుసు? అది నువ్వే చేశావా? ఏంటి? అని మిత్రులు జోకారు.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరేమో మీ పాఠాలు మీరు చెప్పుకుంటూ వ్యవసాయానికి వెళ్లిపోతారు. కానీ నేను అలా కాదు ప్రజలను చైతన్య పరచడానికి ఫెస్‌బుక్‌లో అద్భుమైన సందేశాలు ఇస్తుంటాను. అలాంటి సందేశాల వల్లనే కదా? క్యాండిల్స్ పట్టుకుని ర్యాలీలు తీసేది’’ అని సురేష్ చెప్పుకుపోతుంటే ..


 తెలిసింది లేరా! క్యాండిల్స్ అమ్మే వ్యాపారం మొదలు పెట్టావు. బాగానే గిట్టుబాటు అవుతున్నట్టుగా ఉంది కదా! ఎక్కడ చూసినా క్యాండిల్స్ ర్యాలీలు కనిపిస్తున్నాయి’’ అని మిత్రులు చెప్పా రు.


చీ...చీ... నేను క్యాండిల్స్ అమ్మడం ఏమిటి?
ఇదిగో ఫేస్‌బుక్‌లో సందేశాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి అంటూ ఫేస్‌బుక్ పోస్టులన్నీ చూపించాడు.
అవన్నీ చదివాక మిత్రుల తల వెనుక సినిమాల్లో మాదిరిగా జ్ఞానజ్యోతి వెలుగుతున్నట్టు అనిపించింది సురేష్‌కు.


ఓటు వజ్రాయుధం. ఎన్నికల్లో ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించండి. అవినీతి పరులను పారద్రోలండి. అంటూ పలు సందేశాలు అక్కడ కనిపించాయి.
ఇదంతా ప్రజలను చైతన్య పరచడమన్నమాట! అని చెప్పాడు.


అరే అచ్చం సల్మాన్‌ఖాన్‌లానే ఉన్నాడు అంటూ ఒక ఫోటో వద్ద మిత్రులు చూపును నిలిపారు. సల్మాన్ ఖాన్ కాదు నేనే అని సురేష్ నవ్వాడు. నువ్వెక్కడ సల్మాన్‌ఖాన్ ఎక్కడ అని మిత్రులు విస్తుపోయారు. మరదే నాది ఫోటో జెనిక్ ఫేస్.. ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తే నేను అచ్చం సల్మాన్‌ఖాన్‌లానే ఉంటాను. నువ్వే కాదు  సల్మాన్ ఖాన్ ఈ ఫోటో చూసినా తనదే అనుకుంటాడు  కావాలంటే నన్ను ఫ్రెండ్స్‌గా యాడ్ చేసుకున్న వీరందరినీ అడగండి అని సురేష్ చెప్పాడు. మీకో రహస్యం చెప్పనా! మన క్లాస్‌మెట్ పంకజాక్షి కూడా నా ప్రెండ్ సర్కిల్‌లో ఉంది అని చూపించాడు. 

ఏరా మేం మరీ అంత అమాయకుళ్లా కనిపిస్తున్నామా? చీమిడి ముక్కుతో, బక్కగా, టిబి పేషెంట్‌లా ఉండే పంకజాక్షి మాకు తెలియదనుకున్నావా? రాణిముఖర్జీ ఫోటో చూపించి పంకజాక్షి అంటావేమిటి? అని నిలదీశారు. అదే మీకు తెలియదు ఫేస్‌బుక్ ఫోటో అలానే ఉంటుంది. ఇంకా నయం ఒక్కోసారి ఫేస్‌బుక్‌లో మగవారు అకౌంట్ ఓపెన్ చేస్తే ఆడవారిలా ఫోటో వస్తుంది తెలుసా? అని సురేష్ అడిగాడు.


ఆ మధ్య పత్రికల్లో వచ్చింది ఒక మరుగుజ్జు వాడు ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయికి చా టింగ్‌లో కబుర్లు చెప్పి ప్రేమ పేరుతో డబ్బులు గుంజాడని తీరా చూస్తే వాడు మరుగుజ్జు కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వార్త చదివాను అని వినయ్, ముఖేష్ అమాయకంగా అడిగారు. అది వాడి తప్పు కాదు ఫేస్‌బుక్ ధర్మం. ఆ ఫిలాసఫీని ఆమె సరిగా అర్ధం చేసుకోక మోసపోయాననుకుంది. అని సురేష్ సీరియస్‌గా చెప్పాడు.
‘‘ఫేస్‌బుక్ జ్ఞానం ప్రకారం ఈ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కెజ్రీవాల్ ప్రధాని అవుతారు. ఫేస్‌బుక్‌లో రాహుల్‌కు ఆరు శాతం మంది ఓటు వేస్తే, కెజ్రీవాల్‌కు 94 శాతం మంది వేశారు.


మిత్రులకు కోపం ఆగలేదు చాల్లేరా ‘‘
జైపూర్‌లో ప్రమాదంలో తల్లి మరణించింది, తండ్రీకొడుకులు రక్షించమని మొత్తుకున్నా ఒక్కడూ స్పందించలేదు... అది మేమూ చూశాము టివిలలో 
తెనాలిలో ఒక్కడు స్పందించినా మా అమ్మ బతికేది...’’ అంటూ మరో అమ్మాయి చెప్పిన మాటలు మనలోని మానవత్వపు నటన చెంపను చెళ్లు మనిపించాయి కదా! మన జీవితాన్ని, మానవత్వాన్ని కంప్యూటర్‌కే పరిమితం చేస్తున్నాం. మానవత్వం ఫేస్‌బుక్‌లో కాదు మన ఫేస్‌లో ఉండాలి. వీడింతే అని మిత్రులిద్దరు వెనుదిరిగారు.

17, ఏప్రిల్ 2013, బుధవారం

రాజకీయ అందాలు -రౌతుకు గెలుపు గుర్రాల పోటు

వావ్ అంటూ సిగ్గువల్ల వచ్చిన బిడి యంతో ఆమె నోటిని పూర్తిగా తెరిచి రెండు చేతులతో ముఖం దాచుకుంది. స్థానిక మండల విలేఖరి మురుగయ్య పక్కనోడి జేబులో నుంచి పెన్ను, సర్పంచ్ చేతిలోంచి కాగితం తీసుకుని ‘‘మిస్ మీ జీవితాశయం ఏమిటి?’’అని రాసుకొచ్చిన ప్రశ్నను అడిగాడు. 

‘‘పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత లక్ష్యం. ఇప్పటి వరకు నా జీవితం నాది ఇకపై నా జీవితం ప్రజలది. ఈ జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాను. ప్రజల కోసమే జీవిస్తాను. వారి కళ్లలో ఆనందాన్ని చూడడమే నా జీవితాశయం. పేదల కోసం తిప్పాయపాలెం మొత్తం తిరుగుతాను, తరువాత మొత్తం జిల్లాను, కోస్తా, సీమ, తెలంగాణలో పర్యటిస్తాను. అలానే దేశ మంతా పర్యటిస్తా, ఆ తరువాత ప్రపంచ మంతా పర్యటిస్తాను. ఎక్కడా పేదరికం అనేది ఉండకూడదని శపథం చేస్తున్నాను’’ అంటూ గత వారం రోజుల నుంచి బట్టీ పట్టిన పాఠాన్ని జయప్రభ అప్పచెప్పింది .

 జయప్రద అంత అందంగా తనకు కూతురు పుట్టాలని జయప్రభ కడుపులో ఉన్నప్పుడు  తల్లి కోరుకుంది. ప్రభను మూగగా ప్రేమించిన తండ్రి ఆ ప్రేమను పైకి చెప్పుకోలేక అమ్మాయి పేరు ప్రభ అని పెట్టాలని భీష్మించాడు. మధ్యేమార్గంగా ఇద్దరి అభిమానుల పేర్లు కలిపి జయప్రభ అని పెట్టుకున్నారు. జయప్రభ గ్రామంలో కెల్లా తానే అం దగత్తెను అనే గట్టి నమ్మకం ఉండేది. గ్రామం లోని కుర్రాళ్ళు కుడా ఆవు నిజం  నీవు అనుకుంటున్నది  నిజం నిజం అని  కోరస్ గా  చెప్పే వాళ్ళు .

 జయప్రభ  నమ్మకానికి ఈరోజు అధికారిక ముద్ర పడింది. దాంతో సంతోషంలో తేలిపోతోంది. సర్పంచ్, మునసబు, గ్రామ మోతుబరి మనవ రాళ్ల మధ్య హోరా హోరీగా అందాల పోటీ జరిగి చివరకు ప్రజాస్వామ్య యుతంగా మిస్ తిప్పలాయపాలెంగా జయప్రభ ఎన్నికయ్యారు. ఎంతో కష్టపడి మండల కేంద్రం నుంచి విలేఖరులను కూడా పిలిపించి జయప్రభ ఇంటర్వ్యూ వచ్చేట్టు చేశారు. 

‘‘ముదనష్టపు దానా వచ్చే వారం నుంచి పరీక్షలున్నాయి కాస్త చదువుకొని తగలబడే అంటే మాట వినలేదు. అంత పెద్ద డైలాగు గడగడా చెప్పేసింది . రేపు క్లాసుకు రా నీ సంగతి చెబుతాను అని క్లాస్ టీ చర్   కనక లక్ష్మి మనసులోనే అనుకుంది  . ఆరువందల గడపలు ఉన్న గ్రామ మది. 

అదేం చిత్రమో కానీ విశ్వసుందరిగా ఎన్నికైనప్పుడు ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్‌లైనా మిస్ తిప్పాయపాలెం అయినా పేద ప్రజలను ఉ ద్ధరించడమే తమ జీవిత లక్ష్యం అని చెబుతారు. విశ్వసుందరిగా ఎన్నిక కాగానే మురికి వాడల్లో మురికి పిల్లలు, అనాధ ఆశ్రమంలో అనాధ పిల్లలతో అరగంట కబుర్లు చెప్పి ఆ దృశ్యాలు టీవిల్లో కొన్ని గంటల పాటు వచ్చేట్టు చూసుకుంటారు.


ఇంతకూ రాజకీయాలు వదిలేసి అందాల పోటీల గురించి ఎందుకు? అనే కదా సం దేహం. రాజకీయాలంటే అందాల పోటీలు కావని కేంద్ర మంత్రి జైరాం రమేష్ సెలవిచ్చారు. ఆయనా మాట ఎందుకన్నారో కానీ రాజకీయాలు, అందాల పోటీలు ఒకే రీతిలో జరుగుతాయి. ఐశ్వర్యారాయ్ విశ్వసుందరి పోటీల సమయంలో పేదల ఉద్ధరణే తన లక్ష్యం అని చెప్పిందా? లేదా? సరిగ్గా ఇవే మాటలు ప్రతి రాజకీయ నాయకుడు చెబుతుంటాడు. అందాల పోటీలకు అనేక రౌండ్స్‌లో పోటీ ఉన్నట్టుగానే రాజకీయ నాయకులకు ఐదేళ్ల పాటు అనేక రౌండ్స్‌లో పోటీలు ఉంటాయి. పేదరికం గురించి ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. ఇద్దరూ పోటీల తరువాత ఆ విషయం మరిచిపోతారు.

 దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనేది ఇద్దరి సిద్ధాంతం. అధికారంలో ఉన్నప్పుడే నాయకులు నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. అందంగా ఉన్నప్పుడు నా లుగు యాడ్స్, నాలుగైదు సినిమాలు కొట్టేయాలని అందగత్తెలు చూస్తారు.


రాహుల్‌గాంధీ, మోడీల మధ్య పోటీని చూసి జైరాం రమేష్ రాజకీయాలంటే అం దాల పోటీలు కాదని సెలవిచ్చారు. అందాల పోటీ అని ఒప్పుకోవడానికి జైరాంకు అభ్యంతరం ఏమిటో? ఇద్దరూ బ్రహ్మచారులే కూడా. ఒకరు స్వతంత్రంగా వ్యవహరిస్తారు, ఒకరు తల్లి చాటు బిడ్డ. ఒకరు స్వయం కృషితో ఎదిగిన వారు ఒకరు వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తిని అనుభవిస్తున్న వారు అంతే తేడా!


జైరాం అలా అంటే మన తెలుగు బాబేమో రాజకీయం అంటే గుర్రాల పోటీగా భావిస్తూ మేలు జాతి గుర్రాల కోసం అలుపెరగకుండా ప్రయత్నిస్తున్నారు. పేకాటలో డబ్బులు పోయిన వారు ఈ ఒక్క ఆటతో పోయిన సొమ్మంతా తిరిగి సంపాదించేద్దాం అని నిండా మునిగేంత వరకు ప్రయత్నిస్తారు. గుర్రాల పోటీల్లో కూడా అంతే! నిండా మునిగేంత వరకు తెలియదు. వరుసగా రెండు సార్లు నమ్ముకున్న గుర్రాలు నట్టేట ముంచడంతో ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు అంటున్నారు.


గుర్రాలకే నేతల భాష వస్తే...మంచి గుర్రాల కోసం రౌతు వెతికినట్టే, మంచి రౌతు కోసం గుర్రాలు వెతుకుతాయి. అనే విషయం తెలుస్తుంది.   గెలుపు గుర్రాల కోసం తెలుగు రౌతు వెతుకుతుంటే ఈ రౌతును నమ్ముకుంటే అతనితో పాటు మనమూ మునిగిపోతాం అని గుర్రాలు తోక జాడించి గెలిచే చాన్స్ ఉన్న రౌతు వద్దకు పరుగులు తీస్తాయ.


గుర్రాలు చంచలమైనవి ఒక చోట ఉండవు. ఆ విషయం వాటిని కొట్టుకొచ్చిన తెలుగు రౌతుకు కూడా తెలుసు. ఒక గుర్రం గోడ దూకితే 50 గుర్రాలను తయారు చేసుకుంటాను అంటున్నారు. గుర్రాలు గోడ దూకినప్పుడు కొత్త గుర్రాలను తయారు చేసుకోవడం మాంత్రికుడిని హతమార్చిన తోట రాముడికే సాధ్యం కాలేదు . వాళ్ల అల్లుడికి సాధ్యం అవుతుందా?

 గుర్రాలకు రౌతు మీదనే నమ్మకం పోయింది. అందుకే రౌతుకు వెన్నుపోటు పొడిచి వెలుతున్నాయి .  ఇప్పుడున్న శాసన సభ్యుల వసతి గృహం( ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్) నిజాం కాలంలో గుర్రాల శాల. కొన్ని భవనాలను మళ్లీ నిర్మించినప్పటికీ అప్పటి గుర్రాల శాల ఆనవాళ్లు, నిర్మాణాలు కొన్ని ఇంకా అలానే ఉన్నాయి. గుర్రాల వసతి శాలను ఎమ్మెల్యేల వసతి శాలగా మార్చాలనే ఆలోచన ఎందుకొచ్చిందో? చిత్రమే.  గుర్రాల శాల స్థల  ప్రభావం బాగానే పని చేస్తున్నట్టుగా ఉంది . 

10, ఏప్రిల్ 2013, బుధవారం

కట్జూ ‘మార్కండేయ’ పురాణం!

రాజ్‌నారాయణ్, కెఎపాల్, శేషన్ వంటి హేమా హేమీ లు భారీ కటౌట్లతో హాలు చూడ ముచ్చటగా ఉంది. వీరితో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన కొందరి ఫోటోలు, వారి అతి మేధావి తనం గురించి సంక్షిప్త పరిచయం రాసి ఉందక్కడ. అతి మేధావులను ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సదస్సు అది. మేధావులు ఏదో ఒక రంగంలో దేశానికి అవకాశం ఉన్నంత వరకు ఉపయోగపడతారు. తమ లోకం ఏదో తాముగా జీవిస్తారు. మేధావి తనం ఎక్కువయినప్పుడు అతి మేధావులవుతారు. ప్రారంభ జీవితంలో వీళ్లు కూడా మేధావులే కానీ ఆ గుర్తింపు కాస్తా ఎక్కువయిన తరువాత అతి మేధావులుగా మారుతారు.


కెఎ పాల్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మత బోధకుడిగా మారి సొంత విమానాలు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగారంటే సామా న్య విషయం కాదు. కచ్చితంగా మేధావే. అది కాస్తా ఎక్కువైన తరువాత ప్రపంచాన్ని నేనే నడిపిస్తున్నాను, అమెరికా అధ్యక్షున్ని మార్చేస్తాను, ప్రభువుతో ఇప్పుడే మాట్లాడాను అంటూ అతి మేధావుల జాబితాలో చేరారు.


రాజ్‌నారాయణ్ ఇందిరాగాంధీని ఓడించిన నాయకుడు. అదే ఆయన కొంప ముంచి అతి మేధావిగా మార్చేసింది. రాజకీయాల్లో పిచ్చి మాటలు పిచ్చి చేష్టలతో అతి మేధావులకు అన్నగా మారి... పోయారు. ప్రపంచంలోనే ఎంతో పేరున్న యూనివర్సిటీల్లో పాఠాలు చెప్పే సుబ్రమణ్యస్వామి సైతం పాపం మేధావి తనం పెరిగిపోయి అతి మేధావిగా మారిపోయారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అంటూ ఒకటి ఉంటుందనే విషయమే చాలామందికి తెలియని సమయం లో ఆ కమిషన్ పగ్గాలు చేత బట్టారు .   రాజకీయ నాయకులను హడలెత్తించి, ప్రధానమంత్రిని మించిన పాపులారిటీ సంపాదించిన శేషన్ మేధావి తనం పెరిగిపోవడంతో రాజకీయాలు నేర్పిస్తాను అంటూ రాజకీయ కాలేజీ పెట్టి పెట్టుబడి కూడా తిరిగి రాక తలతిక్క శేషన్‌గా మారిపోయారు.


ఇలాంటి అతి మేధావులందరినీ గుర్తు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన సదస్సులో మార్కండేయ కట్జూ ప్రధాన ఉపన్యాసం ఇవ్వసాగారు.
‘‘మన మెదళ్లు పేడ, చెత్త, దుమ్ము, దూళితో నిండిపోయి, కుళ్లి పోయాయి ’’ అని మార్కండేయ కట్జూ అనగానే ఒక్కసారిగా అక్కడ హాహా కారాలు చెలరేగాయి. మనం వెధవలం, మతతత్వ వాదులం అంటూ ఉపన్యాసం దంచేస్తున్నారు. అంతా లేచి ఏదో అరవ సాగారు.


 మార్కండేయ మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆజాను బాహువైన మార్కండేయకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నేనన్న ప్రతి మాటను ఇక్కడే నిరూపిస్తాను? సవాల్ విసిరారు. నిరూపించాలని కొందరు పట్టు పట్టారు. నేనేమన్నాను అంటూ మార్కండేయ ప్రశ్నించాడు. మన మెదడు, పేడ, చెత్తతో కుళ్లిపోయిందన్నాను కదా? అంటూ ఒక్క క్షణం ఆగారు. సభా ప్రాంగణంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆరడుగులపైనే ఉన్న కట్జూ ఒక్కసారి సభలో ఉన్న అందరికీ కనిపించేట్టుగా తన తలను కిందకు వంచాడు. మళ్లీ సభలో కలకలం చెలరేగింది. అంతా ఆశ్చర్యపోయారు. నిజమే ఆయన మెదడులో పేడ, చెత్త స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ చెత్తను చూసి కొందరు నోరెళ్లబెడితే, వాసన భరించలేక కొందరు ముక్కు మూసుకున్నారు.


ఈ మార్కండేయ ఏదైనా ఆధారం లేనిదే మాట్లాడరు, ఇక నేను చెప్పేది వౌనంగా వినండి అని హూంకరించారు. ఎందుకైనా మంచిదని మార్కండేయ అభిమానులు తమ తలపై చేయి పెట్టి చూసుకున్నారు. చేతికి పేడ అంటింది. ఔను నిజం మార్కండేయ చెప్పింది నిజం.. నిజం అని గట్టిగా చప్పట్లు కొట్టి మద్దతు తెలిపారు.


దేశంలో 90 శాతం మందిమి మూర్ఖులం, 80 శాతం మంది మతతత్వ వాదులు. 4.1 శాతం మంది తలతిక్క వాళ్లు, 5.2 శాతం మంది ఏం మాట్లాడతారో వారికే తెలియదు అంటూ వెంకట్రామా అండ్‌కో ఎక్కాల పుస్తకంలోని అంకెలన్నీ కళ్ల ముందు చూపించసాగారు.
గంభీరంగా ఉపన్యాసం సాగుతుంటే కింది నుంచి ఒకరు...గురుడు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఏం చేశాడో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడని గట్టిగానే అడిగారు.
‘‘ఏమన్నారు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఏం చేశారు అని అడుగుతున్నారా?’’


దేశంలో గతంలో ఎవరూ చేయని భవిష్యత్తులో ఎవరూ చేయలేని పని చేశాను ఒకసారి కాదు రెండు సార్లు సుప్రీంకోర్టులో ముషాయిరా (గానా భజానా) నిర్వహించాను. ఇంత దమ్ము ఇంకెవరికైనా ఉందా? అని మార్కండేయ నిలదీశారు. అరే మనకా సంగతి తెలియదే గొప్ప చాన్స్ మిస్సయ్యాం, తెలిస్తే, బోగం మేళ కూడా నిర్వహించాలని డిమాండ్ చేసి ఉండేవాళ్లం అని తెలుగోడు పక్కనున్న వాడితో చెప్పుకున్నాడు.


మీకు ఇంకెన్నో చిత్రమైన విషయాలు చెబుతాను వినండి ఈ దేశ ప్రధానమంత్రి హిందీలో పాటలు పాడలేరు, పంజాబ్ వాడైనా బాంగ్రా డ్యాన్స్ చేయలేరు. కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసిపోవాలి. శ్రీలంక సమస్య పరిష్కారం కావాలంటే శ్రీలంక ఇండియా కలిసి పోవాలి. ఇరాన్ సమస్యకు పరిష్కారం ఇరాన్ అమెరికాలో విలీనం కావాలి. ఇరవై ఏళ్లలో ఇది జరిగి తీరుతుంది. ఇలాంటి ఐడియాలు నా వద్ద బోలెడు ఉన్నాయి అని చెప్పుకుపోతున్నాడు.


ఆ ఉపన్యాసం వింటున్న మార్కండేయ అభిమానులు ఆయన అతి మేధావి తనానికి బుర్ర తిరిగిపోయింది. ఇంతటి మహా మేధావిని ఇలా ఊరికే ఉంచడం అన్యాయం. లోక్‌సభకు ఎన్నడూ పోటీ చేసి గెలవని వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిన అమ్మ, ఈసారి మరో అడుగు ముందుకు వేసి జీవితంలో ఎన్నడూ ఓటు వేసి ఎరుగని ఈ అతి మేధావిని ప్రధానమంత్రిని చేయడం ద్వారా ప్రపంచ సమస్యలు పరిష్కరించడానికి పూనుకోవాలి అంటూ ఆయన అభిమానులు డిమాండ్ చేశారు.

3, ఏప్రిల్ 2013, బుధవారం

చీకటి శాశ్వతం.. వెలుగు భ్రమ!

విద్యుత్ కోత పుణ్యమా అని జనానికి జీవిత సత్యం బోధపడింది. చీకటి శాశ్వతం, వెలుగు భ్రమ అనే నగ్న సత్యం తెలిసొచ్చింది. మబ్బులు అడ్డం వచ్చినప్పుడు సూర్యుడు కొద్ది సేపు కనిపించకుండా పోతాడు. మబ్బులు తొలగిపోగానే మళ్లీ ప్రత్యక్షం అవుతాడు. చీకటి కూడా అంతే లైటు కొద్దిసేపు వెలిగినప్పుడు హుందా గా కొద్దిసేపు చీకటి తప్పుకుంటుంది. శిశువు తల్లిగర్భంలోని అనంతమైన చీకటితోనవమాసాలు సహజీవనం చేస్తాడు. జీవిత నాటక రంగంలో తన పాత్ర ముగియగానే మళ్లీ అనంత చీకటిలో శాశ్వతంగా కలిసిపోతాడు. ముందు చీకటి తరువాత చీకటి మధ్యలో వెలుగు మూడునాళ్ల ముచ్చటే. ఈ మూడునాళ్ల ముచ్చట కోసం నాయకులు పోటీపడి నాలుగేసి రోజుల దీక్షలు సాగిస్తున్నారు.

 ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటి వాయ నం అంటూ ఆడవాళ్లు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నట్టుగా, ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్‌లో నాలుగేసి రోజుల దీక్ష వాయినాలు సాగుతున్నాయి. పేరంటానికి అమ్మలక్కలంతా వచ్చినట్టు వామపక్షాల నాలుగు రోజుల దీక్షకు టిడిపి, టిఆర్‌ఎస్, బిజెపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు. ఆ తరువాత టిడిపి పేరంటానికి మిగిలిన వాళ్లు వచ్చారు. మీది ఉమ్మడి కుటుంబం అయితే మాది ఇద్దరు లేక ముగ్గురు చాలు అనుకునే చింతలు లేని చిన్నకుటుంబం అంటూ బిజెపి వాళ్లు దీక్ష మొదలుపెట్టారు. ఎంత శత్రువైనా పేరంటానికి పిలిచినప్పుడు వెళ్లడం ధర్మం. అందుకే లెఫ్ట్ రైట్ అనే తేడా లేకుండా దశాబ్దాల శత్రుత్వాన్ని సైతం పక్కన పెట్టి లెఫ్ట్ పేరంటానికి బిజెపి వెళ్లింది, బిజెపి పేరంటానికి లెఫ్ట్ నేతలు వెళ్లారు. ముఖ్యమంత్రి మాత్రం చిన్నపార్టీ పెద్ద పార్టీ అనే తేడాలేకుండా అందరికీ నాలుగేసి రోజుల పాటు దీక్షకు అవకాశం ఇచ్చారు. పనిలో పనిగా కాంగ్రెస్ వాళ్లు కూడా దీక్ష చేస్తే భలేగా ఉండేది. కాంగ్రెస్ నాయకులు ఒకే చోట నాలుగు రోజులు కుదురుగా కూర్చోలేరు. కానీ మాటల్లో మాత్రం విపక్షాలను మించి మాట్లాడారు.


వెలుగుల కోసం నాయకులు చేసే ఉద్యమాలు పెళ్లి సందడిని గుర్తుకు తెస్తున్నాయి. నాయకులు జనం వెలుగు కోసం దీక్షలు చేస్తున్నారని ఎవరైనా అనుకుంటే రాజకీయంగా వాళ్లు ఇంకా చిమ్మచీకటిలో ఉన్నట్టే లెక్క. అధికారం లేక చీకటిలో ఉన్న తమకు మళ్లీ వెలుగు రోజులు వస్తాయన్న ఆశతోనే దీక్ష చేస్తారు. చీకటిలోనే నాయకుల వెలుగులు దాగుంటాయి. వారు కోరుకునేది చీకటినే. తమ ప్రత్యర్థి పాలన చీకటిమయం కావాలని, తమ ప్రత్యర్థి పాలించే కాలంలో ప్రజల జీవితాలు చీకటి మయం కావాలని అధికారంలోకి రావాలనుకునే ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. ఎందుకంటే వారికి అధికారం లభించేది చీకటి నుంచే.
రాజకీయాలకు చీకటికి అవినాభావ సం బంధం ఉంది. మీ పాలన చీకటి రోజులను గుర్తుకు తెస్తుంది అంటాడు ప్రతిపక్షం ఆయన అధికార పక్షం వాళ్లను. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు ఈ డైలాగులను ఉపయోగించే అధికారంలోకి వచ్చి ఉంటారు.


 అందుకే నేమో ఈ మాటలు విని దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్యకు దేవుడు గుర్తుకొచ్చాడు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఉద్యమం ఇలానే ఉండేది. ఈ ఉద్యమం పుణ్యమా అని టిడిపి పాలన చీకటిలో కలిసిపోయింది, చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన సైతం అలానే చీకటిలో కలిసిపోయేట్టుగా అనిపిస్తోంది అని ఆయన కెమెరాల వెలుగులోనే మనసులోని మాట చెప్పుకొచ్చారు. ఆయనకు టిడిపి అనుభవం ఉంది, కాంగ్రెస్ అనుభవం ఉంది, మధ్యలో ప్రజారాజ్యం అనుభవం అదనం కాబ ట్టి ఆయన మాటలను తేలిగ్గా తీసిపారేయలేం అంటున్నారు కాంగ్రెస్ అసమ్మతి వాదులు .

 టిడిపి చీకటిపాలనపై ఉద్యమించి ఇప్పుడు చీకటి పాలనకు ప్రాతినిధ్యం అందిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అప్పుడెప్పుడో ఉల్లిగడ్డలు కూడా ఢిల్లీలో ఒక ప్రభుత్వాన్ని దించాయి, మరో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు వచ్చాయి. కాబట్టి రాజకీయాల్లో దేన్నీ తేలిగ్గా తీసుకోలేం. నాయకులు చీకటిని ప్రేమిస్తారు, కానీ వారి జీవితం మాత్రం వెలుగుల మయం, ప్రజలు వెలుగును కోరుకుంటారు కానీ వారి జీవితం మాత్రం చీకటిమ యం.
ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందే అర్ధరాత్రి చిమ్మచీకటిలో... చచ్చి సాధించడం అంటే ఇదేనేమో తమ చీకటి పాలనను ముగించి తెల్లోడు వెళుతూ వెళుతూ చీకట్లోనే స్వాతం త్య్రం ప్రకటించడం ద్వారా మనకు చీకటి పాలన శాశ్వతం చేసేశాడేమో!


బ్రిటీష్‌వాడు చీకట్లో ఇచ్చిన స్వాతంత్య్రాన్ని గౌరవిస్తూ మన నాయకులు చీకటి పాలననే అందిస్తున్నారు. అన్నీ చీకటి ఒప్పందాలే.... చీక టి పనులే... చివరకు విద్యుత్ కోతలతో జనం తప్పనిసరిగా చీకటిని ప్రేమించేట్టు చేస్తున్నారు.


ఎప్పుడో ఒకసారి తళుక్కున మెరుపులా మెరిసిపోయే కరెంట్ వెలుగు  కన్నా రోజూ వెన్నంటి ఉండే చీకటిపైన వద్దన్నా ప్రేమ పుట్టకుండా ఉంటుందా? పాండవులు స్వర్గానికి వెళ్లేప్పుడు ఒకరి తరువాత ఒకరు పడిపోగా, చివరి వరకు ధర్మరాజును ఒక కుక్క వెన్నంటి నిలిచింది. కుక్క విశ్వాసానికి చలించిపోయిన ధర్మరాజు తనతో పాటు ఆ కుక్కకు కూడా స్వర్గానికి అనుమతించాలని కోరాడట! కొన్ని గంటల పాటు తనతో నడిచిన కుక్కకే స్వర్గప్రాప్తి కలిగించాలని ధర్మరాజు అనుకున్నప్పుడు రోజుల తరబడి మనతో ఉండే చీకటిపై మనకు ఆ మాత్రం ప్రేమ పుట్టకుండా ఉంటుందా?


సమస్యలన్నీ వెలుగులోనే ఉన్నాయనిపిస్తోంది. విద్యుత్ కనుగొనడానికి ముందు మనుషుల జీవితాలు కొండల్లో , అడవుల్లో, గుట్టల్లో ప్రకృతిలో ఎంత హాయిగా ఉండేది. విద్యుత్తే లేనప్పుడు ఇక బిల్లులెక్కడివి, కోతలెక్కడివి. మళ్లీ అలాంటి అపురూపమైన కాలంలోకి తీసుకు వెళుతున్న పాలకులకు మనం సదా రుణపడి ఉండాలి.