28, సెప్టెంబర్ 2011, బుధవారం

నవీన ‘బుద్ధుడు’....నడమంత్రపు నైతిక నియమాల జబ్బు


చెట్టంత కొడుకు నుండి ఆ మాట వినగానే పరంధామయ్యకు నవనాడులు క్రుంగిపోయాయి. నేరం చేసిన వాడు తన కొడుకే అని తెలిసినప్పుడు సినిమా ‘జస్ట్టిస్ చౌదరి’ ఎంత మనోవేదనకు గురయ్యాడో పరంధామయ్య అంతే బాధపడ్డాడు. పరంధామయ్య సాధారణ వ్యక్తి కాదు. లిక్కర్ కింగ్, రియల్ ఎస్టేట్ సామ్రాట్, స్టార్ కాంట్రాక్టర్ అలాంటి పరంధామయ్య ఏకైక కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతటి సంపన్నుడికి కొడుకు నుండి అలాంటి మాటలు వింటే బాధగానే ఉంటుంది. హరి అనే మాట ప్రహ్లాదుని నోటి నుండి విన్నప్పుడు దేవతలనే గడగడలాడించిన హిరణ్యకశపుడు క్రుంగిపోయినట్టుగానే పరంధామయ్య బెంబేలెత్తిపోయాడు. హే భగవాన్ ఈ వయసులో నాకిదేం పరీక్ష తండ్రీ ?అని మూగగా రోదించాడు.


కష్టాలు మనుషులకు కాకపోతే చెట్లకు వస్తాయా? అని తోటి కాంట్రాక్టర్ పరశురాం పరామర్శకు వచ్చాడు. తన పరిస్థితి చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది పరశురాం ముఖం పరంధామయ్యకు ‘‘ అప్పుడే సమాచారం వీడిదాకా వెళ్లిందా?’’ అని మనసులో అనుకొని ‘‘ అయ్యో మీలాంటి పెద్దలు, అసలే షుగరు, బిపి, కీళ్లనొప్పులతో అడుగు తీసి అడుగు వేయలేరు, ఒకసారి గుండెపోటు కూడా వచ్చింది అయినా శ్రమకోర్చి పరామర్శకు మా ఇంటికొచ్చారు మాకదే చాలు ’’ అని పరంధామయ్య చురక అంటించారు. రోగిష్టి వెధవ అని తిట్టినట్టు అనిపించినా పరశురాం పట్టించుకోలేదు.

నీ అభిప్రాయం మారదా?- అని కొడుకును లాలనగా ప్రశ్నించాడు. ‘‘ఈ జీవితం శాశ్వతం కాదు నాన్నా, ప్రజల కోసం ఏం చేశామనేది ముఖ్యం, కాలే కడుపుతో రోజుకు ఒక పూట తిండికూడా లేని వాళ్లు కోట్లాది మంది ఉన్నప్పుడు ఈ విలాసవంతమైన జీవితం అవసరమా? చెప్పు నాన్నా’’ అంటూ కొడుకు అడుగుతుంటే పరంధామయ్యకు చెవుల్లో వేడి సీసం పోసినట్టుగా ఉంది. ‘‘పరంధామయ్య !మీ అబ్బాయిలో నాకో గౌతమ బుద్ధుడు కనిపిస్తున్నాడు. రాజ్యాన్ని త్యజించి అర్ధరాత్రి అడవులకు వెళ్లి బుద్ధుడైన గౌతముడిని కళ్లతో చూస్తున్నట్టుగా ఉంది ’’ అంటూ వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ పరశురామయ్య గంభీరంగా బయటకు వెళ్లాడు.


 అటు నుండి పరశురామయ్య తనకన్నా సగం వయసున్న డార్లింగ్ వళ్లో వాలిపోయి జరిగిందంతా చెప్పి పడిపడి నవ్వాడు. డార్లింగ్ నా జీవితంలో ఇంత సంతోషం నాకెప్పుడూ కలగలేదు, వ్యాపారంలో నా ప్రత్యర్థి పరంధామయ్య గాడి జీవితం రోడ్డున పడ్డట్టే, వాడి కొడుకు నేడో రేపో సన్యాసుల్లో కలిసిపోవడం ఖాయం. అక్కడున్న పది నిమిషాల్లో వాడి కొడుకు ఏం చెప్పాడు. మన దంతా పాపపు సంపాదనంటా, సింపుల్‌గా బతకాలంట, నైతిక విలువలు ముఖ్యమట, ఇంకేమన్నాడు ఆ అవినీతికి వ్యతిరేకంగా జాతిని అదేదో చేస్తానన్నాడు.. ఆ.. ఆ.. జాగృత పరుస్తాడట!’’ అంటూ నవ్వు ఆపుకోలేకపోయాడు. ‘‘చాల్లేండి మరీ అంతగా నవ్వకండి గుండాగిపోతారు’’ అని మధురవాణి లుబ్దావదాన్లను మందలించినట్టు మందలించింది.


‘‘పోతే పోనీ డార్లింగ్!వాడి కొడుకు మాటలు ఈ చెవులతో విని, ఈ కళ్లతో వాడి దుస్థితి చూశాక ఉంటే ఎంత నీ ఒళ్ళో ప్రాణాలు వదిలితే ఎంత? ’’ అని మళ్లీ నవ్వాడు పరశురాం. ‘‘వాడికున్న వందల కోట్ల ఆస్తి ఇప్పుడు చిత్తుకాగితాలే, వాడి కొడుకు సన్యాసుల్లో కలిశాక వీడు ఒకటి రెండేళ్లకన్నా ఎక్కువ బతకడు ’’అని పరశురాం పరంధామయ్య కొడుకు సంగతి అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. క్షణాల్లో ఈ వార్త నగరమంతా ప్రాకిపోయింది.


 కొంత మంది యువకులు పరంధామయ్య ఇంటి ముందు వాలిపోయి ‘‘మేం పలానా సంస్థకు చెందిన వాళ్లం. మీ నాయకత్వంలో మనం ఈరోజు సాయంత్రం నైతిక విలువల కోసం క్యాండిల్ వాక్ చేద్దాం’’ అని పరంధామయ్య కొడుకును కలిశారు. ‘‘అలాగే ఇక నా జీవితం ప్రజలకు, విలువలతో కూడిన జీవితం కల్పించడానికే అంకితం’’ అని అక్కడే ప్రకటించేశాడు. ‘‘ఏరా మరోసారి ఆలోచించుకో’’ అని పరంధామయ్య కొడుకు రెండు చేతులను పట్టుకున్నాడు. అమ్మవైపు, చెల్లివైపు చూస్తూ ‘‘లేదు నాన్నా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ప్రజలే నాకు దేవుళ్లు ప్రజలకే నా జీవితం అంకితం’’అని చెప్పి, మేడపైనున్న గదిలోకి పరిగెత్తి అప్పటి వరకు వేసుకున్న జీన్స్‌ను వదిలేసి తెల్ల దుస్తులు వేసుకున్నాడు. తల్లి, చెల్లి కిందే ఉండి ఏం జరగబోతుందో అని ఆసక్తిగా చూడసాగారు.
 కొద్దిసేపటి తరువాత పరంధామయ్య తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ తానూ మేడపైనున్న కొడుకు గదిలోకి వెళ్లాడు. ఏ జన్మలో చేసుకున్న పాపమో సరే నీ ఇష్టం అన్నాడు. గదిలో ఆ ఇద్దరికి తోడుగా నిశ్శబ్దం మాత్రమే ఉంది.‘‘ మరీ ఈ ఆస్తినంతా ఏం చేయమంటావు’’ అని అడిగాడు. ‘‘జీవితానికి డబ్బే ముఖ్యం కాదు నాన్నా, విలువలు ముఖ్యం, ఎన్నాళ్లు బతికినా ఏదో ఒక నాటికి అందరం పైకి వెళ్లాల్సిన వాళ్లమే, నీవు వెళ్లిన తరువాత కూడప్రజలు నిన్ను గుర్తించుకునేలా మంచి పనులు చేయాలి. నైతిక నియమాలు లేని జీవితం వృధా’’ పరంధామయ్య కొడుకు వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకున్నాడు.

పరంధామయ్యకు అయోమయంగా ఉంది. గదిలో ఉన్నది ఇద్దరమే అని మరోసారి నిర్ధారించుకున్న తరువాత కొడుకు గళం విప్పాడు.‘‘ పిచ్చినాన్నా . నాకేమన్నా పిచ్చనుకున్నావా? నేను పరంధామయ్య కొడుకును నాన్నా, నీ కన్నా ఎక్కువ సంపాదిస్తా, నానా గడ్డి కరిచి నువ్వు సంపాదించింది వందింతలు చేస్తా కానీ దాన ధర్మాలు చేస్తానా? రాజకీయమంత లాభసాటి వ్యాపారం లేదు. నువ్వు రాజకీయాల్లోకి వస్తే నిన్ను పీక్కుతినాలని చూస్తారు. నా గురించి ఇప్పటికే మన ప్రత్యర్థులే బోలెడు ప్రచారం చేసి ఉంటారు. నన్ను అసెంబ్లీకి పోటీ చేయమని జనమే కాళ్లావేళ్లా పడతారు. మన ఆస్తిని 60 నెలల్లో వంద రేట్లు పెంచుతా నాన్నా నైతిక నియమాలా ? మజాకానా? అని నవ్వాడు. ఈ రహస్యం మనలోనే ఉండాలి , అమ్మకు కూడా చెప్పొదు రాజకీయం అంటే ఇదే అని కొడుకు ఒట్టు పెట్టించుకున్నాడు.
 అమ్మ కొడుకా! అని పరంధామయ్య నిర్ఘాంత పోయాడు. ఇప్పుడాయన మనసు ప్రశాంతంగా ఉంది.....


 నీతి : నడమంత్రపు నైతిక నియమాల జబ్బు చేసిన వారితో జాగ్రత్త!

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

చానల్స్ పై చానల్స్ స్టింగ్ ఆపరేషన్స్ ... ప్రత్యక్ష పోరుకు దిగుతున్న చానల్స్

కంచే చేను మేస్తే పాత సామెతలానే మీడియానే తప్పు చేస్తే అనే సామెత కూడా పాతపడిపోయినట్టుంది. చానల్స్ మధ్య గతంలో కోల్డ్‌వార్ సాగింది. ఇప్పుడు మొహమాటాలేమీ లేవు ప్రత్యక్ష యుద్ధానికే దిగుతున్నారు. కొన్ని చానల్స్ ఒకరిపై ఒకరు స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహించుకుంటున్నారట! పలు చానల్స్‌లో జరిగే అంతర్గత వ్యవహారాలపై ప్రత్యర్థులు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, త్వరలోనే ఇవి ప్రసారం కానున్నాయని ఎలక్ట్రానిక్ మీడియా సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రచారం. 
కందుకూరి వీరేశలింగం దాదాపు 130 ఏళ్ల క్రితం వివేకవర్థిని అనే పత్రిక నడిపారు. న్యాయవ్యవస్థను విమర్శించడానికి మీడియా భయపడుతుంది. జన లోక్‌పాల్ పరిధిలో న్యాయవ్యవస్థ సైతం ఉండాలని జన లోక్‌పాల్ కోరుతోంది. కందుకూరి వీరేశలింగం 130 ఏళ్ల క్రితమే అప్పటి న్యాయవ్యవస్థలోని తప్పులను ఆధారాలతో సహా ఎండగట్టారు.
 దానికి వీరేశలింగానికి నోటీసు ఇస్తే, కోర్టుకు వెళ్లిన వీరేశలింగం తన వాదనను వినిపించారు. తప్పు చేశారని ఎవరిపైనైతే నేను రాశానో వాళ్లు నన్ను విచారించడం ఏమిటి? నాకు న్యాయవ్యవస్థ అంటే గౌరవమే కానీ కక్షదారునికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని వాదన వినిపించారు. వీరేశలింగం వాదనతో ఆ న్యాయమూర్తికి దిమ్మతిరిగిపోయిందట!
జాతీయ స్థాయిలో జన లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటుకై ఉద్యమాలు సాగుతున్న సమయంలోనే కర్నాటక లోకాయుక్త ఇచ్చిన తీర్పుతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. తరువాత లోకాయుక్తగా శివరాజ్ పాటిల్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంటి స్థలం పొందడంలో అవకవతకలకు పాల్పడినందుకు చివరకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు లోక్‌పాల్ పరిధిలోకి లోక్‌పాల్‌ను, లోకాయుక్త పరిధిలోకి లోకాయుక్తను సైతం చేర్చాలి అనే జోకులు వినిపించాయి అతని రాజీనామా తరువాత.
ఈ విషయాలు ఎందుకంటే సమాజంలోని తప్పులను ఎత్తి చూపాల్సిన బాధ్యత మీడియాది. కానీ చివరకు మీడియా తప్పులను ఎత్తిచూపడానికి ప్రత్యేకంగా ఒక చానల్ ఏర్పడుతుందేమో అనిపిస్తోంది. కొన్ని సంఘటనలను చూస్తుంటే ... తప్పు చేసిన మిరేమిట్ నన్ను ప్రశ్నించేది అని ఇప్పుడు అందరి నుండి 
 మీడియా ప్రశ్న లు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది 


చానల్స్ వార్తలను ప్రసారం చేయాలి కానీ కొన్ని చానల్స్ తామే వార్తలను సృష్టించి గందరగోళంలో పడిపోతున్నాయి . ఒక చానల్ ఆవిర్భవించడానికి ముందు ఏదైనా సెనే్సషన్ చేద్దామని ఉస్మానియా మార్చురీలో అనాధ శవాలను కొనుగోలు చేసి మూసీలో పారేసింది. శవాలు కొట్టుకొస్తున్నాయని స్టోరీ చేయడం కోసం. పోలీసుల విచారణలో అసలు వ్యవహారం బయటపడింది.

 ఇక తాజాగా ఒక చానల్- ఒక రాజకీయ నాయకుడు ఆ పార్టీ మహిళలను వేధిస్తున్నాడని, పార్టీ అధ్యక్షుడ్ని కలవాలనుకునే వారు తన వద్దకు రావాలని వేధిస్తున్నాడనేది కథ. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఆ చానల్‌కు మద్దతుగా ఒక పార్టీ రంగంలోకి దిగింది. కొత్త పార్టీకి చెందిన నాయకుడు ఒక అమ్మాయితో శృంగార భరితంగా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఊ.... ఊ... అంటూ రెచ్చగొట్టే విధంగా శబ్దం చేస్తుంది తప్ప మాటల్లో ఎక్కడా దొరకడం లేదు. అతనేమో మాటలతో వీరవిహారం చేసేస్తున్నాడు. ఇది ఒక చానల్‌లో ప్రసారం అయిన కథ. కొద్ది సేపటి తరువాత ఒక అమ్మాయిని ప్రవేశపెట్టారు. కొత్త పార్టీ నాయకుడు వేధించింది ఈ అమ్మాయినే అని చెప్పించారు.
 మరి కొద్ది సేపటి తరువాత ఆ అమ్మాయి ఈ చానల్‌కు, వీరి పార్టీకి పోటీగా ఉండే చానల్‌లో ప్రత్యక్షమైంది. ఫలానా చానల్ వాళ్లు నన్ను బెదిరించి నాతో ఇలా చెప్పించారు. నేను ప్రజారాజ్యం పార్టీలో ఉండగా ఆ చానల్ వాళ్ల ఆఫీసుపై దాడి చేశాను, ఆ కేసు నుండి తప్పించాలంటే మేం చెప్పినట్టు వినాలని బెదిరించారు అనేది ఆమె కథనం. ఆమె మాటలకు ఆధారంగా కొత్త పార్టీకి అనుబంధ చానల్‌లో ఈ అమ్మాయి ప్రత్యర్థి మీడియాపై దాడి చేస్తున్నప్పటి దృశ్యాలు సైతం ప్రసారం చేశారు. ఈ వ్యవహారంపై రెండు చానల్స్, రెండు పార్టీలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిల మధ్య రోజంతా మాటల యుద్ధం జరిగింది.
ఆ నాయకుడు అమ్మాయితో అలా మాట్లాడింది నిజమే కానీ అలా మాట్లాడింది మాత్రం టీవీలో కనిపించిన ఆ అమ్మాయితో కాదు, జగన్ పార్టీని వ్యతిరేకించే చానల్‌లోనే పని చేసే అమ్మాయితో అని వినిపిస్తోంది. ఆమె దాదాపు నెల రోజుల నుండి కొత్త పార్టీలో మగ నాయకులు పలువురికి ఫోన్ చేసి అలా మాట్లాడితే చివరకు ఒక నాయకుడు వీరి గాలానికి చిక్కాడు. 

ఐతే తమ చానల్‌లో పని చేసే అమ్మాయిని చూపించలేక దాని కోసం మరో అమ్మాయిని చూపించారు అనేది అంతర్గత చర్చల్లో నాయకులు చెబుతున్న మాటలు. చివరకు ఈ వ్యవహారం ఆరోపణ ఎదుర్కొన్న నాయకుడు, రెండు చానల్స్‌లోనూ హడావుడి చేసిన అమ్మాయి ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి మానవ హక్కుల కమీషన్‌ను కలిసి చానల్ వాళ్లు తనను బెదిరించి తప్పుడు మాటలు చెప్పించారని ఫిర్యాదు చేసింది. కేసు విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో జగన్ కోసం ఒక చానల్ పని చేస్తే, టిడిపి కోసం మరో చానల్ పని చేస్తుందని బలంగా విమర్శలు వినిపించాయి. రాష్ట్రంలో మీడియా నిష్పక్షపాతం గురించి ముసుగులేమీ లేవు. ఎవరు ఎవరి పక్షమో అంతా బహిరంగమే

21, సెప్టెంబర్ 2011, బుధవారం

ఇది ఇంటింటి రాజ్యాంగేతర శక్తి కథ....శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు రాజ్యాంగేతర శక్తికి ఆధ్యులు



రేషన్ కార్డు మీద ఇంటి యజమాని కాలమ్‌లో ఇంటాయన తన పేరు చూసుకుని మురిసిపోతాడు. కానీ నిజానికి ఇంటి యజమాని తాను కాదు ఆమె అనే విషయం అతనికీ తెలుసు. అంటే అధికారికంగా అధికారం ఒకరి చేతిలో ఉంటుంది, దాన్ని చలాయించేది మరొకరు అనేది మనకు రేషన్ కార్డు నుండే అనుభవంలోకి వస్తుంది. కేంద్రంలో పాలన రాష్టప్రతి పేరు మీద రాష్ట్రంలో గవర్నర్ పేరు మీద సాగుతుంది. వారిదే నిజమైన అధికారం అని వారి వద్ద పని చేసే బంట్రోతులు కూడా అనుకోరు. సోనియమ్మ విదేశాల్లో ఉంటే అంతామౌన  వ్రతం చేశారు అమ్మగారు వచ్చేంత వరకు సమస్యలు ప్రస్తావించవద్దనుకున్నారు..


ఆమె ఈ దేశానికి ప్రధాని కాదు, రాష్టప్రతి కాదు. మరి ఆమె ఏమిటీ ? అంటే ఏమీ కాదు. కానీ అన్నీ ఆమెనే ఇదే మన ప్రజాస్వామ్య విచిత్రం. మన రాజ్యాంగంలోనే రాజ్యాంగేతర శక్తికి బోలెడు అవకాశాలు కల్పించారు. నా ప్రభుత్వం అంటూ రాష్టప్రతి, గవర్నర్ ప్రసంగిస్తారు. కానీ వారి చేతిలో ఎలాంటి అధికారం ఉండదు.
ఇప్పుడు ప్రధానమంత్రి పోస్ట్ కూడా డమీ అయిపోయింది.

 ఆ మధ్య ఒక పోటీలో ఒక్కో దేశంవాళ్లు తాము కనిపెట్టిన వాటి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారట! రిమోట్‌తో నడిచే టీవి, విమానం కనిపెట్టామని చెప్పుకుంటు పోతుంటే మన దేశీయుడు లేచి మీదేం గొప్ప మేం రిమోట్‌తో నడిచే ప్రధానమంత్రిని ఆవిష్కరించామని చెప్పగానే మన వానే్న విజేతగా ప్రకటించారట!
పాండవ వనవాసంలో ఎస్వీ రంగారావు బానిస కొక బానిస కొక బానిస ఏ బానిస అని తిట్టినట్టుగా ఉంది మన ప్రజాస్వామ్యం సైతం. 1924లో మహాత్మాగాంధీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత ఎప్పుడూ ఆయన ఎలాంటి పదవి తీసుకోలేదు. కానీ స్వాతంత్య్రంకోసం పోరాటాన్ని, కాంగ్రెస్‌ను నడిపింది ఆయనే. చేసింది మంచి పనే కాబట్టి ఆ సంగతి వదిలేద్దాం. రాజ్యాంగం ప్రకారం అధికారం ఒకరి చేతిలో ఉండడం అధికారం చలాయించేది మరొకరు కావడం మనకు అనాది కాలం నుండి ఉన్న సంప్రదామే.

 దేవేంద్రుడే పెద్ద డమ్మి ప్రభువు కదా! శక్తివంతులైన త్రిమూర్తులే కాదు, చిన్నా చితక దేవుళ్లు కూడా దేవేంద్రున్ని పెద్దగా పట్టించుకున్న దాఖలా కనిపించదు. పాలించే పని ఎలాగూ లేదని ఆయన షోకిల్లా రాయుడిలా తిరగడంపైనే దృష్టి సారించి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఆయనకు పాలించే అవకాశమే దక్కనప్పుడు పాలనలో ఇబ్బందులు ఎక్కడుంటాయి.

 శ్రీరాముడుపితృవాక్య పాలకునిగా కన్నా పినతల్లి కైక వాక్య పరిపాలకునిగానే ఎక్కువ కనిపిస్తున్నారు. నిజంగా దశరథుని చేతిలో అధికారం ఉంటే ఆయన శ్రీరాముడిని అడవులకు పంపేవారా? పాలన దశరథుని పేరుతో సాగినా పగ్గాలన్నీ కైక చేతిలోనే ఉండేవని అధికారమంతా ఆమెదేనని అర్ధం కావడం లేదా? మహాభారతంలో అడుగడుగునా రాజ్యాంగేతర శక్తులే కనిపిస్తాయి. విరాట రాజు డమీ రాజు , అసలైన అధికారం కీచకుడిదే! మీ రాజు ఉట్టి డమీ అసలైన అధికారం నాదే అని కీచకుడు సైరంధ్రికి చెబుతాడు. ఔను నిజమే అతను చెప్పినట్టు విను అంటుంది మిసెస్ విరాట రాజు.

 యుద్ధాన్ని నడిపిన శ్రీకృష్ణుడే అతి పెద్ద రాజ్యాంగేతర శక్తి కదా! పాండవులు, కౌరవుల మధ్య అది భూమి తగాదా? దాంతో శ్రీకృష్ణునికి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇద్దరి మధ్య రాయబారం నడిపి, రాయబారం విఫలమైందని, చెప్పి యుద్ధం చేయించింది ఆయనే కదా! పాండవుల సంగతి పక్కన పెడదాం, కౌరవుల్లోనై నిజమైన అధికారం ఎవరి చేతిలో ఉందే వారే అధికారం చలాయించారా? అంటే అదీ లేదు. మొన్న కౌన్ బనేగా కరోడ్ పతిలో భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు వంటి కొన్ని పేర్లు చెప్పి వీరిలో కౌరవ సైన్యానికి నాయకత్వం వహించని వారు ఎవరు ?అని ప్రశ్నించారు. చెబితే పాతిక లక్షలొస్తాయి. రామాయణ, భారతాల గురించి తెలియని భారతీయుడుంటారా? ఉన్నారు సమాధానం చెప్పలేక పోయారు. ఎందుకంటే కౌరవ పక్షం మొత్తం దుర్యోధనుడి పేరుతోనే గుర్తింపు పొందింది కానీ అతనెప్పుడు సైన్యానికి నాయకత్వం వహించలేదు. అంటే రాజ్యాంగేతర శక్తి అన్న మాట!
 ధృతరాష్ట్రుడు రాజైనా అతను మన్‌మోహన్‌సింగ్ లాంటి వాడన్నమాట! చుట్టూ ఎన్ని కుంభకోణాలు జరిగినా, ఏం జరిగినా సర్దార్‌జీ మంచి బాలుడు అన్నట్టు అవేమీ పట్టకుండా సోనియాజీ మాట జవదాటకుండా ఉంటారు. అందుకే రాజైనా ధృతరాష్ట్రుడి మాట ఎవరూ వినరు, పట్టించుకోరు. పక్కన వింజామరలు ఊపే సిబ్బంది తప్ప ఎక్కడా ఎవరూ ఆయన మాట విన్నట్టు కనిపించలేదు మనకు.

 అధికారంలో ఉన్నవారి వద్ద రాజ్యాంగేతర శక్తులు కనిపిస్తుంటాయి కానీ ఘనత వహించిన మన బాబుగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు. ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు ఆయన తరఫున పార్టీలో అసలైన అధికారం చలాయించి, కొత్త రికార్డు సృష్టించారు. అధికారంలో ఉన్నప్పుడు వెన్నుముక లేని వింత జీవులను తయారు చేసి తనకు రాజ్యాంగేతర శక్తుల సమస్య లేకుండా చేసుకున్నారు.
చేయి ఖాళీ లేదు వెళ్లిపోమని బిక్షగాడికి చెప్పడానికి కోడలుకున్న అధికారం ఏమిటి? ‘‘ఇటు రా’’, అని పిలిచి వాడు వచ్చాక ‘‘ఆధికారికంగా నేను చెబుతున్నాను, చేయి ఖాళీ లేదు ’’అందట పూర్వపు అత్త. ఇప్పుడు అధికార కేంద్రం మారింది. ఇప్పుడు అత్తగారా ధైర్యం చేయడం లేదు. కోడలే ఆ మాట చెబుతోంది. ఆయన డమీ ఆమెదే అసలైన అధికారం. ఇది ఇంటింటి రాజ్యాంగేతర శక్తి కథ.

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

తెలుగు చానల్స్ చింతామణి సూక్తులు...శ్రీరంగ నీతులు.................. 80 ఏళ్ల తెలుగు సినిమా




టివి 9లో  రాజకీయ  నాయకులు 

రెచ్చగొట్టుకుంటూ మాట్లాడుకుంటున్నారని, సంయమనం పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ విలువలతో కూడిన ఉపన్యాసాల గురించి, విమర్శల గురించి ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అవి వింటుంటే చింతామణి సూక్తులు విన్నట్టు సంతోషం కలిగింది. చెప్పేవి శ్రీరంగ నీతులు అనే సామెత గుర్తుకొచ్చింది. గతంలో పిల్లలకు లోక జ్ఞానం కోసం టీవీలు చూడాలని, రేడియో వినాలని చెప్పేవారు. ఇప్పుడు న్యూస్ చానల్స్ చూడాలంటే అందులో పని చేసే వారు సైతం విరక్తి చెందే పరిస్థితులు వచ్చేశాయి.
చర్చల పేరుతో చివరకు స్టూడియోలోనే బాహాబాహీ కొట్టుకునే పరిస్థితులు వచ్చాయి. వచ్చాయి అనడం కన్నా మన తెలుగు చానల్స్ తీసుకు వచ్చాయి అనడం సబబుగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంపై టిఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, టిడిపి తెలంగాణ నాయకులు పరుష పదాలు పలకడం, సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్రపై తెలంగాణ నాయకులకు వ్యతిరేకంగా పలికిన కొన్ని మాటలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి నీతి సూక్తులు చెప్పారు. ఇంకా విచిత్రమేమంటే టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి నాయకులు వివిధ సందర్భాల్లో బహిరంగ సభలో, విలేఖరుల సమావేశాల్లో మాట్లాడిన మాటలను ఏరికూర్చి కార్యక్రమాన్ని తయారు చేశారు.

 ఇక వీటికి సమాధానం అన్నట్టు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం టీవి9 వాళ్లు ఒక్కరే నగరంలోని ఒక హోటల్‌లో మంత్రి టిజి వెంకటేశ్‌ను ప్రత్యేకంగా కలిసి తెలంగాణ నాయకులను తిట్టించారు. వాళ్లు మిమ్ములను ఇలా తిట్టారు దానికి మీరేమంటారు అని ఒక నాయకుడిని చానల్ వాళ్లు ప్రశ్నిస్తే వాళ్లేమంటారు. అంత కన్నా తీవ్రంగా తిట్టి తీరాల్సిందే కదా! టిజి వెంకటేశ్‌తో అదే చేయించారు. ఒకవైపు నాయకులు సంయమనం పాటించాలని నీతిసూక్తులు చెబుతూ మరోవైపు నీతి సూక్తుల కార్యక్రమం కోసమే టిజి వెంకటేశ్‌ను కలిసి తిట్టించడం చానల్ వారు కోరుకుంటున్న విలువల్లో నిజాయితీ ఎంతో తెలుస్తోంది. సరే మిగిలిన వార్తల్లో విలువలు పాటించడం ఎలాగో కనిపించదు కనీసం విలువల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలోనైనా కాస్త విలువలు పాటిస్తే బాగుండేది.

 ఎప్పుడో తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి వాటిని వెతికి పట్టుకుంటే సరిపోయేది, ఈ కార్యక్రమం కోసం టిజితో ప్రత్యేకంగా తిట్టించాల్సిన అవసరం ఎందుకు?
తెలుగు నాట ఈ తిట్టుకునే అధ్వాన్న సంస్కృతిని ప్రవేశపెట్టింది టీవి9. దాన్ని మిగిలిన చానల్స్ అనుసరిస్తున్నాయి. ఎంతగా అనుసరిస్తున్నాయంటే చివరకు ఈ అనుసరించడంలో ఇతర చానల్స్ ముందుకు వెళ్లిపోతే కొన్నిసార్లు టీవి9 వెనకబడింది. ఒక దశలో న్యూస్ చానల్స్‌లో టీవి9 ది ఏకస్వామ్యంగా సాగింది. బయట చిల్లర గొడవలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది వీళ్లే. ఇప్పుడు త్వం శుంఠా అంటే త్వమేవ శుంఠ అన్నట్టు ఈ పోటీలో ఎవరూ వెనకబడి లేరు.

 తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటుకు తాళాలు వేసి అక్కడే బైఠాయించి, అక్కడే తిన్నారు. పవిత్రమైన అసెంబ్లీలో ఇదేమిటి? అని మీడియా ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే, మేం మాట్లాడితే మీరు పట్టించుకుంటారా? ఏదో ఇలాంటి జిమ్మిక్కు చేస్తే కానీ మీ దృష్టిలో పడం, మీరు చానల్స్‌లో చూపరు, మా రాజకీయం అంతా మీకోసం సాగుతోంది అంటూ ఆ ఎమ్మెల్యే చెబితే, మీడియా వద్ద సమాధానం లేదు. బాగా తిట్టుకునే నాయకులు ఎవరెవరు అని గుర్తించి వారికి పెద్ద పీట వేసి స్టూడియోలకు పిలిపించి చర్చలు పెట్టింది టీవి9. చివరకు ఈ తిట్టుకునే వ్యవహారం న్యూస్ చానల్స్ అంటే మొహం మొత్తేలా అయింది. న్యూస్ చానల్స్‌ను వార్తల కోసం చూసే వారి సంఖ్య తగ్గిపోతుంది. దానికి తగ్గట్టు చివరకు న్యూస్ చానల్స్ సైతం న్యూస్ కన్నా సినిమా ఆధారిత కార్యక్రమాలనే ఎక్కువగా ప్రసారం చేస్తున్నారు.
80 ఏళ్ల తెలుగు సినిమా
తెలుగు సినిమాకు 80 ఏళ్లు. ‘్భక్త ప్రహ్లాద’తో మొదలైన తెలుగు సినిమా నడక 80 ఏళ్ల సుదీర్ఘ ప్రస్తానంలో వేగం పుంజుకుంది. ఎంతగా వేగం పుంజుకుందంటే చివరకు కథను సైతం గాలికి వదిలి ఎటు పోతుందో తెలియకుండా గుడ్డిగా పరిగెడుతున్నంత వేగం పుంజుకుంది. ‘్భక్త ప్రహ్లాద’ నుండి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు, కథల్లో వస్తున్న మార్పులపై హెచ్‌ఎం టీవీ 80 ఏళ్ల తెలుగు సినిమా పేరుతో చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. భక్తి కథల నుండి ఫ్యాక్షన్ కథలు, ప్రేమ కథల వరకు సాగుతున్న పరిణామాలపై చక్కని విశే్లషణ సాగింది. ఉన్న కొద్ది పాటి సమయాన్ని ఉపయోగించుకుని, అందుబాటులో ఉన్న సినిమాల క్లిప్పింగ్‌లతో 80 ఎళ్ల తెలుగు సినిమా ప్రపంచాన్ని కళ్ల ముందుంచారు.
సప్తగిరిలో అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్వ్యూ. జీవిత అనుభవాన్ని కాచివడబోసిన అక్కినేని నాగేశ్వరరావులాంటి వారు తమ జీవిత గమనంలో ఎదురైన పలు అనుభవాలను పంచుకున్నారు.
ఇలాంటివి ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.

 సాక్షిలో జమున ఇంటర్వ్యూ సైతం అలానే ఉంది. సినిమాలో అంత అందంగా ఉన్న జమునను వృద్ధాప్యంలో చూస్తే మనసు ఎలానో అయిపోతుంది. సినీ తారలు అభిమానుల దృష్టిలో దేవతలే కావచ్చు కానీ వారు మనుషులే.. వారికీ వృద్ధాప్యం అనివార్యం అని జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. అభిమానుల సంగతి సరే కానీ అలాంటి నటీనటులు తాము యవ్వనంలో ఉన్నప్పటి సినిమాలు టీవీల్లో కనిపిస్తే వారికి ఎలా అనిపిస్తుందో? వారితో చెప్పిస్తే బాగుండు.

15, సెప్టెంబర్ 2011, గురువారం

పిల్లలను హీరోలను చేయాలనుకొని విలన్లు అవుతున్న తల్లితండ్రులు ?

లైఫ్ ఈజ్ ఏ గేమ్. జీవితం ఒక ఆట. అందులో విజయాలు ఉంటాయి. ఓటములు ఉంటాయి. సుఖాలు కష్టాలూ ఉంటాయి. ప్లస్‌లు మైనస్‌లూ ఉంటాయి. రెండూ ఉంటేనే జీవితం. మరి -ఆటలో అస్తమానూ విజయాలే కోరుకుంటే. సుఖాలనే ఆహ్వానిస్తే. ప్లస్‌లనే తీసుకుంటానంటే. పిల్లల నుంచి అమ్మానాన్నలు అవే కోరుకుంటుంటే....!!?
***

ఇప్పుడు -పిల్లలకు మల్టిపుల్ టాలెంట్స్ కావాలి. పిల్లలంతా ఆల్‌రౌండర్స్ అయివుండాలి.
లేదంటే -అమ్మానాన్నలకు కోపం వస్తుంది.
చదువుల్లో -మన పిల్లాడే ర్యాంకరై ఉండాలి.
ఆటల్లో -మనవాడే చాంపియన్ కావాలి.
పాటల్లో -మనవాడే సూపర్ సింగర్ అనిపించుకోవాలి.
డాన్స్ చేయాల్సి వస్తే -మహామహా మైఖేల్ జాక్సన్‌లాంటి వాళ్లు సైతం మనవాడి కాలి గోటికి సరిపోనంతగా డాన్స్ చేసేయాలి.
జేబులో రూపాయి లేకపోయినా -చాలెంజ్ చేసి రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలి.

అంతెందుకు -మన పిల్లాడు ‘హీరో’. అసాధ్యం అన్నది వాడి డిక్షనరీలో ఉండకూడదు. ఇందులో ఏది తక్కువైనా, ఏ ఒక్కటి లేకపోయినా -అమ్మానాన్నకు కోపం వచ్చేస్తుంది. వీడెందుకు పనికిరానివాడన్న ముద్రపడిపోతుంది. పసివాడికైనా, ప్రపంచాన్ని అప్పుడే చూడ్డానికి అలవాటుపడుతున్న టీనేజర్‌కైనా అది సాధ్యమా?
‘సాధ్యం కాదు’ అని ఎలా చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలి? వాడి మనసు వేసే ఒత్తిడి పొలికేకలను ఎవరు పట్టించుకోవాలి?
****

‘హామ్మా నేను కత్తియుద్ధంలో రాకుమారుడినే ఓడించానమ్మా’ అంటూ ఓ సామాన్యుడి కొడుకుగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ తల్లి ముందు కత్తి విన్యాసం ప్రదర్శిస్తే -ఆ బ్లాక్ అండ్ వైట్ సీన్‌ని మనం ఏంజాయ్ చేస్తాం. కాలేజీలోకి బెరుకు బెరుకుగా అడుగుపెట్టిన కుర్ర హీరో వారం తిరగకుండానే గోల్డ్‌మెడల్ మెడలో వేసుకుని ఇంటికొచ్చిన -కలర్ సీన్ చూసేసి ఆనందించేస్తాం. ‘బ్లాక్ అండ్ వైట్ కావచ్చు, కలర్ కావచ్చు. చిరంజీవి కావచ్చు రాంచరణ్ కావచ్చు. అక్కినేని నాగార్జునో, నాగచైతన్యో కావచ్చు. హీరో ఎక్కడైనా నెంబర్ వన్. నువ్వూ అలా ఉండాలి. అన్నింట్లో ఫస్ట్ రావాలి’ అంటూ పిల్లాడికి చిన్న లెక్చర్ ఇస్తాం.
హీరో నంబర్ టూ స్థానంలోకి వెళ్లడాన్ని మనం జీర్ణించుకోలేం. నెంబర్ టు స్థానానికి వెళ్లాడంటే, వాడు చాతకాని హీరో. హీరో ఎప్పుడూ నెంబర్ వన్‌గానే ఉండాలి. విలన్ గ్యాంగ్‌లోని వందమంది ఉన్నా చితక్కొట్టాలి. రిక్షా తొక్కడం నుంచి జీవితం మొదలెట్టినా రీళ్లు పూర్తయ్యేసరికి -ఫ్లైటునుంచి దిగాలి. అంతేనా -హీరో పాటలు పాడాలి. డ్యాన్సులు చేయాలి. ఎక్కడా శిక్షణ లేకపోయినా, అప్పటికప్పుడే నేర్చేసుకుని విమానం నడిపేయాలి. గుర్రాన్ని స్వారీ చేసేయాలి. సర్వ కళల్లో రాణించాలి. అలాగైతేనే హీరోని యాక్సెప్ట్ చేస్తాం. ఆ విద్యలన్నీ -కొడుకులోనో, కూతురిలోనో చూడాలనుకుంటాం.



 సరే మన సినిమా కోరికల్ని దర్శకుడో, నిర్మాతో ఈజీగానే తీర్చేస్తాడు. సినిమా సక్సెస్‌లు మన పిల్లలకూ అన్వయించుకుంటూ కలల్లో బతికేస్తాం.
అందుకే -కానె్వంట్‌నుంచి ఇంటికొచ్చిన పిల్లాడికి నీ ర్యాంకెంతరా? అన్న పలకరింపే అమ్మానాన్నల నుంచి ఎదురవుతుంది. ఎంసెట్‌లో మన పిల్లల ర్యాంకు అదిరిపోవాలి, లేకపోతే తట్టుకోలేం. ఇరుగుపొరుగు వారు అడిగినప్పుడు మనవాళ్ల ర్యాంకును మనం సగర్వంగా ప్రకటించుకునేట్టుగా ఉండాలి. లేకపోతే మన తల కొట్టేసినట్టు ఫీలవుతాం. అంతేనా -మన పిల్లాడు టీవిల్లో కనిపించాలి. పాటలు పాడేయాలి. డ్యాన్సులు చేసేయలి. ఎక్కడైనా మనవాళ్ల పేరే వినిపించాలి.



లేకపోతే మనకు నామోషి. మన కోరికల సంగతి సరే. దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించామా? -ఆ ఒక్కటీ మనకక్కర్లేదు. దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పటి పరిస్థితి వేరు. అంతకు ముందు ఆకాశవాణిలో పిల్లల్లో కళలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు ఉండేవి. కానీ ప్రైవేట్ చానల్స్ పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో, వాళ్లు నిర్వహించే టాలెంట్ షోల పుణ్యమా అని పిల్లలపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. ఎంపిక కాకపోతే తమ జీవితం అంతటితో ముగిసినట్టు స్టేజిపైనే బోరున విలపించే సంఘటనలు చూస్తున్నాం. పిల్లల్లో కళలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు ఉంటే మంచిదే. కానీ వారిలో మరింతగా ఒత్తిడి పెంచే విధంగా ఇవి మారకూడదు. ఒకప్పుడు పిల్లలు స్కూల్‌లో స్టేజిపైన మాట్లాడేందుకే జంకే వారు. ఇప్పుడు టీవిల్లో టీనేజర్లే కాదు, ఐదారేళ్ల పిల్లలు చలాకీగా మాట్లాడేస్తున్నారు. పాటలు పాడుతున్నారు. యాంకరింగ్ చేస్తున్నారు. మంచిదే కానీ వాళ్లు అలా చేస్తున్నారని, ఎవరికి వారు తమ పిల్లలపై ఒత్తిడి తెచ్చి నువ్వు అలా ఎందుకు మాట్లడలేకపోతున్నావని తిట్టడం, ఒకరితో పోల్చడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ పరిణామాలు పిల్లల్లో మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని తెచ్చిపెడుతున్నాయి.


 ఒక్కొక్కరికీ ఒక్కో రంగంలో ప్రతిభ ఉండొచ్చు. కొందరు ఆల్ రౌండర్లూ కావచ్చు. కానీ అందరి పిల్లలూ ఆల్‌రౌండర్లు కావాలని, అగ్రస్థానంలోనే ఉండాలిన తల్లిదండ్రులు మానసికంగా హింసించడం ఎంతవరకు సబబు. కొన్ని స్కూల్స్, కాలేజీల పిల్లలు టీవిల్లో ఇలాంటి పోటీల్లో పాల్గొంటునప్పుడు వాళ్లు హఠాత్తుగా చదువుకునేప్పుడే కాలేజీ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. వీరిని చూసి ఇతరులను తల్లిదండ్రులు చిన్నచూపు చూడడం, నీకేమైందని ప్రశ్నించడం ఒత్తిడి పెంచే చర్యలు.
ఇలాంటి పోటీల్లో పాల్గొంటున్న పిల్లలు మానసికంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు మానసిక నిపుణులు చెబుతున్నారు. తాము ఒత్తిడికి గురవుతున్నామని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. 



కానీ తలనొప్పి ఎక్కువగా ఉండడం, అనారోగ్యం వంటి లక్షణాలు ఉంటాయట! వీటిని గమనించినప్పుడు పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారని గ్రహించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పోటీలో పాల్గొనడమే విజయం సాధించడం, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజయం సాధించలేరు కదా! ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించి పిల్లల్లోని ఒత్తిడిని తొలగించడానికి ప్రయత్నించాలి. పోటీలో పాల్గొనడానకి వెళ్లినప్పుడు తిరస్కరణకు సైతం ముందే పిల్లలను సిద్ధం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

14, సెప్టెంబర్ 2011, బుధవారం

మరక మంచిదే............పుట్టుమచ్చ లేని మనిషుండడు. ఏదో ఒక మరక లేని గొప్పవారు లేరు

ఛీ...చీ...చీ... వెదవ బతుకు. దేవుడా! ఇంత చాతకాని మొగుడ్ని నాకెందుకు ప్రసాదించావురా దేవుడా! వచ్చే జన్మలోనైనా నేను గర్వంగా తలెత్తుకుని తిరిగే జీవితాన్ని ప్రసాదించు’’ అంటూ సుభద్ర మొగుడికి వినిపించేట్టుగానే తనను తాను తిట్టుకుంది. పాపం సుభద్రకే కాదు ఎవరికైనా అలానే ఉంటుంది. పక్కింటి మీనాక్షి ఇంటిపై సిబిఐ వాళ్లు దాడి చేశారు, రోజూ ఐటి శాఖ ఇడి శాఖ అంటూ ఇంగ్లీష్‌లోని అన్ని అక్షరాల శాఖల వాళ్లు దాడులు జరుపుతున్నారు. తమ ఇంటికేమో ఎవరూ రావడం లేదు దాంతో సుభద్రతో పాటు చుట్టుపక్కల వారికి తలకొట్టేసినట్టుగా ఉంది . అప్పటి వరకు అందరితో స్నేహంగా మెలిగే మీనాక్షి దాడుల తరువాత నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ అన్నట్టు, నేనెక్కడ మీరెక్కడ అంటూ కాలనీలో అందరినీ పురుగుల్లా చూస్తోంది. మాకూ మంచి రోజులొస్తాయని సుభద్రతో పాటు ఇరుగు పొరుగు వారు పైకి అంటున్నా మనకంతా అదృష్టమా? అనే ఆవేదన వారిలో ఉంది. నిజమే మరి మరక లేని జీవితం నరక ప్రాయం కదా!

***


ఏరా షర్ట్ మీద ఈ మరకలేమిటి? ఉతకలేక చస్తున్నాను అని అమ్మ చిన్నప్పుడు తిట్టే తిట్లతో జీవితం మొదలవుతుంది. మరీ చిన్నపిల్లాడిలా షర్ట్‌మీద మరకలేమిటి? అని పెద్దయ్యాక భార్య వేసే ప్రశ్నలతో జీవితం సాగుతుంది కుటుంబరావులకు. అందుకేనేమో కుటుంబ రావులకు మరక పరమ చిరాకుగా ఉంటుంది. మరక మంచిదే అని గ్రహించిన వాళ్లు జీవితంలో ఎదిగిపోతుంటే, మరకకు భయపడేవారిని బతుకు భయపెడుతుంది. చిన్నప్పటి నుండి మరక మంచిది కాదు అనే మాటలకు ఎడిక్ట్ అయిపోయి సామాన్యులుగా బతికేస్తున్నాం.


 మనలానే సర్ఫ్ ఎక్సెల్ వాడు కూడా మరకకు భయపడితే మార్కెట్‌లో నిలిచేవాడా? మరక మంచిదే అని ఎప్పుడైతే గ్రహించాడో అదే నినాదంతో మార్కెట్‌లోకి వెళ్లి ప్రత్యర్థులు లేకుండా చేసుకున్నాడు. షర్ట్‌పైన చిన్న మరక ఉంటే అంతా మన మరకనే చూస్తున్నారేమో అని రోజంతా ఏ పనీ చేయలేం, కానీ పెద్దవాళ్లకు మాత్రం మరకే అలంకారంగా నిలుస్తోంది. ఎన్ని మరకలుంటే జీవితంలో అంత ఉన్నత స్థాయిలోకి వెళతారు.

లక్ష కోట్ల మరక లేకుంటే జగన్‌కు అంత జనాదరణ ఉండేదా? అప్పరావు, సుబ్బారావుల కొడుకుగానే ఆయన జీవితం గుట్టుచప్పుడు కాకుండా సాగేది. అదృష్టం బాగుంటే ఆ మరకలే ఆయనకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తును అదృష్టరేఖలవుతాయి. మరక ఉంటేనే రాజకీయాల్లో అదృష్టం కలిసొస్తుంది.


 74 ఎళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం ఎన్టీఆర్ జీవితంలో మరక అని అభిమానులు అంటారు. కానీ ఆ మరక వల్లనే కదా94 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష స్థానంకూడ దక్కకుండా చేసింది.
 నాకున్నవి రెండే మరకలు ఒకటి వెన్నుపోటు, రెండోది రెండెకరాల నుండి రెండువేల కోట్ల ఆదాయం అని బాబుగారే స్వయంగా చెప్పుకున్నారు.
 రెండువేల కోట్లు లేవు నాకున్నది 39లక్షలు మాత్రమే అని ఒక మరకను కనిపించకుండా తుడిపేసుకునే ప్రయత్నం చేశారు. మేకప్‌తో కంటికింద చారలు, ముడతలు కనిపించకుండా చేసినట్టే నాయకులు మన కంటికి కనిపించని మేకప్‌తో మరకలు కనిపించకుండా చేసుకుంటారు. నాకు 39లక్షల రూపాయల ఆస్తి మాత్రమే ఉందని చెప్పుకోవడం లాంటి మేకప్ అన్నమాట! మరక లేని నాయకులు మాజీలుగా ఉంటారేమో కానీ ప్రస్తుత రాజకీయాల్లో కనిపించరు. మరకలు ఎక్కువగా ఉన్నవారే మచ్చలేని నాయకులం అని ప్రచారం చేసుకుంటారు. తెల్లబట్టలపై నల్లచుక్క అయినా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొత్తం బురదలో కూరుకుపోతే మరకలెక్కడ కనిపిస్తాయి. ఇలాంటి వారే దమ్ముంటే నాకు మరకలున్నట్టు నిరూపించండి అని సవాల్ విసురుతారు.


 జుట్టుపై తెల్ల వెంట్రుక కనిపించగానే నల్లరంగేసేస్తాం. కొంత కాలం తరువాత మన జుట్టులో తెల్లవెంట్రుకలెన్నో, నల్లవెన్నో మనకే తెలియదు. మన జుట్టు లోగుట్టు మనకే తెలియనప్పుడు నాయకుల లోగుట్టు కనిపెట్టగలమా? బురదలో ఉన్నవారి మరకలను పట్టగలమా? 1999 ఎన్నికల సమయంలో లోక్‌సత్తా పార్టీగా మారక ముందు రాష్ట్రంలో పోటీ చేస్తున్న వారిలో మరకలున్న అభ్యర్థుల జాబితా ప్రకటించి సంచలనం సృష్టించింది. అయితే ప్రజలు ఆ మరకలున్న నాయకులందరినీ గెలిపించి మరింత సంచలనం సృష్టించారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి కాంగ్రెస్ తరఫున జక్కం పూడి రామ్మోహన్‌రావు ఒక్కరే గెలిచారు. లోక్‌సత్తా నేరాల మరకల జాబితాలో అతని పేరూ ఉంది, మరకకు భయపడి అతనికి టికెట్ ఇవ్వకపోతే గోదావరి జిల్లాల నుండి అప్పుడు కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే ఉండకపోయేది.


 జగన్ అరెస్టవుతాడా? అని అభిమానులు కంగారు పడుతున్నారు. అరెస్టయితే అతని కీర్తికిరీటంలో మరో మరక చేరి, రాజకీయాల్లో అతని ఉజ్వల భవిష్యత్తుకు తోకచుక్కలా మారుతుంది. పత్రికల్లో అప్పుడప్పుడు కనిపించే, కూలీ పని చేసుకొని బతుకుతున్న మాజీ ఎమ్మెల్యే భార్య, దిక్కులేని జీవితం గడుపుతున్న మాజీ ఎంపి అంటూ వచ్చే వార్తలన్నీ మరకలేని జీవితం గడిపిన నాయకుల గురించే. వీరిని చూశాక మరక లేని జీవితం గడపాలని ఏ నాయకుడైనా అనుకుంటారా?

చంద్రడికి అందం వచ్చింది మరకతోనే కదా? ఒక్క మరక ఉంటేనే దేవుడు. శరీరం మొత్తం మరకలే ఉన్న ఇంద్రుడు దేవాది దేవుడు .. ఒక రాత్రి ఆయన కాలు జారి తప్పు పని చేస్తే పాపం ఆయన శరీరం మొత్తం మరకల మయం కావాలని శపించారు. మరకల్లాంటి ఆ కళ్లు అందరి కళ్లకు కనిపించకుండా అతను వరం పొందాడనుకోండి. మరకలు లేని వాళ్లు వోటర్లుగా మిగిలిపోతే, మరకలున్నవాళ్లు నాయకులవుతున్నారు, పాలకులవుతున్నారు, దేవతలవుతున్నారు. పుట్టుమచ్చ లేని మనిషుండడు. ఏదో ఒక మరక లేని గొప్పవారు లేరు.



13, సెప్టెంబర్ 2011, మంగళవారం

మీ అమ్మాయి జ్యోతి లక్ష్మిలా డ్యాన్స్ చేస్తోంది అంటే ముచ్చటపడుతున్న తల్లులు....... ఫిర్యాదులతో టీవీ సీరియల్స్‌కు మరింత పాపులారిటీ





 జీ తెలుగులో ప్రసారం అవుతున్న ముద్దుబిడ్డ సీరియల్ పిల్లల్లో నేర ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా ఉందని, ఈ సీరియల్‌ను నిషేధించాలని బాలల హక్కుల సమితి రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. అదే రోజు కేబుల్ టీవీ నెట్ వర్క్ చట్టాన్ని సవరించే ప్రక్రియ ప్రారంభించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి వారు చూపిన కారణం సైతం పిల్లల ప్రధానాంశంగా ఉన్న హిందీ సీరియల్ కావడం విశేషం. కలర్స్ చానల్‌లో బాలికా వధు ( హిందీలో వస్తున్న ఈ సీరియల్‌ను అనువదించి తెలుగులో మా చానల్‌లో ప్రసారం చేస్తున్నారు) ఇది బాల్యవివాహానికి సంబంధించిన ఒక కథ. ఈ సీరియల్‌నే కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి చౌదరి మోహన్ జత్వా ప్రస్తావించారు. టీవీ ప్రసారాలపై స్వయం నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనను కేబుల్ టీవీ నెట్ వర్క్ చట్టంలో చేరుస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ బాలికా వధు వంటి సీరియల్‌పై కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కొందరు అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటూ మంత్రి చెప్పుకొచ్చారు.
ఇక మన ముద్దుబిడ్డ విషయానికి వస్తే ఫిర్యాదుకు ముందు ఈ సీరియల్ గురించి ఎంత మందికి తెలుసో తెలియదు కానీ ఈ సీరియల్ ప్రసారాలను నిలిపివేయాలని బాలల హక్కుల సమితి మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేసిన తరువాత హడావుడిగా టీవీ 9, ఎన్‌టీవి వంటి ప్రముఖ న్యూస్ చానల్స్ దీనిపై చర్చా గోష్టులు నిర్వహించి బోలెడు ప్రచారం కల్పించాయి. ఈటీవి సుమన్, ప్రభాకర్‌ల స్నేహం ఆ మధ్య సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ప్రభాకర్ కోసం చివరకు సుమన్ తండ్రిని సైతం వదిలి బయటకు వచ్చారు. తిరిగి సుమన్ సొంతింటికి వెళ్లారు. ఆ సమయంలో సుమన్‌పై అభిమానంతో (ఈ విషయం సంస్థ ప్రారంభించినప్పుడు ప్రభాకరే చెప్పుకున్నారు) ప్రభాకర్ సుమన్ పేరుమీదనే శ్రీసుమనోహర పేరు మీద ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి 2009లో నిర్మాత, దర్శకుడిగా ప్రభాకర్ ముద్దుబిడ్డ పేరుతో ఈ సీరియల్ నిర్మించారు. జీ టీవీలో సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ సీరియల్ ప్రసారం అవుతోంది. రెండేళ్ల నుండి ప్రసారమవుతున్న సీరియల్‌పై ముగింపు దశలో ఫిర్యాదులు అందడం ఏమిటో?

తెలుగు సీరియల్స్ అన్నింటిలో ఆడవారంటే విలన్లు. అత్త పాత్ర కావచ్చు, భార్య , తల్లి , బిడ్డ, ఆడపడుచు, వదినా, మరదలు, చిన్న కోడలు పాత్ర ఏదైనా కావచ్చు, మహిళా పాత్ర అయితే విలన్ లేదంటే నిరంతరం ఏడుస్తూ ఉండే ఏడుపు గొట్టు పాత్ర. చాలా కాలం నుండి ఇదే ట్రెండ్ సాగింది, సాగుతోంది. అన్ని చానల్స్‌లో ఇవే కథలైనప్పుడు పాపం ప్రేక్షకులను సైతం చూడకుండా ఏం చేయగలరు. వీటికి భిన్నంగా ఒక రకంగా మరింత దగ్గరగా ఉంటుంది ముద్దుబిడ్డ. అన్ని సీరియల్స్‌లో పెద్ద మహిళలు విలన్లు అయితే ఈ సీరియల్‌లో మాత్రం ఐదారేళ్ల చిన్నపాప విలన్ అన్న మాట. ఓ పాప కుటుంబంపై కక్ష తీర్చుకోవడానికి కుట్రలు చేస్తుంది. ఓ కుటుంబాన్ని నాశనం చేయాలనకున్న మహిళ తన బిడ్డకు శిక్షణ ఇచ్చి ఆ కుటుంబ సభ్యురాలిగా పంపుతుంది. దాంతో ఆ బాలిక ప్రతి రోజూ ఆ కుటుంబంపై కక్ష తీర్చుకోవడానికి కుట్రలు పన్నుతుంది. మొత్తం మీద కథ ఇది.

 ఐదారేళ్ల పాపతో కక్ష తీర్చుకోవడానికి తల్లి శిక్షణ ఇవ్వడం ఏమిటో, అంత చిన్నపాప కుటుంబంపై కక్ష పెంచుకోవడం ఏమిటో? నిజానికి ఆ పాపలో కన్నా కథ రాసిన రచయిత బుర్రలో, దర్శకుని బుర్రలో ఎంత విషముందో అర్ధమవుతోంది. పూర్వం రాజుల కథలతో సినిమాలు వచ్చినప్పుడు తండ్రిని మోసం చేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్న విలన్లపై హీరో ఎక్కడో పెరిగి పెద్దవాడై కక్ష తీర్చుకుంటాడు. ఇది స్పీడ్ యుగం అప్పటి మాదిరిగా హీరో పెద్దవాడయ్యేంత వరకు ఆ తల్లికి నిరీక్షించే ఓపిక లేదు. ఐదారేళ్ల వయసులోనే బుర్రలో విషం నింపి కక్ష తీర్చుకునే మానవ బాంబుగా మార్చేస్తోంది. ఇలాంటి తల తిక్క కథతో రెండేళ్ల పాటు సాగించిన సీరియల్ నిలిపివేయాలనే ఫిర్యాదు అందడంతో అందరి దృష్టిలో పడింది.

 గతంలో ఇదే విధంగా బాలల హక్కుల సంఘాలు ఓంకార్ ఆటపాటలపై మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. నాలుగైదేళ్ల పిల్లలు డ్యాన్స్ చేస్తే జడ్జిస్ అట 60 ఏళ్ల వృద్ధులు జ్యోతిలక్ష్మిలా భలే డ్యాన్స్ చేస్తున్నావు అని కామెంట్లు చెప్పడం, దీనిపై ఫిర్యాదు చేస్తే మానవ హక్కుల కమీషన్ ప్రసారాలను నిలిపివేయమంటే ఓంకార్ కోర్టుకు వెళ్లారు. ఈ వివాదం వల్ల ఆ కార్యక్రమానికి మరింత పాపులారిటీ పెరిగింది. ఓ మహాతల్లి ఈ సందర్భంగా టీవీ చర్చల్లో మాట్లాడుతూ మా పిల్లలు మా ఇష్టం వద్దనడానికి మీరెవరు? జ్యోతిలక్ష్మిలా భలే డ్యాన్స్ చేస్తున్నావని అంటే మీకొచ్చిన నష్టం ఏమిటి? జ్యోతిలక్ష్మి మాత్రం మనిషి కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిందాతల్లి. సెన్సార్ బోర్డులు, నియంత్రణలు ఇవన్నీ ఎందుకు? ఆ మహాతల్లి చెప్పినట్టు నచ్చక పోతే ఆ చానల్ మార్చేసుకోండి, చూడమని మిమ్మల్ని ఎవరు బతిమిలాడుతున్నారు.
 ఏడుపుగొట్టు సీరియల్స్, మనుషుల్లో ఇలాంటి కుళ్లు కుతంత్రాలను నింపే సీరియల్స్ చూడలేక ఇతర హిందీ, ఇంగ్లీష్ వచ్చిన వారు ఆ చానల్స్ వైపు వెళుతున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఈ కుళ్లు ఇంకెంత కాలమో! తమిళ కథలను ఎంత కాలం నమ్ముకుంటారు. తెలుగులో ఆలోచించలేరా? అమృతం సీరియల్ రెండోసారి ప్రసారం చేస్తున్నా జనం హాయిగా చూస్తున్నారు కదా! ఫిర్యాదులతో మరింత సీరియల్స్‌కు మరింత పాపులారిటీ పెరుగుతుంది తప్ప మార్పు రాదు.

7, సెప్టెంబర్ 2011, బుధవారం

కుచేల కృష్ణుడు.. అభినయ సైకిల్‌ నాయుడు!

సలే ఆరోగ్యం బాగాలేదు ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు వద్దురా! అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను విన్నావా? నేనొత్తా నేనొత్తా అంటూ వెంటపడి వచ్చావు... ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. బాబు ఆస్తుల ప్రకటన అంటే ఆస్తుల పంపకం అన్నంత ఉత్సాహం చూపించావు - అంటూ జర్నలిస్టు జగన్నాధం ఏకదాటిగా మాట్లాడుతూనే పోతున్నాడు. ‘‘ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో’’అని కొంత గ్యాప్ ఇచ్చాడు. ‘‘ఇవి కన్నీళ్లు కావు అన్నయ్య! ఆనందబాష్పాలు ’’ అని ముకుందం ఏడుపు, సంతోషం సమపాల్లలో మిళితమైన స్వరంతో పలికాడు. ఇప్పుడు షాక్ తినడం జగన్నాధం వంతయింది.

కొన్ని వందల సార్లు బాబు ప్రెస్‌కాన్ఫరెన్స్ కవర్ చేసిన అనుభవం అతనిది. గోకుల్‌చాట్, లుంబిని పార్క్‌ల వద్ద బాంబు పేలుళ్ల వార్తను కూడా ఐశ్వర్యారాయ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు వెళ్లి వచ్చినంత ఈజీగా కవర్ చేసిన వృత్తి అనుభవం అతనిది. అలాంటిది జర్నలిజంలో బొడ్డూడని ముకుందం మొదటి రోజే ఇలా షాకిచ్చాడేమిటబ్బా అనుకుని ‘‘ఎందుకమ్మా? ఆ ఆనంద బాష్పాలు’’ అని వ్యంగ్యంగా అడిగాడు.

ఎమ్‌జిఆర్ తన సంపదనంతా తమిళ ప్రజలకు ఇచ్చినప్పుడు కూడా మీడియాలో ఇంత ఆసక్తి కనిపించలేదు. ప్రపంచలోనే అత్యధిక సంపన్నుడు బిల్‌గేట్స్ తన సంపదను ట్రస్ట్‌కు రాసిచ్చినప్పుడూ ఇంత స్పందన లేదు. వారెన్‌బఫెట్ స్టాక్ మార్కెట్ గడించిన వేల కోట్లను ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చినప్పుడు ఇంత కలకలం కలగలేదు. మన తెలుగు వాడు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన గ్రంధి మల్లిఖార్జున రావు తన ఆస్తిలో కొన్నివందల కోట్లు ట్రస్ట్‌కిచ్చినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.


 కానీ బాబు తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో గడించిన సంపదను బహిరంగ పరుస్తాను అనగానే వందల సంఖ్యలో అక్కడ కెమెరాలు వాలిపోయి, బాబుపై లైట్లను ఫోకస్ చేశాయి. ఏడేళ్ల నుండి అధికారం లేక చిక్కిపోయిన బాబు ముఖం ఒక్కసారిగా ఆ లైట్లవెలుతురులో మెరిసిపోయింది. జగన్నాధం అనుమానాన్ని అర్ధం చేసుకున్న ముకుందం ‘‘బాబు ఆంధ్రుల అభిమాన ప్రతిపక్ష నాయకుడు, మీడియా ఆశాకిరణం అందుకే ఆయనపై అంత ఆసక్తి... 


ఇంతకూ నా ఆనంద బాష్పాలకు కారణం ఏమిటనే కదా? నీ అనుమానం. మహాభారత యుద్ధాన్ని నివారించేందుకు రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా దుర్యోధనుడు వినకపోవడంతో చివరకు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ధృతరాష్ట్రునికి సైతం తన విశ్వరూపం కనిపించేట్టుగా శ్రీకృష్ణుడు వరమిస్తాడు. హే కృష్ణా నీ విశ్వరూపాన్ని సందర్శించిన ఈ కళ్లతో మరేమీ చూడలేను ఈ చూపు ఇక చాలు వెనక్కి తీసుకో అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. అలానే నాకు ఒకే ఒక ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో బాబుగారి విశ్వరూపాన్ని సందర్శించే అదృష్టం కలిగింది. మా అల్లుడు నా కన్నా గొప్పనటుడు అని ఎన్టీఆర్ చెప్పిన మాటలు బాబు నిజం చేశారు. ఈ జీవితానికి ఇంతకు మించిన అనుభవం ఏముంటుంది. అందుకే ఆనంద బాష్పాలు’’ అని ముకుందం తన్మయంతో చెప్పుకొచ్చాడు.


 అంతే కాదు యశోదకు చిన్నికృష్ణుడు కనిపించినట్టుగా నాకు నారా కృష్ణుడు కనిపించాడు. చిలిపికృష్ణుడు మన్నుతిన్నాడని ఫిర్యాదు చేసినట్టే, బాబు అవినీతి పరుడు అని అంతా ఫిర్యాదు చేశారు. 14 భువనభాండాలను తనలో దాచుకున్న కృష్ణుడు తల్లికి మాత్రం మన్నుతిన్న చిన్నికృష్ణుడిగానే కనిపించాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆధునిక అవినీతికి ద్వారాలు తెరిచిన బాబు తన కడుపులో అన్నీ దాచుకుని ప్రజలకు మాత్రం 39లక్షల 88వేల ఆస్తి మాత్రమే ఉందని చెప్పడం చిన్నికృష్ణున్ని గుర్తు చేయడం లేదూ! చిన్ని కృష్ణుడిలానే ఫిర్యాదులపై నారా కృష్ణుడు తన ఆస్తుల చిట్టా విప్పి చూపితే నేను యశోదమ్మలానే ఐపోయాను. అని ముకుందం చెబుతుంటే జగన్నాధం అడ్డుతగిలి తాను కుచేలుడినని బాబు చెబుతుంటే ఆయనలో నీకు శ్రీకృష్ణుడు కనిపించాడా? అని అడిగాడు.


 కృష్ణుడు, కుచేలుడు కలిసిపోతే ఎలా ఉంటారో నాకు నారా కృష్ణుడు అలా కనిపించారు. ఐతే ఆయన నారా కుచేల కృష్ణుడంటావు అని జగన్నాధం పూర్తిగా సరెండర్ ఐపోయి సందేహం తీర్చుకోవడానికి అన్నట్టుగానే అడిగాడు. శ్రీకృష్ణుడు ఏమన్నాడు, నీవు ఎలా కొలిస్తే అలానే దర్శనం ఇస్తాను అన్నాడు కదా! నారా వారు కూడా అంతే నీవు కుచేలుడు అనుకుంటే కుచేలుడిగా, శ్రీకృష్ణుడు అనుకుంటే శ్రీకృష్ణుడిగా దర్శనమిస్తారు.


 యథాప్రజా తథారాజా అనేది కొత్త మాట. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వారికిచ్చే తెల్లకార్డు రాష్ట్రంలో 106 శాతం కుటుంబాలకు ఉన్నాయి. అంటే అంతా తాము కుచేలులం అని ప్రకటించుకున్నట్టే కదా! కుచేలులకు కుచేల పాలకుడే శరణ్యం కాబట్టి ప్రజలు ఇప్పుడు రారా కృష్ణయ్య.... నారా కృష్ణయ్య అని పిలుచుకుంటారు చూడు’’ అని ముకుందం ధీమాగా చెప్పాడు. ఆస్తుల ప్రకటనలోనే తన వారసున్ని కూడా ప్రకటించేశాడు బాబు. 
తాను మూడు దశాబ్దాల పాటు శ్రమించి 39లక్షల 88వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తే, మా అబ్బాయి ఎమ్‌బిఏ చదువుకుని కనీసం ఒక్క నెల కూడా ఉద్యోగం చేయకుండా ఆరుకోట్లరూపాయలు సంపాదించాడు అని చెప్పడం ద్వారా తన కుమారుడే సరైన వారసుడని చెప్పకనే చెప్పాడు.


 నారావారి పల్లెనుదాటి ఎరుగని బాబు తల్లి అమ్మణ్ణమ్మ హెటెక్ సిటీ రాకముందే అక్కడ ఐదెకరాలు కొని, 50 కోట్లరూపాయల విలువైన ఆ భూమిని మనవడికి కానుకగా ఇచ్చిందట..

బాబుగారి ఆస్తుల చిట్టాలో పనికిరాని పాత కారుంది కానీ మామ నుండి ఎత్తుకెళ్లిన సైకిల్‌ను చూపించలేదెందుకంటావు? అని అనుమానం వ్యక్తం చేశాడు. ‘‘ఎవరైనా ఆస్తుల జాబితాలో ఎత్తుకొచ్చిన ఆస్తి చూపిస్తారా? చూపరు కదా? అందుకే బాబు కొట్టుకొచ్చిన సైకిల్‌ను ఆస్తుల జాబితాలో చూపించలేదు’’ అని ముకుందం చెప్పాడు.


 అంతే అంటావా? లేక సైకిల్‌కు కాలం చెల్లిందంటావా? ఏమో కాలమే చెప్పాలి.

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఎలక్ట్రానిక్ మీడియా అతిని నివారించేందుకు నియంత్రణ కమిటీ అవసరమా?



అవినీతిపై అన్నా హజారే సాగించిన దీక్షకు మీడియా అతిగా స్పందించిందనే అభిప్రాయం స్వయంగా మీడియాలోనే వినిపిస్తోంది. నిజానికి మీడియాకు సైతం మొన్నటి అన్నా హజారే ఉద్యమం పాఠాలు చెప్పింది. ఈ ఉదంతం తరువాత మీడియాలో ఇలాంటి అతిని నిరోధించేందుకు ఒక నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిమండలి భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.


 ఆ మరుసటి రోజే ప్రధానమంత్రి కార్యాలయం ఈ వార్తలను ఖండించింది. అతి వ్యవహారంపై మంత్రిమండలిలో చర్చకు వచ్చిన విషయం వాస్తవమే అయితే నియంత్రణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయమేమీ జరగలేదని ప్రకటించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్ ప్రధానంగా ఈ నియంత్రణ కమిటీ గురించి ప్రస్తావించారు. అయితే అన్నా హజారే ఉద్యమ సమయంలో ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా అతిగా వ్యవహరించింది అనే భావన మాత్రం చాలా మంది మంత్రులు వ్యక్తం చేశారు


. అన్నా దీక్ష ఊపుమీదున్నప్పుడు వ్యతిరేక ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత లభించలేదు కానీ అంతా ముగిసిన తరువాత మెల్లగా జాతీయ చానల్స్ ఔను నిజం చాలా అతిగా చేశాం అంటూ చెప్పుకుంటున్నాయ. చానల్స్ అన్నా ఉద్యమానికి అతిగా ప్రచారం జరపడంలో చూపిన శ్రద్ధ అసలు జనలోక్‌పాల్ బిల్లు ఏమిటో చెప్పడానికి ఆసక్తి చూపలేదు. నిజానికి జనలోక్‌పాల్‌లో ఏముందో కూడా చర్చించేందుకు చానల్స్ ఆసక్తి చూపలేదు. ఇంకా విచిత్రమేమంటే జనలోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తరువాత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రజల్లో కనిపించిన సంబరం కన్నా ఈ రోజు ఎక్కువగా సంబరపడుతున్నారన్నట్టుగా మీడియా అతి చేసింది. ఒకసారి కాదు రెండుసార్లు కాదు పార్లమెంటులో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టారు. స్టార్‌ప్లస్, జీటీవి వంటి హిందీ చానల్స్ దీక్ష ముగిసిన తరువాత ఈ వ్యవహారంలో అతి ప్రవర్తించిన దాని గురించి పలు కథనాలు ప్రసారం చేశాయి.


 లోక్‌పాల్ అనేది అన్నా హజారే బుర్రలో నుండి పుట్టిన ఆలోచన అనే ఈ ఉద్యమంలో, ర్యాలీల్లో పాల్గొన్న చాలా మంది భావిస్తున్నారు. కానీ 1968లో తొలిసారిగా లోక్‌పాల్ గురించి ఆలోచన చేసింది మాజీ ప్రధానమంత్రి, దివంగత లాల్‌బహదూర్ శాస్ర్తీ. ఈ విషయం సైతం జాతీయ చానల్సే దీక్ష తరువాత చెప్పుకొచ్చాయి.


అన్నా హజారే సాగించిన దీక్షను ప్రతిష్టాత్మకమైన ఎక్స్.ఎల్.ఆర్.ఐ. బిజినెస్ స్కూల్‌లో ఒక అధ్యయన అంశంగా చేరుస్తున్నట్టు ఆ బిజినెస్ స్కూల్ ఆచార్యులొకరు ప్రకటించారు. ఇదో కార్పొరేట్ ఉద్యమం అనే ప్రచారం జాతీయ చానల్స్‌లో బలంగా సాగింది. బిజినెస్ స్కూల్‌లోనే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా విద్యార్థులు అధ్యయనం చేయాల్సిన అంశాల్లో సైతం చేరిస్తే బాగుంటుంది. ఒక అంశంపై లోతైన చర్చకు అవకాశం ఇవ్వకుండా గుడ్డిగా పరిగెత్తడం అంటే ఏమిటో ఈ ఉద్యమం సందర్భంగా మీడియా ప్రజలకు చూపించింది.
యోగితా దండేకర్ అనే ప్రముఖ మరాఠీ నటి నగ్నంగా తన శరీరంపై మూడు రంగుల పేయింట్ వేయించుకుని తాను అన్నా హజారే ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించుకున్నారు. జాతీయ చానల్స్‌లో ఈమెకు బాగానే ప్రచారం లభించింది. ఇది ఉద్యమమా? వేలం వెర్రా? అనే సందేహం వస్తుంది ఇలాంటి వార్తలు చానల్స్‌లో చూసినప్పుడు. మరి కొందరు భక్తులు ఏకంగా వినాయకుడిని అన్నా హజారే రూపంలో తయారు చేసి ప్రతిష్టించారు. ఇలాంటి చిత్ర విచిత్రాలకు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం బాగానే లభిస్తుంది. వారికి కావలసింది ప్రచారం. చానల్స్‌కు కావలసింది ఇలాంటి తిక్క దృశ్యాలు. మరి ఇవి ఉద్యమానికి ఏ విధంగా ఉపయోగపడతాయో వారికే తెలియాలి. ఏదో ఒక సంఘటనను సాకుగా చూపించి ప్రభుత్వం మీడియాను నియంత్రించాలని ప్రయత్నించడం మంచిది కాదు. మీడియా నిష్పక్షపాతత అసలే అంతంత మాత్రం. ఇప్పుడు పార్టీకో చానల్, ప్రాంతానికో చానల్, కులానికో చానల్ అయిపోయింది. ప్రభుత్వ నియంత్రణ కన్న మీడియా తనకు స్వయం నియంత్రణ విధించుకోవడం మంచిది.
చానల్స్ వార్...
మన తెలుగు చానల్స్ వీకిలిక్స్‌కు సైతం ఎక్కాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఎబిఎన్ చానల్‌లో అప్పటి గవర్నర్ ఎన్‌డి తివారీ వ్యవహారం ప్రసారమైంది. అంతకు ముందు ఆరునెలల క్రితం మీడియాకు తివారీ వ్యవహారానికి సంబంధించి సీడీలు అందినా ఉద్యమం సాగుతున్న సమయంలో ప్రసారం చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీకిలిక్స్‌లో ఈ అంశం ప్రస్తావించారు. దానిపై టీ చానల్ కొన్ని కథనాలు ప్రసారం చేస్తే, ఎబిఎన్ చానల్ టీ చానల్‌ది మిడిమిడి జ్ఞానం అంటూ ఎదురు దాడి చేసింది. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని మిడిమిడి జ్ఞానం కానిదెవరికీ? మన చానల్స్‌పై సామాన్యుల అభిప్రాయాలు వింటే మన మిడిమిడి జ్ఞానం ఎంతో తేటతెల్లమవుతుంది. తెలుగు చానల్స్ మధ్య అనారోగ్యకరమైన ఈ వాతావరణం గురించి కొత్తగా చెప్పుకోవడానికేముంది.


 పార్టీల వారీగా, కులాల వారీగా తమ చానల్స్ ద్వారా బాహాబాహీ పోరుకు దిగిన విషయం బహిరంగ రహస్యమే కదా! గతంలో రాజకీయ నాయకులెవరైనా మీడియాలో వచ్చిన ఏ అంశంపైనైనా విమర్శ చేస్తే, పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తారా? అంటూ టిడిపి అధినేత చంద్రబాబు మొదలుకుని ఆ పార్టీ నాయకులంతా మండిపడేవారు. ఇప్పుడు బాబుతో సహా ఆ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా ముందు ఒక చానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాతనే మాట్లాడుతున్నారు. సాక్షి చానల్ వచ్చిన తరువాత బాబు నోటి నుండి మీడియా స్వేచ్ఛపై దాడి అనే మాట వినిపించకుండా పోయింది. ఒక రకంగా ఇదో మార్పే కదా

5, సెప్టెంబర్ 2011, సోమవారం

వ్యక్తిత్వ వికాసం కోణంలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జీవితంపై పుస్తకం






ఈ మధ్య రాజకీయ నాయకులపై పుస్తకాలు చాలానే వస్తున్నాయి. చంద్రబాబు జమానాలో మొదలై ఆ తరువాత మరింత ఊపందుకుంది. అయితే అవన్నీ పుస్తకాల విడుదలలో హడావుడి తప్ప ఆ పుస్తకంలో చదవడానికి పెద్దగా సరుకు ఉండదు. . అవసరార్ధం రాసిన పుస్తకాలే ఎక్కువ. అధికారంలో ఉన్నవారిపై వారి సహచరులు రాసే పుస్తకాల్లో అతిశయోక్తులే ఎక్కువగా ఉంటాయి. ఆ పుస్తకం రాయడానికి వారి అవసరమే తప్ప పాఠకులకు చదవడానికి పెద్దగా ఆసక్తి కలిగించే అంశాలు తక్కువే. ముఖ్యమంత్రి చేసే అభివృద్ధి కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్‌లో వివరించినట్టుగానే ఉంటాయి ఆయా నాయకుల అభిమానులు రాసే పుస్తకాలు.
కానీ వీటికి భిన్నంగా ఒక రకంగా సమకాలీన రాజకీయ నాయకులపై వచ్చిన పుస్తకాలన్నింటిలో కన్నా బాగుంది అనిపించేట్టుగా ఆకెళ్ల రాఘవేంద్ర దటీజ్ వైఎస్‌ఆర్ పేరుతో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గురించి రాశారు. రచయితకు వ్యక్తిత్వ వికాసంపై పలు పుస్తకాలు రాసిన అనుభవం ఉంది. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జీవితంపై జీవిత చరిత్రలా కాకుండా వైఎస్‌ఆర్‌లోని నాయకత్వ లక్షణాలను వివరిస్తూ వ్యక్తిత్వ వికాసం కోణంలో ఈ పుస్తకం రాసినట్టు రచయిత పేర్కొన్నారు. నాయకుడంటే ఇలా ఉండాలి అంటూ వైఎస్‌ఆర్ లక్షణాలు ప్రస్తావిస్తూ పరోక్షంగా ఇలా ఉండవద్దు అంటూ బాబు పేరు ప్రస్తావించకపోయినా మనకు అనేక సందర్భాల్లో బాబు గుర్తుకు వస్తుంటారు. కానీ ఒక చోట రచయిత చాలా సీరియస్‌గా వైఎస్‌ఆర్ గుణగణాలు ప్రస్తావించినప్పుడు ఆయన ఎంత సీరియస్‌గా చెప్పినప్పటికీ నవ్వు తెప్పిస్తుంది. అదే సందర్భంలో బాబు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. 1973లో ఎంబిబిఎస్ పూర్తికాగానే వైఎస్‌ఆర్ పులివెందులలోని ఆస్పత్రిలో డాక్టర్‌గా చేరారు. ఆ ఏడాది అంతా వైఎస్ పులివెందుల నుంచి జమ్మలమడుగుకి రోజూ ప్రైవేటు బస్సులో వెళ్లి వచ్చేవారు. బస్సులో కిటీకి పక్కన కూర్చోని భవిష్యత్తులో ఏం చేయాలి, గొప్పలీడర్‌గా ఎలా ఎదగాలి అని ఆలోచించే వారు. ఆ ప్రయాణంలో భాగంగా అక్కడ ఉండే కొండల్ని, గుట్టల్ని, బీడువారిని భూములను చూస్తూ ... ముద్దనూరు కొండలను తిలకిస్తూ తనకు మంచి రోజులు వస్తే ఎందుకూ పనికి రాని ఈ కొండలను ప్రయోజన కరంగా మార్చాలని వైఎస్ అనుకుంటూ ఉండేవాడు, సన్నిహితులతో అంటుండే వాడు. ఆ ఆలోచనలకు కార్యరూపమే నేటి బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం( పేజీ67) ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందే డాక్టర్‌గా ఉద్యోగం చేస్తూ ఇలాంటి ఆలోచన చేశారని రచయిత చెప్పడం కొంత ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు దీపం పథకం కింద గ్యాస్ పంపిణీ చేస్తూ మా అమ్మ కట్టెల పొయ్యి మీద వండుతూ ఆ పొగతో ఇబ్బంది పడ్డప్పుడు నేనీ పథకం గురించి ఆలోచించాను అని చెప్పుకోవడం ఈ సందర్భంగా గుర్తుకు వస్తుంది.
ఈ పుస్తకంలో రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబం గురించి జర్నలిస్టులకు కాంగ్రెస్ నాయకులకు సైతం తెలియని ఎన్నో విషయాలు రాశారు. టిడిపి చేసే ప్రచారం వల్ల రాజారెడ్డి అంటే కళ్లముందు కరుడు గట్టిన ఒక ఫ్యాక్షనిస్టుగానే కనిపిస్తారు. కానీ ఆయన సైన్యంలో పని చేశారు. 1930-40ల్లో బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా చేరాడు. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పని చేశారు. తరువాత పులివెందుల వచ్చి కొంత పొలం కొని స్థిరపడ్డారు. వైఎస్‌ఆర్ పూర్వీకులు హిందువులే. అప్పటి ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా మంది హిందువుల కుటుంబాలు క్రైస్తవం స్వీకరించాయి. అలానే వైఎస్‌ఆర్ పూర్వీకులు క్రైస్తవం స్వీకరిస్తే, గ్రామ బహిష్కరణ చేశారు. సహజంగా ఇలాంటి అంశాలు ఆసక్తికలిగిస్తాయి. వైఎస్ తండ్రికి కడప జిల్లాకు చెందిన కమ్యూనిస్టు నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. మాక్సిం గోర్కీ రాసిన అమ్మ పుస్తకాన్ని తన కుమారుడు రాజశేఖర్‌రెడ్డికి తండ్రి కొనిచ్చిన తొలి పుస్తకమట!
రాజశేఖర్‌రెడ్డిలో హస్యప్రియత్వాన్ని తెలిపే విషయాలు కూడా కొన్ని ప్రస్తావించారు. చిరంజీవిపై అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డిని కలిసినప్పుడు చర్చల్లో ఏ సినిమాలో చూశావమ్మా అని అడిగితే మగధీర అని ఆమె చెప్పినప్పుడు ఆయన నవ్వుతూ ఆడధీరవు అయ్యావు కదమ్మా అని జోకేయడం బాగుంది.
వైఎస్‌ఆర్ ఇంటిపేరు తెలుసు కానీ ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. వైఎస్ పూర్వీకుల ఇంటిపేరు - యెడుగూరివారు. కడప జిల్లా పులివెందుల తాలుకా బలపనూరు గ్రామంలో ఒక సందులోపలి ఇంటిలో ఉండేవారు. అందుకని ఊర్లోని వారంతా వారిని సందులోని ఇంటివారు అనేవారు. అలా అది సందింటివారు అని ఇంటిపేరుగా మారిపోయి యెడుగూరి సందంటి అని స్థిరపడిపోయింది. (48పేజీ) ఇలాంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి.
రచయిత ఈ పుస్తకాన్ని ఒక నాయకుడి జీవితాన్ని తెలుపుతూ వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే పుస్తకంగా తీర్చిదిద్దాలని ఎంత ప్రయత్నించినా, ఆ కోణంలో కన్నా ఒక నాయకుడిపై అభిమానంతో ఆయన గురించి రాసిన జీవిత చరిత్రగానే అనిపిస్తుంది. మనసిక విశే్లషణలతో గతంలో నరసింహారావు రేపు మాస పత్రికలో ఇందిరాగాంధీ, జలగం వెంగళరావు, ఎన్టీరామారావులపై చక్కని విశే్లషణలు రాశారు. వారు చేసిన చర్యల ద్వారా వారి మానసిక విశే్లషణ చేశారు. ఆ తరువాత రాజకీయ నాయకులపై అలాంటి విశే్లషణలు కనిపించలేదు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులపై వచ్చిన పుస్తకాలన్నింటిలో కన్నా బాగున్న పుస్తకమిది. వ్యక్తిత్వ వికాసం ఎలా ఉన్నా రాజశేఖర్‌రెడ్డి గురించి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలనుకునే ఆయన అభిమానులు తప్పక చదవాల్సిన పుస్తకం.
దటీజ్ వైఎస్‌ఆర్
రచన: ఆకెళ్ల రాఘవేంద్ర
పేజీలు 418, వెల: రూ. 280/-
ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర
అన్ని బ్రాంచుల్లో