27, అక్టోబర్ 2011, గురువారం

మైకుకు మాటొస్తే... ...రాజకీయ వ్యంగ్యం

25, అక్టోబర్ 2011, మంగళవారం

తెలుగు చానల్స్ సీన్ మారుతోంది



దూరదర్శన్‌లో అధికార పక్షానే్న చూపిస్తున్నారు. మమ్ములను చూపించడం లేదు- ఇది మూడు దశాబ్దాల క్రితం భారత ప్రతిపక్ష నాయకుని విమర్శ
‘‘మీ టీవిలో నన్ను చూపించరా?’’- రాష్ట్రంలో ప్రైవేటు చానల్స్ వచ్చిన కొత్తలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుల నుండి వినిపించిన మాట. ఇవన్నీ గతానికి చెందిన మాటలు. ప్రస్తుతానికి వస్తే...
‘‘సార్! చానల్‌లో చర్చకు మీరు రావాలి?’’అని చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరిని విలేఖరులందరి ముందు ఒక చానల్ అతను ఫోన్ చేసి అడిగాడు. పనికి మాలిన వారందరినీ మీరు చర్చలకు పిలుస్తారు, వారు నిలదీస్తే నేను సమాధానం చెప్పాలి, మీ చానలే కాదు నేను ఏ చానల్ చర్చకు పిలిచినా వెళ్లడం లేదు. నేను రాను’’ అని ఆ మాజీ మంత్రి ఖరాఖండిగా సమాధానం చెప్పాడు. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పారు. కొందరు చెప్పడం లేదు కానీ చాలా మంది తమను తాము గొప్పవారిగా భావిస్తున్న నాయకుల వైఖరి ఇదే. పనికి రానివారిని పిలుస్తున్నారు అంటే వీరి దృష్టిలో రాజకీయ నాయకుడు అంటే కనీసం ఒక వంద కోట్ల రూపాయలైనా సంపాదించాలనా? అలాంటి వారైతేనే గౌరవం ఇస్తారా? విషయ పరిజ్ఞానం ఉండాలి కానీ మాట్లాడేందుకు సొమ్ముతో సంబంధం ఏమిటి? మా నాయకుడు పార్టీ ఏర్పాటు చేసి ఎంతో మంది అనామకులకు రాజకీయ బిక్ష పెట్టారు అని వీరే గొప్పగా చెబుతారు. మేం అవకాశాలిస్తే తీసుకోవాలి కానీ మాతో పాటు టీవీల్లో చర్చించడం ఏమిటి? మమ్ములను నిలదీయడం ఏమిటి? అనేది వీరి బాధ.
వెంకయ్యనాయుడు లాంటి నాయకులు టీవిలో మా పార్టీ వార్తలు చూపడం లేదు, అధికార పక్షం వార్తలే చూపుతున్నారని దేశ వ్యాప్తంగా ఆందోళన చేశారంటే ఇప్పటి తరం వాళ్లు నిజమా? అని ఆశ్చర్యపోవచ్చు. దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు అది అధికార పక్షం వారి వార్తలే ఎక్కువగా చూపుతోందని, తమను పట్టించుకోవడం లేదని దేశవ్యాప్తంగా బిజెపి ఆందోళనకు దిగింది. అలాంటిది ఇప్పుడు స్థానిక నాయకులు సైతం టీవి చర్చలకు పిలిస్తే అబ్బా రాలేమండి బిజీ అని సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది.
* * *
తెలుగు సినిమాలో ఇటీవల డ్రగ్స్ మాఫియాలు బయటపడుతున్నాయి. మాజీ హీరోయిన్లు, తారలు వ్యభిచారం కేసుల్లో పట్టుపడ్డారు. మాఫియాలతో సంబంధాలు బయటపడడంతో తప్పించుకు తిరుగుతున్నారు. ఫ్యాక్షనిస్టు హంతకులతో వీరి సంబంధాలు బయటపడుతున్నాయి. నిండా కేసుల్లో మునిగిపోయిన సినిమా వాళ్లు సైతం మీడియాపై సెటైర్లు వేస్తున్నారు. నీతులు చెబుతున్నారు.
తెలుగు చానల్స్ చేస్తున్నదంతా తప్పేనా? సమాజంపై చూపుతున్న ప్రభావం ఏమీ లేదా? విమర్శలు ఎన్నున్నా, అందులో ఎంత వాస్తవం ఉన్నా? చానల్స్ సమాజంపై చూపిన ప్రభావం తక్కువేమీ కాదు.
* * *
చానల్స్‌లో అంతా చెడే అని చెప్పలేం, అంతా అద్భుతం అనలేం. తప్పును తప్పుగా ఎత్తి చూపవచ్చు. కానీ మీడియా విస్తృతం కావడం వల్ల అణగారిన వర్గాలు సైతం తమ గొంతు విప్పి మాట్లాడగలుగుతున్నారు. ఇది కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.
సినిమా వాళ్లే కాదు రాజకీయ నాయకులు, సామాన్యులు అన్ని వర్గాల్లోనూ మీడియా పట్ల వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. చానల్స్‌ది రెండు దశాబ్దాల ప్రస్థానం మాత్రమే. ఇందులో తప్పటడుగులు చాలానే ఉన్నాయి. కాలమే మీడియాను సంస్కరించి తీరుతుంది.
మీడియాపై వ్యతిరేకతకు అద్దం పట్టే ఫోటో ఒకటి గత రెండేళ్లలో దేశంలోని దాదాపు అన్ని భాషల్లో తిరుగుతోంది. అన్ని చానల్స్ లోగోలు, వాటి ముందు కూర్చున్న కుక్క. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషల సోషల్ సైట్స్, బ్లాగ్స్‌లలో మీడియాపై తమ భావాలు వ్యక్తం చేయడానికి ఈ ఫోటోను ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ నాయకులు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అనే భావనతో కొందరు, మీడియా పనికిమాలిన వారికి ప్రాధాన్యత ఇస్తోంది అనే కోణంలో కొందరు ఈ ఫోటోను చూపుతున్నారు.
స్వాతంత్య్ర పోరాట కాలంలో దేశంలో ప్రింట్ మీడియా వచ్చింది. సంఘ సంస్కరణ లేదా స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు అనే ప్రధాన లక్ష్యాలతోనే పత్రికలను ప్రారంభించారు. ప్రారంభ కాలంలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారు, పత్రిక నిర్వాహకులు, రాసేవారు ఎక్కువగా ఒకే వర్గానికి చెందిన వారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రధానంగా వ్యాపారమే లక్ష్యంగా పత్రికలు వచ్చాయి. యాజమాన్య వర్గం మారింది. యాజమాన్యం ఒకవర్గం అయితే ఎక్కువ మంది జర్నలిస్టులు మరో వర్గం. స్వాతంత్య్ర పోరాట కాలంలో పత్రికలు ప్రారంభించిన వర్గానికి చెందిన వారే రెండవ దశలో జర్నలిస్టులుగా ఉండేవారు. ఆర్థిక సంస్కరణల తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ కాలంలోనే చానల్స్ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. సంస్కరణల కాలంలోనే ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయి. అప్పటి వరకు మీడియాలో అధిక సంఖ్యలో ఉన్న వర్గం వారంతా ఐటి రంగాన్ని ఆశ్రయించారు. ఇటీవల కాలంలో అది మరీ ఎక్కువైంది. గతంలో ఉన్నవారు తప్ప ఇప్పుడు ఆ వర్గం వారు మీడియాలోకి రావడం తగ్గింది.
 చానల్స్‌లోకి ఇప్పుడు వస్తున్నదంతా కొత్త వర్గం, కొత్త తరం.
తెలుగులోని సోషల్ సైట్స్‌ను, చానల్స్‌ను చూస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ సైట్స్ ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ వంటి వాటిలో తెలంగాణ అనుకూలత కనిపించినా, అంతకు మించి తీవ్రమైన తెలంగాణ వ్యతిరేకత కనిపిస్తుంది. చానల్స్‌లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. ఐటి రంగంలో ఉన్నవారి హడావుడే సోషల్ సైట్స్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. అదే చానల్స్‌లోకి ఆర్థిక సంస్కరణ తరువాత ఇతర సామాజిక వర్గాల రాక ఎక్కువైంది. తొలి దశలో, మలి దశలో మీడియాలోకి వచ్చిన సామాజిక వర్గాలు ఇప్పుడు ఈ రంగంలోకి రావడానికి ఇష్టపడడం లేదు ఐటి వైపు దృష్టిసారించాయి. ప్రారంభ కాలంలో మీడియా వైపు తొంగి చూడని వర్గాల నుండే ఇప్పుడు ఎక్కువగా చానల్స్‌కు వస్తున్నారు. 

మరో దశాబ్దంలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించవచ్చు. ప్రస్తుతానికి మీడియా యాజమాన్య వర్గం ఒకటైతే, అందులో పని చేయడానికి వస్తున్న వారు మరో వర్గానికి చెందిన వారు. మరో దశాబ్ద కాలంలో యాజమాన్యాల్లో సైతం ఈ మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజికంగా అణిచివేతకు గురైన వర్గాల నుండి కూడా త్వరలోనే చానల్స్ రానున్నాయి. మీడియా చెడిపోయిందని తిట్టుకున్నా, పనికిరాని వారిని చర్చలకు పిలుస్తున్నారని గింజుకున్నా మార్పు అనివార్యం. ఈ మార్పు మంచికి దారితీయాలి.

19, అక్టోబర్ 2011, బుధవారం

అన్నలు- నేతలు - జనజీవన స్రవంతి

కనిపించే మేఘాల ద్వారా, కనిపించని గాలి ద్వారా కొందరు ప్రేయసికి కవిత్వంతో ప్రేమ సందేశాలు పంపేవారు. అక్షర శుద్ధి ఉన్న కవి ప్రేమికులు ఆకాశ మార్గం పడితే, వీటిని నమ్ముకుంటే సందేశం డెలివరీ అవుతుందో లేదో అనే సందేహం ఉన్న ఆధునిక కవులు గాలిని నమ్ముకోవడం కన్నా జీవిని నమ్ముకోవడం మంచిదని చిలకనో, పిచ్చుకనో మచ్చిక చేసుకుని సందేశం పంపేవారు.

 ప్రేమికుడు ప్రియురాలికి సందేశం పంపినట్టుగానే అప్పాయగూడెం సర్పంచ్ మొదలుకుని దేశ ప్రధాని వరకు అన్నలకు సందేశం ఇచ్చేవాళ్లు. ప్రియుడు పంపే లేఖల్లో కవిత్వం ఒలకబోసినట్టుగా వీరు అన్నలకు ఒకే ఒక మాట చెప్పేవారు ‘జనజీవన స్రవంతిలో కలవండి’ అంటూ..!

ఈ మాట అనలేదు అంటే అతను రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకోలేదన్నంతగా తిరస్కారం ఉండేది. సరస్వతి నది అదృశ్యమైనట్టు, తెలుగు భాష నుండి బడులు అదృశ్యమైనట్టు, ఇంత చక్కని మాట రాజకీయాల నుండి గుట్టుచప్పుడు కాకుండా అదృశ్యమైంది. జనజీవన స్రవంతిలో కలవడం అంటే ఏమిటి? ఓ నేతను మెల్లగా అడిగితే ఇదిగో అప్పుడోసారి ఇలానే నా జీవితం తెరిచిన పుస్తకం అంటే ఏమిటి? అని అడిగి నాకు చిరాకు తెప్పించావు, ఇప్పుడేమో జనజీవన స్రవంతిలో కవడం అంటే ఏమిటంటూ ఇబ్బంది పెడుతున్నావు. ప్రతి అడ్డమైన వాడు ఈ మాట మాట్లాడితే ఏమీ అనరు కానీ ననే్న అడుగుతారేం? అంటూ ఆ నేత గుర్రు మన్నాడు. మళ్లీ అరసున్నాను వెలికి తీసినట్టు అంతా మరిచిపోయిన జనజీవన స్రవంతిలో కలిసే మాట ఇప్పుడెందుకు అంటారా?
కాల చక్రం గిర్రున తిరగడం, చరిత్ర పునరావృతం కావడం, అంటే ఇదేనేమో..! గతంలోనేమో ప్రతి నాయకుడు అన్నలకు జన జీవన స్రవంతిలో కలవమని చెప్పేవాడా..! ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రతి ఒక్కరూ.. రాజకీయ నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని డిమాండ్ చేస్తున్నారు!
తెలంగాణ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ ఉద్యమిస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరూ మాతో చేతులు కలపండి రాజీనామా చేయండి. జనజీవన స్రవంతిలో కలుస్తారా.. చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారా? అని సీమాంధ్రలో ఉద్యమ కారులు రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో మామూలుగా ప్రశ్నించడం లేదు, జనజీవన స్రవంతిలో కలిసి మాతో పాటు ఉద్యమిస్తారా? ఆంధ్రా పాలకులకు తొత్తులుగా, తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారా? తేల్చుకోండి అంటూ తెలంగాణ ఉద్యమ కారులు మండిపడుతున్నారు. 

దాదాపు రెండేళ్ల నుండి రాష్ట్రంలో రాజకీయ నాయకులు జనజీవన స్రవంతికి దూరంగానే ఉంటున్నారు. నియోజక వర్గానికి వెళితే తెలంగాణ ఏమైందంటూ నిలదీస్తారని తెలంగాణ నేతలంతా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. జనజీవన స్రవంతిలో కలువ లేక వీరు పడుతున్న కష్టాలు ఆ పగవాడికి కూడా వద్దనిపిస్తోంది.
నా నుండి ఎలాంటి వాడు కూడా తప్పించుకోలేడు.. అని శనిదేవుడు శివునితో పందెం వేశాడట! సరే చూద్దామా? దమ్ముందా? ధైర్యం ఉందా? తేల్చుకుందాం అని ఇద్దరు సవాళ్లు విసురుకున్నారు. శని ననే్నం చేస్తాడో చూస్తానంటూ శివుడు అడవిలో ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడట! తర్వాత ఏదో పొడిచేస్తానన్నావు, పత్తా లేకుండా పోయావు, ఏమైంది నీ సవాలు? అని శివుడు నిలదీశాడు. కైలాసంలో ఉండాల్సిన మీరు, అడవిలో చెట్టుతొర్రలో వారం పాటు బతుకీడ్చారంటే నా శక్తి కాకుండా ఇంకేమిటని శని నవ్వాడు..! అధికారం చెలాయించాల్సిన మంత్రులు రహస్య జీవితం గడుపుతూ అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి చేరుకోవడానికి మించిన శని ప్రభావం ఏముంటుంది. జనజీవన స్రవంతిలో కలవాలని ఒకవైపు మంత్రులను జనం నిలదీస్తున్నారు, సరే పిలిచారు కదా...అని వస్తే కోడిగుడ్లతో కొడుతున్నారు. పదవి లేనిదే రాజకీయాల్లో బతకడం కష్టం అని నాయకులు ఇంత కాలం అనుకునే వారు. పదవి లేకపోయినా బతక వచ్చు కానీ జనజీవన స్రవంతిలో కలవని రాజకీయ జీవితం కూడా ఒక జీవితమేనా? అని ఇప్పుడు వాపోతున్నారు. అల్లా టప్పా నాయకులకే కాదు జగన్, చంద్రబాబు, చిరంజీవి వంటి పాపులర్ నాయకులకు సైతం ఈ బాధ తప్పడం లేదు. రాష్ట్రంలో ఒక ప్రాంతంలో జన జీవితానికి వీళ్లు పూర్తిగా దూరమయ్యారు.
మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ భారత్‌కు వచ్చాక, ఇప్పుడు ననే్నం చేయమంటారు? అని తిలక్‌ను అడిగారు. ముందు జనజీవన స్రవంతిలో కలవమని గాంధీకి తిలక్ చెప్పారు. అంటే ముందు దేశమంతా తిరిగి జనంలో కలువు ఏం చేయాలో నీకే ఆలోచన వస్తుంది అని చెప్పారు. ఆ మాట విని ఆచరణలో పెట్టి మహాత్ముడయ్యారు. త్వరలోనే పట్ట్భాషేకం అనుకుంటూ మురిసిపోయి ముందు యువరాజుతో పరిచయం పెంచుకుందామనుకున్న జగన్‌కు హఠాత్తుగా తండ్రి మరణంతో ఏం చేయాలో అర్ధం కాలేదు. ముందు జనజీవన స్రవంతిలో కలువు.. ఆలోచన అదే వస్తుందని శ్రేయోభిలాషులు చెప్పడంతో ఆయన అదే పనిలో వున్నారు. దేవతలకు అమృతం ఎలాంటిదో.. రాజకీయాల్లో ఉన్నవారికి జనజీవన స్రవంతిలో కలవడం అంత శక్తివంతమైంది. జనజీవన స్రవంతిలో కలిసి చెడిపోయన నాయకుడింతవరకు లేడు.
గణాధిపత్యం కోసం పోటీలో సైతం జనజీవన స్రవంతిలో కలవడమే షరతు! గణాధిపత్యం కావాలని వినాయకుడు, సుబ్రమణ్యస్వామి పోటీ పడితే సరే లోకం చుట్టిరండి అనగానే.. సుబ్రమణ్యస్వామి నిజంగానే తిరిగి వస్తే వినాయకుడు తెలివిగా తల్లిదండ్రుల చుట్టు తిరిగి పని పూర్తి చేసుకున్నారు. అంటే దొడ్డదారిలో జనజీవన స్రవంతిలో కలవడం అనేది ఆ కాలం నుండే ఉందన్నమాట! కొందరు జనం చుట్టూ తిరుగుతుంటే కొందరు తెలివిగా అమ్మ చుట్టు తిరిగి అందలమెక్కుతారు. అమ్మదయ ఉంటే జనజీవన స్రవంతిలో లేకపోయినా అధికారం దక్కొచ్చు కానీ అది ఎల్లకాలం నిలువదు. ఎందుకంటే ఇప్పుడు జనం నుండి వినిపిస్తున్న డిమాండ్ ‘నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలి’!!

18, అక్టోబర్ 2011, మంగళవారం

తెలంగాణ, సీమాంధ్రల్లో చానల్స్ ప్రసారాలపై నిషేధం



తెలంగాణ, సీమాంధ్ర ఈ రెండు ప్రాంతాల మధ్య ఏ ఒక్క విషయంలోనూ ఇప్పుడు ఏకాభిప్రాయం కనిపించడం లేదు. కానీ రెండు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన ఘనత మాత్రం మన తెలుగు చానల్స్‌దే. ఔను నిజం చానల్స్‌ను నిషేధిస్తాం అంటూ ఇటు తెలంగాణ ఉద్యమకారులు, సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది. అమెరికాలోని చానల్స్‌ను సైతం మనం హాయిగా వీక్షించవచ్చు. కానీ పొరుగుననే ఉన్న పాకిస్తాన్ చానల్స్ చూడలేం. పాకిస్తాన్ సైతం అంతే ఇండియా చానల్స్ తప్ప అక్కడ అన్ని చానల్స్ చూడవచ్చు. పాకిస్తాన్ చానల్స్ ప్రసారాలను ఇండియాలో నిషేధిస్తే, ఇండియా న్యూస్ చానల్స్‌పై పాకిస్తాన్‌లో నిషేధం ఉంది.
ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో కాదు కానీ కేబుల్ ఆపరేటర్ల స్థాయిలో తెలంగాణ, సీమాంధ్రల్లో ఇండియా పాకిస్తాన్ మాదిరిగానే చానల్స్ ప్రసారాలను నిలిపివేసే ప్రయత్నం మొదలైంది. ఒకటి రెండు చానల్స్ విషయంలో ఈ నిషేధం అమలవుతోంది కూడా...
అసలే చానల్స్ సంఖ్య ఎక్కువ పోటీ పెరిగిపోయింది. దానికి తోడు ఉద్యమాల వల్ల వ్యాపారం తగ్గింది. ఇలాంటి పరిస్థితిలో రేటింగ్ పెంచుకోవడం, తద్వారా ఆదాయం పెంచుకోవడం ఎలా అని చానల్స్ తంటాలు పడుతుంటాయి. ఒకవైపు ఈ సమస్యలుంటే మరోవైపు అటు సీమాంధ్ర జెఎసి, ఇటు తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ జెఎసిలు మీ వైఖరి మార్చుకోకపోతే మా ప్రాంతంలో మీ చానల్స్ ప్రసారాలను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాలకు ప్రాధాన్యత ఇస్తూ చానల్స్ ప్రసారాలు చేస్తే సహించేది లేదు, సీమాంధ్రలో వాటి ప్రసారాలు నిలిపివేయడానికి ఆపరేటర్లను కోరనున్నట్టు సీమాంధ్ర జెఎసి నాయకులు ప్రకటించారు.
 నాగార్జున యూనివర్సిటీలో జరిగిన 14 యూనివర్సిటీల సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసిలో చానల్స్‌పై చర్చించారు. తెలంగాణ ఉద్యమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రసారాలు సాగిస్తూ అడ్డుకుంటామని, ప్రసారాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఇక మరోవైపు సీమాంధ్ర కార్పొరేట్ కాలేజీలకు చెందిన వారితో కలిసి తల్లిదండ్రుల పేరుతో ర్యాలీలు తీసి ఉద్యమాన్ని దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నాలకు చానల్స్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి, ఈ వైఖరి మార్చుకోకపోతే తెలంగాణలో ఈ చానల్స్ ప్రసారాలను నిలిపివేస్తాం అని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల జెఎసి ప్రకటించింది.
‘రాష్ట్రంలో వేర్పాటు ఉద్యమ పాపం మీడియాదే’ అని సమైక్యాంధ్ర ఐకాసా కన్వీనర్ ఎన్.శామ్యుల్ , గౌరవాధ్యక్షుడు పి.నరసింహారావులు విమర్శించారు. చానల్స్ తమ రేటింగ్ పెంచుకోవడానికి రాష్ట్రంలో లేని సమస్యలు సృష్టించి గమ్యం లేని కొంత మంది రాజకీయ నాయకులతో చర్చలు పెట్టి వేర్పాటు ఉద్యమానికి దర్శకత్వం వహిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.
రెండు ప్రాంతాల వారు చానల్స్ తీరుపై మండిపడుతున్నారు అంటే చానల్స్ నిజాయితీగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నాయని సంబరపడొచ్చా? వాదన కోసం ఇది బాగానే ఉంటుంది కానీ నిజంగా చానల్స్ అలా ఉన్నాయా? నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయా?
సర్వోదయ ఉద్యమ ప్రచారం కోసం గతంలో ఒకసారి మహాత్మాగాంధీ మనవరాలు హైదరాబాద్‌లో విస్తృతంగా పర్యటించారు. సర్వోదయ నియమాల్లో ఎన్నికల్లో ఓటు వేయకూడదనే ఒక నిబంధన ఉందని ఆమె చెప్పుకొచ్చారు. సర్వోదయ సభ్యులు ఎవరూ ఎన్నికల్లో ఓటు వేయరు. ఓటు విషయంలో నక్సలైట్ల మార్గం అనుసరించడం ఏమిటని అడిగినప్పుడు ఆమె చెప్పిన విషయం ఆలోచింపజేసే విధంగా ఉంది. మనం ఒక పార్టీకి ఓటు వేశాం అంటే మనపై ఆ పార్టీ ప్రభావం ఉంటుంది. ఆ పార్టీకి ప్రయోజనం కలిగే విధంగా వ్యవహరించాలనుకుంటాం. అదే విధంగా సర్వోదయ సభ్యులు ఓటు వేయడం ద్వారా ఏదో ఒక పార్టీకి చెందిన వారు ఆనే ముద్ర పడితే మా లక్ష్యాలు దెబ్బతినవచ్చు అందుకే మేం ఓటింగ్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
పార్టీకి ఓటు వేస్తేనే పార్టీ వారమై పోతాం, వారికి అనుకూలంగా పని చేయవలసి వస్తుందనుకున్నప్పుడు మన చానల్స్ వాళ్లు అంత కన్నా పవిత్రులా? పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి చానల్స్ నిర్వహించేది దేశాన్ని ఉద్ధరించడానికి కాదు. ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. యజమానులైనా, అందులో పని చేసేవారైనా యంత్రాలు కాదు కదా వారూ మనుషులే తమకు నచ్చిన పార్టీకి, ప్రాంతానికి, సామాజిక వర్గానికి ప్రయోజనం కలిగే విధంగా వ్యవహరించాలనే ఆలోచన రావడం సహజమే.
డిసెంబర్ 9న కేంద్రం పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్టు ప్రకటించేంత వరకు తెలుగు చానల్స్ వైఖరి ఒక విధంగా ఉంటే, ఆ తరువాత మారిపోయింది. అప్పటి వరకు తెలంగాణ ఉద్యమం అంటే రేటింగ్ పెంచుకోవడానికి ఉపయోగపడే వార్త మాత్రమే. అసెంబ్లీలో తీర్మానం వరకు తెలంగాణకే మా మద్దతు అని ప్రకటించిన రాజకీయ నాయకుల వలెనే చానల్స్ సైతం తెలంగాణ ఉద్యమానికి మంచి కవరేజీ ఇచ్చాయి. కేంద్రం ప్రకటన వెలువడ్డాక రాజకీయ పక్షాలు ప్లేటు ఫిరాయించినట్టుగానే చానల్స్ ప్లేటు ఫిరాయించాయి. ఏదో ఉద్యమం వరకు సరే అనుకుంటే చివరకు తెలంగాణ వాస్తవ రూపం దాల్చడం ఏమిటని అప్పటి నుండి విధానం మార్చుకున్నారు. ఇదే సమయంలో పలు కొత్త చానల్స్ రావడం, చివరకు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న టిఆర్‌ఎస్ సొంతంగా ఒక చానల్‌ను ప్రారంభించింది. చానల్స్ వైఖరిపై అనేక సార్లు తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల జెఎసి మండిపడింది.
 టీవి9ను తెలంగాణలో బహిష్కరించినట్టు ప్రకటించింది. ఇతర చానల్స్‌కు సైతం ఇదే విధంగా వార్నింగ్‌లు ఇచ్చారు. ఇప్పుడు ఒకవైపు తెలంగాణ ఆపరేటర్లు హెచ్చరిస్తుంటే, ఇదే విధంగా సీమాంధ్ర ఆపరేటర్ల ద్వారా సీమాంధ్రలో చానల్స్ ప్రసారాలను నిలిపివేస్తామని సీమాంధ్ర జెఎసి ప్రకటిస్తోంది. డజనుకుపైగా న్యూస్ చానల్స్ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారివి కాగా, రెండు చానల్స్ యజమానులు మాత్రం తెలంగాణ వారు. ఈ రెండింటిలో ఒక చానల్ పేరే టీ న్యూస్ (తెలంగాణ న్యూస్) అంటే తెలంగాణ చానల్ ప్రసారాలను సీమాంధ్రలో నిలిపివేస్తామని ప్రకటిస్తే అది విడ్డూరంగా ఉంటుంది.

 ఒకవేళ ప్రసారాలను నిలిపివేయాలంటే ముందు సీమాంధ్రలో తెలంగాణ చానల్ ప్రసారాలు చూపించాలి. అదే తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు ప్రసారాలను సీమాంధ్ర చానల్స్ ప్రసారాలు నిలిపివేయాలనుకుంటే డజను చానల్స్ ఉన్నాయి. ఒక చానల్ ఒక ప్రాంతానికి అనుకూలం అనో వ్యతిరేకం అనో ముద్ర పడితే ఆ చానల్‌కు నష్టమే, రాజకీయ ప్రయోజనాలు, ప్రాంత ప్రయోజనాలపై ఆసక్తి ఉండడం సహజమే కానీ ఇలాంటి వ్యవహారాల్లో అవకాశం ఉన్నంత వరకు సంయమనం పాటించడం మంచిది. విద్యా సంస్థల బంద్ వల్ల తెలంగాణ విద్యార్థులకు ఒక సంవత్సరం జీరో ఇయర్‌ను చేస్తారట! ఇది ఎన్‌టీవి శుక్రవారం నాటి కథనం. ప్రభుత్వం చేయడం కాదు ... అలా చేయమని ఎన్‌టీవి ఉద్యమాన్ని నిర్వహించినా సాధ్యం కాదు.

12, అక్టోబర్ 2011, బుధవారం

హే కృష్ణా!.. జై తెలంగాణ.. జై సమైక్యాంధ్ర....జైతెలుగు నాయుడు



‘‘మరేటి సేద్దామంటావ్!’’ అని ఒకరంటే ‘‘నేనేటి సెప్తా’’ అంటూ మరో నాయకుడు అంతే అసహనంగా బదులిచ్చాడు.
పూర్వకాలం నాటి జమీందారు బంగ్లాలా, కార్పొరేట్ కంపెనీ ఆఫీసులా ఉన్న ఆ భవనం చుట్టూ చేరి చాలా మంది నాయకులు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. అపరిచితుడు వీరి మాటలకు అడ్డుతగులుతూ ‘‘తెలుగు భవనం ఇదేనా? బోర్డు కూడా లేదిమిటి?’’ అని ఆశ్చర్య పోయాడు. ‘‘ తటస్థ భాషలో ఉంది మీకు కనిపించదు.

 మాది ప్రాంతీయ పార్టీ. చూపు జాతీయం, ఆలోచన అంతర్జాతీయం. ఇంగ్లిష్‌లో బోర్డు పెడితే తెలుగు, ఉర్దూ, హిందీ భాషల వారికి దూరమవుతాం, సరే తెలుగులో పేరు పెడితే ఏ ప్రాంత మాండలికంలో పెట్టాలి? పార్టీని పోషించేది మేం కాబట్టి మా మాండలికమే కావాలని కోస్తా వాళ్లంటారు, తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ మాండలికంలో పెట్టమని ఈ ప్రాంతం వారంటారు, మేం రాజధానిని త్యాగం చేశాం కనీసం బోర్డుమీద మా మాండలికంలో పేరు పెట్టొచ్చు కదా అని రాయలసీమ వాళ్లంటారు. మేమేమన్నా రాష్ట్రం అడుగుతున్నామా? మా ఉత్తరాంధ్ర మాండలికం అంటే మీకంతా చిన్నచూపా? అని ఇజీనగరం వాళ్లు వాదించేశారు. అందుకే అందరి కోసం తటస్థ భాషలో పెట్టారు’’ అని తెలుగునేత చెప్పుకొచ్చాడు.

‘‘మీరేమీ అనుకోనంటే చిన్న సహాయం’’ కోస్తా నాయకులు చాలా మర్యాదతో తెలంగాణ నాయకులను అడిగారు. తాము కూర్చున్న కుర్చీలను అడుగుతున్నారేమో అనుకుని తెలంగాణ నాయకులు లేచి నిలబడ్డారు. ‘‘మేం గొడారికెళ్లాలి?’’ అన్నారు. ‘‘అడవులకెళ్లాల్సిన ఖర్మ మనకెందుకండీ ఈ సారి మన పార్టీ గెలుస్తుంది మీరు భయపడకండి’’ అంటూ తెలంగాణ నేత ధైర్యం చెప్పబోయాడు. ‘‘ఎడారి కాదండీ, గొడారి అంటే గోదావరి ట్రైన్ కన్న మాట. టైం అవుతోంది. అధినేతతో మీ సమయంలో మేం మాట్లాడతాం, మా సమయం మీరు తీసుకోండి’’ అని కోరాడు.
అగ్నిగుండం అవుతుంది, తలలు తెగుతాయి.. అంటూ కృష్ణా జిల్లా యువనేత బట్టీ పడుతున్నాడు. వెరీగుడ్ బాగా మాట్లాడుతున్నావ్ అని  తెలుగు నాయుడు అతని భుజం తట్టి అభినందించాడు. గుంటూరు సీనియర్ నేత తెలుగునాయుడి చెవి దగ్గరకు తన నోటిని పంపించి సార్ ఆ డైలాగులు మనోడి సొంతం కావు, ఆ తెలంగాణ పార్టీ నాయకుడు ఎప్పుడో వాడేసిన డైలాగులను ఇప్పుడే మా ముందే బట్టీ పట్టి చెబుతున్నాడని అన్నాడు.

 ‘‘మీ ప్రాంతంలో అస్సలు ఉద్యమం లేకుండా అంతా ప్రశాంతంగా ఉంటే పార్టీ మనుగడ ఎలా ఉంటుంది’’ అని తెలుగునాయుడు ఉత్తరాంధ్ర నాయకులను నిలదీశాడు. మేం ఎంత చెప్పినా మా ప్రాంతంలో సమైక్య ఉద్యమం సాగడం లేదు సార్! పోనీ ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం నడపమంటారా? అని భారీ నాయుడు అడిగాడు.
 ఆయన వైపు అనుమానంగా చూస్తూ ‘‘ఏంటీ నాయుడు గారు బాగానే సంపాదించినట్టున్నారు, ముఖ్యమంత్రిని అయిపోదామనుకుంటున్నారా? ఇప్పటికే రెండు కళ్లంటున్నాను, మీరు ఉత్తరాంధ్ర ఉద్యమం అంటే అప్పుడు నేను మూడు కళ్ల సిద్ధాంతం చెప్పాలి’’ అంటూ వారిని పంపించి, రాయలసీమ నాయకులను పిలిచారు.

 ఫోన్‌లో ఢిల్లీలోని జాతీయ నాయకుడితో, ఏం చేయదలుచుకున్నారో మీరు నాకు ఎప్పటికప్పుడు చెప్పండి, సలహాల కోసం నా సెల్‌ఫోన్ లైన్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’’ అంటూ తెలుగునాయుడు మాట్లాడుతుండగా, నల్లగొండ నాయకుడు చిటికెన వేలు చూపుతూ లోనికి పరిగెత్తుకొచ్చాడు. మిస్టర్ పెళ్లాంలో ఆమని కోసుకుపోయిన తన చిటికెన వేలివైపు రాజేంద్రప్రసాద్ చూడాలని ఆశపడ్డట్టుగా ఆశగా చూశాడు. అటు చూడకుండానే కనులతోనే ఏంటన్నట్టు అధినేత ప్రశ్నించాడు. బాత్రూమ్‌కు వెళ్లాలి మీ అనుమతి అంటూ నసిగాడు. తెలంగాణ సాధన ఉద్యమం కోసం మీకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చాను కదా? ఏ క్షణంలో ఏం చేయాలో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నా కదా? బాత్రూమ్‌కు వెళ్లాలంటే మీ కన్వీనర్ అనుమతితో వెళ్మొచ్చు కదా? అని కోపంగా పంపించేశాడు.
* * *
ఇక్కడ ఇలా ఉంటే అక్కడ ఇటలీ భవన్‌లో ...
* * *
సత్తిబాబు ఫ్యాక్స్ దగ్గరే తిష్టవేసి హై కమాండ్‌కు ఎప్పటికప్పుడు సమాచారం పంపుతున్నారు. పరిస్థితులు ఇక్కడ చాలా ఘోరంగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర సత్తిబాబునో, గోదావరికి చెందిన మెగాజీవినో అర్జంట్‌గా సిఎంను చేసేయండి అది తప్ప సమస్యకు మరో పరిష్కారం లేదు అనేది ఆ ఫ్యాక్స్ సందేశాలన్నింటి సంక్షిప్త సారాంశం.
* * *
సమయం ఎక్కువగా లేకపోవడంతో అన్ని ప్రాంతాల నాయకులకు ఉమ్మడిగా సందేశం ఇవ్వడానికి తెలుగునాయుడు సమావేశ మందిరానికి అందరినీ పిలిచాడు. ‘‘ప్రత్యేక రాష్ట్రం కోసం భూ కంపం సృష్టించండి.... 60 ఏళ్ల నుండి మీకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు’’ అంటూ గంట ఉపన్యసించాడు. వెంటనే సమైక్య రాష్ట్రం వల్ల రాష్ట్రం ఏ విధంగా సమగ్రాభివృద్ధి జరుగుతుందో సీమాంధ్ర నాయకులకు గణాంకాలతో సహా తెలుగు నాయుడు మరో గంట వివరించాడు. వెళ్లండి మీమీ ప్రాంతాల్లో మహోద్యమాన్ని నిర్వహించండి.. అని బోధించి పంపాడు. అక్కడ జై తెలంగాణ జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నుముట్టాయి.
* * *
కోస్తా నేతలు పరిగెత్తుకొచ్చి కార్యాలయ ఇన్‌చార్జ్‌తో ‘‘తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత-ఉద్యమించాల్సిన తీరు బుక్‌లెట్స్ సీమాంధ్ర వారికిచ్చారు, సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి బుక్‌లెట్‌ను తెలంగాణ వారికిచ్చారు కొంప మునిగింది’’ అని వాపోయారు.
ఆ బుక్‌లెట్స్ తీసుకున్నవారంతా వెళ్లిపోయారు ఇప్పుడెలా అని కార్యాలయ బాధ్యులు తలపట్టుకున్నారు.
* * *
అపరిచితుడు అంతా రహస్యంగా విన్నాడు. తెలుగు నాయుడు తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత, ఉద్యమం సాగించాల్సిన తీరు ఎంత అద్భుతంగా చెప్పాడో, సమైక్యాంధ్ర గురించి అంతే అద్భుతంగా చెప్పాడు. ఇలాంటి నేత నిజంగానే ప్రపంచంలోనే అరుదు అనుకున్నాడు.
‘‘ అర్జునా నీవు నిమిత్త మాత్రుడవు, చంపేదీ నేనే, చనిపోయేది నేనే, అంతా నాలోనే లీనమవుతున్నారు. తెలంగాణ ఉద్యమం చేయించేది నేనే, సమైక్యాంధ్ర ఉద్యమం చేసేది నేనే అంటూ బోధిస్తున్న అపర కృష్ణునిలా కనిపించాడు తెలుగునాయుడు అపరిచితుడికి. హే కృష్ణా మళ్లీ జన్మించావా? అని అపరిచితుడు కింద పడిపోయాడు.

11, అక్టోబర్ 2011, మంగళవారం

ఢిల్లీ నేతలను హడలెత్తిస్తున్న తెలుగు చానల్స్ విపరీత వ్యాఖ్యానాలు


 

చంద్రుడిలో మచ్చ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనిపిస్తుంది. శిశువుకు పాలిస్తున్న తల్లిలా కొందరికి కనిపిస్తే, త్రాచుపాములా ఒకరికి కనిపించింది. ఒక్కో కవికి చంద్రునిలో మచ్చలు ఒక్కోలా కనిపిస్తాయి. మీరు మనసులో ఒక రూపాన్ని తలుచుకుని మబ్బులను చూడండి మబ్బుల్లో అచ్చం ఆ రూపమే కనిపిస్తుంది. వినాయకుడిని తలుచుకుని అదే పనిగా మబ్బులను చూస్తే అందులో వినాయకుడి రూపం ఉన్నట్టు అనిపిస్తుంది.

 విషయం ఏమంటే ఈ మధ్య నాయకులు మాట్లాడే మాటలు మన చానల్స్‌కు సైతం అదే విధంగా వినిపిస్తున్నాయి. తమ చానల్ ఏం కోరుకుంటే నాయకుల నోటి నుండి వచ్చిన మాటలకు అదే అర్థం స్ఫురిస్తోంది. తెలుగు చానల్స్ దెబ్బకు ఢిల్లీ నాయకులు సైతం హడలెత్తిపోతున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ రాష్ట్రంలో మూడు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులతో చర్చించి తెలంగాణ అంశంపై హై కమాండ్‌కు ఒక నివేదిక అందజేశారు.

 ఆ నివేదికలో ఏముందో ఆయన ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. కానీ ఆయన నివేదిక ఇంకా అధిష్టానం చేతిలో పెట్టకముందే తెలంగాణపై మూడు ప్రతిపాదనలు చేశారని, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ చానల్స్ ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు ప్రసారం చేశాయి. ఖంగుతిన్న గులాంనబీ ఆజాద్ నేను ఈరోజు తెలుగు చానల్స్‌ను కూడా చూశాను, మీ ఇష్టం వచ్చినట్టు ప్రసారం చేశారు. నేను ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు, నేను ప్రతిపాదనలు చేశానని మీరెలా ప్రసారం చేస్తారని ప్రశ్నించి, చానల్స్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయనే కాదు చివరకు పెద్దగా మాట్లాడేందుకు ఇష్టపడని, వివాదాలకు దూరంగా ఉండే ప్రణబ్ ముఖర్జీకి సైతం తెలుగు చానల్స్ ఘాటు ఏంటో తెలిసొచ్చింది.

 ప్రతి సంవత్సరం దసరా పండుగకు సొంత గ్రామంలో గడపడం ఆయనకు అలవాటు. ఎన్‌డిటీవీ వాళ్లు ఆయన్ని గ్రామంలోనే కలిసి ఇంటర్వ్యూ చేశారు. సాధారణంగా స్టూడియోలో మాట్లాడితే శబ్దంలో క్లారిటీ ఉంటుంది. గ్రామంలో ప్రణబ్ మాట్లాడినప్పుడు శబ్దం స్టూడియోలో ఉన్నంత స్పష్టంగా లేదు. దానికి తోడు విషయం తెలంగాణకు సంబంధించింది. ఇంకేం తెలుగు చానల్స్ వీరంగం వేశాయి. అన్ని చానల్స్ కన్నా మిన్నగా ఆయన మాటలతో ఐ న్యూస్ అనువాదంలో వీర విహారం చేసింది. ప్రణబ్ ఇంటర్వ్యూ పూర్తి పాఠం రాత్రి 9.30కి చూపిస్తారని ఎన్‌డిటీవీ వార్తల్లో కొద్ది భాగం చూపితే, ఉదయం ఎనిమిది గంటల నుండే తెలుగు చానల్స్ దీనిపై చర్చలు నిర్వహించింది. 

తెలంగాణ ఏర్పాటు చేస్తే మరో పది రాష్ట్రాలు ఏర్పాటుకు డిమాండ్ వస్తుందని ప్రణబ్ చెప్పినట్టు ఐ న్యూస్ స్క్రోలింగ్ విడుదల చేసింది. మొదటి గంట వరకు ఇతర చానల్స్ కొంత సంయమనం పాటించాయి, ఆ తరువాత ఐ న్యూస్ తరహాలోనే ఇతర చానల్స్ కూడా విజృంభించాయి. అప్పటి వరకు తెలంగాణ సంక్లిష్టమైన సమస్య అని ప్రణబ్ చెప్పారని చెప్పిన ఇతర చానల్స్ గంట తరువాత ఐ చానల్ తరహాలోనే తెలంగాణ ఏర్పాటు చేస్తే పది రాష్ట్రాల డిమాండ్ వస్తుందని ప్రణబ్ అన్నారని చెప్పుకొచ్చాయి. ఆయా చానల్స్ తమతమ పాలసీలకు అనుగుణంగా ప్రణబ్ మాటలను తమకు తోచిన విధంగా అనువాదం చేసుకున్నాయి.

 నిజానికి ప్రణబ్ ముఖర్జీ గత 60 సంవత్సరాలుగా తెలంగాణ సమస్య ఏ విధంగా ఉందో చెప్పుకుంటూ వచ్చారు. రాష్ట్రాల ఏర్పాటు అంశం, మద్రాసు ప్రెసిడెన్సీ, ముంబాయి ప్రెసిడెన్సీ తదితర అంశాల చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు. ఆ మాటలు కాస్తా పరమానందయ్య శిష్యుల వంటి తెలుగు చానల్ పాలిట పడి అనేక రూపాలు సంతరించుకున్నాయి. నాలుగు వందల సంవత్సరాల నుండి రాష్ట్రాల విభజన జరగలేదట ఇది ఐ న్యూస్ చెప్పిన చారిత్రక సత్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎన్ని రాష్ట్రాలుంటే ఇప్పుడెన్ని ఉన్నాయి. అప్పటి వరకు ఆలోచించడం కష్టం అనుకుంటే పోనీ వాజ్‌పాయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్‌డిఏ హయాంలో మూడు కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది అంటే మన తెలుగు చానల్స్ లెక్క ప్రకారం వాజ్‌పాయి నాలుగువందల సంవత్సరాల కన్నా పూర్వం ప్రధానిగా చేశారా? ఇక దేశంలో మద్రాసు, బొంబాయి రెండు ప్రెసిడెన్సీలే ఉండేవని ప్రణబ్ చెప్పారని చానల్స్ ప్రసారం చేశాయి. ఆయన చెప్పింది దక్షిణ భారతదేశంలో ఈ రెండు ప్రెసిడెన్సీలు మాత్రమే ఉండేవన్నారు, దేశం మొత్తంలో రెండని చెప్పలేదు. మన తెలుగు చానల్స్ ప్రణబ్ మాటలపై ఇంత హడావుడి చేస్తే తీరా మరుసటి రోజు ప్రణబ్ తెలుగు చానల్స్ మాటలను ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమస్యలని, కొత్త రాష్ట్రాల డిమాండ్ వస్తుందని తానేమీ అనలేదని విలేఖరుల సమావేశంలో ఖండించారు.

 ఒకవేళ ఆయన ఆ మాటలను అని తిరిగి ఖండించారని చానల్స్ భావిస్తే, అప్పుడు ఇంటర్వ్యూలో ఆయన అన్ని మాటలు ఇవి, ఖండిస్తూ ఇప్పుడు చెప్పిన మాటలు ఇవి అంటూ రెండింటిని చూపించవచ్చు కదా? అలా చేయరు ఎందుకంటే నిజానికి ఆయన ఆ మాటలు అనలేదు కాబట్టి. తెలంగాణ సంక్లిష్ట సమస్య అని చెప్పారు తప్ప తెలంగాణ ఏర్పాటు చేస్తే సమస్యలొస్తాయని, కొత్తరాష్ట్రాల డిమాండ్ వస్తుందని తెలుగు చానల్స్ చెప్పినట్టుగా ఆయన అనలేదు. ఇక ఆ రోజు ఎన్‌టీవి ఒక అడుగు ముందుకు వేసి తమ ఢిల్లీ రిపోర్టర్‌తో అప్పటికప్పుడు విశే్లషణ చేయించారు. యుపిఎ మిత్రపక్షాల్లో మమతా బెనర్జీకి తెలంగాణ ఏర్పాటుపై వ్యతిరేకత ఉందని, గుర్కాల్యాండ్ సమస్య వల్ల ఆమె వ్యతిరేకిస్తున్నారని అందుకే ప్రణబ్ అలా చెప్పారన్నారు. 

బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించగానే మమతా బెనర్జీ గుర్కాలాండ్ సమస్య పరిష్కరించుకున్నారు. అదే ఫార్ములాను ఎపికి అమలు చేస్తారా? అనే విశే్లషణలు సైతం టీవిల్లో వచ్చాయి. ఇక గతంలో స్వయంగా మమతనే విలేఖరుల సమావేశంలో తాను తెలంగాణకు వ్యతిరేకం అనే ప్రచారంలో వాస్తవం లేదని, ఆ సమస్యతో నాకేం సంబంధం అని ప్రశ్నించారు. ఈ పరిణామాలు ఆ రిపోర్టర్‌కు గుర్తులేవో లేక ఆ సమయంలో సెలవులో ఉన్నారో కానీ అప్పటికప్పుడు ఏదో చెప్పమంటే ఇలాంటివే చెబుతారు. కానీ విషయం సున్నితమైంది, రాష్ట్రం ఉద్రిక్తతతో ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు చూపాలి కానీ ఇలా సొంత కవిత్వం కలిపితే ఎలా? సోనియాగాంధీనే ప్రణబ్‌తో ఈ మాటలు చెప్పించింది అని తెలుగు చానల్స్ తేల్చిపారేశాయి. సాక్షి ఓ అడుగు ముందుకేసి రాష్టప్రతి పాలన అంటూ తేల్చేసింది. మిగిలిన చానల్స్‌కు సమైక్యం ప్రధాన సమస్య అయితే సాక్షికి వెంటనే ఎన్నికలు జరగడం అత్యవసరం.
3జి సమస్య
అసెంబ్లీ ఆవరణలోకి కెమెరాలపై నిషేధం అమలులో ఉంది. మీడియా పాయింట్‌లో సైతం అసెంబ్లీ సమావేశాలు జరిగేప్పుడే కెమెరాలకు అనుమతి. ఈ మధ్య నాగం జనార్దన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదించాలని డిప్యూటీ స్పీకర్ గదిలో తమను తాము నిర్భంధించుకుని గడియపెట్టుకున్నారు. అందులో నుండి ఒక నాయకుడు 3జి ఫోన్‌తో సాక్షి చానల్ రిపోర్టర్‌కు ఫోన్ చేశాడు. అతను తన 3జి సెల్‌ఫోన్ ద్వారా డిప్యూటీ స్పీకర్ గదిలో ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారో చానల్‌లో చూపించారు. అప్పటి వరకు వారు గదిలో ఎలా ఉన్నారో తెలియదు. 3జితో తెలిసొచ్చింది. మరి కెమెరాలను అనుమతించనప్పుడు 3జి సంగతేమిటి? 3జిపై కూడా నిషేధం విధిస్తారా? ఇదో కొత్త సమస్యనే స్పీకర్ ఇంకా దీనిపై దృష్టి సారించినట్టు లేదు.

5, అక్టోబర్ 2011, బుధవారం

సామంత ‘కిరణం’!

ఉద్యోగులంతా ఒక చోట చేరి కబుర్లుచెప్పుకుంటున్నారు. ఎప్పటిప్పుడు రహస్యంగా సమాచారం తెలుసుకోవడమే కాకుండా అంత కన్నా రహస్యంగా పైకి నివేదిక పంపడంలో నిష్ణాతుడైన సామంతరాజు కిరణుడు గోడ వెనక్కి చేరి వారి మాటలు వినసాగాడు. రాష్ట్రాన్ని చూస్తుంటే చిన్నప్పుడు చదివిన కథోటి గుర్తుకొస్తుందిరా! అని ఒక ఉద్యోగి నవ్వాడు.


 ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకడు ఏదో అడిగాడని రాష్ట్రం తగలబడి పోతుంతే నీకు కథలు గుర్తుకొస్తున్నాయా? అని మిగిలిన వారు విసుక్కున్నారు. కథకూడా అలాంటిదేలేరా! అనండంతో అంతా ఆసక్తిగా ముందుకొచ్చారు.

వెనకటికో రాజుగారు యుద్ధాలకు వెళ్లాడు. అప్పుడు సెల్‌ఫోన్ల వంటి సమాచారం లేదు కాబట్టి మన రాజుగారు భారీ సైన్యంతో యుద్ధానికి వెళ్లాక తన రాజ్యంలో పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కష్టం. కొంత కాలానికి వార్తాహరుడు వచ్చి మహారాజా మీరెంతో ప్రేమించే మీ ముద్దుల గుర్రం కాలు విరిగింది అని చెప్పాడు.


 రాజు గారి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. బాధను తట్టుకోలేక పోయారు. కొద్ది సేపటి తరువాత స్థిమిత పడి ఇంతకూ కాలు ఎలా విరిగింది అని అడిగాడు. మరి మన రాజభవనం కూలిపోయి దానిపై పడితే కాలు విరగదా? అని వార్తా హారుడు మెల్లగా చెప్పాడు, రాజుకు తల గిర్రున తిరిగినట్టు అనిపించింది. తేరుకుని రాజభవనం కూలిపోయిందా? అన్నాడు. మరి శత్రురాజులు దాడి చేసి ఫిరంగులతో పేలిస్తే రాజభవనం కూలిపోదా? అని చెప్పుకొచ్చాడు. శత్రురాజులు దాడి చేశారా? అని తేరుకోకముందే మరి వారు దాడి చేసి మీ కుటుంబాన్ని అదుపులో తీసుకుని ఫిరంగులతో రాజభవనం పేలిస్తే.... అంటూ ఒక దాని తరువాత ఒకటి చెప్పుకు పోసాగాడు.


 శత్రురాజు దాడి చేసి మీ రాజ్యాన్ని సర్వనాశనం చేసి మీ కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారని అన్ని విషయాలు ఒకేసారి చెబితే రాజుగారు తట్టుకుంటారా? గుండాగిపోదా? ఒక దాని తరువాత ఒకటి చెప్పడంతో రాజుగారు గుండెదిటవు చేసుకుని వినగలిగారు అని ఉద్యోగి కథ ముగించాడు. మన రాజు కూడా అమ్మగారికి ఇలానే సమాచారం పంపుతున్నట్టున్నాడు అని అంతా నవ్వారు.

****
కథ విన్న సామంత రాజు కిరణుడికి ఐడియా వచ్చింది. ఇంత శక్తిసామర్ధ్యాలు తన సేవలు జాతికి అవసరమనుకుని అమ్మకు ఉత్తరం రాయడం మొదలు పెట్టాడు....


 ‘‘అమ్మా మీ ప్రియపుత్రుడు కిరణుడు పంపిస్తున్న రహస్య లేఖ.. ఇక్కడ రాష్ట్ర ప్రజలు మినహా నేను సుఖంగా ఉన్నాను, అక్కడ మీరు కూడా సుఖంగా ఉన్నారని భావిస్తున్నాను. నెల నెలా నేను పంపిస్తున్న నివేదికల ద్వారా మా రాష్ట్రం ఎంత అద్భుతంగా ఉందో మీకు ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉన్నాను. ఆరేడువందల మంది యువకులు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోవడం, విద్యుత్ లేక పంటలు పండక కొందరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం వంటి స్వల్ప సంఘటనలు మినహా రాష్ట్రం అద్భుత ప్రగతి పథంలో పయనిస్తోంది. 


ప్రభుత్వం అనేది లేదు అనిపించడమే అద్భుతమైన పాలనకు చిహ్నం అని, చట్టాలు ఎంత తక్కువగా ఉంటే పాలన అంత బాగున్నట్టు అని పాశ్చాత్య రాజనీతిజ్ఞులు చెప్పారు. 


అమ్మా కావాలంటే ఇప్పుడు మీరు రాష్ట్రంలో పర్యటించండి ప్రభుత్వం అనేది ఉందని ఒక్కరన్నా చెబుతారేమో చూడండి. ప్రభుత్వమే లేనప్పుడు చట్టాలు ఎక్కడుంటాయి.? మంత్రులు ప్రభుత్వం సంగతి తేలుస్తామంటున్నారు, నేను మంత్రుల సంగతి తేలుస్తానంటున్నాను. ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. ప్రభుత్వం ఉంటే కదా పడగొట్టడానికి...


 టిబెటియన్ల గురువు దలైలామా చాలా రోజుల నుండి ప్రవాస ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అప్పుడెప్పుడో సుభాష్ చంద్రబోస్ ప్రవాస భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడట! నేను వీరందరి కన్నా ఒక అడుగు ముందుకేసి అసలు కనిపించని ప్రభుత్వాన్ని చక్కగా నడిపిస్తున్నాను. నేను పంపిన నివేదిలతోనే నాకు పదవి వచ్చిందని తెలిసి గిట్టని వారు నాపై తప్పుడు నివేదికలు పంపిస్తారు వాటిని అస్సలు నమ్మకు తల్లి. నా అంతటి వాన్ని నేనే , మరొకరు లేరు.


 ఎన్టీఆర్‌కు, వైఎస్‌ఆర్‌కు సైతం సాధ్యం కాని ఎన్నో అద్భుతాలు నేను సాధించాను. అసలు నేను ముఖ్యమంత్రిగా ఉండడానికి మించిన విచిత్రం ఏముంటుంది?? వైఎస్‌ఆర్ జగన్ అభిమానులమంటూ 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మిగిలిన వారు తెలంగాణ కోసమంటూ రాజీనామా చేశారు. వారందరి రాజీనామాలు ఆమోదిస్తే , ప్రధాన ప్రతిపక్షం బలం కన్నా మనది తక్కువ. ప్రధాన ప్రతిపక్ష ప్రాయోజిత ప్రభుత్వాన్ని నడిపిన ఘనత నాదే తల్లీ! దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు అని ప్రతిపక్షాన్ని మనం సవాల్ చేసే స్థితిలో ఉన్నాం. అప్పుడెప్పుడో పార్టీ మార్పిడి నిరోధక చట్టం లేనప్పుడు హర్యానాలో బన్సిలాల్ నేనొక్కడిని గెలిస్తే చాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్నాడని గొప్పగా చెప్పుకుంటారు.


 నేను అంత కన్నా గొప్పవాన్ని నాకు నేనే సొంతంగా గెలువలేను, సిఎమ్‌గా సొంత జిల్లాకు వెళితే ఒక్క ఎమ్మెల్యే రాలేదు అయినా నాకు ఎదురు లేదు. ఎన్టీఆర్ ఎంత గ్లామర్ ఉన్న నాయకుడైనా ప్రతిపక్షాల చేతిలో ఇబ్బందులు తప్పలేదు, వైఎస్‌ఆర్ ఎంత చరిష్మా ఉన్న నాయకుడైనా మీడియా చేతిలో ఇబ్బంది తప్పలేదు, కానీ నేను మాత్రం అటు ప్రతిపక్షం నుండి, ప్రతిపక్ష మీడియా నుండి సైతం మద్దతు సాధించాను ఇంత కన్నా శక్తివంతుడెవరుంటారు తల్లీ! ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయగలి శక్తిసామర్ధ్యాలు నాకున్నాయని తేలిపోయింది. మీరు సరే అంటే ఈరోజు నుండి మన మోహన్‌సింగ్ ప్రభుత్వంపై రోజూ నివేదికలు పంపగలను. రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించిన నాకు దేశాన్ని కూడా అంతే అద్భుతంగా పాలించాలని ఉంది....’’
అం టూ ఉత్తరం ముగించి సామంత రాజు కిరణుడు అమ్మ నుండి సమాధానం కోసం ఎదురు చూడసాగాడు.


 మనమూ ఎదురు చూద్దాం....ఈ దేశ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండబోతుందో!

4, అక్టోబర్ 2011, మంగళవారం

ప్రత్యేక చానళ్ల పరిస్థితి ఏమిటి?




 హిందీలో పలు భక్తి చానల్స్ వస్తున్నప్పుడే ఎన్‌టీవి సంస్థ వనితల కోసం ప్రత్యేకంగా ఒక వనితా చానల్, భక్తి చానల్ తీసుకు రావడానికి ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలియగానే టీవీ 9 హడావుడిగా ప్రపంచంలోనే తొలి సర్వమత అధ్యాత్మిక చానల్ అంటూ సంస్కృతి చానల్‌ను ముందుగా ప్రారంభించింది.

 అయితే ఎన్‌టీవి భక్తి చానల్ కన్నా ముందు ప్రసారాలు మొదలు పెట్టాలనే హడావుడి తప్ప చానల్‌ను విజయవంతంగా నిర్వహించడంపై శ్రద్ధ లేకపోవడంతో ఎంత వేగంగా మొదలైందో, అంతే వేగంగా చరిత్ర ముగిసింది. ఆ చానల్‌ను ఎలా నిర్వహించాలో తెలియక టీవీ 1 అని పేరు మార్చారు. ఆ చానల్ ఒకసారి దళిత ఉద్యమ చానల్‌గా కనిపిస్తోంది. మరోసారి నాటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారేమో అనిపిస్తుంది. మొత్తం మీద నానా కంగాళీ చానల్‌గా మారిపోయింది.
ఇక వనిత చానల్ పేరుకు వనిత అయినా ఒక ఎంటర్‌టైన్ మెంట్ చానల్‌గానే నిర్వహిస్తున్నారు తప్ప మిగిలిన చానల్స్ కన్నా మహిళలకు సంబంధించి పెద్దగా ప్రత్యేకతేమీ ఇందులో కనిపించడం లేదు. పాత తరం నటీనటులను అన్ని చానల్స్‌లోనూ ప్రసారం చేస్తుంటే వీళ్లు ఆనాటి హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూపుతున్నారు. వనితలో గోల్డెన్ క్లాసిక్ పాత సినిమా పాటలు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

నవ్వుల గోల
ఎంటర్‌టైన్ మెంట్ చానల్స్‌తో పాటు న్యూస్ చానల్స్ అన్నింటిలోనూ ఏదో ఒక సమయంలో కామెడీ బిట్స్‌ను చూపిస్తున్నారు. గుండెపోటు తెప్పించే వార్తల గొడవల మధ్య కాసేపు హాయిగా నవ్వుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చూసే వారి సంఖ్య బాగానే ఉంటుంది. అలాంటిది ఏకంగా 24 గంటల పాటు హాస్య కార్యక్రమాలు వస్తే ఎలా ఉంటుంది. హాస్యాన్ని ఇష్టపడే వాళ్లు ఎగిరి గంతేస్తారు కదూ! తెలుగులో 24 గంటల కామెడీ కార్యక్రమాల చానల్ ఒకటుంది. పాయసంలో రాయిలా కామెడీ బిట్స్ మధ్యలో ఆ మాటలను భరించడం కష్టంగా ఉంటోంది. కాసేపు రిలాక్స్ అవుదామని ఎంతో ఆసక్తిగా జెమినీ కామెడీ చానల్ పెట్టగానే యాంకర్‌కు ఎవరో ఫోన్ చేయడం వారిద్దరు ఒక్కో సారి చిన్ననాటి స్నేహితుల్లా, పక్కింటి పరిచయస్తుల్లా, ఒక్కోసారి ప్రేమికుల్లా మాట్లాడేసుకుంటుంటారు. టీవీలు పుట్టక ముందు రేడియోల్లో తమ పేరు వినాలనే కోరిక ఉన్నవారికి మీరు కోరిన పాటల కార్యక్రమం ఉండేది. తమ పేరు వినడానికి చాలా మంది తపన పడేవారు. జెమినీ కామెడీ ఆనాటి రోజులు గుర్తుకు వచ్చేవిధంగా ఉన్నాయి. ఇంకా రేడియో నయం తాము కోరిన పాటను కార్డుపై రాస్తే చదివే వారు కావలసిన మ్యాటర్ మాత్రమే చదివి పేరు వినిపించేవారు. ఇప్పుడేమో జెమినీ కామెడీలో ఇప్పుడే లేచావా... టిఫిన్ చేశావా? కాలేజీకి వెళ్లలేదా? అంటూ ప్రేమికుల్లా మాట్లాడుకోవడం, నీ పేరు అని యాంకర్ అడిగితే ఫోన్ చేసిన వారెవరో ఆ... అంటూ ఎవరికీ అర్థం కాకుండా ఏమిటో చెప్పడం ఈమె మళ్లీ అడగడం వినిపించడం లేదనడం... భరించడం కష్టంగా ఉంది.

 ఒక కామెడీ బిట్ కోసం ఇంత సోది భరించాలా? అనిపించి చానల్ మార్చేయక తప్పని పరిస్థితి. పోనీ ఫోన్ చేసేవారంతా టీవి చూసేస్తారు, దాంతో వీవర్ షిప్ పెరుగుతుంది అనుకుంటే అదీ లేదు. ఒక పాతిక మంది ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా వారి పేర్లే హలో అనగానే యాంకర్ ఫోన్ చేసిన వారిని గుర్తు పట్టేస్తుంది. కామెడీ బిట్‌కు కామెడీ బిట్‌కు మధ్య గ్యాప్ ఉండాలి నిజమే దాని కోసం ఈ తలనొప్పి మాటల కన్నా వినూత్నంగా ప్రయత్నం చేయవచ్చు. ఇద్దరు యాంకర్స్ హాస్యంగా మాట్లాడుకోవచ్చు. యాంకర్ల కొరత ఉందనుకుంటే తెలుగులో మరే భాషలోనూ లేనన్ని కార్టూన్లు వచ్చి ఉంటాయి. పాత పత్రికల్లో ఉన్న వాటిని చూపిస్తూ మధ్యలో డైలాగు వినిపించవచ్చు.
జీ స్మైల్ పేరుతో 24 గంటల తొలి కామెడీ చానల్‌లో 2003లో ప్రారంభించారు. ఆ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం జీ స్మైల్ ఆర్థికంగానూ బాగానే ఉందని చెబుతున్నారు. జెమినీ కామెడీ సినిమా బిట్స్‌కే పరిమితం అయితే జీ స్మైల్ మాత్రం హాస్య సినిమాలు, కామెడీ బిట్స్, కామెడీ సీరియల్స్ ప్రసారం చేస్తోంది. దేశంలో తొలి కామెడీ చానల్‌గా జీ స్మైల్ రికార్డు సృష్టించింది. తెలుగులో తొలుత నవ్వుల్ నవ్వుల్ అంటూ జెమినీ సాటిలైట్ కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ చానల్‌ను ప్రత్యేకం చేశారు. తరువాత ఇప్పుడు జెమినీ కామెడీగా మారింది. కొద్దిపాటి శ్రద్ధ చూపితే కాసేపు సరదాగా నవ్వుకుందాం అనుకునే వారి పాలిట వరంగా మారుతుంది.