6, మే 2023, శనివారం

ఈనాడు రిపోర్టర్ వచ్చాడా ? ఓ జ్ఞాపకం

ఈనాడు రిపోర్టర్ వచ్చాడా ? ఓ జ్ఞాపకం రెండు దశాబ్దాల క్రితం వరకు తన వృత్తి జీవితం లో ప్రతి జర్నలిస్ట్ ప్రతి రోజూ విన్న మాట ఇది ... **** ఓ రోజు ఇంటికి రాగానే నా కోసం ఓ వ్యక్తి పరిగెత్తు కొచ్చి చేతిలో ఓ ఐడెంటీ కార్డు పెట్టాడు ... కార్డు చాలా బాగుంది నాణ్యతతో మెరిసి పోతుంది ... అతను చదువుకోలేదు అప్పుడప్పుడు డ్రైవర్ గా పని చేస్తాడు .ఏంటీ అని అడిగితే నేను జర్నలిస్ట్ ను అయ్యాను .. ఆ కార్డు అదే అని చెప్పాడు .. ఎంత ఇమ్మన్నారు ? అని ప్రశ్నించాను .సాధారణంగా ఎవరైనా ఉద్యోగం వచ్చింది అంటే , ఎంత జీతం అని అడుగుతారు ... నేను అలా అడగ లేదు ఎంత ఇమ్మన్నారు అంటే 25 వేలు ఇవ్వమన్నారు అని బదులిచ్చాడు ... ఏదో యూ ట్యూబ్ ఛానల్ మూడో నాలుగో 9 నంబర్ లు ఉన్నాయి ... నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే వాటికి ఇంకో తొమ్మిది కలిపి నువ్వే యూ ట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు ... ఒక్కడూ పైసా ఇవ్వడు అని వివరంగా చెబితే నిరాశగా వెళ్లి పోయాడు ... అతని బైక్ మీద మాత్రం ప్రెస్ అనే స్టిక్కర్ మెరిసి పోతోంది ...ఆ స్టిక్కర్ వెలుగుల్లో మీడియా భవిష్యత్తు స్పష్టం గా కనిపించింది **** ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఐదారుగురు రిపోర్టర్ లు మాత్రమే ఉండేవారు ... తెలుగు దేశం అనే కాదు కాంగ్రెస్ , బీజేపీ , వామపక్షాలు రాజధాని లో నైనా జిల్లాలో నైనా ఈనాడు రిపోర్టర్ వచ్చాడా అని అడిగి రాకపోతే యేవో కబుర్లతో కొంత సమయం గడిపే వారు ... ఆ కబుర్ల అసలు ఉద్దేశం అందరికీ తెలిసినా తెలియనట్టే నటించే వారు ... తెలుగు దేశం లో ఇది కొంత ఎక్కువే ... 95-96 తరువాత మెల్లగా ఈ టివి వచ్చిందా అని చూసే వారు .. 2000 ప్రాంతం లో టివి 9 కోసం ఎదురు చూసే వారు ... ఆ తరువాత ఎలక్ట్రానిక్ మీడియా తుఫాన్ . ఏ పేపర్ , ఏ ఛానల్ గురించి అడిగే పరిస్థితి లేదు . రెండు దశాబ్దాలు గడిచాక యూ ట్యూబ్ సునామీ ... మీడియా కానిది ఎవరో తేల్చు కోవడం కష్టం ... ఓ సారి వికారాబాద్ లో సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో దాదాపు 50 యూ ట్యూబ్ ఛానల్స్ లోగోలు చూసి బిత్తర పోయారు . గతం లో మీడియా ప్రశ్నలకు నాయకులు బిత్తర పోయే వారు . ఇప్పుడు సంఖ్య చూసి భయపడుతున్నారు . ఇప్పుడు ప్రతి నేత కాదు కాదు ప్రతి మనిషి మీడియానే .... నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ తరువాత ఎన్టీఆర్ తిరిగి సీఎం అయినప్పుడు స్టాఫ్ ముందు రామోజీ రావు ఇక్కడ ప్రభుత్వాలను మార్చబడును అని బోర్డు పెట్టాలి అన్నారట నవ్వుతూ ... ఉండవల్లి పేరు మన పత్రికలో రాకూడదు అని ఆదేశించిన రామోజీ మార్గదర్శి వ్యవహారం లో ఉండవల్లి సంధించిన రెండు చిన్న ప్రశ్నలకు ఈనాడు లో రోజు రెండు పేజీల వివరణ . ఎంతో మంది పై దాడుల వార్తలు ఫొటోలతో ప్రచురించిన రామోజీ రావు పై అలాంటి దాడి జరిగితే ఆయన బెడ్ పై పడుకున్న ఫోటో మీడియా లో వస్తుంది అని కలలో కూడా అనుకోలేదు .కాల మహిమ ... ఆర్థిక సంస్కరణల తరువాత మీడియా వారు కూడా గుర్తించనంత మార్పులు మీడియాలో వేగం గా చోటు చేసుకున్నాయి . లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఎబియన్ ఛానల్ లో లోకేష్ ను మనం తక్కువగా అంచనా వేస్తాం కానీ ఓ ప్రపంచ ప్రముఖ వ్యాపార వేత్త లోకేష్ తెలివికి మురిసి పోయి వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు అని స్టోరీ వేలల్లో చూస్తే సినీ నటుడు నాగబాబు దీనిపై వ్యంగ్యం గా నా ఇష్టం అని ఛానల్ అప్పుడే ప్రారంభించి ప్రసారం చేస్తే లక్షల్లో చూశారు . కాలం అన్నిటికన్నా శక్తి వంతమైంది ఏదీ శాశ్వతం కాదు .... మార్పును తట్టుకొని నిలిచిన జీవులే బతికి ఉంటాయి మిగిలినవి అంతరించి పోతాయి అంటుంది సైన్స్ ... *** ఈ తరం వాళ్ళు చెబితే నమ్మక పోవచ్చు .. ఓ కార్టూనిస్ట్ సంగారెడ్డి కి వస్తే ఇసుక వేస్తే రాలనంత జనం ... ఆడ మగ అతన్ని చూసేందుకు వెంటపడ్డారు ... ఆంధ్రభూమి వీక్లి ఎడిటర్ కనకాంబర రాజు , కార్టూనిస్ట్ మల్లిక్ ఇతర రచయితలు 86-87 లో సంగారెడ్డి వస్తే అప్పటి వాళ్ల క్రేజీ ...ఇప్పుడు కనకాంబర రాజు లేరు . ఆంధ్రభూమి వీక్లి లేదు .యూ ట్యూబ్ లో స్టాండప్ కామెడీ అని మల్లిక్ వీడియో చూస్తే ఆశ్చర్యం వేసింది .. 79 మంది చూశారు ఆ వీడియోను ... ఇంకా పాతవి ఉన్నాయా అని చూస్తే ఏడాది క్రితం వీడియో ను దాదాపు మూడు వేల మంది చూశారు ... జనం ఆయన్ని చూసేందుకు 87 లో ఎగబడ్డారు ఇప్పుడు .... కాల మహిమ ...కాలానికి తగ్గట్టు మార్పు చెంది యండమూరి వీరేంద్రనాథ్ ఒక్కరు నిలిచారు ... సినిమా యాక్టర్ ల అంత క్రేజ్ ఉన్న ఆనాటి భూమి వీక్లి రచయితల్లో యండమూరి మినహా ఎవరూ నిలువ లేదు . మార్పును ఎవరూ ఆపలేరు ...మీడియా ఐనా ఏదైనా మార్పు అనివార్యం .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం