27, మార్చి 2013, బుధవారం

వర్మ షోలే రీమేక్ ఆగ్ .. చిరంజీవి టిడిపి రీమేక్ ప్రజారాజ్యం.. వై యస్ ఆర్ పాదయాత్ర రీమేక్ చేస్తే ?


చరిత్ర పునరావృతం అవుతుందని చెబుతుంటారు కానీ ఇది అక్షర అబద్ధం. అదెప్పుడూ పునరావృతం కాదు. రీమేక్‌లతో చరిత్రను పునరావృతం చేయాలనే ప్రయత్నం ఇటీవల రాజకీయాల్లో , సినిమాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. షోలే సినిమా మళ్లీ తీసి చరిత్ర సృష్టించాలనుకుంటే ఏమవుతుంది. శివ సినిమాతో కొత్త చరిత్ర సృష్టించిన వర్మ కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, తీస్తే షోలే అబ్బ లాంటి సినిమా తీయాలనుకుని, షోలేను రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు. అమితాబ్‌ను బబ్బర్‌సింగ్‌గా మార్చి ఆగ్ తీశాడు. ఇంత చెత్త సినిమాలో నటించేందుకు నేనెలా ఒప్పుకున్నానో నాకే అర్ధం కావడం లేదని అమితాబ్ అంటే ... మీ సంగతి సరే ఆ సినిమా నేనెలా తీశానో నాకే అర్ధం కావడం లేదని వర్మ బుర్ర గోక్కున్నారు.

 హిట్టయిన షోలే వర్మ రీమేక్‌తో ఆగ్ అయినట్టు, టిడిపిని చిరంజీవి రీమేక్ చేయాలనుకుంటే అది ప్రజారాజ్యం అయింది. ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వస్తే, చిరంజీవి ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాలనుకున్నారు. ప్లాప్ లో చరిత్రను సృష్టించారు. ఎన్టీఆర్ 180కి పైగా సీట్లు గెలిస్తే, చిరంజీవి మొదటి రెండు అంకెలు 18 సీట్లకు పరిమితం అయ్యారు. టిడిపిని రీమేక్ చేయడం ఎన్టీఆర్ వల్లనే సాధ్యం కాలేదు, ఇక చిరంజీవి వల్ల ఏమవుతుంది. 95లో అల్లుడు మామను ఇంటికి పంపించాక, నేను బెబ్బులి పులిని ఓటమిని అంగీకరించను అంటూ హూంకరించి ఎన్టీఆర్ టిడిపి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి చరిత్రను పునరావృతం చేస్తానని ప్రకటించి కొన్ని జిల్లాల్లో పర్యటించారు కూడా బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దిగులుతో మంచం పట్టి బక్కెట్టు తన్నేశారు  . ఎన్టీఆరే టిడిపిని రీమేక్ చేయలేనప్పుడు నేనెలా చేస్తాను అనే ఆలోచన చిరంజీవికి వచ్చి ఉంటే రాజకీయాల్లో ఆయన మెగా ఫ్లాప్‌గా నిలిచే వారు కాదు. మరో రెండు మూడు దశాబ్దాల దాకా ప్రజా రాజ్యంను రీమేక్ చేసేంత సాసహం ఏ నటుడూ చేసే సూచనలు కనిపించడం లేదు. అయినా ఇప్పుడు నెలకో హీరోయిన్ ఏడాదిగో హీరో మారిపోతున్నాడు, రాజకీయం చేసేంత సీన్ ఇప్పటి నటులకు ఉంటుందా? రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది ఒక చరిత్ర. అది ఎప్పటికీ పునరావృతం కాదు.  దాన్నెవరూ రీమేక్ చేయలేరు.


రీమేక్ ఆలోచనలు సినిమాలను కనిపెట్టని కాలం నుంచీ ఉన్నాయి. తాను మాటిచ్చిన త్రిశంకు కోసం విశ్వామిత్రుడు స్వర్గాన్ని రీమేక్ చేయాలనుకుంటాడు. విశ్వామిత్రుడు ఎంత శక్తిసంపన్నుడైనా కావచ్చు. రాజులనందరినీ హతమార్చి ఉండొచ్చు. కానీ ఒరిజినల్ ఒరిజినలే రీమేక్ రీ మేకే.. ఇంద్రుడు పాలిస్తున్న స్వర్గానికి విశ్వామిత్రుడు రీమేక్ చేయాలనుకుంటే అది కాస్తా త్రిశంకు స్వర్గం అయిపోయింది. త్రిశంకు అటు భూమికి ఇటు స్వర్గానికి కాకుండా రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బహుశా ఇదే తొలి రీమేక్ ప్రయత్నం అయి ఉంటుంది.

 నాయకులు మాత్రం గజనీ మహమ్మద్ రికార్డును బద్దలు కొట్టాలని చూస్తూ, రీమేక్‌పై అభిమానం మాత్రం చంపుకోవడం లేదు. రీమేక్‌ల ప్లాప్ రికార్డు సాహిత్యంలో సైతం ఉంది. మొక్కపాటి నరసింహశాస్ర్తీ వారి బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప హాస్య నవలగా మిగిలిపోయింది. మొక్కపాటి నరసింహశాస్ర్తీ అని పరిచయం చేస్తే ఐతే ఏంటీ అని పట్టించుకోని వాళ్లు కూడా బారిష్టర్ పార్వతీశం పాత్రను సృష్టించినాయన అనగానే లేచి నిలబడి గౌరవించే వారట! మొక్కపాటి నరసింహ శాస్ర్తీ కూడా బారిష్టర్ పార్వతీశంను రీమేక్ చేశారు, కానీ అది జనానికి పెద్దగా పట్టలేదు.


అప్పుడెప్పు డో  ఎండా కాలంలో చాలా దూరం నడిచి వైఎస్‌ఆర్ అధికారం హస్తగతం చేసుకుంటే దీన్ని రీమేక్ చేయాలని ఆయన మాజీ మిత్రుడు తెలుగు బాబు, కుమార్తె షర్మిల పరుగు పందెంలో పాల్గొన్నట్టు పోటాపోటీగా నడుస్తున్నారు. అసెంబ్లీలో వైఎస్‌ఆర్ కోసం ఒకవైపుకాంగ్రెస్ వాళ్లు, మరోవైపు వైఎస్‌ఆర్ కాం గ్రెస్ వాళ్లు మాటలతో యుద్ధం చేసుకుంటున్నా రు. ఇది సరిపోదన్నట్టు ఆయన నడకను రీమేక్ చేసి అధికారంలోకి వచ్చేయాలని బాబు తంటా లు పడుతున్నాడు. ముందు విద్యుత్ ఉద్యమం, తరువాత పాదయాత్ర వల్ల వైఎస్‌ఆర్ అధికారంలోకి వస్తే, అవే సీన్లను రీమేక్ చేస్తున్నారు.  చివరకు అసెంబ్లీ నుంచి అప్పుడు వై యస్ ఆర్ ఓల్డ్ యమ యల్ ఏ క్వార్టర్ కు వెళ్లి ఎక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేశారో ఇప్పుడు టిడిపి ఎమ్మేల్లెలు అక్కడే  దీక్ష మొదలు పెట్టారు . అడవిరాముడు  షూటింగ్ ఎక్కడ జరిగిందో అక్కడే అదే సినిమాను  జూనియర్  ఎన్ టి ఆర్ తో రీమేక్ చేస్తే  హిత్తవుతుందా ? రీమేక్ మీద మీకు అసక్తి ఉండొచ్చు కానీ ఓటర్లకు ఉండాలి కదా! వారి అభిరుచులు మారాయి.


దేవదాసు అనగానే అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు వస్తారు. అక్కినేని, సావిత్రి ఆ సినిమాల్లో నటించలేదు. జీవించేశారు. ఆ ఒక్కసినిమా చాలు వారెంత గొప్ప నటులో చెప్పడానికి.
దేవదాసును రీమేక్ చేయాలనుకున్న అక్కినేని.. మరణించిన దేవదాసును మళ్లీ పుట్టించి దేవదాసు మళ్లీ పుట్టాడు అని అక్కినేనితోనే సినిమా తీశారు. ఆ సినిమా వచ్చిన సంగతే చాలా మందికి తెలియదంటే రీమేక్ ఎంత అద్భుతంగా వర్కవుట్ అయిందో అర్ధమయ్యే ఉంటుంది. రీమేక్‌లపై అభిమానం చంపుకోలేక కొంత కాలం తరువాత దాసరి మాయాబజార్‌కు రీమేక్‌ను జనం ముందుకు తీసుకు వచ్చారు. మరో మాయాబజార్ అంటూ, ఇదేమైందంటారా? ఏమో తెలియదు కానీ, తాతామనవడు సినిమా వచ్చి 40 ఏళ్లయిన సందర్భంగా ఆ సినిమాను రీమేక్ చేస్తారా? అని దాసరిని ప్రశ్నించారు. రీమేక్ చేయాలనుకోవడం బావ దారిద్య్రం అని ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఈ మాటల వెనుక ఆయన తీసిన రెండు రీమేక్ సినిమాల ప్రభావం ఉండొచ్చు. లేదా జంజీర్ రీమేక్‌పై కామెంట్ కావచ్చు.


ఎన్టీఆర్, మహేష్‌బాబులు ఒప్పుకుంటే గుండమ్మకథ మళ్లీ తీసేందుకు రామానాయుడు ముందుకొచ్చినట్టు వార్తలొచ్చాయి. అయినా ఈరోజుల్లో గుండమ్మ దొరుకుతుందా? ఎంతైనా ఒరిజినల్ ఒరిజినలే జెరాక్స్ కాపీ జెరాక్స్ కాపీనే. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా...

20, మార్చి 2013, బుధవారం

రాజువయ్యా! త్యాగరాజువయ్యా!

రాజువయ్యా మహరాజు వయ్యా పాట మంద్రంగా వినిపిస్తోంది. మగపెళ్లి వారు, ఆడ పెళ్లి వారికి ఒకే చోట విడిది ఉంటే ఎంత సందడిగా ఉంటుందో అంత ఉత్సాహంగా ఉంది వాతావరణం. అసెంబ్లీ ఆవరణలోని తెలుగు పార్టీ కార్యాలయంలో తెలుగు నేతకు అభినందన సభ ఏర్పాటు చేశారు. రాజువయ్యా మహరాజు వయ్యా పాట వినిపించడంతో అందరి హృదయాలు కొంత భారంగా, మొత్తం మీద వాతావరణం ఉద్వేగభరితంగా ఉంది. అదే సమయంలో అసెంబ్లీ ఆవరణలోనే ఉన్న ఖద్దరు పార్టీ శాసన సభాపక్షం కార్యాలయంలో తీన్‌మార్ పాటలతో కొందరు గెంతులేస్తున్నారు.

 సూర్యకిరణ్ లోనికి ప్రవేశించగానే జరుూ భవా విజరుూ భవా అంటూ పాట వేశా రు. దుర్యోధనుడిలా బొత్స నడుస్తుంటే కర్ణుడు పట్ట్భాషేకానికి బయలు దేరినట్టు కిరణ్ నడుస్తున్నారు.


ఓడిపోతామేమో అనుకున్న యుద్ధంలో ప్రత్యర్థి ఆయుధాన్ని చేతిలో పెట్టి వెళ్లపోవడంతో కిరణ్‌లో ఆనందానికి అంతు లేకుండా పోయింది. శత్రువును జయించిన వాడు వీరుడు. తనను తాను జయించిన వాడిని మహావీరుడంటారు. మరి శత్రువు తనను తానే ఓడించుకుని విజయమాలనే మెడలో వేస్తే?

 అంతటి ఘన విజయం సాధించడంతో కిరణ్ ఊహల్లో తేలిపోతూ ఖద్దర్ కార్యాలయంలో కుర్చీపై కూర్చున్నారు. అభినందన సభకు హాజరు కావాలని తెలుగు పార్టీ వారిని పిలిస్తే తమ కార్యాలయంలో కూడా సరిగ్గా అదే సమయానికి అభినందన సభ ఉండడం వల్ల రాలేకపోతున్నానని, ప్రతినిధి బృందాన్ని పంపిస్తున్నానని తెలుగునేత సందేశాన్ని పంపించారు. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం అన్నట్టు కొందరు సౌహా ద్ర ప్రతినిధులు ఖద్దరు దస్తులతో తెలుగు పార్టీ కార్యాలయంలో అభినందన సభకు హాజరైతే, తెలుగు పార్టీ ప్రతినిధులు ఖద్దరు పార్టీ అభినందన సభకు వెళ్లారు.
***

అధికారపక్ష కిరణుడికి, ప్రతిపక్ష చంద్రుడు చేరువ కావడం 57ఏళ్ల తెలుగు ప్రజాస్వామ్య చరిత్రలో ఇదే తొలిసారి. ఆ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవని రాజకీయ విశే్లషకులు కళ్లు పెద్దవి చేసుకుని చూడసాగారు. అపురూపమైన ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు టీవీల వాళ్లు పోటీ పడసాగారు.
***


తెలుగునేత స్వయం కృషితో ఎదిగిన వారు తన అభినందన సభకు తానే ఏర్పాటు చేసుకుంటారు. తన సన్మాన పత్రాన్ని తానే ఖరారు చేస్తారు. తనను తానే పొగుడుకుంటారు. ఆయ న ఎవరినీ నమ్మరు, ఒక్కోసారి తనను తాను కూడా నమ్మరు. అలాంటి మహానాయకునికి అరుదైన సన్మానం జరుగుతోంది.


కవచ కుండలాలను మాత్రమే దానం చేసిన కర్ణున్ని దాన కర్ణుడన్నారు. పావురం అంత బరువు తొడ మాంసాన్ని కోసి డేగకు ఇచ్చిన  శిబి చక్రవర్తిని మహాదాత అన్నారు. మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అని ప్రశ్నిస్తే, తన తలనే చూపిన బలి చక్రవర్తి కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది. ఇంత చిన్న చిన్న త్యాగాలకే వారికి అంతటి గుర్తింపు లభిస్తే, తన ప్రత్యర్థి కోసం పార్టీనే త్యాగం చేసిన మహానేతను ఏమందాం అని వక్తలు అభినందనలతో ముంచెత్తు తున్నారు.
చాలా కాలం తరువాత సంతోషంగా ఉన్న తెలుగునేత ఒకవైపు పొగడ్తలు వింటూనే ఊహల్లో తేలిపోతున్నారు. ఒబామా అమెరికా అధ్యక్షునిగా రంగంలో ఉన్నప్పుడు అతనితో పోటీ పడిన హిల్లరీ క్లింటన్ ఆ తరువాత ఒబామా ప్రభుత్వంలోనే విదేశాంగ మంత్రి అయ్యారు. మన తెలుగు రాజకీయాలను అమెరికా స్థాయికి తీసుకువెళ్తే తప్పేమిటి? ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు. ప్రతిభా వంతులకు ప్రభుత్వంలో చోటు ఉండాలి ఇది తప్పా? అనే ప్రశ్న వినిపించింది. ఆ ప్రశ్న ఎవరైనా వేశారా? తన లో నుంచే వచ్చిందో తెలుగునేతకు అర్ధం కాలే దు.


 కాబట్టి మన నేతకు ఈ శతాబ్దపు త్యాగరాజు అవార్డు ఇవ్వాలని ఒకరు డిమాండ్ చేశా రు. అంతా చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపారు.
***


కిరణుడిని ఆకాశానికెత్తుతూ ఒకరి తరువాత ఒకరు మాట్లాడసాగారు. పచ్చ చొక్కా నేత ఒకరు లేచి.. దగ్గరకు వచ్చే వారిని దహించి వేయడం ఆకాశంలోని సూర్యుని లక్షణం. తన వద్దకు వచ్చే శత్రుపక్షం వారిని సైతం అక్కున చేర్చుకుని తనలో కలుపుకొని పోవడం ఈ కిరణుడి లక్షణం. వాలితో ఎవరు యుద్ధం చేసినా వారిలోని సగం బలం వాలిలో కలిసిపోయేదట! కానీ కిరణుడితో యుద్ధం చేయాల్సిన  వారి మొత్తం బలం కిరణుడిలో కలిసిపోయింది. వాలి కన్నా శక్తివంతుడు మన కిరణుడు అంటూ అభినందనలతో ముంచెత్తితే కిరణ్ ముసిముసి నవ్వులతో వినసాగారు. ఎంతో కాలం నుంచి ఖద్దరు ధరించే మా కన్నా మించి పొగడడం మీకు ధర్మం కాదు అని వెనక బెంచిలో ఉన్న అసంతృప్తి వాదులు కొందరు అరిచారు. 

పొగడ్తలు వింటూ కిరణ్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు. స్పీకర్ ఎన్నిక సమయంలో సభా నేత, ప్రతిపక్ష నేత స్పీకర్‌ను చెయిర్ వరకు తోడ్కొని వెళ్లడం ఆనవాయితీ. ఆ గౌరవం దక్కని ఏకైక స్పీకర్ కిరణ్. ప్రతిపక్ష నేత కిరణ్‌తో పాటు స్పీకర్ చెయిర్ వరకు వెళ్లడానికి ససేమిరా అన్నారు. మర్యాద పూర్వకంగా తనతో పదడుగులు వేయడానికే ఇష్టపడలేదని ప్రతిపక్ష నేత పట్ల వ్యతిరేకత పెంచుకున్నాను. కానీ ఇంకా 12  నెలల పాటు నేను సిఎం కుర్చీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి ఇంత త్యాగం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. థ్యాంక్స్ తెలుగు నేత థ్యాంక్స్ .. నీ మేలు మరిచిపోలేను అని కిరణ్ చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ మనసులోనే అపద్భాందవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. హే భగవాన్  నన్ను ఆదుకోవడానికినువ్వు తెలుగు నేత రూపంలో వచ్చావా? అని దేవున్ని మొక్కుకున్నారు.
****
మిత్రుని సహకారంతో ఆ విధంగా కిరణుడు పూర్తి కాలం రాజ్యాన్ని పాలించి చరితార్థుడు అయ్యారు.

 రాజ నీతి : నీ  పక్కనున్న వాడు  పోటు  పొడవాలని చూస్తే  నీ  అదృష్టం బాగుంటే నీ  ప్రత్యర్ధి నీకు రక్షణ కవచంగా నిలువ వచ్చు .

15, మార్చి 2013, శుక్రవారం

వందేళ్లలో మనమెక్కడ?.. రామారావు, కత్తి కాంతారావు , అక్కినేని .. అలకమానవే అని శ్రీకృష్ణునితో బతిమాలించుకున్న సత్యభామ (జమున) కళ్లతోనే నటించిన సావిత్రి, గుండమ్మ, గంటన్నలు , సీతమ్మగా జీవించిన అంజలి తెలుగులో తప్ప ఏ భాషలో నైనా ఉన్నారా ?

సరిగ్గా వందేళ్ల క్రితం మన దేశంలో తొలి చలన చిత్రాన్ని ప్రదర్శించారు. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పాల్కే తొలి చిత్రం రాజా హరిశ్చంద్ర సినిమా మే 3, 1913లో విడుదలైంది. ఈ సినిమా విడుదల సమయంలో భవిష్యత్తులో మన దేశంలో సినిమా ఇంతగా విజృంభిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. సినిమా మనిషి జీవితంలో ఇంతగా పెనవేసుకుపోతుందని ఊహించి ఉండరు. మనుషులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు అని ప్రశ్నిస్తే, సినిమాలను ప్రేమించే వారు, సినిమా అంటే చిరాకు పడేవారు, సినిమా అంటే చిన్న చూపు చూసే వారు, సినిమా అంటే పిచ్చి అభిమానం చూపేవారు. ఇంకా ఇలాంటివి ఎన్నయినా చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా సగటు భారతీయుడిపై బాగా ప్రభావం చూపుతోంది. 

వందేళ్లలో ప్రపంచం ఎంతో మారిపోయింది, అరచేతిలోనే ప్రపంచాన్ని ఇమిడ్చే టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీని సైతం సినిమా తనలో జీర్ణం చేసుకుని అభిమానులకు మరింతగా చేరువైంది కానీ కాల గర్భంలో కలిసిపోలేదు. ఈ రెండు మూడు దశాబ్దాల్లో టెక్నాలజీ ఊహించని స్థాయిలో పెరిగింది. ఇది సినిమా నాణ్యతను, సినిమా అభిమానులను మరింతగా పెంచింది సినిమాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని తేల్చి చెప్పింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ , సినిమా సంస్థలు కలిసి వందేళ్ల భారతీయ సినిమా పండగను ఘనంగానే నిర్వహిస్తున్నారు. కానీ భారతీయ సినిమాకు వందేళ్ల పండుగనా, లేక హిందీ సినిమాకు వందేళ్ల పండగనా? అనే సందేహం వచ్చే విధంగా సంబరాలు సాగుతున్నాయి. 

హిందీ తరువాత అత్యధిక సినిమాలు నిర్మించేది తెలుగు సినిమా రంగమే, ఎంతో మంది తెలుగు వాళ్లు గొప్ప గొప్ప తెలుగు సినిమాలను నిర్మించారు. దేశంలో ఏటా దాదాపు వెయ్యి సినిమాలు విడుదల అవుతున్నాయి. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంత అత్యధిక సంఖ్యలో సినిమాల నిర్మాణం జరగడం లేదు. హిందీ తరువాత ప్రాంతీయ భాషా చిత్రాల్లో తెలుగు సినిమాల సంఖ్యనే ఎక్కువగా ఉంది. వందేళ్ల సినిమా పండగపై జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రచారంలో తెలుగు సినిమాల అసలు కనిపించడం లేదు, కొన్ని చోట్ల చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వందేళ్ల సినిమాలో సగం రాజ్‌కపూర్, సగం షోలే సినిమా పంచేసుకున్నట్టుగా ఉంది కొన్ని చోట్ల మాత్రం. సందేహం లేదు. వందేళ్ల సినిమా చరిత్రలో షోలే సృష్టించిన రికార్డు అసామాన్యమైనది. అదే విధంగా రాజ్‌కపూర్ గొప్ప నటుడు. కాదనేవారు ఎవరూ లేరు. కానీ తెలుగులో సైతం గొప్ప నటులున్నారు.

 భారతీయ సినిమా చరిత్రలో వారి పాత్ర తక్కువేమీ కాదు. భారతీయ సినిమాపై తెలుగు వారు వేసిన ముద్ర, తెలుగు సినిమాలు చూపిన ప్రభావం తక్కువేమీ కాదు. 1950 తరువాత 1970కి ముందు తెలుగు సినిమా రంగానికి స్వర్ణయుగం లాంటిది. ఈ కాలంలో తెలుగు సినిమాల ప్రభావం హిందీ రంగంపై గణనీయంగానే ఉంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు. ఇదిగో ఇలా ఉంటారు అని రవివర్మ బొమ్మలు వేసి చూపిస్తే, ఎన్టీఆర్ తెరపై అలా జీవించి చూపించారు. రామానంద్ సాగర్ రామాయణం సీరియల్ టీవిలో ప్రసారం అయ్యే రోజుల్లో దాదాపుగా రోడ్లు నిర్మాణుష్యంగా మారేవి. అందరూ ఇంటికే పరిమితం అయ్యేవారు. అలాంటి రామానంద్ సాగర్ సైతం శ్రీరాముడి వేషధారణ కోసం, రూపు రేఖల కోసం, ఆభరణాల కోసం ఆధారపడింది తెలుగు వారిపైనే. ఎన్టీఆర్ శ్రీరామునికి నటించిన పలు చిత్రాలను చూసి వాళ్లు శ్రీరామున్ని తీర్చిదిద్దారు. పౌరాణిక సినిమా పాత్రల కోసం హిందీ వాళ్లు సైతం ఎక్కువగా తెలుగు పౌరాణిక సినిమాలపైనే ఆధారపడ్డారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తెరపై ఎలా ఉంటాడో భారతీయులకు చూపింది ఎన్టీఆర్. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో తెలుగు వారి ఒరవడి భారతీయ సినిమాలపై చూపిన ప్రభావం తక్కువ కాదు. దేవదాసుగా తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, హిందీలో దిలిప్‌కుమార్ జీవించారు. నాకన్నా దేవదాసుగా మీరే బాగా నటించారు అని దిలిప్ కుమార్ అక్కినేనిని అభినందించారు.

 కత్తి కాంతారావు హిందీ వారికున్నారా? అల్లూరి సీతారామారాజుగా కృష్ణ నటన హిందీ వారికి కనిపించలేదా? అలకమానవే అని శ్రీకృష్ణునితో బతిమాలించుకున్న సత్యభామ (జమున) కళ్లతోనే నటించిన సావిత్రి, గుండమ్మ (సూర్యకాంతం) గంటన్నలు (రమణారెడ్డి) సీతమ్మగా పాత్రలో జీవించిన అంజలి తెలుగు సినిమా రంగంలో తప్ప ఎక్కడున్నారు. ఒక్క పాత్రతో నిజంగానే భక్తులను తయారు చేసిన నాగయ్య మనవాడే కదా! తెలుగు సినిమాల కన్నా హిందీ సినిమాల మార్కెట్ విస్తృతి ఎక్కువ కావచ్చు కానీ తెలుగు సినిమా రంగానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలను నిర్మించిన రామానాయుడు తెలుగువారే. మిస్సమ్మ, మిస్‌మేరీగా హిందీ వారిని అకట్టుకుంది. ఐదారు దశాబ్దాల క్రితమే విజయవంతమైన పలు తెలుగు సినిమాలు హిందీలో పునర్నిర్మించారు. భారతీయ సినిమా వందేళ్ల పండగ జరుపుకుంటున్నప్పుడు హిందీకే పరిమితం కాకుండా మొత్తం భారతీయ సినిమాలకు తగు స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది.

 ఆస్కార్ అవార్డుల్లో మనకు అన్యాయం జరుగుతుందని హిందీ సినిమా రంగం బాధపడుతుంది. జాతీయ అవార్డుల్లో తెలుగు వారి పట్ల చిన్నచూపు అని తెలుగు సినిమా రంగం బాధపడుతుంది. తెలుగు సినిమా రంగంలో తెలంగాణ ప్రాంతానికి తగు ప్రాధాన్యత లభించడం లేదనే విమర్శ ఉంటుంది. ఇదేమీ కొత్త కాదు. కానీ కనీసం ప్రభుత్వ పరంగా నిర్వహించే వందేళ్ల పండగలోనైనా ఇలాంటి వివక్షతకు అవకాశం లేకుండా చూడాలి. ఇండియన్ సినిమా 100 ఇయర్స్ పేరుతో చివరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ వారి వైబ్‌సైట్‌లో 11 సినిమాల పోస్టర్లు ప్రదర్శిస్తే, ఒక్క తెలుగు పోస్టర్ కూడా లేదు. పలు జాతీయ చానల్స్, మీడియాల్లో వందేళ్ల పండగపై వస్తున్న వ్యాసాలు చూస్తుంటే వీరికి తెలుగు సినిమాలంటే చిన్న చూపా? లేక తెలుగు సినిమాల గురించి అస్సలు తెలియదా? అనే సందేహం వస్తుంది. 

వందేళ్లలో భారతీయ సినిమాపై తీవ్రమైన ప్రభావం చూపిన వారి గురించి ప్రస్తావిస్తూ సిఎన్‌ఎన్ ఐబిఎన్ చానల్ తెలుగు నుంచి కేవలం చిరంజీవిని ప్రస్తావించింది. చిరంజీవి సినిమాలు సూపర్ హిట్టయ్యాయి అందులో సందేహం లేదు. కానీ తెలుగు సినిమా అంటే గుర్తుకు వచ్చేది చిరంజీవి మాత్రమేనా? సిఎన్‌ఎన్ ఐబిఎన్ వందేళ్ల భారతీయ సినిమాపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేసినప్పుడు ఒక్క చిరంజీవిని మాత్రమే గుర్తుంచుకున్నారు. తెలుగులో మహామహానటులు ఎంతో మందిని మరిచిపోయారు. 

చిత్రంగా అదే సిఎన్‌ఎన్ ఐబిఎన్ వాళ్లు వందేళ్ల భారతీయ సినిమా రంగంలో ప్రముఖ నటులపై ప్రజలతో సర్వే నిర్వహించినప్పుడు ఎన్టీఆర్ మొదటి స్థానంలో నిలిచారు. ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రిలను జాతీయ చానల్స్, మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ వారికే పట్టం కడుతున్నారని ఆ సర్వేలో తేలింది. వందేళ్ల సినిమా పండగ హిందీ పెత్తనంతో ఏదో ఒక ప్రాంతానికి పరిమితం చేయవద్దు. అన్ని భాషల్లోని అద్భుమైన సినిమాలు, నటులను గుర్తు చేసుకునే విధంగా ఈ పండగ సాగాలి. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ పండగ జరగాలి. ఒక ప్రాంతంలోని గొప్ప నటులు, గొప్ప సినిమాలు ఇతర ప్రాంతాల వారికి తెలిసే విధంగా పండగ జరగాలి. హిందీ తరువాత తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, మరాఠీ, ఒరియా బెంగాలీ, గుజరాత్, భోజ్‌పూరి భాషల్లో సినిమాల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే హాలీవుడ్ సినిమాలు భారతీయ సినిమాలను పెద్దగా ప్రభావితం చేయలేదు. కానీ ప్రాంతీయ భాషా చిత్రాలు హిందీ సినిమాను బాగా ప్రభావితం చేశాయి, అదే విధంగా హిందీ సినిమా రంగం సైతం అంతో ఇంతో భారతీయ భాషా చిత్రాలను ప్రభావితం చేశాయి. 

1960 ప్రాంతంలో కుటుంబ తెలుగు కుటుంబ కథా చిత్రాలు హిందీ సినిమా రంగాన్ని బాగా ప్రభావితం చేయగా, ఇటీవల కాలంలో తమిళ సినిమా రంగంలోని ప్రయోగాలు హిందీతో పాటు ఇతర భాషా చిత్రాలపై ప్రభావం చూపుతున్నాయి. అపరిచితుడు, చంద్రముఖి లాంటి సినిమాలు హిందీని సైతం దునే్నశాయి. రజనీకాంత్, కమల్‌హాసన్ లాంటి వారి ప్రయోగాలు అన్ని భాషల వారిని అకట్టుకుంటున్నాయి. ఇప్పటికీ భారతీయ సినిమా ప్రధాన లక్ష్యం ప్రేక్షకులకు వినోదం కలిగించడమే. భారతీయులు ఇప్పటికీ వినోదంపై ఎక్కువగా ఆధారపడుతున్నది సినిమాలపైనే. మూకీ సినిమాల నుంచి బ్లాక్ అండ్ వైట్ 3 డి వరకు మన సినిమాల ప్రస్ధానం జరిగింది. ఇంకెన్ని మార్పులు వస్తాయో కానీ సినిమాకు జీవం మాత్రం ప్రేక్షకులకు వినోదం కలిగించడమే. అంతర్జాతీయ స్థాయిలో మనకు అవార్డులు దక్కడం లేదే అనే విమర్శ ఒకవైపు ఉంటుంది. కానీ అవార్డుల సినిమాలు వేరు వినోదం పంచే సినిమాలు వేరు, మాకు కావలసింది వినోదం కానీ అవార్డులు సంపాదించే సినిమాలు కాదు అని తమ ఆదరణ ద్వారా ప్రేక్షకులు పదే పదే చెబుతూనే ఉన్నారు. అందుకే ఎవరెన్ని మాట్లాడినా, విమర్శలు చేసినా ఏ భాషలోనైనా ఇప్పటికీ వినోద ప్రధానమైన సినిమాలే ఆ భాషాలో సినిమా రంగాన్ని బతికిస్తున్నాయి. రోమాన్స్, కామెడీ, మానవ సంబంధాలు భారతీయ సినిమాకు ముడి సరుకు. అది షోలే కావచ్చు, శ్రీ420, ఆవారా? మిస్సమ్మ, రాముడు- భీముడు కావచ్చు, నిన్న మొన్నటి పోకిరీ కావచ్చు. హిందీలో అయినా, ప్రాంతీయ భాషల్లో అయినా ప్రారంభంలో అన్నీ పౌరాణిక సినిమాలే వచ్చాయి. 

స్వాతంత్య్రం తరువాత సినిమా రంగంలో వేగంగా మార్పులు జరిగాయి. ప్రధానంగా 60-70 ప్రాంతంలో కుటుంబ కథా చిత్రాల హవా సాగింది. ఇప్పటికీ మనం హిందీలో అయినా తెలుగులో అయినా గొప్పగా చెప్పుకునే సినిమాలో ఈ కాలంలోనే వచ్చాయి. 70 నుంచి పరిస్థితి మారింది. అభిరుచి కన్నా ఫక్తు వ్యాపారం కోసం సినిమా రంగంలోకి ప్రవేశించిన కంపెనీలు సినిమాలపై తమదైన ముద్ర వేశాయి. అప్పటి వరకు చందమామ చక్రపాణి రెడ్డిల శకం నడవగా, ఆ తరువాత కాలం మారింది. హిందీలో 70ల తరువాత అమితాబ్ శకం నడిచింది. యంగ్రీయంగ్‌మెన్‌గా అమితాబ్ సంచలనం సృష్టించారు. దీవార్, జంజీర్ వంటి మసాలా కథలు పెను సంచలనం సృష్టించాయి. ఇక 90ల ప్రాంతంలో రొమాన్స్ యుగం నడిచింది. ఇప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు ప్రేక్షకుల నాడిని అంతు పట్టని విధంగా సినిమా రంగాన్ని ఆందోళనలో పడేసింది. 90 తరువాత క్రమంగా అభిరుచి గల నిర్మాతలు పక్కకు తప్పుకోసాగారు. సినిమా అనేది జూదంగా మారింది. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు తప్పుకోవడం సహజమే. మారిన పరిస్థితుల్లో మర్యాదకరంగా తప్పుకోవడమే మంచిదని నిర్మాతలు, దర్శకులు క్రమంగా పక్కకు తప్పుకున్నారు. ఈ రోజుల్లో సినిమా రంగం పరిస్థితిని చూసి దాసరి నారాయణ రావు లాంటి ప్రముఖ దర్శకులే ఆందోళన చెందుతూ ఈ రోజుల్లో అయితే సినిమాలు తీయడం తన వంటి వారి వల్ల కూడా కాదని ఒక సభలో చెప్పారు. 

ఎలాంటి తుఫాను అయినా ఎక్కువ రోజులు ఉండదు. పరిస్థితులు సద్దు మణుగుతాయి, మళ్లీ ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ప్రశాంత వాతావరణం కోసం ఎదురు చూడాలి. మంచి వాతావరణం ఏర్పడుతుంది. మంచి సినిమాలు రావాలని కోరుకుందాం, వస్తాయని ఆశిద్దాం.

13, మార్చి 2013, బుధవారం

మన నేతలు 150 ఏళ్ళు బతికితే ..?

ఈ సారి మన గెలుపును ఎవరూ ఆపలేరు అంటూ తెలుగు పత్రికను గాలిలో ఊపుతూ పరిగెత్తుకొచ్చాడు చలమయ్య. ఎండ మావులను నమ్ముకుని పరిగెత్తడం అంటే ఇదే. వాళ్లు ఎప్పుడూ మన గెలుపు ఖాయం అని రాస్తుంటారు. మనకేమో డిపాజిట్లు కూడా దక్కడం లేదు. గోడకేసిన సున్నం మీరు కట్టిన డిపాజిట్ తిరిగి రాదు ఎందుకోయ్ ఈ అర్భాటం అని మొన్న మన ప్రత్యర్థి పార్టీ వాళ్లు అంటే కళ్లలో నీళ్ళొచ్చాయంటే నమ్ము అని రమణయ్య అన్నాడు. మన పార్టీ రాయించే వార్తలు మనం నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి. నేను చెబుతున్నది దాని గురించి కాదు ఇటు చూడూ అని పత్రికలో ఒక వార్త చూపించాడు.


‘ఇక మనిషి 150 సంవత్సరాల పాటు జీవించ వచ్చు. శరీరంలో వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసే ఔషధాలను ఆస్ట్రేలియా శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. దీంతో ఇక వార్ధక్యాన్ని అడ్డుకోవచ్చు, మనిషి 150 ఏళ్ల పాటు జీవించ వచ్చు’ ఇదీ ఆ వార్త సారాంశం.
ఈసారి అధికారంలోకి రాకపోతే మన పని ఐపోయినట్టేనని అంతా అనుకుంటుంటే 150 ఏళ్ల వరకు అధికారం కోసం వేచి చూడవచ్చునంటావా? అని రమణయ్య చిరాగ్గా అడిగాడు.
‘‘మనం చిన్న నాయకులం మనకు ఆలోచన ఉండాలి కానీ ఆవేశం కాదు. అసెంబ్లీని శాసించే నాయకులకైతే ఆవేశం కావాలి కానీ గ్రామం మేలు కోరే మనకు ఆవేశం ఎందుకూ’’ అంటూ చలమయ్య కాసింత ఆవేశంగానే చెప్పి జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ దెబ్బతో మన అభిమాన పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది. అడిగిన వారికి అడగని వారికి ఇప్పటికే ఎన్నో ఉచిత హామీలు ఇచ్చేశాం కాదు ఎన్నికల ముందు వజ్రాయుధం లాంటి ఒకే ఒక ఉచిత హామీ ఇచ్చేశామంటే మనకు తిరుగుండదు. అన్నవదిలిన బాణం అయినా, కెసిఆర్ వదిలిన తెలంగాణ బాణం అయినా మన ఉచిత హామీ ముందు బలాదూర్ కావలసిందే! అని చలమయ్య ధీమాగా పలికాడు.


ఏ రోగం వచ్చినా కార్పొరేట్ చికిత్స ఫ్రీ, చావు వరకు వెళ్లిన వాళ్లకు ఈ స్కీమ్‌తో మళ్లీ బతుకు లభించిందనే కదా? మన పార్టీని ఓడించి,మన ప్రత్యర్థి పార్టీని గెలిపించారు. అలాంటిది మనిషిని 150 ఏళ్ల పాటు బతికించే ఔషధాలు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చామనుకో, ఆ మందు తిన్న వాళ్లు మన వల్ల అదనంగా వచ్చిన ఆ జీవితంతో కనీసం డజను ఎన్నికల్లో మన పార్టీకే ఓటు వేస్తారు. ఎలా ఉంది ఐడియా అని అంటూ చలమయ్య అడిగాడు. అదిరిందయ్య చలమయ్యా! వెంటనే పార్టీ సిఇఓకు ఫోన్ చేసి ఐడియా చెప్పు అధికారం మనదే ఖాయం అని రమణయ్య వెన్నుతట్టారు.


ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే వచ్చే ఎన్నికల కోసం సన్నద్ధం అయ్యే మన నాయకులు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే సమయంలో ప్రతి అంశాన్ని రాజకీయంగా చూడకుండా ఉంటారా? మనిషి 150 ఏళ్లపాటు బతికించే ఔషధానికి సంబంధించిన వార్త నాయకులందరి కళ్లలో పడింది. దానిపై వాళ్లు హామీలు కురిపించసాగారు.


***
నేను జగనన్న వదిలిన బాణాన్ని చెబుతున్నాను నమ్మండి. జగనన్న బయటకు వస్తారు, రామన్న రాజ్యం తెస్తారు. మీ అందరితో తానే స్వయంగా ఆ ఔషధాన్ని తినిపించాలని జగనన్న తహతహలాడుతున్నారు. జగనన్న అధికారంలోకి రాగానే మనిషి 150 ఏళ్లపాటు జీవించే ఔషధం ఉచిత పంపిణీ ఫైలుపైనే తొలి సంతకం చేస్తారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఇంటింటికి 150 ఏళ్ల పాటు బతికించే ఔషధం అందజేస్తాం అని జగనన్న వదిలిన బాణం ప్రకటించారు.
***


మా అబ్బాయి నగదు బదిలీ గురించి పరిశోధిస్తున్న సమయంలో ఈ ఔషధం గురించి తెలిసొచ్చింది. నిజానికి ఈ మందు కనిపెట్టింది మా అబ్బాయే. ప్రపంచ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియా వారికి అవకాశం ఇచ్చాం. నాకు మరో చాన్స్ ఇవ్వండి నేను మిమ్మల్ని 150 ఏళ్ల పాటు బతికిస్తాను. బ్రదర్ సైలెన్స్ ఎవరో అక్కడ కామెంట్ చేస్తున్నారు నాకు అన్నీ వినబడుతున్నాయి. తొమ్మిదేళ్లే భరించలేకపోయాం ఇక 150 ఏళ్లు భరించడం మా వల్ల కాదు అని మన మంటే గిట్టని వాళ్లు అరుస్తున్నారు. మీ అరుపులకు నేను భయపడేది లేదు. 150 ఎళ్ల తరువాత మరో 150 ఏళ్లు బతికే ఔషధాలు కనిపెడతాం మీ అంతు చూస్తాం అంటూ నాయకుడు ఘీంకరించాడు.
***

ఆ మందు దేశంలోకి రాకుండా చూడాలని సమైక్యంగా ఉద్యమిస్తామని మంత్రిగోపాల్ ప్రకటించారు. ఆ మందు దేశంలోకి వస్తే అది విభజన వాదుల చేతిలో పడుతుందని, మరో వందేళ్లపాటైనా విభజన కోసం వాళ్లు ఉద్యమించే ప్రమాదం ఉందని, విస్తృతమైన జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ మందు రాకుండా చూడాలని భారీ జాతీయ పతాకాలను భుజాన మోస్తూ పరుగులు తీస్తూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు.
***

ఆరవై ఏళ్లు నిండకుండానే 59వ ఏటనే పెళ్లి చేసుకున్నందుకు ఒక బాల్య జంటపై పోలీసులు కేసు పెట్టారు. ప్రముఖ హీరోయిన్ 82వ సారి తన 18వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. తనకింకా నటనా దాహం తీరలేదని, పెళ్లి వయసు రాలేదని మీడియాకు తెలిపారు. వచ్చే జనవరి 3న సంచల ప్రకటన చేయనున్నట్టు సచిన్ ప్రకటించారు. ఆ రోజు ఆయన 134వ పుట్టిన రోజు.. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
***
129 సంవత్సరాల  నుండి పార్టీ జెండా మోస్తున్న తనకు పార్టీ లో పదవులు ఇవ్వడం లేదని పార్టీ కార్య కర్త టవర్ ఎక్కి   పదవి ఇస్తారా ?  చావ  మంటారా అని ప్రశ్నిస్తున్నారు . 

 వందేళ్ళ నుంచి ప్రసారం అవుతున్న రుతు రాగాలు సిరియల్ హిరో తన 137వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు .. నిన్న మొన్ననే సిరియల్ ప్రారంభం అయినట్టుగా ఉందని, మరో వందేళ్ళు ప్రసారం కావాలని కోరుకుంటూ అప్పటి వరకు   తానే  సిరియల్ లో హీరోగా ఉంటానని ధీమా వ్యక్తం  చేశారు . 


***
దబేల్‌మని మంచం నుంచి కింద పడ్డ సురేష్ చేతిలోని పత్రిక వైపు చూశాడు. మనిషిని 150 ఏళ్లపాటు బతికించే ఔషధాన్ని శాస్తవ్రేత్తలు కనిపెట్టారనే వార్త అది. ఈ మందు అందుబాటులోకి వస్తే ఆనే ఆలోచనల్తో నిద్రలోకి జారుకున్న సురేష్ లేచాక ఆలోచనల్లో పడ్డాడు. వందేళ్ల జీవితంలోనే ఇన్ని కష్టాలు ఇంకా 150 ఏళ్ల జీవితం మనిషికి వరమా? శాపమా? అనే ఆలోచనలో పడ్డాడు.

8, మార్చి 2013, శుక్రవారం

స్టార్ కమెడియన్ కస్తూరికి వందేళ్ళు .. అనాధలా ముగిసిన కుభేరుని జీవితం


ఆయన తొలి స్టార్ కమెడియన్. అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారితో ఆరవై ఏళ్ల క్రితమే సినిమా తీశారు. అప్పుడే విదేశీ కార్లు ఉపయోగించారు. అయన కనిపిస్తే చాలు జనం పరవశించేవారు. ఆయన నటిస్తే సినిమా హిట్టయ్యేది. అలాంటి గొప్ప నటుని ముగింపు దశ ఎలా ఉంటుంది? ఒకటి రెండు స్టూడియోలు, రెండు మూడు తరాల వారుసులు హీరోలుగా పరిచయం చేసే స్థాయిలో ఉంటుంది కదూ? కానీ అలా జరగలేదు. ఆయన జీవితం అనాధలా ముగియగా, ఆయన కుటుంబం ఏమైందో, వారసులు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు.
రైల్వే స్టేషన్‌లో మరణిస్తే, కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి మూడు రోజుల తరువాత గమ్యానికి చేర్చారు. ఆయనే కస్తూరి శివరావు.
ఆయన జీవితం విషాదాంత ముగింపు సినిమా.

తెలుగు సినిమా రంగం సైతం మన కస్తూరిని గుర్తుపెట్టుకోలేదు. ఆయనకో స్టూడియో లేదు, ఆయన కుమారులు, మనవళ్లు హీరోలు కాదు అలాంటప్పుడు ఆయన గుర్తుండక పోవడం సహజమే. వాస్తవిక జీవితంలో సినిమా కథను మించిన మలుపులు ఉంటాయని కస్తూరి శివరావు జీవితం సినిమా రంగంలోని వారికి పాఠాలు చెప్పింది. ఆయన నటన తెలుగు సినిమా హాస్యనటులకు గైడ్ లా ఉపయోగపడింది. ఆయన జీవితం సినిమా రంగంలో ఉన్న వాళ్లకు ఆర్థిక వ్యవహారాల్లో పెద్దబాలశిక్షలా పాఠాలు బోధించింది.
ఎంత గొప్ప నటుడైనా ఆర్థిక వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహిస్తే జీవితం కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది అని సినిమా ప్రపంచానికి చాటి చెప్పింది కస్తూరి శివరావు జీవితం.
మార్చి 6,1913న కాకినాడలో జన్మించిన కస్తూరి శివరావు సినిమా రంగంలో రాజభోగం అనుభవించారు. మూకీ చిత్రాల నుంచే సినిమా రంగంలో ఉన్న ఆయన జీవితం అంతిమ దశ మాత్రం బాధాకరంగా ముగిసింది.
నీ యంకమ్మ... ఎన్న చాట.. ఇలా మన హాస్యనటులు ఏదో ఒక ఊతపదాన్ని ఉపయోగిస్తుంటారు. దీనికి శ్రీకారం చుట్టింది కస్తూరి శివరావు 1949లో వచ్చిన గుణసుందరి కథ సినిమాలోనే ఆయన గిడిగిడి అంటూ ఊతపదం ఉపయోగించారు. అంటే తెలుగు సినిమా ప్రారంభ కాలంలోనే హాస్యనటులకు ఊతపదాలను ఖరారు చేసిన నటుడు ఆయన. గిడిగిడి అంటూ ఆయన చేసిన చమత్కారం ఆ తరం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. గిడిగిడి అంటే నమస్కారం అని అర్ధం. ఏదో భాషలో కాదు మన పూర్వీకులే మరిచిపోయిన మన తెలుగులోనే గిడిగిడి అంటే నమస్కారం అని అర్ధం. హాస్యనటులను హీరోలుగా ఈ మధ్య చాలా సినిమాలే వచ్చాయి. కొంత మంది హాస్యనటులు సినిమాలను కూడా నిర్మించారు. దర్శకత్వం వహించారు. అయితే వీటన్నిటికీ 1950 ప్రాంతంలోనే కస్తూరి శివరావు శ్రీకారం చుట్టారు.

 తొలి నాళ్లలో మూకీ సినిమాలకు కథను చెప్పడానికి వ్యాఖ్యాతలు ఉండేవాళ్లు. అంటే ఇప్పుడు క్రికెట్ కామెంటరీ చెప్పినట్టు అన్న మాట! ప్రతి సినిమా హాళ్లలో ఇలాంటి కామెంటేటర్స్ ఉండేవాళ్లు. కొన్ని సార్లు సినిమా కన్నా వీళ్లు చెప్పే మాటలే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునేవి. అలా సినిమాకు వ్యాఖ్యానం చేసేవారు కస్తూరి శివరావు. పలానా హీరో నటించిన సినిమా అని ప్రచారం చేసినట్టుగా ఈ సినిమాకు మా సినిమా హాళ్లో కస్తూరి శివరావు వ్యాఖ్యానం అని చెబితే చాలు జనం విరగబడేవారట! చమత్కారంగా ఆయన వ్యాఖ్యానం చెప్పేవారు. ఈ చమత్కార శైలే తరువాత ఆయన్ని సినిమాల్లో హాస్యనటున్ని చేసింది. నటుడు కాకముందు ఆయన క్రేజీ కామెంటేటర్‌గా పేరు పొందారు. సినిమా ముగిసిన తరువాత కామెంటరీ చెప్పిన శివరావును చూసేందుకు జనం ఉత్సాహం చూపించేవాళ్లు. సినిమాల్లోకి రాకముందు పద్యాలు, పాటల గ్రామఫొన్ రికార్డులు విడుదల చేశారు. హాస్యనటునిగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే శివరావు సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. నాగేశ్వరరావును హీరోగా, గిరిజను హీరోయిన్‌గా పరిచయం చేశారు. 1939లో వరవిక్రయంలో చిన్న వేషంతో నటనా జీవితం మొదలైంది. 1941లో చూడామణిలో కొద్దిపాటి గుర్తింపును తెచ్చింది. 1945లో స్వర్గసీమ, ఆ తరువాత బాలరాజు సినిమాతో కస్తూరి శివరావుకు మంచి గుర్తింపు లభించింది. బాలరాజు సినిమా తరువాత ఎక్కడికైనా తాను, శివరావు కలిసి వెళ్లిప్పుడు తన కన్నా శివరావును చూసేందుకే జనం ఎక్కువగా ఎగబడేవారని ఒక సందర్భంలో స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు తెలిపారు. 1949లో విడుదలైన పలు సినిమాల్లో శివరావు హవా సాగింది. గుణసుందరి కథ, లైలా మజ్ను, రక్షరేఖ, స్వప్నసుందరి, శ్రీలక్ష్మమ్మ కథ తదితర సినిమాల్లో నటించారు. ఈ సినిమాలన్నీ పెద్ద హిట్సే. దాంతో కస్తూరికి స్టార్ కమెడియన్‌గా గుర్తింపు వచ్చింది. 1950లో స్వయంగా దర్శకత్వం వహిస్తూ, అక్కినేని నాగేశ్వరరావు, గిరిజ హీరో హీరోయిన్‌గా సినిమా తీశారు.
కస్తూరి శివరావు హవా సాగేప్పుడు సంపన్నులు వాడే విదేశీ కారు బ్యూక్‌ను ఉపయోగించే వారు. ఆ కారును చూసేందుకే మద్రాసు నగరంలో జనం కారు వెంట పరిగెత్తే వాళ్లట.
చాలా మంది సినిమా వాళ్లను పరిచయం చేస్తూ ఈ సినిమాతో ఇక అతను వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది అంటారు. నిజానికి ఈ అలవాటే నటులను దెబ్బతీస్తుంది. అప్పుడప్పుడు వెనక్కి, చుట్టుపక్కలకు చూసుకుంటే మార్పు కనిపించేది. కాలం మారుతోంది. దానికి తగ్గటు ప్రేక్షకుల అభిరుచులు మారుతుంటాయి. కస్తూరి శివరావు ప్రాభవం మెల్లగా తగ్గుముఖం పట్టసాగింది. అదే సమయంలో ఆ స్థానాన్ని రేలంగి దర్శనమివ్వసాగాడు. కస్తూరికి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయితే హాస్యనటునిగా ఒక వెలుగు వెలిగిన కస్తూరికి నాకు అవకాశాలు ఇవ్వండి అని అడగడానికి అహం అడ్డు వచ్చింది. ఈ వైఖరి నిర్మాతలకు నచ్చలేదు. సంపాదించింది దాచుకున్నది లేదు. పెట్టుబడులు పెట్టింది లేదు. సాధారణంగా ఒక వెలుగు వెలుగుతున్న వారికి ఈ వెలుగు నిలిచిపోతే ఎలా అనే ఆలోచన వస్తే బాగుంటుంది. కానీ అలా వచ్చేది కొద్ది మందికి మాత్రమే నటన మాత్రమే తెలిసిన కస్తూరికి రేపు ఎలా అనే ఆలోచన రాలేదు. సంపాదించింది రేపటి కోసం పెట్టుబడి పెట్టాలనే ఆలోచన అసలే రాదు. అదే ఆయన్ని కోలుకోని విధంగా దెబ్బతీసింది. కాలం కలిసి వచ్చినప్పుడు గాలిలో తేలిపోతాం, కాలం పగబట్టి పంజా విసిరితే లేవలేరు. కస్తూరి నీ టైమ్ అయిపోయింది అని కాలం హెచ్చరించింది. జీవనోపాధి కోసం చివరకు నాటకాల్లో నటించారు.

 ‘‘బతుకుతెరువు కోసం మద్రాసు వచ్చినప్పుడు తోలుత నేను సైకిల్ తొక్కాను. బాగా సంపాదించాక కార్లలో తిరిగాను, ఇప్పుడు మళ్లీ సైకిల్ తొక్కుతున్నాను’’ అంటూ తన దయనీయమైన పరిస్థితిపై తానే చమత్కరించే వారు. పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగిన వారి జీవితం పూలపాన్పుగా ఉంటుంది. కానీ అదే సంపన్నుడు పేదవానిగా మారితే ఆ జీవితం నరక ప్రాయం. అలాంటి జీవితాన్ని కస్తూరి శివరావు అనుభవించారు. సంపన్నులకు మాత్రమే పరిమితమైన కారుపై చాలా కాలం పాటు వెళ్లిన దారిలోనే సైకిల్ తొక్కుతూ వెళ్లారు. కేవలం బతుకుతెరువు కోసమే చివరి దశలో అనారోగ్యంతో ఉన్నా నాటకాల్లో నటించే వారు. 

1966లో ఒక నాటకంలో వేషం వేయడానికి తెనాలి వెళ్లి అక్కడి రైల్వే స్టేషన్‌లోనే మరణించారు. ఆయన మరణంపై అప్పటి పత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారం శివరావు మరణించిన కొన్ని గంటల తరువాత ఎవరో ప్రయాణికుడు అది శివరావు మృతదేహం అని గుర్తించాడు. కారు డిక్కిలో ఆయన మృత దేహాన్ని మద్రాసు చేర్చారు. మార్గమధ్యలో కారు ఆగిపోవడం వల్ల మూడు రోజుల తరువాత మృత దేహం మద్రాసు చేరింది. ఒకప్పుడు స్టార్‌గా వెలుగొందిన కస్తూరి శివరావు మృతదేహాన్ని చూసేందుకు కూడా సినిమా వాళ్లు రాలేదు. దూరం నుంచి ఆయన్ని చూడడంతోనే జీవితం ధన్యం అయిందనుకునే వారు ఆయన అంతిమ యాత్రలో మాత్రం ఎవరూ లేరు. ‘‘ మా ఇంటి పేరు కస్తూరి దానికి తగ్గట్టు నా జీవితం కస్తూరి వాసనలా గుప్పుమనేది. ఇప్పుడు ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు ’’ అంటూ తన దుస్థితిపై తానే వేధాంత ధోరణిలో చమత్కరించుకునే వారు. నటులను స్టార్లతో పోలుస్తారు, ఆకాశంలో స్టార్లు వెలుగొందేది కొద్ది కాలమే ఇది సహజం అంటూ తన ప్రాభవం తగ్గిపోయిన కాలంలో ఆయనే చెప్పేవారు. తాగుడు సైతం ఆయన జీవితాన్ని దెబ్బతీసిందని అంటారు.
సామాన్యుడి నుంచి స్టార్‌గా ఎదిగి, తిరిగి అన్నీ కోల్పోయి శివరావు జీవితం విషాదాంతం కావడం పూర్తిగా ఆయన స్వయం కృతాపరాధమే కావచ్చు. 

కానీ ఆయన జీవితం మిగిలిన నటులకు పాఠాలు నేర్పింది. నటునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా, చివరి రోజుల్లో ఆర్థికంగా మాత్రం దుర్భర జీవితం అనుభవించారు. తరువాత తరం నటులు ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవడానికి శివరావు విషాదాంత జీవితం ఉపయోగపడింది.

6, మార్చి 2013, బుధవారం

అమితాబ్ మరుజన్మ కోరిక- ఎలుక పెళ్లి

వచ్చే జన్మలో తాను జర్నలిస్టుగా పుడతానని అమితాబ్ బచ్చన్ వచ్చే జన్మ వృత్తిని ఇప్పుడే రిజర్వ్ చేసుకున్నారు. మొత్తం దేశం ఆయన్ని అభిమానిస్తుంటే ఆయనేమో జర్నలిజాన్ని అభిమానించడం ఆశ్చర్యకరమే. ఆయన ఏ ఉద్దేశంతో ఈ కోరిక కోరుకున్నా, ఆయన మాటలు వింటుంటే చిన్నప్పుడు చదివిన ఎలుక పెళ్లి కథ గుర్తుకొస్తుంది. 

ఒక ఎలుకకు తాను చాలా తెలివైన దానినని, అందగత్తెనని గట్టి నమ్మకం. చాలా మందికి ఇలాంటి నమ్మకాలే ఉంటాయి. ఎవరి నమ్మకాలు వారివి. ఓటు హక్కు లేకపోయినా మనం ఎలుక మనోభావాలను గౌరవించాలి. ఆ ఎలుక తనకు పెళ్ళీడు వచ్చిందని గ్రహిస్తుంది. సరే దీనికి తగ్గ ఏదో ఒక ఎలుకను చూసి పెళ్లి చేసుకోవడానికి తాను అల్లాటప్పా ఎలుక కాదని దాని నమ్మకమాయే. దాంతో అది తాను ఎలుకను కాకుండా అత్యంత శక్తివంతుడు ఎవరో వారిని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది.

 లక్ష్య సాధన కోసం పూర్వం ఋషులు లెక్కలేనంత కాలం తపస్సు చేసే వాళ్లు. ఈ కాలంలో లెక్కలేనంత కాలం నడుస్తూనే పోతుంటారు. అది మునుల్లానే తపస్సు చేసింది. దేవుడికి ముచ్చటేసి ప్రత్యక్షం అయ్యాడు. ఎలుకా! ఏమీ నీ కోరిక అని ప్రశ్నించాడు. ఇదీ నా కోరిక అని ఎలుక చెప్పింది. అన్నింటికైనా శక్తివంతమైన వాళ్లు ఎవరో నువ్వే నిర్ణయించుకో వారితో పెళ్లి జరిపించే బాధ్యత నాదీ అని దేవుడు వరం ఇచ్చి మాయమయ్యాడు. బాగా ఆలోచించిన ఎలుక మొత్తం ఎలుక జాతిని నిరంతరం భయపెట్టే పిల్లిని మించిన శక్తివంతమైన జంతువు మరోటి లేదనుకుని పిల్లిని పెళ్లి చేసుకోవాలనుకుని పిల్లి కోసం పెళ్లి చూపులకు వెళుతుంది. నేను కుక్కను చూస్తే పారిపోతాను, నా కన్నా కుక్కే అత్యంత శక్తివంతమైనదని చెబుతుంది పిల్లి.

 ఎలుక ని జమే అనుకుని కుక్క వద్దకు వెళుతుంది. ఇలా ప్రతి జంతువు తన కన్నా శక్తివంతమైన మరో జంతువు పేరు చెబుతుంది. చివరకు మనిషి అందరి కన్నా శక్తివంతుడని జంతువులు చెబుతాయి. మనిషి తన నిస్సహాయ స్థితిని వివరిస్తూ వాన వచ్చినా ఎండ వచ్చినా తట్టుకోలేని నన్ను మించిన శక్తివంతమైనది ప్రకృతి. అలాంటి ప్రకృతి సైతం ఈ బండరాయి ఎదిరిస్తుంది. అని పెద్ద బండను చూపుతాడు. ఎవరినీ లక్ష్యపెట్టని, ఎవరినీ ఖాతరు చేయని బండరాయిని పెళ్లి చేసుకోవాలని ఎలుక నిర్ణయించుకుని బండ రాయి వద్దకు వెళ్లి అదే విషయం చెబుతుంది. బండరాయి నవ్వి ఎలుక తలుచుకుంటే ఈ కొండను కూడా తవ్వేస్తుంది. కింద మట్టి మొత్తం తొలిగిపోయి నేను కొండ మీద నుంచి జారి పడాల్సిందే అని బండరాయి తన కన్నా ఎలుక ఎంత శక్తివంతమైందో చెబుతుంది. దాంతో ఆ ఎలుక పిల్ల మరో ఎలుకనే వరిస్తుంది. దేవుడు మాట నిలబెట్టుకున్నట్టు అయింది. ఎలుక కోరిక తీరింది.


ఆ ఎలుక కోరికలానే అమితాబ్‌కు చిత్రమైన కోరిక కలిగింది. ఏడుపదుల వయసులో కోట్ల రూపాయలు సంపాదిస్తూ, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అమితాబ్ ఈ మధ్య ట్విట్టర్‌లో తన మనసులోని మాట బయట పెట్టారు. వచ్చే జన్మలో మీరు ఏం కావాలనుకుంటున్నారు? అని ప్రశ్నిస్తే, జర్నలిస్టును అని ఆయన చెప్పుకొచ్చారు. యంగ్రీయంగ్‌మెన్‌గా ఎన్నో పాత్రలు వేసిన అమితాబ్ బహుశా జర్నలిస్టు పాత్ర మాత్రం ఏ సినిమాలోనూ వేయనట్టుగా ఉంది. ఏ పాత్ర అంటే మీ కిష్టం అని ప్రశ్నించినప్పుడు జర్నలిస్టు పాత్ర అని చెప్పి ఉంటే అర్ధం చేసుకోవచ్చు కానీ, నిర్భయంగా, నిర్మోహమాటంగా మనసులోని అభిప్రాయాన్ని రాయడానికి జర్నలిస్టుగా పుడతానని చెప్పుకొచ్చారు.


ప్రపంచంలో ప్రతిఒక్కరికీ తామున్న వృత్తిలో తప్ప అన్నింటిలో బోలెడు సుఖ సంతోషాలు ఉన్నాయని పిస్తుందేమో అని పిస్తోంది. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ దేశ మంతా కొన్ని వేల మంది సినిమా అభిమానులు స్టూడియోల చుట్టూ తిరుగుతూ తెరపై ఒక్కసారి కనిపించడమే జీవితాశయంగా బతుకుతుంటే రెండు మూడు దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ఏకఛత్రాదిపత్యంగా ఏలేసి, పెద్ద వయసులో బుల్లితెరను కూడా దునే్నస్తున్న అమితాబ్ మాత్రం ప్లీజ్ ఒక్క చాన్స్ వచ్చే జన్మలో జర్నలిస్టుగా పుట్టించమని అడుగుతున్నారు. అప్పుడెప్పుడో స్వాతంత్య్ర పోరాట కాలంలో, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో నిజాయితీగా, నిర్భయంగా రాసే అవకాశం జర్నలిస్టులకు ఉండేది. ఇప్పుడే లేదంటే ఇక అమితాబ్ వచ్చే జన్మలో అది సాధ్యం అవుతుందా? అత్యాశ కాకపోతే.


పిల్లలను స్కూల్‌లో పెద్దయ్యాక నువ్వేమవుతావు అని అడిగితే సగం మంది డాక్టర్లం అని చెబితే, మిగిలిన సగం మంది ఇంజనీర్లం అని చెబుతారు. ఆ రెండు వృత్తులు అంటే వారికి అంత ప్రేమనా? అంటే అది కాదు ఆ వయసులో వారికి తెలిసింది ఆ రెండు వృత్తులు మాత్రమే. అది కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో అక్కినేని, నందమూరిలు ఎక్కువగా డాక్టర్లుగానే కనిపించేవాళ్లు. అందరూ డాక్టర్ అని చెబితే బాగోదని కొందరు ఇంజనీర్‌తో సంతృప్తి చెందేవాళ్లు. అలానే రాజకీయాల్లో ఏ కార్యకర్తను కదిపినా ఎమ్మెల్యేగా ఎన్నికై నా నియోజక వర్గం ప్రజలకు సేవ చేయాలనేది నా జీవిత లక్ష్యం అంటాడు. అధికార పక్షం వాళ్లను అడిగితే మంత్రి పదవితో సేవ చేసుకుంటాను అంటాడు. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించే నాయకున్ని అడిగితే ఈ వయసులో నాకంటూ ఎలాంటి కోరికలు లేవు, ఏదో ముఖ్యమంత్రి పదవి పొంది మీ అందరికీ సేవ చేసుకుని తరలించాలనేదే నా జీవిత ఆశయం అంటాడు.

 అమెరికాలో చిన్న పిల్లలను నువ్వు అధ్యక్షుడివి కావాలి అని దీవిస్తారన్న ఒక ప్రచారం ఉంది. ఇదేం దీవెనో వినడానికే విచిత్రంగా ఉంది. పరిస్థితులను చూస్తుంటే వచ్చే జన్మ సంగతి ఎలా ఉన్నా భగవంతుడా! మనుషులను మనుషులుగా పుట్టించు అని దేవున్ని కోరుకోవాలనిపిస్తోంది. మనిషి మనిషి కావడం చాలా కష్టం అంటారు గాలిబ్.