10, డిసెంబర్ 2013, మంగళవారం

భలే.. ‘క్రేజీ’వాల్!

‘నీ ఇంటికొస్తాను. నట్టింటి కొస్తాను. డేట్ నువ్వు డిసైడ్ చేసినా సరే, నన్ను డిసైడ్  చేయమన్నా సరే.. ప్లేస్ నువ్వు చెప్పినా
సరే, నన్ను చెప్పమన్నా సరే. ఫేస్‌టూ ఫేస్.. తేల్చుకుందాం’ అంటూ ఆరడుగుల విలన్‌ను నాలుగడుగుల హీరో
ఛాలెంజ్ చేసేస్తుంటాడు  -తెలుగు సినిమాల్లో. పరమ రొటీన్  డైలాగులైనా సరే, వీటితో -స్క్రీన్ మీద చప్పట్లు కొట్టించుకున్న స్టా  ర్లు -రాజకీయాల్లోకి అడుగు పెట్టి చతికిలపడ్డారు.

 ‘రాజకీయాలకు వస్తా.మీ సెగ్మెంట్‌లో  అడుగు పెడతా. అక్కడి నుంచే పోటీ
చేస్తా. డేటు, టైమూ ఎలక్షన్ కమిషన్ ఫిక్స్ చేసింది కనుక -ఫేస్ టు ఫేస్. మిమ్మల్ని ఓడిస్తా’ అంటూ రాజకీయాలకు కొత్త అయిన  కుర్రాడు -మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీని శాశించిన షీలాతో సవాల్ చేశాడు. సవాల్ వరకూ అయితే, ఒకరోజు వార్తే.
పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ, సవాల్‌ని ఆచరణలో పెట్టాడు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సెగ్మెంట్ నుంచే పోటీ చేశాడు. ఆమె డీలాపడేలా చేశాడు. కొద్దిగా రాజీపడితే ముఖ్యమంత్రి పదవి చేపట్టేంత ఘనతే సాధించాడు. అయినా, పూర్తి బలాన్ని
ప్రజలు ఇవ్వలేదు కనుక -విపక్షంలోనే కూర్చుంటానని ప్రకటించాడు. ఈ సీజన్ పొలిటికల్ హీరో సామాన్య కుర్రాడే కావచ్చు. కానీ, అతనొక ‘క్రేజీ’వాల్. అతనే అరవింద్ కేజ్రీవాల్. 
 **
ప్రస్తుతం దేశ రాజకీయాలకు  ఆశాదీపంగా కనిపిస్తున్నాడు కేజ్రీవాల్. సరిగ్గా 13 నెలల క్రితం ఆమ్
ఆద్మీ పేరిట పార్టీ పెట్టాడు. అవినీతికి వ్యతిరేకంగా  జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే
పోరాడుతున్నప్పుడే, కెజ్రీవాల్ గురించి దేశానికి తెలిసింది. రాజకీయాలను అసహ్యించుకోవడం, రాజకీయ నేతలను
తిట్టడం కాదు. రాజకీయాల్లోకి ప్రవేశించి అక్కడున్న బురదను కడిగేయాలనే ధ్యేయాన్ని మనసునిండా నింపుకున్న నాలుగు
పదుల వయసు కుర్రాడతను. ఒకప్పుడు -లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ రాజకీయ అడుగులేసినపుడూ-యువత ఇదేవిధంగా ఆశలు పెట్టుకుంది. మీవెనుక మేం ఉంటామంటూ అడుగులేసింది. ఆయన మాత్రం సురక్షిత నియోజక
వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆయనొక్కరే గెలిచారు. దాంతో కొత్త సమాజ ఆవిష్కరణపై ఆశలు పెంచుకుని వెనుక నడిచిన
యువత మాత్రం -ఆ దెబ్బతో ఒడిపోయింది. కానీ, చాలాకాలానికి -కెజ్రీవాల్ ఇప్పుడు దేశంలోని నవతరం యువతకు
ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో పూర్తి మెజారిటీ ఏ పార్టీకి దక్కని సమయంలో 28 సీట్లను
గెలుచుకున్న ఆమ్ ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిస్తానని ఆఫరిచ్చింది. సరే అని ఒక్క మాట అంటే కెజ్రీవాల్ అనే కుర్రాడు
ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మీద ఉండి ఉండేవాడు. కానీ, అతను పీఠాన్ని కోరుకోలేదు. ప్రతిపక్షానికే పరిమితమవుతామ
ని ప్రకటించాడు. కాంగ్రెస్, బిజెపి రెండూ అవినీతి పార్టీలేనంటూ విమర్శించి, రాజకీయాల్లోకి వచ్చి ప్రచారంలో అదేమాట
చెప్పిన కెజ్రీవాల్ తాము తలపండిన పదవీ కాంక్షాపరులైన నేతలం కాదని, ఈ దేశానికి ఏమైనా చేయాలని తపించే యువకులమనినిరూపించాడు. - ‘ప్రజలు మమ్ముల్ని ప్రతిపక్షంలో ఉండమని తీర్పు చెప్పారు. సమర్థంగా ఆ బాధ్యత
నిర్వహిస్తాం’ అని చెప్పుకున్నాడు. 18నుంచి 25ఏళ్ల లోపున్న యువ ఓటర్లు దేశంలో సగటున 35శాతం. వీళ్లు ఎటు మొగ్గితే
వారిదే అధికారం. రాజకీయాలను, నాయకులను తిడుతూ ఇంట్లో కూర్చోవడం కాదు, క్యూలో నిలబడి ఓటు వేస్తే ఫలితం ఎలా
ఉంటుందో ఢిల్లీ యువత చూపించింది. ఆమ్ఆద్మీ అధ్యక్షుడు కెజ్రీవాల్ మొదలుకొని ఆ పార్టీ అభ్యర్థులు, ప్రచార
బాధ్యత భుజాన వేసుకున్న వారు, చివరకు ఓటు వేసిన వారూ యువతే. అంతే తమ కోసం తామే ఒక పార్టీ
ఏర్పాటు చేసుకుని తామే ఓటు వేసుకుని తామే గెలిపించుకున్నారన్న మాట! నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
ఆదివారం ప్రకటిస్తే, నాలుగు చోట్ల బిజెపినే అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో బిజెపి మొదటి స్థానంలో నిలిస్తే
అధికారంలో ఉన్న కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. అయితే మీడియాకానీ, ప్రజల్లో చర్చలుకానీ ఈ
ఫలితాలకన్నా ఢిల్లీలో 28 స్థానాలతో రెండో స్థానంలో నిలిచినా  కెజ్రీవాల్ గురించి, ఆమ్ ఆద్మీ పార్టీ గురించే ఎక్కువగా
మాట్లాడుకుంటోంది. కచ్చితంగా ఈ ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుంది. ఢిల్లీ అనేది దేశ రాజధాని. రాజధాని నగరంలో
ఉండే రాజకీయ వాతావరణం, గ్రామీణ ప్రాంతాల్లోని వాతావరణం వేరు. కానీ ప్రజల ఆకాంక్షలు మాత్రం ఒకటే. మంచి
రాజకీయాలు ఉండాలని, పాలన బాగుండాలని, తమను పాలించే నాయకుడు బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు.
గ్రామీణ భారత దేశంలో సైతంఇప్పటికిప్పుడు గెలవక పోవచ్చు . కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కచ్చితంగా ప్రభావం చూపుతుంది.
ఎన్నికలకు ముందే ఆ పార్టీ ప్రభావం చూపింది. ఆమ్ ఆద్మీ రంగంలోకి వచ్చిన తరువాతే బిజెపి తన ముఖ్యమంత్రి
అభ్యర్థిని మార్చింది. అధికారంలోకి వస్తేనే మార్పు తీసుకొస్తారని కాదు. ఎన్నికల్లో పోటీ చేయకముందే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన పక్షం ముఖ్యమంత్రిని అభ్యర్థిని మార్చగలగడం అంటే మార్పు వచ్చినట్టే కదా! పాతతరం రాజకీయాలను,
విమర్శలు, తిట్లు, అధికారపక్షం ఏంచేసినా విమర్శించడమే ప్రతిపక్షం బాధ్యతని, అధికారంలో ఉన్నాం కాబట్టి ఇష్టం ఉన్నట్టు
చేస్తాం అనుకునే అధికార పక్షం అహంకారానికి ఆమ్ ఆద్మీ ఒక గుణపాఠం లాంటిది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన ఎనిమిది
నెలలకే అధికారంలోకి వచ్చారు. ఒక నటునిగా తనకున్న గ్లామర్ ద్వారా ఆయనిది సాధించగలిగారు. అస్సాంలో
విద్యార్థులు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు. అస్సాంలో జరిగిన ఉద్యమం ద్వారా వారిలా
చేయగలిగారు. కానీ కేజ్రీవాల్ మాత్రం అవినీతిరహిత రాజకీయాల కోసం ఉద్యమించి, ఆ ఉద్యమం ద్వారానే
రాజకీయాల్లోకి వచ్చి ఉద్యమ నేత అన్నాహజారే వ్యతిరేకించినా జనాన్ని మెప్పించి 28 స్థానాలు గెలిచాడు. కెజ్రీవాల్ విఫలమైతే దేశ యువత కథ మరోలా ఉంటుంది. వారి ఆశలు బలవుతాయి. ప్రతిపక్ష నేతగా ఆయన విజయం సాధిస్తే ఆ ప్రభావం దేశ రాజకీయాల్లో ఏదోక మేరకు తప్పకుండా ప్రభావం చూపుతుంది. గెలవడం కన్నాగెలుపును
నిలబెట్టుకోవడం కెజ్రీవాల్‌కు కత్తిమీద సాములాంటిది. ఈ పరీక్షలో విజయం సాధిస్తాడని
అనుకుందాం. సాధించాలని  కోరుకుందాం.
================

4 కామెంట్‌లు:


  1. బుద్ద మురళి గారు మీ విశ్లేషణ బాగుంది. ఆశావహమైన స్థితి. ఇప్పుడు,

    "గెలవడం కన్నాగెలుపును నిలబెట్టుకోవడం కెజ్రీవాల్‌కు కత్తిమీద సాములాంటిది. ఈ పరీక్షలో విజయం సాధిస్తాడని
    అనుకుందాం. సాధించాలని కోరుకుందాం."

    కెజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మార్పు దిశగా మనమూ అడుగులు కదులుద్దాం!

    రిప్లయితొలగించండి
  2. మీ విశ్లేషణాత్మక వ్యాసం అత్యద్భుతం. అరటిపండు వొలిచి నేరుగా నోటికందించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. Congratulations to Aam Aadmi Party and Mr. Arvind Kejriwal for making INC cry and BJP sweat in Delhi winter elections.

    ఢిల్లీ చిన్న రాష్ట్రం అవడం కేజ్రీవాల్ కి కలిసొచ్చింది.
    అయినా మోడీ ప్రభావాన్ని తట్టుకుని అన్ని సీట్లు సాధించడం గొప్ప విజయం.
    అణ్ణా హజారే పెద్ద మనసుతో, పార్టీకి మద్దతు ఇచ్చి ఉంటే పూర్తి మెజారిటీ వచ్చేది.

    రిప్లయితొలగించండి
  4. ఆమ్ ఆద్మీ ఖొఈఖా ఫలించాలనే అందరి ఉద్దేశమూ~ ఇన్ని గిమ్మిక్కులక్కరలేదేమో! వారి సపోర్ట్ తీసుకోము, మాకు బలం లేదు, ప్రభుత్వం ఏర్పాటు చేయము అని ఖచ్చితంగా చెబితే ప్రజలు హర్షించేవారు కదా! మరో చిరంజీవి కాకుండాలనే కోరిక :)

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం