9, సెప్టెంబర్ 2019, సోమవారం

ఆర్థిక భద్రత

ఈ మధ్య జాతీయ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ముంబై ఐఐటి నుంచి బిటెక్, ఎంటెక్ చేసిన యువకుడు శ్రావణ్ కుమార్ రైల్వేలో దన్‌బాద్ డివిజన్‌లో దిగువ స్థాయి ఉద్యోగంలో చేరాడు. అక్కడి రైల్వే అధికారులంతా ఆశ్చర్యపోయారు. వారే కాదు ఈ వార్త చదివిన వారు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రైల్వేలో డీ గ్రూప్ ఉద్యోగం నెలకు జీతం 18 వేల రూపాయలు. మిత్రులంతా కార్పొరేట్ కంపెనీల్లో చేరితే నువ్వు రైల్వేలో దిగువ స్థాయి ఉద్యోగంలో ఎందుకు చేరుతున్నావు అని ప్రశ్నిస్తే అతను చెప్పిన సమాధానం ఉద్యోగ భద్రత కోసం అని...
దేశంలోని ఐఐటిలన్నిటిలో ముంబై ఐఐటి మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి ఏటా క్యాంపస్ సెలక్షన్‌ల వార్తలు మనం చూస్తూనే ఉంటాం. ఏటా కోటి రూపాయల జీతానికి కోటిన్నరకు సెలక్ట్ అయిన ఐఐటి విద్యార్థులు అని. తెలుగు నాట ఐఐటి క్రేజ్ ఇంతా అంతా కాదు. అసలు మనిషి పుట్టిందే ఐఐటి చదువు కోసం అన్నట్టుగా తల్లిదండ్రులు పిల్లలు కష్టపడతారు. ఐఐటిలో చేరేందుకు టెన్త్ నుంచి రామయ్య కోచింగ్, ఆరవ తరగతి నుంచి శర్మ కోచింగ్, ఆరవ తరగతి వరకు స్కూల్‌లో ఐఐటి కోసం ప్రత్యేక శిక్షణ. హైదరాబాద్ నల్లకుంటలో ఉదయం ఐదు గంటల నుంచే ఐఐటి శిక్షణ హడావుడి కనిపిస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిందే! ఐఐటి సీటు కోసమే అంత కష్టపడతారు. అలాంటిది ఐఐటిలో బిటెక్, ఎంటెక్ పూర్తి చేసిన తరువాత రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడం వింతగానే అనిపించవచ్చు. అతను చేసింది తప్పా? ఒప్పా? అని మనం నిర్ణయించలేం. అతని జీవితం అతని ఇష్టం. అతని అభిరుచి అతనిష్టం.
ఎందుకిలా చేశావు అని అతన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఐతే భద్రత ఉంటుంది. కార్పొరేట్ రంగంలోనైనా, ప్రైవేటు రంగంలోనైనా భద్రత ఉండదు. నాకు ఉద్యోగ భద్రత ముఖ్యం అని సమాధానం ఇచ్చారు.
అతని నిర్ణయం తీసిపారేయదగినదేమీ కాదు. అలా అని ఆహ్వానించదగింది కూడా కాదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రతతో కూడిన జీవితం అనే నమ్మకం ఉంటుంది. కార్పొరేట్ రంగంలో లక్షల రూపాయల్లో జీతం ఉన్నా ఉద్యోగ భద్రత ఉండదు.
ప్రభుత్వ ఉద్యోగి అయితేనే అమ్మాయిని ఇస్తాం అనే తల్లిదండ్రులు రెండు మూడు దశాబ్దాల క్రితం ఎక్కువగా కనిపించేవారు. చిన్ననాటి నుంచి వాళ్లిద్దరినీ భార్యాభర్తలు అనుకున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం లేదని పిల్లను ఇవ్వడానికి ఇష్టపడలేదు అనే ఉదంతాలు చాలా కుటుంబాల్లో కనిపిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉద్యోగ భద్రత ఉటుంది. రిటైర్ అయిన తరువాత పెన్షన్ ఉంటుంది అనే ధీమాతో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికే పిల్లను ఇవ్వడానికి ఇష్టపడేవారు.
కార్పొరేట్ ఉద్యోగంలో జీతం బాగుంటుంది. రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగంలో జీతం పద్దెనిమిది వేలే. ఇలాంటి సందర్భం వస్తే ఏం చేయాలి అని సందేహం వస్తే ఏం చేయాలి.
ఏదో ఒకటే కోరుకోవడం ఎందుకు రెండింటిని కలిపి కోరుకోలేమా?
అదెలా సాధ్యమా?
డబ్బు లక్షణాలు తెలిస్తే అది సాధ్యమే!
బిఎస్‌ఎన్‌లాంటి సంస్థ భవిష్యత్తు ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఇండియన్ ఏయిర్ లైన్స్, బిఎస్‌ఎన్‌ఎల్ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మన కళ్ల ముందే బిడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, అల్విన్ వంటి ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూత పడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్నో కార్పొరేషన్లు మూత పడ్డాయి. మరి అందులో ఉద్యోగంలో చేరిన వారు కూడా శ్రావణ్ కుమార్ లానే ఉద్యోగానికి ఎలాంటి ఢోకా ఉండదనుకునే చేరారు కదా?
ముంబై ఐఐటిలో ఎంటెక్ చేసి శ్రావణ్ కుమార్ కేవలం ఉద్యోగ భద్రత కోసం చేసిన రైల్వేలో సైతం శాశ్వతంగా ఉద్యోగ భద్రత ఉంటుంది అనే నమ్మకం లేదు. రైల్వేను ప్రైవేటీకరిస్తారు అనే ప్రచారం జరుగుతుంది. మన కళ్ల ముందే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం అయినప్పుడు రైల్వే అయితే పెద్దగా ఆశ్చర్యపోవలసిన అవసరం కూడా లేదు.
ప్రభుత్వ ఉద్యోగంలో జీతం తక్కువ అయినా టెన్షన్ ఉండదు, ఉద్యోగ భద్రత ఉంటుంది అనే నమ్మకం తేలిగ్గా తీసేయాల్సిందేమీ కాదు. అదే విధంగా కార్పొరేట్ కంపెనీల్లో లక్షల్లో జీతాలు ఉన్నా పని ఒత్తిడి, ఉద్యోగం ఎప్పుడు పోతుందో అనే భయం. జీవితానికి భద్రత లేని పరిస్థితి నిజమే.
మరేం చేయాలి? కార్పొరేట్ రంగంలోని ఎక్కువ జీతం, ప్రభుత్వ ఉద్యోగంలోని భద్రత రెండూ సాధ్యం కాదా? అంటే...
డబ్బు గురించి అవగాహన, కొంత ఆలోచన ఉంటే సాధ్యం అవుతుంది.
కాలం మారింది. జీవితం సంక్లిష్టంగా మారింది. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగానికే భద్రత లేని పరిస్థితుల్లో కార్పొరేట్ రంగంలో ఉద్యోగ భద్రతపై పెద్దగా ఆశలు పెట్టుకోలేం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు పోతాయో అనే టెన్షన్ నిజమే. అదే సమయంలో ఉద్యోగ అవకాశాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా విస్తృతంగా ఉన్న మాట నిజమే.
కార్పొరేట్ రంగంలో కానీ ప్రైవేటు రంగంలో కానీ ఎక్కువ జీతానికి ఉద్యోగం లభించినప్పుడు ఉద్యోగ భద్రత లేదు అనే దిగులుతో పని చేయడం కన్నా ... జీతం ఎక్కువైన జీవన శైలి మాత్రం తక్కువ ఖర్చు స్థాయిలోనే గడిపితే రేపటికి ఢోకా ఉండదు. 18 వేల జీతంతో రైల్వే ఉద్యోగం కన్నా కార్పొరేట్ రంగంలో లక్ష రూపాయ జీతానికి ఉద్యోగం లభిస్తే, దాదాపు పాతిక వేల ఆదాయం స్థాయిలో జీవితం గడిపి, 75వేల రూపాయలను సరిగ్గా ఇనె్వస్‌ట చేస్తే శ్రావణ్ కుమార్ జీవితానికి బోలెడు భద్రత లభిస్తుంది. 75 శాతం సాధ్యం కాకపోయినా 50 శాతం డబ్బును కనీసం ఐదు పదేళ్లపాటు అతను సరిగా ఇనె్వస్ట్ చేస్తే అతనికి ప్రభుత్వ ఉద్యోగానికి మించిన భద్రత లభిస్తుంది.
కుటుంబ పరిస్థితి, అవసరాలు, ఆర్థిక స్థితి అన్నీ కలిపి ఒక నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేస్తుంది. శ్రావణ్ కుమార్ నిర్ణయాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
ఐఐటి అని కాకపోయినా కార్పొరేట్ రంగంలో, ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేస్తున్న ఈ తరం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్ అనే అలవాట్లను మొదట్లోనే అలవాటు చేసుకుంటే జీవితానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ఐదు -పదేళ్ల పాటు సగం జీతం స్థాయిలో గడిపితే.. ఆ ఇనె్వస్ట్‌మెంట్ ఉద్యోగం పోయినా జీతం అందించే స్థాయికి చేరుకుంటుంది. జీవితానికి ఇంతకు మించిన భద్రత ఇంకేం ఉంటుంది.
-బి.మురళి(ధనం మూలం 8-9-2019)

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం