29, జూన్ 2011, బుధవారం

చిన్ని..చిన్ని.. ఆశ!



చిన్నిచిన్ని ఆశ... - ‘ఆపేశావేం పాడు రాధా పాడు.. అయ్యో నా ఉద్దేశం అది కాదు రాధా పాడడం ఆపేశావేంటీ పాడమని అడుగుతున్నాను. ఐనా మన పరిచయం ఇప్పుడే కదా! అప్పుడే ‘పాడు’ రాధవు ఎలా అవుతావు అని గోపి మనసులోనే అనుకున్నాడు.


 గోపీ నీ చిన్న కోరిక తీర్చకపోవడానికి ఈ రాధ అంత కర్కశురాలేమీ కాదు పాడుతా గోపీ పాడుతా అంటూ రాధ పాటందుకుంది. అడగ్గానే పాడావు, మరో చిన్న కోరిక కాదనవు కదా! అని తన్మయంగా రాధముఖంలోకి చూశాడు గోపి. రాధ సిగ్గుతో ముడుచుకుపోయింది. అడుక్కో గోపి అడుక్కో ఏమడుగుతావో అడుక్కో అంది రాధ!


 ఇంత అద్భుతంగా పాడిన నీ చేతిమీద చిన్నముద్దు అంటే నా ఉద్దేశం పాడింది నీ గొంతే అనుకో కానీ అలా పాడినందుకు నీ చేతిమీద చిన్నముద్దు పెట్టుకోవాలని అంటూ గోపి మెలికలు తిరిగిపోయాడు. రాధ ఫక్కున నవ్వింది.


 పిచ్చి గోపీ ఇది 2011 నువ్వు మరీ 1911 నాటి వాడిలా అమాయకుడిలా ఉన్నావని చేతిని ముందుకు చాచింది. పిచ్చి ఎవరికో నీకు తరువాత తెలుస్తుంది చెయ్యిచ్చి నువ్వు నా చిన్నకోరిక తీర్చావు ఆ తరువాత ముందుకు దూసుకెళ్లడం ఎలానో నాకు తెలుసు అని గోపి మనసులో అనుకున్నాడు.
 చిన్నిచిన్ని కోరికే కదా అని మనం నమ్మామనుకో కొంప మునుగుతుంది అని ఇప్పుడు రాధ అందరికీ చెబుతోంది.


భక్తా నీ భక్తికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో?-అని హిరణ్యకశిపుని సృష్టికర్త అడిగాడు .
 మరీ పెద్ద పెద్ద ఆశలేమీ లేవు భగవాన్ నావన్నీ చిన్నిచిన్న ఆశలే. ఈ చరా చర సృష్టిలో నేనో చిన్నప్రాణిని, ఈ ప్రాణం ఉంటేఎంత? లేకుంటేఎంత? కావున ఈ ప్రాణాం శాశ్వతంగా ఉండాలనేది నా చిన్నికోరిక.
 నా కోసం కాదు , మిమ్ములను నిరంతరం కొలుచుకోవాలనే ఈ చిన్న కోరిక కోరుకుంటున్నాను. సరే కండిషన్స్ అప్లై అంటూ చిన్న స్టార్ గుర్తుతో మీరు మడత పేచీ పెట్టాలని ప్రయత్నించకండి స్వామీ.


 సరదాగా ఈసారి కండీషన్స్ నేనే పెడతాను. రాత్రి కానీ పగలు కానీ , ఇంట్లో కానీ ఇంటి బయట కానీ, జంతువుతో కానీ, మనిషితో కానీ చావకుండా ఉండే చిన్న కోరిక తీర్చండి స్వామి అని హిరణ్య కశిపుడు కోరుకున్నాడు. కస్టమర్‌కే ఇన్ని తెలివితేటలుంటే ఉత్పత్తిదారుడికెన్ని ఉండాలనుకున్న దేవుడు చిరునవ్వుతో తథాస్తు అన్నాడు.
సరే మెచ్చాను కానీ నీ కోరికేమిటో చెప్పూ -అని అప్పటికే బోలెడు మందికి వరాలిచ్చిన శివుడు భస్మాసురుడ్ని అడిగాడు. నేను ఎవడి తలపై చేయి పెడితే వాటు మటాష్ కావాలి శివా! అని కోరుకున్నాడుభస్మాసురుడు . సరే నువ్వు ప్రజాస్వామ్యం వచ్చాక రాజకీయ నాయకుడిగా పుడతావు అని శివుడు వరమివ్వబోతే అయ్యో స్వామి చిన్న కోరిక తీరడానికి అన్ని యుగాలు వేచి ఉండాలా? నా వల్ల కాదు అని అలిగాడు. నీ మంచి కోసమే చెబుతున్నాను ఏ కాలంలో పండే పళ్లను ఆ కాలంలో తింటేనే ఆరోగ్యానికి మంచిది నువ్వు కలియుగం చివరి దశలో కోరాల్సిన కోరికను ఇప్పుడు కోరుతున్నావు దీని వల్ల నీకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.



 మంచి కస్టమర్‌ను వదులుకోవడానికి షాపువాడు, మంచి ఉద్యోగిని వదులుకోవడానికి ఏ కంపెనీ వాడు ఇష్టపడడు అలానే మంచి భక్తున్ని వదులుకోవడం దేవుడికి ఇష్టం ఉండదని చెబుతున్నాను ఆ తరువాత నీ ఇష్టం అని శివుడు నిష్టూరంగానే పలికాడు. నేను చిన్నవరం అడిగితే మీరు పెద్ద ఉపన్యాసం ఇస్తున్నారు అంటూ భస్మాసురుడు చిన్నబుచ్చుకున్నాడు.


 సరే చావు నీ ఇష్టం అని శివుడు వరమిస్తే పరీక్షించడానికి శివుని తలపైనే చేయిపెట్టేందుకు భస్మాసురుడు పరుగు తీశాడు.అలా పరుగు తీస్తూ తీస్తూ రాజకీయాల్లోకి గెంతాడు. అదే రూపంలో ఉంటే భగవంతుడు తనను గుర్తు పట్టి విష్ణుమాయ చేస్తాడనే అనుమానంతో భస్మాసుడు అనేక రూపాలు దాల్చాడు. ఎక్కువ భాగాన్ని రాజకీయాల్లోకి పంపించాడు.
 అక్కడ ఇక్కడ అని లేదు మనకు పార్కుల్లో, మహానగరంలో బైకులపై కనిపించే కుర్ర కుంకలు మొదలుకుని రాజకీయాల వరకు అన్ని చోట్ల భస్మాసురుడు తన సూక్ష్మరూపాన్ని ప్రవేశపెట్టాడు. చిన్నకోరిక అనే మాట వినిపిస్తే అలాంటి వారిని ఒకసారి పరిశీలించి చూడండి వాడిలో భస్మాసుర లక్షణాలు కనిపించొచ్చు.


 అలా అని అందరినీ భస్మాసుడు అనలేం కొందరు గోపిలు, రాజకీయ నాయకులు కూడా కావచ్చు.


ఈ కథ నిజం కాదేమో అనే అనుమానం కలుగుతోంది. ఐనా చిన్నిచిన్ని కోరికలు లేనిదెవరికి? అన్న తరువాత నేనే సిఎంను అనే చిన్నకోరిక బాబుగారికి చాలా కాలం నుండే ఉండేది. వదిన రూపంలో స్పీడ్ బ్రేకర్ అడ్డోస్తే రోడ్డునే తవ్వేసి స్పీడ్ బ్రేకర్‌ను తప్పించి సిఎం అయ్యాడు.


 కోరిక తీరుతుందని కలలో కూడా అనుకోకుండానే రోశయ్య చిన్న కోరిక తీరిపోయింది. కిరణ్‌కుమార్‌రెడ్డి అమ్మగారి ముందు క్యూలో నిల్చుని తన చిన్నకోరిక తీర్చుకున్నారు. జగన్‌మంకుపట్టు పట్టి రోడ్డున పడ్డాడు.

మణులడిగానా? మాణిక్యాలడిగానా? ఏదో చిన్న కోరిక తెలంగాణ ఇమ్మన్నాను అంతే కదా! అని కెసిఆర్ గుర్రు మంటున్నాడు.


 అడగక ముందే చిన్న కోరిక తీర్చారు మరి అడిగిన చిన్నకోరిక గవర్నర్ పదవి సంగతేమిని రోశయ్య అడుగుతున్నారు.
 మంచి దయ్యమా నీ చిన్న కోరికేమిటి? అంటే మనిషిని కావాలని అంది. నీ కోరికేంటి అని వడ్డీ వ్యాపారినడిగితే ఎవరికీ చెప్పరు కదా! అని ఒట్టేయించుకుని మెల్లగా చెప్పాడు ‘‘ఏదో ఒక రోజు ప్రపంచ బ్యాంకు నా వద్దకు అప్పు కోసం రావాలి’’ అన్నాడు.. వాడొస్తే ఎంత రేటుకిస్తావేమిటి? అంటే ‘‘వాడొస్తే,నిన్నేవ్వడు నమ్ముతాడు   నీకు చచ్చినా లోన్ ఇవ్వనుపో అని చెప్పాలనేది మరో కోరిక’’ అన్నాడు.

 ఈ ‘కాలం’ ఇలా సాగిపోవాలని ,చదివి  బాగుందని అనాలని చిన్నకోరిక.

28, జూన్ 2011, మంగళవారం

ఛానల్స్ మాటలకు అర్థాలే వేరులే..cinima


ఛానల్స్ మాటలకు అర్థాలే వేరులే...

-బి.ఎం.

* ఆకాశానికెత్తేస్తారు.. పాతాళంలో పడేస్తారు
* మొన్న హిట్టన్న సినిమాలన్నీ నేడు ఫట్టట..
‘కత్తి! అబ్బో ఇంత అద్భుతమైన సినిమా ఇప్పటి వరకు తెలుగులో రాలేదు. ప్రపంచం అదిరిపోయేట్టుగా ఉన్న సినిమా ఇది. హాలీవుడ్‌ను తలదనే్న విధంగా ఉంది. ఇంత అద్భుతమైన సినిమా తీయాలనే ఆలోచన మీకెలా వచ్చింది, ఈ కథ ఆలోచన ఎలా తట్టింది... ఇంత గొప్ప సినిమాలో మీ నటన చూసేందుకు రెండు కళ్లు చాల లేదండి జూ.ఎన్టీఆర్’’ ఇవి మొన్నటికి మొన్న తెలుగు ఛానల్స్ అన్నింటిలో ఊదరగొట్టిన డైలాగులు. కొంచెం అటూ ఇటూగా దాదాపు అన్ని ఛానల్స్‌లోనూ ఇవే మాటలు వినిపించాయి. అలానే పవన్ కళ్యాణ్, రాంచరణ్ సినిమాలు వచ్చినప్పుడు ఇలాంటి డైలాగులే వినిపించారు. ఛానల్స్ రెండు వారాల పాటు ఇలాంటి డైలాగులు వినిపించినా పాపం ఆ సినిమాలు మాత్రం వారానికి మించి నడవలేదు. సరిగ్గా ఇప్పుడు అవే ఛానల్స్ ఇంత అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఇటీవల కాలంలో తెలుగు సినిమా రంగం చవి చూడలేదని చెబుతున్నాయి. జీ 24 గంటలు, మహా టీవి, టీవి9, ఎన్‌టీవి దాదాపు ఒక రోజు తేడాతో ఒకే విధమైన ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయ. తెలుగు సినిమా రంగం ఈ మధ్య భారీ సినిమా లతో దాదాపు రెండువందల కోట్ల రూపాయలు నష్టపోయిందని, కథాబలం లేకుండా కేవలం స్టార్ హీరోలను నమ్ముకొని బోర్లా పడ్డారనేది కథనం. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల వంటి స్టార్ హీరోల సినిమాలు బొక్క బోర్లా పడ్డ వైనాన్ని వివరించారు. కథను నమ్ముకోకుండా ఓవర్ యాక్షన్ చేయడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందనేది ఛానల్స్ కథనం. ఫలానా కథతో, ఫలానా విధంగా సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని తెలిస్తే నిర్మాతలైనా దర్శకులైనా అలా తీయకుండా ఉంటారా? వారికి కావలసింది సక్సెస్.. దాని కోసం ఏమైనా చేస్తారు. ఏ సినిమా హిట్టవుతుందో, ఏ సినిమా ఫట్టవుతోందో తెలిస్తే ఛానల్స్‌లో రివ్యూలు చేయడం కాదు ఏకంగా సినిమాలే తీస్తూ ఎక్కడో ఉండేవారు. సరే మరి సరిగ్గా రెండు వారాల క్రితం ఇవే సినిమాలను అద్భుతమైన సినిమాలని, తెలుగులో ఇంతకు ముందెన్నడూ రాలేదని, కొత్త రికార్డులు సృష్టిస్తాయని ఏమేమో చెప్పారు కదా! మరి వాటి సంగతేమిటి? ‘బద్రినాథ్’ సినిమాకు ఛానల్స్ పోటీ పడి ఎంత హడావుడి చేశాయి. తెలుగు సినిమా చరిత్రలోనే వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించిందని, బన్నీ నాన్న చెప్పడం ఛానల్స్ ఊదరగొట్టడం. అయినా ఇప్పుడు ఛానల్స్‌ను నమ్మి సినిమాకు వెళ్లే వారెవరున్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలో ఛానల్స్ అంతగా స్వరం మార్చేసి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయడం వింతే. నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది. సినిమాకు వెళ్లి వచ్చిన వారు బాగుంది అంటే సినిమాలు చూస్తున్నారేమో కానీ ఛానల్స్‌లో ప్రచారం చూసి నమ్మే రోజులు పోయాయి. చూసినకొద్దీ చూడబుద్ధేస్తుంది అంటూ ఛానల్స్‌లో సాగిన ప్రచారానికి రోజులు చెల్లిపోయాయి. విశ్వసనీయత అవసరం అనుకుంటే ఛానల్స్ కూడా అడ్డదిడ్డమైన సినిమాలకు కూడా అంతగా ఉచిత ప్రచారం కల్పించడం అవసరమా? ఆనేది ఆలోచించుకోవాలి. లేదంటే తమ మితిమీరిన ప్రచారమే తమకు భస్మాసుర హస్తంగా మారుతుంది. పెద్ద సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ కాగా, ఇటీవల విజయవంతం సాధించిన సినిమాల్లో 90 శాతం చిన్న సినిమాలే అని మహాటీవి ప్రత్యేక వార్తను ప్రసారం చేసింది. నరేష్ సినిమాలు మినిమం గ్యారంటీగా నిలుస్తున్నాయని, ఇటీవల సక్సెస్ అయిన చిన్నసినిమాలపై కథనం ప్రసారం చేశారు.
ప్రభువును మించిన
ప్రభు భక్తి
ప్రముఖ నిర్మాత, కవి ఎం.ఎస్.రెడ్డి ఆత్మకథ నా కథ సినిమా రంగంలో సంచలనం సృష్టించింది. హిపోక్రసీతో నిండి పోయిన సినిమా రంగంలో విమర్శను తట్టుకోరు. తట్టుకునే మాట అటుంచి విమ ర్శించే వారే కనిపించరు. ఎదురుగా ఒకరినొకరు పొగుడుకోవడం, వెనక గోతులు తవ్వడం సాధారణం. ఎంఎస్ రెడ్డి ఆత్మకథలోని అంశాలు వివాదాస్పదం కావడంతో స్టూడియో ఎన్‌లో చర్చ నిర్వహించారు. అయితే చర్చలో పాల్గొన్నవారిలో సినీ నటి కవితతో సహా మిగిలిన కొందరు ఆయన ఆత్మకథ చదవకుండానే వచ్చారనిపించింది. చాలా కాలం క్రితం ‘కాగడా’ వంటి కొన్ని సినిమా పత్రికలు సినీ పెద్దల అంతర్గత వ్యవహారాలు, గొడవలను రాసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. బహుశా ఇక సినిమాలు తీసే ఉద్దేశం, అవకాశం లేనట్టుగా ఉంది ఎంఎస్ రెడికి. తన సినిమా అనుభవాలన్నింటిని కుండబద్దలు కొట్టినట్టు రాశారు. చర్చలో ఇటీవల కవిత- ఎన్టీఆర్ మంచివారే, ఎంఎస్‌రెడ్డి మంచివారే అంటూ ఇంకా తాను సినిమా జీవితాన్ని కోరుకుంటున్నాను, ఎవరినీ నొప్పించలేను అన్నట్టుగా మాట్లాడారు. సినిమా విశే్లషకుని పేరుతో మాట్లాడిన ఒక పెద్దాయన మూడు మాటలు మాట్లాడారు. ఆ మూడు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఆయన అక్కినేని హీరోగా ఉన్నప్పటి జర్నలిస్టు. వయసు పెరిగితే చాదస్తం వస్తుందంటారు ఎంఎస్‌రెడ్డి. అలానే చాదస్తంతో రాశారు అని తేల్చారు. సరే మరి ఎంఎస్‌రెడ్డిది వయసు చాదస్తం అయితే, బట్టతలపై మిగిలి ఉన్న కొద్ది వెంట్రుకలకు రంగు వేసుకోగానే మీరు నవయువకులయ్యారా? రెడ్డి రాసినవన్నీ అబద్ధాలు అని ఒక్క ముక్కలో చెప్పారు. బాగానే ఉంది ఆ వెంటనే ఇవే విషయాలు మేం రాస్తే మండిపడతారు, మరి వాళ్లే ఎలా రాశారు అని నిలదీశాడు. గతంలో చక్రపాణి సినిమా మిస్సమ్మలో భానుమతిని ఎంపిక చేసి తరువాత సావిత్రిని తీసుకున్నారు. అలానే కొన్ని వివాదాలు ఉంటాయి. ఇలా బయటపెడితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా జర్నలిస్టులు రహస్యాలను బయట పెట్టాలని చూస్తారు, అది వారి వృత్తి ధర్మం. కానీ ఆయన మాత్రం అలా ఎలా బయటపెడతారు అంటూ చర్చలో ప్రశ్నించడం నవ్వు తెప్పించింది. ప్రభువును మించిన ప్రభు భక్తి ఈ వయసులో ఎందుకండీ. మంచి చర్చే కానీ హడావుడిగా ఆత్మకథ కూడా చదవకుండా ఏదో మాట్లాడాలని కాకుండా ముందుగా ఆత్మకథ చదివించి తరువాత చర్చ నిర్వహిస్తే బాగుండేది.

27, జూన్ 2011, సోమవారం

పుస్తకాలు చదవకండి ప్లీజ్ .........సికింద్రాబాద్ ముచ్చట్లు

ప్రశాంతంగా ఉండే కాలనీ అంతకన్నా బాగున్న ఇల్లు .సంపదను ప్రదర్శిస్త్న్నట్టు కాకుండా సింపుల్ గా అందంగా కనిపించిందా ఇల్లు .ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు కానీ నాకు మాత్రం ఇంటిని చూసి ఆ ఇంటిలో పుస్తకాలు చూడడం అలవాటు . ఇంట్లోకి అడుగు పెట్టగానే ఖరీదైన సోఫా, అడవులనుంచి కొట్టుకొచ్చిన టేకు ఫర్నిచర్ ఉందా? లేదా ?అనేది ఏమాత్రం చూడకుండా ఎదురుగా కనిపించిన అద్దాల షెల్ఫ్ పైకి నా దృష్టి వెళ్ళింది . ఆ షెల్ఫ్ లోపల పెద్ద పెద్ద బుక్స్ కనిపించాయి. షెల్ఫ్ తెరవడానికి ప్రయత్నిస్తే రాలేదు. తాళం వేసి ఉంది. అతను నువ్వుతూ తాళం చెవి నా వద్ద కూడా లేదు అన్నాడు. నేను వదులుతానా ? హీరోయిన్ ను వదిలేయి అని విలన్ ఎంత భయపెట్టినా హీరో వదలడు కదా మరి చిన్నప్పటినుంచి సినిమాలు చూస్తూ  పెరిగిన మనం ఇష్టపడ్డ దాన్ని  వదులుతామా ?  

****
అతనో పార్టీ నాయకుడు. మీడియా వ్యవహారాలు  చూసేవాడు. నాయకుడు అంటే సహజంగా ఉండే అభిప్రాయానికి భిన్నంగా ఉండే వాడు. సరదాగా కబుర్లు చెప్పుకునే వారం . నాయకుడు అన్నాక సంపాదన కోసం ఏదో ఒకటి చేయాలి.
నాయకులకు బాగా కలసి వచ్చే వ్యాపారం . కాంట్రాక్టులు. భారీగా కాకపోయినా తన స్థాయికి  తగిన కాంట్రాక్టులు చేస్తూ ప్రజా సేవ చేసేవాడు. ఓసారి విజిటింగ్  కార్డు ఇచ్చాడు .  చెన్న.......చౌదరి   అని ఉంది . నేనేమి మాట్లాడక ముందే మరో జేబులోనుంచి మరో కార్డ్ తీసి చూపాడు . అందులో అతను మైనారిటీ మతానికి చెందిన వ్యక్తి అని  సూచించే విధంగా అతని పేరు ముందు సంకేతం ఉంది .
 అది టిడిపి అధికారం లో ఉన్న కాలం . కాంట్రాక్టులు అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదండి. పనుల కోసం ఎక్కడ ఏది ఉపయోగ పడితే ఆ ఆయుధాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది అని నవ్వాడు. నైతిక  విలువల గురించి అతిగా మాట్లాడే వారికన్నా ఇలా నిర్మోహమాటంగా మాట్లాడే వారే నయం అనిపిస్తుంది. 
*****
 పరిచయమైన కొత్తలో  నేను రజనీష్ గురించి మాట్లాడితే మరుసటి రోజు రజనీష్ ఉపన్యాసాల క్యాసెట్ ఇచ్చాడు. పార్టీ కార్యాలయం లో ఆందరూ  పార్టీ గురించి మాట్లాడుకుంటుంటే భలే చెప్పాడు కదా అంటూ  మేం రజనీష్ గురించి మాట్లాడుకునే వాళ్ళం .నువ్వు రాజకీయాలకు పనికి రావు నా మాట విను అని అతనికి సలహా ఇస్తే నా అభిప్రాయం కూడా ఇదే నువ్వు చేసే పనికి నువ్వు పనికి రావు అన్నాడు. నాకు ఇది తప్ప ఇంకో పని రాదు అని చెప్పేశాను. 
***
ఓషో రజనీష్ జీవిత సత్యాలు అప్పుడే చదవడం మొదలు పెట్టాను . నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఆ పుస్తకం కిక్కు అప్పటికే నాకు మెల్లగాఎక్క సాగింది. 
 మనిషి తాను ఏదైతే కాదో అది అని చెప్పుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తాడు. ఆ పుస్తకంలో  రజనీష్  చెప్పిన ఈ మాట నాకు బాగా నచ్చింది  ఆ రోజు యం యల్ ఏ క్వార్టర్ లో అయ్యదేవర కాళేశ్వర్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం. అప్పటికి చంద్రబాబు విజయ వంతంగా తన మామను అధికారం నుంచి దించి ముఖ్య మంత్రి పదవి చేపట్టారు. ముఖ్య మంత్రిగా ఆయన హాజరు అవుతున్న తొలి కార్యక్రమం. ఆహుతులందరినీ ఒకసారి పరికించి చూసిన ఆయన  రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని ఆవేదనగా ప్రసంగించారు. చెప్పాను కదా అప్పటికే రజనీష్ మాటల కిక్కు ఎక్కడం మొదలైందని. బాబు నోటినుంచి నైతిక విలువల మాట రాగానే కిసుక్కున నవ్వాను. తన్మయంతో వింటున్నట్టు జీవించిన కొందరు నా వైపు చూశారు. పుస్తకాన్ని చదివానే అనుకో ఇప్పుడు గుర్తు చేసుకోవాలా అని నన్ను నేనే మందలించుకున్నాను. 
*** 
మళ్లీ మన చెన్న ... చౌదరి వద్దకు వద్దాం .....  అప్పుడు వారాసి గూడా లో ఉండే వాణ్ణి. పద్మారావు నగర్ పక్కనే కాబట్టి ఓసారి ఇంటికి రమ్మని పిలవడం వల్ల చె ... ఇంటికి వెళ్ళాను. షెల్ఫ్లో  అన్ని పుస్తకాలు చూసి   నేనేమి తీసుకొను ఇక్కడే చూసి ఇస్తాను అని చెప్పాను. నిజంగానే తాళం చెవి లేదు నేనే కావాలనే పారేశాను అని చె....... చౌదరి చెప్పాడు . నాకు నమ్మకం కలగలేదు . చాలామంది ప్రముఖులు పెద్ద పెద్ద పుస్తకాలను అలంకరణ కోసం పెడతారు.  హాలులో  విప్పి చూడని  హిందూ పేపర్, షెల్ఫ్ లో  భగవద్గీత  చాలా చోట్ల చూసినవే నాకు తెలుసులే అని అన్నాను. ఆతను అదికాదు అని అసలు విషయం చెప్పాడు.   నేను అలాకాదు నిజంగానే అవి చదివాను . ఎదురుగా కనిపించే వాటిలో  అంబేద్కర్ బుక్స్ కూడా చాలానే ఉన్నాయి . అంబేద్కర్ బౌద్ద మతాన్ని స్వికరించేప్పుడు చెప్పిన విషయాలు అధ్బుతం . మతం గురించి, తన జీవితం గురించి, తాను ఎదుర్కొన్న వివక్ష గురించి , మనిషి కి మతం ఏ విధంగా మేలు చేయాలో చెబుతూ అనేక మతాల సారాన్ని వివరిస్తూ ఉపన్యసించారు . ఆ పుస్తకాల్లో అది కూడా ఉంది. ఆ బుక్ చదివాక అది నాపై తీవ్రమైన ప్రభావం చూపింది.  చివరకు నేను కాంట్రాక్ట్ పనులు చేయలేక పోయాను. నేను చేసే పనిలో ఎన్నో తప్పులు తప్పవు . నిజాయితిగా ఉంటే భార్యాపిల్లలకు తిండి కూడా పెట్టలేను , కాంట్రాక్టులు చేయలేను అన్నాడు. కనీసం నెల రోజుల పాటు ఆ పుస్తకం నన్ను వెంటాడింది . ఒక్క పుస్తకం తోనే నా పరిస్థితి ఇలా మారింది అన్ని చదివితే ఏమవుతుందో అని భయమేసింది  అప్పుడే ఆ షెల్ఫ్ కు లాక్ వేసి కీ పారేశాను,  ఇక నాకు విశ్రాంతి కావాలి అనుకున్నరోజున ఆ షెల్ఫ్ తెరుస్తాని అని చెప్పాడు. 

***
అతని కథ మనకు తెలియక ముందే మనం పిల్లలను పుస్తకాలకు దూరంగానే పెంచుతున్నాం .  చిన్నప్పుడు చందమామ కథలు పెద్దయ్యాక నీతి కథలు చదివి చాలా మంది చెడిపోయారు . సరే ఇప్పుడు అది కాస్త తగ్గింది. 10 వ తరగతి వరకు అమ్మమ్మ , నానమ్మలను పలకరించెంత సమయమే ఉండదు . ఇక వారు చెప్పే కథలు వినేంత సమయం ఉంటుందా? తరువాత రెండేళ్లపై ఎలాంటి దిగులు అవసరం లేదు. చైతన్య, నారాయణ వాళ్ళు ఉపిరి తీసుకోవడానికి కొంత  సమయం ఇస్తారు తప్ప సాహిత్యానికి ఇవ్వరు. కాబట్టి మనం రెండేళ్ళు బయపడాల్సిన అవసరం లేదు. 
****
మనిషి మనిషిగా మారడం అత్యంత ప్రమాదకరం. పుస్తకాలతో ఆ ప్రమాదం ఉంది.

 ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము 
నరుడు narudouta యెంతో దుష్కరము  సుమ్ము -గాలిబ్  
అన్నింటికన్నా మనిషి మనిషి కావడం కష్టం అంటాడు గాలిబ్ . పుస్తకాలు అలాంటి కష్టమైన పనిని సులభంగా చేసేప్రమాదం ఉంది.  లాడెన్ లాంటి వాడిని సైతంమనిషిగా మార్చేంత ప్రమాదకరమైంది సాహిత్యం. 
****
 రాకుమారుడిని అష్టకష్టాలు పడి పెంచిన రాజమాత ఎక్కడికైనా వెళ్ళు ఆ గుహలోకి మాత్రం వేళ్ళకు అని జాగ్రతలు చెబుతుంది. రాజ కుమారుడు మాత్రం చివరకు  ఆ గుహలోకే వెళ్లి రాక్షసునితోపోరాటం వంటి కష్టాలెన్నో కొని తెచ్చుకుంటాడు.  వద్దని చెబుతాం లేదు మేం మనుషులుగానే ఉండాలను కుంటున్నాం. చదువుతాము అంటే అది మీ ఇష్టం .  ఆవిడెవరో ఆలమూరు సౌమ్య వివాహ భోజనంభు అంటే కడుపు నింపు కుందామని వెళితే మెదడు నింపుకోవడానికి పుస్తకాల జాబితా ఇచ్చింది . మరో 54 మంది . మెదడు నింపుకోవడానికి మరిన్ని పుస్తకాల పేర్లు ఇచ్చారు. మరింత మంది తమ తమ బ్లాగ్స్ లో  తాము చదివిన బుక్స్ పై సమీక్షలు చేస్తున్నారు . నేను ముందే చెబుతున్నాను పుస్తకాలతో చాల ప్రమాదం . వాటిని నమ్మొద్దు అవి మనిషిని కుదురుగా ఉండనివ్వవు . మానవత్వం తో వ్యవహరించెట్టు చేస్తాయి. మనిషికి ఇంతకన్నా ప్రమాదం ఇంకేముంటుంది .
(సికింద్రాబాద్ ముచ్చట్లు ౫)

24, జూన్ 2011, శుక్రవారం

లక్ష వత్తుల నోము... సుమన్ .వెయ్యి సినిమాల నోము

బాబు సుమన్ నీ అదృష్టాన్ని చూస్తే జెలసి కలుగుతోంది బాబు . అంతా తమ తమ గోడు వేల్లబోసుకోవడానికి బ్లాగ్స్ మొదలు పెట్టినంత సులభంగా నువ్వు సినిమా తిసేస్తున్నావు  . అందుకే బ్లాగర్స్ నిన్ను ఆదర్శంగా తీసుకోని ఎవరి బ్లాగ్ కు వారే సుమన్ అనే నినాదం లేవదీశారు ( ఈ నినాదం నాకు నచ్చిన నినాదం కానీ నాది కాదు ) థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనుగొన డానికి  వెయ్యి ప్రయోగాలు చేశాడు. వెయ్యవ సారి విద్యుత్ బల్బు కనుగొన్నాడు . బల్బును ఎలా చేయకుడదో 999 మార్గాలు తెలుసుకున్నాను అని , తన ప్రయోగం విజయ వంతం అయ్యాక చెప్పాడు. 

 జూన్ 26 నా   నీ మరో సినిమా మమత మీ టివి లో విడుదల అవుతుందనే హెచ్చరిక ఇప్పుడే చదివాను. నీ సినిమాలపై బ్లాగ్ లోకం లో పిచ్చి అభిమానం బాబు. నిజంగా ఆ సమయం లో నేను ఆఫీసు లో ఉండి తీరాలి లేక పొతే చూడడానికి అదేం భాగ్యం బాబు. నువ్వేమన్నా పరాయి వాడివా మా తెలుగు వాడివే కదా . ఐనా ఇప్పటి వరకు నువ్వెన్ని సినిమాలు తిశావని . చేతిలో స్టూడియో ఉండి చూపడానికి టివి ఉండి. చూసేందుకు బాబు సుమన్ అస్సలు భయపడవద్దు బాబు .. భయపడితే మనదేశానికి అమెరికా నుంచి సముద్ర మార్గం కనిపెట్టే వారా? ఎర్రగా ఉందని టమాట ను చూసి తొలుత బయపడిన  వారు అలానే ఉంటే అంత రుచికరమైన టమాట మనకు దక్కేదా? మేమున్నాం. భయపడకు తీయి బాబు తీయి  . 

థామస్ ఆల్వా ఎడిసన్ అంత గోప్పవాడవు కావాలంటే కనీసం వెయ్యిసినిమాలు తీయాలి బాబు . ఎజన్మలో చేసుకున్న పుణ్యమో నీ కిన్ని అవకాశాలు. ( వాళ్ళ  నాన్న సంగతి మనకెందుకండి. మన సుమన్ బాబు మనకు ముఖ్యం . ఆ మధ్య నువ్వు మీ నాన్న గురించి మరో పేపర్లో ఇంటర్వ్యు లో ఏదో చెబితే ఇదంతా వై యస్ ఆర్ కుట్ర అని నన్నపనేని విమర్శించారు . ఇప్పుడు నువ్వు సినిమాలు తీయడం వెనక యువనేత కుట్ర ఉందని అనే వాళ్ళు అనుకుంటారు నువ్వు పట్టించుకోకు . ఆడ వాళ్ళు లక్ష వత్తుల నోము నోచుకున్నట్టు నువ్వు వెయ్యి సినిమాల నోము నోచుకోవాలని , వందేళ్ళు హీరోగా నటిస్తూ వర్ధిల్లాలని మన రాజకీయ  నాయకులురాష్ట్రాభివ్రుద్దినికోరుకున్నంత మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.....
  నీ నుంచి కుటుంబ కథ చిత్రాలు వచ్చాయి. డబుల్ యాక్షన్ చిత్రాలు వచ్చాయి. పౌరాణిక చిత్రాలు వచ్చాయి. నీ నుంచి ఇక రావలసింది ఒక దయ్యం సినిమానే బాబు . చచ్చి లోకాన ఉన్నాడో కానీ హిచ్ కాక్ కూడా భయపడాలి అలా ఉండాలి ఆ దయ్యం సినిమా 

( అతని సినిమా ఎలా ఉంటుందనే విషయం పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు ఆతను నిజంగానే సొంతంగానే కథ , మాటలు రాస్తాడట. చాలా మంది ప్రముఖులుఘోస్ట్  చేత రాయిస్తారు. పెద్దల పిల్లలు అడ్డమైన అలవాట్లతో దారి తప్పుతుండగా ఆతను అలా కాకుండా సాహిత్యం పై ఆసక్తి పెంచుకున్నందుకు అభినందనలు )  

22, జూన్ 2011, బుధవారం

దయ్యం నిజం.. దైవం నమ్మకం!

నమ్మకమే జీవితం. జీవితం అన్నాక నమ్మకాలుంటాయి. నమ్మకాలున్నప్పుడు మూఢనమ్మకాలూ ఉంటాయి. మనకున్న మూఢనమ్మకాల్లో దయ్యాలకు కాళ్లు వెనక్కి ఉంటాయనేది ఒకటి. అది మూఢనమ్మకం అని నా గట్టినమ్మకం.


 మనకు గట్టినమ్మకం అనిపించింది ఎదుటి వాడికి మూఢనమ్మకం అనిపించవచ్చు, ఎదుటి వాడికి గట్టినమ్మకం మనకు పిడివాదం అనిపించొచ్చు. ఎవరిష్టమొచ్చినట్టు వాళ్లు జీవించే హక్కున్నప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వారు మూఢనమ్మకాల్లో ఉంటారు.
 ఒకరి మూఢనమ్మకంలో మరొకరు జోక్యం చేసుకోకపోవడమే ప్రజాస్వామ్యం. పరస్పర మూఢనమ్మకాలను గౌరవించుకోవడంపైనే ప్రజాస్వామ్య మనుగడ ఆధారపడి ఉంది.
అందుకే దయ్యాలకు కాళ్లు వెనక్కి తిరిగి ఉంటాయనేది మూఢనమ్మకం అని నా నమ్మకం.



 ఏం దయ్యాలకు కాళ్లు వెనకే ఎందుకుండాలి మనం దోవతి నుంచి జీన్స్‌లోకి అటు నుంచి చిరిగిపోయిన జీన్స్ నుంచి సగం ప్యాంట్‌లోకి వచ్చినట్టు, ఆడవాళ్లు చీరల నుంచి చుడీదార్‌లోకి వచ్చినట్టు దయ్యాలు కూడా వాటి కాళ్లు వెనక నుంచి ముందుకు ఎందుకు తెచ్చుకోవు. దయ్యాలు కొండలను ఎత్తుతాయి, భవనాలను చిటికెనవేలుతో కూల్చేస్తాయి. రాజకుమారిని అరచేతిలో మంచంతో సహా లేపుకుపోతాయి. మనిషి  మెదడు తల నుంచి మోకాలికి వస్తుండగా, దయ్యం కాళ్లువెనక  నుంచి ముందుకు ఎందుకు రావు. మళ్లీ దయ్యాలున్నాయా? అనే సందేహం ఎందుకు దేవుడున్నాడా? అని సందేహం లేనప్పుడు దయ్యాలున్నాయా? అనే సందేహం రావలసిన అవసరమే లేదు.
దయ్యాన్ని చూశానని, మాట్లాడానని, చెప్పేవాళ్లు చాలా మంది కనిపిస్తారు. దయ్యం పడితే కాల్ చేయండి మేం వచ్చి తొలగిస్తాం అని పత్రికల్లో ప్రకటనలు ఇస్తుంటారు ! దేవుడి విషయంలోనైనా అనుమానాలు ఉండొచ్చు కానీ దయ్యం విషయంలో మాత్రం అలాంటి అనుమానాలు అస్సలు వద్దు. నీ పొరుగువాడిని ప్రేమించు అని ఒకరంటే మనిషిలోని దైవాన్ని చూడు అని మరొకరన్నారు. మనిషిలో దైవం కనిపించడ కష్టమేమో కానీ దయ్యం మాత్రం అడుగడుగునా కనిపిస్తుంది. అందుకే దయ్యం వాస్తవం, దేవుడు నమ్మకం అనిపిస్తోంది. 

విఠలాచార్యకు దయ్యాలకు అవినాభావ సంబంధం ఉంది. ఆ రోజుల్లో ఆయన్ని చూసి చాలా మంది నటీనటులు దయ్యాన్ని చూసినట్టు భయపడేవారట! షూటింగ్‌కు ఆలస్యంగా రావడం వంటి తలతిక్కపనులతో దర్శకులను, నిర్మాతలను ముప్పు తిప్పలు పెట్టే నటీనటులు విఠలాచార్య విషయానికి వచ్చే సరికి పెంపుడు దయ్యాల్లా చెప్పినట్టు వినేవారట! ఓ సారి ఇలానే హీరోగారు హీరోయిజం చూపించాలని షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చాడు.

 నేనూ నా కోడి లేకపోతే ఎలా తెల్లారుతుందో చూస్తాను అన్న ముసలవ్వలానే హీరోగారు మెల్లగా స్టూడియోకు వచ్చాడు. హీరోలేక నిర్మాత, దర్శకుడు కన్నీళ్ల పర్యంతం అయి ఉంటారని, సందులు గొందులు వెతికి ఉంటారని ఏవేవో ఊహించుకుని హీరో స్టూడియోకు వస్తే అక్కడ ఈయన్న పట్టించుకున్నవారే లేరు. షూటింగ్ సాగిపోతోంది. హీరోను మార్చారా? అని అనుమానం వచ్చి చూస్తే హీరోయిన్ ఒడిలో కుక్కుంది. అంత అందమైన హీరోయిన్ ఒడిలో ఆ కుక్క గారాలు పోవడం చూసి ఆపండి అని హీరో గట్టిగా అరిచాడు.

 ఇది పెళ్లి పీటల మీద వినిపించాల్సిన డైలాగు అని సర్ది చెప్పారు. ఏం జరుగుతుందిక్కడ నాకు ఇప్పుడే తెలియాలి అని అడిగితే హీరోను దయ్యం కుక్కగా మార్చేసింది. దాంతో ఇప్పుడు ఆ కుక్కతోనే హీరోయిన్ డ్యూయెట్ పాడుతోంది అని సమాధానం వచ్చింది. కథలో అలా లేదు కదా! అని ఆశ్చర్యపోతే ఇప్పుడు వచ్చిన ఐడియా అందుకే కథలో ఈ మలుపుఅని సమాధానం వచ్చింది.

 బుద్ధి గడ్డితింది అని హీరో బావురుమన్నాడు. కాళ్ల బేరానికి వచ్చాడు. అప్పటి నుండి నటీనటులు విఠలాచార్య దగ్గర ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండేవారట! కోపం వస్తే ఇక నీ పాత్ర ముగిసింది నువ్వు పిల్లివయ్యావనో, ఎలుకవయ్యావనో చెప్పి వాటితో నటింపజేస్తారని భయపడేవారట!

 నిజమే ఎప్పుడూ నాలుగైదు దయ్యాలను వెంట ఉంచుకుంటే ఎదురుండదు. పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నప్పుడు పెంపుడు దయ్యాలు ఎందుకుండవద్దు. మనం అనుకుంటాం కానీ చాలా మంది దయ్యాలను పెంపుడు జంతువుల్లా తమతో అట్టిపెట్టుకుంటారు. అవి దయ్యాలు కాబట్టి మనకు కనిపించవు. పరీక్షించి చూడండి ప్రతి మనిషిలో కనిపించని దయ్యం ఉంటుంది. చూసే ఓపిక ఉండాలి. నాయకుల్లో అధికారం అనే దయ్యం ఉంటుంది.

 వారికి అధికార దయ్యం పట్టిన తరువాత వారు అధికారం కోసం ఏమైనా చేస్తారు. చాలా మంది నాయకుల్లో ఎన్నో సుగుణాలు కనిపిస్తాయి కానీ ఈ అధికారమనే దయ్యం వారితో ఏ పనైనా చేయిస్తుంది. ఆదాయం కోసం ఎన్నో వ్యాపారలు ఉండగా, రాజకీయాలనే ఎందుకు నమ్ముకున్నారని ప్రశ్నిస్తే చిరునవ్వుతో దాటవేస్తారు. దయ్యం కోరుకునేది అధికారం కానీ కేవలం సంపాదన మాత్రమే కాదు కదా!
దయ్యాల్లో అనేక రకాలు ఉంటాయి

 కొరివి దయ్యం, ఆడ దయ్యం, పిల్ల దయ్యం, కామ పిశాచం అంటూ రకరాలుగా ఉంటాయి. చాలా సినిమాల్లో దయ్యాలను మరీ బఫూన్లుగా చూపిస్తారు కానీ అవి మరీ మనుషులంత బఫూన్లు కావు, మనుషుల కున్నంత క్రూరత్వం ఉండదు. రాజకీయ దయ్యాలు మరీ చిత్రమైనవి. తమ చిత్రవిచిత్ర వేషాలతో అవి ఎప్పటికప్పుడు ప్రజలను తమపై నమ్మకం పెంచుకునేట్టు చేస్తాయి.

 పాడుపడిన శ్మశాన వాటికల్లో దయ్యాలు తమ మానాన తాముంటే వాటిని ఆక్రమించుకుని దయ్యాలను రోడ్డుపాలు చేసే మనుషుల కన్నాదయ్యాలు క్రూరమైనవేమీ కాదు. దయ్యాలు విడిగా ఉన్నప్పుడు బుద్ధిమంతురాళ్లుగానే ఉంటాయి. అవి మనిషితో కలిసినప్పుడే , అధికారం కోసం ఏమైనా చేయబుద్ధవతుంది. దయ్యం ప్రభావం మరీ ముదిరిపోతే నైతిక విలువల గురించి ఊరూరు తిరిగి ఉపన్యాసాలు ఇవ్వాలనిపిస్తుంది. ప్రపంచ పు దయ్యాలు ఏకం కావాలి. పోరాడితే పోయేదేమి లేదు మానవ సంకెళ్లు తప్ప.

20, జూన్ 2011, సోమవారం

నీకు అంత దైర్యం ఎక్కడిది నాయనా

మహాత్మా గాంధీ కుమారుడు తన తండ్రిపై రాసిన పుస్తకం లో మోహన్ దాస్ కరం చంద్ గాంధీ  ఈ దేశ ప్రజల దృష్టిలో జాతిపిత, మహాత్ముడు కావచ్చు. కాని ఒక కుమారుడిగా, తన తండ్రి   గాంధీ పై తన  అభిప్రాయం అది కాదు.    గాంధీ అంటే ఒక విఫలమైన  తండ్రి అని  అన్నాడు. 
 మహాత్ముడు ఈ నేలపై నడయాడిన దేవుడు అని భావించే ప్రజల్లో  నేను ఒకడిని . కాని ఒక కుమారుడుగా మాత్రం .నా ఓటు మహాత్ముని కుమారుడికే . 
జాతిపిత కావచ్చు ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్న వారైనా  కావచ్చు తన పిల్లలను తీర్చి దిద్దాల్సిన బాధ్యత తండ్రిపై ఉంటుంది . తండ్రి విఫలమైతే మొత్తం కుటుంబమే విఫలమౌతుంది . 
***


మా నాయనను అనేక ప్రశ్నలతో కడిగేయాలని నాకు ఎన్నాళ్ళనుంచో ఉంది. హైదరాబాద్ నగరానికి కేవలం 45 -50   కిలోమీటర్ల దూరం లో ఉన్న ఊరు మాది నల్లగొండ జిల్లా  మన్నెవారి తుర్కపల్లి ( నేను మా ఊరు ఎప్పుడూ వెళ్ళలేదు ) ఎకరం కోటి రూపాయల వరకు ధర పలుకుతుందని తెలియగానే . తాతల కాలం నుంచి వచ్చిన అన్ని ఎకరాల  భూమి మాకోసం ఉంచాలని అనిపించలేదా నాన్న ? నీకా ముందు చూపు లేక పోవడం వల్లనే కదా మహానగరంలో మేం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది అని నిలదీయాలని ఉండేది . పోనీ హైదరాబాద్ వచ్చావు. హైదరాబాద్  గాంధీ నగర్ లో భూమి ధర  ఇప్పుడు బంగారం కన్నా ఎక్కువ ఖరీదు చేస్తుంది. అప్పుడు  వెయ్యి రూపాయ లకో ప్లాట్ వచ్చేదట తలా ఓ ప్లాట్ కొని పెట్టినా బాగుండేది కదా . అలా ఎందుకు చేయలేక పోయావు నాయనా? 
మీ అమ్మకు బోలెడు బంగారం పెట్టరురా అని మేనమామ చెప్పినప్పుడు కనీసం ఆ బంగారం దాచలేక పోయావా? అని అడగాలనుకున్నా .. ... . .. నిజాం కాలం లో తెలంగాణా పల్లెలను దోచుకోవడానికి అవకాశం ఉన్న స్థానంలో  ఉండి..  దోచుకోక పోయినా పరవాలేదు కనీసం ఉన్నది ఎందుకు దాచలేక పోయావని ప్రశ్నించాలని   అనిపించేది ..... ఇంకా ఇలాంటి ప్రశ్నలు నాలో అనేకం ఉండేవి  . 
*****
ఇప్పుడు కుడా ప్రశ్నించాలనే   అనుకుంటున్నాను . కాని నా ప్రశ్నల సంఖ్య మారింది, ప్రశ్నలూ మారాయి .
నీకు అంత దైర్యం ఎక్కడిది నాయనా? అని ఒకే ఒక ప్రశ్న అడగాలని ఉంది.  
నిజంగా పేదరికం కవులు వర్ణించినంత భయంకరంగా ఏమి ఉండదు.
 కసిని పెంచుతుంది , మనలోని శక్తి సామర్థ్యాలకు  సాన పెడుతుంది. సరిగ్గా ఎదుర్కొంటే తోక ముడుస్తుంది. సంపదలో పెరగడం అంత అదృష్టం కాదు, కష్టం కుడా కాదు . కాని సంపదనుంచి  పేదరికం లోనికి మారి బతకడం చాల కష్టం .
 నిజాం కాలం లో గ్రామం లో పెత్తనం చెలాయించే ఇద్దరు ముగ్గురిలో పోలీసు పటేల్ ఒకరు .. మా నాన్న పోలీసుపటేల్ గా  ఉండే వారు . దాదాపు పన్నెండు గ్రామాల వారికి వడ్డీకి డబ్బులు ఇచ్చేవారు.  మా నాన్నా సంపదలో పుట్టి, సంపదలో పెరిగారు  .మాకు ఊహ  తెలియక ముందే అంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది . సంపద ఉన్నదనే తెలియనప్పుడు ? ఎటుపోయిందో?  ఏం తెలుస్తుంది . 

*****
నిజమే మా నాన్నకు పెద్ద వ్యసనాలే ఉండేవి .మనుషులను నమ్మడం, మనుషులను ప్రేమించడం .. ఎలాంటి వారైన చావు దెబ్బ తినడానికి మనుషులను నమ్మడమనే ఒక్క వ్యసనం సరిపోదూ ? మనుషులను ప్రేమించడం వరకు క్షమించేయవచ్చు , కానీ  మనుషులను పూర్తిగా నమ్మడం మాత్రం ఎప్పటికైనా ప్రమాదమే. .....
మా నాన్నకు మనుషులను నమ్మడమనే వ్యసనం ఉంటే మా పెద్దన్నకు మనుషులను అస్సలు నమ్మకపోవడం అనే పెద్ద వ్యసనం ఉంది. తన వ్యసనం వల్ల  సంపదలో పుట్టినా  పేదరికం లో బతికాడు మా నాన్న .. నమ్మకపోవడమనే  వ్యసనం వల్ల మా అన్న మాత్రం పేదరికాన్ని చాలెంజ్ చేసి సంపన్నుడు అయ్యాడు . తండ్రి వ్యసనాన్ని చూసి మా అన్న ఒకే ఒక పాటం నేర్చుకున్నాడు. ఎవరినీ నమ్మవద్దు అనే సత్యాన్ని నమ్ముకున్నాడు. .  ఆ నమ్మకమే అతన్ని బట్టల కొట్టు గుమస్తా నుంచి బంగారం  దుకాణం యజమానిగా మార్చింది , అద్దె ఇంటిజీవితం మొదలు పెడితే   ఒకటిన్నర డజన్ల ఇళ్లనుంచి అద్దెలు వసూలు చేసే యజమానిగా మార్చింది. అందరినీ నమ్మితే ఎమోతుందో నాన్న ఉదాహరణగా నిలిచారు. అలా అని అస్సలు మనుషులను నమ్మకుండా ఎలా ఉంటాం . అందుకే నాకు  ఆ రెండు వ్యసనాలలో  కొంచం కొంచం వ్యసనం చాలనిపించింది . 
***
 రామాయణం, మహాభారతం , పురాణాల నుంచి కొన్ని ఉదాహరణలతో వ్యక్తిత్వ వికాసం పై ఓటమే గురువు పుస్తకం రాశాను . మిత్రులకు పుస్తకం ఇస్తుంటే అక్కడికి కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ మిత్రుడు నా చేతిలోని బుక్ పై ఇంటి పేరు చూసి ఈ ఇంటిపేరు గలవారు మా కు తెలుసు మా ఊరే అని ఆసక్తి చూపించాడు. మా ఊరిలో బుద్దా కాశయ్య  అని ఉండే వారు , మా నాన్న ఆయన శిశ్యుడు . తెలంగాణా సాయుధ  పోరాట సమయం లో కలిసి పని చేశారు . వాళ్ళ ఇంట్లో ఎప్పుడు  చూసినా జనం సందడి  .అంటూ చెప్పుకు పోతున్నాడు. చాల సంతోషం వేసింది . అతను చెబుతున్నది మా నాన్న గురించి. కొద్ది సేపటి తరువాత చెప్పాను ఆయన మా నాన్న అని . ఆ తరువాత ఆ మిత్రుడు చాల సార్లు అన్నా ఓసారి ఊరికిరా అని అడిగాడు. వస్తానని చెప్పను కాని ఎందుకో నాకు పెద్దగా  ఆసక్తి అనిపించలేదు . ఓ సారి  కొంచం ఆశర్యంగా, వింతగా చూస్తూ  మన ఊరు చూడాలని నీకు ఎప్పుడూ  అనిపించలేదా అని అడిగాడు. చిరునవ్వే సమాధానం. ఓసారి అక్కడి యమ్. యల్.ఏ. తో ఏదో మాట్లాడుతుంటే  మురళి నువ్వు మానురివాడివే నట కదా అంటూ ఊరికి చెందినా కొందరు పెద్దల పేర్లు చెప్పి  వీరంతా నాకు పరిచయమే అని చెబుతుంటే ఒళ్ళు పులకరించినట్టు అయింది చిన్నప్పుడు ఆ పేర్లన్నీ  మా నాన్న మాటల్లో  తరుచుగా వినిపించేవి .
 *** 
నాకు కొద్దిగా ఎరుక అనేది వచ్చిన  తరువాత గుర్తున్న విషయం . రక్త సంబందికులకు  బందించిన సమస్య.  తాతలనాటి ఆస్తి పాతవారిని ఖాళీ చేయించి భారీ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి. తేడా వస్తే ఏమైనా జరగ వచ్చు . ఎవరితో వ్యవహారాలు ఎలా జరపాలో నాకు తెలుసు బయపడకండి అంటూ ఆరు నెలలు రాత్రి పగలు నాన్న అక్కడే ఉన్నాడు. పదే పదే రుజువు అయ్యేదాన్నే సత్యం అంటాం . అక్కడ నమ్మితే మోసమే అనేది మరోసారి రుజువైంది . మానాన్న మాత్రం ఎప్పుడూ సంతృప్తి కరంగానే కనిపించేవారు, చిన్నచిన్న వాటికి సంతోష పడే వారు  
**** 
స్టాక్ మార్కెట్ పడిపోవడం తో మొన్న ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వాళ్ళ భార్య కుడా చనిపోయింది . ఆ వార్త  బాధ కలిగించింది  వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు , ఒకరు iit లో టాప్ రాంక్ సాధించారు .చచ్చి వాళ్ళు సాధించింది ఏముంది . ఆర్ధిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్య  . పిల్లలను బావిలో పడేసి తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి .. ఇలాంటి వార్తలు చదివినప్పుడు మనుషులు ఎందుకు అంత పిరికిగా  ఆలోచిస్తారని అనిపిస్తుంది. 
****
నీకు అంత దైర్యం ఎలా వచ్చింది అని మా నాన్నను అడగాలని ఉంది. పోలీసు పటేల్ గా ఉంటూ సాయుధపోరాటానికి అండగా ఉండడం కాదు.. ఈ నేల నలు చెరుగులా పోరాట గాలులు వీస్తున్నప్పుదు . ఆ గాలి నుంచి ఎవరు తప్పించుకోలేరు .  నా సందేహం అది కాదు ..  బంధువులు తప్పా ఏ ఆధారం లేకుండా పదిమందితో హైదరాబాద్ మహానగరం లో అడుగుపెట్టడం. ఎవరి జీవితాన్ని వారు నిర్మించుకునేట్టు చేయడం చూస్తే  ... అంత ధైర్యం ఎలా వచ్చింది అని అడగాలని ఉంది . పిల్లలకు ఎలాంటి పరిస్థితి నైన ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వండి చాలు ...మార్కెట్ పడిపోతే , ఉద్యోగం పోతుందంటే ఆత్మహత్యను మార్గంగా చూపించకండి . ఏమో ఈ రోజు బావిలో తల్లితో పాటు శవంగా తేలుతున్న పిల్లవాడిని బతకనిస్తే జీవితంలో తలెత్తుకొని నిలబడే వాడేమో . 
****
సంపద నుంచి పేదరికం లోకి మారాక జీవితం నరక ప్రాయంగా ఉంటుంది కాని నాకు గుర్తున్నంత వరకు మా నాన్న ముఖం లో నేను నిరాశను ఎప్పుడు చూడలేదు . నమ్మినవారు మోసం చెసినా అస్సలు పట్టించుకోలేదు . ఉన్నంతలో పిల్లలతో హాయిగా ఉండాలి అంతే. మనం ఫిల్ఖాన లో ఉండగా నాన్న కోసం ఆ నాడు సాయుధ పోరాటం లో పాల్గొన్న వాళ్ళు కొంతమంది వచ్చి ఆనాటి ముచ్చటలు చెప్పుకునే వారని మా చిన్నన్న చెప్పాడు. 
ఓ సారి మా చిన్నమ్మాయి నాన్నా అంతా సెలవుల్లో మా ఉరేలుతున్నాం అని గొప్పగా చెబుతున్నారు , మనకు ఉరులేదా మనం వెళదాం అంది. హైదరాబాదే మన ఊరు అని సింపుల్ గా చెప్పాను. 
 ఇప్పుడునాకు మా ఊరు వెళ్ళాలని ఉంది .మా ఊరికి వెళతాను. ఉరి ముచ్చట్లు మా నాన్న ముచట్లు సేకరిస్తాను. 
****
 ఈ ఫీజులు , ఖర్చులు చూస్తుంటే ఒక్కో సారి భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది . అనే మాట ఇంట్లో వినిపిస్తే , సొంతిల్లు, ప్రభుత్వ ఉద్యోగమంత భద్రత ఉన్న ఉద్యోగం , చక్కగా చదువుకుంటున్న పిల్లలు ఇలా ఉన్న మనమే అలా అనుకుంటే మరి మా నాయన .... అంటూ మా నాన్న గురించి చెబితే నిజమే అన్నారు. నాకు ఇప్పటికీ మా నాన్నే ధైర్యం . 
అధికారంలో ఉన్న వారని వెధవలకు కుడా తలవంచి పైకి ఎదుగుతున్న వారు కళ్ళ ముందు కనిపిస్తున్నా.. నేను నిటారుగా నిలబడే వ్యక్తిత్వం తోనే ఉన్నా ... నేను రాసిన  జనాంతికం పుస్తక ఆవిష్కరణ  సభలో ప్రొఫెసర్ హరగోపాల్ నీకింత ధైర్యం ఏమిటి ?  నీమీద పోటా కేసు పెట్టవచ్చు తెలుసా అనిపుస్తకం  లోని మాటలు ప్రస్తావించారు. రాయడానికి నిజంగా పెద్ద ధైర్యం అవసరం లేదు పైరవీలు చేసుకొని బతుకుదాము అనే కోరిక లేకుంటే చాలు . కాని కష్టాలను ఎదిరించి బతుకు పోరాటం చేయడానికే ధైర్యం కావాలి .. అందుకే అంత ధైర్యం నీకు ఎలా వచ్చింది అని మా నాన్నను అడగాలను కున్నా..  
*****
ఓ చోట రాంగోపాల్ వర్మ గవాస్కర్ చెప్పిన మాట చెప్పాడు .అవుట్ అయి రాగానే పాడ్ బాయ్ కూడా మీరు ఆ బాల్ అలా కొట్టాల్సింది కాదు సార్ అని సలహా ఇస్తాడట . అలానే ఇలా చేయాల్సింది కాదు అలా చేయాల్సింది కాదు అని చెప్పడం నా  నా ఉద్దేశం కాదు . తప్పు ఎవరిది, ఎవరు ఎవరిని మోసం చేసారు అనే దానిపై కూడా నాకిప్పుడు ఆసక్తి లేదు. 
 బతుకు ఆంటే భయంకరం అనుకోని దాన్ని భయంకరంగా ఉహించుకోకండి . ఆత్మహత్య పిరికి పండ చర్య అని నేను చెప్పడం లేదు . ఆత్మహత్యకు కూడా ధైర్యం కావాలి కాని బతకడానికి అంతకన్నా మించి ధైర్యం కావాలి. బతుకు భయపెడితే పేదరికాన్ని ఈడ్చి తన్నిన మా పెద్దన్న భవనం  బేగంపేట ఆనంద్ సినిమా హాల్ వెనకాల నిటారుగా నిలబడి ఉంటుంది . ఓ సారి చూడండి. 
****
ఏసమస్య  వచ్చినా ముందు నిలిచేది మా నాన్ననే   1982 లో నేను పదో తరగతి పరీక్షలకు  సిద్ధ మౌతున్నా.. అంత్యక్రియల్లో ఏదో సందేహం . ఎందుకు కంగారు పడతారు నాన్నను అడగ వచ్చు కదా మాట నోటివరకు వచ్చి ఆగిపోయింది .  అక్కడ జరుగుతున్నవి  మానాన్న అంత్యక్రియల ఏర్పాట్లు . 
( ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా )

15, జూన్ 2011, బుధవారం

యాంటీ ‘అంకుల్, ఆంటీ ’ ఉద్యమం

అంకుల్ .. అంకుల్.. ఆ ఒక్క మాటతో నవనాడులు క్రుంగిపోయాయి. ప్రకృతి స్తంభించింది. గుమ్మడి ఉంటే ఆ సినిమాలో గుండెపోటు గ్యారంటీ అని ముందే తెలుసు కాబట్టి గుండెపోటుతో గుమ్మడి హరీ అన్నా మనకంత ఆశ్చర్యం కలగదు.
 కానీఅక్కినేనికో, హీరోయిన్‌కో క్యాన్సర్ అంటే మాత్రం మనమే కాదు ప్రకృతి మొత్తం స్త్భించి పోతుంది. సముద్రంలో పైకి ఎగిసిన అలలు ప్రకృతి నిమయానికి భిన్నంగా ఆకాశంలోనే నిలిచిపోతాయి. గాలి వీచడం ఆగిపోతుంది.
 హీరోలంటే ప్రకృతికి సైతం ప్రత్యేక అభిమానం. జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబు వస్తుంటే వందలాది కార్లు, సుమోలు గాల్లో లేవడాన్ని తప్పు పడుతున్నారు కానీ ఆ రోజుల్లో హీరోలకు, హీరోయిన్లకు కష్టాలొస్తే గాలి ఆగిపోవడం కన్నా గాలిలో కార్లు లేవడం కొంత నయం కదా!
 అలానే కొందరికి కొన్ని మాటలు వింటే ప్రకృతి స్తంభించినట్టుగా ఉంటుంది.

గోవిందు ఎన్టీఆర్‌లా నటుడు కాదు, కనీసం అభిమాని కూడా కాదు. చిరంజీవి కన్నా పాతికేళ్లు చిన్నవాడు పెళ్లయి ఆరేళ్లయింది. కానీ అమ్మాయిలు కనిపిస్తే పెళ్లికాని ప్రసాదులానే మాట్లాడతాడు. 
అలాంటి గోవిందును తొలిసారి అంకుల్ అని పిలిచాడు. పిలుపే కంపరమెత్తిస్తే ఆ పిలిచిన వాడు తన వయసు వాడు కావడం మరింత బాధ కలిగించింది.


 లిఫ్ట్ అంకుల్ అంటూ మరోసారి అదే కూత కూశాడు. పాత విలన్ ఆర్ నాగేశ్వరరావు మొదలుకొని ముంబై నుంచొచ్చిన విలన్ షిండే వరకు అందరిని కలిపి తయారు చేస్తే వీడి ముఖంలా ఉంటుందేమో అనిపించింది గోవిందుకు లిఫ్ట్ అడిగిన వాడిని చూడగానే ...


 వాడి ముఖం చూడడానికే ఇష్టం లేదు పైగా వాన్ని తన బైక్‌పై కూర్చోబెట్టుకుని సహ ప్రయాణమా!నెవర్ అంటూ నేను వెళ్లాల్సింది వెనక్కి అని బైక్‌ను వెనక్కి మళ్లించాడు. మనసు బాగాలేనప్పుడు సాయంత్రం అయితే బారుకు, ఉదయం అయితే ఇంటికే వెళ్లడం ఉత్తమం, చచ్చినా ఆఫీసుకు వెళ్లవద్దనుకున్నాడు. 


మహాత్మాగాంధీని గాడ్సె హత్య చేసినప్పుడు గాంధేయవాదులు తమ జీవితంలో అది అత్యంత దుర్భరమైన దినంగా భావించినట్టు, 9/11 రోజును అమెరికన్లు భావించినట్టు ఈ రోజు తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజని డైరీలో రాసుకున్నాడు.


 60 ఏళ్ల వయసులో కాలేజీ కుర్రాడిగా నటించి, 74 ఏళ్ల వయసులో నిజజీవితంలో పెళ్లి చేసుకున్న ఎన్టీ రామారావునే సొంత అల్లుడు అంకుల్ అని పిలవలేదు. కానీ నన్ను..... అని బాధపడ్డాడు. 


ఈ విషయంలో మాత్రం ఎన్టీఆర్ అదృష్టవంతుడే ఇద్దరు అల్లుళ్లు, పదిమంది సంతానం, చిన్న భార్య అంతా, ఆయన ప్రస్తావన వస్తే అన్నగారు అనే చెబుతారు. అల్లుడు బాబు కూడా అంకుల్ అనగా ఎవరూ విన్నవారు లేరు. 


వినగా వినగా అంకుల్ అనే మాట గోవింద్‌కు మొదటిసారి కలిగినంత బాధ మాత్రం కలిగించలేదు. చెంగుచెంగు మంటూ కాలేజీకి గెంతుతూ వెళ్లే అమ్మాయిని ఒక దుర్ముహూర్తంలో ఎవరో ఒకరు ఆంటీ అని పిలుస్తారు. అంతే అప్పటి వరకు ఐశ్వర్యారాయ్‌లా ఊహించుకున్న అమ్మాయి కాస్తా నేను కూడా ఏదో ఒక రోజు కల్పనారాయ్‌ని కావలసిందే కదా! అని దిగులు పడుతుంది.

ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందంటారు. ఐడియా సంగతెలా ఉన్నా ఒక్క మాట మీ జీవితాన్ని మార్చడం మాత్రం ఖాయం. ఆంటీ, అంకుల్ చిన్నపదంలా కనిపించినా అణుబాంబుకున్నంత పవరుంటుంది. అందాలరాముడులో రాజబాబు తీతా అని పిలిచినప్పుడు అల్లురామలింగయ్య బాధ చూడాలి. తీతా అంటే తీసేసిన తహసిల్దారు. అలానే మాజీ ముఖ్యమంత్రి అనే పదం ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి తొలిసారి విన్నప్పుడు ప్రాణం విలవిలలాడిపోకుండా ఉంటుందా?


 మనకే కాదు మహా మహా నాయకులకే ఏదో ఒక మాట జీవితాన్ని క్రుంగదీస్తుంది. తీసేసిన ముఖ్యమంత్రి అనే మాట వినపడకముందే రోశయ్య కాబోయే గవర్నర్ అని ప్రచారం చేసుకున్నారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో అవినీతిపై వీరోచితంగా రెండు గంటలు ఉపన్యసించారు. నవ్వుతూ కవ్వించే వైఎస్‌ఆర్ లేచి చాల్లేవయ్యా పెద్ద చెప్పొచ్చావు, మామను వెన్నుపోటు పొడిచిన నువ్వు కూడా మాట్లడడమే అనే వారు


. అప్పటి వరకు బాలచంద్రుడిలా వెలిగిపోయిన బాబు వెన్నుపోటు అనే మాట వినగానే డీలాపడిపోయి కూర్చునే వారు. వెన్నుపోటు పదం వినడానికి ముందు, తరువాత అంటూ బాబువి రెండు ఫోటోలను స్పష్టమైన తేడాలతో చూడొచ్చు. ఇలానే ఏదో ఒక పదాన్ని వైఎస్‌ఆర్‌కు తగిలిద్దామని బాబు బృందం విపరీతంగా కష్టపడింది కానీ సాధ్యం కాలేదు.్ఫ్యక్షనిస్టు అనే పదాన్ని కొంత కాలం ప్రయోగించారు. అది కాస్తా ఆయన గ్లామర్‌ను పెంచింది.
 దాంతో ధనయజ్ఞం ఆయుధాన్ని ప్రయోగించారు. కొద్దిపాటి ప్రభావం చూపింది కానీ ఆశించిన స్థాయిలో పని చేయలేదు.


 ఏ పదాస్త్రాన్ని ప్రయోగించి ఎదుటి వాడిని బంధించవచ్చునో గ్రహించడమే రాజకీయం. ద్రోణాచార్యుడు అలానే చెలరేగిపోతే పాండవులకు కష్టం. అందుకే కృష్ణుడు ధర్మరాజుతో అశ్వత్థ్ధామ హతః - అని చెప్పించాడు. ద్రోణాచార్యుడే కాదు మనిషన్నవాడెవడినైనా క్రుంగిపోయేట్టు చేసే మాట అది.


 ఆ మాట యుద్ధగతినే మార్చేసింది. ముఖ్యమంత్రి భార్యగా లక్ష్మీపార్వతి వెలిగిపోతున్న సమయంలో బాబు బృందం వదిలిన డైలాగు దుష్టశక్తి. ఎన్టీఆర్‌నే కట్టిపడేసిన లక్ష్మీపార్వతి ఈ డైలాగును మాత్రం తట్టుకోలేకపోయారు. ఎన్టీఆర్ ముందే గ్రహించినట్టుగా ఉన్నారు. అందుకే ఆయన అన్నగారు అనే పిలిపించుకున్నారు.
అవినీతికి పాల్పడినా సహిస్తాం కానీ అవినీతి అనే పదం పలికితే అరెస్టు చేస్తాం అని కేంద్రం వారు రాత్రికి రాత్రి రామ్ దేవ్‌బాబాను అరెస్టు చేశారు. చిన్నమాటే అని వదిలేస్తే వందేమాతరం బ్రిటిష్‌వాడినే వణికించింది. పుస్తకాలను నిషేధించినప్పుడు పదాలను ఎందుకు నిషేధించరు? క్రుంగదీసే పదాలను ఉపయోగించడం హక్కుల ఉల్లంఘనే కదా! అందుకే ‘యాంటీ అంకుల్, ఆంటీ’ ఉద్యమం నిర్వహించాలి.

12, జూన్ 2011, ఆదివారం

అత్తవారింటిలో ప్రభ అందం .. స్కూల్ పిల్ల కాయల సాహసం అను ప్రహసనం ... సికింద్రాబాద్ కథలు 5

  

వాళ్ళు స్కూల్ ఎగ్గొట్టి సినిమాకు వెళ్లారట తెలుసా ? ఆ మాటలు మా బ్యాచ్ పౌరుషాన్ని తట్టి లేపాయి. ఇతర స్కూల్స్ లో చదువుతున్న వారి మాటలు, మా స్కూల్ లో చదివే  వారి అన్నోతమ్ముడో మరో  స్కూల్ లో చదువుతుంటాడు కదా వారి నుంచి రోజుకో విశ్వసనీయ సమాచారం తెలిసేది. అదేదో సినిమాలో       షావు కారు జానకి నాగేశ్వర్ రావు తో కలిసి పాడుతుంది కదా పాండవులు పాండవులు తుమ్మెదా....కన్నెగానే బ్రతుకు గడిచిపోతుంది... అంటూ  తన జీవితం అలానే ముగిసి పోతుందని  బాధ  పడినట్టు గానే స్కూల్ లో మా గ్యాంగ్ అంతా చింతాక్రాన్తుల మై పోయాం . స్కూల్ ఎగ్గొట్టి సినిమాకువెల్ల  కుండానే స్కూల్  జీవితం ముగిసి పోతుందేమో అనే బెంగ పట్టుకుంది . 
***
ఆరు నూరైనా పన్నెండో ఎక్కం రాక పోయినా , అటు సూర్యుడు ఇటు పొడిచినా . స్కూల్ ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. సూపర్ స్టార్ కృష్ణ ఏజెంట్ ౧౧౬ లో మాదిరిగా మెల్లగా మాట్లాడుకుంటూ ప్లాన్ తయారు చేశాం . మా స్కూల్ సికింద్రాబాద్ నాలా బజార్ స్కూల్ .. సినిమా హాల్ స్కూల్ కు దగ్గరగా ఉండాలి, స్కూల్ వదిలే సమయానికి  తిరిగి రావాలి. సినిమా హాల్ లో మనకు తెలిసిన వాళ్ళు యెవరూ ఉండకూడదు . మన బడ్జెట్ కు సరి పోయే విధంగా సినిమా హాల్ ఉండాలి. ఎవరెవరు వస్తున్నారు, ఎవరేం చేయాలి అంత ప్లాన్ తయారు చేసుకున్నాం . లాడెన్ ను చంపడానికి ఆమెరికా వోడు ౪౦ నిమిషాల్లో పని ముగించు కొని వెళ్లి పోయాడు కదా అలా అన్న మాట . 
*** 
చిలకల గూడా క్రాస్ రోడ్ దగ్గరలో అమర్ అనే సినిమా హాల్ ఉంది . మా ప్లాన్ కు సరిగ్గా సరిపోయే సినిమా హాల్ అని నిర్ణయం చేశాం. స్కూల్ కు దాదాపు రెండు కిలోమిటర్లోపే ఉంటుంది . కాని సికింద్రాబాద్ వాళ్ళు ఎవరూ అటువైపు రారు . ఆనుకున్న రోజు రానే వచ్చింది .  ఏడెనిమిది మందిమి స్కూల్ ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళాం 
***
తొలి సారిగా  మన దేశం లో  సినిమాను తెరపై చుసిన వారు భయంతో పరుగులు తీసారట . కొంత మంది సాహసం చేసినట్టిగా సినిమా చుశారటా.  క్లాసు డుమ్మా కొట్టి సినిమా చూడడం సాహసంగానే  భావించినా  , మేం అలా పారిపోలేదు, భయపడలేదు కాని గొప్ప పని చేస్తున్నామన్న భావన మాత్రం బలంగా కలిగింది. అది అత్తవారిల్లు సినిమా అందం వల్ల ప్రభ , ఇంటి పేరు వల్ల వంకాయల సత్యనారాయణ పేరు గుర్తుంది. సినిమా కథేంటో, మిగిలిన నటులు ఎవరో గుర్తు లేదు .  అది అమర్ లోడైరెక్ట్ గా విడుదల అయిన  సినిమానో లేక విడుదల అయ్యాక కొంత కాలానికి వేసిన సినిమానో కూడా తెలియదు. సినీతారల చర్మ సౌందర్యానికి కారణ మైన లక్సు సబ్బును ప్రభ వాడినట్టు చూడలేదు . కాని ఆమె మాత్రం ఇప్పటికీ అంత అందంగా ఎలా ఉన్నారో. మొన్న మొన్నటి హిరోయిన్ లు రాశి, బాపు పెళ్లి పుస్తకం లో అందంఅంటే  ఇది అనిపించిన దివ్యవాణి  లాంటి వారు అంత లావుగా ఐపోతే ప్రభ మాత్రం ఇంకా అందంగా ఉన్నారు. ఈ మద్యనే ప్రభ దూరదర్శన్ లో మువ్వల సవ్వడి కార్యక్రమం నిర్వహించారు .  అంతే   అందంగా కనిపించారు.  ప్రభ అందాన్నిచూడాలంటే దానవీర  శూర  కర్ణ చూడాలి. 

****
విజయవంతంగా సినిమా చూసి ఏమి ఎరగా నట్టుగానే మరుసటి రోజు క్లాస్ కు వెళ్ళాం. మొదటి పీరియడు, రెండో పీరియడు గడిచిపోయింది. దాంతో మేం కుడా మా సాహసాన్ని మరిచిపోయం . మూడో పిరియడ్ లో సైన్స్ టిచర్ వచ్చి  అందరిని ఒక సారి చూసి మా వైపు చూపుతూ లేచి నిలబడమంది. చిత్రం మేం ఎనిమిది మందిమి సినిమాకు వెళితే సైన్స్ టీచర్ సరిగ్గా వారిని నిలబడమంది.  అంతకు ముందు వచ్చిన సోషల్ టిచర్ కు సోషల్ రెస్పాన్సిబులిటి లేకున్నా సైన్స్ టీచర్ కు మాత్రం  సోషల్ రెస్పాన్సిబులిటి కాస్త ఎక్కువే .. డొంక తిరుగుడు లేకుండా సూటిగా నిన్న మీరు ఏ సినిమాకు వెళ్లారు అని అడిగారు . మా పని అయిపోయిందని అనుకున్నాం . మెల్లగా పేరు చెప్పాం. అన్నిటికి సిద్దపడే సినిమాకు వెళ్ళాం . ఎన్నేసి దెబ్బలు పడతాయో అని అనుకుంటుంటే .. సినిమా పేరు వినగానే నవ్వు ఆపుకోలేక పోయింది.పడిపడి నవ్వుతూనే ఉన్నారు. మగాళ్ళు అంత వీరోచితంగా అత్తవారిల్లు సినిమాకు వెళ్ళడం ఏమిటి అని నవ్వింది. అసలే టిచర్ అందంగా ఉంటుంది. అంత అందమైన టిచర్ మా సాహసాన్ని నవ్వుల పాలు చేయడం తట్టుకోలేక పోయాం. అంతటితో ఊరుకోకుండా మిగిలిన టిచర్ లందరికి చెప్పేశారు. మా సాహసం అల ప్రహసనగా మిగిలిపోయింది ఇప్పుడు ఆ సినిమా హాల్ గేటు ఉంది కాని సినిమా హాల్ లేదు పెద్ద అపార్ట్ మెంట్ ఆ స్థానం లో ప్రత్యక్షమైంది 
****
సరే మేం కనీసం ఓ ప్రయత్నమన్నా చేశాం. ఇప్పటి పిల్లలకు ఆ అవకాశం కుడా లేదు కదా? యల్ కేజీ నుంచి టెన్త్ వరకు  పిల్లలను స్కూల్ లో తండ్రి డ్రాప్ చేసి వెళితే, తల్లి తీసుకొస్తుంది . ఇంటర్ లో నారాయణ, చైతన్య వాళ్ళ  రెండేళ్ళ కఠిన కారాగార శిక్ష తో సరి ఇంకెక్కడి మధుర స్మృతులు . ఐతే చిన్న వయసులోనే యాసిడ్ ప్రేమలు, లేదంటే జైలు శిక్షలాంటి చదువు . పాపం పిల్లలు .

8, జూన్ 2011, బుధవారం

వీరబాబు కథ .. నాయకుడిలోని నాయకులు

కొత్తకారులో లాంగ్ డ్రైవ్‌కు వెళదామా? డార్లింగ్ అని రాజేశ్ అడగ్గానే సుజి ఒక్క క్షణం కూడ ఆలోచించలేదు. పరిచితుడు, పైగా ప్రేమికుడు మురిసిపోయి కారెక్కింది. ఊరుదాటింది, అడవి ప్రవేశించింది చల్లని గాలికి కనులు మూతపడుతుండగా, వర్షం మొదలైంది. వీరికోసమే అన్నట్టు అక్కడో పాడుపడిన బంగ్లా కనిపించింది.

 వర్షంలో తడుస్తూ బంగ్లాలోని పరుగులు తీశారు. తడిసిన చీరలో ఆమె మరింత అందంగా కనిపించింది. పరిచితుడైన రాజేశ్‌లోని అపరిచితుడు బయటకు వచ్చాడు. తరువాత కథ నమ్మించి మోసం చేశాడని టీవి లైవ్ షోలో ఆమె చెప్పుకోవడం పిఓడబ్ల్యు సంధ్య ఆగ్రహం అంతా తెలిసిందే కదా! వదిలేద్దాం. రాకేశ్‌లు రాజేశ్‌లే కాదు. పాలకులు పాలితులే కాదు దేవుళ్లులో సైతం పరిచితుల్లో బయటకు కనిపించని అపరిచితులు ఎంతో మంది ఉంటారు. వారి వారి పాత్రల అవసరాన్ని బట్టి బయటకు వస్తారు
.****
సాలార్‌జంగ్ మ్యూజియంలో ఒకవైపు స్ర్తిగా మరోవైపు పురుషునిగా కనిపించే విగ్రహాన్ని చూస్తూ అంతా విస్తుపోతుంటారు. కానీ అలా విస్తుపోయే వారిలో సైతం కనిపించని మనుషులు ఎందరో ఉంటారు. అలానే ఈ మధ్య అల్లుడు బాబు తనలోని వీరబాబు అవతారాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. చెవిలో చెప్పిందంత నిజమేనని నమ్మేవారుంటారని కొందరి నమ్మకం. అలానే గట్టిగా చెబితే జనం నమ్ముతారని వీరబాబు కొత్త సిద్ధాంతం . ఇప్పుడాయన తన పేరుతో సహా ఏదైనా చాలా గట్టిగా చెబుతున్నారు.
కాకిపిల్ల కాకికి ముద్దు మీడియా మానస పుత్రుడు మీడియాకు ముద్దు. వీరబాబు కొత్త అవతారాన్ని చూసి సొంత మీడియా మురిసిపోతోంది. అప్పుడంటే ప్రచారం కోసం అర్రులు చాచి క్లింటన్ మెచ్చుకున్నాడు అంటూ ప్రచారం చేసుకున్నాను, అది నా అసలు అవతారం కాదు ఇప్పటి రైతు అవతారమే నిజమైన అవతారం అని నమ్మమంటున్నారు.

 డ్రెస్ కోడ్‌ను సైతం మార్చి అడ్డపంచ కట్టారు. వచ్చే మహాపండగ నాటికి వీరబాబు ధోవతి కట్టుకొని వస్తారని ఆయన అభిమానులు ఎన్నికల హామీ ఇస్తున్నారు. ఏం చేశాం, ఏం చేస్తున్నామన్నది ముఖ్యం కాదు ఎలా నటిస్తున్నాం అనే్నదే ముఖ్యం అని వీరబాబు నమ్మిన సిద్ధాంతం. ఆయనలో హైటెక్ రూపాన్ని చూసిన అభిమానులు ఆయన ఓటమిని సైతం తట్టుకున్నారు కానీ పంచలోకి మారక తప్పని పరిస్థితిని జీర్ణం చేసుకోలేకపోతున్నారు.

 చేసేవాడిని చేయించే వాడిని అంతా నేనే అని శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పారు. నా అసలు రూపం నాకే తెలియనప్పుడు నేను ఏ రూపంలో కనిపిస్తేనేం అని వీరబాబు అభిమానులకు నచ్చజెపుతున్నారు. విష్ణువు అంశ ఉంటేనే కాదా రాజ్యభోగం లభిస్తుంది. అధికారంలోకి వచ్చారు అంటే వారిలో విష్ణు అంశ ఉన్నట్టే కదా!

 విష్ణు అంశం ఉండడం అంటే కనీసం పది అవతారాలైనా ఎత్తాల్సిందే కదా! మరి వీరబాబైనా మరెవరైనా రంగులు మారుస్తున్నాడని విమర్శించడం ఎందుకు అవతారాలు దాలుస్తున్నారని మురిసిపోవచ్చు కదా! వీరుడంటే ఇలా ఉండాలని చెప్పడానికి సృష్టించిన పాత్ర అర్జునుడిది. అటూ ఆడా ఇటు మగా కాని పాత్ర బృహన్నలది. అర్జునుడు బృహన్నల కావడం మహాభారతంలో ఓ విచిత్రం. ఎన్టీఆర్ కృష్ణుడిగా, అర్జునుడిగా ఎంతగా అలరించారో, బృహన్నలగా అంత కన్నా బాగా ఆకట్టుకున్నారు.

 ఒక మనిషిలో అనేక మంది మనుషులుంటారు. సందర్భాన్ని బట్టి ఒక్కో మనిషి బయటకు వస్తారు. అప్పటి సూపర్ స్టార్ కృష్ణ సాంకేతిక విలువలతో కురుక్షేత్రం సినిమాకు సన్నాహాలు చేస్తే, ఎన్టీఆర్ దాన వీర శూరకర్ణకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో దుర్యోధనుడి నుంచి నుంచి శ్రీకృష్ణుని వరకు అంతా ఎన్టీఆర్ మయం. కథ, దర్శకత్వం, నిర్మాత సర్వ బాధ్యతలు ఆయనవే. ఒకటి అరా సరిపోకపోతే కొడుకులతో నటింపజేశారు.
 ఒక మనిషిలో అనేక మంది మనుషులుంటారనే దానిపై ఏమైనా అనుమానం ఉంటే ఎన్టీఆర్ నటన చూశాక అవి పటాపంచలై పోక తప్పదు. బహుశా ఈ సినిమా ప్రభావం అల్లుడిపై బాగానే పడినట్టుంది. 
ఆయన ముఖ్యమంత్రి కాగానే చీపురు పట్టుకుని క్లీన్ అండ్ గ్రీన్ ఎలా చేయాలో చూపించారు, ఆకస్మిక తనిఖీ అంటూ బడిపంతులయ్యారు. పరిపాలన ఇలా కూడా ఉంటుందా? అని సిఇఓ అవాక్కయితే, ఆయన హోదా కూడా లాక్కోని ఇప్పుడు నేనే సిఇఓ నన్నారు. సొంత డబ్బుతో, సొంత బ్యానర్‌పై అన్ని పాత్రల్లో ఎన్టీఆర్ తానై నటించినా దానవీర శూరకర్ణ సూపర్ హిట్టయితే అన్ని పాత్రలు తానై నడిపించిన బాబు పాలన అట్టర్ ఫ్లాపైంది.

 అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎన్ని పాత్రలు పోషించారో ఆయనకే గుర్తు లేదు. ఇప్పుడు తీరిగ్గా ఒక్కో పాత్రను గుర్తుకు తెచ్చుకుంటూ పశ్చాత్తాపం ప్రకటిస్తున్నారు. అన్ని పాత్రల్లో దూరిపోవాలనే తపనే కాదు సత్తా కూడా ఉండాలి. పబ్లిసిటీపై సినిమాలే కాదు పాలన కూడా నడవదని అల్లుడు తన తొమ్మిదేళ్ల నిర్విరామ కృషితో నిరూపించారు.
మహాభారతం వాస్తవం అయితే అద్భుతం, కల్పితం అయితే మహాద్భుతం అన్నాడో పాశ్చాత్యుడు.

 ఒకటా రెండా కొన్ని వేల పాత్రలు. ఏదో ఇలా వచ్చి అలా పోయే పాత్రలు కాదు ప్రతి పాత్రతో హీరోగా కొన్ని వందల సినిమాలను తీయవచ్చు. రచయిత హీరోను సృష్టించినా విలన్‌ను సృష్టించినా ఆ క్యారక్టర్‌లోని లక్షణాలు రచయిత మనసులో కొద్దొ గొప్పో ఉండి తీరుతాయి.
 విలన్ రేప్ సీన్ సృష్టించే రచయితకు రేప్ చేసిన అనుభవం లేకపోయినా కనీసం కోరికైనా కొంతైనా ఉంటుంది. లేదా ఎవరైనా రేప్ చేస్తే అలా చితగ్గొట్టాలనే కోరికైనా ఉంటుంది. భిన్నభిన్న మనస్తత్వాలతో కొన్ని వేల పాత్రలను సృష్టించడం అంత ఆషామాషి కాదు అందుకే మహాభారతం వాస్తవం అయితే అద్భుతం అన్నవారు కల్పితం అయితే మహాద్భుతం అన్నారు
.***
అవకాశాలు లేక అమాయక పాత్రలో ఉండిపోతాం కానీ మనం మాత్రం తక్కువనా? అవకాశం ఉంటే మనలోని అపరిచితులను బయటకు తీయకుండా ఉంటామా? 

4, జూన్ 2011, శనివారం

స్పీకర్ పదవికి పెరిగిన ప్రాధాన్యం..అప్పుడు ముద్దు కృష్ణమ నాయుడు స్పీకర్ పదవి చేపట్టి ఉంటే బాబు రాజకీయ జీవితం ఎలా ఉండేదో ?

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో శాసన సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు టిడిపి పోటీచేయడం ఇదే తొలిసారి. అధికార పక్షం అభ్యర్థే స్పీకర్ పదవికి ఎంపిక కావడం సహజం. స్పీకర్ పదవి ఎన్నికలోనే అధికార పక్షం అభ్యర్థి ఓడిపోయాడంటే ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్టే. మామూలు గా స్పీకర్ ఎన్నిక లాంఛన ప్రాయమే అయినా సంక్షోభ రాజకీయాల్లో స్పీకర్ పదవి కీలకంగా మారుతోంది. అందుకే అధికారంలో ఉన్న వారు అన్ని కోణాల్లో ఆలోచించే స్పీకర్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో వైఎస్‌ఆర్ చేసింది అదే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నది అదే. టిడిపి ఆవిర్భావం తరువాత రెండు సందర్భాల్లో స్పీకర్ పదవి తీవ్ర వివాదాస్పదంగా మారింది, వారు తీసుకున్న నిర్ణయాలే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి.

ఎన్టీరామారావు నాయకత్వంలో 1994లో టిడిపి ఘన విజయం సాధించినప్పుడు గాలి ముద్దుకృష్ణమనాయుడును స్పీకర్ పదవి చేపట్టమని కోరారు. ఒకవేళ ఆయన స్పీకర్ పదవి చేపట్టి ఉంటే రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మరో విధంగా ఉండేవేమో! ఆయన చాలా గొప్పనాయకుడు స్పీకర్ గా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేవారు, రాష్ట్ర ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయిందని కాదు. ఒకవేళ ఆయన స్పీకర్ పదవి చేపట్టి ఉంటే చంద్రబాబు పరిస్థితి మరోలా ఉండేదేమో! 1994 ఎన్నికల్లో ఏకపక్షంగా ప్రజలు తీర్పును ఇచ్చారు.


 కాంగ్రెస్ పార్టీకి చివరకు ప్రతిపక్షం హోదా సైతం దక్కలేదు. కనీసం పది శాతం సీట్లు లభించిన పార్టీకే ప్రతిపక్ష హోదా ఉంటుంది . ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 27 సీట్లు మాత్రమే వచ్చాయి. అసలు ప్రతిపక్షం అంటూ లేకుండా ఫలితాలు వచ్చినప్పుడు ప్రభుత్వం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఎవరూ ఊహించలేరు. కానీ అప్పటికే ఎన్టీరామారావు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడం, పార్టీలో ఆమెకు ప్రాధాన్యం పెరగడం చంద్రబాబు బృందానికి నచ్చలేదు. ఎన్టీఆర్ తరువాత అధికారం తనదే అని ఆశలు పెట్టుకున్న చంద్రబాబుకు లక్ష్మీపార్వతి రూపంలో స్పీడ్ బ్రేకర్ కనిపించింది. కుటుంబ రాజకీయాలు జోరుగానే సాగినా జనం మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఎన్టీఆర్‌కు పట్టం కట్టారు.
చంద్రబాబు వర్గం నుంచి ఏమైనా జరగవచ్చునని ఎన్టీఆర్ వర్గం అనుమానించింది. ఏం జరిగినా అసెంబ్లీలో స్పీకర్ మాటే శిరోధార్యం కాబట్టి స్పీకర్ పదవిని చేపట్టాలని ఎన్టీఆర్‌కు విశ్వాస పాత్రునిగా నిలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడును ఎన్టీఆర్ వర్గం కోరింది. లక్ష్మీపార్వతి సైతం అదే మాట చెప్పారు. మంత్రి పదవిపై ఆసక్తి ఉన్న ముద్దుకృష్ణమనాయుడు తనకు స్పీకర్ పదవి వద్దన్నారు. బాబు బృందంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు తప్ప ఎన్టీఆర్‌ను తప్పించేంత సాహసానికి ఒడిగట్టక పోవచ్చుననుకున్న ఎన్టీఆర్ బృందం స్పీకర్ పదవి విషయంలో గాలి ముద్దుకృష్ణమనాయుడుపై పెద్దగా ఒత్తడి తీసుకురాలేదు. యనమల రామకృష్ణుడు స్పీకర్ పదవి చేపట్టారు. ఎన్టీఆర్‌ను దించేసే సమయంలో యనమల రామకృష్ణుడు నిర్వహించిన పాత్ర వివాదాస్పదం అయింది.



 న్యాయస్థానం సైతం కొన్ని కామెంట్లు చేసింది. ‘‘ నేను ఇంకా ముఖ్యమంత్రినే సభలో నన్ను మాట్లాడనివ్వండి ’’ అంటూ ఎన్టీఆర్ పదే పదే వేడుకున్నా స్పీకర్ స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు అనుమతించక పోవడం కాంగ్రెస్‌కు ఇప్పటికీ బాబును విమర్శించేందుకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతున్నది. ఆరోజే గనుక గాలి స్పీకర్ పదవి చేపట్టి ఉంటే ఎన్టీఆర్ పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిమానులంటారు. ఒకవేళ గాలి ఆ పదవి చేపట్టినా ఇంత పెద్ద పార్టీలో అందరినీ మెనేజ్ చేసిన చంద్రబాబు గాలిని చేయకపోయేవారా? అని బాబు శక్తిసామర్ధ్యాలపై విశ్వాసం గల ఆయన మద్దతు దారులంటారనుకోండి!


 1983లో తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత తంగి సత్యనారాయణను స్పీకర్‌గా, భీమ్‌రావ్‌ను డిప్యూటీ స్పీకర్‌గాఎన్నకున్నారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటుచేసి వెన్నుపోటు పొడిచిన సమయంలో వీరిద్దరు కూడ నాదెండ్ల వైపు వెళ్లిపోయి మంత్రి పదవులు చేపట్టారు. వీరు అదే పదవుల్లో ఉండి నాదెండ్లకు సహకరిస్తే పరిస్థితి ఎలా ఉండేదో కానీ రాజీనామా చేసి మంత్రిపదవులు చేపట్టడం వల్ల సభ నిర్వహణ కోసం అప్పటి సీనియర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు బాగారెడ్డిని తాత్కాలిక స్పీకర్‌గా నియమించారు. ఆయనపై తమకు నమ్మకం లేదని ఎన్టీఆర్ ప్రకటించారు. రెండు రోజుల పాటు సభను నిర్వహించలేని పరిస్థితితో బాగారెడ్డి రాజీనామా చేశారు.


 తరువాత సుల్తాన్ సలా ఉద్దీన్ ఓవైసిని తాత్కాలిక స్పీకర్‌గా నియమించారు. ఆయన నియామకంపై కూడ ఎన్టీరామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాదెండ్ల బల నిరూపణ చేసుకోకపోడంతో ఎన్టీరామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. వెంటనే సుల్తాన్ సలా ఉద్దీన్ ఓవైసి స్థానంలో మహేంద్రనాథ్‌ను తాత్కాలిక స్పీకర్‌ను చేశారు. 1983 ,1984లలో కేవలం సంవత్సరం వ్యవధిలో రాష్ట్ర అసెంబ్లీలో ముగ్గురు తాత్కాలిక స్పీకర్లు ఉండడం విశేషం. తరువాత నిశ్శంకరరావు వెంకటరత్నంను స్పీకర్‌ను చేశారు.


 19 85 ఎన్నికల తరువాత జి నారాయణరావును స్పీకర్‌గా ఎన్నకున్నారు. ఆయన హయాంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు . స్పీకర్ పదవి గౌరవాన్ని నిలిపే విధంగా ఆయన స్వతంత్రంగా వ్యవహరించే వారు. పార్టీ ఎమ్మెల్యేలంతా ఎన్టీఆర్‌ను దైవంగా పూజించే సమయంలో సైతం నారాయణరావు గంభీరంగా స్పీకర్‌గానే వ్యవహరించేవారు. ఆది తెదేపా అధినేతకు ఏ మాత్రం నచ్చలేదు. నారాయణరావు స్వతంత్రంగా వ్యవహరించే తీరును ఎన్టీరామారావు జీర్ణం చేసుకోలేక పోయారు. తరువాత ఆయన పార్టీ వీడి వెళ్లారు. స్పీకర్ స్థానంలో ఒక వెలుగు వెలిగిన నారాయణరావు తరువాత రాజకీయాల్లో కనిపించలేదు.
సాధారణంగా శాసన సభ్యుల్లో సీనియర్ సభ్యున్ని తాత్కాలిక స్పీకర్‌గా నియమిస్తారు. తాత్కాలిక స్పీకర్ పదవిలో ఎవరిని నియమించాలనే నియమం ఏమీ లేదు. స్పీకర్ నియామకానికి వర్తించే నిబంధనలే త్రాత్కాలిక స్పీకర్‌కు వర్తిస్తాయి. తొలిసారి గెలిచిన సభ్యున్ని సైతం స్పీకర్‌గా నియమించే అవకాశం ఉన్నప్పుడు తాత్కాలిక స్పీకర్‌గా నియమించడానికి అభ్యంతరం ఏముంటుంది. అయితే సాధారణంగా సభలో సీనియర్ సభ్యున్ని తాత్కాలిక స్పీకర్‌గా నియమిస్తారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరో పార్టీకి చెందిన సభ్యుడు సీనియర్ సభ్యునిగా ఉన్నప్పుడు తాత్కాలిక స్పీకర్‌గా ఎవరిని నియమించాలనేది విమర్శలకు దారితీస్తోంది.



 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి వరకు సీనియర్ సభ్యుడైన పెన్మత్స సాంబశివరాజును తాత్కాలిక స్పీకర్‌గా నియమించారు. 2009లో కాంగ్రెస్ రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పుడు జెసి దివాకర్‌రెడ్డిని తాత్కాలిక స్పీకర్‌గా నియమించారు. జెసి కన్నా సీనియర్ అయిన పి అశోకగజపతిరాజును తాత్కాలిక స్పీకర్‌గా నియమించకపోవడం పట్ల తెదేపా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాజీనామా చేసి స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో తాత్కాలిక స్పీకర్‌గా జెసి దివాకర్‌రెడ్డిని నియమించారు. రెండు సార్లు తాత్కాలిక స్పీకర్ బాధ్యతలు నిర్వహించిన రికార్డు జెసిదే.
స్పీకర్ వ్యవహారంలో పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఎంపికలో తెదేపా ఆచితూచి వ్యవహరించడం మొదలు పెట్టింది. ఇప్పుడు అధికార పక్షం సైతం సంక్షోభ రాజకీయాలను, భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది. వైఎస్‌ఆర్ మరణం తరువాత రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టడం, ఆయన రాజీనామాతో అప్పటి వరకు స్పీకర్‌గా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆరునెలల పాటు స్పీకర్ లేకపోవడం, స్పీకర్ లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగడం విశేషం. 

2, జూన్ 2011, గురువారం

అమావాస . రోజు పున్నమి చంద్రుడు .................................... సికింద్రాబాద్ కథలు ౪

ఐశ్వర్య రాయ్ అందంగా ఉంటుందని నేను  చెబితే మీరే మంటారు...నిజమా  చాలా గొప్పవిషయం చెప్పారండి మీరు మామూలు వాళ్ళు కాదు అని విసుర్లు  విసరకుండా ఉంటారా.? ఐశ్వర్య రాయ్ అందంగా ఉందనే  కదా విశ్వసుందరి  టైటిల్ ఇచ్చారు, అభిషేక్ మనసుపడ్డాడు, అమితాబ్ కోడలిగా ఇంటికి తీసుకెళ్ళారు. సరే వాడెవడో సౌందర్య సాధనాల  మార్కెట్ కోసం విశ్వ సుందరిమనులను నిర్ణయిస్తాడు కాని. మార్కెట్ తో సంబంధం లేకుండా  చిన్నప్పటి నుంచి, పోయేంత వరకు ప్రతి ఒక్కరు  తన మనసులోనే ఎంతో మందికి విశ్వసుందరి కిరీటాన్ని బహూకరిస్తుంటారు.

 యం యఫ్ హుసేన్ కు  మధురి దిక్షితే ఐశ్వర్య రాయ్ అయినట్టు ఎవరో ఒకరికి కల్పనా రాయ్ కుడా ఐశ్వర్యా రాయే . నాకు  గాంధీ నగర్లో  ఐదో తరగతి చదివేప్పుడు అన్నపూర్ణ విశ్వసుందరిలా కనిపిస్తే ఆరో తరగతి సికింద్రాబాద్ లో చదివేప్పుడు విజయలక్ష్మి విశ్వసుందరి అనిపించింది. ( వాళ్ళు చిన్నప్పటి వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పబడినవి .. వారెక్కడున్నారో కూడా తెలియదు కాబట్టి భయం లేదు. ఇప్పటి పేర్లు ససేమిరా చెప్పబడవు  )

 సరే ఎవడి గోడుకు వాడె హీరో .. ఐశ్వర్య రాయ్ అందం గురించి ఎందుకు ప్రస్తావించానంటే.. పున్నమి చంద్రుడు అందంగా ఉన్నాడని ... యెంత అందంగా ఉన్నదో చెప్పాలని అనుకున్నా.. పున్నమి చంద్రుడి అందం గురించి నేను చెబితే ..ఐశ్వర్యా రాయ్ అందంగా ఉంటుందని చెప్పినట్టు గా ఉంటుందనీ ఆమె గురించి ప్రస్తావించా. 
******
మా ఇల్లు భూదేవినగర్ సికింద్రాబాద్ జూబ్లి బస్సు డిపో నుంచి ఆరు కిలో మీటర్ల దూరం లో ఉంటుంది.  చుట్టూ కంటోన్ మెంట్ ఏరియా మధ్యలో ద్వీపకల్పం లా ఉంటుంది .   నగరం లోనే ఉన్నా   ఇంకా పెద్దగా అపార్ట్ మెంట్ల సంస్కృతి లేదు కాబట్టి కొంత  ప్రశాంతంగానే ఉంటుంది. పిచుకలు కనిపిస్తాయి . పచ్చని చెట్లు, చల్లని గాలి యిక్కడఇంకా  బతికే ఉన్నాయి ..

 క్లింటన్ వచ్చినప్పుడు , బుష్ వచ్చినప్పుడు మా ఇంటికి దగ్గరలోనే ఉన్న  ద్రాక్ష తోటలోంచి ద్రాక్ష పళ్ళు  ఇచ్చారు. హిందులో వచ్చిన ఆ ఫోటోలను తోట వాళ్ళు కొద్ది రోజులు ప్రదర్శించారు. ఆమెరికా అధ్యక్షుడు మెచ్చిన ద్రాక్ష అని రేటుపెంచుతారేమో  అనుకున్నా కాని పెంచలేదు..  ఇంటి ఎదురుగా రైలు  పట్టాలు . అప్పుడప్పుడు గుడ్స్ రైళ్ళు వెళతాయి   పట్టాల అవతల రాముల వారి  గుడి ఉదయాన్నే సుప్రభాతం వినిపిస్తుంది   .. వావ్ అనిపిస్తుందా ఇవన్నీ పాసిటివ్ పాయింట్స్ . అబ్బే అనిపించే   నెగిటివ్ పాయింట్స్ వీటికన్నా చాలా ఎక్కువగానే ఉన్నాయి .. నాకు వాటితో పని లేదు కాబట్టి నేను వాటిని పట్టించు కొను .. అలానే అవి నన్ను పట్టించు కోవు ..
****
వీక్లీ ఆఫ్ కావడంతో రాత్రి మేడపైన ఒక్కడినే ఉన్నా.. పున్నమి చంద్రుడు ఎప్పుడూ లేనంత అందంగా ఉన్నట్టు  అనిపించాడు. పున్నమి చంద్రుని అందం గురించి చెప్పాలనుకునే ఐశ్వర్యా రాయ్ అందం గురించి ప్రస్తావించా...పున్నమి చంద్రుడి అందం మాకు తెలుసులే అంటారని వర్ణించడం లేదు .   దేవుడికి కృతజ్నతలు చెప్పాలనిపించింది . ఎందుకంటారా ? పున్నమి చంద్రుడు ...  చల్లని గాలి..  వెనకవైపున   దేవాలయం నుంచి మెల్లగా ఏదో స్వరం వినిపిస్తోంది . నా పక్కన ట్రాన్సిస్టర్ లోంచి అమరగాయకుడు ఘంటసాల పాడుతున్నపాటలు ... నేనున్నానని చెబుతూ పదేపదే తాకి వెళుతున్న చల్ల గాలి .. ఈ జీవితానికి ఇంకేం కావాలనిపించింది ..

 ఏ కుంభకోణంలో పెరుంటుందో అనే భయం లేదు.. ఎసిబి వాడు దాడి చేసి అక్రమ సంపాదన భయత పెడతాడని భయపదాల్సిన స్తాయి కాదు నాది . అప్పులవాడు తలుపు తడతాడేమో అనే ఆలోచనే అవసరం లేదు ..

 ఘంటసాల పాటలు వినడానికి చెవులు ఉన్నాయి, చల్ల గాలి ఆస్వాదించే స్పృహ ఉంది.  ఇంకేం కావలి ఇవన్నీ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పాలని పించింది ... పరుగు పందెం లాంటి జీవితంలో ఇలాంటి రోజులను కుడా కల్పించినందుకు దేవునికి క్రుతజ్జతలు .. ఒక సారి కాదు వందల సార్లు థాంక్స్ ... 

******
ఇక్కడ పున్నమి చంద్రుని ఫోటో ఉంటే బాగుంటుంది కదూ .. నాకు అలానే అనిపించి పైకి చూసా కాని నల్లని మబ్బులు తప్పా ఎమీ కనిపించలేదు .. చంద్రుడు అసలే కనిపించలేదు ... ఎలా కనిపిస్తాడు . అమావాస రోజు చద్రుడు ఎలా కనిపిస్తాడు. పున్నమి రోజు ఆ వాతావరణానికి ముచ్చటపడ్డ నేను పున్నమి చంద్రుడికి , దేవునికి కృతజ్ఞత చెప్పాలనుకున్న.. కాని పని వత్తిడి వల్ల అమావాస
 నాటికి గాని తీరలేదు .. నా కృతజ్నతల కోసం చంద్రుడు వేచి ఉండడు కదా  

  మన జీవితం లో చాలా మందికి ఇలానే కృతజ్నతలు చెప్పలనుకుంటూ వాయిదా వేసుకుంటూ పోతాం .. కని పెంచిన  తల్లితండ్రులు  కావచు.. సేవ చేసే  భార్య కావచ్చు.. తమ విజయాలతో సంతోషపెట్టే  పిల్లలు కానీవండి.  స్నేహితులు కావచ్చు.. బాస్ అయినా సరే దేనికో ఓ దానికి కృతజ్నతలు చెప్పా లని పించినప్పుడు చెప్పేయండి.

 మీకు మేలు చేసిన వారికి కృతజ్నతలు చెప్పాలని ఎప్పుడో అనిపిస్తే అప్పటి వరకు వారు ఉండక పోవచ్చు. చెప్పడానికి మనం ఉండక పోవచ్చు.  సరే దేవుడు శాశ్వతం కాబట్టి ఎప్పుడైనా చెప్పవచ్చేమో మనుషులు శాశ్వతం కాదు కదా .. ఆ రోజు చెప్పలేక పోయామే అనే బాధ  జీవితాంతం ఉంటుంది ... 

1, జూన్ 2011, బుధవారం

గిరీశం మాటవిందాం.... ఒపీనియన్స్ మార్చుకుందాం


పాలిటీషియన్ అనే వాడు ఎప్పటికప్పుడు ఒపీనియన్స్ మార్చేసుకుంటుండాలని గిరీశంతో గురజాడ చెప్పించడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది? గురజాడ అప్పారావుకు ఒకవైపు రాజకీయాలపై ఆసక్తి, మరోవైపు వాటిపై వ్యతిరేకత అనే పరస్పర భిన్నమైన ఒపీనియన్ - అభిప్రాయం- ఉండేదేమోననిపిస్తోంది. రాజకీయాలపై ఆయన ఒపీనియన్ మారిందో లేదో తెలియదు కానీ మధురవాణిపై మాత్రం ఒపీనియన్ మార్చుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి.

 నాయకులే కాదు గురజాడతో సహా అసలు ఒపీనియన్స్ మార్చనిదెవరు? గురజాడ కన్యాశుల్కాన్ని రెండుసార్లు రాశారు. మొదటిసారి రాసిన దాంట్లో మధురవాణికి అంతగా ప్రాధాన్యం లేదు. ఆయన సృష్టించిన మధురవాణి పాత్రపై ఆయనకే ముచ్చటేసినట్టుంది. రెండోసారి రాసిన దాంట్లో మధురవాణి పాత్రదే హైలెట్. మధురవాణి పట్ల తన ఒపీనియన్ మార్చుకుని రెండో దాంటో ఆమె ప్రాధాన్యం పెంచారు.

 తాను సృష్టించిన పాత్ర తన సృష్టికర్త మనసునే మార్చేసింది. అధికారంలో ఉన్న పార్టీని ఐదేళ్లకోసారి ప్రజలు గద్దె దించుతున్నారంటే, వోటర్లు తమ ఒపీనియన్స్‌ను మార్చుకోవడమే కదా! కొద్ది మంది నాయకులు పార్టీ మారితే తప్పు పడుతూ , లక్షల మంది వోటర్లు ఒపీనియన్స్ మార్చుకుంటే మార్పు గెలిచింది అని సంబరపడుతున్నాం. పార్టీని మార్చే హక్కు వోటర్లకు ఉన్నట్టు నాయకులకూ ఉంటుంది. మేం ఒపీనియన్స్‌ను అస్సలు మార్చుకోం ఒకసారి కమిట్ అయ్యామంటే మా మాట మేమే వినం అనే ఒపీనియన్‌తో ఉంటే జీవితం రక్తకన్నీరవుతుంది.

 ఆ అమ్మాయిని చేసుకున్నావంటే ఇంట్లో అడుగుపెట్టనిచ్చేది లేదని తండ్రి, గీతకు మనసిచ్చాను, మాటిచ్చాను.. ఎవరడ్డొచ్చినా పెళ్లి చేసుకుని తీరుతాను అని కొడుకు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఒపీనియన్ మార్చుకుంటే ఆ కుటుంబం హాయిగా ఉండేది కానీ ఇద్దరు తమ నిర్ణయాన్ని మార్చుకునేది లేదన్నారు. వృద్ధాప్యంలో కొడుకు అండ లేక తండ్రి జీవితం దుర్భరంగా మారింది.
 పెళ్లికి ముందు రంభలా కనిపించిన గీత ముఖంలో గీతలు కనిపించాక రాక్షిసిలా అని పించింది. నీ వల్లే మా కుటుంబానికి దూరమయ్యానని అతను, నీ వల్లే చదువు మధ్యలో ఆపేసి బంగారం లాంటి జీవితాన్ని వంటింటికి అంకితం ఇచ్చానని ఆమె ఒకరినొకరు తిట్టుకుంటూ చుట్టుపక్కల వారికి పన్ను లేని వినోదాన్ని అందిస్తున్నారు. తమ ఒపీనియనే్స గొప్పవనే పిచ్చి భ్రమ వల్లనే ఇలాంటి గొడవలు.

 ఎవడి పిచ్చి వాడికానందం అన్నట్టు ఎవడి ఒపీనియన్ వాడికి గొప్ప . తండ్రి కొడుకుల సవాళ్లు ఈనాటివా?
విష్ణువు విలన్ అతని పార్టీ మనకు పడదు అనేది హిరణ్య కశిపుడు నిశ్చితమైన ఒపీనియన్. అసలే రాక్షసరాజు జాతివైరాన్ని మరిచిపోతాడా? కొడుకు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. విష్ణువు దేవుడు అనేది అతని ఒపీనియన్. ముఖ్యమంత్రి కొడుకు వెళ్లి ప్రతిపక్ష నాయకుడి పార్టీలో చేరిపోతే జనం నవ్వుకుంటారు కదా! అదే భయంతో హిరణ్య కశిపుడు కొడుకు ఒపీనియన్ మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు.

 వీడి ఒపీనియన్స్ మార్చే విధంగా చదువు చెప్పండి వినకపోతే చంపేయండి అని హిరణ్యకశపుడు ఆదేశిస్తాడు. సరే తరువాత కథ తెలిసిందే కదా! తండ్రి కొడుకుల్లో ఏ ఒక్కరు తమ ఒపీనియన్స్‌ను మార్చుకున్నా హాయిగా ఉండేవారు కదా! తన వల్ల తండ్రి చచ్చాడనే బాధ కొడుక్కుండకపోయేది, కొడుకును చంపించడానికి ప్రయత్నించాడనే అపవాదు తండ్రికుండకపోయేది.

 ఎవరక్కడ అంటూ సేవకులను పిలుస్తూ, రాజభోగాలు అనుభవించాల్సిన చక్రవర్తి హరిశ్చంద్రుడికి చివరకు , శ్మశాన వాటికలో పాటలు పాడుకోవల్సిన ఖర్మ ఎందుకు పట్టిందంటారు. పిచ్చి ఒపీనియన్స్ వల్లనే కదా! మాటిచ్చానా? నేనా? ఎప్పుడూ అని ఒక్క మాట అనుంటే చంద్రమతితో రాజమందిరంలో సుఖంగా ఉండేవాడు కదా!
పాండవులే విలన్లు, కౌరవులు హీరోలు అనే నీ ఒపీనియన్ మార్చుకుంటే కురు సామ్రాజ్యానికి నీవే కాబోయే రాజువు అని కృష్ణుడు ఎంత చెప్పినా తన ఒపీనియన్ మారదన్నందుకే కదా! కర్ణుడు అర్ధాయుస్సుతో హరీ మన్నాడు. పరాయిపాలకులపై యుద్ధం చేసిన అరవింద్ ఘోష్ సన్యాసిగా మారడం, చలం చివరి దశలో రమణాశ్రమానికి వెళ్లడం ఏ ఒపీనియన్ కూడా శాశ్వతం కాదు అని నిరూపిస్తున్నాయి.

 ఒపీనియన్స్ మార్చుకోకపోవడం వల్ల కలిగే కష్టాల సంగతి తెలిసే మన నాయకులు ఆడాళ్లు చీరలు సెలక్ట్ చేసుకోవడానికి తీసుకుకునే సమయం కన్నా తక్కువ సమయంలో ఒపీనియన్స్ మార్చేస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో విలాస వంతమైన జీవితాన్ని చూసిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక విరక్తితో సన్యాసం స్వీకరించి, కాషాయ డ్రెస్‌లోకి మారిపోయారు. తరువాత తన ఒపీనియన్స్ మార్చుకుని 74 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కన్యాశుల్కం సినిమాలో గిరీశం పాత్రకు ఎన్టీఆర్ జీవం పోశారు.
 సంసారం సజావుగా సాగాలంటే భర్త తన ఒపీనియన్ మార్చుకునిభార్యతో నీ మాటే కరెక్ట్ అనడమే ఉత్తమం.
ఉచిత విద్యుత్ ఇస్తే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందున్న విజనున్న ‘వీర’బాబు ఒపీనియన్స్ మార్చేసుకుని , అధికారం ఇవ్వండి, రోజంతా ఉచిత విద్యుత్తు నిస్తానంటున్నారు. రాజకీయాల్లో అత్యంత వేగంగా ఒపీనియన్స్ మార్చుకున్నది ఆయనే. మసీదులు కూల్చే పార్టీ అన్న బిజెపితో చేతులు కలిపారు. మళ్లీ విడిపోయారు. మళ్లీ కలువరనే గ్యారంటీ లేదు. సమైక్యాంధ్రే ముద్దన్నారు.. తెలంగాణకు సరే అన్నారు.. ఇప్పుడు రెండు కళ్లంటున్నారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులన్న నోటితోనే కమ్యూనిస్టులు లేనిదే తనకు కాలం నడవదంటున్నారు. మహామహనీయులే ఒపీనియన్స్ మార్చేస్తుంటే కాలంతో పాటే మనం ఒపీనియన్స్ మార్చేసుకుంటే పోలే!
కొడుక్కు నీతులు బోధించడం బాధ్యత అనేది తండ్రి ఒపీనియన్ ఐతే, పబ్బుకెళ్లడానికి డబ్బులివ్వడమే తండ్రి బాధ్యత అనేది కొడుకు ఒపీనియన్. అందరి ఒపీనియన్స్‌ను గౌరవించాలనేది ఈ ‘కాలం’ఒపీనియన్.