28, డిసెంబర్ 2018, శుక్రవారం

దేవుళ్లూ.. పారాహుషార్..!


‘‘నన్ను డిస్ట్రబ్ చేయకు.. నేనో భారీ ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నా..’’
‘‘ఏంటా ప్రాజెక్ట్? గరీబీ హఠావో అని ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించే ప్లాన్ చేస్తున్నావా?’’
‘‘అలాంటి దురాశ నాకేం లేదు. మనం పేదరికంలో మగ్గిపోవాలన్నా, సంపన్నులం కావాలన్నా అది ప్రభుత్వం చేతిలో లేదు.. మన మెదడులోనే ఉందనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మేవాడ్ని.’’
‘‘మరింకేం చేస్తున్నావ్?’’
‘‘చూడోయ్.. మనం ఇలానే నిర్లక్ష్యంగా ఉంటే అంతా మన చేయి దాటి పోతుంది. దెబ్బ తాకినప్పుడు పసుపు రాయడం మన అమ్మమ్మల కాలం నుంచి మనకు అలవాటే కదా? అమెరికా వాడు పసుపు, వేపగింజల మీద పేటెంట్ పొందేంత వరకు మనం మేల్కోలేదు. వాడికి పచ్చిపులుసు సంగతి తెలియదు కాబట్టి బతికి పోయాం. లేదంటే మామిడి కాయ సోగి, పచ్చిపులుసు, చింతకాయ తొక్కు, మాగాయ, ఆవకాయ, గోంగూర చట్నీ, పుంటికూర తొక్కు పేరేదైతేనేం.. ‘అన్నీ మావే’ అని పేటెంట్ హక్కులు పొందేవాడు.’’
‘‘అంటే నువ్విప్పుడు పచ్చిపులుసు, పుంటికూర తెలుగు వాడి హక్కు అని ప్రపంచానికి చాటి చెప్పదలుచుకున్నావా?’’
‘‘కాదు.. అంతకన్నా మహత్తర కార్యంలో ఉన్నా..’’
‘‘ఊరించక అదేంటో చెప్పు?’’
‘‘హనుమంతుడు మా కులం అంటే మా కులం అని ఇప్పటికే ఉత్తరాదిలో చాలా రాష్ట్రాలు, పార్టీలు, నాయకులు పోటీ పడుతున్నారు?’’
‘‘ఔను.. నేనూ చూశా మీడియాలో.. హనుమంతుడు, జాంబవంతుడు, రామలక్ష్మణులు, శబరి మా వారంటే మా వారని వాదులాడుకుంటున్నట్టు మీడియాలో చూశా. ఐతే నువ్వేం చేస్తావ్’’
‘‘ఆ మధ్య శ్రీకృష్ణదేవరాయల పాలన ఐదు శతాబ్దాల ఉత్సావాల సందర్భంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి పాలక సామాజిక వర్గాల వారు కర్నాటక వెళ్లి- కృష్ణదేవరాయల వంశస్తులను కలిసి మీరు మా కులం అంటే మా కులం అని చెప్పండని పోటీ పడ్డారట! అధికార వర్గంలో, ఉన్నత పదవుల్లో ఉన్న ఆ సామాజిక వర్గాల ప్రతినిధి బృందం శ్రీకృష్ణ దేవరాయలను తమ వర్గంలో కలుపుకోవడానికి పడుతున్న తపన చూసి కర్నాటకలోని శ్రీకృష్ణదేవరాయల వంశస్తులు విస్తుపోయారు’’
‘‘ఔను.. దాదాపు దశాబ్దం క్రితం ఈ వార్త నేనూ చదివాను. దానిపై పరిశోధన చేస్తున్నావా? రాయలు ఆ రెండు సామాజిక వర్గాలకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వారని పరిశోధన జరుపుతావా?’’
‘‘అలా అని నేను చెప్పానా?’’
‘‘చరిత్రను తిరగరాస్తామంటే ఇదేనేమో? యుద్ధంలో విజయం సాధించిన వారు రాసిందే చరిత్ర కదా? ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారినట్టు చరిత్ర కూడా మారితే భలే ఉంటుంది కదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారు- ఐదు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న వారు రాసింది తప్పుడు చరిత్ర, కొత్త చరిత్ర రాస్తాం అంటున్నారు’’
‘‘అధికారంలోకి వచ్చిన వారికి దేశచరిత్రను తిరిగి రాసే అధికారం ఉన్నట్టుగానే రాష్ట్రా ల్లో అధికారంలోకి వచ్చిన వారికి రాష్ట్ర చరిత్రను తిరిగ రాసే అధికారం ఉండాలి.’’
‘‘నువ్వేదో సరదాగానే అంటున్నా- కొందరు ఈ పని చేస్తూనే ఉన్నారు.’’
‘‘ఔను.. పాలనకు పనికిరారని దించేసిన వారినే విగ్రహాలుగా పెట్టి పూజిస్తూ, ప్రజలంతా పూజించాలని చెబుతున్నారు’’
‘‘వర్మ సినిమా గురించా?’’
‘‘కాదు- జరిగిన చరిత్ర గురించి’’
‘‘ఆ సంగతి వదిలేయ్.. ఇంతకూ నీ భారీ ప్రాజెక్ట్ ఏంటో చెప్పనేలేదు’’
‘‘మనం అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం అని చెబుతూనే ఉన్నాను. వెంకన్న మందిరాలు ఎన్నున్నా వెంకన్న ఆలయం అనగానే తిరుపతి గుర్తొస్తుంది కదా? అలానే ఊరూరా రామాలయాలున్నా దేశంలో శ్రీరాముని ఆలయానికి భద్రాచలం ప్రఖ్యాతి కదా? ’’
‘‘కాదని ఎవరన్నారు? రాష్ట్ర విభజన తరువాత భద్రాచలం తెలంగాణకు వచ్చిందని, ఆంధ్రలోని ఒంటిమిట్ట రామాలయంలో వేడుకలు నిర్వహిస్తున్నారు కదా?’’
‘‘దాని గురించి కాదు. శ్రీరాముడిని కమలం పార్టీ వాళ్లు ఓన్ చేసుకుని రెండు సీట్ల నుంచి అధికారం వరకు ఎగబ్రాకారు. ఇప్పుడు మరోసారి శ్రీరాముని దయచేతను- అని చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ’’
‘‘నిజమే- మన భద్రాది రాముడిని ఉత్తరాది రాముడిగా మార్చేశారు.’’
‘‘అందుకే చెబుతున్నా.. ఇప్పటికైనా మనం కళ్లు తెరిచి మిగిలిన దేవుళ్లపై దృష్టి సారించాలి. ’’
‘‘అంటే ఏం చేయాలి’’
‘‘దేవుళ్లను మనం కాపాడుకోవాలి’’
‘‘నీకేమన్నా పిచ్చా? కష్టం వస్తే దేవుళ్లకు మొక్కుకుంటాం. మనల్ని కాపాడమని వేడుకుంటాం. మనం దేవుళ్లను రక్షించుకోవడం ఏంటి?’’
‘‘మరదే.. ఇప్పటికే కొంతమంది దేవుళ్లు మన చేతిలో నుంచి దాటి పోయారు. ఏ దేవుడు ఏ కులమో ఉత్తరాది వాళ్లు తేల్చేస్తున్నారు. దక్షిణాదికి న్యాయమైన వాటా ఇవ్వాలనే ఆలోచన కూడా చేయకుండా దేవుళ్లను ఆయా కులాల వాళ్లు పంచుకుంటున్నారు. అసలే ఎన్నికల కాలం.. ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉంటే దేవుళ్లను ఆ కోటా కింద వేసేస్తున్నారు. మనం వౌనంగా ఉంటే అన్యాయమై పోతాం. ’’
‘‘దానికి మనమేం చేస్తాం?’’
‘‘మనకు ముక్కోటి దేవుళ్లు ఉన్నారు కదా? అందరి పేర్లు సేకరించి..’’
‘‘మొన్న మా మనవడు కౌరవులంటే వంద మంది సోదరులు కదా? 97వ సోదరుడి పేరు చెప్పమని అడిగితే తెల్లమొఖం వేశాను. దుర్యోధనుడి పేరు, ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల వల్ల దుశ్శాసనుడి పేరు తప్ప ఇంకో పేరు తెలియదన్నాను. నువ్వు ముక్కోటి దేవుళ్ల పేర్లు సేకరిస్తావా? సేకరించి ఏం చేస్తావ్?’’
‘‘ప్రజల్లో సామాజిక చైతన్యం పెరిగింది. ప్రతి సామాజిక వర్గం తమకో ఫవర్‌ఫుల్ దేవుడు ఉండాలని కోరుకుంటోంది’’
‘‘ఐతే నువ్వేం చేస్తావ్?’’
‘‘ముక్కోటి దేవుళ్ల పేర్లను మనమే రిజిస్టర్ చేయించుకుంటాం. వారిపై సర్వ హక్కులు మనకే ఉంటాయి. ఎవరైనా- తమ సామాజిక వర్గానికి ఓ దేవుడు కావాలంటే కేటాయించే అధికారం మన చేతిలోనే ఉంటుంది. అంటే- మనం చెప్పిన ధర చెల్లించి దేవుడిని కోనుక్కోవాలి’’
‘‘అంటే దేవుళ్లను అమ్ముకుంటావా?’’
‘‘మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉంటే దాన్ని అమ్ముకోవాలి. ఈ వ్యాపారానికి ముక్కోటి దేవుళ్ల ఆశీస్సులు నాకుంటాయి. ఏ మంటావ్?’’
‘‘దేవుళ్లూ పారాహుషార్. మిమ్మల్ని కూడా అమ్మేసుకుంటారని అంటాను’’
*బుద్దామురళి (జనాంతికం 28-12-2018)

24, డిసెంబర్ 2018, సోమవారం

ఇది కేసీఆర్ శతాబ్దం

ఈశతాబ్దం నాది అని సాహి త్యంలో మహా కవి శ్రీశ్రీ ప్రకటించుకున్నారు. తెలుగు సాహి త్యంలో శ్రీశ్రీ ప్రకటింకున్నట్టుగానే తెలుగు రాజకీయాల్లో ఈ శతాబ్దం నాది అని ప్రకటించుకునే ధైర్యం ఒక కేసీఆర్‌కే ఉన్నది. తెలుగు రాజకీయాల్లో ఈ శతాబ్దం నాది అని సగౌరవంగా ప్రకటించుకునే అవకాశం ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉన్నది. శ్రీశ్రీ కన్నా ముందు, తర్వాత టన్నులకొద్దీ సాహిత్య సృష్టి జరిగింది, జరుగుతున్నది. కానీ ఒక్క మహా ప్రస్థానంతో శ్రీశ్రీ ఈ శతాబ్దం నాది అని ప్రకటించుకోగలిగారు. వందేండ్లలో దాదాపు 80 ఏండ్ల పాటు తెలంగాణ ఎన్నో ఉద్యమాలను చూసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నుంచి నేటిదాకా అనేక పోరాటాలు ఈ నేల చూసింది. ముల్కీ ఉద్యమం 1955లోనే ఆంధ్రప్రదేశ్‌లో విలీనానికి వ్యతిరేకంగా సాగింది మొదలు 1969 తెలంగాణ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం వంటి ఎన్నో ఉద్యమాలు చూసింది. తెలంగాణలో సాగిన ఈ ఉద్యమాల అనుభవాలు, ఫలితాలను అధ్యయనం చేసి 2001లో శ్రీకా రం చుట్టిన తెలంగాణ ఉద్యమం విజయతీరాలను తాకి తెలంగాణ కలను సాకారం చేసింది. ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేయడం ద్వారా కేసీఆర్ ఈ దశాబ్దం నాది అని సగౌరవంగా ప్రకటించుకోవచ్చు.

దేశానికి భూసంస్కరణల ఆలోచన కలిగించిన నేల ఇదే. భూదాన ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నేల ఇదే. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్ట్టెక్కించి ఆర్థిక సంస్కరణల ద్వారా ఆధునిక భారతానికి దారులు వేసిన పీవీ నర్సింహారావు పాలనా పాఠాలు నేర్చుకున్నది ఇక్కడే. ఇవన్నీ ఈ దశాబ్ద కాలంలోని అపురూప దృశ్యాలు, దేశ గతిని మార్చిన పరిణామాలు. అయితే వందేండ్ల తెలంగాణ చరిత్ర చూస్తే ఈ దశాబ్దం నాది అని ప్రకటించుకు నే అవకాశం చరిత్ర కేసీఆర్‌కే ఇచ్చింది. వందేండ్ల తెలంగాణ చరిత్ర పరిశీలిస్తే ఈ వందేండ్లు కూడా పలు కీలక ఉద్యమాలతోనే గడిచింది. అయితే వీటిలో 2001లో మొదలైన తెలంగాణ ఉద్యమం మాత్రమే విజయం సాధించింది. తెలంగాణ సాకారం కావడమే కాదు, ఉద్యమనేతగా కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. మొద టి గెలుపును సెంటిమెంట్ అనుకుంటే, ఇప్పుడు పాజిటివ్ వేవ్‌తో రెండవసారి ఘన విజయం సాధించారు. 2014లో తెలంగాణ సాకారమైన తర్వాత 63 స్థానాల్లో విజయం సాధిస్తే, 2018లో 88 స్థానాల్లో విజయం సాధించారు. సంక్షేమ పథకాల్లో అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు.

ఆధునిక తెలంగాణకు వందేండ్ల క్రితమే పునాదులు పడ్డాయి. సిర్పూర్ పేపర్ మిల్లు, బోధన్ చెక్కర ఫ్యాక్టరీ, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం స్టేట్ రైల్వే వంటితో నాడే పారిశ్రామికాభివృద్ధికి పునాదులు పడ్డాయి. ఆధునిక తెలంగాణ సృష్టికర్తను నేనే అని ఎన్నికల ప్రచారంలో బాబు అహంకారంతో ప్రకటనలు చేసినా 1920 నాటికే తెలంగాణ లో ఆధునిక తెలంగాణకు పునాదులు పడ్డ విషయం చారిత్రక సత్యం.1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలం గాణ విలీనం తర్వాత ఈ ప్రాంతం అనుభవించిన వివక్ష, అణిచివేతలు అంతా ఇంతా కాదు. అప్పటినుంచి ఏదో రూపంలో తెలంగాణ తన అస్తి త్వం నిలుపుకోవడానికి ఉద్యమిస్తూ నే ఉన్నది. 2014లో ఆ కల నెరవేరింది. ఈ కల సాకారం చేయడానికి జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా కేసీఆర్‌కు ఈ శతాబ్దం నాది అని చెప్పుకునే ఘనతను చరిత్ర కట్టబెట్టింది.1982లో హైదరాబాద్‌లోనే ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఒక సంచలనం. యువతకు రాజకీయాల్లో అవకాశాలు దక్కాయి. ఎన్టీఆర్ గ్లామర్ వల్ల రాజకీయాలు సామాన్యులకు చేరువ అయినా తెలంగాణకు పెద్దగా ప్రయోజనం కలుగలేదు. పైగా 19 83 నుంచే ఆంధ్ర నుంచి బలమైన సామాజికవర్గం హైదరాబాద్‌కు వలస రావడం బాగా పెరిగిపోయింది. తెలంగాణ పల్లె భూములు, హైదరాబాద్ పరిసరాల్లోని విలువైన భూములు ఆ వర్గం చేతిలోకి వెళ్లాయి. వైయస్ రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభానికి చేవెళ్లకు వచ్చిన వారు అక్కడి భూములు చౌకగా లభించడం చూసి విస్తుపోయారంటే తెలంగాణ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు.
Kautilya
ఈ పరిణామాలన్నింటి మధ్య పుట్టిన తెలంగాణ ఉద్యమం విజయ తీరాలకు చేరుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడటమే కాదు పాలనలోనూ కొత్త పుంతలు తొక్కుతున్నది. రైతులకు నేరుగా నగదు అందజేయడం విషయంలో దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నది. రుణమాఫీ కన్నా నగదు సహాయం అందించే రైతుబంధు మేలు అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. తెలంగాణలో విజయం సాధించిన కేసీఆర్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు సమాయత్తమవటం ముదావహం.
ఒకప్పుడు ఆర్థిక సంస్కరణల్లో తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు దేశానికి దారిచూపితే, అదే దారిలో ఇప్పుడు దేశ రాజకీయాల్లో కేసీఆర్ రూపంలో తెలంగా ణ మరోసారి తన ప్రభావం చూపనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు చివరి దశలో ఉన్నది. అది పూర్తయితే సగం తెలంగాణ సమస్యలు తీరుతాయి. ఇప్పుడు నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులు రెండేండ్లలో పూర్తి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో అమలు జరుగుతున్న రైతుబంధు పథకం అందరికీ ఆద ర్శంగా నిలుస్తున్నది. ఈ పథకాన్ని అమలుచేయనున్న ట్టు ఇప్పటికే ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ప్రకటించాయి. నిఖార్సయిన తెలంగాణ రాజకీయాల్లో, పాలనలో మానవీయ కోణం ఉన్నది. అది పీవీ ఆర్థిక సంస్కరణ ల్లో అయినా కేసీఆర్ చెబుతున్న గుణాత్మక మార్పు అం శంలోనైనా.. ఇదే గమనించవచ్చు. వందేండ్ల తెలంగాణ రాజకీయ చరిత్రలో కచ్చితంగా ఈ దశాబ్దం నాది అని చెప్పుకునే విశిష్టత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుంది. కేసీఆర్ తప్పకుండా తెలంగాణ యుగపురుషుడు. తెలంగాణ సమాజానికి ఓ వెలుగుదారి. భవిష్యత్ దిక్సూచి.
నమస్తే తెలంగాణ 23-12-2018)



సంపద బ్లూప్రింట్

మీ సంపద బ్లూ ప్రింట్ ఎలా ఉందో మీరు చూసుకున్నారా? అదేంటి అనుకుంటున్నారా?
ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు ముందుగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాం. అదొక్కటే కాదు. ఒక పని ప్రారంభించేందుకు, ఒక పరిశ్రమ ప్రారంభించేందుకైనా ముందుగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటారు. గృహ నిర్మాణం కోసం బ్లూ ప్రింట్ అంటే సరే కానీ సంపదకు సంబంధించిన బ్లూ ప్రింట్ ఏమిటి? చిత్రంగా అనిపిస్తుంది కదూ? నిజమే డాక్టర్ హార్వ్ సీక్రేట్ ఆఫ్ మిలియనీర్ మైండ్ పుస్తకంలో సంపద బ్లూ ప్రింట్ గురించి వివరించినప్పుడు ఇలానే అనిపించింది. ఐతే సామాన్యులకు ఇది చిత్రంగా అనిపించవచ్చు. కానీ సంపన్నులు మాత్రం సరైన బ్లూ ప్రింట్ ద్వారానే తాను అనుకున్న స్థాయికి, కోరుకున్న స్థాయికి ఈ బ్లూ ప్రింట్ ద్వారా చేరుకుంటారు.
సంపదకు సంబంధించి మన సాధించే విజయాలకు సంబంధించి మన ఆలోచనలు, మన లక్ష్యాలు, డబ్బుకు సంబంధించి మన ఆలోచనల రూపమే ఈ బ్లూ ప్రింట్.
పేదలు, సంపన్నులు, విజేతలు, పరాజితులు అనే తేడా లేదు. అందరికీ అంతర్లీనంగా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. దానికి తగ్గట్టే వారి జీవిత గమనం సాగుతుంది. దానికి తగ్గట్టే ఫలితాలు ఉంటాయి. నేను ఐఎఎస్‌ను కావాలి అని నిరంతరం మనసులో అనుకుంటూ తాను మాత్రం రోజూ సినిమాలు, క్రికెట్ చుట్టూ తిరిగితే ఐఎఎస్ కావడం మాట దేవుడెరుగు పదో తరగతి గట్టెక్కడమే కష్టం అవుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకోవడమే కాదు దాన్ని చేరుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించే వారికే లక్ష్యం చేరువ అవుతుంది.
* * *
సంపన్నులు, పేదలు కాదు. ప్రతి ఒక్కరికీ సంపదకు సంబంధించిన బ్లూ ప్రింట్ ఉంటుంది. ఐతే అది మనసులో నిక్షిప్తమై ఉంటుంది. బయటకు కనిపించక పోవచ్చు. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన విజయాలు అన్నీ ఈ బ్లూ ప్రింట్‌కు అనుగుణంగానే జరుగుతుంటాయి. సంపన్నుడు, పేదవాడు ముందు ఆలోచనల నుంచే పుడతాడు. ఆలోచనలను ఆచరణలో పెట్టినప్పుడు ఫలితమే పేదరికం, సంపద. ఈ రెండు కూడా ఆలోచనల నుంచే పుడతాయి. పేద ఆలోచన నుంచి పేదరికం పుడుతుంది. సంపన్నమైన ఆలోచన నుంచి సంపద పుడుతుంది.
ఇటీవల సామాజిక మాధ్యమంలో కొందరి జీవితాలు ఇంతే అంటూ ఒకతను నిరాశాపూరితంగా తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ స్థితి నుంచి బయటకు వచ్చి పాజిటివ్ దృక్ఫథంతో ఆలోచించి ముందడుగు వేస్తే పేదరికాని దూరం కావచ్చునని, అలా బయటకు వచ్చిన వారి గురించి మరో వ్యక్తి వివరిస్తుంటే పూర్తిగా నిరాశలో మునిగిపోయిన ఆ వ్యక్తి మాత్రం పాజిటివ్‌గా ఎవరేం చెప్పినా దానికి నిరాశాపూరితంగానే స్పందించ సాగాడు. అంబానీ లాంటి వారు సామాన్య ఉద్యోగిగానే జీవితాన్ని ప్రారంభించి, వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించారో వివరిస్తే, అతను కొందరికి లిఫ్ట్ ఇచ్చే వారుంటారు. అలాంటి వారు ఎదుగుతారు. కానీ మా లాంటి వారికి అంటూ అదే విధంగా పేద ఆలోచనలను బయటపెడుతూనే ఉన్నారు. మనసు నిండా పేదరికం, నెగిటివ్ ఆలోచనలు నింపుకున్న ఇలాంటి వారు మారడం అంత సులభం కాదు. ఐతే అసాధ్యం కాదు. ఈ జీవితం ఇంతే అని నిరాశను నింపుకున్న వారి జీవితాలు నిజంగా పేదరికంలోనే సమస్యల్లోనే ముగుస్తాయి.
మన మనసులో రూపుదిద్దుకునే బ్లూ ప్రింట్ వెనుక మన జీవిత చరిత్ర ఉంటుంది. తల్లిదండ్రుల మాటలు, వారి ప్రవర్తన, కుటుంబం, బంధువులు, చిన్నప్పటి నుంచి మన స్నేహితులు, మనకు తెలిసిన వారు అంటే మన జీవితంపై ప్రభావం చూపించే అందరి ప్రభావం మన బ్లూ ప్రింట్‌పై ఉంటుంది.
‘డబ్బు పాపిష్టిది, ధనవంతులు పాపాత్ములు, తప్పుడు పనులు చేస్తేనే సంపద చేకూరుతుంది. ఎంత సంపద ఉంటే అంతే తప్పులు చేసినట్టు, గుణ వంతున్ని కాబట్టి నా వద్ద డబ్బు లేదు. విలువలకు పాతర వేస్తే నేనూ సంపన్నుడిని అయ్యే వాడిని ’ అనే ఇలాంటి మాటల ప్రభావం బాల్యం నుంచి మనపై బలంగా ఉంటుంది. పేదరికంలో ఉండిపోవడానికి మన అసమర్థతే కారణం అని అంగీకరించడానికి మన మనసు ఒప్పుకోదు. పైగా మనం చాలా నిజాయితీ పరులం కాబట్టే పేదరికంలో ఉండిపోయామని చాలా మంది అనుకుంటారు. ఏ ప్రాంతం, ఏ కుటుంబం, ఎక్కడ పుట్టాలి అనేది మన చేతిలో లేకపోవచ్చు. కానీ వీటికి అతీతంగా మన కృషితో మనం ఎదగవచ్చు అనే ఆలోచన మనలో లేకపోతే అది ముమ్మాటికీ మనదే తప్పు.
బాల్యం నుంచి సంపద గురించి ఇలాంటి తప్పుడు అవగాహన వల్ల సంపదపై వ్యతిరకేక బావం మనలో ఏర్పడుతుంది. మన ఆలోచనలు, మన పనితీరు కూడా దీనికి తగ్గట్టే ఉంటుంది. ఫలితాలు కూడా దీనికి తగ్గట్టుగానే వస్తుంది.
సంపద చెడ్డది అనే అభిప్రాయం తప్పు. సంపన్నులంతా తప్పు చేసిన వారు కాదు. నేను కూడా సంపన్నున్ని కావాలి అనే ఆలోచన ఉంటే మన సంపద బ్లూ ప్రింట్‌ను సమీక్షించుకోవాలి. మనం వెళుతున్న దారి సరైనదే అనే అభిప్రాయం బలంగా ఉంటే అలానే కొనసాగించాలి. లేదు. నీతి తప్పకుండా సంపన్నులు కావచ్చు. మన ఆలోచనలతో సంపన్నులు కావచ్చు. సంపన్నులు కాకపోయినా కనీసం పేదరికంలో మగ్గిపోవద్దు అనుకుంటే సంపద బ్లూ ప్రింట్‌ను మార్చుకోవాలి.
బ్లూ ప్రింట్‌ను మార్చుకున్నప్పుడు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. చిన్న ఉద్యోగంలో ఉన్నామా? చిన్న ఉద్యోగంలో ఉన్నామా అనే తేడా లేదు. మనం ఎదగాలి అనే భావన బలంగా ఎప్పుడు ఏర్పడితే అప్పుడు అవకాశాలు కనిపిస్తాయి. అన్ని పాపాలకు డబ్బే కారణం అనే భావనే తప్పు పుణ్య కార్యాలకు సైతం కావలసింది డబ్బే. మన ఆలోచనలకు అనుగుణంగానే మన చర్యలు ఉంటాయి. మన చర్యలకు తగినట్టుగానే మనకు ఫలితాలు ఉంటాయి.
వడ్డీ రేట్లు, స్టాక్ మార్కెట్, ధరల పెరుగుదల, వడ్డీ, వ్యాపారం, ఇవన్నీ పైకి కనిపించేవి. కానీ సంపద సమకూరడానికి పైకి కనిపించే వీటి కన్నా కనిపించని ఆలోచనల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఒక మనిషి సంపన్నుడిగా ఎదిగినా, పేదవాడిగా మిగిలిపోయినా పైకి కనిపించే వాటి కన్నా కనిపించని వాటి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పైకి కనిపించని ఆలోచనలే కీలక పాత్ర వహిస్తాయి. జీవితంలో ఏ స్థాయిలో ఉండదలిచాం. ఎంత సంపాదించాలని అనుకుంటున్నాం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ విధంగా కృషి చేయాలి. అనే అంశాలతో కొత్త బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. మన ఆలోచనలు ఏ తీరుగా ఉన్నాయో సమీక్షించుకుని , ఏ దశలో ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నామో దానికి తగినట్టు కొత్త బ్లూ ప్రింట్ రూపొందించుకుందాం. విజయాన్ని చవి చూద్దాం.
-బి.మురళి(23-12-2018)

21, డిసెంబర్ 2018, శుక్రవారం

ఈ నల్లని రాలలో ఏ వ్యూహం దాగెనో

ఈరోజుల్లో కూడా అంతటి మహానుభావులు ఉన్నారంటే నమ్మలేం. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో మోసిన శ్రవణుడి గురించి పురాణాల్లో విన్నాం, తల్లిదండ్రులను దేవతల విగ్రహాలుగా మలిచిన కలియుగ శ్రవణుడిని మీ వీధిలో చూశా..’’
‘‘దేని గురించి ?’’
‘‘మీ ఇంటికి వస్తుంటే మూలమలుపు మీద శ్రావణ్ కుమార్ అనే నేమ్ ప్లేట్ ఉన్న ఇంటిని, ఇంటి ముందున్న విగ్రహాలను చూశాను’’
‘‘బుక్‌పై కవర్‌ను చూసి బుక్‌ను అంచనా వేయవద్దన్నట్టు, ఇంటి ముందు విగ్రహాలను చూసి ఇంటి యజమానిని అంచనా వేయవద్దు’’
‘‘మంచితనాన్ని కూడా మెచ్చుకోలేక పోవడం బాగాలేదోయ్.’’
‘‘శ్రావణ్ ఇంటి విగ్రహాల గురించి నీకు తెలుసా?’’
‘‘విగ్రహాల సైజు ఎంత? వాటి కోసం ఎంత ఖర్చు చేశాడని కాదోయ్. చనిపోయిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను తయారు చేయించాలనే అతని పెద్దమనసును చూసి మెచ్చుకోవాలి’’
‘‘వారి తల్లిదండ్రులు చనిపోయారని నీకెవరు చెప్పారు? నగరంలోని ప్రముఖ వృద్ధాశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూ, దేవుడా మమ్మల్ని పైకి ఎప్పుడు తీసుకుపోతావా? అని ఎదురు చూస్తున్నారు’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘అందుకే చెప్పా.. రాజకీయాలతో నాకేం పని అనుకుంటే ఏదీ అర్థం కాదు. రాజకీయాలను దగ్గరి నుంచి పరిశీలించాలి.’’
‘‘రాజకీయాలకు, విగ్రహాలకు సంబంధం ఏమిటి?’’
‘‘దేవుని దయవల్ల నిండా నూరేళ్లు బతికిన కరుణానిధి తన జీవిత కాలమంతా విగ్రహారాధనను వ్యతిరేకించారు. చివరకు ఆయన పోయాక మొన్న చెన్నైలో కుమారుడి నాయకత్వంలో విగ్రహం ఏర్పాటు చేశారు. కూటముల నాయకులు చాలా మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.’’
‘‘ఔను.. ఐతే..?’’
‘‘సర్దార్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు ముందు ప్రపంచంలో అత్యంత పెద్ద విగ్రహం ఎవరిదో తెలుసా? బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధునిది. విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపిస్తే, ప్రపంచంలోకెల్లా ఎత్తయిన విగ్రహం ఆయనదే కావడం వింతగా లేదు’’
‘‘ఔను! ఐతే?’’
‘‘హఠాత్తుగా పటేల్ భారీ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? స్వాతంత్య్ర పోరాటం కాంగ్రెస్ నేతృత్వంలో జరగడం, దేశభక్తులంతా కాంగ్రెస్ జాబితాలోనే ఉండిపోవడంతో, గాంధీ, నెహ్రూలను పక్కకు పంపి పటేల్‌ను తమ పార్టీలో చేర్పించుకోవడానికి భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. ’’
‘‘నిజంగా ఇది వింతే.. ఐదేళ్ల కోసం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే వాళ్లు ఏడాది రెండేళ్లు కూడా గెలిపించిన పార్టీలో ఉండకుండా పార్టీ మార్చేస్తున్నారు. కానీ ఆరు దశాబ్దాల క్రితం మరణించిన పటేల్‌ను పార్టీ మార్చి తమ పార్టీలో చేర్చుకోవడం వింతే!. ఈ రోజుల్లో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నో జి మ్మిక్కులు చేస్తారు. విగ్రహాలకు, రాజకీయాలకు, శ్రావణ్ కుమార్ ఇంటి ముందు వాళ్ల అమ్మానాన్నల విగ్రహాలకు సంబంధం ఏమిటి?’’
‘‘ఆకలికి నకనకలాడే వారు ఎంతో మంది ఉండగా, వేల కోట్ల ఖర్చుతో పటేల్ విగ్రహం ఏర్పాటు చేస్తారా? అని తీవ్రంగా విమర్శించారు. నవ్యాంధ్రలో ఎన్టీఆర్ భారీ విగ్రహం నిర్మిస్తున్నారు. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం కలిగినట్టు- అదేదో ఆఫ్రికా దేశం వారికి హఠాత్తుగా గాంధీజీ విగ్రహం చూడగానే జ్ఞానోదయం కలిగి.. గాంధీ మహాత్ముడిలో జాతి వివక్ష కనిపించగా- అతని విగ్రహాన్ని తొలగించారట! ’’
‘‘ఔను మీడియాలో చూశాను.’’
‘‘మరి దీని గురించి ఏమంటావు?’’
‘‘ఆఫ్రికా సంగతి మనకెందుకు కానీ.. ఎన్టీఆర్ విగ్రహం గురించి తెలుసు?’’
‘‘విమర్శలు వచ్చినా విననంత గాఢమైన ప్రేమ ఎన్టీఆర్‌పై ఉందంటావా?’’
‘‘ఆ మాట నేనెక్కడన్నాను. అసలే ఎన్నికల కాలం. తెలంగాణలోనేమో ముందస్తుకు వెళ్లి మళ్లీ కుర్చీపై ధీమాగా కూర్చున్న కేసీఆర్- చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నారు. ఇటు కేసీఆర్ ఇలా చెలరేగిపోతుంటే, అటు బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఆందోళన ఎలా ఉన్నా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడాలి కదా? ఎన్టీఆర్ అభిమానుల మద్దతు సంపాదించేందుకు విగ్రహానికి భారీ స్కెచ్ వేసినట్టుంది. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే.’’
‘‘ఎన్టీఆర్‌ను గద్దె దించి, మానసిక క్షోభకు గురి చేసి పైకి పోయేట్టు చేసిన వారే విగ్రహం ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా లేదా?’’
‘‘రాజకీయం అన్నాక అన్నీ ఉంటాయి. మరి ఎంతో కాలం నుంచి అధికారంపై కనే్నసి ఉంచితే మధ్యలో చిన్నరాణి వచ్చి అధికారం లాగేసుకునేట్టు ఉంటే ఊరుకుంటారా? పుష్కరాలకు ఏకంగా దేవుడి రూపంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తేనే జనం ఆదరించారు. ఇప్పుడు పటేల్ విగ్రహంతో పోటీ పడి ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పే ముంది? పర్యాటక రంగం వృద్ధికీ ఉపయోగపడుతుంది. ’’
‘‘అంతే అంటావా?’’
‘‘అంతే.. నువ్వు శ్రావణ్ కుమార్ తల్లిదండ్రుల విగ్రహాల గురించి తప్ప అన్నీ చెబుతున్నావ్’’
‘‘ సరే చెబుతా.. శ్రావణ్‌కుమార్ తండ్రి బాగా సంపన్నుడు. ఆయన సంపాదన అంతా కష్టార్జితమే. పిల్లలకు అప్పనంగా ఆస్తి ఇస్తే బయటకు పంపిస్తారనే లోకజ్ఞానం ఉన్నోడు. దాంతో శ్రావణుడు బాగా ఆలోచించి తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేయించాడు. బతికుండగానే తమ విగ్రహాలను చేయించిన కుమారుడిని చూసి తల్లిదండ్రుల ఆనందానికి అంతు లేదు..’’
‘‘ఆ తర్వాత?’’
‘‘ఆ తన్మయత్వంలో ఆస్తి మొత్తం కుమారుడికి అప్పగించారు’’
‘‘ఆ?..’’
‘‘ఆస్తి ఇచ్చాక తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో, వారి విగ్రహాలు ఇంటి ముందు.. ఇదే- ఆ ఇంటిముందున్న విగ్రహాల కథ’’
‘‘ఆ..??’’
‘‘విగ్రహాలను చూడగానే- ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో అని పించింది సినారెకు.. అద్భుతమైన శిల్ప సంపదను చూడగానే ఆ మహాకవికి అలా అనిపించడం సహజమే.. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ రాజకీయ విగ్రహాలే. అవసరాల కోసం పుడుతున్న విగ్రహాలే. రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తే, ఏ విగ్రహం వెనుక ఏ వ్యూహం దాగుందో తెలుస్తుంది. శ్రావణుడు రాజకీయాలను బాగా వంటబట్టించుకున్నాడు. అతనికి రాజకీయాలు తెలుసు కాబట్టి విగ్రహాలతో తండ్రి ఆస్తి స్వాహా చేశాడు .  ఆస్తి తప్ప రాజకీయాలు తెలియకపోవడంతో అతని తండ్రి శేష జీవితం వృద్ధాశ్రమం పాలైంది.’’
* బుద్ధామురళి (జనాంతికం 21-12-2018)


17, డిసెంబర్ 2018, సోమవారం

ఏ గట్టునుంటారు?

సంపన్నుల గురించి చాలా మంది ఆలోచనలు చిత్రంగా ఉంటాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ కనిపించింది. ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఇల్లు కట్టిన అంబానీది, 80 గజాల స్థలంలో ఇల్లు కట్టిన నాదీ ఒకే దేశమా?
న్యూజిలాండ్‌లో షాపింగ్ కోసం 350 కోట్లతో చార్టర్డ్ ఫ్లైట్ కొన్న నీతూ అంబానీది, షాపింగ్ కోసం ఆటో ఎక్కాలా ? వద్దా అని ఆలోచించే మా అమ్మది ఒకే దేశమా?
సెవెన్ హిల్స్ హాస్పటల్‌లో ఐదు లక్షల బిల్లు కట్టి డెలివరీ అయిన ఐశ్వర్యారాయ్‌ది, నిర్మల ఆస్పత్రిలో ముక్కి ముక్కి ఐదువేల బిల్లు కట్టిన నా భార్యదీ ఒకే దేశమా?
ఇలా సాగుతుంది ప్రశ్నల పరంపర. చాలా మంది అంబానీ అలా ఎదిగిపోవడానికి, మనం సామాన్య జీవితం గడపడానికి కారణం ఈ వ్యవస్థ, ప్రభుత్వం లేక ఇంకోటి ఏదో అనుకుంటాం. ఇందులో మన పాత్ర ఏ మాత్రం ఉండదు వారి ఆలోచన ప్రకారం.
నిజానికి మన విజయంలో ఐనా పరాజయంలో ఐనా ప్రధాన పాత్ర మనదే. మన ఆలోచనలదే. మన మనసుదే. ఒక వ్యక్తి అంబానీగా ఎదిగినా, ఇల్లు గడవడానికే అప్పులు చేస్తూ బతికే అప్పుల అప్పారావుగా మిగిలిపోయినా దానికి మనమే కారణం అంతే కానీ కనిపించని దేవుడు, కనిపించే ప్రభుత్వాలు, వ్యవస్థలు ఎంత మాత్రం కారణం కానే కాదు. సమస్య నుంచి పారిపోయే వారు, ఎదుర్కోలేని వారు, బద్ధకస్తులు మాత్రమే కారణం తమది కాదు ఇంకెవరిదో అంటారు.
అంబానీ పెద్ద ఇల్ల్లు కట్టుకున్నా, కూతురు పెళ్లి వైభవంగా చేసినా మనం సహించలేం. అంబానీ చట్టవిరుద్ధంగా సంపాదిస్తే దాన్ని వ్యతిరేకించాలి కానీ సంపాదించడమే తప్పు అన్నట్టుగా వాదనలు ఉంటాయి.
మనం విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి సామాన్యులుగా ఉండిపోయాం. అంబానీ విలువలకు కట్టుబడి లేడు కాబట్టే సంపన్నుడు అయ్యాడు అనేది కొందరి వాదన. ఇలా వాదించే వారు తమను తాను మోసం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో ఎవరైనా చేసేదేమీ లేదు.
ధీరూబాయ్ అంబానీ కూడా ఒకప్పుడు సాధారణ ఉద్యోగి. చిన్న ఉద్యోగంలో ఉన్నా ఆలోచనలు మాత్రం ఉన్నతం. చిన్న ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఏదో ఒక రోజు వ్యాపార సామ్రాజ్యం సృష్టించాలని కలలు కన్నాడు. వాస్తవం చేసుకున్నారు. దుబాయ్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ఇంటింటికి తిరిగి వస్తువులు అమ్మారు. ఏం చేస్తున్నా ఎప్పుడూ తన లక్ష్యం కళ్ల ముందు మెదులుతూనే ఉండేది.
సంపన్నులు సామాన్యులు ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది.
సెల్‌ఫోన్‌లో నెట్‌వర్క్ సరిగా లేకపోతే మరో కంపెనీకి మారుదామని మనం ఆలోచిస్తాం. కానీ అంబానీ మాత్రం జియో నెట్ వర్క్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తారు.
నిర్మా గుర్తుందా? గుజరాత్‌లోని ప్రభుత్వ ఉద్యోగి, కెమిస్ట్. కర్సన్‌బాయ్ పటేల్. ఇంటి నుంచి ఆఫీసుకు సైకిల్‌పై వెళ్లే సమయంలో, తిరిగి ఇంటికి వచ్చే సమయంలో నిర్మా పౌడర్‌లు అమ్ముతూ తన వ్యాపార ప్రస్థానం ప్రారంభించి. 15వేల మంది ఉద్యోగులు, 3550 కోట్ల రూపాయల టర్నోవర్‌కు వ్యాపారాన్ని విస్తరించాడు.
అంబానీలు, కర్సన్‌బాయ్‌లు, మన చట్టూ చాలా మందే ఉన్నారు. సైకిల్‌పై తిరిగి క్రేన్ వక్కపొడి అమ్మిన వారు, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అంటూ సైకిల్‌పైనే ఇంటింటికి తిరిగి అగర్ బత్తీలు అమ్మిన వారు కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించారు. ఇలాంటి వారు మేం పేదరికంలో ఉండడానికి ఈ వ్యవస్థ, ఈ దేశమే కారణం ఆనే ఆలోచనలు చేయరు. సంపద కలిగి ఉండడం పాపం అనుకోరు. సంపన్నులను విలన్లుగా చూడరు. తాము పేదరికంలో ఉన్నా దానికి కారణం ఎవరూ కాదనని తామేనని, పేదరికం నుంచి బయట పడే మార్గం కూడా తమ వద్దనే ఉందని భావిస్తారు. భయటపడేందుకు కృషి చేస్తారు. విజయం సాధిస్తారు. కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి ప్రేరణగా నిలుస్తారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తారు. ఇలాంటి విజేతలు ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు. అలాంటి వారి నుంచి ప్రేరణ పొందవచ్చు అంతే తప్ప సంపన్నులను విలన్లుగా చూడాల్సిన అవసరం లేదు.
ఆఫీసు నుంచి రాగానే టీవిలో అత్తా ఒకింటి కోడలే సీరియల్ చూస్తే ఎదగం. క్రికెట్ కబుర్లు, సినిమా కబుర్లు, రాజకీయ కబుర్లతో కాసేపు కాలక్షేపం కావచ్చు. కానీ జీవితంలో ఎదిగే అవకాశం ఉండదు. ఉద్యోగంలో ఎప్పుడు ఇంక్రిమెంట్ వస్తుందా? ప్రమోషన్ వస్తుందా? అనే ఆలోచన కన్నా తన పరిస్థితి మెరుగు పరుచుకునే మంత్రం తన వద్దనే ఉందని గ్రహించడం వల్లనే ఎంతో మంది చిరుద్యోగం నుంచి వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించే స్థాయికి ఎదుగుతున్నారు. మంత్రాలు, మాయలు, యంత్రాలు చేసేదేమీ ఉండదు. మన చేతి చమురు వదలడం తప్ప మనను విజయతీరాలకు చేర్చే శక్తి మనలోనే ఉందని గుర్తించాలి.
ఏ క్రికెటర్ పుట్టిన రోజు ఎప్పుడో కొంత మంది అడగ్గానే చెప్పేస్తారు. హీరోయిన్ పుట్టుమచ్చలు. హీరోల పుట్టిన రోజులు గుర్తుంచుకోవడానికి ఖర్చు చేసే సమయాన్ని మనం విజయం కోసం మనం ఖర్చు పెట్టుకోవడం అవసరం.
ఏ సినిమా ఎన్ని రోజులు నడిచింది, ఏ సినిమాలో ఏ హీరోయిన్ ఎన్ని చీరలు మార్చింది మన కెందుకు. మన జీవితం ఎలా మారుతుంది ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ముందు ఆలోచించడం ప్రారంభిద్దాం.
అంబానీ గురించి మనం గంటల తరబడి చర్చించుకున్నా, మన గురించి అతను ఒక్క క్షణం కూడా ఆలోచించడు. తన సమయం ఎంత విలువైందో అంబానీకి తెలుసు. అది తెలియంది మనకే. తెలుసుకున్న రోజు మనమూ ఎదుగుతాం. పేదరికం నుంచి సంపన్నత వైపు పయనించే ఆలోచనల గట్టుమీద ఉంటారా? పేదరికానికి వ్యవస్థలు, దేవుడు, కనిపించని శక్తులే కారణం అనే ఉపయోగం లేని భావాలా గట్టున ఉంటారా? మీ ఇష్టం.
-బి.మురళి(16-12-2018)

14, డిసెంబర్ 2018, శుక్రవారం

జ్ఞానభేరి-పందెం కోళ్లు

‘‘తిరునాళ్లలో రంగుల రాట్నం లాంటిదే ఈ జీవితం.. ఒకసారి కింద ఉంటుంది, మరో సారి ఆకాశంలో ఉన్నట్టు అనిపిస్తుంది.’’
‘‘నిజమే.. ఏదీ శాశ్వతం కాదు.’’
‘‘విజయం పరాజయం ఒకే నాణానికి రెండు ముఖాల వంటివి’’
‘‘మరణించిన వాడు తిరిగి పుట్టక తప్పదని ఘంటసాల ఎప్పుడో చెప్పారు’’
‘‘అది చెప్పింది ఘంటసాల కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. పాడింది మాత్రం ఘంటసాలనే’’
‘‘ఐనా రాసేదెవరు? పాడెదెవరు? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడని అంటున్నావు. నువ్వు చూశావా? నేను చూశానా’’
‘‘నేను చూడలేదు.. కానీ మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్నవారంతా బంధుగణమే కావడంతో వారితో యుద్ధం చేయలేనని వైరాగ్యంతో యుద్ధరంగాన్ని వీడి వెళ్లబోతుంటే బంధువులు ఎవరు? శత్రువులు ఎవరు? మిత్రులెవరు? చంపేదెవరు? చచ్చేదెవరు? అని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను బోధించే సరికి అర్జునుడు యుద్ధానికి సిద్ధం అవుతాడన్న కథ మనం విన్నది. ఎన్నో సినిమాల్లో ఉన్నది. ’’
‘‘యుద్ధం జరిగింది అనుకుంటే జరిగింది, లేదు అనుకుంటే లేదు. అంతా దేవుని మాయ అయినప్పుడు గెలిచింది ఎవరు? ఓడింది ఎవరు?’’
‘‘ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడంటారు’’
‘‘తూర్పున సూర్యుడు ఉదయిస్తాడనేది అబద్ధం. సూర్యుడు ఉదయించే దాన్ని మనం తూర్పు అంటున్నాం. దాన్ని తూర్పు అని కాకుండా మార్పు అని పిలిచినా సూర్యుడు అటు నుంచే ఉదయిస్తాడు. మనం తూర్పు, మార్పు, తీర్పు అనుకునే దానితో సూర్యుడికి సంబంధం ఉండదు.’’
‘‘ఏదీ మనం అనుకున్నట్టు జరగదు. ‘జొమాటో’ వాడు చక్కని ప్యాక్ చేసి తెచ్చే ఫుడ్ బాగుంటుందనుకుంటాం.. కానీ మన కన్నా ముందే వాడు దాని రుచి చూశాడని మనకేం తెలుస్తుంది?’’
‘‘వాడు రుచి చూసిన దృశ్యాన్ని మేడ మీద నుంచి ఎవడో షూట్ చేసి ప్ర పంచం కళ్లు తెరిపించి, వాడి ఉద్యోగాన్ని ఊడబెరికిస్తాడని ఎవరికి తెలుసు?’’
‘‘ఔను!కర్నాటక తేజం విజయ్ మాల్యా, తెలుగు తేజం సుజనా చౌదరిలు వేల కోట్ల రూపాయల హాంఫట్ వ్యవహారాల కన్నా- ‘జొమాటో’ వాడు నాలుగు మెతుకులు చౌర్యం చేసిన దానిపై మనం సామాజిక చైతన్యం ఎక్కువ చూపించాం.. ఎందుకంటావ్..?’’
‘‘అది సరే ఆ తెలుగు తేజం వాటా ఆరువేల కోట్లట కదా? ఆరువేల కోట్ల అంకెలో ఎన్ని సున్నాలుంటాయి.?’’
‘‘పదో పదకొండో.. ఒకటి ఎక్కువైతేనేం తక్కువైతేనేం’’
‘‘అదేంటోయ్ ఒక సున్నా కలిపితే వేల కోట్లు అవుతుంది. తగ్గిస్తే వందల కోట్లు అవుతుంది. ’’
‘‘ఐతే కానీ.. సున్నా ఎప్పటికైనా సున్నానే. మనవి కానప్పుడు, మనపై ప్రభావం చూపనప్పుడు ఎన్ని సున్నాలైతే మనకేం? అదే ‘జొమాటో’లోనైతే మనం తెప్పించుకునే ఫుడ్ మనది. మన జేబులోనుంచి డబ్బులు ఇస్తాం. ఎవడో కొంత ఫుడ్ కొట్టేస్తే ఎలా ఊరుకుంటాం?’’
‘‘ఏదో ఆకలి.. ఫుడ్ అనుకుంటాం.. కానీ అంతా భ్రమ.. ఈ రోజు ఆకలికి ఏడుస్తాం. రేపు తిన్నది ఎక్కువై ఏడు స్తాం. జీవితం ఏదీ శాశ్వతం కాదు. విజయం శాశ్వతం కాదు. పెరుగుట విరుగుట కొరకే. నాలుగు రోజుల జీవితానికి విజయాలు, పరాజయాలు అవసరమా? మనం తోలు బొమ్మలం, మనల్ని ఆడించేది భగవంతుడు. ’’
‘‘అరేయ్.. ఇంకో మాట మాట్లాడారంటే మీ బుర్రలు పగల గొడతా.. మీ ఇద్దరూ ఎంతెంత డబ్బు పోగొట్టుకున్నారో ఆ విషయం ముందు చెప్పండి’’
‘‘వా.. వా.. వా..ఆ...’’
‘‘దరిద్రపు ఏడుపు ఆపి మాట్లాడండి’’
‘‘మేం తాత్త్విక ధోరణితో చర్చించుకుంటుంటే నువ్వేంటి హఠాత్తుగా ఎంతెంత డబ్బులు పోగొట్టుకున్నారని అడుగుతున్నావ్? ఆ సంగతి నీ కెలా తెలిసింది?’’
‘‘మీ అతితెలివి తేటలు నా దగ్గర చూపకండి.. నిన్న మొన్నటి వరకు మీ ఉపన్యాసాలు వినలేదనుకున్నావా? మీ సవాళ్ల గురించి తెలియదనుకున్నావా? సామాజిక మాధ్యమాల్లో మీరు పెట్టిన పోస్టులు చూడలేదనుకున్నావా?’’
‘‘వా.. నిండా మునిగాం.. చంటి లోకల్ అన్నట్టు ఊర్లో నన్ను జూనియర్ లగడపాటి అని, వీడినేమో గోనె ప్రకాశ్ అని ఎంత అభిమానంతో పిలుస్తారు.. రాజకీయాలకు సంబంధించి అంకెలన్నీ లగడపాటి నాలుకపైనే ఉంటాయి. ఆయన మెదడులోని కంప్యూటర్ కోట్లాది మంది గంట క్రితం ఏ పార్టీకి ఓటు వేయాలనుకున్నారు, నిమిషంలో నిర్ణయం ఎలా మార్చుకున్నారు.. అంటూ నిమిష నిమిషానికి చెప్పేస్తుంటే అక్కడున్న విలేఖరులు విస్తుపోయి చూస్తుంటారు. తిప్పాయ పాలెం తింగరోళ్లం మేమెంత? ఏ శుభకార్యానికైనా ముహూర్తం కోసం పంతులును కలిసినట్టు ఏ ఎన్నికలు వచ్చినా ఫలితాలు ఎలా ఉంటాయని మమ్మల్ని అడిగి పందెం వేసేవాళ్లు. ఈసారి వారి ఊపులు, విరుపులు చూసి మా దగ్గరున్న డబ్బంతా పందెం కాశాం. మాపై నమ్మకంతో తెలిసిన వారంతా పందెం కాశారు.’’
‘‘ తెలంగాణలోనేమో అధికార పక్షం గెలుస్తుందని, ఆంధ్రలోనేమో కూటమి గెలుస్తుందని పందాలు కడుతున్నారని అదేదో మీడియాలో రాశారు’’
‘‘మేం కూడా వారి రాతలనే నమ్ముకుని నిండా మునిగాం. డబ్బులు పోయాయి. పైగా పందెం ఓడిపోతే మీసం తీసేస్తానని నేను, సగం గుండు కొట్టించుకుంటానని వీడు పందెం కాశాం. పీక కోసుకుంటానని ఒకరంటే బ్లేడ్ పట్టుకుని ఓ మీడియా అతని ఇంటి చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు ఊరికెళా వెళ్లాలి, తెలిసిన వారికి ముఖం ఎలా చూపాలనే పిచ్చి పిచ్చి ఆలోచలతో ఏమీ తోచక అంతా మాయ, మిధ్య, భ్రమ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నాం.’’
‘‘మీ అంత మేధావులు ఉండరురా! ఆ వార్త చదివినప్పుడు మీ బుర్ర పని చేయలేదా? ప్రజాభిప్రాయం ఆ వార్తలోనే ఉంది’’
‘‘కూటమి గెలుస్తుందని ఆంధ్రలో, ఆధికార పక్షం గెలుస్తుందని తెలంగాణలో ఎలా పందాలు కాస్తున్నారు? మరి ఎన్నికలు ఎక్కడ జరిగాయి?’’
‘‘తెలంగాణలో..’’
‘‘ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలంగాణలో తెలుస్తుంది కానీ ఎన్నికలతో సంబంధం లేని ప్రాంతానికెలా తెలుస్తుందనే ఆలోచన రాలేదా?’’
‘‘ఇంత సింపుల్ లాజిక్ తెలిస్తే ఆ రాతలను ఎందుకు నమ్ముతాం. నిండా ఎందుకు మునుగుతాం. ఐనా విజయం, ఓటమి అంతా భ్రమ’’
‘‘మళ్లీ మిట్ట వేదాంతమా?’’
‘‘ఆరునెలల తరువాత జరిగే ఆంధ్ర ఎన్నికలపై పందెం కాసి నష్టాన్ని పూడ్చుకుందామా?’’
‘‘కుక్క తోక వంకర అని నీ పందెం బుద్ది మారదా? మీది పందెం కోళ్ల వైరాగ్యమే’’

 *బుద్దామురళి (జనాంతికం 14-12-2018) 

10, డిసెంబర్ 2018, సోమవారం

సంపదను ద్వేషించవద్దు

మనం ద్వేషిస్తే చిన్న కుక్క పిల్ల కూడా మనతో ఉండదు. ప్రేమిస్తేనే అది మనతో ఉంటుంది. అలాంటిది డబ్బును ద్వేషిస్తే అది మనతో ఉంటుందా? లా ఆఫ్ అట్రాక్షన్ అనే సిద్ధాంతం పాశ్చాత్య దేశాల్లో బాగా పాపులర్ ఈ సిద్ధాంతంపై వచ్చిన పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందాయి. మన స్ఫూర్తిగా మనం ఏది కోరుకుంటే అది సాకారం అవుతుందని చెబుతుంది ఈ సిద్ధాంతం. మన పూర్వీకులు యద్భావం తత్ భవతీ అని ఎప్పుడో చెప్పారు. మనం ఇలా చెప్పినా పాశ్చాత్యులు లా ఆఫ్ అట్రాక్షన్ అని శాస్ర్తియంగా చెప్పినా దాని అర్థం ఒకటే మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే అది సాధ్యం అవుతుంది.
హాస్టల్‌లో ఉండి చదువుకున్న ప్రవీణ్‌కుమార్ అనే ఐపిఎస్ అధికారి ఇప్పుడు సంక్షేమ హాస్టళ్లలో విప్లవం సృష్టిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో మనం ఏది కోరుకుంటే అది సాధ్యం అవుతుందని నిరూపిస్తున్నారు. చదువుకునే పిల్లలను ఆ మార్గంలో తీసుకు వెళుతున్నారు. అతనికి ఆకలి తెలుసు పేదరికం తెలుసు. దాని నుంచి బయటపడే మార్గం కూడా తెలుసు. పేదరికాన్ని వ్యతిరేకించడం అంటే అడవుల్లోకి పారిపోవడం కాదు. మనం ఎదగాలి, ఎదగాలి అంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. ఆ మార్గంలో పయనించాలి. మన ఎదుగుదలను చిన్నప్పటి నుంచి మన మనసుపై బలంగా ముద్రించుకోవాలి.
సంపద విషయంలో సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. ధనంపై మనకున్న అభిప్రాయాలను ముందు మనం సమీక్షించుకోవాలి. డబ్బుదేముంది మంచి మనసు ముఖ్యం, ధనవంతులంతా విలన్లు అని మనకు చిన్నప్పటి నుంచి సినిమా కథల నుంచి పెద్దల వరకు ఎంతో మంది బలవంతంగా మన మీద ఒక ముద్ర వేశారు. సినిమాలో హీరో పేదవాడు. ధనవంతుల అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి తండ్రి విలన్ హీరో పేదవాడు కావడం వల్ల ప్రేమను అంగీకరించడు. డబ్బుకు విలువ లేదని మనసు ముఖ్యం అని హీరో విలన్‌కు బుద్ధి చెప్పి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. తోట రాముడు, బండరాముడు, పాతాళభైరవి పేరేదైతేనేం చాలా సినిమాల కథ ఇదే. ఇంకా ఇవే కథలు. మన మీద మనకు తెలియకుండానే బలమైన ముద్ర వేస్తాయి.
అంబానీ 80 అంతస్తుల భవనం కట్టుకున్నా మనం సహించలేం. రెండు రూపాయలకు కిలో బియ్యం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం అందరి లానే అంబానీ కూడా క్యూలో నిలబడితే తప్ప మన మనసు కుదుట పడదు.
80 అంతస్తుల భవనం కట్టుకోవడం నేరం అనే చట్టం ఉంటే వ్యతిరేకించాలి. లేకపోతే చట్టబద్ధంగా అతను భవనం కట్టుకుంటే మనం తిట్టుకోవలసిన అవసరం ఏముంది. సంపదను ఏదో రూపంలో మన ద్వేషిస్తే అది మన వైపు చూడదు.
యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా రిటైర్ అయినా ఒక బృందంతో ఇటీవల చర్చల్లో వ్యాపారం గురించి ప్రస్తావిస్తే, వ్యాపారం అంటేనే మోసం అది మా వల్ల కాదు అని మేధావుల సమాధానం.
నెల్లూరులో ఒక అటెండర్ ఇంటిపై ఎసిబి దాడి జరిపితే వంద కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. ఉద్యోగులు అంటే అంతా అక్రమంగా సంపాదించే వారే అనుకోవడం, వ్యాపారం అంటే అంతా మోసమే అనుకోవడం, అక్రమాలు చేస్తేనే సంపాదిస్తారు అనుకోవడం మన ఆలోచనల్లో ఉండే తప్పు. తప్పు చేసే వారు ఉద్యోగులు, వ్యాపారులు అనే తేడా లేదు ఎక్కడైనా ఉంటారు. డబ్బు సంపాదించడం అంటే అదేదో నేరం అని వ్యాపారం అంటేనే మోసం అనే అభిప్రాయం బాల్యం నుంచి మనపై పడే బలమైన ముద్ర. దాని నుంచి బయటకు రావాలి.
ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారం చేసినా డబ్బు పాపిష్టిది అనే అభిప్రాయం నుంచి బయటకు రాక పోతే అది మనతో ఉండదు.
వ్యాపారి డబ్బుకు విలువ ఇస్తాడు. పూజిస్తాడు. అలా చేయడం వల్ల మన జేబులో నుంచి ఒక రూపాయి ఖర్చు చేయాల్సి వచ్చినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాం. ఈ ఖర్చు అవసరమా? మన డబ్బుకు సరైన విలువ గల సేవను మనం పొందుతున్నామా? అనే ఆలోచన వస్తుంది. ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు మనం విలువ ఇస్తేనే ఆ బంధం నిలుస్తుంది. లేక పోతే వివాహ బంధం సైతం నిలువదు. బంధాలు ఎలానే డబ్బు సైతం అంతే దానికి విలువ ఇచ్చి ప్రేమిస్తేనే నీతో ఉంటుంది లేదంటే నీకు తెలియకుండానే చేజారి పోతుంది. ఒకప్పుడు తమ నటనతో సంపాదించిన డబ్బుతో అనేక భవనాలను కొన్న పాత కాలం నాటి నటులు ఎందరో చివరి దశలో తిండికే ఇబ్బంది పడాల్సి వచ్చింది. వాళ్లు నటనను ప్రేమించారు. నటనలో జీవించారు. కానీ డబ్బుకు ఏ మాత్రం విలువ ఇవ్వలేదు. అలా విలువ ఇవ్వక పోవడం చాలా గొప్పతనం అని వారి చుట్టూ ఉన్న వాళ్లు పొగడ్తలతో ముంచెత్తారు. రోడ్డున పడిన తరువాత అంతకు ముందు పొగిడిన వారెవరూ చుట్టు పక్కల కనిపించలేదు. కష్టపడి సంపాదించిన డబ్బు అది అనే స్పృహతో దానికి తగిన విలువ ఇస్తే అంతిమ దశ అలా ఉండకపోయేది.
మనం విలువ ఇచ్చేది మాత్రమే చివరి వరకు మనతో ఉంటుంది. కాలం కలిసి రావడం రాకపోవడం అంటే ఇదే. మనం డబ్బుకు ఏ మాత్రం విలువ ఇవ్వకపోతే ఏ కాలం కూడా కలిసి రాదు. డబ్బు మన వద్ద ఉన్నప్పుడే దానికి తగిన విలువ ఇవ్వాలి. అలా విలువ ఇవ్వని వారి జీవితాలు ఎలా మారాయో మన కంటి ముందే మనకు ఎన్నో జీవితాలు కనిపిస్తాయి. వారి దైన్యస్థితి మనకు గుణపాఠం కావాలి.
నా చేతిలో డబ్బు నిలువదు, డబ్బుకు విలువ లేదు అనే రోటీన్ డైలాగులు మాట వరుసకు కూడా అనోద్దు. నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఇది. నా చేతిలో నిలుస్తుంది. మరింత పెరుగుతుంది అని మీకు మీరు చెప్పు కోవాలి. డబ్బు విషయంలో నెగిటివ్ ఆలోచనలు పారద్రోలాలి. డబ్బును ప్రేమించాలి, విలువ ఇవ్వాలి. డబ్బుకు విలువ ఇవ్వడం అంటే అదేదో నేరం అని భావించే వారితో డబ్బు విషయంలో దూరంగా ఉండడమే మంచిది. మీ దృష్టిలో డబ్బుకు విలువ లేకపోవచ్చు, కానీ నా దృష్టిలో విలువ ఉంది. డబ్బుకు నేను విలువ ఇస్తాను అని నిర్మోహ మాటంగా చెప్పగలగాలి. విలువ ఇచ్చినప్పుడే డబ్బు నిలుస్తుంది. పెరుగుతుంది. అవసరానికి ఉపయోగపడుతుంది. అంతిమ దశలో కొండంత అండగా ఉంటుంది. డబ్బుకు విలువ లేదు అనే భావనతో చివరి దశలో ఒకరిపై ఆధారపడి బతుకుతారో, డబ్బుకు విలువ ఉందని గ్రహించి చివరి దశలో ఆత్మవిశ్వాసంతో బతుకుతారో ఎవరికి వారే నిర్ణయించుకొని ఆ దిశగా పయనించాలి.
-బి.మురళి( 9-12-2018)

రాముడు, రావణుడు ఏకమైతే..

‘‘ఈ ప్రపంచాన్ని ఎలా మార్చేద్దామనా.. అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?’’
‘‘ ఇంట్లో టీవీ చానల్ మార్చేంత అధికారం కూడా నా చేతిలో ఉండదు. ఇక ప్రపపంచాన్ని మార్చేంత సీనా? నాకో ఆలోచన వచ్చింది.. అలా జరిగితే ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా?’’
‘‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరంటారు కదా?’’
‘‘ఒక్క రాజకీయాల్లోనే కాదు. మన జీవితాల్లో, వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. పోటీపోటీగా వెళ్లిన సెల్‌ఫోన్ కంపెనీలు ఎన్ని ఏకం కాలేదు. ఎన్ని వ్యాపార సంస్థలు ఒకదానిలో ఒకటి విలీనం కాలేదు? ’’
‘‘అలానే పురాణ కాలంలో కూడా శాశ్వత శత్రువులు మిత్రులుగా మారితే ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నా’’
‘‘అర్థం కాలేదు...’’
‘‘రామాయణ కథ ఏమిటి? ’’
‘‘శ్రీరాముడు హీరో, రావణుడు విలన్. ఇంకా చాలా పాత్రలున్నాయి’’
‘‘అన్నదమ్ములైన వాలి సుగ్రీవులు ఏకమైతే ఎలా ఉంటుంది?’’
‘‘ఇద్దరూ ప్రాణాలతో మిగిలి ఉండేవాళ్లు. చెరి సగం రాజ్యం పాలించే వాళ్లు.’’
‘‘అలానే శ్రీరాముడు, రావణుడు ఏకమైతే..?’’
‘‘రామాయణమే ఉండదు.’’
‘‘ఎందుకుండదు? ఇప్పుడు చూడు.. ప్రపంచానికి కాంగ్రెస్ పార్టీనే అత్యంత ప్రమాదకరమని భావించి ‘అన్న’ ఎన్టీఆర్ సినిమాల్లో హీరో వేషాలను వదిలేసి తెలుగుదేశం పార్టీని స్థాపించారా? లేదా? ’’
‘‘ఔను’’
‘‘కాంగ్రెస్ వ్యతిరేకతే తెదేపా సిద్ధాంతం కదా?’’
‘‘ఔను.’’
‘‘మరి అలాంటి రెండు పార్టీలు ఏకమైనపుడు రాముడు, రావణుడు ఏకమైతే తప్పేంటి?’’
‘‘తలాతోకా లేకుండా రాజకీయాలను, పురాణాలను ఏకం చేస్తావేంటి? శ్రీరాముడు క్షణాల్లో రావణుడిని వధించలేక కాదు. సీతాపహరణం, రామరావణ యుద్ధం అన్నీ లోక కల్యాణం కోసమే జరిగాయి.’’
‘‘కాదని నేనన్నానా? దేశ కల్యాణం కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపానని బాబు చెబుతున్నారు కదా? ’’
‘‘నువ్వెన్నయినా చెప్పు.. రాముడు, రావణుడు ఏకం కావడం అనేది నేనసలు ఊహించలేను. హీరో, విలన్ ఎలా కలుస్తారు. ఇక సినిమా ఎక్కడుంటుంది?’’
‘‘నీ దృష్టిలో శ్రీరాముడు హీరో, రావణుడు విలన్ ఐతే చాలా మంది రావణుడే హీరో, శ్రీరాముడు విలన్ అని నమ్ముతారు. నువ్వు చాలా సార్లు ప్రస్తావించే రజనీష్ కూడా రావణుడే హీరో, రాముడే విలన్ అన్నాడు.’’
‘‘ఎవరి అభిప్రాయం వారి ది. ఈ దేశంలో కొన్ని కోట్ల మంది శ్రీరాముడని దేవుడిగా భావిస్తారు. నువ్వు రావణుడిని మొక్కుతానంటే వద్దనడానికి నెనెవరిని?’’
‘‘నీకీ సంగతి తెలుసా? 1965 ప్రాంతంలోనే ఎన్టీఆర్ తనకు రావణుడే ఆదర్శం అని ఓ పత్రికలో వ్యాసం రాశారు.’’
‘‘ఎన్టీఆర్‌ను అభిమానించే వాళ్లు రాముడినే దేవుడిగా పూజిస్తారని నీకు తెలుసా? నీ ఇష్టం.. నువ్వు ఎవరినైనా పూజించుకో. చాలా ఏళ్ల క్రితం ‘రావణుడే రాముడయితే’ అనే సినిమా కూడా వచ్చింది. కానీ శ్రీరాముడు, రావణుడు ఏకమైతే.. అనే ఆలోచన ఎవరికీ రాలేదు. నీకే వచ్చింది. ఇదొక్కటేనా? ఇంకెవరినైనా కలిపేద్దామనిపిస్తుందా?’’
‘‘ ఈమధ్య పౌరాణిక పాత్రలను తీసుకుని తమ కోణం నుంచి రాస్తున్నారు కదా?’’
‘‘ఔను చాలా మంది గురించి వచ్చింది. యార్లగడ్డ ద్రౌపది గురించి రాసినట్టున్నారు. కుంతి గురించి ఆ మధ్య ఎవరో రాశారు. కుంభకర్ణుడు, రావణుడు, కైకేయి, శూర్పణఖ.. ఇలా చాలా పాత్రలను తీసుకుని తమ కోణంలో వారి గురించి నవలలు రాసినట్టున్నారు. ధ్రుతరాష్ట్రుని భార్య గాంధారికి చూపు ఉన్నా, భర్త కోసం కళ్లకు గంతలు కట్టుకుని జీవిత కాలమంతా అలా గుడ్డిగానే బతికింది.. ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించి రాశారు’’
‘‘నాకోటి తెలియక అడుగుతున్నాను.. మన పురాణాలైన రామాయణం, మహాభారతం నిజంగా జరిగాయో లేదో తెలియదు. ఊహ కావచ్చు, నిజం కావచ్చు. ఆ పాత్రలు ఏమనుకుంటున్నాయో ఏ సందర్భంలో వారి ప్రవర్తన ఎలా ఉందో పురాణాల్లోనే పూసగుచ్చినట్టు ఉంది కదా? వాళ్లు నిజంగా అలా అనుకోలేదు. మరోలా అనుకున్నారని మన ఇష్టం వచ్చినట్టు రాయడం సబబేనా?’’
‘‘నాకూ ఓ అనుమానం ఉంది. పురాణాలు అబద్ధం. కానీ పురాణాల్లోని కొన్ని పాత్రలు నిజం అని వాదించే వర్గం ఒకటి తయారైంది. అంటే శ్రీరాముడు అబద్ధం.. కానీ రావణుడు నిజం అని బల్లగుద్ది వాదించడం అన్న మాట. పురాణాలే అబద్ధం అనుకుంటే కొన్ని పాత్రలు నిజమెలా అవుతాయి?’’
‘ప లానా నాయకుడు ఏమనుకుంటున్నాడు? ఆయన మనోగతం ఏమిటి? అని మీడియాలో  ఎవరికి తోచినట్టు వాళ్లు రాయడం లేదా? ఒక నాయకుడి మనోగతం ఇలా ఉందని ఒక్కో పత్రిక ఒకే సందర్భంలో ఒక్కో రకంగా రాస్తే తప్పు లేదు కానీ- పురాణాల్లో పాత్రలు మనసులో ఏమనుకుంటున్నాయో రాస్తే తప్పెలా అవుతుంది? రాముడు, రావణుడు ఏకం కావాలి. కృష్ణుడు, దుర్యోధనుడు చెట్టాపట్టాలేసుకుని తిరగాలి. దుర్యోధనుడు, అర్జునుడు ప్రాణస్నేహితులు కావాలి. కావాలంటే ఐదేళ్లలో సగం కాలం దుర్యోధనుడు, మిగిలిన సగం కాలం ధర్మరాజు, మధ్యలో ఓ ఏడాది కర్ణుడు పాలించాలి. మన చర్చ రాజకీయాల నుంచి పురాణాల్లోకి వెళ్లింది. పురాణాల సంగతి మనకెందుకు వదిలేయ్.. రాజకీయాల గురించి మాట్లాడుకుందాం.’’
‘‘పురాణాల్లోని పాత్రల్లా రాజకీయ నాయకులు సైతం ఏకం కావాలి. ఇండియా, పాకిస్తాన్ ఏకం కావాలి. అమెరికాలో ట్రంప్, హిల్లరీ చేతులు కలపాలి. శాంతిదూతలు, ఉగ్రవాదులు ఏకం కావాలి. కేసీఆర్ , జగన్, చంద్రబాబు ప్రాణస్నేహితులు కావాలి. మోదీ, రాహుల్ జంటగా విదేశీ పర్యటనలు చేయాలి.’’
‘‘అంతేనా? ఆకాశం, భూమి ఏకం కావాలి అని కూడా కోరుకో. ఆశకు కూడా హద్దు ఉండాలి. హీరోలు, విలన్లు కలిస్తే సినిమాలుండవు. దేవతలు, రాక్షసులు కలిస్తే పురాణాలుండవు. బద్ధ శత్రువులైన నాయకులు కలిస్తే రాజకీయాలు ఉండవు.’’
‘‘ఉండనీ ఉండక పోనీ, ఉండాలని కోరుకుంటా.. అది నా ఇష్టం. ఏమో ఆకాశం, నేల ఏకం కావచ్చు. అసాధ్యం అనుకున్న నాయకులు కలవలేదా?’’
*-బుద్దా మురళి ( జనాంతికం 7-12-2018)

3, డిసెంబర్ 2018, సోమవారం

ఇవి ఉంటే డబ్బు మీ వెంటే..

మనిషి పుట్టినప్పటి నుంచి జీవితం ముగింపు వరకు డబ్బుతోనే జీవితం సాగుతుంది. మరణించిన తరువాత కూడా తతంగాన్ని నిర్వహించడానికి సైతం డబ్బు అవసరం. కానీ డబ్బు దేముంది అంటూ మన వాళ్లు చిత్రంగా మాట్లాడుతుంటారు. డబ్బు పాపిష్టిది కాదు. అదే విధంగా డబ్బే జీవితం కాదు. జీవితానికి డబ్బు అవసరం. డబ్బును విలన్‌గా చూడాల్సిన అవసరం లేదు. డబ్బు లక్షణాలను గుర్తించి దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే జీవితం నరకంగా మారుతుంది.
డబ్బుకుండే లక్షణాలు చిత్రమైనవి. అది మన చేతిలో ఉంటే ప్రపంచాన్ని జయించేంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. అది చేతిలో లేనప్పుడు అవసరం పడ్డప్పుడు డబ్బు ఎంత శక్తివంతమైందో తెలిసొస్తుంది.
సంపాదన- ఖర్చు
మన సంపాదన ఖర్చు లెక్కలు సరిగ్గా ఉండాలి. డబ్బు సంపాదించాలి అనుకునే వారికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. ఖర్చు, ఆదాయానికి సంబంధించిన లెక్కలు తెలిసి ఉండడం. మీరు ఎంతైనా సంపాదించవచ్చు. సంపాదన కన్నా ఖర్చు ఎంతో కొంత తక్కువ ఉండాలి. సంపాదనను మించి ఖర్చు చేసే అలవాటున్న వారు జీవితంలో ఎప్పుడూ సంపన్నులు కాలేరు. అవసరానికి అప్పుల కోసం పరుగులు తీయడం వారి జీవిత లక్షణంగా మారుతుంది.
మీ పొదుపు అలవాటు ఎలా ఉందో సమీక్షించుకోవాలి. మీకు వచ్చిన జీతం/ ఆదాయం నుంచి ముందు ఖర్చులు తీసేసి మిగిలిన దానిలో అవకాశం ఉన్నంత వరకు పొదుపు చేస్తారా? పొదుపునకు సంబంధించి ఇది సరైన అలవాటు కాదు. మీరు నెలకు ఓ ఐదు వేల రూపాయలే పొదుపు చేయాలని నిర్ణయించుకున్నారనుకుందాం. మీ తప్పని సరి ఖర్చుల్లో ముందుగా ఉండాల్సింది మీరు పొదుపు చేయాలనుకుంటున్న ఈ ఐదువేల రూపాయలు. అంటే మీ ఇంటి అద్దె, ఇంట్లో నిత్యావసర వస్తువులు, పిల్లల ఫీజులు ఇవన్నీ అనివార్యంగా చెల్లించాల్సిన ఖర్చులు. మీ పొదుపు సైతం ప్రాధాన్యతా క్రమంలో ముందు ఉండాలి. అలా ఐతేనే పొదుపు సాధ్యం. అలా కాకుండా చాలా మంది ఖర్చులు పోగా ఎంత మిగిలితే దాన్ని పొదుపు చేయాలి అనుకుంటారు. దీని వల్ల అనవసర ఖర్చులు ఎక్కువ చేస్తాం. దీన్ని కొద్దిగా మార్చి, పొదుపు, ఇంటి అద్దె, నిత్యావసరాలు, పిల్లల ఫీజులు ఇలా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకోండి. పొదుపు దానంతట అదే అలవాటు అవుతుంది.
చిన్న వయసులోనే పొదుపు
పొదుపు అనేది ఎంత చిన్న మొత్తం అయినా కావచ్చు. అది ఎంత తక్కువ వయసులో ప్రారంభిస్తే అంత మంచిది. మరో నాలుగైదేళ్లలో రిటైర్ అవుతాము అనుకునే సమయంలో చాలా మంది అప్పుడు హడావుడిగా పొదుపుపై దృష్టి సారిస్తారు. ఎంత ఎక్కువ పొదుపు చేసినా ఇంకా మిగిలింది ఐదేళ్ల కాలమే కాబట్టి పెద్ద అమోంట్ సాధ్యం కాదు. అలా కాకుండా ఉద్యోగంలో చేరిన కొత్తలోనే పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వాలి. చక్రవడ్డీ ప్రాధాన్యత తెలిసిందే. 25ఏళ్ల వయసులో పొదుపు మొదలు పెడితే రిటైర్ అయ్యేనాటికి మీ జీతాన్ని మించిన వడ్డీ వస్తుంది. ఈ కాలంలో 20-25ఏళ్ల వయసులోనే ఐటి కంపెనీల్లో యువత ఉద్యోగం సంపాదిస్తుంది. వీరికి పొదుపును అలవాటు చేస్తే రిటైర్‌మెంట్ వయసు నాటికి మీరు ఊహించనంత సొమ్ము మీ చేతికి వస్తుంది. ఈ పొదుపే మిమ్ములను సంపన్నులుగా మారుస్తుంది.
రిస్క్- ఆదాయం
పొదుపు చేయడమే కాదు. దాన్ని సరైన రీతిలో ఇనె్వస్ట్ చేయాలి. ఎక్కువ ఆదాయం ఆశ చూపితే జాగ్రత్త. ఎక్కడైనా రిస్క్‌ను బట్టే ఆదాయం ఉంటుంది. పెద్దగా రిస్క్ వద్దు అనుకుంటే బ్యాంకు డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ అంతంత మాత్రమే. అలా అని ఎక్కువ వడ్డీ ఆశ చూపించే ప్రైవేటు సంస్థల వద్ద డిపాజిట్ చేయడం అసలుకే మోసం వస్తుంది. సురక్షితంగా ఉండడంతో పాటు మంచి ఆదాయం ఇచ్చే పెట్టుబడిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.
* విభిన్న రంగాలు
ఒకే ఆదాయాన్ని నమ్ముకుంటే ఒక్కోసారి ప్రమాదం తప్పదు. అదే విధంగా మన ఇనె్వస్ట్‌మెంట్‌లో సైతం ఒకే రంగాన్ని ఎన్నుకోవద్దు. వివిధ రకాల పెట్టుబడులు అవసరం. ఒకవేళ స్టాక్‌మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేసినా విభిన్న రంగాలకు చెందిన స్టాక్స్‌పై ఇనె్వస్ట్ చేయాలి. రియల్ ఎస్టేట్, బంగారం, స్టాక్స్ ఇలా భిన్నమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఒకటి దెబ్బతిన్నా మరోటి ఉంటుంది.
* ఆటోమెటిక్ పొదుపు: బ్యాంకుకు ముందుగానే అనుమతి ఇవ్వడం ద్వారా ఆటోమెటిక్ సేవింగ్ ప్రారంభించవచ్చు. మన ఖాతా ఉన్న బ్యాంకుకు ముందుగానే అనుమతి పత్రం ఇస్తే వాళ్లు ప్రతి నెల నిర్ణీత తేదీ నాడు మనం కోరిన మొత్తాన్ని పొదుపు కింద డిపాజిట్ చేస్తారు. లేదా మ్యూచువల్ ఫండ్‌లో ఇనె్వస్ట్ చేయమంటే చేస్తారు. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఒకసారి అనుమతి ఇచ్చామంటే నెల నెలా దానంతట అదే పొదుపు జరిగిపోతుంది.
-బి.మురళి(2-12-2018)