25, మార్చి 2014, మంగళవారం

వై యస్ ఆర్ అలా దెబ్బ తీశాడు చిరంజీవిని .. కొందరి వాడు

నర్సాపూర్ దగ్గర గ్రామం -మొగల్తూరు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినూరు. సొంతిల్లూ ఇక్కడే ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన తరువాత.. -ఎన్నికల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అక్కడికెళ్లారు. సొంతూళ్లో.. సొంతింటిని గ్రంథాలయం ఏర్పాటుకు ఇవ్వని ఈయన రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేస్తాడంటే నమ్ముతున్నారా? -అంటూ సెటైర్ వేశారు. అది చిరంజీవి గుండెల్లో గునపంలా గుచ్చుకుంది. ‘హమ్మో రాజకీయాలు’ అనుకున్నాడు. రాజకీయ ఆట అంటే ఏమిటో ఆ దెబ్బతో మెగాస్టార్‌కు తెలిసొచ్చింది. చిరంజీవి ఇంటిని గ్రంధాలయంగా మార్చాలని  చాలా కాలం క్రితం  గ్రామస్తులు అడిగితే , చిరంజీవి ఒప్పుకోలేదు .. ఇంటిని అమ్మేశారు 


చిరంజీవి ‘అందరివాడు’ -హీరో. మేమూ అలాగే అనుకుంటే -ఆంధ్రావాడని నిరూపించాడని తెలంగాణ వాళ్లు తెగుడుతారు. మావాడూ కాదు -మంత్రి పదవి కోసం సీమాంధ్రను దగా చేసిన మోసగాడంటూ సీమాంధ్రులూ తిడతారు.


ఇదీ రాష్ట్రంలోని -రెండు ప్రాంతాల్లో చిరంజీవి పరిస్థితి. సినిమాల్లో మామాలు స్థాయిలో అడుగుపెట్టి మెగాస్థాయికి చేరుకున్న చిరంజీవి -రాజకీయాల్లో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మిగిలిపోయారు. అన్నా నువ్వు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలి. నా మరణమైనా నీలో కదలిక తీసుకురావాలి -అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడో అభిమాని ఖమ్మంలో. బహుశా.. భారతదేశంలో ఎక్కడా -పొలిటికల్ పార్టీ పెట్టమని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాగడా పెట్టి వెతికినా కనిపించదు. ఎన్టీఆర్ తనంతట తానే పార్టీ పెట్టాడు. కానీ చిరంజీవిని మాత్రం ఎంతోమంది అభిమానులు కోరితేనే పార్టీ పెట్టారని చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అల్లు బావ అరవింద్ చెప్పుకొచ్చారు. నిజమే కానీ -పార్టీ పెట్టాక అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఖమ్మంలో ఒక్క సీటు కూడా రాలేదు. ఇదీ, ఇదే నిజం.
53 ఏళ్ల వయసు అంటే ఒక ఉద్యోగి తన బాధ్యతలు పూర్తి చేసుకోవాలి. రిటైర్‌మెంట్ వయసు దగ్గరపడుతోంది అని కంగారుపడుతుండాలి. కానీ -రాజకీయ నేతకు అది నవ యవ్వనం. మరి సినిమా హీరోకు ఆ వయసు సంధియుగం. చరిష్మా కుంగి.. హీరోగా అవకాశాలు తగ్గి.. ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన తరుణం. ఎన్టీఆర్ హయాంలో హీరోల రిటైర్‌మెంట్ వయసు 60ఏళ్లు. చిరంజీవి కాలానికి అది 53ఏళ్లకు దిగింది. తనకున్న అపారమైన ఇమేజ్ ఒకవైపు, హీరోగా అవకాశాలు తగ్గిపోతున్న పరిస్థితి మరోవైపు.. రెంటినీ బేరీజు వేసుకుని ఇదే సరైన సమయమనుకుని చిరంజీవి 2008లో ప్రజారాజ్యం జెండా ఎగరేశారు. హీరో దారి మళ్లడానికి అది సరైన వయసు కావచ్చు, కానీ రాజకీయ రంగంలో అది సరైన సమయం కాదని ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. ఒకవైపు తన పథకాలతో జనంలో వైఎస్సార్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. బలమైన ప్రతిపక్షంగా తెదేపా తన స్థానాన్ని పదిలపర్చుకుంది. ఈ రెండు పక్షాలకు బలమైన మీడియా మద్దతూ ఉంది. ఇలాంటి అననుకూల పరిస్థితిలో రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి -తన లక్ష్యాన్ని చేరుకోలేక పోయారు.


అంతా రెడీ అయ్యాక షాట్‌కు పిలిస్తే చెప్పినట్టు చేసి మెప్పించటం -నటన. అన్నిటికీ బాధ్యత వహించి అందరినీ మెప్పించటం -రాజకీయం. ఈ రెంటికీ తేడా తెలిసి సారాన్ని గ్రహించే సరికి జెండా పీకేయాల్సిన సమయం ఆసన్నమైంది. తెల్ల ఏనుగులాంటి ప్రజారాజ్యాన్ని నడపడం వల్లకాదని గ్రహించిన తరువాత కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం పొంది కేంద్ర మంత్రి అయ్యారు. చిరంజీవి ఉదంతం సినిమా వాళ్లకు జ్ఞానోదయం కలిగించే చక్కని అంశం. తెరమీద గ్లామర్ సీన్లు చూసి చప్పట్లు కొట్టే అభిమాన జనమంతా పోలింగ్ బూత్‌కు పరిగెత్తుకొచ్చి ఒటువేసే జనం కాదని సినిమా వాళ్లందరికీ తెలిసి వచ్చేట్టు చేశారు చిరంజీవి. రీల్ హీరోలు.. రియల్ హీరోల మధ్య వ్యత్యాసం ‘చిరు’-సన్నివేశంతో సినిమా వాళ్లకు అర్థమైనట్టే.
ముక్తాయింపు: అందరివాడు కాదు మోసగాడంటూ -విభజన తరువాత తిట్టిపోస్తున్న సీమాంధ్రలోనే కాంగ్రెస్‌ను గెలిపించే ప్రచార బాధ్యతలు చిరంజీవి మోయాల్సి రావడం.