27, ఫిబ్రవరి 2013, బుధవారం

ఇచ్చట రెడీమేడ్ డైలాగులు లభించును

ఇప్పుడు మీకో ప్రశ్న..
ఇది పిరికి పందల చర్య. ఈ మాటను ఎవరంటారు


1. భార్యమీద ప్రతీకారం తీర్చుకొనే ధైర్యం లేక భర్త కూరలో ఉప్పు ఎక్కువ వేసినప్పుడు భార్య అనే మాట.
2. చదువుకోమని విద్యార్థులను మందలించినందుకు ఎవరోతన బైక్‌కు పంక్చర్ చేసినప్పుడు లెక్కరర్ అనే మాట.
3.తాగుబోతు భర్త భార్యను చితగ్గొట్టినప్పుడు పక్కింటి వారి మాట.
4. ఉగ్రవాదులు బాంబులు పేల్చి అమాయకులను పొట్టన పెట్టుకున్నప్పుడల్లా ప్రధానమంత్రి చెప్పే డైలాగ్.
అన్ని సమాధానాలు కరక్టే అనిపిస్తాయి కానీ నాలుగవ సమాధానం వచ్చే సరికి మరో ఆలోచనే లేకుండా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది.


 సరే ఇంకో ప్రశ్న.
నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది
ఈ మాట ఎవరంటారు?
1. జేబులు కొట్టేస్తూ పట్టుపడిన పిక్‌పాకెటర్
2. బ్రోతల్ హౌస్‌లో పట్టుపడిన విటుడు, వేశ్య.
3.గజదొంగ గంగులు
4.్భరీ కుంభకోణంలో పట్టుపడిన రాజకీయ నాయకుడు/ ప్రముఖ వ్యక్తి.
పొట్టకూటి కోసం చిన్న చిన్న నేరాలు చేసే వాళ్లు సిగ్గుతో ముడుచుకుపోతారు కానీ ఏకపాత్రాభినయంలా డైలాగులు చెప్పరు. పట్టుపడిన తరువాత కూడా న్యాయ వ్యవస్థ గురించి, నీతుల గురించి అద్భుతమైన డైలాగులు చెప్పే ధైర్యం, సామర్ధ్యం ఉండేది ప్రముఖులకు మాత్రమే.
షోలే లో అరె వో సాంబా కితినే గోలిహై అని గబ్బర్ సింగ్ అడగ్గానే కాలియా ఏం చెబుతాడో, ఆ తరువాత గబ్బర్ సింగ్ ఏమంటాడో, ఎలా నవ్వుతాడో అందరికీ తెలుసు కానీ ఆ డైలాగు విన్నా కొద్దిగా వినబుద్ధవుతుంది. 1975లో వచ్చిన ఆ సినిమా డైలాగులు ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి కానీ విసుగెత్తించవు. మన నాయకులు కొన్ని డైలాగులను మొదటి సారి చెబుతున్నంత ఉత్సాహంగా చెబుతారు, మనమూ అంతే ఉత్సాహంగా వింటాం. 


పేదరిక నిర్మూలన, సమ సమాజ స్థాపనే నా ధ్యేయం, రైతుల కష్టాలు చూస్తుంటే నా కడుపు తరుక్కు పోతుంది ఇవి నిత్య నూతనమైన డైలాగులు. దేవతలకు వైధవ్యం లేదట! అలానే తమ ఈ మాటలకు ఎప్పుడూ మరణం లేకుండా మన నాయకులు దేవుడి నుంచి వరం పొందారు. నాయకులకు ఎన్ని వరాలున్నా వారి సమస్యలు చూస్తే మాత్రం జాలి వేస్తోంది. షోలే ఎంత గొప్ప సినిమా అయినా, ఇంకా నడుస్తూ ఉన్నా ఆ సినిమా కోసం సలీం జావేద్‌లు మళ్లీ మళ్లీ డైలాగులు రాయడం లేదు, కథ రాయడం లేదు కదా! మరి నాయకులకు ఈ సౌకర్యం కల్పించాల్సిన అవసరం లేదా? అసలే మాట్లాడే అలవాటు లేని మన్మోహన్‌సింగ్ దేశంలో ఎక్కడ బాంబుల పేలుళ్లు జరిగినా నెలకోసారి ఇది పిరికిపందల చర్య అంటూ అదే డైలాగు మళ్లీ మళ్లీ చెప్పడం ఎంత కష్టం. ఒకసారి చెబితే దాన్ని రికార్డు చేసుకుని బాంబులు పేలిన వెంటనే దీన్ని టీవి చానల్స్‌కు పంపించలేరా? ఇంకా కావాలంటే దోషులు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు, మా సహనాన్ని అసమర్ధతగా భావించవద్దు. తీవ్ర వాదం పీచమణిచేస్తాం అంటూ కొన్ని డైలాగులు అదనంగా చేర్చవచ్చు.


కాలం చాలా మారిపోయింది. అన్నీ రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయి. పెళ్లికి అమ్మాయి అబ్బాయి ఉంటే చాలు అవసరమైన డబ్బు చెల్లిస్తే పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసేసే ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు గల్లీ గల్లీల్లో కనిపిస్తున్నాయి. మీ బంధువులెవరెవరిని పిలవాలో, ఎవరికెలా మర్యాద చేయాలో అనే దిగులే లేదు. అన్నీ వాళ్లే చేసేస్తారు. క్విక్ మ్యారేజెస్‌లు క్విక్ విడాకులకు దారి తీస్తాయోమో అని కొందరి నిరాశా వాదుల అనుమానం. దానికి ఇబ్బందేమీ లేదు. పెళ్లయినట్టు ఆధారాలు ఉంటే చాలు క్విక్ విడాకులు ఇప్పించే సంస్థలకూ కొదవ లేదు. మా ఇంట్లో పొయ్యిలో నుంచి వారం రోజుల నుంచి పిల్లి లేవడం లేదు అని ఎవరైనా అంటే పాత కాలం వాళ్లు పాపం ఎంత దయనీయమైన పరిస్థితి అని సానుభూతి చూపుతారు. కానీ విషయం తెలిసిన వారు మాత్రం మీకేంటి భార్యా భర్తలు ఇద్దరూ బాగా సంపాదిస్తారు, వారం అయినా నెల అయినా పొయ్యిలో నుంచి పిల్లిని లేపాల్సిన అవసరం లేదు అని అసూయ పడతారు. కూరలన్నీ రెడిమెడ్‌గా వండి గ్రాముల చొప్పున అమ్మేస్తున్నారు. గుత్తొంకాయ కూర వండానోయ్ మామా అంటూ చిన్నది పాట పాడి మరీ చెప్పేది. ఇప్పుడు అపార్ట్‌మెంట్ కిందకు దిగి చూస్తే చాలు వంకాయే కాదు దాని బాబు లాంటి కూరలు కూడా రెడీమేడ్‌గా అమ్మేస్తున్నారు.

 అన్నీ రెడీమేడ్‌గా లభిస్తున్నప్పుడు రాజకీయ నాయకులకు ఈ సౌకర్యం లేకపోవడం అన్యాయం. అందుకే సందర్భానికి తగ్గ డైలాగులను వాళ్లు ముందుగానే రికార్డు చేసి పంపించాలి. ఈరోజు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టగానే రాష్ట్రానికి అన్యాయం అంటూ భారీ డైలాగులు రికార్డు చేసి ముందే పంపించాలి. ప్రతి సంవత్సరం వీటినే వాడుకోవాలి. సాధారణ  బడ్జెట్ రాగానే  కొత్త సీసాలో పాత సారా, దిశా దశా లేని బడ్జెట్ అంటూ ప్రతిపక్షం. నా జీవితంలో ఇంత అద్భుతమైన బడ్జెట్ చూడలేదు. సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చి అద్భుమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు అని అధికార పక్షం చెప్పాలి. అంకెల గారడీ తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదని వామపక్షాల రికార్డు వినిపించాలి.

 ఓరుూ సామాన్యుడా!నీ వంతుడైలాగు కూడా ముందే చెప్పేయ్! అని అడిగితే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వీళ్ల మాటలను పట్టించుకోవడమే మానేసి నా కర్మ అనుకుంటున్నాను. ఇంతోటి దానికి నా డైలాగు కూడా అవసరమా అని సామాన్యుడు విసుగ్గా చెప్పి  వెళ్లిపోయాడు.

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

అసలు.. వృద్ధుడెవడు?... నిజ వ్యక్తి కథ



కహానీ.4
======
‘ఈ భాషలెవడు కనిపెట్టాడ్రా బాబూ!’ అంటూ శత్రువు సినిమాలో కోట శ్రీనివాస్‌లాగే -వినోద్ డైలాగ్ కొట్టగానే రూమ్‌లోని ఫ్రెండ్సంతా గొల్లున నవ్వుకున్నారు. వాళ్ల కంబైండ్ స్టడీలో ఇలాంటి జోకులే ఎక్కువగా పేల్తుంటాయ్. ‘ఇవే కనుక లేకపోయి ఉంటే జీవితం ఎంతహాయిగా ఉండేదో? మాతృభాష, ఫస్ట్ లాంగ్వెజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇవి చాలవన్నట్టు ఏదోక విదేశీ భాష నేర్చుకోమని ఇంట్లో పోరు. వీటికితోడు అమ్మాయిల్ని ఆకట్టుకునే ‘భాష’ మనం సొంతంగా నేర్చుకోవాలి’ అని అశోక్ అనేసరికి అంతా చప్పట్లు కొట్టారు. భాషలు నేర్చుకోవడంతోనే జీవితం సరిపోతుంది -అని అంతా బాధపడ్డారు. కొద్దిసేపటికి వారి చర్చ పక్కింటి పైకి మళ్లీంది. ఏరా వినోద్ ఈమధ్య ప్రతి రోజూ ఒకే సమయానికి మీ పక్కింటికో ఆంటీ వస్తోంది. ఏంటీ కథా? అంటూ చిలిపిగా నవ్వాడు ప్రకాశ్. ‘నాకూ అదే అర్ధం కాలేదురా! పక్కింట్లోకి కొత్తగా వృద్ధ జంట దిగింది. అయినా, వాళ్లిద్దరూ వృద్ధుల్లా ఉండరు. మనకంటే ఎక్కువ ఉత్సాహంగానే ఉంటున్నారు. ఈసారి పలకరించి, విషయమేంటో తెలుసుకోవాలి’ అని వినోద్ బదులిచ్చాడు.
***
‘నమస్కారం అంకుల్’ -దారిలో ఎదురుపడిన పక్కింటి వ్యక్తిని పలకరించాడు వినోద్. రేబాన్ అనుకుంటా అని మనసులోనే నవ్వుకున్నాడు కంటి అద్దాలను చూసి. వినోద్ పరిచయంతో ఆ వ్యక్తి ఇంట్లోకి ఆహ్వానించాడు. కొద్ది సేపటికే ఒకమ్మాయి వచ్చింది. ‘్ఫరవాలేదు కూర్చో’ అని వినోద్‌కు చెప్పి, ఆ వృద్ధుడు మాత్రం ఆమె ముందు విద్యార్థిగా మారిపోయాడు. అర్థంగాకుండా అయోమయంగా ఆమె చేతిలోని బుక్‌వైపు చూస్తున్న వినోద్‌తో అంది.. ‘ఇది బ్రెయిలీ లిపి పుస్తకం’ అని.
***
వృద్ధునికి ఆమె బ్రెయిలీ లిపి నేర్పించడానికి రోజూ వస్తొంది. విషయం అర్థమయ్యాక అయోమయం మరింత పెరిగింది వినోద్‌లో. ఈ వయసులో? అంటూ మనసులోని ప్రశ్నార్థకాన్ని అప్పుడే అక్కడకు వచ్చిన వృద్ధుడి భార్యముందు అనేశాడు. దానికి ఆమె -అంకుల్‌కి ఏడుపదులు దాటి చాలా కాలమైంది. ఆయనకు చాలా భాషలు వచ్చు. ఇప్పుడు క్రేజీగా చెప్పుకుంటున్న ఐఐటి చదువులు ఆయన ఎప్పుడో చదివాడు. పెద్ద కంపెనీలో పెద్ద హోదాలోనే పని చేసి రిటైరయ్యారు. ఈ వయసులో హఠాత్తుగా కళ్లుపోయాయి. వినికిడి శక్తి మాత్రం ఉంది’ అని చెప్పుకొచ్చింది. అతని గురించి తెలిశాక వినోద్ ఆశ్చర్యంగా ‘ఈ వయసులో బ్రెయిలీ నేర్చుకుని ఏం చేస్తారు’ అడిగాడు. చిన్నప్పటి నుంచి చదవడం ఆయనకు ఇష్టమైన పని. హఠాత్తుగా కళ్లుపోయాయి. బ్రెయిలీ లిపిలో మంచి ఆత్మకథలు ఉన్నాయట. వాటిని చదువేందుకు ఇప్పుడు బ్రెయిలీ నేర్చుకుంటున్నారు’ అంటూ ఆమె చెప్పుకునిపోతుంటే -వినోద్‌కు మనసులోనే అనిపించింది. 20ఏళ్ల వయసులో ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం కష్టమైన పని అనుకునే నేను వృద్ధుడినా? ఏడు పదుల వయసులో కళ్లుపోయినా ఆత్మకథలు చదివేందుకు బ్రెయిలీ నేర్చుకోవడానికి ఉద్యుక్తుడైన అంకుల్ వృద్ధుడా? అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. తాను చదవాల్సినవి చాలా ఉన్నాయి. ‘భగవంతుడా.. నాకు కళ్లిచ్చావు చాలు. వీటిని సార్థకం చేసుకుంటాను’ అని మనసులోనే అనుకుని ఇంటిముఖం పట్టాడు.
*
(ఇది నిజంగానే ఉన్న వ్యక్తి కథ .. 72 ఏళ్ళ వయసులో  చదువు పై ఆసక్తితో బ్రెయిలీ లిపి నేర్చుకుంటున్నారు .). 

20, ఫిబ్రవరి 2013, బుధవారం

మనసులోని మర్మం-బయట పెట్టే సెల్‌ఫోన్!


రజనీకాంత్ ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియా వాళ్లు ఆయన చేతిలో బేసిక్ మోడల్ సెల్‌ఫోన్ చూసి విస్తుపోయారు. చిత్ర సీమకే స్టైల్ నేర్పిన రజనీ చేతిలో ఓల్డ్ మోడల్ సెల్‌ఫోన్ కనిపించడం ఆశ్చర్యమే కదా? అదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావిస్తే, ఈ సెల్‌తో నేను మాట్లాడింది ఇతరులకు వినిపిస్తుంది, వాళ్లు మాట్లాడేది నాకు వినిపిస్తుంది. సెల్‌ఫోన్‌కు ఇంత కన్నా ఇంకేం కావాలి అది బేసిక్ మోడల్ అయితేనేం లేటెస్ట్ మోడల్ అయితేనేం అని ఆయ న నవ్వారు. మహాత్మాగాంధీ అంగవస్త్రంతో ఉంటే ప్రపంచ మంతా ఆయన సింప్లిసిటీకి జోహారులర్పించింది. అదే పని ఇతరులు చేస్తే పాపం పూర్తిగా దివాళా తీసినట్టున్నాడనుకుంటారు.

 రజనీ స్టైలే వేరు కాబట్టి బేసిక్ మోడల్ ఫోన్ కూడా ఆయన చేతికి అలంకరణగానే ఉంటుంది. జంటల మధ్య సంబంధాలు రోజు రోజుకు బలహీనపడుతూ వేగంగా విడిపోతున్నారు కానీ మనిషి + సెల్‌ఫోన్ జంట మధ్య మాత్రం అను బంధం రోజు రోజుకు మరింత దృడంగా మారుతోంది. ఈ జంట విడిపోయే అవకాశమే కనుచూపు మేరలో కనిపించడం లేదు. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మీ చేతిలో ఉన్నట్టే. అందుకే ఇంట్లో సైతం జంట లేకపోయినా పెద్దగా దిగులు పడడం లేదు కానీ చార్జీంగ్ అయిపోతే ఐదు నిమిషాలు కూడా భరించలేకపోతున్నారు. సెల్‌ఫోన్లలో ఊహించని ఫీచర్లు వచ్చేస్తున్నాయి. 50వేల రూపాయల ఐఫోన్ వాడే మా అంతస్తెక్కడ? ఐదువందల రూపాయల చైనా ఫోన్ వాడే నీ అంతస్థెక్కడ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి నీకెంత ధైర్యం అని ప్రేమను తిరస్కరించే వారూ ఉన్నారు. సెల్‌ఫోన్లలో ఊహించని ఫీచర్లు వచ్చేస్తున్నాయి.


ఫిలిప్స్ ఎలక్ట్రానిక్స్ సంస్థ అద్భుతమైన ఒక అప్లికేషన్ అభివృద్ధి చేసింది. ఈ అప్లికేషన్‌ను ఏ స్మార్ట్ఫోన్‌లోకైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రేమిస్తున్నాను అని చేప్పే వ్యక్తి ఎదురుగా ఈ స్మార్ట్ఫోన్ కెమెరాను కొద్దిసేపు నిలిపితే, ఆ వ్యక్తి గుండె కొట్టుకునే వేగాన్ని, ఊపిరి పీల్చుకునే క్రమాన్ని లెక్కిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా ఆ వ్యక్తి ప్రేమ ఎంత లోతుగా ఉంది, ఆ వ్యక్తి మాటల్లో నిజాయితీ ఎంతుంది అనేది చెబుతుంది. ఈ అప్లికేషన్స్‌ను రూపొందించిన వినె్సంట్ జెన్నీ ఇది 99 శాతం కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుందని చెబుతోంది.


ప్రేమిస్తున్నారో లేదో సెల్‌ఫోన్ చెప్పేసినప్పుడు ఇంక ఫోన్ చెప్పని విషయం ఏముంటుంది. అదే జరిగితే అల్లకల్లోలం అవుతుందేమో! అదేదో సినిమాలో ఎదుటివారు మనసులో అనుకునే విషయాలన్నీ గ్రహించే శక్తి రావడంతో బ్రహ్మానందం జీవితం బతుకు బస్టాండ్ అవుతుంది. కొంప దీసి ఈ కొత్త ఫీచర్లు జనం జీవితానికి సుఖాన్నిస్తాయా? కొత్త సమస్యలు తెచ్చిపెడతాయా? ఈ అప్లికేషన్స్ అందుబాటులోకి వచ్చాక మాట్లాడే మాటల వెనుక అసలు అర్ధాన్నిసెల్‌ఫోన్ ఇలా విశే్లషించి చెబితే ఎలా ఉంటుంది.
***

*‘నిర్మాత అస్సలు ఖర్చుకు వెనకాడలేదు. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. హీరోయిన్, హీరో అంతా బాగా సహకరించారు- దర్శకుడు.
- పైసా ఖర్చు చేస్తే ప్రాణం మీదకు వస్తుందనుకునే వాడు సినిమా ఎందుకు తీశాడో? హీరోయిన్ సినిమాలో కన్నా నిర్మాత కోసమే ఎక్కువగా పని చేసింది. ఈ సినిమా సంకనాకి పోవడం ఖాయం.
*‘చిట్టి ... కన్నా... ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదూ!’- బాస్ ఇంట్లో ఉద్యోగి.
- చింపిరి జుట్టు బాస్ ఒకడు. వీడి పిల్లి కళ్లే వీడి కొడుక్కు వచ్చాయి. ఆదివారం ఎంజాయ్ చేయకుండా బాస్ కొడుకు పుట్టిన రోజని ఇక్కడ తగలడాల్సి వచ్చింది.
*‘వాడొట్టి వెధవ! మొన్న ఏమైందో తెలుసా?’
‘నాకు తెలిసి అతను అలాంటి వాడు కాదే! నాతోనైతే బాగానే ఉంటాడు’- ఇద్దరు కొలిగ్స్.
- వాడి కన్నా వీడు పెద్ద రోగ్. వాడు తిట్టింది వదిలేసి నేను తిట్టింది సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి వాడికి చేరవేస్తాడు. నా దగ్గర వీడి పప్పులు ఉడకవు. నేను వీడి కన్నా ముదురును.
*‘రోజీ ఈ రోజేంత అందంగా ఉన్నావో? నీ డ్రెస్‌కే నీ వల్ల అందం వచ్చింది’- అబ్బాయి.
- పార్కులంటూ, పార్టీలంటూ ఎంత తిప్పిస్తున్నావు. ఖర్చు చేయిస్తున్నావు. ఒక్కసారి నీకు నామీద గురి కుదరనీ అప్పుడు చూపిస్తా నీ సంగతి 


 *‘ నువ్వు నాకు బాగా నచ్చావు రాజ్ ! మహిళలను గౌరవించే నీ సంస్కారం. నాకెంతో నచ్చింది.’- అమ్మాయి.
-వీడి బొంద. నాకు నచ్చింది వీడి ఆస్తి, వీడి ఉద్యోగం.

*‘ప్రజలే నాకు దేవుళ్లు- వారికే నా జీవితం అంకితం- నాయకుడు
- కూటికి గతిలేని వాడికి కూడా ఓటు హక్కు ఇచ్చేశారు. వీళ్లను కాదు అనాల్సింది ఇలాంటి వాళ్లకు ఓటు హక్కు ఇచ్చినోళ్లను అనాలి. ఇంటింటికి తిరగాల్సి వస్తోంది. తప్పుతుందా? ఓటు వేశాక ఇంతకింత ఏడిపిస్తాను.
‘ప్రజల కోసం తపించడమే మా అబ్బాయి చేసిన నేరమా?’
- మీ అబ్బాయిని ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నావు. మరి మా అబ్బాయిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే తప్పా?
*‘కాళ్లు వాచిపోయాయి. వేళ్లు చిట్లిపోయాయి. నీరసంగా ఉంది. షుగర్ లెవల్స్ పెరిగింది. అయినా ప్రజల కోసం నడుస్తున్నందుకు సంతోషంగా ఉంది- నేత
- జబ్బు పడేంతగా నడిచేది డబ్బు కోసం కాదు. ముఖ్యమంత్రి పదవి లేందే ఉండలేను. ఈసారి అధికారం ఇవ్వకపోయారో? మీ అందరినీ శపించేస్తాను.
*‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. నాకెలాంటి అనుమానం లేదు- అధికారపక్షం
- పిచ్చి సన్నాసులు. ఒక్క ఎమ్మెల్యే మద్దతు లేకున్నా 2014 వరకు అధికారాన్ని కాపాడుకోవడమే అద్భుతమైన విజయం. ఎంత చేసినా జనం గెలిపించరని అందరికీ తెలుసు.

* న్యాయ వ్యవస్థ పై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది .-  కేసులో చిక్కిన నేత. - కేసు నుంచి ఎలా బయట పడాలో నాకు బాగా తెలుసు  

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

చూపుడు వేలు..


కహానీ 3

‘ఛ.. ఛీ... ఈ దేశంలో ఎవరికీ సివిక్‌సెన్స్ లేదు. కామన్‌సెన్స్ అస్సలు లేదు’ అంటూ తిట్టుకుంటూనే మిత్రుడు సురేష్ ఇంట్లోకి వచ్చాడు రమేష్. మిత్రులు ఇద్దరూ సామాజిక చర్చల్లో మునిగిపోయారు. ఇద్దరి అభిప్రాయాలు ఒకటిగానే ఉన్నాయి.
‘ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికి రాదు. మిలటరీ పాలన వస్తేగానీ జనం దారికి రారు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయాలి. రాజకీయ నేతలంతా దొంగలు. జనం పరమ బద్ధకస్తులు. ఇలాంటి దేశం ఎప్పుడు బాగుపడుతుందో. ఈ దేశాన్ని పూర్తిగా
మార్చేయాలి’ ఇవీ వారి చర్చల్లో దొర్లిన కొన్ని అంశాలు. ‘ఏంట్రా రమేష్ ఎప్పుడూ లేనంత ఆవేశంగా ఉన్నావ్. ఏమైందేమిటి?’ అంటూ అప్పటి వరకూ వారి మాటలు వింటూ పత్రిక చదువుతున్న సురేష్ అన్న సందీప్ ముందుకొచ్చాడు. ‘ఏ పనీ సమయానికి చేయరు. ఒక్కరూ మాట మీద నిలబడరు. చట్టాన్ని గౌరవించరు. నిబంధనలు పాటించరు’ అంటూ రమేష్ తన అసహనం వ్యక్తం చేశాడు.

 ‘నీకో జోక్ చెప్పనా’ అంటూ సందీప్ అక్కడి వాతావరణాన్ని తేలిక పరచడానికన్నట్టు సరదాగా అడిగాడు. సమాధానం కోసం ఎదురు చూడకుండానే జోక్ చెప్పాడు. ఒక యువకుడు డాక్టర్ వద్దకెళ్లి తనకు విచిత్రమైన జబ్బు ఉందని చెప్పాడు. ‘శరీరమంతా ఎక్కడ ముట్టుకున్నా నొప్పి వేస్తుంది. కానీ శరీరంలో ఎక్కడా ఏమీ కనిపించడం లేదు. నొప్పి
భరించలేకపోతున్నా’ అని డాక్టర్‌ను కలిశాడు. నొప్పి ఎక్కడని డాక్టర్ అడిగితే, ఎక్కడ ముట్టుకున్నా నొప్పి అంటూ ముఖాన్ని చూపుడు వేలితో ముట్టుకున్నాడు. అబ్బో నొప్పి అని మెలికలు తిరిగిపోయాడు. కాళ్ల మీద, చెంపల మీద, వీపుమీద అన్నిచోట్లా ముట్టుకుంటూ.. నొప్పి నొప్పి అని అరుస్తున్నాడు. డాక్టర్ అతనే్న పరీక్షగా చూసి నవ్వాడు. నొప్పితో బాధపడుతున్న తనను డాక్టర్ చూసి నవ్వడంతో అతనికి మండుకొచ్చింది. ‘బాబూ నీ శరీరానికి వచ్చిన సమస్యేమీ లేదు. శరీరంలో నొప్పి లేదు. రోగం లేదు. నీ ఆలోచనలోనే తేడా ఉంది’ అని చెబుతూ అతని చూపుడు వేలిని పట్టుకుని చూశాడు.

ఇదిగో సమస్య ఇక్కడుంది. నీ చూపుడు వేలికి గాయమైంది. గాయంతో ఉన్న వేలితో శరీరంలో ఎక్కడ ముట్టుకున్నా నొప్పి లేస్తోంది. అది శరీరం సమస్య కాదు, నీ చూపుడు వేలి నొప్పి’ అని డాక్టర్ చెబితే అతనికి అప్పుడు గుర్తుకొచ్చింది. పెన్సిల్ చెక్కుతుంటే చూపుడు వేలికి గాయమైందని. అరే వేలికి గాయమైతే మొత్తం శరీరాన్ని అనుమానించాను అనుకున్నాడు’ అని సందీప్ ముగించాడు. రమేష్‌కు విషయం అర్ధమై ఆలోచనలో పడ్డాడు. తరువాత సిగ్గుపడ్డాడు. దేశాన్ని మార్చడం కాదు మారాల్సింది ముందు తానే అని మనసులోనే అనుకుని వౌనంగా ఉండిపోయాడు.
 అందరినీ  మార్చేద్దాం అని బయలు దేరిన వాళ్ళంతా ముందు తాము మారితే లోకం  దానంతట అదే  మారేది .

17, ఫిబ్రవరి 2013, ఆదివారం

సాహిత్య,సినీ రాజకీయ అంటు రోగాలు!!


వాస్తు దోషమో, వాతావరణ ప్రభావమో కానీ తెలుగునాట అంటు రోగాల సందడి ఎక్కువే.  సీజనల్‌గా వచ్చే అంటు రోగాల గురించి కాదు. వారసత్వంగా వస్తున్న అంటు రోగాల గురించి. 
తాపీ ధర్మారావు తన సాహిత్య మర్మరాలులో ఆంధ్ర కవుల్లో అంటు రోగాలు అంటూ సాహిత్య అంటు రోగాలను పరిశోధించి మరీ కనిపెట్టారు. ఒక కవిని రాజు పిలిపించి నా కోసం ఒక గ్రంథం రాయమన్నాడంటే అలానే చాలా మంది అదే దారి పట్టారు. ఈ అంటు రోగాలు ఎంతగా వ్యాపించాయంటే అంటు రోగాలు లేకుంటే అది గ్రంధం అనిపించుకోదేమో అని ఆ కాలంలో వ్యాపించిన అంటు రోగాన్ని కవులంతా అనుసరించారని తాపీ వారు వాపోయారు.

 తన గ్రంధంలో ఎవరో ఒక కుకవిని ఒక కవి తిట్టాడంటే ఈ
అంటు రోగం ఆ తరువాత కవులంతా అనుసరించాల్సిందే. తెనాలి రామలింగడు, తిక్కన, అల్లసాని పెద్దన్న రఘునాథ నాయకుడు, చేమకూర కవి వంటి వారంతా  ఈ సాహిత్య అంటు రోగాల పాలైన వారే.

 వీరి గ్రంధాల్లో కుకవిని విమర్శిస్తూ కచ్చితంగా ఒక కవితను రాసి కసి తీర్చుకున్నవారే నంటూ తాపీ వారు వివరించారు. తాపీ వారు ఈ అంటు
రోగాల గురించి కుకవిని విమర్శించే అంశానికే పరిమితం అయ్యారు కానీ సాహిత్యంలో అంటు రోగం వ్యాపించని
ప్రక్రియ ఏముంది. భావ కవిత్వం అంటూ కృష్ణశాస్ర్తీగారు వ్యాపింపజేసిన  అంటు రోగం ప్రభావం తక్కువా?

ఆ కాలంలో జుట్టు పెంచి ప్రేమ కవిత్వం రాయని వాడు కూడా
ఒక కవేనా? అనుకున్నారు కదా? ఒక కవి మేఘంతో ప్రేమ లేఖ పంపితే మరొకరు పావురంతో ఒకరు పిట్టతో ప్రేమ సందేశాలు పంపేవారు. 

ఆర్థిక సంస్కరణల ప్రారంభ కాలంలో  హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్‌లో
ఏదైనా ఒక కంపెనీ షేర్ ధర గురించి  విచారించాడు అనే వార్త బయటకు పొక్కితే చాలు దాని ధర ఆకాశాన్నంటేది. అంతా ఆ షేర్ కోసం ఎగబడేవారు. అలానే సాహిత్యంలో పలనా కవిత్వానికి బాగా పేరొస్తుందనగానే ఓ కాలంలో క్యూ కట్టేవాళ్లు. అది విప్లవ కవిత్వం దిగంబర కవిత్వం, మినీ కవిత్వం, నానీలు, కుల కవిత్వం, మైనారిటీ కవిత్వం పేరేదైతేనేం ఒక్కో కాలంలో సాహిత్యంలో ఒక్కో అంటు రోగం రాజ్యామేలేది. అప్పుడు ఫేస్‌బుక్‌ల
వంటివి లేవు కానీ ఉండి ఉంటేనే కవిత్వంతో నిండిపోయేవి. కవిత్వానికి కాలం చెల్లిపోయిందేమో అనుకుంటున్న కాలంలో వచ్చి ఫేస్‌బుక్ బతికి పోయింది.  సాహిత్యంలోనే కాదు తెలుగునాట  అంటు రోగాలు లేని రంగం లేదు.

సినీ రాజకీయ రంగాల్లో ఈ అంటు రోగాల ప్రభావం మరీ ఎక్కువ. సినిమా రంగంలో అంటు రోగానికి కేంద్ర బిందువు హీరో. అనువంశిక రోగాల మాదిరిగా తెలుగునాట హీరోకు హీరోలు, వాళ్లకు మళ్లీ హీరోలు పుడతారు.
 పాపం తర తరాలుగా ఈ రోగం వారిని వెంటాడుతూనే ఉంటుంది.

 జబ్‌తక్ సూరజ్ చాంద్ రహేగా అప్పారావు తేరా నామ్ రహేగా అంటూ నాయకుడి అభిమానులు కీర్తించి, దశ దిన కర్మ తరువాత ఆతన్ని గుర్తుంచుకునే వారే ఉండరు. కానీ సినిమాల్లో మాత్రం అలా కాదు
ఒక హీరో నానా తంటాలు పడి ఎదిగాడంటే ఆయన కొడుకు, మనవడు, మునిమనవడు, ఇంట్లో పుట్టిన ప్రతి మగ శిశువు ఏదో ఒక నాడు హీరో కావలసిందే. సినిమాల్లో తమ వంశ చరిత్రను మహా గొప్పగా చెబుతుంటారు. అంతేనా చివరకు కథల్లో సైతం ఈ అంటు రోగాల ప్రభావం బాగా కనిపిస్తుంది. 

కంటి చూపుతో చంపే కథకు కాసులు కురిశాయంటే ఈ రోగం మొత్తం చిత్ర సీమను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కథను కొద్దిగా మార్చి కంటి చూపుకు బదులు పంటితో చంపేసే కథలు వస్తాయి. ఒక్క చేతితో ఒకడు
పది మందిని చంపితే, మరో గొప్ప వంశం హీరో ఏకంగా వంద మందిని చంపేస్తాడు. హీరోల బలం విషయం ఎలా ఉన్నా ఈ విషయంలో విలన్ల క్రమశిక్షణ మాత్రం ముచ్చటేసే విధంగా ఉంటుంది. హీరో ఒకరిని కొట్టగానే అతను చెట్టు చిటారు కొమ్మపై పడతాడు. అప్పటి వరకు మరో విలన్ చేతులు కట్టుకుని తన వంత వచ్చే వరకు వేచి చూస్తాడు కానీ మధ్యలో వెళ్లడు. ఎంత క్రమశిక్షణ. అదే రోడ్డుమీద ట్రాఫిక్‌లో నీదే తప్పంటే నీదే తప్పంటూ ఉన్న పది మంది ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఏ మాత్రం క్రమశిక్షణ పాటించకుండా తిట్టుకుంటారు. వీళ్ల కన్నా సినిమాలో చక్కని క్రమ శిక్షణ పాటించి హీరో చేతిలో చిత్తయ్యే విలనే్ల మేలు. ఏదో ఒక సినిమాలో విలన్ ఇలా ప్రవర్తిస్తే అంతా అదే దారిలో వెళతారు. 

కల్లు వ్యాపారం లాభసాటి అనగానే అందరూ కల్లు దుఖాణాలు తెరిచేస్తారు. చేపల చెరువుల్లో డాలర్లు పండుతున్నాయంటే  చెరువుల అంటు రోగం అందరికీ అంటుకుంది. చివరకు చేపలకు ఏదో తెలియని అంటు రోగం అంటుకుని అంతా మునిగిపోయారు.
ఇంజనీరింగ్ కాలేజీలు మంచి లాభసాటి అని తేలగానే ఊరవతల ఉన్న కల్లు పాకలు మాయమయ్య ఇంజనీరింగ్ కాలేజీ అనే బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. ఇది విద్యా వ్యాపారంలోని అంటు రోగం. అన్ని రాష్ట్రాల్లో మాకు కాలేజీలు కావాలని పైరవీలు చేసుకుంటుంటే బాబోయ్ మా కాలేజీలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. దీన్ని రద్దు చేసి మమ్మల్లి కాపాడు అంటూ వేడుకుంటున్నారు. కాలేజీలను ప్రారంభించడం ఒక అంటు రోగంగా వ్యాపిస్తే, మూసివేయాలనే నిర్ణయంలో సైతం అంతే రోగం అంతే వేగంగా విజృంభించింది.

 ఇక రాజకీయాల్లో ఈ రోగం ప్రభావం మరీ ఎక్కువ. ఒకాయన ఉచిత విద్యుత్‌తో అధికారంలోకి వచ్చాడనగానే అప్పటి వరకు ఉచిత విద్యుత్ అంటే ఉరితీస్తాను అని ఘీంకరించినాయన కూడా నిరంతర ఉచిత విద్యుత్ అంటారు. ఒకాయన రోడ్డుపై నడిచి వెళుతుంటే మెడలో అధికార మాల పడిందనగానే మరోకాయన అంత కన్నా ఎక్కువ దూరం నడిచేస్తాడు. ఒకరు ఉచిత కలర్ టీవి అంటే మరొకరు ఉచిత ఎల్‌సిడి టీవి అంటారు. మరొకాయన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ కూడా ఉచితం అంటాడు. ఈ ఉచిత రోగం చివరకు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి సొంతంగా నిద్ర పోతే చాలు మిగతావన్నీ మేం ఇచ్చేస్తాం అని పార్టీలు చెప్పేంత వరకు వెళుతుంది. మరి తిని కూర్చుంటే కొవ్వు పెరుగుతుంది కదా? అనే సందేహం వస్తే ఉచితంగా కొవ్వు తొలగించి ఇంటికే నగదు బదిలీ చేస్తాం అంటారు. ఒకరు కొడుకును రంగంలో దించితే మరొకరు తన కొడుకునే కాదు బంధు వర్గం కొడుకులందరినీ రంగంలో దించుతారు. కడుపు చించు కుంటే కాళ్ళ పై పడుతుంది . అంటు రోగి కానీ దెవరు ? అంటు రోగం వ్యాపించని రంగ మేది ? 

13, ఫిబ్రవరి 2013, బుధవారం

అందరిలోనూ విశ్వరూపం!

ఎమర్జన్సీలో ఇందిరాగాంధీ దేశ ప్రజలకు తన విశ్వరూపం చూపిస్తే, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఇందిరాగాంధీకి తమ విశ్వరూపం చూపించారు. సాంకేతిక, సమాచార రంగాల్లో అంతగా అభివృద్ధి చెందని ఆ కాలంలో రాత్రికి రాత్రి భారతీయులంతా ఒక చోట సమావేశం అయి నిర్ణయం తీసుకున్నట్టుగా అసేతు హిమాచలం ఒకే రీతిలో స్పందించడం పట్ల ప్రపంచం నివ్వెరపోయింది. పాకిస్తాన్ యుద్ధంలో ఇందిరాగాంధీ ఉగ్ర రూపాన్ని చూసి ప్రతిపక్షానికి చెందిన వాజ్‌పాయి లాంటి వారు అపర దుర్గామాత అని కీర్తించారు. కానీ ఇప్పుడు పొరుగు దేశం యాత్రికులను పంపినంత ఈజీగా తీవ్రవాదులను దేశంపైకి పంపినా వౌనంగా ఉంటున్న నేతలను చూస్తుంటే, ఎందుకో మన నేతలు మరుగుజ్జుల్లా కనిపిస్తున్నారు. ఇలాంటి నేతల నుంచి విశ్వరూపాన్ని ఆశించడం అత్యేశే అనిపిస్తోంది.


పోలింగ్ రోజు ఓటరు విశ్వరూపం చూపిస్తే, ఓట్ల పండగ ముగిశాక నేత ఐదేళ్లపాటు ఓటరు ప్రజలకు తన విశ్వరూపం చూపిస్తాడు ప్రజాస్వామ్యం అంటే ఇదే. ఓట రు, నాయకుల విశ్వరూపాల జుగల్ బందీనే పరిపాలన. శ్రీకృష్ణ్భగవానుడు అంతటి వాడు రెండుసార్లు మాత్రమే తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఓటరుకు మాత్రం ఐదేళ్లకోసారి ఆ అవకాశం లభిస్తుంది. సానుభూతిపైనో, గ్రహాలపై నమ్మకంతోనో, గ్రహపాటుతోనో కొందరు నేతలు కొంత ముందస్తుగానే ప్రజలకు విశ్వరూపం చూపించే అవకాశం కల్పిస్తుంటారు.


తొలిసారి రాయబార సమయంలో కౌరవసభలో, రెండవ సారి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి గీతాబోధన చేస్తూ మొత్తం రెండు సార్లు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించారు. శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తికి ముం దు మరుగుజ్జ వేశం లో కనిపించి, తరువాత తన విశ్వరూపాన్ని ప్రదర్శించి బలి తలపైనే కాలు పెట్టాడు. విశ్వరూపంతో కాని పనులు కొన్నిసార్లు మరుగుజ్జు వేశంలో కావచ్చు. ఎప్పుడు విశ్వరూపం చూపించాలి, ఎప్పుడు మరుగుజ్జు వేశం చూపాలో తెలిసుండడమే లోకజ్ఞానం. అందుకే శ్రీకృష్ణుడు కీలక సమయంలో మాత్రమే విశ్వరూపం చూపించాడు. రాయబారం కోసం వెళ్లినప్పుడు కౌరవ సభలో తనను తక్కువగా అంచనా వేసినప్పుడు విశ్వరూపాన్ని చూపించి, జరగబోయే మహాయుద్ధం కౌరవసేనకు ఎంతటి ముప్పు కలిగించనుందో చెప్పకనే చెప్పాడు. తీరా యుద్ధ్భూమిలోకి వచ్చిన తరువాత యుద్ధం చేయలేనని అర్జునుడు నిరాశతో పలికాడు. 

ఎన్నికల్లో డిపాజిట్ రాని నాయకుడు సైతం అధికారం మనదే అంటూ పార్టీ శ్రేణులను నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. అలా చెప్పకపోతే టికెట్ అడిగే వారుండరు, పోటీ చేసేవారుండరు. పోలింగ్‌కు ముందే ఓటమి పాలవుతారు. అలాంటిది తన మార్గదర్శకంలో నడిచే యుద్ధంలో నాయకుడే నిరాశ పడితే కొంప కొల్లేరు కాదూ! అందుకే శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి భగవద్గీతను వినిపించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి ఉండక పోతే కురుక్షేత్ర యుద్ధమే ఉండేది కాదు, దుర్యోధనుడు రారాజుగా మిగిలిపోయే వాడు. భవగద్గీతను మామూలుగా చెప్పి ఉంటే అర్జునుడు పెద్దగా పట్టించుకునే వాడు కాదు అందుకే శ్రీకృష్ణుడు విశ్వరూపంలోనే విశ్వ రహస్యాలను విప్పి చెప్పాడు. యశోధకు వెన్నదొంగగా కనిపించిన శ్రీకృష్ణుడు, సత్యభామ మానస చోరుడు, గీతకారుడు ఒకరే. ఏ సమయంలో ఏ రూపు దరించాలో ఆయనకు బాగా తెలుసు. ఏదీ నోరు చూపించు అంటే మొత్తం విశ్వాన్ని తన నోటిలో చూపించాడు.


హనుమంతుడు కూడా అంతే రాక్షసుల చెవిలో నుంచి దూరి వెళ్లేంత చిన్నగా మారా డు.సముద్రాన్ని ఈదేంత పెద్దగానూ మారా డు. లంకలో సీతాదేవిని చూసినప్పుడు కోతి రూపంలోనే ఉన్నాడు. శ్రీరాముడు వస్తాడు, రావణుడిని సంహరించి మిమ్ములను తీసుకువెళతాడు అని చెప్పినప్పుడు నమ్మకం కలిగించడానికి విశ్వరూపం చూపించేశాడు. శ్రీరామునికి భారీ సైన్యం ఉంది. అందులో నేనో చిన్న కోతిని అని చెప్పుకొచ్చాడు. చిన్న కోతే లంకు నిప్పంటించేంత బలవంతుడైతే శ్రీరాముని వద్ద ఉన్న సైన్యం ఇంకెంత బలమైందో అనే నమ్మకం సీతమ్మకు ఏర్పడకుండా ఉంటుందా?


మహావిష్ణువులో మరుగుజ్జు రూపం,విశ్వరూపం రెండూ ఉన్నట్టుగానే ప్రతి 
మనిషిలో, నేతల్లో ఆ రెండు రూపాలు ఉంటాయి, కావలసిందల్లా ఏ రూపాన్ని ఎప్పుడు ప్రదర్శించాలనే జ్ఞానం. సినీనటుడు కమల్ హాసన్ ఈ రెండు రూపాయలను విజయవంతంగా ప్రదర్శించాడు. ఆ మధ్య రజనీకాంత్ రోబోలో తన విశ్వరూపం చూపించేశాడు. విశ్వరూపంలో కమల్ హాసన్ అదే చేశాడు. అంతకు ముందు ఆయన మరుగుజ్జుగా, స్ర్తిగా నటనా విశ్వరూపం చూపించేశాడు.

 ఎన్నో సినిమాల్లో శ్రీకృష్ణుడిగా విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఎన్టీఆర్ అల్లుడి విశ్వరూపాన్ని చూసి తిరిగి తేరుకోలేక సొమ్మసిల్లి...... పోయారు. టిడిపి నుంచి బయటకు వచ్చిన తరువాత కెసిఆర్ విశ్వరూపాన్ని చూసి టిడిపి వాళ్లు 12 ఏళ్ల నుంచి ఇంకా తేరుకోలేక... పోతున్నారు. కొంత మంది మరుగుజ్జులా కనిపించినా అవసరం అయినప్పుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే, మరి కొందరు నాయకులు మాత్రం విశ్వరూపంలో కనిపిస్తారు. కానీ తీరా సమయం వచ్చాక అది విశ్వరూపం కాదు భ్రమ అని తేలిపోతుంది. అచ్చం చిరంజీవి రాజకీయ ప్రవేశం వలె... బిగ్‌బాస్ పొలిటికల్ ఎంట్రి బిగ్ బ్యాంగ్ ప్రయోగం అవుతుందనుకుంటే గాలిబుడగ అయ్యారు.

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

ద్వాపర యుగం అర్జునుడు .. కలియుగం అర్జున్ .. ఒక పిట్ట కన్ను


అర్జున్ -- కహానీ2

 



 అర్జు నా.. నీకేం కనిపిస్తుంది! అని ద్రోణుడు అడిగినప్పుడు, పిట్ట కన్ను తప్ప తనకేమీ కనిపించడం లేదని సమాధానమిచ్చాడు ద్వాపరయుగం నాటి అర్జునుడు. ప్రస్తుత కాలపు అర్జున్‌ను అతని మాస్టర్ ఇదే ప్రశ్న అడిగితే, సమాధానమేమీ చెప్పకపోయే వాడు. కారణం -ప్రశ్నలు కూడా వినిపించుకోలేనంతగా పనిలో లీనమవుతాడు. మన కథలో -అర్జున్ తీరు మొదటి నుంచీ అంతే. చదువు పూర్తికాగానే క్యాంపస్ సెలక్షన్స్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. లక్ష్యం తప్ప అతనికేమీ పట్టదు. పట్టించుకోడు... పట్టించుకోవాలనే ఆసక్తీ ఉండదు. తన బృందంలో అర్జున్ ఉండటం అదృష్టమని బృంద నాయకుడు చాలాసార్లు స్వయంగా అర్జున్‌తోనే చెప్పాడు. ఆ మాట అర్జున్‌కు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఉత్సాహం అతనికి అప్పగించిన పనిలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఆఫీసులో వాతావరణం ఉత్సాహంగా ఉంది.

కంపెనీకి నాలుగు ప్రాజెక్టులు వస్తేనే కళకళలాడుతుంది. ఉద్యోగుల పరిస్థితి బాగుంటుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టును విజయవంతం చేసినందుకు యాజమాన్యం కొందరికి ప్రమోషన్లు ఇచ్చింది. ఆ ప్రాజెక్టులో కీలక పాత్ర తనదే. జాబితాలో తొలి పేరు తనదే ఉండి తీరుతుంది అనుకున్న అర్జున్‌కు -మేనేజిమెంట్ నిర్ణయం ప్రకటించిన తరువాత అసలేం జరిగిందో అర్థం కాలేదు. బృంద నాయకుడిని యాజమాన్యం ఆకాశానికెత్తేసింది. తన పేరును ప్రస్తావించే వారే లేరు. ఎక్కడో పొరపాటు జరిగిందని అనుకున్నాడు అర్జున్. కాదు మోసం జరిగిందని గ్రహించాడు. మనసు అసంతృప్తితో రగిలిపోతోంది. కానీ ఎవరికీ చెప్పలేదు. విషయం తెలిసిన సీనియర్ ఒకరు భుజంపై చేయి వేసి పద.. క్యాంటిన్ వరకూ వెళ్లొద్దామని ఆప్యాయంగా పిలిచాడు. ఏమీ మాట్లడకుండా సీనియర్ వెంటే క్యాంటిన్‌కు వెళ్లాడు. అర్జునుడు పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుందని చెప్పే  కథ చిన్నప్పుడు  విన్నావా ? అని సీనియర్ ప్రశ్నిస్తే, వినడమే కాదు ఆ కథ నాపై తీవ్రమైన ప్రభావం చూపింది. లక్ష్యాన్ని తప్ప దేన్నీ పట్టించుకోవద్దనే జీవిత పాఠం నేర్పిన కథ అది అని అర్జున్ సమాధానమిచ్చాడు. అయినా అసందర్భంగా ఇప్పుడా విషయం ఎందుకు? అని మనసులోనే ప్రశ్నించుకున్నాడు. 

అర్జున్ మనసు భావాన్ని అర్థం చేసుకున్న సీనియర్ ఈ విధంగా హితోపదేశం చేశాడు.  అర్జునుడు  పిట్ట కన్నుపై మాత్రమే గురిపెట్టి చుట్టుపక్కల ఉన్న దుర్యోధన బృందాన్ని పట్టించుకోలేదు. ద్వాపరకాలం కాబట్టి   దాని వల్ల అతనికి ఇబ్బందేమీ కలగలేదు .  కానీ ఇది కలికాలం. పిట్ట కన్నుపై మాత్రమే గురిపెడితే సరిపోదు. నువ్వు బాణం వేసేప్పుడు నీకాళ్ల కింద గొయ్యి తవ్వే వాళ్లు ఉంటారు.  పని చేస్తున్నది తానే అని నీ  విషయం   నువ్వే  చెప్పుకోవాలి. లేదంటే ఏ దుర్యోధనుడో దాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు. ఎవరికి వారే మార్కెటింగ్ చేసుకునే కలికాలమిది అన్నాడు సీనియర్
.

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

రాహుల్ పెళ్ళి కోసం కోర్ కమిటీ ... బాబు నవ్వాడు



ఇక్కడి పౌరసత్వం తీసుకోని విదేశీయులు కుడా ప్రధాన మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్న దేశం మనది .. అలాంటిది  బ్రమ్మ చారులకు  అడ్డే ముంటుంది ... అయినా ముందు  చూపుతో ఓట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ పెళ్లి  చేయాలని 15 ఏళ్ల  సుదీర్ఘ   చర్చల  తరువాత సోనియా నిర్ణయించారు .

భారతీయ సంప్రదాయాలను గౌరవించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని రాహుల్ గాంధీ ముసిముసి నవ్వులతో ప్రకటించారు. పెళ్లి ఏర్పాట్లలో సోనియాగాంధీ బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్‌లో రాహుల్ పెళ్లి విషయంపై నాలుగవ సారి సమావేశం జరిగింది. ఏకాభిప్రాయం కుదిరితే తప్ప నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని గులాంనబీ ఆజాద్ ప్రకటించారు. దీనికి నెల రోజులు పట్టవచ్చునని అన్నారు. నెల అంటే 30 రోజులే కానవసరం లేదని పనె్నండు నెలలు కూడా కావచ్చునని ఆయన తెలిపారు. 

దీనిపై వాయిలార్ రవి అభిప్రాయాన్ని కోరగా దీనిని మీడియా తప్పుగా అర్ధం చేసుకోవద్దని, ఎన్ని రోజులైనా పట్టవచ్చు అని చెప్పినంత మాత్రాన దాన్ని రాహుల్ ఇక పెళ్లి చేసుకోరు అనే భావంతో అర్ధం చేసుకుంటున్నారని అన్నారు. అయితే రాహుల్ పెళ్లి చేసుకుంటారని మీరు చెబుతున్నారా? అని విలేఖరులు గుచ్చి గుచ్చి ప్రశ్నించగా, ఆ విషయం నేనెలా చెబుతాను, నేను కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌నే కానీ, కాంగ్రెస్ నాయకుల కుటుంబ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను కాదని అన్నారు. షిండే వివరణ కోరగా, హోంమంత్రిగా మా ఇంటి వ్యవహారాలే నాకు తెలియదు, ఇక సోనియా ఇంటి విషయాలపై అడగడం మీడియాకు భావ్యం కాదని అన్నారు.

***
అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేకు కుడిభుజంగా నిలిచి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తో జనం ముందుకు వచ్చిన అరవింద్ కెజ్రీవాల్‌కు కాంగ్రెస్ హై కమాండ్ అంటే కోపం ఎందుకో తెలుసా? కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ చరిత్రను తవ్వి వెలికి తీసి దీన్ని బయట పెట్టారు. ఇది చాలా రోజుల క్రితం నాటి మాట అంటే మరీ అనగనగా ఒక రాజు అంత పాత కాలం కాదు. ప్రియాంక, రాబర్ట్ వాద్రాలకు పెళ్లి కాక ముందు నాటి మాట! కెజ్రివాల్ ప్రియాంకను పెళ్లి చేసుకోవడం ద్వారా గాంధీ కుటుంబంలో సభ్యుడు కావాలనుకున్నారు. దాని కోసం ఆయన దిగ్విజయ్ సింగ్‌ను కలిసి తన మనసులోని మాట చెప్పాడు. దీనికి దిగ్విజయ్ ససేమిరా అంగీకరించేది లేదన్నారు. దాంతో సోనియాగాంధీ కుటుంబంపై కక్షపెంచుకున్న కెజ్రివాల్ రాబర్ట్ వాద్రా, డిఎల్‌ఎఫ్ కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కెజ్రివాల్ గాంధీ కుటుంబంలో చేరడానికి ఏ మాత్రం అర్హత లేని వాడు. అతనికి డ్యాన్స్ రానేరాదు ఇంతకు మించిన అనర్హత ఏముంటుంది.
***
సిబిఐ జగన్‌ను దేశంలోనే అత్యంత క్లీన్‌చిట్ గల నాయకునిగా ప్రకటించింది. ఇంత కాలం విచారణ పేరుతో వేధించినందుకు క్షమాపణలు కోరుతూ జగన్‌కు లేఖ రాసింది. రాజకీయ ఒత్తిడి వల్ల మచ్చలేని నాయకునికి మచ్చ అంటించాలని తాము ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు ఫెవికాల్ సైతం పని చేయలేదని సిబిఐ ప్రకటించింది. జగన్ జైలులో ఉండగా, ఆయన ప్యాంటుకు అంటుకున్న గడ్డిపరకను సైతం తిరిగి జైలుకు అప్పగించి వెళ్లారని, తన 150 ఏళ్ల జీవితంలో ఇలాంటి అరుదైన సంఘటన చూడలేదని జైలు ఉద్యోగి జయనాధం చానల్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. జగన్ జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు తన తల్లి గర్భం నంచి బయటకు వచ్చేది లేదని కంకిపాడుకు చెందిన సుబ్బలక్ష్మి కడుపులోని బిడ్డ తిరగబడింది.
***
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల కోసం పాదయాత్ర చేస్తూ ఈరోజు మధ్యాహ్నం అలసిపోయి స్పృహ తప్పి పడిపోయారు. డాక్టర్లు చెప్పినా వినకుండా స్పృహ లేకుండా నిస్పృహతో బాబు అలానే నడిచారు. జగన్ అంతు తేల్చేంత వరకు, భూగోళం అంతు చూసేంత వరకు అవసరం అయితే చంద్రలోకం వరకు ఇలా నడుస్తూనే ఉంటానని ప్రకటించారు. బోసినవ్వులతో ఉన్న చిన్నారిని చూసి బాబు ఈ పాదయాత్రలో నవ్వారు. బాధల్లో ఉన్న వారిని చూసి కన్నీరు కార్చారు. అయితే బాబు నవ్వుతున్న ఫోటోలు, కన్నీరు పెట్టిన ఫోటోలు నిజమైనవి కావని మార్ఫింగ్ చేశారని, ఆ రెండూ ఆయనకు అలవాటు లేదని ఆధారాలతో సహా నిరూపిస్తానని గోనె ప్రకాశ్‌రావు సవాల్ చేశారు. దీనికి స్పందించిన ఎన్టీఆర్ భవన్ 3456 ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. ఆ ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకోలేక బలహీనులైన ముగ్గురు నలుగురు మీడియా వాళ్లు నీరసంతో పడిపోయారు. ఈసారి ఎలాగైనా బాబును ముఖ్యమంత్రిని చేస్తామని జనం గుండెలు బాదుకుంటూ చెప్పారు.
***
రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిందని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి చూసి ఆవేదన చెందిన ఆయన తానిక సమైక్యాంధ్ర వాదిగా ఉంటానని ప్రకటించారు.
***
రాష్ట్రంలోని పరిస్థితుల పట్ల ఆవేదన చెందిన రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు తమకు ఎలాంటి పదవులు వద్దని, తమ స్థానంలో బడుగు బలహీన వర్గాలకు కాంట్రాక్టులు, పదవులు ఇవ్వాలని వారిద్దరు సంయుక్తంగా సోనియాగాంధీకి లేఖ రాశారు.
***
***
సోనియా నివాసంలో కాంగ్రెస్ పెద్దలు కిరణ్ కుమార్‌రెడ్డితో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తొలుత ఈ సమావేశం తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి అని అంతా అనుకున్నారు. కానీ తరువాత అసలు విషయం తెలిసింది. ముఖ్యమంత్రికి కాంగ్రెస్ తరఫున తెలుగు నేర్పించే బాధ్యత ఎవరికి అప్పగించాలని సాగిన మంతనాల్లో ఆ బాధ్యత గులాంనబీ ఆజాద్‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఏకాభిప్రాయం కుదరడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణపై సైతం ఇదే విధంగా ఏకాభిప్రాయం కుదురుతుందని దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు.....
****
ఆగండాగండి ఇవన్ని నిజమైన వార్తలు కావు .

అమెరికాలో www.theonion.com పేరుతో ఒక వెబ్ పత్రిక ఉంది. ఇలానే మన దేశంలో సైతం ది ఫేకింగ్ న్యూస్ (www.fakingnews. com) అని ఒక వెభ్ పత్రిక ఉంది. ఇందులో వ్యంగ్య వార్తలు భలే రంజుగా ఉంటున్నాయి. తెలుగులో ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయరు అని చర్చ జరిగితే, తెలుగు మీడియాలో వార్తలు అలానే ఉన్నాయి కదా? ఇంకా ప్రత్యేకంగా ఎందుకు అని కొక్కిరాయి సమాధానం వచ్చింది.  కేజ్రివాల్ గురించి  ఇందులో ప్రస్తావించిన దిగ్విజయ్ సింగ్ పరిశోధన వార్త అందులోదే. మిగిలిన వన్నీ ఈ వెబ్‌సైట్ తెలుగులో ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి పుట్టినవి. ఇవి వార్తలు కావు. ఊహలు మాత్రమే!
.

6, ఫిబ్రవరి 2013, బుధవారం

ఈ పిల్లకు మొగుడెవరో?


టీవీని చూస్తూ ఈ పిల్లకు మొగుడెవరొస్తారో? అని పరంధామయ్య ఎదురుగా ఉన్న పరశురామయ్యను అడిగాడు.

 మా గోల్డ్ టీవిలో ఎప్పటిదో పాత సినిమా వస్తోంది. మురళీ మోహన్ గుడ్డివాడు. కర్ర పట్టుకుని పాట పాడుతూ జోలెపట్టి అడుక్కుంటున్నాడు. కారులో వెళుతున్న ప్రభ ఆ పాట వింటూ తన్మయంలో మునిగిపోయింది. జోలెపట్టి అడుక్కుంటున్న మురళీ మోహన్‌ను ప్రభ తన్మయంగా చూస్తోంది. ‘‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేముందోయ్ ఆమెకు మురళీ మోహన్‌తోనే పెళ్లవుతుంది. హీరో ముష్టివాడైనా కుష్టి వాడైనా హీరోయిన్ అతనే్న ప్రేమిస్తుంది. రేపిస్టోడైనా పాపిష్టోడైనా హీరోయిన్ హీరోనే ప్రేమించాలి ఇది సినిమా థర్మం. కావాలంటే పందెం’’ అని పరశురామయ్య చెబుతుంటే, పరంధామయ్య అడ్డు తగిలి ‘‘నేనడిగింది ఈ సినిమాలో ప్రభ పెళ్లి గురించి కాదు. వచ్చే ఏడు రాజ్యలక్ష్మి పెళ్లీడుకొస్తుంది కదా మొగుడెవరంటావు ’’ అని అడిగాడు.

 ఇంటర్ నెట్ ఆన్ చేయగానే ముందు వివాహ ప్రకటనలే స్వాగతం పలుకుతున్నాయి కదా? మన చిన్నప్పుడు పెళ్లిళ్ల పేరయ్యలు చేసే పనిని ఇప్పుడు అవేవో మాట్రిమోనియం డాట్ కాంలట వందల కోట్ల వ్యాపారం చేసేస్తున్నాయి. వివరాలు పంపలేకపోయావా? వేల సంబంధాలు వచ్చి వాలిపోతాయి కదా? అని పరశురామయ్య చెప్పుకొచ్చాడు.
మరో ఏడాది అయితే పెళ్లి కాంట్రాక్టు ముగుస్తుంది కదా అప్పుడు ఈ అమ్మాయికి మొగుడెవరో అని అడుగుతున్నాను అని చిలిపిగా నవ్వుతూ మళ్లీ ప్రశ్నించాడు. 

ఎంటోరా! ఈ మధ్య విడాకులు మరీ ఎక్కువయ్యాయి. చిన్న చిన్న సమస్యలకే విడాకుల వరకు వెళుతున్నారు. కొత్త దేవుడి కన్నా పాత దయ్యం మేలంటారు కదా? విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నా వాళ్లు కలిసుంటారనే నమ్మకం ఏమిటి? అని పరశురామయ్య ప్రశ్నించాడు. పరుశూ నువ్వింకా అర్ధం చేసుకోలేదురా! శ్రీరామునికి ఏటేటా పెళ్లవుతుంది కదా? అలానే రాజ్యలక్ష్మికి ఐదేళ్ల కోసారి పెళ్లి జరపాల్సిందే కదా? ఎలాంటి మొగుడు వస్తాడా? అని ఆలోచిస్తున్నాను. ఐదేళ్ల పెళ్లి అంటే మాటలు కాదు అని పరంధామయ్య నవ్వాడు. 

ఓహో రాజ్యలక్ష్మి పెళ్లి అంటే ఎవరో అమ్మాయి అనుకున్నాను. నువ్వు మాట్లాడుతున్నది ఐదేళ్ల పెళ్లి గురించా అని పరశురామయ్య గట్టిగా నవ్వాడు. ఇంతకూ ఎవరితో పెళ్లవుతుందని నువ్వు అనుకుంటున్నావు? నీ ఎరుకలో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని పరశురామయ్య అదే ధోరణిలో అడిగాడు. లేకేం మూడు నాలుగు సంబంధాలు ఉన్నాయి. వాళ్లకు సర్వ అవలక్షణాలూ ఉన్నాయి. పరంధామయ్య నిరాశ ధ్వనించినట్టుగా చెప్పాడు. 

మా వాడికి మీ రాజ్యలక్ష్మిని కట్టబెట్టండి వీడంత మొనగాడు మరొకడు లేడు అంటూ ఎవరి చానల్‌లో వాళ్లు గోల గోలగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఒక్కో చానల్ ఒక్కో పెళ్లి కొడుకును ప్రమోట్ చేయడమే కాకుండా తమకు పోటీగా ఉన్న పెళ్లి కొడుకు ఎంత దుర్మార్గుడో కథలు కథలుగా వర్ణిస్తున్నారు. ఇవన్నీ చూశాక రాజ్యలక్ష్మికి అసలు పెళ్లి మీదనే విరక్తి కలుగుతుందేమో ననిపిస్తోంది. ఆ ప్రచారం చూడడం కన్నా దూరదర్శన్‌లో పందుల పెంపకం కార్యక్రమం భరించడం ఈజీ అనిపిస్తోంది అని పరశురామయ్య చెప్పాడు. ఇంతకూ మరి ఏం జరుగుతుందని అనుకుంటున్నావ్? అని ఆసక్తిగా అడిగాడు. ఇదిగో ఇప్పటి వరకు వచ్చిన సంబంధాలు ఇలా ఉన్నాయి.
‘‘అబ్బాయి వయసులో ఉన్నవాడే. తండ్రి ఆస్తి భారీగానే కలిసొచ్చింది. మాట మీద నిలబడే వంశం అని చెబుతున్నాడు. రెండు చేతులా సంపాదించాడు. బయటకు వదిల్తే మరింత సంపాదిస్తాడని పూర్తి నమ్మకం ఉంది. కానీ జైలులో ఉన్నాడు. చూస్తూ చూస్తూ జైలుపక్షికి రాజ్యలక్ష్మిని ఎలా కట్టబెడతారు? అదే అసలు సమస్య. 

మరొకరేమో షష్టిపూర్తి దాటిన వయ సు. పెళ్లికి తహతహలాడుతున్నాడు. నా పాతివ్రత్యం గురించి నా మొదటి మొగుడ్ని అడుగు అందట వెనకటికొకావిడ. ఈయనా అంతే తొమ్మిదేళ్లు కాపురం చేసినప్పుడు రాజ్యలక్ష్మిని నేనెంతగానో ప్రేమించాను, రాజ్యలక్ష్మి లేందే క్షణం ఉండలేను అంటున్నాడు. మీరేం డిమాండ్ చేసినా ఒప్పుకుంటాను నమ్మండి అంటున్నాడు. ఆయన మాటలు బాగుంటాయి . మాటలకు ఆచరణకు  అస్సలు సంబంధం ఉండకుండా  జాగ్రత్త పడతాడు . ఆయన మాట అస్సలు నమ్మలేం అదే ఈయనతో వచ్చిన చిక్కు. కాళ్లు బొబ్బలెక్కాయి, నీరసంగా ఉంది, గుండె కొట్టుకుంటోంది అంటూ ఆయన చెబుతున్నవి వింటుంటే నీరసం వచ్చేస్తోంది. రాజ్యలక్ష్మిని కట్టబెడితే జీవితం ఎంత హాయిగా ఉంటుం దో చెప్పాలి కానీ రోగాల జాబితా చెబితే జాలి పుడుతుందేమో కానీ రాజ్యలక్ష్మిని అప్పగించాలని అనిపిస్తుందా?
ఇక ఇప్పుడున్నాయన హై కమాండ్‌నే నమ్ముకున్నాడు. తానెంత మొనగాడో చెప్పుకోవాలి కానీ తల్లి చాటు బిడ్డలా అన్నింటికి హై కమాండ్‌పై ఆధారపడే మొగుడ్ని ఎంత త్వరగా వదిలించుకోవాలని చూస్తుందేమో కానీ మళ్లీ చేసుకోవాలని చూస్తుందా? నాకైతే అనుమానమే. ఇక ఎర్రన్నలిద్దరూ వాళ్ల సిద్ధాంతాలను వాళ్లు అర్ధం చేసుకోవడానికే జీవిత కాలం సరిపోదు ఇక రాజ్యలక్ష్మినేం ఒప్పిస్తారు. ఇక మరొకాయన ఆ మధ్య కమలం పువ్వు పట్టుకుని ప్రేమిస్తున్నానని తిరిగాడు, ఆమ్మాయి ఆయన వైపు చూసే లోగానే సైకిలెక్కి తుర్రుమన్నాడు. పువ్వు సైకిల్ చైన్‌లో పడి ఆయిల్ అంటుకుని ప్రేమకు పనికి రాని పువ్వయింది. ప్రేమకే పనికి రానప్పుడు పెళ్లి దాకా ఏం ఆలోచిస్తాం . ఇంకొకాయనేమో ఒక రాజ్యలక్ష్మిని రెండు ముక్కలు చేయండి, ఒకటి స్వీకరిస్తానంటున్నాడు.

ఇన్ని అవలక్షణాలున్న పెళ్లి కొడుకులను చూస్తుంటే రాజ్యలక్ష్మికి అసలు పెళ్లవుతుందా? అమె భవిష్యత్తు ఏమిటో? తలుచుకుంటేనే దిగులేస్తోంది. ఈ ఏడాదిలో ఏదో అద్భుతం జరిగితే తప్ప లేకపోతే వీరిలోనే ఎవరో ఒకరిని ఇష్టం ఉన్నా లేకున్నా మనువాడలి . పాపం రాజ్య లక్ష్మి .. 

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

రతన్ టాటా-సంతోషం

సంతోషం..కహానీ1


వచ్చే జన్మంటూ ఉంటే నన్ను అర్థం చేసుకునే వాళ్లింట్లో పుట్టించు దేవుడా! -ఇంట్లోవాళ్లకు గట్టిగా వినిపించేట్టుగానే అన్నాడు రవి. రిబాక్ షూ మీద రవికి ఆశ. కొనుక్కుందామంటే ఇంట్లో వాళ్లు పట్టించుకోవడం లేదు.. కోపానికి అదీ కారణం! ఇలాంటి ఇంట్లో పుట్టడం వల్ల తనలాంటి ప్రతిభావంతుడికి సంతోషమనేది లేకుండా పోయిందని మరికొంత కోపం. -‘అరే ఇంజనీరింగ్ చదివే కొడుకు ఎలా ఉండాలి. కాలేజీలో ఒక్కొక్కడు ఎంత స్టయిల్‌గా ఉంటున్నాడు. నేనేమన్నా డబ్బున్నోడి కొడుకులా కారు కొనివ్వమన్నానా? మనకంత సీన్ లేదని తెలుసు. మంచి డ్రెస్సు, షూ అడిగానంతే కదా?’. ఈ మాటలన్నీ స్వగతంగా అంటున్నట్టుగా రవి గట్టిగానే అంటున్నాడు. రవి ఎంత మొత్తుకున్నా తండ్రి మాత్రం అవేమీ పట్టించుకోకుండా టీవీ చానెల్‌ను ఆసక్తిగా చూస్తున్నాడు. తండ్రి కూర్చున్న సోఫా వద్దకు వచ్చి పక్కనే కూడలబడ్డాడు రవి. 


టీవీలో రతన్ టాటాపై ప్రత్యేక కార్యక్రమం వస్తోంది. రతన్ టాటా ఇంట్లో పుట్టే అదృష్టం ఉంటేనా?....’ అంటూ తండ్రికి వినిపించేట్టుగా మళ్లీ అన్నాడు రవి.

దేశంలో సంపన్నతకు టాటా మారుపేరు. సంపన్నత కన్నా టాటా పేరుకే ఎక్కువ ప్రాచుర్యం... యాంకర్ చదువుకుంటూ పోతోంది తెలుగునే ఇంగ్లీష్‌లా. అదృష్టం అంటే టాటాదే కదా? అనుకున్నాడు రవి. ఎంత ఏడ్చినా తండ్రిని ఒప్పించడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చి తానూ వినసాగాడు.

 రతన్ టాటా దాదాపు 50 ఏళ్లపాటు టాటాల సామ్రాజ్యానికి నాయకత్వం వహించారు. ఆ సామ్రాజ్యం విలువ ఐదులక్షల కోట్లు. 75 ఏళ్ల వయసులో రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. సాధారణంగా రిటైర్ అయ్యే వారిలో రేపటి నుంచి ఎలా అనే దిగులు కనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం పాతికేళ్ల యువకుడిగా ఉత్సాహంగా ఉన్నారు. ‘అయినా మనలాంటి కుటుంబరావులకు దిగులు కానీ లక్ష్మీపుత్రుడు ఆయనకేం’ అనుకున్నాడు రవి స్క్రీన్‌మీద చూపు తిప్పకుండానే. -రిటైర్మెంట్ తరువాత ఏం చేయాలనుకుంటున్నారు’ టాటాకు యాంకర్ సంధించిన ప్రశ్న. ‘లైఫ్ బిజీతో చాలా కోరికలు నెరవేర్చుకోలేకపోయాను. ఇప్పుడు వాటి పనిబడతా’ అంటూ చిర్నవ్వుతో చెప్పుకుపోతున్నారు టాటా. 

‘నీకేం బాసూ.. లక్షల కోట్లు. ఏ కోర్కెనైనా క్షణాల్లో నెరవేర్చుకుంటావ్’ రవి మనసు రన్నింగ్ కామెంట్రీ చేస్తోంది. ‘చిన్నప్పుడు పియానో నేర్చుకునే వాడిని. ఏడేళ్ల వయసులోనే బిజీగా ఉండి ఆపేశాను. ఇప్పుడది నేర్చుకోవాలని అనిపిస్తోంది. నా పెట్స్‌కు నేనంటే ఎంతో ప్రేమ. ఇప్పుడిక వాటితో ఆడుకుంటా. లైఫ్ బిజీతో దూరమైపోయిన చిన్న చిన్న సంతోషాలన్నీ ఇప్పుడు తీర్చేసుకుంటా.  నాకిప్పుడు చాలాటైం దొరుకుతుంది’ అంటూ రతన్ టాటా చెప్పుకుపోతుంటే రవికి బుర్ర తిరిగింది. అంతా గమనిస్తున్న తండ్రి గట్టిగా నవ్వేశాడు. ‘సంతోషమంటే రెబాక్ షూ, బ్రాండెడ్ జీన్స్ మాత్రమే కాదురా కుర్రకుంకా. చాలా ఉంటాయ్..’ అంటూ రవి భుజం తట్టాడు.