28, మే 2025, బుధవారం
చిన్నప్పటి జ్ఞాపకం హైదరాబాద్ లో భారత్ -పాక్ యుద్ధ జ్ఞాపకం
ఇటీవల భారత్ - పాక్ యుద్ధ సమయంలో ట్యాంక్ బండ్ ను ఏ మీడియా అయినా గుర్తు చేస్తుందేమో అని చూశా . 1971లో జరిగిన ఇండియా పాక్ వార్ లో పాకిస్థాన్ ను జయించి మన సైన్యం స్వాధీనం చేసుకున్న యుద్ధ ట్యాంక్ ఒకటి హుసేన్ సాగర్ కట్ట మీద పాక్ మీద మన సైన్యం సాధించిన విజయానికి చిహ్నం గా నిలిచి ఉంది .
ట్యాంక్ బండ్ , వినాయక్ సాగర్ , హుసేన్ సాగర్ పేర్లు ఎన్నయినా అదో అద్భుత మైన ప్రాంతం . వందల ఏళ్ళు అయినా చెక్కుచెదరని నిర్మాణం అని కాదు . ట్యాంక్ బండ్ ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తుంది . అద్భుతం అనిపిస్తుంది .
దాదాపు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు చాలా మంది హుసేన్ సాగర్ కట్ట మీదికి వెళుతుంటే నేనూ వెళ్ళాను . హుసేన్ సాగర్ కట్ట మీద ట్యాంక్ ఏర్పాటు చేశారు ,. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని ట్యాంక్ బండ్ గా పాపులర్ అయింది . ట్యాంక్ అంటే యుద్ధ రంగంలో ఉపయోగించే వాహనం . ఇక్కడ నిజంగానే యుద్ధంలో ఉపయోగించే ట్యాంక్ ను ఏర్పాటు చేశారు . దాని పేరు మీదనే ట్యాంక్ బండ్ గా పాపులర్ .
1971లో ఇండియా పాకిస్థాన్ ల మధ్య జరిగిన యుద్ధంలో ఇండియా పాక్ ను చిత్తుగా ఓడించి బంగ్లా దేశ్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయగలిగింది . ఆ యుద్ధంలో భారత సైన్యం పాకిస్థాన్ లోకి చొచ్చుకు వెళ్లి 66 యుద్ధ ట్యాంక్ లను స్వాధీనం చేసుకుంది . అందులో ఒక ట్యాంక్ ను హుసేన్ సాగర్ కట్ట మీద 1973లో ఏర్పాటు చేశారు . సికింద్రాబాద్ వైపు నుంచి హుసేన్ సాగర్ కు వస్తుంటే కట్ట మొదట్లోనే కుడి వైపు ఈ యుద్ధ ట్యాంక్ ఉంటుంది .
ఆ ట్యాంక్ ఏర్పాటు సమయం లో అక్కడికి సమీపంలోనే ఉన్న కవాడిగూడలో ఉండేవాళ్ళం . ట్యాంక్ ఎదురుగా వైస్ రాయ్ హోటల్ . దానికి వెనుక వైపు చిన్న దారి గుండా వెళితే కవాడిగూడ . మహా అయితే వెయ్యి అడుగుల దూరం కావడం వల్ల ఆ ట్యాంక్ ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి చూశాను .
చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చి ట్యాంక్ ను చూసేవాళ్ళు . పిల్లలకు అదో జాతరలా ఉండేది . ఇప్పటిలా సెల్ ఫోన్ కెమెరాలు లేవు కానీ కొద్ది మంది ట్యాంక్ లోపల కూర్చొని కెమెరాలతో ఫోటోలు దిగేవారు . హుసేన్ సాగర్ పై మొత్తం సందడి ఇక్కడే ఉండేది . కొద్ది కాలం తరువాత రోటరీ క్లబ్ వాళ్ళు అక్కడ ఒక పార్క్ నిర్మించారు . ఆ పార్క్ లో ఒక పెద్ద అక్వేరియం భవనం కూడా నిర్మించారు . కాలం గడిచిన టి అంజయ్య బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ చేపట్టారు . ముందు నెక్లెస్ రోడ్ , ఎన్టీఆర్ మరణం తరువాత ఎన్టీఆర్ ఘాట్ నిర్మాణంతో ట్యాంక్ ఉన్న ఇటు వైపు ఎవరూ పట్టించుకోలేదు . పార్క్ పాడుపడింది . చెబితే తప్ప ఇది అక్వేరియం అంటే నమ్మని విధంగా మారింది .
2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత మరోసారి పార్క్ కళకళ లాడింది . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ట్యాంక్ బండ్ పై ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు . ఆ సందర్భంలో ఈ పార్క్ ను కూడా పట్టించుకున్నారు .
వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారని బీజేపీ అనుకూల వర్గాలు హుసేన్ సాగర్ పేరును వినాయక సాగర్ అని పెట్టినా జనం లో మాత్రం ట్యాంక్ బండ్ అనే పాపులర్ .
దాదాపు 1980 వరకు కూడా హుసేన్ సాగర్ నీళ్లు ఇప్పటి అంత ప్రమాదకరమైనవి , విషపూరితమైనవి కావు . స్థానికులు ఈత కొట్టేవాళ్ళు . నాకు ఈత రాదు కానీ బాల్యంలో పెద్ద వాళ్ళతో కలిసి వెళ్లిన జ్ఞాపకాలు ఉన్నాయి . హోలీ రోజు రంగుల్లో మునిగిన వారు ఇక్కడ స్నానం చేసేవారు . బతుకమ్మ పండుగకు చుట్టుపక్కల ప్రాంతాల వారు బతుకమ్మ ఆడి ఇక్కడే బతుకమ్మ ను నీళ్లలో వదిలి ప్రసాదం పంచేవాళ్ళు . దాదాపు 1980 తరువాత పరిస్థితి తెలియకుండానే మారిపోయింది . బతుకమ్మ పండుగ కనిపించకుండా పోయింది . తరువాత క్రమంగా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కలిసి పోయి హుసేన్ సాగర్ నీళ్లు విషపూరితంగా మారాయి . ఆ తరువాత ఇక్కడ వినాయక నిమజ్జనం హడావుడి తప్ప యుద్ధ ట్యాంక్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో సందడి లేకుండా పోయింది . తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్ నగరంలో మళ్ళీ బతుకమ్మ పండుగ కళ కనిపించింది . సంస్కృతి , పండుగలు అనేవి ఒక తరం నుంచి మరో తరానికి అలవాటు అవుతుంది . మధ్యలో ఒక తరం తప్పుకుంటే ఇక అంతే . బతుకమ్మ పండుగ ఒకటి కాదు రెండు మూడు తారలు తప్పుకున్నాయి . తెలంగాణ ఉద్యమం వల్ల హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై మళ్ళీ కనిపించింది .
చిన్నప్పుడు మొదటి సారి సినిమా షూటింగ్ చూసింది ట్యాంక్ బండ్ పైనే హిందీ సినిమా బహుశా కోరా కాగజ్ కావచ్చు . హీరో పెద్ద కారులో వెళుతుంటాడు . హీరోయిన్ ఆకు కూరలు తీసుకోని వెళుతుంటుంది . కారు తాకి కూరగాయల సంచి పడిపోతుంది . చిన్న సీన్ కు అంత సమయమా అనిపించింది .
ఎన్టీఆర్ హయాంలో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేశారు . కెసిఆర్ హయాంలో భారీ అంబెడ్కర్ విగ్రహం , అంతా వీరుల స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు .
1971లో ఇండియా పాకిస్థాన్ పై విజయం సాధించిన దానికి గుర్తుగా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుతారు . కనీసం ఆ రోజైనా ఈ యుద్ధ ట్యాంక్ వద్ద విజయ్ దివస్ నిర్వహించరు .
బుద్దా మురళి
లేబుళ్లు:
జ్ఞాపకాలు,
మా సికింద్రాబాద్ కథలు
14, మార్చి 2025, శుక్రవారం
జిందగీమే కుచ్ భీ హోసక్తా ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -118
జిందగీమే కుచ్ భీ హోసక్తా ... .
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -118
హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ప్రోగ్రాం ఒకటి జిందగీమే కుచ్ బీ హో సక్తా .. మంచి ఆసక్తికరమైన ప్రోగ్రాం . ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి సినిమా రంగంలో ఎదిగిన వారి జీవిత విశేషాలను పరిచయం చేసే కార్యక్రమం . జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు . జీవితంలో ఏదైనా జరగవచ్చు . ఆశను వదులుకోకుండా ప్రయత్నిస్తే ఏదైనా జరగవచ్చు అని చెప్పే ప్రోగ్రాం .
*** *** *****
2017 లో ఆర్ టీ ఐ కార్యాలయం.. మధ్యాన్న సమయం ఏదో పనిలో ఉండగా ఆఫీస్ బాయ్ వచ్చి ఒక విజిటింగ్ కార్డు అందించాడు . ఇద్దరు రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారులు . షఫీ కుజ్జ మా తో పాటు మరో అధికారి . ఐఏఎస్ గా రిటైర్ అయ్యాక న్యాయవాదులుగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు .
ఆర్ టి ఐ కేసు విషయంలో ఆర్ టి ఐ కమిషనర్ గా నన్ను కలవడానికి వచ్చారు .
తెలంగాణ యూనివర్సిటీ లో తమ క్లయింట్ కేసు ఉందని , కేసు త్వరగా వస్తే న్యాయం జరుగుతుంది అని చెబుతుంటే .. వాళ్ళిచ్చిన విజిటింగ్ కార్డు ను అలా చూస్తూ ఆలోచనల్లో పడిపోయి .. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను .
**** *****
డిగ్రీ పూర్తి కాగానే 1987 సెప్టెంబర్ లో మెదక్ జిల్లా ఆంధ్రభూమి రిపోర్టర్ గా సంగారెడ్డికి వెళ్ళాను . ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన లెటర్ తీసుకోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాను . అప్పుడు కలెక్టర్ షఫీ కుజ్జ మా... ఆంధ్రభూమికి కొత్తగా వచ్చాను అని లెటర్ ఇచ్చి పరిచయం చేసుకున్నాను . అంతకు ముందు జిల్లా మంత్రి కరణం రామచంద్ర రావు కు డిపి ఆర్ ఓ భూమికి కొత్త అని పరిచయం చేస్తే ఆయన ఏ మూడ్ లో ఉన్నారో భూమికి కొత్తా ? భూమికే కొత్తనా ? అని జోక్ వేశారు . 87 నుంచి బాబు సీఎం అయ్యాక అసెంబ్లీలో నే కరణం మాట్లాడుతూ మాట్లాడుతూనే అస్వస్థతకు గురై మరణించేవరకు అనేక సార్లు కరణం ఉపన్యాసాలు విన్నాను ఒక్క సారి కూడా జోక్ వేయగా వినలేదు .
కలెక్టర్ మాత్రం ఎలాంటి జోక్ వేయకుండా కాసేపు మాట్లాడి పంపించేశారు .
**** *****
తరువాత హైదరాబాద్ వచ్చాక ఓ రోజు అనుకోకుండా 1996 ప్రాంతంలో షఫీ కుజ్జ మా డ్రామా న్యూస్ కవర్ చేయాల్సి వచ్చింది . జూబ్లీ హల్ లో సీఎం చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మీడియా మొత్తం వచ్చింది . మద్యనిషేధాన్ని ఎత్తి వేయడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయం అది . ఇంకా మీటింగ్ పూర్తి కానందు వల్ల బాబు కోసం మీడియా ఎదురు చూస్తుంటే అంత పెద్ద సంఖ్యలో ఉన్న మీడియా వద్దకు షఫీ కుజ్జ మా కొన్ని కాగితాలు చదువుతూ రాష్ట్రంలో మద్యనిషేధం ఎంత ఘోరంగా విఫలం అయిందో చెబుతున్నారు . కల్తీ మద్యం తో ఎంత మంది మరణించారు . ఎన్ని అక్రమ మద్యం కేసులు , మద్యనిషేధం ఎత్తివేయక పోతే ఎంత ప్రమాదకరమో వివరించే విధంగా ఆ గణాంకాలు ఉన్నాయి . చెప్పాల్సింది అంతా ఆయన చెప్పి వెళ్లి పోయాక . కొద్ది సేపటికి సీఎం చంద్రబాబు వచ్చారు . హష్మీ అని ఉర్దూ రిపోర్టర్ బాబు రాగానే మద్యనిషేధం ఘోరంగా విఫలమైంది ? అంటూ ఆ అధికారి చెప్పిన అంకెలు చెప్పుకొచ్చాడు . నిజామా ? అని చంద్రబాబు బోలెడు ఆశ్చర్య పోయాడు. . మా అల్లుడు నా కన్నా గొప్ప నటుడు అని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ఉరికే అనలేదు .
****
కేసు త్వరగా వస్తే మా క్లయింట్ విద్యా సంవత్సరం కాపాడినవారు అవుతారు . కమిషన్ నుంచి నోటిస్ వస్తే చాలు పని అయిపోతుంది అని షఫీ కుజ్జ మా అడగగానే ప్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చి పీఎస్ ను పిలిచి వీరి కేసు వెంటనే రావాలి అని చెప్పాను . షఫీ కుజ్జ మా ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోతుంటే 1987 నాటి నా పరిచయం గుర్తు చేసి .. 96లో మద్యనిషేధం విఫలం అంటూ మీరు చదివి వినిపించిన ఆ అంకెలు అన్నీ బాబు ఆదేశంతోనే కదా ? అని అడగాలి అని నోటి వరకు వచ్చినా అడగకుండా ఉండిపోయాను .
ఏ పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్రకే పరిమితం కావడమే మంచి సంప్రదాయం అనిపించి మౌనంగానే ఉండి పోయాను . ఐఏఎస్ అధికారులు ఎంత పరిచయం ఉన్నా కొన్ని విషయాలు ముఖాముఖిలో కూడా పంచుకోరు . అలాంటిది బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ అని మీడియా వస్తే బాబుకు సంబంధం లేకుండా ఎక్సయిజ్ కమిషనర్ వచ్చి మద్యనిషేధం ఎలా విఫలం అయిందో చెబుతారా ? తెలిసిన విషయం అడగడం ఎందుకు అని అడగలేదు
సాంప్రదాయ ముస్లిం జీవనం గడిపే అతనికి ఎక్సయిజ్ శాఖ అస్సలు ఇష్టం లేదు అని విన్నాను .
1987 లో రిపోర్టర్ గా అతనికి నన్ను నేను పరిచయం చేసుకుంటే ... సరిగ్గా మూడు దశాబ్దాలు గడిచిన తరువాత ఆర్ టీ ఐ కమిషనర్ గా ఉన్న నన్ను న్యాయవాదిగా అతను పరిచయం చేసుకోవడం ఏదో సినిమా కథలా అనిపించింది ...
****
హిందూ చీఫ్ రిపోర్టర్ వర్లు ఒక సారి సి సి ఎల్ఏ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లారు . కమిషనర్ కార్యాలయంలోకి వెళ్ళగానే కమిషనర్ వర్లు ను చూసి సార్ మీరు వచ్చారా ? అని లేచి నిలబడి స్వాగతం పలికారు .. ఆ రోజుల్లో మీడియాకు ఇంత గౌరవం ఉండేది అని ముందుగానే నిరయానికి వచ్చేయకండి . కమిషనర్ లేచి నిలబడి స్వాగతమ్ పలికింది నిజమే . కానీ కారణం వేరు . హిందూ లో వర్లు చీఫ్ రిపోర్టర్ గా ఉన్నప్పుడు అతని బ్యూరోలో ఒక రిపోర్టర్ గా సి సి ఎల్ ఏ కమిషనర్ ఉన్నారు . ఎప్పుడు ఉద్యోగం వదిలి , ఎప్పుడు సివిల్స్ కు ఎంపిక అయ్యారో పెద్దగా దృష్టి పెట్టలేదు . తన బ్యూరోలో రిపోర్టర్ వద్దకు తానే ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లడం ఒక అరుదైన అనుభవం .
డక్కన్ క్రానికల్ లో అయేషా అని అమ్మాయి క్రైం రిపోర్టర్ . క్రైం రిపోర్టర్ లు ఎక్కువగా పోలీసులు ఇచ్చిన సమాచారం పై ఆధారపడాలి . ఈ అమ్మాయి మాత్రం రోజూ మార్చురీకి వెళ్లి సమాచారం సేకరించేది . అయినా ఎడిటర్ జయంతి వేధిస్తోంది అని బాధపడేది . ఆ వేధింపులు తట్టుకోలేక డక్కన్ క్రానికల్ కు రాజీనామా చేసి ఉర్దూ పేపర్ లో చేరింది . ఆర్ టీ ఐ కమిషనర్ గా ఓ రోజు కేసులు చూస్తుంటే ఓ అధికారి మా కలెక్టర్ స్ట్రిక్ట్ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం అని కలెక్టర్ పేరు చెప్పగానే సంతోషం వేసింది . ఆయెషా గ్రూప్ వన్ కు సెలక్ట్ అయింది అని తెలుసు చిన్న జిల్లాలు ఏర్పాటు చేసిన సమయంలో ఆయెషా ను జిల్లా కలెక్టర్ గా నియమించారు . ఓపిక తో ఉండి తమ నైపుణ్యాలు పెంచుకుంటూ పోతే అవకాశాలు అవే వస్తాయి అని చాలా మంది నిరూపించారు .
****
ఐతే జర్నలిజం లోకి రమ్మంటావా ?
అని ప్రశ్నిస్తే వద్దే వద్దు అంటాను . ఆర్థిక సంస్కరణల తరువాత అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి . అదే సమయంలో అంతే స్పీడ్ గా మీడియా రంగంలో అవకాశాలు తగ్గిపోయాయి . తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో అవకాశాలు చాలా వేగంగా పడిపోయాయి . పైగా ఇప్పుడు అంతా రాజకీయ పార్టీల మీడియానే . స్వతంత్ర మీడియా అని చెప్పుకొనేది కూడా అటు రైట్ వైపో ఇటు లెఫ్ట్ వైపో స్వతంత్రంగా పని చేస్తున్నావే . 99 లో టీడీపీ స్వతంత్రులకు టికెట్లు , మంత్రి వర్గంలో స్థానం కల్పించింది . ఒక పార్టీ తరపున పోటీ చేశాక తటస్తులు ఏమిటో ? ఇప్పుడు మీడియా కూడా అలాంటి తటస్తమే . ఎడిటర్ లను , పత్రికలో వార్తలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది . లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మొదలుకొని , వెయ్యి లోపు సబ్ స్కైబర్స్ ఉన్న యూ ట్యూబ్ వరకు ఏదో ఒక పార్టీ కోసం పని చేస్తోంది . పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి మధ్యలో మీడియాలోకి వస్తే వేరు కానీ దీనిని ఉపాధిగా భావించి వస్తే దిన దిన గండం ఆరు నెలల ఆయుష్యు అన్నట్టు ఉంటుంది . వెజ్ బోర్డు సిఫారసులు ఉంటాయి .అమలు చేస్తే దాదాపుగా గ్రూప్ వన్ అధికారులకు లభించే స్థాయిలో వేతనాలు ఉంటాయి . ఒక్క ఆంధ్రభూమి తప్ప మరే మీడియా సంస్థ వీటిని అమలు చేయలేదు .
- బుద్దా మురళి (జర్నలిస్ట్ జ్ఞాపకాలు 118 )
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)