6, మే 2023, శనివారం

అటు బిర్యానీ -ఇటు ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఓ జర్నలిస్ట్ కు మూడు కోట్ల రూపాయల పాఠం

అటు బిర్యానీ -ఇటు ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఓ జర్నలిస్ట్ కు మూడు కోట్ల రూపాయల పాఠం ఓ జ్ఞాపకం .... రాక్సీ లో నార్మా షేరర్ బ్రాడ్వే లో కాంచన మాల ఉడిపి శ్రీకృష్ణ విలాస్ లో - అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ ... రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలో శ్రీ శ్రీ కే కాదు ఎవరికైనా కష్టమే .. జర్నలిస్ట్ కే కాదు ప్రతి మనిషి జీవితం లో ఇలా రెండింటిలో ఒకటి నిర్ణయించు కోవలసి ఉంటుంది ... 95లో ఎన్టీఆర్ ను దించేశాక కొన్ని రోజులకు ఎన్టీఆర్ మీడియాకు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు .. ఈనాడు , జ్యోతిని ఎన్టీఆర్ , ఆయన పార్టీ ఇంటి మీడియాగా భావించే వారు .. ఇంటి పత్రికల జర్నలిస్ట్ లను ఇంటి మనుషులుగా చూసే వారు . మిగిలిన వారిని అసలు పట్టించుకునే వారు కాదు . ఇంటి మీడియానే అల్లుడితో కలిసి వెన్నుపోటు పొడవడం తో విలవిల లాడిన ఎన్టీఆర్ ఇతర మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వసాగారు. ఆంధ్రభూమి తరపున ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేసేందుకు నేను , మరో రిపోర్టర్ కేఎన్ చారి వెళ్లాం . ఇంటి ముందు నిరీక్షణ ఇంకా మా వంతు రాలేదు . ఈలోపు చారికి మరో జర్నలిస్ట్ నుంచి ఫోన్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారో తెలియదు ... ఈ లోపు బిర్యానీ తినివద్దాం అని పిలుపు ... అదే విషయం చారి చెబితే నేను రాను ఈ లోపు వాళ్ళు పిలిస్తే అన్నాను ... బిర్యానీ , ఎన్టీఆర్ ఇంటర్వ్యూ లో నేను ఇంటర్వ్యూ కే ఓటు వేసి నీ ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళు అన్నాను .చారి వెళ్ళాడు ... కొద్ది సేపటి తరువాత ఎన్టీఆర్ నుంచి పిలుపు నేను వెళ్లి ఇంటర్వ్యూ చేశాను ... అల్లుడు చేసిన ద్రోహం తన భవిష్యత్తు కార్యాచరణ గురించి ఎన్టీఆర్ చెప్పుకుంటూ వచ్చారు ... కనిపిస్తే చాలు పాదాల పై పడి పోయే తమ్ముళ్లే వెన్ను పోటు పొడవడం తట్టుకోలేక పోయారు ... నీరసించి పోయారు . మునుపటి రాజసం లేదు . చారి తో పాటు అప్పుడు బిర్యానీ కోసం వెళితే జీవితం లో మళ్ళీ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ దొరికేది కాదు ...ఎందుకంటే ఆ తరువాత కొన్ని రోజులకే ఎన్టీఆర్ మరణించారు .ఒక జర్నలిస్ట్ కు తమ కాలం నాటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేయాలి అని ఉంటుంది . **** నామాల విశ్వేశ్వర్ రావు అని జర్నలిస్ట్ మిత్రులు ఆంధ్ర ప్రభ లో ఉండే వారు ... పర్మనెంట్ ఉద్యోగి... జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ ఫారం , డీడీ తీసి జర్నలిస్ట్ నాయకుడికి ఇచ్చారు . ఆ నాయకుడు నాలుగిళ్ళ పూజారి . అన్ని యూనియన్లు అతని చేతిలోనే ... కొంత కాలానికి సభ్యులకు ప్లాట్ కు డబ్బు కట్టమని నోటీసులు . తాను పర్మనెంట్ ఉద్యోగి , సీనియర్ ను తనకన్నా జూనియర్లు పైగా పర్మనెంట్ కాదు వారికి నోటీసు నాకు రాలేదు అని సొసైటీ ఆఫీస్ కు వెళితే.... నువ్వసలు సభ్యత్వ దరఖాస్తు చేయలేదు పో అన్నారు ... అక్కడ దుమ్ము దూళి తీసి చెత్తా చెదారాన్ని వెతికితే ఓ చోట అతని దరఖాస్తు , డీడీ పడి ఉంది ... అప్పటి కే పుణ్యకాలం తీరిపోయింది ...నాలుగిళ్ళ పూజారి అయిన నాయకుడికి ఎన్నో పనులు ఉండవచ్చు . నీ దరఖాస్తు పై నీకు శ్రద్ద లేనప్పుడు అతనికి ఉండాలి అని ఏముంది ? నాయకుడికి ఇవ్వకుండా తన దరఖాస్తు తానే ఆఫీస్ లో ఇచ్చి ఉంటే ఇప్పుడు ఓ ప్లాట్ కు ఓనర్ అయి ఉండేవాడు . గోపనపల్లి లోని జర్నలిస్ట్ కాలనీలో ఆ ప్లాట్ విలువ ఇప్పుడు మూడు కోట్ల రూపాయలు .. ఆ రోజు అతనికి ఎంత ముఖ్యమైన పని ఉన్నా మూడు కోట్ల రూపాయలకు మించిన పని ఐతే కాదు .. జర్నలిస్ట్ అనే కాదు ఎప్పుడు ఏది ముఖ్యమో ఆ పని చేయాలి లేదంటే ...చదువుకొనే వయసులో సినిమా హాలులో హీరో కటౌట్ ను పాలతో కడగడం లో బిజీ గా ఉంటే చదువు తరువాత సినిమా హాల్స్ కడిగే పనే దక్కుతుంది . బిర్యానీ కోరుకునే వారికి బిర్యానీ దక్కుతుంది ఎన్టీఆర్ ఇంటర్వ్యూ కోరుకున్న వారికి ఇంటర్వ్యూ దొరుకుతుంది. ఏం కోరుకుంటున్నారో అది సాధించేందుకు ప్రయత్నించాలి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం