7, ఫిబ్రవరి 2019, గురువారం

డబ్బు- దృష్టికోణం

ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అది డబ్బుకు సంబంధించిన అంశం కావచ్చు. జీవితంలో సమస్యలు కావచ్చు.
చిన్నప్పుడు చదివిన ఒక కథ. భారీ కాయుడు ఒకరు ఒక గ్రామానికి వచ్చి అందరినీ భయపెడతాడు. అతన్ని చూడగానే గ్రామస్తులంతా భయంతో వణికి పోతారు. పొరుగూరు యువకుడు చుట్టపు చూపుగా ఆ ఊరికి వస్తే ఊరిలో ఒక్కరూ కనిపించరు. అంతా భయంతో ఊరు బయట కొండల్లో దాక్కుంటారు. ఎందుకలా పారిపోయారని యువకుడు అడిగితే భారీ కాయుని గురించి చెబుతారు. అతను ఒక్కడూ మీ ఊరి వాళ్లంతా కలిసి అతన్ని ఎదిరించలేరా? అని యువకుడు అడుగుతాడు. నీకేమన్నా పిచ్చా అతన్ని చూస్తే నువీ ప్రశ్న అడగవు. అతనెంత భారీకాయుడో నీకు తెలుసా? అని గ్రామస్తులు ఎదురు ప్రశ్నిస్తారు. ఆ యువకుడు నవ్వి అతని భారీకాయాన్ని చూసి మీరు భయపడుతున్నారు. నిజానికి ఆ భారీకాయం వల్లనే అతని ఓడించడం సులభం అని చెబుతాడు. ఎలా అంటే ఒక చీమపై మీరు దాడి చేయాలంటే అంత ఈజీ కాదు. కంటికి కనిపించని ఆ చీమ ఎటు నుంచి ఎటు పారిపోతుందో తెలియదు. పెద్ద బండ వేసినా ఆ చీమకు తగులుతుంది అనే గ్యారంటీ లేదు. ఎందుకంటే దాని సైజు మరీ అంత చిన్నది. అతను భారీ కాయుడు కాబట్ట మీరు దాడి చేస్తే అతనికి తగలదు అనే సందేహమే అక్కర లేదు. భారీ కాయం కాబట్టి తాకి తీరుతుంది. అంటాడు. గ్రామస్తులకు ధైర్యం చెప్పి ఆ భారీ కాయుడిపై రాళ్ల వర్షం కురిపిస్తాడు. వీరి దాడికి ఆ భారీ కాయుడు మట్టికరుస్తాడు.
ప్రపంచంలో కెల్లా సంపన్నుడు బిల్‌గేట్స్ పిజ్జా కోసం క్యూలో అందరితో పాటు నిలుచున్న ఫోటో ఒకటి ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. ఇది చూసి ఎవరి కోణంలో వారు ఆలోచించవచ్చు. అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని ఏం చేసుకుంటాడు. హాయిగా ఏ స్టార్ హోటల్‌కో వెళ్లి కావలసినవి తెప్పించుకోవాలి కానీ సామాన్యుడిలా క్యూలో నిలబడడం ఏమిటి? అనిపించవచ్చు. ఎంత సంపన్నుడైనా సామాన్య జీవితం గడిపై ఆయనపై గౌరవం పెరగవచ్చు.
చాలా మంది సంపన్నుల్లో ఉండే కామన్ గుణం. డబ్బుకు విలువ ఇవ్వడం. స్టార్ హోటల్‌కు వెళ్లి లక్షల్లో బిల్లు చేస్తేనే లభించే సంతోషం కన్నా, ట్యాంక్‌బండ్‌పై చల్లని సాయంత్రం పది రూపాయల మొక్కజొన్న కంకి తింటే అంత కన్నా మించిన సంతోషం లభించవచ్చు.
డబ్బుకు సంబంధించి చిన్నప్పటి నుంచి మనలో చిత్రమైన అభిప్రాయాలు ఉంటాయి. డబ్బు చెడ్డది అని చిన్నప్పటి నుంచి చెబుతుంటారు. డబ్బు సంపాదించే జ్ఞానం, డబ్బు గురించి అవగాహన లేని వాళ్లు మాత్రమే అలా చెబుతారు. పొదుపునకు, పిసినారి తనానికి తేడా కూడా తెలియదు. కొన్ని కుటుంబాల్లో చిన్నప్పటి నుంచే డబ్బు విలువ గురించి చెబుతారు. వారికి పొదుపు, పిసినారి తానికి తేడా ఏమిటో చిన్నప్పుడే అవగాహన వస్తుంది. అది తెలియని వారికి పొదుపు కూడా పిసినారి తనంగా అనిపిస్తుంది.
అవసరం అయిన దానికి ఖర్చు చేయాల్సిందే. అదే సమయంలో అనవసరమైన దానికి ఖర్చు చేయడం అంటే డబ్బుకు విలువ ఇవ్వక పోవడమే. మనకు విలువ ఇవ్వని వారి వద్ద మనం ఎక్కువ సేపు ఉండలేం, అదే విధంగా డబ్బు సైతం అంతే తనకు విలువ ఇవ్వని వారి వద్ద ఎక్కువ రోజులు ధనం నిలువదు.
పొదుపు చేయాల్సిన చోట పొదుపు చేయాల్సిందే, అదే సమయంలో అవసరమైన ఖర్చు చేయాల్సిన చోట ఖర్చు చేయాల్సిందే. ఏది అవసరం? ఏది పొదుపు? ఏది పిసినారి తనం అనే అవగాహన ఉండాలి. డాక్టర్‌కు చూపించుకుంటే రెండు వందల ఖర్చు అని నిర్లక్ష్యం చూపిస్తే అది లక్ష రూపాయలు చికిత్సగా జబ్బు ముదిరిపోవచ్చు. దీన్ని పొదుపు అనం, ఇది పిసినారి తనం అవుతుంది. కొంప కూల్చే పిసినారి తనం అవుతుంది. అదే సమయంలో విలాసాల కోసం అప్పు చేసి ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తే అది జీవితం అనిపించుకోదు, బాధ్యాతారహితమైన జీవితం అనిపించుకుంటుంది.
డబ్బు అనేది కేవలం అంకెలకు సంబంధించిన శాస్త్రం కాదు. సంపద రహస్యంలో అంకెలకన్నా ఆలోచనల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మన ఆలోచన ధోరణి సైతం మన సంపదపై ప్రభావం చూపుతుంది. ఎదుటి వారు ఏమనుకుంటారో ఆనే ఆలోచనతో అప్పులు చేసి విలాసవంతమైన జీవితం గడపాల్సిన అవసరం లేదు. నా జీవితం నా ఇష్టం అనుకుని సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేసే లెక్కలు తెలిసిన వాడు జీవితంలో ఎదిగి తీరుతాడు. సంపన్నుల్లో కామన్‌గా కనిపించే లక్షణం. పాజిటివ్ దృక్ఫథం. విజయవంతమైన వారు ప్రతిదానిలో అవకాశం వెతుకుతాడు. పాజిటివ్ దృక్ఫథంతో వ్యాపార సామ్రాజాన్ని సృష్టించుకుంటాడు. నెగిటివ్ ఆలోచనా ధోరణి ఉన్నవారికి కంటి ముందు ప్రతిదీ సమస్యగానే కనిపిస్తుంది. పాజిటివ్‌గా ఆలోచించే వారికి అవకాశంగా కనిపించిన అంశాలు సైతం నెగిటివ్‌గా ఆలోచించే వారికి సమస్యలుగా కనిపిస్తాయి.
చిన్న ఉద్యోగం కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, పాజిటివ్‌గా ఆలోచించే వారు ఆ దశ నుంచి పైకి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తారు. అదే నెగిటివ్ ఆలోచనా పరులు తనకు ఎవరూ సహకరించడం లేదని, బంధువులు ఆదుకోవడం లేదని, తమ సామాజిక వర్గం ఇంతే అని సమస్యల ఆస్తిని కూడబెట్టుకుంటారు. ఇలాంటివారికి ఇతరులులు సహాయం చేయడం తరువాత తనకు తాను కూడా ఉపయోగపడరు. పైగా ఇలాంటి వారితో ఎక్కువ సమయం గడిపేందుకు కూడా ఎవరూ ఆసక్తి చూపించరు. అలాంటి నిరాశావాదుల నిస్పృణ మాటలు తమ మీద ఎక్కడ ప్రభావం చూపుతాయో అని దూరంగా వెళతారు. ప్రపంచంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి, బోలెడంత సంపద ఉంది. నా శక్తి మేరకు నేను ఆ సంపదను సంపాదించలగను అనే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అవకాశాలు అవే వస్తాయి. ప్రతి సమస్యలోనూ అవకాశాలు ఉంటాయి. ప్రయత్నించే వాడికే దైవం కూడా సహకరిస్తుంది అంటారు.
నెగిటివ్ ఆలోచనలు మానేసి ఈ ప్రపంచం విశాలమైంది. ప్రపంచంలో బోలెడు సంపద ఉంది. అవకాశాలకు కొదవ లేదు. అనే ఆలోచనలతో ముందడుగు వేయండి. అవకాశాల కోసం వెతికితే అవకాశాలు కనిపిస్తాయి. సమస్యల కోసం వెతికితే సమస్యలు దొరుకుతాయి. ఏది కావాలో నిర్ణయించుకోవాల్సింది మీరే.
*
-బి.మురళి(29-1-2019)

1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

దేవుడే దిగిరావాలి..


‘‘ ఛీ.. ఛీ.. మరీ ఇంత అన్యాయమా? ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతోంది?’’
‘‘ఏమైందిరా? ఐనా ఈ రోజు కొత్తగా విలువలు పడిపోవడం ఏమిటి? ఎప్పటి నుంచో ఇలా జరుగుతున్నదే కదా? కాలానికి తగ్గట్టు మార్పు తప్పదు. కలి ప్రవేశించినప్పుడే ఆ ప్రభావం మొదలైంది. ఇప్పుడేంది?’’
‘‘ఎంత కలికాలం ఐనా ఎంతో కొంత ధర్మం ఉండాలి...’’
‘‘ఔను.. ఇంతకూ ఏమైంది? ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచుతున్నారా? ఓట్లు కొంటున్నారా? ఎన్నికలు మొదలైనప్పటి నుంచే ఏదో ఒక స్థాయిలో ఈ వ్యవహారం సాగుతూనే ఉంది కదా? ఇప్పుడు కొత్తగా ఆశ్చర్యపోవడానికేముంది?’’
‘‘ఎప్పుడైనా విన్నామా? కన్నామా? కలి కూడా సిగ్గుపడేట్టు చేస్తున్నారు’’
‘‘ఎన్నికల గురించే కదా? నువ్వు మాట్లాడేది.’’
‘‘ఔను!’’
‘‘మరీ అంతగా ఆశ్చర్యపోవడం ఏంటి? లగడపాటి ఆవేదన గురించా? ’’
‘‘లగడపాటి ఏంటి?’’
‘‘అందరూ నవ్విన తరువాత తొర్రి పళ్లవాడు నవ్వాడని.. ఫలితాలు వచ్చిన రెండు నెలల తరువాత ఆయన ఆశ్చర్యపోతూ, నేను ప్రకటించిన ఎన్నికల ఫలితాలను అధికారికంగా గుర్తించాలి కానీ ఎన్నికల కమిషన్ ఫలితాలు ప్రకటించడం ఏమిటన్నట్టు ఆశ్చర్యపోతున్నాడు. ఎన్నికల కమిషన్ ఫలితాలను తాను గుర్తించేది లేదంటున్నాడు.’’
‘‘ఔను.. నేనూ చూశాను. బాబుగారిని - ఇంటికి వెళ్లి కలిసి వచ్చిన తరువాత ఢిల్లీలో ఈ ప్రకటన చేశాడని పత్రికలలో చదివాను’’
‘‘నీకంటే పనీపాటా ఉండదు. రోజూ నాలుగైదు పత్రికలు చదువుతుంటావు. టీవీలో వార్తలు చూస్తుంటావు. ఓట్లు లెక్కించగానే ఫలితాలు టీవీలో చూసి ఉంటావు. లగడపాటికి ఒకటా రెండా వేల కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఆయన చూసి ఉండరు. బాబును కలిశాక- ఆయన ఫలితాలు చెప్పి ఉంటారు. రెండునెలల తరువాత స్పందిస్తే తప్పా? వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని పక్కన పెట్టి ప్రాచీన విద్య చిలక జోస్యాన్ని గౌరవించే ఆయన్ని అభినందించాలి కానీ విమర్శిస్తావేం.’’
‘‘ఇంకెక్కడి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు? ఎప్పుడో నిండా మునిగిపోయారు. సైకిల్ నడుపుతున్నట్టు ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంటాయి. ఆ సైకిల్ సహా ఆయన్ని అమ్మినా అప్పు తీరదని తెలిసిన వారంటారు.. ’’
‘‘లోకులు కాకులు. ఇలానే అంటారు. వేల కోట్ల రూపాయల వ్యాపారం దివాలా తీస్తే తీసి ఉండొచ్చు. వ్యాపారం పోతే పోనీ చిలక జోస్యాలే నాకు ముఖ్యం అంటూ ఆయన నిలబడ్డాడు చూడు .. నాకది బాగా నచ్చింది. ప్రాచీన కళలు, సంస్కృతిని కాపాడాలని అందరూ ఉపన్యాసాలు ఇచ్చేవారే. కానీ ఇలా ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించే వారేరి?’’
‘‘సర్లే .. ఆయనకు లేని బాధ నాకెందుకు? వ్యాపారాలు పోతే చిలక జోస్యం చెప్పుకొని బతుకుతారు. పెప్పర్ స్ప్రే ఏజెన్సీ తీసుకుంటారు... నాకేం?’’
‘‘మనం ఇంత సేపు మాట్లాడుకున్నా... ప్రజాస్వామ్యం విలువలు లేకుండా పోయాయంటూ నీ బాధ ఏంటో ఇప్పటి వరకు చెప్పనే లేదు.’’
‘‘ఓ అదా.. మనం ఎప్పుడైనా విన్నామా? కన్నామా? ’’
‘‘ఏంటో చెప్పి ఏడువ్’’
‘‘ఎన్నికలు పుట్టినప్పటి నుంచి ఎంతో కొంత డబ్బులు ముట్టచెప్పడం మామూలే. ఇవ్వడం, తీసుకోవడం రెండూ మామూలే. కానీ ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడం ఎంత అన్యాయం? పంచాయతీ ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి డబ్బులు పంచిన వాళ్లు, ఓడిపోగానే ఇంటింటికీ తిరిగి మా డబ్బు మాకిచ్చేయమని అడుగుతున్నారట! ఇదెంత అన్యాయం?’’
‘‘ఎన్నికలన్నాక ఒకరికన్నా ఎక్కువ మందే పోటీ చేస్తారు. అందరూ పంచుతున్నారు. గెలిచేది ఒకరే కదా? ఈ మాత్రం ప్రజాస్వామ్య తత్త్వం అర్థం కాని వాళ్లు, తెలియని వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు? ఇలా ఐతే వచ్చే ఎన్నికల్లో వాళ్లు డబ్బులు పంచితే తీసుకుంటారా? ’’
‘‘ఓడినా గెలిచినా తిరిగి డబ్బులు అడగం అని హామీ పత్రం రాసుకుంటారేమో చూడాలి’’
‘‘ఇది విన్నావా? తెలంగాణలో వరి పండదు అన్నారు కదా?’’
‘‘వరి పండదు అన్నారు. అంతకు ముందు తినడం నేర్పించాం అన్నారు. సరే ఏమైంది?’’
‘‘ఈసారి దేశంలో అత్యధికంగా వరి తెలంగాణలోనే పండింది. దేవుడి దయ తెలంగాణపై భాగానే ఉంది. దేశానికి ధాన్యాగారంగా మారుతోంది.’’
‘‘అంతగా మురిసిపోకు.. తెలంగాణకు పెద్ద ప్రమాదం తప్పేట్టు లేదు. అది తెలుసుకో ముందు..’’
‘‘ఎలా?’’
‘‘రెండు నెలల తరువాత ఎన్నికలు జరుగుతాయి. మూడు నెలల్లో నేను గెలుస్తాను. నాలుగు నెలల్లో అద్భుతాలు జరుగుతాయి. ఐదు నెలల్లో మాయ మీ కళ్ల ముందు కనిపిస్తుందని కేఏ పాల్ అంత స్పష్టంగా చెప్పిన తరువాత కూడా నీకు అర్థం కాలేదా?’’
‘‘పాల్ సీఎం ఐతే ఏంటి?’’
‘‘ప్రపంచమంతా ఆయన చెప్పినట్టు వింటుంది కదా? ప్రపంచ నాయకులంతా ఆయన కనుసన్నల్లోనే పని చేస్తారు కదా? ప్రపంచంలోని పెట్టుబడులన్నీ ఆంధ్రకే తరలిస్తానంటున్నారు. అప్పుడు తెలంగాణకు ఇక పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి?’’
‘‘అంటే పాల్ సీఎం కావడం ఖాయం అనే నిర్ణయానికి వచ్చావా?’’
‘‘ఆయన మాటలు వింటే అలానే అనిపిస్తోంది. ఎంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు? అబద్ధాలు చెప్పేవారైతే ముఖంలో తేడా కనిపిస్తుంది’’
‘‘మాటల్లో నిజాయితీ లేదా పిచ్చితనం ఏదో ఒకటి ఉందనిపిస్తోంది’’
‘‘పిచ్చివాళ్లు, నిజాయితీ పరులు ఒకటే అంటావా?’’
‘‘నేనెప్పుడన్నాను? చేతికి ఉంగరం కూడా లేదని చెబుతున్నా- లక్షల కోట్లు తెచ్చేస్తానన్న ఆత్మవిశ్వాసం ముఖంలో కనిపిస్తోంది. పిచ్చితనమో, ఆత్మవిశ్వాసమో తెలియదు’’
‘‘సరే.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందంటావా?’’
‘‘హోదా సమస్య కన్నా అతిమేధావులే అసలు సమస్య అంటాను. మేధావుల సమస్య నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకోవాలని కోరుకుంటా...’’
‘‘ఒకప్పుడు అధిక జనాభా పెద్ద సమస్య అనుకునేవాళ్లం. చైనా ఆ సమస్యను కూడా అనుకూలంగా మార్చుకున్నాక, ఇప్పుడు జనాభా కాదు అతి మేధావులే అసలు సమస్య అనిపిస్తోంది. సమాజం అతి మేధావుల సమస్య నుంచి ఎప్పుడు విముక్తి చెందుతుందో- ఆ దేవుడికే ఎరుక..’’
‘‘పాల్ దేవుడికా? ’’
‘‘సరే.. ఇక ఉంటాను..’’
*బుద్దా మురళి (1-2-2019 జనాంతికం )