29, నవంబర్ 2013, శుక్రవారం

ఆశలు రేకెత్తిస్తున్న ఆమ్ ఆద్మీ కేజ్రివాల్.. విఫలమైన లోక్ సత్తా జెపి


ఐదు రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ రాష్ట్రం ఎన్నికల ఫలితాల పట్ల అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం పురుడు పోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుండడమే దీనికి ప్రధాన కారణం. అవినీతికి వ్యతిరేకంగా జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఉద్యమించిన సమయంలో కెజ్రీవాల్ తెరపైకి వచ్చారు. అంతకు ముందు వివిధ ఉద్యమాల్లో ఆయన ఉన్నా జన్‌లోక్‌పాల్ ఉద్యమ సమయంలోనే ఎక్కువగా యువత దృష్టిని అకట్టుకున్నారు.
70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఐతే కాంగ్రెస్ లేదంటే బిజెపి, ఒకసారి నువ్వు మరోసారి నేను అన్నట్టుగా ఎన్నికలు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఢిల్లీ ఎన్నికలను మూడు ముక్కలాటగా మార్చేసింది. వివిధ సర్వేల్లో దాదాపుగా ఈ మూడు పార్టీలకు సమానంగా సీట్లు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆమ్ ఆద్మీ అయితే కింగ్ మేకర్ లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాది వయసు పార్టీ, దానికి నాయకత్వం వహిస్తున్న కెజ్రీవాల్ యువకుడే. ఒక ఉద్యోగి. ఢిల్లీ ప్రయోగం విజయవంతం అయితే ఆ ప్రభావం కచ్చితంగా దేశ వ్యాప్తంగా కనీసం మహానగరాల్లోనైనా కనిపిస్తుంది. ముఖ్యంగా మహానగరాల్లో కొత్త తరం రాజకీయాల్లోకి రావచ్చు.
ఒకప్పుడు మన రాష్ట్రంలో లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్‌పై యువతలో ఇలాంటి అభిప్రాయమే ఉండేది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎఎస్ అధికారిగా కీలక స్థానంలో ఉన్న జయప్రకాష్ నారాయణ్ బాబు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే లోక్‌సత్తా పేరుతో తొలుత ఒక సంస్థను స్థాపించి పాలనా సంస్కరణలపై పలు సదస్సులు నిర్వహించి తరువాత 2006లో రాజకీయ పార్టీగా మార్చారు. విద్యావంతులైన యువత, మధ్యతరగతి ముఖ్యంగా భాగ్యనగరంలో జయప్రకాశ్‌పై ఇలాంటి ఆశలే అప్పుడు కనిపించాయి. 
చంద్రబాబుకు ఏ మీడియా, ఏ సామాజిక వర్గం మద్దతు ఇచ్చిందో, జెపికి అదే వర్గం మద్దతు పలికింది. చంద్రబాబు రాజకీయాల్లో విఫలం అయితే బాబుకు ప్రత్యామ్నాయంగా జెపిని ఆ వర్గం మీడియా ప్రోత్సహిస్తోంది అనే ప్రచారం లోక్‌సత్తా పార్టీ ఏర్పడినప్పుడు బలంగా జరిగింది. ఈ ప్రచారంలో నిజానిజాలు ఎలా ఉన్నా, లోక్‌సత్తాకు మాత్రం ఆ వర్గం నుంచి బ్రహ్మాండమైన ప్రచారం, మద్దతు  లభించింది. అదే ఢిల్లీలో చూస్తే ఆమ్ ఆద్మీకి ఏదో ఒక వర్గం మీడియా కాకుండా మొత్తం మీడియా నుంచి మద్దతు లభిస్తోంది. లోక్‌సత్తాకు ఆ వర్గం ప్రచారం చివరకు వారికే నష్టం కలిగించింది. ఐటి ఉద్యోగులు, విద్యావంతులు, మధ్యతరగతి వర్గాల మద్దతు సాధారణంగా టిడిపికి ఉంటుంది. టిడిపికి చెందిన వీరిలో కొంత మంది 2009లో హైదరాబాద్‌లో లోక్‌సత్తావైపు మొగ్గు చూపారు. దాంతో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్‌కు ప్రయోజనం కలిగింది. స్వల్ప మెజారిటీతో 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి హైదరాబాద్‌లోని సీట్లు దోహదం చేశాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత లోక్ సత్తా కలిగించిన నష్టానికి  టిడిపి కంగుతిని, లోక్‌సత్తాపై దాడి మొదలు పెట్టింది. జెపి సోనియా ఏజెంట్ అని అందుకే ఆమె జెపికి జాతీయ స్థాయిలో పదవి ఇచ్చారని టిడిపి ఆరోపించింది .. బాబు, యనమలతో పాటు పలువురు టిడిపి నేతలు  జెపికి వచ్చే నిధుల గురంచి అనేక ఆరోపణలు చేశారు .. అదే విధంగా బు పాలన గురించి జెపి ఆరోపణలు చేశారు ... మరి జెపి తాను  చేసిన ఆరోపణలు వాస్తవం కాదని ఒప్పుకున్నారో, లేక జెపి పై తాము చేసిన ఆరోపణలు నిజం కాదని టిడిపి ఒప్పుకుందో? అంతర్గతంగా ఏం జరిగిందో కాని ఇప్పుడు ఆ రెండు పార్టీల వాయిస్ ఒకటే అయింది . దత్తపుత్రుడు , అద్దె పుత్రుడు , తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ , తెలుగు జాతిని చిల్చడం వంటి డైలాగులు రెండు పార్టీలు కామన్ గా  వాడేస్తున్నాయి 

చంద్రబాబుతో పాటు కింద స్థాయి నాయకుల వరకు తనపై విమర్శల దాడి మొదలు పెట్టడంతో జెపి ఉక్కిరి బిక్కిరయ్యారు. చివరకు  ఇప్పుడు విభజన అంశం తో లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ్  టిడిపికి చేరువయ్యారు.

తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం ప్రకటించగానే స్వాగతం పలుకుతూ తన అభిప్రాయం వెల్లడించిన జయప్రకాష్ నారాయణ్ ఆ తరువాత ప్లేటు ఫిరాయించారు. సమన్యాయం జరిగేంత వరకు విభజనపై ముందడుగు వేయవద్దని బాబు చెప్పినట్టుగానే జెపి చెబుతున్నారు. విభజన, సమైక్యంపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. కానీ సాంప్రదాయ పార్టీలు అని ఇంత కాలం ఇతర పార్టీలను విమర్శిస్తూ వచ్చిన జెపి ఇప్పుడు వాటిమార్గం లోనే నడవడం  విశేషం.
లోక్‌సత్తా ఆవిర్భవించి ఏడేళ్లయిన సందర్భంగా జెపి మాట్లాడుతూ కూకట్‌పల్లిలో ప్రజలు లోక్‌సత్తాకు ఎందుకు ఓట్లు వేశారు, మిగిలిన ప్రాంతాల్లో ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. గెలిచిన చోట తమ చరిష్మా పని చేసిందని, ఓడిన చోట అభ్యర్థుల లోపం అని ఏ పార్టీ నాయకుడైనా చెప్పే మాటనే జెపి చెప్పారు.
కుకట్ పల్లి నియోజక వర్గాన్ని జెపి ఎంపిక చేసుకోవడం లోనే సాంప్రదాయ రాజకీయాలు ముడిపడి ఉన్నయి.  కూకట్‌పల్లిలో  ఆయన గెలుపులో సైతం సాంప్రదాయ రాజకీయాలు పని చేశాయి. 2009లో టిఆర్‌ఎస్, టిడిపి పొత్తు పెట్టుకున్నాయి. కొత్తగా ఏర్పడిన కూకట్‌పల్లి నియోజక వర్గంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి స్థిరపడిన వారే ఎక్కువ. వీరిలో టిడిపికి అండగా నిలిచే సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉంది. అయితే ఈ నియోజక వర్గంలో టిడిపి పోటీ చేయకుండా టిఆర్‌ఎస్‌కు కేటాయించారు. సాంప్రదాయంగా టిడిపికి ఓటు వేసే ఈ వర్గం మొత్తం జెపికి అండగా నిలిచింది.
ఆ తరువాత మున్సిపల్ కార్పోరేషన్  వార్డులు సైతం లోక్‌సత్తా గెలుచుకోలేక పోయింది. రాష్ట్ర విభజన నిర్ణయం తరువాత మారిన పరిస్థితుల్లో ఇప్పుడు  రెండు పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంది. లోక్‌సత్తా వల్ల ఒకటి రెండు శాతం ఓట్లు కోల్పోవడం కన్నా ఒక సీటు ఇవ్వడం లాభసాటి బేరం అని టిడిపికి తెలుసు.
ఐఎఎస్ అధికారిగా ఎంతో పాలనానుభవం సైతం ఉన్న జెపి లోక్‌సత్తా ప్రయోగం రాష్ట్రంలో విఫలం అయినట్టే. అదే ఢిల్లీలో కెజ్రీవాల్ మాత్రం మధ్యతరగతిలో, యువతలో ఆశలు రేకెత్తిస్తున్నారు. కెజ్రీవాల్ అధికారంలోకి రాకపోవచ్చు కానీ కచ్చితంగా ఢిల్లీ అసెంబ్లీలో ప్రభావం చూపిస్తారు. ఏడేళ్ల ప్రస్థానంలో జెపి రాజకీయ నాయకునిగా సామాన్యులకు చేరువ కాలేకపోయారు. ఒక వర్గం మద్దతు పొందిన జెపి చివరకు ఏడేళ్ల ప్రస్థానంలో ఆ వర్గం మద్దతు సైతం కోల్పోయారు.

27, నవంబర్ 2013, బుధవారం

తేజ్‌పాల్.. కెజ్రీవాల్.. సత్య హరిశ్చంద్రుడు ..చిలుకల సిద్ధాంతం

ఏ గుంపులోని చిలకలు ఆ గుంపు పలుకులే పలకాలి, నా రూటు సపరేటు అంటూ ఆ గుంపులోని పక్షి వేరుగా మాట్లాడితే తోటి చిలకలు ముక్కుతో పొడిచిపొడిచి చంపేస్తాయి. గతంలో జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని మంత్రులు, పోలీసు అధికారులు రోజూ పిలు పు ఇచ్చేవారు. రెండు చేతులా సంపాదిస్తూ పి ల్లా పాపలతో హాయిగా ఉండకుండా కొంత మంది సమ సమాజం, తొక్క తోలు అంటూ ఏవేవో మాటలకు, పాటలకు ఆకర్షితులై అడవుల బాట పట్టేవాళ్లు. అలాంటి వేరు చిలకులు తమ గుంపులో కలిసిపోవాలని చెప్పడానికి జన జీవన స్రవంతిలో కలవాలని, అంటే మాలా సంపాదనలో మునిగిపోవాలని కోరుతూ పెద్ద లు పిలుపు ఇచ్చేవారు. కొత్త చిలుక సొంతంగా బియ్యపు గింజలు సంపాదించుకోవడం కష్టం కాబట్టి జనజీవన స్రవంతిలో కలిసిన చిలుకలకు డబ్బులు కూడా ఇచ్చేవాళ్లు. ప్రతి చిలుకా తమలానే ఉండాలని చిలుకలు కోరుకోవడం లోక సహజం. సత్య హరిశ్చంద్రుడి కథ తెలుసు కదా! సురులు, అసురులు, శత్రువులు మిత్రులు అందరూ ఆయన్ను కష్టాలు పాలు చేశారు. రాజ్యపాలన చేయాల్సిన ఆయన స్మశాన వాటికలో ‘ఇచ్చోటనే..’ అంటూ పాటలు పాడుతూ కాపలా కాయాల్సి వచ్చింది. ఎందుకలా అని ప్రశ్నిస్తే, ఇంకెందుకు దేవతలంతా హరిశ్చంద్రుని సత్యసంధతను లోకానికి చాటేందుకు అలా పరీక్షలు పెట్టారు. అని చెబుతారు. ఇది నిజంగా నిజమా? అనుమానమే?

ఇప్పట్లా అప్పుడు మీడియా ఉండి ఉంటే హరిశ్చంద్రుడితో ఆఫ్‌ది రికార్డ్‌గా మాట్లాడిస్తే ఏం తేలేది? అందరూ అబద్ధాలతో జీవిస్తుంటే, నిజం చెప్పడం తప్పని నా జీవితం ద్వారా నేను గ్రహించాను అని చెప్పేవాడేమో! లోహితాస్యుడిని అడిగితే చచ్చాక నిజం చెప్పవద్దనే సత్యాన్ని గ్రహించానని చెప్పేవాడేమో! మహారాణిలా అధికారం చలాయించాల్సిన నేను అష్టకష్టాలు పడాల్సి వచ్చిందంటే మా ఆయన అబద్ధం చెప్పక పోవడం వల్లే కదా కాబట్టి సత్యం చెప్పకండి అని హరిశ్చంద్రుడి భార్య హితబోధ చేసేవారేమో! ఇంతకూ హరిశ్చంద్రునికి ఆ పరీక్షలన్నీ ఎందుకు పెట్టారు అంటే చిలక సిద్ధాంతం గుర్తొస్తోంది. మేమంతా అబద్ధాలపై జీవించే చిలుకలం, అస్సలు అబద్ధం చెప్పని చిలకగా నువ్వు ఉండాలనుకోవడం సహించరాని నేరం అనే ఆగ్రహంతోనే అందరూ హరిశ్చంద్రునికి అలా పరీక్షలు పెట్టారేమో! చిలకల్లో చిలకలా చేరిపోయి చిలక పలుకులు పలికితే హాయిగా గడిచిపోతుంది. దారి తప్పారా?అంటే దారి లేకుండా చేస్తారు.


అరవింద్ కెజ్రీవాల్ అనే యువకుడొకరు తన ఉద్యోగమేదో తాను చేసుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో వచ్చాడు సరే అందరి మాదిరిగా తెల్లని బట్టలు, నల్లని ఆలోచనలతో రాజకీయ వ్యాపారం సాగించవచ్చు కదా? ఎన్నికల సమయంలో నేతలు చీపురు పట్టుకుని ఊడు స్తూ మీడియాకు ఫోజులిస్తుంటారు. కెజ్రీవాల్ కూడా అలా చీపురు పట్టుకుంటే సర్లే మన గూటి పక్షే అనుకున్నారు. ఆయన మాత్రం మా గూడు వేరు, మా రెక్కలు వేరు, మేం ఎగిరే తీరే వేరు అంటూ అప్పటి వరకు గుంపులు గుంపులుగా ఉన్న చిలకలన్నింటిపై దాడి మొదలు పెట్టాడు. కొత్త పక్షులను తీసుకు వచ్చి తమపై దాడిగి దిగడంతో కొమ్ములు తిరిగిన పాత పక్షులు కొద్ది సేపు వౌనంగానే ఉన్నాయి. అంతలోనే చానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్. ఊరూపేరులేని సందట్లో సడేమియా అనే మీడియా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి కెజ్రీవాల్ పార్టీ నాయకులు సెటిల్‌మెంట్లు చేస్తూ డబ్బులు గడిస్తున్నాడని వీడియోను మీడియాకు విడుదల చేసింది.

 ఈ లోపుగానే అసలు మీ చీపురు పార్టీ కార్యకర్తలు రోజూ రెండు పూటలా తినడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి అంటూ విచారణ కమిషన్ వేశారు. కోట్లు కొల్లగొట్టేవాడ్ని వదిలి చీపురు కట్టలతో ఉన్నవారిని పట్టుకున్నారేమిటంటే , ‘‘మరి వీడొక్కడే మాలో కలువ కుండా తానేదో సత్యహరిశ్చంద్రుడిని అని చెబుతున్నాడు అలాంటప్పుడు హరిశ్చంద్రుని కష్టాలు వీడికి చూపాల్సిందే లేకపోతే మా వ్యాపారాలు మూసుకోవలసి వస్తుంది..’’ అనేది పాత చిలుకల గుంపు వాదన. వేల కోట్ల పెట్టుబడులతో సాగే రాజకీయ వ్యాపారంలో చీపుర్లతో ప్రవేశిస్తే ఈ రోజు ఢిల్లీ మాదే అంటాడు, రేపు దేశం మాదే అంటాడు చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటున్నారు.

 మన రాష్ట్రం జెపి అని ఒకాయన అచ్చం మేధావిలానే కనిపిస్తారు. 2009 ఎన్నికల ఫలితాలు రాగానే టిడిపి వాళ్లు జెపి చిలకను పొడిచిన చోటు పొడవ కుండా పొడిచారు. జెపి సోనియా ఏజెంట్. సోనియా జెపికి జాతీయ స్థాయిలో పదవి ఇచ్చింది. జెపికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని ప్రశ్నించారు. మీది పెద్ద పార్టీ. ఏక్ నిరంజన్ పై ఎందుకంత కక్ష అని తెలుగు ఎమ్మెల్యేను అడిగితే. ఆయన కూడా ఈ గూటి పక్షే కానీ తానేదో ప్రత్యేక జాతి అని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ గూటి పక్షే అని తేల్చేస్తే చాలు లేకపోతే ఏకు మేకవుతుంది అని చెప్పుకొచ్చారు.అందరినీ  మార్చేయాలని బయలు దేరిన జెపి చిలుక ప్రయాణం లో వాస్తవాలు గ్రహించి   చివరకు తానే మారిపోయి చిలుకల గుంపులో కలిసిపోయింది ఉన్న ఒక్క సీటు నిలుపుకోవడానికి  ఐదేళ్లలో జెపి చిలుక భాష బాగానే నేర్చుకున్నారు.  జెపి నేను మీ గూటి పక్షినే అంటూ అచ్చం బాబు పలుకులే పలుకుతున్నారు.

తరుణ్ తేజ్‌పాల్ అత్యాచార యత్నం వ్యహారం కోర్టు తేలుస్తుంది. జాతీయ చానల్స్‌లో అతని గురించి హడావుడి చూస్తుంటే, వాడూ మా వాడే అని తృప్తి పడుతున్నట్టుగా ఉంది. బిజెపిపై స్ట్రింగ్ ఆపరేషన్ చేసినందుకు ఆయనపై చాలా కాలం నుంచి చాలా మందికి కోపంగా ఉంది. ఇప్పుడు మా గూటి పక్షే అని నిరూపించేందుకు అవకాశం లభించింది అందు కే అంత ఉత్సాహం. ఐఎంఎఫ్ అధ్యక్షుడు అ లాంటి తప్పు చేస్తాడా? తరుణ్ తప్పు చేశాడా? అంటూ ప్రశ్నలు వినిపించినప్పుడు రజనీష్‌ను గుర్తు చేసుకుంటే.. హోదా తరువాత.. ముందు మనిషి. వాళ్ళను  దేవుళ్లు అనుకోవడం నీ తప్పు. మనిషికుండే అవలక్షణాలన్నీ ఆ మనిషికీ  ఉంటాయి అనే జీవిత సత్యం కళ్ల ముందు మెదులుతుంది.

20, నవంబర్ 2013, బుధవారం

పురుష దినం

‘‘ఈ రోజు ఏమిటి?’’
‘‘అది కూడా తెలియదా? పేపర్ చూడవా? ఈరోజు నవంబర్ 19’’
‘‘అంటే ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? అని’’
‘‘ఏడవ తరగతి చదివేప్పుడు సరిగ్గా ఈరోజే నేను మా క్లాస్ మెట్ విజయలక్ష్మికి లవ్ లెటర్ రాశాను. కాస్త గంభీరంగా ఉంటుందని గంగాభాగీరథీ సమానురాలైన విజయలక్ష్మికి ప్రేమతో అని రాశాను. ఎక్కడో ఈ పదం విన్నప్పుడు ఇదేదో బాగుందని, ఉపయోగించుకున్నాను.


తెలుగులో ఇన్ని తప్పులు రాస్తావా? నీకు భాష రాదు, భావం తెలియదు అంటూ మా టీచర్ కొట్టిన చోటు కొట్టకుండా కొట్టారు. ఈ లేఖ ఎవరైనా చదివితే నీకు పాఠాలు చెప్పిన గాడిద ఎవడురా! అని నన్ను తిడతారురా! అడ్డగాడిద అంటూ చితక బాదేశారు. ఈ సంగతి మా నాన్న వరకు వెళ్లి, ఆయనో నాలుగు ఇచ్చుకున్నాడు. ఈ సంగతి సత్తిగాడికి తెలిసి తప్పులు లేకుండా ప్రేమ లేఖ రాయలేని వాడితో నీకేం ప్రేమ. తెలుగులో ఎప్పుడూ నేనే క్లాస్‌లో ఫస్ట్ పద మనం ప్రేమించుకుందాం అని విషయమంతా చెప్పి విజయలక్ష్మిని నా నుంచి దూరం చేసి, తాను దగ్గరయ్యాడు’’ అంటూ భారంగా చెప్పుకొచ్చాడు వీరేశం. 

ఆ రోజు వాడు నాకు వెన్నుపోటు పొడిచినందుకు కాలమే వాడిని శిక్షించింది... విజయలక్ష్మిని పెళ్లి చేసుకుని గాడిద చాకిరి చేస్తున్నాడు వెదవ. మొన్న దీనంగా ఉన్న వాడిని చూసి చిన్ననాటి మిత్రుడని కూడా చూడకుండా బాగైందిరా నీకు అని అ నకుండా ఉండలేక పోయాను’’ అని వీరేశం చెప్పుకొచ్చాడు.


‘‘చాల్లేరా నీ చచ్చు ప్రేమ. రిటైర్‌మెంట్‌కు దగ్గరకొచ్చాక ఏడవ తరగతిలో ప్రేమ కథ నువ్వు చెప్పడం నేను వినడం’’ అని కామేశం చిరాకుపడ్డాడు.
‘‘ నా కవిత్వం నీకు గోలగా అనిపించొచ్చు నాకు మాత్రం మహదానందంగా ఉంటుంది. ఎవడి కవిత్వం వాడికి నచ్చినట్టే... ఎవడి దురద వాడు గోక్కుంటే సంతోషం కలిగినట్టే, లేత వయసు ప్రేమైనా లేటు వయసు ప్రేమైనా ఎవరి ప్రేమ వాడికి అద్భుతం, ఎవడికి వాడు షాజహానే, ఎవరి ప్రేయసి వారికి ముంతాజే’’ అని వీరేశం కాస్త గట్టిగానే చెప్పాడు.
‘‘సర్లే నీ ప్రేమ దురద సంగతి నాకెందుకు కానీ...ఈరోజు ఏమిటో నిజంగా తెలియదా?’’ అని కామేశం అడిగాడు.


‘‘ తెలుగు పార్టీ వాళ్ల వెబ్‌సైట్‌లో ఈ రోజు ప్రత్యేకత ఏమిటో చూసి చెబుతాను.
‘‘వాళ్లకు ప్రపంచం అంటే వాళ్ల పార్టీ, విశ్వం అంటే వాళ్ల విశ్వవిఖ్యాత నటుని కుటుంబమే. ఈరోజు మామ సినిమా విడుదలైందనో, అల్లుడు ఈరోజే హైదరాబాద్‌ను కనుగొన్నాడనో, ఇంకుడు గుంతలు తవ్వాడ నో ఏదో ఉంటుందని కానీ. నేనడిగింది దాని గురించి కాదు’’ అని కామేశం చెప్పాడు.
‘‘ఆడియెన్స్ పోల్ తీసుకోవచ్చా?’’అని వీరేశం అంటే...
‘‘ఇక్కడ ఆడియన్స్ ఎవరున్నారురా! నువ్వూ నేనే కదా? నేను అడుగుతున్నాను. ‘‘నువ్వు చెప్పు’’ అని కామేశం బదులిచ్చాడు.
ఒక్క నిమిషం ఉండూ అని సెల్‌ఫోన్‌లో ఏదో వెతికి ...‘‘ఆ తెలిసింది ఈ రోజు వరల్డ్ టాయ్‌లెట్ డే ’’అని గట్టిగా అరిచాడు వీరేశం.
‘‘ఈ దినాలు పెట్టేవాళ్లకు అస్సలు బుద్ధి ఉండదేమో! వరల్డ్ టాయ్‌లెట్ డే కూడా ఈరోజునే నిర్ణయించాలా? మగాళ్లంటే మరీ చులకనైపోతోంది’’ అని కామేశం అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తెలిసింది.. దేశంలో తొలి మహిళా బ్యాంకు ఈరోజే ప్రారంభించారు. ఐనా మహిళా బ్యాంకు ప్రారంభిస్తే, మగాళ్లను చులకన చేసినట్లు ఎలా అవుతుంది’’ అని వీరేశం సందేహించాడు.
‘‘నీ వల్ల కాదు కానీ నేనే చెబుతాను.. ఈ రోజు పురుషుల దినోత్సవం ’’ అని కామేశం చెప్పుకొచ్చాడు.


ఆ మాట వినగానే వీరేశం ఉలిక్కి పడి.. ఇదిగో దీంతో నాకెలాంటి సంబంధం లేదు. ఈ మాట నువ్వే అన్నావు కానీ నేనలేదు. అసలే ఇంట్లో పరిస్థితి బాగాలేదు. మా ఆవిడకు తెలిస్తే...అంటూ వీరేశం వణికిపోయాడు.
అబ్బా నవంబర్ 19 ప్రపంచ పురుషుల దినోత్సవంరా బాబు ఈరోజును నిర్ణయించింది నువ్వు కాదు నేను కాదు ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో దీన్ని జరుపుకుంటా రు.’’ అని కామేశం చెప్పాడు.


ప్రపంచం సంగతి నాకు తెలియదు కానీ మొన్న ఇందిరాపార్క్ వద్ద భార్యాబాధితుల సంఘం వాళ్లు ధర్నా చేసి నవంబర్ 19న పురుష దినోత్సవం అని గుర్తు చేశారు కదా? అంటే పురుష దినోత్సవం జరుపుకుంటున్నది భార్యా భాధితులే కదా? ఈ దినం పట్ల నేనూ ఆసక్తి చూపిస్తున్నాననే విషయం మా ఆవిడకు తెలిసిందంటే.. నేనూ ఇందిరాపార్క్ వద్ద పర్మనెంట్ శిబిరం వేసుకుని కూర్చోవలసిందే. ఎందుకొచ్చిన దినాలురా బాబూ!’’ అని వీరేశం వాపోయాడు. సర్లే నా గొడవ సంగతి పక్కన పెట్టు.. ఈరోజును పురుషుల దినోత్సవంగా ఎందుకు నిర్ణయించారంటావు? అని వీరేశం ఆసక్తిగా అడిగాడు.
‘‘నాకూ తెలియదురా! కానీ తెలిసి చేశా
రో తెలియక చేశారో కానీ ఈ నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజే  ఝాన్సీ లక్ష్మీబాయ జయంతి.  ఇందిరాగాంధీ పుట్టిన రోజు కూడా.’’ అని కామేశం తెలిపాడు.
‘‘తలా తోకా లేకుండా చెబుతున్నావు. ఇందిరాగాంధీ జన్మదినం అంటావు, పురుషుల దినోత్సవం అంటావు. దానికీ దీనికీ, ఏమైనా సంబంధం ఉందా? ’’ అని వీరేశం అడిగాడు.
‘‘లేకేం ఉంది. భారత రాజకీయాల్లో ఏకైక మగాడు ఇందిరాగాంధీ!’’
ఒక చెంపపై కొడితే మరో చెంప చూపమని మహాత్ముడు చెప్పాడు, మరి రెండో చెంపపై కొడితే, ఏం చేయాలి అనే ప్రశ్నకు ఇందిరాగాంధీ మూడో కన్ను తెరిచి పాక్‌ను రెండు ముక్కలు చేయడం ద్వారా 71లో సమాధానం చెప్పారు. పాక్‌కు ఇలా సమాధానం చెప్పిన మరో  పురుష ప్రధాని దేశ చరిత్రలో ఉన్నారా? ఇందిరాగాంధీ  ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళ, భారత రత్న పురస్కారం పొందిన తొలి మహిళ. పురుష దినోత్సవంగా ప్రకటించడానికి ఆమె జన్మదినం కన్నా గొప్ప రోజు ఇంకోటి ఉంటుందంటావా? ఇంత కన్నా గొప్ప పురుష నేత దేశ రాజకీయాల్లో ఇంకొకరు ఉన్నారంటావా?’’ అని కామేశం అడిగిన దానికి వీరేశం తలాడించడం ద్వారా తన ఆమోదం తెలిపాడు.

17, నవంబర్ 2013, ఆదివారం

ఇచ్చట చరిత్ర సృష్టించబడును

పార్వతమ్మ గారు ఇంకా రాకపోవడంతో ఈ రోజు బిజీగా ఉన్నారేమో అనుకున్నాను.
లేదండి సావిత్రి గారు! కోడలు పిల్ల నాతో పనేమీ చేయించదు. మనవడితోనే ఆలస్యమైంది అని చెప్పుకొచ్చింది.


 ఇద్దరూ గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగులు. పెన్షన్ పుణ్యమా అని ఇంట్లోనో, వంట్లోనూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. పైకి చెప్పుకోరు కానీ ఇంట్లో తమ మాట అంతో ఇంతో చెల్లుబాటు కావడానికి పెన్షనే కారణమని వారికీ తెలుసు. అత్తలేని కోడలుత్తమురాలు.. ఓయమ్మో కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది పాత పాట. పెన్షనున్న అత్త ఉత్తమురాలు.. ఉద్యోగం ఉన్న కోడలు గుణవంతురాలు అనుకునే కాలం వీరిది. సాయంత్రం కాలనీ పార్కులో బాతాఖానీ వారి దిన చర్య. రాజకీయ పార్టీల్లో గ్రూపులున్నట్టుగానే కాలనీలో అన్ని గ్రూపులు తమ తమ వర్గం వారితో పార్కులో సెటిల్ అయ్యారు. ఒకే అభిప్రాయాలు ఉన్నవారు ఫేస్‌బుక్‌లో ఒకే గ్రూపులో తచ్చాడినట్టుగా పార్వతమ్మ, సావిత్రి ఒకే చోటుకు చేరుతారు. రాష్ట్ర విభజన అంశం మొదలుకుని కాంగ్రెస్, టిడిపిలపై అభిప్రాయాల వరకు వారికి భావ సారూప్యత ఉండడం వల్ల వారి స్నేహం దిన దిన ప్రవర్థమానం అవుతోంది. భద్రాచలంపై కూడా వారిద్దరిదీ ఒకే అభిప్రాయం. అనేక అంశాలు చర్చించుకున్నా ఇద్దరి మధ్య ఎప్పుడూ బేదాభిప్రాయాలు పొడసూపలేదు. లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుల్లా కలిసిపోయారు మీరిద్దరూ అని పక్కింట్లో కొత్తగా దిగిన పంకజమ్మ వీరి స్నేహాన్ని చూసి చమత్కరించారు. మహేష్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఎవరి సినిమా బాగున్నా ఇద్దరు కలిసి వెళతారు కాబట్టి ఇక వారిరువురిని ఏ సమస్య విడదీయలేదని కాలనీ వాసులు నిర్ధారించుకున్నారు.


ఆ రోజు వారిద్దరి మధ్య ఎప్పుడూ లేని విధంగా కొత్త కొత్త అంశాలపై చర్చ సాగింది. కొత్త అంశాలంటే మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఫ్యాషన్‌లు, కొత్త సినిమాలు, కాలనీలో ప్రకాశ్ వాళ్ల అబ్బాయి తమ కాలేజీలో చదివే అమ్మాయితో ఎక్కడికో పోయిన విషయాలు అని కాదు. చాలా పాత విషయాల్లోని కొత్త కోణాలన్నమాట!


వారిద్దరి మధ్య సంభాషణల సారాంశం ఇలా ఉంది.
‘‘ఈ విషయం తెలుసా? గుర్రంపై కత్తిపట్టుకుని నిలుచున్న వీరనారి ఝాన్సీరాణి కాదట! మరో మహిళ అలా వీరోచితంగా పోరాడితే కొంత మంది ఝాన్సీరాణి అంటూ ప్రచారం చేశారట! మాయావతి పుణ్యమా అని ఈ విషయం ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది.’’


నిజమే నేను కూడా ఇంత కాలం ఝాన్సీ రాణి అనుకున్నాను..
సర్దార్ పటేల్ తొలి ప్రధానమంత్రి కావలసిన వారు, తృటిలో తప్పి పోయింది. పటేల్ ప్రధాని అయి ఉంటే మనం అమెరికాను మించి పోయేవాళ్లం. ఈ ప్రమాదాన్ని బ్రిటీష్‌వాడు ముందే కనిపెట్టి నెహ్రూ ప్రధానమంత్రి అయ్యేట్టుగా రహస్యంగా కుట్ర పన్నాడు. కావాలంటే మా అబ్బాయి ఫేస్‌బుక్‌లో ఉన్న ఫోటో చూపిస్తా చూడు. నెహ్రూ సిగరెట్టు తాగుతున్నట్టుగా ఉంది చూశావా ఈ ఫోటోనే దానికి సాక్షం.
దానికి దీనికి సంబంధం ఏమిటే?
అక్కడే ఉంది అసలు రహస్యం. ఈ సిగరేట్టులో ఒక రకమైన మత్తుమందు పెట్టారు. ఈ మందు ఎవరు పెడితే వారు చెప్పినట్టు వింటారన్నమాట! పటేల్ ప్రధానమంత్రి కావద్దు నెహ్రూనే ప్రధానమంత్రి కావాలి అని సంకల్పం చెప్పి ఈ సిగరెట్టును నెహ్రూతో తాగించారు. దాంతో అప్పటి వరకు అందరూ పటేల్ ప్రధాని కావాలని అనుకున్నవారు కూడా నెహ్రూనే ఎంపిక చేశారు’’
ఇందులో మహాత్మాగాంధీ కుట్ర కూడా ఉందనిపిస్తోంది. దీనిపై పరిశోధించమని మా మనవడి ఫేస్‌బుక్‌లో కామెంట్ రాస్తాను. నాకెందుకో మొదటి నుంచి మహాత్మునిపై అనుమానం. మహాత్మాగాంధీ పోరాడింది బ్రిటీష్‌వాడిపై చివరకు మహాత్మునిపై సినిమా తీసింది, మహాత్మునిగా నటించింది ఆ బ్రిటీష్‌వాడే ఇందులో కుట్ర ఉందనడానికి ఇంత కన్నా సాక్షం ఏం కావాలి...జాతిపిత బిరుదు విషయంలో భగత్‌సింగ్ తనకు పోటీ వస్తాడని మహాత్ముడే ఏదో కుట్ర పన్నాడని మొన్న మా మనవడి క్లాస్ మెట్ చెప్పిందట!


ఔను ఇంతకూ నీ మనవడు ఏ క్లాస్ చెప్పనే లేదు.
అదేంటి నీకు తెలియదా? ఇప్పుడు వాడు యూ కేజి దాటి ఒకటో తరగతికి వచ్చాడు. వాడికి చరిత్ర అంటే ఎంతిష్టమో!
ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రానికి, బిజెపి అధికారంలోకి వచ్చాక దేశానికి స్వాతంత్య్రం వచ్చిందట కదా?
నిజమే అయితే వాళ్లిద్దరు ఓడిపోగానే మళ్లీ వచ్చిన స్వాతంత్య్రం వెనక్కి వెళ్లింది. అంతే కాదు బ్రిటీష్‌వాడిపై పోరాడేందుకు అన్నగారు సిద్ధమవుతుండగా, ఈ విషయం ఉత్తరాది వారికి తెలిసి లాల్‌బాల్‌పాల్‌ల ద్వారా స్వాతంత్య్ర ఉద్యమం నడిపించారు. అమ్మో ఉత్తరాదివారు ఎంతైనా తెలివైన వారు. దేన్నయినా ముందే గ్రహించేస్తారు. అదే మన నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం జరిగి ఉంటే ఇప్పటికీ మన వాళ్లే ప్రధానమంత్రులుగా ఉండేవారు. చరిత్ర సృష్టించాలన్నా, తిరగ రాయాలన్నా మన వాళ్లకే సాధ్యం.


అసలు చైనా వాడు అన్ని రంగాల్లో అలా ముందుకు దూసుకెళ్లడానికి కారణం తెలుసా?
మన పూర్వీకులు రాసిన తాళపత్ర గ్రంధాలు కొన్ని జర్మనీ వాడు ఎత్తుకెళ్లి ఎంతో అభివృద్ధి చెందితే, మరిన్ని చైనా వాడికి దొరికాయి వాటితోనే వాడీ రోజు అమెరికానే సవాల్ చేసేట్టుగా తయారయ్యాడు.
మన జ్ఞానాన్ని ఎత్తుకెళ్లిన వాడే అంత అభివృద్ధి చెందితే మరి మనం అని వెనక నుంచి ఎవరో ప్రశ్నించినట్టుగా అనిపించింది. వెనక్కి చూస్తే ఎవరూ లేరు.

‘అమెరికాను కనుగొన్నది మన తెలుగువాడే? 
మనవాడు పడవలో వెళుతుంటే కొలంబస్ అనేవాడు లిఫ్ట్ అడిగాడు. మన వాళ్లు అసలే దయార్ధ్ర హృదయులు కదా సర్లేఅని పడవలో ఎక్కించుకుంటే మన వాడి కన్నా ముందు వాడే పడవ నుంచి దూకేసి అమెరికాను కనుగొన్నది నేనే నేనే అని అరిచాడు’’ అని అప్పటి వరకు వీరి మాటలు వింటున్న పంకజమ్మ టీవిల ద్వారా తనకు తెలిసిన పరిజ్ఞానాన్ని పంచుకుంది.

13, నవంబర్ 2013, బుధవారం

ఆ ఒక్కటీ అడక్కు...!

‘‘రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నట్టుగా అనిపించడం లేదూ’’!
‘‘దేశంలోని సమస్యలకు పరిష్కారం రాష్ట్ర విభజనే అంటూ జూలైలో ప్రకటించినా, ఇప్పటి వరకు విభజన జరగలేదు రోజులు భారంగానే గడుస్తున్నట్టు అనిపిస్తున్నాయి.’’
‘‘అబ్బా నీకు లోక జ్ఞానం అస్సలే లేదురా! రాష్ట్ర విభజన వద్దంటూ కెసిఆర్ ఆమర దీక్షకు కూర్చున్నా విభజన ఆగదు. ఆ సంగతి వదిలేయ్ ..’’
‘‘మరి నీ బాధ దేని గురించి ?’’
‘‘నిన్న మొన్ననే అన్నగారు సినిమా రంగాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. అలాంటిది అల్లుడు గారు అధికారం చేపట్టడం చివరకు ఆయన కూడా తన కుమారుడిని ప్రజలకు త్యాగం చేయడానికి సిద్ధం చేయడం చూస్తుంటే రోజులు చాలా వేగంగా గడుస్తున్నట్టు అనిపిస్తున్నాయి కదూ!’’
‘‘ఎదుటి వాళ్లతో త్యాగాలు చేయిస్తారు కానీ బాబు త్యాగం చేయడం ఏమిటి?’’
‘‘ఆయనే కాదు ఈ నేలపై పుట్టిన ప్రతి నేత ఏదో ఒక రోజు ఇలా త్యాగం చేయాల్సిందే!’’
‘‘ఏమా త్యాగం ఏమా కథ!’’
‘‘త్యాగాల నేలపై నిలబడి నేతల త్యాగం గురించి తెలియకపోవడం నిజంగా బాధాకరమే. అయితే నీకు మొదటి నుంచి చెప్పాలి. ః’’


***
వెనకటికో ధర్మాత్ముడి వద్దకు కొందరు సంఘ సేవకులు వచ్చి వృద్ధాశ్రమం నిర్మిస్తున్నాం మీ వంతు సహాయం అని కోరితే మీ ఆలోచన అభినందనీయం నా వంతుగా వృద్ధులైన మా అత్తా మామలను మీ వృద్ధాశ్రమానికి విరాళంగా ఇస్తానని ఎంతో దయార్ధ్ర హృదయంతో ప్రకటించాడు. ఆయన మాటలు విన్న శ్రీమతి మా ఆయన అంత ఉదారత్వం చూపిస్తే నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ మా అత్తా మామలను కూడా మీ వృద్ధాశ్రమానికి విరాళంగా ఇస్తానని భార్యా భర్తలు తమ అత్తా మామలను త్యాగం చేసేందుకు పోటీలు పడ్డారు.


త్యాగం ఈనేల సహజ లక్షణం. ఎరువులు వేయకున్నా, వర్షాలు లేకున్నా త్యాగాల పంట దేశంలో రోజు రోజుకూ విరగ పండుతోంది!
వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం చందాలు ఇవ్వండి అని భాగ్యనగరంలో అడిగినట్టు, యజ్ఞం చేస్తున్నాం విరాళం ఇవ్వండి అని భక్తులను అడిగినంత ఈజీగా విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తూ రాక్షసుల నుంచి రక్షణ కోసం దశరథుడిని అడిగితే మీలాంటి వారు అంత దూరం నుంచి వచ్చి అడగాలా! కాకితో కబురంపితే నేనే మా వాళ్లను పంపేవాడిని కదా అన్నట్టుగా చూసి తన కుమారులు రామలక్షణులను పంపించేశాడు. ఇది త్యాగం కాకపోతే మరేమిటి? విశ్వామిత్రుడు ముక్కుపచ్చలారని రామలక్ష్మణులను తీసుకెళ్లింది వన విహారానికి కాదు... రాక్షసులను సంహరించేందుకు! ఏదైనా తేడా వస్తే అంతే కథ. సింహాసనం అధిష్టించాల్సిన వారిని ఇలా త్యాగం చేసే ఆచారం కొత్తదేమీ కాదు. త్రేతాయుగం నుంచి కూడా కొనసాగుతున్నదే. అలానే రాహుల్‌గాంధీని దేశానికి త్యాగం చేయాల్సి రాగానే సోనియాగాంధీ తల్లడిల్లారట! ఇటలీ అయినా ఇండియన్ అయినా తల్లి తల్లే కదా! ముళ్లకిరీటం ధరించేందుకు కొడుకును త్యాగం చేసేందుకు ఏ తల్లయినా తల్లడిల్లిపోతుంది. సింహాసనం అనేది ముళ్లకిరీటం బాబూ! అయినా దేశం కోసం ఈ త్యాగానికి సై అనక తప్పడం లేదని బాధపడ్డారట!


ఈ త్యాగాల చరిత్రలో తెలుగునేత బాబుది విలక్షణ శైలి. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. అన్నగారు. 72 ఏళ్ల వయసులోనూ ప్రేమించి మళ్లీ పెళ్లి చేసుకుని సింహాసనాన్ని వారసునికి త్యాగం చేసే సూచనలు ఏమీ కనిపించక పోవడంతో అల్లుడు గారే మామను త్యాగం చేసి ముళ్లకిరీటం లాంటి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. సహజంగా వారసుడిని ప్రకటించి దేశ ప్రజల కోసం వారసుడిని త్యాగం చేయడం సంప్రదాయం. వారంతట వారే త్యాగానికి సిద్ధం కాకపోతే ఇలా చేయడం ఇక్కడ ఆనవాయితే. వైఎస్‌ఆర్ కూడా బతికి ఉంటే ఇప్పటికే తన కుమారుడిని రాష్ట్రానికి త్యాగం చేసి ఉండేవారు. దాని కోసమే ఎంపిగా ఉన్న తమ్ముడితో సీటు త్యాగం చేయించి అబ్బాయిని పోటీ చేయించారు.


రెండు సార్లు విజయవంతంగా ఓడిపోయాక బాబుగారు కూడా తప్పని సరి పరిస్థితిలో త్యాగాల బాట పట్టారు. అబ్బాయి లోకేశ్ తెలుగు ప్రజలకు త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. పూవు పుట్టగానే పరమళిస్తోంది, అచట పుట్టిన చివరి కొమ్మయినా చేవ అనే మాటలన్నీ ఆ చినబాబు కోసమే పుట్టాయేమో అనిపిస్తోంది. అన్నప్రాసన నాడే ఆవకాయ తింటేనే గొప్ప అనుకుంటున్నాం మనం. అలాంటిది చినబాబు పార్టీలోకి వచ్చిన మొదటి రోజే తెల్ల జుట్టుతో నేడో రేపో అన్నట్టుగా ఉన్న హేమా హేమీలకు ఎన్నికల్లో విజయం సాధించడం ఎలా? విజయానికి ఏడు మెట్లు అంటూ రాజకీయాలను బోధిస్తున్నారు. రాహుల్‌లా చినబాబు తన త్యాగాన్ని చెప్పుకోవడం లేదు. చినబాబు అద్భుతంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తుంటే లైవ్‌లో చూసిన పెద బాబు హృదయం ఆనందంతో పొంగిపోయిందట! పెదబాబు ఇలా పవర్ పాయింట్ ప్రజంటేషన్స్ చేసీ చేసి పార్టీని పదేళ్ల నుంచి అధికారానికి దూరంగా కుటుంబానికి దగ్గరగా తీసుకు వచ్చారు. ఇప్పుడు చినబాబు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తున్నాడంటే మేం ఇక అధికారానికి వచ్చినట్టే అని రెండు సార్లు విజయవంతంగా ఓడిపోయిన నిత్య అసంతృప్తి నేత వాపోయారట!


నాయకులు తమ కుమారులను ప్రజల కోసం త్యాగం చేస్తుంటే ఓటర్లుగా మనం మనశ్శాంతిని కూడా నేతలకు త్యాగం చేయాలి తప్పదు.

 నేతలు తమ వారసులను కాకుండా తాము సంపాదించింది సొమ్మును ప్రజలకు త్యాగం చేస్తే ?
ఆ ఒక్కటీ అడక్కు.

6, నవంబర్ 2013, బుధవారం

విక్రమార్కుడితో బేతాళుడి కుమ్మక్కు

విక్రమార్కుడు బేతాళుడిని భుజాన మోస్తూ వెళుతున్నాడు. ‘‘రాజా! నీకు ఇప్పటి వరకు ఎన్నో కథలు చెప్పాను. ఇప్పుడు తెలుగురాజకీయ కథ చెబుతాను’’ అని భేతాళుడు అనగానే విక్రమార్కుడు వణికిపోయాడు. పొరపాటున ఉదయం టీవిలో తెలుగురాజకీయాల చర్చను చూస్తేనే జీవితంపై విరక్తి కలుగుతోంది. పాపం తెలుగు ప్రజలు దాన్ని ఎలా భరిస్తున్నారురా భగవంతుడా! అనుకుంటున్నాను. ఇక నువ్వు రాజకీయ కథ చెబుతాను అంటే విని బతికి ఉంటా నా? ఇక నీకు సమాధానం చెప్పడానికి’’ అని విక్రమార్కుడు బేరుమన్నాడు!

 ఎన్నో కథలు విని సంక్లిష్టమైన ప్రశ్నలకు ఈజీగా సమాధానం చెప్పిన మీరే ఇలా బెంబేలెత్తిపోతే ఎలా రాజా! ముందు కథ వినండి .. నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతే నిజాయితీగా ఒప్పుకోండి అని బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు.
***
బ్లాక్‌మెయిల్ చేశాడనే ఫిర్యాదు వస్తే తీసేసిన స్ట్రింగర్ కోపంతో పత్రిక పెట్టుకుని ఏకంగా ఎడిటర్ అయినట్టు...తెలుగునాట ఏ నేతకు ఎవరి మీద కోపం వచ్చినా కొత్త పార్టీ పెట్టుకుంటారు. అలానే యువనేత కొత్త పార్టీ పెట్టుకుని విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. 16 నెలల పాటు జైలులో ఉన్న యువనేత ఎన్నికల సమయంలో బెయిల్‌పై బయటకు వచ్చాడు. లక్ష కోట్లు సంపాదించాడని విపక్ష పార్టీ ఆయనపై ఆరోపణలు చేస్తే సిబిఐ మాత్రం అంత కాదు కానీ ఎంతో కొంత సంపాదించాడని చెబుతున్నది. యువనేత సోనియాగాంధీతో కుమ్మక్క య్యారని అందుకే బెయిల్ లభించింది అనేది విపక్ష నేత ఆరోపణ. యువనేత పార్టీ, రాజమాత పార్టీలోవిలీనం అవుతుందని ఆ షరతుతోనే బెయిల్ లభించిందని, యువనేత రాజమాత దత్తపుత్రుడని విపక్ష బాబు ఆరోపణ. నిజమేమిటో కానీ ఈ ప్రచారం మాత్రం బలంగా సాగుతోంది. నిజమే అని నమ్ముదామంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి.


రాజమాత పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడానికి విపక్ష బాబు మద్దతే కారణం అనేది అంత కన్నా బలంగా సాగుతున్న ప్రచారం. రాజమాత పార్టీ నాయకుడు కిరణుడికి సొంత జిల్లాలోనూ ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేదు. కొన్ని పార్టీలు అవిశ్వాసం పెడితే ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేందుకు వీలులేదని అప్పటి వరకు హుంకరించిన విపక్ష బాబు అవిశ్వాసమప్పుడు ఓటింగ్‌కు దూరంగా ఉండి ప్రభుత్వాన్ని కాపాడారు. రాష్ట్ర ప్రభుత్వానే్న కాకుండా ఎఫ్‌డిఐల అంశంలో రాజ్యసభలో కేంద్రంలో అధికార పక్షాన్ని సైతం కాపాడారు. ఆపద తలెత్తిన ఓటింగ్ సమయంలో విపక్ష బాబు పార్టీ ఎంపిలే తలనొప్పితో ఒకరు, దాహం వేయడం వల్ల మరొకరు బయటకు వెళ్లి అధికాపక్షాన్ని కాపాడారు. కేసులకు భయపడి విపక్ష బాబు అధికారపక్షానికి అండగా నిలిచారని ఆయనే రాజమాత పెంపుడు కొడుకుగా మారాడనేది యువనేత పార్టీ ఆరోపణ.


ఇక గులాబీ పార్టీ వారు అటు జగన్‌తో ఇటు కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారనేది అదే విపక్ష బాబు ఆరోపణ. తల్లిపుట్టింటి గురించి మేనమామకు తెలియందేముంటుంది. బాబుకు కాంగ్రెస్ పుట్టి ల్లు. మూడు దశాబ్దాల నుంచి ఆయన మెట్టినింట ఉన్నా పుట్టింటి గురించి ఆయన తెలియని విషయం ఉంటుందా? బాబు మా పార్టీ మేనమామే అని అధికారపక్షం మాజీ మంత్రి కూడా స్వయంగా చెప్పారాయె! 

సందట్లో సడేమియా అన్నట్టు యువనేతతో మా రాజమాత కుమ్మక్కు నిజమే అని అధికార పక్షం నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెస్‌తో టిడిపి కుమ్మక్కు అయిందా? వైకాపాతో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందా? టిఆర్‌ఎస్‌తో వైకాపా కుమ్మక్కా? కాంగ్రెస్ కుమ్మక్కా? లేక వీరంతా కుమ్మక్కు అయి ప్రజలను ఆయోమయంలో పడేస్తున్నారా? ప్రతి కుమ్మక్కు ఆరోపణ నిజమే అనిపిస్తోంది. ఇందులో అసలు నిజం ఏది రాజా!


అప్పుడెప్పుడో తూర్పు పడమర అని ఒక సినిమా వచ్చింది. అందులో తూర్పు పడమర ఎదురెదురూ నింగినేల ఎదురెదురు కలియని దిక్కులు కలవవని తెలిసీ ఆరాటం దేని కని అంటూ ఓ పాట ఉంది. ఈ సినిమాలో ఎవరికెవరు ఏమవుతారో కథ రాసిన రచయిత, దర్శకుడు సైతం తేల్చలేకపోయాడు. తెలుగు రాజకీయం కథ కూడా తూర్పు పడమర కథలానే ఉంది. ఇప్పుడు చెప్పు రాజా! ఎవరికెవరు దత్తపుత్రుడు, ఎవరికెవరు పెంపుడు కొడుకు? ఎవరితో ఎవరు కుమ్మక్కు అయ్యారు? అని బేతాళుడు ప్రశ్నించాడు.


విక్రమార్కుడు చిరునవ్వు నవ్వి ఇందులో తల బద్ధలు కొట్టుకోవలసింది ఏమీ లేదు. ఎవరితో ఎవరూ కుమ్మక్కు కాలేదు అన్నాడు.
ఈ సమాధానంతో బేతాళుడు సంతృప్తి చెందలేదు. అదేంటి రాజా! ఆధారాలు అంత స్పష్టంగా కనిపిస్తుంటే కుమ్మక్కు కాలేదంటావు. కాస్త వివరంగా చెప్పు అని బేతాళుడు అడిగాడు.


యాచకో యాచక శత్రుః అన్నారు. యాచకునికి యాచకుడు ఎలా శుత్రువో రాజకీయ పార్టీలకూ, వాటి నేతలకూ అంతే.
ఎవరు ఎవరితోనూ కుమ్మక్కు కాలేదు. ఎవరితో ఎవరైనా కుమ్మక్కు అవుతారు. కట్టుకున్న పార్టీకే కట్టుబడి ఉండని వారు తెర వెనుక ఒప్పందాలకు కట్టుబడి ఉంటారని అనుకోవడం నీ అమాయకత్వం బేతాళా! స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టేన్సీ అన్నట్టు ఎవరి బతుకు తెరువు కోసం వారు తంటాలు పడతారు. తన కాళ్లు నరికేసుకుని తన ప్రత్యర్థి పార్టీని బతికించాలని ఏ నాయకుడికీ ఉండదు. అలాంటి త్యాగశీలి ఏ పార్టీలోనూ ఉండడు. ఎవరి అవసరం వారిది. ఒకరికి బెయిల్ కావాలి, మరొకరికి ప్రభుత్వం పడిపోతే తక్షణం ఎన్నికలను ఎదుర్కోనే సత్తాలేక కాస్త గడువు కావాలి. అంతే ...


ఎన్నికల ముందు ఎవరితోనూ ఎవరూ కుమ్మక్కు కారు. వరద తగ్గాక నగ్నంగా ఉన్నదెవరో బయటపడుతుందని ఒక నానుడి. ఎన్నికల తరువాత ఎవరి అవసరం మేరకు వారు జతకడతారు’’ అని విక్రమార్కుడు చెప్పాడు.
‘‘రాజా! నా అనుమానం మనకు తెలియకుండానే మన మిద్దరం కుమ్మక్కు అయ్యామనిపిస్తోంది’’అని బేతాళుడు అనుమానం వ్యక్తం చేశాడు.